తుమ్మపూడి కంటి వెలుగు చంద్రమౌళి

 

                                                                                

-సి.బి. రావు

~

సజ్జనుడు, సాహితీ ప్రియుడైన  చంద్రమౌళి గారు నవంబరు 28, 2015 న మరణించారన్న వార్త  మనసును విచారంతో నింపింది. సంజీవదేవ్ రచనలతో కూడిన కొన్ని చిన్న పుస్తకాలు మిత్రుడు సురేష్ తెనాలి నుంచి తీసుకొచ్చి నా కిచ్చినప్పుడే మొదటగా చంద్రమౌళి గారి పేరు నేను విన్నాను. చంద్రమౌళి గారి ఆర్థిక సహాయంతో  ఆ పుస్తకాలను ప్రచురించారు. సంజీవదేవ్ కుమారుడు  మహేంద్రదేవ్ హైదరాబాదు లోని  Centre for Economic and Social Studies, (CESS), Hyderabad, India, లో 1999 నుంచి మే  2008 వరకు Director గా పనిచేశారు. CESS నుంచి కొత్త ఢిల్లీ కు Chairman, Commission for Agricultural Costs and Prices, Ministry of Agriculture గా బదిలి అయిన సందర్భంలో అమీర్‌పేటలోని CESS కార్యాలయంలో జరిగిన వీడ్కోలు సభలో నేను చంద్రమౌళిగారిని చూడటం, పరస్పర పరిచయం జరిగాయి. అప్పటినుంచి వారు నా మిత్రులయ్యారు.

చంద్రమౌళి గారు Chief Engineer R & B గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారప్పుడు. టెలిఫోన్లో సంజీవదేవ్, సాహిత్య విషయాలు గురించి మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళం. కొన్నిసార్లు వారిని, వారింట చూశాను. పాతతరం రచయితలంటే ఆయనకు మిక్కిలి ప్రేమ ఉండేది. సంజీవదేవ్ రచనలంటే ప్రాణం పెట్టేవారు. వారితో తనకు వ్యక్తిగత పరిచయం లేదని, అంతటి మహావ్యక్తిని తాను కలుసుకోనందుకు మిక్కిలి బాధపడేవారు. సంజీవదేవ్ వియ్యంకుడు ఈయన సహొద్యోగి అయ్యుండీ, సంజీవదేవ్‌ను తన సహొద్యోగి, సంజీవదేవ్ కుమారుడి వివాహం జరిగిన సందర్భంలో పరిచయంచెయ్యలేదని బాధపడుతూ చెప్పేవారు.  

Chandramouligaru rs

చిత్రం: దామరాజు నాగలక్ష్మి గారి సౌజన్యంతో

   సంజీవదేవ్ రచనలు ఎక్కడా లభ్యం కాకపోవటం వీరిని బాధించింది. తనే దేవ్ రచనలు కొన్ని, చిన్ని పొత్తాలుగా ముద్రింపించారు. సంజీవదేవ్ జీవిత చరిత్ర అసలు ప్రతి దొరకక  జీరాక్స్ ప్రతి తెప్పించుకుని చదివి ప్రభావితమయ్యారు. జుజ్జవరపు చంద్రమౌళి గారు  సంజీవదేవ్ స్వీయవాణిని జనం చేత చదివించాలన్నదే తమ అభిమతమని చెప్పి, సంజీవ్‌దేవ్ రచించిన ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతిబింబాలు’, ‘గతంలోకి’ పుస్తకాలను  రాజాచంద్ర ఫౌండేషన్ పేరిట ‘తుమ్మపూడి’  అనే సంకలనంగా తీసుకొచ్చారు. సంజీవదేవ్ స్వీయచరిత్ర అయిన ఈ మూడుభాగాల సంకలనానికి ఆయన స్వస్థలమైన దుగ్గిరాల మండల గ్రామమైన తుమ్మపూడి పేరిట నామకరణం చేశారు. ఏప్రిల్ 4, 2011 న సంజీవదేవ్ నివాసం ‘రసరేఖ’లో సంజీవదేవ్ సతీమణి సులోచన పుస్తకావిష్కరణ చేశారు.

tummapudi_rs (1)

రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షుడిగా చంద్రమౌళిగారు తుమ్మపూడి (సంజీవదేవ్), నా స్మృతిపథంలో.. సాగుతున్న యాత్ర (ఆచంట జానకిరాం), రమణీయ భాగవత కథలు (ముళ్ళపూడి వెంకట రమణ), సురపురం (మెడోస్ టైలర్ ఆత్మ కథ), జానకితో జనాంతికం (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి), డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు (అబ్బూరి ఛాయాదేవి), సంజీవదేవ్ లేఖలు (శ్రీనివాసాచార్య దర్భాశయనం కు వ్రాసినవి), అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకి జేజే, వగైరా పుస్తకాలు ప్రచురించారు.

చంద్రమౌళిగారికి సాహిత్యాభిలాష మెండు. వారి ఇంటిముందు వసారాలో కూర్చుని తనకిష్టమైన పుస్తకాలు చదువుతూ వాటిగురించి మిత్రులతో చర్చించే వారు. అముద్రిత వ్యాసాలను లేక ఆసక్తికరమైన వ్యాసాలను జీరాక్స్ తీసి మిత్రులకు పంపేదాకా ఆయనకు నిద్రపట్టేది కాదు. తనకిష్టమైన పుస్తకాలను రచయితలవద్దనుంచి టోకుగా కొని మిత్రులకు పంచేవారు. ఒకసారి సోమరాజు సుశీలగారి పుస్తకం, మరికొన్ని పుస్తకాలు  నాకు ఇచ్చారు. వారికి కోపం ఎక్కువ. ఒకసారి ఎందుకో నా పై కోపం ప్రదర్శిస్తే కొన్నాళ్ళు వారింటికి నే వెళ్ళలేదు. తనకోపం వలన, నాకు మనస్తాపం కలిగితే, అందుకు విచారం వ్యక్తం చేస్తూ,, పెద్దమనసుతో తనను క్షమించాలని కోరుతూ జాబు వ్రాసారు. ఇది ఆయన సహృదయతకు తార్కాణమై నిలుస్తుంది. కాలపాలన విషయంలో క్రమశిక్షణతో ఉండటం ఆయనకు ఇష్టం. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు.

  నా వియ్యంకుడు సత్యనారాయణగారు (Retired Chief Engineer, R & D) ఆయనకు Junior. వారు నాతో   మాట్లాడుతూ “చంద్రమౌళి గారు చాలా నిష్కర్షగా, నిష్కాపట్యముగా, అవినీతికి దూరంగా ఉండేవారు. అందరికీ సహాయకారిగా ఉండే వారు. ఆయన Senior కావటంతో, కార్యాలయంలో ఎక్కువ మందితో పరిచయాలుండేవి. ఎవరైనా చనిపోతే తనే అందరికీ ఫోన్ చేసి సమాచారం అందించేవారు. పుస్తకాలు బాగా చదువుతుండేవారు.” అన్నారు.

మరణాంతరం జరిగే కర్మకాండలపై చంద్రమౌళిగారికి విశ్వాసం లేదు. తన తదనంతరం తన శరీరం వృధా పోవటమూ వారికిష్టం లేదు. వారి కోరిక మెరకు వారి కుటుంబ సభ్యులు, వారి పార్థివ దేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు అందచేశారు. ఎలాంటి కర్మకాండలు జరపటం లేదని వారి కుటుంబ సభ్యులు తెలియచేశారు. రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షులైన చంద్రమౌళిగారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, ఎప్పటివలెనే రాజాచంద్ర ఫౌండేషన్, ఉత్తమ సాహిత్యం, తెలుగు ప్రజలకు అందిస్తుందని ఆశిద్దాం. ఆ పుస్తకాలు  చదివి ఆనందిస్తే, అదే  సాహితీబంధు చంద్రమౌళి గారికి మనమిచ్చే  నిజమైన నివాళి.

*

 

 

 

 

 

ఏడు రంగుల ఇంద్రధనస్సు “ సప్తపర్ణి”

Saptaparni cover page చిత్రలేఖనం, ఛాయాగ్రహణం , ఇంకా చలనచిత్రాల పై అనేక  వ్యాసాలున్న  ‘సప్తపర్ణిపుస్తకావిష్కరణ సభ ఇటీవల  హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ దూర దర్శన్ మాజీ అధికారి, ప్రయోక్త  వోలేటి పార్వతీశం సభ ను నిర్వహించారు.  మాజీ పోలీసు అధికారి చెన్నూరి ఆంజనేయరెడ్డి  అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంజనేయరెడ్డి పుస్తకావిష్కరణ చేసాక మాట్లాడుతూమిసిమి, భూమి పత్రికలలో ప్రచురించబడిన కాండ్రేగుల నాగేశ్వరరావు వ్యాసాలు ఇప్పుడు పుస్తకరూపంలో సప్తపర్ణిగా మనముందున్నాయి. కళలను బోధించే ఉపాధ్యాయులకు   పుస్తకం విజ్ఞానదాయినిగా ఉండగలదు. కళ మీద వ్యాసాలు రాయడం  మొదలెట్టింది సంజీవదేవ్. తరువాత నాగేశ్వరరావు ప్రభృతులు. నిజానికి  మాజిక్ రియలిజమ్  గురించి సరళంగా వ్రాయటం ఒక కళ. హైదరాబాదు నగర ప్రభావంతో ఇక్కడివారికి కళ, శిల్పాలపై ఆసక్తి కలుగుతోంది. కష్ట నష్టాలకోర్చి, కళాజ్యోతి బాపన్న మిసిమి మాస పత్రిక, ఇంకా ఇతర పుస్తకాలు వెలువరిస్తున్నందుకు నా అభినందనలుఅంటూ తమ అధ్యక్షోపన్యాసం చేసారు.

వోలేటి పార్వతీశం మాట్లాడుతూ సప్తపర్ణి అంటే ఏడు ఆకులని ,ఏడు అంశాల కలయికే సప్తపర్ణి అని చెప్పారు. సృజన, కళారాధన, కళా సమీక్ష, చిత్రకళ, శిల్పకళ, చలనచిత్ర కళ, వ్యాస రచనల కలయికే ఈ సప్తపర్ణి అని వివరించారు.

శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వాణీ దేవి మాట్లాడుతూ ” కళలపై ఆంగ్లంలో చాలా పుస్తకాలుంటాయి కాని తెలుగు లో బహు తక్కువ. లలిత కళలపై  చక్కటి పుస్తకాన్ని వ్రాసి, ఒక చిత్రకారుడు చేయలేని పనిని  నాగేశ్వరరావు చేసి చూపారు. లలిత కళలపై అవగాహనకు, ఈ పుస్తకం విద్యార్థిలోకానికి దోహదపడకలదు. చిత్రకారుల జీవితం, వారు చిత్రాలను గీయటానికి ప్రేరకమేది, డాడాయిజం వగైరాలను సులభ శైలిలో నాగేశ్వరరావు చెప్పారు. హిట్లర్ ఆధునిక కళలపై ఏహ్యభావం కలిగున్నవాడై, అటువంటి చిత్రాలను వెంటాడి, వాటిని తగులబెట్టించిన విషయం, హిట్లర్ గురించిన వ్యాసం లో మనము చదవవొచ్చు. కొందరి చిత్రాకారుల చిత్రాలు అమ్ముడుపోని స్థితి నుంచి మరికొందరి చిత్రాలు లక్షలు, కోట్ల రూపాయలలో అమ్ముడుపోవటం దాకా మనము గమనించవచ్చు. లెయొనార్డొ విన్సి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను ఫ్లూట్ చక్కగా ఊదుతాడు. గాలిలో ఎగరటం వగైరా శాస్త్రీయ విషయాలపై చిత్రాలు గీసాడు. ఛాయాగ్రహణం, సాలార్ జంగ్ సంగ్రహాలయం , వంగ చిత్రకళారీతులు వగైర అంశాలపై పెక్కు వ్యాసాలున్నాయి సప్తపర్ణి లో ” అని చెప్పారు.

  చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా  కాండ్రేగుల నాగేశ్వరరావు


చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా కాండ్రేగుల నాగేశ్వరరావు

రచయిత నాగేశ్వరరావు మాట్లాడుతూ ” లలిత కళలపై రెండు వ్యాసాలు మిసిమి సంపాదకులకిస్తే, వారికవి నచ్చి మిసిమికి క్రమంగా వ్రాయమని ప్రోత్సాహించారు. సాంస్కృతిక అధ్యయనం మన పాఠకులలో తక్కువగా ఉంది. మిసిమి లాంటి మంచి సాహిత్య పత్రికలు  ఆ లోటు తీరుస్తాయి. నేను అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు వాణి (కీ.శే. పి.వి.నరసింహారావు కూతురు)  గారిని లేపాక్షి తీసుకెళ్ళి చూపించే బాధ్యత నా పై ఉంచారు.  లేపాక్షిలో వారి లైన్ డ్రాయింగ్స్  చూసాను. 17 సంవత్సరాల వయసు నుంచే పత్రికలకు వ్రాయటం ప్రారంభించాను. మా నాన్న గారు వైద్యులు. కాకతీయ రాజ్యపతనం కథాంశంగా  మల్లాది వసుంధర రచన  సప్తపర్ణి అనే చారిత్రక నవల ఈ పుస్తకానికి ఈ పేరుంచటానికి ప్రేరకం. మహర్షి ఇచ్చిన మొక్కకు స్వర్ణం రంగులో ఏడు ఆకులు వస్తాయి. అవే సప్తపర్ణి. కళలకు సంబంధించిన ఈ పుస్తకం లో, చలనచిత్రాలపై  నేను వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. సినిమాలు కదిలే చిత్రాలు. నిజమైన కళాత్మక చిత్రం సత్యజిత్ రే చిత్రం తోనే మొదలయ్యింది. సత్యజిత్ రే చిత్రకారుడు కూడా. బి.నర్సింగరావు, కె.వి.రెడ్డి ఇంకా బాపు దర్శకులు మాత్రమే కాక చిత్రకారులు కూడాను. ప్రపంచ విఖ్యాతుడైన దర్శకుడు Alfred Hitchcock చిత్రకారుడు కూడా. తన సినిమా కు కావల్సిన సెట్టింగ్స్ బొమ్మలు  అన్నీ తనే చిత్రించే వాడు. చిత్రకళకు సినిమాకు చాల దగ్గరి సంబంధం ఉంది. చిత్రాలకు న్యాయం జరిగేందుకై, సప్తపర్ణి ప్రమాణము 9″X9″ గా నిశ్చయించాను. సప్తపర్ణి మూడు భాగాలుగా తీసుకురావాలని ప్రణాళిక. మూడవ భాగంలో పరిశోధనాత్మక వ్యాసాలుంటాయి “ అని చెప్పారు.

సభాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ “1920-26 ల లో అజంతా-ఎల్లొరా ల చిత్రాలకు సుమారు 250  నకళ్ళు గీయించారు. వీటిలో కొన్నింటిని నాగార్జున సాగర్ సంగ్రహాలయం లో ఉంచబోతున్నారు” అని తెలిపారు. సభ ఆద్యంతం ఆసక్తికరంగా, చక్కటి జ్ఞాన, భావ వీచికలతో, వోలేటి పార్వతీశం నిర్వహించారు.

Text and Photographs : సి.బి.రావు

Link for డాడాయిజం = http://en.wikipedia.org/wiki/Dada

 

 

 

 

హోసూరులో తెలుగు కథ హోరు!

మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ తరఫున, మధురాంతకం నరేంద్ర  కథావార్షిక 2012 ఆవిష్కరణకు, మే  18, 2013 న, శనివారం, హోసూర్ కు రావలసినదిగా పంపిన ఆహ్వానం అందగానే ఇది ఒక చక్కటి రచయితల సదస్సు కాగలదనిపించింది. నేను వస్తున్నట్లుగా వారికి ఒక విద్యుల్లేఖ పంపాను. హోసూరు తమిళ్ నాడు లోనే ఉన్నా, బెంగళూరు కి దగ్గరిగా 40 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాదు నుంచి వెళ్ళాలంటే బెంగళూరు మీదుగా వెళ్ళటం సులువు. మిత్రులు అనిల్ ఆట్లూరి తాను హోసూర్ వెళ్తున్నట్లుగా ఫేస్ బుక్ లో సందేశం ఉంచారు. హోసూర్ వెళ్ళాలనే ఉత్సాహం పెరిగింది. దీనికి తోడుగా హైదరాబాదులో ఎండలు మండిపోతున్నాయి. హోసూర్ లో రచయితల సాన్నిహిత్యం లో ఎండల నుంచి కూడా తప్పించుకోవచ్చు అనుకున్నాను.
కథావార్షిక ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్న కృష్ణగిరి  జిల్లా తెలుగు రచయితల సంఘం (కృష్ణ రసం) ప్రతినిధులు మాకు స్వాగతం చెప్పి, ఉపాహారం, కాఫీ, టీలు అందించారు. కాఫీ తాగుతుండంగా  కథా వార్షిక సంపాదకులు మధురాంతకం నరేంద్ర కనిపించారు. పుస్తకావిష్కరణకు తీసుకున్న ఏర్పాట్లకు వారిని అభినందించాను. నరేంద్ర తాను కూడా మాలాగే అతిధి లా వచ్చానని శ్రమంతా కృష్ణ రసం వారిదేనని అన్నారు. ఇంతలో విశ్వేశ్వరరావు  వచ్చారు. వీరు కవితా (సమకాలీన కవితల కాలనాళిక) పత్రికకు  నిర్వాహక సంపాదకులు. ఎల్లలు లేని సాహితీమిత్రుల విలాసమైన శ్రీ శ్రీ ప్రింటర్స్, విజయవాడ వీరిదే. చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు, కథావార్షిక 2012 వీరి ముద్రణశాలలోనే అందంగా అచ్చయినవి. పరస్పర పరిచయాల తరువాత తాజాగా వారి ముద్రణాలయం లో అచ్చయిన కొత్త పుస్తకాలు చూపారు. వాటి ముద్రణ బాగుంది.
సభాస్థలి  హోసూరు వారే కాకుండా బెంగళూరు, హైదరాబాదు, బోధన్ లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీ అభిమానులతో నిండింది. ఆ రోజు కార్యక్రమంలో ఉదయం పుస్తకావిష్కరణ , సాయంత్రం తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కి కేతు విశ్వనాథ రెడ్డి -2012 పురస్కార ప్రదానం ఉన్నాయి. అయితే కొన్ని కారణాలవలన రెండో కార్యక్రమం రద్దయినది. కృష్ణరసం గౌరవ అధ్యక్షుడు కలువకుంట నారయణ పిళ్ళై  స్వాగత పలుకుల తర్వాత కథ సంపాదకులు వాసిరెడ్డి నవీన్, మధురాంతకం నరేంద్ర సంపాదకత్వంలో వెలువడిన కథావార్షిక 2012 పుస్తకావిష్కరణ చేశారు.
నవీన్ మాట్లాడుతూ, మధురాంతకం రాజారాం పట్ల ఉన్న గౌరవం, అనుబంధం వలన ఈ పుస్తకావిష్కరణకు అంగీకరించామన్నారు. తన సంపాదకత్వంలో వస్తున్న కథ 2012, కథావార్షిక 2012 లలో కథలు పునరావృతం కాకుండా, తాను మధురాంతకం నరేంద్ర తో సంప్రదిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
విమల కథ “కొన్ని నక్షత్రాలు కాసిని కన్నీళ్ళు”,  రెండు సంకలనాలలో   చోటుచేసుకుని, విశిష్ట కథయ్యింది. ఈ కథ ఆలోచింపచేస్తుంది.ఈ కథలో ప్రధాన పాత్రగా రచయిత్రి ప్రథమపురుషలో మనకు కథ చెప్తారు. 12 ఏళ్ళ తరువాత ఒక పెళ్ళికి వేములవాడ వెళ్ళిన రచయిత్రి, విరసం సభ్యురాలిగా అప్పటి కార్యకర్తలు, కార్యక్రమాలను నెమరువేసుకుంటుంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మాధవ, అక్కా అంటూ రచయిత్రి దగ్గర కొస్తాడు. అతనితో మాట-మంతీ సందర్భం లో అతను జ్యోతి అనే అమ్మాయి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అందరి కార్యకర్తలుకూ చెప్పినట్లే అతనికీ కొన్ని గ్రామాల పనిచెప్తుంది. అయితే రామడుగు అనే ఊళ్ళో జరిగిన చిన్న పొరపాటు వలన పోలీస్ ఎన్ కౌంటర్లో, మాధవ చనిపోతాడు. వర్తమానానికొస్తే, రాత్రి జరగబోయే పెళ్ళికి, ఒకామె వచ్చి తనను తాను జ్యోతిగా పరిచయం చేసుకుంటుంది. తన మేన బావతో పెళ్ళయిందని, తనకు ఇద్దరు పిల్లలని చెప్తుంది. గాలికి ఆమె చేతిపై ఉన్న వస్త్రం తొలిగినప్పుడు కనిపించే దీపం బొమ్మ పచ్చబొట్టు, అప్రయత్నంగా మాధవ్ జ్ఞాపకాలు తెస్తాయి. రచయిత్రి కథ చెప్పిన తీరు ఆసక్తికరంగా నడిచింది. నక్సలైట్ ఉద్యమ బాటపట్టి ఎన్ కౌంటర్ లో బలైన వాళ్ల గురించి, ఈ కథ గట్టిగా ఆలోచింపచేస్తుంది. సాంప్రదాయ పద్ధతులలో పనిచేస్తే పోలీస్ ఎన్ కౌంటర్ తప్పదు. ఆరోగ్యం బాగా లేకపోయినా ఉద్యమాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలవాలి. లొంగుబాటు తప్పట్లేదు. కనుక ప్రజాసామ్య పద్ధతిలోనే సామాజిక విప్లవం వచ్చేలా ఉద్యమంలో మార్పులు తీసుకురావాలి. తద్వారా ఎందరో యువకుల అమూల్య ప్రాణాలు గాలిలో కలవకుండా నివారించవచ్చు.
తెలుగు సాహిత్య పరిషత్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.రామస్వామి రెడ్డి మాట్లాడుతూ తెలుగుభాషలోని అణిముత్యాలైన పుస్తకాలను ఇతర భాషలలోకి తర్జుమాచేయటంలో కేంద్ర సాహిత్య అకాడెమి సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. హోసూర్ ఎం.ఎల్.ఎ. గోపీనాథ్ మాట్లాడుతూ ఇక్కడి మాండలీకంలో వ్రాసిన రచనలను ప్రోత్సాహించాలన్నారు. తద్వారా ఇక్కడి రచయితలకు మరిన్ని రచనలు చేయటానికి కావలసిన ప్రేరణ ఉండగలదన్నారు. తరువాత బహుమతి గ్రహీతలకు పురస్కారాలను అందచేసారు. ప్రఖ్యాత రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ తన కథలలో ముస్లిం పాత్రలు లేవన్నారు. ముస్లింల జీవన పరిశీలన ఖదీర్ బాబు కథలలో తెలుస్తుందన్నారు.
మహమ్మద్ ఖదీర్ బాబు న్యూ బోంబే టైలర్స్ పుస్తకానికి కథాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు. స.వెం. రమెష్ ప్రళయకావేరికథలు కు కథాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు.కథావార్షిక -2011 లోని కథల సింహావలోకనం చేసిన అఫ్సర్ కు కథాకోకిల పురస్కారాన్ని ప్రకటించారు. అఫ్సర్ అమెరికా లో ఉంటుండటం వల్ల అవార్డ్ అందుకోవటానికి రాలేకపోయారు.
డా వి చంద్రశేఖర రావు కథావార్షిక 2012  కథల విశ్లేషణ చేశారు. సింహావలోకనం కై కధాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు. మన్నం సింధుమాధురి కథ “కాళాపు” కథావార్షిక 2012 లో ప్రచురణయ్యింది. కథా రచయిత్రిగా తెలుగు సాహిత్య పరిషత్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.రామస్వామి రెడ్డి చేతుల మీదుగా కథావార్షిక 2012 పుస్తకాన్ని సింధుమాధురి అందుకున్నారు. వీరి ఉళేనూరు క్యాంపు కథలు పాఠకుల దృష్టికెళ్ళాయి. గంగావతి కాంప్ (కర్ణాటక) లో పుట్టి పెరిగిన మాధురి, క్యాంపుల లోని జీవన సరళి  నేపధ్యంలో ఈ కథలు వ్రాశారు.కథావార్షిక 2012 సంపాదకులు మధురాంతకం నరేంద్ర, చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు కథా రచయిత  అమరనారా బసవరాజులను ఎం.ఎల్.ఎ. గోపీనాథ్  దుశ్శాలువా కప్పి సన్మానించారు.

రచన, చిత్రాలు: సి.బి.రావు

 

హేతువాదం లోతుల్లోకి … “ఏది నీతి, ఏది రీతి”?

గత 30 ఏళ్ళుగా రావిపూడి వెంకటాద్రి సంపాదకత్వాన వస్తున్న ‘హేతువాది’ మాసపత్రిక లో నరిసెట్టి ఇన్నయ్య రాసిన వ్యాసాలన్నిటినీ ఇసనాక మురళీధర్ సేకరించి, క్రోడికరించి “ఏది నీతి, ఏది రీతి” అనే పేరుపై e-book గా వెలువరించారు. ఇది ఇంకా పుస్తకంగా రావలసి ఉంది.

ఈ ఇ-పుస్తకంలో 50 వ్యాసాలున్నాయి. కొందరు ప్రముఖ హేతువాద నాయకుల దృక్పథాల గురించిన వ్యాసాలతో పాటు హేతువాద సమస్యలు, ఎదుర్కొంటున్న చిక్కులు, వైజ్ఞానిక దృక్పథంతో సూచిస్తున్న మార్గాంతరాలూ ఇందులో ఉన్నాయి.

జ్యోతిష్యం, సెక్యులరిజం, హోమియోపతి, మెస్మరిజం వంటి సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు కేవలం భారతదేశానికి చెందినవి. ఉదాహరణకు అయ్యప్ప, రామకృష్ణపరమహంస, వివేకానందుడు, అరవిందాశ్రమం ఇందులో పేర్కొనదగినవి. గాంధీజీ గురించిన వ్యాసం ప్రత్యేక కోణంలో చూపిన తీరు గమనార్హం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ గురించి శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేశారు. అమెరికాలో జేమ్స్ రాండీ వలె, ఇండియాలో ప్రేమానంద్ నిర్వహించిన పాత్ర, బాబాల, మాతల మోసాలను వెల్లడించిన తీరు, జ్యోతిష్యాన్ని, దివ్యశక్తులను ఛాలెంజ్ చేసి ఎండగట్టిన తీరు విశిష్టమైనది.

మరణించిన తరువాత ఆత్మ ఉన్నదని, స్వర్గానికి పోతుందని నరకానికి పోకుండా అడ్డుపడే పూజలూ, క్రతువులూ ఉన్నాయని నమ్మించి వ్యాపారం చేసే ధోరణి వైజ్ఞానికంగా ఎంత భ్రమపూరితమైనదో చూపడం కనువిప్పు కలిగిస్తుంది. త్రిపురనేని గోపీచంద్ హేతువాదిగా విజృంభించి, ఆధ్యాత్మిక వాదిగా దిగజారిపోయిన ధోరణి గురించి చదువుతుంటే చాలా ఆసక్తి గా వుంటుంది. భారతదేశంలో సెక్యులరిస్టు ఉద్యమాన్ని ఎంతో కట్టుదిట్టంగా ప్రారంభించి నిలదొక్కుకునేటట్లు చేసిన ఎ.బి.షా పాత్ర గమనార్హం. ర్యాడికల్ హ్యూమనిస్టు నాయకుడిగా మల్లాది రామమూర్తి దేశంలో నిర్వహించిన పాత్ర వెలుగులోకి తెచ్చిన వ్యాసం ముఖ్యమైనది . ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యాన్ని పరిష్కరించి ప్రచురించిన శిబ్ నారాయణ్ రే గొప్ప చరిత్రకారులుగా మిగులుతారు. పోస్ట్ మోడరనిజం పేరిట కొందరు ఆధునికులు వేస్తున్న వెర్రితలల ధోరణి ని కూడా ఈ వ్యాసాల్లో నరిసెట్టి ఇన్నయ్య చర్చించారు .

కులం భారతదేశానికి ప్రత్యేకమైనది. అది మతం ద్వారా వచ్చింది. దాన్ని హేతువాదులు ఎలా చూస్తారు అనే విషయం కొత్త ఫక్కీలో నడిచింది. మూఢనమ్మకాలలో మనకు ఏమాత్రం తీసిపోని అమెరికా ఎన్ని వక్ర మార్గాలను అనుసరిస్తున్నదో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువు, విజ్ఞానం, సంస్కారం ఏమయ్యాయని ఆశ్చర్యపోయేవిధంగా అక్కడ మూఢనమ్మకాలు అమలులో ఉన్నాయి. చదువుకున్నవారిలో ఇలాంటి నమ్మకాలుండటానికి మూలకారణాలేంటి? అనేది లోతుగా పరిశీలించిన దానిని బట్టి ఇండియాకూ, అమెరికాకూ పోలికలు కనిపిస్తాయి.

అంబేద్కర్ పేరిట అన్ని రాజకీయపక్షాలూ ఓట్లకోసం, సీట్లకోసం పడుతున్న పాట్లు, వేస్తున్న ఎత్తుగడలు చూపటం ఈ పుస్తకంలో మరొక విశేషం. వెంకటేశ్వర సుప్రభాతంలో తెలుగు ఎందుకు ఉండదు? సంస్కృతంలోనే ఎందుకు అనే విషయాన్ని వెనిగళ్ళ సుబ్బారావు రాసిన అంశం వెలుగులోకి తెచ్చింది.

పిల్లల విషయాల్లో కూలంకషంగా అన్ని కోణాలను పరిశీలించటం ఈ గ్రంథంలో మకుటాయమానం. అలాగే సెక్యులరిజం గురించిన అంశం కూడా చాలా నిశితంగా పరిశీలించటం గమనించవచ్చు. సెక్యులరిజాన్ని గురించి అందరూ భజన చేస్తుండగా అసలు విషయం ఏమిటి? అని చూడటం గమనార్హం. మొత్తం మీద చర్చను పురికొల్పే అంశాలు, వైజ్ఞానిక ధోరణిని పరిశీలించాల్సిన ఆవశ్యకత, గ్రంథం యావత్తూ అంతర్లీనంగా వ్యాపించి వుంటుంది.

భావ స్వాతంత్ర్యం విలువ మాటలలో చెప్పలేనిది. ఈ విలువ ప్రాణం కంటే తక్కువేమి కాదు. ఆస్తికుడిగా ఉండాలా లేక నాస్తికుడిగానా అనేది ఎవరికివారు నిర్ణయించుకోవలసిన విషయం. అయితే కొన్ని మొహమ్మదీయ దేశాలలో ఇలాంటి హక్కు లేదు. అఫ్గనిస్తాన్, ఇరాన్, మాల్దీవులు,మౌరిటానియ, పాకిస్తాన్, సౌది అరేబియ ఇంకా సూడాన్ దేశాలలో నాస్తికత్వం నిషేధింపబడ్డది . ఇక్కడి వ్యక్తుల నమ్మకాలు వారిని మరణదండనకు గురిచేసే ప్రమాదముంది. ఇది ఖచ్చితంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవహక్కుల ఉల్లంఘనే. డా.ఇన్నయ్య పెక్కువిషయాలలో తన అభిప్రాయాలను నిర్భీతిగా వెల్లడించటం ఈ వ్యాసాలలో గోచరమవుతుంది. రచయిత ఇన్నయ్య అమెరికా లోని మేరీలాండ్ లో నివాసముంటున్నారు.

ఈ ఇ-పుస్తకాన్ని ఇక్కడ చదవవచ్చు లేక ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.