పేనందీసుకున్న పాల్తేరు సినఎంకటి

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

 

పాల్తేరు సిన ఎంకటి పుడ్డం ఒక మనిసిగానే పుట్టేడు. కాని, సవ్వడం మటుకు రెండు ముక్కలై సచ్చిపోనాడు. అది కూడా రైలు కిందపడిపోయి. అలగని వొవులూ ఆణ్ని పొగలబండి కింద తోసీనేదు. ఆడికి ఆడే అమాంతం రైలు కిందెల్లి బుర్రెట్టీనాడు. ఆ రైలుతల్లి ఆడి తలని తరిగీసింది. మొండాన్ని ఏరుసేస్సింది. ఇదంతా ఏ రాతిరిమీద జరిగీనాదో మాకయితే తెల్దు. తెల్లారగట్ట మాతరం పట్టాలొడ్డున గడ్డిగోక్కుందావని బుంగా బొరిగ వొట్టుకెల్లిన వంతాడ సూరయమ్మ సూసింది. ఇకనది ఇలగలగ గోలెట్నేదు. ఏడుసుకుంతా ఊల్లోకి పారొచ్చీసి ఎంకటి సావుకబురు అందరికీ సెప్పీసింది. మావందరం అటేపు బయలెల్లేం.

బాబురోయ్‌. ఆ పట్టాలకాడంతా రకతమే. మా సెడ్డ గోరంగుంది. ఎంకటి తలని రైలింజీను వొక్సాసి ఇసిరీసింది. చెరీరేన్ని మరొక్కాసి తోస్సింది. ఈట్ని కలిపీసి కుట్టించీసి ఇత్తావని మా రేగుపాలెం పక్కనున్న ఎలమంచిలి రైలివే పోలీసోల్లు ఎలిపొచ్చీనారు. బారికోల్లసేత పీనిగిని మోయించుకుని పోనారు.
మావూ ఆల్తో పట్టాల మీద నడుసుకుంతానే ఎలమంచిలేపు దారితీస్సేం. మా గురించేటిగానీ, మాతోటే నడిసొచ్చిన మా వూరి కాపుదొర సింగంపిల్లి అప్పారావుగోరు మాతరమూ కల్లనీరు కుండలకొద్దీ కార్సీనారు.

నల్లికిల్లపావునాగ నజ్జుగుజ్జులు పడిపోనారు. మరి సచ్చిపోయిన ఎంకటి గాడు ఆల్ల ఇంటికాడే కదేటి కంబారిపని సేసీది.

ఒక ఎంకటిగాడేనేటి. మా మాలపేట జట్టు జట్టంతానూ అప్పారావుబాబు పొలాలమీదే దినం తీరుసుకుంతారు. ఈల్లకి తక్కువకాదు మా మాదిగపేట మనుసులు. మాలోల్లంతా అప్పారాయేపు కాస్తే, మాదిగోల్లు  రెడిపిల్లి తాతారావు దొరయేపు కాసుకుంతారు. తాతారావు మడిసెక్కల మీద సెవట్ల్లు కారుత్తా మెతుకులు తింతాఉంతారు. ఆ పెద్దగెద్దలిద్దరూ బాగానే ఉంతారు. పుటకొక్కు ల్నాగ దిని, పందికొక్కుల్నాగ బలిసుంతారు. ఈల్ల కోపానికి, తాపానికీ మా తల తక్కువ
మాలోల్లు. బుర్రలేని మాదిగోల్లే  నానా సావూ సత్తుంతారు. మా పాల్తేరు సిన ఎంకటిగాడు సచ్చిందీ ఈల్ల తగూలవల్లే కదేటి. ఆడు రైలుకింద
తలకాయదూర్సీసేడంతే ఉత్తినికే దూర్సీనాడేటి. అలగ దూర్సీడానికి మా దొరబాబులే కదేటి కార్నం, మా రేగుపాలెం పక్కా పెదకాపుల గ్రేమం. ఊల్లో బూవులన్నీ అల్లయే. ఇల్లన్నీ ఆల్లయే. నూతులు గోతులూ అల్లయే. నీతులూ బూతులూ కూడా ఆల్లయే. ఈ పెదకాపుల్నే దొర్లంతారు. అయితే అల్లు పేరుకే అగ్గరజాతిగానీ ఆల్లకేబొక్కా తెల్దు.

సొమ్ముంది కాబట్టికి ఆల్లకి సెలామనీ. వొవుల్దెగ్గిర డబ్బుంతే ఆల్లకి మెడపోత్రం మా నావుగా ఉంతాదంతారే. సరీగా మా దొరగార్లకి ఈ మాట సమానింగా
సరిపోద్ది. ఆల్ల కొవ్వంతా వొప్పుడూ మావూరి పేదనంజికొడుకులమీదే.

Kadha-Saranga-2-300x268

ఊల్లో  నాలుగు కొంపల బేమ్మలున్నారు. మరో పుంజీడు రాజుబాబుల దేవిడీలున్నాయి. ఈ ఎనిమిది కుటంబాల్నీ బగముంతుల్లా సూసుకుంతారు
దొరగోర్ల్లు. అల్ల దగ్గర తోకతిప్పరు. కుక్కిన పేనుల్లాగుంతారు. బేమ్మలూ, రాసోల్లూ కూడా మందబలం జాస్తీగున్న కాపుల్తో ఎట్టుకోరు.

పైపెచ్చు మీరూ మావూ పెద్దకులపోల్లమని కాపుల్ని పొంగబెడతారు. ఈ కాపులేమో ముందు ఎనకా సూసుకోకుండా ఆల్ల సంకనాకెత్తుంతారు.  పోనందరూ కలిసీసి ఊర్ని బాగుసేత్తారా అంతే అదేటీనేదు. మావూరి కాపులు పులుల్లాంటోల్లు. మావూరి బేమ్మలు  నక్కల్లాంటోల్లు. ఇంకా సెప్పాలంతే దొంగ వొరల్లాంటోల్లు.
పేదోల్ని ఎలా పీడిరచీయాలో కాపులికి మప్పీది ఈ గొల్లిగోల్లే.

ఇకను, మా అప్పారావు దొర, మా తాతారావు దొర పైవోల్లేటీ కాదు.   సేనా దగ్గరోల్లే. ఈడి సెల్లిని ఆడు, ఆడి సెల్లిని ఈడు కుండమారుపు సేసుకున్నారు. బావా బామ్మర్దులు. అలాంటప్పుడు దొబ్బితినీసి ఒల్లక కూకోవొచ్చు కదేటి. అబ్బే అలగసేస్తే ఇకనేవి. ఒకడిమీద ఒకడికి సెప్పనేనంత దొబ్బుదెగులు. ఈడో పార్టీ అయితే ఆడో పార్టీ. ఈడు ఊరి పెసిరెంటయితే ఆడు మండలానికి పెసిరెంటయిపోతుంతాడు. ఈల్ల మయానా ఎప్పుడూ తగూలు తంటాలే.

ఈ దొర్ల పున్నెవాని  మా మాల, మాదిగ పేట్లు రెండూను పగలు పెంచీసుకున్నాయి. కారపన్యాలకు దిగిపోనాయి. ఇప్పుడు ఆల్లకంటే ఎక్కవగా ఈ పేటోల్లు  రంది పడిపోతన్నారు. పోలీసుటేసన్ల ఉరుసుట్టూ తిరగతన్నారు.

దొర్లకి కోపం రాగానే ముందు దేనిమీద దుస్టెడతారో తవరికి తెల్సా.
ఎగస్‌పార్టీవోల్ల పొలాలమీద, తోట్లమీదానీ. ఈల్ల మద్దెన పుట్టీసిన గొడబలవల్ల మా ఊల్లో మట్టసంగా పెరిగిన ఎన్ని పంటలు ఎన్ని సుట్లు నాశినం
అయిపోనాయో సెప్పనేం. ఎకరాలికి ఎకరాల యూకలిప్టీ  మొక్కలన్నీ రాత్రిరాత్రే ఓ పాలి మాల జట్టు నరికీనాది. ఇందుకు పెతీకారెంగా జీడిమావిడి తోటల్ని
మాదిగోల్లు  నిలువునా సీరీసి పోగులేసీనారు. మరో పాలయితే, పదియేనెకరాల్లోని తాతారావు మావిడి మొక్కల్ని అప్పారావు గేంగీ మొదల్లకి
కూల్సీసింది. పగతో రగిలీసిన తాతారావు ముటా  ఊరుకుంతదేటి. సీతాఫలాలు, దానిమ్మలు, పనసలు, పంపర పనసలు బెమ్మాండమయిన అప్పారావు తోట్లో
సెట్లన్నిట్నీ నిమసాల్లో పీకీసింది. ఇలగ దొరల కచ్చలకి మావూల్లో కూలీసిన తోట్లకి నెక్కాజమా నేదు. పచ్చని సెట్లు అమాంతం ఇరిగి పడినప్పుడు మాతరమూ
మా ఇరు పంచాల ఊల్లోల్లు చాలా బాదగా ప్చ్‌..ప్చ్‌..ప్చ్‌లు కొడుతుంతారు.

మన్లో మనమాట. ముద్దుగా పెరిగిన మొక్కలేటి సేసేయి. ఆట్లికేటి తెలుసు. పగలు గిగలూను. కానీ ఈ ముస్కరముండాకొడకుల బార్ని పడి కునికీనాయి.
పదేల్లు నానా పుర్రాకులూ పడి  గరిటికట్టీసిన మొక్కతల్లి ఒక్క ఏటుకి సచ్చిపోడం గోరం కదా. ఆటి ఊసు అలగొగ్గీండి. ఆట్ని అడ్డంగా నరికీసీటప్పుడు
మా మాలమాదిగజనమంతా కూడానూ సేనా ఇది అయిపోయీవోరు. అయినాగానీ ఎలక్కాదనగల్రు. దొర్ల మాట కాదంతే ఆల్లకి నూకలేయి. ఇలాంటేలే అందరికంటే
ఎక్కవగా జిమజిమలాడిపోయీవోడు మా పాల్తేరు సిన ఎంకటి. దీనికీ మా ఎంకటకీి సంబందం ఏతంతారా. ఆడు, ఆడి  జట్టే అప్పారావు బూవుల్లో తోట్లు పెంచీది.
తాతారావు బూవుల్లో తోట్లు నరికీదీని. ఎంకటిగోడు ఇప్పటికి  ఎన్ని సెట్లు నరికినాడో, ఎన్ని కేసుల్లో ఇరికినాడో, ఎన్ని సుట్లు
బొక్కలోకెల్లొచ్చినాడో సెప్పనేం. అలా నరికి నరికి ఆడికి సార్వీసయిపోనాది. ఒంటికీ ఎనబైయ్యేల్లొచ్చీనాయి. ఈడితోపాటు దొరబాబులూ ముసిలయిపోనారు. కానీ
ఆరి పగలు మాతరం ముసిలికానేదు.

 

ఆ రోజు ఏటయిందో ఏటో తెల్దు. అప్పారావు ఇంటి కాణ్నించి ఎంకటిగాడికి సందేల కబురొచ్చీనాది. ఉన్నపలంగా దొరగారు వచ్చీమన్నారని బారికపెంటయ్య పారొచ్చీసి సేప్పీనాడు. అప్పుడే నానా సాకిరీలు దొరగారి సేలో సేసొచ్చి గంజి తాగతున్నాడు ఎంకటిగోడు. ఆడు ఒంటి మనిసయిపోయి సేనా ఎల్లయింది. దొరకి సేవ సేసి సేసి ఆడి బతుకు సివరికొచ్చీనాది. దొరసానికి సేవ సేసీ సేసీ ఆడి పెల్లాం  పరదేశమ్మ ఈ మద్దెనే నోకం వొగ్గీనాది. నేకనేక పుట్టిన  కూతుర్ని
పక్కూల్లోని మేనల్లుడికే ఇచ్చి సేస్సేడు.  గుడిసిలో ఒంటికాయనాగా సొంటికొమ్మునాగా ఉంతన్నాడు.

‘‘ఏట్రా పెంటా. ఈ టయాంలో బాబుకి ఇంత అరజంటు పనేట్రా’’ బారిక పెంటయ్యని గంజి తాగుతూనే అడిగినాడు ఎంకటి.
‘‘నాకేటి తెలుసు మాయ్యా. నువ్వూ నీదొరా తక్కువేటి. మాకేటి పలానీ పనని సెప్తారేటి. తోలీనారు. వచ్చీనాను’’ సులాగ్గా సెప్పి సుట్టముక్కకి అగ్గి
అడిగీనాడు పెంటగోడు.

‘‘ఓరేట్రా. ఏం పన్రా. సెయ్యడానికేటి జంకునేదుగానొరే. పూరవంనా కాదురా. ఓపికానేదు. మనసూ నేదురా. అయినా అదేం పన్రా. అదేటి మంచిదేట్రా. మనుసుల్ని తన్నడమూను, మొక్కల్ని నరకడమూను. ఓర్నాయిన. ఎన్నెన్ని సెట్లని నరికీనాన్రా. ఇదంతా ఆ బాబు పున్నెమే. ఆ బాబు పాప్మే.’’ అనీనాడు
ఎంకటిగోడు.

‘‘నాకెందుకెయ్‌. మీ గోస. వత్తేరా. నేపోతే దొబ్బీ. దొర సెప్మన్నాడు. సెప్పినానంతే. వత్తానుండుమీ.’’ గుప్పుగుప్పుమంతా సుట్టపొగ వదులుకుంతా
పోనాడు పెంటడు.
గబాగబా గంజినీల్లు తాగీసి, మూత్తుడిసీసుకుని, తలక్కట్టిన సింకి తుమాలు ఇప్పీసీసి, బుజానేసీసుకుని దొరింటియేపు దారీతీస్సేడు ఎంకటి.
ఆడలగ ఎల్లీసరికి అప్పారావుదొర మాంచి అగ్గిమీదనున్నాడు. తాతారావుని అమ్మలకి, అప్పలకీ తిడతన్నాడు. పక్కనే ఉన్న బారిక పెంటయ్య
గడగడలాడిపోతన్నాడు.

‘‘ఈయాల అటో ఇటో తేలిపోవాల్రా ఎంకటీ. ఆ నాకొడకడేమో నాను దొంగసారా కాత్తన్నానని పోలీసోల్లకి నిన్ననే కంప్లయింటెట్నాడ్రా. ఈ సమ్మచ్చరము ఆడి
నోటికి ఒక్కతంతే ఒక్క బొప్పాయి ముక్కా ఎల్డానికి నేదు. ఒక్క పనసతొనా తినీ యోగం అడికుండగూడదు. ఈయాల రేతిరికే మూర్తం ఎట్టండి. మనోల్లందర్నీ
తీస్కెల్ల్లు. ఎల్లీటప్పుడు కనీసం వంద మందిరి ఎల్లండి. మన రేగుపాలెం పక్కనే వలందీపేట్లో బొప్పానపల్ల తోట పదెకరాలు మొన్ననే కొనీనాడు గోసిగోడు.
దానికి అంటింపుగా బలిసిన పనసతోటా కొనీనాడు. అదో అయిదెకరాలుంతాదీ. ఈ జోడు తోటల్నీ సీకటేల సుబ్బరగ సిదివీసి ఎలిపొచ్చీండి. వొవుడైనా అడ్డొస్తే ఆడి
మెడకాయ నరికీండెహే. తోట్లు కొంటాడట తోట్లు’’ తాతారావు మీద ఒంటికాలిమీద ఇరగబడిపోనాడు అప్పారావుదొర.

ఇలాంటియి ఇనడం ఎంకటికి కొత్తగాదు. గేనవచ్చినకాణ్నించి దొరసెప్పినట్టే తాతారావుగోరి మొక్కామోడూ నరుకుతానే ఉన్నాడు. ఇంకా సెప్పాలంతే ఏసిన
పంటలకంటేను దూసిన మొక్కలే ఎంకటి బతుకులో ఎక్కవ. అందుకే, ఈ సుట్టు దొరమాటని ఎంకటి గాడు పెద్దగా నచ్యపెట్నేదేమో. నోరు తెరిసి దొర ముందర
మాటాడ్డం మొదలెట్టీనాడు.

‘‘బాబూ ఒకటీ రెండూ కాదు. ఏబైయ్యేల్లయిందేటో. తవరు సెప్పడం మాం సెట్లని సెండడం. ఇలాంటలాంటి సెట్లని సెండేవేటి. పండీడానికి సిద్దంగున్న సెట్లు
యేలకియేలు నా సేతుల్లో అమాంతం సచ్చిపోనాయి. నేరడు మొక్కలు, గులాబీజాములు, రాంబానాలు, కొబ్బరి నవుజులు, నీలగిరీలు, నారింజలు, నిమ్మలు ఒకటేటి మాసేత తాతారావు దొడ్లో ఎన్నని నరికించీనారో తవరు. మొక్కలెట్టడానికి, పెరగడానికి ఎంతటయిం అవుతాదో మీకు తెల్దేటి. అసలు మనూల్లో మీ ఇద్దరి తన్నులాట్లకీ ఒక్క మొక్కముండయినా నిలబడగలిగిందేటి. నిండుగరిబినీనాంటి పల్ల సెట్లని తొవ్వించీనారు. సీకట్లో మాసేత మీరు సేయించిన ఈ పాపం సిన్నది కాదు. ఒక్కక్క మొక్కా నరుకుతుంతే మా యన్నదమ్ముల్ని అక్కసెల్లెల్నీ సొయంగా నరికీసినట్టుంటందీ మయాన. కానీ ఏటి సేత్తాం. మీరు  తిండెడతన్నారు.
ఒల్లక్కూకున్నాను. బాబూ మనం తప్పుసెయ్యడం కాదు. పేటోల్ల సేతా సేయించీనాం. మీరేటి మావేటి అందరం తప్పుసేసినాం. ఇకనీ మొక్కల్ని సంపడం అపీండి బాబు.’’ అన్నాడు పాల్తేరోడు.

ఆ మాట్లకి అప్పారావుదొర దెయ్యిం పట్టీసినోడినాగ సిందులు తొక్కీనాడు.

10578786_10204979719078424_162694362_n
‘‘పతివ్రెత యేసాలేత్తన్నావేట్రా కసకంత్రీయెదవా. నా సొమ్ముదిని నాకు నీతులు సెప్తావేట్రా పోరంబోకెదవ. నరికినన్నాల్లూ నరికీసి ఇప్పుడు బగవదగీత
వొల్లిత్తావేట్రా బాడుకావా. నీతులు సెప్పినావంతే టుపాకీతో కాల్సి పారెత్తానెదవ’’ అంటూ ఎంకటిగాడి మీద ఇరుసుకు పడీపోనాడు. అయినా గానీ ఎంకటిగాడు దిట్టంగా మాటాడ్డం మాన్నేదు.

‘‘బాబూ ఈ మయాన్నే నా పెల్లం  సచ్చింది. దగ్గిదగ్గి జబ్బుతో సచ్చింది. దాని సెవాన్ని   సూసి నానెలగేడిసినాను. కొండలు కరిగీనాగ, బండలు పగిలీనాగా
ఏడిసినాను. తోడు పోయిందని దిక్కులు సూసుకుంతా  సూసుకుంతా ఏడిసినాను. మనిసి కాబట్టికి, దాని మొగున్ని కాబట్టికి నానేడిసినాను. మరి నా సేతుల్లో
సచ్చిన మొక్కల మాటేటి. అటికి పెనివిటీ, పిల్లలు  ఉన్నారో నేదో మనకి తెల్దు. కాబట్టికి వొవులూ ఏడిసినట్టు మనకి తెల్నేదు. మనుసులు కాదు
కాబట్టికి ఆట్ని నరికితే నెత్తురూ గిత్తురూ రానేదు. అలగని ఆటికి పేనం లేదనగల్దువేటి. ఆ మద్దినెప్పుడో నా కూతురికి ఆడబిడ్డ పుట్టీనాది. పురిట్లోనే ఆ సిన్న పిల్ల సచ్చిపోనాది.  సచ్చినబిడ్డనొట్టుకుని నా కూతురు ఎంతని దుక్కపడిపోనాదో  సెప్పనేను. మరి నాను నరికిన సిన్నసిన్న మొక్కల్ని వొట్టుకుని పెద్దమొక్కలూ అచ్చం అలగే ఏడిసినాయో ఏటో. వొవులికి తెలుసు. నానూ సిన్నోన్నీ సితకోన్నీ కాదు బావూ. రేపో మాపో పుట్టుక్కుమనీ నాగున్నాను. మరిక ఈ పాపాలు సెయ్యినేను. నానింక మొక్కాగిక్కా నరకలేన్నాయినా. అలా  ఆట్ని నరకడం కంటేను నన్ను నేను నరికీసుకోడమే సుకమేటో నాయినా. నాను సస్తే దయిద్రం వొదిలిపోద్దేటో నాయినా.’’ జెలజెల కన్నీరు తెగ్గారిసెస్తా  సెప్పీనాడు ఎంకటి.
దొరబాబుకి కోపం సర్రున పెరిగిపోనాది.

‘‘బాంచోత్‌. పెద్దకపుర్లు సెప్తావేట్రా. మొక్కలు తెగ్గొయ్యలేవుగానీ తల తెగ్గోసీసుకుంతావేట్రా. నువ్వంత దరమపెబువ్వేట్రా. నువ్వంత పత్తిత్తవేట్రా. నువ్వంత పోటుగోడివేట్రా. నువ్వంత తేగపురుసుడివేట్రా. నీకు దమ్ముంతే, ఒకమ్మా బావుకీ పుడితే, రేపీయాలకి నిన్ను నువ్వే నరికీసుకుని సవ్వాల్రా. ఎల్లుండి కాణ్నించీ నువ్వు నా కంటికి కనబడగూడదురోయ్‌. నువ్వుగానీ నిజవయిన మనిసివయితే మాటమీద నిలబడాల్రా. సచ్చి సీపించీరా.’’ కోప్మూ, ఎటకారమూ కలగలిసీసి, రౌదరంగా కసిరీసి మరీ ఇంటి ముంజూర్లోంచి  ఎంకటిని తోస్సేడు అప్పారావుదొరబాబు.

అప్పటికి పొద్దుబాగా వోలిపోయింది. సూరీడు పడవటింట్లోకి దూరతన్నాడు.
సందురూడు ఆకాసంలోకి వచ్చీటయం అయినాది. ఆ సమయంలో మరి ఎంకటిగాడు ఏటనుకున్నాడో. అవమానం జరిగిందనుకున్నాడో, నేక పెద్దోల్తో మనకి
పనేటనుకున్నాడో గానీ  దొర ఇంటికాన్నించి నిమ్మలంగా నడిసీసి పేటయేపు వచ్చీనాడు. మరి మాపటికి ఆడు ఏటి ఆలోసించుకున్నాడో మనకి తెల్దు. ఆడి
మనసులో మరేటి పుట్టీసిందో అసలు తెల్దు. అద్దరేతిరియేల గుడిసెలోనించి బయటకొచ్చీనాడు. మాసెడ్డ గేలాప్మీద రేగుపాలెం సైడున్న రైలు పట్టాలకేసి
డైరట్రగా ఎలిపోనాడు. ఏ రైలు మాతల్లిని ఏ రాతిరిమీద ఆడు ఏటి ఏడుకున్నాడో తెల్దు. మరే రైలు కింద బుర్రెట్టీనాడో తెల్దు. మర్నాడుదయం సూరయమ్మ
సెప్పీదాకా  ఆడి సావు సంగతి మాకొవులికీ తెల్దు.

ఇకను ఆనాటి సాయంకాలంయేల ఎలమంచిలి ఆసపత్రిలో డాటర్‌బాబులు ఓ పక్క మా ఎంకటి గాడి సెవాన్ని ఎడే పెడా కోత్తన్నారు.  మరోయేపు శవాలగది ముందర మా ఊరి జెనాలు జమయిపోయి ఈ కతంతాను  ఒకల్లకొకలు సెప్పీసుకుంతన్నారు. సీకటిసీకటి అవుతుండగా పేనాల్లేని ఎంకటిగోడు మా ఊరి సొసేనంలో అల్లుడు అగ్గెట్టగా కాల్డం మొదలెట్టీనాడు. మాట మీద ఆడు నిలబడిపోనాడని తల్సుకుని తల్సుకుని సొసేనంలో మావంతా  గొల్లుమన్నాం. మొక్కామోడూ  కోసమే మెడకాయ ఇచ్చీసుంతాడని గోసగోస పెట్టీనాం. రుద్దరబూవిలో సెట్టూసేవా కూడా ఆడి సెవాన్ని సూసి కన్నీరెట్టుకున్నట్టుగా మాకయితే ఆ టయింలో అనిపించీనాది. ఆ సెట్లన్నీ తలలు దించీస్కుని ఏడుత్తున్నట్టుగా నేలసూపులు సూస్తున్న ఆటి ఆకుల్ని బట్టి వొవులయినా సెప్పీవొచ్చు.
ఆకరికి ఎంకటిగోడి నోట్లో మావెట్టిన తులిసాకుల్దీ అదే తీరువా.

*

చిత్రం: వర్చస్వి