నేలతల్లి విముక్తి చిరునామా – పాణి కవిత్వం!

aboozmaad

 

అబూజ్ మాడ్.. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. ఏడు దశాబ్దాల తరువాత కూడా స్వాతంత్ర్యం పొందామనుకుంటున్న ఈ దేశ చిత్రపటంపై ఈ పేరు ఒకటి వున్న ప్రాంతమున్నదన్నది అటు పాలకవర్గాలకు కానీ సామాన్య ప్రజానీకానికి కానీ ఎరుకలో లేదు.  కానీ ఇటీవలి సామాజిక రాజకీయ ఉద్యమాల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఈ పేరు అందరికీ తెలిసింది. కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అంటూ కార్పొరేట్ మీడియా కథనాలు ఈ ప్రాంతం చుట్టూ కమ్ముకుంటున్న సైనిక యుద్ధవాతావరణం దీనిని ప్రజలందరి మనసులో ఓ ప్రశ్నగానో లేక ఒక భయంగానో ఎక్కువమందికి ఆశ కల్పించే ఓ సుదూర అరుణతారగానో మదిలో మెదులుతూంది.

కారణం మధ్య భారత దేశంలో కేంద్రీకృతమైన ప్రజాయుద్ధ గెరిల్లా క్షేత్రం ఆదివాసీ సాంప్రదాయ ఆయుధాలతో పాటుగా ఆధునిక కలష్నికోవ్ లతో ఈ దేశ కార్పొరేట్ పాలక వర్గ సైన్యాన్ని సవాల్ చేస్తూ నిలబడి వుండడమే. దీని నేపథ్యంగా పాణి తన కవితా సంపుటిని అబూజ్ మాడ్ పేరుతో వెలువరించారు. విరసం బాధ్యులుగా వున్న పాణి తన విమర్శనారంగం, నవలా రచనలనుండి కవిత్వ రంగం వైపు అనివార్యంగా వచ్చానని తన ముందుమాటలో పేర్కొన్నారు.

“కవిత్వంతో ఎందుకులే అనుకున్నా… కానీ కవిత్వం కావాలి. కవిత్వం ఉద్యమాలకు కావాలి. కార్యకర్తలకు కావాలి. మనిషికి తప్పక కావాలి. కవిత్వం రాయడమొక అవసరమని, గొప్ప అనుభవమని, అంతులేని ఓదార్పు, తిరుగులేని శక్తి అనీ ఈ కవిత్వం రాస్తూ, రాస్తూ తెలుసుకున్నాను” అని అంటారు. నూతన మానవుని ఆవిష్కరణ అనే ఓ సుదీర్ఘ స్వప్నాన్ని కలగంటూ తడిగా బురద అంటి ముళ్ళు గుచ్చుకున్నా మండే కొండ రాళ్ళపై ఓర్పుతో సహనంగా నేలపై నగ్న పాదాలతో విల్లంబులు ఎక్కుపెట్టి తన నేలను నేల గర్భంలోని సంపదను భవిష్యత్ తరాలకు పచ్చగా అందించేందుకు గోచి పాతతో ఎదురొడ్డి నిలిచిన ఆదివాసీ ఈ దేశ అసలు సిసలు భూమిపుత్రులు చేస్తున్న పోరాటాన్ని త్యాగాన్ని వారికి దిశా నిర్దేశం చేస్తున్న ఉద్యమకారుల వీరోచిత నెత్తుటి త్యాగాలను అక్షరాలలో పచ్చి నెత్తుటి తడితో మనకు పరిచయం చేస్తూ తద్వారా ఓ సామాజిక సందర్భాన్ని యుద్ధ మేఘాల ఉరుములు మెరుపులను రాజ్యం చేస్తున్న హంతక పాలనను, కుట్రలు కుయుక్తులను కవిత్వంగా అందించారు పాణి.

అబూజ్ మాడ్ లో దండకారణ్యంలో కొనసాగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో సంక్షుభిత కాలంలో జరుగుతున్న విధ్వంసపూరిత ప్రయాణంలో అక్కడే జరుగుతున్న అద్భుతమైన ప్రత్యామ్నాయ సామాజిక ప్రయోగం జనతన సర్కార్ గురించి పాణి కవిత్వం ద్వారా ప్రకటన చేసారు.

 

అబూజ్మాడ్ రాజకీయం అంటే – తెలియనిది తెలియడమే

శత సహస్ర యుద్ధ రంగాల్లో

గెలుపోటముల నిమిత్తం లేకుండా తలపడిన ఆదివాసీకి

నక్సల్బరీతోనే తన యుద్ధం రాజకీయమని తెలిసింది

పోటీ రాజకీయమని తెలిసింది

అప్పటి నుంచే దండకారణ్యం

లోకమంతా తెలుసుకోవాల్సిన ప్రయోగం అయింది… అంటారు.

 

గెలిచిన పోరాటాలు సరే

ఓడినా తలవంచని గాథలలోనే కదా

చరిత్ర రక్త ప్రసరణ పోటెత్తేది…

 

ఈ కవిత్వంలో సామూహిక సామాజిక నేపథ్యాలతో పాటు కవి తన వైయక్తిక భావ సంఘర్షణను హత్తుకునేట్టు ఆలోచింపచేసేట్టు అక్షరబద్ధం చేయడం విరసంపై గత కొన్నేళ్ళుగా ప్రధాన స్రవంతిలో వున్నామనుకుంటున్న కవుల సాహిత్యకారుల విమర్శలకు ధీటుగా చాలా కవితలు వున్నాయి. కవిత్వం కావాలి కవిత్వం అని గొంతెత్తేవారి దాహార్తిని తీర్చే కవిత్వం మెండుగా వుంది.

పాణి

పాణి

తెలిసీ తెలియక

 

దు:ఖమొకసారి కార్చిచ్చు

మరోసారి విరిగిపడే కడలి ఘోష

 

నీ స్పర్శకెపుడైనా తెలిసిందా

 

మనిషి తెలియకపోవడమే దు:ఖం

ఎందుకిలా ఉన్నాడు

ఎందుకిలా ఉన్నది

ఏ అంచనాకూ

పరికరాల్లేని నిస్సహాయతే దు:ఖం

 

అబూజ్ మాడ్ (కవిత్వం) – పాణి

ప్రతులకు: దిశ పుస్తక కేంద్రం, సహచర బుక్ మార్క్, నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. వెల: రూ.50/-

  కెక్యూబ్ వర్మ

1236896_10200449162092190_608445714_n

అడివిలో మాయమయిన ఇంకో వెన్నెల!

’సముద్రుడు’ ఈ పేరు వినగానే ఒక గంభీరమైన వాతావరణం ఆవరించుకుంటుంది. నాకు కవిత్వాన్ని విశ్లేషించడం రాదు. ఆస్వాదించడం లేదా వంటపట్టీంచుకోవడమే వచ్చును. కొన్ని కవితలు చదివినప్పుడు బాగున్నాయనుకుంటాం మరికొన్ని చదువుతుండగానే  మనలోని వెలితిని కోల్పోతూ మమేకమవుతాం మరికొన్ని చదువుతూ కొత్త వెలుగును చూస్తాం. అలా కొత్త వెలుగును చూపే కవిత్వం ఆసరా భరోసా ఇచ్చే కవిత్వం ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు కొద్ది మంది కవిత్వంలోనే పొందుతాను. అందులో మొదటిది సముద్రుని కవిత్వం. ఈ వరుసలోనే అమరులు కామ్రేడ్ ఎమ్.ఎస్.ఆర్., కామ్రేడ్ కౌముదిల కవిత్వం. ఈ ముగ్గురి కవిత్వ వస్తువు ఒక్కటే అయినా ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి అక్షరం వారిదే. ఒకరికొకరు యుద్ధ రంగం నుండే రాస్తున్నా తమ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ విప్లవ కవిత్వానికి ఓ కొత్త పరిమళాన్ని అద్ది దారి చూపిన వారే. ఇప్పుడు సముద్రుని సమయం గురించి మాటాడుకుందాం.

సరిగ్గా ఇరవై రెండేళ్ళ క్రితం 1991 సెప్టెంబర్ ఒకటో తారీఖున ఉద్యమ కార్యాచరణలో భాగంగా మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు యువకులపై కాల్పులు జరిపి గాయపడిన వారిని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి ఎదురుకాల్పుల పేరిట రాజ్యం హత్య చేసింది. వారిద్దరిలో ఒకరు కామ్రేడ్ జనార్థన్. తన కలం పేరు సముద్రుడు. అతని అమరత్వం తరువాత ఆయన ముద్రిత రచనలు ’త్యాగమే జయిస్తుంది’, ’భూమి నా తల వెల నిర్ణయించు’, ’స్వేచ్చ’, ’వాడు నా భూమి, మరణానంతరం అచ్చయిన ’మృత్యువే మరణిస్తుంది’ కవితా సంకలనాల సంపుటిగా సముద్రుడి సమయం’ పేరుతో విరసం 1994 లో ప్రచురించింది.

నిజానికి విప్లవ కవిత్వమంటే నినాద ప్రాయంగా ఒకే వస్తువుతో ఎలిజీలకు పరిమితమవుతూ ఉంటుందని చాలా మంది అభిప్రాయం, నిజమే కదా యుద్ధ రంగం నుండి పిలుపు ప్రేమ పల్లవిలా ఎలా పలుకుతుంది? అది వీరుని గొంతులోనుండి యుద్ధ నినాదంగానే పెడబొబ్బలా సింహనాదంలా ప్రతిధ్వనించి మేల్కొలపాల్సిన అవసరముంది. అదే సమయంలో మీ తూనిక రాళ్ళకు సరిపోయే కవిత్వాన్ని అందించే కృషి జరుగుతునే వుంది నిరంతరం. అలా కృషి కొనసాగుతున్న క్రమంలోనే నూనూగు మీసాల నూత్న యవ్వన ప్రాయంలోనే యుద్దరంగంలో ఒరిగిపోతున్న వారి కవిత్వానికంటిన పచ్చి నెత్తురు తడి మీ అరచేతులకంటుతుంది ఈ సంపుటినిండా. ఒరిగిపోతున్న తన గురువులు, సహచరుల గురించి కవి గుండె కలిగిన సముద్రుడు రాయకుండా వుండగలడా? అలా ఇందులోను ఎలిజీలు వున్నాయి.

శివారెడ్డి గారన్నట్టు విప్లవ సాహిత్యం ఎదుగుదలలో ’ఎలిజీ’ది ప్రత్యేక స్థానం. ఒక ఎడబాటు, ఒక లాస్, ఒక తీరని దు:ఖం, పోయిన దాన్ని వెతుక్కునే క్రమంలో తగిలే కారణాల్లోంచి జన్మించే క్రోధం నుంచి ’ఎలిజీ’ పుడుతుంది అంటారు. అసహజ మరణాలు నిత్యకృత్యమయ్యే దశలో ’ఎలిజీ’ అనివార్యమయింది. ఎవడి ’ఎలిజీ’ వాడు రాసుకునే దశ ఇది అంటారు. యుద్ధ రంగంలో వున్న గెరిల్లా తనను తాను సంభాళించుకొని అడుగు ముందుకు వేయటానికి పనికొచ్చేదే కామ్రేడ్ స్వర్ణలత ’చరితార్థయై’ గాధగా మిగిలినప్పుడు రాసిన వాక్యాలు..

 

’ ప్రపంచంలోని విషాదాన్ని, ఆనందాన్ని ఒక్కసారే ఎవ్వరైన

 తాగుతారో లేదో తెలియదు గానీ.

 విప్లవకారులు మాత్రం హాలాహలాన్ని అమృతాన్ని ఒకేసారి

 తాగి జీర్ణించుకోగలరు’

అలాగే కామ్రేడ్ సుధాకర్ అమరుడయినప్పుడు రాసిన ’బేబాకీ’లో

 

’ చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటే

 గేలిచేస్తూ పగలబడి నవ్వే వారెవరు?

 కబళించిన చావును తిరిగి విసిరి

 గోడకు దిగ్గొట్టిన వారెవ్వరు?

 శహభాష్! నా వీరులారా!

 మీరు చావుకి గోరీలు కడుతున్నారు’

అలాగే కామ్రేడ్ బాబూరావు అమరత్వంపై రాసిన కవిత ’మృత్యుంజయులు’ లో

 

మీ కోసం వదిలిన ఈ కన్నీళ్ళు

సామాన్యమైనవి కావు కామ్రేడ్ అంటూ

ఇవి రక్త సంబంధం కోసం వదిలిన అశువులు కావు

హిమాలయాలకంటే ఉన్నతమైన

వర్గసంబంధం కోసం వెచ్చించిన కన్నీటి ధారలు

కామ్రేడ్! అంటాడు సముద్రుడు.

 samudrudi samayam

కవిత్వంలో కొత్త ఎత్తుగడలను పదబంధాలను ఎన్నుకొని ప్రయోగించడంలో సముద్రుడు తనదంటూ ఒక ముద్రను వేస్తూ పోయాడు. అందుకు ఈ సంపుటిలోని మొదటి కవిత నీవు – నేను ఒక మంచి ఉదాహరణ. మిషనరీ స్కూళ్ళలో విద్యార్థులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలును ఉదహరిస్తూ రాజ్య దౌష్ట్యాన్ని మన కళ్ళముందుంచుతాడు,

 

’పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక!’

 నీ రాజ్యంలో దాసదాసీలున్నంత కాలం నీ రాజ్యం వద్దు స్వామీ!

 ప్రజల కొరకు ఏ రాజు పాటుపడ్డాడు?

 ఏ పులి మేకలకై త్యాగానికి సిద్దపడుతుంది

 రెండు చేతులు జోడించనందుకు

 నా అరచేతులు కాల్చినపుడు

 రాలిన నీటిబిందువులపై

 నీ ఆత్మ ’అల్లాడిందా’ ప్రభూ?’

సిద్ధాంతాన్ని తద్వారా పోరాట పటిమను ఎలుగెత్తి కీర్తించడంలో సముద్రుని కవిత్వం ప్రతిభావంతంగా సాగుతుంది. ’మేకవన్నె పులులు’, ’జడుడు’, ’ప్రతిఘటన’ ’మేం వజ్రాలనే వెదుకుతాం!’ మొ.న కవితలు ఉదాహరణలు. ఇందులో ’ప్రతిఘటన’ కవితలో

 

’సముద్రపు అంచు పైపైకొస్తున్న

 సూర్యుణ్ణి అణచాలని

 సాయుధంగా సముద్రంలో ముందుకు సాగినా

 సూర్యుణ్ణి చూసి ఉత్సాహంగా లేచే అలల్ని

 మాత్రం మీరు అణచగలరు గాని

 సూర్యుణ్ణి ఏమీ చేయలేరు’

అని విప్లవ ఉద్యమాన్ని రాజ్యం ఎన్ని బూటకపు ఎదురుకాల్పులు జరిపినా, ఎన్ని వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తూ విష ప్రచారం చేసినా అణచలేదని భరోసా ఇస్తాడు.

 

గెరిల్లా కవిగా సహచరులకు తన కవితల ద్వారా కార్యోన్ముఖులను చేయడంలో సముద్రుడు చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. ఉదాహరణకు

’కాలం సందిట్లో గుణపాఠం నేర్వకుంటే

 పొందికగా నడవడం చేతకాదు

 గుణపాఠాన్ని గుర్తించకుంటే

 రేపటి నీ ఆకారానికి గుర్తింపే ఉండదు’

’వేళ్ళను నమ్మని వాళ్ళకు చెట్టుపై విశ్వాశముండదు

కాపును కోయ సిద్ధమేగాని నీళ్ళు పోయడానికి భయం’ అని లొంగిపోయిన వాళ్ళని ఎద్దేవా చేస్తాడు

’విశ్వాశం పట్టుదల తరాలను మారిస్తే

త్యాగం అంతరాలను మారుస్తుంది’  అంటాడు.

ఇంకా ఉద్యమాన్ని హేళన చేస్తూ తామే ఉద్యమాన్ని నిర్మించామనుకునే స్వీయ ప్రకాశుల కోసం

 

’ సారె మీద తిరిగే ఈగ

 సారె తిరిగేది తన గొప్పతనంనుండే అనుకుంటే

 చివరకు కుడితిలో పడ్డ ఈగలా

 ఊపిరాడక చావక తప్పదు

 ఒకనాటి తోటరాముడు చివరకు

 కాగితం పువ్వుకంటే హీనమైపోతాడు’ అంటాడు

’పాలక వర్గం “ఫేస్” మీద “పౌడర్”లా

అతుక్కుపోయిన వీరికి

ఏ ధర్మం అర్థం కాదు

అందుకే అవకాశవాది నోరు తెరిస్తేనే దుర్వాసన’ అంటాడు.

సముద్రుడు కవిత్వంలో ఏ వస్తువునీ స్పృశించకుండా వదలలేదు. తన తల్లి, గురువులు, సహచరులు, బిడ్డ సాగర్, అడవి, ప్రకృతి, పెట్టుబడిదారీ విధానం, గెరిల్లా యుద్ధతంత్రం, అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలు వ్యూహాలు ఇలా అన్ని అంశాలను తన కవిత్వంలో పొందుపరిచాడు. ఇందులోని చివరి దీర్ఘ కవిత ’అడివి’ చదివితే మన కళ్ళ ముందు అడివిలోని జీవితం ప్రకృతి రమ్యతతో పాటు యుద్ధమూలాలు సజీవంగా మనకు కదలాడుతాయి. తన రచనా శైలిలోని బిగువుకు అడివి సజీవ ఉదాహరణ. విప్లవ కవికి శిల్పం పట్ల నిర్లక్ష్యం అన్నమాటకు జవాబుగా ఇందులో తాను తీసుకున్న అనేక ప్రతీకలలో

 

’నడిజాము ముబ్బుల మధ్య దోబూచులాడే చంద్రుడు

 నీటిలో చేపలా తిరుగాడే గెరిల్లా

 అకస్మాత్తుగా దాడి జరిపే వానజల్లు

 చివరికి ఆకులపై పొంచివుండి సెంట్రీ జేస్తుంది!

 గుట్టలమీద నుండి దూకే జలపాతం తిరిగి తిరిగి అడవికి వడ్డాణమైంది

 ఎత్తైన కొండల్ని – అగాధాల్ని దాచుకున్న అడివి పూర్ణగర్భిణిలా వుంటుంది!

’ అడివిలో వృక్షాలపై, కొమ్మలపై, ఆకులపై నిఘాను పెట్టగలడేమో గాని

 అడివిలో వెన్నెల వెల్లి విరియడాన్ని ఎవడాపగలడు?

’వెన్నెల వేడిలో అడివి స్నానమాడుతుంది

 అడివి కిరీటాన్ని తొడిగినట్లు ఆకాశాన ఇంద్రధనుసు వెల్లివిరిసింది’

’అడివి వసంతాన్నావహించి చిగుర్లలో లేత ఎరుపును కౌగిలించి

 లేత చిరు ఎండలో ఆరుద్రలో మెరిసిపోతుంద”

’ఆకాశం కాలుష్యాన్ని చూసి భోరుమని విలపిస్తే

 అడివి కడిగిన ముత్యంలా వెలిగిపోతుంది’

 

ముప్పైఏళ్ళలోపు పిన్న వయసులోనే అమరత్వాన్ని ముద్దాడిన కామ్రేడ్.  నిత్యమూ యుద్ధరంగంలో తన మెడపై వేలాడే కత్తిని గమనిస్తూనే సమకాలీన కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ, వేటగాళ్ళ చూపులనుండి తప్పించుకుంటూ తనకిష్టమైన కవులను కలుస్తూ సాహిత్యం గురించి చర్చిస్తూ తన సృజనకు మెరుగులు దిద్దుకునే క్రమంలో రాజ్యం అత్యంత నీచంగా హింసాత్మకంగా తన ముఖాన్ని చెక్కి దేహమంతా గాయాల మయం చేసినా తన కవిత్వంలో నిర్బంధం గురించి ఏమి రాసాడో అవే అక్షరాలకు బద్ధుడై తన పిడికిలిలోని రహస్యాన్ని తెరవకుండా చిరునవ్వుతో చావును గేలి చేస్తూ శతృవుకు తనను చంపడమనే చేతకాని చర్య తప్ప మరో దారి లేకుండా చేసిన మరో భగత్ సింగ్, ఆజాద్ ల వారసుడు. జీవితమే యుద్దమై యుద్ధమే జీవన రంగమైన ఓ నవయువకుని ఆశల స్వప్నాల ఆరని జ్వాల ఖండిక ఈ ’సముద్రుని సమయం’ ఇప్పటికీ యుద్ధ సమయమే.

-కెక్యూబ్ వర్మ

వర్మ

వర్మ

 

 

ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ‘చెర’ కవిత

వందేమాతరం

 

ఓ నా ప్రియమైన మాతృదేశమా

తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా

దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది

అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది

సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది

 

ఊసినా దుమ్మెత్తి పోసినా చలనంలేని మైకం నీది

కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న

ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న “భారతి” వమ్మా

నోటికందని సస్యశ్యామల సీమవమ్మా

వందేమాతరం వందేమాతరం

 

ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి

వివస్త్రనై ఊరేగుతున్న చైతన్య నీది

అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో

కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది

ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని

ఓదార్చలేని శోకం నీది

ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది

అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ

వందేమాతరం వందేమాతరం

cherabandaraju(1)

నేను డిగ్రీ ఆఖరి ఏడు  చదువుతున్నప్పుడు మిత్రుని ద్వారా ఈ అగ్ని గోళం వంటి కవిత పరిచయమై నాలో పేరుకున్న జఢత్వాన్ని పటాపంచలు చేసింది. చదవగానే అటు దు:ఖమూ ఆగ్రహమూ కలగలిసి నాభినుండి తన్నుకు వచ్చే దుఖాగ్రహ శకలాల ప్రేరేపితమైన ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ఈ కవిత.

చెర తన కవితకు ప్రేరణ ఏమిటో చెప్తూ నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు అంటాడు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది. మార్క్సీయమైన శాస్త్రీయ అవగాహన నా కవితాధ్యేయానికి స్పష్టతను ప్రసాదించింది అంటారు. దిగంబరకవిగా ఒకటి రెండు సభల్లో తనపై రాళ్ళు వేయించింది, ఎమర్జెన్సీలో జైల్లో ఒక ఆర్,ఎస్.ఎస్. వ్యక్తిచేత కొట్టించిందీ ఈ గేయమేనని చెప్పారు. అలాగే వందేమాతరం బంకించంద్ర వందేమాతరంనకు అనుకరణా కాదు, అనుసరణా కాదు. దానికి పూర్తి వ్యతిరేకమైనదన్నారు. వందేమాతరంలో బంకించంద్ర సుజలాం సుఫలాం అన్నప్పుడు మన భారతదేశ జల ఖనిజ సంపద మన కళ్ళముందు కదలాడుతాయి. కాని అవి ఎవరికి చేరాలో వారికి చేరడం లేదు కదా అని అందుకనే తాను నోటికందని సస్యశ్యామల సీమవమ్మాఅని రాసానన్నారు. ఈ వందేమాతరం దిగంబర కవుల మూడవ సంపుటంలో మొట్టమొదటి గీతం.

    ఈ తరానికి చెరబండరాజు చిరునామా. ఈ కవిత్వ తరానికీ చెరబండరాజు చిరునామానే. ఆయన కవితలలో దాగివున్న అనంతమైన ఉత్ప్రేరక శక్తి ప్రతి పద చిత్రంలోను దాగివున్న విస్ఫోటనాతత్వం వేరెవ్వరిలోనూ కానరావు. దిగంబరకవులందరిలోకి భవిష్యత్ తరంలోకి మార్పును ఆహ్వానిస్తూ దానికో శాస్త్రీయమైన సశస్త్రబలోపేతమైన మార్క్సిస్టు అవగాహనను చేర్చుకుంటూ వర్తమాన తరానికి దిక్సూచిగా తన ఆచరణ ద్వారా ముందు పీఠిన నిలిచిన వారు చెరబండరాజు కావడం యాధృచ్చికం కాదు. అందుకే చెరబండరాజు మనందరికీ చిరస్మరణీయుడు. 

వరుస మారిన వందేమాతరం ఇప్పటికీ మనకు  సజీవ సాక్ష్యం. నేటి కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ అంతర్జాతీయ వ్యాపార లాభాల స్వలాభాలకు భారతదేశ అపార ఖనిజ సంపదను దోచుకుపోవడానికి సెజ్ ల పేరుతో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో విధ్వంసకర అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతూ పర్యావరణాన్ని  ధ్వంసం చేస్తూ, మనుషులలో నైతికతను చెరుస్తూ, మానవత్వాన్ని చెరబడ్తూ, ఓ అభధ్రతా బావాన్ని మనలోకి ప్రవేశపెడ్తూ ఈ దేశ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ సందర్భంలో చెర వందేమాతరం మరోమారు మనం ఆలపించి ఆచరణవైపు కదలాల్సిన యుద్ధసందర్భం ఇది.

–కెక్యూబ్ వర్మ

కెక్యూబ్ వర్మ

సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…

 

varma.

ఇప్పుడెందుకో ఒక్కో సమాధిని శుభ్రం చేయాలనుంది

రాలిన పండుటాకుల్ని వాడిన పూల రేకుల్ని పేరుకు పోయిన ధూళిని

మట్టిని నేలనుండి పాకిన చెద పుట్టలను చుట్టూ పట్టిన నాచును

చిగురు వాడిన మొక్కలను గడ్డి దిబ్బలను

దీపపు సెమ్మెకింద అంటిన నూనె జిడ్డును

సున్నితంగా తొలగిస్తూ సమాధిని శుభ్రం చేయాలనుంది

 

నిద్రిస్తున్న యోధుడి గాయంలోంచి చిగురిస్తున్న మోదుగు పూల

మృధు స్పర్శ లోలోకి పాకుతూ గుండెలయను పెంచుతూ

నరాలలో రక్తకణ కాసారాన్ని ఉడుకెత్తిస్తూంది

 

గాయకుడెవరో ఇక్కడ గొంతు తెగిపడినట్టుంది

ఒక పాట చెవిలో వినిపిస్తూ నాభినుండి

దిక్కులు పిక్కటిల్లే నినాదమవుతూంది

 

అక్షరాలను అస్త్రాలుగా పదునెక్కించిన వారెవరో

పుటల మద్య నిప్పులు చెరుగుతూ దాగినట్టుంది

నెత్తురంటిన అక్షరాల పూత వేలి చివర మెరుస్తూంది

 

ఆరుగాలం ఆకాశం వైపు చూస్తూ మట్టితో యుద్ధం చేస్తూ

ప్రేమిస్తూ తన నెత్తురినే ఎరువుగా మొలకెత్తిన

మట్టి మనిషెవరో విశ్రాంతి తీసుకున్నట్టుంది

చేతులకింత మట్టి తడి అంటుతూంది

 

ఎదనిండా తడి ఆరని జ్నాపకాలేవో రంగుల చిత్రంగా

నేసిన ప్రేమికుడెవరో భగ్న హృదయంతో అరమోడ్పు

కనులతో అవిరామంగా ధ్యానిస్తున్నట్టుంది

చేతులకిన్ని అద్దం పెంకులు గుచ్చుకున్నట్టుంది

 

లోలోన అలికిడి చేయకుండా పై మూత తెరవకుండా

మదినిండా గంధపు పరిమళమెదో

శ్వాస నిశ్వాసల మధ్య కమ్ముకుంటూ

సమాధి చుట్టూ చిగురించిన లేలేత పచ్చదనంతో

పూరేకుల తడితనమేదో స్పర్శిస్తూ

లోలోపల దాగిన కాంతిపుంజమేదో చేతి వేళ్ళగుండా

దేహమంతా ప్రవహిస్తూ నాలో దాగిన నైరాశ్యాన్ని

నిరామయాన్ని నిర్వేదాన్ని పారదోలుతూంది

 

సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…