స్వాతి వాళ్ళ అమ్మ

క్రొత్తగా పెళ్లి చేసుకుని  విదేశానికి వచ్చి  బయటకి  కదలకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల్సివచ్చినందుకు  విసుగ్గా ఉంది  స్వాతికి.   అనుకోకుండా  ఒక ఆహ్వానం అందింది. ఆటవిడుపుగా ఆ కార్యక్రమానికి  హాజరైంది. అక్కడ అనేకమంది తెలుగు వారిని చూసి సంతోష పడింది. అందరినీ పరిచయం చేసుకుంది.  అంతా తెలుగు వారే కావడంతో అది  ఆంధ్రదేశంలో ఒక  ఊరులాగా తోచింది.
అదొక కమ్యూనిటీ హాలు.   ఆ రోజు అక్కడ ఒక కార్యక్రమం జరగబోతోంది. ప్రత్యేకించి స్త్రీలకి సంబంధించిన కార్యక్రమం. పరాయిభావనలో మూలాలు గుర్తుకు రావడం మూలంగానేమో దేశంలో జరిగే ప్రతి చిన్నవిషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి  అలవాటు పడిపోయిన వారికి అదొక అవకాశమే!

వారానికి అయిదు రోజులు యంత్రాలలా పనిచేసి ఆటవిడుపు కోసం వెతుక్కుని నలుగురూ కలిసే సందర్భం  కోసం ఎదురు చూస్తున్న  వారికి కందుకూరి జయంతి గుర్తుకు వచ్చింది.  స్త్రీల పునర్వివాహాలు జరిపించడానికి విశేషంగా కృషి చేసిన విధం గుర్తుకు వచ్చింది.   వెంటనే  ఒక కార్యక్రమం వారి ఆలోచనలలో రూపుదాల్చింది. నాటి కాలానికి నేటి కాలానికి వచ్చిన మార్పులు గమనిస్తూ పునర్వివాహాల  వల్ల  కలిగే మంచీచెడుల పరిణామం గురించి ఒక చర్చా కార్యక్రమం నిర్వహించదలిచారు.

‘ఒంటరి స్రీలు – పునర్వివాహం అనే అంశంపై  ఎవరైనా మాట్లాడవచ్చు  వారి వారి అనుభవాలని చెప్పవచ్చు’ అని ప్రకటించారు. రోజంతా అదే విషయం పై కార్యక్రమం జరుగుతుంది  కాబట్టి చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

స్వాతి కార్యక్రమాన్ని ఆసక్తిగా  చూస్తూ ఉంది.
కొందరు చక్కటి తెలుగులోనూ, మరి కొందరు ఇంగ్లీష్  లోను వారి అనుభవాలనీ, అభిప్రాయాలనీ చెబుతున్నారు.  చాలా మంది పునర్వివాహం చేసుకోవడం  చాలా మంచి ఉద్దేశ్యం అనీ, ఒంటరి జీవితాలకి తోడూ-ప్రేమా దొరుకుతాయని, మనిషి ఆనందంగా బ్రతకడానికి వివాహం చాలా అవసరం అని చెపుతున్నారు. వారి వారి మాటలు వింటున్న స్వాతికి  కోపం ముంచుకొస్తోంది.
ప్రక్కనే ఉన్న భర్త అనిల్ స్వాతి చేయి పట్టుకుని వారిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ భర్త మాటని లక్ష్య పెట్టకుండా లేచి గబా గబా నిర్వాహకుల దగ్గరికి వెళ్లి  తనకీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని కోరింది.  నిర్వాహకులు ఆమె పేరుని నమోదు చేసుకుని వరుస క్రమంలో ఉంచారు.
” స్వాతీ .. ఏం  మాట్లాడ దల్చుకున్నావ్ ? ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నావా ? అలాంటి బుద్ది  తక్కువ ఆలోచన మానుకో ! మన గురించి మనమే చాటింపు వేసుకోవడం అవసరమా ? ” అన్నాడు అనిల్. “మన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే తప్పేమిటి?   ఆ అనుభవం ఇతరులకి మంచి చేయవచ్చు కదా! ” అంది స్వాతి.
“ఇక్కడ ఉన్నంత మాత్రాన స్వేచ్ఛ గా ఎవరికీ తోచింది వారు చేసేయవచ్చు అనుకోకు. మనకి అక్కడ ఉన్నట్లే ఇక్కడ వారిలో కూడా చాలా విషయాలలో మూర్ఖత్వం ఉంది. పై పైకి అందరూ నాగరికులే, చదువుకున్న వారే, సంస్కారం ఉన్నవారే, కాని మన జీవితాలలో ఉన్న చిన్న లోపం కనిపెట్టినా చెవులు కొరుక్కుంటారు. వెలివేసినట్టు చూస్తారు.   ఎవరికీ కూడా  మనం అనుకున్నంత విశాల హృదయం ఉండదు. ముందు ‘అయ్యో ! అలాగా!’అని సానుభూతి చూపించి మన వెనుక మళ్ళీ తాటాకులు కడతారు. ఇతరులు మన గురించి తక్కువగా చూడటం, హీనంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.  నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తావని నేను అనుకోను. ఇకపై నీ ఇష్టం.”అని  చెప్పాడు అనిల్.
స్వాతి మౌనంగా ఉండి పోయింది. “అక్కడొక ఫ్రెండ్ విష్ చేస్తున్నాడు. వెళ్ళి వస్తాను. నువ్వు వస్తావా? “అని అడిగాడు.
“నేను రాను మీరు వెళ్లి రండి” ముభావంగా చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనడానికి  తన వంతు వచ్చేటప్పటికి  స్వాతి లేచి వెళ్ళింది.  వెళ్ళేటప్పుడు భర్త వైపు చూడను కూడా చూడలేదు. చూస్తే మరొక సారి చూపులతో అయినా తనని హెచ్చరిస్తాడని.  స్వాతి వేదికపైకి వెళ్లి మైక్ తీసుకుని గొంతు విప్పింది.  ఒకసారి బలంగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది.
“నేను నా అనుభవాన్ని చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది” అని – అందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. నిర్వాకుల అనుమతి లభిండంతో  స్వాతి చెప్పడం మొదలెట్టింది.
“నా పేరు స్వాతి. నాకు నా  తల్లి అంటే చాలా ఇష్టం. అందరికి అమ్మ అంటే ఇష్టమే, కానీ నాకు  మరీ ఇష్టం. నేను  పుట్టి నాలుగు నెలలైనా కాక ముందే నాన్న చనిపోయాడు. భర్త పోయిన బాధని, తనలో ఉబికే  దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని బిడ్డే ప్రపంచం అన్నట్లు  బతికింది. అత్తమామలకి, కన్నవాళ్ళకి మధ్య తలలో నాలుకలా మెలుగుతూనే ఆగి పొయిన  చదువు కొనసాగించి  లెక్చరర్ అయింది  అమ్మ.
సన్నిహితులు ఎవరైనా  ‘ఎన్నాళ్ళు ఇలా మోడులా ఉంటావమ్మా ! స్వాతిని చూసుకోవడానికి మేమంతా లేమూ ! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో’ అని  చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేవారు.
” స్వాతి కి నాన్న ఎలా ఉంటారో తెలియదు.  నేను  పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయి తనకి అమ్మని దూరం చేయమంటారా?  అప్పుడు నేను అమ్మని కాను మర బొమ్మని అవుతాను. నా బిడ్డ తోడిదే నాకు లోకం. అమ్మని అనిపించుకొవడమే  నాకు గొప్ప కానుక. మరిక ఏ కానుకలూ వద్దు ” అని సున్నితంగా తిరస్కరించేది.
నాన్న గురించి అమ్మ చెప్పేటప్పుడు  చూడాలి ఆమె ముఖం. నవ్వుతో మెరిసిపోయేది.  నాన్న నాకు స్వాతి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక విశేషం ఉందట. స్వాతి సినిమా వచ్చినప్పుడు నేను పుట్టానట. స్వాతి సినిమా నచ్చి నాకు స్వాతి అని పేరు పెట్టారని అమ్మ చెపుతుంటే విని స్వాతి సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటానో !  సినిమా చూసిన ప్రతి సారీ మా అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలి అనిపించేది.  మా నాన్నకి తను చనిపోతానని ముందే తెలుసేమో!  అందుకే నాకు ఈ పేరు పెట్టారేమో! అని తెగ ఆలోచనలు ముంచుకొచ్చేవి. అమ్మని ఆ మాటే అడిగితే   చప్పున పెదవులపై చూపుడు వేలుంచి ‘తప్పు అలా మాట్లాడ కూడదు.  ఎవరు ఎప్పుడు చనిపొతారో ఎవరికీ తెలియదు. చనిపోయేలోగా మంచి పనులు చేయాలని అనుకోవాలి’ అని చెప్పేది.
మరి నీకు పెళ్లి చేయడం మంచి పనే కదా !  నాకు నాన్న కావాలనుకోవడం మంచి పనే కదా అని అమ్మని విసిగించేదాన్ని. నేను, అమ్మ నాయనమ్మ  వాళ్ళింట్లో ఉండేవాళ్ళం. నాయనమ్మ, తాతయ్య అమ్మని కూతురులా చూసేవాళ్ళు. మా ఇంటి ప్రక్కనే రాజేశ్వరి టీచర్ ఉండేవారు. ఆమె భర్త కూడా టీచర్.  కానీ ప్రమోషన్ పై ఆ ఊరి స్కూల్ కి హెడ్మాస్టర్ అయ్యారు.  ఆయన పేరు మోహన కృష్ణ. పేరుకు తగ్గట్టు మోహనంగా ఉండేవారు. ఎప్పుడూ నలగని ఖద్దరు సిల్క్ దుస్తులతో పాటు నలగని నవ్వు, కళ్ళకి  నల్లద్దాల చలువ కళ్ళ జోడుతో  చాలా హుషారుగా కనిపించేవారు.  స్కూల్లో పిల్లలకి ఆయనంటే ఎంత భయమో అంత ఇష్టం కూడా.  భార్యభార్తలిద్దరూ  ఒకే స్కూల్ లో పని చేసేవారు. రాజేశ్వరి టీచర్ మాత్రం లావుగా, నల్లగా ఎత్తు పళ్ళుతో ఉండటమే కాదు ఎప్పుడు దిగులు ముఖంతో కనబడేది.  స్కూల్,  వంట ఇల్లు తప్ప ఆమెకి మరో ప్రపంచం ఉండేది కాదు.
రాజేశ్వరి టీచర్ కి  ఇద్దరు  మగ పిల్లలు.  వాళ్ళు ఇద్దరూ కూడా మా ఊరి హై  స్కూల్ లోనే  చదువుకుంటూ ఉండేవారు. అమ్మ రేడియో వింటూ, పుస్తకాలు చదువుతూ, నాతో ఆడుకుంటూ, నన్ను చదివిస్తూ ఉండేది.  నేనేమో మోహన కృష్ణ మాస్టారు వంక అదేపనిగా చూస్తూ ఉండేదాన్ని.  మా నాన్న ఉంటే అచ్చు ఇలానే ఉండేవారేమో అనుకునే దాన్ని.  మోహన కృష్ణ అంకులేమో  మా అమ్మ వంక దొంగ చూపులు చూస్తూ ఉండేవాడు. ఆ వయసులో అలా ఎందుకు చూస్తున్నాడో అర్ధం కాకపోయినా కూడా ఆ చూపులలో  ఏదో తప్పు ఉందని నాకు తెలిసిపోయేది.
మోహన కృష్ణ మాస్టారి చూపులని గమనించిన అమ్మ బయటకే వచ్చేది కాదు.  నేను సెవెంత్ క్లాస్ కి వచ్చేటప్పటికి తాతయ్య చనిపోయారు. అమ్మకి మా ఊరి నుండి  వేరే చోటకి బదిలీ  అయింది మాతో పాటు నానమ్మ, నానమ్మ వాళ్ళ అమ్మ జేజమ్మ కూడా మాతో వచ్చేసారు.  అలా  ఏడెనిమిది ఏళ్ళు మేము మా ఊరి వైపుకి  రాకుండానే గడిపేశాము.
నేను ఇంజినీరింగ్ చదువుతూ ఉండగా మా జేజమ్మ  చనిపోయింది.  ఆమె అంత్యక్రియల కోసం   మళ్ళీ మా ఊరు రావాల్సి వచ్చింది. నా చిన్నప్పటిలా ఆరాధనగా కాకపోయినా ఆసక్తిగా మోహన కృష్ణ మాస్టారు వంక చూస్తూ ఉండి  పోయాను.  వాళ్ళు మా ఇంటి ప్రక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు. వారి అబ్బాయిలు  ఇద్దరూ  విదేశాలలో స్థిర పడ్డారని, పెళ్ళిళ్ళు కూడా అయిపొయ్యాయని చెప్పారు.  మేము ఒక నెల రోజులు ఉండి తిరిగి అమ్మ వర్క్ చేస్తున్న ఊరికి వచ్చేశాము.
కొన్ని నెలలకి మోహన కృష్ణ మాస్టారు భార్య ఉరి వేసుకుని చనిపోయింది అని నానమ్మ చెప్పింది.  ఎందుకు అంటే ఏమో తెలియదు అని చెప్పింది.  అప్పుడు నాలో ఎక్కడో అణచి ఉంచిన   ఊహలు  మళ్ళీ నిద్ర లేచాయి. నానమ్మ ప్రక్కన చేరి ‘నానమ్మా!  నాకు నాన్న కావాలి’  అని చెప్పాను.
ఇరవై రెండేళ్ళ పిల్ల నాన్న కావాలి అంటే అర్ధం చేసుకోకుండా ఉంటుందా?
‘నీకు నాన్న కావాలని మీ అమ్మకి ఎప్పుడో చెప్పాము తనే వద్దని భీష్మించుకుని కూర్చుంది . తను కావాలంటే నేను వద్దంటానా? మీ అమ్మని ఒప్పించు. అయినా ఈ వయసులో ఎక్కడని మీ నాన్న కోసం వెతుకుతావు వెర్రి మొహం నువ్వూనూ!’  అని చీవాట్లు పెట్టింది.
‘ఎక్కడో వెతకక్కరలేదు. మన ఇంటి ప్రక్కన మోహన కృష్ణ మాస్టారు అమ్మకి తగిన జోడు’  అని చెప్పాను.   నానమ్మ ఆశ్చర్యంగా చూసి  ‘అతనా! అతనైతే పర్వాలేదు.  వ్యక్తి కూడా మంచి వాడే ననుకుంటాను.  పాపం ఎందుకో ఆ రాజేశ్వరి టీచర్ ఆ వయసులో అలా ఉరేసుకుని చనిపోయింది ” అంది.
నాయనమ్మ దగ్గర ఆమోదం లభించడంతో  నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం  కలిగింది.  ఇక అమ్మ దగ్గర నా ఆలోచనలని కార్య రూపంలో పెట్టడానికి ప్రయత్నించాను.  అమ్మ
ససేమిరా ఒప్పుకోలేదు. నేను అలిగాను. తిండి తినకుండా బెట్టు చేసాను. ఆఖరి అస్త్రంగా ‘నాకు పెళ్లి చేసినప్పుడు కన్యాదానం చేయాలి.  నాకు ఆ లోటు లేకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి.  నాకు నాన్న కావాలి’ అని చెప్పాను.
నాన్న లేకపోడం వల్ల  ఆస్తుల వాటాల విషయంలో, అయినవాళ్ళ వైఖరిలతో విసిగి పోయిన అమ్మ  బంధులంటే విముఖత పెంచుకుంది.  అమ్మకి  నా పెళ్లి విషయంలో బంధువుల  అండ దండ వీసమెత్తు అయినా  తీసుకోవడం ఇష్టం లేకపోయింది. పదే  పదే అదే విషయాన్ని నేను అడగడం,  నానమ్మ కూడా నాకు వత్తాసు పలకడం చూసి ఆలోచనలో పడింది.   అమ్మ ఆలోచనలని గ్రహించి నేను కార్యాచరణలోకి దిగాను.
మోహన కృష్ణ మాస్టారుతో మాట్లాడి ఆయనని ఒప్పించాను. ఆయన సులభంగానే ఒప్పుకోవడంతో పాటు వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడాడు. వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు అని చెప్పారు  రెండు నెలలలో పెళ్ళికి తేదీని నిర్ణయించాము.  అమ్మ పెళ్లి రంగ రంగ వైభవంగా చేయాలని అనుకున్నాను. కానీ అమ్మ సున్నితంగా తిరస్కరించి  గుడిలో సింపుల్ గా దండలు మార్చుకుంటే సరిపోతుందని,   అలాగే తనకి ఇష్టమని కూడా  చెప్పింది.  పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు మోహన కృష్ణ మాస్టారు పిల్లలు ఇద్దరూ వచ్చారు. నేను వాళ్ళని అన్నయ్యా అంటూ సంతోషంగా పిలిచాను.  వాళ్ళూ  చెల్లెమ్మా..  అంటూ  ఆప్యాయంగానే ఉన్నారు   అన్నయ్యలగా నాకు ఒక వడ్డాణంని బహుకరించారు. అమ్మకి కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారు  అమ్మ నాన్నల  పెళ్లి అయిన తర్వాత ఒక పది రోజులు వరకు ఉన్నారు. మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది.   ఆనందానికి అవధులు లేకుండా  అంతా నేనై తిరిగాను. మోహన కృష్ణ గారిని  ‘నాన్నా- నాన్నా’  అంటూ వదలకుండా తిరిగాను.
అన్నయ్య లిద్దరూ అమ్మని ‘ఆంటీ’ అంటూ పిలిచారు. అమ్మకి అది కష్టంగా అనిపించింది ‘అదేమిటి బాబూ! స్వాతి నాన్న గారూ అని పిలుస్తుంది మీరు కూడా  నన్ను అమ్మా అని పిలవచ్చు కదా!’  అని అడిగింది.
‘ సారీ అంటీ ! స్వాతికి అంటే వాళ్ళ నాన్న ఎవరో తెలియదు కనుక అలా తేలికగా పిలవగలుగుతుంది.  మాకు మా అమ్మ అంటే ఏమిటో తెలుసు. ఆమె ప్రేమ తెలుసు, అట్లాగే  ఆమె కష్టాలు తెలుసు. మా కోసం మా అమ్మ పెదవి విప్పకుండా ఎన్ని బాధలు భరించిందో మాకు తెలుసు’ అని అన్నారు.  అమ్మే కాదు ఆ మాటలు వింటున్న నేను కూడా స్థాణువులా నిలబడి పోయాను.
అన్నయ్యలు ఇద్దరూ వాళ్ళ అమ్మ కష్టాలు అంటూ చెపుతున్నారు అంటే మోహన కృష్ణ మాస్టారు మంచి వ్యక్తి కాదా! – అనేక అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యలిద్దరూ తిరిగి వెళుతూ నా పెళ్లి బాధ్యత  అంతా వాళ్ళే చూసుకుంటాము అనీ,  నాన్న రిటైర్  అయిన తర్వాత  వచ్చే డబ్బు కాని ఆయన పెన్షన్ డబ్బు  కానీ ఏవి తమకి ఇవ్వనవసరం లేదనీ, అన్నీ మాకే చెందుతాయననీ  చెప్పి వెళ్ళారు.
రోజులు గడుస్తున్న కొద్దీ చాలా విషయాలు నాకు అవగతమయ్యాయి.  నాన్న అట్టే మంచాడు కాదని భార్యని   అనాకారి అని నిత్యం వేధించుకు తినేవాడని,  ఏ వంట చేసినా నచ్చ లేదని పేర్లు పెట్టేవాడని,  స్త్రీ లోలత్వం ఉందని అర్ధమయి పోయింది. నాకు చచ్చేంత దిగులు ముంచుకు వచ్చింది.  హాయిగా పువ్వులా బ్రతుకుతున్న అమ్మని తీసుకు వచ్చి వ్యసన పరుడికి   జత చేసానేమో అని దిగులు కలిగింది.
అమ్మ ఏమి చెప్పేది కాదు. ‘నాన్న మంచి వాడేనా అమ్మా!’ అని అడిగేదాన్ని. ‘మంచివాడు అనేగా బలవంత పెట్టావ్’  అని నవ్వేది.  ఆ నవ్వులో నాకు అనేక అర్ధాలు కనిపించేవి.   ఒక సంవత్సర కాలంలోనే నాన్న  రిటైర్మెంట్.   ఆ ఫంక్షన్  కి వెళ్ళాము. అక్కడ అందరూ  మోహన కృష్ణ మాస్టారు భార్య చాలా అందంగా ఉంది కదూ అని మెచ్చుకుంటూనే  కాసేపటి తర్వాత  గుసగుసలాడుకుంటున్నారు. వీరిద్దరికీ అదివరకే పరిచయం ఉంది అంట. ఇద్దరి ఇళ్ళూ  ప్రక్కనే కదా! వీళ్ళ గ్రంధసాంగం తెలిసే  రాజేశ్వరి టీచర్ ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పుకుంటారంట’ అనే మాటలు నా చెవిన పడ్డాయి. నాకు దు:ఖం ముంచుకు వచ్చింది. ఉన్నత చదువులు చదువుకుని గురువుల  స్థానంలో ఉన్న వీరు కూడా  ఎంత నీచంగా ఆలోచించగలరో ! అనుకున్నాను. నిజాలు ఏవిటో తెలియ కుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు  అనిపించింది,  అసహ్యం వేసింది. నాన్నని  ‘అన్నయ్య వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయింది’ అని  అడిగేశాను .
ఆయన నవ్వుతూ  ‘ఆమెకి అందంగా లేనని ఇన్ఫీరియారిటీ  కాంప్లెక్స్.  వంట  చేయడం సరిగ్గా రాదు. ఇతరులతో  స్నేహాన్ని  అర్ధం చేసుకునేదే  కాదు.  నాపై అనుమానం ఎక్కువ. అందుకే అలా చేసింది’  అని చెప్పారు. నాన్న రిటర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో అమ్మ పేరు మీద  ఉన్న స్థలంలో ఇల్లు కట్టారు. నాన్నతో పాటు నాన్న వాళ్ళ అమ్మ, నాన్నమ్మ నేను. నాన్న, అమ్మ అందరం కలసి ఉండేవాళ్ళం . నానమ్మలిద్దరూ బాగా కలసి పోయారు. వారితో  ఏ ఇబ్బంది ఉండేది కాదు.  ఉదయాన్నే నేను,  అమ్మ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నాన్న ఇంట్లో ఉండేవారు. నాన్నతో పరిచయం ఉన్నఅనేక మంది టీచర్స్ మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు.  అమ్మ వచ్చేసరికి వంట ఇల్లు అంతా  కాఫీలు తయారుచేసుకుని, టిఫిన్స్ తయారుచేసుకుని  తిని వంట వస్తువులు అన్నీ  అడ్డదిడ్డంగా  వాడి పడేసే వారు. డైనింగ్  టేబుల్ పైన తిన్న కంచాలు అలాగే పడి ఉండేవి.  ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం లాంటివి  అన్నీ కనబడుతూ  ఉండేవి. అదేమిటి అని అడిగితే  సరదాగా ఫ్రెండ్స్ మి  కూర్చుని ఆడుకుంటున్నాం అనేవారు నాన్న.
ఆయన చేసే రకరకాల విన్యాసాలని నాకు కనబడకుండా చేయడానికి అమ్మ నాకు మేడపై గది కేటాయించింది . నాన్నమ్మలిద్దరూ ఓ మూల  గదిలో ఉండేవారు. ఒక రోజు నేను నా గదిలో నుండి బయటకి  వచ్చి క్రిందికి చూశాను.  నాన్న తను తినే అన్నం పళ్ళెం ని అమ్మ ముఖం పై విసిరి కొట్టాడు. అన్నం అంతా చెల్లాచెదురు అయిపొయింది  పళ్ళెం విసరడం వల్ల అమ్మ కంటి పైభాగంలో దెబ్బ తగిలి వెంటనే బొప్పి కట్టి పోయింది.
‘నీకు ఎంత దైర్యం ఉంటే  ఉదయం వండిన కూర వేసి  నాకు అన్నం పెడతావు.  సిగ్గు లేదా? మొగుడుకి వేడి వేడిగా చేసి వడ్డించాలని తెలియదా!?’  అంటున్నాడు.
అమ్మ సంజాయిషీగా  ‘ఈ రోజు రావడం ఆలస్యం అయింది. తలనొప్పిగా కూడా ఉంది. అందుకనే ఈ పూట కూరలు  చేయలేకపోయాను’ అని చెపుతోంది .
‘నువ్వు మాత్రమే ఉద్యోగం  చేస్తున్నావా?  రాజేశ్వరి కూడా ఉద్యోగం చేసేది. అయినా నాకు ఏనాడూ  లోటు చేసేది కాదు. ఎలా చేసినా ఏది పడేసినా తిని ఊరుకుంటాడు లే అని అనుకుంటున్నావేమో’ అంటూ  ఇంకా ఏదేదో మాట్లాడబోయి నన్ను చూసి ఆగి పోయాడు.
ఆ రాత్రి అమ్మని పట్టుకుని నేను ఏడ్చేసాను.  అమ్మ మౌనంగా కన్నీరు కార్చింది.
అమ్మ ప్రతి రోజూ  కాలేజ్ కి వెళ్ళాలంటే రాను పోను నూటముఫై  కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.  కనీసం ఇంటి దగ్గర నుండి రెండు గంటల ముందు బయలు దేరితే తప్ప సమయానికి చేరుకోలేదు. తెల్లవారుఝామునే  లేచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసుకుని నాన్నకి అన్నీ హాట్ ప్యాక్ లలో సర్ది  అమ్మ బయటకి వెళ్ళాలి. అమ్మ ఒక్కటే ఒంటరిగా బయటకి వెళ్ళకూడదు. ఆయనతోనే బయటకి వెళ్ళాలి. జనన మరణ పెండ్లి విందు వినోద కార్యక్రామాలు అన్నిటికి ఆయనతో ఠంచనుగా వెళ్లి తీరాలి. అక్కడ అందరికి అమ్మని గర్వంగా చూపాలి. అమ్మ వెళ్ళడం కుదరదంటే, ఆ రోజు ఇంట్లో మరో యుద్ధం జరిగేది.
ఇవన్నీ చూస్తూ బాధ పడుతున్న నన్ను ఎక్కువకాలం అక్కడ ఉంచడం అమ్మకి ఇష్టం లేక పోయింది. అన్నయ్యలతో చెప్పి ఫారిన్ సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్లి జరిపించారు. నాకు ఎలాంటి  భర్త వస్తాడు అనే దానికన్నా అమ్మ జీవితం ఎలా గడుస్తుందో అనే నాకు దిగులుగా ఉండేది. నేను అమ్మకి పెళ్లి చేయాలనుకోవడమే చాలా పొరబాటు పని అనిపించింది. హాయిగా ఉన్న అమ్మ బ్రతుకుని  కష్టాల పాలు చేసినట్లు అయ్యింది.
స్త్రీ కి పునర్వివాహం అనేది అందరికీ  సంతోషాన్ని ఇవ్వదు.  అసలు సంతోషాన్నే ఇవ్వదు అంటాను నేను. మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకుంటే వాడితో ఎందుకు తేడాలు వచ్చాయి?  వాడు నాలా ఉండేవాడు కాదా?  వాడు నీకు నచ్చలేదా? అనో,  లేదా వాడిని ఎందుకు వదిలేశావు? ఎవరినైనా ఉంచుకున్నావా? అనో,  మొదటి  పెళ్ళైన ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి  పెళ్లి అయ్యింది,  ఇన్నాళ్ళు మడి  కట్టుకునే ఉన్నావా?  అనో అవమానకర ప్రశ్నలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.  మళ్ళీ  ఎందుకు పెళ్లి చేసుకున్నామా ? అని పశ్చాత్తాప పడుతూ   పెనం మీద నుండి పొయ్యిలోకి పడేసినట్లుగా తమ పరిస్థితి అయింది అని అనుకునే వాళ్ళు తక్కువ ఏమీ కాదు.
అమ్మ తన బాధలు అన్నింటిని కాకపోయినా కొన్ని అయినా నాతో చెప్పుకుంటుంది. ఆమెకి నేను తప్ప ఎవరున్నారు? ఎవరితో నైనా పంచుకున్నా పలుచన అయిపోతాము అంటుంది . అందరి  దృష్టిలో మోహనకృష్ణ  మంచివాడు.  అమ్మకి జీవితం ఇచ్చాడు. ఇల్లు కట్టాడు  నాకు బోలెడు నగలు చేయించారు. పెళ్లి చేశాడు అని చెప్పుకుంటారు తప్ప.  ఆయన కొడుకులు కూడా ఆయన బాధ్యతని తెలివిగా అమ్మ పై వేసి తప్పుకున్నారు అని అర్ధం కావడం కష్టం.  జీవితం లో అవసరాల కోసమే పెళ్లి అనుకునే వారే ఎక్కువ. ఇలాంటి పెళ్ళిళ్ళలో
ఏ మాత్రం ప్రేమకి, అనుబంధానికి తావే ఉండదు.  అందుకు ఉదాహరణ మా అమ్మ వివాహమే.
మగవాడికి  ఏ వయసులో అయినా వంట వండి  పెట్టడానికి, ఇంటి  అవసరాలు చూడటానికి,  ఇంకా శారీరక అవసరాలు తీర్చుకోవడానికి స్త్రీ అవసరం కావాలి. అందుకు పెళ్ళి అనే అందమైన ముసుగు వేస్తారు.   పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అలాగే ఒంటరి తనంతో బ్రతుకున్న స్త్రీలు ఆర్ధిక అవసరాల కోసమో, అండ కోసమో తోడు కోరుకుంటారన్నమాటే కానీ వారికి ఏ మాత్రం ప్రేమానురాగాలు లభింపక పోగా ఎన్నో అవమానాలు, అనుమానాలు ఎదుర్కోవాల్సి  వస్తుంది. ఆ వివాహాన్ని తెగతెంపులు చేసుకునే ధైర్యం రాదు. ఒకవేళ అలా తెగింపు నిర్ణయం తీసుకున్నా  మరొకసారి  విఫలమైన వివాహంతో సగం చచ్చి ఉన్న వారిని  చుట్టుప్రక్కల వారు వారి మాటలతో పూర్తిగా చంపేస్తారు.  స్త్రీ జీవితం అడుగడుగునా వేదనాభరితమే!  అలాగే అంతకు ముందు వివాహం వల్ల పిల్లలు ఉంటే స్త్రీకి  అనేక సర్దుబాట్లు ఉండాలి. ముందు వివాహం వల్ల కల్గిన  బిడ్డలని  పూర్తిగా  వదులుకోవాలి. పురుషుడికి ఉండే పిల్లలకి  అలాంటి ఒప్పందాలు ఉండవు .  ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లి అనే ముద్ర  ఉండనే ఉంటుంది. ఒక్కో వివాహంలో భర్త మొదటి పిల్లలకి   రెండో భార్యగా వచ్చిన ఆమె పై సదభిప్రాయమే ఉండదు.  కనీస గౌరవానికి అనర్హురాలన్నట్లు చూస్తారు.  ఇలాంటివి అన్నీ ఉన్న చోట పునర్వివాహం విజయవంతం కావడం  కష్టం అని నా అభిప్రాయం. మళ్ళీ మా అమ్మకి మునపటి జీవితం తిరిగి రాదు.  ఇవ్వాలంటే కష్టం కూడా.  సంవత్సరానికి ఆర్నెల్లు అయినా మా అమ్మని నాదగ్గరకి పిలిపించుకుని ఆమెకి విశ్రాంతి ఇవ్వడం తప్ప మరో దారి కనబడటం లేదు.   అలా అమ్మని పిలిపించుకుందామన్నా అతను  తయారవుతాడు”  అంది అతనిని   నాన్న అనడానికి కూడా ఇష్టం లేనట్టుగా.
“ఇది  నా ఇంట్లో జరిగిన విషయం . ప్రపంచానికి ఏమి తెలియకుండా  అమ్మ గుంభనంగా  దాస్తుంది కాబట్టి ఆమె జీవితం హాయిగానే సాగి పోతుంది అనుకుంటారు.  చాలా మంది జీవితాల్లో కూడా ఇలాంటి  సమస్యలు ఉంటాయి.  మళ్ళీ జరిగిన పెళ్లి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు.  మగవారు సాధిస్తారు.  అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కుఅనుకుంటారు.   స్త్రీకి  ప్రేమ, తోడు-నీడ కావాలనుకునే తపన కూడా ఉంటుంది. కానీ అవన్నీ  గుర్తించని స్థితిలో ఇరుకు మనస్తత్వాల మధ్య బతుకు వెళ్ళదీయాలనుకోవడం  నరకం కదా !   ఇప్పుడు చెప్పండి పునర్వివాహాలు మంచివేనంటారా?  ఎంతమంది  నిజమైన తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుంటారంటారు ” అని అడిగింది స్వాతి.
సమాధానంగా  అప్పటివరకు నిశ్శబ్దంగా  ఉన్న హాలంతా  చప్పట్లతో దద్దరిల్లింది
ఆ చప్పట్ల  మధ్యలోనే  “నాలా  ఎవరూ  కూడా ఎవరినైనా  పునర్వివాహం చేసుకోమని బలవంతం చేయకండి.  పెళ్లి అనే బంధంలోకి బలవంతంగా నెట్టకండి. స్వేచ్ఛగా  వారికి నచ్చిన విధంగా వారి బ్రతుకుని వారి చేత బ్రతకనివ్వండి. మీరు అలా ఎవరినైనా బలవంతం  చేయాల్సి వస్తే , అలా చేసేముందు “స్వాతి వాళ్ళ అమ్మ” ని గుర్తుకు తెచ్చుకోండి. తర్వాత నిర్ణయం తీసుకోండి ” అని ముగించి ధన్యవాదములు చెప్పి క్రిందికి దిగి వస్తూ ఉంటే తల్లి  గుర్తుకు  వచ్చింది్ స్వాతికి.  ఆమె పడే అవస్థ  కళ్ళ ముందు మెదిలింది. కన్నీళ్లు ముంచుకొచ్చాయి  బాధ గొంతులో తారట్లాడుతుండగా చేతి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ  వచ్చి తను అంత  క్రితం కూర్చున్న కుర్చీలో కూర్చుంది స్వాతి.

వనజ వనమాలి  (వనజ తాతినేని)

ఈ ఇందిర ‘కాలాతీత వ్యక్తే!’

vanaja vanamaliస్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలన్నింటిలోనూ కొన్ని నవలలను పంచ కావ్యాల్లాంటివని సాహితీ కారులు పేర్కొన్నారు.  అందులో డా ॥ పి.శ్రీదేవి రాసిన “కాలాతీత వ్యక్తులు ”  ఒకటి.

స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి రాసిన నవల ఇది. గోరా శాస్త్రి గారి సంపాదకత్వం లోని “తెలుగు స్వతంత్ర”  లో  21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన సీరియల్ ఇది.  దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో  వచ్చిన మార్పులకి,   వారి  ఆలోచన విధానానికి, మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి  ఈ నవల అద్దం  పట్టింది. ఈ నవల ఇప్పటికీ సమకాలీనమనే చెప్పవచ్చు.  ఇందిర లాంటి స్త్రీలని ఇప్పటికీ మనం అంగీకరిచలేకపోతున్నామనేది వాస్తవం.

55 సంవత్సరాల క్రితం డా ॥ పి  శ్రీదేవి రాసిన   ఈ నవల లోని “ఇందిర”పాత్ర ఇప్పటి కాలం లోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానిని  కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.
అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి ఎవరు  అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. “కల్యాణి” పాత్ర  ఆ నవల లో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవల లోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది. నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.  అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు . చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ అలాంటి వ్యక్తి కాదు ఇందిర. చిన్న తనం లోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు బాధ్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది.  చాలీ చాలని జీతం మధ్య అన్నీ అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే  పోషించాల్సి  రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని లోక మర్యాదలని ఎదిరించింది . తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది.  ఒక విధంగా కాలానికి లొంగకుండా  తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని  మోసం చేయడం  వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది .

అందుకే ఇందిర పాత్ర  చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర.   కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు ప్రకాశంతో స్నేహం చేస్తుంది  షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం  వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నాను అని చెప్పుకుంటుంది .

తానూ ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ  కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణి ల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది అనుకుంటుంది .ఇందిర పాత్ర  ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది. “ఏమిటి ఆలోచిస్తున్నావ్” ప్రకాశం అని అడుగుతుంది ఇందిర. కల్యాణి గురించి అంటాడు అతను.  “అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు.  నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకొస్తున్నాను. నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది నాన్న సంగతి నీకు తెలుసు. అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా  ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు వాళ్లతో  నేను కాలక్షేపం చేయలేను.  ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు. అంత  నంగనాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు .నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది ” అంటుంది.

kalateeta vyaktulu

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది. ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం. ప్రకాశం కల్యాణి  కి ఆకర్షితుడవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది . పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది.  అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది. తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.

ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అదినాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ  నా మీద పెట్టు అని అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు  కావాలి  . ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నోవ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషి లా ప్రవర్తిస్తావనుకున్నాను పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కాని అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు అని నిర్మొహమాటంగా చెపుతుంది .

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి  అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిరా ఇంట్లో ఉంటుంది  . ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు   సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి  మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే  ఇందిరా ఇలా అంటుంది .పశువు కాకపొతే మరో నందికేశుడు జీవితమే పశువుల సంత లా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకం లో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని నెట్టు కుని ముందుకు వెళ్ళడమే అంటుంది.

కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తి పాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది  మనిషి లోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది.  ఆమె అతన్ని  ఎప్పుడూ ఇష్టపడదు.  అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా  ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన  కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని  చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో  మధ్య తరగతి కుటుంబం లో  డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర  ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా  నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో  కనిపిస్తుంది జీవిస్తుంది  ఇందిర లాంటి  స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు  సమాజం లో  కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని  చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది .

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు .మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్నలోపాలు ని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని “కాలాతీత వ్యక్తులు” నవల చెపుతుంది.

పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి  ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల లో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి  అభిరుచి ల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితం ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర.  కాల గమనం లో అందరూ మరుగున పడిపోతారు .కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన  వ్యక్తిత్వం తో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ  కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.

ఈ నవల లోని ఇందిర పాత్ర ని నేడు  అధిక సంఖ్యలో నిత్యం  మన సమాజంలో చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా “ఇందిర ” ని  హర్షించలేక పోతున్నాం  ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి  లాంటి స్త్రీల మధ్య “ఇందిర ” కాలాతీత వ్యక్తి  తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీరువు . చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర.