పిల్లలా…!  నో వే…!

 

 

-రాజ్యలక్ష్మి

~

 

 

హేండ్ బేగ్, లంచ్ బాక్స్ భుజానికి తగిలించుకుని, లిఫ్ట్ కోసం ఆగకుండా దాదాపు పరిగెత్తుతున్నట్టే మూడంతస్తులు ఎక్కి, ఆఫీసులో తన సీట్ దగ్గరకు వెళ్లి లాగిన్ అయి, “అమ్మయ్య!  లేట్ కాలేదు” అనుకుంటూ అనుకుంటూ నీరసంగా కుర్చీలో కూలబడింది సౌమ్య.  లేకపోతే నెలలో రెండు లేట్లకి ఒక లీవ్ కట్.  ఇంకానయం, లాప్‌టాప్ లేదు.  లేకపోతే అది మోస్తూ ఇన్ని అంతస్తులు ఎక్కాలంటే…  అమ్మో!

ఇంతలో “హాయ్…” అంటూ భార్గవి వచ్చింది.  “ఏంటి నిన్న రాలేదు, ఒంట్లో బాలేదా?” సౌమ్యని అడిగింది.

“నేను బాగానే ఉన్నాను. అనన్యకి మొన్నటి నించీ జ్వరం.  ఇంకా తగ్గలేదు.”

“మరెందుకు వచ్చావు?  ఈరోజు కూడా సెలవు పెట్టాల్సింది.”

“నేను అదే అనుకున్నాను.  కానీ మేనేజర్‌కి ఫోన్ చేసి సెలవు అడిగితే, ఫస్ట్ వీక్ కదా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలని రమ్మన్నాడు.  అందుకే దానిని క్రెచ్‌లో దింపి, మందులు జాగ్రత్తగా వేయమని చెప్పి వచ్చాను.  సాయంకాలం మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్ళాలి.  ఈ రిపోర్ట్స్ అవగానే వెళ్లిపోతాను.“

“ఓ.కె.  ఏదైనా సహాయం కావాలంటే చెప్పు” అంటూ భార్గవి తన సీట్ దగ్గరకి వెళ్లిపోయింది.

సౌమ్య పేరుకు తగ్గట్టే చాల సౌమ్యంగా ఉంటుంది.  తన పని చాలా శ్రద్ధగా చేస్తుంది, ఎవరూ వంక పెట్టడానికి వీలు లేకుండా.  తనేమో, తన పనేమో అన్నట్టుగా ఉంటుంది.  ఇల్లు, ఆఫీసు తప్ప వేరే ప్రపంచం లేదు.  ఎవరినీ ఒక మాట అనదు, ఎవరన్నా తనని అన్నా తిరిగి సమాధానం చెప్పడం చేతకాక, తనలో తనే బాధపడుతుంది.

భార్గవి ఇందుకు పూర్తిగా విరుద్ధం.  తను ఎవరిజోలికీ వెళ్ళదు కానీ, ఎవరైనా తన జోలికి వచ్చారంటే మాత్రం ఊరుకోదు.  ఆఫీసులోనూ, బయటకూడా ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటుంది.  అందులోనూ ఆడవాళ్ళంటే ఇంక వెనకా ముందూ చూసుకోదు.  ఒక మహిళాసంస్థలో వాలంటీర్‌గా కూడా పనిచేస్తోంది.

భిన్న ధృవాల్లాగా లాగా ఇద్దరి మనస్తత్వాలలో ఏమాత్రం పోలిక లేకపోయినా ఇద్దరూ మంచి స్నేహితులు.  పక్కవారి మీద అంత దయ, ప్రేమ చూపించే భార్గవి అదే సమయంలో అంతలా ఎలా పోట్లాడగలదనేది సౌమ్యకి ఎప్పుడూ అంతుపట్టని విషయం.  “అందుకే పోట్లాడతా” అని నవ్వుతుంది భార్గవి.

“మా అక్క న్యూరాలజి చేయాలనుకుంది, ముఖ్యంగా సర్జన్ అవుదామనుకుంది.  సీట్ కూడా వచ్చింది.  కానీ వాటిల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పిల్లలతో కష్టమని మా అమ్మానాన్న రేడియాలజి చేయమన్నారు” అని సౌమ్య చెప్తే “మీరు ఏం చదవాలో మీ అమ్మానాన్న నిర్ణయించడమేమిటి, అందులో పి.జి. లెవెల్లో?” అని భార్గవి చాలా ఆశ్చర్యపోయింది.  “ఇలాగే ఈ తల్లిదండ్రులు ప్రేమ, భధ్రత పేరుతో పిల్లలని ఇండివిడ్యుయాలిటి లేకుండా, బలహీనులుగా తయారు చేస్తారు” అని బాధపడింది.  “అలా ఇల్లు, ఆఫీసు అంటూ బావిలో కప్పల్లాగా ఉండద్దు.  కాస్త బయటకొచ్చి ప్రపంచాన్ని చూడండి” అంటుంది ఎప్పుడూ.   భార్గవి స్నేహంతో సౌమ్య కూడా కొంచెం ఆలోచించడం నేర్చుకుంది, ఆమెలాగా ఎదిరించలేకపోయినా.

“నిన్న ఆఫీసులో గొడవ అయిందట కదా!” లంచ్ రూంలో అడిగింది ఉష.

“నిన్న నువ్వు లేవు కదా! ప్రియ మెటర్నిటి లీవ్ అప్లై చేస్తే రాకేష్ అవమానకరంగా మాట్లాడాడుట.  తను పాపం రెస్ట్ రూంలో ఏడుస్తుంటే భార్గవి చూసి కంప్లైంట్ చేయించింది. ఆఫీసులో పెద్ద గొడవ.  ఆడవాళ్ళందరమూ కూడా ప్రియకి సపోర్ట్ చేసాము.  అపాలజీ చెప్పకపోతే వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి కంప్లైంట్ చేస్తామనేటప్పటికి, రాకేష్ ఇక తప్పక అపాలజి చెప్పాడు.  ఈ క్రెడిట్ అంతా భార్గవికే.” అంది సూజన్.  ఇలాంటివాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది సౌమ్య.

“మా అఫీసులో ఒకేసారి ఇద్దరు మెటర్నిటి లీవ్‌లో వెళ్ళారు.  మావాళ్ళేమో రిప్లేస్‌మెంట్ ఇవ్వరు.  చచ్చిపోతున్నాము చాకిరీతో.  ఈ ఆడవాళ్ళు ఎందుకొస్తారో ఉద్యోగాలు చేయడానికి…” అని తన అన్నయ్య ఒకసారి విసుక్కోవడం గుర్తొచ్చింది ఉషకి.

“అసలు ఆడవాళ్ళందరూ ‘పిల్లలని కనం, పెంచం’ అంటే ఏం చేస్తారో ఈ మగవాళ్లు!” కోపంగా అంది సూజన్.   “పిల్లలు లేకుండానా…! అమ్మో…!  అనన్య లేకుండా ఒక్క క్షణమైనా తను ఉండగలదా…” అనుకుంది సౌమ్య

“అయినా హెచ్. ఆర్. లో కొంచెం సెన్సిటివ్ వాళ్ళని తీసుకోవాలి, ఇలాంటివాళ్ళని కాదు.” అంది ఉష.

“అసలు మనుషులని మనుషులలా కాకుండా ఒక్ రిసోర్స్ లాగా చూడడమే ఇన్సెన్సిటివిటి.  మళ్ళీ అందులో సెన్సిటివిటి ఏమిటి”  అంది భార్గవి.   అందరూ నవ్వారు.

కానీ భార్గవి ఈ విషయంలో చాలా సీరియస్.  ఈ ఒక్క విషయంలోనే కాదు భార్గవికి ప్రతి విషయంలో ఒక ఖచ్చితమైన, ధృఢమైన అభిప్రాయం ఉంటుంది.  స్త్రీల పట్ల వివక్ష; ఇంట్లో, ఆఫీసులో వాళ్ళకి జరిగే అన్యాయాలు – ఇలాంటివే కాకుండా పర్యావరణ రక్షణ, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వం రైతులనుండి సారవంతమైన భూమిని వ్యవసాయేతర అవసరాలకోసం సేకరించడం – ఇలాంటివాటి పైన కూడా  ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటుంది.

సౌమ్య రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి అప్రూవల్ కోసం మేనేజర్ కాబిన్‌లోకి వెళ్ళేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. “బ్రాంచ్‌లో అడిషనల్ స్టాఫ్ కావాలి నిజమే, కానీ ఆడవాళ్ళు వద్దు.  ఇప్పటికే మా బ్రాంచ్‌లో ఆడ స్టాఫ్ ఎక్కువైపోయారు.  ఎప్పుడూ సెలవలు, పర్మిషన్లు!  వాటికితోడు గొడవలు!  చచ్చిపోతున్నాననుకో…” అంటూ సౌమ్యని చూసి ఫోన్ కట్ చేసాడు.

‘ప్రతి ఒక్కడూ ఆడవాళ్ళమీద కామెంట్లు చేసేవాడే!  సుత్తిమొహం…’ అనుకుంటూ అప్రూవల్ తీసుకుని “ఈ రిపోర్ట్స్ మెయిల్ చేసేసి నేను వెళ్తాను, పాపని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి” అంది. “ఓ.కె. నో ప్రాబ్లం. మరి లీవ్ అప్లై చేసారా?” అన్నాడు.  “లేదు, హాఫ్‌డే చేస్తాను” అని బయటకొచ్చింది, అంతకంటే ఏమీ అనలేక.

“ఏమంటున్నాడు మన బాసాసురుడు?” సౌమ్య విసురుగా రావడం చూసి అడిగింది ఉష.

“అసలు సెలవు తీసుకుందామనుకుంటే పనైపోగానే వెళ్ళిపోవచ్చని బతిమాలి ఆఫీసుకు రమ్మన్నాడు.  ఇప్పుడేమో తీరా పని పూర్తిచేసి వెళ్తానంటే హాఫ్‌డే లీవ్ పెట్టమంటున్నాడు.“  సౌమ్యకి ఒళ్లు మండిపోతోంది.

“A boss is a boss is a boss is a boss.” నవ్వింది సూజన్.

“ఇప్పుడు లీవెందుకు?  అప్పుడే నాలుగున్నర అయింది కదా!” ఆశ్చర్యపోయింది ఉష.  “నువ్వు అడగకపోయావా?” అంది

“ఉపయోగం లేదు.  నిన్నటి గొడవ తర్వాత ఆడవాళ్ళంటేనే మండిపోతున్నాడు.”  అంది సూజన్

“ఏమీ వద్దు.  లీవ్ అప్లై చేసి దర్జాగా వెళ్లిపో.  లేకపోతే వీళ్ళందరూ ఆడవాళ్ళు ఎప్పుడూ పర్మిషన్లు అడుగుతారని ఏడుస్తారు” అంది భార్గవి.

“నిజమే” అంది సూజన్.

లీవ్ అప్లై చేసి ఆఫీస్‌లోంచి బయటపడింది సౌమ్య.  అనన్యని డాక్టర్‌కి చూపించి ఇంటికి వెళ్ళింది.  అనన్యకి మందు వేసి, బ్రెడ్, పాలు ఇచ్చి పడుకోపెట్టింది.  మందు పనిచేసినట్టుంది, అనన్య ఏడవకుండా నిద్రపోతోంది.   సౌమ్య కూడా పక్కనే పడుకుంది.  ఈ రోజు చాలా అలసటగా ఉంది.  అందులోనూ మధు ఊళ్ళో లేకపోవడంతో మరీ ఒంటరిగా అనిపిస్తోంది.  ఇంతవరకు అనన్య గురించిన దిగులుతో ఆఫీసులో జరిగిన విషయాలు పట్టించుకోలేదు.  ఇప్పుడు అనన్య ప్రశాంతంగా నిద్రపోతూడడంతో పొద్దుననుండి జరిగిన విషయాలు గుర్తుకొస్తున్నాయి.

ఈ మేనేజర్ ఒకడు, మొత్తం పని చేయించుకుని హాఫ్‌డే లీవ్ పెట్టమన్నాడు.  దానికన్నా వాళ్ళు ఆడవాళ్ళ గురించి చేసిన కామెంట్లు మరీ బాధిస్తున్నాయి.  మెటర్నిటి లీవ్ గురించి రాకేష్ అసభ్యంగా మాట్లాడాడుట!  ఏమన్నాడో?  అసలు ఏమైనా అనే అధికారం అతనికేముంది?  మేనేజర్ అయితే ఏకంగా బ్రాంచ్‌లో ఆడస్టాఫునే వద్దంటున్నాడు.  ఏం?  ఆడవాళ్ళు జీనియస్సులు కారా?  వాళ్ళకి ఎఫిషియెన్సి లేదా?

తను చదువుకునే రోజుల్లో ఆడపిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయని మగపిల్లలు గొడవ చేసేవారు.  “మీరేమన్నా క్రికెట్ ఆడుతారా?  ఫ్రెండ్స్‌ తో బయట తిరుగుతారా?  ఊరికే ఇంట్లో కూర్చుని ఏమీ తోచక చదివితే మాకూ వస్తాయి మార్కులు” అని వెక్కిరించేవారు.  ఆడపిల్లలు కూడా స్పోర్టివ్‌గా తీసుకుని “మిమ్మల్ని మేమేమన్నా బయట తిరగమన్నామా?  మీరూ ఇంట్లో కూర్చుని చదవండి” అనేవారు నవ్వుతూ.  అప్పుడు ఏమీ అనిపించేది కాదు, సరదాగా ఉండేది.  కానీ ఇది వేరు!

బయట వాళ్ళననుకుని ఏం లాభం?  “ఆడవాళ్ళు ఎంత చదివినా పొయ్యిలోకే!  బి.యే. చదివినా బియ్యం ఏరాల్సిందే!” – అమ్మ టెంత్ తర్వాత ఇంకా చదువుకుంటానని గొడవ చేస్తే వాళ్ళ తాతయ్య అనేవాడట.  “స్త్రీ స్వాతంత్ర్యం అంటే ఇదే!  ఇంట్లోనూ, బయటా కష్టపడడమే!  కావాలని సాధించుకున్నారుగా! అనుభవించండి…” – అమ్మ ఇంట్లోనూ బయటా చేసుకోలేక సతమతమవుతుంటే తాతయ్య వెక్కిరింతగా అనేవాడు.  “నిన్ను ఉద్యోగం చేయమని ఎవడేడ్చారు?  ఆ వెధవుద్యోగం లేకపోతే గడవదా?  మానిపారెయ్…” – తనకేదైనా ఇబ్బందయితే అమ్మ మీద అరిచేవాడు నాన్న కూడా!  ఆ మాట అనిపించుకోకూడదని అమ్మ నానా హైరానా పడేది.  “నా ఉద్యోగం చిన్నదనీ, మీ నాన్నతో సమానంగా చదువుకోలేదనీ, సంపాదించటంలేదనీ చులకన నేనంటే.  మీరు మాత్రం బాగా చదువుకుని మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయాలి.  అప్పుడే మీకు గౌరవం” అనేది అమ్మ ఎప్పుడూ.  అమ్మ అభిప్రాయం ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తోంది.  వాళ్ళతో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా ఎందుకో అంత చులకన?

“ఈ మగవాళ్ళు ఇలా ఎందుకు ఉంటారో…” అంటే, “ఆడపిల్లలు పుట్టరు, తయారు చేయపడతారు అంటారు.  కానీ మగపిల్లలు కూడా పుట్టరు, తయారు చేయపడతారు.  మనం వారితో పాటు సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేయటం వారిలో తరతరాలుగా జీర్ణించుకున్న అహంకారం భరించలేదు.  ఆ అసహనంవల్లే ఈ కామెంట్లూ అవీ…  వీళ్ళసలు ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారు, కాని అవన్నీ ప్రేమ, ఆప్యాయతల ముసుగులో ఎవరికీ కనపడవు” అంటుంది భార్గవి.

ఇలాంటివెవరైనా తనని అంటే కాళ్ళూ, చేతులూ బిగిసిపోయి, గుడ్లప్పగించి చూస్తుంది కానీ తిరిగి సమాధానం చెప్పలేదు.  లాభం లేదు.  అలాంటివాళ్ళకి స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి.  రకరకాల అలోచనలతో సౌమ్య నిద్రలోకి జారుకుంది.

 

***

క్రీ.శ. 2040

 

“పెళ్ళి పెళ్ళి అని నన్ను ఊరికే సతాయించకమ్మా.  మీకెన్నిసార్లు చెప్పాలి?  నేను పెళ్ళి చేసుకోను.” సౌమ్యని విసుక్కుంది అనన్య.

అనన్య బయోటెక్నాలజిలో రీసెర్చ్ చేస్తోంది.  కూతురికి ముప్పయ్యేళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా పెళ్ళి కాలేదని సౌమ్య దిగులు.  ఎప్పుడైనా అనన్య ఇంట్లో ఖాళీగా దొరికితే ఇద్దరికీ ఇదే చర్చ.

“అదికాదమ్మా, నీకిష్టమైనవాడినే చేసుకో,   మేమేమీ కాదనం కదా!” అంటున్న సౌమ్యకేసి జాలిగా చూసింది అనన్య.

“అబ్బా!  నీకెలా చెప్తే అర్థమవుతుంది?  పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కదా ఇష్టమైనవాడో, ఇష్టంలేనివాడో!  పెళ్ళి చేసుకుని నా కెరీర్ పాడుచేసుకోలేను.”  అంది అనన్య

“పిన్నీ…!  అనన్యా…!” అంటూ వచ్చింది నవ్య, సౌమ్య అక్క కూతురు.  నవ్యని చూడగానే సౌమ్యకి సంతోషం వేసింది.  కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత “చూడవే… నవ్యా!  అనన్య అసలు పెళ్ళేచేసుకోనంటొంది.  నువ్వయినా చెప్పవే…” అంది సౌమ్య ఆశగా.

నవ్య అనన్యకి షేక్‌హాండ్ ఇచ్చి, “కంగ్రాచ్యులేషన్స్!  నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు.  ఈ మాట మీదే నిలబడు” అంది .
“అదేమిటే, నువ్వు కూడా అలా అంటావు!  పెళ్ళి చేసుకుని నువ్వు ఏం ఇబ్బంది పడుతున్నావు?  ఒకటి రెండేళ్ళల్లో పిల్లలకి కూడా ప్లాన్ చేస్తారనుకుంటుంటే…” ఆశ్చర్యంగా అంది సౌమ్య.

“ఓ, పిన్నీ!  పిల్లలా…! నో వే…!  అసలు పెళ్ళే ఒక బర్డెన్ అనుకుంటుంటే ఇక పిల్లలు కూడానా!”  నవ్య చాలా ధృఢంగా చెప్పింది.  అర్థం కానట్టు చూస్తున్న సౌమ్యతో “మా అమ్మ న్యూరాలజీ చెయాలని ఉన్నా రేడియాలజి ఎందుకు చేసింది, నేను ఉన్నాననే కదా!  నువ్వు ప్రమోషన్లు ఎందుకు వదులుకున్నావు, అనన్య కోసమే కదా!  అంటే మీ కెరీర్‌ని, కోరికలని మాకోసం చంపుకున్నారు.  నేను అలా ఉండాలనుకోవటం లేదు. అందుకే…” అంది నవ్య.

సౌమ్య అయోమయంగా చూసింది.  ఏమైంది వీళ్ళందరికీ!  తన స్నేహితులందరికీ వాళ్ళ పిల్లలతో ఇదే సమస్య.  సగానికి సగం మంది పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.  ఒకవేళ చేసుకున్నా పిల్లలని కనడమే లేదు, కెరీర్ పాడవుతుందని!

“అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది.  నవ్యేమో పిల్లలు వద్దంటోంది.  ఏం చెయాలి వీళ్ళని?” అంటూ మధు దగ్గర బాధపడింది.

“చూడూ!  మా అమ్మమ్మ వాళ్ళు ఏడుగురుట.  మా అమ్మ వాళ్ళు నలుగురు.  మేము ఇద్దరం.  మనకి ఒక్కరే.  మనని ఇంకొకరిని కనమని ఎంత బలవంతం చేసారో మర్చిపోయావా?” అన్నాడు.  “మరీ ఒక్క పిల్లేమిటే!  ఇంకొక్కరు ఉంటే బావుంటుంది.  ఒకరికొకరు తోడుగా ఉంటారు” అని అమ్మ ఎన్నోసార్లు తనతోనూ, అక్కతోనూ అనడం గుర్తొచ్చింది సౌమ్యకి.

“కానీ, ఇద్దర్ని మనం మేనేజ్ చేయలేమని కదా ఒక్కరే చాలనుకున్నాము”

“అదే నేను చెప్పేది.  మనం ఒక్కరు చాలనుకున్నాము.  ఈ తరం ఆ ఒక్కరు కూడా వద్దనుకుంటోంది.”

“పిల్లలు సరే, అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది కదా!  ఇప్పుడు బాగానే ఉంటుంది.  కొంతకాలం పోయిన తర్వాత ఒంటరితనంతో ఎంత బాధపడతారు!”  సౌమ్యకి ఈ పరిస్థితి మింగుడుపడడంలేదు.

“బహుశా బాధపడరేమో!  ఇప్పటికే సింగిల్‌గా ఉండే ఆడపిల్లలూ, మగపిల్లలూ ఎక్కువవుతున్నారు.  అనన్య స్నేహితుల్లో కూడా అలాంటివాళ్ళు చాలామందే ఉన్నారు కదా!  ఇంక ఒంటరితనం అన్న ప్రశ్నే రాదు.”

మధు తీసుకున్నంత తేలికగా సౌమ్య తీసుకోలేకపోతోంది.  “మనమేమీ చేయలేము.  ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్.”  అన్నాడు అనునయంగా మధు.

 

***

 

క్రీ.శ. 2300

 

వెంకట్ బిక్కుబిక్కుమంటూ రోడ్డుమీద నడుస్తున్నాడు.   కనుచూపుమేరలో ఇంకెవరూ లేరు.  దాదాపు రెండొందల సంవత్సరాల క్రితం మనుషులు ఇలా రోడ్డు మీద నడిచేవారట.  ఇల్లు ఇంకో వందగజాలు ఉండగా వెహికల్ ఆగిపోయింది.  దగ్గరే కదా అని నడవడం మొదలుపెట్టాడు.  కానీ మనసులో చాలా భయంగా ఉంది.   ఉన్నట్టుండి అయిదారుగురు ముసలివాళ్ళు చుట్టుముట్టారు.  వెంకట్‌కి ఏమి చేయాలో తెలియలేదు.  వెంకట్ దగ్గరున్న వస్తువులు లాక్కుని వాళ్ళు పారిపోయారు.  ఈమధ్య ఇది మామూలైపోయింది.  పోలీసులకి పట్టుబడతామని భయం కూడా లేదు.  నిజానికి పట్టుబడితే ఇంకా మంచిది.  ఏ రెండు మూడు నెలలో జైల్లో హాయిగా ఉంటారు.  పాపం వాళ్ళననేమీ లాభంలేదు!  స్ట్రగుల్ ఫర్ ఎగ్సిస్టెన్స్, అంతే!  

 

***

బాబి కంప్యూటర్ ముందునుంచి లేచాడు విసుగ్గా.  కంప్యూటర్ గేమ్స్ ఆడీ ఆడీ విసుగొచ్చేసింది.  రోజంతా కంప్యూటర్‌తోనే కాలక్షేపం.  ఆడుకోవడానికి కాదు కదా కనీసం మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు.  చదువు కూడా కంప్యూటర్ సహాయంతోనే.  అంతా ఆటోమేటెడ్!  రెండొందల ఏళ్ళ క్రితం వరకూ పిల్లలందరూ ‘బడి’లో చదువుకునేవారనీ, అక్కడ పాఠాలు చెప్పడానికి ‘టీచర్’ అనేవాళ్లు ఉండేవారనీ, సాయంకాలాలు పిల్లలందరూ కలిసి ఆడుకునేవారనీ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాడు.  వీడియోల్లో చూసాడు.  ఎంత బావుందో!  తనెప్పుడూ అలా ఆడుకోలేదు.  అసలు తన ఈడు పిల్లలని చూసి ఎన్నాళ్ళయిందో!

***

 

ప్రపంచ నేతల సదస్సు జరుగుతోంది.  అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు.

“మన టెక్నాలజి చాలా అభివృద్ధి చెందింది.  మనిషి తన మేధస్సునీ, తెలివి తేటలనీ ఒక్క రీసెర్చ్ కే ఉపయోగిస్తున్నాడు.  మిగిలిన రొటీన్ పనులన్నీ ఆటోమేట్ చేసాము.  అఫీసుల్లో, పొలాల్లో, ఫాక్టరీల్లో  పని అంతా రోబోలే చేస్తున్నాయి. ఈ రోబోలని కంట్రోల్ చేయడానికే మనిషి!

దీనికి ఇంకొక పార్శ్వం గమనిస్తే, ఇరవైయ్యొకటవ శతాబ్దంతో పోలిస్తే ప్రపంచ జనాభా సగానికి పైగా తగ్గిపోయింది.  దానిలో యాభై శాతం పైగా వృద్ధులే!  పిల్లలు పది శాతం కూడా లేరు!

కుటుంబ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవడంతో వృద్ధుల, పిల్లల భారం ప్రభుత్వాల మీద పడింది.  వారి పోషణ, రక్షణ ప్రభుత్వాలకి పెద్ద సవాలైంది.   వృద్ధులలో క్రైం రేటు బాగా పెరిగిపోయింది.  చిన్న చిన్న దొంగతనాలు, వృద్ధులు గుంపులు గుంపులుగా కలిసి ఒంటరివారిపై చేసే దాడులు పెరిగిపోయాయి.  జైళ్ళన్నీ వృద్ధులతో నిండిపోయాయి.  తోటిపిల్లలు లేకపోవడంతో పిల్లలు కూడా స్థబ్దుగా తయారయ్యారు.  అన్ని వర్గాల, వయస్సుల ప్రజలలో రకరకాల సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి.  ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరిగిపోయింది.  ఇదే పరిస్థితి కొనసాగితే తొందరలోనే మానవజాతి అంతరించి పోతుంది.  ఈ సమస్యని అధ్యయనం చేయడానికి సోషియాలజీ ప్రొఫెసర్ పండిట్ అధ్యక్షతలో ఒక కమిటీని నియమిస్తున్నాము.  ఈ కమిటీలో ఆర్థికశాస్త్రం, జీవశాస్త్రం మొదలైన రంగాలలో నిపుణులు మెంబర్లుగా ఉంటారు.” అని ముగించాడు.

ఆ కమిటీ ఒక సంవత్సరం పాటు రకరకాల అంశాలను అధ్యయనం చేసి జనాభా తగ్గడానికి గల కారణాలు, ఇది ఇలాగే ఉంటే ఇక ముందు మానవజాతి ఎదుర్కోబోయే సమస్యలు, అలాగే జనభా పెరుగుదలకు తీసుకోవలసిన చర్యలు సిఫార్సు చేసింది.   ప్రపంచ నేతల సదస్సులో ప్రొఫెసర్ పండిట్ ఆ రిపోర్ట్‌ లోని అంశాలని చెప్పడం మొదలుపెట్టాడు.

“ఇరవయ్యొకటవ శతాబ్దం తర్వాత జనాభా తగ్గడానికి గల ముఖ్యమైన కారణాలు:

  1. పర్యావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో సంతానలేమి పెరిగింది.
  2. ఇరవయ్యొకటవ శతాబ్దం నుంచీ స్త్రీలు పురుషులకి తామేమీ తీసిపోమని వారితో సమానంగా చదువూ, ఉద్యోగాలలో రాణించారు. ఆ క్రమంలో తమ చదువుకి, కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యం వివాహానికీ, సంతనానికీ ఇవ్వలేదు.   వివాహము, సంతానము తమ చదువుకూ, కెరీర్‌కూ ప్రతిబంధకంగా వారు భావించారు.

 

జనాభా తరుగుదలకి ఈ రెండో కారణమే ప్రధానం.  దీనిని అరికట్టాలంటే యువతకు, ముఖ్యంగా స్త్రీలకు వివాహము, సంతానము కారణంగా వారి కెరీర్‌కి ఎలాంటి ఆపద ఉండదని హామీ ఇవ్వాలి.  అంతే కాకుండా ఎక్కువమంది సంతానం ఉన్నవారికి తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది.  కుటుంబవ్యవస్థని తిరిగి పునరుద్ధరించటానికి తగిన చర్యలు తీసుకోవాలి.  ఇంకా…”

***

ఫోన్ మోగుతున్న శబ్దానికి సౌమ్యకి మెలకువ వచ్చింది.  కాసేపు తను ఎక్కడ ఉన్నదో అర్థం కాలేదు. తల తిప్పి చూస్తే పక్కన అనన్య నిద్రపోతోంది.   ఎంతసేపటినించీ ఆ ఫోన్ మోగుతోందో!  మోగీ మోగీ ఆగిపోయింది.   టైము చూస్తే తొమ్మిదే అయింది.  అంటే తను గంటే నిద్రపోయిందన్నమాట.  ఈ గంటలోనే కలా!  లేచి ఎవరు ఫోన్ చేసారా అని చూసింది.  భార్గవి.  ఎందుకు చేసిందా అని అనుకుంటుండగానే మళ్ళీ చేసింది,  అనన్యకి ఎలా ఉందంటూ.

“ఫరవాలేదు.  నిద్రపోతోంది.  అది సరే కానీ, నాకిప్పుడే ఒక చిత్రమైన కల వచ్చింది తెలుసా…”  అంటూ భార్గవికి తనకొచ్చిన కల చెప్పింది సౌమ్య నవ్వుతూ.

“ఇది నవ్వుకునే విషయం కాదు సౌమ్యా! ముందుముందు మానవజాతి ఎదుర్కునే స్థితి.  దీని సూచనలు ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలలో కనిపిస్తున్నాయి.  ఉదాహరణకి జపానులో జనాభా వృద్ధిలో తగ్గుదల ఇప్పటికే మొదలైంది.  దీనికి కారణం, అక్కడ స్త్రీలు కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యత సంతానానికి ఇవ్వకపోవడమే!  దీనివల్ల జపాను ప్రభుత్వం రకరకాల సమస్యలని ఎదుర్కొంటోంది.  ఈ సమాజానికి ఉత్పత్తి ఎంత ముఖ్యమో, పునరుత్పత్తి కూడా అంతే ముఖ్యం.  ఉత్పత్తి చేసే వాళ్ళల్లో ముఖ్యమైన రైతుకి అన్నదాత, రైతే రాజు అనీ, అలాగే కుటుంబవ్యవస్థలో, పునరుత్పత్తిలో ముఖ్యపాత్ర వహించే స్త్రీకి గృహలక్ష్మి, మాతృదేవత అని బిరుదులిస్తున్నామే కానీ, వారి శ్రమకు తగిన విలువ, గుర్తింపు, గౌరవం ఇవ్వడంలేదు.  కుటుంబమా – కెరీరా?  పిల్లలా – ప్రమోషన్లా?  ఇలా ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే పరిస్థితి నేటి స్త్రీది.  కానీ ఈ రెండూ జంటపదాల్లాగా, జుగల్బందీలాగా విడదీయలేనివి.  ఇది అర్థం చేసుకోనంతకాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు.  ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నీకొచ్చిన కల నిజమవడానికి ఎంతో కాలం పట్టదు.” ఆవేశంగా అని, “మా మహిళా సంస్థలో వీటిగురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.  ఇంకా ఎంతో చర్చ జరగాల్సి ఉంది.  ఎంతో అర్థం చేసుకోవాల్సి ఉంది.  రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం.” అంటూ ఫోన్ పెట్టేసింది భార్గవి.

భార్గవి మాటలకు బిత్తరపోయి అలాగే కూర్చుండిపోయింది సౌమ్య.                                                                                                               *

 

[ఉత్పత్తి సమాజ మనుగడకు ఎంత ముఖ్యమో పునరుత్పత్తి అంత ముఖ్యం.  దానిలో కీలక పాత్ర స్త్రీది.  అక్కడ వారి శ్రమకు విలువగుర్తింపు, గౌరవం దొరకాలి.  ప్రస్తుతం అవి లేవు.  మాతృమూర్తి, దేవత అని కితాబునిచ్చి ఊరుకుంటారు.  –  ఓల్గా]

మహాలక్ష్మి

-రాజ్యలక్ష్మి

~

 

rajyalakshmi“ఈ ఏడాదైనా పిల్ల పెళ్లి చేస్తారా లేదా?  అమ్మమ్మకి కాస్త ఓపిక ఉండగానే ఆ శుభకార్యం కాస్తా అయిందనిపిస్తే బావుంటుంది కదే.  చూసి సంతోషిస్తుంది.  అయినా అదేమైనా చిన్నపిల్లా? ఇరవైనాలుగోయేడు రాలా?” మా అమ్మ నన్ను అడుగుతోంది.   సాయంకాలం వాకిట్లో కూర్చుని సన్నజాజి పూలు మాల కడుతూ మాట్లాడుకుంటున్నాము.  మా అమ్మమ్మ వైపు చూసాను.  “నా కోసం ఎమీ చేయనక్కరలేదు.  చూసి సంతోషిస్తాననుకో. కానీ అది కాదు ముఖ్యం.  పెళ్లంటే హడవుడి పడకుండా మంచీ చెడూ అన్నీ విచారించాలి” అంది మా అమ్మమ్మ.    అదేమిటో మా అమ్మమ్మ ఎప్పుడూ ప్రపంచానికి విరుద్ధంగానే మాట్లాడుతుంది.  ఎవరైనా పెద్దవాళ్లు, వాళ్లు కాస్త ఓపికగా ఉన్నప్పుడే మనవళ్ల, మనవరాళ్ల పెళ్లిళ్లు చూడాలనుకుంటారు.  మా అమ్మమ్మేమో ఇలా!

మా మామయ్య, అత్తయ్య తీర్థయాత్రలకి వెళ్తూ అమ్మమ్మని మా ఇంట్లో దింపారు.  ఎలానూ అమ్మమ్మ ఉన్నన్ని రోజులు సెలవు పెట్టాను కదా అని అమ్మని కూడా వచ్చి ఉండమన్నాను, ఈ పదిరోజులు.  వచ్చిన రెండోరోజే మా అమ్మ మొదలు పెట్టింది, మా అమ్మాయి పెళ్లి గురించి.

ఇంతలో మా అమ్మాయి వచ్చింది.  ఎవరో ఫ్రెండ్ కారులో డ్రాప్ చేసి వెళ్లాడు.  “ఎవరే ఆ వచ్చింది?  ఐనా నీ బండి ఏమైంది?” మా అమ్మ అడిగింది అనుమానంగా.  “ఫ్రెండ్ అమ్మమ్మా, వెహికల్ ప్రోబ్లం ఇస్తే సర్వీసింగ్‌కి ఇచ్చాను” అంది మా అమ్మాయి లోపలికి వెళ్తూ.

ఆడపిల్లల్లు, మగపిల్లలు తేడా లేకుండా దాని ఫ్రెండ్సు ఇంటికి రావడం అలవాటే.  ఎప్పుడైనా అవసరమైంతే, ఎవరైనా ఇలా డ్రాప్ చేయడమూ అలవాటే. కానీ దాని మొహంలో వెలుగు, పెదవులమీద చిరునవ్వు చూస్తుంటే అంతకన్నా ఎక్కువే అనిపించింది. “ఇదివరకు ఎప్పుడూ చూడలేదే?” అన్నాను దానికి కాఫీ ఇస్తూ.  నాలోని అమ్మ ప్రోబింగ్  మొదలుపెట్టింది.

అది కూడా ఈ అవకాశం కోసమే చూస్తున్నట్టుంది, ఎక్కువ బెట్టు చేయకుండా “అభిరాం అమ్మా.  చార్టెడ్ ఎకౌంటెంట్, ఓన్ ఫర్మ్ ఉంది.  వాళ్ల నాన్నగారు కూడా చార్టెడ్ ఎకౌంటెంటే” అంది తలవంచుకుని.  అర్థమైపోయింది. ఆడపిల్ల అంతకన్నా ఏం చెప్తుంది?  ఎంత చదువుకున్నా ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా పెళ్లి అనేటప్పటికి ఈ డెలికసి తప్పదేమో!

“మనవాళ్లేనా” అంది మా అమ్మ ఆత్రంగా.  “ఆ, మనవాళ్లే.  ఐనా కాకపోతే పనికిరారా? ఏం తాతమ్మా?” అడిగింది మా అమ్మాయి.  మా అమ్మ మొహంలో పెద్ద రిలీఫ్!  నాక్కూడా!

అబ్బాయి బాగానే ఉన్నాడు.  చదువు, ఫామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బావుంది. కారు కూడా మెయిన్‌టైన్ చేస్తున్నట్టున్నాడు.  పైగా మనవాళ్లే!  అమ్మలోని మరో కోణం కాలిక్యులేట్  చేస్తోంది.

“ఎందుకు పనికిరారూ! ఈ రోజుల్లో అందరూ పనికి వస్తారు. మీకేమైనా సంధ్యావందనాలా? దేవతార్చనలా?  మంచివాళ్లైతే చాలు”  అంది మా అమ్మమ్మ.   తొంభైయేళ్ల మా అమ్మమ్మంత  మోడ్రన్‌గా నేనెప్పుడు ఆలోచించగలుగుతానో!  ఆలోచనలు ఇలా ఉంటాయి, మళ్లీ కాసాపోసి చీర కట్టుకుంటుంది.  రెండు పూట్లా మడితోనే భోజనం చేస్తుంది.

“నువ్వు డాక్టరువి కదే, నీకెట్లా పరిచయం?” అడిగాను.  మళ్లీ ప్రోబింగ్.

“రెండేళ్లక్రితం నేను హౌస్‌సర్జన్ చేసే రోజుల్లో అభిరాం చెల్లెలు శ్రావణి మీద ఆసిడ్ అటాక్ జరిగింది.  మా హాస్పిటల్‌లోనే ట్రేట్‌మెంట్ జరిగింది. అప్పుడు అభిరాం ఆ సిట్యుయేషన్‌ని హాండిల్ చేసిన విధానం నాకు నచ్చింది. అలా పరిచయం.”  ఒక్కసారి ఒళ్లు జలదరించింది.  ఈమధ్య ఆడపిల్లల మీద అత్యాచారాలు మరీ ఎక్కువ అయిపోయాయి. బయటకి వెళ్తే తిరిగి వచ్చేవరకూ భయమే.  సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం, …  ఇప్పుడు ఈ అత్యాచారాలు!  భగవంతుడా! ఆడపిల్లలను రక్షించు తండ్రీ!

“మీ ఆసుపత్రిలో ఎందుకు చేరింది?” మా అమ్మమ్మకి అర్థమైనట్లులేదు, అడుగుతోంది.  “అది కాదు తాతమ్మా,  శ్రావణిని వాళ్ల కాలేజిలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు.  తను ఒప్పుకోలేదు.  అప్పటికే శ్రావణికి యు.యస్.లో ఎం.యస్.కి అడ్మిషన్ వచ్చింది.  ఎంగేజ్‌మెంట్ కూడా అయింది.  పెళ్లికొడుకుకి కూడా యు.యస్. లోనే జాబ్.  ఇది తెలిసి ఆ రోగ్ శ్రావణి మీద ఆసిడ్ పోసాడు”  ఆవేశపడిపోయింది.

“శ్రీరామరామ! వాడికిదేం పోయేకాలమే!  రావణాసురుడు కూడా అలా చేయలేదు కదే!” అంది మా అమ్మమ్మ బాధగా.  మనసంతా వికలమైంది.  కాసెపటివరకూ ఎవ్వరం మాట్లాడలేదు.

“ఇప్పుడు ఎలా ఉంది? రికవర్ అయిందా?” అడిగాను నెమ్మదిగా.  “మొహంలో ఒక వైపు చాలా భాగం కాలిపోయింది. నాలుగు సర్జరీలు అయ్యాయి.  ఇంకా చేయాలి, కానీ ఇదివరకటిలాగా రావడం కష్టం.  ఈమధ్యనే జాబ్ లో జాయిన్ అయింది ఈ ఊళ్లోనే” అంది.

“మరి పెళ్లి, అమెరికా?”  మా అమ్మ మనసులో అనుమానం.  “పెళ్లికొడుకు వాళ్లు ఎంగేజ్‌మెంట్ బ్రేక్ చేసారు.  అభిరాం, వాళ్ల పేరెంట్స్ ఈ టైంలో శ్రావణిని ఒక్కదాన్ని యు.యస్.కి పంపడానికి ఇష్టపడలేదు” అంది.

“మంచిపని చేసారు.  కాస్త కుదుటపడేవరకూ అమ్మాయిని ఒక్కదాన్నే వదిలిపెట్టకూడదమ్మా.  వేయి కళ్లతో కనిపెట్టుకుని ఉండాలి.”  అంది మా అమ్మమ్మ.  కనీసం కళ్లతోనైనా చూడని మనిషి గురించి ఎంత కన్సర్న్!

“అయితే ఇక్కడే ఉంటుందన్నమాట” అంది మా అమ్మ.  అలాంటి ఆడపడుచు ఇంట్లో ఉంటే మనవరాలి కాపురం ఎలా ఉంటుందో అని భయం.  “ఇంకెక్కడ ఉంటుంది?” మా అమ్మాయి విసుక్కుంది.

“ఆ ఆసిడ్ పోసిన వాడినేం చేసారు?” అడిగాను.  “అరెస్ట్ చేసారు.  కేస్ నడుస్తోంది.  వాడు ఒక రిచ్‌కిడ్.  పెళ్లి కాన్సిల్ అయిందని తెలిసి కేస్ విత్‌డ్రా చేసుకుంటే శ్రావణిని పెళ్లి చేసుకుంటానని బేరం పెట్టాడు – రాస్కెల్!  కానీ అభిరాం వాళ్లు ఒప్పుకోలేదు.”  మళ్లీ ఆవేశపడింది.

“ఆ త్రాష్ఠుడికి పిల్లనిస్తాముటే!  పెళ్లికాకపోతే పీడాపాయె!  వాడిని జైల్లో పెట్టించాల్సిందే – వదలకూడదు”  అంది మా అమ్మమ్మ కూడా ఆవేశపడిపోతూ.  ఈవిడ ఏ ఫెమినిస్ట్ కి తీసిపోతుంది?

“ఇంతకీ అభిరాంకి ఏం చెప్పావు?”  ఈ డిస్టర్బెన్స్‌తో అడగకూడదనుకుంటూనే అడిగాను.  “మీతో మాట్లాడి చెప్తానన్నాను” అంటూ ఖాళీ కప్పు లోపల పెట్టడానికి వెళ్లింది.   ఇలా చెప్తోంది కానీ, దీని ఉద్దేశ్యం తెలుస్తూనే ఉంది.  లేకపోతే అతని కారులో ఎందుకు వస్తుంది?  పైగా రెండేళ్ల పరిచయం!

“దీనికి మీ అమ్మమ్మ పోలిక వచ్చిందేమిటే?  ఆ పిల్లకి పెళ్లి అవుతుందా? అలాంటి పిల్ల ఇంట్లో ఉంటే ఇదేమి సుఖపడుతుంది?”  మా అమ్మ మాటలకి నాకేమి చెప్పాలో తెలియలేదు.  అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే – ఈ అపశ్రుతి!  మా అమ్మమ్మ వైపు చూసాను.  ఆవిడ ఏమీ మాట్లాడలేదు.

“ఏమిటి అమ్మమ్మా! పోలిక అంటున్నావు” మా అమ్మాయి వస్తూ అడిగింది. “అదికాదమ్మా! ఆ పిల్లకి పెళ్లి కావడం కష్టం.  అలాంటి పిల్ల ఇంట్లో ఉంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? చిన్నపిల్లవు. అలా ఇంట్లో ఇద్దరు ఆడపడుచులతో మీ తాతమ్మ ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలీదు”  అంది మా అమ్మ.

“అవునా తాతమ్మా? నాకు తెలీదే! చెప్పవూ!” అడిగింది మా అమ్మాయి.  “ఏముందే!  చెప్పడానికీ,  వినడానికీ!  ఇదేమన్నా రమాయణమా?  భారతమా?” అంది అమ్మమ్మ.  “పోనీలే తాతమ్మా, చెప్పు.  వింటాను.”  మా అమ్మాయి బలవంతం చేస్తే “సరే” అని అమ్మమ్మ చెప్పడం మొదలుపెట్టింది.

. . .

 

నాకు ఎనిమిదో ఏట పెళ్ళైంది.  పద్నాలుగో ఏట కాపరానికి వచ్చాను.  నాకు ఇద్దరు ఆడపడుచులు.  పెద్దావిడ సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ అనేవాళ్లు. నాకన్నా పదేళ్లు పెద్ద.  నలుగురు పిల్లలు.  చిన్నావిడ మహాలక్ష్మి.  నా ఈడుదే.  ఇంకా కాపురానికి వెళ్లలేదు.  ఇంట్లో ఆయన, నేను, అత్తగారు, మామగారు, మహాలక్ష్మి – అంతే.

నాకు, మహాలక్ష్మికి తొందరగానే స్నేహం కుదిరింది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ, చలాకీగా ఉండేది. చివరిపిల్ల అవడంతో గారాబం కూడా ఎక్కువే.  రోజూ పొద్దున్నే వాకిలి, దొడ్డి చిమ్మి ముగ్గులు పెట్టేవాళ్లం.  ఎవరు పెద్ద ముగ్గు వేస్తారా అని ఇద్దరికీ పొటీ.  స్నానం చెసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసి సుబ్రహ్మణ్యాష్టకం, లక్ష్మీఅష్టోత్తరం, కృష్ణాష్టకం, అన్నపూర్ణాష్టకం, మీనాక్షీపంచరత్నం పారాయణ చేసేవాళ్లం.

వంట మడితో మా అత్తగారు చేసేవారు.  మగవాళ్లిద్దరి భోజనాలు అయినతర్వాత ఆడవాళ్లం భొంచేసేవాళ్లం.  మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చింతపిక్కలో, అష్టాచెమ్మానో ఆడుకునేవాళ్లం. లేకపోతే ఏవైనా పద్యాలో, పాటలో పాడునేవాళ్లం.  నాకు కుమారీశతకం, సుమతీశతకం, రుక్మిణీకళ్యాణం మాత్రమే వచ్చుకానీ, మహాలక్ష్మికి దాశరథీశతకం, నరసింహశతకం, గజేంద్రమోక్షం,  ప్రహ్లాదచరిత్ర , వామనచరిత్ర కూడా వచ్చు.  ఎన్ని పాటలు పాడేదో –  మేలుకొలుపు పాటలు, ఊర్మిళదేవి నిద్ర, లక్ష్మణస్వామి నవ్వు, పద్మవ్యూహం, శివకళ్యాణం, నౌకాచరితం, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, తరంగాలు – ఎన్నో!   సౌందర్యలహరి ఎంత బాగా పాడేదనీ!  కౌసల్యకల, కృష్ణజననం పాడితే ఆనందమో, దుఃఖమో తెలియని పారవశ్యంతో కళ్లంబట నీళ్లుకారేవి.  తన గొంతులో ఏపాటైనా ఎంతో బాగుండేది.

పెద్ద దొడ్డి.  అందులో అరటి, జామ, బాదంలాంటి చెట్లు;  కాయకూరల, ఆకుకూరల మళ్లు;  పారిజాతం, మందార, గన్నేరు,  సన్నజాజి, కనకాంబరం, మల్లె, చేమంతిలాంటి పూలమొక్కలు ఉండేవి.  రోజూ సాయంకాలం పూలు కోసి పెద్ద పెద్ద మాలలు కట్టుకుని జడలో పెట్టుకునేవాళ్లం.  ఏపనైనా ఇద్దరం కలిసే చేసేవాళ్లం.  గుడికి, పేరంటానికి – ఎక్కడికెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం.  ఇంక మా కబుర్లకి అంతే ఉండేది కాదు.  అదేమిటో బావిలో నీళ్లలాగా ఊరుతూనే ఉండేవి.  ఎప్పుడూ నవ్వుకుంటూ, సన్నగొంతుకతో  మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం.  మా అత్తగారు “ఏముంటాయే అన్ని కబుర్లు!” అనేవారు నవ్వుతూ.  మేము ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని మళ్ళీ నవ్వుకునేవాళ్లం.

నేను కాపురానికొచ్చిన రెండేళ్లకి సుబ్బమ్మవదిన భర్త జ్వరంవచ్చి పోయారు.  పదోరోజు ఆవిడని చూస్తే ఏడుపొచ్చింది.  మూడునిద్రలకి ఆయనతో పాటు వచ్చినప్పుడు ఎలా ఉండేది!  ఎర్రంచు ఆకుపచ్చ పట్టుచీర, తలలో కనకంబరాలు, ఎర్రటి కుంకుమ బొట్టు, ఎర్రరాయి ముక్కుపుడక, చేతినిండా గాజులు –  పూసిన తంగేడులా!   ఇప్పుడు ఈ తెల్లని సైనుపంచె, తలమీద ముసుగు, బోసి మొహం, మెడ,  చేతులు –  ఆ సుబ్బమ్మవదినేనా అనిపించింది.   మూడో నెలలో సుబ్బమ్మవదినని, పిల్లలని మా ఇంటికి తీసుకొచ్చేసారు.  పిల్లల్ని ఇక్కడే బళ్లో చేర్పించారు.

నాకు నెల తప్పింది.  మహాలక్ష్మికి పదహారో ఏడు వచ్చింది.  ముహూర్తం చూసి మహాలక్ష్మిని కాపురానికి పంపించాము.  వెళ్లేటప్పుడు ఇద్దరం ఒకరిని ఒకరు కావలించుకుని ఒకటే ఏడుపు.  మా మామగారి అక్కయ్య “శుభమా అని పిల్ల కాపురానికి వెళ్తుంటే ఏమిటే మీ ఏడుపులు” అంటూ కోప్పడ్డారు.   మహాలక్ష్మి వెళ్లిపోయాక దాదాపు నెలరోజులపాటు ఎమీ తోచలేదు నాకు.  ఒక్కోసారి భోజనానికి మాతోబాటు మహాలక్ష్మికి కూడా విస్తరి వేసేదాన్ని.   మా అత్తగారు “ఏమిటే నీ పరధ్యానం” అని నవ్వేవారు.

పిల్లలతో కాస్త కాలక్షేపం అయ్యేది కాని, సుబ్బమ్మవదిన ఎక్కువ మాట్లాడేది కాదు.  పైగా ఆవిడకి ఈమధ్య కోపం, విసుగు ఎక్కువయ్యాయి.  ఎప్పుడూ ఎదో విషయం మీద విసుక్కుంటూనే ఉండేది, నన్నే కాదు అందరినీ!  నేను మాత్రం తిరిగి సమాధానం చెప్పేదాన్ని కాదు.  నాకన్న బాగా పెద్దది, పైగా కష్టంలో ఉంది!  మా అత్తగారు “ఏదో పిల్లలతో లక్షణంగా కాపురం చేసుకుంటోందనుకుంటే, ఆ భగవంతుడు చిన్న చూపు చూసాడు. ఈ యోగం పట్టింది.  దీని బతుకిలా బండలైంది.  ముప్ఫైయ్యేళ్లన్నా లేవు, ఎప్పటికి వెళ్లేను దీని జీవితం” అని బాధపడేవారు.

దసరా పండక్కి రెండు రోజుల ముందే వెళ్లి మా మామగారు మహాలక్ష్మిని తీసుకువచ్చారు.  లోపలికి వస్తూనే నన్ను కావలించుకుని “నీకోసం ఏం తెచ్చానో చూడు” అంటూ, సంపంగి పూలమాల తీసి తలలో పెట్టింది.  “అదేంటి మొత్తం నాకే పెట్టావు, నీకు లేకుండా” అన్నాను.   “మా ఇంట్లో పెద్దచెట్టు ఉంది.  నేను రోజూ పెట్టుకుంటూనే ఉన్నానులే” అంది.  “అప్పుడే అది మీ ఇల్లయిపోయిందా?” అని వేళాకోళం చేసాను.   ఆ రోజు మా కబుర్లకి అంతే లేదు.  మా అత్తగారు “పొద్దుపోయింది ఇంక పడుకో”మని కోప్పడేదాకా మా కబుర్లు సాగుతూనే ఉన్నాయి.  “ఆడపడుచు వస్తే నన్నిక పట్టించుకోవా ఏమిటి” అని ఆయన వెక్కిరించారు.  మహాలక్ష్మి ఉండగానే మా అమ్మ వచ్చి సీమంతం చేసి నన్ను పురిటికి తీసుకెళ్లింది.

నాకు మగపిల్లవాడు పుట్టాడు.  మూడోరోజు పథ్యం పెట్టిన తర్వాత మా నాన్నగారు మా మామగారికి మనవడు పుట్టాడని ఉత్తరం రాసారు.  పిల్లవాడిని చూడడానికి ఆయన కానీ, మా అత్తగారు కానీ రాలేదు.  ఎందుకో అర్థం కాలేదు.  పెద్ద దూరభారం కూడా కాదు.  మూడునాలుగు గంటల ప్రయాణం, అంతే!  మా అమ్మతో అంటే “కుదరద్దూ!” అంది.   కానీ పిల్లవాడిని చూసుకుంటే నాకెందుకో చాల గర్వంగా, ప్రపంచంలో ఎవరూ చేయలేని పని నేను చేసినట్లు, అందరూ నన్ను అభినందించాలని, అపురూపంగా చూడాలని అనిపించేది.

మూడో నెల వచ్చింది.  బారసాల నాటికి వచ్చారు ఆయన, ఒక్కరే!  మనిషి బాగా డస్సిపోయి, నల్లకప్పేసినట్లు ఉన్నారు.  మొహంలో కళే లేదు.  పిల్లవాడిని చూసిన సంతోషం ఎక్కడా కనపడలేదు.  చాలా ముభావంగా ఉన్నారు.  మా అత్తగారు, మహాలక్ష్మి వస్తారనుకున్నాను, రాలేదు.  మహాలక్ష్మి ఎందుకు రాలేదో! పురుడు వచ్చిన తర్వాత వాళ్ల అత్తగారింటికి ఉత్తరం రాయించాను కూడా!  అడుగుదామంటే  ఆయనతో ఏకాంతంగా మాట్లాడడానికి వీలు కాలేదు.  పిల్లవాడికి కనీసం ఒక గొలుసు కానీ, మురుగులు కానీ తేలేదు!  మొత్తానికి బారసాల అయిపోయింది.  ‘రామం’ అని పేరు పెట్టాము.  మంచిరోజు చూసి నన్ను, పిల్లవాడిని పంపించమని చెప్పి భోజనాలు అవుతూనే ఆయన బయలుదేరి వెళ్లిపోయారు.  అదే సంగతి మా అమ్మతో అంటే, “గొలుసు, మురుగులు చేయించటానికి డబ్బు సర్దుబాటు అవ్వద్దూ!  అంతమంది ప్రయాణం అంటే ఎంత ఖర్చు!  ఒంటిరెక్క మీద అంత సంసారం లాగడమంటే మాటలా!  అందులోనూ ఇప్పుడు సంసారం మీద సంసారం వచ్చి పడిందాయె!” అంది.  ఏమైనా, నా అనందాన్ని పంచుకోవడానికి మహాలక్ష్మి పక్కన లేకపోవడం నాకు వెలితిగానే ఉంది.

మంచిరోజు చూసి మా అమ్మ నన్ను, పిల్లవాడినీ మా అత్తగారింట్లో దింపింది.  నాకు, పిల్లవాడికి గుమ్మంలో దిస్టి తీసి మా అత్తగారు నా చేతిలోంచి పిల్లవాడిని అందుకుని లోపలికి తీసుకెళ్లారు.  లోపలి గదిలో మహాలక్ష్మి కనిపించింది తెల్ల సైనుపంచెలో!  తలమీద ముసుగుతో!  అక్కడే నిలబడిపోయాను.  నాకు పురుడు వచ్చిన పదోరోజు మహాలక్ష్మి భర్త పాము కరిచి చనిపోయాడుట!  మా అత్తగారు కళ్లుతుడుచుకుంటూ ఎమిటేమిటో చెప్తున్నారుగానీ నాకేమీ వినపడ్డంలేదు.  మా అమ్మ కూడా అయోమయంగా చూస్తోంది.  పట్టుకుచ్చులా నిగనిగలాడుతూ ఇంత బారుజడ, గలగల్లాడుతూ చేతిగాజులు, గల్లుగల్లుమంటూ కాళ్లపట్టీలు – ఏమైనాయి?  ఎన్నిరకాల జడలు వేసుకునేది!  ఎన్ని పూలు పెట్టుకునేది!  ఎన్నెన్ని రంగుల చీరెలు కట్టుకునేది!   కళకళ్లాడుతుండే మొహం, వెలుగులు చిమ్మే కళ్లు, చిరునవ్వు చిందే పెదవులు – ఏవీ?  అసలు అక్కడ ఉన్నది మహాలక్ష్మేనా?  ఈ ప్రపంచంలోని ఆనందమంతా తన స్వంతమైనట్లు ఉత్సాహంగా తుళ్ళుతూ ఉండే మహాలక్ష్మి ఇప్పుడు చైతన్యం లేకుండా తలవంచుకుని ఈ గదిలో ఒక మూల కూర్చుని ఉంది!

నేను, మహాలక్ష్మి ఒకళ్లని ఒకళ్లు పట్టుకుని ఏడుస్తూ ఎంతసేపు ఉండిపోయామో తెలీదు. మా అత్తగారు “ఇలా నువ్వు హైరాన పడతావనే నీకు కబురుచేయలేదు.  తమాయించుకో.  అసలే బాలింతరాలివి.   పిల్లవాడు ఏడుస్తున్నాడు చూడు.  లేచి పాలు పట్టు” అని నన్ను బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్లారు.

పెద్దమ్మాయి విషయంలో తట్టుకోగలిగిన మా అత్తగారు చిన్నమ్మాయి విషయంలో తట్టుకోలేకపోయారు.  ఆ దిగులుతోనే ఆర్నెల్లు తిరక్కుండా పోయారు.  మా అత్తగారు పోయినప్పుడు వచ్చిన మా అమ్మ వెళ్తూ “మీ అత్తగారు కూడా లేదు, నిన్ను కడుపులో పెట్టుకు చూసుకోవడానికి.  మీ ఆడపడుచులకు వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు.  ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది.  ముఖ్యంగా మహాలక్ష్మికి.  దాన్ని ఎవ్వరు తీర్చలేరు.  ఆ బాధలో వాళ్లు ఏదైనా పరుషంగా మాట్లాడినా, నువ్వు మటుకు మాట తూలకు.  నీకు నీ పిల్లలెంతో సుబ్బమ్మ పిల్లలంతే. ఆ తేడా ఏనాడూ కలలోకి కూడా రానీయకు.  మీ మామగారు పెద్దవారు, కనిపెట్టుకుని చూసుకో తల్లీ!” అన్నది.  అది ఒక తారకమంత్రంలాగా ఎప్పటికీ నా మనసులో నిలిచిపోయింది.

సుబ్బమ్మవదినకి పగలంతా పిల్లల పనితో సరిపోయేది.  సాయంకాలాలు ఏదైనా హరికథకి కానీ, పురాణానికి కానీ ఏ పిల్లనో వెంటపెట్టుకుని వెళ్లేది.  మహాలక్ష్మి మాత్రం ఇంట్లోంచి బయటకి వచ్చేదే కాదు. ఎప్పుడూ అశాంతితో రగిలిపోతున్నట్టు ఉండేది. అంతులేని దుఃఖంతో దహించుకుపోతూ ఉండేది.  మా అత్తగారు పోయిన తర్వాత ఈ దుఃఖం మరీ ఎక్కువైంది.  నవ్వడం ఏనాడో మర్చిపోయింది.  ఎప్పుడూ పద్యాలో, పాటలో పాడుతుండే ఆ గొంతు మూగబోయింది.  రాత్రిపూట ఏడుస్తూ కూర్చునేది.  తెల్లవార్లూ తనతో పాటే కూర్చునేవాళ్లం – సుబ్బమ్మవదినకానీ, నేనుకానీ.  అద్దం చూసుకుని ఒక్కోసారి ఏడుస్తూ ఉండేది.  తనకున్న రంగురంగుల చీరలన్నీ తగలబెట్టేసింది.   తన నగలన్నీ బావిలో పడేయబోతే అడ్డుకుని, దాచేసాము.

అదివరకు ఇద్దరం ఒకే ప్రాణంలా ఉండేవాళ్లమా! ఇప్పుడు నన్ను చూస్తే అసలు గిట్టదు.  కాల్చేసే చూపులతో నావైపు చూసేది. ఎంతో ప్రేమతో చూసే ఆ కళ్లల్లో ఇప్పుడు ద్వేషం, అసహ్యం!  “నాకు చిన్నది చాలు వదినా” అని తను చిన్నపూలమాల పెట్టుకుని, పెద్దమాల నా జడలో పెట్టే మహాలక్ష్మి – ఇప్పుడు నేను పూలమాల కట్టుకుంటే పూలన్నీ తుంపి పోస్తుంది!  “ఈ రంగు నీకు బావుంటుంది వదినా” అని నాకోసం చీరలు ఏరే మహాలక్ష్మి – ఇప్పుడు నేను కొత్తచీర కట్టుకుంటే, దానికి కాటుక మరకో, సిరా మరకో పూస్తుంది!  ఎప్పుడైనా కొఱ్ఱుపట్టిన చీర కట్టుకుంటే అది మార్చుకునేవరకూ గొడవచేసే మహాలక్ష్మి – ఇప్పుడు నా చీరలన్నిటికీ చిల్లులు పెట్టింది!  “మనిద్దరం ఇలా పొద్దుపోయేవరకూ కబుర్లు చెప్పుకుంటూంటే అన్నయ్య తిట్టుకుంటాడు వదినా” అని వేళాకోళం చేసే మహాలక్ష్మి – ఇప్పుడు రాత్రిపూట మా పడకగది కిటికీలోంచి తొంగి చూస్తుంది!  నా సీమంతానికి పూలజడ వేసి, సీతమ్మవారి సీమంతం పాట పాడిన మహాలక్ష్మి – ఇప్పుడు రామాన్ని చూసి మొహం తిప్పుకుంటుంది; దగ్గరకు వెళ్తే తోసేస్తుంది!  తనని చూస్తే  “కమలములు నీట బాసిన … ” [*] పద్యం గుర్తు వచ్చేది.

ఒకరోజు సుబ్బమ్మవదిన కూతురు జయ, తెలిసినవాళ్ల దొడ్లోంచి సంపంగిపూలు తెచ్చుకుంది.  మాల కడదామని వచ్చి చూద్దును కదా, మహాలక్ష్మి రేకులని ఒక్కక్కటిగా తుంపి నేలపై పోస్తోంది.  పసిపిల్ల తెచ్చుకున్న పూలు పాడుచేసిందని కోపంగా “ఏం పని ఇది వదినా!” అని అనబోయి, తన మొహం చూసి ఆగిపోయాను.  ఆ కళ్లల్లో అనంతమైన దుఃఖం!  ఆ దుఃఖం  పోగొట్టడానికి ప్రాణాలైనా ఇవ్వాలనిపించింది ఆ క్షణంలో.  మా అమ్మ అన్నట్టు ఆ దుఃఖం ఏనాటికైనా తీరేదా? ఎవరైనా తీర్చగలిగేదా?

జయ పెళ్లి కుదిరింది.  పెళ్లి హడావిడి ఉన్నన్ని రోజులు మహాలక్ష్మి మాత్రం ఇవతలికి రాలేదు. మా పెళ్లిలో ఎన్నో పాటలు పాడింది.  స్నాతకం పాటలు, తలంబ్రాల పాటలు, సదస్యం పాటలు, వియ్యాలవారి  పాటలు, మంగళహారతులు, పన్నీరు పాటలు, బంతులాట పాటలు, పేరుచెప్పే పాటలు, ఆఖరికి అప్పగింతల పాట కూడా మహలక్ష్మే పాడింది ఆ ఐదు రోజుల పెళ్లిలో.  ఎప్పుడూ నావెంటే ఉండేది కబుర్లు చెప్తూ.  అప్పుడు పెళ్లిపందిట్లో సందడంతా తనదే!  ఇప్పుడు కనీసం పెళ్లికొడుకునన్నా చూడలేదు!

పెళ్లి హడవిడి అయిపోయింది.  పెళ్లివారు, బంధువులు వెళ్లిపోయారు.  అందరం బాగా అలసిపోయి నిద్రపోతున్నాము.  ఒక రాత్రివేళ బావి గిలక శబ్దానికి మెలకువ వచ్చింది.  “ఆత్మహత్య మహాపాతకమని కానీ, లేదంటే ఏనాడో బావిలో దూకేదాన్ని” అన్న మహాలక్ష్మి మాటలు గుర్తుకు వచ్చి, ఉలిక్కిపడి బయటకి పరిగెత్తాను.  మహాలక్ష్మి బావిలోంచి నీళ్లు తోడుకుని చన్నీళ్ల స్నానం చేస్తోంది!  అక్కడే దొడ్డిగుమ్మంలో నిలుచుని అలా చూస్తూ ఉన్నాను.  ఎన్ని చేదలు తోడి పోసుకుందో!  ఎన్ని బావులలో నీళ్లు పోసుకుంటే ఆ హృదయంలోని మంట చల్లారుతుంది?   అంతలో వీధి వసారాలో పడుకున్న మా మామగారు లేచి వచ్చారు. నేను చటుక్కున పక్కకి తప్పుకున్నాను.  ఆయన నన్ను చూసారేమో తెలీదు.  మహాలక్ష్మి లోపలికి వచ్చింది, తలవంచుకుని.  ఎవ్వరం ఎమీ మాట్లాడలేదు.

మర్నాడు  మా మామగారు వాళ్లబ్బాయితో “నేను చిన్నమ్మాయిని తీసుకుని కొంతకాలం కాశీలో ఉందామనుకుంటున్నాను. ఏర్పాట్లు చూడు” అన్నారు.  పదిరోజుల్లో మా మామగారు, మహాలక్ష్మి కాశీకి బయలుదేరి వెళ్లిపోయారు.  కనీసం కాశీలో అన్నా మహాలక్ష్మికి మనశ్శాంతి దొరికితే బావుండునని ఆ విశ్వేశ్వరుడికి దణ్ణం పెట్టుకున్నాను.

అలా వెళ్లిన వాళ్లు ఏడాది తర్వాత తిరిగి వచ్చారు.  మహాలక్ష్మి “నీకోసం తెచ్చాను వదినా” అని పెట్టెలోంచి బెనారసు చీర, “దారిలో కనబడ్డాయి, నీకిష్టం కదా” అంటూ సంపంగిపూల పొట్లం నా చేతిలో పెట్టింది.  సంతోషంతో కావలించుకున్నాను.   నేను మడి కట్టుకుని వంట చేస్తుంటే సన్నగా పాడుతున్నట్టు మహాలక్ష్మి గొంతు వినిపించింది.  రామాన్ని ఒళ్లో కూర్చోపెట్టుకుని రామాయణం శ్లోకాలు చదువుతోంది.  నన్ను చూడగానే “నాన్న నాకు రామాయణం పాఠం చెప్తున్నారు వదినా.  అయోధ్యకాండ వరకూ అయింది” అన్నది.  ఆ కళ్లల్లో తేజస్సుకి, మొహంలో ప్రశాంతతకి అర్థం తెలిసింది.

. . .

అమ్మమ్మ చెప్పడం పూర్తి చేసింది.  అందరి మనసులూ భారమయ్యాయి.  చీకటిపడుతూంటే  లేచి లైట్ వేసాను.  “తర్వాతేమైంది?” మా అమ్మాయి అడిగింది. ” ఏముంది!  మీ అమ్మమ్మ పుట్టింది. అందరి చదువులు, పెళ్లిళ్లు అయ్యాయి. సుబ్బమ్మవదిన పిల్లల దగ్గరకు వెళ్లింది.  మా మామగారు, సుబ్బమ్మవదిన, మహాలక్ష్మి, మీ ముత్తాత – అందరూ వరసగా వెళ్లిపోయారు.  నేనొక్కదాన్నే మిగిలాను, నీ పెళ్లి చూడడం కోసం” అంటూ మునిమనవరాలిని దగ్గరకు తీసుకుని మా అమ్మమ్మ నవ్వింది.

“అందుకే చెప్తున్నాను.  విన్నావుగా! తాతమ్మ ఎన్ని కష్టాలు పడిందో! నీకింతకంటే రాజాలాంటి సంబంధం వస్తుంది. ఈ సంగతి మర్చిపో.”  మనవరాలిని కన్విన్స్ చేయటానికి యథాశక్తి ప్రయత్నిస్తోంది మా అమ్మ.

“అదే పరిస్థితి నాకొస్తే ఏం చేస్తారు అమ్మమ్మా?”  విసురుగా అంది మా అమ్మాయి.  “అపభ్రంశపు మాటలు మాట్లాడకు” అంటూ అరిచింది మా అమ్మ.

“అదలా మొండిగా మాట్లాడుతుంటే నువ్వలా చూస్తూ ఊరుకుంటావేమిటే?  ఇదిలాగే వాళ్ల నాన్న కూడా దగ్గర వాగుతుందేమో?  అసలే ఇది తాన అంటే ఆయన తందానా అంటాడు” అంటూ నా వైపు చూసింది అమ్మ.

నిజమే!  దానికి నాకన్నా వాళ్ల నాన్న దగ్గర చనువు ఎక్కువ.  దీని మాటలు చూస్తుంటే ఇది ఆ కుటుంబంతో చాలా అటాచ్‌మెంట్ పెంచుకున్నట్టుంది.  పోనీ, ఇన్‌ఫాచ్యుయేషన్ అనుకుందామా అంటే ఇదేమీ టీనేజ్‌లో లేదు, ఇరవైనాలుగేళ్ల పిల్ల, పైగా ఎం.డి. చేస్తోంది.  నేనెటూ తేల్చుకోలేకుండా ఉన్నాను.  అంత ఇష్టంగానూ లేదు, అలా అని దాని అభిప్రాయానికి విరుధ్ధంగా వెళ్లాలనీ లేదు.  డెసిషన్ దానికీ, వాళ్ల నాన్నకీ వదిలిపెట్టాలనుకున్నాను.

ఇంక తట్టుకోలేక మా అమ్మ “నువ్వన్నా చెప్పమ్మా! నువ్వు పడ్డ కష్టాలన్నీ అది కూడా పడాలా?” అంది మా అమ్మమ్మతో.

“నేనేం కష్టాలు పడ్డానే?  కష్టాలు, బాధలు అన్నీ సుబ్బమ్మవదినవీ, మహాలక్ష్మివీ!  నావి చిన్న చిన్న ఇబ్బందులే.  అయినా వాళ్లేమన్నా పరాయివాళ్లా?”  అంది అమ్మమ్మ.  మా అమ్మమ్మ ఎప్పటికైనా నా అలోచనలకి అందుతుందా!

న్యూక్లియర్ ఫామిలీస్ వచ్చాక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అన్న ఆలోచనకి అలవాటుపడిపోయింది మా తరం.   అటు పుట్టింటివాళ్లనీ, ఇటు అత్తగారింటివాళ్లనీ కూడా తన కుటుంబంలో భాగంగా చూసి, వాళ్ల కష్ట సుఖాలని తనవిగా భావించే మా అమ్మమ్మ తరంలోని సంస్కారం తిరిగి మా అమ్మాయి తరంలో ప్రవేశిస్తోందా!

“మీ నాన్నని ఊరునించి రానీయమ్మా మాట్లాడుదాము.  అన్నీ కుదరాలి కదా!” అంటోంది మా అమ్మమ్మ.  “థాంక్స్ తాతమ్మా!” అంటూ మా అమ్మాయి వాళ్ల తాతమ్మని కావలించుకుంది.

***

 

[*]  – కమలములు నీట బాసిన,  కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్,  దమ దమ నెలవులు తప్పిన,  దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!