ఇది అనామకురాలు, గాయత్రీ దేవుడి తో ముఖాముఖి!

 Dr Gayatridevi

ఔను, మీరు సరిగ్గానే చదివారు.
అనామకుడి “రమణీయం” 2006 లో ప్రచురణకి నోచుకుంది.

పుస్తకాన్ని ఇతరులకి అంకితం ఇవ్వడం ఒక సంప్రదాయం.  దాన్నిఛేదించాడు ఈ అనామకుడు.  తనకే అంకితం ఇచ్చుకున్నాడు.  ఆ అంకితం ఎలా ఇచ్చుకున్నాడో తన మాటలలో చూద్దాం!

” (గాయత్రీ)  దేవి,

నేనైన నీకు

నీవైన నేను

(రామం) బావ”

అందుకని విడదీయలేము.  అంత రమణీయంగా ఉంది వారి జీవితం.  కాబట్టీ ఇద్దరితోను కలిపి కూడా ఒక ముఖాముఖి!  ఆమె ఐన అతను. అతను ఐన ఆమె.  అమె అనామకుడు. అతను డా.గాయత్రీ దేవి.

గాయత్రీదేవి ఉషశ్రీ పెద్దమ్మాయి.  వైద్యం, చిత్రలేఖనం, రచనావ్యాసంగం – మూడు గుర్రాల స్వారీ.  రచనావ్యాసంగంలో ఆయుర్వేద పుస్తకాలు వ్యాసాలతోపాటు అడపాదడపా కథలు. అందులో కొన్ని హాస్యం, కొన్ని అ-హాస్యం.  వాటినీ వీటినీ కలిపి ఓ పుస్తకంలా వేస్తున్నారు.

అంతకుముందు ప్రచురణలు – ప్రకృతివరాలూ, అమ్మాయీ అమ్మా అమ్మమ్మా, నాన్నగారి అసంపూర్ణరచన పూరణ, ఎవరితో ఎలా మాట్లాడాలి—అన్ని రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా భరతముని ఆదర్శమహిళా పురస్కారం, ముంబయి ఆంధ్రమహాసభ ఉత్తమ మహిళా పురస్కారం. పత్రికల ద్వారా, టీవీ ద్వారా తెలుగు వారికి సుపరిచితం.

 

Qఅనిల్: తన రచనలు మీరు చదువుతారా?

అనామకుడు:తను తెలుగులో రాసిన కధలూ, వ్యాసాలూ చదువుతాను. తను రాసిన ఆయుర్వేదపరమైన పుస్తకాలూ వ్యాసాలూ నేను చదవలేదు. అలాగని చదవలేదనీ చెప్పలేను. ఒక్కోసారి వాటి ఎడిటింగ్ పని నాకు అప్పగిస్తుంది. అప్పుడు చదువుతాను.

Qఅనిల్మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రాస్తారు?

 అనామకుడు: నేనెక్కువ చదువుతాను. తక్కువ రాస్తాను. తనకి నెలనెలా రాయాల్సిన శీర్షికలు ఉంటాయి. తన పుస్తకాలూ వ్యాసాలూ జనానికి అవసరమైనవీ, ఉపయోగించేవీ.

Q అనిల్: మీకు రచనాసక్తి ఎలా కలిగింది?

 

అనామకుడు: నాకు పద్యాలు రాయాలన్న మక్కువ చిన్నప్పుడే కలిగింది. ఆ ఆసక్తికి కారణం – మా నాన్నగారూ మా పదో తరగతిలో మా తెలుగు మాస్టారూ. పద్యాల మీద ఇష్టం తర్వాత తర్వాత కధల మీదకి మళ్ళింది.

 

Qఅనిల్మీరు కలిసి రాయరా? చాలా మంది భార్యాభర్తలు ఆ పని చేస్తారు కదా?

 

అనామకుడు: లేదు. అది కుదిరే పని కూడా కాదు. ఒకే ఒక్క కధని ఇద్దరం రాసినట్లు ఉంటుంది. కథ తనది. కథనం నాది. పేరు ఎవరికి ఎవరు అని గుర్తు.

 

Qఅనిల్: ఐతే ఇద్దరూ కలిసి సాహితీ వ్యాసంగం చెయ్యలేదనే అనుకోవాలి.

అనామకుడు: కలిసి రాయలేదు కానీ ఇద్దరి రచనలకి ఒకరి సాయం ఇంకొకరికి ఉంది. కొత్తగా ఓ ప్రయోగం చేస్తున్నాం. ఇద్దరం చెరో పుస్తకం వేస్తున్నాం. నా పుస్తకానికి తను ముందు మాట రాస్తే తన పుస్తకానికి నేను రాసాను.

 

Qఅనిల్:ఏమిటా పుస్తకాలు?

 

అనామకుడు: తను రాసిన కధల్లో ఎక్కువ హాస్య కధలు ఉన్నాయి. కొన్ని హాస్యం కాని కథలూ ఉన్నాయి. అవీ ఇవీ కొన్ని ఏరి హాస్యాహాస్య కథలు అని వేస్తోంది.

ముగ్గురు కలిసి నవ్వే వేళల...

ముగ్గురు కలిసి నవ్వే వేళల…

Qఅనిల్: ఎప్పుడు విడుదల?

అనామకుడు: విడుదల అని మేమేం కార్యక్రమం పెట్టుకోవడం లేదు. ఇంతవరకూ నా పుస్తకం దేనికీ అలా చెయ్యలేదు కూడా. ఐతే నవంబర్ పదకోండో తేదేన ఆన్లైన్ సైట్లో దొరికేలా చేస్తున్నాం. అదే విడుదల.

 

Qఅనిల్: చివరిగా ఏదన్న మాట చెప్తారా?

 

అనామకుడు: తన పుస్తకాలు చాలా మార్కెట్లో ఉన్నా మొదటిసారిగా కథలపుస్తకం వేస్తోంది. అదీ పెళ్ళిరోజుకి. అందుకు గాయత్రీదేవికి శుభాశీస్సులు.

 

Qఅనిల్: తన రచనలు మీరు చదువుతారా?

 

గాయత్రి: చదవను. ఎందుకంటే తను రాసిన ప్రతి రచనా ఎక్కడికైనా పంపించడానికి ముందు నాకు చదివి వినిపిస్తాడు. తను ఎకనామిక్స్ మీదో ఫైనాన్స్ మీదో రాసిన పుస్తకాలో వ్యాసాలో తను వినిపించడు. నేను చదవను.

 

Qఅనిల్: మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రాస్తారు?

 

గాయత్రి: ఏమో తెలియదు. నేనే ఎక్కువ రాస్తానేమో. ఐతే నేను రాసేవి ఎక్కువ ఆయుర్వేద వ్యాసాలూ పుస్తకాలూ ఉంటాయి. తనవి కధలూ, పద్యాలూ, నవలలూ, నాటికలూ – వాటిలో క్రియేటివిటి ఎక్కువ ఉంటుంది.

Hasya Hasya kathaluFrontCoverTitlePageW

Qఅనిల్: మీకు రచనాసక్తి ఎలా కలిగింది.

 

గాయత్రి: మా నాన్న ఉషశ్రీ నిరంతరం రాస్తూనే ఉండేవారు. అదే నాకూ వచ్చుంటుంది.

 

Qఅనిల్: మీరు కలిసి రాయరా? చాలా మంది భార్యాభర్తలు ఆ పని చేస్తారు కదా?

 

గాయత్రి: కలిసి రాయలేదు కానీ తన కథ ఒకదానికి నేను బొమ్మ గీసాను. ఆ కథ పేరు తల్లి. అలానే తను రాసిన పద్యాలకి నేను బొమ్మలూ, నేను గీసిన బొమ్మలకు తను పద్యాలూ – వేసానూ, రాసాడూ. ఆంధ్రప్రభలో ప్రచురించబడ్డాయి.

 

అనిల్: ఐతే ఇద్దరూ కలిసి సాహితీ వ్యాసంగం చెయ్యలేదనే అనుకోవాలి.

 

గాయత్రి: కలిసి పుస్తకాలు వేస్తున్నాం. ఐతే ప్రింట్ పుస్తకాలు కాదు. డిజిటల్ పుస్తకాలు.

 

Qఅనిల్: ఏమిటా పుస్తకాలు?

 

గాయత్రి: తను తొంభైల్లో రాసిన రెండు నవలికలు ఉన్నాయి. ఒకటి – ఓ మొగ్గ పువ్వవుతోంది. రెండోది – ఎరుపు తెల్లపోతోంది. ఈ రెండవ నవలనే సినిమా తియ్యాలని ఓ నిర్మాత పిలిచారు కానీ, బావకి కుదర్లేదు.

 

Qఅనిల్: ఎప్పుడు విడుదల?

 

గాయత్రి: మా పెళ్ళిరోజున. అది నవంబర్ పదో పదకొండో. నవంబర్ పది అర్ధరాత్రి ఒంటిగంటకి ముహూర్తం. అందుకే రెండురోజులూ మా పెళ్ళి రోజులే.

 

Qఅనిల్: చివరిగా ఏదన్న మాట చెప్తారా?

 

గాయత్రి: తనవి చాలా పుస్తకాలు తెలుగులో ఇంగ్లిషులో ప్రచురించబడ్డాయి. ఒక్కటి కూడా తను ప్రచురించింది కాదు. ఓ విధంగా ఈ పుస్తకం తను వేస్తున్న మొదటి పుస్తకం. నేనేం చెప్తాను – శుభాకాంక్షలు తప్ప.

 

(గాయత్రి గారి రచనల కోసం: http://kinige.com/kbrowse.php?via=author&name=Dr.+Gayatri+Devi&id=21)

మిగిలినవి నాన్న పుస్తకాలూ, కొన్ని జ్ఞాపకాలూ!

అనిల్ అట్లూరి

అనిల్ అట్లూరి

విజయవాడలో పూర్ణానందపేటలో అనుకుంటా మేము ఉండేవారం. లీలగా గుర్తు. నా చిన్నతనంలోనే నాన్న నా కోసం బొమ్మలు తీసుకురావడం, పుస్తకాలు తేవడం బాగానే గుర్తుంది. అప్పట్లో నాన్న ‘విశాలాంధ్ర’లో ఉండేవారు.

విజయవాడ నుండి మద్రాసుకి హౌరా మెయిల్లో వెళ్లడం గుర్తే. పొగబండి (స్టీం ఇంజన్) కదా! కళ్ళు మిరుమిట్లు గొలిపే హెడ్‌లైట్. మెటాలిక్ సిల్వర్‌తో నక్షత్రం లాంటి డిజైన్ మధ్యలో ఉండేది ఆ దీపం. మొదట పసుపచ్చని కాంతి కనబడేది. తరువాత ధడ్, ధడ్, ధడ్ మంటూ శబ్దం వినపడేది. ఆ తరువాత ట్రైన్ కనపడేది. రైలు పట్టాలు మెరిసేవి ఆ కాంతిలో.

 ప్లాట్‌ఫారం అంతా వెలుతురే! ముందు తెల్లటి ఆవిరి. అది బుసలు కొడుతూ చేసే శబ్దం. ఆ బ్రహ్మాండమైన నల్లటి చక్రాలు, వాటిని కదిలించే శక్తివంతమైన పిస్టన్లు. కాళ్లక్రింద ప్లాట్‌ఫార్మ్ కదిలిపోతుందా అనిపించేది. దగ్గిరకు వెళ్ళి చూద్దామనుకుంటూ ఉంటే వెనక అమ్మ చెయ్యి పట్టుకుని ఆపడం బాగానే గుర్తు ఉంది. కిటికి పక్కనే కూర్చోవడం, కళ్లలో ఆ రాకాసి బొగ్గు నుసి, మొహంమ్మీదకి, ముక్కులోకి ఆ నల్లని, చిక్కటి, దట్టమైన పొగ, ఆ చీకట్లోకి కళ్ళు చికిలించి చూడడం ఇంకా గుర్తే! ఈలోపు అమ్మ నాన్న సహాయంతో హోల్డాల్‌ తెరిచి బెర్త్ మీద పరవడం లీలగా గుర్తు.

మద్రాసు సెంట్రల్ స్టేష‌న్లో దిగడం. ఫియట్ టాక్సిలో నేను, అమ్మ వెనుక సీటులో. నాన్న ముందు సీటులో. డిక్కిలో సామాన్లు. పైన కారియర్‌. దాని మీద హోల్డాలులు. ఇంటి ముందు దిగడం గుర్తు ఉంది. తేనాం పేటలోని వెంకటరత్నం వీధి, ఇంటి నెంబరు 13. మేడ మీద ఉండే వారం. మొదట్లో ముగ్గురమే. నాన్న, అమ్మ, నేను.

ఫాస్ట్ ఫార్వార్డ్

ముఖం మీద లైట్ పడి కళ్ళు తెరిచాను. నాన్న బట్టలు వేసుకుంటున్నారు. బయట కిటికిలోంచి చూస్తే చీకటి కప్పేసింది ప్రపంచానంతటిని. బయటికి వెడుతున్నట్టున్నారు.

“వస్తావా?”

“ఎక్కడికి?”

పాంటు వేసుకుంటూ, “చెప్పకపోతే రావా?”

పుస్తక ప్రపంచంలో నాన్న

పుస్తక ప్రపంచంలో నాన్న

నేను కళ్ళు నులుముకుంటున్నాను. అమ్మ “వద్దులేండి” అంటుండగానే, “వస్తా” అంటూ లేచాను. వరండాని వీధి లాంతరు వెలుతురు పలకరిస్తోంది. వరండాకి పిట్ట గోడ ఉంది. దానినిండా జాలీలు. పిట్ట గోడ అంచుమీద కుండీలు. అటు ఇటూ మనీప్లాంట్ మొక్కలు. మధ్యలో ఇంకేవో పూల మొక్కలు. బయట పెరడులో వేపచెట్టు, మల్లె చెట్లు, కొబ్బరి చెట్టు, సంపెంగలు, గన్నేరు చెట్లు, వగైరా. వాటి మధ్య నుండి పడుతున్న ఆ వీధి లాంతరు వెలుగులో ఆ కొమ్మల, ఆకుల నీడలు అల్లిబిల్లిగా ఆ వరండా గోడ మీద నృత్యం చేస్తున్నవి నిశబ్దంగా.

ఈ లోపు ‘మోతి‌’ కూడా లేచి తోక ఊపుకుంటూ వెనక పడింది. దాన్ని ఆగమంటూ అమ్మ గేటు వేసేసింది. కిందకి దిగిన తరువాత, నాన్న షర్ట్ జేబులోంచి గోల్డ్ ఫ్లేక్ పాకెట్ తెరిచి అందులోనుంచి సిగరెట్టు తీసుకున్నారు. లైటర్‌తో దాన్ని ముట్టించారు. గుండెల నిండా పీల్చి నెమ్మదిగా వదులుతున్నారు. ఆ పొగలోంచి నా వైపు చూసారు.

వీధి లాంతరు మసక వెలుతులో.. చలిగాలిలో.. ఆ సుడులు తిరుగుతున్న పొగల వలయాలలో నాన్న నాకు దేవుడు లాగా కనపడ్డాడు. చెయ్యి అందుకున్నాను. వెచ్చగా ఉంది తన ప్రేమ లాగా. ఇద్దరం నెమ్మదిగా నడవడం మొదలు పెట్టాము.

“ఎక్కడికి నాన్నా?”

“ఇక్కడే నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. చూద్దామని”

బహుశా ఇక్కడే పడిందేమో “స్నేహం”కి నా తొలి పునాది. ఎందుకనో మొదటి నుంచి నాకు స్నేహితులే దగ్గిరవుతూ వచ్చారు, బంధువుల కన్నా.

నాన్న అడుగుతున్నారు. నేను చెబుతున్నాను. నేను అడుగుతున్నాను. నాన్న చెబుతున్నారు. అలా మా వీధిలోనుండి అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ తేనాం పేట మెయిన్ రోడ్డు మీదకి చేరుకున్నాం. కుడి చేతి వైపుకు తిరిగి, మార్కెట్ వైపు నడవడం మొదలుపెట్టాం. ఎడం చేతి వైపు అక్కడ స్కూలు. ఒకొక్కసారి సాయంకాలం నా స్నేహితులతో అందులోనే ఆటలు. దానిని దాటాం. ఇంకా వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. తరువాత గుడి. మార్కెట్టు ప్రాంతంలో ఎడ్ల బండ్ల మీద నుంచి కూరగాయల గంపలు, బస్తాలు దింపుకుంటున్నారు. తుపుక్కున నములుతున్న తమలపాకుని ఊస్తున్నారు. బొడ్డునుంచి ఆకులు తీసుకుని, సున్నం రాసి, మడిచి నోట్లో పెట్టుకుంటోంది ఆమె. కొందరు బీడీలు కాలుస్తూనే బస్తాలు మోస్తున్నారు. నిశబ్దంగా యాంత్రికంగా పనిచేసుకుంటున్నారు. ఈ లోపు టీ షాప్ కనపడింది. నాన్న నిలబడగానే ఆ టీ మాస్టారు పలకరింపుగా నవ్వి, నా వంక చూస్తూ ఏదో అన్నాడు.

పొగలు కక్కే..Young Turk...!

పొగలు కక్కే..Young Turk…!

నాన్న “నువ్వు కూడా తాగుతావా? టీ”.

“ఊ” అంటూ బుర్ర ఊపాను.

నాకొక చిన్న గాజు గ్లాసులో సగం కన్నా తక్కువ టీ ఇచ్చాడు. మూతి వెడల్పు, అడుగు సన్నగా ఉంటుంది ఆ గ్లాసు. దాని చుట్టూ పలకలు, పలకలుగా దానికి డిజైను. “నెమ్మదిగా తాగు, వేడిగా ఉంటుంది. జాగ్రత్త”. అరిచేతుల మధ్య పట్టుకుని ఊదుకుంటూ, ఆ మార్కెట్టు వైపు, ఆక్కడ వాళ్ళు చేసుకుంటున్న పనులు చూస్తూ ఆ టీ తాగాను. నాన్న మరో సిగరెట్టు అంటించారు. టీకొట్టు వాడికి డబ్బులు ఇచ్చారు నాన్న. నేను మళ్ళీ నాన్న చెయ్యి అందుకున్నాను. ప్లాట్‌ఫారం పైనే నడుచుకుంటూ వెళ్ళాం ఇద్దరం. నేను నా చెప్పులతో కాళ్లకి అడ్డం వచ్చిన గులక రాళ్ళు తంతున్నాను. వాటితో పాటు సిగరెట్టు ఫాయిల్స్.

ఒక పది ఇళ్ళు, కొట్లు దాటగానే కుడి చేతి వైపునే తలుపులు. చిగురాకుపచ్చ రంగులో. నెమ్మదిగా నాన్న నెడితే అవి తెరుచుకున్నవి. పైకి మెట్లు కనపడ్డాయి. ఏదో గుడ్డి వెలుగు. ముందుకు నన్ను నెట్టి నాన్న నా వెనక మెట్లు ఎక్కుతున్నారు. ఈ లోపు కిర్రు మని చప్పుడు. పైన తలుపు రెక్క తెరుచుకుని ఎవరో ఒకాయన లుంగిలో బయటకి వచ్చారు. పైన బనీను. ముఖానికి కళ్ళజోడు. “రండి, రండి. మీ వాడ్ని కూడా తీసుకువచ్చారా” అంటూ నవ్వుతూ అహ్వానించారు. (దాసరి సుబ్రహ్మణ్యం గారనుకుంటాను).

గుమ్మం ముందు ఒక పక్కగా చెప్పులు వదిలి లోపలికి అడుగు పెట్టాం ఇద్దరం. గదిలోపల ఎడం వైపు మంచం. దానికి ఆనుకుని ఎదురుగాఉన్న గోడకి ఒక చెక్క కుర్చి. పక్కనే చెక్క స్టూలు. క్రింద పేపర్లు. ఒక వైపు గోడకి ఆనుకుని రాక్. దాని నిండా పుస్తకాలు. రంగు రంగుల అట్టలు. వాళ్ళిద్దరు మాటల్లో పడ్డారు. నాకు ఏమీ తోచడం లేదు.

“నేను అవి చూడోచ్చా”

“చూడ్డమెందుకురా? చదువుకో. మీ ఇంట్లో ఉండే ఉంటాయి! లేకపోతే తీసుకువెళ్ళు.”

అవి ఇల్లస్ట్రేటెడ్ వీక్లి ప్రతులు. ఇంగ్లీష్ పత్రిక. రెండో మూడో తీసుకుని మంచం మీద కూర్చుని చూస్తున్నాను. మా యింట్లో, లైఫ్, స్పాన్, పంచ్, ఇంకా ఎవో చాలా ఇంగ్లిష్ పత్రికలున్నాయి. వాటిల్లో కొన్నింటిలో బొమ్మలు ఉంటాయ్. కొన్నిట్లో బొమ్మలు అస్సలు ఉండవు. ఈ లోపు నాన్న, ఆయనా మాటల్లో పడ్డారు.

ఎవరో నెమ్మదిగా “బాబు, బాబూ” అంటూ పిలుస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తే నాన్న, నా కళ్లలోకి చూస్తూ. తెల్లవారింది. ఇంటికి ఎలా చేరానో గుర్తు లేదు కాని.. మోతి మాత్రం భలే గొడవ చేసింది.

ఆడించే నాన్న...పాడించే నాన్న!

ఆడించే నాన్న…పాడించే నాన్న!

నిద్ర లేచి చూస్తే, నాన్న పక్క మీద లేరు. హాల్లోనూ లేరు. వరండాలో పేము కుర్చిలో కూర్చుని, పిట్టగోడమీదకి కాళ్ళు జాపుకుని ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుకుంటున్నారు. వెళ్లి పుస్తకం లాగేసి నేను బొజ్జమీదకి చేరాను. నన్ను వాటేసుకున్నారు.

“బాబు, ఈ పూట సుమతీ శతకంలో పద్యాలు చదువుకుందామా?”

“ఊ”

“ఐతే వెళ్ళి ముఖం కడుక్కుని రా”

ముఖం కడుక్కున్నాను. బినాకా టూత్ పేస్టు. అమ్మ ఈ లోపు బోర్న్‌వీటా కలిపి ఇచ్చింది. అది తీసుకుని వెళ్ళి నాన్న ముందున్న టేబుల్ మీద పెట్టాను. నా టేబుల్ మీద ఉన్న శతకాల పుస్తకంలో నుండి, సుమతీ శతకం తీసుకుని మళ్ళీ వరండాలోకి వెళ్ళాను. నాన్న కాళ్ళ మధ్యకి చేరాను. నా చుట్టు చేతులు చాపి నా ముందు నాకు కనపడేలాగా పుస్తకం పట్టుకున్నారు. నా తలమీదుగా పుస్తకాన్ని చూస్తూ నాన్న ఒకొక్క పాదం చదువుతుంటే నేను మళ్ళీ పలికేవాడిని. నాన్న నన్ను అలా వాటేసుకున్నట్టుంటే ఆ బలమైన చేతులమధ్య ఎంత వెచ్చగా, హాయిగా ఉంటుందో! బహుశా అందుకేనేమో ఆ పద్యాలు అంత ఇష్టంగా నేర్చుకున్నాను.

శ్రీ రాముని దయచేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనగా

ధారాళమైన నీతులు

నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ

సుమతీ, వేమన, దాశరధి, కృష్ణ శతకం, గజేంద్ర మోక్షం నాన్నే నాతో వల్లె వేయించారు. ప్రతి దానికి తాత్పర్యంతో సహా. దాదాపు ప్రతి రోజు పొద్దునే ఉండేది ఈ శతకాలన్ని చదవడం. ఉచ్ఛారణ కూడా. చ అక్షరం పలకడం లో ఎందుకనో ఆ రోజు నాకు రావడం లేదు. చ కి వత్తుతో పలకడం రావడం లేదు నాకు. చేప అంటున్నాను , చాప అంటున్నాను కాని వత్తుతో పలకలేక పోతున్నాను.

“అది. ఇప్పుడు “చ్చ” పలికావుగా! అలా అన్నమాట”

“ఏది మళ్ళీ చెప్పు. “చ్చ” పలుకు.”

“చ్చ”

“చా”

“చాప”

“చేప”

“చాపము”

——

మద్రాసులో టి.నగర్ బస్ టెర్నినస్, సౌత్ ఉస్మాన్ రోడ్డులో ఉంది. దానికి తూర్పు వైపున కృష్ణవేణి సినిమా హాలు. అందులో ఒక ఉదయం తెలుగు సినిమా ప్రీవ్యూకి తీసుకెళ్ళారు నాన్న. చాలా మంది పలకరించారు నాన్నని. నాన్నకి చాలా మంది స్నేహితులు ఉన్నారు! నెమ్మదిగా మెట్లు ఎక్కి పైన ఫోయర్ లోకి వెళ్లాం. బాల్కని. ఏదో ఒక వరుస. అప్పటికే కొంత మంది కూర్చుని ఉన్నారు. కుడి చేతి వైపు మధ్యలో ఉన్న ఒక వరుసలోకి ముందు నన్ను వెళ్లమంటూ నాన్న నా వెనకే వచ్చారు. హాలు ఫుల్.

నాన్నకి కుడి వైపున నేను కూర్చున్నాను. లైట్లు డిమ్ అయినవి. సినిమా మొదలైంది. ఇంట్రవెల్‌లో నాన్న లేచారు. వారి వెనకే నేను. ఐల్ లోకి రాగానే నాన్న చిటికిన వేలు పట్టుకున్నాను. చుట్టూ చాలా పాంట్లు. చాలా మంది మగవాళ్ళు. ఆ చిటికిన వేలు పట్టుకుని ఒకొక్క మెట్టు ఎక్కి తలుపుల దగ్గిరకి చేరాను. అక్కడ ఫోయర్ లోకి దిగడానికి మెట్లు. దిగి చిటికిన వేలును పట్టుకుని పైకి చూసాను. నాన్న కాదు. ఇంకెవరో! నాన్న ఏరి? చూట్టూ చాలా మంది పెద్దవాళ్ళు.

పొగ. మాటలు. నవ్వులు. పలకరింపులు. నాన్న కనపడటం లేదు. నాన్న, నాన్న ఏరి? ‘ఏపిఆఱ్‌”..”రావుగారు” అని పిలుపులు. చక్కగా గంజిపెట్టిన, స్టిఫ్‌గా ఉన్న పాంట్, దానితో పాటు నాకు చిరపరిచితమైన రెండు అడ్డపట్టీలున్న నల్లరంగు పాలీష్డ్ లెదర్ చెప్పులు. పైకి చూస్తే నవ్వుతూ నాన్న. “భయపడ్డావా?” నాన్న పక్కనే ఉంటే నాకు భయం ఎందుకు? నవ్వుతూ నాన్న చిటికెన వేలు అందించారు. దానితో పాటే వెళ్లాను. పాప్‌కార్న్ పాకెట్టు ఇచ్చారు. అక్కడే నిలబడి ఎవరితోనో సిగరెట్టు తాగుతూ, కాఫీ తాగుతూ ఏవో కబుర్లు. ఇంతలో హాలు బెల్లు మ్రోగింది. మళ్ళీ లోపలికి. ఈ సారి జాగ్రత్తగా నాన్న చిటికిన వేలును చూసుకుని పట్టుకుని ఆయన వెమ్మటే నడిచాను. సీట్‌లో కుర్చున్నాక, పాప్‌కార్న్ పాకెట్ ఒపెన్ చేసి ఇచ్చారు. నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా తింటూ సినిమా చూసాను.మళ్ళీ నాన్న చెయ్యి పట్టుకుని బయటికి వచ్చాను. కారులొనే మళ్ళీ ఇంటికి.

వరండా. నాలుగు పేము కుర్చిలు. ఒకటి టూ సీటర్. రెండు సింగిల్ సీటర్లు. మధ్యలో చెక్క టేబుల్. దాని మీద ఒక ఆకు పచ్చని క్రాస్టిచ్ గుడ్డ పరిచి ఉంటుంది. దాని మీద పూల బొమ్మ. అది కుట్టింది అమ్మే. దాని మధ్యలో ఇత్తడి ఆష్ ట్రే. దాని మీద చక్కని నగిషీలు. మూత తీస్తే, లోపలి అంచు చుట్టూతా పది చిన్న గొట్టాలు. ప్రతి గొట్టం లోను ఒక చిన్న స్ప్రింగ్. అందులోకి సిగరెట్లు పేర్చి, మూత పెట్టాలి. మూతలో ఒక బెజ్జం. మూత తిప్పగానే ఆ బెజ్జం నుండి ఒక సిగరెట్టు పైకి వచ్చేది. ఒక పక్కనే ఇల్లస్ట్రేటేడ్ వీక్లి, స్పాన్, లైఫ్ వగైరా. మరో వైపు తెలుగు దిన పత్రికలు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, విశాలాంధ్ర, అభ్యుదయ లాంటివి. చందమామ కూడ. పేము కుర్చీలకు కవర్లు. కవర్ల మీద అందమైన పువ్వులు. వాటిని క్రాస్ స్టిచ్‌తో కుట్టింది అమ్మే. అమ్మకి కుట్లు, అల్లికలు వచ్చు. చాలా బాగా వచ్చు. కలర్ మాచింగ్ కూడా అమ్మ తరువాతే ఎవరైనా. నా భార్యకి కూడ అమ్మే నేర్పింది.

వరండాలోనుంచి హాల్లోకి గుమ్మం. గుమ్మానికి కర్టెన్లు. దాని మీద చక్కని కుట్లు. అవి కూడా అమ్మ కుట్టినవే. హాల్లో నుంచి బెడ్ రూమ్. బెడ్ రూములో ఉత్తరం వైపున నా స్టడీ టేబుల్. టేకుది. దక్షిణం వైపున గోడకానుకుని నాన్న టేబుల్, రైటింగ్ పాడ్, నాన్న కుర్చి. టేబుల్ ని కప్పేస్తూ గుడ్డ. దాని అంచుల చూట్టూ అందమైన లతలతో అమ్మ కుట్టిన డిజైన్లు. దాని మీద ఎదురుగుండా గోడకి ఆనుకుని నాన్న కలం. పార్కర్ పెన్ను. పెన్సిళ్ళు, ఎరుపు, నీలంతో పాటు మాములు గ్రాపైట్ పెన్సిళ్లు. అవన్నీ ఒక చెక్క పెట్టెలో. దానికి మూత ఉండదు. పక్కనే ఒక షార్పెనర్. నాన్న వాడుకునే క్వింక్ , బ్లూబ్లాక్ ఇంక్ బాటిల్. బ్లాటింగ్ పేపర్లు. ఒక బ్లాటింగ్ పాడ్. మార్కింగ్ పెన్సిళ్ళు, ఎరేజర్లు. మరో వైపు నాన్న చదువుకునే పుస్తకాల దొంతర. ఒక చిన్న పళ్ళెం. మధ్యలో ఒక బ్రాస్ ఆష్‌ట్రే. అందులో కొన్ని నీళ్ళు. దాని పక్కేనే లైటర్.

ఆ రోజు నాన్న ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చి, స్నానం చేసి ఆటలాడుకుని ఇంటికి రాగానే మళ్ళీ స్నానం. పుస్తకాలు వేసుకుని హోం వర్క్ చేసుకున్నాను. అమ్మ పక్కనే కూర్చుంది. ఏదో పుస్తకం చదువుకుంటూ. నాన్న అవతల పడక గదిలో ఉన్నారు.

“ఇక చాల్లే. లే భోజనం చేద్దువు” అని అమ్మ అంటే, “నాన్నని పిలుస్తా!”

“నాన్న వ్రాసుకుంటున్నారు. తరువాత చేస్తారు లే. ముందు నువ్వు కానివ్వు”

నాన్న గారి చేరాత

నాన్న గారి చేరాత

“మరి నువ్వు?”

“నేను నాన్నగారితో చేస్తాను. నీకు నేను పెడతానుగా. నువ్వు చేసేయ్”.

అయిష్టం గానే భోంచేసాను. సాధ్యమైనంత వరకు మేము ముగ్గురం కలిసే భోజనం చేసేవారం. అదే అలవాటు నా జీవితాంతం పాటించాను.

బెడ్ రూం గుమ్మానికున్న కర్టెన్లు తొలగించి, నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా ఒక తలుపు రెక్కని వెనక్కి తోసాను. ఎదురుగుండా టేబుల్ లైటు వెలుగులో గోడ మీద ముందుకు వంగి కూర్చున్న నాన్న నీడ. నాన్న ఎడం చేతిలో సిగరెట్టుతో కూర్చుని ఉన్నారు. కుర్చీ చేతుల మీదుగా టేబుల్‌కి వారధి లాగ మధ్యలో రైటింగ్ పాడ్. దానిమీద తెల్ల కాగితాలు. టేబుల్ మీద టేబుల్ లైటు. దాని వెలుతురు కాగితాల మీద పడుతోంది. కుడిచేతిలో పెన్ను. పార్కర్ పెన్ను అది. బంగారపు పాళీ. ఆ కలం కాగితం మీద పరుగెడుతున్న చేస్తున్న మధురమైన శబ్దం. (వయొలిన్ గుర్తు వస్తోంది) ఆ లైటు వెలుతురులో వ్రాసుకుంటున్న నాన్న.

చప్పుడు చెయ్యకుండా నాన్న వెనుకగా గోడ వైపుకు ఉన్న నా చిన్న మంచం మీదకి ఎక్కి దుప్పటి కప్పుకున్నాను. కాళ్ళూపుకుంటూ నాన్న వీపు వైపు చూస్తున్నాను. నాన్న వ్రాసుకుంటున్న కలం పాళీ చప్పుడు చేస్తున్న చప్పుడు వింటున్నాను. మధ్యలో ఎందుకో ఒకసారి, వెనక్కి తిరిగి చూసారు. నేను దుప్పటి తలమీదుగా కప్పుకుని పడుకుని ఉన్నాను. నన్ను చూసి నవ్వారు. నేను నవ్వాను. కళ్ళు మూసుకున్నాను. కాగితం మీద ఆ ‘వయొలిన్’ వినిపించే సంగీతానికి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు.

మరో రోజు

ఆ రోజు ఉదయం నాన్న పడక కుర్చీలో హాలులో గుమ్మానికి ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. పెన్సిల్‌తో ఏదో ఇంగ్లీష్ పజిల్ నింపుకుంటున్నారు. చెవుల మీదుగా తలకి మఫ్లర్ చుట్టుకున్నారు. స్వెటర్ కూడా వేసుకున్నారు. దగ్గిరకి వెళ్ళి పుస్తకం నెట్టేసి చేతుల మధ్య నుండి ఆయన బొజ్జ మీదకి ఎక్కేసాను. ఆయన నడుం చుట్టూ కాళ్లేసేసి, చాతీ మీద తల వాల్చుకున్నాను. ఎందుకనో ఎప్పుడు ఉండే వెచ్చదనంకంటే ఆయన శరీరం ఇంకా కొంచెం ఎక్కువగానే వెచ్చగానే ఉన్నట్టుంది. ఈ లోపు అమ్మ ఒక పళ్ళెంలో కప్పు, సాసర్‌తో టీ తెచ్చింది. నన్ను చూస్తునే, “లేమ్మా, నాన్నగారికి బాగోలేదు”.

“ఏం అయ్యింది?”

“జ్వరం”

“ఐతే నేను స్కూలుకి వెళ్లను. నాన్న ఇంట్లోనే ఉంటారుగా”.నాన్న నవ్వుతూ, “నేను ఇంట్లోనే ఉంటాను కదరా? నువ్వు స్కూల్‌కి వెళ్ళి వచ్చేయ్”

నాకు ఎందుకో నాన్నని అలా వదిలేసి స్కూలుకి వెళ్ళాలనిపించలేదు. నేను వెళ్లను అని, వెళ్ళాలని అమ్మా, నాన్న. చివరికి నాన్న ఒక సలహా ఇచ్చారు. సరే స్కూలుకి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేయ్ సరేనా? అని. అమ్మ లీవు లెటర్ వ్రాసి ఇచ్చింది.

రోజూ స్కూలుకి స్కూలు బస్సులో వెళ్లి వచ్చేవాడిని. ఆ రోజు స్కూలు బస్సులో వెళ్ళి మధ్యాహ్నం బస్సులో ఇంటికి చేరుకున్నాను. నాన్న పడుకుని ఉన్నారు. ఎందుకో దిగులేసింది. నాన్న అలా పడుకుని ఉండటం నచ్చలేదు నాకు. నెమ్మదిగా పక్కలోకి దూరాను. నాన్న ఆ మగత నిద్రలోనే నా తలని తన భుజం మీదకు లాక్కున్నారు. అలానే ఉండిపొయ్యాను. అమ్మ గదిలోకి వచ్చి చూసి ఏమనలో తెలియక అలా చూసి వెళ్ళిపోయింది. కళ్ళలో తడి. ఉందా? ఏమో తెలీదు.

—-

భార్యాభర్తలు సినిమా విడుదల ప్రకటన

భార్యాభర్తలు సినిమా విడుదల ప్రకటన

నాన్న ఊరెళ్ళారు.

పొద్దున్నే వస్తారు అని అమ్మ చెప్పింది. నేను, మోతి ఇద్దరం వరండాలోనే కూర్చున్నాం. ఏదో కారు హారన్ వినపడింది. చదువుకునే వాడినల్లా పిట్టగోడకున్న జాలీలో నుంచి చూస్తే, కారులో నుంచి నాన్న దిగుతున్నారు. “నాన్నొచ్చారు” అని అరుస్తూ, గేటు తెరిచి మెట్లు దూకుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నా వెనకే మోతి. నాన్న నవ్వుతూ నా వైపు తిరిగి మోకాళ్ల మీదకి కొంచెం వంగి చేతులు చాపారు. ఒక్క దూకు దూకాను ఆ చేతుల్లోకి. అలాగే గాల్లోకి లేపి, మళ్ళీ నన్ను హత్తుకున్నారు.

బాబోయ్, నాన్నకి ఎంత బలమో!

మోతి కూడ నాన్న కాళ్ళమీదకి ఎగురుతోంది. నాన్న కాళ్ళు నాకుతోంది. మా ఇద్దరి చుట్టు గిరగిరా తిరుగుతోంది. సంతోషంగా అరుస్తోంది. డ్రైవరు డిక్కి లోంచి సామాన్లు తీసి కింద పెడుతున్నాడు. ఈ లోపు పనిమనిషి ‘బేబి‌’ వచ్చింది. అవన్నీ తీసుకుని ఇంట్లోకి చేరుస్తోంది. పెద్దది బ్రవున్ పేపర్ పాకెట్ ఒకటి. చాలా బరువుగా ఉన్నట్టుంది. మొయ్యలేక ఆపసోపాలు పడుతోంది. నాన్న అలాగే నన్ను ఒక చేత్తో ఎత్తుకుని మరో చేత్తో హొల్డాలు పట్టుకుని, మెట్లెక్కి పైకి ఇంట్లోకి తీసుకువెళ్ళారు.

కాసేపు అవి ఇవి కబుర్లు. స్కూలు టైం అయిపోతుంది అమ్మ నన్ను హెచ్చరిస్తోంది. స్కూలు ఎగగొట్టే అవకాశం లేదు. “నేను ఉంటానులేరా నువ్వు వచ్చేటప్పడికి”, అని నాన్న దగ్గిర అరిచేతిలో ప్రమాణం చేయించుకుని ఆ రోజు స్కూలుకి వెళ్ళాను.

సాయంత్రం వచ్చాను. నాన్న హాలులో పడక కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నారు. మార్కింగ్ పెన్సిల్‌తో గుర్తు పెట్టుకుంటున్నారు. ఇంట్లో హాలులో పుస్తకాల రాక్‌ల మధ్య ఆ బ్రవున్ పేపర్ కట్ట అలానే ఉంది.

“నాన్న, ఇందులో ఏం వున్నాయి?”

“నువ్వే చూడు”

“నేను తెరవ్వొచ్చా”.

నవ్వుతూ “ఊ”..

అమ్మ నవ్వుతూ “మెషిన్లో కత్తెర ఉంది గా. చూడు”.

ఉషా కుట్టు మిషిన్ అది. నాన్నకి, నాకు అమ్మ ఆన్నీ దానిమీదే కుట్టి పెట్టేది. అందులో నుంచి కత్తెర తీసాను. అమ్మ సహాయంతో ఆ కట్టకున్న తాళ్ళు కోసేసాను. పొరలు పొరలుగా కాగితాలు తీసేసి చూస్తే లోపల పుస్తకాలు. ఎన్ని పుస్తకాలో! రంగు, రంగుల అట్టలతో!

“నాన్నా, ఈ పుస్తకాలన్ని నాకేనా?”

“నీకేరా..అన్నీ నీకే”.

తీస్తూన్నాను, ఇంకా వస్తూనే వున్నాయ్. ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి పుస్తకాలు.
ఇవన్నీ చదివి నాన్నలాగా పెద్దవాడినై పోవాలి. మరి ఎక్కడ పెట్టుకోవాలి ఈ పుస్తకాలన్నీ.  అమ్మ అంది. నీ టేబుల్ మీద పెట్టుకో అని. “మరి అన్ని పట్టవుగా”? అప్పుడు నాన్న, “ నా రాక్‌లో కొన్ని పెట్టుకో. నీ పుస్తకాలకి ఇంకో రాక్ చేయించుదాంలే” అన్నారు. నాన్న పుస్తకాల రాక్‌లో నాన్న పుస్తకాల పక్కనే నా పుస్తకాలు. అంటే నాన్న అంత గొప్పగా చదువుకుంటాను. నాన్నకంటే ఎక్కువ తెలుస్తుంది అప్పుడు. అప్పుడు, నాన్నని కాస్మోనాట్ అంటే ఎవరు, స్పుత్నిక్ అంటే ఏమిటి, పడవలను ఎలా చేస్తారు, షిప్పు కాప్టెన్‌కి సముద్రంలో దారి ఎలా తెలుస్తుంది, దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా, అది ఎలా చెక్కు కడుతుంది, ఒంట్లో పురుగుగులు ఎలా ఉంటాయ్,  అవేమి తింటాయ్ అని అడగకుండా అన్ని నేనే చదివి తెలుసుకోవచ్చు.

నాన్న నాకు డ్రాయింగ్ బుక్స్ కూడా తెచ్చిపెట్టారు. ఎంచక్కగా, జనమంచి మామయ్య తెచ్చిన కలర్ పెన్సిల్స్‌తో కొత్త పుస్తకంలో, కొత్త కొత్త బొమ్మలు వేసుకోవచ్చు. బొమ్మల పంచతంత్రం, భారతం, రామాయణం, పారిపోయిన బఠానీ, జానపద కథలు, రష్యన్ కథలు, గేయాలు. పిల్లల పాటలు, నీతి చంద్రిక, ఉత్పలమాల, మను చరిత్ర, సింద్‌బాద్ కథలు ఎన్నో కథలు. రాకుమారులు, రాకుమార్తెలు, మంత్రగత్తెలు, గుర్రాలు, ఏనుగులు, పులులు, చీమలు, కోతులు, చెట్లు, ఆకులు, పడవలు, స్పుత్నిక్కులు, విమానాలు, కార్లు, ఫోర్డ్, నక్షత్రాలు, నీరు, పిడుగులు, విద్యుత్తు …వాటితో పాటు గ్లోబ్. దాని మీద పేర్లన్నీ తెలుగులో ఉన్నాయి!

నాన్న మీద అమాంతం ప్రేమ పెరిగిపోయింది. పరుగెత్తుకుంటూవెళ్ళి నాన్నమీదకి ఎక్కేసాను. నేను చూసుకోలేదు. నాన్న చేతిలో సిగరెట్టుని. కాలుతున్న సిగరెట్టు కొస నుండి ఒక కణిక నాన్న చాతి మీద పడింది. కాలింది. బొబ్బలేచింది. నా ప్రేమకి మచ్చగా అది మిగిలిపోయింది. నాన్న నవ్వుతునే ఉన్నారు.

ఆ రోజు ఆకాశంలో నల్లని మబ్బులు అటూ ఇటూ పరుగెడుతునే ఉన్నాయి. నాన్న అటు పడక గదిలోనుండి ఇటు హాలు లోకి అటూ ఇటూ తిరుగుతునే ఉన్నారు. ఏమిటో తెలియదు కాని ఏంటో ఏదో సరిగ్గా లేదు. నేను వరండాలో చెస్ ఆడుకుంటున్నాను.

లోపల నుండి మూలుగులు. పరిగెత్తుకుంటూ పడక గదిలోకి వెళ్ళాను. అమ్మ కూడా వంటగదిలోనుండి వచ్చింది.

నాన్నకి బాగోలేదు. వాంతులు, విరోచనాలు. బెడ్‌రూమ్ నిండా వాంతులే. నాన్నకి అస్సలు బాగోలేదు. సన్నటి తుప్పర పడుతోంది. క్రింద ఇంటిలోనుండి వాళ్ళు వచ్చారు పరుగెత్తుకుంటూ. ఎవరో అన్నారు, “టాక్సీ తీసుకురామ్మా. నాన్నని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి”. పరుగెత్తాను. తేనాం పేట మెయిన్‌రోడ్డు మీదకి. ఆ మూల మీద టాక్సీ స్టాండ్‌లో ఎవరూ లేరు. అటూ, ఇటూ చూసాను. ఆల్వార్ పేట మూల మీద రెండు పెట్రోలు బంకులున్నవి. వాటి దగ్గిర్లో ఒక టాక్సీ స్టాండ్ ఉంది. అటువైపు పరుగెత్తాను. దాదాపు ఒక కిలోమీటరు. రొప్పుతూ అంబాసిడర్ కార్ టాక్సీ డ్రైవర్‌కి చెప్పాను. నాన్నకి బాగోలేదు. నువ్వు రా. హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని.  ముందు డోర్ తెరిచి కూర్చో మన్నాడు. ఇంటికి తీసుకు వెళ్ళాను. నాన్న కిందకి తీసుకుని వచ్చారు. మెట్లమీద, నాన్న “బాబూ” అంటూ రెండు మూడు సార్లు పిలిచారు. అదే ఆఖరు సారి నాన్న నన్ను పిలవడం. బహుశా ఆయన ఆ ఆఖరి క్షణాలలో భయ పడింది నేనేమైపోతాననేమో!

నాన్న వెళ్ళిపోయారు. నేను మిగిలిపోయాను. ఆయన జ్ఞాపకాలు మిగిలిపోయినవి, ఆయన పుస్తకాలు లాగానే!

 

-0-

నాన్నకి వార్ మెడల్

నాన్నకి వార్ మెడల్

మా నాన్న పేరు అట్లూరి పిచ్చేశ్వర రావు.  ఆయన వృత్తి రీత్యా మొదట నావికుడు.  బ్రిటీషు వారి రాయల్ ఇండియన్ నేవీ నావికాదళంలో నౌకల మీద ఇంజనీరు. భారత దేశ స్వాతంత్ర్య సమరం నేపథ్యంలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో(మ్యూటిని) పాల్గొన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి శిక్షించింది. బారతదేశ స్వాతంత్ర్యానంతరం, భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు మళ్ళీ భారత నౌకాదళంలో చేరారు. ఆయన రచయిత. సాయుధ నౌకదళం తిరుగుబాటు నేపథ్యంతో కథలు కూడా వ్రాసారు. కొన్ని కథలు, వ్యాసాలు, నాటికలు, వెండి తెర నవలలే కాక, సినిమాలకి కథలు కూడా వ్రాసారు. కొన్నింటికి సంభాషణలు కూడా వ్రాసారు. అంటే స్క్రీన్‌ప్లేలు. కొన్ని హిందీ నవలలని తెలుగులోకి అనువదించారు.

మా అమ్మ పేరు చౌదరాణి. శతావధాని త్రిపురనేని రామస్వామి గారి కనిష్ట పుత్రిక. తనూ రచయిత్రే. కథలు, కవితలు, రేడియో వ్యాసాలు, నవలలు వ్రాసింది. హిందీలో నుండి తెలుగులోకి అనువాదాలు చేసింది. స్వయంగా మూడు దశాబ్దాల పాటు మద్రాసులోని త్యాగరాయ నగరులోని, పాండి బజారులో తెలుగు వారికోసం ప్రత్యేకంగా తెలుగు పుస్తకాల షాపుని స్థాపించి, సాహిత్య గోష్టులు, చర్చా వేదికలు, సమావేశాలు నిర్వహిస్తూ సాహిత్య సేవ చేసింది. బహశా ఆ మాత్రం చేసిన తొలి తెలుగు మహిళ తనేనేమో!

– అనిల్ అట్లూరి

సెప్టెంబర్ 26 ప్రసిద్ధ అభ్యుదయ రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారి వర్ధంతి .

Sakshi_D25895202

– ౦-

 

హైదరాబాద్ లో 27న ‘తొండనాడుకతలు’ పరిచయ సభ

 

954820_612525435436475_1241627260_n
ఇరవై తెలుగు కతలు, ఇరవై తమిళ కతలతో తొండనాడు కతలు పుస్తకం రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడు. రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉంది. తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల కతలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

తొండనాడు కతలు పుస్తకం పరిచయ సభ ఈ నెల 27 మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ బంజరాహిల్స్ లోని లామకాన్‌లో జరుగుతుంది. జయధీర్ తిరుమలరావు, సామల రమేష్‌బాబు, వే దగిరి రాంబాబు, ఓట్ర పురుసోత్తం మాట్లాడుతారు. వివరాల కోసం 8142642638, 9346814601 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

తొండనాడుకతలు లో – తమిళ రచయితలు కీ.శే. అణ్ణాదురై, కీ.శే. ము.వరదరాజన్, జయకాంతన్, సార్‌వాగన్, శివశంకరి, బవా చెల్లదురై, వె. శేషాచలం, పారవి, ఎక్బర్డ్ సచ్చిదానందం, డేవిడ్ కనకరాజ్, అళగియ పెరియవన్, జి.మురుగన్, జె.డేనియల్, కాంచి శాంతన్, కవిపిత్తన్, ము.మురుగేశ్, వెణ్ణిల, యాళన్ ఆది, పడుదళం సుకుమారన్, ఇమైయం కథలు ఉన్నాయి. తెలుగులో- కీ.శే. కె.సభా, సి.వేణు, నామిని సుబ్రమణ్యంనాయుడు, కలువకొలను సదానంద, లంకిపల్లె కన్నయ్యనాయుడు, కీ.శే. మధురాంతకం మహేంద్ర, కీ.శే. పులికంటి కృష్ణారెడ్డి, సౌదా, కీ.శే. మధురాంతకం రాజారాం, మధురాంతకం నరేంద్ర, వి.ప్రతిమ, గోపిని కరుణాకర్, విష్ణుప్రియ, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, కె.ఎ.మునిసురేష్‌పిళ్ళె, గూళూరు బాలక్రిష్ణమూర్తి, పసుపులేటి గీత, జిల్లేళ్ళ బాలాజి, స.వెం.రమేశ్, ఓట్ర పురుసోత్తం కథలు ఉన్నాయి.

ఈ పుస్తకం కినిగెలో దొరుకుతుంది.