బొజ్జ తారకం ఎవరు?!

tarakam1
బొజ్జా తారకంగారితో నాకు గల పరిచయాన్ని మీతో పంచుకోవాలనిపిస్తోంది.
2004 డిసెంబర్ లో నేను జపాన్ నుంచి భారత దేశానికి తిరిగివచ్చినప్పుడు కొద్దికాలం హైదరాబాద్ లో టూరిజం డైరెక్టర్ గా ఉన్నాను. ఆ సమయంలో కొన్ని దళిత సమావేశాలలో బొజ్జ తారకంగారిని కలిసేవాడిని.  ఆయన సంపాదకీయంలో వెలువడే ‘నీలి జెండా’ పత్రికను తెప్పించుని  దళితుల సమస్యలమీద రాస్తున్న వ్యాసాలను చదివి అర్దం చేసుకునేవాణ్ణి.  గనుముల జ్ఞానేశ్వర్ గారు కనబడినప్పుడు బొజ్జ తారకంగారి గురించిన వార్తలు చెప్పేవారు. అప్పుడు నేను కొత్తగా దళిత కవిత్వం రాయడం మొదలు పెట్టాను. కవితలు ఆంధ్ర జ్యోతిలో ప్రచురింపబడ్డప్పుడు తారకంగారు తప్పకుండా ఏదో విధంగా చదివేవారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కనబడినప్పుడు నా కవిత్వం గురించి  ప్రస్తావించి మరిన్ని దళిత సమస్యలమీద రాయాలని ఉద్భోధించేవారు. ‘పోరాడాలి. లేకపోతే  అన్యాయం జయిస్తుంది ‘ అని తరుచుగా అనేవారు.
ఏ విషయాల మీద రాయాలి, ఏ విషయాల మీద పోరాటం చెయ్యాలి అని మార్గదర్శకత్వం చేసేవారు. “బొజ్జ తారకం గారిని ఎలా చూడాలి”  అనే సందేహం నన్ను వెంఠాడేది. ఒక కవిగా, రచయితగానే కాదు, సామాజిక, దళిత న్యాయవాదిగా, పౌరహక్కుల కార్యకర్తగా అన్ని రూపాల్లో నాకు కనబడేవారు. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఎన్ని పాత్రలు నిర్వహించాలో అన్ని పాత్రలనూ ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.  అందుకేనేమో ఈరోజు అన్ని వర్గాలవారు తారకంగారిని తమవాడిగా చెప్పుకుంటున్నారు. పౌరహక్కులకోసం ఇంతగా పోరాడిన నాయకుడు నాకు ఇంతవరకూ తారసపదలేదు. దళిత కులం నుంచి వచ్చిన తారకంగారు పౌరహక్కుల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. అనేక  బూటకపు పోలీసు ఎన్కౌంటర్లలో పాల్గొన్న అధికారులకు వ్యతిరేకంగా తారకంగారు సుప్రీం కోర్ట్ లో కేసు దాఖలు చేసి కేసు గెలిచారు . 2004లో  డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు  ముస్లింలకు  రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేసును తారకంగారు వాదించారు.  కారంచేడు దళితులపై జరిగిన హింసకు  నిరసనగా  తారకంగారు  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక ప్రాసిక్యూటర్ పదవికి  1984 లో రాజీనామా చేశారు.
టోలీ చౌక్ లో ఉన్న ఆయన ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను. అంబేద్కర్ గారు రాసిన రాసిన పుస్తకాలను తెలుగులోకి  ఆనువదించిన ఆయన సతీమణి విజయభారతిగారు కాఫీ ఇచ్చి కుశల ప్రశ్నలు వేసేవారు. 2007 లో నా మొదటి కవితా సంకలనం ‘దళిత వ్యాకరణం ‘ ఆవిష్కరణకు మొత్తం కార్యక్రమాన్ని తన బుజాలమీదకు ఎత్తుకున్న కవి శిఖామణిగారు  బొజ్జ తారకంగారిని  నా తరపున ఆహ్వానించారు. నా కవిత్వం చదివి మురిసిపోయి నన్ను తుల్లిమల్లి కాదు, ‘తుళ్ళీతుళ్ళిపడే విల్సన్ సుధాకర్’ అని తారకంగారు చమత్కరించారు. గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ బుక్ఫెస్టివల్ కు సామాన్యగారి పుస్తకం ఆవిష్కరణకు బొజ్జ తారకంగారిని ఆమె ఆహ్వానించారు.  ఆమె తరపున నేను తారకంగారింటికి వెళ్ళీ ఆయనను, విజయభారతిగారిని కారులో ఎగ్జిబిషన్కు తీసుకువచ్చాను. ఆ సందర్భంగా ఆయనతో దళిత సోదరులమంతా ఫోటోలు దిగాము.
 tarakam2
దళిత వాణిగా పేరొందిన బొజ్జా తారకం గారి మరణ వార్త విని ‘ పౌర హక్కులకు  ఆసరాగా నిలబడ్డ చివరి బురుజు కూలిపోయింది ‘ అన్నారు ఆంధ్ర జ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ గారు.  ‘బొజ్జ తారకం ఎవరు’ అనే ప్రశ్న నేటి తరానికి  కలగొచ్చు.  ఒక్క మాటలో తారకం గారిని నిర్వచించలేము.  దళిత, పౌరహక్కుల, సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా,  ఆంధ్రలో రిపబ్లికన్ పార్టీ , దళిత మహాసభ సంస్థాపకుడిగా తారకంగారు ఎంతో సేవ చేశారు.  దళితుల మీద అగ్ర వర్ణాలు జరుఫుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆయన నిరంతర పోరాటం చేసారు.  సెంట్రల్ ఊనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యోదంతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి దేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించగలిగారు. మేజిస్ట్రేట్, హైకోర్ట్ , సుప్రీం కోర్ట్లలో దళితులు, మైనారిటీలు, కొండజాతులవారికి న్యాయ సహాయం అందించారు. అనారోగ్యం పాలయినా సరే  RPI ద్వారా అంబేద్కర్ ఆశయాలను యువతలో ప్రచార చేసేలాచివరివరకూ క్రుషి చేశారు.  జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశేష అధికారాలతో పోలీసు యంత్రాంగం చెలరేగిపోయి నక్సలైట్ ముద్రలు వేసి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు ‘ పోలీసులు  అరెస్ట్ చేస్తే’ అనే పుస్తకాన్ని రచించి పౌరహక్కుల కోసం క్రుషి చేశారు. ఈ పుస్తకం Jane Maxwell రచించిన Where There Is No Doctor అనే పుస్తకం పొందినంత ప్రచారం పొందింది.
1992 లో చుండూర్ లో దళితులపై అగ్రవర్ణాలు జరిపిన మారణ కాండపై తారకం గారు జరిపిన న్యాయపోరాటం ఎంతో ప్రసిద్ధమయ్యింది. మా ఇద్దరి మధ్య కొన్నిసార్లు చుండూరు కేసు ప్రస్థావనకు వచ్చేది. ఏకపక్షంగా కొందరు న్యాయమూర్తులు ఎలా వ్యవహరిస్తున్నదీ, చివరకు వారి మనసులో ఏమున్నదీ తారకం గారు నాకు చెప్పేవారు. ఒకానొక దశలో తారకంగారిమీద కోర్టు ధిక్కార నేరాన్నిమోపుతానని ఒక న్యాయమూర్తి బెదిరించారనీ, మీరు ఏమిచేసుకుంటారో చేసుకోండని  అన్నాననీ తారకం గారు చెప్పి వారి పక్షపాత ధోరణి పట్ల విచారం వ్యక్తం చేసేవారు.
చుండూరు ఊచకోత కేసులో  తారకంగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. దళిత కెమెరా తో ఒక ముఖాముఖిలో మాట్లాదుతూ ” చుండూరు కేసులో ఇచ్చిన తీర్పు తర్కవిరుద్ధమయినది, పక్షపాతంతో కూడినది  అని  చీత్కరించారు. హైకోర్టు చేసిన వాదన నేర న్యాయశాస్త్రం మీమాంసకు, రుజువులున్న సాక్ష్యాలకు, అన్ని నియమాలకు విరుద్ధంగా ఉంది.  తొలి తీర్పు ఇచ్చిన  ట్రయల్ కోర్టు మొత్తం సాక్ష్యాల్నిచర్చించించి తిరుగులేని ఒక నిర్ధారణకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు  అన్ని నిబంధనలను గాలికి వదిలి, నేర న్యాయ శాస్త్ర మీమాంసను తెలియక,  అశాస్త్రీయతార్కికంతో  అన్ని ఆరోపణలున్న దోషులను నిర్దోషులుగా విడుదల చేసింది” అని అభిప్రాయపడ్డారు.
tarakam3
హైకోర్టు  వాదన ప్రకారం- కారణాలలో ఒకటి ఏమిటంటే  ” ప్రాసిక్యూషన్ ‘సంఘటన సమయాలను రుజువుచెయ్యడంలో విఫలమైంది, ఏ సమయంలో బాధితులకు  గాయాలు ఏ తగిలాయో చెప్పలేదు.”  కేవలం భౌతికమైన వైరుధ్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మేము న్యాయమూర్తులకు చెప్పామని” తారకంగారు అన్నారు. కానీ నేరపూరిత న్యాయ మీమాంసకు, విధానాలకు సంబంధం లేకుండా, చట్టం, సాక్ష్యం ప్రసక్తి లేకుండా హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఎటువంటి వాదనలకోసం ఎదురు చూడకుండా దోషులను వదిలివెయ్యాలని హైకోర్ట్ నిర్ణయించిందని మాకు అర్దమయ్యింది అని తారకం గారు నాడు వ్యాఖ్యానించారు. చివరకు వారు కొరినట్లే జరిగింది అని ఆయన అన్నారు.
తారకంగారు తెలుగు రాష్ట్రాలలోని  అట్టడుగు వర్గాలకు  ఆయన ఒక గొప్ప వాగ్దానం. దళితులు మీద దుర్మార్గపు చర్యలపై నిత్రంతరం పోరాటం జరిపిన వ్యక్తి. ఒక గొప్ప నాయకుడు, కవి, వక్త , కార్యకర్త. ఒక గొప్ప రచయిత విజయ భారతి జీవిత భాగస్వామి. తమ మీద అత్యాచారాలు జరిపిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలని కోరిన ఏకైక వ్యక్తి. ఆయన మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.
*

జ్ఞానవృక్ష ఫలాలను కోసుకుందాం రండి!

 

 

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

~

 

ప్రకృతినీ-వినీలాకాశాన్నీ-వింత వింత నక్షత్రాల్నీ

వీక్షించిన బుద్ధి కుశలత ‘హోమో సేపియన్స్’ దే కదా!

విరోధాభాసమంతా  స్వర్గమూనరకాల భ్రమల తర్వాతే !

 

జ్ఞాన వృక్షపు నిషిద్ధ ఫలాల్ని తిన్నతర్వాత

లాటిన్మృతభాషలో పారడైజ్ పిట్టకథలు  తెలిసినట్లు

న్యూటన్గతి సిద్ధాంతపు కక్ష్య యంత్రగతిని జాగ్రత్తగా లెక్కించిన చోటే

ఆధునిక రోదసీ పథనిర్దేశానికి ఇస్రో తిరుపతి కొండలెక్కుతుంది…

 

శాస్త్రీయతను ధ్వనించే  శబ్దాలతో సైంటిస్టులే

సత్తాలేని సరుకుల లేబుళ్ళకు  సైన్స్ నామాలు పెడుతున్న దేశంలో

వేలెడంతలేని  ‘నోబెల్’ రామకృష్ణన్

ఏనుగంత  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను వింత సర్కస్ అనేశాక

ఆవిరైపోయిన తర్కం గురించి ఎవరితో మాట్లాడతాం !

 

‘కఫాలా’ కు ఆధునిక బానిసత్వం పేరుపెట్టి

భాషరాని శ్రామికులను-మనసు భాషరాని ఇసుక కోతుల మధ్యకు  తరిమినట్లు

భావ దాస్య ముష్కరంగా మార్చిన పుష్కరంలో

జ్ఞానస్నానం పొందాల్సిన తెలుగు జీవితాలు  ఉత్తపుణ్యాన నీటిపాలు..

బౌద్ధభూముల అమరావతిలో భూసూక్తం చదివిన చందాన

అశాస్త్రీయ పద్దతిలోమాయని లాగితే చిట్లిన గర్భకోశంపై ఏం మాట్లాడగలం!

 

‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ లా ఫోజులు కొడుతూ

సిలికాన్ మురిక్కాలువలా ప్రవహించే  కొత్త రాష్ట్రంలో

ప్రాంతీయ సామంత రాజొకడి  పిలుపుమేరకు

నాలుగు దశాబ్దాల బహుజన మూలవాసీ అవిశ్రాంత  పోరాటం

బ్రాహ్మణీయ భావజాలపు ప్రతీఘాత నిరర్ధక విప్లవం  పాలు..

ఆల్ ఈజ్ వెల్ ! ఆగ్నేయంలో మాత్రం అగ్ని ప్రమాదం..

 

‘అసహనం చెంప దెబ్బకు లక్ష నజరానా’  పొందినంత ఆనందంగా

తెలంగాణ జర్నలిస్టుల జాతరకెళ్ళిన  ప్రెస్ క్లబ్ స్కీటర్లు

సరళాదేశ సంధి జరిగి  ‘సరళమే ఆదేశంగా’ నిష్క్రమించడం విచిత్రం..

సత్యాన్ని ప్రశ్నించని శతాబ్దాల మహాయానంలో

అసత్యం పై ఇండియన్  ఫోరంల మీద  ఏంజెళ్ళలా నటించే

డక్కన్  మేధావుల  వ్యూహాత్మక మౌనం మరీ విచిత్రం..

 

రొట్టెనడిగితే రాయి నిచ్చిన తర్వాత

కట్టని గుళ్ళూమసీదులకు నజరానాల గానా బజానా తర్వాత

నిరసన సమూహాలకు ప్రకటించనున్నది భారీ అసహాయం..

నైరుతి రుతుపవనాల్నీ ఎల్ నినో ‘చేపమందు’లా వేసుకుందని తెలిసి

విత్తిన నేలే  తక్కువని సర్కారే  నట్టూవాంగం వాయించాక

విత్తినవాడి గుండె  పఠాన్ చెరువు కాకుండా ఉంటుందా!

బతికి బట్టకట్టిన రైతుకోసం ఖరీఫ్ పంట కత్తి దూసే ఉండదా!

ఖాళీ కడుపులతో  ఏం ఫిలాసఫీ మాట్లాడతాం !

 

దేశమనే కంద పద్యంలో

దోషమే కనబడని ఆషా వర్కర్లు  నిషిద్ధ గణం

దిశ తెలియని ఆధిపత్యం దిమ్మతిరిగే యాగాలకు ప్రాపకం!

ఆకలి ఆత్మల బుజ్జగింపుకు ఖుర్బానీలుగా- తాయెత్తులు కాశీ తాళ్ళుగా

మారే పేదల సంతలపై ఏ నిషేధాల లాజిక్కులు మాట్లాడతాం!

సంధి కుదరనప్పుడు తప్పదులా వుంది విసంధి  దోషం !

రాష్ట్ర ప్రాయోజిత చీకటిలో ఇప్పుడు తెలుగు జనం !!

 

( హేతువాద ఉద్యమంకోసం తీవ్రంగా కృషి చేసిన దళితనేత  కత్తి పద్మారావుగారికి)

-తుల్లిమల్లి  విల్సన్ సుధాకర్

09538053030