ధ్వని

ముందుగా ఒక ప్రతిధ్వని :

గొప్ప ” కథ ” … చదివిన క్షణాల్లో ఉద్విగ్నత నీ.. చదివేసాక ఒక నిశ్శబ్దాన్ని .. తర్వాత తలచుకున్నప్పుడల్లా, కొన్ని క్షణాల పాటు , చదివి అర్ధం చేసుకొనే శక్తి ఉన్నందుకు కించిత్ గర్వాన్నీ కలగచేస్తుంది …” కథల మీద ఎప్పుడో రాసుకున్న ఈ వాక్యం గుర్తొచ్చింది “ధ్వని “ కథ చదవగానే-

ధ్వని గురించి రాయాలన్నా కూడా అదే రకమైన ఉద్విగ్నత, ప్లస్ కొంచం భయం కూడా వేసింది.. రాయగలనా అని !

డిస్క్లైమర్  : నేను రాసినవేవీ , నాకలాంటి భావాన్ని కలిగించలేదు .. ఎంత నేర్చుకోవాలో తెలుసుకున్నప్పుడు భలే హాయిగా ఉంది .. జీవితంలో ఇంకా వొంపుకోవాల్సిన విషయాలు గుర్తొచ్చి..!

ధ్వని  వివిన మూర్తి గారి కథ .. ఒక అంధత్వం ఉన్న ముస్లిం లాయర్ కథ , అతని సహాయకురాలిగా పరిచయం అయి, స్నేహితురాలిగా మారి, సన్నిహితంగా మారటానికి తటపటాయించే ఒకమ్మాయి సత్య కధ ..!

అంధత్వాన్ని, ఇస్లాం నా నేను’ లలో ముఖ్యమైనవి అని కథ మొదలెడతారు ఆయన ..! ధ్వని ఎంత అవసరం ? ఒక మనిషిని అంచనా వేయటానికి, కేవలం ధ్వనే ఆధారంగా బ్రతకటానికి అనే … కథలో మాటల్లో చెప్పాలంటే –“ చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్. “ అనే ఈ Quintessential ప్రశ్న తో, ఈ కథ మొదలవుతుంది. చూపుల, కొలతల బేరసారాల్లో జీవితం కోల్పోయిన అమ్మాయి, ఆమె గొంతులో మెత్తదనాన్ని ఆస్వాదిస్తూనే, అనలైజ్ చేసి, శల్య పరీక్ష చేస్తున్న .. ఒకబ్బాయి ..!! నా కళ్ళ ముందు చాలా జీవితాలు కదిలాయి.

“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”- అనుకొనే తండ్రి ఉన్నప్పటికీ, తండ్రి చెప్పాడని , లాయర్ జీవితంలోకి , వస్తుంది .. సత్య, ఆమె గొంతు అంత మెత్తగా .. కానీ, నిశ్శబ్దంగా , నోరు తెరచి చెప్పనప్పటికీ తనదైన నిశ్చితాభిప్రాయాలతో.. సత్య మాట్లాడక పోవటానికీ, లాయర్ కేవలం ధ్వని మాత్రమే వినటానికీ .. తనలోని లోపాన్ని కప్పి పెట్టేంత మాట్లాడటానికీ, తెలివితేటలు కలిగి ఉండటానికీ .. ఓహ్.. ఎన్ని పొరలు ఒకే మనిషిలో ..!

ఇదే కథలో ఎన్నో కాంప్లెక్సిటీలు కలబోసి పెట్టారు వివిన మూర్తి గారు – ఉదాహరణ కి మంచు లాంటి మౌనం కరిగిన సత్య మాట్లాడుతూ – “మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి.” – తన అభిప్రాయాల్ని ఇంత తెలివిగా పాత్ర ద్వారా చెప్పటం ..నాకొక లెర్నింగ్.

అదే సమయంలో , ఇంత తెలివైన అమ్మాయికి , ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించటం , కష్టం తమకొస్తే, బేలగా తయారవటం.. వేరేవాళ్ళ విషయంలో , అనలైజ్ చేసే , సాధారణ మనస్తత్వాన్ని .. సూచిస్తుంది.

సరిగ్గా అలాగే, వివాహానికి ప్రతిపాదించిన లాయర్ .. ఆమె కాదు అన్నట్టు సూచించగానే – తాను గుడ్డివాడు కాబట్టే ఆమె కాదంటోంది అన్నట్టు తొందర పడటం కూడా – సింపుల్ గా కనిపించే కాంప్లెక్స్ మెంటాలిటీ.

తమకి నచ్చింది తీసుకొని, ఆ ప్రకారం జడ్జ్ చేసే లాయర్ మనస్తత్వానికి శర్మ తో స్నేహం తాలూకా ఉదంతం  వొక ఉదాహరణ .

ఈ కథ నాకు కొంత అసూయని కలగజేసింది ..ఇంత బాగా రాయలేక పోయినందుకు. కానీ అదే సమయంలో , ఒక యార్డ్ స్టిక్ లా కూడా పనికొస్తుంది అనిపించింది. కథ నిండా ఉన్న సూక్తులు , కొంత ఇబ్బందిని కలుగజేసాయి.. అవసరం కానీ, కొన్ని కథలో బ్లెండ్ కాలేదు అనిపించింది.

వోల్గా రచనల ద్వారా వివాహ ప్రతిపాదన నాకు అంతగా అర్ధం కాలేదు .. కానీ, సత్య జవాబు మాత్రం చాలా నచ్చింది – “వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. దానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”

వివాహమే కాదు, ఏ బంధమైనా .. వాచ్యార్ధం కన్నా ధ్వని మీద ఆధారపడితే, బోలుతనమే మిగులుతుంది అన్నదానికి ఇంతకంటే, గొప్ప వాక్యాలు రాయబడలేదు అని నాకు అనిపించింది.

ఇంత రాసి, లాయర్ పాత్రకి వొక పేరు పెట్టకపోవటం నాకు నిరాశని కలిగించింది .. కానీ , వికలాంగులకి అనేకాల్లో .. పేరు లేకపోవటం కూడా సమాజం సహజంగా తీసుకొనే విషయం.. కుంటి, గుడ్డి , మూగోడు .. ఇలా .. హ్మ్మ్ !!

చాలా వొంటరితనాలకి .. కేవలం వోటి గిన్నెల శబ్దం లా ద్వనించటమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు .. చాలా ఇజాలకి కూడా ..!

ధ్వని’ – చాలా తెలుగు కథల బోలుతనాన్ని , మెతకతనాన్ని , సున్నితంగా ప్రశ్నించే కధ ..!

-సాయి పద్మ

 ధ్వని 

vivina murthy

  -వివిన మూర్తి

నేను అనేకం. అందులో రెండు ముఖ్యం. నా అంధత్వం. నా ఇస్లాం.

ఈ రెంటిలో ఏది తెలిస్తే ఆమె నోరు మూత పడుతుంది.. ? ఏదితెలిస్తే మరింత పెద్దదవుతుంది.. ? ఆకాశంలో సగమైన మొగవాళ్లు మిగిలిన సగాన్ని తాకటంలో మలిన వాంఛలు తప్ప మరే అనివార్యతలూ ఉండవన్న ఆమె నమ్మకం వమ్మవుతుంది.. ? నన్ను తిడుతున్నావిడ పూలు నా ముక్కుకి తగిలాయి.. నాలాగే పొడుగు అయుంటుంది. నా పొడుగుని, నా వెడల్పాటి రొమ్ముని చూసి అమ్మీజాన్ లో ఆనందం వినిపించేది.. తతిమ్మా వారిలో ఖుదా కీ మర్జీ వినిపించేది. అసంకల్పితంగా ఆ పూల పరీమళాన్ని నా శ్వాస పీల్చుకుంది. ఆ శ్వాసే కాకుండా నా శరీరంలో ఏదైనా భాగం ఆమెకు తగిలి ఉండవచ్చు. అదీ నా అపరాధం.

ఆలోచనలు వేగంగా ఒకదాని మీద నుంచి ఒకటి దొర్లుతున్నాయి..
నేను ప్రతిస్పందించకముందే ఆమె బస్సులోని జనాన్ని, బహుశా మగ జనాన్ని నా దుశ్చర్యకు వెంటనే ప్రతిస్పందించమని వేడుకుంటోంది. అటునున్న జనానికి నా నల్ల కళ్లజోడు సందేహం కలిగిస్తోందనుకుంటాను. చేతిలో ఓ చప్పుడు కర్ర ఉండి ఉంటే వాళ్లకి ఆ సందేహం లేకుండా పోయేది.
ఆమె తిట్లకూ, జనం సందేహాలకూ, నా ఆలోచనలకూ ముగింపునిస్తూ… ఓ మెత్తని చెయ్యి, అంతకన్న మెత్తని స్వరం, ఆ వ్యక్తిత్వం నిండుకూ నింపిన గులాబి అత్తరులోంచి అప్పుడే బయటపడ్డట్టు… నాకు అల్లా ప్రసాదించిన నాలుగు జ్ఞానేంద్రియాలలో మూడింటిని ఒకేమారు ఉత్తేజితం చేస్తున్నట్లు… ఇక్కడ కూర్చోండి.. అని కూర్చోబెట్టింది.
“మంచిపని చేసావు కన్నా.. కూర్చోండి లాయరు గారూ..”.

2.

ఆ మెత్తదనం పేరు సత్య. ఆ సత్యను లోకంలోకి తీసుకు రావటమే కాకుండా, నా జ్ఞాపకాలలోనే నిక్షిప్తమై పోకుండా నా జీవితంలో కొనసాగే వీలు కల్పించినవాడు సూర్యచంద్రవర్మ.
గుడ్డి లాయరుని. ఎవ్వరైనా గుర్తుంచుకుంటారు. వర్మ నన్ను నా కారుతో సహా గుర్తుంచుకున్నాడు. మీరీ రోజున కారులో రాలేదేం- అదీ తొలి ప్రశ్న. కారులో వస్తుంటాను. రాగలను. రాగలపాటి అతి కొద్దిమంది భారతీయ ముస్లింలలో నేనూ ఉన్నాను. కాని నాకు బస్సు ఇష్టం. ధ్వనులు. చప్పుళ్లు. వాసనలు. స్పర్శలు. నవ్వులు. కబుర్లు. లోకం నాచుట్టూ వెచ్చటి దుప్పటి కప్పుతున్నట్లుంటుంది. అమ్మీజాన్ ఇచ్చిన ఆలోచనల చేతివేళ్లతో లోకాన్ని తాకుతున్నట్టుంటుంది.
కానీ- ఒక్కటే ముల్లులా పొడుస్తుంటుంది. అది లోకం తాలూకు జాలి.
కోర్టుకి వెళ్లి తొలి వకాలతు అందిస్తున్నపుడు జడ్జి –అయ్యో పాపం- అనుకునే ఉంటాడు. ఆ –అయ్యో పాపం- తనపై –అయ్యో పాపం-గా మారుతుందని నాకు కేసు అప్పగించిన వాడు నిశ్చితంగా అనుకున్నాడు. నాకందిన ధ్వని వాస్తవమై పోయింది.
నే దిగవలసిన చోటు వచ్చింది. నా సెల్ లోని జీపియస్ హెచ్చరిస్తోంది.
అందాకా కబుర్లు చెపుతున్న వర్మ నేనూ, సత్యా ఇక్కడే దిగాలి అని ప్రకటించి నా వెనకే దిగాడు. ఆ మెత్తటి చెయ్యి నాకు సాయంగా నా చేతిని పట్టుకుంది. ఆ చేతిని విదిలించెయ్యాలని…. మర్యాద నా చర్యను విదిలించి వెయ్యాలని..
కిందకు దిగాక-
“నేను పట్టుకోటం మీకు నచ్చలేదు.”
“మీరు పొడుగా?”
“ఏం- ఎందుకూ”- మెత్తదనం నశిస్తున్న గొంతు.
అదెందుకు నశిస్తున్నదో ఆ తర్వాత అర్ధమయింది. మన సంభాషణలో మనని మనం చెప్పుకోటానికి వెచ్చించే సమయం ఎదుటివాళ్లని మాటలని గ్రహించటానికి వెచ్చించంట. ఈ మాట నాకు అర్ధమయ్యేటట్టు ఆ తర్వాత కాలంలో సత్యే చెప్పింది.
“తెల్లవాళ్లకి నల్ల వాళ్లని చూస్తే లోకువ. పొడుగు వాళ్లకి పొట్టి వాళ్లని చూస్తే లోకువ. కాకపోతే జాలి.”
పద నాన్నా పోదాం.. ఆమె వెళ్లి పోతున్నట్టుంది మెత్తదనాన్ని వదిలేసినా వెంటబడుతున్న గొంతుతో.
ఉండమ్మా ఉండు.. అంటూ వర్మ కూతురుని వెంబడించాడు.
నాకా క్షణంలో కలిగినది ఆమె అనాగరిక ప్రవర్తనపై కోపం. నేను చెప్పినది కేవలం స్వానుభవం నుంచి ఏర్పరచుకున్న ఓ అభిప్రాయం. నేనలా నా అభిప్రాయాన్ని చెప్పటం నాగరికమేనని ఆ క్షణాన నా నిశ్చితాభిప్రాయం.
అంతటితో ముగిసిపోయే కథని వర్మ ఆరోజు మధ్యాహ్నం నన్ను కలిసి పొడిగించాడు.

3

సత్య జీవితంలో ఆమె ఎత్తు చాలా కష్టాలు తెచ్చిపెట్టింది. కోర్టు గడపను ఎక్కించింది. ఇంటర్నెట్ ద్వారా కుదిరిన సంబంధం. వధువు వివరాల్లో ఐదు అడుగులు అని రాసాడు వర్మ. ఫొటో చూసాడు. నచ్చింది. ఇంటికొచ్చి చూసుకున్నాడు. నచ్చింది. కులం గోత్రం డబ్బూ దస్కం అన్నీ సరిపోయాయి. అందరికీ అన్నీ నచ్చాక అడ్డేముంది.. పెళ్లై పోయింది. మూడు నెలల కాపురం వెలగ బెట్టాక అనుమానం వచ్చింది. కొలిచాడు. నాలుగడుగుల పదంగుళాలే ఉంది. దగా చేసారని కోర్టుకెక్కాడు. వివాహం చెల్లదని రద్దు చెయ్యాలనీ వాదన.
“నిజంగా..”
“ఈరోజు వాయిదా..”
“పిచ్చాడులాగున్నాడే..”
“నేను మాత్రం? ఉన్నదున్నట్టు వెయ్యొచ్చు గదా..”
“విడాకులకి ఆ కారణం చెల్లదు..”
“అతను విడాకులు అడగటం లేదు. 1955 హిందూ వివాహ చట్టం కింద ఫిర్యాదిని ప్రాడ్ చేసి వివాహంకి ఒప్పిస్తే అది చెల్లదని వాళ్ల లాయర్ వాదన.”
“-కోర్టు స్వీకరించిందా..”
“ఆయన గట్టివాడు. మా అల్లుడి దగ్గర మస్తుగా ఉంది డబ్బూ, పట్టుదలా..”
వర్మ చాలా వషయాలు చెప్పాడు.
మీడియా ఈ కేసుకి బాగా ప్రాధాన్యత ఇచ్చింది. చర్చ జరిపింది.
రెండు అంగుళాలు ఎక్కువ అని బొంకటం ఆడపిల్ల తండ్రికి శుక్ర నీతి వంటిదే అన్నారు కొందరు. పెళ్లి కోసం ఆడిన బొంకుకి పాపం ఉండదట. పేద్దపేద్ద అబద్దాల మధ్య బ్రతుకుతున్నాం- సముద్రంలో కాకిరెట్ట ఈ చిన్ని అబద్దం- అన్నారు సాధు నైతిక దృష్టితో కొందరు.
చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అబద్ధమే. తప్పు తప్పే. చట్టపరంగా ఇది నేరంగా తేలినా మానినా తప్పే. కొన్ని తప్పులకు ఇహలోకంలోనే అనుభవిస్తాం. ఇక్కడ తప్పినా అక్కడ తప్పదు- అన్నారు కఠిన నైతిక దృష్టితో కొందరు.
ఎత్తు అతగానికి అంత ముఖ్యమైతే పెళ్లికి ముందు ఎందుకు కొలుచు కోలేదు. ఒక వస్తువును కొనుక్కునే ముందే దాని నాణ్యతనూ కొలతలనూ చూసుకోవటం వినియోగదారుడి బాధ్యత కదా – అని కొందరి ప్రశ్న.
ఒక వస్తువు తయారీ లోపముంటే దానిని వాడిన తర్వాత నిరాకరించటం వినియోగదారుడి హక్కు- అన్నారు కొందరు సమాధానంగా.
ఆడది వస్తువా- వస్తు నాణ్యతా పరిశీలన స్త్రీకి యుగయుగాలుగా అమలు జరుగుతూనే ఉంది – అన్నారు లింగ వివక్షతను లేవనెత్తుతూ కొందరు. అసలు కొనుగోలు అన్నది జరిగితే సొమ్మిచ్చి కొనుక్కునేది ఆడదే- అని కూడా చేర్చారు.
అందుకేగదా ఈనాడు చట్టాలన్నింటికీ స్త్రీ పరమైన వివక్ష, ప్రత్యేక రక్షణ.. ఈ కేసులో కూడా చట్టం మగవానికి న్యాయం చెయ్యదు- అన్నారు కొందరు.
దృశ్య, అక్షర మాధ్యమాలు రెండూ కొంత కాలం చర్చించి పాల్గొన్నవారికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాయి.
వర్మ చెప్పిన దానికి నా వివేచన జోడించి విన్నాను.
“మీరేమంటారు-” అన్నాడు వర్మ.
“నేను ముస్లింని. నాది ఇస్లాం”.- అన్నాను.
ఆయనను కంగు తినిపించాలని నేను అనలేదు. కాని ఆయన గట్టిగా ఆశ్చర్య పోయాడని – అంటే!?- అన్న ప్రశ్న వంటి స్వరం వినగానే గ్రహించాను.
“నాపేరుని బట్టి మీకు నా మతం తెలుసు. ఇస్లాం తెలుసా..”
“చెప్పండి..” అన్నాడు.
“విశ్వంలోని ప్రాణులూ, పదార్ధాలూ ముస్లింలే. అల్లా – ఆ విశ్వ ప్రభువు – ఆజ్ఞాపాలనకి లోబడి ఉంటాయి. ఆ దైవానికి స్వయంసమర్పణే ఇస్లాం… లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అన్న కలిమాను విశ్వసిస్తే ఇదంతా మరోలా అర్ధమవుతుంది..”
“ఇలాంటి విశ్వాసాలు హిందువులకీ ఉంటాయి. అన్ని మతాలకీ ఉంటాయి..” అన్నాడు మధ్యలోనే.
“మీరు హిందువులు కారా..”
“- నేను నాస్తికుడిని. అయినా నావిశ్వాస అవిశ్వాసాలకి దీనితో సంబంధం లేదు. మీరు అనేదానికీ నా కూతురు పరిస్థితి మీద మీ అబిప్రాయానికీ సంబంధం నాకు పూర్తిగా బోధ పడటంలేదు…”
“కొంత బోధ పడిందిగా.. అదేంటి..” అన్నాను
“లాయర్లు వాళ్ల మాటలు ఎదుటి వాళ్ల నోళ్లలో కుక్కి అదే కక్కేట్టు చేస్తారుట.. ఏముంది., అంతా కర్మ అనుకుని అనుభవించాలి.. అంతేగదా ఏ మతమైనా చెప్పేది.” అంటూ నవ్వి లేచాడు. వెళ్లేముందు నా చిరునామా పత్రం ఇచ్చాను. కాని అది అతను ఉంచుకుంటాడనీ ఉపయోగిస్తాడనీ అనుకోలేదు.
నాకు చాలా చికాకు కలిగింది. నేను అందరినీ అర్ధం చేసుకోవాలి. నన్ను అర్ధం చేసుకునీ ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చెయ్యరు. కావాలంటే జాలి పడగలరు.. ముస్లిం షరీఅత్ ఇలాంటి కేసు ఎదుర్కుంటుందా.. వివాహం ఒక ఒప్పందంగా భావించే సమాజానికీ, అది ఒక దైవనిర్ణయంగా భావించే సమాజానికీ – స్త్రీ ఎదుర్కొనే రక్షణ సమస్యలో ఉన్న తేడాపాడాల గురించి మాటలాడాలని నా ఆలోచన. ఒక నాస్తికుడికి హిందూ ఆస్తికుడి మీద ఉండేపాటి సహనం కూడా ముస్లిం ఆస్తికుడి మీద ఉండదు.
కాని ఆ గొంతు మెత్తదనం నన్ను వెన్నాడుతూనే ఉంది.
అమ్మీజాన్ విని ఫొటో లోంచి అంది.. చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్.

4

నా మొబైల్ నాకు వచ్చిన ఈ-మైల్స్ చదివి వినిపిస్తోంది. ఆ సమయంలో వచ్చాడు వర్మ.
సత్య ఆత్మహత్యా ప్రయత్నం చేసింది… వర్మ చెపుతుంటే ఆయన గొంతు వణుకు తెలుస్తోంది.
మరణం ఎవరిదవనీ.. ఆ వార్త బాధ కలిగిస్తుంది. ఆ వ్యక్తులతో మనకున్న దగ్గరతనాన్ని బట్టి ఆ బాధ తీవ్రత ఉంటుంది. నాకు సత్యతో ఉన్నది స్వల్ప పరిచయమే. చెపుతున్నది కన్నతండ్రి కనక మరికొంత కదలిక. కాని నాలో అంతకన్న ఎక్కువ కదలికకి కారణం? ప్రతి ఒక వ్యక్తికీ మనకీ చెందిన బృందం ఒకటుంటుంది. దానికో పేరూ ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతం, రాష్రం, దేశం .. ఇలా ఎన్నో. ఒక్కోమారు ఈ బృందాలన్నింటికీ అతీతంగా కూడా కదులుతాం. అప్పుడు మనని కదిపేది ఏది.. కలిపేది ఏది.. అన్న ప్రశ్న వస్తుంది.
ఈ ప్రశ్నలూ, ఆలోచనలూ ఆ క్షణంలో లేవు ఒక ఉద్విగ్నత తప్ప.
ఆయన వెంట వెళ్లి పోలీసులతో, వైద్యులతో మాట్లాడాను.
ఆత్మహత్య పాపమైతే దానికి తీర్పు దినాన మాత్రమే జవాబు చెప్పుకోవలసి వస్తే సమస్య లేదు. అది నేరం అంటుంది చట్టం. బతికి బయటపడ్డ వారిని నేరస్తులు అంటుంది. బతకటంలో విఫలమై చావబోయి, చావులో విఫలమై నేరగాడు అయిపోతాడు పౌరుడు.
సత్య ఆస్పత్రి నుంచి, చట్టం నుంచీ బయట పడటంలో చెయ్యగలిగినది చేసాను.
ఆ తర్వాత ఒకరోజు వర్మ నాకు మా ఇంటివద్దకి వచ్చి మరో ఆభ్యర్ధన చేసాడు.
“తప్పు నాది.. శిక్ష తనకి..” అన్నాడు ఆరంభంలో.
“నేరం నిర్ధరించటం.. తీర్పు ఇవ్వటం అంతా మీరేనా.. ” నవ్వాను.
నవ్వితే బాగుంటానుట. నా బుగ్గ మీద సొట్ట పడుతుందిట. అదీ పడవలసిన చోట పడుతుందిట. ఆ సమయంలో కళ్లజోడుతో ఉన్నాను. తెల్లటి కుర్తా పైజామాల్లో ఉన్నాను. విశాలమైన గదిలో ఉన్నాను. ఆగది విశాలమైన బంగ్లాలో ఉంది. ఆ బంగ్లా విశాలమైన జాగాలో అందంగా పెంచుతున్న తోటలో ఉంది. అది అలాంటి తోటలు జాగాలూ కలిగిన భవనాల వరసలో ఉంది. కనక నేను బాగా ఉన్నాననిపించే నేపథ్యంలో ఉన్నాను.
“మీరనేది.. ” అంటూ ఆగాడు.
“రెండంగుళాలు ఎక్కువ చెప్పటం అనే నేరం మీరు చేసారు. కోర్టుకేసు.. వివాహ భగ్నం.. ఆత్మహత్య.. ఆమెకు శిక్షలు.. అదీ మీరన్నది.” అన్నాను.
కొంతసేపు మాటలాడలేదు. మళ్లీ అడిగితే అన్నాడు..
“మీరు కళ్లతో చూడలేక పోయినా మీకు అంతర్నేత్రాలు ఉన్నాయి. నా కన్న ఎక్కువ చూడగలరు. ”
“మరీ గాలి కొట్టకండి. పేలిపోగలను. ”
నవ్వులు. నవ్వులు.
“సత్యకి మీ స్నేహం ధృఢత్వం ఇస్తుంది. ”
ఆయన అంటున్నది ఆ క్షణంలో హాయిగా అనిపించింది. ఆమె మెత్తని గొంతు ఆ క్షణంలో మరింత మెత్తగా జ్ఞాపకాలను తాకింది.
అతను వెళ్లిపోయాక అది మరీ అంత మెత్తనా అనిపించింది.
ఆలోచిద్దామంటే నాకు రాని సత్య మెయిల్ చదివి చెప్పే శక్తి నా మొబైల్ కే కాదు నాకూ లేదు.

10951421_10155158252645363_7689865125180948401_n

5

వర్మ తరచు ఫోన్ చేస్తున్నాడు. కలుస్తున్నాడు. ఒకటి రెండు మార్లు సత్యనీ తీసుకు వచ్చాడు. ఒకటి రెండు మాటలు తప్ప సత్య దాదాపు మౌనంగానే ఉంది. ఆ గొంతు మెత్తదనం మనసుని స్పృశిస్తూనే ఉంది. మనసు సత్యలో ఏదో విశేషం ఉందని నమ్మించజూస్తోంది.
దైవం మీదా, విధి మీదా కించిత్తు కూడా విశ్వాసం లేదుట. తన విశ్వాస రాహిత్యంతో భార్యని బాధించాడట. కుటుంబం లేకుండా చేసాడుట. కూతురికి దిక్కు లేకుండా చేసాడుట. లోకవిరుద్ధంగా ఆలోచించే వాళ్లు లోక విరుధ్ధంగా జీవించ గలగాలిట. లోపలి ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, బైట ప్రపంచం ముందు అదృశ్య శృంఖలాలతో జీవించేవాళ్ల కన్న నిస్సహాయులు లేరట. – వర్మ వస్తువు విశ్వాస రాహిత్యం కాదు. దానివల్ల ఏర్పడే పరిస్థితి.
“ ఇప్పుడు విశ్వాసం కలిగించుకోవచ్చు గదా వర్మ గారూ”
“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”
“అవిశ్వాసులు ఎందరో విశ్వాసులు అయినట్టు విన్నాను. ”
“కాదు. నాస్తి అన్న విశ్వాసం నుంచి అస్తి అన్న విశ్వాసానికి మారారు. అది సాధ్యం. ఆలోచనా ప్రవృత్తితో సత్యం ఏదని వెతికేవారికి ఏ విశ్వాసమూ ఉండదు. ”
“నాకు అర్ధం కాలేదు. నేను ఒప్పుకోను. ”
“మీరు ఎలా భావించినా ఫరవాలేదు. నా జీవితం గడిచి పోయింది. సత్యకింకా చాలా బ్రతుకుంది. నా ఆలోచనల ప్రభావం తన మీద ఉండుంటే ఈ పని చేసుండేది కాదు. .. ” ఆయన గొంతు రుద్ధమైంది. “ పైగా నిరాధారం చేసింది. మీరు ఆమెలో విశ్వాసం కలిగించాలి. ” ఆ గొంతులో ఓటమి, ధృఢత్వం, ఆశ మూడూ జమిలిగా వినిపించాయి.
నా మాటలను ఆయన కొనసాగనివ్వలేదు.
ఆ మెత్తని గొంతు స్పర్శను ధ్వనించబోతోందా…

6

సత్య అసత్యపు భ్రాంతిలోంచి నా జీవితంలోకి చాలా నెమ్మదిగా ప్రవేశించింది. నేను మాటలాడేవన్నీ వినేది. ప్రశ్నలు లేవు. వ్యాఖ్యానాలు లేవు. ఆమె ఏమనుకుంటున్నదీ ముఖంచూసి తెలుసుకునీ అవకాశం నాకు లేదు. స్వరం విని తెలుసుకునీ అవకాశం సత్య ఇచ్చేది కాదు. ఒక మార్మికమైన మౌనం ఒకటి రెండు మాటలై గుండెలను తాకి ఏదో బలిష్టమైన ఉచ్చులో నన్ను బంధించేది. ఆమె తండ్రి ప్రోత్సాహం తోనే నన్ను కలుస్తోంది. నా మనసే నన్ను ప్రోత్సహిస్తోంది. చెప్పిన కారణం ఆమెకి జీవించే ఉత్సాహమివ్వటం, దైవంమీద విశ్వాసం కలిగించటం. ధ్వనించే కారణం జీవితమివ్వటం. నాస్తికుడికి మతం అడ్డయే అవకాశం లేదు. మెజారిటీ మతస్తుడికి తన అభ్యుదయ ప్రదర్శనకి ఒక అవకాశం కూడా.
ఒక గుడ్డికీ, ఒక మూగకీ ఏర్పడని సంపర్కం అన్నంత బాధ.. నిరాశ.. కలిగేది అప్పుడప్పుడు..
“మీరు జవాబివ్వటం లేదు. ” అన్నాను నిరాశ కప్పి పుచ్చుకుంటూ కొన్నాళ్లయాక ఒకరోజు.
“ప్రశ్నలుంటే జవాబులుంటాయి సార్.. ” ఆ స్వరం మరింత మెత్తగా.. కొద్దిగా జీవం నింపుకుని.. తొలిసారి.
“నేనన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నానంటారు.. ”
“నోరులేని లాయరు ముందు ఛాన్సు దొరికిందిగదా అని రెచ్చిపోయే పబ్లిక్ ప్రాసిక్యూటర్లా.. ”
నవ్వులతో మంచు కరిగింది..
మరికొన్ని మాటలయాక..
“ముందుగా మీకు నా కృతజ్ఞతలు. ”
“దేనికి?”
“మా నాన్న నా ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం ఫలానా అని చెప్పాడు. మళ్లీ అలా జరక్కుండా ఉంచే విరుగుడు మీ వద్ద ఉందని తను నమ్మాడు. మిమ్మల్ని నమ్మించాడు. మీరు చాలా శ్రద్ధగా మీరు తీసుకున్న బాధ్యత నిర్వహిస్తున్నారు. అవునా? ”
“మీరు చెప్పేది చెప్పండి. ”
“మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి. ఆయన ఇటీవల మాటలనూ, ప్రవర్తననూ గమనించితే నా చర్య ఆయనను ఎంత షాటర్ చేసినదీ నాకు అర్ధమవుతోంది. పోతే.. ”
“చెప్పండి.. ”
“మీతో కలిసిన ఈ నాలుగైదు పరిచయాలలో మీమీద మా నాన్న ఇంప్రెషన్ తప్పు కాదనే అనిపించింది. నిజంగానే మీరు మంచివారు. మనుషులు. నాకు మీరో సాయం చెయ్యగలరా?”
“చెయ్యగలిగినదైతే తప్పక చేస్తాను. ”
“మా నాన్నతో చెప్పండి. నేనిక అలాంటి ప్రయత్నం చెయ్యనని. అవసరమైతే ఆయనకి నమ్మకం కలగటానికి .. అంటూ ఆగి.. నాకు దైవం మీద విశ్వాసం కలిగిందనో – కావాలంటే – కలిగించాననో చెప్పండి. నన్ను కౌన్సిలింగ్ చేసే బరువు మీకూ తగ్గుతుంది. ”
“నన్ను అబద్ధం ఆడమంటారు. ”
“అహఁ .. అబద్ధమని కాదూ.. ”
“మీరు అంటున్నది అదే .. నేను అసత్యం ఆడను. మీరు ఆడండి ప్లీజ్ బడుద్దాయి గారూ .. అని. ”
సత్య మాటలాడలేదు.
“మీ నాన్నగారు నా ఊహ ప్రకారం భిన్నంగా జీవించారు. వివాహం చేసుకున్నారు. మిమ్మలని పెంచారు. మీరు అందరి కన్న భిన్నంగా ఉండాలని బహుశా ఆశించారు. వివాహం విషయంలో మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని అలాంటి మనిషికి అనిపించే ఉంటుంది. చివరికి”..
అంటూ ‘నాబోటి గుడ్డిపోచ మీద ఆధారపడటం కూడా ఆయన భిన్న ప్రవర్తనకి సంకేతం’ అంటూ నోటి చివరి వరకూ వచ్చిన మాటను తుంచేసి కొనసాగించాను.
“ఆ మాట తండ్రిగా ఆయన చెప్పటం సరే ధ్వనించటానికి కూడా సాహసించలేక పోయుంటారు. తనే పెళ్లి ప్రయత్నాలు చేసారు. ఫలితం ఇలా జరిగింది. అవతల వాడు ఏదో వంక పెట్టి మిమ్మలని కాదన్నపుడు మీరు ఈ నీచుడు లేకపోతే నేను బ్రతకలేనా నాన్నా విడాకులు ఇచ్చేద్దాం అనుండాలి. అదీ మీరు చెయ్యలేదు. కోర్టు.. కేసు.. ఎక్కడ ఎందుకు మీ స్థైర్యం దెబ్బతిందో.. చివరకు ఇలాంటి ప్రయత్నం చేసి ఆయన నడుం విరగ్గొట్టారు. నాబోటి అపరిచితుడితో మీరన్నారే ఆ కౌన్సిలింగ్ .. దానికి కూడా మీరు ఒప్పేసుకున్నారు. మీ అంతట మీరు అబద్దం ఆడరు. నిజం.. మీలో అదొకటి ఉంటే.. చెప్పరు. ఆయనా, చివరకి ఏ సంబంధం లేని నేనూ అబద్ధం చెప్పాలి.. ”
నేను చెప్పవలసింది అయిపోయింది.
చాలాసేపు మౌనం.
“నేను వెళ్తాను సార్”
“కోపం వచ్చిందా? ”
“నాకు నేనే తేల్చుకోవలసిన విషయం స్పష్టం చేసారు.. నాకు సమయం కావాలి.. ”
బయలుదేరుతోంది సత్య.
“ ఒక్క నిమషం.. ” అంటూ బిల్లు చెల్లించి కాఫీడే నించి బయటకు వచ్చి కారువైపు నడుస్తున్నాను. ఆగి “నాతో వస్తారా మీకు కావలసిన చోట దింపుతాను.. ” అన్నాను.
“నాకు వేరే పనుంది.” అంది.
“అనుకున్నాను.. ” అన్నాను నవ్వటానికి ప్రయత్నిస్తూ.
సత్య తొలిసారి స్పర్శించింది.
“మీరీ రోజున నాకో విషయం చెప్పి గురువు అయారు. ‘ధ్వనించ కూడదూ చెప్పాలీ’ అన్నారు. నేనీ దేశపు ఆడదాన్నిగదా- ధ్వనించటమే మా బ్రతుకు. మీరూ అది పాటించాలి. నేనేమన్నానో అదే మీరూ తీసుకోవాలి. ”అంది మెత్తటి నవ్వుతో.
ఆ నవ్వూ, గొంతూ, స్పర్శా నన్ను వెన్నాడుతున్నాయి.
నా సారధి నన్నొకడినే తీసుకుని బయలుదేరాడు.

7

నెల పైగా గడిచింది.
ఈ మధ్యలో చాలా జరిగిపోయాయి. సత్య పరస్పర అంగీకారం మీద విడాకులకి ఒప్పుకుంది. ఆమె ఎత్తు మీద మీడియాలో దాని చర్చతో రచ్చకెక్కిన సత్య పరిస్థితిని వాడుకుని వేధించటానికి ప్రయత్నించి ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి కారకుడైన సహోపాధ్యాయుని మీద యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వాళ్లు వెంటనే చర్య తీసుకోకపోతే తోటి ఉపాధ్యాయులను, స్త్రీ సంఘాలనూ కూడగట్టుకుని అతని మీద చర్య తీసుకునేట్టు చేసింది. నిర్భయంగా స్కూలుకి వెళ్లడం మొదలెట్టింది.
నా మాటలు తన కూతురి మీద చాలా ప్రభావం చూపించాయని వర్మ అన్నాడు.
నిజానికి నేను కూడా సత్యలో అంతటి మార్పుని ఊహించలేదు. దానికి కారణం నేనే అని కూడా నాకు అనిపించలేదు. అల్లా దయామయుడు అనుకున్నాను.
నన్ను తాకే ఆ మెత్తదనం కేవలం ఆమె గొంతులోనే కాదు ఆమె నిండుకూ ఉంది.
మీరు తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నారు. అందొకమారు.
“చిన్న సవరణ. చదువుకోలేదు. విన్నాను. మా నాన్నగారు సంస్కృత పండితులు. ఎందరో తెలుగు రచయితలను వినిపించారు. శాస్త్రి నా ప్రాణస్నేహితుడు. నా అమ్మీజాన్ బాబాజాన్ నేనీ స్థితికి రాటానికీ, నేనిలా నించోటానికీ ఎంత కారకులో అంత కారకుడు. వాడు నాకూ సాహిత్యానికీ నా చదువుకీ ఒక ఆధారం. ”
శాస్త్రి గురించి కబుర్లు. అమ్మీజాన్ బాబాజాన్ ఏక్సిడెంటు. పిఠాపురం నుంచి హైదరాబాదు మకాం మార్పు. “నా ఈ అంధత్వానికి కారణం నా తలిదండ్రులు అన్నదమ్ముల బిడ్డలు కావటం – అన్నాడోమారు శాస్త్రి. దానికి అమ్మీజాన్ జవాబివ్వమంది. ఇచ్చాను. మీ తలిదండ్రులు అక్కాతమ్ముళ్ల పిల్లలు కదా నీకెందుకు రాలేదు- వాడా వెంటనే నిజమే గదా- అన్నాడు. అదీ మా శాస్త్రి. ” అన్నాను. నవ్వింది సత్య. వినిపించింది. మనసంతా కంపించింది.
“ఎందుకో అంత నవ్వు-” అని అడిగాను. మళ్లీ నవ్వింది. మరింత సత్యంగా.. స్వచ్ఛంగా..
“ధ్వనించకూడదు. చెప్పాలి. ”. అన్నాను. నా గొంతులో నాకే వశంకాని మాదకత.
“సరే.. చెప్తా. నా నవ్వు మీరు ఎంజాయ్ చేసారు. ఐనా ప్రశ్న వదలలేదు. అదీ రెండో నవ్వు కారకం. మీ తర్కాన్ని ఒప్పేసుకునీ వాళ్లుంటే మీకు దగ్గరవుతారు.. మీ శాస్త్రిగారిలా. ”.
నవ్వులు..
సత్యని కలిసినపుడల్లా రెండు ఉత్తుంగ తరంగాలు నాలో ఎగసి పడేవి. ఆమెతో జీవితం నా బ్రతుకును పూరిస్తుందన్నదొక భావ తరంగం. ఆమె నాకు దక్కదన్నది మరో తరంగం. ఒకదాని వెంట మరొకటి. దక్కినా కారణం నా స్థితీ కావచ్చు, ఆమె స్థితీ కావచ్చు. అప్పుడామె దక్కినట్టా దక్కనట్టా- అమ్మీజాన్ అనేది- నమ్మి మోసపో కాని నమ్మక కోలుపోకు. అమ్మ మాట ఈమాన్. కాని నమ్మకం- అందులోనూ తోటి మానవుల మీద- అందులోనూ నా స్థితిలో మరింత కష్టం. అపనమ్మకాన్ని రక్షణ కవచం చేసుకుంటుంది ఆశ.
శాస్త్రితో ఫోనులో మాటలాడాను. ప్రయత్నించు. తప్పులేదు. అనొచ్చు. నేనొస్తాను. మాటాడతాను. అనొచ్చు. రెండూ అనలేదు. ఆశ పెట్టుకోకు. నువ్వు భగ్నమైతే నేను భరించలేను. అన్నాడు. అంటే వాడుకూడా హిందువులా మాటలాడాడు. అమ్మీజాన్ ఉంటే వాడి మాటలను మరో కోణంలో చూపించగలిగేదేమో..
చివరికి నేను నన్ను పట్టుకోలేక పోయాను.

8

అప్పటికి ఏడాదికి పైగా గడిచి పోయింది.
ఓరోజు కావాలనే ఓల్గా సాహిత్యం మీదకి మరలించాను సంభాషణను. ఆపేరు వింటే సత్యలో ఉత్తేజం అనేకమార్లు గమనించాను. సంభాషణ వివాహం మీదకు తప్పనిసరిగా మరలుతుందని నా ఆశ.
-నవలలో ప్రతిపాదితమైన స్వేచ్ఛ, ఓల్గా ఆశించే స్వేచ్ఛ, స్త్రీలకవసరమైన స్వేచ్ఛ వేరంటారు మా నాన్న. ఆయన నవలగురించీ, రచయిత గురించీ, సమాజం గురించీ విడి విడిగా మాటలాడతారు. ఓల్గా అంటే ఆయనకు ప్రాణం. స్త్రీల సమస్యకి పరిష్కారం కేవలం ఆర్దిక స్వావలంబన మీద లేదన్న భావన ఓల్గాని చదివినపుడు తనకు కలిగిందిట… సత్య ఉత్సాహంగా చెపుతోంది.
నాకు చేదుమాత్ర మింగినట్టుంది.
నాదృష్టిలో ఓల్గా నేటి చదువుకున్నఆడపిల్లల వివాహ ఆశలకు ఒక ప్రేరణ. ఆవిడ ప్రశక్తి వస్తే ఎటువంటి ఆడదైనా వివాహిత అయితే తన జీవితం గురించి, అవివాహిత ఆయితే తన వివాహం గురించి తన అబిప్రాయాలను ఎంతోకొంతైనా బయట పడేస్తుందని నా నమ్మకం. ఆమె సాహిత్యంగురించి తన అభిప్రాయాలను తండ్రి ఆలోచనలను కలగాపులగం చేసేసి మాటలాడేస్తోంది సత్య.
నా సహనం తెగిపోయింది. నేను దానిని తెగ్గొట్టాల్సినంతటి ఉద్రేకం వచ్చేసింది.
“జ్ఞానోదయాన్ని నిర్వచిస్తూ కాంట్ దానికి కావలసిన ప్రధాన అవసరం స్వేచ్ఛ మాత్రమే అంటాడు. అత్యున్నత మానవ సమాజం ప్రజలకు దానిని కల్పించగలదంటాడు. ఓల్గా గారు చెప్పే స్త్రీస్వేచ్చ సరైన సమాజంతోనూ, పురుషుల స్వేచ్ఛతోనూ సంబంధం లేకుండా ఊహించటం సాధ్యంకాదు.”– అన్నాను.
ఆ తర్వాత జరిగిన సంభాషణలో సత్య మాటలాడినవేవీ నాకు అర్ధం కాలేదు. విషయం పట్ల ఉత్సుకతతో నేనందులోకి దిగలేదు గదా. అది కేవలం నెపం. ఇప్పుడు పునరాలోచిస్తే నేను సత్య మధనను అర్ధం చేసుకునీ అవకాశాన్నిమరోమారు పోగొట్టుకున్నాను. ఆమెను ఒక వస్తువుగా పొందటానికి చేసిన ప్రయత్నంలో సహస్రాంశమైనా ఒక వ్యక్తిగా సామీప్యతని సాధించటానికి చెయ్యలేదు.
ఆ విషయం నేను ధ్వనులను విడిచి పెట్టి నేరుగా వివాహం ప్రస్తావించి నపుడు కూడా నాకు అర్ధం కాలేదు.

9

“సత్యా.. నీ జీవితానికి కొత్త వెలుగు నివ్వాలనీ, నా బ్రతుకుకి నువ్వు ఆధారం కావాలని నా కోరిక. ”
నేనెంతకాలమో ఆలోచించి తయారు చేసుకున్న ఈ వాక్యం ఎంత కృతకంగా ఉందో నాకే తెలిసిపోతోంది. వాక్యం ఎంత శక్తిహీనమయిందో ఆ క్షణాన నాకు అర్ధమయింది.
“తప్పకుండా”.. అంది వెంటనే.
ఆ అంగీకారం నాకు చెప్పరాని ఆనందాన్నీ కలిగించింది. అంతులేని అనుమానాన్నీ కలిగించింది. ఆ క్షణంలో ఆ కళ్లను చూడగలిగే కళ్లు నాకుంటే అందులో ఏదో ఒకటి మాత్రమే కలిగేది.
“మీ నాన్నగారితో వెంటనే మాటలాడతాను. ” అన్నాను.
“దేని గురించి.. ”
“పెళ్లి గురించి.. ఎప్పుడూ.. ఎలా.. ”
“ఆగాగు.. దేనిగురించీ.. ” అంది.
“మన పెళ్లిగురించీ .. ” అన్నాను అయోమయంగా.
చాలాసేపు సత్యనుంచి మాటలు లేవు.
నేనూ ఆ మౌనాన్ని కొనసాగించాను. ఆ కాస్త మౌనంలోనూ నేనామెకు ఇచ్చే ఆధారం ఏమీ లేదనిపించింది. ఆ మాట అనటం ద్వారా నేనామెను కోల్పోతానా అనిపించింది. మరుక్షణంలో ఆమె విలువ పెరిగి పోయింది. ఆమె తప్పకుండా అన్నది దేనిగురించి ?
“సత్యా” – అన్నాను చాలా సేపటికి.
“ఊఁ-” అంది. ఆ గొంతులో నే వెదుకుతున్న మృదుత్వం అలాగే ఉంది. అంత అలజడిలోనూ అది నాకు కలిగించే అనుభూతి అలాగే ఉంది.
“నేను పెళ్లాడతానని ఎలా అనుకున్నావు.. నేనెక్కడ ఎప్పుడు నీకు అలాంటి అవకాశమిచ్చానా అని గుర్తు చేసుకుంటున్నాను. ” అంది. ఆమె మాట పూర్తి కాలేదు. నేనేదో అనబోతున్నాను.. కనులున్నాయిగదా.. ఉపయోగించుకుంది.. నాచేయి పట్టుకుంది.. నా చెయ్యి ఆమెతో ఏమందో తెలీదు..
“మనకి వివాహమాడే అర్హత లేదు.. వివాహం మనమున్న పరిస్థితిలో మనకున్న సత్సంబంధాలకి ముగింపు. ప్లీజ్ అర్ధం చేసుకో.. ” అంది.
“అవును.. నిజమే.. ఒక అంధుడితో పెళ్లా.. ఒక ముస్లింతో అందులోనూ. ”. నేను నా వశం తప్పాను..
“ఏంటదీ.. నువ్వు.. ఎలా ఇలా .. మాటలాడగలుగుతున్నావ్.. ” సత్యచేతిలో నా చేయి అలాగే ఉంది. దాన్ని విదిలించుకునే నా ఉద్రేకం సత్యకి అర్దమవుతూనే ఉంది..
“నీ మాటలకి ఇంకే అర్దముంది.. ” అన్నాను.
చెప్పింది.. సమాజం గురించి.. వివాహ వ్యవస్థ గురించి.. తన అనుభవం నుంచి చేసుకున్న నిర్ణయాన్ని గురించి.. వివాహం వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాలను ఛిద్రం చేయటం గురించి.. ఆమె మనసు వివాహాన్ని అంగీకరించటం లేదట. నా మనసు దేనినీ స్వీకరించటం లేదు.. ఆమెది నిరాకరణ అన్న భావన నుంచి బయట పడటం లేదు.. ఆమె ఏ వాక్యాలను ఎంత సరళంగా చెప్పినా అందులో నిరాకరణ తప్ప మరేమీ ధ్వనించటం లేదు..
చెప్పి.. చెప్పి.. నన్ను వినివిని.. చూసి చూసి అంది.. సత్య.
“కళ్లు లేకపోవటం లోపం కాదు. మరేదో ఇంద్రియాన్నో, ఇంకేదో సాంకేతిక పరికరాన్నో ఉపయోగించుకుని దాన్ని అధిగమించవచ్చు. కాని, .. నువ్వు మరింత గాయపడతావేమో.. ”
“చెప్పు.. ఇంతకన్న నన్నేం గాయపరచగలవు.. ”
“కళ్లు మూసుకోటం ఎవరూ సరిచెయ్యలేని లోపం. దయచేసి ఆలోచించు. వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. చానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”
“సత్యా. ”. నా మనసు నాకు తెలియకుండానే నా స్వరంలో నిండింది.
“ఎక్కువ సంఖ్యవాళ్లలో అధిక శాతం తక్కువ సంఖ్యవాళ్లను తక్కువ చేసి చూస్తారనేది తక్కువ సంఖ్యవాళ్లను వెన్నాడుతుంటుంది.. దానిని ఉపయోగించుకునే ప్రపంచంలో అనేక అవాంఛనీయ కృత్యాలు జరిపిస్తున్నారు కొద్దిమంది. వాళ్లు అధికసంఖ్యకీ చెందవచ్చు. అల్పసంఖ్యకీ చెందవచ్చు. వాళ్ల లక్ష్యాలు వేరుగా ప్రకటించుకోవచ్చు. కాని ఆకొద్దిమంది లక్ష్యమూ ఒక్కటే. మనిషిని మనిషితో కలిపే సమస్త మార్గాలనూ మూసివేయటం. నిజమైన ఆ కొద్దిమందీ మొత్తం మానవజాతిని మానసికంగా శాసించగలుగుతున్నారు. దానినుంచి వ్యక్తులుగా ముందు మనం బయటపడాలి.. మనం చర్చను నేర్చుకోవాలి. అభిప్రాయాలను మార్చే ప్రయత్నం ప్రేమతో.. ఓరిమితో చెయ్యాలి. మనలను శాసించే భావాలలో మనవేవో.. మనం కొనితెచ్చుకున్నవేవో.. గింజ ఏదో పొల్లు ఏదో వేరుచేసుకోగలగాలి. అందులో మనం తోడూనీడా కాగలగాలి. స్నేహితుడా ధ్వనిని అలంకారప్రాయం చేసుకుని ఎవరైనా దేనినైనా నేరుగా మాటలాడగలిగే ప్రపంచం కలగందాం రా. నా మనవి ఒక్కటే.. సాధ్యమైనంత వరకూ మనం మాటల మీద వాటి వాచ్యర్ధం మీద ఆధారపడటం ద్వారానే మనం ఏకమయీ అవకాశం ఎంతో కొంత ఏర్పడుతుంది.. ప్లీజ్ నేరుగా అర్ధం చేసుకో.. ”

(2010 ఆగస్టు రచన సంచిక)

“ఆ శ్రీశ్రీ పద్యంలో ఉన్నది నేనే అనిపించేది”

images

కార్టూనిష్టు శంకర్ కుంచెలో శ్రీశ్రీ

 

“శ్రీశ్రీగురించి ఎందుకు రాయాలనుకుంటున్నావు?”

“అడిగారు కనక”.

“ఎందరో రాయమన్నవి నువ్వు రాయలేనన్నావు గతంలో. ఇప్పుడు?”.

“శ్రీశ్రీ కనక. దాదాపు ఎన్నడూ రాయలేదు కనక.”

“ఆయనగురించి అనేకమంది రాసారు. ఆయన కవిత్వం పట్టుకున్నవారు కవిత్వం గురించి రాసారు. వారిలో వ్యక్తిగతంగా దగ్గరైన వారు తమ సాన్నిహిత్యాన్నిచెప్పుకున్నారు, వ్యక్తిగా శ్రీశ్రీ గురించీ చెప్పారు. ఇంతమంది చెప్పాక నువ్వు కొత్తగా చెప్పటానికేముంది? ”

“రోజూ తిన్న అన్నమే తినుట ఏల? అందరూ పూజించు రామచంద్రమూర్తినే పూజించుట ఏల? అన్న ధోరణిలో విశ్వనాధవారు రామాయణ కల్పవృక్షం రాయటానికి కారణం చెప్పారు. 1910లో పుట్టి 1940ల నాటికి తన కవిత్వానికీ తనకీ ఆరాధకులను తయారు చేసుకున్నారు శ్రీశ్రీ. ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక తరం అనుకుంటే దాదాపు నాలుగు తరాల యువకులను ఆయన కవిత్వం పట్టుకుంది. కమ్యూనిజం వైపు వారిని నెట్టింది. ఇంతమందిలో నేనొకడిని. నా అనుభూతులని కూడా చెప్పుకోటం కన్న ఏం చెపుతాను.”

“అంటే నీగురించి నువ్వు చెప్పుకుంటావన్నమాట. ”

“ఒక విధంగా అంతే. ఏ వ్యక్తిగత అనుభవంలోనన్నా, అనుభూతిలోనన్నా సామాజిక అంశ కొంత ఉంటుంది. దానిమీద నేను దృష్టిపెట్టి, చదువరుల దృష్టిపడేలా ప్రయత్నిస్తాను. పోతే- శ్రీశ్రీ నాకేమిటి అన్నదానికి జవాబివ్వటానికి ప్రయత్నిస్తాను.”

“ప్రయత్నించు”.

“ఒక పాఠకునికీ, కవికీ ఉండే సంబంధం అర్ధమయేలా చెప్పాలంటే ధార్మిక నమ్మకాలలో ముఖ్యమైన ఆత్మ అన్న భావనని నేను ఉపయోగిస్తున్నాను. ఆత్మపై నాకున్న విశ్వాస అవిశ్వాసాలను పక్కనుంచి, ఆ భావనను ఉపయోగించుకొంటేనే నాకు సరిగ్గా చెప్పానన్న తృప్తి కలుగుతుంది. ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండి, దానికి చైతన్యం అవుతుంది. శ్రీశ్రీ కవిత్వం అదే మాదిరి నా సమస్త స్పందనలనూ జీవంతో, చైతన్యంతో, కదలికతో నింపుతున్నదని అనుకుంటున్నాను. అందుకే శ్రీశ్రీ నాకు స్వాత్మ్యం.”

“నిన్ను నువ్వు తార్కికుడు అనుకుంటావు గదా?”

“నేను తార్కికుడినే. అయినా కేవలం కవిత్వంతో హృదయం తర్కాతీతమైన అనుభూతిని పొందగలదన్నది నాకు అనుభవమే. అంతకుమించి ఆ అనుభూతికి నేను ఇతర విలువలు ఆపాదించలేను, అర్ధాలు చెప్పను. అలాగే అటువంటి అనుభూతి ఒక మూఢత్వానికీ, పూర్తి దాసోహానికీ దారితీసి పాఠకుడిని క్రియాశీలుడిని చేయటం కూడా కాదనలేని వాస్తవం. అదీ నాకు అనుభవమే. శ్రీశ్రీ కవిత్వంతో క్రియాశీలులు అయిన ఎందరో చేసిన పనులతో తూచితే నేను చేసినది పూర్తిగా వీగిపోతుందనీ నాకు తెలుసు.”

“తార్కికుడు ఒక కవిత్వపు విలువను నిర్ణయించవలసి వస్తే కొన్ని ప్రమాణాలను ఏర్పరుచుకుంటాడు. ఆ ప్రమాణాలకు నిలిచేవీ, నిలవనివీ ఆ కవి కవిత్వ సృజనలోనుంచి గుర్తు పడతాడు. వేరు చేస్తాడు. తరతమాలను నిర్ణయిస్తాడు. ఒకే కాలానికి చెందిన, ఒకే భావజాలానికి చెందిన కవులను బేరీజు వేసేటపుడు అతడు తన ప్రమాణాలకే కట్టుబడతాడు. తనను ప్రభావితం చేసిన మహా కవుల, మహా రచయితల సాహితీ సృజన జాతికి అందించినదేమిటో చెప్పేటపుడు అందులో సమస్త మానవజాతికి కలిగించిన చిరు నష్టాన్నైనా ఉంటే చూడగలుగుతాడు, చూపగలుగుతాడు. ఎక్కిన ఎత్తులను గణించేటపుడు ఎక్కలేకపోయిన ఎత్తులనూ గుణించుతాడు. దిగిన లోతులకు దిగేటపుడు దిగలేకపోయిన లోతులకు కూడా తార్కికుడు దిగుతాడు. అవునా?”

“నిజమే. ఈ నా వ్యాసం పరిధి అంత సమగ్రమైనది కాదు. నేను అంత నిజాయితీగానూ, నిష్పక్షపాతంగానూ ఉండగలిగినా నాకున్న శక్తి చాలా పరిమితమైనది.”

2

“నేను 48లో పుట్టాను. మా కుటుంబంలో ఎవరికీ సాహిత్య వాసన లేదు. మా నాన్నగారు పుస్తకాలు చదివేవారు. 64 నాటికి చాలా పుస్తకాలు చదివాను. ప్రబంధాలు మొదలుకుని అదీ ఇదీ అని లేకుండా చదివాను. వాటిలో సాహిత్యం, చరిత్ర, జనవిజ్ఞానం నాకు ప్రధాన ఆసక్తులు. ఈ చదువులో ఏ సంవత్సరం. ఏ తేదీన శ్రీశ్రీ నాకు తటస్థపడ్డాడో, పడ్డపుడు నా తొలి స్పందనలేమిటో నేను చెప్పలేను. శ్రీమూర్తి అన్నమిత్రునితో నాకు స్పర్ధ ఉండేది. అతను కృష్ణశాస్త్రిని ఆరాధించేవాడు. నేను వేదులని ఆరాధించాను. దీపావళి అప్పట్లో నోటికి వచ్చేది. ..నాకు తలంపు లేదు లలనాజనతాకబరీ భరైక భూషాకలనన్.. అనటం వేదుల సమాజం చింతనగా, దేవులపల్లి మనసారగా ఏడ్వనీరు నన్ను అనటం సమాజ నిరాకరణగా అనిపించే అవకాశం ఉంది. 67 నాటికి చదువు పూర్తయింది. నిరుద్యోగం మొదలయింది. ప్రేమ అన్నది ఉందని, కనక ప్రేమించాలని చదువు చెప్తే, అదంతా కేవలం ఒక భావుక స్వభావం మాత్రమే, అలాంటిది ఉన్నా ఆకలి ముందు నిలవదని నా తర్కం చెప్పేది. ఈ ఘర్షణకీ, శ్రీశ్రీ ప్రభావానికీ సంబంధముందా అని ఇప్పుడు ఆలోచిస్తే లేదనే అనిపిస్తోంది. నాలోని ఈ ఘర్షణ నా జీవుడిని (మౌలిక స్వభావాన్ని) తెలియబరుస్తుంది. ఈ జీవునికి ఖచ్చితంగా అమరిన కవి శ్రీశ్రీ. లోకంలోని ఆకలిని ఒక వాస్తవంగా చూసాడు నా కవి. అదే సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి లోనై ఆ ఉద్వేగం అంతా తన పాఠకునిలో నింపగలిగాడు. నిజానికి ఆకలికీ, అనుభూతి తీవ్రతకీ చుక్కెదురు. నాదీ అదే పరిస్తితి. నాలో రెండూ ఉన్నాయి. అందుకే శ్రీశ్రీని నా స్వాత్మ్యం అనాలనిపిస్తోంది. మరికొంచెం ఆలోచిస్తే ఒక ప్రశ్న ఎదురవుతుంది”.

“ఏమిటది?”

“రాతిని కూడా గానం కరిగించగలదని అంటారు గాని అది సాధ్యమా? ఆ ఊహ కమ్మగా ఉంటుంది. అది గానం యొక్క గొప్పతనాన్ని అందంగా చెపుతుంది. కరగటానికి కరిగే లక్షణం కూడా అవసరం.”

“అది నీ ప్రత్యేక లక్షణమంటావు.”

“నాది అనుకోను. అది మానవజాతిలో సర్వే సర్వత్రా కనిపిస్తుంది.”

“శ్రీశ్రీతో నీకు విభేదం లేదంటావు”.

“అనను. ఇది విభేదం అనీ అనలేను. దీనికి చాలా వివరణ అవసరం. కవిత్వానికి ఛందస్సు, మాత్ర, లయ ఉంటాయి. కవులు ఓ లయను అనుసరిస్తున్నపుడు అది ఓ ఛందస్సును – అంటే కొన్ని గణ నియమాలనూ, కొన్ని వాక్య నియమాలనూ – అనుసరిస్తుంది. అలా ఆది కవులు స్వయంగా ఏర్పరుచుకున్న నియమాలను వర్గీకరణ చేసి, అవి తర్వాతి కవుల ఉపయోగం కోసం అందుబాటులోకి తేగా అది ఛందస్సు అనీ, అలాగే రాయాలని కవులు కానివారు పట్టుబట్టటం జరిగింది. ఇది భావప్రవాహాన్ని అడ్డుకుంటుందంటని శ్రీశ్రీ గొప్ప కవితావేశంలో కవితా ఓ కవితాలో అన్నారు. 68లోనే అని గుర్తు. పస్తులు, నిరుద్యోగాల మధ్య ఓ రాత్రి నేను వృత్త పద్యాలు రాయటం మొదలయింది. ఆ ఆవేశంలో రోజుల తరబడి పద్యాలు. కడుపు చేతబట్టుకుని ఇల్లు వదలి వెళ్లిపోయినపుడు నా దగ్గర ఉన్నది ఈ పద్యాలు, ప్రేమ-ఆకలి మధ్య సంఘర్షణ, శ్రీశ్రీ కవిత్వం.

ఈ బాటసారి పద్యంలో ఉన్నది నేనే అనిపించేది. కలకత్తా ఫుట్పాతులూ, బీహారు- ఒరిస్సా సరిహద్దులలోని గ్రామాలు తిరిగి జబ్బుపడి, చనిపోకుండా ఇంటికి రాగలిగాను. పోతన మీద ఒక మూడొంతుల కావ్యం, వామపక్ష భావాలతో కపోత సందేశం వృత్తాలలో రాసాను. పోతన కావ్యానికి ముందు మాటలుగా ఛందస్సును శృంఖలాలుగా భావించిన శ్రీశ్రీ అనుభవం గురించి చాలా ఆలోచన నడిచింది. ఛందస్సు వల్ల భావం ఉధృతి(force)ని కోల్పోతుందా పొందుతుందా అన్న చర్చ అనేక పుటలలో సాగింది. హృదయంలో భావాన్ని కవి అక్షరబద్ధం చేస్తాడు. ఈ భావంలో అవేశముంటే అది ఛందస్సు అనే పిచికారీ వల్ల మరింత ఉధృతితో పాఠకుడిని తాకుతుంది అన్నది ఆనాటి నా చర్చ ప్రధానాంశం. అక్షరంలో శబ్దం ఉంటుంది. అక్షరాల కూర్పులో శబ్ద విన్యాసం ఉంటుంది. అది భావావేశాన్ని మరింత గట్టిగా పఠితనూ, శ్రోతనూ కదిలిస్తుందన్నది మరో అంశం. ఇది మన పూర్వకవులు పలికి చూపించారు.  కవి శక్తిహీనుడైతే వచన పద్యాలలోనైనా కవిత్వం పలుకుతుందా? ఉధృతి వస్తుందా? అది మరో ఆలోచన.”

“నువ్వు రాసిన పద్యాలలో అలాంటి కవిత్వం, ఉధృతి ఉన్నాయంటావా? ”

” మారుమూల వృత్తాలు, గర్భకవిత్వం(పద్యంలో పద్యం) వంటి సర్కసు పద్యాలతో సహా అన్ని వృత్తాలూ, ఉదాహరణకి కవిరాజ విరాజితం, స్రగ్ధర, మహాస్రగ్ధర, మాలిని వంటి ఎన్నో, రాసాను. కోకిల రామాయణం పేరుతో మత్తకోకిల, తరళాలతో ఫోతన చెప్పినట్లు రామాయణం రాసాను. గోదావరి జిల్లా యాసలో సీసపద్యాలతో ముసురు అన్నపేరిట వ్యవసాయం గురించి కొన్ని రాసాను. ఇలా నేను రాసినవి పద్యాలేగాని కవిత్వమని ఎన్నడూ అనిపించలేదు. వచన పద్యాలు కూడా రాసాను. వాటిల్లో ఏదో కొంత తృప్తి ఉండేది.”

“శ్రీశ్రీ అభిప్రాయంతో ఏకీభవించానంటావు?”

“చెప్పలేను. వస్తువు పట్ల ఆవేశం, అభివ్యక్తి ఉన్నవారికి ఛందో నియమాలు వదిలెయ్యటం వల్ల కొంత వెసులుబాటు కలిగిన మాట వాస్తవం. మన నిచ్చెన మెట్ల సమాజంలో దేనికీ స్వచ్ఛత లేదు. స్పష్టత లేదు. కవిత్వం తీరికవర్గాల విలాసాలకు, వినోదాలకు ఎక్కువగా వినియోగపడింది. అంతేగాక, అది సామాన్య జనానికి అందని ఏదో పూర్వజన్మ సంస్కారఫలంగా, కవులు అసాధారణ వ్యక్తులుగా అనేక ఊహలు, వదంతులు చెలామణీలో ఉండేవి. “హయమట సీత” అంటూ ఆరింట త అక్షరం ఉంచి పద్యం చెపితే శత్రువు చనిపోయాడు వంటి కథలు ఉండేవి. ఈ రహస్యమయ అసాధారణ స్థానం నుంచి కవిత్వాన్ని అందరికీ అందేదిగా చేసిన గురజాడ, శ్రీశ్రీలను అంగీకరించకుండా ఎలా ఉండగలం? అదే సమయంలో పొట్టి, పొడుగు వాక్యాలతో, ఏ ఆవేశంగాని, వైచిత్రిగాని, రామణీయకత గాని లేని రాతలను పద్యాలుగా, అందులో కవిత్వం ఉందని నమ్మించజూచే వత్తాసు వ్యాసాలతో తెలుగు భాషలో ఒకప్పటి పేరుతో చెట్టుపేరుజెప్పి కాయలు అమ్ముకునే లబ్ద ప్రతిష్టులూ, అమాయకులూ, సరైన మార్గదర్శకత్వం లేని కుర్రవాళ్లూ రాసేవి కంటబడినపుడు శ్రీశ్రీ పొరపడ్డాడా అనిపిస్తూనే ఉంటుంది.”

“మహాప్రస్థానంలో నీకు ఇష్టమైన కవిత?”

“రాత్రింబవళ్లు శ్రీశ్రీ, మనసు బాగుంటే శ్రీశ్రీ, ఓగుంటే శ్రీశ్రీ అన్నట్లు ఉండేది. కర్తవ్యం గురించి ఆలోచిస్తే జయభేరి, కవిత్వం గురించి ఆలోచిస్తే కవితా ఓ కవితా, కమ్యూనిజం గురించి ఆలోచిస్తే మహాప్రస్థానం, జీవిత మౌలిక లక్ష్యాలగురించి వెదుకుతుంటే శైశవగీతి, మానవజాతి గురించి ఆలోచిస్తుంటే మానవుడా ఇలా అనేకం నన్ను నడిపించాయి.”

CM24VIDU_2287311e

“శ్రీశ్రీతో వ్యక్తిగత పరిచయం ఉందా?”

“దాని గురించి చెప్పేముందు నా రచనలతో శ్రీశ్రీ గురించి చెపుతాను. ఋక్కులు తొమ్మిది పేర్లతో వారం పదిరోజులలో కథలు రాసాను. అందులో ఓ కథ రొట్టెముక్క. దానిని నా భార్య సాఫుచేసి పంపటం అది బహుమతి పొంది ప్రదురించబడటంతో నాకు తెలిసి నా ప్రచురణ పర్వం మొదలయింది. ఆ తొమ్మిది కథలూ వివిధ పత్రికలలో రావటం నాకు వ్యక్తిగతంగా గొప్ప సంతోషం కలిగింది. ఆ తర్వాత కవిత్వమెక తీరని దాహం(ప్రచురణకి ప్రయత్నించలేదు), ప్రపంచమొక పద్మవ్యూహం కూడా రాసాను. కాక కధలకు పేర్లు వెతుక్కోటానికి మహాప్రస్థానం ఆశ్రయించేవాడిని. ఇంక వ్యక్తిగత జీవితం. నా బిడ్డలకు నిద్రపుచ్చటానికి మహాప్రస్థానం పాడేవాడిని. వాళ్లు బడులలో పాడిన పాటలు శ్రీశ్రీవి. వంగపండు ప్రసాదరావూ, నేనూ షిప్ యార్డ్ లో కలిసి పనిచేసాం. అతని పాటలూ నా పిల్లలు పాడుతుండేవారు. మిత్రుడు అనంతుడు నా సహోద్యోగి. విశాఖ సాహితీ ప్రపంచంతో వ్యక్తిగత పరిచయానికి కారకుడు. వేణుగారు, కృష్ణక్క, ప్రసాద్ గార్ల ఇల్లు విశాఖ మేధోప్రపంచానికి కేంద్రం. దానిలో ప్రవేశమే నాకు అనేకమందిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం కలిగించింది. కాని నాకు పూనుకుని మాటలాడటం పూసుకుని తిరగటం అన్న భావన హెచ్చు. ఫొటోలకు ఎగబడటం అయిష్టం. అడిగితే చెప్పటం, చెప్పిన పని చేతనైన మేరకు చెయ్యటం నా పద్దతి. కవులు, రచయితల సృజనతో పొందే స్ఫూర్తి మీదనే నాకు ఆసక్తి ఉండేది. ఇలాంటి కారణాల వల్ల శ్రీశ్రీని కలిసిన సందర్భాలున్నా చెప్పుకోదగ్గ విషయాలు మాటలాడిన గుర్తులు లేవు. నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో గురజాడ కళా మందిరంలో 74 లో జరిగిన సభ. నా ప్రధమ సంతానం వీరారుణకవితకి ఎనిమిదో నెల. దానిని తీసుకుని నడుచుకుంటూ వెళ్లటం, వంగపండు పాటలు, శ్రీశ్రీ ఉపన్యాసం, ఆ రాత్రివేళ ఆ ఇసుకలో కూర్చుని శ్రీశ్రీ, కాళీపట్నం రామారావులు సభంతా తిరుగుతూ చందాలు వసూలు చేస్తుంటే దగ్గరగా వారిని చూడటం, సభానంతరం మళ్లీ నడుచుకుంటూ రామంతో కలిసి ఆ అనుభూతిని పంచుకోటం… ఒకమారు శ్రీశ్రీని స్టేషనుకి వెళ్లి తీసుకుని వస్తుంటే కారులో ఆయన పక్కనే కూర్చుంటే కారు తలుపులో నా చెయ్యి పడింది. అయ్యో అంటూ నా చెయ్యిని పట్టుకుని ఊదారు. ఇలాంటి చిన్ని చిన్ని సంఘటనలు వ్యక్తిగత పరిచయం కిందకి వస్తే ఉన్నట్టే అని చెప్పాలి”

“ఇంకా చెప్పుకోవలసినది ఏమైనా ఉందా?”

“ఉంది. అది నా ఆలోచనా ప్రపంచంలో శ్రీశ్రీ. కవిత్వమంటే ఏమిటి అన్నది చాలా చిక్కు ప్రశ్న. ఈ ప్రశ్న కలిగిన సందర్భాలన్నీ శ్రీశ్రీని చదివినపుడే కలిగాయి. జవాబు ఇచ్చుకోవాలనిపించినపుడు ఉదాహరణలు అన్నీ మహాప్రస్థానం నుంచే వెదుక్కున్నాను. ఈ ప్రశ్నకి శతాబ్దాలుగా జవాబివ్వటానికి మానవజాతి ప్రయత్నించింది. క్రిస్టఫర్ కాడ్వెల్ చేసిన చర్చ నాకు తృప్తి కలిగించింది. అతని చర్చ మానవ జాతి ప్రస్థానంలో కవిత్వం పుట్టుక చుట్టూ తిరుగుతుంది. అయితే కవిత్వ నిర్వచనానికి అది అంతగా సహాయపడదు.”

“ఆ నిర్వచన మేదో నీకు లభించిందా?”

“లేదు. కవిత్వ సృజన ఒక ప్రత్యేక శక్తి అనీ, అలాగే కవితాస్వాదన కూడా వ్యక్తి ప్రత్యేక శక్తి అనీ ఒక భావన ప్రముఖంగా ఉంది. రెంటికీ సాధన, అభ్యాసం అవసరమన్న ఊహ కూడా ఉంది. అంటే వ్యక్తులకు ఉండే ఒక ప్రత్యేక శక్తి గానో, ఆసక్తి గానో ఒక వివరణ ఉంది. ఈ శక్తులని మన సాంప్రదాయ భావనలలో రససిద్ధీ, సహృదయ భావనలతో వివరించవచ్చు. అయితే ఈ వివరణ అటుతిరిగీ, ఇటుతిరిగీ భగవద్దత్తంగా, జన్మ సంస్కార ఫలంగా, ఒక మానవాతీత వ్యవహారంగా కవిత్వాన్నీ, కవిత్వాస్వాదననూ విస్తరించటం గమనించినపుడు దీనిని నేను అంగీకరించలేను. జనచైతన్యానికి కవి నిలవాలని, కవిత్వం నిలుస్తుందనీ సంఘాభ్యుదయ కాముకులు అంటారు. సమాజం పరిపక్వమౌతున్న దశలో, అంటే మార్పులకు సిద్ధమౌతున్న దశలో, అది “కవి” రూపంలో “కవిత్వం”గా తనను తను ఆవిష్కరించుకుంటుందనేది వారి వివరణ. ఇది కవిని సమూహంలో భాగంగా, కవిత్వాన్ని సమూహ వ్యక్తీకరణ రూపంగా చూస్తుంది. ఈ వివరణతో నాకు చాలావరకూ ఏకీభావం ఉంది. అయితే ఈ వివరణ కూడా కవిత్వాన్ని కొంతవరకూ ఒక ప్రత్యేక వ్యవహారంగానే చూస్తుంది. కవితాస్వాదకులు ప్రత్యేక వ్యక్తులుగా వారి వినియోగానికి మాత్రమే కవిత్వం అన్న నిర్ణయానికి చేర్చే వాదనను నేను ఒప్పుకోలేను. అలాంటి ప్రత్యేక శక్తి నాకు ఏమాత్రం లేదు. బహుశా అందువల్ల కవిత్వ నిర్వచనం నాకు దొరకలేదు.”

“నీకింకా కవిత్వ నిర్వచనం మీద అన్వేషణ ఉంది.”

“ఉంది. కవిత్వంలో ఆధునిక దశపై కొన్ని ఆలోచనలు ఈ అన్వేషణలో కలిగాయి. కవిలో “అసంకల్పితంగా” ఉన్న సామాజిక బాధ్యత “సంకల్పితం” కావటం ఈ దశకి ఆరంభం. జంటపక్షుల వియోగం వాల్మీకిని కదలించి రామాయణానికి కారణం అయిందట. కవి బాహిర ప్రపంచంలోని ఒక ఘటన అతని అంతఃప్రపంచాన్ని కుదిపివేసినపుడు, ఆ కుదుపుని అతను బాహిరప్రపంచంతో పంచుకోజూస్తాడు. ఇందులో ఆ కుదుపు, ఆ వియోగం కలిగించిన దఃఖం, దాన్ని పంచుకోవాలన్న ఆవేశం అన్న మూడు దశలు కనిపిస్తాయి. ఈ మూడూ “అసంకల్పితం” కావటం మనం గమనించవచ్చు. ఆధునిక కవిత్వ దశలోనూ ఈ మూడు దశలూ ఉంటాయి. అయితే కవి చైతన్యం పూర్తిగా అతని అంతఃనిర్మాణానికి పరిమితమైనది కాదు. బాహిర ప్రపంచ ఘటనలు కవి వశంలో ఎన్నడూ ఉండవు. అయితే ఆతని స్పందనలు ఆతని చైతన్యం మీద, ఎఱుక మీదా ఆధారపడే అవకాశం ఉంది. పక్షులు విడిపోవటం బాధాకరం కాటానికి అది బాధాకరమన్న ఎఱుక అవసరం లేకపోవచ్చు. పేదరికం, అసమానత అన్నవి బాధాకరం కాటానికి పట్టణంలో బ్రతుకుదామని వెళ్లిన బాటసారికి కలిగిన కష్టం దైవకృతం కాదని, మానవ కృతమేనన్న ఎఱుక అవసరం. అలసిన కన్నులు కాంచేదేమిటో కాంచటానికి ఆ ఎఱుక అవసరం. ఆధునిక దశ బీజాలు ఈ తరహా ఎఱుక పుట్టుకలో ఉన్నాయి. భావ కవిత్వపు వెల్లువకి భగవంతుడిని స్త్రీగా భావించి ఆరాధించే సూఫీతత్వం కన్న స్త్రీ సాంఘిక స్థితి పట్ల సమాజంలో ఉన్న అసమ్మతి ఎక్కువ దోహదపడిందని గమనించవచ్చు. వేమన, గురజాడలకు శ్రీశ్రీ ఇచ్చిన ప్రాధాన్యతను గమనించినపుడు మాత్రమే అతని కవిత్వంలోని మూడు దశలలో రెండవ, మూడవ దశలలోని “సంకల్ప” “అసంకల్ప” అంశాలను విడదీసి చూడవచ్చు. కవి consious, subconsious అవస్తలూ, ఆధునిక కవిత్వ లక్షణాలూ అర్ధం చేసుకోవచ్చు.”

“………..”

“ఆధునిక కవిత్వం అనగానే పాతనంతా – రూపంలో, వస్తువులో – విసర్జించాలన్నది చాలామంది ఆశించే విషయం. ఈ ఆశ ఎంతవరకూ సబబైనది అన్న విషయాన్ని పక్కనుంచి ఎంతవరకూ సాధ్యం అని నేను ఆలోచించాను. కొత్త ఆలోచనలు వ్యక్తి చైతన్య సంబంధి. చటులాలంకారపు మటుమాయల నటనలలో నీరూపం కనరానందున… అంటాడు శ్రీశ్రీ. అలంకారాల ప్రగల్భాలను చూడగలిగాడు కనక ఆ చైతన్యంతో వాటిని తొలగించుకోవాలన్న సంకల్పం సాధ్యం. వ్యాకరణాలను సంకెళ్లుగా, ఛందస్సులను సర్ప పరిష్వంగాలుగా, నిఘంటువులను శ్మశానాలుగా చూడగలిగినపుడు వాటిని వదిలించుకొనే ప్రయత్నం చేయగలుగుతాడు. ఈ సంకెళ్లు అతని బాహిర ప్రపంచం వేసినవి. ఇవేకాక మరికొన్ని సంకెళ్లు లేదా మరికొంత పాత ఉండే ఉండవచ్చు. ఉదాహరణకు నరక లోకపు జాగిలమ్ములు, యముని మహిషపు లోహఘంటలు ధార్మిక కల్పనలు. వీటిని పాత కవులెవరూ శ్రీశ్రీ వాడిన ఉద్దేశ్యంలో వాడే అవకాశం లేదు. అయినా ఇవి పాతను సూచిస్తాయి. ఎవరినైనా తూచాలనుకున్నపుడు ఆ కవి తెంచుకున్న సంకెళ్లను లెక్కించాలా తెంచుకోలేకపోయిన సంకెళ్లను లెక్కించాలా అన్నది నా ప్రశ్న. అలాగే రాసిన అంశాలను చర్చించాలా? రాయని అంశాలను లిస్టించాలా? ఓ కవి అభ్యుదయతను, ఆధునికతనూ, సామాజిక స్పందనలనూ తూచటానికి కూర్చున్నపుడు అతని కవిత్వంలో ఉన్న అంశాలను ఆధారం చేసుకోవాలా? లేని అంశాలను – అవి అప్పటికే బాహిర ప్రపంచంలో ఉన్నాయి గనుక – పరిగణనలోకి తీసుకోవాలా? ప్రజాస్వామిక దృక్పధంతో అన్నీ తీసుకోవచ్చు. కాని అభిశంసన కోసం కూర్చున్నపుడు జరిగేదేమిటో మనకు తెలుసు. ఆ అభిశంసనకి కారణం కవి పట్ల విముఖత, ఆ విముఖతకి కారణం ఆ కవి నిలబడిన విలువల పట్ల అసమ్మతి, అతడు స్వప్నించే మరో ప్రపంచం పట్ల అసహనం అన్నది గమనించవచ్చు. అలాంటపుడు సాధ్యతకి సంబంధించిన ప్రశ్న పుట్టదు. శ్రీశ్రీ గురించి తలెత్తిన వివాదాలను పరిశీలనాత్మకంగా చూసినపుడు ఆయనకి ముందు వేమన, గురజాడ వేసిన కాలిబాటలు ఉండవచ్చు. వాటిని ప్రధాన రాచమార్గాలుగా మలచటంలో శ్రీశ్రీ కవిత్వం వహించిన పాత్ర ఒక యుగకవిగా ఆయనను నిలబెడుతుంది.   కవిత్వ నిర్వచన అన్వేషణలో ఇవీ నేను గట్టిగా ఆలోచించిన విషయాలు.”

“చివరగా?”

“విశ్వమానవ భావన తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అందించిన మహత్తర కానుక. అది తెలుగు సాహిత్యం మానవ జాతి సాహిత్యం కావటానికి దోవలు తెరిచింది. తానొక అణువునన్న గుర్తింపు మానపుడిని ఏకం చేసి అనంత విశ్వంలో భాగం చేస్తుంది. నామటుకు నాకు ఈ పెను సత్యం రవ్వంతైనా అందటానికి కారకుడు శ్రీశ్రీ.”

 -వివిన మూర్తి

vivina murthy

కధలకో ఇల్లు

16

మనకు గ్రంధాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంధాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంధపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంధ సేకరణ, భద్రతలకు ప్రయత్నించాయి. స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టాయి. దాతలు విరాళాలు అందించారు. ఈ గ్రంధాలయాలు ఆరంభ లక్ష్యాలను చాలావరకు సాధించగలిగాయి. వినోదంకోసం చదివేవారికి ఇతర వినోదసాధనాలు అందుబాటులోకి రావటం, ఆసక్తిగా, ఆబగా చదవగలిగిన వయసులో పిల్లలకు పాఠ్యపుస్తకాలకు వెచ్చించాల్సిన సమయం అపరిమితంగా పెరిగిపోవటం వంటి పరిణామాలతో గ్రంధాలయాల వినియోగం తగ్గింది. ఒకప్పుడు జీవికనిచ్చిన అణా లైబ్రరీలూ, సర్క్యులేషన్ లైబ్రరీలూ అవి ఆధారపడిన పుస్తకాలు ఏ కోవకి చెందినవైనా కనుమరుగవసాగాయి. భద్రపరచటానికి అవసరమైన స్థలం, సంకల్పబలం, సాధనాలు కొరవడటంతో అనేక పత్రికలు పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోసాగాయి. కనీసం అంగబలం, అర్ధబలం కల పత్రికలు సైతం తమ పత్రికలనైనా భద్రపరచటానికి గట్టిగా పూనుకోలేదు.

ఈ స్థితిలో-
శ్రీ కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలో రూపంలో తెస్తే, తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.
అలా పుట్టింది 1996లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావు గారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తి గారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రధమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలుగాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.

2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను( దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపధ్యాన్నీ సమాజ నేపధ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఆయా కథలు వెలువడిన వెంబడే వచ్చిన స్పందనలు, ఆ మీదట విమర్శకుల తూనికలు వగైరా సమాచారమంతా పోగుచేయటానికి కృషి జరుగుతోంది. దీనికి తోడుగా రచయితల గొంతులను , ఛాయాచిత్రాలను, జీవిత వివరాలను కూడా సేకరించి భద్రపరచాలని ఆలోచన ఉంది. ఈ పనులు కూడా మొదలయాయి.

ఈ సమాచారానికి వినియోగం ఉండాలి. అందుకోసం-
ఇదంతా క్రోడీకరణ జరగింది. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్సైట్ ఏర్పడింది.

పోతే-
ఈ కృషిని ఇంతవరకూ ఉపయోగించుకున్నవారెవరు?
విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్ధులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు. ఈ వెబ్సైట్ వారందరికీ మరింత సేవలు అందిస్తుంది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “ కథాకోశం” తీసుకు వచ్చింది. అనేకమంది రచయితలు తమ సంపుటాలను ప్రచురించారు.

కాళీపట్నం రామారావు గారు తమ సాహిత్య ఆర్జన అంతటినీ వినియోగించి 1997లో కథానిలయం పేరిట ఈ యజ్ఞం ఆరంభించిన తరవాత తనకి లభించిన పురస్కారాల సొమ్ము కథానిలయానికే ఖర్చుపెట్టారు. ఎందరెందరో చేతులు వేసి కథానిలయాన్ని ఇప్పుడున్న స్థితికి చేర్చారు. 15 వేల మంది రచయితల పేర్లతో వెలువడిన, 900 పత్రికలలో ప్రచురించబడిన, 2600 కథా సంపుటాలలో, 400 కథా సంకలనాలలో చేర్చబడిన   86వేల కథల వివరాలు కథానిలయం వెబ్ సైట్ లో లభిస్తున్నాయి. కథానిలయం గ్రంధాలయం కథానిలయం ట్రస్టు నిర్వహణలో నడుస్తోంది.

కథానిలయం వెబ్ సైట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు మనసు ఫౌండేషన్, బెంగళూరు స్వీకరించింది.

ఈ రెంటితోనూ సంబంధం లేకుండా తన స్వంత ధనంతో కాళీపట్నం రామారావు గారు ఆరంభిస్తున్న మూడవ పూనిక ఈ కారాయజ్ఞం అనే పుస్తక ప్రచురణ సంస్థ. దీని బాధ్యత కాళీపట్నం సుబ్బారావు, కాళీపట్నం వెంకట సత్యప్రసాద్, వివిన మూర్తిలకు అప్పగించారు. దీని లక్ష్యం కాళీపట్నం రామారావు గారికి నచ్చిన పుస్తకాలను ప్రచురించటం, వాటిని పాఠకులకు లాభాపేక్ష లేకుండా చవక ధరలకు అందించటం. ఈ ముగ్గురూ కారా సాహితీ అభిరుచుల మేరకు ఈ ప్రచురణలను కొనసాగించుతారు. తొలి ప్రయత్నంగా కారా మాస్టారికి 90 ఏళ్లు నిండుతున్న సందర్భంగా మూడు పుస్తకాల ప్రచురణ జరుగుతోంది.

మహమ్మద్ ఖాసింఖాన్ గారు 1944లో ప్రచురించిన కథానిక రచన మొదటిది.

రెండవది కోర్టుమార్షల్ అనే హిందీ నాటకానికి దాసరి అమరేంద్ర గారి తెలుగు అనువాదం.

1950 లవరకూ కథల మీదా, కథకుల మీదా, కథా వ్యాకరణం మీదా పత్రికలలో వచ్చిన వ్యాసాలు అన్నింటినీ సేకరించిన వ్యాస సంకలనం మూడవది. ఇది కథానిలయం 2015 వార్షికోత్సవం సమయానికి వెలువడుతుంది.

ఇటువంటి ప్రయత్నం కొనసాగాలంటే జనం సహకారం, ఆదరణ ముఖ్యం. ఉత్తమ సాహిత్యం ఉత్తమ సమాజానికి దోవ చూపిస్తుందన్న నమ్మకంతో లాభాపేక్ష లేకుండా కారా మాస్టారు ఆరంభిస్తున్న మూడవ పూనిక ఈ కారాయజ్ఞం ప్రచురణలని బ్రతికించుకునే బాధ్యత జనందేనని విశ్వసిస్తున్నాం.

vivinamurthy

vivinamurthy

-వివిన మూర్తి

త్రిపురా… ఓ త్రిపురా!

వివిన మూర్తి

 

“ఏమిటి నీ ప్రయత్నం?”

“అర్ధం చేసుకుందామని”

“ఎవరిని?”

“—??—”

“ఆయన్నా.. వాళ్లనా.. ”

“అంతేకాదు”

“కాక?”

“చాలా ఉంది. మొత్తాన్ని. రాతని.. చదువుని.. రాయించే చదువుని… చదివించే రాతని.. కమ్యూనికేషన్ని… సాహిత్యాన్ని.. మనిషిని.. నన్ను. ”

“నిన్నా?”

“అవును. నన్నూనూ”

****

“విశాఖపట్నం అంటే సముద్రం”

“కాదు. రాచకొండ. ”

“ఛఛ 13 నంబరు బస్సు.. కేజీహెచ్ అప్పు.. ”

“తెన్నేటి విశ్వనాధం.. అబ్బూరి.. ”

“సింగు హోటలు.. సొంటి బిస్కట్లు”

“కాదు కాదు.. కనక మాలక్ష్మి.. యారాడ కొండ”

“కిట్టటం లేదోయ్.. పాత ఇశాపట్నమా.. ”

“ఇచ్చట మార్గము మూయబడెను.. మార్గమును వెదుకుడి.. ”

****

“హోటల్లో చదివావా?”

“కాలేజీలో చదివాను. ”

“బీట్ రూట్ లాంటి దిబ్బకుర్రాడు దోసిని తినీసి పెసరెట్టుని తడమటం. తెలుగు సినిమా హీరో ఓ దాన్ని వానలో తడిపేసి.. మరోదాన్ని మంచులో ఎక్సర్సైజులు చేయించి.. డాఫర్ పని చెయ్యటం.. ”

“సంబంధం లేదు”

“స్టేట్మెంటా..? నీక్కనపడలేదు”

“చూపించొచ్చుగా”

“చూసిన నీకే కాపడనప్పుడు.. నానేటి సూపించేది”

“ఏంటీ న్యూసెన్సు!!! ”

“ఇమిటేషను బాబూ.. తమాసకాలు కాదు.. ”

“బొంగేం కాదూ.. ”

“ప్యూర్ కాకపోవచ్చు”

“పూర్ కూడా కాదు.. నీ పద్దతిలో నువ్వేడు”

“నా పద్దతా అదేంటది?”

“వాస్తవం.. రాత ద్వారా వాస్తవం.. ”

“నాకలాటి భ్రమలు లేవు. రాతలో ఉండేది వాస్తవ భ్రమ.  కల్పన.”

“వాస్తవం ఉండదా”

“అద్దంలో ఉండేది నువ్వా?”

“కొండలున్నాయి. వాటి మధ్యలోంచి సూర్యుడు పొడవటం ఉంది. సముద్రం ఉంది. ఆ అలల మీద కిరణాలు పడటం.. వీటిని పడవలు చెదిరించటం ఇదంతా.. వాస్తవమే.. ”

“లేదు. భూమి తిరగటమే వాస్తవం.. ”

“రాతలో ఇదంతా నీ కళ్లకి కట్టిస్తాను. నా మనసుకి పట్టిన ప్రతి అనుభూతినీ.. తట్టిన ప్రతి ఊహనీ.. నీ మనసులో పుట్టిస్తాను.. ఇదంతా వాస్తవం కాక.. ?”

“కాదు. ”

“మరి వాస్తవం ఏమిటి?”

“అదేదో నువ్వు చెప్పాలి”

“నేనా?”

“అవును. ఆయన గురించి రాయాలన్న నిర్ణయం నీది. వాస్తవం – కల్పన అన్న ఆలోచన మెదడున పడ్డది నీకు. దానిని కనటం నీ బాధ్యత.. ”

“వెల్లువలో పూచిక పుల్లలు.. మృత్యుంజయుడు.. అల్పజీవి..అసమర్ధుని జీవితయాత్ర.. హిమజ్వాల.. బుచ్చిబాబు.. చంద్రశేఖరుడు.. మార్క్వెజ్.. సాల్ బెల్లో.. వేణు.. ”

మిత్రబృందంలో త్రిపుర

ముందు వరస 1.అత్తలూరి 2. త్రిపుర 3. భరాగో 4. భైరవయ్య 5. కాళీపట్నం
వెనక వరస 1. ఆదూరి సీతారామమూర్తి 2. అల్లం శేషగిరిగావు 3. అబ్బూరి గోపాలకృష్ణ 4. ఎయస్వీ రమణారావు 5. వివిన మూర్తి

“ఆపాపు.. లిస్టు పెద్దదే.. లింకు తెలీటం లేదు.. ”

“అర్ధం కాకపోటమే లింకు.. అర్ధమయూ కాకపోవటమే సంబంధం.. తరతమ భేదాలు.. స్వపరాలు.. ”

“ఏభై ఏళ్లకి పైబడి చదూతున్నావు.. ఏదో ఒకటి గిలుకుతున్నావు.. అర్ధం కాదంటం పొగరు కాదా.. వాళ్లని అవమానించటం కాదా.. నువ్వు గిలికీదీ అర్ధం కానివాళ్లు చాలామంది.. ”

“ఇంగ్లీషున రాసింది అర్ధం కావాలంటే ఇంగ్లీషు రావాలి.. రాదనటం పొగరెలా అవుతుంది.. మహా అయితే సిగ్గు పడాలి.. ఒప్పుకోటానికి కాస్త ఖలేజా ఉండాలి.. లేకపోతే వినాయకుడి బొడ్డులో వేలే.. అది నాకు గాని వాళ్లకి గాని అవమానమూ గాదు.. సన్మానమూ కాదు.. ”

“ఇంగ్లీషు నేర్వొచ్చుగా.. ”

“ప్రయత్నం చేసా. పట్టు దొరకలేదు”

“అసలు కొందరెందుకు అలా రాస్తారు?”

“కొన్ని వివరణలున్నాయి. ఒక ఎఫెక్టుకి అనేక కాజెస్ ఉంటాయి. అనేక చర్యలకి ఒకే ఫలితం ఉండవలసిన అవసరం లేదు. ”

“అన్నీ చెప్పు”

“పొడుగైపోతుంది. పలచనై పోతుంది”

“నువ్వేప్పుడైనా ప్రచురణ గురించి పొడుగు పొట్టిల గురించి .. ”

“రాయటం మొదలు పెట్టేముందు తనేం చెప్పదలుచుకున్నదీ రచయితకి స్పష్టత ఉంటుంది. అంటే ఆ విషయంలో అతను కాన్షస్ అనవచ్చు. ”

“పాత్రను సృష్టిస్తున్నపుడే నూతిలో పడాలా ఉరేసుకోవాలా అన్నది రచయిత నిశ్చయించేసు కుంటాడంటావు. ”

“కాదు. ఓ క్లిష్టస్థితి నుంచి ఓ స్వభావం కలిగిన పాత్ర లేదా సమూహం బైట పడాలన్నది రచయిత కలం పట్టేముందే మనసులో ఉంటుంది. బయట పడటానికి చంపాలా చావాలా పారిపోవాలా అన్నది కథ రాస్తున్నపుడు మారే అవకాశం ఉంది. చనిపోవటానికి రచయిత అనుమతించితే నుయ్యా, ఉరా, ఎండ్రినా, గార్డినలా అన్నది చాలా చిన్ని సమస్య.”

“ఇలస్ట్రేట్ చెయ్యి”

“చావు అన్న కథలో ఓ గుంపు ఓ ప్రత్యేక పరిస్థితి నుంచి బయటపడాలన్నది రాత ఆరంభించేసరికే కాళీపట్నం రామారావు నిర్ణయం. దానికి జొరావరీగా పుల్లలు కొట్టటం కూడా అతని రచనాపూర్వ నిర్ణయం అయుండాలి. రెండవ నిర్ణయం వెనక రచయిత కన్విన్స్ అయిన న్యాయమో, తాత్విక భావజాలమో అలాంటిదేదో ఒకటుంటుంది. ”

“వద్దొద్దు. నీ వ్యూ పాయింట్ కి సార్వత్రికత ఉందీ అంటే ఈయన కథల నుంచే చెప్పాలి. కొంపదీసి కథలే కావంటావా?”

“నిస్సందేహంగా కథలే.. ఏ కథా.. ?”

“అర్ధం కాలేదంటున్నా అన్నీ చదివావుగదా.. ఒక్కటంటే ఒక్కటి నీ ఇలస్ట్రేషన్ కి పనికిరాదా”

“అన్నింటినీ ఈ భావనతో వివరించవచ్చు. సరే.. చీకటిగదులు.. ”

“కానీ.. ”

tripura

“భాస్కర్ పోగొట్టుకుని, పొంది, పోగొట్టుకుంటాడు కల్యాణిని. ఆవిడని పోగొట్టుకోటం అనే బలితో గాని సుఖమూ, స్వేచ్ఛా భాస్కర్ పొందలేకపోయాడన్నది ‘నిజమే’ అయితే కటువైనది. ఈ నిజం అన్నది కలం పట్టే క్షణానికే కథకుని మనసులో ఉంది. అందువల్ల పోగొట్టుకోటం కథకుని నిర్ణయం. స్వేచ్ఛ పొందానని భాస్కర్ అనుకోటం కథకుని రెండవ నిర్ణయమే. దాని వెనుక కథకుడు కన్విన్స్ అయిన తత్వమో, న్యాయమో, క్రమమో మరేదో ఉంది. అదేమిటో నాకు అందలేదు. ”

“పోనీ.. మిగిలినవన్నీ అందేయా?”

“నాకందినవి చెపుతాను.”

“?”

“శేషాచలపతి పొలిటికల్ మీటింగ్ కి వెళ్తాడు. అక్కడివన్నీ ‘కొత్వాలీ’ లో రిపోర్టు చేస్తాడు. అంతకుముందు రాసిన కథలు పాఠకుడు చదవకపోతే ఈ విషయం పాత్ర స్వభావాన్ని అందిస్తుంది. అప్రధానంగా కనిపించే ఈ వాక్యం ఓ విధంగా ఈకథకి ‘కీ’. శేషాచలపతికి బాల్యం ఉంటుంది. తల్లిని తండ్రి చంపటం.. ఆ చంపటంలోని క్రూరత్వం ఓ వాక్యంలో దాచుతాడు కథకుడు. ‘ఆ పూజాగృహంలో, నాన్న అమ్మని చంపి, వూడిపోయిన పన్నుని అరచేతిలో పట్టుకుని చూసుకున్నాడు-’.. కథ భవిష్యత్తు సూచించే ఓ శక్తి మరో వాక్యంలో.. ‘అతడి దోవలో తగిలినవాళ్ల జీవితాల్లో ఒక మలుపు తిప్పిస్తాడు. అతని ధాటికి నిలవటం కష్టం’. ‘రంగు’ సంగతి భాస్కర్ నోట చెప్పిస్తాడు. ‘నేను’ ‘నాది’ బంధాలే కాదు. బాధ్యతలు.. ’ ‘అవును జీవితం బద్దలయేవుండేది’ అంటాడు ఓల్డ్ స్మగ్లర్ ఇటుకల్లాంటి మాటలకు ప్రాణాలు పోస్తుంటే.. ‘మిగతా అంతా సిన్నింగ్ ఫ్లష్ .. ’ అంటున్నపుడు నవ్వులో అమాయకత్వం కళ్లలో క్రూరత్వం పెట్టుకున్న శేషాచలపతి ముందు అడ్లూ, ఆటంకాలూ తొలగించింది కథకుడా.. ఓల్డ్ స్మగ్లరా.. శేషాచలపతేనా.. ?”

“ఇన్ని అందాక కూడా రచయిత విశ్వసించిన తత్వం.. అందలేదా.. ”

“విశ్వసించిన అనటం నాకు ఇష్టం లేదు. అందరూ కాఫ్కా అంటారు గదా.. ఇన్ ద పీనల్ కాలనీ చదివి చలించిపోయాను. మెటమార్పసిస్, ద ట్రయల్ వంటి ప్రసిద్ధాలు చదివానో లేదో గుర్తులేదు. కాని ఆయన ప్రభావం మన కథకుని కథలలో కనిపిస్తుంది. తండ్రీ-కొడుకు సమస్య.. మార్క్వెజ్ అన్నట్లు కాఫ్కాను చదివాక “that it was possible to write in a different way”… ”

“సరేనయ్యా అందరికీ తెలిసినదే గదా.. ”

“అన్నీ అందరికీ తెలిసినవే గనక .. నాకెందుకు అనుకోవాలంటే మూసేస్తాను.. ”

“సరే సరే నీ గోలేదో నువ్వేడు.. ”

“అబ్సర్డిటీ .. తెలుగులో ఎవడేమంటాడో నాకు తెలీదు.. అసంబద్ధతని కాఫ్కాని కలపటం ఉంది.. కన్నడ సాహిత్యంలో ఇది గుర్తుపట్టగలిగేంత కనిపిస్తుంది.. జీవితానికి అర్ధం లేదని చెప్పే అర్ధం కొందరికి గట్టిగానే పడుతుంది .. ఎందుకు.. అన్నీ తెలిసాక కూడా ఏమీ తెలియకుండా పోతోందనిపించటం వల్లనా.. ఎక్కడో అది కేపిటలిజాన్ని.. అంటేటీ.. జనం బాధలకు కారణాన్ని .. కాదంటుందని కొందరు… వాస్తవాన్నే నిరాకరిస్తుందని కొందరూ.. మార్క్సిస్టులే గట్టిగా వాదించుకునేదాన్ని.. సాహిత్య ప్రతిఫలనంలో.. త్రిపుర వంటి వారు.. కథకులే కారేమో అనిపించే కొందరి.. రచనా లక్ష్యం ఏంటి.. చీకటిగదులలో జీవితపు అసంబద్ధత చూపించటమా.. తనని తను ఎలాంటి purposeనీ లక్ష్యాన్నీ మనసులో ఉంచుకోకుండానే వ్యక్తం చేసుకోటమా.. పెద్దాయన రచన.. వాస్తవం నిరాకరణ కోసం కల్పనా.. కల్పన సొగసు కోసం వాస్తవ నిరాకరణా.. రచయిత కల్పనలో ఉద్దేశిత ఉద్దేశ్యం లేకుండానే వాస్తవాన్ని – పాఠకులని.. ప్రభావితం చేస్తుందని ఇంత స్పష్టంగా తెలిసాక .. రచయిత బుర్రలో ఏమున్నా మానినా అతని కల్పన వాస్తవాన్ని కొట్టిపారేసినా.. అది వాస్తవాన్ని వాస్తవంగా ప్రభావితం చేస్తే.. అందులోనూ సామాజిక ప్రయోజనం గాళ్లని .. ఉందనుకునే వాళ్లని.. ఊపేస్తే.. ”

“…………………”

“పన్ను వూడితేనే సలుపు పోతుంది. కల్యాణి పోతేనే స్వేచ్ఛ.. రామాయణానికి ప్రేరణ జంట విడిపోటం లోని దుఃఖం .. దానిలోని సుఖం ఈ కథకి ప్రేరణా.. సుఖానికి రచయిత నమూనా అలక్ నిరంజన్ యా..సుఖం పట్ల అసంతృప్తా.. సంశయమా.. ”

“అదేదో నీకు అర్ధం కాలేదా.. కథకునికి కూడానా.. ?”

“భగవంతం కోసం .. హోటల్లో .. కెజిహెచ్ ఎంట్రన్స్ ఎదురుగా .. పద్మా నివాస్ అనే గుర్తు.. బుర్రలో తిరిగింది.. అది చదివీ, చదివీ .. వాస్తవం, కల్పనల మధ్య.. బుర్ర తిరిగింది కాని కరగలేదు.. ఎదగలేదు .. అసలది చదవి, వేసిన .. సబ్బు.. కి ఏటి బోద పడిందో నాకైతే కనపడ్డవి కనబడ్డాయి గాని.. బోద పడనేదు.. ఏబైయేళ్ల క్రితం అందులో ఉన్నదేదో .. ”

“దానికి కాలం ఏమిటి?”

“నిరీక్షణకా? మెదలవటానికా? అట్నుంచి ఏడులోనూ.. ఇట్నుంచి పదమూడులోనూ రాని భగవంతం రాటానికి.. ”

“నీకు భాష్యకారులు కావాలి.. ”

“వాస్తవానికి అక్కరలేదు.. సుబ్బారాయుడి రహస్యజీవిత మంత బహిర్గతంగా ఉంటే ఎందుకు?”

“కొన్నింటికి ‘కీ’ అక్కరలేదంటావు”

“కొందరికి కావాలి”

“అందరికీ వకాల్తా ఎందుకు?”

“ఐతే కాసుకు..జైలురోడ్డుకీ సింగుహొటలుకీ మధ్య.. అట్నుంచి కుడివైపు వీరాస్వామి.. ఎడంవైపు నేను.. జర్కన్ వద్దని.. బర్మా కార్గో పడవల పెత్తన ప్రపంచం నుంచి .. నిన్నటి వరకూ తనకిందే పనిచేసిన మనుషుల్తో కలిసి.. మురికి వాడలో.. కుళ్లు కంపులో.. ఎలక్ట్రిక్ దీపాలకోసం అరుస్తూ.. నాస్తిక సమాజం కావాలి రావాలి.. పైసా ఇయ్యి పేరు చెపుతా .. వెంకట్రావు కొడుకు.. ప్రభ పుటల్లోంచి.. ”

“నీకూ భాష్యకారుడు కావాలంటావు.. ”                                                                                                                                            tripura_336x190_scaled_cropp

“అది భాష్యకారుడి కథవుతుంది.. నీకథ ఎక్కాలంటే.. నీ ఏడుపు సంగీతం కారాదు.. ”

“అయిందేమో.. ”

“ఎందుకవదూ.. వానవానగా బాంబులు కుర్దుల మీద కరుస్తుంటే కవనశర్మ ఇరాక్ వాసులు.. వాన తగ్గింది పదండి కూరలు కొనుక్కుందాం.. బజారు చేసుకుందాం.. తొడతొక్కిడి.. టేక్ బహుదూర్ .. పదకొండు ద్వారాలు తెరిచి.. ఓ చాయ్ చిన్నారిని మూసి.. మార్ఫియా వద్దు.. బిస్కట్లు కావాలా.. కర్నాటక ఆంద్రా స్వతంత్ర దేశాలై.. మదనపల్లి బోర్డర్లో తుపాకీగుళ్ల వర్షంలో .. టీ.. చాయ్.. టీ.. చాయ్.. దానికి అక్కరలేని వీసా నీకెందుకు వచ్చెయ్ వివినా అంటూ ఆటునించి వల్లంపాటి.. నాదగ్గర వీసాలేదు.. నాకోసం పన్నెండు ద్వారాలు తెరవటానికి నువ్వు టేక్ బహుదూర్ కాలేవు వల్లంపాటీ.. ఉండుండు.. గాజీ మునిగి పోయింది.. నిస్సార్ సబ్ మెరీన్ రెస్క్యూ షిప్ పంపాలి.. పధండి.. నిద్ర లేవండి.. వైర్లు పీకేసి పని ఆరుగంటలది రెండు గంటల్లో.. డ్రైడాక్ డోర్లు తెరుచుకుంటూ నీరు వదులుతుంటే.. ఓడ కూర్చున్న దుంగలు కదిలి కూలుతున్న శబ్దం.. నెమ్మదిగా సముద్రాన్ని కావలించుకుని హుషారుగా తెల్లారగట్ల మూడుగంటల ప్రాంతంలో డాక్ జట్టీ మీద డాంగ్రీలలో వెళ్తున్నవాళ్లకి చెయ్యూపుతూ నించున్న దృశ్యం.. తిరిగి వస్తారా ప్రశ్నల మొక్కలు తలలో ఎదుగుతుంటే పీకేసిన వైర్ల చుట్టల మధ్య సిటిసి సేవిస్తూ.. ”

“నీకు బాధ్యత లేదా?”

“గొలుసులు గొలుసులుగా జ్ఞాపకాలు వరదలా పొంగుతుంటే.. ఏ కాజ్ ఏ ఎఫెక్ట్ విచికిత్స కొట్టుకుపోతుంటే .. తెగిపడ్డ బాధ్యతలకి సానుభూతి చూపించగలను గాని.. బాధ్యత వహించను. ”

“నువ్వెవరివి?”

“ఈ క్షణానికి ఓ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఛాన్సు వచ్చిన నారాయణావతారాన్ని. ద్వారం కనిపించక సముద్రాన్ని ద్వారం చేసుకున్న నువ్వుని. ”

“చెప్పు చెప్పు”

“నారాయణకి కనుపించని ద్వారాన్ని కనుగొన్నవాడిని.. ప్రపంచమంతటా లాసా మొనెస్టరీలో.. కింబర్లీ వజ్రపు గనులలో బ్లాక్ ఫారెస్టులో.. నీచేల వాల్మీకిలో.. స్మగ్లర్ లో నన్ను చూసుకున్నవాడిని.. ఇక్కడ ఈ ఆస్తి.. సంతకాలు.. తల్లీ తండ్రీ.. అక్కా చెల్లీ వెదుకులాటలో.. యవ్వనం, దేహం.. వారసత్వాన్ని తెగ్గొట్టాలని.. తీర్ధపురాళ్ల మీంచి.. కోస్టల్ బాటరీ పక్కన నువ్వు ఉరికిన రాత్రే .. ఆ రాత్రే.. ఆఖరురూపాయ.. ఆకలి రూపాయ..ద్రోణంరాజు చలపతిరావు అనీ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఒక్కటి ఒకే ఒక్కటి ఆకారం దిద్దుకోకపోతే.. ఇది రాయటానికి త్రిపురని చదవటానికి మిగలని వాడిని.. కనిపించని ద్వారం వరకూ వెళ్లి.. కనిపించినవన్నీ నావే.. నేనే.. నని.. వారసత్వాలు తెగ్గొట్టటం కోసం అదే పరిష్కారం అంటూ వెర్రికేకలు వేసుకుంటూ.. పిచ్చిరాతలు రాసుకుంటూ.. ”

“అంతా వ్యక్తిగతం.. టూ పెర్సనస్.. ట్రూ పెర్సనల్.. ”

“పెర్సనల్ అన్నది అసలు ఉందా.. మనం, మనకి ఎదురయీ సమస్యలు.. వాటికి పరిష్కారంగా కలిగే ఆలోచనలు వాటికి రూపాన్నిచ్చే శబ్దాలు.. సంకేతాల భాష అన్నీ సమాజ ఫలాలే.. ఫలితాలే.. మరోలా చెప్పాలంటే నువ్వుండటం వల్లా మరెందరో ఉండటం వల్లా ఎవరెవరో రాసినవి చదవటం వల్లా.. ”

“మరి వంతెనలు ఎందుకూ.. ?”

“అదీ అసలు ప్రశ్న.. అందులో ఉన్నది త్రిపురే కాదు.. నేనూనూ.. మేం ట్రైటర్సుం.. మేమున్నచోట ధనం ఉంటుంది.. దాన్ని వదులుకోగలం.. అసహ్యించుకోగలం.. జేబులో రాజీనామాలు, గార్డినల్ మాత్రలు, రివాల్వర్లూ అన్నీ మావైపే గురి పెట్టుకోగలం.. రాజూ ఏ పసిబిడ్డల భావి శాంతి స్వప్నాలలో మనిషి కోసం వెక్కివెక్కి ఏడుస్తావ్.. ఏడుస్తూ ఏ ఆయుధం పట్టుకుంటావంటూ మొత్తకుంటాం.. రాజు గురి మారదు.. మా గురి మా గుండెలకి తప్పితే మా మెదడుల మీదకే ఎక్కుపెట్టబడి ఉంటుంది.. అయినా ఆశ.. మేమూ రాజూ ఏ వంతెన మీదైనా కలుసుకుంటామన్న ఆశ.. అందాకా మమ్మల్ని మన్నించమంటూ వేడుకోలు.. మమ్ము తిరస్కరించొద్దని కైమోడ్పులు.. వంతెన ఉందనే మా నమ్మకం.. కాని గురి మారదు.. అతని గురి వేరు.. మాది మాత్రం మావైపే.. నిద్రమాత్రలతో, భర్కీ, రివాల్వర్ నాకోసం నావైపు మృదువుగా మెత్తగా ఎదురుచూస్తుంటే మధ్య పురంలో త్రిపురా.. నేనూ.. ”

“సఫర్ .. ప్రయాణం జరగదా?”

“నడుస్తూనే ఉంటుంది.. రాజు ప్రశ్న వేస్తూనే ఉంటాడు.. ఎందుకంత విషాదం అంటూ.. జవాబుల కోసం మేధావి జీవితంలో.. చీకటి గదుల్లో దొరుకుతుంది.. ప్రవేశించు.. చీకట్లో కనిపించదు.. గదుల్లో చిక్కడి పోతావు కాకుండా పోతావు.. బయట ప్రపంచంలో ఓపెన్ నక్సలైట్ గా అన్నీ వదులుకుని.. లోపలికా బయటకా.. నీ సఫర్? జూడాస్ వి కాగలవు గాని కావుగదా.. ”

“సఫర్ ముగుస్తుందా?”

“ఎలా… కనిపించని ద్వారం లోంచి వంతెనల మీద సఫర్ అభినిష్క్రమణతో కూడా మలుపు.. త్రిపుర రెండవ పురం.. నా మటుక్కు నాకు ప్రధానం.. మొదట జ్ఞాన సేకరణతో.. సేకరించిన జ్ఞానంతో గొడవ.. రెండో దానిలో ఆచరణ ముందు వంగిన తల.. ఆచరించే రాజు ఆచరణ ప్రశ్నల బాణాల ముందు .. వివాహ వ్యవస్థలో సుశీల ప్రేమ స్వంతం..గృహం గృహిణి.. మరి విమల? ఉంటుంది.. జరుగుతుంది.. బయట ఇళ్లంటుకుని.. దేశం దుర్గంధ భూయిష్టమై.. కన్నీళ్ల పర్వతాలను దొర్లించుకుంటున్న చీమల పుట్టల మధ్య.. విమల సాధ్యమా.. సాధ్యమే.. సుశీలా ఎలా ముడెయ్యను మన పిక్నిక్ ముగిసిపోయింది.. అభినిష్క్రమణ కదా ఇది.. రాజూ.. నిన్ను సందేహాలు అడగలేను.. నా ప్రశ్నల కత్తులతో నన్ను నేను చీల్చుకోకుండా ఉండలేను.. బై.. ”

“మూడో పురం.. ?”

“మాలోని అత్తలూరులు చలించి.. ప్రపంచాన్ని చేర్చి.. నువ్విదని.. నీదిదనీ.. నువ్వే ఆహ్వానించని దేన్నో నీముందుంచి.. నీ చుట్టూ ఆరాధకులకి చోటు పెట్టి.. ఎనిమిదేళ్ల ఎడంలో.. ఇంకా ఉన్నానా.. ఓ వాన సాయంత్రం.. సైకిలు కొట్టులో.. సీలలు ఇంకా లూజే.. గ్రీజు వదలదు.. బురదలో కాలు పెట్టకుండా ఉండలేవు.. ఇది అసలు ప్రపంచం కాదు.. కాపీ, నకల్, కౌంటర్ ఫీట్.. మెదడు మడతల్లో డిజార్డర్ చూడు.. డిజార్డర్ లోని ఆర్డర్ కనిపెట్టు.. డాక్టర్ జాన్ పి జాన్ – నీకేం రోగం లేదు బొద్దింక గుర్తింపు.. కుక్క గుర్తింపు కనిపెట్టి కథకట్టే మూర్తీ నీకిలాంటి ఆలోచనలు ఎలావస్తాయి.. నీకు డిజార్డర్ ఏంటి.. ఆర్డర్ లేని ప్రపంచంలో ఆర్డరుందనే వాళ్లలో నారాయణ నట్టులోంచే .. తండ్రి.. ప్రభువు.. సర్వవ్యాపి.. ఎక్కడున్నాడో .. వస్తాడు.. నీచెయ్యి పట్టుకుంటాడని నమ్మవు పట్టుకునీవరకూ.. ”

“మూడోపురంలో నువ్వు లేవా?”

“కౌంటర్ ఫీట్, నకల్, కాపీ ఎక్కడినుంచి వస్తాయి ఒరిజినల్ లేకుండా.. రూపు లేని రాజు చూపూ.. దూరంగా తనలో తనే గొణుక్కునే మూర్తీ.. కల్పనతో కరాలు మోడుస్తున్న వాస్తవ ప్రపంచం ఆరాధకులూ.. ఒరిజనల్ కదా.. ఆ చూపు.. ఆప్రశ్నలు .. చచ్చిపోయాయా.. తుప్పు తుడిపించు.. గీసి పారెయ్.. నట్లు బిగించు.. ఆయిలింగ్ చేయించు.. –ఇవ్వన్నీ ‘పైనే’ – జీవితంలోంచే, ఒరిజినల్ లోంచే కొంటర్ ఫీట్లూ పుడతాయి.. అది గుర్తు పడితే ఒరిజినల్ కుట్ర అవదు. నకలు అన్న ఆలోచనే కుట్ర అవుతుంది. ”

“ఇదీ ఆయనదేనా?”

“నేకపోతే నా పైత్యమా.. నా జొరావరీయా?”

“తేడా తెలీటం నేదు బాబూ”

“తెలాలా?”

నాటి-నేటి త్రిపుర

నాటి-నేటి త్రిపుర

“తెలవాలనీ,  తెలపాలనే గదా నీ ఏడుపు…… ఈ ఏడిపింపూ ”

“ఏడుపా.. కాదే.. ప్రయత్నం.. ఒరిజినల్.. ”

“తేడా ఏంటో?”

“నేనంటే రెండు మనుషులని యిప్పుడిప్పుడే తెలుస్తోంది.. కావాలంటే భగవంతం సంతకం చూడు.. ఒకరినొకరు వెతుక్కుంటూ.. తప్పించుకుంటూ.. ఒకరికొకరు ఎదురైనా గుర్తు పట్టీపట్టనట్లుగా.. ”

“లాభాల గూబల్రాయుడూ నువ్వేనా వలసపక్షీ”

“ఒకవేపే పక్కమీదే మూడు సంవత్సరాల పడుకున్న తర్వాత రెండోవేపు తిరిగి పడుకోటానికి ఉపక్రమించేటపుడు సహజంగా, సంతోషంతో ఎంతో సుఖంగా తేలిగ్గా నిట్టూర్చే వరదరాజులూ.. ఎప్పుడూ ఒకవేపు పడుకోక క్షణంక్షణం మెసిలే నేనూ.. హహ్హహ్హ.. ”

TripuraKathaluPrintBook

“మరినువ్వు?”

”గారబంధ ఆయన్ని గుండోల్లోకి తీసుకున్నవాణ్ణి పెద్దపెద్ద ధియరీలు నాకొద్దు- అతనే నా అంతరాత్మ- నారక్షకుడు.. నా దిగులుకు కారణమూ విరుగుడూ”

“భగవంతం?”

“ఏడేళ్లు ఒక వాక్యాన్ని సరిదిద్దుతూ తెలుసుకున్నది భగవంతం ఒప్పేసుకుని సంతకం పెట్టేసాడు గదా.. ”

“నిజమే గాని-”

“ఒకే ఒక కథని. కుప్పిలి సుదర్శన్ పిల్లిగడ్డాన్ని .. పాలకొండ గ్రంధాలయంలో .. విపుల పాము కరిస్తే.. దాంతో ఇరవై జతల కళ్లని కరపించితే.. పది జతల పెదాలు అర్ధంకాలే అంటే.. ఆరు బుర్రలు ఆంగ్లంకి అను.. అనుమానం చూపుల్తో.. నాలుగు జతల కళ్లు ఉన్మత్త ఉద్విగ్నతతో.. పాము మాజండా జైజై కొట్టి .. అవునవును సాధ్యమే ..ఎప్పుడో  డొస్టోవిస్కీ నేరానికి 67లో మొదలైన శిక్ష ఈ కథాకారాగారంలో ఎవరెవరు ఏఏ పిచ్చి పిచ్చి ఏడుపులతో కాగితాలని పాడుచేసారని లెక్కించుకుంటూ అనుభవిస్తూంటే.. త్రిపుర రామయ్య రాస్తే రాయండి చెక్కొద్దని గొణిగితే .. అసహనం ఫోనుముక్కు మీదనుంచి జారిపోతే.. త్రిపురా ఓ త్రిపురా.. అర్ధమయీ కాని తెలుగు త్రిపురా.. ”

“ఏంటి డౌటు వివినా?”

 “మరేం లేదు గాని త్రిపురా.. నివ్వు ట్రైటరువి.. ”

“నివ్వు కాదేంటి?”

“కాదు. భాషని వాడుకుని దానికి వెన్నుపోటు పొడిచావు. జ్ఞానాన్ని సేకరించి రీసైకిల్ బిన్ లో వేసావు. ‘ఉన్న’ భావనని స్వీకరించి ‘లేని’ భావనగా మార్చేసావు. ‘ఉన్న’ ప్రపంచంలో జీవించి దాన్ని అంతరాత్మ చేసుకుని ‘లేని’ మనుషుల మధ్య అలజడి పుట్టించావు. నువ్వు ట్రైటరువి. బతకటానికే కష్టపడీ ప్రపంచాన్నిమెదడులో మోస్తూ తోచీతోచని ప్రపంచంలో తోపుడుబండి పెట్టుకుని తిరుగుతున్నావు. వాస్తవాన్ని తీసుకుని కల్పనలో వేసుకుని పంచాల్సిన నువ్వు ..వాస్తవాన్నే నిరాకరించే నువ్వు.. నువ్వే ట్రైటరువి.. ”

“వెర్రోడా.. నువ్వూ అంతే.. అక్షరాల గోడల మధ్య సాగని భావప్రసారం కోసం అక్షరాలనే ఆశ్రయించే వాళ్లంతా .. అంతే stabilized అంతటినీ de-stabilize చేయజూసే వాళ్లే వివినా.. పదాల చెకుముకి రాళ్లతో నిప్పు పుట్టించే రచయితలు మనుషులని మాత్రమే కాల్చగలరు.. బండలను కరిగించలేరు. ప్రతి రచనా మనిషిని కాల్చాలనే చూస్తుంది. రైటర్సంతా ట్రైటర్సు కాదనగలవా.. ”

“ మరి రాజు?”

 

 – వివిన మూర్తి