సర్కస్ కాదు, యుద్ధం చేయాలి!

 

  

చిత్వాన్ – అతనొక కథలోని పాత్రే గానీ యిటీవల నన్ను చెప్పలేని కల్లోలానికీ వ్యాకులతకీ గురిచేసిన అత్యాధునిక యువకుడు. దాదాపు వొక సంవత్సర కాలంగా చాలా సార్లు అతను నన్ను నిద్రపోనివ్వ లేదు. ఏ పని చేస్తోన్నా అతను నా ఆలోచనల్లో తారాడుతూనే వున్నాడు. అతని జ్ఞాపకాలు తరచు నన్ను వెంటాడుతున్నాయి . బతుకు పట్ల చావు పట్ల అతని ఫిలాసఫీ నన్ను యేదో తెలీని యిబ్బందికి గురిచేస్తోంది. అతని అకాల మరణం నన్ను పదే పదే  వెంటాడుతోంది. ఇక తప్పించుకొని  పారిపోవడం నా వల్ల కావడం లేదు. ముఖాముఖి యెదుర్కోవడమే యిప్పుడు చేయాల్సింది.

‘యెందుకు జీవితాన్ని చేజేతులా అర్ధాంతరంగా ముగించుకొని చచ్చిపోయావు ?’ యెటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగా.

నా ప్రశ్నకి అతనేం తత్తరపడలేదు. నా వైపు నిశితంగా వొక క్షణకాలం చూసి – ‘నువ్వు మాత్రం చావక బతికున్నావా ?’ అని యెదురు ప్రశ్నించాడు. నేను నిరుత్తరుణ్ణయ్యా.

 ‘నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులుల తో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పువ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను. జీవితమంటే నాకిష్టమే. కానీ జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది. అందుకే నా ప్రాణాన్ని పట్టుకుని వేళ్లాడ్డం అంత ఇష్టం ఉండదు. ఇక చాలనుకున్నప్పుడు ఇక్కడ్నుంచి జంప్ అయిపోవడమే! పవర్ ఆఫ్ బటన్ నొక్కెయ్యడమే! అప్పటివరకూ అంతా నా ఇష్టానుసారమే!’

మనం మనకు నచ్చినట్టు బతకడం లేదని చిత్వాన్ ఆరోపణ. ప్రతిక్షణం అనేక విధాల పరాయీకరణకి లోనై బతికే బతుకు చావుతో సమానమని అతని నిర్ధారణ. అసంబద్ధ బంధాల్లో చిక్కుకొని మనల్ని మనం కోల్పోయి బతికే బతుకూ వొక బతుకేనా అని అతని ప్రశ్న. నిజమే. కానీ ‘జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది.’ అన్న అతని మాటల్ని అర్థం చేసుకోవాలనే తద్వారా అతణ్ణి అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం.

కానీ ‘అన్నింటికీ అర్థాలు వెతకడంలోనే మనిషి తనలోని మ్యాజిక్ ని కోల్పోయాడ’ నే చిత్వాన్ మాటలే మళ్ళీ అతణ్ణి అర్థం చేసుకోడానికి అడ్డుపడుతున్నాయి. అయినా అన్నిటికీ అర్థాలు వెతికే క్రమంలోనే మ్యాజిక్కో  థ్రిల్లో మరేదో వుందని నేను నమ్ముతాను కాబట్టి చిత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నాన్ని నేను మానుకోలేను. చిత్వాన్ ని అర్థం చేసుకోవడమంటే సంక్లిష్టమైన సంక్షుభితమైన సమాజాన్నీ సమాజ చలనాన్నీ అర్థం చేసుకోవడమే. ఇవాళ్టి అత్యాధునిక సందర్భంలో నిర్దిష్ట సామూహిక ధ్యేయాల్లేని యువత  అంతరంగ సంచలనాన్ని  కొలిచే ప్రయత్నం చేయడమే.

ఇంతకీ యెవరీ చిత్వాన్ –  అంటే వెంకట్ సిద్ధారెడ్డి ‘సోల్ సర్కస్’ లోని (సారంగ – జూన్ 11, 2015 ; కథ లింక్ : ) పాత్ర అని వొక్క ముక్కలో చెప్పొచ్చు. కానీ అతణ్ణి అర్థం చేసుకోడానికి యెందుకంత తపన  అంటే మాత్రం అంత తేలిగ్గా చెప్పలేం. కారణం అతను కేవలం కథలో పాత్ర మాత్రమే కాదు అనిపించడం వల్ల కావొచ్చు. రక్త మాంసాలతో వెచ్చని వూపిరితో మన మధ్య జాజ్వల్యమానంగా వెలిగి ఆరిపోయిన మనలోని వ్యక్తే కథలోకి నడిచి వచ్చినట్లు అనిపించడం వల్ల కావొచ్చు. డబల్ పిహెచ్ డి తో తన తెలివి తేటలతో కొత్తతరానికి దారి చూపించగల మేధావికి  తన దారి తానే మూసుకొనే ఆలోచన కలగడంలోని అసంబద్ధత పట్ల అసహనం వల్ల కావొచ్చు. అతణ్ణి బతికించుకోలేని దుస్థితి పట్ల క్రోధంతో కావొచ్చు. మరొకర్ని అతని దారిలో నడవకుండా చేయాలంటే తోటి వ్యక్తులుగా మనమేం చేయాలి అన్న ప్రశ్న తొలవడం వల్ల కావొచ్చు…  యిలా  యెన్నో కారణాలు.

soul

గోపీచంద్ సీతారామారావో రావిశాస్త్రి సుబ్బయ్యో బుచ్చిబాబు దయానిధో కేశవరెడ్డి బక్కిరెడ్డో – యిలా  నవలల్లో పాత్రలు పాఠకుడి మనసు మీద బలంగా ముద్ర వేయడం సాహిత్య ప్రపంచంలో పదికాలాలు నిలబడటం సాధారణంగా జరుగుతుంది కానీ వొక యువ రచయిత రాసిన పది పేజీల కథలోని పాత్ర యింతలా గుర్తుంది అంటే యింతగా వెంటాడుతోంది అంటే కారణం ఆ పాత్రని నిర్మించడంలో లేదా ఆవిష్కరించడంలో అతను చూపిన నేర్పు వొకటే కాదు ;  చిత్వాన్ అతని జీవితంలో భాగం . అందుకే చిత్వాన్ చనిపోతే తన లోపల్లోపల ఏదో ఒక భాగం హఠాత్తుగా  తెలియని లోతుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిట్టు , అంత్యక్రియలు జరగాల్సింది ఒక్క చిత్వాన్ కే కాదు. తన లోపల్లోపల చనిపోయిన ఆ భాగానికి కూడా అని అతనికి అనిపించింది.

నిజానికి చిత్వాన్ రచయితకే కాదు మనకి కూడా లోపల్లోపల వొక భాగమే. అతనిలా మనమూ యే బంధనాల్లేని జీవితాన్నే ఆశిస్తాం . అతనిలా కట్టుబాట్లు లేని స్వేచ్ఛే  కోరుకుంటాం. ఇళ్ళూ వాకిళ్ళూ అర్థంలేని మమకారాలూ అన్నీ తెంచుకొని పోవడం బాగానే వుంటుంది కానీ చిత్వాన్ బుద్ధుడిలా క్షణిక వాది అయ్యాడు గానీ అన్వేషకుడు కాలేకపోయాడు. మానవకోటి దు:ఖానికి కారణం తెలుసుకోవాలనే ప్రయత్నంలో సిద్ధార్థుడు బుద్ధుడైన క్రమాన్ని అతను మర్చిపోయాడు. తనను తాను అన్వేషించుకొనే దారుల్ని వదులుకొన్నాడు. గుర్తు చేసుకొని సంతోషించే మధురమైన గతమూ ఆశావహమైన భవిష్యత్తూ లేకపోవడం వల్ల తానే క్షణికమని నమ్మిన వర్తమానాన్నీ అందు దాగిన దు:ఖాన్నీ యెదుర్కోలేక  మృత్యుద్వారాన్ని తట్టాడు. హంసలా ఆర్నెల్లు బతికితే చాలనుకొన్నాడు. కానీ మనుషులతో జీవించడానికి కావలసిన వనరుల్ని వెతకలేకపోయాడు , పంచలేకపోయాడు. జీవితాన్నే కాదు  ఆఖరికి ప్రేమనీ ప్రేమించినవాళ్ళనీ బంధనంగానే భావించాడు.

ప్రేమంటే ఏంటనుకున్నావు? ప్రేమే మరణం; ప్రేమించడమంటే అత్మహత్య చేసుకోవడం. ప్రేమలో అహం, అవాస్తవాలు మరణిస్తాయి. అని సిద్ధాంతీకరించాడు. ప్రేమలోనూ అతని ఆలోచనలు అసాధారణంగానే వుంటాయి. అతని ప్రేమలో గాఢత వుంది. నిజాయితీ వుంది. ప్రేమించినంతసేపూ తనను తాను మర్చిపోయాడు. బయటి ప్రపంచాన్ని వదిలేశాడు (బయటి ప్రపంచం గురించి అతనికెప్పుడూ పట్టలేదు – అది వేరే విషయం). అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మనసులోని ఫీలింగ్సన్నింటినీ సాధారణీకరించడం అతనికి  నచ్చదు. ఇన్నేళ్ల  జీవితాన్ని ఒక్క క్షణంలో కలిగిన  ఫీలింగ్ కి అంకితం చేయడంలో యేదో తేడా వున్నట్టు భావిస్తాడు. ప్రేమించడమంటే కోల్పోవడం అని అతని నమ్మకం.

నిన్ను నువ్వు కోల్పోకుండా కూడా యెదుటివారిని ప్రేమించవచ్చనీ  లేదా యెదుటివారిని ప్రేమించడంలో నిన్ను నువ్వు కోల్పోడంలో కూడా మాధుర్యం వుంటుందనీ భరోసానిచ్చే వొక వోదార్పు వాక్యం అతనికెవరూ యివ్వలేకపోయారు.

యే బంధనాల్నీ ఇష్టపడని అతని వ్యక్తిత్వమే ప్రేమకీ జీవితానికి కూడా కట్టిపడేయలేకపోయింది. అతని బాల్యం అతణ్ణి ప్రేమ పట్ల కూడా అవిశ్వాసిగా మార్చింది.

చిత్వాన్ అసలు పేరు కృష్ణమూర్తి. అతని మాటల్లోనే చెప్పాలంటే తండ్రి నెల్లూరికి చెందిన వొక డబ్బులబస్తా , వొక ‘రిచ్ బాస్టర్డ్’. వాడు వుద్యోగరీత్యా నేపాల్ వెళ్ళినపుడు అక్కడ ‘ఉంచుకున్న దాని కొడుకు’ చిత్వాన్. అందుకే అతణ్ణి బాబు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. కానీ  ‘నేపాలీ వాడినైతే మాత్రం మీ బిల్డింగ్ లకు సెక్యూరిటీ గార్డ్ గా మిగిలిపోవాలనుకోలేదు’ అని కొంచెం వయసు రాగానే అమ్మ తరుపున పోరాడాడు. నాన్న అతణ్ణి డబ్బుల్తో కొనేద్దామనుకున్నాడు. కానీ చిత్వాన్ సమురాయ్. పోరాడాడు. నాన్న ఏ ఊరెళ్తే ఆ ఊర్లో.  చివరికి తండ్రి కాళ్ల బేరానికొచ్చాడు. తండ్రినొక  ఏటియం గా మలచుకొన్నాడు.

ఇది ఇలా చెయ్యకూడదంటే అదే చేస్తూ పోయాడు. పోరాడి తన జీవితాన్ని క్లైమ్ చేసుకున్నాడు.

బాబు పోవడంతో ఏటియం పర్మనెంట్ గా ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది.

డబుల్ పిహెచ్ డి తో వుద్యోగం సంపాదించాడు. కానీ అంతా కొత్త. ఒక రోజు దుకాణం మూసేశాడు.  జీతాల జీవితం వొద్దు అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగాడు.

రాబందులా జీవితాన్ని వెంటాడే పేదరికంలోనే పుట్టి పెరిగుంటే అన్నీ సాధారణంగానే అనిపించుండేవేమో! పేదరికం అంటే ఇలా ఉంటుందని తెలిసుంటే పస్తులుండి, రోజూ చస్తూనో, చస్తూ బతుకుతూనో, ఎలాగో బతికుండేవాడేమో.  కానీ ఈ పేదరికం అతనికి చాలా కొత్త.  ‘జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ ఏమో అనుకుని ఎప్పట్లానే రైడ్ ఇట్ ఆర్ డై’  అని ప్రయత్నించాడు.  కానీ వల్ల కాలేదు.

ఎటియం లు వున్నంత కాలం జీవితం గురించి యెన్నో కబుర్లు చెప్పగలిగిన చిత్వాన్ , జీవితాన్ని యిష్టమొచ్చినట్టు గడపాలంటే ఎటియం ల అవసరం తప్పదని గ్రహించాడు.  ‘యెన్ని అవాస్తవాలు మరణించినా ఆకలి అనే వాస్తవం మాత్రం నాకు దూరం కాలేదు’ అని గుర్తించాడు గానీ దాన్ని జయించలేకపోయాడు. అందుకు మనసు చంపుకోలేక ఆత్మని అమ్ముకోలేక చావుని ఆశ్రయించాడు.

అంతా చూస్తే లోపలి మనిషి అస్తిత్వ అన్వేషణ – స్వేచ్ఛ ముసుగులు తగిలించుకొన్న వొక వ్యక్తివాదే చిత్వాన్ లో కనిపిస్తాడు. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవడం , భవిష్యత్తు అగమ్య గోచరం కావడం ,  వ్యవస్థాగత నిర్మాణాలు దాని పట్ల భరోసా ఇవ్వలేని పరిస్థితి , సమూహంలో సైతం వొంటరి ద్వీపాలుగా మిగిలి పోయే భద్రతా రాహిత్యం, వొక చట్రంలో యిమడలేని వ్యక్తిత్వం , వ్యక్తిగతమైనదో సామాజికమైనదో వొక గమ్యం లేకపోవడం , జీవితంలో అస్థిరత్వం , అరాచకత్వం  … యివన్నీ చిత్వాన్ చావుకి కారణమేమో అని తోస్తుంది.

మనుషుల్లోని హిపోక్రసీని ద్వేషించి సమాజానికి అతను దూరమయ్యాడు సరే ; సమాజం కూడా అతణ్ణి తనలో యిముడ్చుకోలేకపోయింది. కెరీరజం వూబిలోకి నెట్టి వైయక్తిక ప్రతిభని పై మెట్టు మీద నిలిపే  విశ్వవిద్యాలయాల డొల్ల చదువులు , మనుషులు సామాజిక జీవులుగా గాక వ్యక్తులుగా విడిపోవడమే స్వేచ్ఛకి పరమార్థంగా నిర్వచించే ఆధునికోత్తర ధోరణులు యువతరాన్ని గందరగోళపరుస్తున్నాయి. చిత్వాన్ లోని వైరుధ్యాలకూ ఇంటలెక్చువల్ యారోగెన్స్ కీ పలాయన తత్త్వానికీ వ్యక్తివాదానికీ కారణం యీ వాతావరణమే.

ఈ ఖాళీలని పూరించుకోడానికి  గానీ యీ గందరగోళాన్నుంచి బయటపడటానికి  గానీ  చిత్వాన్ ప్రయత్నం చేయలేదా అంటే – చేశాడు. కానీ అవి బలహీనమైనప్రయత్నాలు. నిలువుటద్దం లాంటి వొక మంచి స్నేహితుడి కోసం వెతుక్కొన్నాడు.

‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన ఒక స్నేహితుడి అవసరం ఉంది. వాళ్లతో నీ రహస్యాలు, నీ తలవంపులు, నీ ఉక్రోషాలుఅన్నీ పంచుకోవాలి.  మాస్కులన్నీ తీసేసి, హృదయాంతరాలను మథించి నీలోపలున్న నిన్నులందరినీ వారికి పరిచయం చేయాలి. అటువంటి నమ్మకమైన నిలువుటద్దంలాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ.’

చిత్వాన్ రచయితలో అటువంటి స్నేహాన్ని చూశాడు. అనుభవించాడు.ఇతరులకు మంచి చేయడం కర్తవ్యం కాదు. అదొక ఆనందం. అది మన సంతోషాన్నీ ఆరోగ్యాన్నీ పెంచుతుంది’ – అంటూ నెమళ్ళ కొలను (పీకాక్ లేక్ కి చిత్వాన్ పెట్టిన పేరు) దగ్గర చేసుకొన్న తొలి పరిచయం తోభయాలు, బిడియాలు, కాంప్లెక్స్ లు, అలవాట్లు, పొరపాట్లు వీటన్నింటిని ఇనుప చొక్కాలా తొడుక్కుని’  వున్న రచయితని వాటి నుంచీ బయట పడేశాడు.

‘యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కృత్వా ఘృతం పీబేత్. భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుత:’ అంటూ చార్వాకుడై కాసేపు , పీత్వా పీత్వా పున: పీత్వా అంటూ ఒమర్ ఖయ్యాంగా కాసేపూ , జరాతుష్ట్రగా కాసేపూ , అదేదో సినిమాలో కళాపోషకుడిగా కాసేపూ … గంటకో కొత్త వేషం వేస్తూ వింత  అనుభవాలు  పరిచయం చేసాడు.  వాదాలూ సిద్ధాంతాలూ ప్రవచించాడు ( ఇవ్వాళ చిత్వాన్ బతికుంటే ‘హాయ్ అయామ్ కన్హయ్య కుమార్ ఫ్రం జెయెన్టీయూ’ అనో ‘రోహిత్ వేముల ఫ్రం నక్షత్ర ధూళి అనో’ తనను తాను  పరిచయం చేసుకొనే వాడేమో!)

భీముని కొలను , శ్రీశైలం టైగర్ రిజర్వ్  ఫారెస్ట్ ,   జమ్ము తావిలో వైష్ణోదేవి గుడి , నాసిక్ త్రయంబకేశ్వరం  , ఎల్లోరా కైలాష గుడి , హంపీ, విరూపాపూర్ గద్దె, మౌళారూజ్ కెఫె … దేశమంతా తిరిగాడు , తిప్పాడు. జీవితమనే ప్రశ్నకు సమాధానాలు వెతకొద్దు. సమాధానం దొరికిందనుకున్న ప్రతి సారీ జీవితం మరో కొత్త ప్రశ్నలా ఉదయిస్తుందని – జీవితంలో అసలు మనమేం చెయ్యాలో కనుక్కునేందుకు, మనల్నేం చెయ్యద్దొంటారో అది చేస్తే మార్గం తెలుస్తుందని చెప్పాడు.

రగిలించి, ఆజ్యం పోసి, అన్వేషించమని అగ్నిగుండంలోకి నడిపించినప్పటికీ , గంటల లెక్కన నిన్ను నువ్వు అమ్ముకోవద్దని వారించి నప్పటికీ – రచయిత పేదరికాన్ని జయించడానికి విదేశానికి యెగిరిపోయినప్పుడు మాత్రం డీలాపడ్డాడు అనిపిస్తుంది.

‘ప్రతి రోజూ, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్లీ కొత్తగా పుడ్తావు. నువ్వు వుంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడూ ఉంటాడు. కొన్ని సార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్లాలి’ – అని తెలిసినప్పటికీ వొంటరివాడయ్యాడు.

హంపిలో  శిధిలాల్లో   జీవితం  అశాశ్వతమన్న ప్రతీకల్ని చూశాడు. ఆ  శిధిలాల్నుంచి  జీవితం  నశ్వరమని నేర్చుకున్నాడు. అక్కడి రాళ్ళతో అతను మాట్లాడాడు. సగం విరిగిపోయిన కోట గోడలు, ఆ గుడి ముందు శిధిల శిల్పం ‘ ఏ దారిలో వెళ్లినా చివరికి శిధిల్లాలోకే దారి తీస్తుందని అతనికి బోధించాయి. వాటి భాష అర్థం చేసుకొన్నాడు.

కానీ పేరడాక్స్ యేమంటే ఆ శిధిలాల్లోనే ప్రేమలో పడ్డాడు. ప్రేమలోని మాధుర్యం అనుభవించాడు. ఆమెను చూస్తున్నంత సేపూ తన  గురించి, ఈ ప్రపంచం గురించి ఏ కంప్లైంట్స్ లేకుండా పోయాయి. ఆమె మాత్రమే కావాలనుకునే వొకే వొక్క ధ్యేయంతో బతికాడు.ఇంకే కోరికలూ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు లేవు. ఆమెను చూస్తున్నకొద్దీ, ఆమెను ప్రేమిస్తున్నకొద్దీ  రోజు రోజుకీ కొంచెం కొంచెంగా మరణిస్తున్నట్టనిపించింది అతనికి.

అంతే –  సడెన్ గా పెరుగన్నంలో ఆవకాయ వేసుకు తినాలనిపించి కాళ్ళా వేళ్ళా బడి ఆమె యెంత బతిమాలినా వినిపించుకోకుండా ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యీ లోకం నుంచే వెళ్ళిపోయాడు.

బతికుండడం ముఖ్యం కాదు; బతకడమూ అంత ముఖ్యం కాదు. అసలీ జీవితంలో ఏదీ ముఖ్యం కాదు – అని  చిత్వాన్ భావించడానికి కారణాలేంటి అని కథ చదువుతున్నంతసేపూ వొక ప్రశ్న మనల్ని బాధిస్తుంది.

సమూహం నుంచి దూరమైన వ్యక్తివాదమే చిత్వాన్ ఆత్మ హననానికి కారణమని నాకు బలంగా అనిపిస్తుంది. మార్గదర్శనం చేయించే  సామూహిక సామాజికోద్యమాలు బలహీనం అయిన నేపథ్యంలో యిటువంటి ఫిలాసఫీ ముందుకు వస్తుందేమో అని తోస్తుంది. రోల్ మోడల్స్ లేనితనం నుంచి వొక నిస్పృహ నుంచి యిటువంటి విపరీత మనస్తత్త్వం రూపొందుతుందేమోనని భయమేస్తుంది. ఆదర్శవంతంగా వుండాల్సిన వుద్యమ జీవితాల్లోకి సైతం స్వార్థపు నీడలు వ్యాపించడం , ఆచరణలో బోలుతనం చోటుచేసుకుంటున్న అవిశ్వాస వాతావరణంలో వొక సామూహిక స్వప్నాన్ని అతనికి అందించలేకపోయాం అని కూడా వ్యథ కల్గుతుంది.

రొటీన్ లో కూడా మరణించనీకుండా కాపాడే మ్యాజిక్ యేదో మన జీవితాల్లోనూ మనం జీవిస్తున్న యీ సమాజంలోనూ వుందనీ ఆ యేదోని తెలుసుకోలేకపోవడం వల్లే నువ్వు మరణించావు చిత్వాన్ అని అతనికి చెప్పాలని వుంది.

జీవితం అనశ్వరం కాదు ; అశాశ్వతమే …  కానీ స్వయంగా దాన్ని స్వయంగా అకారణంగా నాశనం చేసుకోవాల్సిన అవసరం సైతం లేదు. చావడానికి ధైర్యం అక్కరలేదు – బతకడానికి కావాలి. నిజానికి ప్రేమించడం చావు గాదు ;  ప్రేమరాహిత్యమే మరణం అని గొంతు చించుకు అరవాలని వుంది. వ్యక్తల్నే కాదు మందిని ప్రేమించు , నూతన మానవావిష్కరణ కోసం సమాజంలో యేదో వొక మూల సమూహాలు చేసే ప్రయత్నాల్ని ప్రేమించు , చీకటిని కాదు వెలుగుని ప్రేమించు అని బుజ్జగించాలని వుంది. కానీ కాంక్రీట్ అడవుల్లోనో , భద్ర లోకాల మూలల్లోనో , మల్టినేషనల్ కంపెనీల అద్దాల మేడల జిలుగు వెలుగులకాంతిలోనో , ఏసి గదుల్లో కుషన్డ్ సీట్లకు వేడి పుట్టించడంలోనో మైమరచిపోయి ప్రియ పచ్చళ్లు, కరాచీ బిస్కెట్లు, తెలుగు సినిమా డివిడిలు దేశం నుంచి దేశానికి మోసుకుంటూ సంసార రంగుల రాట్నంలో   బిజీగా తిరుగుతూ  వున్న రచయితకు లాగానే నాక్కూడా యేదో తెలీని వ్యక్తం చేయలేని గిల్టీ ఫీలింగ్.

దాన్నుంచీ బయట పడటానికే – అపరాధ భావనని కడిగేసుకోడానికే – పేదరికం నుంచి దూరంగా అడుగులు వేస్తున్నాననుకుంటూ  జీవితం నుంచే చాలా దూరంగా వెళ్లిపోయానని తెలియని తనం నుంచీ తనను కాపాడుకోడానికే కథలో తననో పాత్ర చేసుకొని తన కథనీ చిత్వాన్ కథనీ రాయడానికి  పూనుకొన్నాడు రచయిత. రాయడం గురించి చిత్వాన్ చెప్పిన మాటలే అతడికి భయం కల్గించాయి  దారిచూపాయి కూడా.

‘రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.

 ‘లోపల. నీలోపలే అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోలు తిత్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్; ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనె అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకూ వచ్చిన కథలే మళ్లీ వస్తాయి. ఇప్పటివరకూ చెప్పిన నీతే మళ్లీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టదు. గో డూ సమ్ సోల్ సర్కస్ అనేవాడు చిత్వాన్.’

 ఈ మాటలు కథకుడి మీద బలంగా ముద్ర వేశాయి. ‘నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకోవడమంటే నాకు సన్నిహితమైన నా ఆత్మీయ స్నేహితుడైన చిత్వాన్ ని నిలబెట్టడమే’ అని నిర్ధారించుకొన్న రచయిత రాయడానికే పూనుకొన్నాడు.

నిజానికి కథలోని పాత్రతో రచయితకు అభేదం పాటించి విశ్లేషించడం ఎంతవరకు సమంజసమో తెలీదు గానీ , సిద్ధారెడ్డి కథ పొడవునా రచయిత పాత్రతో ఐడెంటిఫై అవడం కనిపిస్తుంది. ఆత్మ కథాత్మక కథనంతో విశ్వసనీయత సాధించాడు. అందువల్ల రచయితే కాదు పాఠకులుగా మనం కూడా కథతో కనెక్ట్ అవుతాం. జీవితం పట్ల రచన పట్ల చిత్వాన్ తో యేకీభవిస్తూ విభేదిస్తూ కొట్లాడుతూ రాజీపడుతూ కథలో లీనమవుతాం. ఈ కథ యెందరినో కదిలించిందంటే , దు:ఖ పెట్టిందంటే , చిత్వాన్ పట్ల క్రోధాన్నీ ప్రేమనీ కల్గించిందంటే ,  యేకకాలంలో నచ్చిందీ నచ్చలేదు అన్న ద్వంద్వానికి గురి చేసిందంటే , చదువుతూన్నంత సేపూ తమ లోపలికీ చుట్టూ వున్న యితరుల్లోకీ చూసేలా చేసిందంటే ,   కథా రచనకు  సిద్ధారెడ్డి ఎంచుకొన్న టెక్నిక్కే అందుకు ప్రధాన కారణం.

sidha

అందుకే కథ ఆవు వ్యాసం కాలేదు. మంచి కథ కొత్త కథ చదివామని చాలా మండి పాఠకులు స్పందించారు. కథ యిలా చెప్పడానికి ( రచయిత ఐచ్ఛికంగా యెన్నుకొన్న మౌఖిక శైలి కథకి గొప్ప అందాన్నిచ్చింది) రచయిత దశాబ్దం పైగా స్ట్రగులయ్యాడు. సిద్ధారెడ్డి అంతకు ముందు కథా రచనలో చిన్నా చితకా ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమా రంగంలోకి డీవియేట్ అయిన తర్వాత కథా రచయితగా తనను తాను రీడిస్కవర్ చేసుకొనే క్రమంలో రాసిన తొలికథ సోల్ సర్కస్.

రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే అన్న చిత్వాన్ మాటలతోనే కథ ప్రారంభమవుతుంది. ఆ చాలెంజ్ ని రచయిత యెలా  నిర్వహించాడో చూద్దామనే వుత్సుకతతోనే కథ చదవడం మొదలెడతాం. అక్కడ నుంచీ రచయిత పంచుకొనే చిత్వాన్ జ్ఞాపకాలు వూపిరి తీసికోనివ్వవు. జీవితం గురించి చిత్వాన్  ఆలోచనలు మన గుండె లోతుల్ని తడుముతూ వుంటై. అతని మరణానికి కారణం తెలుసుకోడానికి రచయిత వెంట అన్వేషిస్తూ పోతాం.

కథ రచయిత దృష్టి కోణం నుంచీ నడుస్తుంది. కథకుడి దృక్పథం తన సొంత జీవితంపై చిత్వాన్ చూపిన ప్రభావాల గురించి ప్రస్తావించిన సందర్భాల్లో వ్యక్తమౌతుంది. నిజానికి యిద్దరి కథా పక్క పక్కనే కాకుండా జమిలిగా పెనవేసుకొని నడుస్తుంది. అలా నడపడంలోనే వెంకట్ సిద్ధారెడ్డి నేర్పు కనపడుతుంది. నిజానికి కథ అంతా గతమే. కానీ గత వర్తమానాల్లోకి ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. కథ భిన్న స్థల కాలాల్లో జరిగినప్పటికీ అనుభూతి ఐక్యత దెబ్బతినకుండా వుండటమే కథలో బలం. ఆ అనుభూతి పాఠకుల అంతరంగాల్లో విషాదం మిగుల్చుతుంది. ‘నీకు జరిగింది కథ కాదు. నీలో జరిగిందే కథ.’ అని కథకుడి స్థానం నుంచి  రచయిత చేసిన ప్రకటనతో యేకీభవిస్తాం. అందుకే రచయిత లోపలి సంఘర్షణకి కూడా  కథలో సమ ప్రాధాన్యం లభించింది. రచయిత పాత్ర ద్వారా జీవితాన్ని గెలవాలనే ఆరాటంలో మనం కోల్పోతున్నవాటిని గుర్తుచేయడం కూడా వొక కథాంశంగా తయారైంది. రాయడం గురించి రచయిత తనదైన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కూడా వొక సందర్భాన్ని సృష్టించుకొన్నాడు.  అది చిత్వాన్ అభిప్రాయానికి విరుద్ధం కాదు గానీ మరో చూపు.

రచయిత శిల్ప నైపుణ్యం వల్ల దృక్పథా బలం వల్ల కథ వ్యక్తి తలం నుంచీ సామాజిక తలానికి యెదుగుతుంది.

‘రాయడమంటే నడి రోడ్డు లో నగ్నంగా నిలబడ్డం కాదు, నడిరోడ్డులో నగ్నం గా వర్షంలో తడవడమని, నోస్టాల్జియా ఒక జబ్బు కాదు, అదొక గొప్ప మందనీ, రాయడమంటే అగ్ని పర్వతం బద్దలు కావడం కాదు, నిత్యం రగిలే గుండె మంటలను చల్లార్చుకోవడం అనీ, ది జంగిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్; ఇట్ ఈజ్ ఇన్ ది హెడ్ అనీఏదో ఒకటి. అది అబద్ధమో, నిజమో, నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమోఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపుండే వాడిని కదరా?అంటూ వర్షంలో విరూపాక్షాలయం ముందు నించుని గుండె పగిలేలా రచయిత రోదించినట్టే మనం కూడా వుద్విగ్నులమౌతాం. చిత్వాన్ లను కాపాడుకొనే దారులు వెతుకుతాం. చిత్వాన్ కథ చెప్పడం ద్వారా రచయిత ఆశించిన ప్రయోజనం అదే అయితే అందులో అతను నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు.

మరో చిత్వాన్ అకాలంగా  అకారణంగా మన మధ్య నుంచి వెళ్ళిపోకూడదు.

మన మధ్య తిరుగాడే చిత్వాన్ లకీ మన లోపల కదలాడే చిత్వాన్ కీ వొక సామూహిక స్వప్నాన్నిద్దాం ; బతికించుకొందాం. అయితే వొక బృంద గానం ఆలపించిన సామూహిక నినాదమై మోగిన మంది కల గన్న రోహిత్ వేముల కూడా మననుంచి నిష్క్రమించిన విషయాన్ని సైతం మనం మర్చిపోకూడదు. మన స్వప్నాల్ని ధ్వంసం చేసే కుట్రలపట్ల  అప్రమత్తంగా వుండాలి. వాటిని యెదుర్కోడానికి సమాయత్తం కావాలి. అందుకు అవసరమైన శక్తులన్నిటి సమీకరణం యివాళ్టి అవసరం. రోహిత్ ని అయినా చిత్వాన్ ని అయినా మిగుల్చుకోడానికి – అదే యిప్పుడు మనం చేయాల్సిన  సర్కస్ ; కాదు యుద్ధం.

*

తక్షణ క్రియాశీలత కోరే ‘అసందిగ్ధ కర్తవ్యం’

 

  

-ఏ.కె. ప్రభాకర్

~

 

 “మనది దేశంలో అతి పెద్ద రసాయనిక కర్మాగారం. మనవి అత్యంత కీలకమైన ఉత్పత్తులు … కికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలిస్తే ఆనందంతో కేరింతలు కొట్టి మిఠాయిలు పంచుకొనే ‘వాళ్ళ’ ను కీలక స్థానాల్లో కూర్చుండబెట్టి నిశ్చింతగా కునుకు తీయగలమా? … పై పదవుల్లో ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అనధికారికంగా , దేశభక్తి అనే అంశాన్ని కూడా గుర్తించాలి”

  • -అసందిగ్ధ కర్తవ్యం (ఆడెపు లక్ష్మీపతి)

రాజ్యాంగంలో పొందుపరచిన సమాన హోదా , సమాన అవకాశాలు (Equality of status and opportunity) అన్న  ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే పై విధమైన ఆలోచన మన సమాజంలో యెప్పుడు మొదలైందో తారీఖులు దస్తావేజుల్తో చెప్పలేక పోవచ్చుగానీ , అది యివ్వాళ వ్యవస్థాగతంగా ఆధికారికంగానే అమలౌతుంది. మనువాద పాలకులకి సెక్యులరిజం బూతుమాటయి ‘అసహనం’ కలగజేస్తుంది.

మతతత్త్వం దేశభక్తి ముసుగేసుకొని చట్టసభల నేలమీద వికృతంగా నాట్యం చేస్తున్న ప్రత్యక్ష రాజకీయ సందర్భంలో మనం జీవిస్తున్నాం. ఫాసిస్టు శక్తులు హిందూ రాజ్య స్థాపన నినాదంతో  జాతీయవాదాన్ని భుజానికెత్తుకొని లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనల్ని రూపుమాపడానికి ప్రణాళికా బద్ధంగా  ప్రయత్నిస్తున్నాయి. దేశాధ్యక్ష యెంపికల్లో  రాజకీయ కుట్రలు జరగడం , మతం అందుకు సాధనంగా మారడం మనకు కొత్త కాదు కానీ ప్రభుత్వ యంత్రాంగంలో పాలనా వ్యవహారాల ప్రధాన శాఖల్లో విశ్వవిద్యాలయాల్లో కీలక పదవుల్లో ‘సొంత మనుషుల్ని’ నియమించుకొని  ‘దేశద్రోహుల్ని’ యేరిపారేసే ‘ప్రక్షాళన’ కార్యక్రమం యిటీవల వూపందుకొంది. ఈ వ్యూహం మతవాద హంతకుల చేతికి బాహాటంగానే ఆయుధాలు అందిస్తుంది.

గుజరాత్ ప్రయోగాన్ని దేశమంతటా అమలు చేసే యీ తతంగానికి వొక నిర్దిష్టమైన  ఆధిపత్య ఫిలాసఫీ వుందని ప్రగతిశీలవాదులు గ్రహించి అప్రమత్తమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరుగుతూనే వుంది. కేవలం సంఘటన జరిగినప్పుడే కాకుండా వ్యక్తులూ సమూహాలూ  నిరంతర స్వీయ చైతన్యంతో వున్నప్పుడు మాత్రమే లౌకిక ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోగలం. సామాజిక దైనందిన జీవితాల్లోకి చాపకింద నీరులా చొచ్చుకొచ్చిన మతవాదుల ప్రమేయాల గురించి హెచ్చరిస్తూ నిర్దిష్టంగా  స్పష్టమైన అవగాహనతో ఆడెపు లక్ష్మీపతి రాసిన విశిష్టమైన కథ

’( ఈ వారం జనవార్త , 24 ఫిబ్రవరి , 2 మార్చి 2008 – కథాసాహితి ,కథ 2008 లో పునర్ముద్రితం ).

తెలంగాణా కథా రచయితల్లో విలక్షణమైన శైలి లక్ష్మీపతిది. డెబ్భై యెనభైల్లో అల్లం రాజయ్య , బి యస్ రాములు , తుమ్మేటి రఘోత్తం రెడ్డి , పి చంద్ మొదలైన రచయితలు నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాటాన్నీ అడవిలో వెన్నెలలా విరగ పూసిన గిరిజన గూడేల చైతన్యాన్నీ బొగ్గుగుట్టల్లో కార్మిక వాడల్లో రగిలిన అగ్గికణాల్నీ కథలుగా మలిచిన రోజుల్లోనే  కరీంనగర్ కల్లోల పొత్తిళ్ళలోనే కలం తెరచిన రచయిత ఆడెపు లక్ష్మీపతి. అయితే రాకాసి బొగ్గుగనుల నేపథ్యం నుంచీ , గల్లీదాదాగిరీ స్వైరవిహారం చేసే పారిశ్రామిక వీథుల్లోంచీ , సెమీ అర్బన్ సంస్కృతిలో నెలకొన్న అరాచక స్నేహాలనుంచీ , జేమ్స్ జాయిస్ , వర్జీనియా వుల్ఫ్ , టాల్ స్టాయ్ , మామ్ , కుష్వంత్ సింగ్ , అబ్బాస్ , ముల్కరాజ్ ఆనంద్ మొ. విదేశీ – స్వదేశీ కలాల మీదుగా నడిచి రావడం మూలాన లక్ష్మీపతి కథారచనలో తనదైన ప్రత్యేకతని సాధించుకోగలిగాడు. జీవన్మృతుడు , తిర్యగ్రేఖ , ముసల్దాని ముల్లె , వ్యభిచారం , నాలుగు దృశ్యాలు, విధ్వంస దృశ్యం , త్రిభుజానికి నాలుగో కోణం , అసందిగ్ధ కర్తవ్యం వంటి కథలు వస్తు స్వీకరణలో – శిల్ప నిర్మాణంలో –  కథన సంవిధాన రీతిలో లక్ష్మీపతి చూపించిన వైవిధ్యం తక్కిన సమకాలీన రచయితల నుంచీ అతణ్ణి వేరుచేసి చూడడానికి కారణమౌతుంది.

తెలంగాణాలో  అప్పుడప్పుడే రూపొందుతోన్న ఆధునికానంతర సమాజంలో చోటుచేసుకొంటున్న సంక్లిష్టతల్ని లక్ష్మీపతి పట్టుకొన్నంత వొడుపుగా అతని సమకాలికులెవరూ పట్టుకోలేదంటే తప్పు కాదేమో! ఆ సంక్లిష్టతల్ని ఆవిష్కరించడానికే అతను కావాలనే విభిన్న శిల్పరీతుల్ని వుపయోగించి కథలు అల్లాడు. వస్తురూపాల్లో కొత్తదనం కోసం నిరంతరం తపించాడు. ఇమాన్యుయేల్ కాంట్ ఖలీల్ జిబ్రాన్ సీల్ గ్రాంట్ వంటి రచయితల కథనరీతుల్ని అధ్యయనం చేసిన నేపథ్యం నుంచీ రూపొందినదని విమర్శకుల మెప్పు పొందిన అరుదైన కథ  ‘అసందిగ్ధ కర్తవ్యం’ .

లక్ష్మీపతి యీ కథ రాసింది 2008 లో .  కానీ అప్పటికంటే యిప్పుడు  – సమాజపు ప్రధాన స్రవంతి ఆలోచనల్లో సైతం హిందూ – ముస్లిం అనే ద్విజాతి సిద్ధాంతాన్ని వేళ్ళూనికునేలా , పాలకుకులే ప్రధాన రాజకీయ యెజెండాగా పెట్టుకొని వొక పూనికతో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న సందర్భంలో – ఆ కథ  అవసరం యెక్కువగా వుంది. దాని ప్రాసంగికతను తెలుసుకోడానికి ముందు కథలోని వస్తువు క్లుప్తంగా :

కథ యెంత సరళమైందో అంతక్లిష్టమైంది. పబ్లిక్ రంగానికి చెందిన రసాయన కర్మాగారంలో ఇంజనీర్ గా అంకిత భావంతో పనిచేసే  మౌళి అనే ప్రధాన పాత్ర  అంతరంగ సంక్షోభంగా వుత్తమపురుష దృక్కోణంలో కథ నడుస్తుంది. అతని మానసిక క్షోభకి కారణం వొక వుద్యోగి ప్రమోషన్ విషయమై  పై అధికారులతో యేర్పడ్డ వివాదం.

‘సమయపాలన , విధేయత , విషయపరిజ్ఞానం , విశ్లేషణాపటిమ , రిస్క్ తీసుకొనే చొరవ , నాయకత్వ లక్షణాలు … వగైరా అంశాల్లో మామూలు ‘సంతృప్తికరం’ కన్నా మరింత ఉన్నతమైన రిమార్కులు పొంది వెరసి ‘చాలా మెరుగైన’ అభ్యర్థిని’ ఫోర్ మెన్ స్థానం నుంచి మెరిట్ కేటగరీలో యింజనీర్ గా ప్రమోట్ చేయాలని మౌళి చేసిన సిఫారసు అతని పై అధికారులు చీఫ్ డిప్యూటీ చీఫ్ ఇండస్ట్రియల్ యింజినీర్లకి , పర్సనల్ మేనేజర్ కి నచ్చలేదు. కారణం ఆ అభ్యర్థి అబ్బాసలీ అనే ముస్లిం.

అబ్బాసలీ ముస్లిం అయిన వొకే వొక్క కారణంగా  ప్రమోషన్ కి అనర్హుడై పోయాడు. మతం  ‘పుట్టుమచ్చ’తో దేశద్రోహి అయిపోయాడు. తమకి అనుకూలమైన ‘టెంపుల్ కమిటీ మెంబర్’ని ‘నమ్మకస్తుడిగా’ అందలమెక్కించాలంటే , అబ్బాసలీని చీడపురుగులా చూపాలంటే – చూపి యేరిపారేయాలంటే యేదో వొక కేసు అతని మీద బనాయించాలి. ఉద్యోగ విధుల్ని సరిగా నిర్వర్తించడం లేదని నిరూపించి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. లేదా దేశద్రోహి ముద్ర వేయాలి. వృత్తి పట్ల అతని నిబద్ధతని బద్నాం చేయాలి   ( జె యెన్ యూ లోనూ హెచ్ సి యూ లోనూ  యిటీవలి వ్యవహారాలు గుర్తు రావడం లేదూ!). నిఘా షురూ. వేట మొదలు. అబ్బాసలీ డ్యూటీలో వుండగా లెబనీస్ ఫిలాసఫర్ రాసిన పుస్తకం అతని టేబిల్ మీద కనిపించిందని  (చదువుతున్నాడని కాదు) వింత ఆరోపణ. అందులో యే ఫండమెంటల్ సిద్ధాంతాలున్నాయోనని  విచిత్రమైన అనుమానం. అతనికి వ్యతిరేకంగా డిపార్ట్ మెంటల్ స్థాయిలో డిసిప్లీనరీ యాక్షన్ మౌళియే తీసుకోవాలి. కాదంటే మౌళిని యిరుకున పెట్టడానికి ఫ్యాక్టరీ వ్యర్థాలని వూరి చెరువులోకి వదిలిన కారణంగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత కేసును వెలికి తీస్తారు. అందుకు అతణ్ణి బాధ్యుణ్ణి చేసే వ్యూహాన్ని రచిస్తారు. దీన్నుంచీ బయట పడాలంటే అతను తన సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలి. అబ్బాసలీ కెరీర్ ని నాశనం చేయాలి.

ఈ సందర్భంలో సెక్యులరిజం గురించి దేశభద్రత గురించి అంతర్జాతీయ ‘ఉగ్రవాదం’ గురించి ప్రతిభ గురించి ప్రమాణాల గురించి ముస్లింల ప్రొఫైలింగ్ విషయమై దేశంలో ‘చాప కింద నీరులా అమలవుతున్న విధానాల’ గురించి గ్లోబల్ సందర్భం గురించి పై అధికారుల ముఖత: రచయిత పలికించిన మాటలు రాజ్యాంగం దేశ పౌరులకిచ్చిన హక్కుల్ని పాలక వర్గాలు యెంత బేఖాతర్ చేస్తున్నాయో స్ఫుటంగా తెలియజేస్తాయి.

ఆబాల్యం నమ్మిన – అమ్మ శిక్షణలో నేర్చుకొన్న విలువలకీ వుద్యోగంలో యెదురైన ధర్మసంకట పరిస్థితికీ మధ్య నలిగే మౌళి ‘పంటి నొప్పి’ కారణంగా మెడికల్ లీవ్ పెడతాడు. దాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకోడానికి అధికారులు శాంక్షన్ చేస్తారు. కానీ చివరికి మౌళి అబ్బాసలీకి న్యాయం చేయడానికే నిశ్చయించుకొని యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. అయితే అతనా నిర్ణయానికి రావడానికి కారణమైన చిన్ననాటి సంఘటనే కథకి ఆయువుపట్టు. ఆ సంఘటనకీ పంటి నొప్పికీ వున్న సంబంధాన్ని విప్పి చెప్పడానికీ , ఆ సంఘటనని కథలోకి అన్ ఫోల్డ్ చేయడానికీ లక్ష్మీపతి యెన్నుకొన్న టెక్నిక్కే కథని వుత్తమ కళాఖండంగా రూపొందడానికి దోహదం చేసింది.

సెలవులో వున్న మౌళి టౌన్ షిప్ సంక్షేమ సమితి నిర్వహించే ఉగాది వారోత్సవాల్లో అతని కూతురు నటిస్తున్న ‘చిట్టచివరి యుద్ధం’ నాటికని చూడ్డానికి వెళ్తాడు. ‘ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం గనుక సంభవించి పరస్పర మత, జాతి విద్వేషాలతో వివిధ దేశాలు ఒకదానిపై మరొకటి వినాశకర అణ్వస్త్రాలు , జీవ రసాయనిక ఆయుధాలు ప్రయోగించుకున్నట్లయితే …’ అన్నది నాటిక వస్తువు. స్టేజి మీద యుద్ధరంగాన్ని మౌళి మనసులో ఆశలకూ ఆశయాలకూ నడుమ , అంతరాత్మ ప్రబోధానికీ కెరీరిస్టు ప్రలోభానికీ మధ్య జరిగే సంకుల సమరాన్ని , పంటి నొప్పిని కొల్లేజ్ చేస్తూ గత వర్తమానాల మధ్య కథని ముందుకీ వెనక్కీ స్వింగ్ చేస్తూ చెప్పిన తీరు అమోఘం.

స్టేజి మీద ప్రదర్శన జరుగుతూండగా మౌళికి ‘ఎవరైనా బలంగా కొట్టారా మిమ్మల్ని?’ అని డెంటిస్ట్ అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. కంపినీలో ప్రమాదం సంభవించినప్పుడు అబ్బాసలి ప్రాణాలకి తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సంఘటన కళ్ళ ముందు కనిపిస్తుంది. అతని ప్రమోషన్ని అడ్డుకొనేందుకు పై అధికార్లు పన్నుతోన్న కుట్రలు , వాళ్ళతో తన ఆర్గ్యుమెంట్లూ జ్ఞప్తికొస్తాయి. ప్రదర్శనలో కోతి పాత్రలో యెంతో చురుగ్గా అద్భుతంగా నటిస్తున్నబాలనటుణ్ని చూస్తే చదువులో ఆట పాటల్లో అందరికన్నా ముందుండే తన బాల్యమిత్రుడు సలీం గుర్తొచ్చాడు. ఈర్ష్యతో తను అతనికి చేసిన ద్రోహం , అందుకు అమ్మ తనని బలంగా మూతి మీద కొట్టిన దెబ్బ ‘మస్తిష్కంలో తుఫానులా’ అలజడి చేశాయి. అలాంటి ‘తప్పు ఇంకెప్పుడూ చేయకు’ అన్న అమ్మ హెచ్చరిక తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశించింది. నాటికలో థియేటర్లో ముందువరసలో కూర్చొన్న చీఫ్ యింజినీర్ కళ్ళలోకి నిర్భయంగా చూపులు కలిపి  సెలవు కేన్సిల్ చేసుకొన్నట్టు భార్యకి చెబుతాడు.

స్టేజి పై పిల్లల నాటక ప్రదర్శన  , ప్రేక్షక స్థానంలో కూర్చొన్న మౌళి అంతరంగ శోధన , బాల్యంలో  ముస్లిం స్నేహితుడు సలీం జ్ఞాపకాలు , అతని పట్ల తన ప్రవర్తన , అమ్మ బోధించిన జీవితపు విలువలు వాటిని పాటించలేకపోతున్న అపరాధ భావన , చేసిన తప్పుని దిద్దుకోవాలనే తపన … కథకి అవసరమైన వాతావరణాన్ని, మౌళి  అంతరంగ సంక్షోభ చిత్రణకి కావాల్సిన సంఘర్షణని , యేకకాలంలో మనశ్శరీరాలనుభవించే వేదననీ  కథలోకి తీసుకురావడంలో , వొకేసారి నాలుగు స్థల కాలాల్లో గత వర్తమానాల మధ్య వూయలూగే కథన నిర్మాణంలో లక్ష్మీపతి చూపిన నేర్పు అబ్బురపరుస్తుంది.

వస్తువు రచయిత స్వీయ వుద్యోగ జీవితానుభవం నుంచీ తీసుకున్నందువల్ల , యిన్ సైడర్ కథనం కావడం వల్ల  కథకుడి విషయ పరిజ్ఞానం పట్ల పాఠకుల్లో విశ్వసనీయత కలుగుతుంది. ఫ్యాక్టరీ పాలనా వ్యవహారాలన్నీ ఆధిపత్య మత కుల శక్తుల అధీనంలో వున్నాయని చెప్పడానికి ప్రతి సూక్ష్మాంశాన్నీ రచయిత పరిగణనలోకి తీసుకొన్నాడు( అధికార్లకి పెట్టిన భార్గవ కాశ్యప్ వర్మ వామనరావు వంటి పేర్ల దగ్గర్నుంచీ ).

స్టేజిపై జరిగే ప్రదర్శనని  సమాంతరంగా నడపడం వల్ల అందులోని సన్నివేశాల్ని పాత్రల్ని మౌళి అంతరంగ సంక్షోభానికి కారణమైన సంఘటల్ని వ్యక్తుల్నీ పోల్చి చూసుకొనే అవకాశం రచయితే కల్పించాడు. స్టేజి మీద యుద్ధం మౌళి లోపల యుద్ధం అన్నంత వరకూ , ఏంజిల్ పాత్రలో అనుపమని (మౌళి కూతురు) చూసినపుడు అమ్మ గుర్తుకురావడం , నాటిక పోటీలో ప్రతిభకి గుర్తింపుని అబ్బాసలీ ప్రమోషన్ తో ముడిపెట్టడం వరకూ   బాగానే వుంది కానీ …. నాటికలో  సూక్ష్మ క్రిమి గుర్రం పాము సింహం చివరి మనిషి  వంటి పాత్రలు యేవి యెవరికి ప్రతీకలుగా వున్నాయో తెలుసుకోవడంలో కొంత గందరగోళం యేర్పడి పాఠకుడికి మానసిక శ్రమ కలుగుతుంది. అయితే మౌళి ఆలోచనల్లో సుదూర – సమీప గత వర్తమానాల మధ్య వారధిలా , మరీ ముఖ్యంగా సలీం జ్ఞాపకాలని తవ్వడానికి , ప్రదర్శన చక్కగా వుపయోగపడింది. అంతిమంగా మనిషి మానవీయ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని బోధించింది. కథలోనూ కథ లోపలి కథలోనూ అంతస్సూత్రంగా వున్న యీ సారాన్ని ముడివేయడానికి లక్ష్మీపతి అడుగడుగునా మెలకువతో వర్తించాడు.

సలీం మౌళిల మధ్య చోటుచేసుకొన్న వైరుధ్యంలోని సామాజిక కోణాన్ని ఆవిష్కరించడంలో సైతం రచయిత గొప్ప కౌశలం చూపాడు. సలీం ‘చదువులోనూ ఫస్టు. ఆటల్లోనూ ఫస్టు’. వాడికన్ని శక్తి సామర్థ్యాలు యెక్కడివంటే – వాడి ‘ఇంట్లో ఎద్దు మాంసం తింటార’ ని మౌళి మిత్రులకి  చెబుతాడు. అదే విధంగా మౌళి  మిత్రులంతా కోతికొమ్మచ్చి ఆడడానికి ‘తెల్లగున్నోడు దొరా , నల్లగున్నోడు దొంగ’ అని చప్పట్లు వేసినప్పుడు ‘సలీంది తెల్లనిదీ మిగతా ముగ్గురివీ నల్లనివీ’ వస్తాయి. ఆట నీతి ప్రకారం సలీం దొంగ కాకూడదు. కానీ ఆటలోని సహజ న్యాయాన్ని ‘మెజార్టీ’ బలంతో రద్దుచేసి మౌళి సలీంని దొంగగా తీర్మానిస్తాడు. పాపం సలీం మౌనంగా అంగీకరిస్తాడు. అలా సమకాలీన సమస్యలుగా పరిణమించిన బీఫ్ తినడం , మెజార్టీ ఆధిపత్యం వంటి విషయాలు కథలోకి అలవోకగా వచ్చి చేరాయి.

ఈ కథ యిప్పుడు రాసి వుంటే యీ విషయాల్ని రచయిత కథలో పనిగట్టుకు చొప్పించినట్టు భావించడానికి అవకాశముండేది. కానీ 2008 లోనే యింత లోతైన అంశాల్ని కథలో ప్రస్తావించిన లక్ష్మీపతి క్రాంతదర్శిత్వాన్ని మెచ్చుకోకుండా వుండలేం. అడ్డగోలు పారిశ్రామికీకరణ కారణంగా జీవితాలు విచ్ఛిన్నమైన తన ప్రాంత  ప్రజల  తీరని వెతల్ని స్టోరీగా రిపోర్ట్ చేసిన కడప గ్రామీణ విలేకరి ముస్లిం అయిన కారణంగా (ఇస్మాయిల్) వార్తా పత్రిక ఎడిటర్ అతణ్ణి ‘హిందూ సంపద’కి వ్యతిరేకిగా ముద్రవేసి పత్రికలో న్యూస్ స్టోరీని తిరస్కరించడాన్ని అద్భుతంగా చిత్రించిన కేతు విశ్వనాథ రెడ్డి ‘విరూపం’ కథ (2002) కూడా నాకీ సందర్భంలో  గుర్తుకొస్తుంది. పాఠకులు పాఠ్యం లోతుల్ని అర్థం చేసుకొని రచయిత దృక్పథాన్ని అందుకోడానికి  అవసరమైన పరికరాలు కథ బయటకన్నా కథలోనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిళితమై వుంటాయని  చెప్పడానికి ఆడెపు లక్ష్మీపతి ‘అసందిగ్ధ కర్తవ్యం’ గొప్ప వుదాహరణ. శిల్పం వస్తువుని వున్నతీకరించడానికి యెలా దోహదం చేయగలదో  తెలుసుకోడానికి లక్ష్మీపతి కథలు పాఠ్య గ్రంథాల్లా వుపయోగపడతాయని చెప్పడం యే మాత్రం అతిశయోక్తి కాదు.

తిండిని సంస్కృతిలో భాగంగా భావించిన బుద్ధిజీవులు బీఫ్ ని నిషేధించడం దళితుల మైనార్టీల సాంస్కృతిక అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా , భారతీయ సమాజంలోని బహుళత్వాన్ని నాశనం చేసే యెత్తుగడగా  అభివర్ణిస్తూ వ్యాఖ్యానించడం తరచుగా వింటున్న కోణమే. అయితే నా మట్టుకు నాకు లక్ష్మీపతి రాసిన  ‘అసందిగ్ధ కర్తవ్యం’  చదివాకా యిటువంటి నిషేధం ప్రత్యేకంగా కొన్ని సెక్షన్ల పౌరుల్ని శారీరికంగా బౌద్ధికంగా బలహీనులుగా మార్చడానికి రహస్యంగా నిర్మించుకొన్న అజెండానేమో అన్న అనుమానం సైతం కలుగుతుంది. అంతే కాదు కథలో ఆటలో సలీంని ‘సీసాపెంకుల్లోకి తోసేయాలన్న పాడు ఆలోచన’ మౌళికి కలిగినందుకు అతని అమ్మ యెంతో నొచ్చుకొంటుంది. సలీం తల్లిదండ్రుల్ని ‘రసూల్ మామ బీబీ అత్త’ అని పేర్కొని వాళ్ళ పట్ల సహానుభూతినీ ప్రకటిస్తుంది. తెలిసో తెలీకో కొడుకు చేసిన తప్పుని భవిష్యత్తులో తిరిగి చెయ్యొద్దని శాసించింది.

మౌళి చిన్నతనంలో మన సమాజంలో వుండిన యీ స్నేహ బాంధవ్యాల్ని మాయం చేసి విభజన రేఖలు సృష్టిస్తున్న ‘అసాంఘిక’ శక్తులు యివాళ రెచ్చిపోతున్నాయి. వాటిని  అణచివేయాల్సింది పోయి  వాటికి పాలకులే వత్తాసు పల్కుతున్న సందర్భంలో అబ్బాసలీకి అండగా నిలవడానికి మౌళి నిశ్చయించుకొన్నాడన్న ముగింపు గొప్ప భరోసానిస్తుంది. ‘ద్వేషంతో ఏకపక్ష కోణంలోంచి ఆలోచించకండి’ అని నాటక ప్రదర్శనలో హితవు పల్కిన ఏంజిల్ వేషం కట్టిన కన్నకూతురిలో కన్నతల్లిని చూసుకొని తప్పు దిద్దుకొని ‘మనిషిని కాపాడడానికి’  సిన్సియర్ వుద్యోగిగా తనకున్న సమస్త శక్తులూ –  అస్త్ర శస్త్రాలు -వుపయోగించడానికి వెనుకంజ వేయని మౌళిలోని క్రియా శీలతని అందిపుచ్చుకోవడమే యివ్వాళ మనముందున్న అసందిగ్ధ కర్తవ్యం.

 

*