మిగిలిన సగాన్ని వెతుకుతూ…

(కథా రచనలో కృషికి ఈ నెల 25 న మాడభూషి రంగాచార్య అవార్డు  సందర్భంగా)
 
ఆటలు లేవు, వేరే పనేదీ లేదు, బడి లేదు, స్నేహితులు ముందే తక్కువ.
 
పూజ, వంట, భోజనాలతో అలసిపోయిన అవ్వ, నాయినమ్మ, అమ్మ.. అందరూ మధ్యాహ్నం కునుకు తీస్తారు. చప్పుడేదైనా చేస్తే నీ తాట తీస్తారు. తాత, నాన్న డిటో డిటో.
 
అలాంటి ఎంతకీ గడవని అతి నిశ్శబ్దమైన పొడుగైన వేసవి మధ్యాహ్నాలు నన్ను మంచి చదువరిగా మార్చాయి.
 
ఇల్లంతా కలియతిరిగితే మా నాయినమ్మ దగ్గర చిన్న పాకెట్‌ పుస్తకం ‘అంబరీష చరిత్రము’ దొరికింది. ఇక వేరే ఏమీ దొరకని పరిస్థితిలో దాన్నే బోలెడన్నిసార్లు చదివి విసుగొచ్చేసింది. అనుకోకుండా ఒక సాయంత్రం మా నాన్న నన్ను దగ్గర్లోని లైబ్రరీకి తీసుకెళ్లారు. ఒకటే ఆశ్చర్యం…. ‘ఇన్ని పుస్తకాలుంటాయా ప్రపంచంలో’ అని.
37cde126-fb20-46de-b8e7-bb261260aa54
అమితమైన ఉత్సాహంతో ‘సముద్రపు దొంగలు’ ‘అద్భుత రాకుమారి’ వంటి నవలలు చదువుకుంటూ ఉంటే.. అప్పుడు మొదలైంది అసలు బాధ.
పాడుబడుతున్న ఇంట్లో అరకొరగా నడిచే ఆ లైబ్రరీకి వచ్చేవాళ్లు అతి తక్కువమంది. అది సాకుగా ఆ లైబ్రేరియన్‌ వారంలో మూణ్ణాలుగు రోజులు సెలవు పెట్టేసేవారు. దాంతో ఆ లైబ్రరీ ఎప్పుడూ మూసే ఉండేది. పుస్తకాలు ఇంటికి తెచ్చుకోవచ్చని నాకు అప్పటికి తెలియదు.
తలుపులు మూసిన లైబ్రరీ లోపల, చక్కటి చీకట్లో – ఎలకలు, పందికొక్కులు పుస్తకాలను ఆరారగా చదువుతూనే ఉండేవి. అవీ పసివేనేమో, లేదా పిల్లల పుస్తకాల గది మరీ అనువుగా ఉండేదేమో తెలీదుగాని, నేను ఆత్రంగా చదివే పుస్తకాలకు ఆద్యంతాలు లేకుండా భోంచేసేవి మా ఊరి ఎలకలు.
సగం చదివిన పుస్తకం మిగతా సగం దొరక్కపోతే పడే బాధేమిటో ఇక్కడ చాలామంది అర్థం చేసుకోగలరు.
అందులోంచి పుట్టేవి ఊహలు. అవి ఆ కథల్ని పూర్తి చేసేవి.
అప్పటికి వాటిని కాగితం మీద రాయొచ్చని తెలీదు.
అందుకే నా ఊహాలోకంలో అల్లుకున్న ఎన్నో కథల సగాలు ఉదయపు మబ్బుల నీడల్లో, డాబా మీద నుంచి దూరంగా కనిపించే కొండల నీలిమలో, సాయంత్రం విరిసిన సన్నజాజుల సువాసనలో, రాత్రి మెరిసే చుక్కల మెరుపులో కలిసిపోయాయి.
మరికొన్ని కథలు వేసవి రాత్రుల్లోని ఉక్కపోతలో, చలికాలాల్లో ఉక్కిరిబిక్కిరి చేసే దుమ్ములో, వర్షపు నీటిలో కలిసిపోయిన కాలవల దుర్వాసన లో… కొట్టుకుపోయాయి.
ఇంకొన్ని కథలు అగ్రహారాల అనుబంధాల్లో, వేరంగా మారిపోతున్న సామాజిక దృశ్యాల్లో, అక్కచెల్లెళ్ల అన్నదమ్ముల అమెరికా సంబంధాల్లోకి చెరువు నీళ్లు మాయమైనట్టు మాయమైపోయాయి.
వాటన్నంటినీ తిరిగి తెచ్చుకోవడానికి వీల్లేనంత పరుగులో ఇప్పటి నేను చిక్కుపడిపోయాను.
వాటిని వెతుకుతున్న క్రమంలో ‘చందనపు బొమ్మ’ ఒట్టి ప్రిపరేషన్‌. అంతే.
arun1
పాత్రికేయ జీవితంలో పరిచయమైన కొందరు అపురూపమైన మనుషుల్ని, కొన్ని జ్ఞాపకాల్ని – ఇంకొన్ని అసంగతమైన విషయాలను గుదిగుచ్చడంలో చందనపు బొమ్మ నాకు సాయపడింది.
ఇప్పటికైతే నేను మంచి రచయిత్రినని అనుకోవడం లేదు. కాని మంచి పాఠకురాలిని.
మల్లాది, శ్రీపాద, రావిశాస్త్రి, పతంజలి, ఇస్మాయిల్‌ – వీళ్ల వాక్యాల్లోని పదును, సున్నితత్వమూ కూడా నాకెప్పటికీ పట్టుబడవన్న సత్యం తెలుసుకున్న దుఃఖభరితురాలిని.
వాళ్లందరి వరకూ ఎందుకు?
భావన ఏదైనా ఎంతో కవితాత్మకంగా వ్యక్తపరిచే నిషిగంధ, మెహర్‌, బండ్లమూడి స్వాతి, ప్రసూనారవీంద్రన్‌, మోహన్‌ ఋషి వంటి ఇంకొందరిని విస్మయంగా చూసే పాఠకురాలిని.
ఆంధ్ర మహాభారతాన్ని సావకాశంగా చదువుతూ వందల ఏళ్ల క్రితమే మానవ స్వభావ చిత్రణ చేసిన కవుల ప్రతిభకు ఆశ్చర్యపోతున్న అవివేకిని.
ప్రపంచం, జీవితం – రెండూ ఆటే అని అర్థం చేసుకున్నాక కలిగిన వైరాగ్యం కొంత, అందర్నీ ఆడనీ,  నేను ఆట్టే ఆడి అలసిపోవడమెందుకు అని అలవాటయిన బద్దకం కొంత –
 
వెరసి ఏమీ రాయడానికి మనసొప్పడంలేదు. రాయకుండా ఉండలేనని తెలుసుగానీ,
మా నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదుల్లాగా… అప్పుడు ఎండి, అప్పుడు పొంగే ఇంకెన్నో భావాలు ఉరకలెత్తితే , కథల్లో మిగిలిన సగాలు విస్తారంగా రాస్తానేమో మరి.
-అరుణా పప్పు 

నాకు చెప్పరె వలపు నలుపో తెలుపో

arun1

  అరుణ ప‌ప్పు శ్రీకాకుళం జిల్లా పాలకొండ‌లో 1979లో పుట్టింది. గణితంలో ఎం. ఎస్‌సీ. చేసినా తెలుగు చదవాలనీ రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. మొదట ఈనాడులో ఐదేళ్ళు చేసి, గత ఏడేళ్లుగా ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌లో పని చేస్తున్నారు. రచనా వ్యాసంగం శైశవదశలోనే ఉన్నా ఇప్పటికే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆమె క‌థ‌ల సంపుటి చంద‌న‌పుబొమ్మను క‌డ‌ప జిల్లా నంద‌లూరులోని రాష్ట్ర క‌థానిల‌యం వారు కింద‌టేడు ప్ర‌చురించారు. చక్కటి ఆలోచనా, ఆ ఆలోచనలకు తగిన వచనం, ఆ రెండింటికి అమిరేటట్లు హాయిగా చదివింప చేసే శైలి ఆమె కథల ప్రత్యేకత.
వీరి బ్లాగ్‌సైట్ అరుణిమ‌ .arunapappu.wordpress.com
కినిగెలో ఈ పుస్త‌కం దొరుకుతుంది.  

 

‘పెళ్లి తర్వాత సమస్యలేవీ రావని నమ్మకం ఏమిటి?’ సూటిగా అడిగింది నీల.
‘సమస్యలు బయటి నుంచి రావు. అవి మనలోనే ఉంటాయి…’ అన్నాడు శరత్ అంతే స్పష్టంగా.
అతనన్నది ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు.
అర్థం కాకపోవడాన్నుంచి ఒక కోపపు ఛాయ పుట్టింది.
‘అంటే… అన్నీ నేనే ఊహించుకుంటానని.. దాన్నుంచే సమస్యలని… అంతేగా నువ్వంటున్నది…?’ అందామె మాటలు ముక్కలుముక్కలుగా మనిషి విసురుగా.
‘వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడే జబ్బులు చుట్టుముడతాయి. మనం గట్టిగా లేకపోతేనే సమస్యలు భయపెడతాయి…. అదీ నేనంటున్నది. నెమ్మదిగా ఆలోచిస్తే నీకే విషయం స్పష్టంగా తెలుస్తుంది… రెండు రోజులు ఓపిక పట్టు. నీ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి…’ అని బల్ల దగ్గర్నుంచి లేచి వెళ్లిపోయి టీవీ దగ్గర సెటిలయ్యాడు శరత్.
నీలకేమీ తోచలేదు.
అకస్మాత్తుగా పెళ్లి ప్రస్తావన ఎందుకు తెచ్చాడు శరత్? ఇప్పటిదాకా మంచి స్నేహితుల్లాగా కలిసి ఉన్నారు కదా? ప్రేమ… ప్రేమకేమీ తక్కువ లేదు. మూడేళ్లుగా చూస్తోంది తను.. ఎప్పుడూ అతనిలో ఎంచడానికేమీ కనిపించదు. అలాంటప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన తననెందుకు భయపెడుతోంది?
స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో… తనను చూస్తూనే ప్రశ్నార్థకాలయ్యే మొహాలను ప్రతిభతో ఎదుర్కొని నెగ్గుకొచ్చింది తను. మరి పెళ్లి దగ్గరకొచ్చేసరికి భయపడుతోంది ఎందుకు?
అంటే పెళ్లికి మనిషిలోని ప్రతిభ, ఇద్దరి మధ్య అనురాగం – ఇవి చాలవనుకుంటోందా? పెళ్లి దగ్గరకొచ్చేసరికి మనుషుల గుణగణాలు కాకుండా, అందచందాలే ముఖ్యమని అందరిలాగానే తనూ అనుకుంటోందా? తన వయసు అమ్మాయిలు పెళ్లంటే ఎంత సంబరపడతారు? మనసైనవాడు, మంచివాడు శరత్ అడుగుతున్నా సరే, తనలో ఎందుకీ సంకోచం?
నీలకేమీ దిక్కుతోచలేదు. తన ఆలోచనల్లో స్పష్టత లేదని తెలిసిపోయింది. హోటల్ గదికున్న కిటికీ లోంచి చూస్తే రాత్రి పూట సముద్రం నల్లగా ఎగసిపడుతూ కనిపించింది. అలలు మాత్రం తెల్లగా….
రాత్రి నలుపు… వెన్నెల తెలుపు…
చూస్తున్న కళ్లు తెలుపు, కనుపాపలు నలుపు…
ప్రపంచమంతా నలుపుతెలుపుల కలయికే…
కదిలే కారుమబ్బులా, కాటుక పిట్టలా ఉంటుంది నీలోత్పల.
ఎక్కడికెళ్లినా ఒకసారి చూసినవారు మరోసారి ఆశ్చర్యంగా చూడకమానరు. అంత నలుపు.
‘కలకత్తా కాళి..’ అంటూ కామెంట్ చేసేవారు కాలేజీలో. అంత భయంకరంగానూ నిప్పులు కక్కుతూ చూసేదామె వాళ్లవైపు. ఆ చూపులకే కాదు, తీక్షణమైన ఆమె ప్రతిభకు కూడా భయపడేవాళ్లందరూ.
ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడూ అంతే. నీలను చూసి ఆశ్చర్యపోయిన బోర్డు సభ్యులు, ఆమె సాధించిన బంగారు పతకాలను చూసి నోళ్లు వెళ్లబెట్టారు.
‘మీ పని మీరు కాన్ఫిడెంట్‌గా చెయ్యండి. చేస్తారని నాకు నమ్మకం కలిగింది… ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి..’ అన్నారు ఎమ్‌డీ.
‘థేంక్యూ సర్…’ అని చెప్పి వచ్చేసింది.
సహోద్యోగిగా పరిచయమయ్యాడు శరత్‌చంద్ర. అబ్బాయిల్లో అరుదైన బంగారు రంగు అతనిది.
తనను చూసి అతనాశ్చర్యపోలేదు. పని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పాడు. తమ విభాగంలోని ఉద్యోగులను పేరుపేరునా పరిచయం చేశాడు.
పరిచయాల తర్వాత తన సీటు చూపించి కూర్చున్నాక, ‘మీ పేరెంత బాగుందో… పేరుకు తగిన మనిషి మీరు..’ అన్నాడు.
అతని మాటల్లో, చూపులో ఏదైనా వెక్కిరింత ఉందేమోనని చూసింది తను. అటువంటిదేమీ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం తన వంతయింది. అది మొదలు, అతని స్నేహంలో నీలకు అన్నీ ఆశ్చర్యాలే. ఎప్పుడూ తన రంగురూపుల ప్రస్తావనే తీసుకురాకుండా అన్నేసి గంటలు ఎలా మాట్లాడగలడో ఆమెకు అర్థం కాలేదు.
శరత్ తన ప్రేమను ప్రతిపాదించినప్పుడు అయితే ఆశ్చర్య సముద్రంలో ఆమె పూర్తిగా తడిసిపోయింది.
‘నన్నా, ప్రేమిస్తున్నావా? ఏం జోక్ చేస్తున్నావా?’ అని తెరలుతెరలుగా నవ్వింది.
‘ఇందులో అంత నవ్వడానికేం లేదు. నీకు నేను నచ్చితే.. మనిద్దరం కలిసి సంతోషంగా జీవితాన్ని గడపగలమన్న భరోసా నీకుంటే చెప్పు చాలు..’ అన్నాడు శరత్.
‘నీకసలు కళ్లు కనపడుతున్నట్టు లేవు. ఎందుకైనా మంచిది ఓసారి పరీక్ష చేయించుకో. నన్ను చూసే అడుగుతున్నావా.. రేప్పొద్దున ఈ నల్లమేకను ఎక్కణ్నుంచి తెచ్చావని అందరూ అడిగితే పూర్వం కథలోని బ్రాహ్మడిలా వదిలేసిపోతావేమో… ‘ అని నవ్వుతూ భుజాలెగరేసింది నీల.
‘నా కళ్లు బానే ఉన్నాయి. నీ ఆలోచనే బాలేదు. స్కూల్లో, కాలేజీలో ఎవరైనా నలుపంటే కొట్టబోయేదాన్ని అన్నావుగా… మరిప్పుడు నిన్ను నువ్వే వెక్కిరించుకుంటున్నావేం? చిన్నప్పుడు కాకరకాయ అని పెద్దయ్యాక కీకరకాయ అన్నాట్ట నీలాంటివాడెవడో. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా అమ్మగారికి?’ అన్నాడు.
‘వానాకాలం మొత్తం నలుపే… కాకి రెక్కల్లో కారు నలుపే… కన్నె కాటుక కళ్లు నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే..’ అంటూ శ్రావ్యంగా పాటెత్తుకున్నాడు శరత్.
అప్పటిదాకా నవ్విన నీల కంట్లో నీళ్లు తిరిగాయి. మనసులో అన్నేళ్లుగా నానుతున్న విత్తనం నుంచి ప్రేమ మొక్క పుట్టింది. రెండేళ్లలో అది మారాకులు వేస్తూ పెరిగింది.

PAPPUARUNA
ఎప్పుడు నిద్రపోయిందో తెలీలేదుగాని మర్నాడుదయమే లేచి జగన్నాథుడి దర్శనానికి వెళ్లారు ఇద్దరూ.
భక్తుల రద్దీ మరీ అంత ఎక్కువగా లేదు.
ఎత్తయిన గోపురం మీద ఎగురుతున్న కాషాయవర్ణపు పతాకాన్ని తదేకంగా చూసింది నీల.
‘దీన్ని ప్రతిరోజూ మారుస్తారు తెలుసా? ఏ యంత్రాల సాయమూ లేకుండా ఒక మనిషి అంత పైకెక్కి పతాకాన్ని మార్చే దృశ్యం చూడటానికి సాయంత్రం భక్తులు పోగవుతారు ఇక్కడ…’ అన్నాడు శరత్.
‘మనిషి తల్చుకుంటే ఏమైనా చెయ్యగలడు… అంటావు. అంతేగా…’ అంది నీల.
‘తన మీద తనకు నమ్మకం ఒక్కటే కాదు నీలోత్పలా. చేస్తున్న పని మీద కూడా అంతే నమ్మకం ఉండాలంటాను… పద లోపలికి’ అని నవ్వుతూ అడుగులేశాడు..
భారీ వేదిక మీద భారీ విగ్రహాలు… సుభద్ర బలభద్రులతో కలిసి నల్లటి జగన్నాథుడు… నల్లటి ముఖంలో తీర్చిదిద్దిన విశాల నేత్రాలు… ముక్కు, చెవులు, కాళ్లు చేతులు.. ఏవీ పూర్తి కాని సగం సగం ప్రతిమలు.. అయినా ఎంత ఆకర్షణ… కౌగిలి కోసం ముందుకు చాపినట్టున్న మొండిచేతులు… నవ్వుతున్నట్టు నోరు…
అసంపూర్ణత్వంలో ఇంత సౌందర్యమా? ఏం సందేశమిస్తున్నాయి ఈ విగ్రహాలు?
ఒక్క క్షణం నీల ఒళ్లు పులకరించింది. భక్తిని మించిన భావమేదో అల్లుకుంటే… తన్మయత్వంతో కళ్లు మూతలుపడ్డాయి. అప్రయత్నంగా చేతులు జోడించింది వినమ్రంగా.
పండాల గోలను దాటుకుని బయటకొచ్చేసరికి స్వర్గంలోంచి బజార్లోకి పడ్డట్టయిపోయింది.
సందుగొందుల్లోంచి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు శరత్. ఆషాఢమాసపు బురద.. ఈగలు..
ఒక ఇరుకింటి ముందు ఆగి ‘అవ్వా.. అవ్వా…’ అని పిలిచాడు.
‘శరత్ బాబూ, నువ్వేగా… లోపలికి రా నాయనా’ అంటూ పలకరింపు వినిపించింది.
లోపలికి అడుగుపెడుతూనే నీలకు ఆమెను పరిచయం చేశాడు. ‘ఈవిడ పేరు శశిమణీదేవి. గర్భాలయంలో నువ్వు చూసిన జగన్నాథుడి భార్య…’ అని.
నీల ఆశ్చర్యపోయింది.
దాన్ని గుర్తించినట్టు ఆమె నవ్వింది. ‘ఎందుకలా బెదరగొడతావా పిల్లను. ఇలా కూర్చో తల్లీ…’ అంటూ అరుగు చూపెట్టి మంచినీళ్లిచ్చింది శశిమణీదేవి. ఆమెకు డెబ్బయ్యేళ్ల వయసుండొచ్చు.
‘నీలోత్పలా, నీకు దేవదాసి సంప్రదాయం కొంచెమైనా తెలుసా…’ అని శరత్ ఎత్తుకున్నాడు.
‘ఈ గుడిలో ఎనిమిది వందల సంవత్సరాల నుంచీ ఉన్న ఆచారమిది. దేశంలో మిగిలినచోట్లలా కాదు, ఇక్కడ దేవదాసీలకు చాలా గౌరవం ఇస్తారు. ఊహ తెలియని వయసులో దేవదేవుడికి అంకితమైన దేవదాసి అంటే ఆయనకు అచ్చంగా భార్యే… ఒకప్పుడున్న సంగీతనాట్య సేవలు ఇప్పుడు చెయ్యడం లేదనుకో. కాని ఈవిడ ఆయన కోసం ఉపవాసాలు కూడా చేస్తుంది…’ అంటూ శరత్ చెబుతుంటే నీలకు సంభ్రమం కలిగింది. గుళ్లో దేవుడేమిటి, ఈ మనిషి ఆయన భార్య ఏమిటి… ఆమె ఊహలు రకరకాలుగా తొణికాయి.
‘నాకు ఐదేళ్ల వయసులో నా తల్లిదండ్రులు ఇక్కడ దిగవిడిచి వెళ్లారని గుర్తు. మాదే ఊరో, అంతకుముందు నాదే పేరో కూడా గుర్తు లేదు. అప్పట్నుంచీ ఇక్కడ సూర్యప్రభ అనే మనిషి నాకు సంగీతనాట్యాలు నేర్పించింది. ఆమె నాకు తల్లి కన్నా ఎక్కువ. నేను పెద్దయ్యాక మంచి ముహూర్తంలో నాకు జగన్నాథుడితో పెళ్లయ్యింది. ఇప్పుడ ంటే అన్నీ రద్దయిపోయాయిగాని అప్పట్లో నేను పాడితేనే స్వామికి సుప్రభాతం. నా పాటతోనే పవళింపు సేవ…’ చెబుతూ శశిమణీదేవి సుదూర స్వప్నాల్లోకి జారుకున్నట్టయిపోయింది.
నీల ఆమెనే చూస్తూ ఉండిపోయింది.
పసుపు రాసుకున్న కాళ్లకు పారాణి, వెండి కడియాలు, చేతుల నిండా గాజులు, ముఖాన కుంకుమ బొట్టు, నుదుట సింధూరంతో ఆమెలో వింత వెలుగేదో కనిపిస్తోంది. వంకాయ రంగు చీర చుట్టబెట్టిన ఆమె వృద్ధ శరీరం ముడతలు పడినా, మానసిక దృఢత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది నీలకు.
‘ఇవాళ సావిత్రి వ్రతం కదా, భర్త దీర్ఘాయుష్షును కోరుతూ మహిళలు ఉపవాసముంటారు. నేను కూడా ఉపవాసమే. మీరు తినండి…’ అంటూ ఫలహారాలేవో పెట్టింది ఆవిడ. తినేసి శరత్ పెరట్లోకి నడిచాడు.
‘ఇదంతా సాధ్యమా…’ అప్పటికి నోరు పెగల్చుకుని అడిగింది నీల.
చిన్నగా నవ్వింది శశిమణీదేవి.
‘నీకివన్నీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. కాని ఒకటి చెప్తాను విను. దేవుడున్నాడనుకుంటే ఉన్నాడు. లేడంటే లేడు. ఉన్నాడనుకుంటే మా బంధమూ ఉన్నట్టే కదా.. పోనీ ఇదంతా కేవలం పిచ్చి ఊహే అనుకుందాం. అయినా ఆ ఊహలోని అనురాగం ఏ లోటూ లేకుండా నాకు జీవితాన్నంతా నడిపే బలాన్నిచ్చింది కదా… ఉలకనిపలకని దేవుడంటావు నువ్వు, అన్నిటిలోనూ అండగా ఉంటాడనుకుంటాను నేను. ఏదైనా అనుకోవడంలోనే కదా ఉన్నది?’ అందావిడ నింపాదిగా.
‘నీ లోపల భయాలన్నిటినీ తీసెయ్యి నీలా. శరత్ అన్నీ ఆలోచించే పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. మా జగన్నాథుడు నల్లగా లేడా తల్లీ? ఆ మాటకొస్తే ఏ దేవాలయంలోనైనా దేవతామూర్తులు నల్లని శిల్పాలే కదా… మరి వాటిని చూసి మనుషులు భక్తితో దండాలు పెడతారు కదా… అప్పుడెందుకు వాళ్లకు రంగు గుర్తు రాదు? ఎందుకంటే దైవమంటే కరుణ, అభయం, ప్రేమ… ఆ లక్షణాలు మీ బంధంలో ఉన్నప్పుడు నువ్వు దేనికి వెనకాడాలి చెప్పు?’ అన్నది శశిమణీదేవి అనునయంగా.
‘లేనిపోని అనుమానాలతో నీ దగ్గరకు వస్తున్న వసంతాన్ని కాదనకు… నీ సంతోషంలో అతని జీవితానందం ఉంది. ఏవేవో ఊహించుకుని నువ్వు దూరం జరిగిపోకు…’ అన్నది బొట్టుపెట్టి కొత్త చీరనందిస్తూ…
ఆకాశంలోకి చంద్రుడొచ్చినట్టు నీల ముఖంలోకి ఒక సంతోష తరంగం వచ్చింది. లోపలికి వచ్చిన శరత్ ముఖంలో వెన్నెల విరిసింది.

–అరుణా పప్పు

కథనానికి బొమ్మ : పినిశెట్టి