తెలుగోడి తెలుగ్గోడు!

 కర్లపాలెం హనుంతరావు

 

karlapalemరుగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంతులేని ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షినుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  

రామాయణంలోని కిష్కింధ  ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బా!

వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి! స్వామిభక్తి తెలుగువాడికి  విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా! ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే తెలుగోడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే అయుండాలి. ఆ రావడంలోకూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  పురమాయిస్తే ఆంజనేయులువారు ఏం చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా ముగించడం తెలుగన్నకు  మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగివుండీ ఏ స్వామివారి పాదాల చెంతో ఇంత చోటు దొరికితే చాలు జన్మ చరితార్థమయిందని సంబరపడతాడు.  తెలుగువాడికి  బద్ధకం అనాదిగా వస్తున్న బలహీనత.

తెలుగువాడికి అన్నీ అవలక్షణాలేనా?’ అని గొణుక్కోవాల్సిన అవసరం లేదు.  గొప్ప గొప్ప  గుణాలకుప్పా మన తెలుగువాడేనప్పా! వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  డప్పుకొట్టుకొనే  సంప్రదాయం  అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీనివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేలల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూను!

ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవంరాకతో హీనమయిపోయింది! ఆనక వాడు  వైదికం మోజులోపడ్డాక  ఆ శైవమూ రాష్ట్రాల  శీవార్లలోకి పారిపోయింది!

అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు.. ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనంత సంబరంగా చేసుకునే అమాయకులు దేశంలో ఇంకెవరూ ఉండరు!

పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తీర్చిదిద్దాడు. పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా వింటే భారతమే వినాలి అంటూ టాంటాం కొట్టుకొనే పటాటోపం తెలుగువాడిది!

సాహసంలో మాత్రం.. మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోనిసిచయాల్లాంటి సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధదర్మాన్ని ప్రచారం చేసివచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకల్పనావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవనాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలం కాదుటండీ మన తెలుగువారందరం!

మేధస్సులోమాత్రం మనమేమన్నా అధమస్థులమా? హైదవం క్షీణదశలో  దక్షిణాది గోదావరీతటంనుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ఉద్భవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట  యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు.   దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణపండితుడు. ఎల్లలకావలా యీవలా ఎనలేని కీర్తిప్రతిష్టలార్జించిన కోడి రామ్మూర్తి, సి.కె. నాయుడు, ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగు వెలుగులేనంటే  తెల్లబోతాం మనం.

గొప్పవాళ్లెప్పుడూ తెలుగువాళ్లు కారనీ.. తెలుగువాళ్లయుంటే గొప్పవాళ్ళు కాలేరనీ మన తెలుగువాళ్లకో గొప్ప నమ్మకం. బొంబాయి చేరితేగాని కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు నాలుగు కాసులు కళ్లచూడలేదు. తమిళదేశం చెప్పిందాకా  బాలమురళి గానగాంధర్వుడని  మనం ఒప్పుకోలేదు! తెలుగువాడు పైకిరావాలంటే పైకన్నా పోవాలి. దేశందాటి పైకన్నా పోయిరావాలి! ఎందుకిలా?

తెలుగువాడి వెటకారం మరీ వాడి! మహామాత  కాళీదేవత ప్రత్యక్షమయితే మరోడయితేసాగిలపడి మొక్కేవాడు. ఆమె అంగసౌష్టవంచూసి ఫక్కున నవ్వాడంటే  ఆ తెనాలి రామలింగడు తెలుగువాడవబట్టేగా! వేలెడంత లేకపోయినా జానెడంతవాణ్ణి చూసి ‘మూరెడంతైనా లేడ’ని మూతి మూడువంకర్లు తిప్పాడంటే నిక్షేపంగా ఆ ఆక్షేపరాయుడు తెలుగువాడే అయివుండాలి.

 పాకశాస్త్రంలో తెలుగింటి  ప్రావీణ్యమే వేరు. తెలుగు తాళింపు దినుసులు మరే ఇతర ప్రాంతాల వంటిళ్లలోనూ కనిపించవు. తెలుగు వర్ణమాలా ఓ వంటింటి పోపుపెట్టె వంటిదే సుమా! సాతాళించగల చేవ ఉండాలేగాని.. తెలుగువంటకంలా తెలుగురచనా ఘుమఘుమలాడిపోదూ!

గంగాజలం తెచ్చి కృష్ణ, గోదావరి, తుంగభద్రల్లో కలగలపడమే తెలుగుదనం కలివిడిదనం. తాగునీటినిసైతం ‘మంచి’నీరని పిలుచుకొనే మంచి నైజం తెలుగువాడి సొంతం! తెలుగుభాషకూ మంచినీరులా మేధోదాహార్తిని తీర్చే సత్తా ఉంది. శబ్దానికి  పూర్తిన్యాయంచేసే శక్తి ఇటాలియన్  తరువాత  ఒక్క తెలుగక్షరంలోనే ఉందిట! ఇది ఆధునిక భాషాశాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న మాట. కంప్యూటర్ వేగాన్ని అందిపుచ్చుకోగల బైట్ స్(Bytes)సామర్థ్యం తెలుగులిపికి అలంకారప్రాయం- అన్నది  సాఫ్టువేరు నిపుణుల అభిప్రాయం.  ఉప్పా, కర్పూరమా అని తేడా లేదు. ఏ  పలుకునైనా తనలో మంచినీళ్ల ప్రాయంగా కలుపుకోగల గుణం తెలుగువర్ణమాలకు ప్రత్యేకం.

ద్రవిడ సంస్కారి చిన్నయసూరిచేత చక్కని వచన రచన చేయించిందీ తెలుగు పలుకుబడే! తెలుగుమాట తేటతనానికి దాసోహమయే బ్రౌన్ దొర నిఘంటువు నిర్మాణానికి పూనుకొన్నది!  జిజ్ఞాసకు తగ్గ ఉపజ్ఞ తెలుగుభాషామతల్లి  ప్రజ్ఞ.

‘ఆంధ్రదేశపు మట్టి.. అది మాకు కనకంబు’ అని ఎందరో మహామహులు తలవంచి వందనాలర్పించిన చోటుకే  ఇప్పుటి తరం తలవంపులు తెస్తున్నది. అదీ విచారం!

పరాయితనం భుజానమోసే ఔదార్యంలోనే తెలుగువాడెందుకో ముందునుంచీ తరించిపోతున్నాడు?! సగటుతెలుగునాలుకకి తెలుగు పలుకుల మాధుర్యం వెగటు?! ఆదిలో  సంస్కృతం, ఆనక హిందూస్తానీ, ఇప్పుడు ఆంగ్లం!ఒక్క తెలుగుజ్ఞానమే అయితే అది  వట్టి వాజమ్మతనానికి నిదర్శనం! ‘గొప్పోళ్ళు చాలామందికి తెలుగురాదు. కాబట్టి తెలుగురాకపోవడమే గొప్పతన’మనుకొనే తెలివితక్కువతనం రోజురోజుకీ ఎక్కువవ్తుతున్నదీ తెలుగునాట!

‘విజ్ఞానమంటే కేవలం ఇంగ్లీషుమాట. పాండిత్యమంటే కేవలం సంస్కృత పదాల మూట’. ఇదీ  ప్రతి సగటు తెలుగువాడినోటా నేడు వినిపిస్తున్న పాట! పరాయిభాష రుచి నోటికి పట్టాలన్నా పసితనంలో శిశువుకు  తల్లిభాషనే పాలవసరమా కాదా?!

చావగొట్టినా సొంతభాషరాని చవటకి చావచితక్కొట్టినా పరాయి భాష వంటపట్టదని భాషాశాస్త్రవేత్తలే మొత్తుకొంటున్నారు!

 భోజనాలయంలో వాటర్‘ ‘చట్నీఅంటేనేకానీ వడ్డించేవాడి తలకెక్కదా?! కొట్లాట్టానికి అక్కరకొచ్చే సొంతభాష కచేరీల్లో ఫిర్యాదులిచ్చేందుకు ఎందుకు చేదో?! రోగాలకే కాదు.. వాటి నిదానానికి  వాడే మందులకూ  నోరుతిరగని లాటిన్ పేర్లు?! రైలు, రోడ్డు, పోస్టు, సైకిలు, ఫోను, సెల్ఫోను.. నిత్యవ్యవహారంలో నలిగే కొన్ని పదాలకు ప్రత్యామ్నాయం  లేక వాడుకలో ఉన్నాయంటే.. ఏదో అర్థం చేసుకోవచ్చు. పుస్తకం, కలం, ప్రేక్షకుడు, సంతోషంవంటి మాటలకూ బుక్కు,పెన్ను, ఆడియను(నిజానికి ఆడియను అన్న మాటే తప్పు), హ్యాపీసు వంటి వంకరపదాలను వాడే తిక్కసంకరయ్యలు ఎక్కువయిపోతున్నారు! భేషజంకోసం, అతిశయంకోసం పరాయిభాషాపదాలను వేలంవెర్రిగా వాడే గురజాడ గిరీశాలు తలుగునాట రోజురోజుకూ ముదిరిపోతున్నారు!  ఆత్మగౌరవం ప్రాణప్రదంగా భావించే తెలుగువాడికెవడికైనా   ఇది చివుక్కుమనిపించే  అంశమే.

తెలుగుగడ్డమీద తెలుగుబిడ్డ మెడలో తెలుగు పలకనుఅంటూ ఇంగ్లీషులో పలకలా?! తెలుగులో ఏడ్చిన నేరానికి పసిదాని అరచేతికి వాతలా?!

పేరుకేనా మనది ప్రజాస్వామ్యం? పాలితుడి పలుకుమీద పాలకులకెందుకో ఇంత కోపం?!  జన్మతః జిహ్వమీద కొలువైన శబ్దదేవత కదా తల్లిభాష!  జంతుతతులకన్నా విలక్షణంగా బతుకును తీర్చిదిద్దే ఆ భాషామతల్లి  అంటే తెలుగువాడికి ఎందుకంత చులకన?!

 తల్లిమీద, తల్లిభాషమీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి?!

***