ఇంకేం రాయనూ ?

 

 

11 ఏళ్ల క్రితం మా అమ్మ (వైజాగ్ లో) చనిపోయినప్పుడు ఈ ఉత్తరాన్ని కృష్ణాబాయిగారు హైదరాబాద్ నుండి నన్ను ఓదారుస్తూ రాశారు . మళ్లీ ఇన్నాళ్ళకు ఈ ఉత్తరాన్ని టైప్ చేస్తుంటే గుండె బరువెక్కి , అమ్మ మరణం కళ్ళలో మెదిలి మెదడు మొద్దుబారి పోయింది. బహుశా అప్పట్లో వర్మ, మధు (ఆకాశవాణి ) వంటి మిత్రుల తోడు , కృష్ణాబాయి, రంగనాయకమ్మ , కె. వరలక్ష్మి , ప్రతిమ గార్ల ఉత్తరాలే నన్ను ఆ బాధనుండి కొంత విముక్తుణ్ణి చేసాయనుకుంటా. కృష్ణాబాయిగారికి ప్రణమిల్లుతూ – గొరుసు
………………………….

Date: 26.02.05

జగదీశ్వర రెడ్డికి ,

బాగున్నావా అని ఎలా అడగను? ఇంత vaccum కష్టమే .
 

నిన్ను పొగడ్డానికి రాయడం లేదని నీకూ తెలుసు. తల్లి మాత్రమే బిడ్డకి చేయగలిగినట్టు , అనితరసాధ్యంగా , అమ్మని చూసుకున్నావ్ . ఎవరితో పోల్చడానికీ లేదు . నీకెంతో ఇష్టమయిన పనుల్నీ, అభిరుచుల్నీ పక్కకి పెట్టి మరీ చూసుకున్నావ్ . తల్లీ బిడ్డా సంబంధమే కాదు, మానవతా దృక్పధమ్ తో , గొప్ప మనసుతో అమ్మని చూసుకున్నావ్ . నీకు చేతులెత్తి నమస్కరిస్తా నెప్పుడూ మనసులోనే . ఒకటి రెండుసార్లు పద్మినితో అన్నాను కూడా – చేపల కూర చేసి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళాలమ్మా ఎప్పుడో అని . ఆమె “ఆ వాసనున్నా చాలురా ” అన్న మాట నన్ను కుదిపేసింది , కాని మేం చేప వండనూ లేదు, నేను తేనూ లేదు .
ఒక్క ఊరిలో ఉండి , అనుకుని కూడా ఆమెని ఒక్క సారన్నా చూడని నా మీద నాకే చికాగ్గా ఉంది .
 

“60 ఏళ్ళు దాటిన వాళ్ళెవరి నైనా చూడాలను కుంటే వెంటనే వెళ్లి చూడాలి, ఆలస్యం చేయ కూడదు” అనేవాడు ప్రసాదు – BN రెడ్డి గారిని చూద్దామనీ వెళ్ళలేక పోయినందుకు . దిక్కుమాలిన ఒత్తిడీ, టైమ్ సెట్ చేసుకోలేక పోవడమూ ఫలితం ఇది .
ఇది నిన్ను ఓదార్చడానికి కాదు, నన్ను నేను మందలించు కోడానికే .
 

రాత్రి గాంధీ చెప్పాడు – వర్మ చేసాడని . ప్రతిమతో మాట్లాడా .
 

ఎలా ఉన్నావో నిన్ను ఒక్కసారి చూడాలి . మన మిత్రులందరూ నీ చుట్టూ ఉన్నారనుకో . నేను ఓదార్చ గలిగింది మాత్రం – ఇంత దూరాన్నుంచీ – ఏముంది?
అమ్మ – ఘోరమైన హింసనుంచి విముక్తు రాలయింది . అది తృప్తిగా మిగలాలి నీకు .
 

ఇంకేం రాయనూ ?
 

– కృష్ణాబాయి

సౌందర్యమంతా సంద్రమై..

1_Sripathi Letter

             శ్రీపతి,     బి-22  రవీంద్రనగర్,    హబ్సిగూడా,      హైద్రాబాదు – 500 007

                                                                                      డిసెంబర్ 30, 1988

 

ప్రియమైన త్రిపుర గారూ,

 

నమస్కారం.  కొత్త సంవత్సరం కధా కాంక్షలు !

ఈ మధ్య కధలు చదువుతున్నాను.  కొంత వరకు వరదరాజేశ్వర రావు గారు  కారణం.

మార్తాండం ( శ్రీనివాస్ రాయప్రోలు )  పెంగ్విన్ వాళ్లకు కధలు అనువాదం చేస్తున్నాడు.

మీకు నచ్చిన కొన్ని కధలు ఇవ్వండి అని పని అప్పజెప్పారు. దాంతో కధా సంపుటాలన్నీ తిరగేసినప్పుడు మిత్రులు అత్తలూరి ఇచ్చిన ‘త్రిపుర కధలు’ చదవటం – మరోసారి జరిగింది.

అట్లాంటి కధలు చదివినప్పుడల్లా, ఆ రచనల్లోని సృజనాత్మక కళాసౌందర్యం సముద్ర ప్రమాణంలో ప్రత్యక్షమై ఆ సంతోషంతో తన్మయులం అయిపోతాము.  నాకు దొరికిన కొద్ది కధలు ఆయనకు అందజేశాను.  వాటిలో మీ ‘జర్కన్’ కధ ఆయనకు నచ్చి దాన్ని అనువాదం చేసారు.  ఆ సందర్భంగా మీ వివరాలు తెలుసుకుని ఎంతో ఆసక్తి చూపించారు.

త్రిపుర, అజంతా, రాయప్రోలు శ్రీనివాస్ – ఒక కోవ కళాకారులనిపించింది.  వారం దినాల క్రితమే అజంతా దర్శనం అయిందిక్కడ.  ఈ సరికి ఆయన విశాఖ లోనే ఉండాలి.

నా వరకు కధా రచన కొనసాగింపు మొదలయినట్టే అనిపిస్తోంది. ఢిల్లీ   నేపధ్యంలో ఓ చిన్న నవల ప్రస్తుతం మెల్లగా సాగుతోంది. నాలుగైదు  కధలు – తిప్పి రాసి – పత్రికలకు ఇవ్వాలనుకుంటున్నాను.  పాత కధలు పునర్ముద్రిస్తుంటే సిగ్గొచ్చి కొత్త కధలు రాయాలనిపిస్తోంది.

మీ ఆరోగ్యం బాగుందా?  జవాబు రాస్తే సంతోషం.

 

మీ

 

శ్రీపతి

2_Sripathi Letter

ఉత్తరం: రెండు మనసుల సంగమం!

     

  -గొరుసు

~

(ఉత్తరాలు – చేత్తో రాసుకున్న ఉత్తరాలు- ఎప్పటికీ చెరిగిపోవు జ్ఞాపకాల్లోంచి! అవి జ్ఞాపికలు గతానికి, నిన్నటి విలువలకీ, తపనలకీ, బంధాలకీ! అవి ప్రముఖులు రాశారా, ఆత్మీయ మిత్రులు రాశారా  వ్యక్తిగతంగా రాశారా అందరి  కోసం రాశారా అన్నది కాసేపు పక్కన పెట్టండి. ఇదిగో ఇదీ  జీవితం ఇవీ  ఆలోచనలు ఇదీ నా  లోపలి అలజడి అనే ప్రతి  ఉత్తరమూ  ఇక్కడ ప్రస్తావించ దగిందే…ఆత్మీయంగా తలచుకోవాల్సిందే..అలాంటి ఉత్తరాలకు  ఆహ్వానం. ఉత్తరం స్కాన్ ఫోటో, యూనికోడ్ లో తిరిగి టైప్ చేసిన ప్రతీ రెండూ పంపండి. ప్రముఖ కథకుడు  గొరుసు జగదీశ్వర రెడ్డి  ఈ  వారం  ఈ లేఖాయణానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే వారం…?!)

~

                                 Gorusu     ‘నీ చూపులు తుమ్మెద బారులు కట్టి

నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి

వీథి  వీథి నంతా మేల్కొలుపుతున్నాయి

వీథి వీథి నంతా కలియ చూస్తున్నాయి

అడుగో – పోస్ట్ మాన్!’

పై మాటలు తిలక్ ఎవరికోసం రాశారో కాని…అన్వయించుకుంటే నా గురించేనేమో అనిపిస్తుంది. అచ్చంగా అలాగే పోస్ట్ మాన్ కోసం నా చూపులు తుమ్మెద బారులయ్యేవి. టెలిఫోన్ తో పాటు, అంతర్జాలం నా జీవితంలోకి చొచ్చుకు రానంత కాలం అదొక అద్భుత నిరీక్షణ పర్వం. ఉత్తరాల్లో మనసు విప్పుకున్న మధుర గడియలు ఎన్నెన్నో.

ఉత్తరం: రెండు మనసుల సంగమ కూడలి; లింగ భేధమెరుగని పరిష్వంగ కేళీ వినోదం. రెండు వందల పై చిలుకు మిత్రులు – ఎవరి ఉత్తర బాణం ఏ దిశ నుండి నా గుండెను తాకబోతోందనేది ఓ ఉత్కంఠ . చదివిన అక్షరాలనే మళ్ళీ మళ్ళీ చదివి భావోద్రేకంతో చెంపలు చెలమలయ్యేవి.

మనిషికి తిక్క ఎప్పుడైనా పుడుతుంది కదా – అలా పుట్టినప్పుడు గాలి పువ్వులై శూన్యంలోకి ఎగిరిపోగా అటకెక్కినవి  దాదాపు వెయ్యి లేఖలు. వాటిలోంచి రెండు ఉత్తరాలు ఏరడమంటే మెదడు మోకాల్లోకి జారింది. చివరకు జ్యోతిష్యం చెప్పే చిలకలోకి పరకాయ ప్రవేశం చేసి ముక్కుతో లాగక తప్పింది కాదు.

సరిగ్గా 40 ఏళ్ల క్రితం, నూనూగు మీసాల నా  యౌవ్వన ప్రాయంలో పరిచయమైన కలం మిత్రుడు ప్రదీప్. ఆయన రాసే ఉత్తరాలు అర్ధం చేసుకునే స్థాయి నాకప్పటికి లేకపోయినా మేకపోతు గాంభీర్యంతో సాహిత్యాన్ని వడబోసినట్టు జవాబులు రాసేవాన్ని. చివరికి నాకేమీ తెలియదని నిర్ధారించుకుని…అలా…అలా…అలా…పొగమంచులా అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో మరి!

 

__

pradeep -3

secunderabad

27th Dec, ‘76

23.20hrs

వెల్! జగదీశ్వర్ గారూ,

మీ ఉత్తరం చూసి నవ్వు వచ్చింది. నా చేతి రాత బావుందేమో కాని… నేను మాత్రం మీరూహిస్తున్నట్లు ‘ఎంతో అందంగా’ లేను. అయినా రాత ఎప్పుడూ మనిషి స్వభావాన్ని తెలియజేస్తుంది గానీ, భౌతిక రూపాన్ని కాదు. మరో సంగతి, స్త్రీలకూ అందం ఉంటే అందమేనేమో కాని పురుషులకు శక్తిసామర్ధ్యాలు, అన్న మాట నిలుపుకోవటం, నీతి నిజాయితీ లనే ఆత్మసౌందర్యమే అందం. స్త్రీలకూ ఆత్మ సౌందర్యంతో పాటు సౌకుమార్యమే అసలైన అందం. ఇక తెలుపు నలుపు, కనుముక్కు తీరు ఇవన్నీ ‘అందానికి ప్రకృతి దిద్దిన తుదిమెరుగులు’. ఏవంటారు?

ఇంకా… మీ ఉత్తరంలో “నేను హృదయస్పందనకే ప్రాధాన్యతనిస్తాను కాని బాహ్య సౌందర్యానికి కాదు” అని చదివి కాస్త ఆలోచనలో పడ్డాను. ’స్పందన’ అనే చోట సౌందర్యం ఉండాలేమో?

అసలు స్పందన అంటే ఏమిటి? ”తాము ఆరాధించే గుణగణాలు మొదటిసారిగా, తమకు తెలియకుండానే ఎదుటి వారిలో (అంటే స్త్రీలు పురుషుల్లో, పురుషులు స్త్రీల్లో) దర్శించినపుడు ‘ఉవ్వెత్తున లేచి పడే కెరటం’ లాంటి ఉద్వేగపూరితమైన భావానుభావమే స్పందన’. అద్భుతమూ, అనిర్వచనీయమూ అయినా ఈ అనుభవం మనస్సుపై ముద్రించే ఆనవాలు శాశ్వతమై తలచుకొన్నప్పుడల్లా మనసును పరవశింపచేస్తుంది.

ఓ మూడు నాలుగు సంవత్సరాల క్రితం చదివిన, ‘బసవరాజు అప్పారావు’ గారి గేయం జ్ఞాపకం ఉన్నంత వరకు (చాలా వరకు కరక్టే) రాస్తున్నాను చూడండి.

దేహమున  బుల్కలివి  సందేహమేల

భారమైనది హృదయము బ్రతుకుపైన

మనుట కొరకయి పుట్టిన మనుజు నెడద

తీయతీయని తలపులు ప్రేయసి గద

ఎవ్వరితెవు దేవీ?!! నన్నీ లీల విలపింప

జేతువు సుంతైన కరుణ లేక???…

చివురుటాకుల దిన్న కూజిత రవమ్మే

మధుర మధుభాషిణీ కంట రవమ్ము

ఎప్పుడో విన్న గుర్తుగా నిపుడు విందు

నీదు నడకల కవ్వింపు నాట్య బర్హిపద

నేర్పరులరయ ఎక్కడో కన్నగుర్తుగా

నిపుడు గందు! ఏల దేవీ నన్నీ లీల

విలపింపజేతువు సుంతైన కరుణ లేక

తెలుపుమీ ‘………..’ ఏలనో!!!

ఇలాంటి గేయాలు చదివినప్పుడు హృదయాంతరాల్లో చెలరేగే భావానుభూతిని ఏమని వర్ణించగలం. కళ్ళల్లో చిలికే రెండు కన్నీటి చుక్కలు తప్ప ఈ అద్భుతమైన భావనను పైకి చెప్పటానికి ఏభాషలోనూ తగిన పదజాలం లేదేమో! నిర్మలమైన స్నేహం, మమతామమకారం, ఆత్మీయతానురాగాలు…ఓహ్!…వీటిని పొందగల్గటం ఎంత అదృష్టం. కాని ఒక్కోసారి అనిపిస్తూంటుంది, భరించరాని ఒంటరితనంలో మగ్గిపోతున్న నేను, నేను కోరే ఈ స్నేహ మాధుర్యం గూర్చి ఎంతో గొప్పగా ఊహించుకుంటూ ఈ స్వార్ధపూరిత ప్రపంచంలో నిజంగా అలాంటి మమతానురాగాలు ఉన్నాయనుకుని మోసపోతున్నానా? నో! నెవ్వర్!! అలా జరగటానికి వీల్లేదు. …దైవమే నిజమైతే ఈ నిర్మల స్నేహానుబంధాలుకూడా నిజమే. కాని…భగవద్దర్శనం ఎంత దుర్లభమో, ఈ మధురమూ, మహత్తరమూ అయిన నిర్మల స్నేహ సంబంధాలు ఆప్యాయతానురాగాలు పొందటం కూడా అంత కష్టతరమే.

మననుండి ఏదో అందకుండా చేసి భగవంతుడు మనని ఏడిపిస్తాడు అనిపిస్తుంది. మన జ్ఞానం, విజ్ఞానం కూడా భగవంతుడి అనుమతి మేరకు పరిమితమై ఉంటాయేమో! మనుషులు వట్టి మూర్ఖులు తెలుస్తూనే భ్రమలో పడతారు.

ప్చ్! ఇలా మనసు విప్పి చెప్పుకుంటే ఎన్ని పేజీలైనా రాయొచ్చు…గాని…ఆ…మీరు లెటర్ పాడ్ పంపమని రాశారు కదూ, తప్పకుండా పంపుతాను. కాని బహుశా వారంలోగా టర్మ్ హాలిడేస్ మొదలైతాయేమో!? రిజిష్టర్ పోస్టులో పంపితే, ఏ అడ్రసుకు పంపాలో రాయండి.

త్వరలో మీ అభిప్రాయం రాస్తారు కదూ!

మరిక ఉండనా…

ప్రదీప్ కుమార్