తెలుగు సాహిత్యం వేరు, తెలంగాణా సాహిత్యం వేరు!

ashok1సమకాలీన తెలుగు కథాలోకంలో ఇప్పుడు బాగా పరిచితమయిన పేరు పెద్దింటి అశోక్ కుమార్. కథ రాసినా, నవల రాసినా అశోక్ ముద్ర వొకటి ఉంటుందని ఇప్పటి పాఠకులు అతి తేలికగా గుర్తు పట్టగల శైలిని సాధించిన రచయిత అశోక్. తెలంగాణ మాండలికం వాడుతూనే తెలంగాణా కథని సరిహద్దులు దాటించిన రచయిత. ఇతర ప్రాంతాలలో కూడా తన కథలకు అభిమానుల్ని సంపాదించుకున్న వచనశిల్పి అశోక్ తో భానుకిరణ్ కేశరాజు కొన్ని సంభాషణలు:
Qజాతీయ కథా సదస్సు కు ఎంపికయిన సందర్బంగా అభినందనలు. దీనికి మీ స్పందన?
 నా “జిగిరి “నవల పంజాబ్ లోకి అనువాదమయింది.దీనికి చాల స్పందన వచ్చింది. పంజాబ్ అనువాద సాహిత్యం లో అది ఒక గొప్ప నవలగా నిలిచి పోయింది.పరోక్షంగా పంజాబ్ సాహిత్య కారులతో పరిచయమయ్యింది. వాళ్ళు ప్రతియేటా జాతీయ  స్తాయిలో కథకుల  సదస్సు నిర్వహిస్తారు.గత సంవత్సరం కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు వీలుకానందున వెళ్ళలేక పోయినాను. తెలంగాణా సాహిత్యం అన్నా, తెలంగాణా ఉద్యమం అన్నా వాళ్ళు బాగా ఇష్టపడతారు. జిగిరి నవల తో తెలంగాణా నవల మొట్టమొదటి సారిగా పంజాబ్ సాహిత్యం లోకి వెళ్ళింది. దీనికి వచ్చిన స్పందనతో తెలంగాణా సాహిత్యం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో అని ఆ కథ సదస్సు లో ఒక తెలంగాణా రచయిత తో మాట్లాడిద్దాం  అనే పట్టుదలతో నన్ను ఆహ్వానించారు.తెలుగు సాహిత్యం నుంచి ఒకటి, రెండు కథలు అనువాదమయినాయి కాని విస్తృతంగా వెళ్ళలేదు. నవల మాత్రం ఇదే మొదలుగా అనువాదమయింది.ఇంకా చెప్పాలంటే తెలంగాణా నుండి కథ గాని నవలగాని ఇదే మొదటిది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు కథలు అంటే  సీమాంద్ర కథలనే అనుకున్నారు. సీమాంధ్ర కథల్లో బలముండదు. తెలంగాణా కథల్లో జీవితం ఉంటుంది  భాష ప్రాంతం ప్రజలు వేరయినా జీవితాల్లో ఉండే సంక్షోబం  ఒకటే అని నా జిగిరి నవల నిరూపించింది. వాళ్ళ సాహిత్యం లో స్పృశించని , వాళ్ళ ఊహకు కూడా రాని అంశం ఈ కథాంశం. దీనితో నన్ను ఆహ్వానించడం  జరిగింది.
Qతెలంగాణా ఉద్యమ సాహిత్యం. తెలంగాణా ప్రజా జీవితం సంస్కృతి మీద వచ్చిన సాహిత్యం, తెలుగు సాహిత్యం దీనిపై మీ వివరణ?
నా కథ సంకలనాల మీద చర్చ వచ్చినప్పుడు ఇవి తెలుగు కథలకు భిన్నంగా ఉన్నాయి అని వాళ్ళ స్పందన చూసి  తెలుగు వేరు, తెలంగాణా సాహిత్యం వేరు, ఇక్కడి జీవితం వేరు, ఇక్కడి సంస్కృతి వేరు ,భాష వేరు, ఉమ్మడి రాష్ట్రంలో వివక్షత చేత తెలంగాణా జీవితాలు బయటికి రాలేదు,అని వివరించాను. ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణా లో సాహిత్యమే లేదు తెలంగాణా సాహిత్యం  అంటే పోరాట సాహిత్యమే , తెలంగాణా కథ అంటే ఉద్యమ కథే అని ప్రచారం కూడా జరిగింది. తెలుగు వేరు తెలంగాణా వేరు, తెలంగాణా లో ఒక ప్రత్యెక జీవితం ఉంది తెలంగాణా సంస్కృతీ ఉంది  అని కేంద్ర సాహిత్య అకాడమీ సభల్లో కూడా చెప్పడం జరిగింది.తెలంగాణా సాహిత్యం అనేది ఉర్దూ మరియి నిజాం పాలనతో ప్రభావితమయింది.తెలుగు సాహిత్యం మీద  ఆంగ్ల మరియి బెంగాలి తదితర భాషల సాహిత్య ప్రభావం ఉంది. తెలంగాణా సాహిత్యం ఉర్దూ సాహిత్యం తో ప్రభావితంయ్యింది. కాబట్టి ఇక్కడ కథ, కవిత్వం నిలకడ గా ఉంది , భూమి మీద  ఉంది. వాస్తవ జీవితాల్ని ప్రతిబింబించింది. ఆంద్ర ప్రాంతం లో  శిల్పం శైలి మీద ఆధారపడి  కథలుగా నిలిచినాయి. కాని తెలంగాణా లో వస్తువు ప్రధానంగా కథలు నిలిచినయి.ఇదే విషయం వేరే రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది.ఇక్కడి భాష,జీవితం ,  అలవాట్లు, సంస్కృతి వేరు.కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రత్యక ప్రాంతం గా గుర్తించాలి, ప్రత్ర్యేక రాష్ట్రంగా గుర్తించాలి .ఇక్కడి భాషా సాహిత్యాలకు ప్రత్యెక హోదా కల్పించాలి.
Qతెలంగాణా మాండలికం లో రాసిన మీ రచనలు వేరే భాష లోకి అనువాదమయినప్పుడు మూలం లోని తెలంగాణా  ప్రాంత జీవితం ,భాష, పలుకుబడి.,యాస లోని ఆ సొగసు  కనపడదు కదా? మూలం లోని సహజత్వం అనువాదం లో ఆస్వాదించగలమా?
నిజమే మీరన్నట్లు మూల భాషలో ని తడి , ఉత్కంటత అనువాదం లో కనపడదు.అనువాదకుడు భాషా పండితుడు అయి  ఉండి తెలంగాణా భాష మీద  పట్టు ఉన్నవాడయితే  అనువాదానికి న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు నేను రాసిన “తెగారం” అనే కథ శివ సత్తుల జీవితం మీద రాసింది ఆంగ్లం లోకి అనువాదమయింది.  వాళ్ళు  వాడే పదాలు ఆంగ్లం లోకి అనువాదం చేయలేక పొయ్యారు. అదే విదంగా “మాయిముంత” కథను హిందీ లోకి అనువాదం చేసి, అనువాదం లో మూలం లో ఉన్న తడి రాలేదు ,ఈ కథకు అన్యాయం చేయలేమని ఆ కాగితాలని చిమ్పేశారు..ఆంగ్లం లోకి కూడా ఆ depth ఆ tone అనువాదం లో చూపించలేక పోతున్నాం ఈ కథకు అన్యాయం చెయ్యలేం ,అనువాదం చెయ్యలేం అని అన్నారు. జిగిరి ని ఆంగ్లం లో తెలుగు లో చదివిన మిత్రులు  ఈ ఆంగ్లానువాదం ఎందుకు పనికిరాదు అన్నారు.చిత్రమేంటంటే హిందీ అనువాదం లో కూడా తెలుగులో ఉన్న తడి లేదు కానీ హిందీ నుంచి ఆ తర్వాత పదకొండు భాషల్లోకి అనువాదమయింది.రెండు భాషల మీద పట్టు ఉన్నట్లయితే అనువాదానికి న్యాయం జరుగుతుంది.
పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

Qబాల్యం, విద్యాబ్యాసం :
నేను 8 వ తరగతి వరకే చదువుకున్న  తర్వాత బంజేసిన. మిగతా చదువంతా ప్రైవేట్ గానే కొన సాగింది. మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. 80 లో పెద్ద కరువొచ్చింది. మా బాపు అప్పుడు గల్ఫ్ పోయిండు.ఇక్కడ అప్పులు ఎట్లా తెర్పాలో తెలియక గల్ఫ్ పోయిండు. నా చదువు బంజేసి వ్యవసాయం ఎడ్లు జూసు కొనుడు మొదలుపెట్టిన.ఓ సంవత్సరం దాక మా బాపు జాడ తెల్వదు ఎం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నడో తెలియదు.  అప్పుడు మేం పడ్డ ఆ సంఘర్షణ  తర్వాత వలస కథలుగా రాయడం జరిగింది. పదో తరగతి ప్రైవేట్ గానే రాసి పాస్ అయిన. మా బాపు మళ్ళీ రెండో సారి గల్ఫ్ పోయిండు, కాని ఈ సారి ఓ స్తిరమయిన  కంపెనీ లో జేరి మంచిగానే ఉండే. అప్పుడు నన్ను చదివించాలని అనుకోని చదువుకొమ్మని ఉత్తరం రాసిండు. దగ్గర కాలేజ్ లేదు మనమేం చదువుతంలె అని ఊరుకున్న. 82 ల గంబీరావు పేట లో కొత్త కాలేజ్ పడితే దాంట్ల చేరిన. చేరిన రోజు పొతే మళ్ళీ ఎక్సామ్ రాసిన రోజే పోయిన.ఎందుకంటీ చిన్నపటినుంచి నాకు నాటకాల మీద ఇష్టం ఉండేది. మా ఇంట్లోనే ఈ నాటకాల రిహాల్సల్స్ జరుగుతుండేవి. ఈ నేపథ్యం లో నుంచి తర్వాత మా ఊరి బాగోతం అనే కథలు రాసిన.
Q మీరు రచయిత గా ఎదగడానికి ప్రేరేపించిన అంశాల గురించి చెప్పండి
మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు  అప్పటికప్పుడు పాటలు రాసుడు, పద్యాలు రాసుడు, ఉన్నయి మంచిగా లేక పొతే కొత్త పదాలు రాసుడు ఇలా నాలో క్రియేటివిటీ అప్పటినుంచే మొదలయ్యింది.ఏదన్న పాట సరిగ్గా కుదరక పొతే దాన్ని మార్చి మళ్ళీ రాసేది. అదే విదంగా సిద్ధిపేట లో డిగ్రీ అయ్యేదాకా కొనసాగింది. నాటకాల కొరకు తిరిగే వాళ్ళం. నాకు రావణాసురిడి వేషం వెయ్యాలనే కోరిక ఉండేది. నా పర్సనాలిటీ ఏమో దానికి సరిపోదు. అది ఎప్పటికీ కోరిక గానే మిగిలిపోయింది. ఆ తర్వాత 90 నుండి 96 వరకు ఊరికి దూరంగా ఉన్న. 96 తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఊరికి పోయిన.  ఊరికి పోయిన తర్వాత ఊళ్ళో వచ్చిన మార్పులు నాకు స్పష్టంగా కనిపించినయి.అంతకు ముందు ఊరు మంచిగా  ఉండే. రెండు చెరువులు ఉండె. వాగు ఉంటుండే , ఊరినిండా పశువులు ఉంటుండే.ఇవన్నే ఒక్కటి లేకుండా పోయినాయి. విద్వంసం బాగా జరిగింది. ఊళ్ళ ఉన్నోళ్ళందరూ గల్ఫ్ కి పొయినారు.ఇంటికో ఏజెంట్ అయ్యిండు, ఏజెంట్ల మోసాలు, గల్ఫ్ లో ఉండె వాళ్ళ బాదలు, ఇక్కడ ఉండె వాళ్ళ కుటుంబాల , స్త్రీల, పిల్లల బాధలు నన్ను కదిలించినాయి , వాకిళ్ళు అన్నీ    మొరం దేలినాయి, ఇండ్లకు తాళాలు పడ్డాయి కుల వృత్తులు పోయినాయి  కుమ్మరోడు, కమ్మరోడు లేదు అందరు పోయిండ్రు.ఇవన్నీ చూసి బాగా కదిలిపోయిన , ఎట్లుడే ఊరు ఎట్లయి పోయింది  అనే ఆలోచన మనసులో మెదిలి తట్టుకోలేక వెంటనే కథలు రాయడం మొదలుపెట్టిన . అప్పటికి నేను సాహిత్యం ఏమీ చదువుకోలేదు. ఎ కథా సాహిత్యం చదువుకోకుండానే రాయడం మొదలుపెట్టిన. సాహిత్యం చదువుతే రాసేవాన్ని కాదేమో.నేను కథలు రాసే నాటికి కేవలం వ్యాపార సాహిత్యం మాత్రమె ఉండేది. అట్లా ఏమీ చదువకుండానే మొదటి కథ రాసిన.అప్పుడు చదవక పోవడమనేది మైనస్ అనుకున్న కానీ అదే నాకు ప్లస్ అయ్యింది.ఆ సాహిత్యం చదివితే ఇన్ని కథలు రాసే వాణ్ని కాదేమో. ,
Q మీ మొట్టమొదటి రచన, ఆ రచనా నేపథ్యం  ఆ తదుపరి మీ రచనా జీవితానికి ప్రేరణ గురించి చెప్పండి?
నా మొట్ట  మొదటి కథ ఆశ నిరాశ  ఆశ అని 99 లో రాసిన. అది ఒక రైతు జీవితం  పంట వేయడం అది ఎండి పోవడం, మళ్ళీ వేయడం అది మళ్ళీ ఎండి పోవడం . రైతుకు భూమి కి ఉన్న సంబంధం మామూలు సంబంధం కాదు. మున్గనీ , చావనీ చావనన్న చస్తాడు కానీ భూమిని వదిలి పెట్టడు.పంట పండినప్పుడు ఆశ ఉంటది, ఎందినప్పుడు నిరాశ ఉంటది. ఆ ఆశ నిరాశ ఆశ ల మధ్య కొట్టు మిట్టడుతాడు  తప్ప భూమిని వదిలిపెట్టుకోడు.అటువంటి రైతు కథ ని ” ఆశ నిరాశ ఆశ” అని 99 లో రాసిన. ఆ తర్వాత చుట్టూ చూస్తె గల్ఫ్ బాదితులు చాల మంది కన్పించిన్రు. గల్ఫ్ వాళ్ళ బాగుపడ్డ జీవితాలు  ఉన్నాయి , కొంత మంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మా కుటుంబం ఒకటి.ఆ బాధల  నేపథ్యం లోనుంచి సమగ్రంగా వలస కథలని 12 కథలు వివిధ కోణాల్లో నుంచి అంటే భార్య కోణంలో నుంచి, భర్త కోణం లోనుంచి, ఏజెంట్ కోణం లోనుంచి, ఇలా విస్త్త్రుతంగా రాసిన.
గల్ఫ్ వలస  జీవితం మీద 2001 లో ఎడారి మంటలు అనే నవల కూడా రాసిన. పోయిన తర్వాత ఏమి జరుగుతది , వచ్చిన తర్వాత ఏమి జరుగుతది , వలస ఎట్లా చిచ్చు పెదతది  అని రాసిన .తర్వాత , రాస్తూ పోతున్న కొద్ది అవగాహన ఏర్పడి, సమాంతరంగా సాహిత్యం చదువుకోడం జరిగింది.మన విస్తృతి పెరిగింది. ప్రపంచీకరణ జరిగి కుల వృత్తులు ఎట్లా పోయినయి, వ్యవసాయం లో వచ్చిన సంక్షోబాలు, తర్వాత మానవ జీవితాల్లో  ఉన్న సంక్లిష్టత, ఇవన్నీ కథలుగా రాయడం జరిగింది.ఆ క్రమలో అయిదు నవలలు కూడా రాయడం జరిగింది.వీనిలో మూడు చతుర లో రెండు ఆటా పోటీలలో రావడం జరిగింది. నేను ఎంచుకున్న మార్గం ఏమిటంటే పోటీ లకు పంపడం. బహుమతుల కొరకు కాదు, పోటీ లలో సెలెక్ట్ అయిన కథలు కాని నవలలు కాని ఎక్కువ మంది చదివే అవకాశము ఉంటుంది అని పోటీలకుపంపెవాన్ని. పల్లె జీవితాలని వలస జీవితాలని దగ్గర్నించి గమనించడం అవి కథలుగా మలచడం నేను చేసిన పని. విద్వంసం  చూసి తట్టుకున్నవాడు క్షేమంగా నిలబడతాడు, తట్టుకోలేని వాడు పిచ్చి వాడు అన్న అయితాడు, లేదా రచయిత అన్న యితడు , నేను ఆ విద్వంసం  చూసి తట్టుకోలేక రచయతగా మారిన కథలుగా రాస్తూ నా బరువు దించుకుంటున్న .
అశోక్ తో  భాను కిరణ్

అశోక్ తో భాను కిరణ్

Qమీ రచనలన్నీ తెలంగాణా మాండలికం , తెలంగాణా పల్లెల నేపథ్యంలో సాగుతాయి దీనికి ప్రత్యెక కారణాలు ఏమయినా ఉన్నాయా?
ప్రాంతీయ సాహిత్యం లో రావి శాస్త్రి నుంచి మొదలు పెట్టి  కారా నుంచి , ఇలా నెరుడాదాక , గూగీ దాక ఎవడి భాషలో వాడు ఎ ప్రాంత జీవితాన్ని  ఆ  భాషలో బలంగా చెప్పినప్పుడు మాత్రమె దానికి ఒక స్తానికత వస్తుంది.ఈ రోజు తెలంగాణా జీవితాన్ని తెలంగాణా లో  కాకుండా మామూలు తెలుగు లో చెపితే పేలవంగా ఉంటది.అంత depth రాదు.  పాత్రలు ఇక్కడివి, జీవితం ఇక్కడిది అయినప్పుడు భాష ఇక్కడిది కాకపొతే  అక్కడిదయితే పాయసం లో ఉండల్లా ఉంటాయి .ప్రాంతీయ ముద్ర లేని ఎ సాహిత్యం కూడా గొప్ప సాహిత్యం కాదు. గూగీ కూడా నేను నా భాష లోనే రాసుకుంట మీకు కావాలంటే ఇంగ్లీషు లోకి అనువాదం చేసుకోండి అన్నాడు.ఎందుకంటే మన భాషలో మనల్ని express చెయ్యొచ్చు. మాయిముంత కథను ఆ భాషలో రాయకుండా ఎ భాషలో రాసిన కానీ అంత అందం రాదు. నా ఉద్దేశం లో జీవితం, వస్తువు ఎంత ప్రధానమో దానికి భాష కూడా అంతే ప్రధానం.భాష అనేది కథల్లో , జీవితంలో ఒక బాగం.
Qఈ నాటి రచయితలు తమ రచనల్ని మాండలికం లో చేయాలన్న అత్యుత్చాహాన్ని కనబరుస్తూ పాఠకుడికి  దూరమవుతున్నారని అంపశయ్య  నవీన్ గారు అన్నారు, తెలంగాణా మాండలికం లో రచనలు చేస్తున్న మీరు దీని గురించి ఏమంటారు?
 నవీన్ గారు అన్న దాన్లో వాస్తవం లేదు. మీకు భాష రానంత మాత్రాన, భాష మీద ప్రేమ లేనంత మాత్రాన రచయితలూ అందరు అట్లా రాయాలనుకోవడం తప్పు. ఒక సాహిత్య కారుడికి , ఒక పాఠకుడికి  భాష అనేది ఎంతమాత్రం అవరోధం కాదు.  రావిశాస్త్రి కథలని, కారా యజ్ఞాన్ని , అల్లం రాజయ్య  కథలని ఈరోజు ఆంద్ర ప్రదేశ్ అంతట చదివారు. కథలో బలముంటే , తడి ఉంటె, depth ఉంటె దాన్ని ఏదీ ఆపలేదు.గూగ్గీ సాహిత్యాన్ని ఏది ఆపగలిగింది, ఒకానొక తెగ భాషలో రాస్తే ఈరోజు ప్రపంచమంతా ఆ సాహిత్యాన్ని చదువుతుంది.గురుజాడ కన్యాశుల్కలో విజయ నగరం  మాండలికం లేదా, రావిశాస్త్రి, కార రచనల్లో శ్రీకాకుళం మాండలికం లేదా. వాటిని  మనం ప్రక్కన పెట్టలేదు కదా. రచయితలకు  భాషా సంకెళ్ళు వేయొద్దు. కథ అనేది భాద ని కలగ జేస్తది , తన్లాటని కలగ జేస్తది, ఆలోచిమ్పజేస్తది , కాబట్టి కథ మీద ప్రేమ ఉన్న వారికి భాష ఒక అవరోధం కాదు. రచయితలూ ఆత్మ గౌరవంతో రాసుకుంటున్నారు అనుకోవాలి  తప్ప పాఠకులకి  దూరమవుతున్నారని అనుకోకూడదు.
Qకథ , నవల మీకు నచ్చింది ఏ ప్రక్రియ?
 రెండూ నాకు నచ్చిన ప్రక్రియలే. ఎందుకంటీ నేను ఎంచుకున్న వస్తువు విస్తృతి ని బట్టి అది కథ గా రాయాలా, నవలగా రాయాలా అనేది నిర్ణయించుకుంట. కథలో స్కోప్ తక్కువుంటుంది, నవలలో స్కోప్ ఎక్కువుంటుంది. కథ అనేది అంగూర పండ్లు తిన్నట్టు, నవల అనేది నారికేళ పాకం.కథ రాయడానికున్న వెసులుబాటు అంటే సమయం, నిడివి , చిన్న సబ్జెక్ట్ ని బట్టి కథలు ఎక్కువగా వస్తున్నాయి. నేను కూడా ఎక్కువగా కథల వైపు మొగ్గు చూపించడం జరిగింది. రెండూ నాకు సమానమే. ఒక మంచి సబ్జెక్ట్  ఉంటె తప్పకుంట నవల రాస్తాను. ఉదాహరణకు జిగిరి మొదట ఒక కథగా రాసుకున్న, కాని అది కథలో ఇమడలేదు, అది నవల అంత విస్తృతి కలది కాబట్టి  నవల గా రాసిన.
ashok2
Q2006 ఆటా నవలల పోటీలో ప్రథమ బహుమతి సాదించి అనేక భాషల్లోకి అనువాదమయిన  జిగిరి నవలా నేపథ్యం గురించి చెప్పండి?
జిగిరి నేపద్యం అది విచిత్రంగా జరిగింది. నేను బండలింగాపూర్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు మా బడిలో ఒక పెద్ద విశాలమయిన  స్తలం  ఉండేది. దాన్ని అందరూ వాడుకునే వాళ్ళు. ఊళ్లకు ఎవ్వరు వలస వచ్చినా , కళ్లాల  కి కూలీలు, కోతులోల్లు, పిట్టలోల్లు వచ్చినా, సాధనాసూర్లు అందరూ అక్కడికి రావాల్సిందే. కోతులోల్లు వస్తే నేను “రెండు కోతులు” అని ఒక కథ, సాదత్ కాండ్లు వస్తే వాళ్ళ మీద “ఘోస” అనే కథ రాసిన.ఓ సారి గుడ్దేలుగులాయన వచ్చిండు. ఎవ్వరు వచ్చిన ఓ 15 రోజులు ఉంది పోయేవాళ్ళు. ఈయన రెండే రోజులు ఉండి  పోయిండు. ఎలా  పోతాడని నాకు అనుమానం వచ్చింది కాని రెండు రోజుల తర్వాత అతను  మళ్ళీ కాన పడ్డప్పుడు  గుడ్డేలుగు లేకుండా ఒక్కడే కన్పించిండు. అడుగుదామనుకుంటే బయపడి పోయిండు, నాకు అనుమానం వచ్చి సబ్జెక్ట్ ని వెతుక్కుంటూ, వెతుక్కుంటూ పోయే క్రమంలో నాకు వన్య ప్రాణి సంరక్షణ, గుడ్డేలుగు కనపడితే పోలీసులు పట్టుకుంటారని, వాటిని జు లో వదిలిపెట్టాలని కొన్ని అంశాలు తెల్సినాయి. నిజామాబాద్ జిల్లా దగ్గర అంబారీపేట్ వద్ద గుడ్డేలుగుల కుటుంబాలు ఉన్నాయంటే అక్కడికి పోయిన, అప్పుడు నాకు ఈ వాస్తవాలు , వాళ్ళ కుటుంబాల్లో ఎంత సంక్షోబం ఉంటది అని అనేక విషయాలు తెల్సినాయి. గుడ్డేలుగు ఒక క్రూర మృగం, దాన్ని మనిషి తీసుక వచ్చి సాదుకుంటాడు. అప్పుడు దానికి మనిషి లక్షణాలు నేర్చుకుంటది.కాని మనిషనే వాడు గుడ్డేలుగు తో సావాసం చేసి వీడు పశువులా ప్రవర్తించి దాన్ని వదిలి పెట్టుకోవటానికి సిద్దపడ్డాడు. మనిషి మృగం గా మారితే , మృగం మనిషిగా మారటం ఈ నవలా నేపథ్యం. దీన్ని నవలగా పంపితే ఒకటి రెండు పత్రికలూ దీన్ని తిరస్కరించినాయి. అప్పుడు ఆట నవలల పోటీ కి పంపితే వాళ్ళు ప్రదమ బహుమతి పొందిన నవలగా ఎంపిక జేయడం జరిగింది. ఆట కబురు అనే పుస్తకం లో ప్రచురితమయిన ఈ నవలను చూసి జె.ఎల్.రెడ్డి గారు చూసి హిందీ లోకి అనువాదం చేసారు.ఆ తర్వాత ఈ నవల 11 భాషల్లోకి అనువాదం జరిగింది.
Q మీరు రాసిన జిగిరి నవల పై బడుగు జీవుల బాధలని చిత్రించిందనే అబద్దపు ముద్ర వేయబడిన నవల అని విమర్శ వచ్చింది దీనికి మీరేమంటారు?

 

 ఒక నవల రాసిన తర్వాత అది మనది కాదు. జిగిరి మీద చాల విమర్శలు వచ్చాయి. మంచి నవల అని కొందరు, కాదని కొందరు అన్నారు. అడివి నుంచి దాన్ని తీసుక వచ్చినపుడు దాన్ని బ్రతుకు దెరువు కు తీసుకు వచ్చినా కాని తర్వాత దాంతో ఉన్న అటాచ్మెంట్ ని కాదనలేం కదా.కానీ తరాల మధ్య అంతరం మారింది. కొడుకు చూసే కోణం వేరు, తండ్రి చూసే కోణం వేరు.కొడుకు దాన్ని ఒక వ్యాపార వస్తువు గానే చూసిండు. తండ్రి అలా కాదు. అది వీళ్ళ జీవితాన్ని , జీవితంలో సంక్షోభాన్ని ప్రతిబింబించింది కాబట్టి అది బడుగు జీవుల నవల అయ్యింది. కాని దాన్ని బడుగు జీవుల నవల అని ఎవ్వరు అన్నారో నాకు తెలీదు. నెగెటివ్ గా వచ్చిన వ్యాసం ఇది ఒక్కటే, నేను దాన్ని స్పోర్టివ్ గా తీసుకున్న.
Q“మాయి ముంత” కథ ఓ బర్రె గురించి అయినా ఆ కథలో స్త్రీ హృదయం , పశువు ను కూడా ఒక బిడ్డలా చూసిన ఒక తల్లి పడే ఆరాటం వేదన ఎంతో హృద్యంగా చిత్రించారు. ఈ కథా నేపద్యం వివరిస్తారా?
మాయి ముంత, ఏడిండ్ల పిల్లి కూన , అనగనగా ఓ కోడి పెట్ట, ఈ మూడు కథలు మాత్రుత్వంలో మూడు కోణాలను చిత్రించిన కథలు. బర్రె బాద వేరు, పిల్లి బాద వేరు, కోడి బాధ వేరు. కోడి పిల్లలకి 50 రోజులు అన్నీ  నేర్పి వదిలి పెడతడి. పిల్లి తన పిల్లల్ని ఏడు ఇళ్లు  తిప్పుతది, ఎక్కడయితే సెక్కురిటీ ఉండదో వెంబడే పిల్లల్ని వేరే ఇంట్లోకి మారుస్తుంది. ఇట్లా ఏడు ఇండ్లు మారుస్తుంది. అది ఏడు ఇండ్లలో ఎంత వేదన అనుభవిస్తది అనేది కథాశం .మాయి ముంత ఒక బర్రె పడే ప్రసవ వేదన. నేను ప్రత్యక్షంగా   ఒక బర్రెకి పురుడు పోసిన, బర్రె కాని, పిల్లి కాని, ఏది కాని ఒక స్త్రీ పడే వేదన ఎంత ఉంటుంది అన్నది కథాంశాలు , ప్రక్రుతి ఎంత విచిత్రమయింది. ప్రసవం కాగానే బిడ్డ పట్ల బర్రె ప్రవర్తన దానికి ఎవ్వరు చెప్పిన్రు. చాల విచిత్రమయిన విషయం . మాతృత్వం మధురం అంటాం కాని అందులో ఒక స్త్రీ పడే హింస ఎంత ఉన్నది అని ఆలోచించాల్సిన విషయం. దీనికి గర్భం చేసిన దున్నపోతు ఎక్కడ పండు కుంటదో కాని ఇక్కడ ఈ బర్రె పడే వేదన హింసే మాయి ముంత కథ. మీకు జాతీయ సాహిత్యం లో ఇటువంటి కథ ఎక్కడా రాలేదు.
Q మిమ్మల్ని ప్రభావితం చేసిన రచనలు , రచయితల గురించి చెబుతారా?
 మీకు ముందే తెలియజేసినట్లు నేను ఈ రచనలో చదవలేదు. నన్ను ప్రభావితం చేసిన అంశం మా ఊరే. ఊరు, ఊరి జీవితం, స్మక్షోభాలు సంక్లిష్టతలు నన్ను ప్రభావితం జేసాయి తర్వాత కూడా నేను ఎవ్వరి ప్రభావాలకూ లోను కాలేదు.రచయితా  గా చాలా దూరం వచ్చిన తర్వాత నే నేను మిగతా సాహిత్యం చలం ,సాహిత్యం చదవడం జరిగింది. ఇష్టం వేరు ప్రభావితం కావడం వేరు.
Qమీ రచనల్లో మీకు ఇష్టమయిన రచయితలు  ఎవ్వరు  ?
 అల్లం రాజయ్య , తుమ్మేటి రఘోత్తం  రెడ్డి, చలం సాహిత్యం, కారా రావి శాస్త్రి సాహిత్యం నాకు ఇష్టమయినవి.
Qరచయితగా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

మార్పులకి అనుగుణంగా నన్ను నేను అప్డేట్ చేసుకొని ఈ సంక్షోబాన్ని, సంక్లిష్టత ను తెలంగాణా భాషలో కథలుగా రాయడం.

ఇంటర్వ్యూ : భానుకిరణ్ కేశరాజు

జలగండం

peddinti

తెలంగాణా పల్లె జీవితాలను తెలంగాణా భాషలో, యాసలో రాస్తున్నా. పల్లె అద్దం మీద ప్రపంచీకరణ రాయి పడ్డాక పగిలిపోయిన బతుకుల్ని, దీనంగా సాగిపోయిన వలసల్ని చిత్రిస్తున్నా. 2000 సంవత్సరం నుంచి రాయడం మొదలు పెట్టిన. నేను రచన మొదలు పెట్టే నాటికి కథ రైతు కూలీ జీవితం వద్దకి వచ్చి  ఆగింది. నేను ఇంకా అట్టడుగు వర్గాల జీవితాల్లోకి తొంగి చూస్తున్న. ఇంత వరకు అయిదు నవలలు, నూరు కథలు, వ్యాసాలూ, నాటకాలూ రాసా. అయిదు కథా సంకలనాలూ వచ్చాయి. ‘జిగిరి’ నవల ఇంగ్లీషుతో పాటు అనేక భారతీయ భాషల్లోకి తర్జుమా అయింది. –పెద్దింటి అశోక్ కుమార్ 

*

తలుపు తట్టిన చప్పుడు.

మగత నిద్రలో ఉన్న రచయిత ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు.

గదిలో కాగితాలు చిందరవందరగా ఉన్నాయి. ఫ్యాను గాలికి ఎగిరి ఎగిరి అలిసిపోయినట్లుగా చతికిల బడ్డాయి. సగం చదివిన పుస్తకం గుండెల మీద రెక్కలు విప్పుకుంది. కలగన్నాననుకుని కళ్ళు మూసుకున్నాడు రచయిత.

మళ్లీ తలుపు తట్టిన చప్పుడు. ఈసారి చిన్నగా పిలుపు.

లేచి టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. “ఇంత రాత్రివేళ ఎవరబ్బా’ అనుకుంటూ సగం తెరిచిన కిటికీలోంచి బయటకు తొంగి చూశాడు.
ఎవరో అపరిచిత స్త్రీ, వెంట చిన్న పిల్లవాడు. ఆమెని ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తు లేదు.

ఎవరో ఎందుకొచ్చారో అర్ధం కాలేదు. అప్లికేషన్లు రాయమనో, ఫారాలు నింపమనో ఎవరయినా ఆఫీసర్లను కలవాలనో అప్పుడప్పుడు ఒకరిద్దరు వచ్చినా పొద్దున్నో, మధ్యాహ్నమో వచ్చేవారు. తలుపు తెరవాలా వద్దా అని ఆలోచిస్తుండగానే రెండుసార్లు తలుపు తట్టిన చప్పుడు.

ఏదో అత్యవసర పని ఉంటే తప్ప రారనుకొని తలుపు తెరిచాడు రచయిత.

వయసు ఎంతుంటుందో తెలియదు.ముఖంలో మాత్రం వృద్ధాప్య చాయలు కనిపిస్తున్నాయి. తల నెరిసి ఉంది. మనిషి బక్కగా, తెల్లగా  ఉంది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకున్నట్లు స్థిరంగా ఉంది. వెంట ఉన్న పిల్లవాడికి ఆరేడేండ్లు ఉండొచ్చు. భయం, భయంగా చూస్తున్నాడు.

ఎవరు మీరన్నట్లు చూసాడు రచయిత.

అతడి చూపుల్ని చదివినట్లు ‘నేనో అభాగ్యురాలిని,’ అన్నది ఆమె.

“ఎందుకొచ్చారు…?” అడిగాడు రచయిత.

“మీతో పని పడింది,” సన్నగా చెప్పింది.

“నాతోనా.. ఏం పని..” మరీ ఇంత రాత్రి వేళ…” ఆశ్చర్యంగా అడిగాడు రచయిత.

“మీరు ఇంట్లోకి రానిస్తే వివరంగా చెప్పొచ్చు,” స్థిరంగా అన్నది.

వారిని ఇంట్లోకి ఆహ్వానించి కుర్చీ చూపించాడు రచయిత. ఆమె బిడియంగా కుర్చీలో కూర్చుంది. అబ్బాయి ఆమె ఒడిలో ఒదిగిపోయాడు. ఆమెకు ఎదురుగా కుర్చీజరుపుకుని కూర్చుంటూ ‘ఇప్పుడు చెప్పండి’ అన్నాడు రచయిత.

“నిద్ర పోయారా? మెలకువతో ఉన్నారనుకున్నాను.. ” ఆమె అన్నది.

“ఏం.. అలా అడుగుతున్నారు?”

“ఏం లేదు.. ప్రపంచమంతా నిద్ర పోతున్నప్పుడు.. రచయిత మెలకువతో ఉంటాడని…” నసిగినట్టుగా అన్నది.

అతనికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమెను పరిశీలంగా చూస్తూ “సరే.. చెప్పండి..” అన్నాడు.

“మీరు నీటి సమస్య మీద రాసిన నవల బాగుంది. రోజు రోజుకు తరిగిపోతున్న జలవనరుల గురించి బాగా చెప్పారు. చదువుతుంటే భయమేసింది. మీరన్నారు చూడండి. రేపు యుద్ధాలంటూ  జరిగితే అవి నీళ్లకొరకేనని.. అది వాస్తవమండి..” అన్నది.

రచయిత విసుగ్గా చూసాడు. ఇంత రాత్రి పూట వచ్చి ఇదా చెప్పేది అనుకున్నాడు. లోలోపల కోపంగా వున్నా నవ్వుతూ “మీరెందుకొచ్చారో చెప్పండి” అన్నాడు.

ఆమె ఒకసారి శూన్యంలోకి చూసి బాబు వీపు నిమురుతూ “నా పేరు సుశీల. మాది పక్క ఊరే. వీడు నా మనవడు” అన్నది.

అయితే ఏమిటన్నట్లు చూసాడు రచయిత. అర్ధరాత్రి నిద్ర లేపడమే కాకుండా విషయం సూటిగా చెప్పకపోవడం అతనికి విసుగును పుట్టిస్తుంది.

సుశీల కొన్ని క్షణాలు మౌనంగా కళ్లు మూసుకొని తెరిచి రచయితను చూసింది. రచయిత తొందరగా చెప్పమన్నట్టు చూసాడు. రచయిత అంతరంగాన్ని చదివినట్టు మనవడిని చూపిస్తూ “వీడు ఎలా చస్తాడో మీరు చెప్పాలి..” అన్నది.

అదిరిపడ్డాడు రచయిత. తను విన్నది నిజమేనా ఆన్నట్టు చూసాడు. అది గమనించిన సుశీల మరోసారి  స్థిరంగా అదే ప్రశ్నను అడిగింది.

రచయిత వింతగా చూస్తూ ‘ఇదేం ప్రశ్నండి.. ఎలా బతుకుతాడో చెప్పమంటారు కాని ఎలా చస్తాడో  చెప్పమని ఎవరయిన అడుగుతారా… అయినా ఎలా బతుకుతారో, ఎలా చస్తారో నాకెలా తెలుస్తుంది..’ అన్నాడు కోపంగా.

సుశీల విరక్తిగా నవ్వింది. నవ్వి ‘మీరు రచయిత కదా’ అన్నది.

ఆ మాటలకు రచయితకు మరింత కోపం వచ్చింది. ‘అయితే! జాతకాలు చెబుతానా.. రచయితంటే జ్యోతిష్కుడిననుకున్నారా?” అన్నాడు విసుగ్గా..

ఆమె అంతే స్థిరంగా ఉంది. ‘రచయితంటే కాలజ్ఞాని కదా’ అన్నది.

రచయితకు కోపం ఎక్కువయింది. తనను తాను అదుపు చేసుకుంటూ ‘మీరు ఎవరినైనా జ్యోతిష్కున్ని కలవాల్సింది. అదీ మీకు నమ్మకముంటేనే.. ఈ విషయంలో నేనేమి సహకరించలేను..’ అన్నాడు.

‘అయ్యో.. కలిసానండి. నా భర్త ఉన్నప్పుడు కలిసాను. నా కొడుకు ఉన్నప్పుడు కలిసాను. వీడితో కూడా కలిసాను. మూడుసార్లు ఒక్కటే చెప్పారు. జలగండం ఉందని..’ సుశీల ఆగిపోయింది.

ఈవిడ పిచ్చిది కాదు కదా అనుకున్నాడు రచయిత. మాట తీరు చూస్తుంటే అలా అనిపించలేదు. నన్ను ఆటపట్టించడం లేదు కదా అనుకున్నాడు. ఆమెను అలాగే పరిశీలనగా చూస్తుండిపోయాడు.

‘.. వీడికి జలగండం ఉంది. అదీ పదేళ్ల వయసులోనే. అంటే ఇంకో మూడేళ్లుంది. ఈలోగా వీడెలా చస్తాడో తెలిస్తే నా ప్రయత్నం నేను చేస్తా.’ చెప్పింది.

రచయితకు నవ్వొచ్చింది. పకపకా నవ్వేవాడే. ఆమె కన్నీళ్లు చూసి ఆగిపోయాడు.

సుశీల ఉగ్గబట్టుకుని ఏడుస్తుంది.

ఆమె ఏడుపును చూసాక పూర్తిగా నమ్మకం కుదిరింది రచయితకు. కాని ‘ఎలా చస్తాడో  నేనెలా చెప్పగలనూ అనుకున్నాడు. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మౌనం గా  ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత తనే తేరుకుంది సుశీల. రచయిత వైపు చూస్తూ నొచ్చుకున్నట్టుగా ‘రాకూడదనుకున్నాను బాబూ. కాని తప్పలేదు. గతంలోంచి పాఠం నేర్చుకుని వర్తమానం చూసి భవిష్యత్తును దర్శించేవాడే రచయిత అంటారు కదా…… నా సమస్యకు మీరొక్కరే మార్గం చూపిస్తారని వచ్చాను..’ అన్నది.

ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ కొంత సౌమ్యంగా ‘అదే.. ఎలా…? నాకెలా తెలుస్తుంది’ అన్నాడు రచయిత.

సుశీల మనవడిని దగ్గరికి హత్తుకుంది. అతడు ఆమె చీర కుచ్చిళ్ళలో మొహం దాచుకున్నాడు.

‘మీరు ఆలోచిస్తే తప్పక చెప్పగలరన్న నమకం నాకుంది బాబూ. వీడికి జలగండం అని రాసి ఉంది కదా.. చూడబోతే భూమ్మీద నీళ్లే లేవు. కరువు కాటకాలేనాయె. మరి జలగండం ఎలా ఉంటుంది. ఏ రూపంలో వస్తుంది.’ అడిగింది.

అమాయకురాలిని చూసినట్టుగా చూసి నవ్వాడు రచయిత. నవ్వుతూ ‘చూడబోతే చదువుకున్నవారిలా ఉన్నారు. ఈ జాతకాలు, జ్యోతిష్కం అంతా వట్టిదే…. మీరెలా నమ్ముతున్నారూ’ అన్నాడు.

ఆమె సీరియస్‌గా చూస్తూ ‘నేనూ నమ్మను. కానీ జరిగింది. అది యాదృచ్చికం అనుకున్నా మరేదో అనుకున్నా వీడి తాతకు అదే జరిగింది. తండ్రికి అదే జరిగింది. నా ఆరాటమంతా వీడిని ఎలా తప్పించాలనే…’అన్నది.

రచయిత కు  ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమెకు ఏదో నచ్చ చెప్పాలని చూసాడు కాని బలంగా వాదించలేకపోయాదు.

అతడు ఎక్కడ విసుక్కుంటాడోనని ముందుగా తన కథని చెప్పడం మొదలుపెట్టింది సుశీల.
కొంత ఆసక్తిగా, కొంత అర్ధం కాకుండా ఉండడంతో మౌనంగా వింటూ కూర్చున్నాడు రచయిత.

* *  *

నాకు పెళ్లయింది. అత్తవారింట్లోనే అడుగుపెట్టాను. మామలేదు. చిన్నప్పుడే బావిలో పడి చనిపోయాడట. అత్త ఒక్కతే ఉంది. నా భర్తకు తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. అమాయకుడు. పొద్దంతా కష్టపడి పని చేయడం తప్ప లౌక్యం తెలియదు.

మాకు ఐదెకరాల భూమి, రెండు కరంటు మోటారు బావులు. చాలినన్ని నీళ్లు. పండినంత పంట. అప్పటికే మా అత్త ఆరోగ్యం బాగులేదు. నేను వచ్చిన రెండు మూడేండ్లకే ఆమె మంచం పట్టింది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది.

ఒకనాడు ‘సుశీల….’ అంటూ నన్ను దగ్గరికి తీసుకుని ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. అప్పటికి నాకొక కొడుకు.

‘సుశీలా.. నేను వెళ్లిపోతున్నానే… గంగన్న పయిలం. వాడు ఎందునెరుగని అమాయకుడు. సంసారమంతా నువ్వే ఎత్తుకోవాలి. మన వంశాన్ని ఉద్ధరించాలి.’ అన్నది.
నేను సరే అన్నట్టు తలూపాను.

నన్ను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఆప్యాయంగా తల నిమురుతూ ‘సుశీలా.. నీకో విషయం చెప్పాలి’ అన్నది.

‘చెప్పత్తా. ఏమిటా విషయం’ అన్నాను.

‘గంగన్న్నకు జలగండం ఉందే’ అన్నది.

నాకేమీ అర్ధం కాలేదు. భయం భయంగా ‘అంటే ఏంటత్తా’ అన్నాను.

‘వాని నలభైయవ ఏట జలగండం ఉందని రాసి ఉందే. వీడి తండ్రికి ఇలాగే అంటే నేను నమ్మలేదు. కాని మక్క పెరడుకు మోటకొడుతూ బాయిలో పడి చచ్చాడే’ అంది.

నాకు నమ్మబుద్ధి కాలేదు. ఆమె తృ ప్తికోసం నమ్మినట్టు నటిస్తూ ‘అయితే ఎలా మరి?’ అన్నాను.

ఆమె దగ్గర సమాధానం లేదు. ‘ఏం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ వాడినో కంట కనిపెడుతుండు. నీళ్ల అంచుకు వెళ్లనీయకు’ అన్నది.

నేను సరే అన్నాను. నా మొహంలోకి దీనంగా చూసి కన్నీరు కార్చింది.

తర్వాత నెలలోపే ఆమె కన్ను మూసింది.

ఎంత మరిచిపోదామన్నా ఆమె చెప్పిన విషయం మరిచిపోలేకపోయాను. అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి భయం వేసేది. ఊరినిండా బావులు. బావుల నిండా నీళ్లు. ఊరి చుట్టూ వాగు. ఊరు అంచున చెరువులు. నా భర్త బయటకు వెళ్తే భయం వేసేది. నీళ్లకు దూరంగా ఉంచడం సాధ్యం కాలెదు.

ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని పట్టుబట్టి అతనికి ఈత నేర్పించాను. బావుల్లో చెరువుల్లో అతడు ఈత కొడుతుంటే నా గుండె నిండా ధైర్యం నిండేది. త్వరలోనే అతడు గజ ఈతగాడుగా పేరొందాడు. తాటిచెట్టంత లోతైన మడుగులో కూడా సూదిని వెతికి తెచ్చే నైపుణ్యం సాధించాడు.

‘అమ్మయ్య… నాకింక భయమెందుకు… ఇంకెక్కడి జలగండం’ అనుకున్నాను. అయినా జాగ్రత్తగా ఉండేదాన్ని.

చూస్తూ చూస్తుండగానే నీళ్లు మాయమైపోయాయి. వాగులు, చెరువులు ఎండిపోయాయి. వ్యవసాయ బావుల్లో తడిలేదు. కండ్లల్లో తప్ప చేండ్లల్లో చెమ్మలేకుండా పోయింది. ఊరంతా బావులు కూడివేసి బోర్లు వేయడం మొదలుపెట్టారు నేనూ అదే చేసాను.

అప్పుడప్పుడు నాకు జలగండం గుర్తుకువచ్చి నవ్వొచ్చేది. ‘జలమే లేదు. గండమెక్కడిది’ అనుకునేదాన్ని.

ముందటిలా వ్యవసాయం నడవలేదు. కరెంటు రాక, నీళ్లు లేక నానా అవస్థలు పడ్డాను. వేలు ఖర్చు పెట్టి బోరు వేస్తే వేలెడన్ని నీళ్లు పోసేది. అది కూడా వేళ్ల మీద లెక్కించినన్ని రోజులే. అలా బోరు మీద బోరు వేసి బొక్కబోర్లా పడ్డాము. పుట్టెడు అప్పయింది. పండిన పంట వడ్డీలకు సరిపోలేదు. అప్పుల బాధ తట్టుకోలేక ఒకనాడు నా భర్త పత్తిమందు తాగి ఎండిన పొలంలోనే ప్రాణాలు వదిలాడు.

జలగండం అంటే నీళ్లలో మునిగి చావడం అనుకున్నాను కాని నీళ్ల కోసం అప్పుల్లో మునిగి చావడం అనుకోలేదు.

పుట్టెడు శోకంతో ఒంటరిగా మిగిలిపోయాను. వెంటనే నా కొడుకు జాతకం చూపించాను. వాడికి కూడా విచిత్రంగా  అదే జలగండం ఉందన్నారు. అప్పటికి వాడు చదువుతున్నాడు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మొత్తం మీద ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. నా కొడుకును వ్యవసాయంలోకి దించితే  తండ్రిలాగే చస్తాడనిపించింది. అందుకే వ్యవసాయానికి దూరంగా ఉంచాను. వానికి చదువు అబ్బలేదు. ఏ ఉద్యోగం దొరకలేదు.

అప్పటికి మా ఊరికి  ఏవేవో ఫాక్టరీలు వస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఊర్లో పోరాటాలు కూడా జరుగుతున్నాయి.

‘మీకు డబ్బులిస్తాం. ఉద్యోగాలిస్తాం. భూములివ్వండీ అన్నాయి కంపెనీలు.

‘పచ్చని పంట పొలాలను ఫాక్టరీలుగా మారుస్తారా? ‘ అంటున్నారు జనం.

ఎక్కడి పంట, ఎక్కడి పచ్చదనం, అన్నీ బీడుభూములేగా అనిపించింది నాకు. అప్పటికి అప్పుల భారం పెరిగి వ్యవసాయమే బరువైపోయింది.

చాలామంది తమ భూములను కంపెనీలకు అమ్మారు. నేను గూడా నా భూమిని కంపెనీకి అమ్మాను. వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాను. మిగిలిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకున్నాను. ఊరిలోకి కంపెనీలు వచ్చాయి. నా కొడుకుకు కంపెనీలో ఉద్యోగం దొరికింది. పెళ్లి చేసాను.

అప్పుడప్పుడు జలగండం విషయం గుర్తుకు వచ్చి నవ్వొచ్చేది. భూమిలేదు. నీళ్లు లెవ్వు. బోర్లు కూడా లెవ్వు. నీళ్లతో సంబంధమే లేదు. జలగండం ఎలా వస్తుంది. అనుకునేదాన్ని. కాని ఆ గండాన్ని తప్పించుకోలేకపోయాను.

ఒకనాటి రాత్రి ఎలక్ట్రోప్లేటిన్ కంపెనీ విడుదల చేసే పాదరస కాలుష్యం తాగునీటిలో కలిసింది. ఆ నీళ్లు తాగి చనిపోయిన వారిలో నా కొడుకు కూడా ఉన్నాడు. సీనియర్ సిండ్రోం వ్యాధి సోకి పిచ్చిపట్టి మరణించాడు. కంపెనీ తప్పంతా మా మీదికే తోసింది. జలగండం ఈ రూపంలో వస్తుందని నేను ఊహించలేకపోయాను.
భర్తను పోగొట్టుకున్నాను. కొడుకును పోగొట్టుకున్నాను. భయం ఎక్కువయింది. వెంటనే నా మనవడి జాతకం కూడా చూపించాను. విచిత్రంగా వీదికి కూడా అదే జలగండం రాసి ఉంది.

*   *  *

చెప్పడం ఆపి రచయిత వైపు చూసింది సుశీల. రచయిత వింటున్నాడు. అప్పటికి ఆమె కళ్లనిండా నీళ్లు. గొంతు బొంగురుగా మారిపోయింది.
“ఇప్పుడు చెప్పండి…. అది ఏరూపంలో వస్తుంది. దాన్ని తప్పించడానికి నేను ఏం చేయాలి?” బాధగా అడిగింది సుశీల.
ఆలోచనల్లో పడాడు రచయిత. సమస్య సుశీలది ఒక్కరిదే కాదని ప్రతీ ఊరిదని తెలిసిపోతుంది. రోజురోజుకు తరిగిపోతున్న నీటి వనరులు పెరిగిపోతున్న కాలుష్యం మనిషిని ఎక్కడికి తీసుకుపోతోందో తెలియడం లేదు.

సుశీల సమాధానం కోసం చూస్తుంది.
రచయిత దగ్గర సమాధానం లేదు.