చెప్పులో ముల్లులాంటి భాషలో…!

 

 maakuOkaBhashaKaavaaliByWilsonSudhakar

(గత వారం తరువాయి)

నిర్భయ మరణంతో చలించి ఒకేసారి ‘గుడ్‌బై ఇండియా’ వీడ్కోలు నిర్వేదం. ఈ దేశంలో స్త్రీలపై జరిగే దాడులనీ, వేదనలనీ, రోదనలనీ సాహిత్య రూపంగానో లేకపోతే మంచి కళాకారుడి చేతిలో బొమ్మగా మారటం అంత తేలిక కాదు. ఘర్షణలన్నీ గొప్ప కథలుగా కొంతలో కొంత మలచగలుగుతున్నారు. అంటే ఇక్కడ కథలే గొప్ప అని కాదు. అవన్నీ కవిత్వంగా మలచటం అదీ ఒక పరిపక్వమయిన కవిత్వంగా మలచటం లేదా సాహిత్యంగా మారటం చాలా తక్కువగానే జరుగుతుంది. నిర్భయపై చూడండి..

‘నువ్వు బతికొస్తే ఒక్క తల్లి కొడుకయినా

మానవ పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి

పీటల వయిపు నీతో నడుస్తాడా

అమ్మల ఆదర్శ స్వరాల హార్మోనియం వినిపిస్తుందా?”

నిజంగా నిర్భయ బతికి ఉంటే ఈ మొదటి లైన్లకి పులకించిపోయేదేమో. పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి .. ఎంత అద్భుతమయిన ఊహాదృశ్యం. ఎంతో పొంగిపోయే లోపల కఠోర, కర్కశ నిజాన్ని , సత్యాన్ని పీటలపయిన నడిచే మగపురుగులు ఉండరా?  అమ్మల ఆదర్శ స్వరాలు వినిపిస్తయా?. అని బాధితురాలు తరఫున మన మనస్సులోకి దూరి, నిలేసి మేకులు దిగ్గొడతారు. నిజంగా జాతి సిగ్గుతో ముడుచుకుపోవలసిన క్షణాలు.

ఆదివారం సెలవురోజంత అందంగా చెబుతా. మళ్లీ  వచ్చే సోమవారాన్ని కళ్లలో కారం కొడతాడు. బతుకు పందెంలో ఉరుకు పరుగులు, చింతలు – వంతలు, వంకరలు, తిరకాసులు, ఎంచక్కా నాయితే సెలవొచ్చింది. మా పిల్లలకి టీవీలో సినిమా ఒచ్చింది. మా అవిడ వంటగదిలో కెల్లాల్సి వచ్చింది. ఆడవాళ్లకి కావలసిన విశ్రాంతి, సెలవ గురించి బద్ధకంగా తీరిగ్గా కూచ్చుని కోడికాలు తిన్నత బాగుంది.

‘గుహని మార్చినంత మాత్రాన

పులిని సింహంగా మారవలేమనీ తెలుసు’

ఆమె మతం కూడా ఏమాత్రం ఉద్ధరించదని, ఇవాంజెలికల్ చర్చి పరంపరలో ఉన్న రాజకీయాల కుళ్ళుని , అందులో దూరే సవర్ణులని, ఓ.సి., క్రీస్తు భక్తులని మీకేం పని, మీవల్లనే మేము జాన్ పుల్లయలం, ఫ్రాన్సిస్ చల్లయలం అవుతున్నాం అని అటు ఆళ్లు, ఇటు ఈళ్లు ఎవరూ మమ్మల్ని కలుపుకోరని సమాజంపయిన, సవర్ణ బోధ  గురువులపైనా, ఆ సమాజంపైనా నిరసన జెండా ఎగరేశాడు.

నిన్నటిదాకా రూపాయి చూడని మనం ఏదో ఇవాళ కొద్దిగా పచ్చకాయితాలతో అన్నం తింటంటే, పేరులో రైస్ ఉంది కదా అని భూమి మీద పండే ప్రతి బియ్యం గింజా నేను చెబితేనే తినాలనీ, మా అనుమతి లేకపోతే ఆకలితో చావనయినా చావాలిగాని మాకు ఇష్టం ఉంటేనే ఏ దేశానికయినా కూడెడ్తాం లేదా సముద్రంలో పారబోసుకుంటాం. ఇంక ఎక్కువ మాట్టాడితే ఇరాక్‌లాగా  మసి చేసి నేలమట్టం చేయగలం. ఇంకా ఎక్కువయితే మేం సముద్రంలో అన్నీ దొల్లిచ్చుకుంటాం అనే కండకావరపు అమెరికాని ఎత్తి చూపిచ్చే రొట్టెల తనిఖీ. వీళ్లు పిజ్జాలు, బర్గర్‌లు, కోక్‌లు ఎన్నయినా తినొచ్చు, పీకలదాకా పీలవొచ్చు. మనం మన మాంసం, చేపలు, గుడ్లు ఆడికి ఎగుమతి చెయ్యకుండా తింటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ‘యాంకీ’బాబు ఒంకర బుష్‌గారి పళ్లు పీకాడు. బడుగులపై బలవంతుడిలాగా, పేద దేశాలమీదేగా అమెరికా ప్రతాపం. మొక్కుబడుల పేరుతో తిరిగి మొలిచే జుట్టుని ఎన్నిసార్లయినా గుండు కొట్టించుకుంటాం. అదే ఏలో, కాలో ఇవ్వాల్సి వత్తే ఇత్తామా? ఇదీ అంతే. మనం  ఇప్పటికే రెండుపూటలా బ్రేవ్‌మని ఏడిసిందెక్కడ?. ఆయనకి తెలుగురాదుగా ఈ విషయాలన్నీ ఎవరు చెబుతారు.

ఒకరోజు  నేనూ  నా స్నేహితుడూ మాట్లాడుకుంటూ పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిందనే కథ చెప్పుకున్నాం. ఇంత పెద్ద మంద ఉండి ఈ A B, C, D ల పేరుతో ఎదురు పడితే అనాధల్లాగా నొసలు ముడేసుకుని, కళ్ళతో అదేదో కక్కుకుంటున్నారు. ఆప్యాయంగా అందరూ పాలు నీళ్లయితే అధికారపు హంసలకి ఆహారం అందదు కదా. ఎన్నాళ్ళీ Kingmakers బతుకు. మా ఊరిలో మా దగ్గిరలో ఉండే అందగత్తెలు, ఒద్దికయిన వాళ్లు, మానవత్వపు మహిళలు ఇద్దరు, కాళావు, మాంకాళి.  ఆళ్ళు ఏది మాట్టాడినా ఎంత బాగున్నా లేక అలంకరించుకున్నా ఆళ్లని సంబోధించటమే వేరు. లంజ, లంజముండ, లంజలభాష, లంజకొడుకులు, ఒసివి చేస్టలు అనే భాషఘోష నాకు తిరిగి తిరిగి తగులుతున్నది. నా మిత్రుడు, మా పక్క ఊరివాడు ‘విజయవాణి'(కన్నడ పత్రిక) సంపాదకుడు పంపన గౌడ మాటల్లో “ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటాం బుజ్జమ్మా, నువ్వు రచయిత్రివయ్యావు. నేను రిపోర్టర్నయ్యాను. కానీ మన ఊళ్లో రెండూ జాంబుల (గ్లాసుల)పద్ధతిని మార్చలేకపోయాం. చీ! ఏం బతుకులు” అని ఇప్పటికీ సిగ్గుపడతాం. వైద్యుడిగా మా నాన్న ఈ డిస్పోజల్స్ రాకముందు  గాజు సిరంజితో మా దగ్గెరి వాళ్ళకి జరం వచ్చినపుడు సూది మందేత్తే మూడూర్లు మా నాన్న వైద్యాన్ని బహిష్కరించారు. కానీ మా నాన్న అంతకన్నా మొండోడు. వాళ్లు వచ్చినా వైద్యం చెయ్యనని వాళ్లనే బహిష్కరించిన రోజులున్నాయి. మా ఊరి ‘మాంకాళి’ బ్యాడరు కులానికి చెందిన ‘వీరభద్రి’ అనే దర్జీని ప్రేమించినందుకు ఊరూరూ ఆమెని చంపాలంటే, రండిరా చూసుకుందాం అని మా ఇంట్లోనే ఆరునెలలు దాచాడు. ఈ అడ్డనామాల దురాగతాలు ఒకటా? రెండా? సమస్‌కృతం కలిసిందా భాషంటే, మరి పామరుడిదీ,  శ్రమజీవులదీ, చేనుదీ,  చెమట చుక్కదీ, కొట్టంలో నించీ కొట్టే మురికిప్యాటల్ది,  పశువుల పాలకులదీ, సోమరులదీ, సూటుబూటు బొఱ్ఱల బాబులది కాదు.

భాషంటే జాతరది, చర్చిది. సంస్కృతి మన ఒక్కళ్ళదేనా? సృష్టి కన్నా ముందే సంస్కృతి పుట్టిందా? మా ఊరి బుడకజంగాల నడిగితే  విద్య అంటే తెలివే ముందు. గురువే తరవాత. మూర్ఖుడు మాత్రమే గురువులని ఆశ్రయించి కొలుస్తాడు అని అంటారు. మరికొన్ని వేల సంవత్సరాల క్రిందట రాయబడిన ‘పాత నిబంధన’ గ్రంధంలో భాషలు తారుమారయిన ఈ బాజెల్ నగరం కథలు చదువుకోలేదా? పెద్ద మనం డాబులు చెప్పుకునేవాళ్లమేమో. సాటివాళ్లని పశువులకన్నా హీనంగా చూస్తా పెద్ద పెద్ద రిసెర్చి స్కాలర్లు, మేధావులు ఎందుకు అసహ్యించుకుంటున్నారు? గుఱ్ఱం సీతారాములు ఎంత నలగ్గొట్టబడితే గుఱ్ఱం సీతారావణ్‌లవుతారు?

శ్రీలంకలోని నాలుగు మూలజాతులున్నవి. వెడ్డా, అహికుంటిక, రామకుళూవర్, వాగ. ఈ నాలుగింటిలో ఒక్క వెడ్డా తప్ప మిగతా మూడు జాతులు తెలుగు జాతులు. వీళ్లు సింహళం, తమిళం, తెలుగు మాట్లాడగలరు. అదీ ఇంగిలీసు కలవని తెలుగు. అంటే పల్లె తెలుగు. వెడ్డా అనే తెగ దాదాపు అంతరించిపోయే దశలో ఉంది. వెడ్డాల పేర్లు ఇలా చెప్పాడంట. బంటన్న, ఎఱ్ఱ బండన్న, నల్లమ్మ ఇట్టా ఉండి, వాళ్ల భాష మన మూల వాసుల భాషకి చాలా దగ్గరగా ఉందంటే చాలా ఆశ్చర్యపోయాం. ఇవన్నీ ఎవరు పరిశోధనలు చేత్తారు. ఎవరిగోల వాళ్లది. భాష  దళితీకరించబడినప్పుడే కదా బాధితులకి నమ్మకం కలిగేది. ఇక్కడ ఒక ఉదా:- చూడండి. వాళ్లలో బతికి ఉన్న మసెన్న అనే శ్రీలంకవాసితో మాట్లాడుతు ఉంటే (పాములు పట్టటం , ఆడిచ్చటం అతని వృత్తి) ఆ తెలుగు  మన మూలవాసుల తెలుగుతో కలిసి ఉన్నది. అలాగే భోపాల్ వాసులయిన ఆదీవాసుల్లో ఒక భాగస్తులయిన “శుభాష్ సింగ్, దుర్గాబాయి’కు పర్దాన్ గోండు కళలో నిష్ణాతులు. వాళ్లు సంప్రదాయ బొమ్మలు, పుస్తకాల వ్యాకరణాన్ని అందిస్తూ చిత్రించిన “భీమాయణం (అంబేత్కర్ జీవిత యాత్ర)” ప్రతి ఒక్కరు (H.B.T) చూడదగిన పుస్తకం.

సుధాకర్ విల్సన్

సుధాకర్ విల్సన్

Happy New Year

కొత్త యాడాది సంబరాలు

అంటే ఏది తీసుకుంటాం. ఇక్కడ కవి ఎంత పెద్ద తలలో గుజ్జయినా తోడందే వదలనన్నాను. ఈ వ్యంగ్యం మీరూ చూడండి. అమ్మో! రామాయణం అంటే సామాన్యం కాదు.

‘ఇప్పుడు కవిత్వమూ వ్యభిచారమయ్యింది

సమాజంకోసం మొదట్లో రాస్తాం

పోనుపోను కీర్తికిరీటాల కోసం

రాసి రాసి రంపాన పెడుతుంటాం.

నిజమే ఒక్కోసారి మన వల్ల అవతలవాడు చస్తాడని తెలిసినా మన పిశాచ ఆనందం కోసం రచనా హత్యలు చేత్తానే ఉంటాం. ఒక సభలో  ఢిల్లీ ప్రొఫెసర్ చిన్నారావు ఇలా అన్నాడు. “చిన్నప్పుడు ఊరి బయట, ఇప్పుడు రాష్ట్రం బయట” అని. డోంట్ వర్రీ బ్రదర్ కాలం మారింది. మీరు లేందే ఊళ్ళేలేని రోజు ఇవ్వాళ. ఈ దేశంలో ప్రతికులంలోనూ ఒక అంబేత్కర్ రావాలని, అంబేత్కర్‌ని ఉపయోగించుకునే వాళ్లు చెప్పే దళిత బ్రాహ్మణిజానికి కూడా రేవు పెట్టాడు. ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టుగా తమకు దళిత అన్నపదమే అసహ్యంగా ఉందని we are more than that  అనీ తాము ఆ స్టేజీ దాటామనీ, శుచీ శుభ్రతలో బ్యామ్మర్లతో సమానమనీ అంటుంటే పిచ్చివాళ్లలారా,  పడకండి పడకండి ఏ వ్యామోహపు గుండాలలో అని ఆరవాలనే ఉంటది. మొదటిసారి చదివినప్పుడు ఎవరీయన అనే ఆశ్చర్యం, చదవగా చదవగా మనవాడై, వేడై, మెదడులో పురుగులాగా, చెప్పులో ముల్లులాగా గుచ్చుకుంటాడు. చేనేత ఉరినేతలా మారటంపై  చూడండి.

‘మా నేతల్ని మేమే నేసుకోవాలి

మా శవాలపై గుడ్డల్ని నేయటమయినా

మా పిల్లలకి నేర్పాలి,

కొడుకులు బట్టలు నెయ్యటం నేర్పారుగానీ

ఉరితాళ్లు పేనటమయినా

వేట కత్తులు నూరటమయినా

నేర్పలేక పోయారు..

ఇది చదివినాక గుండె భగభగమని, తుప్పు పట్టిన సూరులో కత్తి నూరటంలో, ఏ ఉద్యమంలోకో దూకి జండా పట్టటమో, అన్యాయానికి ఉరి వెయ్యటమో, ఏదో లేకపోతే మన పళ్ళనే పటపట, టకటక, కటకట నూరటమో చెయ్యకుండా ఉండం.

‘కామ్రేడ్‌లతో తినిపిచ్చిన ప్రశ్నల ఎండుమిరగాయలు చూడండి.

‘ఆయుధాలు పట్టటం ఇక్కడ ఉద్యమం

మనువుని సంహరించకుండా

మనిషిని వర్గ శత్రువనటం వికటం

పాపం మన కామ్రేడులు మిరపకాయలే కాదు వాటి పొగేసినా చలిచ్చరు.

ఉద్యమ నెలబాలుడి గురించిన గొప్ప వాక్యాలు.

చెట్లెన్ని పడినా వీచెగాలి ఆగదన్నాడు. జనం గుండెల్లో తనెప్పటికీ చచ్చిపోలేదన్నవార్త, తన సమాధినీ చూడగలిగినవాడు. దళితసాగర గీతాన్ని శివమెత్తి పాడుతున్నవాడు రాసినవాడు ఈ కవి. ఇకనించీ మనం కూడా వాళ్ల బతుకు బాసని మాట్టాడదాం. కనీసం ఇందాం. ఫూలన్‌దేవి ఎందుకు తుపాకీ పట్టిందో లోతుగా అధ్యయనం చేద్దాం. పొట్టిలంక మారణహోమం విషయం మరిచిపోయాం,  లక్సింపేట అందమయిన సంకలనం అయింది. భాషలో అరసున్న పోయినప్పుడే గుండుసున్న మిగిలిందని దేన్ని కొట్టి చెప్పాలి. దేనితోనూ కొట్టకుండానే మనకి తగిలేట్టు చెప్పాడు.

మిత్రుడు చంద్ర గురించి ఎవరితను అని చెప్పినపుడు, చదివి నేను రాసినంత సంబరపడ్డా. ఆప్తులయినవాళ్లని అరిచేతులమీద నడిపిత్తారని, అంతులేని కన్నీళ్లతో గుండెల్ని తడుపుతారని, బెంగలతో ఊరేగింపు యాత్రలో పూలవుతారని, కాళ్ళకి అడ్డం పడే బంధువులవుతారనిపిచ్చింది. ప్రేమనాలుకల తడిలవుతారు.

మద్దూరి, శిఖామణి, ఎండ్లూరి తరవాత ఎవరంటే ‘విల్సీ’నే . అలా అచ్చంగా వాళ్లకి చెందినాడేం కాదు. ఆశ్చర్యంగా అప్పుడపుడూ ‘మో’గారి పదాలు కూడా పడతయ్యి. “బ్లాక్ కీ నీగ్రో’ తేడా తెలుసుకున్న మిత్రుడు. నిజంగా కవితా ప్రేమికులకి నచ్చే పుస్తకం మాకూ ఒక భాష కావాలి.

 

దొరికే చోటు: అన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లో

Ebook: Kinige.com

 

 

– మన్నెం సింధు మాధురి

sindhumadhuri

దళిత కవిత్వపు వెలుగు రవ్వ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ !

మాకు ఒక భాష కావాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్న సుధాకర్ !

గాడిద పేడతో
డిటర్జెంట్లు చేసే రజకుల మేధస్సునీ
గొడ్డుటావుల చర్మాన్ని
గంటలో ఒలిచే చర్మకారుల నైపుణ్యాన్నీ
వాంతి చేసుకోకుండా
దేశీయుల మలాన్ని చేతులతో పట్టుకెళ్ళే
దౌర్భాగ్యుల సహనాన్నీ
గుర్తించని ఈ భాషాజాతులు
ఎవరికి ట్రోజన్‌ హార్సులు!

జాతిలో సమైక్యం కాలేనప్పుడూ
నీతిలో సమతుల్యం లేనప్పుడూ
వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ
దళితుల గౌరవం కోసం రాయనప్పుడూ
సమానత్వం ఫ్లాట్‌ఫారాల మీద
సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని
సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!

                                                                          –తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

‘చిలిపి కళ్లతో నవ్వుతా భూమి ఆకాశాల మజ్జన ఎవరి పాట వాళ్లు రాసుకోవాలంటాడు’ త్రిపురనేని శ్రీనివాస్. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటాడు కలేకూరి. ఇప్పుడు సుధాకర్ కి  భాష కావాలంట. ఇన్నాళ్లకన్నా ఆ దళిత భాష. ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి స్పృహ వచ్చింది. నిజానికి అంటరాని కవిత్వాన్ని, దళిత జీవితాలని, సాహితీ ఆకాశంలోకి ప్రవేశపెట్టి, బతుకు ఆలోచనల మకిలిని , అహంకారపు మాడుని  పచ్చడి బండతో కొట్టి, నా దారి నేనే ఏసుకుంటా అని ఎగరేసుకున్న జండా సుధాకర్.

ధిక్కారిగానూ, ఒకసారి యోధుడుగానూ, ఒకసారి జపాన్‌లోని పార్కు గురించీ, మరోసారి నొసలు ముడవద్దంటూ విశ్వభాష అయిన నవ్వు గురించి, ఒకటా రెండా, రిజర్వేషన్లు, దళిత క్రైస్తవం, ఇవాంజులికల్ చర్చి పెద్దలు , కామ్రేడ్లపైన చురకలు, వర్గీకరణలు అంగీకరించకుండా ధిక్కరించి, ఏ విభజననీ ఎవ్వరేమనుకున్నా ఒప్పుకోకుండా తుఫానులో లైటు హౌస్‌లాగా నిలబడ్డాడు. చెవిలో సీసం పోసిన వాళ్లని, మురిగిన కషాయాల కాషాయలని, ఉత్తుత్తి ప్రజాస్వామ్యాన్నీ, ప్రజల ప్రాణాలతో ఆడుకునే పాలకుల నిర్ణయాలని, వ్యతిరేక వ్యక్తులనీ, శక్తులనీ, తన కవిత్వంతో, ప్రతి కణాన్ని ఒణికించాడు. గుండెల్ని చీల్చే మాటలతో, విషయాన్ని మూడోకంటితో చూస్తా. ఎప్పటికప్పుడు మారే వాసనలని కలంతో పీల్చుతా, అందరికీ కొంచెం పూశాడు. వర్గీకరణలూ లేని కవిత్వాన్ని ఎంతో కొంత (ఇది సరిపోదు) అందించాడు. దళిత కవిత్వాన్ని అందించాడు. ఇంకొక్కసారి చెపుతున్నా. నిర్బంధ మానవ జీవితాల వ్యధల్ని, ఆంక్షల కట్టడాలని కూల్చిన సరికొత్త కవితా గ్రామ నిర్మాణ శిల్పి. ‘రావణాసురు’డి కాలుతున్న కాష్టపు కంపు ఆరని చితిమంటలని కథలుగా చెప్పుకుంటా, బొట్టూ, పూవులు ఉన్న మండోదరి పతివ్రత అని దణ్ణం పెట్టుకునే లోకంలోనే బతుకులు ఈడుస్తున్నాం. ఆ కవురు కంపుని కాష్టపు పొగలనీ కూడా కవిత్వం చేసినవాడు. తరతరాలుగా దళిత జాతి మనస్సులో, జీవితాల్లో, మాటల్లో చితి ఆరటంలేదు. వాళ్ల మాటల్ని, వాళ్ల బాధల్ని మనం భాషగా ఒప్పుకోం. ఇక్కడ భాషంటే రెండు తోలు పెదాల్లోనించీ స్వరపేటికతో కలిపి వచ్చే శబ్దాలు, అరుపులు. నాలిక మడతలు కాదు. భాష అంటే  పాట్లు, భాష అంటే బతుకు, భాష అంటే జీవితం. కత్తికన్నా కలం పదునయినదన్నది పాత బూజు సిద్ధాంతం. కాదు ఈ రెండింటికన్నా భాష పదునయినదనీ, దానిలో కూడా మళ్లీ ఎన్నో తేడాలు. Power of Languageకి Language of Powerకీ ఉన్నంత తేడా.. దీన్ని చర్చిస్తే  ఒక గ్రంధమే రాయాలి.

maakuOkaBhashaKaavaaliByWilsonSudhakar

సాల్వెడార్ ఆలెండీ మృతివార్త విని ప్లాబో నెరుడా మరణించాడు. విచిత్రం… కవిగా మరణించినా మెదడు మాత్రం ఆఖరి నిముషం వరకు పని చేసిందంట. బహుశా నెరుడా మెదడులోని ఒక కణం ఈ కవి చేతిలో దూరిందేమో. ఎన్నెన్ని సంఘటనలు. కష్టాలు ఎవరివయినా ఒకటే. ఎన్నెన్ని సంఘటనలని రూపం కట్టాడు. నిజానికి పారే నెత్తురికీ, ఊడదీసిన బట్టలకీ, భర్తాబిడ్డల ముందు మానభంగాలకీ, ఓపికలేని కుత్తుకలకీ, పిల్లికూతల స్వరల తరఫున నరాలు తెగిపడేలాగ అరిచాడు. అసలు ఈ సంఘటనలు కవితలుగా మలచటానికి ఇంత ఓపికా, శక్తి ఉండటం కూడా ఆశ్చర్యమే. మట్టిలో పడే పాదముద్రలకి శాశ్వత్వం మళ్లీ వాన కురిసేదాకానే. బాటగా బతుకుపాటగా, పాటుగ మారతయ్యనుకోటం మన ఆశ. అయినా ఎలుగెత్తటం మానకూడదు. ఎలుతురిని ఎతకటంలో తప్పులేదు.

కారంచేడు, చుండూరు, నీరుకొండ, కందమాల్,  భైర్లాంజీ, నిర్భయ, దళితక్రైస్తవం, అంబేద్కర్ , బుద్ధుడు, పూర్తి రిజర్వేషన్లు, అన్నీ చెపుతా ముల్లు కఱ్ఱతో తన వాళ్లని తనే పొడుస్తున్నాడు, పొడిచే పొద్దువైపు చూపుతా.

మరిప్పుడూ భాషెందుకు కావాలి. ఇప్పుడు మాట్టాడే భాష కాదు? మరి అందరూ ఆ భాషే మాట్టాడతంటే వీళ్లెందుకు ఆ భాషని కక్కిన కూడులాగా అసహ్యించుకుంటన్నారు.

వాళ్ల పదాలనీ, జీవితాలనీ, వృత్తులనీ, గుండెనీ, గుడిసెనీ, ఆటనీ, పాటనీ, బువ్వనీ, అవ్వనీ, నవ్వునీ, ఏడుపునీ మనం గుర్తించనప్పుడు అసలు ఈళ్ళు ఉనికే వద్దన్నప్పుడు, బతుకే దినదినగండం నూరేళ్ళ ఆయుస్సు అయినప్పుడు అది ఆనందపు మాటగా, మాట బాసగా మారుద్దా. వాళ్ల పాటకి సరిగమలు లేవంటే అది శ్రమది, ఇది ఇంకోటి. వాపుకీ, బలుపుకీ ఉన్న తేడా.

సంగీతం అంటే సరిగమపదనిసలు. తిరగా బోర్లా ఎనిమిదక్షరాలు. ఆరోహణా, అవరోహణా అనే అర్ధం కాని పదాలా అంటే అవ్వొచ్చు. కాకపోవచ్చు. ఒక సినిమా” ద కలర్ కాల్డ్ పర్పుల్” లో స్పీల్‌బర్గ్ ఇలా అంటాడు. సంగీతం అంటే ఆఫ్రికన్ ఎడారుల్లో రైలు మార్గాలు వెయ్యటానికి, గడ్డపారల్లో పట్టాలు దొర్లించేటప్పుడు ఒదిలే ఊపిరి, కడుపు నింపుకునే ఆహారాన్వేషణలో భయాన్ని పోగొట్టుకోటానికి చేసే ధైర్యపు శబ్దాల పాట. ఆకలేసి, ఏసి ఏడ్చి సొమ్మసిల్లిన నిస్సత్తు రాగం. బహుశా ఇదే నా మెదడులో కూడా ఉందేమో.

ఏది ఏమైనా తెలంగాణా ఉద్యమానికి పునాది వాళ్ల మహోన్నతమయిన సాంస్కృతిక వాదమే. గొప్ప భాష వాళ్ల సొంతం. ఎంతో సొగసైన మాండలికం, కట్టె పుల్లలు, కట్టెల పొయ్యి, దుడ్డు, బిడ్డ, యాట లాంటి అసలయిన పదాలు ఆళ్ల సొంతం. ఎంతెంత సాహితీ సంపన్నులు. మాండలీకాలనే గవ్వలనీ, రవ్వలనీ పోగేసుకున్నవాళ్లు. గద్దర్, గోరేటి లాంటి సంస్కృతీ వారసత్వంతో అదీ ఒద్దీకరించబడి (రికార్డెడ్) ఉండాలి. అక్కడా అంతా గొప్పా అంటే అదేమీ లేదు. పట్టు చీరల గరగరల బతుకమ్మల్లో పాపం మన దళిత సోదరులకి  సోటుందా. సరే మళ్లీ విషయంలోకి వద్దాం. నేను “క” గుణింతాన్ని ఎన్ని రకాలుగా నేర్చుకున్నానో.

1. ‘క’కార అకారముల ‘క’, ‘క’కార ఆకారముల ‘కా’, ‘క’కార ఇకారముల “కి’

2. ‘క’కు దీర్ఘమిస్తే కా, ‘క’కు గుడిత్తే ‘కి’, ‘కి’కు పొల్లిత్తే ‘కీ’

3. క, కా, కి, కీ, కు, కూ,కృ, కౄ

ఇక్కడే మూడు మూడు వర్గాలయ్యాయి. ఒకటి బ్రాహ్మణులది, ఒకటి ధనగ్రవర్ణాలది, ఒకటి బీదలది. అయినా అన్నీ సదివినా, బతుకులో ఈ కాకిగోల ఎంతకి ఉపయోగపడుద్దో అర్ధమే కాదు.

అసలు దళిత వాదానికి పునాది ఏంటి? ఎవరో కొద్దిగా ఆలోచిత్తే చాలు. ఎవరికయినా తెలుత్తుంది. హైందవ అమానవీయ సంస్కృతిని ధిక్కరించే పోరాటమే. ధర్మశాస్త్రాల ఆధిపత్యాన్ని తిరస్కరించిన చార్వాకులు, బౌద్ధులు, అంబేత్కర్, పూలే, పెరియా ఉద్యమాలే కదా మూలం. కుల నిర్మూలన జరగాలనే వాదమే కదా వాస్తవానికి దళితవాదం. ప్రవాహపు నదిలా ఉండి ఉపనదులని కలుపుకుంటా సంపన్నం కావాలి. కానీ కాన్షీరాం అన్నట్టు కడుపు నిండినవాడు ఎవరంటే దళిత బ్రాహ్మణుడు అంటాడు కవి.

వాళ్లలోని ఈ ఆకారం లేని పోకడల పట్ల పెన్నం మీద గింజల్లా పేలతాం కానీ భూమిలోని విత్తులా మొలవరేం. దళితోద్యమాలు చైతన్యపూరితం అయ్యి తీవ్రమయిన అగ్రహాన్ని వ్యక్తం చేసే స్త్రీలని గాయపరిచే భాషలని  వాడటం నివారించగలిగాయి. ఎన్నో సంకలనాలు కూడా వచ్చాయి. ఎంతోమంది కవులు ఎన్నోరకాలుగా రాశారు. కొందరయితే పేరొచ్చినాక దళిత కవిత్వం, దళిత అనే మాటలకే దూరంగా జరిగిపోయారు. (ఇక్కడ  పేర్లు అవసరం లేదు) ఒకరకంగా అన్యాయాల పైన  కూడా . అంటే వాళ్ల మీద వాళ్లే  పోరాటాలు చేసుకోవాలేమో. అయినా ఎంత చెప్పినా దళితవాదం గురించి తక్కువే. అదొక పోరాటం, ఉద్యమం  స్థాయిలో ఇంకా పెరుగుతూనే ఉండాలి.

కొందరికి నదులు, కొండలు, పర్వతాలు, జలపాతాలు, కిటికీలోంచి లోకం, ఉదయాలు, సాయంత్రాలు.. ఇవే కవిత్వం. ఇక్కడి కవికి అణిచివేత, అణగదొక్కటం, నోటితో మాట్లాడి నొసలుతో ఎక్కిరించటం లాంటి వాటిపైన పశృతలతో పడ్డాడు. ఇది నిజంగా కొంతలో కొంత ఆధునిక ధిక్కారం. ఊకబస్తాలాంటి మెదళ్లని కదిలిచ్చటం. అంబరానికి ఎగిరిన పొలికేక, తెగిపడ్డాక కంఠాల అరుపు. మనుషులుగా గుర్తించాల్సిందే అనే హెచ్చరిక. మీద పడయినా మావాటా లాక్కుంటాం. పరిగె గింజలకి కాదు, పాలికుప్పలకోసం, కల్లాల కోసం పోరాటం. ఆమోదాలకోసమో, అలంకారాల కవిత్వం కాదు. ఆకలికేకలు. అణిచివేత అరుపులు, కులాల కుంఠాటల్ని జాడిచాడు.

మాకు ఒక భాష కావాలి. అది దళిత భాష కావాలి. కోరికయితే కోరాడు కానీ నిజానికి సుధాకర్ కవిత్వంలో ఎంత దళిత భాష ఉంది? ఉంటే ఎంత? లేకపోతే ఎంత. కొంచెం ఎనక్కి వెళితే నేను తన ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాను. కోస్తాలో మాంచి మోతుబరి కమ్మగ్రామం ఆయన ఊరు. తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు. తండ్రి ఊరికి మంచి చెడులు చెప్పే పాస్టరు, పోస్టు మాస్టరు, హెడ్ మాస్టరు. తల్లిగారు కూడా ఉపాధ్యాయురాలే. ఒక రకంగా మాస్టారి అబ్బాయిగా మంచి జీవితమే. అందరికన్నా మెరుగయిన బతుకే. అందుకే ఎక్కువగా నాగరిక భాషే ఉంటది.. మరి విషయం దళితులది. విధానం స్థానిక, దేశ, విదేశ పదాల కలగలుపు. అయినా సమస్యనే తీసుకున్నాడు కనక ఈలోపాన్ని వదిలేద్దాం. మరి ఇపుడు మాట్టాడేది భాష కాదా? శ్రమ చేసి వాడి పాదాలు మనతో మాట్టాడాలి. డప్పు కొట్టె చెయ్యి గుండెల దడ కావాలి. కవికి ఒళ్ళంతా కళ్లయి ప్రపంచలోని ప్రాపంచాన్ని చూడాలి. ఎమ్మటే కంటిలో పాపలా లలితంగా మారిపోవాలి. మళ్లీ ఇట్టా అంటాడు. భూమినాది కాదు. భూమిపయిన హక్కు నాది కాదు. ఏ రూపంలోనయినా మమ్మల్ని కలుపుకోనప్పుడు మీ బతుకు కతల్లో మాకు గారవమే లేనప్పుడు, మాకు మీ చెడిన చరిత్రలో చిరుగుల పేజీ అయినా లేనప్పుడు ఈ భాష మాకెందుకు? అప్పుడప్పుడు అనిపిచ్చుది. సమాజం చేసిన గాయం ఎంత లోతయినదో కదా.. ఇంకా గేదె మానాన్ని పొడిచే కాకుల జీవితమే కదా. చిరుగుపాతల గోనెపట్టయినా కప్పట్లేదు. కాకులకి వదిలేశామిది చూడండి.

 

కులపిచ్చిగాళ్లకి దేశమొక ఎలమావితోట

జాతికి జవ్వనాశ్వంలా మేమూ శ్రమదానం చేస్తున్నా

కుల ఓంకారాన్ని ప్రణవాక్షరం చేసుకున్న

దేశపౌరుల గుండెలోతుల్ని తెలుసుకోగలమా!

కాలేజీ రోజులు ఇంకా పచ్చగా, పచ్చిగా కళ్లముందే కదలటల్లా. ఆడు ఒకటా, రెండా అని మీ చెవుల్లో మోగటల్లా.. అన్నియ్యా, అక్కియ్యా, ఒచ్చేడు, ఎల్లేడు అనే ఎకిలి మంత్రాలు ఇంకా వాగి మోగుతున్నాయి.

రామా “అడ్‌కాప్” చెప్పులకన్నా

నీ పావుకోళ్ళ జత గొప్పవైతే

రా! బహుజన సామ్రాజ్యంలో గద పట్టుకు నిలబడ్డ అంబేత్కర్ని దాటి’

ఎంత ధైర్యం, నిబ్బరం, మేము దళితులం అని సగర్వంగా తలెత్తిన క్షణం, బతుకుల్ని బాగుచేసి, చేత్తన్న, చేసే వైనాన్ని కనుక్కొన్నారు. మీకొక మనిషున్నాడు. అతని ఆత్మ అంతరవలయమై ప్రతి దళితవాడని ఇనపకంచెలా, తిరగబడే పిడికిలిలా, కన్నీటిని తుడిచే అమృత హస్తంలా కావలి కాత్తానే ఉంది.  ఏ తలకాయ లేదనుకున్న గొఱ్ఱె తలకాయలకి ఓ సమాధానం ఈ తల. ఏ ధనం లేదనుకున్నవాళ్లకి జై భీమ్ పిడికిలే సంపద. తలే కొన్ని కోట్ల తలల తిరుగుబాటు. తలలకే తల అది. అసలు ప్రతి కులంలోనూ ఓ అంబేత్కర్ ఉండాలంటాడు కవి. అంబేత్కర్ వల్ల కడుపులు నిండినవాళ్ల మానం పైనా చురకలేశాడు. నిజానికి అంబేత్కర్ ఆశయాలు ఎంతగా ప్రచారం పొందాయో, అంతకన్నా త్వరగా దుష్ప్రచారాలని సాగించటంలో కూడా కొన్ని శక్తులు విజయం సాధించాయి. అసలు దళితులే అంబేత్కర్‌ని ఆరాధించాలని ఏమీ లేదు. వ్యక్తిగా ఎవరమయినా అతని గొప్పతనాన్ని సంఘం పయిన ఉండే ముందు చూపుకీ జై భీమ్. రామాలయాలు వద్దు. కాలే కడుపుకి గంజే ముద్దంటాడు.

మాంసం తినే హిందువంటే

మాంసం తినని హిందువు ఇంటిదాకా రానిస్తాడా…..

ఇంటిదాకా కాదు ఒంటికి తగిలినా మునుగుతారు. మన సిగ్గులేని  సమత్వం సిగ్గుతో దాక్కోటాన్ని చూత్తాం.

విత్తమూ నీది కాదు. విత్తనమూ నీది కాదు. విన్నాణమూ నీది కాదు. పుల్ల మామిడి దొరకని పురజనులకి, ఓడలు దిగిన చైనా యాపిళ్లలో గుట్టు, కిమయా డేట్సు, ఓట్సు, Ives(ఏవీస్) మాహిశ్చరైజర్లు, ఈ దేశం నీదయినా, ఈ రాజ్యం నీది కానప్పుడు , ఈ గింజ నీ చేతిలో ఉన్నా భూమి లేనప్పుడు అవి ప్రపంచీకరణ దుష్ప్రభావాలని దుయ్యబట్టి, ఎండేశాడు. ఈ పద్యాలన్నీ చదివితే ఇవి దళిత, బహుజన, క్రైస్తవ సమాజం కోసమే  అనుకుంటే పొరపాటు. ఆలోచిస్తే పుడమిని చీల్చుకుని వచ్చే ప్రతి ప్రాణి బాధ దిగులు. ఉనికిని కోల్పోయే జీవితాన్ని గుర్తు చేస్తా భయంతో చేసే హెచ్చరిక.

sindhumadhuri-మన్నెం సింధు మాధురి

 

(రెండో భాగం వచ్చే వారం)

రంగం పెట్టి

sindhu-2_336x190_scaled_cropp

మన్నెం సింధు మాధురి

 

  వర్తమాన తెలుగు కథా సాహిత్యం లో విశిష్ట స్వరం మన్నెం సింధు మాధురి . ఒక కొత్త కెరటం లా  కథన రంగం లోకి దూసుకు వచ్చిన సింధు మాధురి గుంటూరు జిల్లా లో పుట్టి, బళ్ళారి దగ్గర ఉళెనూరు క్యాంప్ లో పెరిగారు. ఉళేనూరు క్యాంప్ జ్నాపకాలను కథలుగా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో 25 వారాల పాటు సీరియల్ గా అందించారు.  సింధుమాధురి కథల్లోని స్త్రీపాత్రలు అందరికీ తెలిసిన స్త్రీల జీవితాలు కావు. ఊహాజనిత పాత్రలు అసలు కావు. ఆమె కథలన్నీ స్వానుభవ కథనాలు. ఆ కథనాల్లోని వ్యక్తులు విభిన్న వర్గాలకు చెందిన స్త్రీలు. వివిధ రకాల జీవిత పోరాటాల్లో నలిగిపోయినా మొక్కవోని ధైర్యం తో నిజంగా జీవితాన్ని జీవించిన స్త్రీలు.  కథల  వస్తు,రూపాల చుట్టూ ఉన్న పరిమితుల సంకెళ్ళను  అలవోకగా ఛేదించిన రచయిత్రి సింధుమాధురి.

***

‘‘యావండీ లచ్చీశ్రీమ్మగారూ బాగుండారా? ఏంటి కబురు చేశారంట,’’ అనే మాట ఇనపడింది. అతను మా ఊరి వడ్రంగి వాసుదేవరావు.
‘‘ఏవీ లేదు. కాళీగా ఉంటే మా రంగం  పెట్టికీ, మైలగుడ్డల పెట్టికీ పాలిష్ పెడతావని పిలిచాను,” అంది అమ్మమ్మ.

“మొన్న పట్నం నించి పెద్ద కొట్టాళ్ళు (షో రూమ్) వచ్చారండీ. ఎక్కడన్నారంగంపెట్టి ఉంటే ఎతికి పెట్టమన్నాడు. ఐదేలిప్పిత్తాను.’’

‘‘ఏదో పనివంతుడివి తింటే పదో పరకో తింటావు గందా అని నిన్ను పిలిత్తే మా కొంపలో వాళ్లలాగా నువ్వు కూడా నా సామానం మీదే కన్నేశా. పదినిమిషాల్లో మా స్థలం ఖాళీ చెయ్యక పొయ్యావో నిన్ను సావిడూడిసే పొలికట్టెతో కొడతా,’’ అని తిట్లు మొదలుపెట్టింది. దడిసిపోయిన వాసుదేవరావు కథ ఎదురు తిరగటంతో బతుకుజీవుడా అని ఎట్టాగో బయటపడ్డాడు.

ఇంత లోకి మా అమ్మమ్మకి నేను దొరికిపోయా.

‘‘ఏవే ఎక్కడ ఆడతన్నా. ఊరిమీద బలి తిరుగుతున్నావా. బెజగాడెల్లే పెరిగావు. పనిపాటల్లేవు. ముసల్ది చేసుకోలేక సత్తందని యావన్నా ఉందా. నీకు ఇవరం ఎప్పుడు వచ్చుద్దే,’’ అని అమ్మమ్మ పురాణం ఇప్పింది.

నన్నేదో అనటం ఇని, ‘‘ఏంజెయ్యాలక్కయ్యా,’’ అంటా పక్కింట్లో ఉండే మా కవలమ్మమ్మ వచ్చింది.

‘‘ఏంజెయ్యాలా ఆ ఎలిసిమీద సామానం పారేసి ఎన్నాళ్ల యింది. పోయినేడు కుదరక తోవలా. ఆటి గురించి పట్టిచ్చుకునేది ఎవరు? ఒక్కళ్లన్నా నా మాట ఇంటేనా. అట్టా వదిలేసి రెండేళ్లు అయ్యింది. ఎలికలు, బొద్దింకలు, సాలీళ్లు ఎన్ని గూళ్లు, గుడ్లు పెట్టినయ్యో. తోవటానికి పనిమనిషి నాగమ్మని రమ్మన్నా. ఈ పిల్లలు ఒకళ్లు  పైకెక్కి ఒంపుతా, రెండో వాళ్లందిత్తంటే, నాగమ్మ తోవుతుంటే నేను కడగొచ్చొనుకుంటన్నా. మళ్లీ ఆటిని తుడిసి ఎండలోబెట్టి, కిలువు పట్టకుండా, ఉప్పురవకుండా, నేతిగుడ్డతో తుడవాలి. ఎలిసి దులపాలి. మళ్లీ కొత్తగుడ్డలు పరిసి సామానం పరవాలి. నా సావు కొత్తంది, ఒక్కదాన్నే సేసుకోలేక.’’

‘‘నేను సెయ్యేత్తాలే అక్కయ్యా,’’ అంటా పనికి మమ్మల్ని పురమాయించారు.

ముందుగా రంగంపెట్టి మైలపెట్టి తుడుత్తున్నారు. నేను రంగంపెట్టి ఈపు అరసున్నాలాగా ఉంటే కాసేపు దానిమీద పడుకున్నా. మా ఇంటో భోషాణం పెట్టి, కుండలపెట్టి, మైలగుడ్డల పెట్టి, రాట్నం పెట్టి, గాజుల పెట్టి, బల్లపద్దుల పెట్టి, ఏకులపెట్టి, బొట్టుపెట్టి, ఆఖరిది పెట్టెలకే రారాజు రంగం పెట్టి (రంగూన్‌ పెట్టి). మళ్లీ దీంటో రకాలు. పూలపెట్టి, నగిషీలపెట్టి, బద్దీలపెట్టి. మా పక్కింటో కవలమ్మమ్మ వాళ్లది పూలపెట్టి. బద్దీలపెట్టిలో నాలుగొరసలు. వరసకి నాలుగు నించీ ఎనిమిది సొరుగులు. ఒకొరస మొత్తం తీత్తేగానీ రొండో వరస రాదు. రక రకాల అరలు. అమ్మమ్మ మెడలో చంద్రహారం పెట్టికి ఏసినట్టుగా పైన దండ అతుక్కుని ఉంటది. మూలలన ఇత్తడి బద్దీలు మేం రంగూన్‌ జమిందారులం అన్నట్టు నిక్కు సూపిత్తా ఉంటయ్యి. దస్తావేజులు, పాత పుస్తకాలు, సావుపుటకల కాయితాలు, ఈలునామాలు, అప్పునోట్లు. అన్నిటికీ అదే బ్యాంకీ. ఆఖరి అర తియ్యాలంటే అంతా తెలిసినాళ్లకి అరగంటయినా పట్టుద్ది. నా పదేళ్లు వయసప్పుడు మా పక్కింటో ఉండే మా అమ్మమ్మ చెల్లెలు వరసయ్యే కవలమ్మమ్మ రంగంపెట్టి తెరుత్తుంటే చూశా. అప్పటినంచీ నాకా పెట్టంటే చానా ఇష్టం. పాత విఠలాచార్య సినిమాలో మాంత్రికుడి కొంపలాగా ఉండేది.rangampette

రంగంపెట్టి మా ఇంటికి చేరటం కూడా సిత్రవే. కవలమ్మమ్మ వాళ్లాయనా, మా తాతా పడవల మీద బియ్యం ఏసుకుని రంగం ఎల్లి వత్తావత్తా, మాకు బద్దీలపెట్టి, ఆళ్లకి పూలపెట్టి తెచ్చారు. నష్టం వచ్చి యాపారం మానేసినా ఈ చెక్క సామానం గుర్తుగా ఉండిపోయినయ్యి.

ఇంకోటి మైలగుడ్డల పెట్టి. దాన్ని సుండు సీతమ్మగారని మా అమ్మమ్మ స్నేహితురాలు ఆళ్ల పిల్లలతో పాటు రాజమండ్రి నించీ మాకూ ఒకటి తెచ్చింది. ఇడిసిన గుడ్డలు అందులో ఏత్తే మా రాంకోటి తాత కింద చిన్న తలుపు తీసుకుని గుడ్డలు మూట కట్టుకుని ఎల్లేవాడు. దానికి గాజు అద్దాలు. ఎనక పాత హిందీ సినిమా తారల చిత్రాలు. ఎప్పుడయినా అల్లరి ఎక్కువ చేత్తే అమ్మతో దెబ్బలు పడతయ్యి అనుకున్నప్పుడు గౌనులో ఏరు సెనక్కాయలు పోసుకుని తింటా అమ్మ కోపం తగ్గినాక బయటికి వచ్చేదాన్ని. ఈ రొండూ లేకపోతే మా ఇంటికి అందవే లేదు. మరనాటి పొద్దిన్నే సామానం తోమే పని మొదలుపెట్టారు. అసిగాడు (అన్న) ఎలిసిమీద నించి అందిత్తంటే, నచ్చితే చేతికిత్తన్నా లేకపోతే ఇసిరి ఇసిరి కొడతన్నా, ఆడుకోటానికి ఈలవటల్లేదనే కచ్చతో.

‘‘అట్టా ఇసిరితే, సొట్టలు పడితే అయ్యి ఎందుకూ పనికి రావు. మళ్లీ కొనుక్కొలేము. వస్తువ అవరదు. నిదానంగా ఇవ్వాలి,’’ అంది కవలమ్మమ్మ.

‘‘దానికేంటి కష్టం జేత్తేగా నెప్పి తెలిసేది. ఒంకిటికెల్లి ఉడకేసుకోటానికి కూడా సట్టీ అవుర్సుకున్నప్పుడు కదా మన బాద అర్థవయ్యేది.’’

‘‘అంతేలే అక్కయ్యా, పిల్లాజెల్లా లేకపోతే కుక్కా నక్కా పిల్లీ దూడా దుక్కీ మీద బెమలు పెంచుకుంటాం. అయ్యీ లేకపోతే బీరువాలు, మంచాలు, కంచాలు, చిప్పలే బందాలు. పొద్దిన లెగిత్తే అయ్యే పలకరిత్తయ్యి. ఆటిమీదే మమకారాలు. ఏదో పక్కింటో నువ్వుండబట్టి ఇంటో లేళ్లల్లే ఈ పిల్లలు ఎగురుతా, గంతులేత్తన్నారు. ఏదో ఈళ్లేగా నాకు పిల్లాజెల్లా. మొగుడు ఏ దేశాల మీద తిరిగినా లోటు తెలవటల్లా. ఏది తెచ్చిపెట్టమన్నా తుర్రున పరుగెత్తుతారు. అంతగా అయితే దానికి పెళ్లయిన తరువాత నే నెలతాలే ఎనకమాల. ఒంటికాయి సొంఠికమ్మునేగా.’’

‘‘దీన్ని నమ్ముకుంటా, గొంతులో నీళ్లు కూడా పొయ్యదు. నాకూ కూతురుంది. సుకపడతన్నానా. చాకిరీ తప్పిందా. బిడ్డలుండా లేకపోయినా ఒకటే బతుకు. ఉండాళ్లేవయినా మమ్ముల్ని ఎండి ఉయ్యాలేసి ఊపుతున్నారా, నిన్నూపట్లేదని బాదపడతానికి. అందరిదీ ఒకటే రాత. ఈ బిడ్డలకన్నా మట్టిగెడ్డలు నయ్యం. చాకిరీ జేత్తే ఫలితం సూపిత్తయ్యి.

ఇప్పుటాళ్లు మీద మనవే నయం. తిట్టుకున్నా, తిమ్ముకున్నా పెద్దాళ్లు మంచాన పడితే శాకిరీ జేసి కూడేశాం. ఇప్పుడన్నీ మొక్కుబడి తంతులు. ముందు ముందు అయ్యి కూడా సూడములే. మాట్టాడితే నా కూతురు సామానం కేజీల లెక్కన మారకం కాటా ఏపిత్తానంటది. ఏనాటినించీ ఏర్పాటు జేసుకున్నాం. ఎన్ని గుర్తులు. అయినా మన బాదలు మడుసుల కన్నా సామానులకే ఎక్కువ తెలుసు,’’ అంది.

సాయంత్రం దాకా అందరం కలసి సత్తా, పడతా సామాన్లు కడగటం సరిపోయింది. అమ్మమ్మకి, కవలమ్మమ్మకీ ఓపికలు అయిపోయినయ్యి. ఇక రేపు తుడిసి సర్దొచ్చులే అని ఇల్లంతా సిందరవందరగా పరిసినట్టు ఒదిలేశారు. మైలుగుడ్డల పెట్టి, రంగం పెట్టి, దబ్బకాయలో నాలుగు, ఎఱ్ఱమట్టి, సబ్బుపొడి, కొబ్బరిపీసు, తోవటానికి ముగ్గురు  మడుసులు, దొంగలెవరన్నా ఎత్తుకుపోతారనే బయం. కొంపకి కాపలాగా ఎల్లకాలం ఓ మడిసి. తీరా సర్దినాక డమడమా, బడబడా, ఆటిట్టో ఎలికలు తిరగడం,’’ అని ఇసుక్కుంది.

‘‘ఇయ్యాల అయ్యి అడ్డవయినయ్యని అమ్ముతానంట న్నావు. రేపు ముసలాళ్లు మయినాక మేవడ్డమని మమ్ముల్నెవరికి అమ్ముతా?’’

‘‘అమ్మా ఇక నువ్వాపు. రోజుకొకసారన్నా వాడనయ్యి ఇంటో అనవసరం. అయినా నేను చెపితే నువ్వింటా. ఎముకలు అరిగే దాకా తోవుకో.’’

‘‘నేను సచ్చేదాకా నా సామానం అమ్మమాక. నీకు ఒద్దకపోతే నేను నా మనవరాలికి ఇత్తా. ఆనాడే దానికి ఒద్దకపోతే తెగ నమ్ముద్ది.’’

అక్కడే ఉండి ఈళ్ల మాటలింటన్న నేను, ‘‘నాకు మాత్రం కవలమ్మమ్మది రంగంపెట్టి, మైలగుడ్డల పెట్టీ కావాలి. రంగం పెట్టిలో ఉండి ఎండి కాటిక్కాయి, వక్కపొడి డబ్బా, ఎండి పెన్ను, పన్నీరుబుడ్డీ నాకే ఇత్తానందిగా.’’

‘‘తీసుకుని నెత్తిన పెట్టుకు ఊరేగు. నీకొచ్చేవాడు పల్లెటూళ్లో ఉంటాడనేంటి? ఏ పట్నంవాడో అయితే అగ్గిపెట్టి కొంపలో ఖాళీలేక ఇసిరి రోడ్డుకేత్తాడు. ఈ పెట్టెలు రొండూ పెట్టాలంటే పెద్ద చావిడి (హాలు) కావాలి.’’

‘‘కొంపాగోడూ లేనాణ్ణి ఎతికి తెత్తావా ఏంటి దానికి. మేం ఇద్దరం ఎల్లి సర్ది వత్తాం. అవసరం అయితే సచ్చేదాకా దాని దగ్గిరే ఉండి బూజులు దులిపి కడిగి పెడతాంలే,’’ అంది కవలమ్మమ్మ.

‘‘ఇప్పుడు మాటలూ ఓపికలూ అప్పుడు ఎవరికీ ఉండవు. అయినా దాని సంగతి మీరెట్టా చెబుతారు. ఇక అది కూడా ఏ ఆనందం లేకుండా మీకు మల్లేనే కుండలూ, డబ్బాలు, సట్టిలూ, సిప్పలూ కడుక్కుంటదా. చదువూ, ఉజ్జోగాలు, దేశాల మీద తిరుగుతా, అన్నీ హోటళ్లలో కొనుక్కుని తినే రోజులొత్తయ్యి. అయినా మీకు మడుసుల మీద కన్నా కుండ, సిప్ప, డిప్పా, సట్టీ, సిబ్బిరేకు, తప్పాళాలల మీదే మోజు. అయ్యే కూడు పెడతయ్యి.’’

‘‘మాకు తెలిసింది ఇదే. మీ బాబులాగా, నీలాగా మమ్మల్ని మా బాబు సదివివ్వలా. ఈటి గురించి తప్ప మాకింకేమి తెలుత్తయ్యి. ఏ ఊళ్లన్నా ఏలటం రావద్దూ. అయినా నాకు సామానం అంటే ఇష్టం. మల్లీ మాట్టాడావో, అన్నీ పట్టుకుపోయి ఏరే కొంపలో అద్దెకుంటా,’’ అని ఒక్కిసురిసిరింది.

ఎందుకొచ్చిన గొడవ అని అమ్మ కూడా వాదిచ్చలా.

రాత్తిరయ్యింది. సామానం వాకిలంతా పరిసి చిక్కురు బిక్కురుగా ఉండయ్యి. అమ్మమ్మలిద్దరికీ సర్దటానికి ఓపికలు అయిపోయినయ్యి. టేకుచెక్క చినుకులు పడితే పాడవుద్దని కవలమ్మమ్మ వరండాలో మైలపెట్టిని జరిపిచ్చారు.

అన్నాలు, కూరలు వండటం అయినాక అందరం ఇక్కడే తిన్నాము. కవలమ్మమ్మ ఆళ్లాయనా మా తాతా కలిసే యాపారాలు చేసేవారు. లాసొచ్చి మా తాత మానేసినా, ఆ తాత మాత్రం యాపారం ఏరుతో అక్కడే ఉండి సంవత్సరానికి రెండుసార్లు వచ్చి నెలేసి రోజుల లెక్కన ఉండి ఎలతాడు. కానీ చాలామంది అమ్మమ్మకి పిల్లలు లేరని రంగంలో ఎవరినో చేసుకుని పిల్లల్ని కన్నాడని ఆళ్లు పెంపకం కోసం, దానికోసం అక్కడే ఉంటన్నాడని ఎనకగా గుసగుసలాడుకుంటారు. ఎదురుగ్గా అంటే మా అమ్మా, అమ్మమ్మా రాచ్చసుల్లా పడతారని బయ్యం. ఆళ్ల ప్రేమలూ బందాలే ఏరు.

ఇద్దరూ ఇరవై ఏళ్ల నించీ పక్కపక్క ఇళ్లల్లో కాపరాలు. మొగుళ్లు తెచ్చినా తేకపోయినా సంసారాలు లాక్కురాటం అలవాటయిపోయింది. గోంగూరా పండుమిరపకాయలు పచ్చట్టో గోలగూర ఆకులాకులుగా కనపడేటట్టు పచ్చడి పట్టటం దగ్గిర నించీ రాట్నం మీద ఏకులు ఒడకటం, అత్తామావల సంవచ్చరీ కాలకి బట్టలు పెట్టి ఎవరికి దానం ఇవ్వాలి, ఏ గేదె పాలకి కోవా ఎక్కువ కట్టుద్ది, ఈ సంవత్సరం మొత్తానికీ ఎంత ముదర లేతరంగు కుంకాలు నూరుకోవాలి, రాళ్లు ఎన్నేయ్యాలి, నిమ్మరసం ఎక్కువయితే కుంకం ఏ రంగుకి తిరుగుద్ది, కొబ్బరినూనె, పచ్చ కర్పూరం పాళ్లు కుంకంలో ఎంత కలిపితే మొకాన రాలకుండా అతుక్కుంటుంది, పూర్ణాల పూత పిండి బరకబరకగానే ఎందు కుండాలి లాంటి జాతీయ సమస్యలన్నీ ఇరవై ఏళ్లుగా మాట్లాడు కుంటన్నారు. అయితే చివరికి ఇద్దరి నిర్ణయం ఒకటే.

ముందు మా అశిగాడు (అన్నయ్య) తరువాత నేనూ తరువాత మా తమ్ముడు ఎవరో ఒకళ్లం కవలమ్మమ్మ పక్క మీదే నిదర. మొగుడికి దూరంగా సంవచ్చరాలు గడిపింది కానీ పక్కలో మాత్రం పసిపిల్లలు లేకుండా ఎప్పుడూ లేదు. మేం పక్కలు తడిపేసినా ఆనందమే. ఒక్కోసారి మేం ముగ్గురం తన దగ్గిరే పొడుకుంటావని ఏడిసి కొట్టుకుని అమ్మ చేతుల్లో ఈపులు ఇమానం మొతలు మోగిచ్చుకున్న రోజులెన్నో.

ఇవ్వాళ కూడా అన్నాలు తినటం అయినాక అమ్మమ్మ మంచం ఎక్కి పడుకున్నా. అసిగాడికి, తమ్ముడికీ ఏరే మంచం ఏసింది. అందరం పగ్నలంతా అటూ ఇటూ తిరుగుతా పని చేత్తా ఉండామేమో తొందరగా నిద్దరలోకి జారుకున్నాం. అద్దరాత్తిరి కాడ ఎవరియ్యో మాటలు ఇనపడతన్నయ్యి. ఎవరా అని చూశా. ఎంతాశ్చర్యం. ఆళ్లు మైలపెట్టి మా రంగం పెట్టీ. ఏం మాట్టాడ తన్నయ్యో అని దగ్గిరగా ఇంటానికి నిలబడ్డా.

‘‘రంగప్పా ఏంటి రోజులిట్టా కూలతన్నయ్యి. మడుసుల ఎక్కలో మనం చిల్లికానీ ఇలవ చెయ్యటల్లేదు. ఎంత భోగంగా బతికావు? అసలు నీ పుటకెక్కడ, ఆ దర్జా ఏంటి? ఎక్కడ రంగం? ఎక్కడ కథ. రంగం నించీ నిన్ను తెత్తన్నారని ఉత్తరం వచ్చిన కాడ్నించి నీ రాకకోసం ఊరంతా ఎంత ఎదురుచూశారు. నువ్వు ఓడ మీద విలాసంగా దిగావు. నిన్ను ఆరుగురు  మడుసులు మోసి లాగుడు  పడవలోకి నిదానంగా కూచ్చోబెట్టారు. ఆ పడవ పెద్ద కాలవలో పడి సాయంత్రానికి ఊరు జేరింది. కాలువ గట్టున ఊరు ఊరంతా నిలబడ్డారు. జాగ్రత్తగా తాళ్లు ఉయ్యాలతో గోనెపట్టల మీద దించి జనం స్వాగతంతో ఆశ్చర్యంగా సూత్తంటే సున్నం కొట్టిన తెల్లటి ఇంట్లో అడుగెట్టావా. మీది దేవదారు వంశమేమో మాంచి వయస్సులో ఉండప్పుడు తయారయ్యావేమో అబ్బా ఎంత సోకు. నీపై నున్న ఇత్తడి బద్దీల నగ్నల ముందు ఎంత హారాలయినా దిగదుడుపే. రోజుకొకింటాళ్లొచ్చి నీలో డబ్బు దాసుకునేవాళ్లు. నాలుగొరసల్లో ఎన్ని సొరుగులు.

నల్లమందుకి ఒక అర. దాన్ని సూసి మొకం చిట్టగిచ్చినా, పెద్ద పాపాయి కూతురు కన్నప్పుడు, సరిగ్గా సూడక వాపునెప్పులొస్తే, నాటుసిక్కుడు గింజంత ఏత్తే మళ్లీ మూడురోజులు నెప్పులని మూలగలేదు. అట్టాగే కాసుల సొరుగు. రంగం నించీ వచ్చిన పత్తీ, చెక్కరంగుదే అయినా తోటలో దూరిపి ఉంచితే ఆ సొరుగులో ఊరందరిదీ శాదెడు బంగారం దాశారు. ఇనప్పెట్లెలూ, బాంకీ తాళాలూ ఒట్టి సేతుల్తో పగలకొట్టే స్టూవర్టుపురం దొంగ ‘మాణక్కానికి’ తెల్లవార్లూ తిప్పినా అరదారి కనపడలా. పట్టుసీరలు, తనఖా కాయితాలు, డిక్రీలు ఎన్నెన్ని దాశారు. సెరిత్రలో ఈళ్లు కొన్న గన్నాయ్‌, బొన్నాయ్‌ బీరువాల తాళాలు పగలకొట్టి దొంగతనాలు సూశాంగానీ ఒకనాడన్నా రంగం పెట్టి దోపిడీ జరిగిందని రోడ్డుకిగానీ, పేపరుకిగానీ ఎక్కి ఎరుగుండామా,’’ అని దిగాలుగా అంటుంది మైలపెట్టి.

నీ బతుకు మాత్రం అవటానికి ఇడిసిన గుడ్డలపెట్టయినా పెళ్లీ, బట్ట, పెద్దమడిసి అయినబట్ట, పురిటిగుడ్డలూ, శోభనం గుడ్డలూ, పురుళ్లు, పున్యాలు, సావులు ఎన్నిటిని కాసి కాపాడా. నువ్వే లేకపోతే గబ్బెత్తిపోయేది ఇల్లు. అనే లోపల డమ్‌మని దూకింది, సూరుకి యాలాడగట్టిన సొరకాయబుఱ్ఱ.

‘‘ఏంటి మాట్టాడతన్నారు రంగం వదినా?’’

‘‘ఏదో కట్టం, సుకం లే? సూరులో ఎట్టుండా?’’

‘‘ఉప్… ఏం జెప్పను. కనీసం మిమ్మల్ని ఇళ్లల్లోనో, సంత మేడల్లోనో ఉంచుతున్నారు. మా పని మరీ గోరం. ఇదివరకి పాదుబెడితే ఇంటి కప్పంతా అల్లుకుని, సల్లగా లేత కాయలతో కడుపులు నింపుతా ఉండేదాన్ని. సొరకాయ దప్పళం అంటే నా స్నేహితురాలు ముద్దపప్పుతో కలిపి తినని వాళ్లుండారా. ముదిరినాక నన్ను లోపల శుభ్రంజేసి రకరకాల ఇత్తులునింపి యాలకడితే ఒచ్చే పంటకి గింజ పొట్లిపోకుండా, పుచ్చకుండా, బూజు పట్టకుండా పొట్టలో దాచుకునేదాన్ని. ఏంటో మమ్ముల్ని పెంటపోగుల్లో ఏసి, ప్యాస్టిక్‌ పొట్టల్లో ఇత్తనాలు దూరుతున్నారు. ఈ ప్యాస్టిక్‌ జిమ్మదియ్య,’’ అని మెటికలు ఇరుత్తుండగా ఎవరియ్యో నీడలు కదిలినట్టయ్యింది.

రంగంపెట్టి కళ్లు నులుపుకుని సూత్తే దిగులుగా మూడు కోతులు వచ్చి, ‘‘బావుండావా రంగప్పా,’’ అన్నయ్యి.

‘‘ఏం బాగులే దినదినగండం నూరేళ్ళాయుష్షు. మీరెవరు? అయినా కోతిమూక మీకేం తక్కువ? దేశం అంతా ఎగరొచ్చు.’’

‘‘ఏం ఎగురుతాం? అడివి అంతా నరికేసి వరిపొలాలు, చేపల సెరువులు సేత్తే. మెందు కొట్టిన పచ్చిగడ్డి తిని కడుపులు ఉబ్బి చానామంది మావాళ్లు సచ్చిపోయారు. ఇక మా విషయం` నా పేరు విజారు, ఇది ఐజారు, ఇది కిజారు. మాది జపాను దేశంలో నిక్కారు నగరంలోని బౌద్ద ఆలయంలో ఒక గోడ. అక్కడ మమ్మల్ని ఇతారిస్కో అనే ఆయన ఎడమ చేత్తో రాశాడు. మాది ఇతారి వంశీకుల పడికట్టు. ఇతారి అంటే ఎడమచేత్తో రాసేవాటం ఉండాళ్లం అని అర్థం. గాంధీతాత మనసుని గెలుచుకుని ఇక్కడ మనుషుల్లో ఇళ్లలో కలిసిపోయాం. ఆయన గురించి మాట్టాడినప్పుడల్లా ఆయనతో సమాన గౌరవం అందుకుంటా, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్టాడకు అని పేర్లు మార్చుకున్నాం. మేం పుట్టి పెరిగిన ఊరినే మరిసిపోయాం. ఇప్పుడు ఇక్కడాళ్లకి గాంధీ సినిమాల్లో గుర్తున్నాడు. మా గురించి ఇక చెప్పేవాళ్లెవరు. గాంధీ తాతతోనే మా ఇలువంతా పోయి ఒట్టి కోతిమూకలా మిగిలాం,’’ అని జలజలా కన్నీళ్లు రాల్చినయ్యి.

టకటకమని పళ్లు నూరతన్న శబ్దం ఎక్కడిదా అనుకుంటే చీకిపోయిన గోనెసంచిలో పురికొసతో కట్టిన మూటలోనించి బయటపడటానికి తన్నుకుంటోంది. ఏదో ఏంటో అని సంచి మూతి ఉప్పదీత్తే కీళ్లు, కాళ్లు సరిచేసుకుంటా బయటపడిరది చిలకల అచ్చు.

‘‘అయ్యో ఇదేంటి ఎల్లువకి కొట్టుకొచ్చిన పిల్లలా నీలుక్కుంది. ఒల్లంతా సెదలు కొరుక్కు తినట్టుందే?’’

టకటకా అరిగిపోయిన దవళ్లని కదిలిత్తా మొదలుబెట్టింది. ‘‘ఏం జెయ్యను. తెల్లటి పంచదార పాకంపట్టి నిమ్మరసం పిండి పక్కనబెట్టి, మమ్మల్ని నీళ్లలో ముంచి మాలో పాకం నింపితే నిమిషాల్లో మా నించీ అడివిలోకి పారిపోయే జంతువులు, ఆకాశంలో పిట్టలు, నీళ్లలో చరాలు ఎన్ని తయారయ్యేయి. పిల్లలు ఎంత సంబరంగా జేబుల్లో పెట్టుకుని చేతులు నాక్కుంటా కాకెంగిలితో పంచుకునేవాళ్లు. పెళ్లిలో పెద్దపెద్ద ముంత మావిడి కాయలంత చిలకలు పోసి ఎదురు బుట్టలో పెట్టి ఇయ్యపురాలికిత్తే మురిసిపోయి, కోపాలన్నీ మరిసిపోయేవాళ్లు. మమ్మల్ని సూత్తే నవ్వని పెదాలు, అపురూపంగా అరచేతిలో ఉంచుకోనాళ్లేరీ,’’ అంటంటే దాని వంటి చెదపురుగుల్ని అందరూ పడి దులిపారు. ఇంకా కొన్ని అట్టాగే ఉండగా,
‘‘ఓ అరుణపతాకమా, చేసుకోమ్మా రెడ్‌ సెల్యూట్‌. నీలో ఉన్న సుత్తి, శ్రమజీవుల నవీనశక్తి నీలో కలుసున్నది కొడవలి,’’ అంటూ పాట పాడతన్న కొడవలీ, సుత్తి, ప్రవాహంలా వీళ్లని అనుసరిత్తన్న దబ్బనం, అట్టకాడ, గొడ్డలి, పొలుగ్ను, గ్నునపం, ఆరి, తవ్వంగాల, దోకుడుపార, మొత్తాన్ని చూసి గొడ్డలి ఊగిపోతా ఉపన్యాసం అందుకుంది.

ఆ ఉపన్యాసం అయిపూ అంతూ లేకుండా సాగుతాంది. ఇంతలో సుట్టూ, జిడ్డూ కవురు కంపు వంటితో, సంగం ఎలికలు తిని కొరికి వదిలేసిన ఆవునెయ్యి ఒత్తులు యాలాడతంటే వచ్చినయ్యి నాలుగు దీపారాధన కుందులు. ఆటితో పాటుగా ఒళ్లంతా ఎలికగొద్దెలు, పగిలిన బల్లిగుడ్డు పెంకులతో పొత్రం దొల్లినట్టు డొల్లుకుంటా నడుత్తా వచ్చింది లావాటి గుండిగ.
ఇదేంటి జనంలో భక్తి ఇపరీతంగా పెరిగి పూజలూ, పునస్కారాలూ ఎక్కువయినయ్యి కదా. మీరేటి శనికి దానవిత్తే ఏళ్ల తరబడి వాడని నువ్వుల నూనిలా సవురు కారతన్నారు. మీ ఎనకాల పానకం పోసే గుండిగకేమొచ్చింది.

‘‘ఒక్కొక్క కుందిలోకీ కేజీ నూని పొయ్యాలి. ఈళ్ల దగ్గిర అంత డబ్బులా, రోజూ తోవే ఓపికలూ లేవు. పున్యం లేకోతే పింగాయె. రోజుకో వాదం, ధ్యానం అని, యోగ అని, మనస్సని, ఆత్మ అనీ ఇక్కడెవరూ మమ్ముల్ని లెక్క చెయ్యట్లా.

అదేంటంటే తింటానికి కూడులేదగానీ పూజలెందుకు అని తిడతన్నారు. మాకు అమెరికా పోవాలని ఉంది. ఈ ఇంటి సుట్టాలు అమెరికాలో వుండారు. మాలాంటి నాలుగు కుందుల్ని, నాలుగేపులా పెట్టి మజ్జలో గుండిగ పెట్టి పయినగాజు పలకేసి అన్నాల బల్ల చేశారంట. ఆళ్లని సూట్టానికి మనాళ్లే కాదు, ఇంగ్లీసాళ్లు కూడా వత్తన్నారని అనుకుంటన్నారు. ఆళ్లు అక్కడ మెరుత్తున్నారంట. అట్టా ఆ దేశం అన్నా పోయి ఒకెలుగు ఎలగాలని ఉంది. సొంతూళ్లో ఇలవా సలవా లేదు. ఏడాదికోసారి రుద్ది కడగటానికే ఏడిసి సత్తన్నారు. ఎవరు పడితే ఆళ్లే ముట్టుకుంటన్నారు. ఆచారాలకయితే ఎప్పుడో ఉద్ద్యాపన చెప్పేశారు. ఎన్ని తరాలు సూత్తన్నాము. ఈళ్లు మన ముందు పుడతన్నారు, సత్తన్నారు. ఇంకెన్ని తరాలు సూత్తాయో. నిలేసుకుని ఉండా పట్టిచ్చుకోటల్లా. లెక్కలేనట్టుగా ఇదిలిచ్చి పోతన్నారు. కనీసం ఆదేశవన్నా పోతే ఈ చింతలన్నీ మరిసి ఆళ్లకి కొత్తగా కనపడొచ్చు.

‘‘ఏంటల్లా అమెరికా, పీనిగ మొకాలు అంటన్నారు,’’ అంటా కడుపుతో ఉండే ఆడదిలా, ఉప్పు ఉరిసి పాతకంపు కొడతా వచ్చింది సింతకాయ పచ్చడి జాడీ.

‘‘అబ్బో నువ్వా మాకన్నా పురాతనం. సీకుడు ఆలోశనలు, మాకే సీద్రం అయినా వచ్చిందిగా ఏం సెప్పుద్దో,’’ అన్నట్టు చూశారు.

‘‘నా పచ్చడీ నేనూ రొండూ మోటే. జరం వత్తే పత్తెం భోజనం, నాలో తెలుగాళ్ల ఆవకాయ, గోంగూర, మాగాయి, నార దబ్బకాయి ఎన్ని దాసుకున్నాను. మీరు నన్ను పాత సింతకాయ బావాలన్నాగానీ ఆనాడే ‘ప్యారీ’ అనే పేరుతో గీరపోయా. మేం చిన్నాపెద్దా కలిపి ఒక ఐదారన్నా పతి ఇంటో తిరిగేవాళ్లం.’’

అంతలో అందరికీ అమ్మో, అమ్మో అని అని ఒంటి మీద వాతలు తేలుతున్నాయి. ఎవరో గాలిలో ఎగిరెగిరి కొడతన్నారు. ఆ దెబ్బలు సర్రన కొండరాయిని కోసినట్టుగా సురుకు అంటు తున్నయ్యి. దొరక పుచ్చుకుంటే అది వాళా కఱ్ఱ. ‘‘ఒంగోలెద్దుగానీ, మైసూరెద్దుగానీ బండి కడితే చట్‌చట్‌లాడతా చేతిలో రంగు కుచ్చులతో మెరిసేదాన్ని. కింద నాకో మూరెడు పొడుగువారు కట్టేవాళ్లు. వాళా కఱ్ఱా, చెర్నాకోలు, వారుకోలు అని ఎన్ని పేర్లు. నాకు తోడు మా అమ్మకి సవితి కొడుకుండేవాడు. ఆడి పేరు ముల్లుకఱ్ఱ. తుప్పట్టిన ముల్లుతో ఉండాడు. మమ్మల్ని సూత్తే ఎంత పశువయినా, ఆబోతయినా మేకలా మారాల్సిందే,’’ అని గప్పాలు కొడతంది. ఎనక్కి తిరిగితే, గలగల సిన్న గెంటల మోత ఊగతా ఊగతా, సంపంగి నూనోసనతో, నాలుగ కాళ్లతో కింద రాతి జోళ్లుతో ఊగతా వచ్చింది పందిరిమంచం. అందరూ కూసోండని నడుం వాల్చింది. అయ్యో నడుం ఇరుగితే అవటిదానివవుతావు అన్నారందరూ.
బుస్సున కోపంతో ‘‘ఇరగటమా, ఈ ఇంటికి మూడు తరాల ముందు పెద్దావిడితో పాటుగా కాపరం జేత్తన్నా. రాయగడ తెలువడ్రంగుల సేతిలో తయారయ్యా. అబ్బో ఈ మంచంమ్మీదే ఆ పెద్దాళ్ల మొదటి రాత్తిరి. గదిలో అన్నీ సర్ది మంచం పయిన సలవగుడ్డ పరిసి, సన్నజాజులు సల్లి అప్పుడు అమ్మాయిగా వుండ ఈమెని లోపలికి పంపారు. తలుపు సందుల్లోనించీ కిటికీల్లోనించీ వరసయినాళ్లు తొంగి సూట్టం సూసిన పెళ్లికొడుకు శోభనం వద్దు, అన్నీ మా ఇంటికొచ్చినాకే, ఇదేవన్నా అందరూ సూసే ఆటా, ఇద్దరి పరవశం, ఆళ్లకే సొంతమయిన గ్యాపకం,’’ అని అలిగి ఆళ్లూరి దారి పట్టాడు.

బాగా చదువుకున్నాడు. ఇట్టాంటియ్యి నచ్చవని, ఎదవ ఏసాలెయ్యమాకండని, పెద్దాళ్లందరూ ఆడాళ్లని కేకలేసి, ఆఖరికి ఇద్దరినీ గదిలోకి పంపారు. అమాయకుడనుకున్న పెళ్లికొడుకు నాలుగు రోజుల్లో నూనిదీపం ఎలుగులో నూలుసీరిప్పదీప్పిచ్చి, జుట్టు జారేసి, పెనబాముల్లాగా సుట్టేసుకుంటా, గోడ మీద పడిన ఆళ్ల నీడల బొమ్మలు సూపి ఆళ్లే సిగ్గుపడి సిన్ననవ్వులు నవ్వుకునే వాళ్లు. అట్టా నా సాయంతో ఆరుగ్నురు పిల్లల్ని కన్నారు. పడకగది లోనూ పందిరిమంచంమ్మీదా ఆళ్లు తన్నుకోటం ఏనాడూ సూడలా. ఆ పెద్దావిడి పడకింటోకి, మురికి సీరతో ఎప్పుడూ రాలా. ఇవ్వాళ ముసలాయన కాలం చేశాడు. ఆమేమో ముతక కోకల్లోకి ఏలు ముడిలోకి దిగిపోయింది. నన్నేమో కీళ్లూడదీసి గోడకానిచ్చారు. ఆ రోజుల్లో ఆళ్లిద్దరి మజ్జా నలిగిన మల్లెరేకులు, మరవం ఆకులూ పెట్టెల్లో ఇరుక్కుని సాలీళ్లు గ్నూళ్లు అల్లుకుంటన్నయ్యి. దూరంగా మినుకు మినుకుమంటా అందరి మీదా గుడ్డెలుగు చూపిత్తా పలచగా పరుచుకున్న గాజు దీపంబుడ్డి, పక్కనే గడకఱ్ఱలాగా వత్తన్న సవురు తోడుకునే బొంబాయి (ఒకలాంటి పంపు).

ఈళ్లందరినీ చూత్తా అటూ ఇటూ పరిగెత్తుతున్నా. ఈలోపల కాల్లో ఆకుముల్లో, పల్లేరుగాయి ముల్లో కస్సున దిగింది. ముల్లు లోతుగా దిగి ఇరుక్కుంది. రాటల్లా. ఏమి చెయ్యాలా అని నెప్పిని భరిత్తా కాలును ఒళ్లో పెట్టుకుని కింద కూచ్చున్నా. అప్పుడు గలగలలాడతా వచ్చింది. చూత్తే ముళ్లగుత్తి. దానికి యాలాడతన్న చిమిటికి, నిదానంగా నా కాలుని తీసుకుని తను ముళ్లు ఇరుక్కున్న దగ్గిరకి వచ్చి గుత్తితో ముల్లుని అట్టుకుని ఒక్క లాగు లాగింది. మెత్తని కండలోనించీ అమ్మా అన్న మూలుగుతో పాటు ముల్లు కూడా వచ్చేసింది. ముళ్లుగుత్తి గలగలలాడతా నెమ్మదిగా గుంపులో కలిసింది.

గోల గందరగోళంలో ఒకపక్కన బరబరా పోష్టుకార్డు మీద గోకుతుంది ఇంకుపెన్ను. రాసిరాసి గొంతుకలో నించీ నల్లరక్తం కక్కుతా, అరిగిపోయాను. ఓపిక లేదు. ముందుతరాలకి అందాలని ఈ రాత. అని మళ్లీ కక్కి, క్షమించండి, ఎన్ని జీవితాలకి రాశానో నాకే జీవితం లేకుండా అయ్యింది.

పట్టెమంచం మీద కూచ్చున్న తాబేటికాయ, సొరకాయ బుఱ్ఱ, కత్తి, సుత్తి, కొడవలి, కుండా, గొడ్డలి, చిలకలచ్చు, తెడ్డు కట్టె, గాజుబుడ్డి, బొంబాయి, మరచెంబూ, గ్నునపం, ఆరి, అట్టకాడ, ముళ్లగుత్తి దాని ఆనుకున్న చిమిటికీ కబుర్లు చెప్పుకుంటన్నయ్యి. బఱ్ఱబఱ్ఱమని ఒళ్లు జలతరిచ్చే మోత వత్తంటే చూశారు. గిరగిరా సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా తన చుట్టూ తనే తిరుగుతున్న తిరగలి. కారతన్న నూని, ఇసిరేది ఏంటో ననుకుంటే ఇసక.

‘‘పప్పులన్నీ మిల్లులో తయారయ్యి,   మేము  పెరట్టో  కాళ్లు కడుక్కునే రాళ్లలాగా మారాం. నా సత్తా సూపిద్దాం అని ఇసకని ఇసిరి నూని కక్కిత్తన్నా. అందరూ కలిసి తిరగలిని కూడా గుంపులో కలుపుకుని ఏం జెయ్యాలా అని ఆలోసించి, పుత్తకాల మేజాబల్లని సలహా అడిగినయ్యి.

‘‘ఎదురుతిరిగి చితక్కొట్టకపోతే బతుకే లేదు. పతింటిలో నించీ ఇప్పటికే బయటికి తోశారు. మిగిలిన వాళ్లమయినా బతకాలి. మన శత్రువులని దొరికినాళ్లని దొరికినట్టు నాశనం చెయ్యండి. పదండి యుద్ధానికి, ఆఖరి పోరాటానికి, అంతూ అయిపూ తేల్చుకోటానికి,’’ అని బయలుదేరదీసింది.

అంతే అన్నీ, అందరూ కలిసి ఫ్రిజ్జులనీ, ఏసీలనీ, ప్లాస్టిక్‌ కుర్చీలనీ, ప్లాస్టిక్‌ బల్లలనీ, బాటిళ్లనీ, టీవీలనీ, గ్రైండర్లనీ, మిక్సీలనీ, వాషింగ్‌ మిషన్‌లనీ నాశనం చెయ్యటంలో పడ్డయ్యి. ముక్కలు ముక్కలవుతున్న ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ వాన కురవటం మొదలుపెట్టింది. అది తుఫానుగా మారి, వరదయ్యి ఇళ్లనీ వాకిళ్లనీ ముంచెత్తింది. మరి అమ్మమ్మా, తాత, కవలమ్మమ్మా ముసలాళ్లంతా ఏరి? కొట్టుకుపోతన్నారు. అయ్యే దాహం… తాగటానికి నీళ్లు లేవు. అంతా ప్లాస్టిక్‌ ద్రవం. గొంతెండి పోతంది… బాబోయ్‌… అమ్మా… నాన్నా… అమ్మమ్మ… దాహం… అని గెట్టిగా అరుత్తున్నా.

ఫట్‌మని ఈపు మీద దెబ్బ పడటం, ‘‘బారెడు పొద్దెక్కినా ఏనిగల్లే కలవరిత్తన్నా. సామానం సర్దాలి. లేసి మొకం కడుగు. పాలు కలిపింది అమ్మమ్మ,’’ అంటంది కవలమ్మమ్మ.
ఒక్కసారి సుట్టూ చూశా. ఇల్లంతా పరిసిన సామానం. ఆటిని సూడాలంటే దడవనుకుగా ఉంది. కాసేపుట్టో అన్నీ ఒకదాంటో ఒకటి, ఒకదానిమీద ఒకటి కుప్పలుగా పడతయ్యి. అమ్మమ్మలనీ, తాతలవంకా చూశా. ఈళ్లని వృద్ధకొంపల్లో బతికుండగానే చల్లటి గదుల్లో కుక్కుతారు. దూరంగా చూశా. రైతులు పీకేసిన పత్తి కంపని మండిలా పేర్సి తొక్కి పైకి లెగవకుండా గాడిద రాళ్లు పెడతన్నారు.

మంచం దిగా. కాళ్లకి ఏదో తగిలింది. సొరకాయబుఱ్ఱ. ఇదిలిచ్చా. ఎన్ని మంచి ఇత్తనాలో, కావలసిన ఇత్తులు తీసుకుని భద్రంగా సూరుకి కట్టాను.

ఇయ్యన్నీ నా పిల్లలిక ఆళ్లమ్మమ్మ, నాయనమ్మలతో కలిపి ఇయ్యాలి. నా బిడ్డలు, కాదు బిడ్డల బిడ్డలు కూడా భద్రం చేసుకోవాలి. అన్నిటినీ, అందరినీ.

మొత్తం సామాన్లన్నీ రంగంపెట్టి సుట్టూ జేరి ‘ఎంకినై పాడాల ఏ జనమకయినా,’ అంటా కాలూ చెయ్యీ ఊపుతా నాట్యం చేసినయ్యి.

 (  కన్నెగంటి చంద్ర సంపాదకత్వం లో వచ్చిన  తానా సావనీరు (2013) లో ప్రచురితమైన కథ ఇది. పునర్ముద్రణకు అంగీకరించిన  రచయితకు ధన్యవాదాలు )