సింహాసనాల వింతాట

ఎన్నో రాజ్యాలు , ఎందఱో రాజులు , రాజ్యం కోసం వాళ్ళు చేసే రాజకీయాలు , వేసే ఎత్తులు, తీసే ప్రాణాలు, చేసే త్యాగాలు ఇవన్నీ ఎన్నో కథల్లో కథనాల్లో చదువుతూ ఉంటాం . “A game of thrones” కూడా అటువంటి రచనే అయినా ఒక కొత్తరకమైన ప్రాచీన జీవన విధానాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది . ఇందులో కొంత మాయాజాలం కూడా ఉంటుంది సుమా అని చిన్న క్లూ ఇస్తూ అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తిని కలిగిస్తూ ఆద్యంతం చదివేలా చేస్తుంది . అద్భుతమైన కథనం మనల్ని మంత్రం ముగ్దుల్ని చేసి చెయ్యి పట్టుకుని ముందుకి నడిపిస్తుంది . (కొంత అడల్ట్ కంటెంట్ ఉంది కనుక పిల్లలకి నిషిద్ధం .)

అదే George R. R. Martin రాసిన “A Song of Ice and Fire “సిరీస్ . ఇవి మొత్తం ఏడు పుస్తకాలట. ప్రస్తుతానికి ఐదు మాత్రమే పబ్లిష్ అయ్యాయి. అందులో మొదటిది ‘A Game of Thrones ‘ లో ఏముందో చూద్దాం .

ముందుగా కథ ఒక పెద్ద గోడ తో ప్రారంభమవుతుంది . పురాతన, మానవేతర జాతులనుండి రక్షించుకోవడం కోసం వేల సంవత్సరాల కి పూర్వం, వందల మైళ్ళ దూరం పాటు ఉత్తర దిశగా కట్టబడిన గోడ అది . అంతరించి పోయిందనుకున్న ‘అదర్స్’ అనబడే ఓ అనాగరిక పురాతన జాతి ఉంది ఉందంటూ ముందుగా ఒక చిన్న ఆధారాన్ని చూపించి కథలోకి తీసుకెళ్తాడు రచయిత .

కథ వింటర్ ఫెల్ అనే ఒక రాజ్యం లో ప్రారంభమవుతుంది . ఒక్కో అధ్యాయం ఒక్కో పాత్ర దృక్పథం లో సాగుతుంది . అది వారి వారి అంతరంగాల్ని మనకి చూపడంతో పాటు కథని కూడా ముందుకి నడుపుతూ ఉంటుంది .
index

ఉత్తర దేశానికి అధిపతి అయిన లార్డ్ Ned Eddard Stark కి ముగ్గురు అబ్బాయిలు (Robb ,Bran, Rickon), ఇద్దరు అమ్మాయిల(Sansa ,Arya )తో పాటు ఒక bastard son (Jon Snow )కూడా ఉంటాడు . వీళ్ళకి ఒక dire wolf కి చెందిన ఆరు పిల్లలు దొరుకుతాయి . సరిగ్గా వాళ్లకి సరిపోయేలా నాలుగు మగ,రెండు ఆడ తోడేళ్ళు కావడంతో Eddard పిల్లలు వాటిని పంచుకుని పెంచుతూ ఉంటారు . స్టార్క్ ల వంశం తోడేళ్ళకి సంబంధించిన వంశంగా పేరుపొందింది కూడా .

ఇంతలో మహారాజు Robert Baratheon తన కుటుంబంతో వింటర్ ఫెల్ కి వస్తాడు . Eddard ని తన సహాయకారి ( hand)గా రాజధానికి రమ్మని ఆహ్వానిస్తాడు . ఆ సమయం లో ఎనిమిదేళ్ళ Bran అనుకోకుండా ఒక చూడకూడని దృశ్యం చూడటం వల్ల , మహారాజు బావమరిది Jaime Lannister, ఆ బాబుని భవనం పై నించి క్రిందికి తోసేస్తాడు. ఆ కుర్రవాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు లాడుతుంటాడు . ఏం జరిగిందో మిగిలిన వాళ్ళకి తెలీదు . ఇటువంటి కష్ట సమయం అయినా Eddard, మహారాజు కి ఇచ్చిన మాటకి కట్టుబడి తన ఇద్దరు కుమార్తెలని తీసుకుని రాజధానికి తరలి వెళ్తాడు . తన రాజ్యభారాన్ని భార్య Catelyn , పెద్ద కుమారుడు Robb లకి అప్పగిస్తాడు .

స్టార్క్ద్ ల పెద్దమ్మాయి పదకొండేళ్ళ Sansa అందగత్తె మాత్రమే కాదు, రాచరికపు కట్టుబాట్లు బాగా తెల్సిన అమ్మాయి . ఆ అమ్మాయికి మహారాజు కుమారుడు Joffrey తో నిశ్చితార్ధం అవుతుంది . రెండో అమ్మాయి తొమ్మిదేళ్ళ ఆర్యా కి కత్తి యుద్ధాలు చెయ్యడం , గుర్రపు స్వారీ చెయ్యడం ఎక్కువ ఇష్టం . అక్కా చెల్లెళ్లకి అంతగా సరిపడదు .

రాజధానికి వెళ్ళగానే Eddard ఒక రాజ రహస్యం తెలుసుకుంటాడు . మహారాణి Cersei కి ఆమె కవల సోదరుడు Jaime తో అక్రమ సంబంధం ఉందని , మహారాజు పిల్లలు గా చెలామణి అవుతున్న ముగ్గురు పిల్లలు వాళ్ళ పిల్లలేనని అతనికి తెలుస్తుంది . అంటే రాజు తర్వాత సింహాసనం అధిష్టించేందుకు వాళ్ళు అర్హులు కాదన్నమాట . రాజుతో ఈ విషయం ఎలా చెప్పాలా అని అతను ఆలోచిస్తుండగానే వేట కి వెళ్ళిన రాజుని ఒక ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచిందన్న వార్త వస్తుంది .

మహారాజు మరణం తో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారవుతాయి . Eddard ని , Sansa ని మహారాణి బంధించగా ఆర్యా మాత్రం పారిపోతుంది . రాజ ద్రోహం అనే చేయని నేరం మోపి Eddard తల నరికేసి Sansa ని మాత్రం బందీ గా ఉంచుతుంది మహారాణి . రాజ్యానికి అసలైన వారసుడు కాకపోయినా కుమారుడు Joffrey కి రాజ్యాభిషేకం చేస్తుంది . Sansa తోడేలు ‘Lady’ కూడా చంపివేయబడుతుంది .

Eddard పెద్ద కుమారుడు Robb, తన తండ్రి మరణానికి ప్రతీకారం గా యుద్ధానికి సిద్ధ పడతాడు . మహారాణి తండ్రి Tywin Lannister వైపు సైన్యం తో తలపడి మొదటి దశ విజయం సాధిస్తాడు . మరోవైపు ఆర్యా , అబ్బాయిలా నాటకమాడుతూ తిండి కూడా లేని దీన స్థితి లో ఎన్నో కష్టాలు పడుతూ తన దేశం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది .ఆమె తోడేలు ‘Nymeria’ కూడా ఆమెకి దూరమై పోతుంది . సహజంగా చాలా ధైర్య వంతురాలు కావడం వల్ల ఈ ఆటు పోట్లన్నీ ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆర్యా వెర్షన్ లో ఉండే అధ్యాయాలు ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి( నాకైతే).

అసలే భయస్తురాలైన Sansa ని Joffrey చాలా హింసిస్తుంటాడు . అక్కడ Winterfell లో Bran బ్రతికి బట్టకట్టినప్పటికీ పడిపోవడం వల్ల నడిచే శక్తి ని కోల్పోతాడు . ఆఖరి వాడైన నాలుగేళ్ళ Rickon, తన కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు గా తనని వదిలి వెళ్లి పోతుండటంతో చాలా అసహనానికి గురవుతుంటాడు .

ఎడ్డార్డ్ Bastard son అయిన Jon snow , కథ మొదట్లోనే గోడ కాపలా కోసం వెళ్ళిపోతాడు . అక్కడ అతనికి చనిపోయిన మనుషులు బ్రతికి రావడం వంటి వింతలు ఎదురవుతాయి . ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసుకోవడం కోసం , గోడ సంరక్షణ కి నియమింప బడిన Night’s Watch బృందం తో పాటుగా అతను గోడ వెనుకకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు .

మరో పక్క మహారాజు Robert , ఒకప్పుడు ఓడించి తరిమి కొట్టిన డ్రాగన్ వంశానికి చెందిన అమ్మాయి Daenerys కథ కూడా సమాంతరం గా సాగుతుంది . ఆమె తన రాజ్యాన్ని వదిలి వచ్చిన సమయానికి పాలు తాగే పసిపిల్ల . తల్లి తండ్రుల్ని పోగొట్టుకున్న ఆ చిన్నారి పాపని తీసుకుని అప్పట్లో ఆమె అన్నగారు తూర్పు వైపుకి పారిపోతాడు . ఆ తర్వాత పద్నాలుగేళ్ళ ప్రాయానికి వచ్చాకా ఆ అమ్మాయి ఒక మొరటు రాజుని పెళ్లి చేసుకుని ఎటువంటి జీవనాన్ని గడిపిందో , ఎలా ఒక యుద్ధంలో భర్త ని కోల్పోయిందో , ఒక మంత్రం గత్తె వల్ల ఎలా మోసగింపబడిందో , ఆఖరుగా ఎప్పుడో అంతరించి పోయాయనుకున్న డ్రాగన్స్ కి ప్రాణం పోసి మూడు డ్రాగన్ ల తల్లిగా ఎలా మారిందో రచయిత ఆసక్తికరం గా వివరిస్తాడు . అటువైపు Robb తో పాటుగా ఇక్కడ ఈ అమ్మాయి Daenerys కూడా రాజ వంశం పై ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండటం తో మొదటి పుస్తకం ముగుస్తుంది .

ఈ పుస్తకం కొన్ని ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్స్ గెలుచుకోవడం తో పాటు , మరికొన్ని గొప్ప అవార్డ్స్ కి నామినేట్ అయింది కూడా . కొసమెరుపు ఏమిటంటే ఈ రచన లోని పాత్రల పేర్లని అమెరికన్లు చాలా మోజుగా తమ పిల్లలకి పెట్టుకుంటున్నారట.

కుదిరితే రెండో పుస్తకం A Clash of Kings తో మళ్ళీ కలుద్దాం .

– భవానీ ఫణి

bhavani phani.

అన్వేషి

టాక్సీ ఆగిన కుదుపుకి  కళ్ళు తెరిచింది క్రిస్టీనా. సిగ్నల్ పడినట్టుంది . ఏవో గుస గుసగా మాటలు వినిపిస్తే, కిందకి దింపి ఉన్న అద్దంలోంచి బయటకి  చూసింది. బైక్ మీద తండ్రి వెనుక కూర్చున్న ఇద్దరు పిల్లలు తనని విచిత్రం గా చూస్తూ  చెవులు కొరుక్కుంటున్నారు . స్కూల్  యూనిఫాం లో ఉన్నారు . నవ్వి చిన్నగా చెయ్యి ఊపింది. వాళ్ళు  కూడా ఉత్సాహంగా చేతులూపారు. పదినిమిషాల తర్వాత ఒక ఇంటిముందు ఆగింది టాక్సీ .

 అడ్రస్ సరిచూసుకుని టాక్సీ కి డబ్బులిచ్చి పంపేసి , తలుపు మీద మెల్లగా తట్టింది.  రెండు  నిమషాల తర్వాత తలుపు  తెరుచుకుంది . ఓ ముసలాయన తల బయటకి పెట్టి చూసి ఏదో అన్నాడు . క్రిస్టీనా కి అర్ధం కాలేదు . సిద్ధార్ధ్  ఉన్నాడా అని ఇంగ్లీష్ లో అడిగింది .ఆయన ఒకసారి  ఆమెని ఎగా దిగా చూసి అడ్డు తప్పుకున్నాడు . లోపలి రమ్మన్నట్టుగా . “నువ్వు కూర్చోమ్మా , నేను అర్జెంట్ పని మీద బయటకి వెళ్తున్నా . మా కోడలితో మాట్లాడు ”  ఈసారి ఇంగ్లీష్ లో  అన్నాడాయన సోఫా చూపిస్తూ. ఓసారి లోపలికి వెళ్లి వచ్చి  బయటకి వెళ్ళిపోయాడు.
లోపల్నించి ఏవో  చప్పుళ్ళు వినిపిస్తున్నాయి . ఏం చెయ్యాలో అర్ధం కాక సోఫా లో  ఇబ్బందిగా కదిలి గదంతా కలియ జూసింది . గోడ మీద ఉన్న ఒక ఫోటో వెంటనే ఆమె దృష్టిని ఆకర్షించింది . ఒక్క నిమిషం ఆమెకి గుండె ఆగినంత పనైంది. దిగ్గున లేచి ఫోటో దగ్గరగా వెళ్లి పరికించి చూసింది .
ఇంతలో వెనుక నుండి ఎవరో వస్తున్న అలికిడికి వెనక్కి తిరిగింది . అక్కడ ఒకామె నిలబడి ఉంది . ఆమె ముఖం నిండా విషాదం అలుముకుని ఉంది . ఒక రకమైన దైన్యం , నిరాశ ఆమె ముఖంలో స్పష్టం గా కనిపిస్తున్నాయి . పాతికేళ్ళ లోపే ఉంటుంది ఆమె వయసు .
క్రిష్టీనా కొంచెం తడబడింది  ” సిద్ధూ అదే సిద్ధార్ధ్ ఫ్రెండ్ ని నేను . తన కోసం వచ్చాను “
 ఆమె ఆశ్చర్యంగా చూసింది . సిద్ధూ కోసం మీరు  యు . స్ నించి వచ్చారా ! “
“అవును. మీరు…. “అని ఆగిపోయింది క్రిస్టీనా.
“ఆ ఫోటో లో వ్యక్తి నా భర్త , సిద్ధూ అన్నయ్య  గౌతమ్. వాళ్ళిద్దరికీ చాలా పోలికలు ఉంటాయి . అందుకే  కంగారు పడినట్టున్నారు “ఆమె ఇంగ్లీష్ స్పష్టం గా ఉంది
“అవునండీ , ఎప్పుడు జరిగింది . నాకు తెలీదు . అయాం రియల్లీ సారీ ” జాలిగా చూస్తూ అంది క్రిస్టీనా
ఒక్కసారిగా ఆమె లో దుఃఖం పెల్లుబికింది. అణుచుకోవడానికి క్రింది పెదవిని మునిపంటి తో నొక్కి పెట్టింది . ఏమీ మాట్లాడలేకపోతోంది. అంతటి శోకం  కూడా  ఆమె సౌందర్యాన్ని దాచలేకపోవడం  క్రిస్టీనా చూడగలుగుతోంది
” నా పేరు క్రిస్టీనా లీ , మీ పేరు?” టాపిక్ మార్చడం అవసరమనిపించింది.
” వైష్ణవి ”  కొంచెం ఆగి  అడిగిందామె   ” కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా?”
“ఇప్పుడేమీ వద్దు . సిద్ధూ ఎక్కడున్నాడో చెప్పగలరా “
క్రిస్టీనా ని తేరిపార చూస్తూ అడిగింది వైష్ణవి ” ముందు సిద్ధూ మీకెలా పరిచయమో చెప్పండి  “
  ***
పక్క ఫ్లాట్ లోంచి  భళ్ళున ఏదో పగిలిన శబ్దానికి మేలుకుంది  క్రిస్టీనా. టైం చూస్తే ఐదు  కావస్తోంది . ఇంత ఉదయాన్నే ఏమిటా శబ్దం!
ఒక్క నిమిషం మనకెందుకులే అనిపించినా ఉండబట్టలేక లేచి బయటకి వచ్చింది . పక్క ఫ్లాట్  దగ్గరకి వెళ్లి ఏం  చేద్దామా అని  ఆలోచిస్తుండగానే తలుపు తెరుచుకుంది. ఆ ఫ్లాట్ లో ఎవరుంటారో తెలీదు ఆమెకి . కానీ విచిత్రంగా తలుపు ఎవరు తీసారో కూడా ఆమెకి అర్ధం కాలేదు .
“లోపలి రండి” అని ఒక మగ గొంతు మాత్రం వినిపించింది . సంకోచిస్తూనే లోపలి అడుగు పెట్టింది . డ్రాయింగ్ రూం మధ్యలో ఒక వ్యక్తి తెల్లని దుస్తులు ధరించి కూర్చొని ఉన్నాడు . తనని చూసి చిన్నగా నవ్వాడు. సౌత్ ఈస్ట్ దేశాలకి చెందిన వాడిలా ఉన్నాడు.
“ఏదో పెద్ద చప్పుడు వినిపిస్తే, ఏమిటో అని …” సంజాయిషీ ఇవ్వడానికి ప్రయత్నించింది .
“ఏమీ లేదు లెండి . దయచేసి వచ్చి కూర్చోండి “అన్నాడు .
“తలుపు ఎవరు తీసారు ” నాలుగువైపులా కలియ జూసింది . ఓ పక్కగా పగిలి పోయిన గాజు ముక్కలు కనిపించాయి .అవి పగిలిన  చప్పుడే  తన నిద్ర పాడుచేసినట్టుంది.
“నా కళ్ళు ” అన్నాడతను .
ఏమిటితను! తనని ఆట పట్టిస్తున్నాడా? అతని ముఖ కవళికలు చూస్తే అలా అనిపించలేదు
“మీకు సరిగా నిద్రపట్టదు కదూ . ఏదో అశాంతి.  ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేసారా ఎప్పుడైనా  “
ఆమె ఉలికి పడింది.  ఇతనికి ఎలా తెల్సు. ఆ విషయం తెలుసుకోవాలనే సాయంత్రానికి  సైకియాట్రిస్ట్ దగ్గర అప్పాయింట్ మెంట్ కూడా తీసుకుంది
అతను లేచి వెళ్లి బుక్ షెల్ఫ్ లోంచి ఒక పుస్తకం తీసి తనకి ఇచ్చాడు .
“ఇది చదవండి . మీ సమస్యకి పరిష్కారం  దొరకచ్చు”  అప్పుడు చూసిందామె, అతని బుక్ షెల్ఫ్ నిండా చాలా పుస్తకాలున్నాయి
అయోమయంగా అతనిచ్చిన పుస్తకం  అందుకుంది  . “యు ఫరెవర్” అనే పుస్తకం అది . లోబ్సాంగ్ రాంపా అనే ఆయన రాసారు .
“మీరు టిబెటన్లా  లేరే?”
“కాదు, ఇండియన్ “
“మెజీషియన్ నా మీరు? “
అతను పెద్దగా నవ్వాడు. అతని ముఖం పై  వింత తేజస్సు అలుముకుని ఉంది  ” కాదండీ , నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న మామూలు మనిషిని  “
అలా జరిగింది వాళ్ళ పరిచయం. రోజూ ఉదయం నాలుగు గంటలకి నిద్ర లేచి అతను యోగ సాధన చేస్తాడట . తను కూడా ఆ టైం కి  అతని ఫ్లాట్ కి వస్తానని రిక్వెస్ట్ చేసింది . అతని  చర్యలని  ఆసక్తి తో గమనించేది . కొన్ని కొన్ని సందేహాలు అడుగుతుండేది . అతను తనకి తెలియని ఎన్నో విషయాలు చెబుతూ ఉండేవాడు. అతను తన చూపులతో వస్తువుల్ని కదపడానికి చేసే ప్రయత్నాన్ని క్రిస్టీనా ఆసక్తి తో గమనించేది .
కొన్నాళ్ళ తర్వాత ఆమె  అడిగింది  “నేను ఎందుకో ఎవరితోనూ గట్టి మానసికమైన సంబంధాన్ని ఏర్పరుచుకోలేక పోతున్నాను . తండ్రి లేకుండా గడిపిన బాల్యం, ఒంటరితనం  అందుకు  కారణం అంటావా సిద్ధూ “
“నీది నిర్లిప్తత అని నువ్వు అనుకుంటున్నావు . కానీ అది  మనసుకి ఉన్న నిశ్చలత అని నీకు త్వరలోనే తెలుస్తుంది. ఏదో ఒక రోజు నీకు కావాల్సింది ఏమిటో  నీకు అర్ధం అవుతుంది . నువ్వే అప్పుడు దాన్ని వెతుక్కుంటూ వెళతావు  “
ఆ రోజు ఉదయం సిద్ధూ ఫ్లాట్ కి వెళ్ళే సరికి అది ఖాళీ గా కనిపించింది. రెండు రోజుల్నించీ లేట్ నైట్ వరకు పని చెయ్యడం వల్ల ఆమె సిద్ధార్ధ ని కలవలేకపోయింది . సడన్ గా ఏమీ చెప్పకుండా అతను ఎక్కడికి మాయం అయిపోయాడో అర్ధం కాలేదు . చివరి సారి అతన్ని కలిసినప్పుడు అతను కొంచెం నిరాశగా ఉండటం గుర్తొచ్చింది
“చేస్తున్న ఈ సాఫ్ట్ వేర్ జాబ్ నాకు సంతృప్తిని ఇవ్వడం లేదు . ఇంకా ఏదో చెయ్యాలి అనిపిస్తోంది ” అన్నాడు అతనప్పుడు.
ఆ తర్వాత ఎంతో ప్రయత్నం మీద సిద్ధార్ద్  ఇండియా వెళ్లిపోయాడని అతని కొలిగ్ ద్వారా తెలుసుకుంది . అడ్రస్ కనుక్కుని ఇండియా కి బయలుదేరింది .
 ***
url
 క్రిస్టీనా తన మరిది గురించి చెబుతుంటే అతనికీ , తన భర్త కీ  ఆలోచనల్లో ఎంత సారూప్యం ఉందో వైష్ణవి కి అర్ధం అవుతోంది
మూడు నెలల క్రితం ఆ రాత్రి ఎక్కడినుండో మాటలు వినిపిస్తుంటే మెళకువ వచ్చింది వైష్ణవి కి . చూస్తే పక్కన భర్త కనిపించలేదు . ఎప్పుడూ తాళం వేసి ఉండే మరిది రూం తెరిచి ఉంది . ఆ రూం లో తన భర్త తో మాట్లాడుతున్న వ్యక్తి ని చూసి  ఆశ్చర్య పోయింది . ఇతను యు. ఎస్. నించి ఎప్పుడు వచ్చాడు! వస్తున్నానని చెప్పనైనా చెప్పలేదే?
 లోపలికి వెళ్ళ బోయిన వైష్ణవి, తన భర్త అన్న మాటకి గుమ్మం  దగ్గరే ఆగిపోయింది .
“నాకు మాత్రం ఇక్కడ ఇలా ఈ జీవితాన్ని గడపడం ఇష్టం అనుకుంటున్నావా?” భర్త గొంతు గంభీరంగా పలికింది .
“నీ సంగతి వేరు అన్నయ్యా ” అంటున్నాడు  సిద్ధూ
“వేరు ఏమీ లేదు రా , నాక్కూడా నీ లాగే ఇంకా  తెలుసుకోవాల్సిందీ , చెయ్యవలిసిందీ  చాలా ఉంది ఆనిపిస్తుంది . అదలా ఉంచు , అమ్మ , నాన్న గురించి ఆలోచించావా?”
“వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అన్నయ్యా, నీకంటే  బాగా  వాళ్ళని ఎవరు చూసుకోగలరు “
“ఇలా చెయ్యడం మన స్వార్ధం మనం చూసుకోవడం అవుతుంది రా ,బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించక పోవడం చాలా తప్పు “
తన భర్త ఇంకా ఏదో చెబుతున్నాడు .
 ఆధ్యాత్మిక పరమైన వాళ్ళ సంభాషణ మీద నుండి దృష్టి మరలిన వైష్ణవికి  తన పెళ్లి చూపుల్లో భర్త అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి
“నేను నీకు నచ్చానా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిర్మొహమాటం గా చెప్పమ్మా”   ఒంటరిగా వేరే గదిలో మాట్లాడమని పెద్దవాళ్ళు పంపినప్పుడు అడిగాడు గౌతమ్ .
సిగ్గుతో తల దించుకుని ఉన్న వైష్ణవి తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక పోయింది . ఎవరో పెద్ద వాళ్ళ లా తనని అమ్మా అని పిలుస్తాడు ఏంటి !
అతని వైపు చూడాలన్న కోరికని బలవంతం గా అదిమిపెట్టి ఇష్టమేనన్నట్లుగా తల ఊపింది
పెళ్లి తర్వాత  తెల్సింది అతని మంచితనం ఆమెకి . ఎప్పుడూ  ప్రశాంతం గా ఉండటం ,ఎంత పెద్ద విషయానికి అయినా కోపం తెచ్చుకోకపోవడం , తనని చిన్న పిల్లని చూసినంత అపురూపం గా చూడటం ఆమెని అమితమైన ఆనందాన్ని కలిగించేవి.
కానీ ఒక్కోసారి గంటల  తరబడి ధ్యానం లో ఉండిపోవడం చూస్తే భయమేసేది . ఏంటి ఈయన వాలకం అని
అలాగే ఓ సారి చుట్టపు చూపుగా  వచ్చిన ఒక పెద్దావిడ , తమ ఇంట్లో ఉన్న నిలువెత్తు శివుడి పటం  చూసి ” అంత పెద్ద  శివుడి పటం  ఇంట్లో పెట్టుకోకూడదమ్మా ” అన్నప్పుడు కూడా చాలా  ఆందోళన కలిగింది . భర్త తో చెబితే నవ్వి ఊరుకున్నాడు .
తన ఆందోళన గమనించిన అత్తగారు ఒక రోజు తనని దగ్గర కూర్చోబెట్టుకుని కొన్ని విషయాలు చెప్పారు
“అమ్మా , వాళ్ళకి  వంశ పారంపర్యం గా వచ్చిన లక్షణాలు ఇవి . గౌతమ్ తాతగారి తాతగారు అంటే మా మామగారి తాతగారు బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసేవారట . ఆ తల్లి అయన కి కనిపించేదనీ,మాట్లాడేదనీ చెబుతారు . ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో రాత్రి వేళ గజ్జెల మోత వినిపించేదట . వాళ్ళ వశం లో తరం వదిలి తరం మీద తన ప్రభావం ఉండేలా చేయమని అయన ఆ తల్లిని వరం కోరుకున్నారని అంటారు . మా మామగారు కూడా చాలా ఆధ్యాత్మికమైన భావాలతో, తీవ్రమైన భక్తి భావంతో  జీవితాన్ని గడిపారట . కానీ అయన తన ముప్ఫైయవ ఏట ….. “అని అర్ధోక్తి గా ఆవిడ చెప్పడం ఆపేసారు . తర్వాత ఎన్ని సార్లు అడిగినా ఆ విషయం గురించి ఆవిడ మాట్లాడలేదు .
అసలు గౌతమ్ కి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదేమో !వైష్ణవి  ఆలోచన ల్లోంచి  తేరుకుని చూసింది
గదిలోంచి ఇంకా అన్నదమ్ముల మాటలు విసిపిస్తూనే ఉన్నాయి  . నెమ్మదిగా  బెడ్ రూం లోకి వచ్చేసింది.
***
ఎవరో పిలిచినట్టు  అనిపిస్తే తుళ్లిపడి  లేచింది వైష్ణవి . ఎదురుగా హాస్పిటల్ బెడ్ మీద భర్త మెల్లగా కదులుతున్నాడు . ఒక్కసారిగా అల్లకల్లోలం చేసే నిజం ఆమె  కళ్ళ ముందు కనిపించి కలవరపాటు కి లోనైంది .
ఎవరెంత చెప్పినా వినకుండా సిద్ధార్ధ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ,అతని మీద బెంగ తో అత్తగారు మంచం పట్టి , నెల రోజులకే కన్ను మూయడం , కాశీ రామేశ్వరం అన్ని చోట్లా  సిద్ధార్ధ కోసం వెతికించి  అతని జాడ తెల్సుకోవడంలో తాము  విఫలం కావడం , అత్తగారు చనిపోయినప్పటి నుండీ భర్త ఉదాశీనం గా ఉండటం , పది రోజుల క్రితం మొదలైన జ్వరం ఎంతకీ తగ్గకుండా అతన్ని హాస్పటల్  పాలు చెయ్యడం అన్నీ ఆమె జ్ఞాపకాల్లోకి ఒక్కసారిగా తోసుకొచ్చాయి.
బాధ గా భర్త వైపు చూసింది . అతను మెల్లగా నవ్వాడు . ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరి  బిక్కిరైంది . రెండు రోజులుగా అతను మూసిన కన్ను తెరవలేదు. గౌతమ్ కి  నయమవ్వాలని  ఆమె చెయ్యని పూజలు లేవు . మొక్కని మొక్కులు లేవు . చివ్వున   లేచింది .
” ఆగు వైషు , నే చెప్పేది విను “
“ఎక్కువ మాట్లాడకండి . డాక్టర్ ని పిలుస్తాను “
“వద్దు , ఆగు , నేను చెప్పేది  జాగ్రత్త గా విను . ఇలా జరుగుతుంది అన్న విషయం నాకు ముందే తెలుసు. అయినా రాసిపెట్టి ఉన్నదాన్ని ఎవ్వరు మార్చలేరు కనుక మన వివాహాన్ని ఆపలేక పోయాను . నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి తప్పదు , కానీ ఆ  బాధ తాత్కాలికమే . ఈ సమయం లో ఇలా చెప్పడం సరి కాకపోవచ్చు . కానీ తర్వాత నాకు చెప్పే అవకాశం ఉండదు కనుక చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెబుతున్నాను . ప్రశాంతం గా విను . నేను దూరమయ్యాక నీకు అన్యాయం జరగదు . నా తర్వాత నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు “
“అయ్యో, ఏమిటండీ ఆ మాటలు, నాకోసం  ఇప్పుడిప్పుడే నాలో రూపుదిద్దుకుంటున్న మన బిడ్డ కోసం మీరు బాగుండాలండీ  ” దుఃఖాన్ని అపుకోలేకపోతోంది వైష్ణవి “బెంగ పడకు వైషూ , మన బిడ్డ కి ఏ లోటూ ఉండదు . వాడికి మంచి భవిష్యత్తు ఉంది “
అవే అతను ఆమెతో మాట్లాడిన చివరి మాటలు . ఆ తర్వాత మూసుకున్న అతని కనురెప్పలు ఇక  విడలేదు. అ మరుసటి రోజు ఉదయమే అతను  తన కోరుకున్న లోకానికి పయనమయ్యాడు .
***
అరె! నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా ?” క్రిస్టీనా అడుగుతుంటే వర్తమానం లోకి వచ్చిన వైష్ణవి భర్త జ్ఞాపకాలతో తన కళ్ళు విపరీతం గా వర్షించడాన్ని గమనించుకుంది
” లేదు, లేదు , మీరు అంత దూరం నుండి శ్రమ పడి  వచ్చారు . కానీ నాకు  సిద్ధార్ధ ఎక్కడున్నాడో తెలీదు. మా అత్తగారు చనిపోయినప్పుడు మా వారు సిద్ధూ కోసం చాలా  వెతికించారు . అతను ఆఖరి సారి కాశీ లో కనిపించాడట కొందరికి . తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు . ఇల్లు వదిలి వెళ్ళాక ఒకటి రెండు సార్లు మాత్రమే ఫోన్ చేసాడు . తాను హిమాలయాలకి వెళ్ళ దలుచుకున్నట్టు, ఎవరూ తనని వెతికే ప్రయత్నం చెయ్యొద్దనీ  మాత్రం చెప్పాడట “
క్రిస్టీనా ముఖం తెల్లగా పాలిపోవడం చూసిన వైష్ణవి చెప్పడం ఆపింది .
రెండు నిముషాలు మౌనం గా ఉండిపోయిన క్రిస్టీనా దీర్ఘంగా నిట్టూర్చింది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా .
“చివరి సారి గా సిద్ధూ ని చూసిన వాళ్ళ అడ్రస్ గానీ ,ఫోన్ నెంబర్ గానీ ఇవ్వగలరా “
తను వెతికి ఇచ్చిన అడ్రస్ తీసుకుని థాంక్స్ చెప్పిన క్రిస్టీనాని జాలిగా చూసింది వైష్ణవి.
“నా ప్రేమని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను , నీ ప్రేమ అయినా నీకు లభించాలి అని కోరుకుంటున్నాను “
 ఆ మాటలకి క్రిస్టీనా కొంచెం ఇబ్బంది పడింది.  తన ఫోన్ నెంబర్ ఆమెకి ఇచ్చి, సిద్ధూ గురించి ఏమైనా తెలిస్తే తనకి తెలియజేయమని చెప్పి , వైష్ణవి దగ్గర సెలవు తీసుకుని ఆ ఇంట్లోంచి బయటపడింది .
తను  సిద్ధూని ప్రేమిస్తున్నానని  వైష్ణవి అనుకుంటోందా! సిద్ధూని తను ఆ దృష్టితో  ఎప్పుడూ చూడలేదు . సిద్ధూ సామీప్యం లో తన మానసిక అలజడి  మటుమాయ మయ్యేది . అతని  మాటలు తనని ఎంతో ప్రభావితం చేసాయి . అతను  ప్రయాణించే మార్గమే తనని కూడా తన గమ్యానికి చేరుస్తుంది అనే నమ్మకం తోనే అతన్ని వెతుక్కుంటూ వెళుతోంది.
కనుచూపు మేర వరకు క్రిస్టీనాని చూస్తూ నిలబడిన  వైష్ణవి తలుపులు వేసే ప్రయత్నం చేస్తుండగా  ఓ అపరిచిత వ్యక్తిని  ఎదురుగా చూసి కంగారు పడింది
“క్షమించాలి. మిమ్మల్ని భయపెట్టినట్టున్నాను.   నా పేరు విష్ణు . గౌతమ్ నా ప్రాణ స్నేహితుడు. ఒక స్వఛ్చంద సంస్థ లో పని చేస్తూ రెండు  సంవత్సరాలు గా రుమేనియా లో ఉండిపోవటం  వల్ల  మీ పెళ్లి కి కూడా రాలేకపోయాను “
తేరుకున్న వైష్ణవి పక్కకి తొలగి అతన్ని లోపలి కి ఆహ్వానించింది .
        ***
bhavaniphani   -భవానీ ఫణి
(భవానీ ఫణి మొదటి కథ ఇది.  తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీ పోలవరం ఆమె స్వస్థలం. ప్రస్తుతం బెంగుళూర్ లో ఉంటున్నారు. అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉంటారు. )