నేనే..ఓ పోయెం

 

 

 

-కొనకంచి
~

నా హ్రుదయంలో దాక్కున్న సూక్ష్మ హ్రుదయం
కొత్త రెక్కలొచ్చివెళ్ళిపోగానే
నేను..ఎండిపోయిన ఒంటరి చెట్టుమీద
విక్రుతంగా మిగిలిపోయిన
విషాదపు..నిస్సహాయపు..నిర్జీవపు
పక్షి గూడుగా మారిపోతాను.

రెండోసారి మళ్ళీ జన్మించిన నేను
ఆత్మోద్భవనంలో
నన్ను నేనే ప్రేమించుకుంటూ
నేను పుట్టిన ఏకాంతపు పక్షి గూటిని
కొత్తగా ప్రేమించుకుంటూ..
సరికొత్త కొత్త గుడ్డుగా మారిపోయాను

ఆ.. నన్ను కన్నతల్లి పక్షి
కవిత్వం…
గుడ్డు గా మారిన ఆ పిల్ల పక్షిని
ఆ..నేనే..ఓ పోయెం

2
ఇప్పుడిక మాటలుండవు.
ఇప్పుడిక చేష్టలుండవు
దూరాలు భారాలు కూలిపోయిన చోట
ద్రుశ్యాలు..కన్నెపిల్లల అందెల శబ్దాన్ని
కొత్త కొత్తగా ధ్వనిస్తాయి.

శబ్దాలు ఎక్కడెక్కడో వెన్నెలకుప్పలై
కొత్త కొత్తగా కనిపించని చీకట్లలో
మట్టి పూలై పూస్తాయి.

సరికొత్త స్వరాలు రాగాలు
కళ్ళముందు నదీమ తీరాల్లో
వలస పక్షులుగా మారి..
ఈకలని..కోర్కెలని ..ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టు
ప్రతి ఒక్కళ్ళదీ..ఎవరికి వాళ్ళు
ఏవరూ గుర్తించని ఎండమావుల్లో నీటికోసం వెదుకులాటే.

స్వర్గం నించి దిగివచ్చిన దేవతలు
వినువీధుల్లో వదిలి వెళ్ళిన పాదముద్రల జాడల్లో
పరిచిత..అపరిచితమయిన నువ్వు
ఇక ఎంతమాత్రమూ కనిపించవు.

సముద్రం మీద పరుగెత్తిన చేప అడుగు జాడల్లో
ఎడారుల్లో పరుగెత్తిన మనిషి అడుగు ముద్రల్లో
కలిసిపోయిన
నీ అడుగుజాడలు ఎక్కడా కనిపించవు.

నా లోంచి నన్ను..నాలోంచి నిన్ను
పోగొట్టుకున్నచోట బూడిద కుప్పగా మిగిలిన
ఆ నేనులో మిగిలిన నువ్వే
నా కవిత్వం.
ఆ మిగిలిన నేనే ఓ పోయెం.
3

శబ్దాన్ని..ద్రుశ్యంలా చూద్దామని
ద్రుశ్యాన్ని..శబ్దంలా విందామని
ఎంత ప్రయత్నించినా కూడా
చిన్నపాటి శబ్దం కూడా ఎక్కడా కనిపించదు.

నా చుట్టూ ఉన్న ప్రపంచం
కార్చిచ్చులో కాలిపోయాక..
మిగిలిపొయిన తాటాకుల వనంగా మారిపోయి ఉంటుంది.

అంతు తెలీని కాంతి సంవచ్చరాల కావలనించి
వినవస్తున్న స్వప్న గానమాధుర్యంలో మునిగిపోయి
నన్ను నేను..నిర్లక్ష్యం చేసుకున్నప్పుడు
బతుకు ఓడ తెరచాపతో
సుడిగాలి చేసే జీవిత పోరాటంలో
ఆసలు జీవితం తనకు తానే కలలు కంటున్న
నకిలీ జీవితం గా మారిపోతుంది.
పాట పాటగా..తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి
కోరస్ గా మిగిలిపోతుంది
తన జీవితానికి అప్పుడే కొత్త అర్ధం తెలిసిన
సగం చిట్లిన గాలి బుడగ..
పూర్తిగా చిట్లిన గాలి బుడగను చూసి
“అయ్యో” అనిబాధపడటమే ఎవ్వరూ గుర్తించని
అసలు జీవిత విచిత్రం.

ఈ భూమ్మీద ఏదీ తనది కాదనుకుంటూనే
ఇక్కడున్నదంతా మనిషి..
నిర్లజ్జగా పోగేసుకుంటున్నప్పుడు
ఉద్యానవనాలుగా విరబూయాలనుకుంటున్న అక్షరాలన్నీ
గజిబిజిగా సాలెగూళ్ళల్లో చిక్కుకోని
అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకోని
విరహ గీతాలుగానో.. విలాపగీతాలుగానో
మిగిలిపోవటమే అసలు కవిత్వం.
ఆ మిగిలిపోయిన నేనే ఓ కవిత్వం ..
ఆ నేనే ఓ పొయెం..
4

నిప్పు..ఎవరిదయితేనేం?నిప్పు ఎక్కడ..ఎవరు జ్వలింపజెస్తేనేం?
నిప్పుకు..కులం లేదు.
నిప్పుకు మతంలేదు.
అపరిమిత ..అపరిచిత హ్రుదయ విధ్వంసంలో
కాళ్ళకింద బద్దలవుతున్న అగ్నిగుండంలో
తనువుల్ని కాల్చిన మాంసపు ధూళిలో
దాచేస్తే దాగని.. సత్యం..
ఆర్పేస్తే ఆరని…నిజం..
కవిత్వం ఒక్కటే ..

అందుకే

వ్రుద్ధాప్యం లేని అక్షరాలకు యజమాని
కవి.. బ్రతికినంతకాలం చిరంజీవుడే ..
అతని కవిత్వానికి ఎప్పుడూ నిత్య యవ్వనమే
*

త్వరలో విడుదల అవుతున్న
“”నేనేమీ మాట్లాడను”” కవితా సంపుటిలోంచి