‘అడవిలో చెట్టు కూలింది. ఎవ్వరూ గమనించలేదు. కాబట్టి చెట్టు కూలలేదు !’ అరణ్యకాలలో ప్రస్తావితమైన ఈ తర్కం ఆధునిక క్వాంటంమ్ థీరీలోనూ చర్చనీయాంశమే ! రోమన్ దేవత డయానా వంటిది వేదవాజ్ఞ్మయపు అరణ్యదేవత అరణ్యని. ఆమె గ్రామాలకు రాదు. అడవిలోనే ఉంటుంది. అడవిలో చెట్టుకూలితే అడవిలో నివసించే వారికే చెబుతుంది. అడవిలో చెట్టు కూలుతున్న వైనం పల్లెలకే తెలియనితనంలో నాగరీకులకు ఎలా తెలవాలి? అడవులను చుట్టిన వీరుడు శివాజీ వంటి వారి ద్వారా తెలియాలి. వ్యాసాల ద్వారా, రేఖాచిత్రాల ద్వారా ఆ పని చేసాడు శివాజీ. కొన్నేళ్లుగా పెయింటింగ్స్ వేస్తున్నారు.
ఆయన పెయింటింగ్స్ విషాదాన్ని పలికించవు. ‘అడవిలో చెట్లన్నీ కూలిపోయినా ఒక వేరును ఉంచుతాను. దానితో అడవిని మళ్లీ పునర్నిర్మించుతాను’ అనే అరణ్యని విశ్వాసాన్ని శివాజీ పెయింటింగ్స్ కలిగిస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే మనం కోల్పోయాం అనుకుంటున్న సహజ జీవితం ఇంకా ఉందని చూపిస్తాయి. లేగదూడలు, మేకపిల్లలు తన తోడపుట్టినవారే అని భావించే మాయనెరుగని బాలలను చూపిస్తాయి. గాలికి ఊగే ముంగురులు తూనీగలను అద్వైతంగా చూపిస్తాయి. ఒకటి లోంచే అన్నీ వచ్చాయి అనే సోయగాలను పరుస్తాయి. ఒక పువ్వు పరిమళిస్తోంది అంటే, దాని వెనుక ఒక చిటారు కొమ్మ ఉంటుంది, నిటారు కాండం ఉంటుంది. వేర్లుంటాయి. నేల ఉంటుంది. పరిమళాలు వెదజల్లే పెయింటింగ్స్ వెనుకా అంత కథ ఉంటుంది. జర్నలిస్ట్, వ్యాసకర్త, కథకుడు, నవలాకారుడు, పర్యావరణ ప్రేమికుడు, చిత్రకారుడు అయిన శివాజీ తాత్వి‘కథ’.
.........................
శివాజీ, బాబర్ లాంటి వాడు. తైమూర్, చంఘిజ్ఖాన్ల రక్తాలు బాబర్లో ప్రవహించేవి. మాతామహుడు మొక్కపాటి నరసింహశాస్త్రి, పితామహుడు తల్లావఝ్జల శివశంకరశాస్త్రిల రక్తాన్ని శివాజీ పంచుకు పుట్టాడు. చేత వెన్నముద్ద అన్నట్లుగ చిన్నప్పుడే సుద్ద వక్కలను పట్టాడు. తాను చదువుతోన్న ఒకటి రెండు వాచకాల్లోని బొమ్మలను అలికిన నేలమీద పరచేవాడు.
శివాజీ ఏకవర్ణ విహారానికి తాతయ్య తల్లావఝ్జల శివశంకరశాస్త్రి రంగుల చాక్పీస్లను సమకూర్చారు. తాతయ్య ఆనాటి సారస్వత లోకానికి ‘సభాపతి’ కదా! వారిని కలిసేందుకు నోరి నరసింహశాస్త్రి, కాటూరి వెంకటేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి పెద్దలు తరచూ ఒంగోలు వచ్చేవారు. తారే జమీన్ పె, అన్నట్లుగా ఇంటిలో నేలంతా పరుచుకున్న బొమ్మలు వారిని పలకరించేవి. బొమ్మలు దాటడం కష్టంగా ఉంది అనుకుంటూ అంగలు వేసుకుంటూ తాతయ్య గదికి వెళ్లేవారు. చిత్రకారుడు కన్పించకపోతే ‘బొమ్మలు వేసే కుర్రవాడు’ ఏడీ? అని అడిగేవారు. ‘‘బొమ్మలు వేసే కుర్రవాడు" అనే మకుటంతో శివశంకరశాస్త్రిగారు బాల శివాజీపై ఒక కవిత రాసారు!
ఒంగోలు ముని సుబ్రహ్మణ్యంగారు గురజాడ అప్పారావు స్నేహితుడు. ముని, ముని మనుమడు శివాజీ క్లాస్మేట్.
‘తొలి ప్రతిలో రంగూ రాగమూ లేని మధురవాణి, ఇప్పుడు జీవంతో తొణికిసలాడుతోంది. నేను మధురవాణి వ్యామోహంలో పడిపోయాను’ అని గురజాడ ముని సుబ్రహ్మణ్యంకు రాసారు. శివాజీ బొమ్మలేసే కుర్రవాడుగా ఒంగోలులో గోలగోలగా ఉంది కదా! మా ముత్తాత బొమ్మ వేయరా అన్నాడు స్నేహితుడు. ‘తాను వేసిన తొలి పోర్ట్రయిట్ ముని సుబ్రహ్మణ్యంగారిదే’ అంటాడు శివాజీ. ఆ తరువాత పోర్ట్రయిట్స్ వైపు వెళ్లలేదు.
మాతామహుడు ‘బారిష్టర్ పార్వతీశం’ విఖ్యాతుడు మొక్కపాటి నరసింహశాస్త్రి ఇంట, పిఠాపురంలో, శివాజీ అన్ని కాలాల సెలవులూ గడిపాడు. 1952లో ఒంగోలులో జన్మించిన శివాజీ డిగ్రీ వరకూ ఒంగోలులోనే చదివారు. ఇద్దరు తాతలు శివాజీలోని ఆర్ట్ ఇన్స్టింక్ట్ను గమనించి వరల్డ్ ఆర్ట్ను పరిచయం చేసారు. ఆయా పుస్తకాలు ఇచ్చేవారు. వి.ఆర్. చిత్ర 1945 నుంచి 49 వరకూ తెచ్చిన ‘శిల్పి’ అనే పత్రికలు, డి.సి. గంగూలీ ‘రూపమ్’లను పేజీలు నలగకుండా, అంచు మాత్రమే వేలికి తగిలేలా తిప్పివేస్తూ వాటిని చూపులతో తాగేసాడు.
********************
ఒంగోలు నుంచి 1974 ప్రాంతాల్లో తిరుపతి వెళ్లారు. శ్రీనగర్ కాలనీలో కజిన్ సిస్టర్ ఇంట్లో ఉన్నారు. అదే కాలనీలో నివసించే మధురాంతకం రాజారాం, నేదునూరి కృష్ణమూర్తి, ఆచంట జానకిరామ్ - శారదాదేవి, వడ్డెర చండీదాస్ వంటి పెద్దలతో సత్సాంగత్యం. వారితో సాయంకాలపు నడక. రోజూ కపిలతీర్ధ సందర్శనమ్. ఆచంట జానకీరాం ఇంట దేవీప్రసాద్రాయ్ చౌదరి, నికొలస్ రోరిక్ల ఒరిజినల్ చిత్రాలను శివాజీ ‘రీడ్’ చేసారు. తన తదనంతరం ఈ బొమ్మలు నీవే అనేవారట శివాజీతో ఆచంట. వారి వారసులెక్కడున్నారో... ఆ ఒరిజినల్స్ ఉన్నాయా?! ఆనంద కుమారస్వామి, కజిన్స్ వంటి విఖ్యాత చిత్రకళావిమర్శకుల వ్యాసాలు ఆచంట ఇవ్వగా చదివారు.
బొమ్మలు వేసే కుర్రవాడు, బొమ్మల వెనుక కథలను తెలుసుకుని తిరుపతి నుంచి మెడ్రాస్ వెళ్లారు. డిగ్రీ ఉంది. ఉద్యోగం కావాలి. డాక్టర్ వి.ఎన్. శర్మగారు మెడ్రాస్లో కిండర్గార్టెన్ స్కూల్ పెట్టారు. ఆయన్ని జర్మన్ శర్మగారు అనేవారు. ఆయన పిల్లలకోసం ఎన్నో బుక్స్ తెప్పించేవారు. చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెబుతూ శివాజీ ఆ పుస్తకాలను ఆనందించేవారు. ఆ రోజుల్లో మెడ్రాస్లో పిల్లల కోసం బుజ్జిబుజ్జి పుస్తకాలు అచ్చయ్యేవి. ఆ రచనలకు ప్రూఫ్ రీడింగ్ చేసేవారు. అమెరికన్ కాన్సులేట్, సిటీ సెంట్రల్, ఫైనార్ట్స్ కళాశాలల్లో చక్కని లైబ్రరీలుండేవి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటలవరకూ నిరాటంకంగా చదువుకునే వీలును సద్వినియోగం చేసుకున్నాడు శివాజీ. సోవియట్ ల్యాండ్, సోవియట్ భూమి పత్రికల్లో బొమ్మలు తనకు నచ్చలేదంటాడు శివాజీ. వరల్డ్ ఆర్ట్ పోకడలను శివాజీ చదివేవారు. వరల్డ్ ఆర్టిస్ట్ల గురించి ప్రదర్శించిన డాక్యుమెంటరీలను కేవలం పావలా రుసుము చెల్లించి చూసాడు.
******************************
బొమ్మలు వేసే కుర్రవాడికి ఈ జ్ఞానం బొమ్మలు వేసేందుకు మరింత ఉత్సాహం కలిగించాలి కదా! శివాజీకి బొమ్మలు వేయాలంటే భయం పట్టుకుంది. దేశవిదేశాల్లో ఇందరు మహానుభావులు, ఇన్నిన్ని చిత్రాలు వేయగా, తానేతీరున వేయాలి? అమ్మో అనుకున్నాడు. మనం ఆస్వాదించడానికే పరిమితం అవుదాం అనుకున్నాడు. ఈ అణగదొక్కిన కోర్కెలు కలలుగా వచ్చేవి. రకరకాల వాసనలను తెచ్చేవి. హేండ్ మేడ్ పేపర్ వాసన. కొత్త ఆర్ట్ బుక్స్ వాసన. వాటర్ కలర్స్ వాసన. పెన్సిల్ వాసన.
వివిధ యూరోపియన్ భాషలు, భారతీయ భాషలు, ప్రత్యేకించి ప్రాకృత భాషలలో నిపుణుడు కదా శివశంకరశాస్త్రి గారు. మెడ్రాస్లో తాతగారిని కలిసేందుకు పెద్దలు వచ్చేవారు. కృష్ణశాస్త్రిగారు కారులో వచ్చేవారు. వారి అబ్బాయి బుజ్జాయి కారు నడిపేవారు. కృష్ణశాస్త్రిగారు శివాజీ తాతగారిని కలిసేందుకు ఇంట్లోకి వచ్చినా, బుజ్జాయి కారునే అంటిపెట్టుకుని ఉండేవారు. పెద్దవాళ్లు మాట్లాడుకుంటుంటే పిల్లలు ఏం చేయాలి? వాళ్ల టాపిక్ వారికి ఉండనే ఉంది. బొమ్మలు! ఆంధ్రనాడు పత్రికలో వెర్రి కథలకు బాపుగారు, బుజ్జాయి గారు బొమ్మలు వేసేవారు. బొమ్మలకోసమే ఆ పత్రికను శివాజీ చూసేవాడు. బుజ్జాయి - శివాజీల సంభాషణల్లో బొమ్మలు ప్రాణం పోసుకునేవి. ఒకసారి బుజ్జాయి శివాజీకి విన్సర్ అండ్ న్యూటన్ బ్రష్ల పాకెట్ ఇచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ ఆ కంపెనీ రంగులు, బ్రష్ల తయారీలో వరల్డ్ లీడరే! విన్సర్ అండ్ న్యూటన్ బ్రష్ల ప్యాకెట్ను ఎన్నిసార్లు నిమిరాడో. నెమలి ఈకలా ఆ బ్రష్ల స్పర్శను ఎంతగా తన్మయించాడో !
బ్రిటిష్ ఇండియాలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద పెన్సిల్ తయారీదారులుగా పేరుపొందిన ‘వి.పెరుమాళ్ చెట్టి అండ్ సన్స్’కు మౌంట్రోడ్లో విక్రయశాల ఉండేది. ఆ షాప్ గురించి శివాజీ కథలుగా విన్నాడు. వి.పెరుమాళ్ చెట్టి, 1840లో చీనాబజార్ లోని బ్లాక్టౌన్లో స్ట్రింగర్స్ట్రీట్లో చిన్న స్టేషనరీ షాప్ను మొదలుపెట్టాడట. 1886లో ఒక చిన్నపాటి ప్రెస్ను కొన్నాడు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే అతిపెద్దదైన ప్రీమియర్ ప్రెస్గా వృద్ధి చేసాడు. మొదటి ప్రపంచయుద్ధం నేపథ్యంలో 1914లో పెన్సిల్ యూనిట్ను కొనుగోలు చేసాడు. స్టార్ ఆఫ్ ఇండియా, అజంతా, స్పెక్ట్రమ్, కోహినూర్ తదితర నూరు బ్రాండ్ల పెన్సిల్స్ను తయూరు చేసారు. దక్షిణ భారత ఆర్ట్ మెటీరియల్ హిస్టరీలో వి.పెరుమాళ్ చెట్టి అండ్ సన్స్ చిరస్మరణీయలు. శివాజీకి ఆ షాప్ మెరీనా బీచ్ కంటే ముఖ్యమైనది. వీలైనప్పుడల్లా ఆ షాప్ను దర్శించేవాడు. ఇప్పుడా షాప్ జ్ఞాపకాల్లోనే ఉంది. 2002లో మూత పడిందిట.
*****************************
1968 నుంచి శివాజీకి హైద్రాబాద్ పరిచయం. 72 వరకూ వచ్చివెళుతుండేవారు. మాక్స్ముల్లర్ భవన్లో డాక్యుమెంటరీలు, కళాభవన్ తదితర ప్రాంతాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ చూసేవాడు. ఆ సందర్భంగా పీ.టీ.రెడ్డి, కొండపల్లి శేషగిరిరావు, జయంత్, ఆరా వర్క్స్ పరిచయం అయ్యారు. 1976 నుంచి శివాజీ హైద్రాబాద్లో నివసిస్తున్నారు. 1977లో ఆంధ్రభూమిలో జర్నలిస్ట్గా చేరారు. చలసాని ప్రసాదరావు, మోహన్ల వద్ద తాను గతంలో చూడని సోవియట్ బుక్స్ను శివాజీ చూసారు. 1980 నుంచి 84 వరకూ జ్యోతి మాసపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేసారు.
జర్నలిస్ట్ సర్కిల్స్లో బాగా ప్రచారంలో ఉన్న కె.ఎన్.వై. పతంజలి జోక్ గురించి చెప్పుకోవాలి. ఉదయం ద్వారా కొత్తగా సబెడిటర్ అయిన ఒక వ్యక్తి ఆఫీసులో ఒక పుస్తకం చదువుతున్నాడు. ‘ఆఫీసులో పుస్తకాలు చదవకూడదండీ, రాయాలి’ అన్నారు పతంజలి. శివాజీ జర్నలిస్ట్గా ఉద్యోగం చేస్తూనే, 1. ఆకాశానికి అటూ ఇటూ 2. ఆ నీలి నగరిలో 3. అదిగదిగో గగనసీమ 4. రంగుల గొంగళి 5. వరదొచ్చింది నవలలు రాసారు. ఓ డజన్ కథలూ, వందలాది వ్యాసాలూ, ఇంటర్వ్యూలూ అచ్చయినవి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ తన రచనలను చదివి, రాంగోపాల్ బొమ్మల్లో వలె నీ రచనల్లో దశ్యం కన్పిస్తుంది, ‘నువ్వు ఆర్టిస్ట్వి’ అన్నారు!
********************
ఉదయం దినపత్రిక ఉదయించినప్పటినుంచి 1995లో అస్తమించేవరకూ శివాజీ జర్నలిజం వృత్తిలో ఉన్నారు. వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా 1977 నుంచి ఇప్పటి వరకూ శివాజీ ఆర్ట్ గురించి, ఆర్టిస్టుల గురించి రాస్తూనే ఉన్నారు. ఇ.బి. హావెల్, వెంకటాచలం, ఆనంద కుమారస్వామి, ముల్కరాజ్ ఆనంద్ తదితర ఉద్ధండులు తమ రచనల ద్వారా ఆర్ట్ క్రిటిసిజమ్లో సమున్నత ప్రమాణాలు నెలకొల్పారు. లలిత కళా అకాడెమీ ప్రచురించిన ప్రామాణిక గ్రంథం ‘లేపాక్షి’ రచయిత ఆమంచర్ల గోపాలరావు, స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో స్కాలర్షిప్తో చదువుతూ, లండన్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ల గురించి 60ల్లో ఆంధ్రపత్రికకు అపూర్వమైన వ్యాసాలు రాసిన నైరూప్య చిత్రకారుడు ఎస్.వి.రామారావు ఆ ప్రమాణాలను కొనసాగించారు. తమ రచనల ద్వారా చిత్రకళా విమర్శ-విశ్లేషణ-సమీక్ష చేసారు. ఆ తరాల తర్వాత, ఆ దారులలో, సమకాలీన ఆర్ట్ను ఆకళింపుచేసుకుంటూ రచనలు చేసిన వ్యక్తి శివాజీ. జర్నలిజం వత్తినుంచి వచ్చిన చిత్రకళా విమర్శకునిగా శివాజీని కళాకారులు, పాఠకులు గౌరవిస్తారు. కొండపల్లి, పీ.టీ.రెడ్డి, వైకుంఠం, లక్ష్మాగౌడ్ తదితరుల గురించి, వారి వర్క్స్ గురించి పత్రికల్లో రాసారు. గోపీ బొమ్మలను చూసి శివాజీ పరవశించేవారు. బాపు తర్వాత ఎవరు? గోపీయే!’ అంటారు శివాజీ ! శివాజీ ఆర్టికల్స్ను జి.కృష్ణ, సామల సదాశివ మెచ్చుకున్నారు.
**************************
తెలుగు పత్రికల్లో కార్టూన్ స్ట్రిప్స్ను హిట్ చేసిన జంట, ముళ్లపూడి - బాపు. ఆ తరువాత అంతగా హిట్టయిన కార్టూన్ స్ట్రిప్స్ను రెండు జంటలు సమకూర్చాయి. ఒకటి శివాజీ - మోహన్! మరొకటి శివాజీ - రాజు ! రెండిటి గీతలు వేరైనా రాత శివాజీదే! దిబ్బరాజ్యం, రాజుగోరు, లింగా ద గ్రేట్లలోని సెటైర్స్ చదివేందుకు పాఠకులు ఎదురుచూసేవారు.
ఉదయం మూసివేసారు. ఇహ ఏ పత్రికలోనూ కొలువులో కుదురుకోకూడదు, చాలు చాలు ఈ సేవ అని తీర్మానించుకున్నాడు శివాజీ. భుక్తి గడవాలి! ఏం చేయాలి? తాను బొమ్మలు వేస్తానని జర్నలిస్ట్ మిత్రులకు, ఆర్టిస్ట్ మిత్రులకూ ఎవరికీ తెలీదు. ఉద్యోగం చేస్తోండగానే శివాజీ ఒక రహస్యోద్యమాన్ని ప్రారంభించాడు. స్వచ్ఛంద సంస్థలకు కొన్ని పోస్టర్స్ వేసారు. పర్యావరణ సంస్థలు వేసే బుక్లెట్స్కు బొమ్మలు వేసారు. ఆ వైనం, తనకూ ఆయా సంస్థల మిత్రులకూ మాత్రమే తెలుసు. ఇప్పుడు తీరిక ఉన్నది. అవసరం ఉన్నది. గతంలో తానే జోకొట్టిన తనలోని 'బొమ్మలు వేసే కుర్రవాడి’ని నిద్దుర లేపాడు!
చిత్రకళలో శివాజీ ఎవరికీ ప్రత్యక్ష శిష్యుడు కాడు. చదివిన పుస్తకాలు, జీవితాలు, చూసిన చిత్రాలు, కలిసిన మహానుభావులు తన గురువులు. ఎవరేం వేసారో, ఎవరేం వేస్తున్నారో తెలుసు కాబట్టి తానేం వేయాలో తర్కించుకున్నాడు. ముందుగా తానేం కాదో తర్కించుకున్నాడు. కార్టూన్లు, క్యారికేచర్లు, ఇలస్ట్రేషన్స్కు తాను దూరం. ఇంతకీ తానేమిటి? తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. ఇష్టాన్ని మక్కువతో కదా తీర్చుకోవాలి. తనకు ప్రకృతంటే మక్కువ. ప్రాణులంటే మక్కువ. వాటి మధ్య అవినాభావ సంబంధం అంటే మక్కువ. ఒక్క మాటలో పర్యావరణం అంటే ప్రేమ. ఇవి తనలో ఉన్నాయి. సో... తనవైన బొమ్మలు వేద్దాం అనే నిర్ణయానికి వచ్చి వర్తమానాన్ని ఆలోకనం చేసుకున్నారు.
పూర్వకాలంలో ఏ విద్యకైనా గురుశుశ్రూష ఉండేది. బౌద్ధంలో బాణకులు ఉండేవారు. క్రీ.శ. 6వ శతాబ్ది నుంచి 11వ శతాబ్దం వరకూ అజంతా-ఎల్లోరాల్లో రూపొందిన వర్ణచిత్రాలు బాణకుల గురుత్వంలో నేర్చుకున్న కళాకారులు రూపొందించినవే. రేఖా బాణక, హింగూల బాణక, రంగ బాణక అని రేఖలు- బ్యాక్గ్రౌండ్-కలరింగ్ తదితర ప్రక్రియలను ఆయా విభాగాల్లో పరిపూర్ణులైన గురువులు నేర్పేవారు. ఆ పరంపర టిబెట్, శ్రీలంక వంటి దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. మనకు శాంతినికేతన్ తొలినాళ్ల తర్వాత ఆ సంప్రదాయం మసకబారింది. లాటిన్ అమెరికన్స్, బ్లాక్స్, ఇరానియన్లు, జపనీయులు ... వీరందరికీ స్వంత గొంతుక ఉంది. తెలుగువారు స్వంత చిరునామా మరచిపోయారు. ప్రాచీన శిల్పంలో మనుషులు, జంతువులు, ప్రకృతి కలసి ఉండేవి. వీణలో సింహతలాటం ఉంటుంది !
ఆసియన్ ఆర్ట్కి ప్రాణం లయ. రేఖలు లయ ఏర్పడడానికి సహకరిస్తాయి. సాంప్రదాయ వర్ణచిత్రాలు టూ డైమన్షనల్స్ అయితే మొగల్ మీనియేచర్స్ దృశ్యాన్ని త్రీ డైమన్షన్స్లో చూపే యత్నం చేస్తాయి. ఆ సౌందర్యానికి కొనసాగింపునివ్వాలనుకున్నాడు శివాజీ. ‘బ్యాక్ టు రూట్స్ అంటారే, ఆ పని చేస్తున్నాడు. ‘కవిత్వంలో, కథలో, పెరంటింగ్లో కళారూపం ఏదైనా కళాకారునిలో తనదైన అద్భుతం ఒకటి ప్రతిఫలించాలి. అందరూ చేసేదే నీవూ చేస్తే నీవెట్లా అవుతావు. నీవు కన్పించాలి’ అనే స్పష్టత శివాజీ పెయింటింగ్స్కు స్వంత స్టయిల్ను ఇచ్చింది. వీటిల్లో తన చుట్టూ ఉన్న ప్రకృతి పరిశీలన కన్పిస్తుంది. చైనీయులు, జపనీయుల వర్క్స్లోంచి వచ్చిన స్ఫూర్తి కన్పిస్తుంది. తూనీగలు, కాకులు, గేదెలు, మేకలు, ఉమ్మెత్తలు, ఒకో రుతువులో ఒకో రకంగా సరికొత్తగా కన్పిస్తాయి నిశ్శబ్దంగా ఏవో చెబుతాయి.
****************************
సమకాలీన చిత్రకళా వాతావరణం గురించి శివాజీ ఏమంటారు? చిత్రకారుడు చూపిన అంశానికి చూపరి కనెక్ట్ కావడం చిత్రం పరమార్ధం. గాథాసప్తశతి నుంచి నేటి యువకవి వరకూ కనెక్ట్ కావడం ఉంది, కాబట్టే కవిత్వం ఉంది. కళాకారుడు - కళ - ఆస్వాదకుడు అనే ట్రినిటీ ఏకత్వం సాధించడానికి విమర్శ - సమీక్ష‘ ఉపకరిస్తాయి. సంగీత నాట్యరంగాలలో విమర్శ - సమీక్ష‘ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సాహిత్యం, చిత్ర, శిల్ప కళల్లో ఇటీవలి కాలంలో ఈ సంప్రదాయం తగ్గిపోతోంది. విమర్శ లేకపోవడం, సమీక్ష‘ లేకపోవడం దురదృష్టకరం. తెలుగు - ఇంగ్లిష్ పత్రికలలో కవర్ చేసే కంటెంట్ చిత్రంగా ఉంటుంది. అడిగేవాడు లేడు కదా అని హద్దులేని అజ్ఞానంతో రాస్తున్నారు. ఈ ధోరణి ఆర్టిస్ట్కు, ఆర్ట్ లవర్కూ ప్రమాదకరం. బాగా పేరున్న అంటే డిమాండున్న సంగీతదర్శకుడు ట్యూన్ ఇచ్చి పాట రాయమని అన్నట్లుగా ఉంటోంది ఆర్టిస్ట్ల పరిస్థితి. గోడ సైజ్ ఏమిటి? బిల్డింగ్కి ఏ రంగు వేసాం? ఈ సైజ్లో ఏ తరహా ‘బొమ్మ ఉంటే‘ బావుంటుంది? అని నిర్ణయించేస్తున్నారు. ఆర్ట్ ఏజెంట్స్ లేదా గ్యాలరీల నిర్వాహకుల అభిరుచులూ ఆ మేరకు ఉంటున్నాయి. అడుగుతున్నారు కదా అని ఆర్టిస్టులు అవే ఇస్తున్నారు. ఈ గందరగోళానికి కారణం ఏమిటి? వేరే భాషా ప్రాంతాలలో ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన అందరూ కలసి మెలసి ఉంటారు. సంభాషిస్తారు. అభిప్రాయాలను పంచుకుంటారు. రచయితలు, ‘దియేటరిస్ట్లు, చిత్ర-శిల్పకళాకారులు కలవడం తెలుగునాట ఊహించగలమా? రచయితల్లో కథకులు వేరే. కవులు వేరే. మళ్లీ శాఖలు, ఉపశాఖలు ...
ఫ్రాన్స్లో ఆస్కార్వైల్డ్, స్టెరన్ బెర్గ్ వంటి నాటక రచయితలు, స్టీవెన్ మిలాన్, పాల్ బెరీన్ వంటి కవులూ, ఎమిల్ జోలా వంటి రచయితలూ, గాగిన్, సిజాన్ వంటి చిత్రకారులు ఒక కాలంలో కలసిమెలసి చర్చించుకునేవారు. తర్వాత సార్త్రే, బ్రెహ్ట్, పికాసో వంటి సజనశీలురు, గులామీ అపొలనీయర్ , హెర్బర్ట్ రీడ్స్, వాట్టర్ పీటర్ వంటి బహుముఖ ప్రతిభావంతులు కలుసుకునేవారు. వాదోపవాదాలు జరిగేవి. ఆ వైనం మరుసటి రోజు పత్రికల్లో వచ్చేది. తెలుగు మాట్లాడేవారిలో అటువంటి వాదోపవాదాలు, తన్నుకు చావడాలు లేవు. శ్రీశ్రీ, ఏ.ఆర్.కృష్ణ, అబ్బూరి వంటివారు చిత్రకళను పట్టించుకోలేదు.
ఆర్ట్కు విశేష ప్రచారం కావాలి. చేగువేరా అంటే ఎవరో తెలియకపోయినా కుర్రవాళ్లు బనీన్ల మీద, టోపీల మీద బొమ్మలు వేసుకుని తిరుగుతున్నారు కదా. పిల్లలకు ఆర్ట్ అంటే అభిరుచి లేదని ఎట్లా అనగలం? వారికి చేరువ అయ్యేలా ప్రచారవ్యూహం ఉండాలి. కళ నిత్యావసర వస్తువు కావాలి. సమస్త రూపాల్లో ప్రచారం తెచ్చేందుకు ప్రయత్నించాలి. జానపద కళారూపాలను, అమరావతి శిల్పాలను, ఆధునికుల చిత్రాలను సామాన్యుల జీవితంలోకి తీసుకువెళ్లడం ఎలా అని ఆలోచించాలి.
**************************
శివాజీ బొమ్మలను చూసి ఎవరేమన్నారు? రాయల్ ఫ్రేం వర్క్స్లో పెయింటింగ్లను చూసిన లక్ష్మాగౌడ్ శివాజీ బొమ్మలను చూసి ఆప్యాయంగా భుజంపై చేయి వేసారు. ‘బాగ వేసినవ్ బిడ్డా’ అని మెచ్చుకున్నారు. ఆంజనేయరెడ్డిగారు మిసిమి పత్రిక ఇన్సైడ్ కవర్ చిత్రాలుగా శివాజీ పెయింటింగ్స్ ప్రచురించారు. ఒకరోజు ఆంజనేయరెడ్డిగారు ఫోన్ చేసి మీతో ఒక పెద్దాయన మాట్లాడతానంటున్నరు అని ఆయనకు ఫోన్ ఇచ్చారు. కనీసం పావుగంట మాట్లాడిన ఆ పెద్దాయన బాపు. ఎంతగా ఆనందించారో ! ఎవరండీ అన్నారు? మెచ్చరే, సమకాలీనులు అని! కళాహిత ఆర్ట్ గ్యాలరీలో వైకుంఠం శివాజీ చిత్రాలను చూసి 'ఇంత బాగేస్తవని తెలియుదు. బాగేసినవు’ అన్నరు. రెక్కలొచ్చేవరకూ ఎందరో ఆర్టిస్టులకు తన గూటిలో ఆశ్రయమిచ్చిన మోహన్, శివాజీ బొమ్మలను బోల్డ్గా మెచ్చుకున్నాడు.
శివాజీ తన మిత్రుడు రాజుతో ‘చిగురు’ అనే బాలల మాసపత్రికను కొన్నాళ్లు నిర్వహించారు. ఇలస్ట్రేటర్, శ్రీశ్రీ మెచ్చిన కార్టూనిస్ట్ అయిన రాజు కూడా పెయింటింగ్ వైపు దృష్టి పెట్టారు. ఇరువురూ వారి వారి పద్ధతుల్లో పెయింటింగ్స్ చేస్తున్నారు. ఆర్ట్ బూమ్ చల్లారాక, రియలెస్టేట్ కుదేలయ్యాక శివాజీ -రాజులు మూడు పర్యాయాలు కంబైన్డ్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. కొన్ని గ్రూప్ షోల్లో పాల్గొన్నారు. హైద్రాబాద్ హస్త గ్యాలరీలో, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, బెంగళూరులో ప్రదర్శనలు పెట్టారు. నోవాటెల్ - కాఫీ డేల్లోనూ ప్రదర్శించారు. కొన్ని బొమ్మలు అమ్ముడయ్యాయి. కొందరు స్నేహితులు, ఎవరో తెలియని మరికొందరూ శివాజీ చిత్రాలను ఆదరించారు. ఒక కళాభిమాని తన ఇంటి గోడపై అలంకరించుకున్న శివాజీ బొమ్మను చూపిస్తూ ‘ఎయిర్ ప్యూరిఫైయర్’ అన్నాడు! పొద్దున్నే దినపత్రికలు ప్రసరింపజేసే నెగెటివ్ ఎనర్జీకి విరుగుడు అన్నారు ఒక వైద్యుడు!
నాకు మాత్రం శివాజీ బొమ్మలు మహేంద్రకపూర్ పాటను విన్పిస్తాయి!
‘హే నీలె గగన్ కె తలే/ ధర్తీక ప్యార్ ఫలే’ !
*
తాజా కామెంట్లు