సంకలనాలే ప్రమాణం కాదు : మధురాంతకం నరేంద్ర

 

1) 2016 లో వచ్చిన కథలు:-

పన్నెండేళ్ళపాటూ వార్షిక కథల్ని చదివిన అనుభవంతో చాలాకాలంగా సీరియస్‌గా చదువుతున్న పత్రికలు కొన్నే! మిగిలిన పత్రికలని చదవకపోయినా మంచి కథల్ని చదవకుండాపోయే ప్రమాదముండదని అనుభవంద్వారా నేర్చుకున్న పాఠం.

చదువుతున్న పత్రికలు:-

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం

పాలపిట్ట

చినుకు

యివిగాకుండా గతంలో మంచి కథల్ని జారిపోకుండా జాగ్రత్తపడటం కోసం మరికొన్ని పత్రికల్ని కూడ చదివేవాణ్ణి. యిప్పుడా అవసరం లేదు. “సాక్షి” ఆదివారం అనుబంధాల్లో కథలకిచ్చే ప్రాముఖ్యత బాగా తగ్గిపోవడంతో దాన్నీ చూడాల్సిన అవసరం తప్పిపోయింది. పైగా వాళ్ళు గొప్ప తెలుగు కథల్ని సంక్షిప్తీకరించి ప్రచురించే నేరాన్ని గూడా చేశారు. యిప్పుడు మామూలు పాఠకుడిగా చదివే అవకాశం దొరికింది. అందువల్ల గుర్తున్న కథల్ని గురించి మాత్రమే చెప్పగలను. వస్తుపరంగా చూసినప్పుడు పర్వాలేదనే చెప్పొచ్చు. కానీ శిల్పపరంగా అంటే యేం చెప్పాలి? “వస్తువే శిల్పాన్ని ఎన్నుకుంటుంది” అనేది పాతబడిన మాటే అయినా గుర్తుంచుకోవల్సింది గూడా! అయితే జీవితపు సంక్లిష్టతల్ని వివరించే వస్తువుల్ని యెన్నుకోవడానికీ, వాటిని అవసరమైన శిల్పరీతుల్లో ఆవిష్కరించడానికీ అనుకూలమైన పరిస్థితులు లేవు.

2015లో O’Henry Prize Storiesలో దాదాపు 80పేజీల కథ వచ్చింది. తెలుగులో యిప్పుడు 10పేజీల కథను పత్రిక లేనేలేదు (పాలపిట్ట, చినుకు మినహా). యీ ప్రమాదం నుంచీ రచయితల్ని కాపాడింది మాత్రం వెబ్ పత్రికలే! రెండు మూడు సంవత్సరాలుగా వెబ్ పత్రికలు (సారంగ, వాకిలి, విహంగ వంటివి) రావడంతో పరిస్థితి మెరుగుపడింది. అయితే యీ పత్రికలు మామూలు పత్రికల్లాగా సమయానికి తప్పకుండా వస్తున్నాయో లేదో తెలియదు. యీ పత్రికలన్నింటికి కలిపి వొక Web Index లాంటిది తయారై, అది facebookలాంటి చోట ప్రకటించబడుతూ వుంటే నాలాంటి పాఠకుడికి సౌలభ్యంగా వుంటుంది.

2) 2016లో నేను విడవకుండా చదివింది, లేక చదవడానికి ప్రయత్నించిందీ “ఆంధ్రప్రదేశ్” పత్రికనే! నాకు గుర్తున్న కథలన్నీ దాన్లోంచే వచ్చాయి. ఫిభ్రవరినెలలో రాణి శివశంకర శర్మ “ప్రొఫెసర్ అంతరంగం” అనే కథ రాశాడు. అలీగరీగా చెప్పదలచుకున్న అంశాన్ని బాగా చెప్పాడు. అయితే Browning ప్రసిద్ద కవిత, డ్రమటిక్ మొనలాగ్ “My Last Duchess” ప్రతిధ్వనులు వినిపించాయి. యేప్రెల్‌లో శ్రీవల్లీ రాధిక రాసిన “నాన్న దగ్గరికి” Mythను సమకాలీనంగా మలిచిన కథ.రచయిత్రికి సంప్రదాయంపైన వున్న ప్రగాడమైన విశ్వాసం, ఆస్తిక ధోరణీ కథ సగానికి చేరేసరికి ముందేం జరుగుతుందో, పాత్రలెవరో తేల్చేశాయి. ఆ suspenseను చివరివరకూ సాగనివ్వలేదామె. రచయిత్రి విశ్వాసాలతో పాఠకుడికి పని లేనప్పుడు కథ తేలిపోతుంది. విశ్వాసం వున్నప్పుడు పాఠకుడికి పరవశం కలుగుతుంది. రెండు విధాలా కథకు దెబ్బే తగులుతుంది.

మన్నం సింధుమాధురి డిసెంబరులో “తూరుపు కొండ” అనే చాలా మంచి కథ రాశారు. ఆవిడదైన శైలి యీ కథకు బాగా నప్పడంతోనూ, నిపుణతతో వాడిన శిల్పంతోనూ యీ కథ చాలా బాగా వచ్చింది. యీ కథలన్నింటినీ ప్రచురించడానికి దాని సంపాదకుడైన “నరేష్ నున్నా”ను అభినందించాలి. మంచి సంపాదకుల కొరత వల్లే మంచి కథలు రావడంలేదని గూడా గుర్తించాలి. పట్టుదలతోనూ, అభిరుచితోనూ కృషి చేస్తే మంచి కథానికల్ని రాయించి, ప్రచురించవచ్చునని ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకులు నిరూపించి చూపెట్టారు. అలాగే “సారంగ” పత్రిక గూడా. సారంగలో వచ్చినవన్నీ సీరియస్ కథలే! అయితే కొన్ని మాత్రమే గుర్తున్నాయి.

యివిగాకుండా యీ యేడాదిలో చదివిన కథల్లో నాకు గుర్తున్న కథ, ఖదీర్ బాబు రాసిన “తేగలు”. మెట్రోకథల చట్రంలోకి యీ కథను దూర్చకపోవడంతోనే యిది మంచి కథయ్యింది. అయితే కథను చెబుతున్న వ్యక్తి భార్యపాత్ర చిత్రణలో కొంత వైరుధ్యం కనపడింది.

కథాసారంగలో వచ్చిన సింధుమాధురి గారి కథ “డేవిడ్” పెద్ద Romantic artificial కథగా తయారయ్యింది.

యిటీవలికాలంలో యువ రచయితలూ, రచయిత్రులూ ధైర్యంగా స్త్రీపురుష సంబంధాలను చిత్రిస్తున్నారుగానీ, యిందులో అనవసరపు అనౌచిత్యపు ధోరణులుండడం మంచి ధోరణి గాదు. సత్యం చెప్పడానికీ, extremities చెప్పడానికీ మధ్యనున్న తేడాను గుర్తించాలి.

బూతులు వాడటమే మాండలికమన్న అభిప్రాయమొకటి బలపడింది. నిజజీవితంలో వాడని బూతుల్నిగూడా కథలోకి జొప్పించి, cheap popularityకి పాకులాడడం గూడా జరుగుతోంది. కథకెంత అవసరమో అంత మోతాదులోనే యేదైనా వాడచ్చు. కానీ ఆ మోతాదు శృతిమించడం సంస్కారం గాదు. సాహిత్యం మానవుడి సంస్కారాన్ని పెంచేదిగానే వుండాలి.

3) యీ ప్రశ్నకు జవాబివ్వతగ్గంతగా నేను కథలన్నింటినీ చదవలేదు.

4) వొక ప్రక్రియగా తెలుగు కథ అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకుందా లేదా తెలుసుకోవాలంటే సమకాలీన విదేశీ సాహిత్యాన్ని గూడా చదవాలి. అందుబాటులో వున్న విదేశీకథల సంకలనాలు కొన్నే! వాటితో పోల్చి చూసినప్పుడు మనకథకు యెదగడానికి వీలయిన పరిస్థితులు లేవు.

యిన్ని మార్పులు వచ్చినా తమిళంలోనూ, కన్నడంలోనూ, మళయాళంలోనూ, ఒడిస్సాలోనూ సాహిత్య పత్రికలు కొన్ని వుండనే వున్నాయి. పాఠకులూ వున్నారు. కానీ తెలుగులో పత్రికలూ లేవు. మంచి పాథకుల సంఖ్యా క్రమంగా తగ్గిపోతోంది.

మిగిలిన భారతీయ భాషలతో పోలిస్తే కమర్షియల్ సినిమా వ్యాపారం పెచ్చుపెరిగి పోవడమూ, సాహిత్యం పట్ల అనురక్తి తగ్గడమూ గమనించాల్సిన విషయం.

5) —-

6/7) కథావార్షికను 12సంవత్సరాల పాటూ ప్రచురించిన తర్వాత ఆపేశాను. యిందుకున్న కారణాల్ని గురించి సావధానంగా చెప్పాలి. దానిక్కాస్తా సమయం కావాలి. తరువాతెప్పుడైనా…

2016లో వచ్చిన కథ, ప్రాతినిథ్య సంకలనాలు సగం సగం చదివాను. కొన్ని కథలు బావున్నాయి. కొన్ని నచ్చలేదు.

యిలాంటి సంకలనాలు అన్ని పత్రికలూ చదవలేని పాఠకులకు బాగా వుపయోగపడతాయి. అయితే యీ సంకలనాలలోకి రాకుండాపోయిన మంచి కథల గురించే బాధంతా! యీ సంకలనాల ఆధారంగా అటువంటి మంచి కథల గురించి శోధన, చర్చ జరగడమే లేదు. అదొక గొప్ప విషాదం. మంచి కథలు వేయడం వల్ల వార్షిక సంకలనాలకు గౌరవం చేకూరుతుంది గానీ, వాటిలో వచ్చిన అన్ని కథలూ మంచివి కాలేవు. యిదంతా పెద్ద సాపేక్షికమైన వ్యవహారం.

వార్షిక కథాసంకలనాలు కథానికా ప్రక్రియ పెరుగుదలకు దోహదం చేయడంలో అనుమానమే గానీ, పాఠకుల దృష్ట్యా మాత్రం మంచే చేస్తున్నాయి, కొంతవరకూ… యీ ప్రయాణం సాగాలి యిలాగే… పరిపూర్ణత అన్నది సాపేక్షికమూ, అసాధ్యమూ అయినా దానికోసం చేసే కృషే సాహిత్యపు భూమిక అని గుర్తుంచుకోవాలి.

*

మధురాంతకం నరేంద్ర

“నాకు American Way of Life బొత్తిగా నచ్చడం లేదు”

చికాగో  14 – 7 – 95

Dear Narendra,

క్షేమం.

ఫోనుపైన మాట్లాడుతూనే వున్నా వివరాలన్నీ చెప్పడం సాధ్యం కాలేదు. హైదరాబాదుకు ఫోన్ చేసి మీ మామగారితోనూ, దామల చెరువుకు ఫోన్ చేసి సాంబమూర్తితోనూ మాట్లాడాను. ఈ దేశంలో R.S.సుదర్శనంగారితోనూ, దాక్షాయణి దంపతులతోనూ, సిన్‌సినాటీలోని రోజాతోనూ మాట్లాడాను. న్యూయార్కు పరిసరాల్లో వున్న కిశోర్ ఎట్లాగో నంబరు తెలుసుకుని నన్ను కలిశారు. ఎటొచ్చి నైవేలీలోనూ, పలమనేరులోనూ టెలిఫోన్ సంబంధాలు నెట్టుకురానీకి వీల్లేకపోయింది. ఈ రోజు ఉదయం చిత్తూరునుంచి ఫోన్ చేసి మహి, గీత మాట్లాడారు. ఎలా బెంగపడుతు వుందో ఏమో. మీ అమ్మతో మాట్లాడి వుంటే బాగుండేది.

మద్రాసు ఎయిర్‌పోర్టులో మీరు అద్దాలకటు వైపునుండి వీడ్కోలు చెబుతూ వుంటే నా తొందరలో పరిగెత్తవలసి వచ్చింది. అవతల నా లగేజి, టికెట్టు కౌంటర్‌లోని అమ్మాయి దగ్గర వున్నాయి. నేను స్టేట్ బ్యాంకు కౌంటర్ దగ్గరకు వెళ్లి రూ.300/- ట్రావెల్ టాక్స్ కట్టి రసీదు తీసుకొస్తున్నాను. ఆ కౌంటర్ దగ్గరే  పులికంటి కృష్ణారెడ్డి కలిశారు. మేమెక్కిన విమానం ఉదయం 4.30 గంటల  ప్రాంతంలో డిల్లీలో దిగాం. అక్కడ  2 గంటల విరామం. అక్కడి ఏర్‌పోర్టులో చాలా పెద్దదైన బోయింగ్ విమానం ఎక్కించారు. అందులో 400 మంది ప్రయాణీకులుంటారు. ఆహార పానీయాదులకు కొరత లేదు. నేను sweets తినకూడదు కనుక నా ఆహారం పరిమితమైపోయింది. అయినా ఫరవాలేదు. 29 సాయంకాలము  3 గంటలకు డిల్లీ చేరుకున్నాము.

అక్కడ మళ్ళీ రెండు గంటల విరామం. న్యూయార్కు 8 గంటల ప్రయాణం. అయితే న్యూయార్కులో దిగినపుడు తేదీ మారలేదు. చీకటి మారలేదు. అక్కడ అప్పుడు సాయంకాలం 4 గంటలు అయింది.  మా టికెట్టు ఆ విమానంలో న్యూయార్కు వరకే. అందువల్ల 4 గంటల పాటు ఆగవలసి వచ్చింది. బాపు, జగ్గయ్యగార్లతో కలిసి మాకు తానా కార్యకర్తలు అక్కడ మాత్రం ఓ యింట్లో వంటల ఏర్పాటు చేశారు. స్నానం, భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి 9 గంటలకు విమానమెక్కించారు. రాత్రి 11 గంటలకు చికాగో చేరుకున్నాము.

సభా నిర్వాహకులు విమానాశ్రయంలో కలిసి దగ్గర్లోనే వున్న HYAT హోటలుకు తీసుకెళ్ళారు. అది పదంతస్తుల కట్టడం. వందలకొద్ది గదులున్నాయి. సభలకు ఈ దేశంలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు 7 లేక 8 వేలమంది వచ్చారు. బయటినుంచి వచ్చినవాళ్లందరికీ బసలు ఏర్పాటు చేశారు. మన దేశం నుండి దాదాపు వందమంది తానా ఆహ్వానితులు వచ్చినట్టున్నారు. సదాశివరావు, లవణం, ఇస్మాయిల్, చలసాని ప్రసాదరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మొదలైన తెలుగువారు కలిశారు. జులై 1, 2, 3, తానా సభలు.నాలుగు రోజులపాటు హోటల్లో వున్నాము.

రెండురోజుల్లో ఉదయం ఉపాహారలు మాత్రం చేసి హోటల్లో బస చేయవలసి వచ్చింది. డా.రాశీ చంద్రలత, డా.సుబ్బారెడ్డి దంపతులది కడపజిల్లా. సభలు జరిగిన రోజుల్లో మాత్రమే మేము అందరితో కల్సి హోటల్లో భోజనం చేశాము. ఒక్కసారిగా 7, 8 వేలమంది ఒకే చోట కూర్చుని భోజనం చేయడం అపురూపమైన సన్నివేశం. ‘తానా’ సభల నిర్వాహకులు ఎంతో ఉదారంగా సర్వ సదుపాయాలు సమకూర్చారు. వేర్వేరు హాల్సులో సాహిత్య, సాంఘిక,  స్త్రీ ఉద్యమ సమావేశాలు జరిగాయి.

కొంతదూరంలోని పెద్ద గుళ్ళో సంగీత, నాట్య కార్యక్రమాలు జరిగాయి. ఒక సాహితీ సభలో నేను, కృష్ణారెడ్డి, మేడసాని మోహన్ పాల్గొన్నాము. విష్ణు, జాషువా, బాపిరాజుల వర్ధంతి సభలు జరిగాయి. మునుపటి సభల్లో కన్నా ఈ సభల్లో ఏర్పాటైన కార్యక్రమాలు బాగున్నట్టు చెప్పుకున్నారు. మమ్మల్ని యిక్కడికి ఆహ్వానించిన డా.రాణీసంయుక్త, డా. కట్టమంచి ఉమాపతి సంతృప్తి పొందగలిగారు. సభలు పూర్తయిన మరునాటినుంచి మా బస సంయుక్తగారి యింట్లోనే, 4,5 తేదీల్లో లవణంగారు కూడా మాతోబాటుగా యిక్కడే వున్నారు.

5వ తేదీ సయంకాలం గ్రేటర్ చికాగోలోని రామాలయంలోని  బేస్‌మెంటులో నాస్తికవాద ప్రవక్త లవణంగారు సత్యాహింసల గురించి  ప్రసంగించారు. సభలో మేడసాని మోహన్, ((నేలబర్కవము)), S.V.రామారావు (సుప్రసిద్ధ చిత్రకారులు, చికాగో వాస్తవ్యులు) పాల్గొన్నారు. నాలుగైదు సార్లు డౌన్‌టౌన్‌లోని రద్దీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి ఆకాశ హర్మ్యాలను చూపించారు. వివేకానందుడు ఉపన్యసించిన భవనం అక్కడే వుంది. C.S.టవర్ అనే 110 అంతస్థుల భవనాన్ని ఎక్కి, విశాల షికాగో నగరాన్ని చూచాము. ఈ నగరానికంతా నీళ్లు సరఫరా చేసే మిచిగన్ మహా సరస్సు వుంది. మరొకరోజు గ్రహాంతర పరిశోధనల మ్యూజియం, ప్లానిటోరియం చూశాము.

ఆ రెండు రోజుల్లోను మధ్యాహ్నాల్లో ఒకరోజు ఇటలీ హోటల్లో పిజ్జా, ఇంకొకరోజు చైనా హోటల్లో వాళ్ళ తిండి భోంచేసాము. ఈలోగా ఒక రోజు డాక్టరుగారింట్లో  నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి Blood Sugar చేక్ చేయించారు. 121 మాత్రమే వుంది. ఒకసారి సాయంకాలం కట్టమంచి వారి యింటికి వెళ్లి భోజనానికి పిల్చాము. ఒక యింటికి, మరొక యింటికి, యిళ్ళకు, బళ్లకూ, కార్యాలయాలకు మధ్య 20,25 మైళ్ల దూరముండడం యిక్కడ సామాన్యమైన విషయం. హోటల్లో వుండగానే శ్రీధర్‌కు ఫోన్ చేశాను. కలుపుగోలుగా వుండి యిక్కడివారిలో కలిసిపోయారు.

ఆదివారం నాడు రెండు కార్లలో విస్కాన్సిన్ వెళ్ళాము. ఆ నగరం ఒక పెద్ద పర్యాటక కేంద్రం. దాన్ని ఒరుసుకుని పారే నదిలోని ఒక జలాశయంలో రకరకాల సర్కస్ విన్యాసాలు జరుగుతాయి. నదిలో తొమ్మిదిమైళ్ల స్టీమరు లాంచీ ప్రయాణం. ప్రాచీన రెడ్ ఇండియన్ల గుహలు నదీతీరంలోని కొండల్లో కానవస్తాయి. 30 నుంచి ఈనాటివరకు గృహస్థులందరూ ఉద్యోగులు కావడంవల్ల పగటివేళ  దాదాపుగా అందరం ఇంట్లో వుంటున్నాము.

విష్ణు, వీణ అని వీరి ఇద్దరు పిల్లలు. వాళ్లు యింట్లో వుండడమే అబ్బురం.ఈ నగరంలో యిళ్లు దూర దూరంగా వుంటాయి. ఇరుగుపొరుగు అన్న ప్రసక్తే వుండదు. ఎక్కడో Busy Placesలో తప్ప పాదచారులే కనిపించలేదు. కార్లు, ఫోనులు లేకపోతే నగర జీవితం లేదు. ఈ ఇంట్లో వున్నవారు నలుగురు, ఉన్న కార్లు మూడు. ఈ పరిమితి వల్ల బయటకు వెళ్తే పార్కింగ్ ప్లేసులు దొరకడమే పెద్ద సమస్య.

ఇద్దరు ముగ్గురు కల్సి వచ్చిన కారులో వచ్చిన కత్తిరించి 475 డాలర్లకి బిల్లు వేశారు (475 x 32) ప్రతి వస్తువు గిరాకీగానే  వుంటుంది. కిలో చిక్కుడుకాయలు 6 డాలర్లు (32 x 6= రూ.192)సంపాదనలాగే వీళ్లకు ఖర్చు కూడా ఎక్కువే. సిన్‌సినాటి నుండి రాజా ఫోన్ చేసి తనకు పైసలు చాలడం లేదని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మనవాళ్లకు ఈ దేశం పైన యింత వ్యామోహమెందుకో బోధపడడం లేదు.

నాకు American Way of LIfe బొత్తిగా నచ్చడం లేదు. కార్లకు హారన్లుండవు, ఇళ్ల తలుపులు ఎప్పుడూ మూయబడి వుంటాయి. ఇంట్లో మనుషులున్నారో లేదో బోధపడదు. ఈ ప్రశాంతికి, క్రమబద్ధతకు మనం అలవాటు పడడం చాలా కష్టం. సరే అదంతా అలా వుంచితే వారంలో 5 రోజులు ఏకాగ్రతతో పని చేస్తారు గనుక వీళ్లకు weekendలో మాత్రమే విరామం. అందువల్ల మేము శని ఆదివారాల కోసం వేచి చూస్తు మిగతా 5 రోజులు ఏకాంత గృహంలో చదువుకుంటూనో, నిద్రపోతు, ఫోన్‌కాల్స్‌కు జవాబు ఇస్తూ గడపాలి.

కట్టమంచి ఉమాపతిరెడ్డిగారు గొప్ప గడుసరి వారు. మేము 60లలో సంపాదించాము. పెద్ద పెద్ద యిళ్లు కట్టుకున్నాము. మీరు ఏ గదిలోనైనా వుండొచ్చు. తొందరేముంది? మీరు  మీ దేశం వెళ్లి చెయాల్సిన అర్జంటు పనులేమున్నాయి. ఏవైనా రాయదల్చుకునే యిక్కడే రాసుకోండి. అని మోగమాట పెడుతున్నారు. చివరికలా కుదరదని, తిరుగు ప్రయాణానికి ఒక తేదీ నిర్ణయించుకుని కార్యక్రమాలన్నింటిని ఆ మేరకు ఏర్పాటు చేసుకోవడం బాగుంటుందని తెలియచెప్పుకున్న తర్వాత ఒక ప్లాను తయారు చేశారు.  15,16 తేదీలలో ఒహియో రాష్ట్రంలోని can bush, కడప సుబ్బారాయుడుగారు  డాక్టరు (శతావధాని సి.వి.సుబ్బన్నగారి తమ్ముడు) కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.. 20 నుండి 24 దాకా హూస్టన్, డల్లాస్ నగరాలు, 26న మళ్లీ యిక్కడే సభా కార్యక్రమం యింతవరకు ఏర్పాటయింది.

ఈలోగా తలవని తలంపుగా న్యూయార్క్ దగ్గరగా వున్న న్యూజెర్సీనుంచి ఒక ఫోను కాల్ వచ్చింది.  ఆయన పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ. న్యూజెర్సీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు. ఆయన చిరకాలంగా నా కథలు చదువుతున్నారట. ఎంతో ఆప్యాయంగా పలకరించి న్యూజెర్సీకి ఆహ్వానించారు.

మాకు నయాగరా చూడాలని వుందంటే డెట్రాయిట్‌లోని తన మిత్రునికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయించారు. దాని ప్రకారం మేము 27న డెట్రాయిట్ వెళ్లాలి. 28న అక్కడే వుండాలి.29 శనివారం నయాగరా చూపిస్తారు. 30 ఆదివారం న్యూయార్క్ చేరుకోవాలి.  అక్కడ సత్యనారాయణగారు రిసీవ్ చేసుకుంటారు. సుదర్శనం, దాక్షాయిణి, కిశోర్ గార్లను కలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారాంతంలో తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకుని న్యూయార్కునుంచి విమానంలో సీట్లు రిజర్వు చేయించుకోవాలి.

ఈ వారంలో సుబ్బారెడ్డిగారు నన్ను వేర్వేరు హాస్పిటల్స్ తీసుకెళ్లి రక్త పరీక్ష, నేత్ర పరీక్ష చెయించారు. రక్తపరీక్ష రిపోర్తు వచ్చింది. ఫలితాలు తృప్తికరంగా వున్నాయని చెప్పారు. నేత్ర పరీక్ష చేసిన డా. చిత్ర.వి.నడింపల్లిగారు ఇల్లిందల సరస్వతీదేవిగారి కూతురట. ఈమె అత్తగారిల్లు తిరుపతి. డాక్టరు వి.రామకృష్ణ అని ప్రసిద్ధ నేత్ర వైద్యులుండేవారు. ఈమె ఆయన కోడలు.ఎంతో శ్రద్ధగా పరీక్షలు చేసి Prescription యిచ్చింది. అద్దాలు తిరుపతిలోనే కొనుక్కోమంది. ఇవీ విశేషాలు. కొనుక్కో దలచిన వస్తువులు కోసం Departmental Stores అన్నీ తిరుగుతున్నాము. వంద డాలర్లు పెడితే గాని మంచి  కెమెరా వచ్చేటట్టు తోచదు. వంద డాలర్లు  అంటే 3200 రూ గదా. అట్లాగే మిగిలిన వస్తువులన్నీ, బాగా తెలిసినవాళ్లని తీసుకెళ్లి ఏమైనా కొనుక్కోవాలి. ఈ మధ్య నైవేలికి, పలమనేరుకు కూడా జాబు రాశాను. అయితే యింత వివరంగా రాయలేదు.  నువ్వు జిరాక్సు తీసి పంపిస్తే వాళ్లు సంతోషిస్తారు. లతకు ఆశీస్సులు.  రాసాని దంపతుల్ని అడిగినట్టు చెప్పు. అల్లాగే జాన్, భాస్కర రెడ్డి యింకా మనవాళ్లందరినీ అడినట్లు చెప్పు.

శుభాకాంక్షలతో