ఎంత స్థానికత వుంటే అంత సార్వజనీనత!

 

కవి నందిని సిద్దారెడ్డి తో  కోడూరి విజయ కుమార్   సంభాషణ

ప్రశ్న:  ఇంత దూరం ప్రయాణించిన తరువాత, సాహిత్య రంగంలో ఇంకా చాలా పనులు చేసి వుండవలసింది అన్న అసంతృప్తి ఏమైనా వుందా ?

జవాబు: ఏ సృజనకారునికైనా తృప్తి అనేది ఉంటుందని అనుకోను. అందుకు సిద్దారెడ్డి కూడా మినహాయింపు కాదు. వాస్తవానికి, కవిత్వానికి సంబంధించినంతవరకూ నాకు లభించిన పేరు విషయంలో కొంత తృప్తి వుంది. అయితే, ఇంకా చాలా వ్రాసి వుండవలసింది అన్న ఒక అసంతృప్తి కూడా వుంది. కథల విషయానికి వొస్తే, నేను వ్రాసిన కొన్ని కథల విషయంలో నవీన్, అల్లం రాజయ్య లాంటి మిత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఆగిపోయాను. అయితే, ఒక్క భావజాలానికే పరిమితం కాకుండా వ్రాయవలసిన కథలు వున్నాయని అనిపిస్తుంది. ఉదాహరణకు, నా హీరో మా నాన్న గురించిన కథలు, అట్లానే నేను పుట్టి పెరిగిన మా ఊరు బందారం గురించిన కథలు కూడా వ్రాయాలని వుంది.  నేను పాటలు వ్రాయగలను. చాలా పాటలు  వ్రాసి వుండవలసింది అన్న ఒక అసంతృప్తి కూడా వుంది. కేవలం ఉద్యమకాలంలో వ్రాసిన పాటలనే కాదు. ఒక ఉదాహరణ చెబుతాను. ‘జై బోలో తెలంగాణ’ సినిమా కోసం శంకర్ ఒక ప్రేమగీతం వ్రాయమని ఒత్తిడి చేసినపుడు ‘నేను ఇప్పుడు లవ్ సాంగ్ వ్రాయడం ఏందని’ చాలా వారించిన. చివరికి ఆ పాట ‘ ఒక పువ్వు – ఒక నవ్వు’ బయటికి వొచ్చింది. చాలా పాపులర్ కూడా అయ్యింది. అప్పుడు అనిపించింది … ‘జీవితం లోని చాలా అనుభూతులను నేను పాటలుగా వ్రాసి వుండవలసింది గదా’ అని. దీనికి కొనసాగింపుగా ఒక సంఘటన కూడా చెబుతాను. ఒకసారి అకినేపల్లి బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి కే సి ఆర్, రమణాచారిలతో పాటు నేను, దేశపతి వెళ్తున్నాము. మాటల మధ్యన ఈ పాట  ప్రస్తావన వొచ్చినపుడు  కే సి ఆర్ అన్నారు -‘ ఒక్క విప్లవ గేయాలకే పరిమితం కావడం వల్ల మిగతావి కోల్పోయిన అన్న బాధ ఏమి లేదానే’  అని. నేను ఏదో చెప్పబోతే ‘లేదే – నువ్వు రాయగలవు’ అన్నడు! ఒక్క కవిత్వం, కథలు, పాటలు అనే కాదు. ఒక నవల వ్రాయాలన్న కోరిక కూడా వున్నది.

ప్రశ్న: ఆధునిక తెలుగు వచన కవిత్వం తెలంగాణ కవులను నిజంగానే చిన్న చూపు చూసిందా ?

జవాబు: అవును. ఆధునిక తెలుగు కవిత్వం తెలంగాణ కవులను చిన్న చూపు చూసింది. అసలు పట్టించుకోవడం అంటే ఏమిటి? కవిత్వ విమర్శా వ్యాసాలలో తెలంగాణ కవులకు కవిత్వానికి తగిన చోటు ఇవ్వడమే కదా! ఆ కోణంలో చూసినపుడు ఆధునిక తెలుగు వచన కవిత్వం తెలంగాణ కవులను చిన్న చూపు చూసింది అన్న మాట నిజమే కదా! ‘చేరాతలు’ లాంటి విమర్శా వ్యాసాలలో తెలంగాణ కవులకు దక్కిన చోటెంత? తెలంగాణ లోని లబ్దప్రతిష్టులైన కవులకు సైతం చేకూరి రామారావు లాంటి విమర్శకులు వ్రాసిన వ్యాసాలలో చోటు దక్కలేదు. ఇక కడియాల రామ్మోహన రాయ్ లాంటి విమర్శకులైతే తెలంగాణ కవుల కవిత్వం గురించి వ్రాయడం మాట అటుంచి, తెలంగాణ ఉద్యమ కవిత్వం పట్ల కనీస సహ్రుదయతని కూడా చూపలేదు. ఇంతెందుకు? దళిత కవిత్వమే తీసుకుందాము. చాలా మంది కోస్తా దళిత కవుల కన్నా ముందుగా సలంద్ర ‘దళిత మ్యానిఫెస్టో’ కవిత వ్రాసాడు. మరి, దళిత కవిత్వం పైన వొచ్చిన వ్యాసాలలో సలంద్ర కు న్యాయంగా ఇవ్వవలసిన స్థానాన్ని యిచ్చారా ?

ప్రశ్న: తెలంగాణ కవిత్వం అంటే తెలంగాణ భాషలో వ్రాసింది మాత్రమే అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు చూసినపుడు తెలంగాణ భాష ఒకే రకంగా లేదు కదా! ఇందులోనూ, పల్లెల భాష – పట్టణ భాషలలో భేదాలు కనిపిస్తాయి కదా!

జవాబు: కేవలం క్రియా వాచకాలకు సంబంధించిన కొన్ని పదాలను వాడి, దానిని తెలంగాణ కవిత్వం అనడం సరికాదు. అదే సమయంలో, ఒక నేలకు సంబంధించిన వేదననూ, దుఃఖాన్నీ కవిత్వం చేస్తున్నపుడు, ఆ నేలకు చెందిన భాష, పదజాలం అనివార్యంగా ఆ కవిత్వంలోకి వొస్తుంది. అట్లా వొస్తేనే ఆ కవిత రక్త మాంసాలతో తొణికిసలాడుతుంది. సార్వజనీన వస్తువు, సార్వజనీన వేదన అంటూ వుండవు. ఉదాహరణకు భారత దేశం మొత్తాన్నీ రిప్రేసెంట్ చేసే రైతు ఉండడు. ఎందుకంటే, కోస్తా రైతు దుఃఖం, తెలంగాణ రైతు దుఃఖం ఒకటి కాదు. తెలంగాణ నేల పైన నిలబడి రైతు దుఃఖం గురించి కవిత్వం చెబుతున్నావంటే, ఆ రైతు తెలంగాణ రైతే ఐ వుండాలి. ఆ కవిత స్థానికతకు ఎంత దగ్గరగా వుంటే అంతగా సార్వజనీనం అవుతుంది.

ప్రశ్న: మీ కవిత్వంలో తొలినుండీ తెలంగాణ భాషకు సంబంధించిన పదాల వాడుక చాలా విరివిగా కనిపిస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా జరిగిందా?

జవాబు: లేదు. నాకు నేను పుట్టి పెరిగిన నేల మీది భాష అన్నా, ఆ మాటలు అన్నా ఒక ప్రేమ.  వ్యామోహం అనడం సమంజసమేమో! అందుకే, ఆ వేదనని కవిత్వం చేసినపుడు ఆ నేటివ్ మాటలు విరివిగా వాడడం వల్ల ఆయా కవితలకు ఒక గొప్ప శక్తి వొస్తుందని నమ్మి వ్రాసేవాడిని. అయితే, ఆ తరువాత అట్లా వాడడం పైన వొచ్చిన విమర్శల పైన కసితో ఆ మాటలని మరింత ఎక్కువగా ఉపయోగించాను.             

ప్రశ్న: తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కవిత్వమంతా ఉద్యమమే ఆక్రమించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ కవిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు మున్ముందు ఏముంటాయని ఊహిస్తున్నారు ?

జవాబు: సృజనకారుడైన కవికి ఉద్యమం అనేది ఒక భాగం మాత్రమే! సృజనకారుడు గడిపే జీవితం, అతని చుట్టూ వున్న వాళ్ళు గడిపే జీవితం అతడి నిరంతన సృజనకు దోహదపడుతాయని అనుకుంటున్నాను. ఉదాహరణకు, తెలంగాణలో ఇంకా సాహిత్య సృజన లోనికి తీసుకుని రావలసిన జీవితం చాలా వుంది. తెలంగాణ ఉద్యమం విషయమే తీసుకుంటే, ప్రజలు ఎన్నో కలలతో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. సహజంగానే రేపటి కాలంలో కవులు, రచయితలు ఈ కలల సాధన గురించిన రచనలు చేస్తారు. ఇవి ఒక్కటే కాదు. తెలంగాణలో చిద్రమౌతున్న మానవ సంబంధాల గురించీ, కనుమరుగవుతోన్న కుల వృత్తుల గురించీ కూడా విరివిగా రచనలు వస్తాయని అనుకుంటున్నాను.

 ప్రశ్న: తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య పునరుజ్జీవనానికి ఎట్లాంటి కార్యక్రమాలు రూపొందించే అవకాశం వుంది? పైరవీలకు తావు లేని నిజమైన ప్రతిభకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లభిస్తుందని ఆశించవచ్చా ?

జవాబు: భారతదేశంలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం. కాబట్టి, పైరవీలకు తావు ఉండదని అనుకోవడం అత్యాశే! కాకపోతే, ఏది ఎట్లా వున్నా తెలంగాణ వాళ్ళకే గుర్తింపు లభిస్తుంది. ఇక తెలంగాణ లో సాహిత్య పునరుజ్జీవనానికి కార్యక్రమాలు అంటావా …. అట్లాంటిది జరగాలంటే, ముందుగా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సాహిత్య వికాసానికే అంకితమై వుండే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర సాహిత్య అకాడెమీ ఏర్పాటు అని చెప్పలేను గానీ, అట్లాంటి ఒక వ్యవస్థ. సమైక్య రాష్ట్రంలో ఒకప్పుడు వున్న రాష్ట్ర సాహిత్య అకాడెమి విషయంలో ఎన్ని ఫిర్యాదులు వున్నా, అది కొన్ని మంచి పనులు చేసింది. చాలా పుస్తకాలు ప్రచురించింది. తెలుగు నిఘంటువు కూడా ప్రచురించింది. ఇంతెందుకు? అప్పుడు రాష్ట్ర సాహిత్య అకాడెమి ఇచ్చే పురస్కారాలకు కూడా ఎంతో కొంత గౌరవం వుండేది. ఇప్పుడు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారాలు ఇస్తున్నా వాటికి అప్పటి గౌరవం వుందా? పైగా, అది విశ్వావిద్యాలయం కావడం వలన, దానికి వున్న సవాలక్ష విధులలో సాహిత్య సేవ అనేది ఒకానొక విధిగా మాత్రమే మిగిలిపోతోంది. సాహిత్యానికి సంబంధించి పురస్కారాలు ఇవ్వడం వరకు మాత్రమే తెలుగు విశ్వవిద్యాలయం పాత్ర కుదించుకు పోయింది. అటువైపు కేరళ సాహిత్య అకాడెమీ, ఇటువైపు కర్ణాటక సాహిత్య అకాడెమీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు, ఆయా భాషలకు, సాహిత్యాలకూ అవి చేస్తోన్న సేవలనీ పరిశీలించినపుడు సాహిత్యానికే అంకితమైన ఒక వ్యవస్థ వుంటే ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో అర్థం అవుతాయి. అట్లాంటి వ్యవస్థ వున్నపుడు, తెలంగాణ సాహిత్యాన్ని ప్రజల చేరువకు, మరీ ముఖ్యంగా యువతీ యువకుల చేరువకు తీసుకు వెళ్ళడం సాధ్యపడుతుంది.

ప్రశ్న: తెలంగాణ పల్లెలు పోలీసు క్యాంపుల్లా మారిన కాలంలో గానీ, మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో గానీ తెలంగాణ దుఃఖం పైన అక్షరం ముక్క కూడా వ్రాయని కవులు, రచయితలు ఇవాళ తెలంగాణ ఏర్పడిన తరువాత ఉన్నత పురస్కారాల కోసం, పదవుల కోసం ఎంపిక కాబడుతున్నారని కొందరు తెలంగాణ వాదుల ఫిర్యాదు. సిద్దారెడ్డి లాంటి కవులు ఎందుకు నోరు విప్పడం లేదని కూడా ఒక ఫిర్యాదు!

జవాబు: తమ రచనలనూ, సృజననూ నమ్ముకోవడం కన్నా ప్రచారం ద్వారా, పైరవీల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకునే కవులు, రచయితలూ అప్పటి రోజుల లోనూ వున్నారు. పెద్ద పురస్కారాల కోసం కవులనూ, రచయితలనూ నామినేట్ చేసే అధికార యంత్రాంగం ఒకటి వుంటుంది. సహజంగానే, ఆ యంత్రాంగం దగ్గరికి తమ సృజనను నమ్ముకుని తమ పని తాము చేసుకు పోయే వాళ్ళు ఎవరూ వెళ్ళరు. సిద్దారెడ్డి ప్రస్తుతం ఆ అధికార యంత్రాగం లో భాగం కాదు. అందువల్ల ఆ పేర్ల ఎంపిక కార్యక్రమం లో సిద్దారెడ్డి భాగం కాదు. ఇక కవి సిద్దారెడ్డిగా అంటావా …. ఇక్కడ మన సాహిత్య లోకంతో ఒక చిక్కు వున్నది. అర్హత లేని వాళ్ళ పేర్లు అత్యున్నత పురస్కారాలకు ప్రతిపాదించబడినపుడు ఏదైనా కామెంట్ చేస్తే, ‘ తన పేరు ప్రతిపాదించలేదు కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నాడు’ అని బద్నాం చేస్తారు. అయితే, ఎంపికలో నా పాత్ర వున్నపుడు అర్హులకు పురస్కారాలు లభించేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను.

ప్రశ్న: మీరు కవిత్వం వ్రాయడం ఆరంభించిన కాలంతో పోల్చుకుని చూసినపుడు, ఇప్పటి కవిత్వ వాతావరణం ఎట్లా వుందని అనిపిస్తోంది?

జవాబు: నిజానికి చాలా మంది ప్రతిభావంతులు కనిపిస్తున్నారు. అయితే, అప్పటి తరం కవులు విపరీతంగా అధ్యయనం చేసేవారు. ఒక మంచి కవితల పుస్తకం పట్టుకుంటే, రోజుల తరబడి దాంట్లో మునిగిపోయి వుండే వాళ్ళు. అట్లాంటి వాతావరణం ఇప్పుడు లోపించినట్లుగా వుంది. అంతేకాదు- ఇదివరకు ఒక కవిత వ్రాసి చర్చకు పెడితే, అందరూ మొహమాటం లేకుండా అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడందరికీ మొహమాటాలు ఎక్కువయ్యాయి. కవులలో డిప్లమసీ ఎక్కువయ్యింది. నొప్పించే మాట ఏదైనా చెబితే ఈ సంబంధం ఏమైనా చెడిపోతుందేమో అన్న బెంగ కనిపిస్తోంది. నేను గమనించిన మరొక అంశం ఏమిటంటే, ఇప్పుడిప్పుడే వ్రాస్తోన్న వాళ్ళు కూడా తమ రచనలను ప్రమోట్ చేసుకోవడం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. సాటి కవులతో, రచయితలతో కలవడం, సంభాషించడం బాగా తగ్గిపోయింది. ఎక్కడైనా కలిసినా పేస్ బుక్ కోసమో, వాట్సాప్ కోసమే ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు.

ప్రశ్న:  పురస్కారాలకు వ్యతిరేకి ఐన సిద్దారెడ్డి ఈ పురస్కారం తీసుకోవడం ….. ?

జవాబు: ఒకట్రెండు సందర్భాలలో ఆయా పురస్కార ప్రదాతలతో నాకున్న ఆత్మీయ అనుబంధం వల్లనే ఒప్పుకున్నాను. ఉదాహరణకు ఈ పురస్కారం ఇస్తోన్న యాకూబ్ వ్యక్తిగతంగా నాకు ఆత్మీయుడు. ఆర్నెళ్ళ కిందటే ‘అన్నా మీరు తప్పకుండా తీసుకోవాలే‘ అన్నడు. ఎట్ల కాదనటం ?

*

భూమి స్వప్నాన్ని శ్వాసించిన తెలంగాణ కవిత్వం

10177289_10203107554362740_688223332954052141_n

నిజాయితీగా చెప్పాలంటే, తెలంగాణ కవిత్వం గురించి నాలుగు మాటలు సాధికారికంగా వ్రాసే శక్తి నాకు లేదు. జూన్ 2 వ తేదీన, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పడబోయే సందర్భంగా, జూన్ 1 వ తేదీ రాత్రి 9 గంటల నుండి రాష్ట్ర ఆవిర్భావ ఘడియల వరకు కొనసాగేలా తెలంగాణ కవి గానం ఒకటి, మిత్రులు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాలులో ఏర్పాటు చేస్తున్నారు. ఒక కవిత్వ విద్యార్థిగా, తెలంగాణ లోని వరంగల్ అనే ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా, తెలంగాణ కవిత్వం నన్నెలా చుట్టుముట్టిందో, తెలంగాణ కవిత్వాన్ని నేనెట్లా అర్థం చేసుకున్నానో క్లుప్తంగా చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం ఈ వ్యాసం!    

హైదరాబాద్ రాష్ట్రంలో సజీవంగా వున్న తెలుగు కవిత్వం ఊసు లేకుండా వెలువడిన ‘వైతాళికులు’ సంకలనానికి జవాబుగా సురవరం ప్రతాప రెడ్డి వెలువరించిన ‘గోల్కొండ కవులు’ కాలం నుండి, ‘ఇప్పుడు తెలుగు కవిత్వం అంటే తెలంగాణా కవిత్వమే’ అన్న కాలం దాకా ‘తెలంగాణా కవిత్వం’ చేసిన ప్రయాణం అబ్బుర పరుస్తుంది. మరి, ఆ శక్తి తెలంగాణ కవిత్వానికి ఎవరిచ్చారు? నిస్సందేహంగా, తెలంగాణ జీవితమే తెలంగాణ కవిత్వానికి ఆ శక్తిని ఇచ్చింది. తరాలుగా కొనసాగుతోన్న తెలంగాణ తండ్లాట తెలంగాణ కవిత్వానికి ఆ ఆత్మను ప్రసాదించింది.

కొన్ని వందల ఏళ్ళ పాటు సాంస్కృతిక, ఆర్ధిక దోపిడీకి గురయిన తెలంగాణ, తనను తాను విముక్తం చేసుకోవడం కోసం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సాయుధ పోరాటంలోకి దిగింది. ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ఎక్కడ మొదలైనా పాటే వాటి మొదటి ఆయుధం. తమ శ్రమనీ, తమ శ్రమని దోచుకునే వాళ్ళ మోసాలనీ మరిచిపోయెందుకు సామాన్యులు పాటనే ఆసరా చేసుకున్నారు. తెలంగాణ కవులు కూడా పాటనే ఆశ్రయించారు. ‘బండెనక బండి కట్టి’ అని ఆగ్రహించినా, ‘పల్లెటూరి పిల్లగాడా’ అని దుఃఖించినా, పాటే తెలంగాణ కవిత్వ మాధ్యమం అయింది.

వచన కవిత, కథ, నవల లాంటి సాహితీ ప్రక్రియలు ఐరోపీయ దేశాల నుండి దిగుమతి చేసుకున్నవి. బ్రిటిష్ పాలన లో వున్న కారణంగా, ఇంగ్లీష్ చదువుకూ, సాహిత్యానికీ చేరువైన అప్పటి మదరాసు రాష్ట్రం లోని తెలుగు సాహిత్య సృజనకారులు ఆ ప్రక్రియలలోకి సహజంగానే ప్రవేశించగలిగారు. అయితే, ఉర్దూ చదువు, అది కూడా కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన సమాజం లాంటి పరిమితులు ఉన్నప్పటికీ తెలంగాణ కూడా ఆ సాహితీ ప్రక్రియలలోకి ప్రవేశించింది.

 

//2//

సుదీర్ఘ కాలం పీడనకు గురి కావడం వలన, తెలంగాణ జీవితం లో సహజంగా వున్న ‘సామూహికత’ లక్షణం వలన, తాము స్వీకరించిన ఆధునిక సాహితీ ప్రక్రియలలో కూడా ప్రజా పోరాటాలని ప్రధాన వస్తువుగా చేసుకుని, తమ ప్రజల భాషలో వ్యక్తీకరించారు తెలంగాణ కవులు. పీడితులెప్పుడూ స్పష్టంగానే మాట్లాడతారు. అందుకే, మాటలకు అనవసరమైన పూతలు పూసి, మెరుపులు అద్ది ఆ మాటల వెనుక దాక్కోవడం లాంటి శుద్ధ కళా నైపుణ్యాలు తెలంగాణ కవులు ఔపోసన పట్టలేక పోయారు. అందుకే, పాటలో ధ్వనించే స్పష్టత తెలంగాణా కవితలోనూ ధ్వనిస్తుంది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కవి పలికింది అందుకే!

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భారత దేశ స్వాతంత్ర్యం, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణం తదనంతరం తెలంగాణ కవి, కవిత్వ భాషకు సంబంధించి, కవిత్వ వ్యక్తీకరణలకు సంబంధించి కొత్త పరీక్షలను ఎదుర్కొన్న కాలం. స్వాతంత్ర్యమైతే వొచ్చింది గానీ, ఊళ్ళల్లో ఇంకా కొనసాగుతోన్న దొరల పెత్తనం, అప్పుడప్పుడే యూనివర్సిటీ చదువులు చదువుతున్న తెలంగాణా కవిని ఆందోళనకు గురి చేసింది. అందుకే, 1969 లో ఉధృతంగా వొచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గణనీయమైన స్థాయిలో కవిత్వాన్ని సృష్టించలేక పోయింది. దాదాపు అదే కాలంలో తెలంగాణ లోకి అడుగిడిన నక్సలైటు ఉద్యమాలు, దానికి ముందే ఆవహించిన శ్రీ శ్రీ కవిత్వం, తెలంగాణ కవిని విప్లవ కవిత్వం వైపు నడిపించాయి.

దరిదాపు 80 ల వరకూ, ‘తెలంగాణ కవి అంటే విప్లవ కవి’ అన్నంతగా తెలుగు సాహిత్యం లో ఒక ముద్ర పడి పోయింది. ఇక్కడ గమనించ వలసిన అంశం ఏమిటంటే, ఈ కాలంలో కూడా తెలంగాణ కవులు, దొరల పెత్తనం కింద, పోలీసు క్యాంపుల కింద నలిగిపోయే తన ఊళ్ళ గురించే కవిత్వం రాసారు. ఆ కవిత్వం కూడా, ఏ అర్థం లేని / అవసరం లేని రూపకాల చాటునో కప్పి పెట్టకుండా సాగింది. తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా, ఇట్లాంటి విప్లవ కవిత్వం రాయడం ద్వారా తమను తాము ప్రజా ఉద్యమాలలో మమేకమైన వాళ్ళుగా చూసుకున్నారు తెలంగాణ కవులు!

ఎనభైలలో వొచ్చిన స్త్రీ, దళిత వాదాలు, ‘అందరూ కలిసి చేసే పోరాటం లోనే అందరి విముక్తి ‘ అన్న విశ్వాసం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించి, అస్తిత్వ ఉద్యమాలను మొదలు పెట్టాయి. కాస్త అటూ ఇటూగా అదే సమయంలో, తెలంగాణ లోని కొందరు బుద్ది జీవులు, ‘తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు – అది వెనుకకు నెట్ట బడిన ప్రాంతం’ అన్న స్పృహను తెలంగాణ సమాజంలోకి ప్రవేశపెట్టారు. తదనంతర కాలంలో, ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష’ రాజకీయ రూపం తీసుకుని, తెలంగాణ తెలుగు భాషకు జరుగుతోన్న అవమానం, సంస్కృతి పట్ల అవహేళన, వనరుల దోపిడీ మొదలైన అనేక అంశాలను ఆధారాల సహితంగా చర్చకు పెట్టడం మొదలు పెట్టడం ప్రారంభించారు.

 

//3//

ఇట్లా మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత, తెలంగాణ కవిత్వం గొప్ప సౌందర్యంతో వెలిగిపోయింది. తెలంగాణ కవిత్వం, ఎట్లాంటి శషభిషలూ లేకుండా తన జీవ భాషతో పలికింది. సరళం గానే ఉంటూ, గంభీరమైన అంశాలను స్పృశించింది. దాపునే నది పారుతున్నా, ఫ్లోరోసిస్ బారిన పడుతోన్న తన ఊళ్ళ దుఃఖాన్ని పలికింది. వందల ఏళ్ళు పదిలంగా దాచుకున్న తన భాష ని గేలి చేయడాన్ని సవాలు చేస్తూ పలికింది. తనకే ప్రత్యేకమైన తన పండగల సౌందర్యాన్ని పలికింది. మొత్తంగా, తెలంగాణ కవిత్వం తెలంగాణ జీవితాన్ని ఆవాహన చేసుకున్నది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాటే ఆకాశంలోని సూర్యుడిలా వెలిగిపోయినా, పాట వెలుగు స్పృశించ లేని వేదనని తెలంగాణ కవిత్వం స్పృశించింది. ‘మత్తడి’, ‘పొక్కిలి’, ‘మునుం’ లాంటి బృహత్ సంకలనాలు ఇందుకు దాఖలా ! ఇదే సమయంలో ఒక వైపు తెలంగాణ ఆకాంక్షకు మద్దతు తెలుపుతూనే, రేపటి తెలంగాణ లో తమ అస్తిత్వాన్ని నిలిపుకోవాలనుకునే తెలంగాణ దళిత, బహుజన, ముస్లిం ల ఆకాంక్షని కూడా తెలంగాణ కవిత్వం వ్యక్తం చేసింది. బహుశా, ఈ కాలంలో వెలువడిన తెలంగాణ కవిత్వాన్ని కొంతమేర ఆఫ్రికన్ కవిత్వంతో పోల్చి చూడవోచ్చునేమో!

ముఖ్యంగా, 2009 లో ప్రకటన చేసి, కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళిన తరువాత పెరిగిపోయిన యువకుల ఆత్మహత్యల నేపథ్యంలో వెలువడిన తెలంగాణ కవిత్వం ప్రత్యేకమైనది. వాళ్ళ ఆత్మ త్యాగాలను చూసి దుఃఖించింది. అట్లాంటి యువకులకు ధైర్యం చెప్పింది. వికృత క్రీడలతో తెలంగాణ ప్రకటనలతో ఆడుకున్న రాజకీయాల పట్ల ఆగ్రహం ప్రకటించింది.

ఆగ్రహానికి, దూషణకి సంబంధించి, 2009 ముందు వరకూ దాదాపుగా పరోక్ష ప్రస్తావనలకే పరిమితమైన తెలంగాణ కవిత్వం, ఆ తదనంతర కాలంలో ప్రత్యక్ష ప్రస్తావనలలోకి దిగింది. ఈ కాలంలో వెలువడిన ఒకానొక సంకలనానికి పేరు ‘క్విట్ తెలంగాణ’ !

ఇక ఇప్పుడు తెలంగాణ వొచ్చింది. తెలంగాణ ప్రకటించిన రోజున తెలంగాణ కవులు గొప్ప ఉత్సవ సంరంభంతో కవిత్వం రాసారు. నెరవేరిన తమ ప్రజల ఆకాంక్షలని, అమరులైన యువకుల త్యాగాలను శ్లాఘిస్తూ కవిత్వం చెప్పారు. ఇక ఇక్కడి నుండి తెలంగాణ కవిత్వం ప్రయాణం ఎటువైపు?

చరిత్రని చూస్తే అర్థమయే విషయం – తెలంగాణ కవులు ఎప్పుడూ తమ భూమి పుత్రుల వైపే వున్నారు. తమ భూమి స్వప్నాన్నే తమ కవిత్వంలో శ్వాసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ కవులు, స్టేట్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతీ కాలంలోనూ ‘యాంటీ-స్టేట్’ గానే వున్నారు. తెలంగాణ ఉద్యమాల వారసత్వంగా వొచ్చిన ఆ జీవ లక్షణం కొనసాగుతుందనే అనుకుంటున్నాను. అదే సమయంలో, తెలంగాణ కవిత్వం, కొంగొత్త రూపాలతో వెలువడుతూ ముందుకు సాగుతుందనీ ఆశ పడుతున్నాను –

 

-కోడూరి విజయ కుమార్

vijay