‘కంచె’లు తొలగి.. చిగురంత ఆశ!

– బుద్ధి యజ్ఞమూర్తి
~
తెలుగు చిత్రసీమలో క్రిష్ ఒక విభిన్న దర్శకుడు. ఇవాళ్టి టాప్ డైరెక్టర్లలో అత్యధికులు మూస కథలు, భావావేశ సన్నివేశాలు, వినోదం, వందమందిని ఒక్కడే అలవోకగా చిత్తుచేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నవాళ్లే. వాళ్ళ సినిమాలు కేవలం కాలక్షేపం బఠాణీలే. అవి ప్రేక్షకుల అభిరుచుల్ని ఏమాత్రం పెంపొందించకపోగా, మరింత నష్టాన్ని కలగజేస్తున్నాయని చెప్పొచ్చు. ఆఖరుకి తెలుగు సినిమా సత్తాని ‘బాహుబలి’ విశ్వవ్యాప్తం చేసిందని ఎక్కువమంది గర్వపడుతున్నా, నా దృష్టిలో ఆ సినిమా కూడా ప్రేక్షకుల అభిరుచిని కాస్త కూడా పెంచే రకం కాదు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఆడియెన్స్‌ను అది మెస్మరైజ్ చేస్తే చేసుండవచ్చు. కానీ వస్తుపరంగా అది ఏమాత్రమూ ఉత్తమ స్థాయి సినిమా కానే కాదు.
రాజమౌళికి జనాన్ని ఎట్లా మెప్పించి, వాళ్ల డబ్బు కొల్లగొట్టాలనేదే ప్రధానం. దానివల్ల వాళ్ల ఆలోచనలు వికసిస్తాయా, వాళ్లలో మానసిక చైతన్యం కలుగుతుందా.. అనేది ఆయనకు పూర్తిగా అప్రధానం. ఆయన తీసిన ఏ సినిమా అయినా తీసుకోండి. అవన్నీ భావావేశాలు, ఉద్రిక్తతలు, ఉద్వేగాలు, భీబత్సాలతో నిండివుండేవే. సరిగ్గా క్రిష్ ఇందుకు పూర్తి విరుద్ధ దర్శకుడు. తొలి అడుగు ‘గమ్యం’ నుంచి, ఇప్పటి ‘కంచె’ దాకా అతడి సినిమాలు మానవ సంబంధాలపై అల్లినవే. వివిధ పరిస్థితుల్లో మనుషులు ఎట్లా ప్రవర్తిస్తుంటారు, ఎలా స్పందిస్తుంటారు అనే విషయాల్ని కమర్షియల్ పరిధిలోనే వీలైనంత వాస్తవికంగా చూపించే సినిమాలే. ‘కంచె’ ముందు ఆయన హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తీస్తున్నప్పుడు నేను అసంతృప్తి చెందాను.
ఇప్పటికే రెండు భాషల్లో వచ్చిన సినిమాను హిందీలో తీయడంలో ఆయన ప్రతిభ ఏముంది? అసలు ఎందుకు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకున్నాడా? అనేది ఆ అసంతృప్తికి కారణం. ఆ సినిమా సమాజంలోని.. ముఖ్యంగా బ్యూరోక్రసీలోని అవినీతిపై ఓ వ్యక్తి సాగించిన సమరం. కానీ అందులో వాస్తవికత కంటే, నాటకీయత పాలే ఎక్కువ. అంటే క్రిష్ స్కూల్‌కు భిన్నమైన అంశం. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ ఆశించిన రీతిలో ఆడకపోవడంతో నేను సంతోషించాను. అవును నిజం. అది ఆడుంటే, క్రిష్ ఆ స్కూల్లోకి వెళ్లిపోయే అవకాశాలుంటాయి కదా. అలా జరగలేదు. ఫలితమే ‘కంచె’. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటిరోజు ఉదయం మీడియాకు వేసిన 8.45 గంటల షోకు వెళ్లాను. ఇంటర్వెల్ పడింది. క్రిష్ చేసిన సాహసానికి ఆశ్చర్యపోయాను. యుద్ధ నేపథ్య చిత్రాలు తెలుగులో ఆడవనేది నాకున్న నమ్మకం.
మనవాళ్లు అట్లాంటి వాటికి కనెక్ట్ కారు. క్రిష్ ఈ సినిమాతో ఎంత పెద్ద సాహసం చేశాడంటే, తను తీసుకున్న నేపథ్యం కారణంగా విదేశీ పాత్రల్ని కీలక పాత్రలుగా చూపించాడు. జర్మన్, బ్రిటీష్ పాత్రలుగా అవి మనకు కనిపిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో మినహా మిగతా సినిమా అంతా ఆ పాత్రలకు ప్రాధాన్యం ఉంది. వాటితో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాలేరనేది అప్పటిదాకా నాకున్న అభిప్రాయం. చాలామంది సహచర మీడియా మిత్రులు ‘ఏందీ సినిమా? నాకైతే అర్థం కాలేదు. క్రిష్‌కు డబ్బులెక్కువయ్యాయా?’ అని కూడా అనడం విన్నాను. నలుగురైదుగురు నా వద్ద కూడా దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘సెకండాఫ్ కూడా చూసి మాట్లాడండి’ అన్నాను. సినిమా అంతా అయ్యాక నేనెవరి అభిప్రాయం కోసం ఆగలేదు. అప్పుడైనా వాళ్ల నుంచి భిన్నమైన అభిప్రాయం వస్తుందని అనుకోను. నా మనసు నిండుగా ఉన్నట్లనిపించింది.
మనుషుల మధ్య, వాళ్ల మనసుల మధ్య.. హోదాలు, అంతస్థులు, కులాలు ఎట్లా అడ్డు’కంచె’లవుతున్నాయో, అలాంటి ‘కంచె’ల కారణంగానే ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని ప్రతీకాత్మకంగా చూపిస్తూ ఎంత బాగా తీశాడనుకున్నా. మనుషుల మధ్య ‘కంచె’ కారణంగా రెండు భిన్న నేపథ్యాలున్న ప్రేమికుల జీవితాలు ఎలా విషాదమయమయ్యాయో హృద్యంగా చూపించాడు దర్శకుడు. ఇక్కడ కూడా ఆయన ఫార్ములాకు భిన్నంగానే వెళ్లాడు. హీరో హీరోయిన్లు చనిపోతే.. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు కన్నెత్తి చూస్తారా?.. అయినా క్రిష్ తెగించాడు. ‘కంచె’ల వల్ల జరుగుతున్న అనర్ధం తెలియాలంటే విషాదాంతమే సరైందనుకున్నాడు. అప్పుడే కదా.. అందులోని నొప్పి తెలిసేది. కథలో ఎవరైతే ప్రేమికులకు ప్రధాన అడ్డంకిగా నిలిచాడో, ఆ వ్యక్తి (హీరోయిన్ అన్న) చివరకు ఊళ్లమధ్య లేసిన ‘కంచె’లను తీసేయమనడం కథకు సరైన ముగింపు.
ఈ సినిమా ఆడితే.. ప్రేక్షకులు ఎదిగినట్లేననేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ వినోదం కోసమే సినిమాలు చూస్తున్నవాళ్లు ఎక్కువ. యువత కోరుకుంటోంది అదే. అలాంటప్పుడు ‘కంచె’లాంటి సీరియస్ సినిమా ఎవరికి కావాలి? వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేసేవాళ్లకు ‘కంచె’ల గురించి ఆలోచించే తీరుబాటు ఉంటుందా? అందువల్ల ‘కంచె’ విషయంలో నాది అత్యాశ అవుతుందనే అనుకున్నా. కానీ.. సుమారు రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలిసి ఎంత ఆనందమేసిందో? మొత్తంగా ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయనే నమ్మకం కలుగుతోంది.
ఒకవేళ పోయినా అతి తక్కువ మొత్తంలోనే పోవచ్చు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయనడానికి ఇది సంకేతమా? మూస ‘బ్రూస్‌లీ’కి పరాభవం ఎదురై, కొత్త ‘కంచె’కు ఊహించిన దానికంటే ఆదరణ లభించడం జనం మారుతున్నారనడానికి నిదర్శనమా? చెప్పలేం. కానీ ఒక ఆశ కలుగుతోంది. కొత్తకు మార్గాలు తెరుచుకుంటున్నాయని ఆశ కలుగుతోంది. ‘కంచె’ ఆడితే కొత్త భావాలు, కొత్త వస్తువులతో తెలుగు సినిమాలు వస్తాయనే ఆశ కలుగుతోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ వంటి సినిమాలు తీసిన క్రిష్ వంటి దర్శకుల అవసరం ఇవాళ తెలుగు సినిమాకు ఎంతైనా ఉంది. ఫార్ములా కంచెలు దాటుకొని కొత్త ప్రయోగాలతో, కొత్త నిర్వచనాలతో తెలుగు సినిమాకు అర్థంచెప్పే క్రిష్‌కు తోడుగా అనేకమంది దర్శకులు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
*

 మాయ

buddhiనిమీద బయటికెళ్లిన మాణిక్యరావు ఇంటికొచ్చాడు. ముందింట్లో నవనీత కనిపించకపోయేసరికి, నేరుగా వంటింట్లోకెళ్లాడు. ఆమె దొడ్లో బాట్టలు ఆరేస్తా కనిపించింది. బావి అరుగుమీదకెళ్లి నిల్చుని బక్కెట్‌లోని నీళ్లను కాళ్లమీద
కుమ్మరించుకున్నాడు.
“రేపు గుంటూరుకెళ్తున్నానే” అన్నాడు.
“అయితే కొనాలనే నిర్ణయించుకున్నావన్న మాట” అంది నవనీత, బట్టలకు క్లిప్పులు పెడతా.
“ఇప్పుడు కొనకపోతే, ఇంకెప్పుడూ అక్కడ కొనలేమే. ఇప్పుడే సెంటు లక్ష చెబుతున్నారంటే, ఇంకో ఏడు పోతే ఎంతవుద్దో. ఇప్పుడు కొంటే రెండేళ్లలో నాలుగైదింతలు రేటు పెరగడం గ్యారంటీ.”
“మనం ఉంటున్న ఈ చోటే సెంటు లక్షుంటే ఎక్కడో ఊరికి దూరంగా, ఇళ్లంటూ లేని చోట కూడా లక్షా? అంతెందుకుంటుంది?”
“మనం ఉంటున్న ఏరియాకీ, రాజధాని అమరావతి ఏరియాకీ లంకె పెడతావేందే. ఇక్కడ సెంటు స్థలం లక్ష కావడానికి ఎంత కాలం పట్టిందో నీకు తెలీదా. ఇప్పుడందరి చూపూ అమరావతి ఏరియా మీదే ఉంది. దాని చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దాకా ఎక్కడ స్థలం కొన్నా బంగారం కిందే లెక్క. ఆ చదువులయ్య చూడు. తెలివంటే ఆడిదే. రాష్ట్రం రెండుగా యిడిపోవడానికి ఏడాది ముందుగాల్నే గుంటూరు కాడ ఏకంగా అరెకరం స్థలం కొనేశాడు. ఇంకా రెండేళ్లు కాలేదు. అప్పుడే నాలుగింతలు రేటు పలుకుతోందంట. ఒక్క దెబ్బకు కోట్లు వెనకేసుకోబోతున్నాడు. మనమూ ఉన్నాం ఎందుకూ? ప్రతిదానికీ జంకే. తెగించి ఏం చేద్దామన్నా పడనియ్యవు కదా” అన్నాడు కాస్త విసురుగా.
వేటపాలెం ప్రాంతంలోని షావుకార్ల (మాస్టర్ వీవర్ల)లో మాణిక్యరావు ఒకడు. అతని చేతికింద నూటయాభై మగ్గాల దాకా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది షావుకార్లు నష్టాలపాలై వేరే వ్యాపారాల్లోకి దిగారు. కొంతమందైతే తామే నేతగాళ్లుగా మారిపోయారు. మాణిక్యరావు ఒకేరకం బట్టని కాకుండా నాలుగైదు రకాల బట్టలు నేయిస్తూ కొద్దో గొప్పో సంపాదించాడు. మాణిక్యరావు మాదిరిగానే చదువులయ్యా మాస్టర్ వీవరే. కాకపోతే అతను ఒక్క మగ్గాల్నే నమ్ముకోలేదు. బట్టల వ్యాపారం మీదొచ్చిన డబ్బుతో మొదట్లో ఏడాదికి మూడు పంటలు పండే పొలాలు కొన్నాడు. తర్వాత వాటిని అమ్మేసి రెండెకరాల మామిడితోట కొన్నాడు. నాలుగేళ్లయ్యాక ఆ రెండెకరాల తోటని నాలుగెకరాలు చేశాడు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెని చూశాక రాష్ట్రం రెండుగా విడిపోతుందనే నమ్మకం బలపడి గుంటూరు కాడ స్థలం కొన్నాడు. అతడి నమ్మకం నిజమై ఇప్పుడది నాలుగింతల విలువకు చేరుకుంది. అతడి మాదిరిగా తను ఆస్తులు పెంచుకోలేకపోతున్నందుకు మాణిక్యరావులో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. చదువులయ్యకు వాళ్లావిడ సపోర్ట్ బాగా ఉండబట్టే తెగువతో ముందుకెళ్లిపోతున్నాడని అప్పుడప్పుడూ నవనీతని ఎత్తిపొడుస్తుంటాడు.
“ఇప్పుడు మనకేం తక్కువయ్యిందయ్యా. యాపారం బాగానే సాగుతా, హాయిగా గడిచిపోతోంది కదా. తిండికి కరువా, బట్టకి కరువా? మంచి మేడ కట్టుకున్నాం కదా. ఇద్దరు పిల్లల్నీ మంచి స్కూల్లో చదివించుకుంటున్నాం. కంటిమీద సుఖంగా కునుకుపడితే చాలు. లేనిపోని ఆశలతో తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడమెందుకంటా?” అంది ముందింట్లోకొచ్చి.
“నీకు చెప్పాను చూడూ.. నాదీ బుద్ధి తక్కువ. దేనికీ పడనియ్యవు కదా. ఎప్పుడూ ఇట్టాగే ఉండిపోతామంటావేం. మనిషన్నాక ఆశుండాలే. ఆశుంటేనే ఎదుగుతాం. ఈ యేటపాలెం ఏరియాలో మాణిక్యరావు అనేవాడు డబ్బున్నోడిగా, పెద్దమనిషిగా పేరు తెచ్చుకోవడం నీకిష్టం లేదా?” అంటా, అక్కడ బల్లమీద తను పెట్టిన సంచీని తెరిచాడు. దాంట్లోని శ్రద్ధగా మడతలు పెట్టిన ఆయిల్ పేపర్‌ను తీశాడు. అది మల్లెపువ్వంత తెల్లగా, పాదరసం అంత నున్నగా మెరుస్తోంది.
“మందెట్టా మైకాన్నిస్తుందో ఆశ కూడా అంతేనయ్యా. ఆ మైకంలో పడితే ఎవరేం చెప్పినా తలకెక్కదు” అంటా నెత్తికొట్టుకుంది నవనీత.
“నువ్వు చెప్పే నీతులు పుస్తకాల్లో రాయడానికీ, బళ్లో చదువుకోడానికీ పనికొస్తాయే కానీ జీవితానికి పనికిరావే మొద్దూ” అంటా మెరుపుల కాయితం మడతలు విప్పి, బల్లమీద పరిచాడు.
దానిమీద రంగురంగుల గీతలతో డబ్బాలు కొట్టున్నాయి. ఆ గీతలు, ఆ డబ్బాలు గజిబిజిగా కనిపించాయి నవనీతకు.
“ఇది ఆ స్థలానికి చెందిన లేఔటే. రాజధాని వొస్తున్న ఏరియాకి దగ్గరలో అమరావతి రోడ్ పక్కనే ఉంది ఈ సైటు. ఇక్కడ సెంటు లక్షకి దొరకడమంటే చాలా అదృష్టమనీ, ఆ రేటుకి ఆ చుట్టుపక్కల ఎక్కడా స్థలం దొరకట్లేదనీ గణపతి చెప్పాడు. ఈ అవకాశం వొదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అతను అబద్ధం చెప్పడు కదా. నిజానికి ఆ స్థలాన్ని చూడకుండానే కొనేయొచ్చు. కానీ చూశాకే తీసుకుంటానని చెప్పా తెలుసా” అన్నాడు, తనకు తెలివితేటలు ఎక్కువనే సంగతి ఆమె గ్రహించాలన్నట్లు.
“భూమితో యాపారం చేసే మనిషి అట్టా చెప్పకుండా ఇంకెట్టా చెబుతాడంటా. తన భూమి అమ్ముడుపోడానికి ఎన్ని కబుర్లైనా చెబుతాడు. తిమ్మిని బమ్మి చేస్తాడు. మెట్టని మాగాణని చెబుతాడు. పల్లాన్ని మెరకంటాడు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా అతను రాజకీయాల్లో తిరిగే మనిషి. అధికారం అండదండలున్నోడు” అంది నవనీత నచ్చచెబుతున్న ధోరణితో.
దాంతో కాస్త మెత్తబడ్డాడు మాణిక్యరావు. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. లేఔట్ కాయితాన్ని మడతలు పెడతా, కాస్త చిన్నగా “అందుకేగా రేపు గుంటూరు పోతోందీ. సైటు చూశాకే, నచ్చితేనే తీసుకుందాంలేవే” అన్నాడు.
కారులో కూర్చున్నాక “ఈ సైటుకు మీరన్నట్లు వాల్యూ పెరుగుతుందంటారా?” అడిగాడు మాణిక్యరావు.
“అసలా అనుమానం ఎందుకొచ్చింది మాణిక్యం. అది కొంటే బంగారం కొన్నట్లే. లేకపోతే నేనెందుకక్కడ ఆ సైట్‌కొని ప్లాట్లేస్తాను? ఏడాది తిరిగేసరికల్లా ఒకటికి రెండు రెట్లు రేటు పెరక్కపోతే అప్పుడడుగు” అన్నాడు గట్టి నమ్మకాన్ని మాటల్లో వ్యక్తం చేస్తూ గణపతి.
ఇటీవలి కాలంలోనే ఆ ఏరియాలో భూముల రేట్లు ఎట్లా పెరిగాయో, ఇంకా ఎట్లా పెరుగుతున్నాయో వర్ణించి వర్ణించి చెప్పాడు. ఉదాహరణగా హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో ఒకప్పుడు కాణీకి కొరగావనుకున్న భూములు చంద్రబాబునాయుడు హైటెక్ సిటీని ప్రకటించగానే ఎట్లా మారిపోయాయో, అక్కడ భూములున్న పేదోళ్లంతా రాత్రికి రాత్రే ఎట్లా కోటీశ్వరులైపోయారే చెబుతుంటే ఆసక్తిగా విన్నాడు మాణిక్యరావు. నిజానికి ఆ సంగతి అతనికెప్పుడో తెలుసు. కానీ గణపతి చెప్పే విధానంతో, తనూ కోట్లకు పడగలెత్తినట్లేనని ఊహించేసుకున్నాడు. ఆ ఊహ అతన్ని ఉద్వేగభరితుణ్ణి చేసింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా అమరావతి ఏరియా అలాగే కాబోతున్నదనీ, దానికి తిరుగులేదనీ గణపతి చెప్పడంతో, మాణిక్యరావులో హుషారు ఎక్కువైంది. నవనీతవన్నీ ఉత్త భయాలు, అనుమానాలుగా తోచాయి.
“ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయా మాణిక్యం. మన సైట్లో నీళ్లకు కరువనేదే లేదు. పుష్కలంగా ఉంటాయి. మన సైట్‌కు దగ్గర్లోనే కృష్ణా నీళ్లు పారుతున్నాయి. భూమిలో చాలా తక్కువ లోతులోనే నీళ్లు పడతాయి. నిజం చెప్పాలంటే చుట్టుపక్కలున్న అన్ని సైట్ల కంటే మనదే విలువైన సైట్. కొన్న ఏడాదికే అమ్మకానికి పెట్టి చూడు. ఎంతలేదన్నా రూపాయికి ఐదు రూపాయల వొడ్డీ వొస్తుంది” అన్నాడు గణపతి.
ఇంక మాణిక్యరావు ఒక్క ప్రశ్నా వెయ్యలేదు. ఓ గంటన్నరలో సైట్ కాడికి వెళ్లిపోయారు. అమరావతి రోడ్డుకు బాగా దగ్గర్లోనే ఉందది. గణపతి చెప్పినట్లు అల్లంత దూరంలోనే కృష్ణ ప్రవహిస్తూ కనిపించింది.
గణపతి ఓసారి లేఔట్ తీసి, ఖాళీగా ఉన్న ప్లాట్లేవో చూపించాడు. ఈశాన్య మూల ప్లాట్ మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒకటే ఉంది. దానికి మంచి డిమాండ్ ఉందనీ, ఈ రోజు సాయంత్రమే ఒకతను దానికి అడ్వాన్స్ ఇస్తానని చెప్పాడనీ, అది వొదిలేసి మిగతా వాటిలో దేన్నయినా తీసుకొమ్మనీ చెప్పాడు గణపతి. దాంతో ఆ ఈశాన్య మూల బిట్ తనకే దక్కాలని తీర్మానించేసుకున్నాడు మాణిక్యరావు.
“సాయంత్రం కాదు, నేనిప్పుడే బయానా (అడ్వాన్స్) ఇస్తున్నా. ఆ బిట్ నా పేరే రాయండి” అని జేబులోంచి డబ్బులు తీసి, పదివేలు గణపతి చేతిలో పెట్టాడు.
“మాణిక్యం.. నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావోయ్. చాలా కాలం నుంచి తెలిసిన మనిషివి కాబట్టి కాదనలేకపోతున్నా. సాయంకాలం వొచ్చే అతనికి ఏం చెప్పాలో, ఏమో. సర్లే.. నా తిప్పలేవో నేను పడతాలే. మొత్తానికి సూపర్ ప్లాట్ కొట్టేశావ్” అన్నాడు మెచ్చుకోలుగా.
అప్పుడే, ఆ నిమిషమే ఆ ఇరవై సెంట్ల స్థలం తనదై పోయినట్లు తబ్బిబ్బయిపోయాడు మాణిక్యరావు. ఆ స్థలంపై ఒక్కసారిగా ఆరాధనా భావం పెల్లుబికింది. ఆ ప్లాటుకు హద్దులుగా వేసిన రాళ్లను తనివితీరా చూసుకున్నాడు. ఓ రాయిని చేత్తో నిమిరాడు కూడా. విపరీతమైన ఉద్వేగం మనసుని ఊపేస్తుంటే కిందికి వొంగి, అక్కడి మట్టిని గుప్పిట్లోకి తీసుకున్నాడు. వొదల్లేక వొదల్లేక కొద్దికొద్దిగా మట్టిని వొదిలి, చేతులు దులుపుకున్నాడు. పిట్ట ఈక ఎంత తేలిగ్గా ఉంటుందో, మాణిక్యరావు గుండె అంత తేలికైపోయినంది. అతడి చేష్టల్ని ఆశ్చర్యపడతా చూశాడు గణపతి. అతని పెదాల మీదికి ఓ విధమైన నవ్వు విచ్చుకుంది.
ఇరవై లక్షల రూపాయలతో ఆ ఇరవై సెంట్ల ఈశాన్య మూల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు మాణిక్యరావు. రిజిస్ట్రేషన్ కాయితాలు కూడా అతడి చేతికొచ్చాయి. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మాత్రం దాని విలువ సెంటుకు ఐదువేలుగానే రాశారు. గవర్నమెంటోళ్ల రేటు అట్లాగే ఉంటుందనీ, రేటు ఎక్కువ రాస్తే, రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ కట్టాల్సొస్తుందనీ గణపతి చెప్పాడు. మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎప్పుడూ తక్కువే ఉంటుంది కాబట్టి తలాడించాడు మాణిక్యరావు. డబ్బు కట్టడానికి ఐదు లక్షలు తగ్గితే మూడు రూపాయల వడ్డీకి రెండు లక్షలు చదువులయ్య కాడే అప్పు తీసుకున్నాడు. నవనీత నగలు తాకట్టుపెట్టి బ్యాంకులో మూడు లక్షలు గోల్డ్ లోను తీసుకున్నాడు. మనసులో బితుకుబితుకుమంటున్నా అతని ఉత్సాహం చూసి, అతను చేసింది మంచి పనేనేమో, అనవసరంగా అనుమానిస్తున్నానేమోనని సమాధానపడింది నవనీత. ఇరవై లక్షలు పెట్టికొన్న ఆ ఈశాన్య మూల స్థలాన్ని చూసి రావాలనే ఆరాటం మొదలైంది ఆమెలో.
“రిజిస్ట్రేషన్ కూడా ఐపోయింది. ఇంకెప్పుడు చూపిస్తావ్ మన స్థలాన్ని?” అడిగేసింది ఉండబట్టలేక.
“కొనే ముందు దాకా ఎందుకు కొనడమంటూ గోలచేశావ్. కొన్నాక ఎప్పుడు చూపిస్తావని గోలపెడ్తున్నావ్. మీ ఆడాళ్లంతా ఇంతేనే” అని గర్వంగా నవ్వాడు మాణిక్యరావు.
“మేం గోలపెట్టినా మీ మగాళ్లు ఆగుతారా? చెయ్యాలనుకుంది చెయ్యక మానతారా?” అని తనూ నవ్వింది నవనీత.
3
పిల్లలకు సెలవు రోజు చూసుకుని ఆదివారం కారు మాట్లాడుకుని స్థలం చూసేందుకు బయల్దేరారు. ఆ ముందు రోజు రాత్రి పెద్ద వాన పడింది. ఆదివారం కూడా ఉంటుందేమో, వెళ్లడానికి కుదరదేమో అనుకుంది నవనీత. అయితే పొద్దున్నే వాన తెరిపియ్యడంతో స్థిమితపడింది ఆమె మనసు.
కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కనే కాదు, రోడ్ల మీదే కాల్వలు  కనిపిస్తున్నాయ్. దాంతో కారు కాస్త నెమ్మదిగా వెళ్లింది. ఈసారి ప్రయాణం రెండు గంటలు పట్టింది. అయితే తను కొన్న ప్లాటు ఎక్కడుందో గుర్తుపట్టలేక పోయాడు మాణిక్యరావు. అతడికి అంతా అయోమయంగా ఉంది. తను కరెక్టుగానే వొచ్చాడే.
“ఈ ఏరియానేనా సార్? ఇక్కడంతా నీళ్లే కనిపిస్తున్నాయ్ కదండీ” అన్నాడు కారు డ్రైవర్.
“ఇదే ప్లేసయ్యా. నేనెందుకు మర్చిపోతాను?” అన్నాడు బలహీనమైన గొంతుతో, మాణిక్యరావు.
అతడు ప్లాటు కొన్న సైటులో ఒక్క అంగుళం భూమి కనిపించట్లేదు. ఆ ఏరియా అంతా పెద్ద చెరువులా తయారైంది. హద్దు రాళ్లు కూడా నీళ్లలో మునిగిపోయినట్లున్నాయి. నవనీత మొహం వొంక చూడాలంటే భయమేసింది మాణిక్యరావుకు.
“మన సైటేది నాన్నా?” ఉన్నట్లుండి అడిగాడు పదో క్లాస్ చదువుతున్న కొడుకు.
కొడుక్కి సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూశాడు మాణిక్యరావు. రోడ్డుకి రెండోవైపు పొలంలో కొంతమంది పనిచేస్తూ కనిపించారు. వాళ్లల్లో ఒకర్ని పిలుచుకు రమ్మని డ్రైవర్ని పంపాడు.
“ఏంటమ్మా. ఎక్కడ మన సైట్?” – ఈసారి తల్లిని అడిగాడు కొడుకు.
“ఆగు నాన్నా. నాన్న చూపిస్తాడుగా” అని నవనీత చెప్తుంటే, ఏడో క్లాస్ చదువుతున్న కూతురు “నాన్న కొన్న సైట్ ఈ నీళ్లల్లో ఉన్నట్టుందన్నయ్యా. అవును కదా అమ్మా” అంది, ‘చూడు నేనెట్లా కనిపెట్టేశానో’ అన్నట్లు.
మాణిక్యరావు మొహంలో నెత్తురు చుక్క లేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆశ ఉన్నచోట అజ్ఞానం ఉంటుందని ఎవరో పెద్దమనిషి అననే అన్నాడు. ఒకడి ఆశని ఇంకొకడు క్యాష్ చేసుకోవడం తన ఎరుకలోనే ఎన్నిసార్లు చూళ్లేదు. ఇప్పుడు తన ఆశని గణపతి క్యాష్ చేసుకున్నాడా?
ఒకతన్ని వెంటబెట్టుకు వొచ్చాడు డ్రైవర్.
“ఏమయ్యా.. ఈ చోటు గురించి నీకు బాగా తెలుసా?” అడిగాడు మాణిక్యరావు.
“ఎందుకు తెలీదు బాబూ. నేను పుట్టి పెరిగిందీ, ఉంటందీ ఇక్కడే. ఈడ ప్రెతి అంగుళం నాకు తెలుసు.”
“ఓ.. అవునా.. రెణ్ణెల కింద ఈడ స్థలం కొన్నాను. ఇప్పుడు చూస్తే మొత్తం నీళ్లే అవుపిస్తున్నాయ్?”
“చెరువులో స్థలం కొంటే నీళ్లు కాకుండా ఇంకేం అవుపిస్తాయ్ నాయనా. ఇదంతా చెరువు. ఈ మజ్జ చాలా కాలం వానల్లేక ఎండిపోయింది. నిన్నా, మొన్నా కురిసిన పెద్దవానతో నిండిపోయింది. నీకు తెలీక ఈడ స్థలం కొన్నట్లున్నావ్. ఆ మాయగాళ్లు కారుచౌకగా కొని, నీలాంటోళ్లకు ఎకువ రేట్లకు అమ్మి టోపీ పెడతన్నారు. ఇప్పుడైతే ఈడ సెంటు పది, పదిహేనేల కంటే ఎక్కువ లేదు. మీకు చాలా ఎక్కువ రేటుకి అమ్ముంటారే. అయినా కొనేప్పుడు అన్నీ ఇచారించుకోవాలి కద బాబూ.”
అతని వొంక నమ్మలేనట్లు చూశాడు మాణిక్యరావు. తన తెలివితేటల మీద అతడికి చాలా నమ్మకం. నెమ్మదిగా నిజం తెలిసొచ్చింది. ఓ కన్ను మూసి, ఆకాశం వొంక ఐమూలగా చూశాడు. తర్వాత చెరువు వొంకా, ఆ రైతు వొంకా, తన భార్యాబిడ్డల వొంకా బిత్తరబిత్తరగా చూశాడు.
అక్కడ అతను కొన్న స్థలం ఉంది. కానీ దాన్నిప్పుడు తన భార్యాబిడ్డలకు చూపించలేని చిత్రమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ల సంగతి అట్లా పెట్టినా, తన స్థలమేదో ఇప్పుడు తనకే తెలీడం లేదు. తన స్థలం నీళ్ల కింద ఉంది!
ప్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, ఓ సిగరెట్టుని పెదాల మధ్య పెట్టుకొని, ప్యాకెట్టుని మళ్లీ జేబులో పెట్టేసుకున్నాడు. లైటర్ తీసి, సిగరెట్ వెలిగించాడు. మామూలుగా అతను పిల్లల ముందు  సిగరెట్లు కాల్చడు. కానీ ఇప్పుడు కాల్చకుండా ఉండలేకపోయాడు. అతడి స్థితి అర్థమై నవనీత పిల్లలను తీసుకుని కాస్త అవతలకు వెళ్లింది. తను ఎంత సునాయాసంగా మోసపోయాడో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మాణిక్యరావుకు. తానే కాదు, అక్కడ ప్లాట్లు కొన్నోళ్లంతా మోసపోయారు. నోటెంట మాట రానంతగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది.
మనసు రగిలిపోతుంటే గణపతికి ఫోన్ చేశాడు. బిజీగా ఉన్నట్లు సౌండ్ వొస్తోంది. మళ్లీ మళ్లీ చేశాడు. అదే సౌండ్. మౌనంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. అతణ్ణలా చూసిన నవనీతకు భయమేసింది. స్థలం చూడాలని అక్కడకు ఎంత ఉత్సాహంతో వొచ్చిందో, అదంతా తుస్సుమంటూ చల్లారిపోయింది. తమ స్థలం నీళ్లకింద ఉందనే విషయం, అదంతా చెరువు ప్రాంతమనే విషయం తెలిశాక ఆమెలో కోపం కట్టలు తెంచుకున్న మాట నిజం. ఆ క్షణంలో భర్తని ఇష్టమొచ్చినట్లు దులిపేద్దామని కూడా అనుకుంది. కానీ అక్కడ కారు డ్రైవర్‌తో పాటు, ఇంకో మనిషీ ఉంటంతో నోరు నొక్కేసుకుంది. కానీ వాళ్లు తమని చూసి నవ్వుతున్నట్లు అనిపించి, అక్కడ ఇంక ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఇంకోవైపు భర్త మొహం చూస్తే, అతడు పిచ్చిచూపులు చూస్తున్నాడు. అలాంటప్పుడు అతణ్ణి కదిలించడం ఏం బావుంటుంది. కారులో ఉన్నంతసేపూ భార్యాభర్తలిద్దరూ మౌనంగానే ఉండిపోయారు.
ఇంటికొచ్చాక గణపతికి మరోసారి ఫోన్ చేశాడు మాణిక్యరావు. ఫోన్ రింగవుతోంది కానీ, ఎత్తట్లేదు. బైక్‌మీద అతనింటికి వెళ్లాడు. ఆఫీసులోనే ఉన్నాడని ఇంట్లోవాళ్లు చెప్పారు. అక్కడకు వెళ్లే సమయానికి చీకటి పడుతోంది. ఆవేశంతో ఊగిపోతూ ఆఫీసులో అడుగుపెట్టాడు. తన రూంలో కుర్చీలో హాయిగా వెనక్కి చేరగిలబడి ఉన్నాడు గణపతి. కాళ్లను బార్లా చాపి, కిటికీ మీద ఆన్చి ఉంచాడు. కళ్లు మూసుకుని, విలాసంగా డన్‌హిల్ సిగరెట్ పీలుస్తున్నాడు. మొహంలో తన్మయత్వం కనిపిస్తోంది. తలకు హెడ్‌సెట్ పెట్టుకొని, సెల్‌ఫోన్‌లో హుషారైన పాటలు వింటున్నాడు.
గణపతిని ఆ స్థితిలో చూసేసరికి మాణిక్యరావులోని ఆవేశం పదింతలైంది.
“గణపతిగారూ” అని అరిచాననుకున్నాడు. గణపతిలో చలనం లేదు. సిగరెట్ పొగ పీలుస్తూ, తల ఊపుతూ అదే తన్మయత్వంలో ఉన్నాడు.
“ఏవండీ గణపతిగారూ” అని ఈసారి బల్లమీద గట్టిగా చరిచాడు మాణిక్యరావు.
వైబ్రేషన్స్‌కి కళ్లు తెరిచాడు గణపతి.
“ఓ.. మాణిక్యం, నువ్వా. రారా. కూర్చో” అంటూ హెడ్‌సెట్ తీశాడు.
“నేను కూర్చోడానికి రాలేదండీ.”
“ఏంటి విషయం? ఏమైంది? మొహం అట్లా ఉందేంటి?”
“విషయం చాలానే ఉంది. ఇందాకట్నించీ ఫోన్ చేస్తున్నాను. మీరు తియ్యట్లేదు. ఇవాళ సైట్ చూసొచ్చాం.”
“సంతోషం. చూసొచ్చాం అంటున్నావ్. ఎవరెవరు వెళ్లారేం?”
“మా ఫ్యామిలీ అంతా వెళ్లాం. కానీ అక్కడ నా ప్లాటే కాదు, అసలు మీ సైటే అవుపించట్లేదు.”
“సైట్ కనిపించకపోవడమేంటి? సైట్ యేడకి పోద్ది. ఏం మాట్లాడతన్నావ్ మాణిక్యం?”
“సైటేతే ఉంది కానీ నీళ్లకింద ఉందండీ. అదంతా చెరువంట కదా. నిన్నపడిన వానకే అది మునిగిపోయింది. కనీసం హద్దు రాళ్లు కూడా అవుపించట్లేదు. అంత పల్లంలో ఉన్న స్థలాన్ని, సెంటు ఇరవై యేలు కూడా చెయ్యనిదాన్ని, మాయమాటలు చెప్పి, లక్ష రూపాయల కాడికి అమ్మారు. రాజధాని ఏరియా కదా, రేటు పెరుగుతుందనే నమ్మకంతో యెనకా ముందూ ఆలోచించకుండా, మా ఆవిడ వొద్దంటున్నా మూర్ఖంగా కొన్నా. నాకా ప్లాటొద్దు, గీటొద్దు. దయచేసి, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి” అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసి గణపతి చేతికియ్యబోయాడు.
“అది కుదరదు మాణిక్యం” అంటా సిగరెట్‌ని యాష్‌ట్రేలో పెట్టి నలిపాడు గణపతి.
“అట్లా అయితే, ఆ పల్లంలో మట్టినింపి, మెరక చెయ్యండి. ఆ సైట్లో నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు చెయ్యండి” అన్నాడు మాణిక్యరావు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా.
“అది నా పని కాదు మాణిక్యం, నీదే.”
“అయితే నేను నా జీవితంలోనే ఘోరమైన తప్పు చేశానన్న మాట.”
“ఎందుకట్లా ఇదైపోతావ్. నేనట్లా అనుకోవట్లేదు. మట్టి తోలుకొని, రోడ్ లెవల్‌కి పైన ఉండేట్లు చూసుకున్నావంటే దాని గిరాకీ ఎక్కడికీ పోదు.”
“దానికి మట్టి తోలాలంటే ఎంతవుద్దో నీకు తెలీదా. పైగా నేనొక్కణ్ణే తోలితే సరిపోద్దా. అందరూ తోలాలి కదా. ఇంతన్యాయం చేస్తావా? నువ్వసలు మనిషి పుడక పుట్టావా?”
“అది నా తప్పు కాదు.”
“అవునయ్యా, తప్పు నాదే. నిన్ను నమ్మడం నా తప్పే. నువ్వు మోసం చేస్తుంటే తెలుసుకోలేకపోవడం నా తప్పే. నీయంత పెద్ద రాస్కెల్‌గాణ్ణి ఇంతదాకా నీ జీవితంలో చూళ్లేదు. ఇంతదాకా నేను సంపాదించుకున్నదంతా నీళ్లపాలు చేశావ్ కదరా.”
“ఇదిగో మాణిక్యం, మర్యాద.. మర్యాద. మాటలు తిన్నగా రానీయ్. నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదిక్కడ. నువ్వేం చేస్కుంటావో చేస్కో. రిజిస్ట్రేషన్ ఐపోయాక ఆ సైట్‌తో నాకేం సంబంధం లేదు. అది నీదే. దాన్నేం చేస్కుంటావో నీ ఇష్టం. ముందిక్కణ్ణించి కదులు. లేదంటే న్యూసెన్స్ చేస్తున్నావని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాల్సొస్తుంది.”
“పోలీసులకు కంప్లయింటిస్తావా? ఎందుకియ్యవూ. ఇది మీ రాజ్యం కదా. అధికారం మీ చేతుల్లోనే ఉందయ్యే. ఏమైనా చేస్తారు. అందుకేగా ఈ ఏరియానంతా దోచుకు తింటన్నారు. అయినా ఇప్పుడు నన్నేడికి పొమ్మంటావ్ గణపతీ.”
“ఏట్లోకి పో. నువ్వెక్కడికిపోతే నాకేంటి. ఈ తెలివి సైట్ కొనేప్పుడే ఉండాల్సింది. అయినా చూసుకునే కదా కొన్నావ్” అన్నాడు వెటకారం నిండిన గొంతుతో, గణపతి.
“నేను ఏట్లోకి పోతే నీకు సంబరంగా ఉంటుందేమిట్రా.. నానా కష్టాలు పడతా మగ్గాల్ని నమ్ముకుని నేను సంపాదించుకున్నదంతా మాయతో, మోసంతో అన్యాయంగా దోచుకున్నావ్. అందుకని నేను ఏట్లోకి దూకాలా? నువ్వు చేసిన పనికి ఏదో నాటికి నువ్వే ఏట్లో పడే రోజొస్తుంది. మనిషి మాంసం అమ్ముకుని బతికేవాళ్లు ఏదో రోజు కుక్కచావు చావక తప్పదు. గుర్తుంచుకో. నేనెళ్తాను. ఏట్లోకి కాదురోయ్. నీమీద కేసెయ్యడానికి వెళ్తాను” అన్నాడు మాణిక్యరావు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటుని సంచిలో పెట్టుకుంటా.
గణపతి నవ్వాడు. “అంతకంటే నువ్వేం చెయ్యగలవ్ మాణిక్యం. శుభ్రంగా వేసుకో. మళ్లీ దాంట్లో ఓడిపోయి, లాయర్ ఖర్చులయ్యాయని నా మీదపడి ఏడిస్తే లాభం ఉండదు.”
4
ఇప్పటికీ మాణిక్యరావు స్థలం నీళ్లకింద భద్రంగా చెరువులో ఉంది. ఆ స్థలం కోసం నిండా మునిగిన మాణిక్యరావు ఇంకో రెండు లక్షల రూపాయల అప్పుకోసం తిరుగుతున్నాడు. కోర్టు కేసుల కోసం కాదు. తనవద్ద నేసే నేతగాళ్లకు కూలీ (మజూరీ) డబ్బులివ్వాలి. వాళ్లకు నూలు, పట్టు సమకూర్చాలంటే, వాటిని కొనాలి. దానికోసం డబ్బు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. అందుకే అప్పుకోసం తిరుగుతున్నాడు. ఈ అనుభవంతో అతను జీవితంలో మళ్లా ఎక్కడైనా స్థలాలు కొనకుండా ఉన్నాడా, లేదా? ఏమో.. కానీ భవిష్యత్తులో నవనీత మాటలకు విలువివ్వాలని మాత్రం అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు.
——————- x ———————-

తెగని గాలిపటం

Kadha-Saranga-2-300x268

2002 ఆగస్టు 15.

 

సికింద్రాబాద్ స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో కమలిని. ఆ వాన నీళ్ల సవ్వడిలోనూ ఆటో ఆగిన చప్పుడు ఆమె చెవులకు. ఇంట్లోంచి ఒక్క పరుగున బయటకు వొచ్చింది. ఆటోవాలాకు డబ్బులిచ్చి, గేటు తీస్తున్నాడు శేఖర్. తల గిర్రున తిరిగింది. కాళ్లు సత్తువ కోల్పోయాయి.

అతని స్థితి చూసి, ప్రమాదం శంకించి, ఒక్క ఉదుటున అతడి వొద్దకు వొచ్చింది. ఆమె పట్టుకోబోయినట్లయితే కింద పడిపోయేవాడే. అతడి తడి ఒళ్లు కొలిమిలో పెట్టిన కర్రులా సలసలా కాలిపోతోంది. అతడి చేతిని తన భుజం మీద వేసుకొని, నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి – కమలిని.

శేఖర్ నిల్చోలేకపోతున్నాడు. తనను కమలిని పట్టుకోవడం, ఇంట్లోకి తీసుకురావడం తెలుస్తూనే ఉంది. ఆమెకు దూరంగా జరగాలని మనసు కోరుకుంటుంటే, శక్తి చాలడం లేదు దేహానికి. ‘శ్రీనాథ్‌గాడి కింద నలిగిన ఆమె దేహానికి తన దేహం రాచుకోవడమా?’. తల నరాలు చిట్లినంత నొప్పి. తెలివితప్పిపోయాడు.

ఆమెకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అతడికి చలిజ్వరమని తెలుస్తోంది. తమాయించుకుంటూ – చకచకా అతడి బట్టలు విప్పేసింది. రగ్గు కప్పింది. తల తుడిచింది, టవల్‌తో. రెండు అరచేతుల్నీ రుద్దింది. జ్వరాలూ, తలనొప్పులూ, వొంటినొప్పులూ, జలుబులూ, గాయాలూ వంటి వాటికి వేసే మందులెప్పుడూ ఇంట్లో సిద్ధం. వాటిలోంచి పారాసెట్మాల్ టాబ్లెట్ తీసి, వేసింది. అప్పుడు ఆమె కళ్లు పరిశీలనగా, అతడి మొహంలోకి.
మనిషి బాగా తగ్గిపోయాడు. కళ్లు, బుగ్గలు లోతుకుపొయాయి. రగ్గు తీసి చూసింది. పొట్ట వీపుకు అతుక్కుపోయినట్లు డొక్కలు స్పష్టంగా. అతను  కదిలాడు. రగ్గు కప్పింది. మంచం మీద పడుకోబెట్టింది. కొన్ని క్షణాల తర్వాత, అతను పలవరిస్తున్నాడు. ఆ పలవరింతలు ఆమె గుండెల్లో బాకుల్లా సూటిగా గుచ్చుకున్నాయి. కళ్లళ్లోంచి నీళ్లు ఉబికుబికి వొచ్చాయి. వెక్కిళ్లు. ఏడుస్తూనే అతడి అరచేతులూ, అరికాళ్లూ రుద్దుతూ – ఆమె. ఎన్ని కన్నీటి చుక్కలు రగ్గుమీద పడి ఇంకాయో!
*   *   *
కొంత కాలం వెనక్కి.
1997 ప్రారంభ రోజులు.
శేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఆరేళ్లయిపోయింది. ఇంతదాకా ఏ ఉద్యోగంలోనూ కుదురుగా ఉండలేకపోయాడు. ఈ ఆరేళ్లలో తన చదువుకు సంబంధంలేని ఉద్యోగాలూ చేశాడు. గవర్నమెంట్ జాబ్‌కు యత్నిద్దామంటే రిక్రూట్‌మెంట్లే లేవు. కేంద్రంలో ఐక్య ఫ్రంట్ ప్రభుత్వం అనిశ్చితిలో. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అనిశ్చితిలో. ఎక్కడైనా ఒకటీ, అరా జాబ్స్ పడుతున్నా, ‘ఆమ్యామ్యా’ ప్లస్ రికమండేషన్ ఉంటే తప్ప వొచ్చే స్థితి లేదు. శేఖర్‌లాంటి ‘ఎందుకూ పనికిరాని’ నిజాయితీపరుడికి ఆ అవకాశం అసలే లేదు.
ఉద్యోగం వేటలో భాగంగా విజయవాడలో ఉంటున్న మేనమామ వరసయ్యే నరసింహం ఇంటికొచ్చాడు శేఖర్. అక్కడికి రావడం అది మొదటిసారేమీ కాదు. కానీ ఆ రోజు – అతడి జీవితాన్ని మలుపు తిప్పిన రోజు!
నరసింహం కూతురు కమిలిని. గతంలో వాళ్లు బాపట్లలో ఉండే కాలంలో, అక్కడే ఇంజనీరింగ్ చదివాడు శేఖర్. పేరుకు హాస్టల్లో ఉంటున్నా, వాళ్లింట్లోనే ఎక్కువ కాలం గడిపాడు. శని, ఆదివారాలు అక్కడే పడుకునేవాడు. సాధారణంగా భర్త తరపు చుట్టాలంటే నరసింహం భార్య వరలక్ష్మికి గిట్టేదు. చిత్రంగా శేఖర్ ఆమె ఆదరణకు నోచుకున్నాడు. ఒళ్లు దాచుకోకుండా పనిచేసే తత్వం అతడిది. బయటి పనులే కాదు, వంట పనిలోనూ సాయం చేసే అతడి గుణం నచ్చడంతో, అతడిపై అభిమానం చూపేది వరలక్ష్మి.
శేఖర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు పెద్దమనిషయ్యింది కమలిని. అతడక్కడ నాలుగేళ్లున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మానసికంగానూ దగ్గరయ్యారు. ‘శేఖరే నా మొగుడు’ – మనసులో ఆనాడే కమలిని నిర్ణయం. ఇప్పటిదాకా బయటపెట్టలేదు. హోదాపరంగా, ఆర్థికపరంగా కమలిని వాళ్లు శేఖర్ వాళ్లకంటే పైమెట్టు. ఇది అతడికి బాగా తెలుసు. ఆమె ముందు అతనూ బయటపడలేదు. ధైర్యం చెయ్యలేకపొయ్యాడంటే కరెక్ట్.
కమలినికి సంబంధాలు చూస్తున్నారు. తన అన్న కొడుకుతో కూతురి పెళ్లి చెయ్యాలనేది వరలక్ష్మి కోరిక. అతగాడంటే కమలినికి ఇష్టంలేదు. ఆ సంగతి తల్లికి చెప్పాలంటే ఆమెకు జంకు.
t- galipatam-1
అట్లాంటి రోజుల్లో ఆ ఇంటికొచ్చాడు శేఖర్. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. నరసింహం, వరలక్ష్మి డాబామీదకెళ్లారు, పడుకోవడానికి. కాసేపటికి వాళ్లిద్దరూ వాదులాడుకుంటున్న సంగతి కింద హాల్లో ఉన్న అతడికి తెలుస్తోంది. ‘పెళ్లి’ అనే మాట తప్ప మిగతా మాటలు అర్థం కాలేదు.
టైం పదిన్నర. తన గదిలోంచి బయటకొచ్చింది కమలిని. మనసులో భయం స్థానంలో తెలీని తెగువ. నవారు మంచం మీద అటూ ఇటూ పొర్లుతూ శేఖర్. అతని మనసు స్థిమితంగా లేదు. ఆమెకు తెలిసింది. కొద్ది క్షణాల ఊగిసలాట. మనసుకి ధైర్యం చెప్పుకుని అతని మంచం కాడికి ఆమె. మంచం కోడు కాలికి తగిలి అలికిడి. కళ్లు తెరిచి, అటు చూసి గతుక్కుమన్నాడు శేఖర్. గబాల్న లేచి కూర్చున్నాడు.
“ఏంటి కమ్మూ?” చిన్న గొంతుతో, శేఖర్.
కొద్ది క్షణాల మౌనం.
“నన్నేం చెయ్యదలచుకున్నావ్?” – కమలిని.
ఏం చెప్పాలో తోచలేదు. ఆమె దేనిగురించి అడుగుతోందో తెలుసు. చుట్టూ చీకటి. హృదయంలో మిణుకుమిణుకుమంటూ సన్నటి వెలుగు. తనకు కమలిని కావాలి. కావాల్సిందే.
“నీకు నిజంగా నేనంటే అంత ప్రేమా?” – శేఖర్.
మౌనం. మళ్లీ అడిగాడు.
“ఎందుకు మళ్లీ మళ్లీ అడుగుతావ్? నిన్ను ప్రేమిస్తున్నాననీ, నీతోనే నా జీవితమనీ నీకు తెలీదూ? నోటితో చెబితే కానీ తెలుసుకోలేని మొద్దబ్బాయివా?” – ఆమె గొంతు పూడుకుపోయింది.
ఆమె ఏడుస్తోందని తెలుస్తోంది. అతడిలో కంగారు. డాబామీద పడుకున్న వాళ్ల అమ్మానాన్నలకు వినిపిస్తే?
“ప్లీజ్ ఏడవకు కమ్మూ. నాకు తెలుసు, నేనంటే నీకిష్టమని. నాకూ నువ్వన్నా ప్రేమే. కానీ ఎట్లా? నేనింకా ఏ జాబ్‌లోనూ సెటిలవలేదు. ఇంకా వెతుక్కోవడంలోనే ఉన్నా. ఇప్పటి రోజుల్లో జాబ్ దొరకడం కష్టంగా ఉంది. ఒకవేళ జాబ్ దొరికినా మీ నాన్నలా సంపాదించలేను. వొచ్చినదాంతో సర్దుకుపోయే మెంటాలిదీ నాది. కష్టాల్ని భరించడం చిన్నప్పట్నించీ అలవాటైనవాణ్ణి. నీ స్థితి వేరు. నువ్విక్కడ యువరాణిలా పెరిగావ్. నన్ను చేసుకుంటే నీ కలలు నిజం కాకపోవచ్చు. నన్ను చేసుకుంటే సుఖంగా ఉండలేవు. నువ్వేది కావాలంటే అది తెచ్చివ్వలేను. నేను ఆలోచిస్తోంది అదే. మనిద్దరికి మ్యాచ్ కాదనేది నా అభిప్రాయం. ఆలోచించు” – వాస్తవికంగా శేఖర్.
“నువ్వుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు.”
“ఇంకోసారి బాగా ఆలోచించు. తర్వాత కష్టపడతావ్.”
“ఇంక ఆలోచించడానికేమీ లేదు శేఖర్.”
“అయితే మనం పెళ్లి చేసుకుందామంటావ్?”
“నీకు కాకుండా నన్నెవరికి కట్టబెట్టినా బతకను” – శేఖర్ కళ్లల్లోకి చూస్తూ, స్థిరంగా కమలిని.
“అయితే నేను నీవాణ్ణే. మనం పెళ్లి చేసుకుందాం.”
ఆమె చేతినందుకుని చటుక్కున తన మీదికి లాక్కున్నాడు. అతను కింద, ఆమె పైన. ఆమె స్తనాలు అతని ఛాతీని ఒత్తుకుంటుంటే.. నెత్తురు వేడెక్కుతూ.. ఆమె కింది పెదవి మీద బలంగా ముద్దు పెట్టుకున్నాడు. నరాలు వశం తప్పుతూ.. అంతలోనే స్పృహ తెలిసి…
“అమ్మో, ఏమో అనుకున్నా. బుద్ధావతారానివేం కాదు.” – అతన్ని విడిపించుకుని, సన్నగా నవ్వుతూ తుర్రున తన గదిలోకి కమలిని.
వాళ్ల పెళ్లికి మొదట మొండికేసింది వరలక్ష్మి. తండ్రీ కూతుళ్లు ఒక్కటయ్యారు. ఒప్పుకోక తప్పలేదు. శేఖర్, కమిలిని పెళ్లి విజయవాడలో గొప్పగా చేశాడు నరసింహం.
*   *   *
1997 ఏప్రిల్.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట కాలనీలో రెండు గదుల పోర్షన్‌లో కొత్తజంట కాపురం. వాళ్లొచ్చిన నాలుగో రోజు సిటీ అంతా గడబిడ. నడిచే పాట గద్దర్‌పై గుర్తుతెలీని కిరాతకుల కాల్పులు. ఆయన ఛాతీ కుడిభాగంలో, పొట్టలో, కుడిచేతిలో – మొత్తం మూడు బుల్లెట్లు. అయినా మృత్యుంజయుడు గద్దర్.
ఆయనంటే విపరీతమైన అభిమానం శేఖర్‌కు. నిమ్స్‌లో ఉన్న ఆయన్ను అతి కష్టమ్మీద చూసొచ్చాడు. అదివరకు ఓసారి చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండులో అందరిలాగే తనూ ఆ ఆవేశంలో, ఆ ఉద్రేకంలో, ఉద్వేగంలో కొట్టుకుపోయాడు. స్టేజి కింద గద్దర్‌తో కరచాలనం చెయ్యడం, తనను తాను పరిచయం చేసుకోవడం, బాగా చదువుకొమ్మని ఆయన చెప్పడం అతడి జీవితంలోనే మరచిపోలేని క్షణాలు. అప్పటి గద్దర్ ఇంకా శేఖర్ కళ్లల్లో…
తూటాల దెబ్బతిని, ఒంటిమీద కట్లతో, బెడ్‌మీద నీరసంగా.. ప్రజా ఉద్యమ నౌక. దుఃఖం ఆగలేదు శేఖర్‌కు. రెండు రోజుల దాకా మామూలు మనిషి కాలేకపోయాడు. తనకే తుపాకి తూటాలు తగిలినంత బాధ. కమలిని అనురాగంలో తెరిపినపడ్డాడు. ప్రాణాపాయం నుంచి గద్దర్ బయటపడ్డాడనీ, తేరుకుంటున్నాడనీ పత్రికల్లో చదివి, సంతోషపడ్డాడు. ఎప్పటిలా ఉద్యోగాన్వేషణ.
రాష్ట్రంలో, దేశంలో ఎటు చూసినా ఏదో ఒక అలజడి. దేవెగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణ. ఉన్నపళాన కూలింది ఐక్య ఫ్రంట్ గవర్నమెంట్. పది రోజుల తర్వాత మళ్లీ అదే గవర్నమెంట్. ఈ సారి ప్రధాని, గుజ్రాల్. రాష్ట్రంలో.. ఆర్టీసీ సమ్మె. ఇంటర్వ్యూలకు తిరగడానికి బస్సులు లేక శేఖర్‌కు నానా తిప్పలు.
నరసింహం నుంచి ఉత్తరం – జన్మభూమి పనులు మొదలు కాబోతున్నాయనీ, ఇంటరెస్ట్ ఉంటే ఆ పనులు ఇప్పిస్తాననీ, ఏ విషయం వెంటనే ఫోన్ చెయ్యమనీ.
శేఖర్ సంగతి అటుంచితే, కమలినికి మళ్లీ అటెళ్లడంలో ఆసక్తి లేదు. తను, శేఖర్.. హైదరాబాద్‌లో జాలీ లైఫ్! శేఖర్‌కు జాబొస్తే జోరుగా, హుషారుగా షికార్లు!! కులాసాగా కాలం!!! తమ మధ్య ఇంకో మనిషంటూ ఉండకూడదు.
“ఆ పనులు ఎన్ని రోజులుంటాయ్ కనుక. మళ్లీ ఏదైనా జాబ్ చూసుకోవాల్సిందేగా. ఇంట్రెస్ట్ లేదని నాన్నకు చెప్పు” – కమలిని.
శేఖర్‌లోనూ అదే రకమైన ఆలోచన. కష్టమో, నష్టమో కొద్ది రోజులు ఓపిక పడితే ఇంత పెద్ద సిటీలో ఉద్యోగం దొరకదా. ఇక్కడే ఉంటే ఉద్యోగావకాశాలు తెలుస్తుంటాయి.
మావయ్యకు ఫోన్ చేశాడు. జన్మభూమి వర్క్స్ మీద ఇంటరెస్ట్ లేదనీ, ఇక్కడే ఉండి ఉద్యోగం చూసుకుంటాననీ చెప్పాడు.
మే నెల. శేఖర్‌కు ఉద్యోగం, ఓ పేరుపొందిన హాస్పిటల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా. ఇదివరకు చేసిన ఉద్యోగాలతో పోలిస్తే, ఇది నచ్చింది. కొద్ది రోజుల్లోనే అతడి సామర్థ్యం, పనిపై అతడి అంకితభావం హాస్పిటల్ ఛైర్మన్‌కు నచ్చాయి.
జీవితం చకచకా, హాయిగా. అతడి ప్రేమలో ఉక్కిరిబిక్కిరవుతూ కమలిని. పని ఒత్తిడితో అతడెప్పుడైనా ఆలస్యంగా ఇంటికి వొస్తే ఏడుస్తూ, అతని గుండెల మీద వాలిపోతూ – ఆమెకు పుట్టిల్లే జ్ఞాపకం రావట్లేదు.
సుఖంగా రెండేళ్లు. ఒక్కటే అపశృతి. 1998 ఆగస్టులో నెలతప్పిన కమలినికి నాలుగో నెలలో అబార్షన్. శేఖర్ అనురాగంలో త్వరగానే కోలుకుంది. అతడి శాలరీ వెయ్యి రూపాయలు పెరిగింది. దాన్ని వెక్కిరిస్తూ మార్కెట్లో అన్ని వస్తువుల రేట్లూ పెరిగాయి. ఇంటి రెంట్ పెరిగింది. కమలిని కోరికల చిట్టా మరింత పెరిగింది. ఆమెలో క్రమంగా అసహనం, అసంతృప్తి పెరుగుతున్నాయి.
హాస్పిటల్లో పని ఒత్తిడి. శేఖర్‌కు ఊపిరి సలపడం లేదు. హాస్పిటల్ విస్తరణ పనులు. ఆదివారాలూ అతడికి డ్యూటీ. నెలలో ఒక్క ఆదివారం ఇంటిపట్టున ఉంటున్నాడేమో. ఆ ఒక్క రోజైనా ఎక్కడికీ తిరక్కుండా, ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటుంది అతడి శరీరం. కమలిని పడనివ్వదు. అన్ని రోజులూ ఒక్కతే ఇంటిపట్టున ఉంటున్న తనను ఆ ఒక్క రోజైనా బయటకు ఎక్కడికైనా షికారుకు తీసుకెళ్లమనేది ఆమె డిమాండ్. చాలా న్యాయమైన డిమాండ్. కాదనలేడు. కానీ, షికారుకు అతని మనసు, శరీరం సహకరించట్లేదు. షికార్లని ఆస్వాదించలేకపోతున్నాడు. అతడి స్థితితో ఆమెకు నిమిత్తం లేదు. ఆ ఒక్క రోజునూ ఆమె ఆస్వాదిస్తోంది. గోల్కొండ, చార్మినార్, జూపార్క్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, టాంక్‌బండ్, బిర్లా టెంపుల్, సుల్తాన్ బజార్, ఫిలింనగర్, కొత్తగా ఏర్పడిన రామోజీ ఫిలింసిటీ కలియతిరిగింది. ఆమె మనసు నాట్యం చేసింది, నెమలిలా. అదంతా ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడే. అక్కణ్ణించి ఇవతలకు వొస్తే.. మనసంతా వెలితి వెలితిగా…
t- galipatam-2-ff
బైకుల మీదా, కార్లలో తిరిగే యువ జంటలను చూస్తూ వాళ్లదెంత సుఖవంతమైన జీవితం అనుకుంటే ఆమె మనసు చిన్నబోతోంది. శేఖర్ బైకుని నడుపుతుంటే, వెనక కూర్చొని అతని నడుము చుట్టూ చేతులేసి, అతని వీపుమీద తలవాల్చితే ఎంత హాయిగా ఉంటుంది! ఎప్పుడొస్తుందో ఆ రోజు – అనుకుని ఉసూరుమంటోంది.
“మా నాన్నని అడిగితే డబ్బు సర్దుబాటు చేస్తాడు. బైకు కొనొచ్చుగా” – కమలిని.
“అత్తింటి నుంచి ఏమీ ఆశించకూడదని మన పెళ్లి కాకముందే నా నిశ్చితాభిప్రాయం. అలా తీసుకోవడం నా మనస్తత్వానికి విరుద్ధం. ఇప్పుడు బైకు అవసరం ఏముంది? అవసరం వొచ్చినప్పుడు ఎలాగో కష్టపడి కొంటాలే. అప్పటిదాకా సర్దుకుపోవాలమ్మాయ్” – నవ్వుతూ తేలిగ్గా, శేఖర్.
తేలిగ్గా తీసుకోలేకపోయింది కమలిని.
“బైకుల మీదా, స్కూటర్ల మీదా ఝామ్మని పోతున్న జంటల్ని చూస్తుంటే నాకెంత కష్టంగా ఉంటోందో తెలుసా? నాక్కూడా అలా తిరగాలని ఉండదూ? మా నాన్నను అడగాలే కానీ, చిటికెలో సమకూర్చి పెట్టడూ? అయినా లోకంలో నీలాంటివాణ్ణి ఎక్కడా చూళ్లేదు. అతి మంచితనం, నిజాయితీ ఈ సొసైటీలో పనికిరావ్ శేఖర్. ఇంజనీర్‌వి. కావాలనుకుంటే ఎంత సంపాదించొచ్చు! నువ్వు తప్ప అందరూ సంపాదించుకునేవాళ్లే” – నిష్ఠూరంగా కమలిని.
శేఖర్ మొహంలో నవ్వు మాయం. ఒంట్లోని నెత్తురంతా మొహంలోకి వొచ్చినట్లుగా ఎరుపు.
“ప్లీజ్ కమ్మూ. ఇంకోసారి నా దగ్గిర ఇట్లాంటి మాటలు అనొద్దు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మన పెళ్లికి ముందు ఏమన్నావో. నేనుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదన్నావ్. ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్‌గా బిహేవ్ చేస్తున్నావ్” – కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ శేఖర్.
కమలిని గొంతు పూడుకుపోయింది, వేదనతో. కళ్లల్లో నీళ్లు. ఆ క్షణం శేఖర్ ఆమె మొహంలోకి చూసినట్లయితే, ఆ కళ్లు ఏం మాట్లాడుతున్నాయో తెలిసేదేమో.
2000 సంవత్సరపు రోజులు.
హైదరాబాద్ యమ స్పీడ్‌గా డెవలప్ అవుతోంది. ఇదివరకు అబిడ్స్, కోఠీ మాత్రమే మెయిన్ షాపింగ్ సెంటర్లు. ఇప్పుడు అమీర్‌పేట, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, చందానగర్, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట, ప్యాట్నీ పెద్ద షాపింగ్ సెంటర్లయ్యాయి. ఎటు చూసినా షాపింగ్ మాల్సే. బట్టల దుకాణాలూ, జ్యూయెలరీ షాపులూ, ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలూ. డిస్‌ప్లేలలో కళ్లుచెదిరే చీరలూ, చుడీదార్లూ, నెక్లెస్‌లూ, చెయిన్‌లూ.. కమలిని కళ్లు పెద్దవవుతున్నాయి, వాటిని చూస్తూ. వాటిలో ఆమె కళ్లకు నచ్చుతున్నవెన్నో. కానీ, కమలినికి హృదయాన్నిచ్చిన శేఖర్ జిగేల్‌మంటున్న ఖరీదైన చీరల్నీ, నగల్నీ ఇవ్వలేకపోతున్నాడు. ఆమెలో ఇదివరకు ఉన్న సంతోషం, హుషారు క్రమేపీ తగ్గిపోతున్నాయి.
కావాలనుకున్నవి దక్కకపోతే అసంతృప్తి తీవ్రమై మనల్ని దహించివేస్తుంది. మనసు కంట్రోల్ తప్పుతుంది. మంచి, చెడు విచక్షణ లోపిస్తుంది. కమలినిది సరిగ్గా ఇదే స్థితి.
కమలినిలో మార్పును గమనిస్తున్న శేఖర్, ఆమెను కాస్తయినా సంతోషపెట్టాలని అప్పుడప్పుడూ చార్మినార్‌కో, సుల్తాన్‌బజార్‌కో తీసుకుపోతున్నాడు. గాజులూ, ఒన్ గ్రాం గోల్డ్ నగలూ, చుడీదార్‌లూ కొనిస్తున్నాడు. కమలిని కోరుకుంటోంది వాటిని కాదు. అయినా అయిష్టంగానే, అసంతృప్తిగానే వేసుకుంటోంది, వాటిని.
ఇంజనీరంటే ఎంతో కొంత బెటర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చని ఆశించింది కమలిని. కొత్త మోజు తగ్గిపోయాక ఆమె కలలన్నీ కల్లలవుతున్నాయ్. మనసులో ఎడతెగని వేదన. ఈ జీవనశైలి కారణంగా తనపై ఆమెకు ప్రేమ తగ్గిపోతుందని అస్సలు ఊహించలేకపోయాడు శేఖర్. అతను ఊహించనిదే జరిగింది. కమలినిలో చిరాకులూ, పరాకులూ. శేఖర్ విషయంలో నిర్లక్ష్యం. ఆమె ఆశించింది ఈ జీవితమైతే కాదు.
*   *   *
ఆదిలాబాద్ హాస్పిటల్ కోసం ప్లాన్ ప్రకారం మార్కింగ్ చేయించి, భూమి పూజ ఏర్పాట్లు చేసే పనిని శేఖర్‌కు అప్పగించాడు ఛైర్మన్. అక్కడ వారం రోజులు దాకా ఉండాల్సి రావచ్చు.
“మా అమ్మానాన్నల్ని రమ్మని చెప్పేదా?” – శేఖర్.
“అవసరం లేదులే. వారం రోజులేగా. ఎలాగో గడిపేస్తా” – కమలిని.
వారం అనుకున్నది నాలుగు రోజుల్లో పూర్తి. ఐదో రోజు సాయంత్రానికి హైదరాబాద్‌లో శేఖర్. ఇంటికొచ్చేసరికి చీకటి పడుతోంది. ఆశ్చర్యపోయాడు. తలుపులకు తాళం కప్ప. ఆలోచించి, భరత్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడ అతని చిన్నమ్మ వాళ్లుంటున్నారు. దగ్గరి బంధువైన ఆమె తప్ప కమలినికి తెలిసిన వాళ్లెవరూ ఆ దగ్గరలో లేరు.
“ఏరా గుర్తొచ్చామా. మీ మొగుడూ పెళ్లాలు ఈ వైపే రావడం మానేశారే. వొచ్చిన కొత్తలో రెండు మూడు సార్లు వొచ్చి పోయారంతే. నువ్వంటే సరే. తీరికలేని ఉద్యోగం అనుకో. ఇంట్లో ఉండి ఆ అమ్మాయి ఒక్కతే ఏం చేస్తోంది? ఇటేపొస్తే ఇద్దరికీ కాలక్షేపం అవుతుంది కదా. అయినా ఇప్పుడు చీకటి పడ్డాక వొచ్చావేం?” – చిన్నమ్మ.
కమలిని అక్కడకు రాలేదన్న మాట.
“చిన్నమ్మా! అలా అంటావనే ఇలా వొచ్చాను, నేరుగా ఆఫీసు నుంచి. కమలినికి చెబుతాలే, వీలున్నప్పుడల్లా ఇక్కడకొచ్చి కాలక్షేపం చెయ్యమనీ” – బలహీనంగా నవ్వాడు శేఖర్.
ఐదు నిమిషాల తర్వాత అక్కణ్ణించి బయటపడ్డాడు. కడుపులో పేగుల సొద. పొద్దున నాలుగిడ్లీలు తినడమే. చిన్నమ్మ భోజనం చేసి వెళ్లమంటే, ఇంటివొద్ద కమలిని ఎదురు చూస్తుంటుందని వొద్దన్నాడు. మధ్యహ్నం నుంచీ కడుపులో ఏమీ పోలేదు.
రోడ్డు మీదకొచ్చాడు. షేరింగ్ ఆటోలో అమీర్‌పేట చౌరస్తాలో దిగాడు. ఇమ్రోజ్ హోటల్లో కార్నర్ టేబుల్ కాడ కూర్చున్నాడు. ఎదురుగా రోడ్డు నాలుగువేపులా కనిపిస్తోంది. పరోటా ఆర్డర్ చేసి, కమలిని ఎక్కడికి వెళ్లుంటుందా అని ఆలోచిస్తున్నాడు. ఫ్లాష్! కళ్లకు కమలిని కనిపించి, మాయమైంది. తల విదిల్చాడు. అపనమ్మకంగా చూశాడు.
ఆనంద్ బజార్ షాప్ ముందు ఆగిన ఆటోలో కమలిని! కమిలినే!! ఆమె పక్కన.. ఎవడు? ఎవడో కాదు, శ్రీనాథ్! తమ పక్క పోర్షన్‌లో ఉంటున్న బ్యాచిలర్. చక్కగా తయారై ఉంది కమలిని. శ్రీనాథ్‌తో నవ్వుతూ కబుర్లు చెబుతోంది కమలిని. ఒకరి భుజం ఒకరు రాసుకుంటూ, కొత్త జంటల్లాగా, ప్రేమికుల్లాగా, సన్నిహితంగా – శేఖర్ కళ్లకే శక్తి ఉంటే, క్షణాల్లో ఆ ఇద్దరూ బూడిదైపోవాల్సిందే.
గ్రీన్ సిగ్నల్. ఆటో కదిలింది. ఎందుకో.. తను వాళ్లకు కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు శేఖర్. ఎక్కణ్ణించి వొస్తున్నారు? అట్నుంచి వొస్తున్నారంటే బేగంపేటో, సికింద్రాబాదో వెళ్లుంటారు. షికారుకెళ్లారా? సినిమాకెళ్లారా?
దెబ్బకు ఆకలి చచ్చింది. కడుపు రగులుతోంది కోపంతోటీ, అవమానంతోటీ. స్వతహాగా సౌమ్యుడు శేఖర్. కానీ ఈ అవమానం ఎలా తట్టుకోవడం? తల పగిలిపోతోంది. ఎవేవో పిచ్చి అలోచనలు. ఎందుకు బతకడం? ఏ బస్సుకిందో, లారీకిందో పడితే?
బయటకు నడిచాడు. వెనుక నుంచి సర్వర్ పిలుస్తున్నాడు. పట్టించుకునే స్థితిలో లేడు. బస్సెక్కాడు. తమ కాలనీకి కాదు. భాగ్యనగర్ కాలనీకి. అనితా అపార్ట్‌మెంట్స్‌లో ఉండే మిత్రుని దగ్గర ఆ రాత్రి గడిపాడు.
*   *   *
పొద్దున తొమ్మిది. ఇంటికొచ్చాడు, చెప్పుల చప్పుడు వినవచ్చేలా నడుస్తూ. తలుపు తట్టబోయాడు. తెరుచుకుంది. ఎదురుగా కమలిని, నవ్వుతూ! క్షణం.. నవ్వు మాయం! ఆమె కళ్లల్లో తత్తరపాటు!!
‘శ్రీనాథ్‌గాడు వొచ్చుంటాడనే ఆనందంతో తలుపు తీసిందన్న మాట’ – మనసులో కసిగా శేఖర్.
బలవంతాన కమలిని మొహంలో నవ్వు.
“అరె శేఖర్. రా రా. సర్‌ప్రైజ్.. చేసేశావ్. వారం అన్నావ్‌గా. ఐదో.. రోజే వొచ్చాశావేం. పోనీలే మంచి.. పని చేశావ్. ఈ ఐదు రోజులూ తోచక చచ్చి..పొయ్యాననుకో.”
శేఖర్ మొహంలో నిర్లిప్తపు నవ్వు. ఆమె గమనించలేదు. చూపులు ఎక్కడో. అతను కోపం, ఆవేశం ప్రదర్శించలేదు. ఎలాంటి అనుమానాన్నీ వ్యక్తం చెయ్యలేదు.
“తొందరగా పనైపోయింది. ఇక అక్కడ ఉండటమెందుకని వొచ్చేశా. నువ్వసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు కదూ, ఇప్పుడే వొచ్చేస్తానని” – శేఖర్.
లోపలికెళ్లాడు, ఆమె జవాబు కోసం చూడకుండా. బట్టలు మార్చుకున్నాడు.
*   *   *
2001 మార్చి.
మనసు కుదుటపడట్లేదు. కుదుటపడ్డానికి యత్నిస్తున్నాడు. కమలినిపై అతడి ప్రేమలో మార్పులేదు. ఉంటే అది ప్రేమ కాదు కదా.
ఆ శ్రీనాథ్‌కూ, కమలినికీ ఏం సంబంధం? ఎట్లాంటి సంబంధం? కమలిని ఉద్దేశమేంటి? ఏం చేయాలనుకుంటోంది? ఆమే, తనూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. పైగా తనను పెళ్లి చేసుకొమ్మని అడిగిందే కమలిని. ఆమె ఎందుకు ఇట్లాంటి పనిచేసింది?.. పిచ్చెక్కుతోంది శేఖర్‌కు.
సాధ్యమైనంత వరకు నిజాయితీగా బతుకుతూ, కమలినితో జీవితాన్ని ఆస్వాదిస్తూ, పిల్లలు పుట్టాక తనూ వాళ్లలో ఒకడై, వాళ్లను ఆడిస్తూ, తను ఆడుతూ, వాళ్లను తాననుకున్నట్లు తీర్చిదిద్దుతూ బతకాలని ఎంతగా ఆశించాడు. కమలిని కొట్టిన ఒక్క దెబ్బతో అతడి ఆశలన్నీ ధ్వంసం.
జీవితమంటే నాటకమనీ, మనమంతా అందులో పాత్రధారులమనీ ఎక్కడో చదువుకున్న మాటలు జ్ఞాపకానికొచ్చాయి. ఇదేం నాటకం! ఇలాంటి నాటకంలో తన పాత్రేమిటి? నాటకాల్లో వేషాలు వేసేవాళ్లు బయట తిరిగేప్పుడు రంగులు తుడిచేసుకుంటారు. తనేమో ఇంటా, బయటా రంగులు వేసుకునే తిరగాలా? తనకంటే వాళ్లు చాలా బెటర్.
మనసులో థామస్ మెదిలాడు. ఈ మధ్యే అతను తమ హాస్పిటల్ నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా వెళ్లాడు. వెళ్లేప్పుడు “ఓసారి కేరళకు రా బ్రదర్. నీకు మళ్లీ ఇక్కడకు రావాలనిపించదు” అన్నాడు తనతో. అతడిది కేరళలోని కోజికోడ్.
థామస్‌కు ఫోన్ చేశాడు.
“వాట్ ఎ కో ఇన్సిడెన్స్” – థామస్.
“ఏమిటి?” – శేఖర్, కాస్త ఆశ్చర్యంగా.
“నీకు కాల్ చేయాలని ఇంతకు కొద్దిసేపటి క్రితమే అనుకున్నా” – థామస్.
“విషయమేంటి?” – శేఖర్, ఒకింత కుతూహలంగా.
“మా కాలేజీలో సీనియర్ మెయిన్‌టెనెన్స్ ఆఫీసర్ జాబ్ ఖాళీ అయ్యింది. నువ్వే జ్ఞాపకమొచ్చావు. ఇక్కడకు వొచ్చే ఆలోచన ఉంటే చెప్పు. మా వాళ్లకు చెప్పి పెడతాను. ఇంతకీ నువ్వెందుకు చేశావో చెప్పు.”
“సడన్‌గా జ్ఞాపకమొచ్చావు. చాలా రోజులైంది కదా, ఓసారి పలకరిద్దామని చేశా.”
“ఓకే. మరిక్కడకు వొచ్చే ఆలోచన ఉందా?”
“అక్కడ బాగుంటుందంటే వొచ్చేస్తా.”
“అయితే.. డన్.”
కేరళకు వెళ్తున్నానని కమలినికి చెప్పాడు శేఖర్.
“ఇప్పుడక్కడి దాకా వెళ్లాల్సిన పనేముంది?” – కమలిని.
“మంచి ఆఫర్. శాలరీ కూడా ఎక్కువే. నీక్కావాల్సింది కూడా అదేగా” – శేఖర్.
అతని మాటల్లోని శ్లేష ఆమె మెదడుకు చేరలేదు.
“ఏమో నాకైతే అక్కడకు వెళ్లడం ఇష్టం లేదు.”
“సరే. ఇక్కడ ఓ నెల రోజులు సెలవు పెడతా, ఏదో కారణం చెప్పి. కొట్టాయంలో బాగుందో, లేదో తెలుసుకోడానికి ఈ నెల సరిపోతుంది కదా. నచ్చకపోతే వొచ్చేస్తా. నచ్చితే అక్కడే.”
“సరే నీ ఇష్టం.”
“కావాలనుకుంటే ఈ నెల రోజులు నీకు తోడుగా మీ అమ్మను పిలిపించుకో.”
“చూస్తాలే. అమ్మ ఇక్కడకొస్తే నాన్నకు కష్టమవుతుంది. నాలుగు రోజులుండి పొమ్మంటే ఇబ్బంది ఉండదు కానీ, నెల రోజులంటే ఇబ్బందే. సరేలే. ఎలాగో నేనే సర్దుకుపోతాను. అంతగా బోర్‌కొడితే అప్పుడు చూసుకోవచ్చులే.”
‘ఇబ్బంది వాళ్లకా, నీకా?’ – అడుగుదామనుకున్నాడు. పైకి “నీ ఇష్టం” అని ఊరుకున్నాడు.
కొట్టాయం వెళ్లాడు. నెల రోజులు గడిచాయి. శ్రీనాథ్‌తో కలిసి హాయిగా తిరుగుతోంది కమలిని. ఇంట్లోనే అతనితో కులాసాగా కబుర్లు చెబుతోంది. ఇలా జరుగుతుందని శేఖర్‌కూ తెలుసు. తెలిసీ తనెందుకు ఇలా చేస్తున్నట్లు? ఎందుకు ఇలాంటి అవకాశం అనాయాసంగా ఆమెకు కల్పించినట్లు? ఆమెకు అడ్డు కాకూడదనా? తన చేతకానితనాన్ని నిరూపించుకోడానికా? లేక ఆమెను పరీక్షించడానికా? తేల్చుకోలేకపోయాడు.
*   *   *
చిత్రమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ కమలిని. శ్రీనాథ్‌తో షికార్లకు వెళ్తున్నా అతడితో శారీరక సంబంధం పెట్టుకోలేదు. ఒకసారి ఆటోలో గోల్కొండకు వెళ్తుంటే ఆమె నడుం మీదుగా చేయిపోనిచ్చి బ్లౌజ్ మీద నుంచే ఆమె గుండ్రటి స్తనాన్ని పట్టుకొని వొత్తాడు శ్రీనాథ్. ఆమైనే ఉలిక్కిపడి అతడి చేతిని తోసేసింది.
“ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఇంక నీతో ఎక్కడికీ రాను” అని చెప్పింది మందలింపుగా. మిర్రర్‌లోంచి ఆటోడ్రైవర్ ఆసక్తిగా చూస్తున్నాడు. చూసి, వెనక్కి తగ్గాడు శ్రీనాథ్.
ఇంకోసారి – ఇద్దరూ ఇంట్లో కలిసి భోజనం చేస్తున్నారు. తన మొహం వొంక అదేపనిగా అతడు చూస్తుంటే “ఏమిటి?” – ఆమె.
మూతి పక్కన ఏదో అంటిందన్నట్లు సైగ చేశాడు. వేలుపెట్టి చూసుకుంది. ఏమీ తగల్లేదు.
“నీకు కనిపించదులే” – శ్రీనాథ్.
వేలిని ఆమె మూతివొద్దకు తెస్తున్నట్లుగా తెచ్చి, చటుక్కున తన మొహం వొంచి తన ఎంగిలి పెదాలతో, ఈమె ఎంగిలి పెదాలను గట్టిగా ఒత్తేశాడు.
గట్టిగా తోసేసి “ఇంకోసారి ఇలా చేస్తే నీకూ నాకూ కటీఫ్” – విసురుగా, కోపంగా కమలిని.
ఆమె మనసేమిటో అర్థంకాక అతను తికమక. తనతో సినిమాలకూ, షికార్లకూ తిరగడానికి ఏమాత్రం సంకోచించని ఆమె, చేతులు పట్టుకున్నా, అప్పుడప్పుడూ ఒళ్లూ ఒళ్లూ రాసుకున్నా పట్టించుకోని ఆమె, అంతకుమించి తనను ఎందుకు దగ్గరకు రానీయట్లేదు? తనెక్కడకు తీసుకుపోతే అక్కడకు వొచ్చే ఆమె, కులాసాగా ఎన్ని కబుర్లయినా చెప్పే ఆమె, కనీసం ముద్దు కూడా ఇవ్వదెందుకని? తనను వాడుకుంటోందా? ‘సరే. ఇట్లా ఎంతకాలం దూరం పెడుతుందో అదీ చూద్దాం’ – మనసులో.
“నీకు కోపం వొస్తే.. సారీ.. నిన్ను చూస్తూ ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయా. ఇంకెప్పుడూ.. నువ్వు కావాలన్నా ముద్దు పెట్టుకోనులే” – శ్రీనాథ్.
భోజనం పూర్తయ్యేదాకా వాతావరణం గంభీరం. అతడి మనసు కష్టపడిందని అర్థమైంది. ‘నేను మరీ అంత విసురుగా మందలించాల్సింది కాదు.. అమ్మో.. అలా గట్టిగా కోప్పడకపోతే అలుసైపోనూ.. ఇంకా ఇంకా చనువు తీసుకోడూ..’ – మనసులో, కమలిని.
నిజానికి ఇప్పుడే రోజులు హాయిగా గడుస్తున్నట్లున్నాయి ఆమెకు. హైదరాబాద్‌లో చూడాలనుకున్న చోట్లన్నీ ఒకటికి రెండుసార్లు చూసేసింది. ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకు తీసుకుపోతున్నాడు శ్రీనాథ్. హుస్సేన్‌సాగర్ జలాల్లో జోరుగా స్పీడ్ బోటింగ్ చేసింది. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో చూసి చిన్నపిల్లలా సంబరపడింది. జూపార్క్ అంతా కలియతిరిగి అక్కడి జంతువుల్నీ, పక్షుల్నీ పలకరించింది. ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, బొటానికల్ గార్డెన్స్, దుర్గం చెరువు రిసార్ట్స్‌లో విహరించింది. బిర్లా ప్లానిటోరియం చూసి ఆశ్చర్యపోయింది.
ఇవన్నీ ఒకెత్తు, షాపింగ్స్ ఇంకో ఎత్తు. పంజాగుట్ట మీనాబజార్‌లో షిఫాన్ చీర, పోలీస్ కంట్రోల్ రూం దగ్గరున్న కళాంజలిలో డిజైన్ శారీ, బేగంపేట షాపర్స్ స్టాప్‌లో టైటాన్ వాచ్, లైఫ్‌స్టైల్‌లో శాండల్స్, బషీర్‌బాగ్ జగదాంబ జ్యూయెలర్స్‌లో ముత్యాల హారం.. కొనిచ్చాడు శ్రీనాథ్. వారానికోసారి సాయంవేళ ఏ చట్నీస్‌కో, టచ్ ఆఫ్ క్లాస్‌కో, స్వాగత్‌కో, అనుపమకో వెళ్లి తినొస్తున్నారు.
కమలినికి జీవితం చాలా సుఖంగా, హాయిగా. ఇవేవీ శేఖర్‌తో తీరేవి కావు. అయినా ఏదో వెలితి, ఏదో అసంతృప్తి – కమలిని మనసును చికాకుపెడుతూ…
నెలకోసారి శేఖర్ వొస్తున్నాడు. ఆమెతో ముభావంగా గడుపుతున్నాడు. పేరుకు మొగుడూ పెళ్లాలు. మునుపటి దగ్గరితనమైతే లేదు. ఏమీ ఎరగనట్లే ఆమె ముందు నటించాల్సి రావడం శేఖర్‌కు చాలా కష్టం. పక్కనే శ్రీనాథ్‌తో తిరుగుతూ, శేఖర్ ఉన్నప్పుడు అతని తోడిదే లోకం అన్నట్లు గడపాలంటే కమలినికి మహా కష్టం.
*   *   *
శేఖర్‌లో కొత్త దిగులు. కమలిని తనను వొదిలేసి ఆ శ్రీనాథ్‌గాడితో లేచిపోతే? తన జీవితం సంగతి తర్వాత, కమలిని జీవితం ఏమై పోతుంది? పెళ్ళాం లేచిపోతే ఆ మొగుడిపై సొసైటీకి సానుభూతి. లేపుకుపోయిన వాడు కూడా బాగానే ఉంటాడు. ఆ లేచిపోయిన స్త్రీకే కష్టాలన్నీ. శూలాల్లాంటి మాటలతో గుచ్చిగుచ్చి పొడుస్తుంది లోకం. మోజు తీరాక ఆ మగాడు వొదిలేస్తే, ఆ స్త్రీ జీవితం మరింత ఘోరం, నరకం. అనాదిగా సంఘం ఇంతే.
కొట్టాయంలో ఆడా, మగా జంట కనిపిస్తే చాలు, శేఖర్ హృదయంలో క్షోభ. ఈ మధ్య ‘మిన్సార కణవు’ అనే తమిళ సినిమా చూశాడు. అందులో అరవింద్‌స్వామి చెప్పిన డైలాగులు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. కాజోల్‌ని తనను ప్రేమించేట్లు చెయ్యమని ప్రభుదేవాను ప్రాధేయపడతాడు అరవింద్. సరేనని కాజోల్‌ని పరిచయం చేసుకుంటాడు ప్రభు. ఇద్దరూ స్నేహితులవుతారు. అరవింద్ గురించి గొప్పగా చెప్పి, అతడిపై ఆమెకు ప్రేమ పుట్టించాలని చూస్తుంటాడు ప్రభు. చిత్రంగా అరవింద్‌ను కాకుండా ప్రభును ప్రేమిస్తుంది కాజోల్. ఇది తెలిసి ఆవేదనతో ఊగిపోతాడు అరవింద్. “నీ దగ్గర ఉన్నదేంటి? నా దగ్గర లేనిదేంటి?” అని ప్రభుదేవాను అడుగుతాడు.
ఇప్పుడు ఆ మాటలే పదేపదే జ్ఞప్తికొస్తున్నాయి. ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చూసి శ్రీనాథ్‌వైపు ఆకర్షితురాలైంది కమలిని? ఏ మాత్రం సంకోచం లేకుండా అతనితో ఎలా తిరుగుతోంది? తనేం లోటు చేశాడు? తిండికీ, బట్టకీ కరువు లేదే? అడపాదడపా ఆమె తీసుకెళ్లమన్న చోటుకు తీసుకుపోతూనే వొచ్చాడు కదా.
అంటే ఆమెకు తృప్తిలేదు వీటితో. ఇంకా ఇంకా కావాలి. తనకంటే ఆర్థికంగా లేనోళ్లు ఈ సొసైటీలో ఎన్నో లక్షలమందే.. కాదు.. కాదు.. కోట్లమంది. తమ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లుగా వాళ్లు బతకడం లేదా? సర్దుకుపోవట్లేదా? కమలినికి ఇలాంటి చెడుపని చేయడానికి ఎలా మనసొప్పింది? ఇదే ప్రశ్న ఆమెను అడగాలనుకున్నాడు, అడగలేకపోయాడు.
2002 మొదలు. ఈ మధ్యలో కమలినికి డబ్బు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. అప్పటికే మొబైల్ ఫోన్లు మార్కెట్లో వినియోగంలోకి ఎక్కువగా వొచ్చినా, ఇంకా అతను సమకూర్చుకోలేదు. ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చని, అతన్నయినా ఒక మొబైల్ కొనుక్కోమని ఆమె చెబుతుంటే, దాటవేస్తూ వొస్తున్నాడు. అతనికి తెలీని సంగతి ఏమంటే, ఈ కాలంలో కమలిని హృదయానికి ప్రశాంతత అనేది లేకుండా పోయిందని. ఆమెకు చీరల మీదా, అలంకరణల మీదా, షికార్ల మీదా మోజెక్కువైనా, శ్రీనాథ్‌తో కొద్దో గొప్పో ఆ మోజు తీర్చుకుంటున్నా, అతడి చేష్టలు ఆమెకు భయాన్ని కలిగిస్తున్నాయి.
ఆమెకు అర్థమవుతోంది – అతను తన కోరికలు తీరుస్తోంది, కేవలం తన శరీరంపై కాంక్షతోనే అని. తన దేహంపై సున్నితమైన చోట్లను తాకుతూ అతను ఆనందం పొందుతున్నాడు. తన రొమ్ముల్ని రెండు మూడు సందర్భాల్లో వొత్తాడు. అప్పుడు తన దేహం వొణికిపోయింది – మైకంతోటో, మైమరపుతోటో కాదు – భయంతో, జుగుప్సతో.
ఏమీ ఆశించకుండా తను కోరుకున్నవాటిని అతనెందుకు అమర్చిపెడతాడు? అతన్నుంచి తను కోరుకున్నవి పొందుతున్నప్పుడు, తన నుంచి అతను ఆశించకుండా ఎందుకుంటాడు? ఆ తెలివి తనకెందుకు లేకపోయింది?
తను ప్రేమగా ఉంటే, తనకు కావాల్సినవన్నీ శ్రీనాథ్ అమర్చిపెడతాడని ఊహించుకుందే కానీ, అతను తన దేహాన్నే కోరుకుంటాడని ఊహించలేక పోయిందెందుకని? అతడితో పరిచయమైన రోజు నుంచీ, ఈ రోజు దాకా చూసుకుంటే తన కోరికలు కొన్ని తీరాయనేది నిజమే. కానీ, వాటితో అప్పటికి తాత్కాలికంగా సంతోషం కలిగినా, తర్వాత్తర్వాత ఏదో తెలీని అశాంతి వేధిస్తూ వొస్తోంది. శేఖర్‌తో అందమైన జీవితాన్ని కలలు కన్నది. ఆ కలలు నెరవేరడం లేదని షోకిల్లారాయుడైన శ్రీనాథ్‌కు దగ్గరైంది.
నగలూ, ఖరీదైన చీరలూ కొనిపెట్టలేకపోయినా శేఖర్ తనను ప్రేమించాడు. తన బాధ అతడి బాధ. ఎట్లా లాలించేవాడు! తనకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని తపించేవాడు. తనను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా అతడి స్పర్శలో, అతడి ఊపిరిలో ఎంతటి అనురాగం!
కొంతకాలంగా శేఖర్ తనతో అంటీ అంటనట్లుగా ఉంటున్నాడు. ప్రేమగా పలకరించడం లేదు. దగ్గరకు రాకుండా దూరదూరంగా మసలుతున్నాడు. అంటే.. అంటే.. తన విషయం శేఖర్‌కు తెలిసిపోయిందా? అందుకనే అట్లా దూరంగా మసలుకుంటున్నాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అనిపించడమేమిటి? అదే నిజం. లేకపోతే అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు?
ఆందోళనా, ఆవేదనా కలిసి.. కమలిని ఒంటిలో వొణుకు. తన వ్యవహారం తెలిసి కూడా ఒక్క మాటా అడగకుండా, ఒక్క మాటా అనకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? నిజంగా తెలిసుంటుందా? తెలీకపోతే అతడి ప్రవర్తనకు అర్థం? శేఖర్‌కు తెలుసో, తెలీదో.. పోనీ. ఇకముందు అతడిని మోసం చెయ్యకూడదు. కానీ.. ఇప్పటిదాకా చేసిన తప్పుడు పనులో? అతడి ముందు తన తప్పును వొప్పుకొని క్షమించమని అడగొద్దా? తను శేఖర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకొని అతడితోనే లోకమని అబద్ధాలాడి, ఇంకొకరితో తిరుగుతోంది. దీన్నెలా సరిదిద్దుకోవాలి?.. కమలిని తల పగిలిపోతోంది.
శనివారం రాత్రి కొట్టాయం నుంచి వొచ్చాడు శేఖర్. భోజనాలయ్యాయి. తను చేసిన పిచ్చి పనులు చెప్పుకొని, క్షమించమని అడగాలని చెబుతోంది కమలిని మనసు. ధైర్యం చాల్లేదు. దానికి బదులుగా “నేను కూడా నీతో వొచ్చేస్తా. నువ్వక్కడ, నేనిక్కడ.. ఇట్లా ఎంత కాలం? నువ్వొచ్చేదాకా వారాల పాటు ఎదురుచూస్తూ ఉంటం నా వల్ల కావట్లేదు” – ఆమె.
అతనిలో కాస్తంత ఆశ్చర్యం. నవ్వొచ్చింది. ఆమెకు కనిపించకుండా పెదాల మాటున అదిమిపెట్టి “ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో కుదరదు. ఒక్కటే గది. ఇద్దరికీ సౌకర్యంగా ఉండే ఇల్లు చూస్తా. అప్పుడు వొద్దువుగానీలే” – అతను.
దూర ప్రయాణం చేసి అలసివుంటంతో నిద్ర ముంచుకువొస్తోంది. వెళ్లి పడుకున్నాడు. ఆ పూట అతడితో కాసేపు కబుర్లు చెప్పాలనీ, మనసు విప్పాలనీ కమలిని ఆరాటం.
“ఏమైనా కబుర్లు చెప్పకూడదూ? కొట్టాయం ఎట్లా ఉందో, అక్కడి మనుషులు ఎట్లా ఉంటారో, నీకు అక్కడ ఎట్లా అనిపిస్తున్నదో చెప్పొచ్చు కదా. ఎప్పుడూ రావడం, అలసిపోయానని పడుకోడం. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఇన్నాళ్లూ నేను ఏమీ అడగలేదు. ఇవాళ పౌర్ణమి. డాబా పైకెళ్లి పడుకొని, కాసేపు కబుర్లు చెప్పుకుందాం” – కమలిని.
తట్టింది, అతడి భుజంపై. లేద్దామనుకున్నాడు. మనసు ఎదురు తిరిగింది. ఆమె నటిస్తోందనీ, తనకు అనుమానం రాకుండా ప్రేమ వొలకబోస్తోందనీ ఊహ.
“ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. నిద్ర ఆగట్లేదు” – శేఖర్. ఆవులించాడు. కళ్లు మూసుకున్నాడు.
కమలినికి తన్నుకొస్తోంది, ఏడుపు. చప్పుడు చెయ్యకుండా డాబా పైకెళ్లి చాపమీద పడుకుంది. ఆమె కన్నీళ్లతో తడిసి దిండు ఉక్కిరిబిక్కిరి.
*   *   *
ఇప్పుడు కోజికోడ్‌లోని సెంట్రల్ లైబ్రరీకి బానిస శేఖర్. ప్రపంచ సాహిత్యం చదువుతుంటే ఇంకా ఇంకా విశాలమవుతూ మనసు. అక్కడికెళ్లే సమయం చిక్కకపోతే కొట్టాయంలోని పబ్లిక్ లైబ్రరీకెళ్లి ఇంగ్లీష్ పత్రికలు చూస్తున్నాడు.
కొట్టాయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వెన్నిమాల, మాతృమాల అనే కొండ ప్రాంతాలకు వెళ్లి సాయంత్రాలు కాలక్షేపం చేస్తున్నాడు. థామస్ మరింత దగ్గరయ్యాడు. అతను లేకుండా ఒంటరిగా వెళ్లాలనుకున్నప్పుడు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాన్ని తీసుకుపోయి, అక్కడ చదువుకుంటుంటే మనసు వెలిగిపోయేది.
కొట్టాయం దగ్గరలోనే ఉన్న తిరునక్కర మహాదేవ ఆలయం (శివాలయం)కు అప్పుడప్పుడూ వెళ్లొస్తున్నాడు.
అక్కడ మరో రెండూళ్లు తెగ నచ్చేశాయ్. ఒకటి కల్లర, రెండు రామాపురం. కల్లరలో ఎటు చూసినా యేర్లు, వరిపొలాలు, ప్రాచీన గుళ్లు, చర్చిలు. ఎళుమంతురూత్ యేటిలో పడవపై ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయాడు.
రామాపురం ఓ చారిత్రక స్థలం. రామాపురత్తు అనే యోధుడి జన్మభూమి. ప్రఖ్యాత మలయాళ రచయిత్రి లలితాంబిక నివసించిన ఊరు. అక్కడ రామాలయం ఉంది. ఆ గుడికి చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో భరత, లక్ష్మణ, శతృఘ్న గుడులున్నాయి. అన్నింటినీ దర్శించాడు. లలితాంబిక రాసిన ఏకైక నవల ‘అగ్నిసాక్షి’ ఫేమస్ అనీ, దానికి కేంద్ర సాహిత్య  అకాడమీ అవార్డు వొచ్చిందనీ తెలుసుకొని, దాని ఇంగ్లీష్ అనువాదం చదివాడు.
“ఏమిటి విషయం?” – థామస్, ఒక రోజు.
“ఏ విషయం?” – శేఖర్.
“సెలవులు వొస్తున్నా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నావ్. పుస్తకాలు తెగ తిరగేస్తున్నావ్. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చుట్టబెట్టేస్తున్నావ్. ఏంటి కత?” – థామస్.
బలహీనంగా నవ్వుతూ, మౌనంగా శేఖర్.
“నువ్వెళ్లకపోతే పోయావ్. నీ వైఫ్‌నైనా తీసుకొచ్చేయొచ్చుగా. నువ్విక్కడ, ఆమేమో అక్కడ. ఏం బాలేదు. ఇట్లా ఎంత కాలం?” – థామస్.
“ఆమె కూడా అదే అంటోంది. చూడాలి” – శేఖర్.
థామస్ ఇక పొడిగించలేదు. నిజానికి అతను శేఖర్‌తో మాట్లాడాలనుకున్నది ఆ విషయం కాదు.
“శేఖర్, నేను ‘నవజీవన్’ అనే ఓ సేవా సంస్థను ప్రారంభించాలనుకుంటున్నా. దానికి నా స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం ఉంటే సక్సెస్‌ఫుల్‌గా చేస్తాననే నమ్మకం ఉంది” – థామస్.
“నవజీవనా. బాగుంది. దానితో ఏం చేద్దామని?” – శేఖర్.
“అనాథలు, శారీరక, మానసిక వికలాంగులు ఎంతోమంది అనారోగ్యాలతో సరైన వైద్యం లభించక చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లకు మన హాస్పిటల్లోనే ట్రీట్‌మెంట్ ఇప్పించి, ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. కేవలం వైద్యమే కాదు, వాళ్లకు ప్రేమానురాగాల్నీ అందించాలి. తద్వారా వాళ్లకు అందరిలా జీవితాన్ని కొనసాగించే ఏర్పాటు చెయ్యాలనేది నా సంకల్పం” – థామస్.
“ఎంత గొప్ప సంకల్పం!” – శేఖర్, అప్రయత్నంగా.
అతనిలో చాలా సంభ్రమం. ఇట్లాంటి ఆలోచన థామస్‌కు ఎట్లా వొచ్చింది? తనేమో సొంత సమస్యతో తెగ సతమతమైపోతూ, దాన్నుంచి ఎట్లా బయటపడటమా అని ఆలోచిస్తుంటే, థామస్ నలుగురికీ మంచి చేసే పని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచన రావడం సరే, దాన్ని ఆచరణలోకి తీసుకు రావాలంటే ఎంత శ్రమ చెయ్యాలి! ఎంత ఓపిక కావాలి!!
“ఆలోచనదేముంది శేఖర్. ఆచరణ ముఖ్యం. వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చును భరించాలి. అందుకోసం నా జీతంలో పాతిక వంతును దీనికోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. పైగా ఇక్కడున్నంత కాలం వాళ్లకు ఆహారాన్ని ఏర్పాటుచేయడం కూడా ప్రధానమే. అందుకే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలి. ఇప్పటికే కొంతమంది నెలనెలా కొంత విరాళంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు. మన నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్, మెడికల్ స్టాఫ్ కూడా ఖాళీ టైంలో పేషెంట్స్‌కు ఉచితంగా సేవ చేస్తామని మాటిచ్చారు” – థామస్.
అతని ముందు తాను మరుగుజ్జు అయిపోయిన భావన శేఖర్‌లో.
“నువ్వు తలపెట్టింది చిన్న పనికాదు థామస్. నీకు సంసారముంది. పిల్లలున్నారు. సొంత కుటుంబం చూసుకోడానికే కష్టమైపోతోందని అందరూ చెబుతుంటారు. అట్లాంటిది ఇతరుల కోసం ఇంత పెద్ద పని తలకెత్తుకోడం, దాని కోసం టైం కేటాయించడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో గొప్ప మనసు కావాలి. నీది ఖచ్చితంగా గొప్ప మనసు. నీకు నేనెలా ఉపయోగపడగలనో చెప్పు. తప్పకుండా చేస్తా” – శేఖర్.
థామస్ మొహంపై నవ్వు. “మరీ అంతగా పొగడకోయ్. ఇది నేనొక్కణ్ణే చేస్తున్నానా. చాలామంది సాయం తీసుకుంటున్నా. నువ్వనుకుంటున్నట్లు ఇది ఇప్పటికిప్పుడు నాలో కలిగిన ఆలోచన కాదు. నేను కుర్రాడిగా ఉన్నప్పట్నించీ ఉన్నదే. ఓ రోజేమైందో తెలుసా? మా నాన్నకు విపరీతమైన కడుపునొప్పి వొచ్చింది. మా ఊళ్లో ఆస్పత్రి లేదు. జిల్లా ఆస్పత్రికెళ్లాలంటే పది కిలోమీటర్లు ప్రయాణించాలి. నాన్నను  బస్సులో తెచ్చేసరికి హాస్పిటల్ మూసేశారు, టైం అయిపోయిందని. ఆ రోజంతా ఆస్పత్రి వరండాలోనే ఉన్నాం. కడుపునొప్పితో విలవిల్లాడుతున్న నాన్నను పరీక్షించిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నాడు. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు మా వద్ద లేదు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్లో ఉన్న పేషెంట్సే తలా కొంచెం చందాలు వేసుకొని ఆదుకున్నారు. మానవత్వాన్ని ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశా. అప్పుడే అనుకున్నా. ఆపదలో ఉన్న పేషెంట్స్‌ను ఎలాగైనా ఆదుకోవాలని. ఇప్పటికి అది కొలిక్కి వొచ్చింది. సరే.. ఈ పనిలో నువ్వెలా భాగం కావాలనుకున్నా సంతోషమే. డబ్బు సాయం చెయ్యొచ్చు. అనాథలను హాస్పిటల్‌కు తేవడంలో మాకు తోడ్పాటునీయొచ్చు” – వివరంగా, థామస్.
“రెండూ చేస్తా. నీకేమైనా అభ్యంతరమా?” – మనస్ఫూర్తిగా, శేఖర్.
‘నవజీవన్’ పని మొదలైంది. మొదటి రోజు అన్నదానానికి కిలో బియ్యం సరిపోయింది. నెల రోజులు గడిచేసరికి అది పది కిలోలకు పెరిగింది. రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన వాళ్ల కోసం ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు. దానికి ‘నవజీవన్ భవన్’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు శేఖర్‌కు ఖాళీ సమయం ఉండట్లేదు. హాస్పిటల్ డ్యూటీ అవగానే నవజీవన్ భవన్‌కు వొచ్చేస్తున్నాడు.
జబ్బు నయం అయిన అనాథ పిల్లలను ఎర్నాకుళంలోని శిశుభవన్‌కు తీసుకెళ్లే బాధ్యతను అతనే చూసుకుంటున్నాడు. ఈ పనిలో పడి రెండు నెల్లపాటు హైదరాబాద్ రావడానికి అతనికి వీలు చిక్కలేదు.
*   *   *
రోజురోజుకూ పెరిగిపోతోంది, కమలిని మనసులో అశాంతి. శేఖర్ ప్రవర్తనతో పిచ్చిపడుతుందేమో అన్నట్లుంది. తన విషయం అతడికి తెలిసిపోయిందనే నమ్మకం గట్టిపడింది. అంతకు ముందే దూరం పెట్టేసింది శ్రీనాథ్‌ను.
ఒకసారొచ్చి “ఏమైంది నీకు? పద. స్వాగత్‌కు వెళ్దాం. నీ బాధేంటో చెబ్దువు గానీ” – శ్రీనాథ్.
“ముందు ఇక్కణ్ణించి వెళ్లు. పిచ్చి తలకెక్కి ఇంతదాకా నీతో తిరిగింది చాలు. ఇంకొంచెంసేపు ఇక్కడే ఉన్నావంటే అల్లరి పెడుతున్నావని గోలచేస్తా” – కమలిని, స్థిరంగా.
‘నువ్వూ, నేనూ కలిసి తిరగడం ఇక్కడివాళ్లకంతా తెలుసు. గోల చేసుకో. ఎవరూ నమ్మరు’ అందామనుకున్నాడు. ఆమె మొహంలోని నిజాయితీ ఆపేసింది. తనను ఇంతదాకా శారీరకంగా ఆమె హద్దుల్లోనే ఉంచిందన్న నిజం జ్ఞాపకమొచ్చింది. ఆమె వొంక అలాగే కొన్ని క్షణాలు చూసి, మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
అతడు తనకు కొనిచ్చిన వస్తువులన్నింటినీ అతడింట్లో పడేసి వొచ్చింది కమలిని.
*   *   *
2002 ఆగస్ట్ 7. ఉదయం నుంచీ ఒకటే వాన ముసురు. గద్దర్ ఇంటి ముందు ఆగింది ఆటో. కమలిని దిగింది. ఆ టైంలో ఇంట్లోనే గద్దర్. హాల్లో నలుగురైదుగురు రచయితలు, కవులు. అప్పటి రాజకీయాల గురించీ, సాహిత్యం గురించీ చర్చ. మధ్యమధ్యలో గద్దర్‌తో పాటు ఇంకో కవి నోటివెంట ఆశువుగా పాటలు. ఎవరో యువతి గబగబా గేటు తీసుకుని రావడం హాల్లోంచి చూశాడు గద్దర్. తలుపు తెరిచే ఉంటంతో నేరుగా హాల్లోకొచ్చి గద్దర్‌కు నమస్కారం పెట్టింది కమలిని.
t- galipatam-3
“దండాలు తల్లీ. ఎవరమ్మా నువ్వు. అట్లా కూర్చో” – చాప చూపిస్తూ, గద్దర్.
అక్కడున్నోళ్లంతా చాపలపైనే కూర్చుని ఉన్నారు. ఆమెకు గద్దర్ తప్ప మిగతా వాళ్లెవరూ తెలీదు. కమలినిలో మొహమాటం. గమనించాడు గద్దర్.
“వీళ్లంతా మనవాళ్లేనమ్మా. మంచి రచయితలు, కవులు. మొహమాటపడకుండా చెప్పు” – గద్దర్.
“నా పేరు కమలిని అండీ. మీరంటే మా ఆయనకు చాలా ఇష్టం” – కమలిని.
“అవునా. ఎవరు మీ ఆయన?” – గద్దర్.
“శేఖర్. మీరప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని చూసొచ్చిందాకా నిలవలేకపోయాడండీ” – కమలిని.
“మంచిది తల్లీ. ఎందుకొచ్చావో చెప్పు. ఆ పోరగాడికేమీ కాలేదు కదా. అతను లేకుండా ఒక్కదానివే వొచ్చావంటే ఏదో పెద్ద గడబిడ అయ్యుంటుంది” – గద్దర్.
ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“ఈ తల్లికి నిజంగానే ఏదో కష్టమొచ్చినట్టుంది గద్దరన్నా. ఫర్లేదు చెల్లెమ్మా. మేమంతా నీ అన్నల్లాంటోళ్లమే. నీ బాధేందో చెప్పరాదే” – ఒకతను.
“గోరటి ఎంకన్న పేరు వినుంటావులే తల్లీ. ఇతనే ఆ ఎంకన్న. చెప్పు బిడ్డా. శేఖర్ ఏడున్నాడు?” – గద్దర్.
ధైర్యం తెచ్చుకొని పది నిమిషాల్లో తన కథంతా చెప్పింది.
“నేను తప్పుచేశాను. దాన్ని దిద్దుకోవాలనుకుంటున్నా. ఎలాగో తెలీడం లేదు. రెండు నెలలు దాటిపోయింది. మనిషి రావట్లేదు. నాలుగైదు రోజుల క్రితం ఫోన్‌చేసి అడిగితే వొస్తానన్నాడు. అతను రాలేదు కానీ మనియార్డర్ వొచ్చింది. తను నా మొహం చూడ్డానిక్కూడా ఇష్టపడట్లేదని అర్థమైంది. నాకు శేఖర్ కావాలి. అతనెక్కడెంటే నేనూ అక్కడే. అతన్ని ఇంకెప్పుడూ కష్టపెట్టే పని చెయ్యను. ఆ విషయం నేను చెబితే నమ్మడు. మీరు చెబితే నమ్ముతాడు. మీరు ఆయనకు దేవుడికిందే లెక్క. అందుకే వెతుక్కుంటూ మీ వద్దకొచ్చాను” – కమలిని.
రెండు మూడు నిమిషాల నిశ్శబ్దం. గద్దర్ వద్దకు ఈ రకమైన పంచాయితీ ఇదివరకెప్పుడూ రాలేదు. కమలిని గొంతులో, మొహంలో నిజాయితీ తోచింది అందరికీ.
“అన్నా, ఈ బిడ్డ చేసిన తప్పు తెలుసుకుంది. ఇక నుంచీ మంచిగా ఉంటానంటోంది. సాయం చెయ్యన్నా” – వెంకన్న.
గద్దర్ నవ్వాడు. కమలిని తలమీద చేయేసి “నిజం నిన్ను నీడగా వెంటాడుతున్నదే తల్లీ. ఇవాళ నువ్వే కాదు, ఎంతోమంది మార్కెట్ మాయలోపడి విలాసాలకు బానిసలవుతున్నారమ్మా. జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అనుబంధాల్నీ, ఆత్మీయతల్నీ విస్మరిస్తున్నారు. నువ్వు చాలా త్వరగానే నీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. శేఖర్ సంగతి నేను చూసుకుంటా. అన్నంతినెళ్లు తల్లీ” – గద్దర్.
*   *   *
మరోసారి ఆగస్ట్ 15కి. తెల్లవారితే 16.
ఒంటిమీదున్న రగ్గుతీసి అవతలకు నెట్టాడు శేఖర్. ఒళ్లంతా చెమట్లు. పక్కకు చూశాడు. కమలిని లేదు. లేచాడు. విపరీతమైన నీరసం. గద్దర్ ఫోన్ చేయడం, రాత్రి తను రావడం, కమలిని తనకు సపర్యలు చెయ్యడం.. అన్నీ జ్ఞాపకానికొచ్చాయి. ఆమె కన్నీటి చుక్క తన చేతిపైపడ్డం జ్ఞాపకానికొచ్చింది. ఆమె తప్పు తెలుసుకుందా? పశ్చాత్తాపపడుతోందా? లేక తన స్థితికి బాధపడుతోందా? ఆమె దుఃఖానికి రెండూ కారణమేనా?
మంచం మీంచి దిగాడు. ముందు గదిలో వెల్తురు. చప్పుడు చెయ్యకుండా కిటికీ రెక్కను నెమ్మదిగా తెరిచాడు. కింద కూర్చొని పేపర్‌పై ఏదో రాస్త్తూ, కమలిని. మధ్య మధ్య కళ్లు తుడుచుకుంటూ…
ఆ ఒక్క దృశ్యం.. ఆ ఒకే ఒక్క దృశ్యం.. ఎన్నో విషయాలు చెప్పింది. సందేహమే లేదు. ఈ కమలిని, మునుపటి కమలిని కాదు. తన కమ్ము!
ఆమెపై ప్రేమ ఉప్పెనలా తోసుకువొస్తుంటే.. తన కళ్లు తడవటం అతడు గమనించలేదు. ఒళ్లు స్వాధీనంలో లేని విషయం పట్టించుకోలేదు. తలుపు తోశాడు. “కమ్మూ!” అంటా ఒక్క ఊపున వెళ్లాడు. ఆమెలో ఉలికిపాటు. రాస్తున్న పేపర్‌ను దాచబోయింది, కంగారుగా. పేపర్ ఆమె మాట వినలేదు. చేతిలోంచి జారి కిందకి.
ఆమె తియ్యబోతుంటే, చటుక్కున దాన్నందుకున్నాడు. ఆమె కన్నీళ్లతో తడిసిన ఆ పేపర్‌లోని అక్షరాల వెంట అతని కళ్లు పరుగులు.
“శేఖర్ నన్ను క్షమించు. నీకు తీరని ద్రోహం చేశాను. నువ్వెంత మంచివాడివి. నాపై ఎంత ప్రేమ చూపావు. కానీ నేను ఆడంబరాల్లో, షోకుల్లో సుఖముందనే భ్రమల్లో మునిగాను. నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను. ఎండమావుల వెంట పరుగులు పెట్టాను. నా సంగతి తెలిసి కూడా తెలియనట్లు ఉంటున్నావని అర్థమైంది. నీ స్థానంలో ఇంకెవరున్నా అదే రోజు నాతో తెగతెంపులు చేసుకునేవాడు. లేదంటే ఆ చెంపా, ఈ చెంపా వాయించేవాడు. నీది అతి మంచితనం. నేను దారి తప్పుతున్నానని తెలిసి కూడా ఆ బాధను నీలోనే దాచుకొని, ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో. ‘ఇట్లాంటిదాన్నా.. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందీ’ అని ఎంతగా వేదన చెందుతున్నావో. నీ బాధ, వేదన న్యాయమైనవి. మానసికంగా నిన్నెంత క్షోభపెట్టానో తలచుకుంటుంటే నాపై నాకే పరమ అసహ్యం వేస్తోంది. నిజమైన సుఖమేమిటో, ప్రేమేమిటో తెలిసేసరికి నువ్వు నాకు చాలా దూరమైపోయావ్. నేను తప్పు చేశాననేది నిజం. కానీ నేను వ్యభిచారం చెయ్యలేదు. నీతో జరగని సరదాలను తీర్చుకోవాలనుకున్నానే కానీ ఈ శరీరాన్నీ, మనసునీ నీకు తప్ప ఇంకెవరికీ అర్పించలేదు. సంజాయిషీ కోసం ఈ సంగతి చెప్పడం లేదు. నీకు నిజం తెలియాలనే చెబుతున్నా. ఇదే సంగతి నువ్వు అభిమానించే గద్దర్‌గారికి చెప్పి, కొంత ఉపశమనం పొందాను. ఆయన మాటతోనే ఇప్పుడు నువ్వొచ్చావని తెలుసు. కానీ ఇందాక నువ్వు పలవరించినప్పుడు అర్థమైంది, నీ హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా క్షోభించిందో. ‘కమ్మూ, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే భరోసా అనుకున్నా. నువ్వేమో డబ్బులోనూ, ఆడంబరాల్లోనూ, సరదాలు, షికార్లలోనూ ప్రేమ ఉందనుకుంటున్నావ్.  నన్నేందుకు మోసం చేశావ్?’ అని నిద్రలోనే అడిగావ్. నీతో కలిసి బతికే అర్హత నాకులేదని అర్థమైంది. అందుకే…”
అంతవరకే రాసింది. ఆ తర్వాత కన్నీటి చుక్క పడ్డట్లు తడిసింది పేపర్. కమలిని వొంక చూశాడు శేఖర్. తల అవతలకు తిప్పుకొని ఉంది, తన మొహం అతడికి చూపించే ధైర్యంలేక.
తన ప్రమేయం ఏమీ లేకుండానే, తనేమీ అనకుండానే ఆమె తన తప్పు తెలుసుకుంది. కమలిని ఇప్పుడు మారిన మనిషి. ఆమెకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అది చెయ్యలేడా?
ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె తలను చేతుల్లోకి తీసుకున్నాడు. “కమ్మూ, నన్ను వొదిలిపెట్టి నీ దారిన నువ్వు పోదామనుకుంటున్నావా? నేనేమైపోవాలనుకున్నావ్?” అంటా ఆమె పెదాలపై, నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు. తడిసిన కన్నులను పెదాలతో అద్దాడు. కన్నీటి చుక్కలు ఉప్పగా ముద్దాడాయి. రెండు చేతులూ అతడి వీపు వెనుగ్గా పోనిచ్చి మళ్లీ ఎవరైనా తమను వేరు చేస్తారేమోననే భయం ఉందేమో అన్నట్లుగా గట్టిగా, బలంగా శేఖర్‌ను వాటేసుకుంది కమలిని.
-బుద్ధి యజ్ఞ మూర్తి 
buddhi

బతికిపో

 Kadha-Saranga-2-300x268
భళ్లుమంటా తలుపులు తెర్సుకునేతలికి ఆమైనే ఉలిక్కిపడతా చూశాడు కుమార్సామి. ఎదురుంగా అపర ఈరబద్రుళ్లా కొడవలి పట్టుకు కనిపిచ్చాడు ఓబులు. ఆ ముసలోడి కళ్లు నిప్పుకణికల మాదిరి ఎర్రెర్రగా మండిపోతన్నాయి. వడ్డీ లెక్కలు రాసుకుంటన్న కుమార్సామి కదలక మెదలక కొయ్యమాదిరి అట్టాగే కూకుండిపొయ్యాడు.
“రేయ్. పీనుగుల్ని పీక్కతినే లమ్డీకొడకా. ఇయ్యాళ నా సేతుల్లో నీకు మూడిందిరో” అంటా ఒక్క దూకు దూకాడు, ఇంకో ఏడుపోతే ఎనభై నిండే ఓబులు. ముసలోడే ఐనా ఇంకా బలంతగ్గని చేతిలో టెంకాయల్ని కసక్కన తెగనరికే కొడవలి మాత్రం అప్పుడే సానబెట్టినట్టు తళతళమంటా మెరుత్తా ఉంది. తల విదుల్చుకుంటా తెలివి తెచ్చుకున్నాడు కుమార్సామి.
“ఏయ్ ముసలోడా ఏం.. ఏం.. జేత్తన్నావ్? సేతిలో ఆ.. కొ..డ..వ..లి ఏంది?” అన్నాడు భయంతోటి గడగడా వొణుకుతా. ‘ఓబులుకీ, నాకూ మజ్జ ఏదైనా అడ్డం ఉంటే బావుణ్ణు’ అనుకున్నాడు. కానీ ఆ గెదిలో చిట్టీలెక్కల పుస్తకాలు, ఆ పుస్తకాలు పెట్టి రాస్కునే డెస్కు తప్పితే ఇంకేం లేవు.
“కనిపియ్యడం లేదురా కొజ్జా నాయాలా. నీ నెత్తురు కళ్లజూడందే వొదలన్రా. ఇయ్యాళ్టితో ఈడ జనానికి నీ పీడ వొదిలిపోద్ది. చావరా జనం నెత్తురు తాగే రాచ్చసుడా” అని కొడవలితో ఒక్కేటు యెయ్యబోయాడు ఓబులు.
చప్పున ఓబులు కాళ్లని ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అరచ్చణం ఆలిస్యమైనా కుమార్సామి తలకాయ టెంకాయలా తెగిపడేదే. చూశాడు. దీనంగా చూత్తా కుమార్సామి పెళ్లాం రామలచ్చిమి.
‘నా మొగుణ్ణి చంపి నాకూ, నా బిడ్డలకీ అన్నేయం సెయ్యమాకు’ అంటున్నాయి నీళ్లతో మెరుత్తున్న ఆమె కళ్లు.
“ఏమ్మా. నీ మొగుడు ఊళ్లో ఎంతమెంది ఆడాళ్ల ఉసురు పోసుకుంటన్నాడో తెల్వదా. సోద్దెం చూత్తా ఊరుకుంటివే. నాకు తలకొరివి పెట్టాల్సిన మా పెద్దోడు సాంబుగాణ్ణి పొట్టన బెట్టుకుంది ఈ నీచపు ముండాకొడుకే. ఈ నాయాల్ని నరుకుదామనొత్తే అడ్డం పడ్తన్నావ్. నీ మొగుడి పేణం నీకెట్టానో, ఊళ్లో ఆడాళ్లకి ఆళ్ల మొగుళ్ల పేణాలూ అంతేగా. ఇయ్యాళ నా కొడుకు సావుతో అన్నేయమైపోయిన ఆడి పెళ్లాం పిల్లల గతేంది. దానికి జవాబు సెప్పు తల్లీ. అప్పుడు వొదుల్తాను ఈ పుండాకోరునాయాల్ని” – పళ్లు పటపటా కొరికాడు ఓబులు.
మొగుడి సంగతి తెల్సిందే గాబట్టి ఏం చెప్పాల్నో తెలీక ఓబులు వొంక అట్టాగే దీనంగా చూసిందామె.
“ఏం.. ఏంది బెదిరిత్తన్నావ్. నిజ్జంగా సంపుతావేందీ.. అంత తేలిగ్గా ఉందా, సంపడమంటే. నేనేం జేశాను. బాకీ డబ్బులు టయ్యానికి ఇయ్యకపోడం ఆళ్ల తప్పు. సామ్మూర్తి.. అదే నీ కొడుకూ.. అంతేగా. నోటులో రాసుకున్నట్టు బాకీ కట్టాల్నా, లేదా.. అదేగా నేనడిగిందీ.. నేనేమన్నా సావమన్నానా ఏందీ. తీసుకున్న బాకీ డబ్బులు కట్టడం సేతకాక పిరికోడులా ఉరేస్కుంటే దానికి నాదా బాద్దెత?” – కుమార్సామి, దైర్నం తెచ్చుకుంటా.
“రేయ్.. ఏం కూశావ్‌రా. సాంబుగాడు సచ్చింది బాకీ కట్టలేననే బాత్తో కాదురా. ఈదిలో నువ్‌జేసిన అల్లరికీ, నువ్వన్న ఛండాలపు మాటలకీ రా. పరువుగా, గుట్టుగా ఇంతకాలం సంసారం జేసుకుంటా వొత్తున్న నా కొడుకు అందర్లోనూ అవమానం జెయ్యడాన్ని తట్టుకోలేక మనసులో కుంగిపొయ్యి ఉరేసుకున్నాడ్రా. మాటల్తోటే మనుషుల్ని పీక్కతినే పచ్చి రాచ్చసుడివిరా నువ్వు. నిన్నొక్కణ్ణి యేసేత్తే నేతగాళ్లంతా మనశ్శాంతిగా బతుకుతార్రా” – కొడవలి పైకెత్తాడు ఓబులు.
దాంతోటి కుమార్సామి పైపేణాలు పైనే పొయ్యాయి. వొళ్లంతా సెమట్లు పట్టేశాయి. గుండెకాడ నెప్పి మొదలయ్యింది. ‘చివరికి ఈ ముసలోడి సేతిలో సావు రాసిపెట్టుందా?’ అనుకోంగాల్నే, నాలికి పొడిబారింది. మామూలుగా ఐతే తిరగబడేవోడే. యాభయ్యేళ్ల తనముందు ఎనభయ్యేళ్ల ముసలోడు ఓ లెక్కా. కానీ తను ఉత్త సేతుల్తో ఉన్నాడాయె. పైగా కూకొని ఉన్నాడు. ఓబులు సేతిలో జూత్తే అప్పుడే సానబెట్టిన కొడవలుంది. పైగా నించోనున్నాడు. తను లేచేపాటికి ఒక్కేటుగానీ యేశాడా.. తన తలకాయ పుచ్చకాయలా తెగిపడుద్ది. భయంతో గొంతు పిడచకట్టుకుపొయ్యింది కుమార్సామికి.
*    *    *
ఆ పేట మొత్తమ్మీద కుమార్సామే పెద్ద వొడ్డీ యాపారి. ఓ పక్క చిట్టీపాటలు, ఇంకోపక్క వొడ్డీ యాపారంతో శానా తక్కువ రోజుల్లోనే కోట్లు సంపాదిచ్చాడు. బంగాళాపెంకుల ఇంటిని పడేసి రెండంతస్తుల మేడ బ్రెమ్మాండంగా కట్టాడు. మెట్ట, మాగాణి కలిపి యాభై ఎకరాల పైనే ఉంటుందని పేటలో సెప్పుకుంటా ఉంటారు. ఆటిలో బాకీ కట్టలేనోళ్లు జమచేసిన పొలాలు పదెకరాల దాకా ఉంటాయి. అట్టాగే ఓ పెంకుటిల్లునీ, ఏడు సెంట్ల ఖాళీ స్తలాన్నీ కూడా బలవంతాన లాగేసుకున్నాడు కుమార్సామి. ఆటి యజమానులు ఆయబ్బి కాడ జేసిన బాకీని కట్టాల్సిన టైముకి కట్టకపోడమే దానిక్కారణం. పేటలోని నేతగాళ్లే కాదు, శానామంది షావుకార్లు (మాస్టర్ వీవర్లు) కూడా ఆయబ్బితో ఇబ్బందులు పడతన్నారు. మనసులో ఆయబ్బి మీద ఎంత కోపమున్నా, కసున్నా ఏం జెయ్యలేని పరిస్తితిలో ఉన్నారు. ఎందుకంటే అవసరానికి ఎంతంటే అంత డబ్బు అప్పిచ్చేది ఆయబ్బే కాబట్టి.
ఓబులు కొడుకు సాంబమూర్తి శానా రోజుల్నించే కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తన్నాడు. పౌర్ణం రోజు వొచ్చిందంటే కుమార్సామి ఇల్లు పాటలు కట్టేవోళ్లతోటి కిటకిటలాడిపోద్ది. మామూలుగా పౌర్ణం రోజు నేతగాళ్లందరికీ ఊరట. అంటే సెలవురోజు. మగ్గం చప్పుడు వినిపిచ్చని రోజు. షావుకార్ల కొట్లు నేతగాళ్లతో కళకళలాడే రోజు. ఆ రోజే నేతగాళ్లంతా తాము ఏ షావుకారికి నేత్తున్నారో ఆ షావుకారు కాడికి నేసిన గుడ్డల తానులు తీసకపొయ్యి కొత్త ‘ఎంట్లు’ (పడుగు, పేక నూలు, పాగళ్లు) తెచ్చుకుంటారు. ఆటితో పాటే ఆటి తాలూకా కూలీ డబ్బులు కూడా. అంటే ఉజ్జోగం చేసేవాళ్లకి జీతాలొచ్చే రోజు ఎట్టాగో నేతగాడికి పౌర్ణం రోజు అట్టాగా. ఆ రోజంతా నేతగాళ్ల ఇళ్లల్లో పండగ సందడే. నేతగాళ్ల కాడ డబ్బులాడేది అప్పుడ్నే కాబట్టి కుమార్సామి చిట్టీ పాటలు పెట్టేది అప్పుడ్నే.
పాటలు పాడుకోడానికి వొచ్చినోళ్లతోటీ, బాకీ చెయ్యడానికి వొచ్చినోళ్లతోటీ కుమార్సామికి అయ్యాళ చెణం తీరికుండదు. ఎవరైనా పాట డబ్బులు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా ఆయబ్బి ఊరుకోడు. ఆ తెల్లారే ఆ కట్టనాళ్లింటికాడికి పొయ్యి నానా యాగీచేసి, డబ్బులు వసూలు చేస్కుంటాడు. ఏదైనా అవసరానికి పనికొత్తాయి కదా అని నేతగాళ్లంతా కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తుంటారు.
శానా యేళ్లనుంచీ ఆయబ్బి కాడ పాటలు కడ్తన్నాడు సామ్మూర్తి. ఎప్పుడైనా పౌర్ణం రోజు పాట డబ్బులు కట్లేకపోతే ముందుగాల్నే ఆ సంగజ్జెప్పి, గడువడిగి, ఆ లోపల కట్టేసేవోడు. అట్టాంటి నమ్మకమైన మనిషైన సామ్మూర్తి ఆమజ్జ కుమార్సామి కాడ యాభయ్యేలు అప్పుజేశాడు. పెద్ద కూతురి పెళ్లిని ఎట్టాగో ఎవరికాడా బాకీ పడకుండా జేశాడు కానీ రెండో కూతురి పెళ్లికి అప్పుజెయ్యక తప్పలేదు. అబ్బాయి ఆర్టీసీ కండట్టరుగా గవర్మెంటు ఉజ్జోగం జేత్తుంటం వల్ల, కూతురికి బవిష్యెత్తులో నేతనేసే పని తప్పుతుందనే ఆశతోటీ, వొచ్చిన మంచి సంబంధాన్ని సేతులారా వొదులుకోవడం ఎందుకనే ఉద్దేశంతో సేతిలో డబ్బులు అంతగా లేకపోయినా బాకీచేసి ఆ పెళ్లి జేశాడు.
వొందకి రెండ్రూపాయల వొడ్డీ లెక్కన ఆ అప్పు తీసుకున్నాడు సామ్మూర్తి. మూడేళ్లలో అసలు, వొడ్డీ కలిపి బాకీ మొత్తం తీరుత్తానని ఆయబ్బి చేత నోటు రాయించుకున్నాడు కుమార్సామి. అంటే మూడేళ్లలో వొడ్డీతో కలిపి ఎనభై యేలు కట్టాలన్న మాట. ఒకేళ ముందుగాల్నే కట్టేత్తే వొడ్డీ తగ్గుద్ది. అయితే నేతగాడికి అంత డబ్బు చెల్లిచ్చాలంటే అయ్యే పనేనా?
ఇంట్లో నేతనేసేది సామ్మూర్తి వొక్కడే. షుగరొచ్చి ఆయబ్బి పెళ్లాం జెయమ్మ శానా కాలం నుంచీ పైపనులు మాత్రమే జేత్తంది. కొడుకు కాలేజీలో సదూకుంటన్నాడు. ఓ పక్క కొడుకుని సదివిత్తా, ఇంకోపక్క పెళ్లాం రోగానికి డబ్బులు ఖర్చుపెడతా ఉంటే బాకీ డబ్బు చెల్లిచ్చడం ఎంత కనాకష్టమో సామ్మూర్తికి తెలవంది కాదు. మనసులో బయం రోజురోజుకీ పెరుగుతున్నా, వొంటి గురించి పట్టిచ్చుకోకుండా రేయింబవళ్లూ కష్టపడ్తా వొచ్చాడు. నిద్రలేచాక ఆరింటి కాణ్ణించీ మగ్గం గుంటలోనే సామ్మూర్తి జీవితం. మజ్జలో అన్నాలు తింటానికీ, బయటేమన్నా పన్లుంటే యెళ్లిరావడానికీ తప్పితే రేత్రి తొమ్మిది, పదింటిదాకా గుంటలోనే ఉంటన్నాడు.
“ఇట్టా అదేపనిగా నేత్తే నీ వొళ్లు పాడవుద్దయ్యా” అని దిగులు పడ్తుంటుంది జెయమ్మ.
“నాకేందే.. నాది ఉక్కొళ్లు” అని నవ్వుతా అంటాడే గానీ తనొళ్లు ఇంతకు ముందులా తన మాట వింటంలేదనే యిష్యం ఆయబ్బికి తెలుత్తానే ఉంది. నలబై ఐదేళ్లనుంచీ అదేమైనుగా మగ్గం గుంటని అంటిపెట్టుకొన్న బతుకు ఆయబ్బిది. నిన్న మొన్నటిదాకా పేట మొత్తమ్మీద స్పీడుగానే గాకుండా శానా అందంగా నేసే నేతగాడని అందరూ అనేవోళ్లు. వొయసులో ఉన్నప్పుడు ఓబులు కూడా తన కొడుకులా నేసినోడు కాదు.
కాలం గిర్రున తిరుక్కుంటా పోతంది. సామ్మూర్తి కొడుకు ఇప్పుడు బీయస్సీ మూడో యేడు సదూతున్నాడు. ఆ మజ్జలో రెండో కూతురు పురుడు కోసమని పుట్టింటికొచ్చింది. కాన్పు మామూలుగా అయిపోతందనుకుంటే ఆఖర్లో బిడ్డ అడ్డం తిరిగిందనీ, ఉమ్మ నీరు పోతన్నదనీ జెప్పి పొట్టకోసి బిడ్డను బయటకి తీసింది డాక్టరు. ఆ ఆపరేషన్‌కీ, ఇంకొన్ని ఖర్చులకీ పదేల దాకా ఐపోయాయి. కూతురు కదా తప్పదయ్యే. ఇట్టాంటియ్యే మజ్జమజ్జలో ఎయ్యో ఖర్చులు రావడం, అప్పటిదాకా దాచుకున్న డబ్బు ఖాళీ ఐపోడంతో కుమార్సామి కాడ చేసిన బాకీకి వొడ్డీ తప్పితే అసలు చెల్లిచ్చలేకపొయ్యాడు సామ్మూర్తి. కుమార్సామి సంగతి తెల్సు కాబట్టి మనసులో పీకుతానే ఉంది సామ్మూర్తికి, ఏం గొడవ జేత్తాడోనని. మూడేళ్లైపొయ్యాయి. వొడ్డీ ఇద్దామని యెళ్లిన ఆయబ్బిని నానా కూతలూ కూశాడు కుమార్సామి. వొడ్డీ తీసుకుని అసలు కూడా అప్పటికప్పుడు చెల్లిచ్చాల్సిందేనని పట్టుబట్టాడు.
“ఏంది సామీ. నా సంగతి నీకు తెల్వదా. ఎన్నేళ్లబట్టి నీకు పాటలు కడ్తన్నాను. ఎప్పుడైనా నావొల్ల తేడా వొచ్చిందా? ఇప్పుడంటే రెండో దాని పెళ్లి తర్వాతనే కదా కాత్త ఇబ్బంది పడ్తన్నా. అబ్బాయి సదూకోసమనీ, ఇంటిదాని వైజ్జం కోసమనీ ఖర్చవుతా ఉంది. వొడ్డీ అయితే ఆపకుండా ఇచ్చేత్తన్నా కదా. అబ్బాయి సదువైపోతే ఆడికి ఏదో వొక ఉజ్జోగం రాకపోదు. అప్పుడు నాకింత కష్టం ఉండదు. నీ బాకీ అణాపైసల్తో తీర్చేత్తా. మళ్లా నోటు రాయి” అని బతిమాలాడు సామ్మూర్తి. అప్పు తీసుకున్నోళ్ల బాధల్ని ఇని దయచూపితే ఆయబ్బి కుమార్సామి ఎట్టా అవుతాడు? ఆస్తులు ఎట్టా పోగేసుకుంటాడు?
“నాకీ కతలన్నీ చెప్పమాక సామ్మూర్తీ. టయ్యానికి బాకీ కట్టని పెతోడూ నీ మాదిరి కతలు చెప్పేవోడే. అయ్యన్నీ ఇనుకుంటే నేను యాపారం జేసినట్టే. నువ్వేం తిప్పలు పడ్తావో, ఏ ఇంటికి కన్నం యేత్తావో నాకు తెల్వదు. పది రోజులు టైమిత్తన్నా. నా బాకీ కడితే సరే. లేదంటే బజారుకీడుత్తా” అని కచ్చితంగా చెప్పేశాడు.
ఇదంతా ఓబులికి తెల్సినా కొడుక్కి ఏం సాయం చెయ్యలేని ఇదిలో ఉన్నాడు. కొద్ది రోజులు పెద్దకొడుకు కాడా, కొద్ది రోజులు చిన్నకొడుకు కాడా రోజులు నెట్టకొత్తున్నాడు. పైపనుల్లో సాయం తప్పితే ఆయబ్బి పోగేసుకున్నదేం లేదు.
కుమార్సామి ఎంత గట్టిగా జెప్పినా, ఆయబ్బి యెట్టాంటోడో ఎరిగినా మంచోడిగా, పరువు  మర్యాదలు ఉన్నోడిగా తనకున్న పేరువల్ల కొంత దయ సూపుతాడేమోనని ఆశపడ్డాడు సామ్మూర్తి. పైగా ఎన్నో ఏళ్లబట్టి తను ఆయబ్బి కాడ పాటలు ఆగకుండా కడతా వొత్తున్నాడాయె.
పది రోజులెళ్లిపొయ్యాయి. కుమార్సామి ఇంటిమీదికి వొత్తాడేమోనని మనసులో బితుకుబితుకుమంటన్నా పైకి నిబ్బరంగా ఉంటానికి పెయత్నిత్తున్నాడు సామ్మూర్తి.
ఆ రోజు మజ్జాన్నం మొగుడూ పెళ్లాలు అన్నాల కాడ కూకోబోతన్నారు.
“ఏవయ్యా సామ్మూర్తీ” అన్న కేక, ఇంటి బయట్నించి. అది మామూలు కేక కాదు. అది మామూలు గొంతూ కాదు. బీరకాయ కూరతో అన్నం కలుపుకొని, ముద్ద జేత్తన్నాడు సామ్మూర్తి. ఇంకా ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదు నోట్లో.
Bathiki ....Po (600x435)
“సరిగ్గా టయ్యానికి వొచ్చేశాడే దొంగనాయాలూ” అని, “నేను మాట్టాడొత్తా. నువ్వు తింటుండు” పెళ్లాంతో చెప్పి కంచం కాణ్ణించి లేచాడు.
“ఈ మడిసికి యేళాపాళా ఉండదా. నువ్వు కూకో. కాసేపాగి రమ్మని సెప్పొత్తా” అంటా లేవబోయింది జెయమ్మ.
“ఏం జేత్తన్నావ్ పెద్ద మనిషీ.. లోనా” అంటా పంచాలోకి వొచ్చాడు కుమార్సామి.
“ఇప్పుడే అన్నానికి కూకుంటన్నాం సామీ. వొత్తన్నానుండు” అంటా గబగబా దొడ్లోకి పొయ్యి చేతులు కడక్కొచ్చాడు సామ్మూర్తి.
“ఎట్టా తినబుద్దేత్తందయ్యా కూడు. నాకియ్యాల్సిన బాకీ డబ్బులు ఇయ్యకుండా కూడెట్టా సయిత్తందనీ. నిద్రెట్టా పడతందీ అంటా?” గట్టిగా అరిచాడు కుమార్సామి. ఆయబ్బి కేకలు చుట్టుపక్కలాళ్లకి ఇనిపిత్తన్నాయి. ఇనిపిచ్చాలనే అట్టా అరవడం కుమార్సామికున్న గుడిసేటి గుణం. ఊహ తెలిసినాక ఎప్పుడూ ఎవరికాడా ఇట్టాంటి మాటలు పడని సామ్మూర్తికి ఇది శానా అవుమానంగా అనిపిత్తంది. కుమార్సామి మాటలు బరిసెల మాదిరిగా గుండెల్లో గుచ్చుకున్నాయి.
“సామీ ఎందుకట్టాగా నోరు పారేసుకుంటన్నావ్. నేను బాకీ డబ్బులు కట్టనని సెప్పానా. నా ఇబ్బంది సెప్పుకుని, మళ్లా నోటు రాయిమన్నా కదా. నేనెట్టాంటోణ్ణో నీకు తెల్వదా. ఎంత కాలం నించి నీకు పాటలు కడ్తన్నానో తెల్వదా. వొడ్డీ డబ్బులు ఆపకుండా కడ్తానే వొత్తున్నాగా. ఆమాత్రం ఆగలేవా?” కొంచెం గట్టిగానే మొదలుపెట్టి, చివరికొచ్చేతలికి బతిమిలాడతన్నట్టు అడిగాడు సామ్మూర్తి.
“ఏందోయ్ మాటలు రేగుతున్నాయే. నేను నీకు బాకీ పడ్డానా. నువ్వు నాకు బాకీపడ్డావా? నేను నోరు పారేసుకుంటన్నానా? కడుపుకి కూడు తింటన్నావా, గడ్డి తింటన్నావా? అంత రోషమున్నోడివి టయ్యానికి నా బాకీ డబ్బులు  కట్టెయ్యాలి గదా. ఇత్తే నేను నీ ఇంటిదాకా ఎందుకొత్తాను? నా టైమెందుకు వేస్టు జేసుకుంటాను? వొడ్డీ డబ్బులు కట్టేత్తే అయిపోద్దా. అసలు డబ్బుల సంగతేంది? మీ అయ్యిత్తాడా?” పెద్దగొంతుతో రంకెలేశాడు కుమార్సామి.
సామ్మూర్తికి నోట్టోంచి మాటలు పెగల్లేదు. ఆ యబ్బికి సిగ్గుగా ఉంది. అవమానంగా ఉంది. చుట్టుపక్కల జనాలు ఇళ్లలోంచి బయటకొచ్చి సోద్దెం సూత్తనేతలికి ఆయబ్బికి తల కొట్టేసినట్టుగా ఉంది. తలెత్తి అట్టా ఇట్టా సూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది.
సామ్మూర్తి మౌనంచూసి మరీ రెచ్చిపొయ్యాడు కుమార్సామి. “కూతుళ్ల పెళ్లిచెయ్యగానే సంబడం కాదు. బాకీ కట్టాలన్న ఇంగిత గేనం కూడా ఉండాలి” అన్నాడు. సామ్మూర్తి వంశాన్నంతా తిట్టాడు. మజ్జమజ్జలో బూతులు కూడా. ఆడ జెయమ్మ కూడా ముద్ద నోట్లో పెట్టుకోలేకపొయ్యింది.
“ఆకర్సారి సెబ్తున్నా. వొచ్చే నెల్లోగా బాకీ మొత్తం కట్టేత్తే సరి. లేపోతే నీ ఇంటి కాయితాలు నాకాడ పెట్టుకుంటా” అని గర్జించి యెళ్లిపొయ్యాడు కుమార్సామి.
ఆయబ్బి యెళ్లిపొయ్యినా సామ్మూర్తి తలొంచుకొని కదలకుండా మెదలకుండా కొయ్యలా అట్టాగే నిల్చుండిపొయ్యాడు. తల్లో సుత్తుల్తో కొడతన్నంత బాధ. గుండెల్లో బరిసెలు గుచ్చుతున్నంత నెప్పి. జెయమ్మ వొచ్చి “ఏందయ్యా అట్టా రాయిలా నించున్నావ్” అని కుదిపి కదిపేదాకా అట్టాగే ఉన్నాడు.
పెళ్లాంవొంక జూశాడు సామ్మూర్తి. ఆయబ్బి మొహంలోని ఆలోచనలూ, కళ్లల్లోని నీళ్లూ ఆమెకి తెలిశాయి. మొగుణ్ణెప్పుడూ అట్టా సూడలేదామె.
“ఊరుకోయ్యా. ఆ సామి సంగతి తెలీందా. దా. బువ్వ తిందూగానీ” అంది బుజంమీద సెయ్యేత్తా.
‘ఆకలి సచ్చిపొయ్యిందే’ అందామనుకున్నాడు. ఆమె కూడా బువ్వ తినని సంగతి గేపకమొచ్చింది. మూగోళ్లా యెల్లి కంచంముందు కూకున్నాడు. నాలుగు మెతుకులు గెతికాడు.
ఆ రోజంతా యెట్టానో గడిచింది ఆ ఇద్దరికీ. మొగుడికి దైర్నం సెప్పాలని సూసింది జెయమ్మ. సామ్మూర్తి “ఆ.. ఊ..” అంటన్నాడే గానీ మనసెక్కడ్నో ఉంది. మగ్గాలోకెళ్లి ‘వాటు’ యేత్తన్నాడే గానీ అందులో ఉషారు లేదు. నాడి తగులుకొని పోగులు తెగుతున్నాయి.
“ఈ పూటకి లేచిరాయ్యా. మనసు బావోలేనట్టుంది” అంది జెయమ్మ. లోసొచ్చి నులకమంచం మీద పడుకున్నాడు.
పెద్దకొడుకు ఇంటిమీదికొచ్చి కుమార్సామి గొడవ జేసెళ్లాడని చిన్నకొడుకు కాడున్న ఓబులుకి తెలిసింది. వొచ్చాడు. మజ్జింటో నులకమంచం మీద కళ్లు మూసుకొని పడుకోనున్న కొడుకుని సూశాడు.
కుమార్సామి ఎన్ని మాటలన్నాడో, ఏం కూతలు కూశాడో సెప్పింది కోడలు.
“వొరే సాంబూ. ఆ కుమార్సాంగాడు ఏవేవో అంటంటాడు. ఆడి సంగతి మనకు తెలీందేముంది. నువ్వు దిగులు పెట్టుకోమాక. ఏదో ఓటి సేద్దాంలే” అని దైర్నం సెప్పాలని సూశాడు ఓబులు.
ఏదో గొణిగాడు సామ్మూర్తి. ఓబులుకి అదేందో సరిగా ఇనిపించలేదు. అయినా ఇనిపించినట్టే ఏందని అడగలేదు. ఆ రేత్రి మామూలు రేత్రిలా లేదు. ఆ సంగతి జెయమ్మకి కూడా బాగా తెలుత్తోంది. పక్కన నులకమంచం కిర్రుకిర్రుమంటా సప్పుడు సేత్తంది మాటిమాటికీ. అంటే మొగుడు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాడన్న మాట. ఆమె మనసులో దిగులూ, భయమూ.. రెండూ ముసురుకున్నాయి. ఎందుకో గుండెలో గిలిగా ఉంది. దడగా ఉంది. ఆమెకు ఏ అర్ధరేత్రో నిద్రపట్టింది.
తెల్లారింది. రోజూ తెల్లారినట్లు లేదు ఆ తెల్లారడం. భయంకరంగా తెల్లారింది. భీతిపుట్టేలా తెల్లారింది. ఐదున్నరకి లేచింది జెయమ్మ. పక్కన మొగుడు లేడు. ఐదింటికే లేచి, తలుపు దెగ్గిరగా యేసి, చెంబు తీసుకొని రైలుకట్టకాడికి పోతాడు కాబట్టి అట్టాగే పొయ్యాడనుకుంది.
జుట్టు ముడేసుకుంటా దొడ్డి తలుపు తీసింది. ఆమైనే ఒక్కసారిగా ఒళ్ళు జలదరిచ్చిపొయ్యింది. ఎదురుగా ఏదో నల్లగా ఆకారం, గాల్లో యేళ్లాడతా ఉంది. ఇంకా యెల్తురు పూర్తిగా రాలేదు. జెయమ్మ కళ్లు నులుంకుంటా సూసి గావుకేక పెట్టింది. ఆ కేక ఉంత భయానకంగా ఉందో! యేపసెట్టుకి యేలాడ్తన్న ఆ ఆకారం సామ్మూర్తిది. కంటిగుడ్లు పైకి పొడసకొచ్చి, నాలికి బయటకొచ్చి…
*     *     *
“నిన్నిట్టా ఊరకే వొదిలేత్తే ఇంకెంతమంది పేణాలు తీత్తావో, యెంతమంది ఉసురు పొసుకుంటావో. నువ్వు పోతేగానీ ఈ పేటకి పట్టిన శనీద్రం పోదురా కుక్కా” అంటా కుమార్సామి జుట్టు పట్టుకున్నాడు ఓబులు.
గడగడా వొణికిపొయ్యాడు కుమార్సామి.
‘ఐపోయింది. ఈ ముసలాడి సేతిలో నాకు మూడింది’ అంది ఆయబ్బి మనసు.
“అయ్యా. మా ఆయన్ని ఏం సెయ్యమాకు. ఆయన సెడ్డోడు నిజిమే. ఇకనుంచీ దుర్మార్గం పనులు సెయ్యకుండా నే సూస్కుంటాగా. నన్నూ, నా పిల్లల్నీ అన్నేయం సెయ్యమాకు. నీకు దణ్ణం పెడ్తన్నా. నీ కాళ్లు మొక్కుతన్నా” అని కాళ్లు పట్టేసుకుంది కుమార్సామి పెళ్లాం.
ఆమొంక సూశాడు ఓబులు. తడిగా ఉన్న ఆయమ్మి కళ్లూ.. భయమూ, దిగులూ కలిసిన మొహమూ.. ఆయబ్బిలోని జాలిపేగుని కదిలిచ్చాయి. సప్పున ఓబులు గుండెలో దయ మొలకలెత్తింది.
“రేయ్ సామిగా. నిజ్జింగా నిన్ను నరికి పోగులుపెట్టి మన పేటకి దాపురిచ్చిన పీడని వొదిలిద్దామనే వొచ్చాన్రా. కానీ నీ పెళ్ళాం పిల్లల్ని సూసి వొదిలేత్తన్నా. ఆడదాని వొల్ల బతికిపొయ్యావ్ పోరా కొడకా. రేయ్. ఒక్కటి మాత్రం గేపకం పెట్టుకో. ఈసారి ఎవురింటి మీదకైనా వొచ్చి గోలసేసినట్టు తెల్సిందా.. అక్కడ్నే పాతేత్తా నాయాలా. ఇదుగోమ్మా.. నీక్కూడా సెబ్తున్నా. నువ్ సెప్పిన మాట నిలబెట్టుకోకపొయ్యావో.. ఇంకోసారి.. నీకిట్టా బతిమాలుకొనే అవకాశం కూడా ఇయ్యను. ఛీ.. నీదీ వొక బతుకేనట్రా” అని ఖాండ్రించి కుమార్సామి మొహాన ఉమ్మేశాడు ఓబులు.

-బుద్ధి యజ్ఞమూర్తి

 

ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?

 

గుడిపాటి వెంకటాచలం తన రచనల ద్వారా సమాజంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్త్రీలోకంలోనైతే ఆయన విప్లవమే తెచ్చారు.
ఆయన రచనల అండగా తెలుగు సమాజంలోని స్త్రీలు ప్రశ్నించడం నేర్చుకున్నారు. సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడారు. విజయాలు సాధించారు. చలం ప్రభావం పాజిటివ్‌గానైనా, నెగటివ్‌గానైనా పడని రచయిత ఒకప్పుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి చలానికి నాటకీయ సన్నివేశాలు, కృతక సంభాషణలతో నిండివుండే సినిమాలంటే ఏవగింపు. మరి అదే చలం సినిమాకి పని చేయాల్సి వస్తే ఏం చేస్తాడు? సంభాషణలు రాయాల్సి వస్తే ఎలా రాస్తాడు?
కథల్లో కానీ, నవలల్లో కానీ చలం సృష్టించిన పాత్రలను చూస్తే, అవి మాట్లాడుకోవడం చూస్తే – కృతకంగా కాక సహజంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వ్యావహారంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నట్లే అనిపిస్తాయి. రచనల్లో గ్రాంథిక భాష రాజ్యం చేస్తున్న కాలంలో చలం భాష, చలం శైలి ఆకర్షణలో, మాయలో కొట్టుకుపోయారు జనం. పదాలతో, శైలితో అంతటి గారడీ చేసిన చలం 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా కథనీ, సంభాషణల్నీ రాసిన తీరు అద్వితీయం!
స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్ల ముందు వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా తెలుగునాట పెను సంచలనమే కలిగించింది. బ్రాహ్మణాధిపత్యం పూర్తిగా చలామణీ అవుతున్న కాలంలో, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలంలో బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని సవాలు చేస్తూ, అస్పృశ్యతను ధిక్కరిస్తూ, అణగారిన కులాలకు అండగా నిలుస్తూ ‘మాలపిల్ల’ అనే పేరుతో ఒక సినిమా రావడమంటే మాటలా! దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సంకల్ప బలానికి చలం సునిశిత కలం తోడైతే వచ్చే మహోన్నత ఫలం ‘మాలపిల్ల’ కాకుండా మరొకటి ఎలా అవుతుంది!!
https://www.youtube.com/watch?annotation_id=annotation_3277241873&feature=iv&src_vid=4h26GRojjfY&v=v_dz61Nz8_8
మనం ఇప్పుడు ‘మాలపిల్ల’ కథ గురించి కాక, అందులోని సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోబోతున్నాం. ఆ సినిమాకి ముందు వచ్చిన సినిమాల్లోని సంభాషణలకూ, ‘మాలపిల్ల’ సంభాషణలకూ పొంతననేది కనిపించదు. టాకీ యుగం ప్రారంభమైన కాలంలో అప్పటి నాటకాల భాషలోనే సినిమాల సంభాషణలు నడిచాయి. ఆ భాషను ‘మాలపిల్ల’ భాష సమూలంగా మార్చేసింది. నిజానికి ‘మాలపిల్ల’ తర్వాత వచ్చిన కొన్ని సాంఘిక సినిమాల సంభాషణలు పాత వాసనలోనే నడిచాయి. ఐతే అతి త్వరలోనే ‘మాలపిల్ల’ సంభాషణలకు లభించిన ఆదరణను రచయితలు అందుకోక తప్పలేదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా ఆ చిత్రంలోని సంభాషణలను చలం నడిపించిన తీరు అనన్య సామాన్యం.
‘మాలపిల్ల’లో నీళ్లకోసం చెరువు వద్దకు వచ్చిన మాలలను బ్రాహ్మణుల నాయకత్వంలోని అగ్ర కులాల వాళ్లు అడ్డుకుంటారు. నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదని కట్టడి చేస్తారు. అదే సమయంలో పెద్ద వర్షం మొదలవుతుంది. మాలలు తడుస్తూ సుందరరామశాస్త్రి ఇంటి ముందుకు వస్తారు. వారిలో నాగాయ్ అనే యువకుడు “బాపనోళ్లది ఎప్పుడూ తిని కూర్చునే ఖర్మ. మాలోళ్లది ఎప్పుడూ బువ్వలేక మలమలమాడే ఖర్మ.. గుళ్లో కూర్చుని సుఖంగా ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాలపల్లిలోకి వచ్చి మా కష్టాలు తీరుస్తాడా?” అంటాడు. ‘మాటల తూటాలు’ అంటే ఇవే కదా. అగ్ర వర్ణాలు – నిమ్న వర్ణాల మధ్య, ఉన్నోళ్లు – లేనోళ్ల మధ్య తేడాని రెండంటే రెండు ముక్కల్లో ఎంత శక్తిమంతంగా చెప్పాడు చలం! ఈ విషయంలో దేవుడినీ వదల్లేదు. దేవుడు కూడా పెద్ద కులాలవైపే ఉన్నాడని సూటిగా ఆ పాత్రతో చెప్పించాడు.
index
‘నేనున్నంత కాలం గ్రామంలో కుల ధర్మాలకు ఏమాత్రం విఘాతం రానివ్వన’ని శాస్త్రి బీష్మించినప్పుడు మాలల నాయకుడు మునెయ్య అంటాడు – “మీరు చెరువు కట్టేశారు. దాన్ని విడవండి. ధర్మయుద్ధం చెయ్యండి. అంతేకానీ మాకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం మీకు బోధించిందో మాకు తెలీదు. మా పిల్లల్నీ, ఆడాళ్లనీ మాడ్చారా, మీ పిల్లలూ, ఆడాళ్లూ క్షేమంగా ఉండరు. మమ్మల్ని మృగాల కింద నొక్కిపట్టారు. అవును. మృగాలమే. చేసి చూపిస్తాం. జాగర్త.” అని హెచ్చరిస్తాడు. తమకు నీళ్లివ్వకుండా చెరువు కట్టేసి అధర్మయుద్ధం చేస్తున్నారని తేల్చేసిన మునెయ్య, తమకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం బోధించిందో చెప్పమని అడుగుతున్నాడు. అంతేనా, తమని మృగాలకింద తొక్కిపెడితే, నిజంగా మృగాలమవుతామని హెచ్చరిస్తున్నాడు. అంటే తిరగబడతామని చెబుతున్నాడు. అగ్ర వర్ణాల అకృత్యాల వల్ల, నిమ్న కులాలు ఎట్లా యాతనలు అనుభవిస్తున్నాయో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టే మాలల తరపున ఉండి ఆ మాటలు పలికించాడు చలం.
‘మాలపిల్ల’ టైటిల్ రోల్ చేసింది – తెలుగు సినిమా తొలి స్టార్ హీరోయిన్ కాంచనమాల. ఆమె పాత్ర పేరు శంపాలత. ఆమె మునెయ్య కూతురు. సుందరరామశాస్త్రి కొడుకు నాగరాజు (వెంకటేశ్వరరావు)కూ, ఆమెకూ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ మునెయ్యకి దొరికిపోతారు. “అయ్యా మీరు పెద్దలు. మీ కులంలో ఆడోళ్లు లేరా. మురికోళ్లు, అంటరానోళ్లు.. ఈ పిల్లలెందుకు కావాల్సొచ్చారు నాయనా. మేం అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే. ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు. వీళ్లకి ఉన్నదల్లా ఒక్కటే. అది శీలం. దాన్నీ దోచుకోవాలా! ధనం, అధికారం, సుఖం చాలవేం? వెర్రిపిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకుని, మెరిపించి, మాయమాటలు చెప్పి నమ్మించాలని చూశారూ. శాస్త్రులవారి వంటి మహాత్ముల కుమారులు చెయ్యదగ్గ పనికాదు” అంటాడు మునెయ్య. తన కథల్లోని శైలి తరహాలోనే ఈ సినిమాలోని సంభాషణలనూ గొప్ప లయతో నడిపించాడు చలం. కేవలం మనం చలం సమ్మోహన శక్తిని శైలికే పరిమితం చెయ్యడం పొరపాటు. ఆయన సంభాషణా శిల్పం కూడా అసాధారణం. ఇన్ని దశాబ్దాల తర్వాత, ఇవాళ్టి సినిమాల్లో ఎంతమంది రచయితలు ఇలాంటి శైలితో, ఇలాంటి శిల్పంతో సంభాషణలు రాయగలుగుతున్నారు?
అప్పటికింకా నాగరాజుకు, శంపాలతకు తమ మధ్య ప్రేమ పెనవేసుకుంటున్నదనే సంగతి తెలీదు. స్నేహమైతే ఏర్పడింది. అంతలోనే మునెయ్యకు దొరికారు. నాగరాజును అపార్థం చేసుకున్న మునెయ్య.. చెడుబుద్ధితోనే అతను శంపకు చేరువవుతున్నాడని తలచాడు. ఒక పెళ్లికాని అమ్మాయి తండ్రి ఎలా స్పందించాలో అలాగే స్పందించాడు మునెయ్య. పైగా నాగరాజు సాక్షాత్తూ తమని మృగాల కింద భావించే శాస్త్రి కొడుకు. కరడుకట్టిన దురాచారవాది కొడుకు. తామా తక్కువ కులంవాళ్లు. దుర్బలులు. శంపని లోబరచుకోవడానికి మాయమాటలు చెప్పి దగ్గరవుతున్నాడని సంశయించాడు మునెయ్య. అలాంటి స్థితిలో అతని నోటినుంచి ఎలాంటి మాటలు వస్తాయి? ఎంత శక్తివంతంగా వస్తాయి? ఆ సందర్భానికి తగ్గట్లు మునెయ్య నోటినుంచి వచ్చిన మాటల్ని ఇంతకంటే శక్తివంతంగా, ఇంతకంటే సమర్థవంతంగా ఎవరు రాయగలరు?
‘మాలపిల్ల’లో మాలలకు దన్నుగా చౌదరి నాయకత్వంలోని ‘హరిజన సేవాసంఘం’ నిలుస్తుంది. మాలలను మృగాలుగా పెద్ద కులాలు చూస్తుంటే, కాదు, వాళ్లూ అందరిలాంటి మనుషులేనని సంఘం వాదిస్తుంటుంది. మాలల పక్షం వహిస్తే కమ్మ కులాన్నుంచి వెలేస్తామని ఒకతను చౌదరిని బెదిరిస్తాడు. దానికి చిన్నగా నవ్వి “కులం.. వెలి.. మా కులం హరిజన కులం. వాళ్లతో నీళ్లు త్రాగి, వాళ్లతో పరుండటమే మా నిత్య కృత్యం” అని చెప్పిన చౌదరి “రండి. మాలగూడేనికే పోదాం. మాలల్లో మాలలమై మాలలూ మనుషులేనని లోకానికి చాటుదాం” అంటూ సంఘ సభ్యులతో అక్కడికే వెళ్తాడు. ఆ పాత్రచేత అలా చెప్పించిన చలం నిజ జీవితంలో బ్రాహ్మణ సమాజం తనను వెలేస్తే, మాలపల్లెల్లోనే నివసించిన సంగతి గమనించదగ్గ విషయం.
Mala Pilla_C53242-83C451
ఈ కథలో శంపకు చేదోడు వాదోడుగా ఉండే పాత్ర అనసూయ. ఆమె శంప చెల్లెలే. చిన్నదైనా అక్కకి సలాహాలు, ధైర్యం ఇవ్వగల గడుగ్గాయి. తెలివైంది. శంపను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు, ఆమెని వెతుక్కుంటూ బయలుదేరతాడు. మార్గంలో అనసూయ కనిపిస్తే శంప గురించి ఆమెని అడుగుతాడు. ఎందుకని ప్రశ్నిస్తుంది అనసూయ. “నేను శంపాలతను పెళ్లి చేసుకుంటాను” అంటాడు రాజు. అనసూయ పెద్దగా నవ్వుతుంది. ఆరిందాలా “పెళ్లి? పెళ్లి? మాలపిల్లని? మీకు మతిపోయినట్టుంది” అంటుంది. దాంతో “మీ చిన్నికృష్ణుని పాదాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను” అని చెబుతాడు రాజు (చిత్రంలో శంప, అనసూయ కృష్ణభక్తులు). అప్పుడు అనసూయ ఏమనాలి? ఏ ఇతర రచయితైనా అనసూయతో ఎలాంటి మాటలు పలికిస్తాడు? కచ్చితంగా చలం పలికించినట్లు “ఎక్కడి మాటలు లెండి. మీ నాన్నగారు గుండెపగిలి చావరూ? మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మలు” అని పలికించలేడు. 76 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలోని పాత్రల చేత ఇలాంటి సునిశితమైన, బాకుల్లాంటి మాటలు పలికించడం ఒక్క చలానికే సాధ్యం.
మాలలకు నీళ్లివ్వకుండా చేసి, వాళ్లు నీళ్ల కోసం అలమటించేలా చేస్తున్నందుకు నిరసనగా మాలలంతా చౌదరి నాయకత్వంలో అగ్ర కులాల వారి పొలం పనులకు, ఇతర పనులకు వెళ్లకుండా సమ్మెకట్టారు. ఆ పనులకు పొరుగూళ్లనుంచి మనుషులు రాకుండా చూశారు. దాంతో చౌదరి వాళ్లతో ఒకసారి మాట్లాడమని శాస్త్రికి చెబుతాడు ఆయనకు అనుయాయిగా ఉండే మల్లికార్జున శర్మ. శాస్త్రి కోపంతో ఊగిపొయ్యాడు. “పోండి. పోండి. అందరూ పోండి. నా కొడుకే నాకు ఎదురు తిరుగుతున్నాడు. నేనొక్కణ్ణే ఏకాకినై నిలుస్తాను. రానీ మాలల్ని. నా ఇంటిచుట్టూ మూగి నా అగ్నిహోత్రాల్ని మలినం చెయ్యనీ. నా వంటలో గోమాంసాదులు వెదజల్లనీ. పూర్వం రాక్షసులు  రుష్యాశ్రమాల్ని ధ్వంసం చెయ్యలా. నేనే నిలుస్తాను. ఆ శ్రీరామచంద్రుడే ఉంటే మళ్లా నా ఇంటికొచ్చి కావలి కాస్తాడు. నాకెవ్వరితోనూ నిమిత్తం లేదు నాయనా. పోండి” అంటాడు.
వర్ణ భేదాల్ని నిక్కచ్చిగా పాటిస్తూ, కరడుకట్టిన బ్రాహ్మణిజానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే సుందరరామశాస్త్రి అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటాడు కానీ ఆచారాలనూ, కట్టుబాట్లనూ వదులుకుంటాడా? తమ అవసరం కోసం బెట్టుని వదిలి మెట్టు దిగుతాడా? మాలలతో రాజీకి వస్తాడా? అలాంటి స్థితిలో ఉన్న శాస్త్రి నోటివెంట ఇలాంటి మాటలు కాకుండా వేరేవి ఎలా వస్తాయి? ఆద్యంతం శాస్త్రి పాత్ర తీరుకు తగ్గట్లు (ఇదే మాట అన్ని పాత్రలకూ వర్తిస్తుంది) చలం రాసిన మాటలు ఆ పాత్రకి వన్నె తెచ్చాయి. చలం మాటల్ని శాస్త్రి పాత్రలో గోవిందరాజుల సుబ్బారావు పలికిన తీరు అసామాన్యం. డైలాగులు పలకడంలో, ఆ పలికేప్పుడు హావభావాలు ప్రదర్శించడంలో ఎస్వీ రంగారావుని మించిన నటుడు లేడని మనవాళ్లు అంటుంటారు. అయితే ఆయనకటే ముందు అలాంటి నటుడు ఒకరున్నారనీ, ఆయన గోవిందరాజుల సుబ్బారావనీ ఒప్పుకోక తప్పదు. ‘కన్యాశుల్కం’లో లుబ్దావధాన్లుగా ఆయన నటనని మరవగలమా? ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, తొలి తరం ప్రేక్షకులు ఇప్పుడంతగా లేరు కాబట్టి ఆయన గురించి చెప్పుకునేవార్లు లేకుండా పోయారు. అందుకే ఆయనకు రావలసినంత పేరు రాలేదు.
మాటల రచయిత చలం

మాటల రచయిత చలం

శంపాలతనూ, అనసూయనూ తీసుకుని కలకత్తా పారిపోయాడు నాగరాజు. దీంతో ఇటు శాస్త్రి కుటుంబం, అటు మునెయ్య కుటుంబం దిగాలుపడ్డాయి. శంపాలతను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నానని తండ్రికి ఉత్తరం రాశాడు రాజు. ఆగ్రహంతో ఊగిపోయిన శాస్త్రి తనకసలు కొడుకు పుట్టలేదని అనుకుంటాననీ, పుట్టినా చచ్చిపొయ్యాడనుకుంటాననీ చౌదరితో అన్నాడు. ఆవేశపడకుండా ఆలోచించమన్నాడు చౌదరి. మనుషుల్లో విభజన ఏ శాస్త్రంలో ఉందో చూపించమన్నాడు.
“మేనమామ కూతుర్ని వదిలి మాలపిల్లను వివాహం చేసుకున్నాడంటే దాన్ని తేలిగ్గా చూస్తున్నారు కానీ అది సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ, ఉదార స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ఏరి? ఎందరుంటారు అలాంటివాళ్లు? కామానికి లొంగేనండీ, ఎంగిలి బతుకులు బతుకుతూ ఎంతమంది లేరు ఈ దేశంలో. అమాయకురాళ్లను వలలో వేసుకున్నవాళ్లు ఎందరు లేరు? చేరదీసినదాన్ని పెండ్లి చేసుకుని తన పేరును, తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగినవాళ్లు ఎందరు? వెయ్యిమందిలో ఒక్కడుంటాడో, ఉండడో. ఆ ఒక్కడే మనిషి. తక్కినవాళ్లంతా నీచులు. వారే సంఘద్రోహులు. నిజమైన అస్పృశ్యులు. అలాంటివాళ్లంతా మనలో ఉన్నారు. మనతో తిరుగుతున్నారు. మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పులేదు. మాలలనంటితేనే తప్పు. మీరేమన్నా అనండి. నాగరాజు ధన్యుడు. వారడ్రస్ తెలీదు కానీ అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు చెప్పేవాణ్ణి” అన్నాడు చౌదరి.
గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు చౌదరి చేత పలికించిన ఈ మాటల ద్వారా రెండు ప్రయోజనాలు సాధించాడు చలం. ఒకటి – ఒక ‘మాలపిల్ల’ను వివాహం చేసుకోవడం ద్వారా బ్రాహ్మణుడైన నాగరాజు చేసింది చాలా గొప్ప పని అని చెప్పడం, రెండు – సంఘంలో పైకి పెద్ద మనుషులుగా, మర్యాదస్తులుగా చలామణీ అవుతూ చాటుమాటుగా పరాయి స్త్రీలతో వ్యవహారాలు నడిపేవాళ్లను ఎండగట్టడం. ఈ రోజుల్లో కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాలు సాధారణమయ్యాయి కానీ, ఆ రోజుల్లో అలాంటివి గొప్ప పనులే. తక్కువ కులం అమ్మాయిని ప్రేమించి ధైర్యంగా పెళ్లి చేసుకున్నవాడే మనిషనీ, అమాయకురాళ్లను వలలో వేసుకుని ఎంగిలి బతుకులు బతుకుతున్నవారంతా నీచులనీ, వారే సంఘద్రోహులనీ, నిజమైన అస్పృశ్యులనీ చౌదరిచేత చెప్పించాడు చలం. అలాంటి వాళ్లంతా మనతో తిరుగుతూ మర్యాదలు పొందుతున్నారని ఎండగట్టాడు. నిజానికి ఆ మాటలు పలికింది చౌదరి కాదు. చలమే. అవి అచ్చంగా చలం భావాలే.
ఇవాళ్టి సినిమాల్లోనూ ఈ తరహా డైలాగులు రాయగల రచయిత ఒక్కడైనా ఉన్నాడా? మరి దురాచారాలు, కట్టుబాట్లు అధికంగా రాజ్యం చేస్తున్న కాలంలో ‘మాలపిల్ల’ వంటి సినిమా రావడం పెద్ద సాహసం, గొప్ప విషయమైతే, అందులో బ్రాహ్మణాధిపత్య సమాజానికి సూటిగా, బాణాల్లా తగిలే పదునైన సంభాషణలు రాయడం ఇంకెంత సాహసం, ఇంకెంత గొప్ప విషయం! నేటి సినీ రచయితలు తప్పకుండా అధ్యయనం చెయ్యాల్సిన సినిమా ‘మాలపిల్ల’ అయితే, అందులోని సంభాషణలు వారికి మార్గదర్శకమయ్యే గొప్ప పాఠాలు!!
-బుద్ధి యజ్ఞ మూర్తి
261374_585952121417138_1370360100_n