‘సారంగ’లో త్వరలో ‘జాయపసేనాని’ నాటకం

 

 నేపథ్యం

 

ఓరుగల్లును పరిపాలించిన గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు,బావమరిది..తర్వాతి కాలంలో తామ్రపురి( ఇప్పటి చేబ్రోలు)ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలిన “జాయపసేనాని” భారతీయ నాట్య శాస్త్రానికి సంబంధించి భరతముని చే రచించబడ్డ ప్రామాణిక గ్రంథమైన “నాట్య శాస్త్రము”ను సమగ్రముగా అధ్యయనము చేసి కాకతీయ మహాసామ్రాజ్య వివిధ ప్రాంతాలలోని ప్రజాబాహుళ్యంలో అప్పటికే స్థిరపడి ఉన్న స్థానిక నాట్యరీతులనుకూడా పరిగణనలోకి తీసుకుని “మార్గ”(classical) పద్ధతులతో పాటు “దేశీ” నాట్య రీతులనుకూడా ప్రామాణికంగా గ్రంథస్తం చేసి ప్రసిద్ధ “నృత్త రత్నావళి”ని క్రీ.శ.1254 లో ఆవిష్కరించాడు.దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తెలుగులోకి అనువదిస్తే అంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ 1969 లో పుస్తకంగా వెలువరించింది.

దీనిలోని ప్రధాన “దేశీ” నాట్యమైన శివతాండవ శృంగ నర్తనం “పేరిణి”నృత్యాన్ని డా.నటరాజ రామకృష్ణ తన జీవితకాల సాధనగా రూపొందించి 1985 లో శివరాత్రి పర్వదినాన చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో నాలుగు లక్షలమంది వీక్షకుల సమక్షంలో పదివేల ప్రమిదలు ప్రాంగణంలో వందమంది కళాకారులతో “పేరిణి” నృత్యాన్ని ఒక ప్రపంచ రికార్డ్ గా ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో రాయబడ్డ గంట నిడివి గల నాటకం ఈ “జాయపసేనాని”.ఇది మొదట “ఆల్ ఇండియా రేడియో” లో జాతీయ నాటక సప్తాహంలో భాగంగా ప్రసారమైంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం మొట్టమొదటగా ప్రభుత్వంచేత జనవరి 9,10,11 2015 తేదీల్లో వరంగల్లులో నిర్వహించతలపెట్టిన “కాకతీయ ఉత్సవాలు”లో భాగంగా ఈ “జాయపసేనాని” నాటకం ప్రదర్శించబడనున్నది.

ఈ నేపథ్యంలో..రామా చంద్రమౌళి చే రచించబడ్డ “జాయపసేనాని” నాటకం ఇప్పుడు..మన “సారంగ” పాఠకులకోసం.

2 copy

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 20 నుంచి 26 భాగాలు ( సమాప్తం )

26( గత వారం తరువాయి )

 20

కొద్దిగా కళ్ళు తెరిచాడు రామం.. రెండ్రోజుల తర్వాత అప్పుడే స్పృహలోకొచ్చి..

అపోలో హాస్పిటల్‌.. హైద్రాబాద్‌.

బయట ఎడతెగని వర్షం.
రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఇరవైమూడు జిల్లాల జనసేన కార్యాలయాల దగ్గర వేలకొద్ది ప్రజలు. టి.వి. చానళ్ళన్నీ బ్రేకింగు న్యూస్‌.. ఎప్పటికప్పుడు రామం ఆరోగ్య పరిస్థితిపై బులిటిన్లు. భారతదేశంలో ‘ప్రక్షాళన’ పేరుతో ఆరంభమైన ఈ వినూత్న అహింసాయుత వైవిధ్య ఉద్యమాన్ని పరిశీలించేందుకు, విశ్లేషించేందుకు జాతీయ, అంతర్జాతీయ టి.వి చానళ్ళుకూడా హైద్రాబాద్‌లో మకాం వేశాయి.

అంతకుముందు రోజే రామం కోరికగా క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి, శివ ఒకేమాటగా.. ‘వ్యక్తులు ముఖ్యంకాదు.. ముందుకుపోవడం, యుద్ధం చేయడం, పోరాటాన్ని కొనసాగించడం.. అవిశ్రాంతంగా లక్ష్యంవైపు  పయనించడం.. యివే ముఖ్యం’ అని భావించి రామం హాస్పిటల్లో ఉన్నా… యథావిధిగా ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని జిల్లా కేంద్రాల్లో ‘ప్రక్షాళన” మూడవ విడత కార్యక్రమం జయప్రదంగా నిర్వహించబడింది. అన్ని కేంద్రాల్లో రిటైర్డ్‌ ఆడిటర్స్‌, ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ ఆఫీసర్స్‌, కొందరు మాజీ ఎస్పీలు, యిదివరకు ప్రభుత్వంలో పనిచేసి అన్ని రూల్స్‌ సమగ్రంగా తెలిసిన సెక్రటరీ స్థాయి ఉద్యోగులు.. తమతో చాకుల్లాంటి, దేశంపట్ల, సమాజంపట్ల తమ బాధ్యతలనెరిగిన మెరికల్లాంటి, క్రీమ్‌వంటి యువకులు తోడుగా.. చేతిలో ‘సమాచార చట్టం’ ప్రకారం సంపాదించిన సర్టిఫైడ్‌ కాపీలను జతచేసి.,
శక్తి నిత్యమూ, సత్యమూ, నాశనంలేనిదీ ఐనట్టే.. అందరికీ చెందిన గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం వంటి సహజవనరుల ద్వారా ఉత్పత్తిగా, సేవగా, వస్తువుగా.. చివరికి డబ్బుగా మారిన సంపద.. అంతిమంగా సమాజానికి చెందాలి. సమంగా అందరికీ పంచబడాలి. కాని అందరికీ చెందాల్సిన సామాజిక సంపద అనేక అక్రమ మార్గాలద్వారా కొందరి.. అంటే దేశంలోనే ఓ ఏడెనిమిది శాతం మంది గుప్పిట్లలో బందీ ఐ ఉంది. అందరికి చెందవలసిన ప్రజలఉమ్మడి సంపద కొందరి దగ్గర్నే గుప్తమై ఉండడం సహజన్యాయానికి విరుద్ధమైంది కాబట్టి.. దాన్ని ప్రజలే విముక్తం చేస్తున్నారు.
ఆ క్రమంలో.. జనసేన రహస్య సమాచార సేకరణ బృందాలు అన్వేషించి సంపాదించిన అవినీతి సంపాదన, లంచాలద్వారా కూర్చుకున్న నల్లడబ్బు గల అనేకమంది ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థలవాళ్ళు, బ్రోకర్లు, కన్‌సల్టెంట్స్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు.. వీళ్ళ గత ఐదు సంవత్సరాలుగా ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన రిటర్న్స్‌, ఎలక్షన్‌ కమీషన్‌కు లిఖితపూర్వకంగా యిచ్చిన సమాచారం.. ఒక్కొక్కరిపేర ఉన్న బినామీ ఆస్తుల వివరాలు.. అన్నీ జతచేసి ప్రజల సమక్షంలో దాడులు నిర్వహించి నిగ్గుతేల్చాల్సిందిగా ప్రజల పక్షాన ప్రజలు ఋజువుల్తో సహా కంప్లెయింట్‌ చేయడమే.. వాటిపై చర్య తీసుకోకుండా ఎగవేసేందుకు వీల్లేకుండా కాపీ టు కలెక్టర్‌, కాపీ టు చీఫ్‌ సెక్రటరీ, కాపీ టు గవర్నర్‌.. కాపీ టు.. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌, గవర్నమెంటాఫ్‌ ఇండియా.. బృందాలు బృందాలుగా చేసిన కంప్లెయింట్లను కార్యరూపంలోకి తెచ్చేదాకా డే టు డే ఫాలోఅప్‌.. ఎవర్నీ నిద్రబోనిచ్చేది లేదు.. తాము నిద్రపోయేది లేదు.
పరిస్థితి ఏమైందంటే.. ‘జనసేన’ వెంటపడ్తే..ఒక ఆల్సేసియన్‌ కుక్కలమంద వెంటపడి తరిమినట్టే.. చంపవు.. విడిచిపెట్టవు. సాధారణ ప్రజలకుమాత్రం ఒక సుదీర్ఘ చీకటి తర్వాత.. కొత్త ఉషోదయం.
మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులు.

27
ఆ రోజు విప్లవించిన అహింసాయుత ప్రజాచైతన్య ప్రభంజనాన్ని మీడియా ఆకాశమంత విశాలంగా కథనాలు కథనాలుగా.. ప్రజల అభిప్రాయాలుగా, స్పందనలుగా, మేధావుల ప్రశంసలుగా.. కొందరు గుండాల పశ్చాత్తాపాలుగా ప్రసారంచేసి, ప్రచురించి ఎంతో ప్రాచుర్యం కల్గించాయి.
పరిస్థితి.. నిబద్ధత.. ఎవరికోసం ఏదీ ఆగదు. తీరం చేరేదాకా ప్రయాణం తప్పదు. కొనసాగింపేగాని విరామంలేదు.
వందల వేల సంఖ్యలో ‘రామం’ గురించిన ఎంక్వయిరీలు.. రాష్ట్రం నలుమూలల్నుండి.. ఇతర రాష్ట్రాల అభ్యుదయకాముకులనుండి, ప్రజాసంఘాలనుండి.
ఎప్పుడూ శక్తి ఒకచోట క్షిప్తమై ఉంటుంది. కాని ఒక వెక్టార్‌గా బాణంవలె, తుపాకీగుండువలె అనుసంధానించగలిగే కర్త ఒకరు కావాలి. రామం.. నాయకుడు.. ప్రజాశక్తిని ఒక నిశ్శబ్ద రక్తపాతరహిత ఉద్యమంగా రూపొందించి బ్రహ్మాస్త్రాన్ని చేసి సంధించిన సంధానకర్త. కర్త కర్మ క్రియ..అన్నీ.
యిప్పుడా నాయకుడెలా ఉన్నాడు. అసలా ‘అగ్ని’పై దాడి ఎలా జరిగింది.
పోలీసులు.. కుక్కలు.. అందరూ రంగప్రవేశం చేశాయి.
కాని.. జనసేన కార్యకర్తలు.. సుశిక్షితులు.. యోధులు.. కొత్తవాడ దాడి జరిగిన రెండుగంటల్లోనే శివనగర్‌లో పట్టుకున్నారు ఆ బాంబువేసినవాణ్ణి. ఆ వ్యక్తిని పోలీసుల అదుపులోకి ఇచ్చేముందు సరియైన పద్ధతిలో గూఢాచార కార్యకర్తలు విచారిస్తే.. అంతా బయటపడింది. దాదాపు ఐదు ప్రజాసంబంధమైన ప్రాజెక్ట్‌ల్లో పధ్నాలుగు వేలకోట్లు ప్రక్కదారి పట్టించి తింటున్న ఒక రాయలసీమ రాజకీయ నాయకుడు యిక తన దుశ్చర్యలన్నీ బట్టబయలైతాయని భయపడి, ‘జనసేన’ ఉద్యమం ఇంకా ఇంకా బలపడి వేళ్ళూని బలపడకముందే ఆదిలోనే తుంచేయాలని రామంను హతమార్చేందుకు యాభై లక్షల బేరాన్ని కుదర్చుకుని పంపగా వచ్చిన కిరాయిరౌడీ.. పేరు ఈరప్ప.. మొత్తం కూపీ బయటపడింది. ఆ నాయకుడెవడు. వాని చరిత్ర నేపథ్యం ఏమిటి.. వాని వెనుక ఉన్న తెరవెనుక గుండాలెవరు.. అంతా వెంటనే చర్యకొరకు రాయలసీమలోని ‘జనసేన’ కార్యాలయానికి ఆదేశాలు వెళ్ళాయి.
రామం కళ్ళు తెరిచి.. స్పృహలోకొస్తూ.. మెల్లగా చుట్టూ చూశాడు.
వర్షం చినుకుల చప్పుడు.
గదిలో.. క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, శివ.. మూర్తిగారు.
”బాంబు పేల్చినవాడు పట్టుబడ్డాడు”అన్నాడు శివ ఆత్రంగా
”….” మౌనంగా శివవంక చూశాడు రామం నిర్మలంగా.. ప్రశాంతంగా.. ఆ చూపులనిండా కరుణ జాలువారుతోంది.
”పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు..రాయలసీమవాడు.”
”శివా.. వాణ్ణి వదిలేయమని నా తరపున ఒక ఆప్లికేషన్‌ తయారుచేయి ప్లీజ్‌”
”రామం.. మీరేమంటున్నారు. వాడు మిమ్మల్ని హతమార్చాలనుకున్నాడు”
”ఔను.. అందుకే వదిలేయమంటున్నాను”
”….” శివ అవాక్కయి శూన్యంగా చూస్తూండగా.,
గోపీనాథ్‌కు రామంలో పూర్తి పరిపక్వత చెందిన పరిపూర్ణ మానవుడు దర్శనిమస్తూండగా..,
”శివా.. అతను యిప్పటికే పశ్చాత్తాపపడ్తూంటాడు. విడిచిపెట్తే వాడొక వాల్మీకిలా పరివర్తన చెందుతాడు శివా.. నిజం.. ద్వేషానికీ, పగకూ శిక్ష ఎప్పుడూ పరిష్కారం కాదు. క్షమ ఒక్కటే అటువంటి వ్యక్తికి సరైన శిక్ష”
మూర్తిగారు ఆశ్చర్యంతో ఆనందపడిపోయాడు. తను ఇన్నాళ్లుగా జరిపిన ప్రపంచ తత్వవేత్తల, మహాపురుషులకు సంబంధించిన అనేక అధ్యయనాల్లో యింత పరిణతి కనిపించదు. రామం ఆయనకు ఓ కొత్తకోణంలో మహామనీషిలా కనబడ్డాడు మొదటిసారి.
ఈలోగా శివ చేతిలోని ‘జనసేన’కు సంబంధించిన హాట్‌లైన్‌ మొబైల్‌మ్రోగింది. వరంగల్లు జనసేన కేంద్రక కార్యాలయంనుండి..
”హలో..” అన్నాడు శివ ఏదో ముఖ్యవిషయమే ఐ ఉంటుందని ఊహిస్తూ,
‘ఆపరేటర్‌ పద్మజ.. హలోశివా.. అస్సాంనుండి అఖిల్‌ గొగోయ్‌ అనే సామాజిక ఉద్యమకారుడు రామంగారి ఆరోగ్యంగురించి వాకబు చేస్తున్నాడు. మనవలెనే సమాచారచట్టం ఆర్టిఐని ఆధారంగా చేసుకుని 2006 నుండి కృషిక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి అనే సంస్థను స్థాపించి ఎఫ్‌ సి ఐ గోదాములు, ప్రజాపంపిణీ వ్యవస్థపై చారిత్రాత్మకమైన పోరాటం చేస్తున్నాడు.. అతను..”
”కనెక్షన్‌ యివ్వు పద్మజా”
వెంటనే లైన్‌ రీ ఓపెనై అఖిల్‌ గొగోయ్‌ ట్రాక్‌లోకొచ్చాడు.
”గుడ్మార్నింగు.. హౌ ఈజ్‌ మిస్టర్‌ రామం.. జనసేన చీఫ్‌”
”గుడ్మార్నింగు సర్‌. హి ఈజ్‌ ఔటాప్‌ డేంజర్‌ నౌ.. ఆల్సో సేఫ్‌..”
”థాంక్‌గాడ్‌.. రామం వంటి వారు ఈ దేశానికి చాలా అవసరం.. మీ జనసేన గురించి మీడియాలో జాగ్రత్తగా గమనిస్తున్నాను. నేను ‘అగ్ని’ ఛానల్‌ చూస్తా. మేము యిక్కడ చేయలేని పనిని మీరు భారీఎత్తున చేపట్టి విజయం సాధిస్తున్నారు.. బెస్టాఫ్‌ లక్‌.. ఒకసారి రామం గారికివ్వండి” అన్నాడు అస్సామీ భాషలో-
శివ ఫోన్‌ను రామంకు అందించాడు.. యిచ్చి ”అఖిల్‌ గొగోయ్‌.. కె ఎమ్‌ ఎ స్సెస్‌ అస్సాం” అన్నాడు.
”గుడ్మాన్నింగు.. మిస్టయ్‌ గొగోయ్‌.”
”…..” అట్నుండి సంభాషణ జరిగి.,
”థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్‌.. ఐ ఆల్సో విష్‌ ద బెస్ట్‌ ఇన్‌ యువర్‌ ఎండీవర్‌” అన్నాడు  రామం.
”యు ఆర్‌ ది హోపాఫ్‌ ది నేషన్‌.. మిస్టర్‌ రామం.. ప్లీజ్‌ టేక్కేర్‌..”
”….” నిశ్చలంగా మొబైల్‌ను శివకు అందించాడు రామం.
”శివా.. మొన్నటి మన ‘ప్రక్షాళన’ జరిగిందా ముందే అనుకున్నట్టు”
”ఔను.. జరిగింది.”
”క్యాథీ… గోపీనాథ్‌ సార్‌.. నావల్ల మన కార్యకలాపాలేవీ ఆగొద్దు. మనవంటి సామాజిక ఉద్యమాల్లో ఒక నాయకుడు, అనేకమంది అనుచరులుండొద్దు.. ప్రతివ్యక్తీ ఒక స్వయంచోదిత నాయకుడుగా ఎదిగి ఎదురొడ్డి పోరాడాలి.. క్యాథీ మనం అనుకున్న ప్రోగ్రాం చెప్పవా ప్లీజ్‌” అన్నాడు రామం ఆమెవైపు చూస్తూ.
”మన కార్యాచరణ పథకంలో మనం ప్రధానంగా ఐదు థల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం. అవి అవగాహన, ప్రక్షాళన, సంగ్రామం, పరిపాలన మరియు కొనసాగింపు. మనం గత మూడునెలలో నెలపదిహేను రోజులు అవగాహన పేరుతోలక్షలమందిని సంప్రదించి, అభిప్రాయాలు సేకరించి, డాక్యుమెంట్‌ చేసి ప్రజల్లో పౌరవిధులపట్ల, బాధ్యలపట్ల, హక్కులపట్ల, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలపట్ల అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశాం. దాదాపు నాల్గు లక్షలమందిని జనసేనలో చేర్పించి, లక్షమంది క్రియాశీల కార్యకర్తలతో ఒకటి, ప్రక్షాళన రెండు.. ప్రక్షాళన మూడు కార్యక్రమాలను అమలుచేస్తూ కాంట్రాక్టర్లరూపంలో ఉన్న రాజకీయ నాయకులపైన, యితర దుర్మార్గ బినామీ ఆపరేటర్ల మీద, పవర్‌ ప్రాజెక్ట్‌లు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, రోడ్లు, వంతెనలు, నిర్మాణాలు.. వీటన్నింటిపై మొత్తం ఆరువందల నలభై ఎనిమిది కేసులను ముఖాముఖి ప్రజల సమక్షంలో నిలదీసి.. దాదాపు డెబ్బయిఎనిమిది వేల కోట్ల రూపాయల పాక్షిక దుర్వినియోగాన్ని కోర్టులద్వారా, లోకాయుక్త ద్వారా.. నైతిక విజయాలద్వారా ఆపి నిలదీశాం. దీంతో ప్రభుత్వ సూడో రాజకీయ యంత్రాంగమంతా తోకముడిచి కలుగుల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు యిప్పుడు నేయి హవిస్సుగా లభిస్తున్నప్పుడు ఎగిసెగిసిపడే యజ్ఞ అగ్నిజ్వాలల్లా చైతన్యంతో ధగధగలాడ్తున్నారు. యిక ప్రక్షాళన నాల్గు ఇంకో వారం తర్వాత ఉంది. ఆ థలో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు రావట్లేదు. ఉద్యోగాలు ఎందుకు రూపొందించబడట్లేదు. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో బడాబడా వెధవలు ఎలా శాశ్వత ప్రకృతి వనరులను, మానవశక్తిని దోపిడీ చేస్తున్నారు. దేశీయ ఆదివాసీ, గిరిజన, అరణ్యప్రాంత తెగల ప్రజలు ఎందుకు అణగారిపోయి జీవిస్తున్నారు. వీరిపేర ప్రభుత్వాలు ఇంతవరకు ఎన్నివేల కోట్లను ఉపయోగించి, ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామని చెప్పి.. ఎంత భోంచేశాయి.. యివన్నీ, వీటి చిట్టా విప్పవలసి ఉంది. వీటి సమగ్ర సమాచారం మన గూఢాచార, యువజన విభాగాలు సేకరిస్తున్నాయి. యిక ఆ తర్వాత అతి కీలకమైన సంగ్రామం ప్రారంభమౌతుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చైతన్యవంతులైన ప్రజలు యిక బెబ్బులులై విజృంభించి నేరచరితులు, గుండాలను, అవినీతిపరులైన రాజకీయ నాయకులను కనబడ్తే తరిమి తరిమికొడ్తారు. కలుషితమైన ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా నిర్మలమై, స్వచ్ఛమై పారదర్శకమయ్యేదాకా మన ‘సంగ్రామం’ కొనసాగుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం.. నిరంతరమై, అవిశ్రాంతమై కొనసాగవలసిన ప్రాణక్రియ. ఒకసారి మన ‘జనసేన’ చేత ఆమోదముద్రను పొంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. అధికారంతో సంబంధంలేని మన ‘జనసేన’ సూచించిన ఆదర్శపాలనను ఆరంభించిన తర్వాత.. పరిపాలనా విధానం.. జనాన్ని పూర్తిస్థాయి ఆత్మగౌరవంతో యాచకులవలెగాక ఆత్మాభిమానంతో బతుకగల నాణ్యమైన జీవితాలన్నందించే స్థాయిని, స్థితిని సాధించిన తర్వాత.. మార్గదర్శకాలను, ఆదేశాలను ఎప్పటికప్పుడు స్వార్థరహిత సలహాదారుల నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షమై.. సుశాంతమై.. వర్థిల్లుతూంటే.. యిక ఆ స్థితియొక్క కొనసాగింపు..  ఓ నిరంతర నియంత్రణ క్రియ. నియంత్రణ లేకుంటే పాలనా వ్యవస్థ కుప్పకూలి పతనమైపోతుంది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పదేళ్ళకాలం రాజకీయ విలువలతో కూడిన సంస్కారవంతమైన వ్యక్తులే దేశపరిపాలనలో పాలుపంచుకున్నారు. తర్వాతనే ఎవరి నియంత్రణాలేక, అసమర్థతవల్లా, అధికార వ్యామోహం వల్లా నాయకులు నీచులైపోయారు. యివీ మన ప్రధాన కార్యక్రమాలు రామం..” క్యాథీ ఆగింది నెమ్మదిగా.
”ఇవేవీ ఎక్కడా ఒక్కశాతం కూడా డిరైల్‌ కావద్దు. నేను కోలుకునేదాకా.. మీరంతా మనం అనుకున్న ప్రకారమే కార్యక్రమాలను యథావిధిగా నడిపించండి.. నేనుంటా మీవెంట.. ఈ బెడ్‌పై నుండే..”
”యస్‌.. యస్‌..” అన్నారు గోపీనాథ్‌.. మూర్తి సాలోచనాగా..ఒకేసారి.
తర్వాత.. చుట్టూ నిశ్శబ్దం.
బయట వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా.
”నాకు నిద్రొస్తోంది..” అన్నాడు రామం.. మెల్లగా కనురెప్పలను మూసుకుంటూ.
అది నిద్రకాదు.. యింతకుముందు డాక్టర్‌ యిచ్చిన ట్రాన్‌క్విలైజర్‌ అని గోపీనాథ్‌కు తెలుసు.
శివ, గోపీనాథ్‌, మూర్తి.. ఆ గదిలోనుండి బయటికి.. బాల్కనీలోకి నడిచారు.
క్యాథీ ఒక్కతే ఆ గదిలో మిగిలింది.
ఎందుకో ఆ క్షణం నిగ్రహించుకోలేని దుఃఖం ఆమెను ముంచేసింది. ఎక్కెక్కిపడి ఏడ్చింది మౌనంగానే.

21

‘శత్రుశేషాన్ని సమూలంగా ధ్వంసం చేయాలి. ఆ విషయంగా ఉపేక్ష అస్సలే కూడదు.’ అనేది ఎస్పీ విఠల్‌ సిద్ధాంతం.
మంత్రి మాధవయ్య హత్య.. కానిస్టేబుల్‌ హత్య.. తర్వాత ఒక అద్భుతమైన కథ.. హోంమంత్రి స్థాయిలో అంతా మర్యాదల అంగీకారాలు.. నానుండి.. నీకేంకావాలి..నీనుండి నాకేంకావాలి.. బేరసారాలు, లావాదేవీలు. ముఖ్యమంత్రిదాకా  ఒక రాయబారం – ఒక అవగాహన. చివరికి మంత్రి మాధవయ్య హత్యపై ఒక కమీషన్‌.. ఎంక్వయిరీ.. మంత్రి. కాబట్టి తొందరగా నివేదిక కావాలని ఆదేశం..
ఈ దేశంలో ప్రధానమంత్రి హత్య చేయబడ్తే పదేళ్లు.. ముఖ్యమంత్రి చచ్చిపోతే నిజంనిగ్గు తేల్చడానికి పదినెలలు పట్టే ‘రెడ్‌టేప్‌’ కాలంలో, వ్యవస్థలో.. ఎవని గోల వానిది.. ఎవని శ్రద్ధాసక్తులు వానివి. భారతదేశంలో పై తరగతి ఉద్యోగుల్లో పశువులకంటే ఎక్కువ అతిస్వేచ్ఛ, ఎవనిపై ఎవనికీ నియంత్రణలేని అరాచకత్వంతో నిండిన విచ్చలవిడితనం ఉందంటే.. ఆ బురదలో నివసిస్తున్నవాడికే ఈ దుర్గంధానుభవం అర్థమౌతుంది.
విఠల్‌ ఆరోజు రాత్రి చాలా ఆనందంగా ఉండి మధ్యవర్తిత్వం జరిపిన ముగ్గురు ఫ్రెండ్స్‌కు మద్యం, మగువలతో పోలీస్‌ గెస్ట్‌హౌజ్‌లో పోలీసుల పహరామధ్య పార్టీ యిచ్చాడు. మంత్రి మాధవయ్య హత్యను ఎంక్వయిరీ చేసిన వన్‌మ్యాన్‌ కమీషన్‌.. మంత్రిగారిని అతని దగ్గర అంగరక్షకుడుగా పనిచేస్తున్న మురళీధర్‌ అనబడే గన్‌మన్‌ ముఖ్యమంత్రి యొక్క వీరాభిమాని కావడంవల్ల, ఆరోజే ఉదయం మంత్రి మాధవయ్య ముఖ్యమంత్రిని విమర్శిస్తూ, తూలనాడ్తూ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించడంవల్ల మానసికంగా గాయపడి.. బాగా తాగిన మైకంలో అర్ధరాత్రి బాగా తాగిఉన్న మంత్రి మాధవయ్యను రివాల్వర్‌తో రెండుసార్లు తూటాలు పేల్చి హత్య చేశాడు. ఈ తతంగాన్నంతా తన కళ్ళముందు జరుగుతూండగా ప్రత్యక్షంగా చూస్తున్న ఎస్పీ విఠల్‌ తన విధినిర్వహణలో భాగంగా కానిస్టేబుల్‌ను అడ్డుకోబోయి విఫలుడై విధిలేని పరిస్థితుల్లో ఆత్మరక్షణార్ధం తన సర్వీస్‌ రివాల్వర్‌తో గన్‌మన్‌ మురళీధర్‌ను కాల్చవలసి వచ్చింది. అందువల్ల మురళీధర్‌ అనివార్యమై మరణించాడు. ఇదంతా ఒక అతి సహజ ఘటన. దీంట్లో ఎస్పీ విఠల్‌ ప్రమేయం అస్సలేలేదు. అతను పూర్తిగా నిర్దోషి.. అదీ సారాంశం.
ఎంక్వయిరీ కమీషనర్‌కు కోటి రూపాయలు ముట్టాయి.. మధ్యవర్తులిద్దరికి చెరో పది పదిలక్షలు. ఒకటి రెండు నెలల తర్వాత.. ముఖ్యమంత్రి సమక్షంలో జెంటిల్‌మన్‌ అగ్రిమెంట్‌.. మంత్రి తాలూకు బ్రతికున్న వారసులకు, తనకు.. బార్ల లెక్కలు, భూముల లెక్కలు, సెటిల్‌మెంట్ల అకౌంట్స్‌.,
రాజీకి రాకుంటే చచ్చినోడు ఎట్లాగూ తిరిగిరాడు.. కనీసం ఈ పరిష్కారం క్రింద ఇరవైరెండు కోట్లు పోతాయని చెప్పినమాట వినుడు. అంతేగాని ఎవడు వెధవ కాడు.. ఎవడూ గాజులేసూక్కుర్చోడు.
మంత్రిని చంపడం వల్ల వాడు లెక్కలు తప్పించి నొక్కేసిన డబ్బులోనుండి ముప్పయి రెండు కోట్లు తనకు లాభం.
మొత్తంమీద ఎస్పీ విఠల్‌ టైం బాగుండి హత్యవల్ల ఇబ్బడి ముబ్బడిగా కోట్ల కొద్ది రూపాయల లాభమే చేకూరింది. పైగా బోనస్‌ క్రింద వేరొక జిల్లాకు ట్రాన్స్‌ఫరై.. మళ్లీ కొత్త గడ్డిమైదానం.. పచ్చని తాజాగడ్డి. మళ్ళీ ఇష్టమున్నట్టు మేత.
కాని.,
ఆ రోజు.. ఆ వర్షం కురిసిన రాత్రి..హత్యచేయబడ్డ మంత్రిగారు బాగా తాగి, తనూ తాగి, తనతో షూట్‌ చేయబడ్డ గన్‌మెన్‌ మురళీధర్‌ కూడా బాగా తాగి.. అందరికందరూ తాగుడుమైకంలో పిచ్చిపిచ్చిగా ఓలలాడ్తున్న ఆ చీకటి రాత్రి.,
తను మంత్రిని కాల్చిచంపడం కిటికీలోనుండి ఆరోజు సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రాములు చూశాడేమోనని అనుమానం విఠల్‌కు. అందుకే రాములును అప్పుడప్పుడు ఏదో ఒక నెపంమీద తన దగ్గర్కి రప్పించుకుని మాటల్తో పరీక్షించాడు. కాని అనుమానం బలపడ్తూనే ఏదీ స్పష్టంగా అర్దంగాక పిచ్చిపిచ్చిగా, చికాగ్గా ఉందతనికి.
మరి.. శత్రుశేషం.. సిద్ధాంత కింద రాములుగాణ్ణి శాశ్వతంగా లేపేస్తేమిటట.,
ఏమీలేదు.. లేపెయ్యొచ్చు సుళువుగా.
రాజు తల్చుకుంటే దెబ్బలక్కొదువా అన్నట్టు ఎస్పీ తల్చుకుంటే ఒక కాన్‌స్టేబుల్‌ను చంపడం కాలితో చీమను తాడించి చంపినంత సుళువు.
ఒక ఎన్‌కౌంటర్‌.. ఒక తుపాకీ శుభ్రం చేసుకుంటూండగా పొరపాటున తూటా పేలి ప్రమాదవశాత్తు దుర్మరణం.. డ్యూటీపై వెళ్తూండగా లారీకింద పడి పరమపదించెను.. ఇలాంటివి సవాలక్ష.,
కాని.. ఏది చేసినా.. పకడ్బందీగా, రంజుగా చేయాలని విఠల్‌ కోరిక.
అందుకే.. రాములును తనతోపాటే తనకు కొత్తగా పోస్టింగిచ్చిన జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని రప్పించాడు.
రేపు ఉదయం.. ఏడుగంటలకు సీక్రెట్‌ ట్రిప్‌.. ముత్తారం అడవుల్లోకి.. ఒక నక్సలైట్ల రహస్య స్థావర ఆచూకీ కోసం.. టాఫ్‌లెవల్‌ పర్సూఎన్స్‌లో.. ఎస్పీ తను.. డ్రైవర్‌ రాములు.. ఇద్దరే.. రహస్య పర్యటన.. అడవి లోపలికి.. మనుష్య సంచారమేలేని అడవి గర్భంలోకి.,
అక్కడ.. రాములు.. పరలోకగతుడగుట.,
శత్రుశేషం పూర్తిగా నిశ్శేషమై.. క్లీన్‌బౌల్డ్‌.. పరమపదసోపానం.
విఠల్‌ విస్కీ మత్తులో తన సరికొత్త ఉంపుడుగత్తె రాణీ పద్మజ కౌగిట్లో దొర్లుతూ.. రాములు కథను ఊహించుకుంటూ.. ఆమెతో.,
”రేపుదయం ఆరింటికి లేపాలి.. ఆరున్నరకు స్పెషల్‌ దౌరా.. ” అంటున్నాడు ముద్దముద్దగా.
అప్పుడు రాత్రి ఒంటిగంట పదినిముషాలైంది.
కానిస్టేబుల్‌ రాములుకు ఆశ్చర్యంగా, అదోలా, విచిత్రంగానే కాకుండా భయంగాకూడా ఉంది.
నక్సలైట్ల వేటకోసం కేంద్ర నిధులతో సమకూర్చుకున్న బులెట్‌ ఫ్రూఫ్‌ వాహనాల్తోసహా నిజంగా కొన్నవి కొన్ని, కొన్నట్టు కాగితాల్లో చూపించినవి కొన్ని. ప్రత్యేకంగా అడవులు, కొండల్లో పనికి వచ్చేవి కొన్ని.. అందులో ఒకటి.. ఎస్పీగారు తన యిష్టమొచ్చినపుడు టీ షర్ట్‌, స్పోర్ట్స్‌ ష్యూస్‌ వేసుకుని థర్డ్‌లేడీతో విహారశృంగారయాత్ర జరపడానిక్కూడ పనికొచ్చే ధగధగా నల్లనాగులా మెరిసే ర్యాంగ్లర్‌ జీప్‌.,
ఆ జీప్‌డ్రైవర్‌గా తను.. ప్రక్కసీట్లో ఎస్పీ విఠల్‌.. ఉదయమే నాల్గున్నర గంటలకు.. ఇద్దరే ఇద్దరు వర్షం వెలిసి చల్లగా ఈదురుగాలి వీస్తున్నవేళ బయల్దేరి.,
”మహాముత్తారం అడవుల్లోకి.. ” అన్నాడు జీప్‌ కదలగానే. అంతే యిక మాట్లాడ్డేదు ఎస్పీగారు ఇంతవరకు. మధ్య ఒకసారీ స్పీడ్‌పెంచి యింకా యింకా వేంగా పోనీ అన్నట్టు చూశాడంతే. గంటకు నూరుకిలోమీటర్లకన్నా ఎక్కువవేగంతో జీప్‌ గత మూడుగంటలు పరుగెత్తి పరుగెత్తి.. మహాముత్తారం అడవుల్లోకి ప్రవేశించి.. అరగంటగడిచి..,
మధ్య మధ్య అక్కడక్కడ పోలీస్‌పోస్ట్‌ల్లో రోడ్డుపైకి ఓ కానిస్టేబుల్‌ గన్‌తో సహా పరుగెత్తుకొచ్చి అతి వినయంగా సెల్యూట్‌ చేసి.. అంటే.. ఎస్పీ గారొస్తున్నట్టు కొంతమందికి సమాచారముందున్నమాట.
ఎస్పీ విఠల్‌ ప్రయాణిస్తున్న మూడుగంటల్లో ఎక్కువసేపు కండ్లమూసుకుని ధ్యానంలోఉన్నట్టు ఉండిపోయాడు. అతను ఏదన్నా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడో, నిద్రపోతున్నాడో, ధ్యానముద్రలో ఉన్నాడో రాములుకు అర్ధంకాలేదు. ఏది చేస్తున్నా అతని శరీరంలోనుండి విస్కీవాసన, బట్టల పోలీస్‌ వాసన.. వెరసి ఖాకీ కంపుకొడ్తోంది. ఒక ఎలుగుబంటు ప్రక్కన భయం భయంగా తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చున్నట్టు రాములు వణికిపోతూ గజగజలాడ్తూ వేగంగా, పదిలంగా జీప్‌ను నడిపిస్తున్నాడు.
అడవంతా నిశ్శబ్దంగా గంభీరంగా.. తపస్సు చేసుకుంటున్న ఋషిలా ఉంది.
ఎక్కడో అక్కడక్కడ కనబడ్డ చిన్న చిన్న ఆదివాసీ గ్రామాలు కనుమరుగైపోయి.. యిక అంతా అడవే. ఎక్కడా మానవ సంచారంలేదు.
”అడవంటే యిష్టమా రాములూ నీకు” అన్నాడు విఠల్‌.
మూడున్నర గంటల తర్వాత అతను మాట్లాడిన మొదటి మాట అది.
”ఔన్సార్‌..”
”చాలా యిష్టమా.. కొంచెం యిష్టమా”
”చాలానే యిష్టంసార్‌..”
‘ఊఁ.. నాక్కూడా అడవంటే చాలా యిష్టం నీకులాగానే”
రాములు మాట్లాడలేదు.. ఈ సంభాషణేమిటి అసంగతంగా అనుకున్నాడతను.
”ఔను రాములూ ఆ రోజురాత్రి.. వర్షం కురుస్తున్న రాత్రి.. వరంగల్లు గెస్ట్‌హౌస్‌లో..జ్ఞాపకముందా..” అన్నాడు సడెన్‌గా.
పోలీస్‌ బుద్ది, కుక్కబుద్ది ఒకటే.. వాసన చూడ్డం. ఐతే, వాడు కానిస్టేబులైనా ఎస్పీఐనా ఒకటే.
”జ్ఞాపకముంద్సార్‌.. మంత్రి మాధవయ్యగారు హత్యచేయబడ్డ రాత్రిగదా మీరంటూన్నది.”
”ఊఁ.. ” ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు ఆ రాత్రి తను మంత్రిని చంపుతూండగా వీడు చూశాడని.
”నువ్వప్పుడు సెంట్రీడ్యూటిలో ఉన్నావా రాములూ”
”ఔన్సార్‌..”
వెంటనే ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు యిక వీణ్ణి లేపేయాలని.
సరిగ్గా అప్పుడే గ్రహించాడు రాములు ఈ ఎస్పీగానితో ఏదో ప్రమాదం పొంచిఉందని.
”ఐనా మీరు మొన్నటి ఎంక్వయిరీ కమీషన్‌ రిపోర్ట్‌లో నిర్దోషని తేలిపోయిందిగదా సర్‌.. కంగ్రాట్స్‌ సర్‌” అన్నాడు రాములు.
”ఊఁ..”
వెంటనే ఒక మెరుపులా లీల జ్ఞాపకమొచ్చింది విఠల్‌కు. పాపం పుణ్యాత్మురాలు తనను కాపాడిందా గండంనుండి. ఎంక్వయిరీ కమీషన్‌గా వేసిన ఆ ఢిల్లీ బేస్ట్‌ రిటైర్డ్‌ డిజిపి లక్ష్మీనారాయణ సక్సేనా ముక్కూమొఖం తెలియదు తనకు. ” అమ్మా కాపాడని” వేడుకున్నాడు తను లీలను దీనంగా. ఎంత విస్తృతమైన పరిచయాలో, ఎన్ని గ్లోబల్‌ లావాదేవీలో లీలకు. క్షణాల్లో తనను ఢిల్లీ పిలిపించుకుని ఒక కోటి రూపాయలతో సక్సేనాతో డీల్‌ సెటిల్‌ చేసింది. తర్వాత్తర్వాత చచ్చిపోయిన మంత్రి పెళ్ళాన్ని, తనను హైద్రాబాద్‌ పిలిపించి మూడు ముక్కల్లో మూడువందల కోట్ల వ్యవహారాలను ఫటాఫట్‌ పంచి సరే అనిపించింది. తనుమాత్రం రెండు కేసులకూ కలిపి ఓ నాలుక్కోట్లు తీసుకుందంతే. డెడ్‌ చీప్‌. సెటిల్‌మెంట్లు చేయడంలో ఎవడు సాటొస్తాడు లీలకు. వినకుంటే వాడు లేచిపోయిండంతే. ఒకసారి ఓ కర్ణాటక పాలిటీషియన్‌ వినకుంటే వాన్ని చార్టర్డ్‌ ప్లేన్‌లో తీసుకెళ్లి హిందూమహాసముద్రం డీప్‌వాటర్స్‌లో పడేసొచ్చింది స్వయంగా. వాడింకా పోలీస్‌ రికార్డుల్లో అబ్‌స్కాండింగుగానే ఉన్నాడు. ఒక్క ఆడది.. వంద మగాళ్లకంటే ఎక్కువ.. రియల్లీ గ్రేట్‌ లేడీ.
విఠల్‌ చుట్టూ చూచి.. ఎక్కడా మానవ సంచారంలేదని పకడ్బందీగా నిర్ణయించుకుని.. బాగా దట్టమైన చెట్లు, పొదలు, తుప్పలు.. పక్కనే పెద్ద లోయ.. నదిపాయ ఉన్న కీలక ప్రాంతాన్ని ఎన్నుకుని..
”జీప్‌ ఆపు రాములూ” అన్నాడు మృదువుగా.
రాములు సాలోచనగా ఎస్పీగాడి దిక్కు చూచి.. జీప్‌కు బ్రేక్‌ అప్లయ్‌ చేస్తూ.. ఇప్పుడు నిరాయుధంగా ఉన్న తనను వీడు తను పిస్టల్‌తో కాల్చే ప్రయత్నం చేస్తే ఎలా తప్పించుకోవాలా అని మెరుపులా ఆలోచిస్తున్నాడు. ఏమీ తోచడంలేదు. మరోవైపు భయం ముంచుకొస్తోంది గుండెల్లోకి.. వణుకు..వణుకు.
అనివార్యమైనపుడు..జైల్లో ఉన్నవాడు వేలిగోటితో గోడను గీకిగీకి పొక్కచేసుకుని తప్పించుకుని పారిపోయిన ఉదంతం జ్ఞాపకమొచ్చింది రాములుకు.
”యిక్కడెక్కడో.. నక్సలైట్ల డంప్‌ ఉండాలి.. వెదుకుదాం.”
విఠల్‌ కిందికి దిగాడు. అటువైపు నుండి రాములుకూడా దిగి.,
”నువ్వటు పో.. నేనిటు చూస్తా..ఓ.కే..”
”యస్సార్‌..”
అక్కడ డంప్‌ లేదు పాడులేదని విఠల్‌కు తెలుసు.. కాని ఒట్టి బహానా.
అటుదిక్కు విఠల్‌ అడుగులో అడుగేసుకుంటూ కదిలాడు ఏదో వెదుకుతున్నట్టు.
అదేక్షణం.. విఠల్‌ వెళ్తున్న దిశకు వ్యతిరేకదిశలో రాములు బయల్దేరాడు మెల్లగా.. అతని ఒళ్ళు గజగజ వణికిపోతోంది.. ఏ క్షణాన్నైనా విఠల్‌ చటుక్కున వెనక్కి తిరిగి తనను రివాల్వర్‌తో కాలుస్తాడని ఊహిస్తున్నాడతను.. కాని ఎలా.
మెరుపులా.. ఏదో తోచి.. జరజరా వాలుగా ఉన్న పెద్ద మట్టిజాలుపై నుండి క్రిందికి జారాడు రాములు కావాలని..వేగంగా, బండరాయిలా జారుతూ జారుతూ వేగంగా వచ్చి వచ్చి.. ఒక మోదుగుచెట్ల తుప్పకు తట్టుకుని ఆగి.. పిర్రలు, చేతులు, కాళ్ళంతా గీరుకుపోయి..,
లేచి నిలబడి.,
పైకి చూశాడు రాములు.. ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్న పెద్దపెద్ద ఎత్తైన చెట్లు.. కింద ఒంపులో.. ఒర్రెలో తను. విఠల్‌ కనిపించడంలేదు.
ఇలాగే పారిపోయి తప్పించుకుంటే.,
”అరె రాములూ.. ఏడున్నవ్‌రా.” పైనుండి ఎస్పీగారి అరుపులు,.,
పైకి చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తున్న రాములు కాలికి ఏదో చల్లగా, నునుపుగా తాకి.. దిగ్గున ఉలిక్కిపడి.. ఆగి.,
కాలిదగ్గర.. తుపాకీ.. ఎ.కె. ఫిఫ్టీ టు.. నల్లగా త్రాచుపామువలె మ్యాగజైన్‌ లోడ్‌ చేసి.. రెడీ టు యూజ్‌ టైప్‌లో, చటుక్కున చుట్టూ చూశాడు.. ఎక్కడా ఎవరూ లేరు.
రాములుకు క్షణంలో అంతా అర్థమైంది. తను యిదివరకు నక్సలైట్ల కూంబింగు ఆపరేషన్స్‌లో పాల్గొన్న అనుభవం గుర్తొచ్చింది. మళ్ళీ చుట్టూ చూశాడు పరిశీలనగా.. అటుప్రక్క తుప్ప.. అప్పుడే కప్పినట్టు ఎర్రగా.. కొత్తగా మట్టి..పైన తుమ్మకొమ్మలను కప్పినట్టు పచ్చిపచ్చి.,
టకటకా తుమ్మకొమ్మలను జరిపి.. కప్పిన మట్టిని చేతివ్రేళ్ళతో పెకిలించి. తోడి ..చకచకా..ప్రాణభయం ఒకవైపు.. అనుకోని గగుర్పాటు కల్గించే సందర్భం మరోవైపు.. ప్రక్కన ఎ.కె ఫిప్టీటు తుపాకీ..కొండంత ధైర్యం..ఓ జానెడు లోతుపోగానే చేతికి తాకింది పెద్ద రేకు సందుగ. తుపాకీతో మట్టిని పెళ్ళగించి, అటుతోడి ఇటుతోడి.,
”అరే రాములూ.. ఏడ సచ్చినౌరా..” విఠల్‌ గొంతు.. దగ్గరైతోంది తనకు.
కరకరా ఎండిన ఆకులు బూటు కాళ్ళకింద నలిగి విరుగుతున్న చప్పుడు
హమ్మయ్య.. ట్రంక్‌పెట్టె మూత తెరిచాడు రాములు.. తెరిచి కొయ్యబారిపోయి.. కళ్ళప్పగించి.. గుండె చెదిరి.
అన్నీ వేయి రూపాయలనోట్ల కట్టలు.. భద్రంగా నింపి, పేర్చి.. ప్రక్కన కొన్ని గ్రేనైడ్స్‌. రెండు ఎ.కె ఫార్టీసెవెన్‌ గన్స్‌.,
”వీటిని తను చేజిక్కించుకంటే..”రాములు మెదడులో ఓ మెరుపు మెరిసి, జలదరింపు కలిగి., చుట్టూ చూశాడు.. ఆలోచన పదునెక్కుతోంది. క్షణంలో వందప్లాన్స్‌ రూపొంది, మలిగి..మళ్ళీ రూపొంది.. మళ్ళీ చచ్చి.. మొండి ధైర్యం తలెత్తుతోంది నిద్రలేస్తున్న బ్రహ్మరాక్షసిలా.
ఏదన్నా చేస్తే?.. ఈ డంప్‌లోని కోట్లకొద్ది డబ్బు తనదే.. పోలీసోళ్ళు ఎన్ని డంప్‌లను దొంగతనంగా దొంగల్దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దోచుకోలేదు.. తనకిప్పుడు భగవంతుడు ఒంటరిగా దీన్ని చేజిక్కించుకునే అవకాశమిచ్చాడు ..కమాన్‌ కమాన్‌ క్విక్‌.. ఏదో నిర్ణయం తీసుకోవాలి రెప్పపాటులో .. అవకాశాలు మళ్ళీ మళ్ళీరావు.
వెనుకనుండి మెత్తగా బూట్ల చప్పుడు వినబడింది రాములుకు.
విఠల్‌.
పిలుస్తూ రావడం మానేసి.. హైడ్‌ అండ్‌ సీక్‌ టైప్‌లో దాడికి వస్తున్నాడు..
యిక ఒక్క లిప్తకాలం కూడా వృధా చేయలేదు రాములు. చేతిలోని ఎ.కె. ఫిఫ్టీ టు తో విఠల్‌ను దగ్గరగా పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో తూట్లు తూట్లు కాల్చాడు వరుసగా దూసుకుపోయే బుల్లెట్లతో.
విఠల్‌ శరీరం క్షణాల్లో మాంసం ముద్దలుగా ఖండఖండాలై ఎగిరి..ఎర్రగా రక్తం.. మజ్జ.. ఎముకలు చిట్లి చిట్లి.. గాలిలోకి ఎగిరి ఎగిరి చెల్లాచెదరైపోయింది.
క్షణకాలం అడవి తుపాకీ గుళ్ళధ్వనితో దద్దరిల్లి.,
చెట్లపైనుండి పకక్షులు అదిరిపడి ఎగిరి.. ఆకాశంలోకి రెక్కలార్చి.. టపటపా టపటపా ,
మరుక్షణం.. మళ్ళీ భీకర నిశ్శబ్దం.
రాములు నిలబడ్డాడు అలాగే.. దృఢంగా.. స్థిరంగా.. ఒక చెట్టువలె. అతని తల దిమ్మెక్కిపోయింది.. తిమ్మిరి.. భయం.. దడ దడ.. ప్రకంపన.. సంతోషం.. తను బతికినందుకు. తనను చంపాలనుకున్నవాణ్ని తాను చంపినందుకు.
పైగా.. ప్రక్కన.. కోట్ల రూపాయలు..పిచ్చి ఆనందం. ఉద్విగ్నత.
క్షణకాలంలో తేరుకుని రాములు..షాక్‌లోనుండి బయటపడి.,
వంగి చకచకా ట్రంక్‌పెట్టెలోని వేయిరూపాయల కట్టలను బయటికి తోడుకుంటు పడేస్తూ చుట్టూ ఉన్న సర్వ ప్రపంచాన్ని మరచిన ఉన్మాదక్షణంలో.,
ప్రక్క సెలయేరు దాపుల్లోనుండి దూసుకొచ్చిన ఎ.కె. ఫార్టీసెవెన్‌ తుపాకీ గుళ్ళు రాములు శరీరాన్ని తుత్తునియలు చేసి ముక్కలు ముక్కలుగా గాల్లోకి విసిరేశాయి.
అడవి దద్దరిల్లంది.
అక్కడంతా చెల్లాచెదురుగా.. పచ్చని ఆకులపై ఎర్రగా చిక్కని రక్తం.. మాంసం ముద్దలు. నిశ్శబ్దం.
ఎక్కడా మనుషుల అలికిడిలేదు
ఐతే.. దూరంగా.. సెలయేటి ఒడ్డుమీద ప్రశాంతంగా గడ్డిమేస్తున్న పశువులమంద దగ్గరినుండి ఎవరో కాపరి వినిపిస్తున్న పిల్లనగ్రోవి ధ్వని మృదువుగా, లలితంగా.. తెరలు తెరలుగా అడవిలోకి ప్రవహించడం మొదలైంది.
అడవి తనను స్పర్శిస్తున్న పాటకు పులకించిపోతోంది పరవశించి.. వివశయై.

22

28

అర్ధరాత్రి దాటింది.
సువిశాలమైన ముఖ్యమంత్రి అత్యంత ఆంతరంగిక సమావేశ మందిరం. హాల్‌నిండా వెన్నెల నిండినట్టు, చల్లగా వసంతఛాయలు వ్యాపించి, గాలినిండా పారిజాత పరిమళం నిండి.. నిశ్శబ్దం ఎంతో మధురమై ధ్వనిస్తున్న వేళ..
ఇద్దరే వ్యక్తులు.
డెబ్బయ్యారేండ్ల ముఖ్యమంత్రి. ముప్పయిరెండేళ్ళ లీల.
సోఫాల్లో ఎదురెదురుగా.. మధ్య మౌనగంభీర అనిశ్చితి.
‘ఇంత’రాత్రి ముఖ్యమంత్రి గారు తననిలా ఏకాంతంగా, ఒంటరిగా ఎందుకు పిలిపించినట్టు. ఇది ఒక ప్రత్యేక రహస్య సమావేశం వలెనే ఉంది. లోపలికొస్తూంటే పి.ఎస్‌, సెక్యూరిటీ, స్టెనో.. ఇతరేతర ఇన్‌విజిబుల్‌ గార్డ్స్‌ ఎవరూ లేరు. ఒక్క బంట్రోతుమాత్రమే ఉండి రాగానే ‘ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ హాల్లో కూర్చోమన్నారు’ అని ఈ హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. అంతే.. యిక ఏ ఇతర మానవ సంచారమూ లేదు.
ఎందుకిలా..
వ్చ్‌. అర్ధంకావడంలేదు.
ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితుడు, మధ్య అత్యంత పరస్పర విశ్వసనీయుత కూడా ఉంది.. అనేకానేక కోటానుకోట్ల ప్రభుత్వ ప్రభుత్వేతర ఆర్థిక లావాదేవీలు తమ మధ్య ఉన్నాయి. వ్యాపారముంది. వ్యవహారముంది. వీటికి అతీతమైన ఇంకేదో వాత్సల్యంతో కూడిన, భాషకందని ఆత్మీయతకూడా ఉంది.
ఏమున్నా.. అతని సంస్కారంపట్ల, తెలివిపట్ల, వ్యవహార దక్షతపట్ల.. అన్నింటినీ మించి తనతో పనిచేస్తున్నపుడు చూపే హృదయస్పర్శపట్ల ఎంతో గౌరవముంది తనకు.
జీవితాన్ని చాలా లోతుగా, చాలా తరచి తరచి సూక్ష్మదర్శినిలో చూచినట్టు దర్శించిన వాడాయన. తన దాదాపు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరో కౌటిలుల్ని, వ్యూహకర్తలను, దార్శనికులను, ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాళ్లను, పరమ దుర్మార్గులను, నీతిహీనులను, గుండాలను.. ఎందర్నో చూశాడు తను. అన్నింటినీ ఎదుర్కొని.. అందర్నీ తట్టుకుంటూ, భరిస్తూ..
తను వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత..పదినిముషాలు గడిచి..అప్పుడొచ్చాడాయన. అదే తెల్లని ధోతీ.. తెల్లని లాల్చీ.. అర్ధరాత్రి దాటినా ముఖంపై చెదరని చిర్నవ్వు. అలసటలేని గాంభీర్యం.
వచ్చి తన ఎదురుగా సోఫాపై మౌనంగా కూర్చుని,
అలా కూర్చునిపోయాడంతే చాలాసేపు.
ఐతే అతను వ్యాకులంగా ఉన్నాడు. అంతఃర్మథనంలో ఉన్నాడు. ఏదో లోలోపల ఘర్షణపడ్తున్నాడు.
”లీలా.. నువ్వు విజ్ఞురాలివి.. అనేక విషయాలు తెలిసిన దానివి. చిన్నవయసులోనే ప్రపంచాన్ని లోతుగా చదివినదానివి.. అందుకే నీతో మనసును పంచుకుందామనీ, బయటికి వ్యక్తీకరించలేని ఒక అంతర్గత మథనకు నిష్కృతిని అన్వేషిద్దామని..” ఆగిపోయాడు.
వత్తి అంటుకున్నపుడూ, ఆరిపోబోయేముందూ తెగుతూ మండుతూ, మండుతూ తెగుతూ తల్లడిల్లుతుంది కాసేపు. అలా ఉన్నాడతనప్పుడు.
”జీవితంలో ఎప్పుడూ అధికారంలో ఉండడమే విజయమనీ, విజయమే మనిషి ప్రతిభకు తార్కాణమనీ, విజయాన్ని సాధించే క్రమంలో రాజనీతి ప్రకారం ధర్మాధర్మ విచక్షణ అనవసరమనీ అనుకుంటూ వచ్చాను లీలా. ఐతే కొన్నిసార్లు విజయాలు సాధిస్తాం కాని నిజాకి ఓడిపోతాం.. అధికారంలో, కుర్చీలో ఉంటాం కాని వాస్తవంగా ఎవడికో బానిసగా, తోలుబొమ్మవలె ప్రవర్తిస్తూ జీవిస్తాం.. ఈ తేడా మనిషిని నిశ్శబ్దంగా ఒక లోహాన్ని ఆసిడ్‌ తిన్నట్టు తినేస్తూ మెల్లగా మరణం రుచిని చూపిస్తూంటుంది.. ఔనా..” అని ఆగి,
అతను తనతో తానే గంభీరంగా సంభాషించుకుంటున్నట్టు.. లేదా తనపై ఎంతో ఆత్మీయతతో కూడిన గౌరవంతో తనను తాను నివేదించుకుంటున్నట్టు.,
”మీకు తెలియందేముంద్సార్‌. వర్చువల్‌ రియాలిటీ, రియల్‌ రియాలిటీ అని రెండున్నాయి గదా. గెలుస్తాం కాని నిజానికి ఓడిపోతాం.. ఒక వస్తువు హర్రాజ్‌లో ఏదో క్షణికమైన ఆవేశానికి లోనై దాని వాస్తవ విలువకంటే ఎన్నోరెట్టు ఎక్కువపెట్టి దాన్ని స్వంతం చేసుకుంటాం. కాని తర్వాత తెలుస్తుంది దాని విలువ తక్కువని. అది గెలిచి ఓడడం. నీతిగా, నిజాయితీగా ఒక రోజంతా కష్టపడి వందరూపాయలే సంపాదించినా అదే పనిని అవినీతితో నిర్వహించి ఐదువందలు సంపాదించే వ్యక్తితో పోల్చుకుని ఆత్మతృప్తితో ఆనందపడడం ఓడి గెల్వడం వంటిది. ఇదొక ధర్మ మీమాంస..”
”’ఔను.. ధర్మం వేరు న్యాయం వేరుగదా..”
”ధర్మం కాలంతో పాటు మారనిది. శాశ్వతమైంది. న్యాయం మనిషి చేత నిర్వచింపబడేది, కాలంతోపాటు మారేది.”
”అధికారం.. వ్యామోహం.. శాశ్వతత్వం.. చరిత్ర.. వీటిని విస్తృతమైన అవలోకనలో దర్శించినపుడు.. మనిషి యొక్క దూరదృష్టి, పరిణతి, వికాసం నిజంగా ఎంత ఉదాత్తంగా ఉండాలి లీలా.. మనం ఆ కోణంలో చూచినపుడు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నామో అనిపిస్తోందప్పుడప్పుడు. ఒక విషయం చెప్తాను చూడు, 1776లో బ్రిటిష్‌ పాలనలో ఉన్న అమెరికాను యుద్ధంచేసి విముక్తంచేసిన తర్వాత జార్జ్‌ వాషింగ్టన్‌ తను తలచుకుంటే తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుని ఏకచ్ఛత్రాధిపత్యంగా యిష్టమున్నంతకాలం యిష్టమొచ్చినట్టు పరిపాలన కొనసాగించగలిగేవాడు. కాని ప్రజాపక్షపాతి ఐన దార్శనికుడు కాబట్టి ఆయన ఆ ఏకవ్యక్తి పాలనను వద్దని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి, ఒక రాజ్యాంగాన్ని నిర్మించి, క్రమశిక్షణతో కూడిన అనేక నియంత్రణలతోపాటు అతిస్వేచ్ఛను పరిహరించే శాస్త్రీయ స్వాతంత్య్రాన్ని ప్రసాదించాడు. అందుకే ఒక ప్రపంచ అగ్రరాజ్యానికి ”జాతిపిత” కాగలిగాడు. రెండు వందల ఏళ్ళకు పైగా కాలం గడిచినా యింకా తరతరాలుగా అమెరికా ప్రజల హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిఉన్నాడు. అధికార వ్యామోహం గనుక వాషింగ్టన్‌కు ఉంటే చరిత్రలో యింత పవిత్రమైన స్థానం దక్కి ఉండేదికాదుగదా.. కుర్చీ.. సింహాసనం.. అధికారం.. యివి..”
ఒక తీవ్రమైన ఉప్పెనలో కొట్టుకుపోతున్న ఒట్టి అట్టపెట్టెలా అనిపించాడాయన ఆమెకాక్షణం.
”నిస్సందేహంగా జార్జ్‌ వాషింగ్టన్‌ చాలా గొప్పవాడే సర్‌. కాని చక్రవర్తిత్వాన్ని కాదని ఒక ప్రజాస్వామ్య దేశంగా అమెరికానుప్రకటించిన తర్వాత ఆయనే మొదటి, రెండవ అమెరికా అధ్యకక్షునిగా అధికార పగ్గాలను చేపట్టారు గదా.ఆ కోణంలో చూస్తే ఎప్పుడూ ఏ అధికారాన్నీ ఆశించకుండా ఒక రక్తపుబొట్టు కూడా చిందకుండా భారత స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీ సంగతి..ఈయనెంత గొప్పవాడు. స్వతంత్ర సాధన తర్వాత కూడా ఎన్నడూ ఏ పదవీ కోరుకోలేదే….
” ఆదే పొరపాటు జరిగింది లీలా. నీ వంటి పరిణతి గల ఆధ్యయనకారులు కూడా యిక్కడే హేతుబద్దంగా ఆలోచించడం లేదు…”
”ఎలా….”లీలా కంగుతుంది.
”అక్కడ వాషింగ్టన్‌ ప్రజాస్వామిక ఆమెరికాను ఏ రకంగా స్యప్నించాడో ఆ విధంగా అ దేశం యొక్క ఆకృతిని తీర్చిదిద్దేంకు స్వయంగా పూసుకుని పటిష్టమైన రాజ్యాంగాన్ని నిర్మింపజేసి, దాన్ని స్వయంగా తాను ఆమలు చేసి చూపించి ఒక దారి ఏర్పర్చి….. యిక ఈ మార్గంలో నడవండని చిటికెన ప్రేలును వెనక్కి తీసుకుని వెళ్ళి పోయాడు. అలాగే గాంధీ కూడా తన అద్భుతమైన సిద్ధాంతాలను రాజ్యాంగబద్దం చేసి, కుర్చీపై కూర్చుని ఆమలుచేసి చూపి విలువలతో కూడిన రాజకీయ సంస్కృతిని స్థాపిస్తే బాగుండేదేమో…ఆది జరుగలేదు కాబట్టి ఓ పదిరవై ఏండ్లు దాటక ముందే చూడు రాజకీయాలు బురదకుంటై, పందులు పొర్లాడే రొచ్చుగుంటై ఛండాలమైపోయింది.”
”……” లీల నిజంగా షాకైంది… నిజమేనా ఆని అన్పించిందామెకు.
గాంధీ… అనే జీవి ఒక్కడే… కాని వ్యక్తినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా అర్థమౌతున్నాడు గదా.
”విలువల కోసం అధికారమా… అధికారంకోసం విలువల త్యాగమా, ఇదమ్మా అసలు ప్రశ్న ఈ రోజు” అన్నాడు ముఖ్యమంత్రి మళ్ళీ.
”నిస్సందేహగా అధికారంకోసమే విలువల విధ్వంసం నిర్లజ్జగా కొనసాగుతోంద్సార్‌ ఈ రోజు భారతదేశంలో..
ఈ దౌర్భాగ్య పరిస్థితి మారాలి లేకుంటే ఎవనికందిందివాడు అప్పులుతెచ్చి..పైనబడి లాక్కుని.. ఎగబడి గుంజుకుని దోచుకునే స్థితి ఏర్పడ్తుంది. విలువలకోసం మాత్రమే అధికారం ఒట్టి నామమాత్రంగా నిర్వహించబడే  చేష్ట కావాలి.”
”ఔనా..”
”ఔన్సార్‌ .. ” అంది లీల స్థిరంగా .. దృఢంగా ఖచ్చితంగా
”కదా .. అసలీ రామం ఎవడమ్మా”
లీల మాట్లాడలేదు.
అనుకోని ప్రశ్నకు ఉలిక్కిపడి.. తర్వాత ఆశ్చర్యపడి.. తేరుకుని,
”రామం అనేవాడు జనసేనను స్థాపించి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు”
”…”
”రామం అనేవాడు .. నాలోకి నేను తొంగిచూచుకుని ఆత్మాన్వేషణతో పునర్విమర్శ చేసుకొమ్మని వేదిస్తున్నాడు..”
”…..”
”రామం అనేవాడు నా ఆత్మను ఒక గునపమై పొడిచి పొడిచి ప్రశ్నిస్తున్నాడు”
”……”లీల ఆవేశంగా మాట్లాడ్తున్న ముఖ్యమంత్రి ముఖంలోకి కొయ్యబారి చూస్తోంది.
”రామం అనేవాడు హిరణ్యకశిపుణ్ణి పరేషాన్‌ చేసిన ప్రహ్లాదునివలె వెంటాడ్తూ చాలా కలవరపెడ్తున్నాడు”
”……”
”రామం అనేవాడు దుర్మార్గులైన రాజకీయ నాయకులందర్నీ ఉచ్చలుపోయిస్తూ అంతరాంతరాల్లో వీడురా మగాడంటే..అని అన్పించుకుంటూ అందరిచేతా ప్రేమించబడ్తున్నాడు”
”…..” లీల ఆశ్చర్యంగానేఐనా.. ఆనందంగా ఆయనవంక చూస్తోంది.
”అసలు ఈ రామం ఎవడు..?” స్థిరంగా ఉంది ముఖ్యమంత్రిగారి గొంతు.
లీల లేచి నిలబడింది సోఫాలోనుండి.
యటికి నడవడం ప్రారంభిస్తూ.. ”రామం ఒక ఋషి” అంది స్పష్టంగా
బయటికొచ్చి కార్లో కూర్చుంటున్న లీలకు ముఖ్యమంత్రి తనను ఎందుకు పిలిపించుకున్నాడో అర్థంకాలేదు. కాని వచ్చి తను ఏమి నేర్చుకుందో మాత్రం స్పష్టంగా అర్థమైంది.

29

23

”ఎందుకు..?”
”వ్చ్‌.. ఏమో..”
”ఎందుకో..?”
”ఏమో తెలియదు.”
”ఇంత అర్ధరాత్రి ఈ అత్యవసర పిలుపేమిటో.. మీకేమైనా తెలుసా”
”తెలియదు. మీకు తెలుసా”
”ఉహుఁ.. నాక్కూడా తెలియదు. వెరీ అర్జంట్‌ అంటే ఉన్నపళంగా వచ్చా. ఇంత రాత్రి నలభైమందికి అత్యవసర పిలుపు. పన్నెండు గంటల ముప్పయి నిముషాలకు.. ముఖ్యమంత్రి నివాసభవనంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో.. అందరికీ ఆశ్చర్యం.. ఎందుకు.. ఎందుకు..?
అన్ని ప్రముఖ దినపత్రికల సంపాదకులకు మాత్రమే, అన్ని తెలుగు న్యూస్‌ చానళ్ళ అధిపతులకు, ‘జనసేన’ బాధ్యులు ముగ్గురు..రామం, డాక్టర్‌ గోపీనాథ్‌, క్యాథీ, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌..ఒకే ఒక లోక్‌సభ సభ్యురాలు, ఒక పౌర హక్కుల నేత, ఒక మానవ హక్కుల సంఘ నాయకుడు, ఒక యాభై తొమ్మిదేళ్ళ వయసున్న సీనియర్‌ ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ సుబ్బన్న ఐఎఎస్‌, అటార్నీ జనరల్‌, ఆంటీ కరప్షన్‌ బ్యూరో చీఫ్‌.. వీళ్ళు మొత్తం నలభైమంది.ఒక్క మంత్రి కూడా ఆ మీటింగుకు ఆహ్వానింపబడలేదు.
రాత్రి పన్నెండుగంటల ఇరవై నిముషాలైంది.
బయట చిక్కని చీకటి.. ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌హాల్‌లో చిక్కని పాలవంటి వెలుగు.
ఒకటితర్వాత ఒకటి..మెత్తగా, మెల్లగా ఒక్కోకారు వచ్చి పొర్టికో ముందు ఆగి.., ఆహ్వానితుల్లో ఎవరో ఒకరు దిగి.. హడావుడిగా.. ముఖంనిండా మొలిచే ప్రశ్నతో లోపలికి నడుస్తూ,
బయట ఎక్కడా సెక్యురిటీ హంగామా లేదు.
ఉన్నత రాజకీయవర్గాల్లో వార్త ఎప్పుడూ అంటుకున్న పెట్రోల్‌ మంటే..ప్రాకిపోయింది. మనిషికి ఎప్పుడూ ఉత్సుకత అనేది నోట్లో నానని నువ్వుగింజ. బయటికి కక్కేదాకా కడుపుబ్బుతుంది.
దాదాపు నలభై రెండుమంది మంత్రుల ఇళ్ళలోని అందరి సెల్‌ఫోన్లు పరమబిజీగా ఉన్నాయి. ‘మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి నివాసంలో ఏమిటీ ఉన్నతస్థాయి సమావేశం.. ఎందుకు. ఏమిటి సంగతి.. ఏం జరుగబోతోంది..” అంతా టెన్షన్‌.
”కనుక్కునేదెలా..?”
ప్రయత్నించు ప్రయత్నించు.. నీకు తెలిస్తే నాకు చెప్పు.. నాకు తెలుస్తే నీకు చెప్తా.
ఈ లోగా ఢిల్లీకి కబురు.. అధిష్టానం పెద్దలకు..తాబేదార్లకు, పైరవీకార్లకు, బ్రోకర్లకు, ఏజంట్లకు.. సలహాదార్లకు అందరికి వాళ్ళవాళ్ళ మనుషులు హాట్‌లైన్లలో సమాచారం చేరవేసి ‘ఏమిటో’ కనుక్కుంటున్నారు.
అన్ని చోట్లనుండీ ఒకటే జవాబు ‘తెలియదు’ అని
సమయం పన్నెండూ ముప్పయి.
సెక్రటరీ రామలక్ష్మి వచ్చింది ముఖ్యమంత్రి గదిలోకి. అక్కడ ఆయన, అతని భార్య ఉంది. ఆమె డెబ్బయిమూడేళ్ళ వృద్ధాప్యంలో పండుపండిన గోగుబుట్టలా ఉంది.. నిండుగా, ప్రసన్నంగా ముఖ్యమంత్రి కూడా చాలా నిబ్బరంగా, తృప్తిగా.. ముఖంనిండా వెలుగుతో ఉన్నాడు.”సర్‌. అందరూ వచ్చార్సార్‌” అంది రామలక్ష్మి వినయంగా. ఆమెకు జరుగబోయేది చూచాయగా అర్ధమైంది. రేపు భారత రాజకీయ చరిత్రలో సంభవించబోయే పెనుసంచలనాన్ని అంచనా వేస్తోందామె. ఐతే ఆమె ఒక రకమైన లౌకికాతీత ఆనందాన్ని అనుభవిస్తూ ముఖ్యమంత్రి గారి ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూచింది.
మాట్లాడకుండానే లేచి వెంట భార్యను తీసుకుని మౌనంగా కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి నడిచాడు. అతని వెంట ఓ బరువైన తోలుసంచీని మోసుకుంటూ రామలక్ష్మి కూడా కదిలి,
హాలులోని వేదికపైకి ముఖ్యమంత్రి దంపతులు రాగానే గౌరవపూర్వకంగా అందరూ లేచి నిలబడ్డారు. దంపతులిద్దరూ వేదికపైకి చేరగానే చేతులు రెండూ వినమ్రంగా జోడించి అందరికీ నమస్కరించి వేదికపైనున్న రెండే రెండు కుర్చీల్లో ఆసీనులై,
హాల్‌లో ఒకే ఒక ఫోటోగ్రాఫర్‌ ఉండే విధంగా ఏర్పాటు చేయబడింది.
వేదికపై మీడియా మైక్రోఫోన్‌లున్నాయి.
అంతా నిశ్శబ్దం.. గంభీరం.. ఉద్వేగం.
అందరి ముఖాల్లోకి ఒకసారి కలియజూచి, ఆయన కళ్ళు ‘జనసేన’ సంస్థాపకుడు రామం కోసం వెదికాయి..కాని రామంపై కొద్దిరోజుల క్రితం వరంగల్లులో జరిగిన బాంబుదాడి జ్ఞాపకమొచ్చి., జనసేన తరపున వచ్చిన సిద్ధాంతకర్త గోపీనాథ్‌, క్యాథీ, ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తి..ఇతర నిప్పువంటి వ్యక్తిత్వం గల పాత్రికేయులు..పత్రికా సంపాదకులు, టి.వి. సిఇఓలు, హైకోర్టు చీప్‌ జస్టిస్‌.. లోకాయుక్త.. అందర్నీ కళ్ళతో పలకరించి,
”మిత్రులారా.. డెబ్భై మూడేళ్ళ వయసులో.. నిజానికి ఏ రాజకీయనాయకున్నీ ఇన్నాళ్ళ దాకా పని చేయనివ్వద్దు.. ఈ పెద్ద వయసులో చాలా అలసటతో, బాధతో, దుఃఖంతో మీతో ఒక మంచి స్నేహితునిగా నా వ్యధను పంచుకోవాలని ఈ వేళగానివేళ మిమ్మల్ని యిక్కడికి రప్పించాను. మొదట అందుకు నన్ను క్షమించండి. దాదాపు యాభై సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్నాను. చిన్నపిల్లాడిగా గాంధీ టోపిని నెత్తిపై పెట్టుకుని ఈ పవిత్ర మాతృభూమినే తలపై కిరీటంగా ధరించినంత ఆనందాన్ని పొందాను. ఒక్కోమెట్టు. ఒక్కో అడుగు.. ఒక్కో అధ్యాయం.. ఎందరో మహానుభావులు.. పుచ్చలపల్లి సుందరయ్యగారు, తరిమెల నాగిరెడ్డి, తెన్నేటి విశ్వనాధం, సురవరం ప్రతాపరెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, చండ్ర రాజేశ్వర్రావు.. పార్టీలు ఏవైనా.. అందర్లోనూ మూలధాతువైన మానవతా విలువలు, దేశభక్తి, సామాజిక చింతన, ప్రజాసంక్షేమ పరితపన. బ్రిటిటిష్‌వాడు విడిచిపెట్టివెళ్ళిన ఈ భారతదేశంలో అవిద్య, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం, దరిద్రం.. ఇవే ఎక్కడ చూచినా.. వీటికితోడు మతకలహాలు.
పరిపాలన అనే ఫ్లైట్‌ టేకాఫ్‌ సరిగానే జరిగింది.
ప్రజాకవి శ్రీశ్రీ చెప్పాడు..కాదు హెచ్చరించాడు 1964లోనే,
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగ మింకొకవైపు-
అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు-” అని
జాతీయభావం, దేశంపట్ల ప్రేమ, మాతృభూమిపట్ల మమకారం, పౌరునిగా సామాజిక బాధ్యత.. యివన్నీ క్రమంగా నశిస్తూ.. నిజంగానే అతివేగంగా ఈ దేశం దిగజారడం మొదలైంది.
నిజానికి నేనిప్పుడు మీతో మాట్లాడ్తున్నదంతా నా ఆత్మతో నేను జరుపుతున్న ఒక స్వగత సంభాషణ వంటిది.
కర్ణునిచావుకు కారణాలనేకం అన్నట్టు ఈ దేశం ఈ రకంగా పతనమై దిగజారిపోయేందుకు గల అనేక కారణాల్లో నాలాంటి సీనియర్‌ రాజకీయనాయకులు కూడా శల్యుని పాత్ర, శకునిపాత్ర, విభీషణుని పాత్ర యిలా అవకాశాన్ని బట్టి  కుర్చీకోసం, పదవులకోసం, అధికారంకోసం రాజీపడి.. తలవంచుకు నిలబడి.. తప్పులు చేసి.. తప్పువెనుక తప్పులు చేసి.. దుర్మార్గాన్ని ఎదిరించవలసివచ్చినపుడు ఎదిరించకుండా మౌనం వహించడం యుద్ధనేరం. మాట్లాడవలసివచ్చినపుడుమాట్లాడకుండా మిన్నకుండడం పరమ పాతకం. అలాంటి పాపాలు, నేరాలు నేను కూడా చాలానే చేశాను. యిప్పుడు నేనిలా మాట్లాడ్డం వృద్ధ నారీ పతివ్రత’ లాంటిదే. నాకు తెలుసు. కాని యిప్పటికైనా నేను చేసిన తప్పులకు చెంపలేసుకుని కన్‌ఫెస్‌ ఐపోదామనే.
వెనక్కి తిరిగి చూచుకుంటే.. నాపై నాకే అసహ్యమేస్తోంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు చేస్తున్న అకృత్యాలనెన్నింటినో వ్యతిరేకించి ఎదిరించలేదు సరికదా, అమోదముద్ర వేశాను. బొక్కసంలో ఒక్క పైసా లేకున్నా ప్రజలకు పంచరంగలు కలలను చూపించాం. అధిష్టానం అడిగినా అడుగకున్నా నెలకింత అని కోట్లానుకోట్ల రూపాయలను కార్లలో పంపించాం. శాసనసభ్యులు ఎదురుతిరుగుతారనే భయంతో ఎవడేదికోరితే అది..రోడ్ల కాంట్రాక్ట్‌లు, పవర్‌ ప్రాజెక్ట్‌లు, సెజ్‌ల అలాట్‌మెంట్స్‌, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, మైన్‌ లీజులు, ఇసుక సీనరేజ లీజ్‌లు.. హార్బర్లు, సముద్ర జలాల అప్పగింత, అడవుల లీజ్‌, కొండల గుట్టల లీజ్‌లు.. ఎన్ని..ఎన్నెన్ని.
ఓట్లకోసం ఆర్థికంగా సాధ్యంకాని ఎన్నో ఉచితాలను ప్రకటించాం. బియ్యం, విద్యుత్తు, టి.విలు, ఫీజులు, పచ్చకార్డులు, ఆరోగ్యపథకాలు.. మాకు తెలుసు ఇవేవీ అమలు కావని. ప్రపంచబ్యాంక్‌ అప్పులు, ఐఎమ్‌ఎఫ్‌ అప్పులు, జపాన్‌లాంటి దేశాల పరస్పర వినియోగ ఆర్థిక సహకారాలు.. పబ్లిక్‌ బాండ్స్‌, ప్రజలనుండి అప్పులు.. ఎన్ని చేసినా తెచ్చిన బుడ్డపరకలాంటి అప్పును రాజకీయనాయకుల రూపంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ జస్ట్‌ చప్పరించి సఫా చేయడమే. మరుక్షణమే మళ్ళీ మేతకు తయ్యార్‌.  ఈ నా ప్రక్క తోలుసంచీలో అన్ని వివరాలున్నాయి. తొంభైశాతం శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, జిల్లాలలో కార్పొరేటర్లు.. అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయినిబట్టి జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయి కాంట్రాక్టర్లే. సిగ్గులేకుండా ప్రజలసొమ్మును, ప్రభుత్వ సొమ్మును భోంచేయడానికి అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీ, వామపక్ష పార్టీ అన్న తేడాలేదు. అందరిదీ ఒకటే జాతి. వీళ్ళందరూ నా హయాంలో అడ్డమైన పనులను చేస్తూ నాతోకూడా చేయించినవారే. యిప్పుడు ప్రజాకర్షక పథకాలను ఓట్లకోసం ప్రవేశపెట్టిన భారతదేశంలోని ప్రతి రాష్ట్రప్రభుత్వం ప్రజలను బిచ్చగాళ్ళను చేయబోయి తామే ఓ పెద్ద బిచ్చగత్తె ఐ కూర్చుంది. చివరికి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ తాగుబోతుల దయతో, వాళ్ళు దానం చేస్తున్న ఎంగిలి సొమ్ముతో బతికి బట్టగడ్తున్నాయి. కాని ఈ నీటి బుడగ ఎన్నాళ్ళో నిలవదు. చితికి బ్రద్దలైపోద్ది.

30
ప్రజల తరపున రాజ్యాంగ నిర్వచనం ప్రకారం ప్రభుత్వ అధికారుల పనితీరును, శాసనాల, విధానాల అమలును పర్యవేక్షించి తనిఖీ చేయవలసిన ప్రజాప్రతినిధులే అధికారులతో కలసిపోయి కంచే చేను మేసినట్టు, ఇంటికుక్కే ఇంటి యజమానిని కరిచినట్టు కుమ్మక్కయితే యిక ఏ రూల్సూ, ఏ నిబంధనలూ సమాజాన్ని భ్రష్టుపట్టడం నుండి కాపాడలేవు. ఈ రోజు..నావద్ద రికార్డులున్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎనభైశాతం అవినీతి ఉంది. పర్సెంటేజ్‌లున్నాయి. కమీషన్లున్నాయి. దీనికి తోడు నాణ్యతలేక, ప్రమాణాలు పడిపోయి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో పనికిరాని, పనిచేయరాని ఉద్యోగుల మెజారిటీవల్ల అసలు పరిపాలన స్తంభించిపోయింది. అంతా కాగితాలకే పరిమితమైన పని మాత్రమే మిగిలి ఉంది..నిజానికి ఎక్కడా ఏమి ఉండదు. వ్యవస్థ అంతా అసమర్థమై, నిర్వీర్యమై క్రమశిక్షణ పూర్తిగా లోపించింది.
ఎవడు ఎవనిమాట వినడు.. ఎవడు ఎవన్ని లక్ష్యపెట్టడు.. అతిస్వేచ్ఛ.. నిర్లక్ష్యం.. ఎదురుతిరుగుడు.
అనేక దేశాల్లో ఉన్నట్టు ”ఐ లౌ మై ప్రొఫెషన్‌” అనే తత్వమే యిక్కడ లేదు. అంకితభావం లేదు. ఇది ప్రజలసొమ్ముకదా మనం ప్రజలకు జవాబుదారులం కదా అన్న స్పృహ లేదు.
‘కుచ్‌తో భీ కరో.. బస్‌ పైసే కమావో” అనే కల్చర్‌ ప్రబలిపోయింది.
మిత్రులారా.. యిదంతా మీకు తెలిసిందే. కాని ఈ రోజు నా తప్పును నేను ఒప్పుకుని తలవంచుకుని ఈ వ్యవస్థ యికముందు యింకా యింకా పతనం చెందొద్దనీ, ఈ దురాగతాలకు కనీసం యికనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, భావితరాలు ఈ పరమ దుర్మార్గ మృగతుల్య రాజకీయ నేరచరితుల చేతుల్లో బందీలై నష్టపోవద్దని క్షోభపడి క్షోభపడి, కొద్ది రోజులుగా అంతర్మథనం చెందీ చెందీ, ‘భయం’ అనే సంకెళ్ళను తెంచుకుని, నన్ను ఈ రాజకీయ బురద కంపునుండి విముక్తం చేసుకోడానికి భరించలేని ఆత్మక్షోభతో, దుఃఖంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా నా ప్రధానమైన కొన్ని నిర్ణయాలను బహిరంగంగా, నిస్సంకోచంగా మీముందు, మీరు సాకక్షులుగా ప్రకటిస్తున్నాను.
ఒకటి.. నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంలేదు. నా నాయకత్వంలో పనిచేస్తున్న నాతోసహా చాలామంది అవినీతి మంత్రుల సవివరమైన, లంచగొండి పనితీరు నివేదికలను ఋజువుల్తో సహా గవర్నర్‌కు, రాష్ట్రపతికి సమర్పిస్తూ నా ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్‌ చేసి ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాను.
రెండు.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యిదివరకటి ముఖ్యమంత్రుల హయాంలో కూడా నేను మంత్రిగా ఉన్నపుడు కలిపి.. గత పదిసంవత్సరాల అప్పులు, ఆస్తుల పట్టికలను, ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నలభై ఐదుశాతం ఋణాలు, వడ్డీచెల్లింపుల కిందనే ఖర్చుచేస్తున్నామనే భయంకరమైన సత్యాన్ని, గత ప్రభుత్వాల ద్రోహాన్ని అధికారిక శ్వేతపత్రంద్వారా ప్రజలకు తెలియజేస్తూ నన్ను క్షమించమని ప్రజలను వేడుకుంటున్నాను.
మూడు..ఈ తోలు సంచీలో ఉన్న నాల్గువందల అరవై నాల్గు కరప్టివ్‌ కేసులను..మంత్రులపైన.. శాసనసభ్యులపైన, ఉన్నత ప్రభుత్వాధికారులపైన, కార్పొరేట్‌ బ్రోకర్‌ కంపెనీలపైన, నగరాల్లో పెత్తనం చెల్లాయిస్తున్న మాఫియాలపైన ఆధారాలూ, నిరూపణలతో పాటు హైకోర్టుకు, లోకాయుక్తకు, మానవ హక్కుల కమీషన్‌కు ముఖ్యమంత్రిగా వీళ్ళందరిపై వెంటనే తగు విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని అప్పీలు దాఖలా చేస్తున్నాను.
ఈ మొత్తం అవినీతి ఉదంతాల మొత్తం విలువ లక్షాయాభై రెండు వేల కోట్లు. మీకు ఇన్నాళ్ళబట్టి కరకరలాడే గంజిబట్టలవెనుక నవ్వు ముఖాల్తో కనబడ్డ అనేకమంది యొక్క నిజమైన అసలైన వికృతరూపం ఈ కేసుల్లో సవివరంగా ఉంది. వీటిని గత ఆరునెలల కాలంగా యింకా ప్రభుత్వంలో అవశేషంగా మిగిలి ఉన్న కొద్దిమంది నీతివంతులైన అధికారులతో సమగ్రంగా దర్యాప్తు చేయించి తయారు చేయించాను. వీటిమొత్తం విలువ రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెటుకు సమానం.
నాల్గు..నాలో ఈ పశ్చాత్తాప బీజాన్ని నాటిన జనసేన వ్యవస్థాపకుడు శ్రీ రామంకు వ్యక్తిగతంగా నేను ఋణపడి ఉన్నాను. ఒక మొలకలా పుట్టి మహావృక్షమై విస్తరించిన ఈ ఆత్మప్రక్షాళన సంస్కృతి నిజంగా నన్ను ముగ్దుణ్ణి చేసింది. ‘జనసేన’ స్థాపన ఆలోచనే మంచిది. ఎటువంటి స్వార్థ చింతనాలేని నాయకత్వ విధానం కలకాలం వర్థిల్లుతుంది. భావితరాలకు ఆదర్శమౌతుంది. అందువల్ల ‘జనసేన’ సంస్థకు నా సకల స్థిరాస్తులన్నింటినీ విరాళంగా దాఖలు పరుస్తూ ఓ విల్లు రాశాను. దానిని స్వీకరించి ఈ నా పశ్చాత్తాపానికి నిష్కృతిగా ప్రాయశ్చిత్తం చేసుకునే అదృష్టాన్నీ ప్రసాదించవలసిందిగా రామంగారిని వేడుకుంటున్నాను.
మన భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రులను శాసన సభల్లో అభిశంసించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాని ముఖ్యమంత్రే తన సహచర మంత్రుల అధికారుల, ప్రజాద్రోహాల అవినీతిని బట్టబయలుచేసి కంప్లెయింట్‌ చేసిన ఉదంతాలు ఎక్కడాలేవు. ఈ సాంప్రదాయం నాతోనే మొదలౌతుంది. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు పిల్లిమెడలో గంట కట్టాలి..తప్పదు.
నాకిక ఏ పదవిపైనా, అధికారంపైనా కాంక్షలేదు.
రేపు మతిచలించి ముఖ్యమంత్రిగారు పిచ్చిపిచ్చిగా ఏదేదో చేశాడని మొగుణ్ణి కొట్టి వీధిలో మెరమెరలాడే తరహా మా రాజకీయ సహచరులంటారు. అందుకే నేను మంచి స్వస్థతతో, స్పృహతో, జాగ్రదవస్థలో ఉండి ఈ ప్రకటన చేస్తున్నానని ప్రభుత్వ డాక్టర్‌తో ధృవీకరణ పత్రాన్ని జతచేస్తున్నాను.
ఈ సమావేశానంతరం.. గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. వారిని కలిసి కాగితాలు అప్పగించి ముఖ్యమంత్రి నివాసంనుండి నిష్క్రమించి వానప్రస్తాశ్రమం.. నా స్వంత జిల్లా విజయనగరం వెళ్ళిపోతున్నాను.
మిత్రులారా.. యింతసేపు నన్ను ఓపిగ్గా విన్నందుకు.. నా వ్యథను పంచుకున్నందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు.
ముఖ్యమంత్రి గొంతు ఎందుకో పూడుకుపోయి గద్గదమైంది. ఇన్నాళ్ళబట్టి తనను బంధించి ఉంచిన ఇనుప సంకెళ్ళు అప్పుడే భళ్ళున తెగిపడిపోయి విముక్తుడైన మహానుభూతి కలిగిందతనికి. మౌనంగా ఉండిపోయాడు.
హాలునిండా ఒట్టి నిశ్శబ్దం
వెంటనే రామం తరపున డాక్టర్‌ గోపీనాథ్‌ లేచి నిలబడి ముఖ్యమంత్రినుద్దేశించి ”థాంక్యూ సర్‌” అన్నాడు.
ఎందుకో..అనూహ్యంగానే కొందరు చప్పట్లు కొట్టారు.    రామలక్ష్మి యింకో వ్యక్తి సహకారంతో తోలుసంచీలోని కాగితాల సెట్లను హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు, పత్రికా సంపాదకులకు, టి.వి. అధిపతులకు.. అందిస్తోంది వినయంగా.
హాలులోని నిశ్శబ్ద ప్రళయం ఒక అరగంట తర్వాత మీడియాలో భళ్ళున బాంబులా ప్రేలి ఢిల్లీ వీధులను గడగడలాడించింది..అంటుకున్న పెట్రోలుమంటలా దేశం వీధివీధిలో ప్రవహించింది.
రాత్రి కొనసాగి కొనసాగి.. చీకటి వెలుతురుగా రూపాంతరం చెందుతున్నవేల..
ఎదుట ఆకాశంలో శిశుసూర్యుడు ఎర్రగా.. రౌద్రంగా.. కాంతివంతంగా.,

24

లీలకు ఎందుకో చాలా భయంగా ఉంది.
న్యూ ఢిల్లీ..హోటల్‌ లి మెరిడియాన్‌.. విండ్సర్‌ ప్లేస్‌..రాష్ట్రపతి భవన్‌నుండి రెండు కిలోమీటర్ల దూరం
నంబర్‌ పధ్నాల్గువందల పది.. పదిహేనవ అంతస్తు.
లీల.. ఒకప్పుడు ఒట్టి అనాథ.. దిక్కులేక రోడ్డుమీద జనం చీత్కరిస్తూండగా అడుక్కుంటూ చిరిగిన బట్టలు, చీమిడికారే ముక్కు.. ఆకలితో నకనకలాడే కడుపు .. కళ్ళనిండా నీళ్ళు.,
ఎవరో పుణ్యాత్ముడు అనాథ బాలల పాఠశాల ‘చిగురు’లో చేర్పించాడు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి రైల్వేస్టేషన్‌లో అడుక్కుంటూండగా..క్రిస్టియన్‌ మిషన్‌ క్రింద నడుపబడే అనాథ బాలల ఉద్ధరణ సంస్థ.. ఎన్‌జివో.. జీసస్‌ ఈజ్‌ ఓన్లీ ద గాడ్‌.., దేవుడు చెప్పెను.. ప్రవచనాలు.. బైబిల్‌ ఆరవ అధ్యాయము మూడవ పేరా..యోహాను..బోధనలు..ప్రక్కన గర్జిస్తూ, తలనిమురుతూ, ఊరడిస్తూ గలగలా పారే నది. నది ఒడ్డుపై కూర్చుని ఏకధాటిగా ఎవరికీ తెలియకుండా ఏడ్చిన ఎన్నో రాత్రులు.
ఎక్కడ పుట్టానో.. ఎవరికి పుట్టానో.. ఎందుకు పుట్టానో.. ఏమి తెలియని వయసునుండి..జీవితమంటే ఒక ఆసరా వెదుక్కోవడమని, జీవితమంటే లోతును తెలుసుకుని సముద్రాన్ని ఈదడమని..జీవితమంటే ఓడినా సరే మళ్ళీ మళ్ళీ గెలవడమని.. ఎన్నో నిర్వచనాలు.,
దిక్కులేక అనాథగా ఎదుగుతున్న తను తనకుతాను ఒక ప్రశ్న. తనతోపాటు ప్రశ్నకూడా ఎదిగి..పెరిగి.. పెద్దదై.. జీవితమంటే ప్రశ్నించడమని అంతిమంగా నిర్ణయించుకున్న రాత్రి..,
తమ ‘చిగురు’ సంగతి తెలిసింది. ఎన్‌జివోగా అది ప్రభుత్వం నుండి పదెకరాల నదిఒడ్డున ఉన్న సారవంతమైన ప్రభుత్వ స్థలం.. ఏడాదికి ఎనభై లక్షల ప్రభుత్వ నిధులు.. మతం ముసుగులో, సేవ ముసుగులో ఎన్నో భవనాలు.. ఎన్నో సౌకర్యాలు..
అనుకునేది.. ఈదేశంలో మతమేదైనా, కులమేదైనా.. కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో రిజస్టరై ఎన్‌జివోలుగా చెలామణి ఔతున్న, ఈ సమాజాన్ని సంస్కరించి, ఉద్ధరించి, బాగుపరిచి సేవలు చేస్తున్న సంస్థలు దేశ్యాప్తంగా ఎన్నున్నాయి.. వాటి వివరాలు,వారు స్వాహా చేస్తున్న నిధులు, వారు పంచుకుంటున్న భూములు, వారనుభవిస్తున్న సౌకర్యాలు, సౌఖ్యాలు.. వీటన్నింటినీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రంగా విడుదలచేసి గనుక ప్రజల సమక్షంలో విడుదలచేస్తే నిజాన్ని తెలుసుకుని ప్రజలు వేలమంది దొంగ సామాజిక కార్యకర్తలను, బాబాలను, ధార్మిక సంస్థల నిర్వాహకులను, గ్రుడ్డి, వికలాంగలు ఉద్ధరణ సంస్థల నిర్వాహకులను, వాళ్ళ నిజరూపాలను తెలుసుకుని పెడ్డలతో, కర్రలతో తరిమి తరిమి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వేల ఎన్‌.జి.వోలు కోట్ల కొద్ది రూపాయలు ఎవని పర్సెంటేజ్‌ వానికి పోగా ఎవనికి దొరికిందివాడు పందికొక్కులకంటే హీనంగా తింటూ..,
లీలకు ఎందుకో గతం గుండెలో నిప్పులా భగభగమండుతూ దహిస్తోంది పొద్దట్నుండి.
ఒకటే ప్రశ్న.,
కారణమేదైనా.. కసి ఎవరిపైననో, ఎందుకో ఐనా.. తెగబడి అసాధ్యాలను సాధ్యంచేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ కోట్లకుకోట్లు పోగేసి.. ఎంతపెద్ద వెధవనైనా డబ్బుతో, ఇంకేదో ప్రలోభంతో కొనచ్చునని, వానిలోని బలహీనతతోఎవన్నయినా జయించవచ్చునని..ఋజువు చేస్తూ చేస్తూ.,
ఐతే.. తను చేస్తున్నది కూడా పైరవీయే కదా.. తను చేస్తున్నది కూడా అవినీతి, మోసం, దగాయే కదా.. చీకటిపనే కదా.. చేసే విధానం వేరు కావచ్చు కాని అంతిమంగా తన పనులన్నీ కూడా అనైతికమైనవీ, తుచ్ఛమైనవీ, హేయమైనవే కదా.
ఔను.. ఔను.. తెలుసు తనకు. తెలిసే చేసింది..చేస్తోందింకా.,
ఇంకా ఇంకా చేస్తుందా తను ఈ తప్పును..?
అది అసలు ప్రశ్న.. వేదిస్తున్న ప్రశ్న.. తనను ఛేదిస్తున్న ప్రశ్న. మొన్న ముఖ్యమంత్రిని కలిసి ఢిల్లీకి చేరిన మరుక్షణంనుండి హృదయాన్ని తొలుస్తున్న ప్రశ్న.
జవాబు కావాలి.. జవాబు కనుగొనాలి.,
అద్దాల కిటికీలోనుండి చూస్తోంది లీల. చుట్టూ ఢిల్లీ మహానగరం.. విస్తరించి విస్తరించి.. భవనాలు భవనాలుగా, రోడ్లు రోడ్లుగా, డబ్బు డబ్బుగా, అధికారం, దర్పం, అహంకారం, మోసం, దగా, కుట్ర, కుతంత్రం, హత్యలు, ప్రాణముండీ చచ్చిపోవడాలు.. చచ్చిపోయీ బతికుండడాలు.. అంతా ఓ పెద్ద చదరంగం.. వైకుంఠపాళీ.. పావులు, పాములు, నిచ్చెనలు.. లోయలు, శిఖరాలు.. పరుగు.. పరుగు-
లీలకు ఎందుకో చాలా భయంగా, వ్యాకులంగా, వెలితిగా.. ఎవరో లోపల చేయి పెట్టి దేవినట్టుగా ఉంది.
ప్రక్కకు చూచింది.
పన్నెండు దినపత్రికలు టీపాయ్‌పై పరిచి ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ.. ఎన్నో.
”రాష్ట్ర ప్రభుత్వ పతనం.. రాజకీయ సంక్షోభం..స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా బయటపెట్టిన లక్షాయాభైవేల కోట్ల అవినీతి”
”రాష్ట్ర ప్రభుత్వ బర్త్‌రఫ్‌.. కదుల్తున్న అధికార పీఠాలు.. ప్రజల్లో ఆగ్రహజ్వాలలు.. లక్షా యాభైవేల కోట్ల అవినీతిని ఋజువుల్తో సహా బయటపెట్టిన ముఖ్యమంత్రి”
”మాకు తెలియకుండా మమ్మల్ని ఎప్పుడో ఎవరికో అమ్మారు..ప్రజల గగ్గోలు. రాష్ట్ర ప్రభుత్వ పతనం. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన, అవినీతి మంత్రులు, నాయకుల పరార్‌. రోడ్లపై రాళ్ళతో దాడిచేస్తామని ప్రజల ధర్మాగ్రహం.”
”పునాదుల్తో సహా కూలిపోయిన రాష్ట్రప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన.”
”అవినీతి యింత భయంకరంగా ఉందని అనుకోలేదు. నీతిమాలిన నాయకులను ఉరితీయాలి – హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌”
‘జనసేన’ చైతన్యంతో ప్రభుత్వ పతనం,
”పరార్‌లో అవినీతి మంత్రులు.. నాయకులు.. తరుముతున్న ప్రజలు”
”దేశరాజకీయాల్లో మొదటి పెనుతుఫాను. రాష్ట్ర ప్రభుత్వం పతనం.. శాసనసభ రద్దు.”
ప్రపంచం విస్తుపోయింది. రాజకీయ పండితులు అవాక్కయిపోయారు. వ్యూహకర్తలు జుట్టు పీక్కున్నారు. ఢిల్లీ కుర్చీలు గడగడలాడినై.. బలిసిన ఎలుకలన్నీ అర్జంటుగా కలుగుల్లోకి పరారై పారిపోయినై.
లీలకు పిచ్చి ఆనందంగా ఉంది. భరించలేనంత సంతోషంగా ఉంది.
ఎవడో ఒకడు.. ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు హనుమంతునిలా అగ్నినంటించాడు. యిక మంటలెగిసి సర్వం దగ్ధమైపోతుంది. శుభం.. ఇది జరగాలి.. ఇది జరిగి తీరాలి.
లీలకు బిగ్గరగా అరిచి ఎగిరి గంతేయాలన్నంత మహోద్వేగంగా ఉంది.
రామం జ్ఞాపకమొచ్చాడు.
రాముని రూపంలో ఉన్న హనుమంతుడు వీడేనా.. అసలు రాముడూ, హనుమంతుడూ వేర్వేరుకాదుగదా.. అంతా శకలాలు శకలాలుగా సర్వవ్యాప్తమై ఉన్న శక్తి సంలీనానికి ప్రతీకలుకదా వీళ్ళిద్దరు.
రామం ఒక నిశ్శబ్దం.. రామం ఒక చర్య.. రామం ఒక ప్రజ్వలన.. రామం ఒక విజయం.
లీల చేతిలోని మొబైల్‌ మోగింది.
”హలో..”
”కింద కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాట్లన్నీ ఓ కే మేడం.. రిపోర్టర్సందరూ మీకోసం నిరీక్షిస్తున్నారు” నిర్మల.
నిర్మల ఈట్రిప్‌లో తనతోనే ఉంది.. వెంటరమ్మని తనే చెప్పిందామెకు.
నిర్మల.. తన అసిస్టెంట్‌.. ఒక మెరుపు.. వందమంది ఐపిఎస్‌ ఆఫీసర్స్‌, వేయిమంది ఇంటలిజెన్స్‌ పర్సెనల్‌, ఒక వ్యక్తి.. ఒక వ్యవస్థగా.. ఒక డిపార్ట్‌మెంట్‌తో సమానం.
తన దగ్గర చేరి.. తన దగ్గర శిక్షణ పొంది.. తనవలెనే ఎదిగి.. పదునెక్కి,
కాని తనవలెనే ఓ అవినీతి సామ్రాజ్యానికి అధిపతి ఔతుందా చివరికి..
కావద్దు.. కావద్దు.. అలా జరుగొద్దు.
అందుకే రమ్మంది ఈ సారి తనవెంట.. చివరి పాఠం చెప్పేందుకు.
నిర్మలకు తెలియదు ఇప్పుడీ ప్రెస్‌ కాన్ఫరెన్సెందుకో. అందుకే ఉదయం నుండి తన వంక పిచ్చిపిచ్చిగా, ప్రశ్నప్రశ్నగా చూస్తోంది భయంతో వణికిపోతూ.
”ఐదు నిముషాల్లో వస్తున్నా నిర్మలా.. యు హోస్ట్‌ దెమ్‌”
”యస్‌ మేం”
లీల ఒకసారి అద్దంలో చూచుకుని ప్రక్కనే ఉన్న స్కాజెన్‌ బ్రీఫ్‌కేస్‌ను తీసుకుంది చేతిలోకి.
అప్పుడామె అప్పుడే సముద్రగర్భంలోంచి జలతలంపైకి మహాప్రచండంగా పయనిస్తూ చేరుకుంటున్న వాయుగుండంగా ఉంది.
స్థిరంగా బయటికి నడిచి.. లిఫ్ట్‌ఎక్కి.. మొదటి అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి ప్రవేశించి,
దాదాపు ఇరవైమంది.. తెలుగు పత్రికా విలేఖరులు, టి.వి. చానళ్ళవాళ్ళు, హిందూ, టైమ్సాఫ్‌ ఇండియా ప్రతినిధులు.,
”గుడ్మార్నింగు ఎవ్రీబడీ”
”ఆంధ్రప్రదేశ్‌ ఈరోజు ఒక ప్రపంచ ప్రసిద్ధమైన ఘటనను సృష్టించి చరిత్రలో నిలిచిపోయింది. దీనిని మీలోని ఓ కార్పొరేట్‌ నిర్వాహకురాలు ఎలా స్వీకరిస్తోంది.”
”కార్పొరేట్‌ ప్రపంచానికి చెందిన దానిగానైనా, ఒకప్పటి పేద అనామకురాలిగానైనా, ఒక సాధారణ భారతీయ పౌరురాలిగానైనా, మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగానైనా ఈనాటి ఈ పరిణామాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాను, భావిస్తున్నాను.చరిత్రను ఒక కుదుపు కుదిపి మలుపు తిప్పిన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఈ ఆరోగ్యకర మహాపరిణామానికి కారణమైన ‘జనసేన’ను, దాని వ్యవస్థాపకుడు, రూపకర్త, సాహసి రామంను, అతని సహచరురాలు క్యాథీని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసిస్తున్నాను”
”దీని ప్రభావం మున్ముందు ఎలా ఉంటుంది మేడం”
”చాలా ప్రభావశీలంగా ఉంటుంది. జనసేన చెప్పినట్టు ‘ప్రక్షాళన’ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడే. యిక స్కావెంజింగు చర్య జరుగుతుంది. అశుద్ధాన్ని నీటిధాటితో కడిగి శుభ్రం చేయాలి. నిజానికి ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ అవినీతిపరులైన రాజకీయనాయకులను, అనైతిక పాలనను కొనసాగిస్తున్న ప్రభుత్వాలను, చాలా తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. యిక దొంగలను, గూండాలను, నేరచరిత్ర గలిగిన ఏ పార్టీ నాయకున్నైనా ప్రజలు వీధిలో గల్లాపట్టి కొడ్తారు. పారిపోవాలి కంటకులు తోకముడుచుకుని. ప్రజాబలం ఎంత శక్తివంతమైందో ఋజువౌతోంది.”
అందరూ రాసుకుంటున్నారు.
”సరే.. మిమ్మల్ని ఈ ప్రెస్‌మీట్‌కు పిలిపించిన కారణాలు చెప్తాను”
రెండు నిముషాల్లో అందరూ అప్పటిదాకా రాసుకుంటున్నదాన్ని ఆపి.. తలలెత్తి.. ప్రశ్నలై.,
”మిత్రులారా.. యిప్పుడు నేను చెప్పబోతున్నదాన్ని యధాతథంగా, విపులంగా, నిజాయితీగా రిపోర్ట్స్‌ చేసి నా హృదయాన్ని ప్రజలకు ఒక పూర్తి పాఠంగా అందజేయాలని ఆకాంక్షిస్తున్నాను…నిజాకికి యిది ఒక ‘కన్‌ఫెషన్‌ సెషన్‌’ ఈ సందిగ్ధ సందర్భంలో ఒక విద్యావంతురాలైన పౌరురాలిగా యిన్నాళ్ళ బట్టి.. అంటే దాదాపు పదిహేనేళ్ళుగా ప్రపంచ వేదికపైన నిర్వహించిన అనేక అసాంఘిక, సంఘవిద్రోహ, నేరపూరిత చర్యలను మీముందుంచి, నిజాన్ని నిర్భయంగా అందరికీ తెలియజేసి, ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తూ ప్రజలను నన్ను క్షమించమని వేడుకునేందుకే ఈ ప్రత్యేక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశాను.
తప్పులు చేయడం.. తోటి మానవులకు నష్టం కల్గించే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం.. చివరికి ఏదో ఒక సందర్భంలో జ్ఞానోదయమై పశ్చాత్తాపాన్ని ప్రకటించి సన్మార్గంలోకి మళ్ళి శేషజీవితాన్ని మానవ వికాసం కోసం శ్రమించడం మానవ చరిత్రలో కొత్త విషయమేమీకాదు. బుద్ధునినుండి, అశోకుని నుండి మొన్న ది కన్ఫెషన్‌ ఆఫ్‌ ది హిట్‌మన్‌ అనే పుస్తకాన్ని రాసి అమెరికా రహస్య దుర్మార్గ ఆలోచనలను బయటపెట్టిన జాన్‌ పెర్కిన్స్‌ వరకు, నిన్నరాత్రి మన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివరకు.. పశ్చాత్తాప ప్రకటించిన మహావ్యక్తులెందరో ఉన్నారు. తెలిసి తెలిసి తప్పులు చేస్తూ చేస్తూ తన చేస్తున్నది తప్పని తెలుసుకుని యిక తప్పులు చేయకుండా మారినవాడు యింకా యింకా తప్పులు చేస్తూ ఎప్పుడూ తప్పుని తప్పని తెలుసుకోకుండా మరణించేవానికంటే ఉత్తముడని నేను విశ్వసిస్తాను.
ఈ రోజు బహిరంగంగా నా తప్పులన్నింటినీ మీ అందరి సమక్షంలో బయటపెట్టి.. నా నుండి నా సంఘర్షించే ఆత్మనుండి.. చివరికి అర్ధరహితంగా కొనసాగుతున్న ఈ జీవితం నుండి విముక్తమైపోతున్నాను..”
నిర్మల షాకైంది.. అవాక్కయి చూస్తోంది లీలవంక. అసలేం జరుగుతోందో అర్ధం కావడంలేదామెకు.
”సరిగ్గా నేను పది మార్చి పందొమ్మిదివందల తొంభై ఐదు నాటి రాత్రి వరంగల్లు చౌరస్తాలో ఒక విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి ఒక ప్రకటన చేశాను. పుట్టు అనాథను, దిక్కులేనిదాన్ని, నిట్టనిలువుకొండను ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాకుతూ ప్రాకుతూ జీవితాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకొని బ్రతకాలనుకుంటున్నదాన్ని.. చేతిలో ఒక్క రూపాయికూడా లేనిదాన్ని సరిగ్గా పదిహేను ఏండ్ల తర్వాత సర్వశక్తులనూ ఒట్టి యిరవై వేల కోట్ల రూపాయలను సంపాదించి ఒక మామూలు స్త్రీ ఎలా విజయాలను సాధించగలదో ఋజువు చేసి చూపిస్తానని సవాలు విసిరి నిష్క్రమించాను. మర్నాడు ఆ విషయం ఒక ఉత్కంఠభరితమైన విషయంగా అన్ని తెలుగు పత్రికల్లో వచ్చింది. దాని కాపీ మీకు అందిస్తాను తర్వాత. అప్పట్నుండి యిక జీవితంలో పరుగు ప్రారంభించాను. నేను ఎంబిఎ చదివినప్పుడు మౌళిసార్‌ అని ఓ ప్రొఫెసర్‌ ఉండేవాడు. ఒక వాక్యం చెప్పాడాయన.. మనిషి సర్వకాల సర్వావస్థల్లో సుఖ, దుఃఖ, నిర్వేద, సంకక్షుభిత సర్వసందర్భాల్లో తోడుండేది ఒక ‘పుస్తకమే’ అని. పుస్తకాన్ని ఆయుధంగా చేసుకుని భారత పురాణేతిహాసాల్నుండి ప్రపంచ సకల మానవవికాసానికి సంబంధిచిన పుస్తకాలన్నింటిని ఒక సంవత్సరంపాటు ఆమూలాగ్రం అధ్యయనం చేశాను. పదిహేనేళ్ళలో ఒక ఏడాది గడిచింది. యిక రెక్క విప్పి నన్ను నేను ఒక ప్రశ్నగా, పదునైన పనిముట్టుగా, ఆయుధంగా, బాణంగా, శక్తిగా.. శిల తనను తాను చెక్కుకుని శిల్పంగా మలుచుకున్నట్టు రూపాంతరీకరించుకుని యిక పరుగు పందెంలోకి ప్రవేశించాను.
యిప్పుడు నా నెట్‌ అసెట్‌ వ్యాల్యూ యిరవై ఐదు వేల కోట్ల రూపాయలు. నేను చాలెంజ్‌ చేసినదానికంటే ఐదువేల కోట్ల రూపాయలు ఎక్కువ.
ఐతే మనిషికి పరుగుపందెంలో ఉన్నప్పుడు ఒక్క లక్ష్యం, గమ్యం మాత్రమే కనిపిస్తుందిగాని విచక్షణ ఉండదు. డబ్బు.. డబ్బు.. డబ్బు. డబ్బేలోకం, డబ్బేదైవం, డబ్బే జీవితం. డబ్బు ఇంకా ఇంకా చేరుతున్నకొద్దీ మనిషిని ఒక అజ్ఞాతమైకం కమ్ముతుంది. నిషా శరీరం, మనసు, హృదయం, బుద్ధి వీటన్నింటినీ ఆవహించి ఉన్మాదుణ్ణి చేస్తుంది. డబ్బుతో అధికారం, అధికారంతో వ్యామోహం, వ్యామోహంతో మదం, మదంతో అహంకారం, అహంకారంతో పశుప్రవృత్తి.. యిక మనిషి ధనమదంతో మృగమైపోతాడు. విచక్షణ పూర్తిగా నశించిపోతుంది.
నేను గత పదిహేనేళ్ళుగా మృగంగా జీవిస్తున్నాను.
కాని యిప్పుడు నాలో.. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న ఉదయించింది.
ఈ గుట్టల గుట్టలు డబ్బు ఎందుకు.. కనీసావసరాలకు మించిన ఈ సౌకర్యాలెందుకు.. ఈ అవధులు మీరిన లౌల్యం ఎందుకు.. అసలు గమ్యమే తెలియని ఈ ప్రయాణం ఎందుకు.
ఏమిటి..?ఎందుకు?..ఎక్కడికి?..యివి అసలైన ప్రశ్నలు
యిక యిప్పుడు నన్ను నేను తెలుసుకుని విముక్తమౌతున్నాను.
సూట్‌కేస్‌లో సర్వ వివరాలతో, ఋజువుల్తో కొన్ని ఫైళ్ళున్నాయి. వీటిలో ఈ కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా చెలామణిఔతూ కోట్లకోట్ల అవినీతికి పాల్పడ్తున్న దాదాపు నూటా ఇరవై మంది ఐఎఎస్‌లూ, మంత్రులూ, డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తుల జాతకాలు, వాయిస్‌ ఎవిడెన్సెస్‌, వీడియో క్లిప్పింగ్సు.. అన్నీ ఉన్నాయి.
అంతర్జాతీయంగా ప్రపంచబ్యాంక్‌, ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ వంటి సర్వోన్నత సంస్థల్నుండి బిలియన్సాఫ్‌ డాలర్స్‌ను పర్సెంటేజ్‌లపై భారతదేశపు ఎనిమిది రాష్ట్రప్రభుత్వాలకు తరలించి, ఎన్నో పవర్‌ ప్రాజెక్ట్‌లకు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు, రోడ్లకు, విద్య, వైద్య, ఆరోగ్య పథకాలకు కోటానుకోట్ల మళ్ళించి.. ఇన్ని రాష్ట్రాల్లో ఎవడు ఎంత కమీషన్‌ తీసుకుంటాడు, ఎవడు ఎలా పనులు చేస్తాడు.. ఎవడు ఎంత దోచుకుంటాడు.. ఏ కార్పొరేట్‌ కంపెనీ ఎంత ముట్టజెప్పి ఎంత లాభపడ్తుంది.. యివన్నీ లీలకు ఫింగర్‌ టిప్స్‌. లీల నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా ఉంది. లీల సామ్రాజ్యం అదృశ్యంగా భారతదేశం మొత్తం వ్యాపించి ఉంది. నేను ఒక ఆక్టోపస్‌ వంటిదాన్ని. విస్తరణ నాకు వెన్నతో పెట్టిన విద్య.
నా సామ్రాజ్య రూపురేఖల వివరాలన్నీ ఈ సూట్‌లోని కాగితాల్లో మైక్రోఫిల్ముల్లో నిక్షిప్తమై ఉంది.
సారాంశమేమిటంటే.. దేశమేదైనా.. భాష ఏదైనా.. విషయమేదైనా.. వ్యవహారమేదైనా.. చాలావరకు ‘మనిషి దొంగ.’ ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగుతాడు..పడిపోతాడు చెప్పిన పనిచేస్తాడు..అది పెద్ద రహస్యమేమీకాదు.. మనం ఎవనికివాడు గుండెపై చేయేసుకుంటే మనకే తెలుస్తుంది మనం దేనికీ లొంగిపోతామో.
ఐతే.. ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగిపోవడం మాత్రం ఖాయం అన్న సూత్రంపై ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాను.
కాని అంతిమంగా ఈ డబ్బంతా ఈ సమాజానిది.. ఈ ప్రజలది.. ఈ దీనులది.. ఈ ప్రజలది.. ఇథియోఫియాకు పోండి. ఇండోనేషియాకు పోండి, యుద్ధానంతరం ఇరాక్‌ వీధుల్లో తిరగండి, అప్ఘనిస్తాన్‌ పల్లెల్లో నడవండి. భారతదేశపు ఆదివాసీ గ్రామాల్లోకి తొంగిచూడండి. దుఃఖం.. కన్నీళ్ళు ఏరులై పారుతాయి. ఆకలి, అనారోగ్యం.. దరిద్రం.. నిస్సహాత, దిక్కులేనితనం.. యివి మనల్ని ఒక జీవితకాలం వెంటాడ్తాయి. డబ్బును యింత దారుణంగా దోచుకుంటున్న మనల్ని నిలదీసి సిగ్గుతో తలవంచుకునేట్టు చేస్తాయి.
పశ్చాత్తాపపడ్తూనే నేను ఈ సందర్భంగా దోపిడీదారులైన ఈ దేశవ్యాప్త రాబందు నాయకులకు, ప్రభుత్వాధికారులకు, వ్యాపార రాక్షసులకు ఒకటే వినయపూర్వక విన్నపం చేస్తున్నాను. లంచం తీసుకునేప్పుడు, లంచం యిచ్చేప్పుడు ఈదేశంలో ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్లమంది పేదల కన్నీళ్ళను, వాళ్ళ ఆకలి కడుపులను, వాళ్ళ దుర్భర జీవిత ఆవరణను ఊహించుకోండి. మీరు తీసుకుంటున్న డబ్బు వాళ్ళ రక్తాన్ని తాగుతున్నట్టు వాళ్ళ శరీరాన్ని చించుకుని తింటున్నట్టుగా దృశ్యించండి. ఆ డబ్బు వాళ్ళదే…మీరు దొంగతనంగా వాళ్ళ నోటిముందరి అన్నం ముద్దను లాక్కుని తింటున్నట్టుగా ఊహించుకోండి. యిక మీరు మీ జన్మలో ఎక్కడా లంచం తీసుకోరు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, సర్వ న్యాయవ్యవస్థకు చేతులెత్తి విన్నపం చేస్తున్నాను.. మీ కళ్ళముందే యిన్ని ఘోరాలు, నేరాలు, దౌర్జన్యాలు, బహిరంగ రాజకీయదోపిడీలు, శాసనాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ గూండాలు చట్టసభలను ఆక్రమించుకోవడాలు..జరుగుతుంటే దయచేసి మాకెవ్వరూ కాగితాలపై పిటిషన్‌గానో, దరఖాస్తుగానో దాఖలు చేయడం లేదని చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తున్నారు. ఒక సాధారణ మనిషిగా మీరే  ఓ రాజ్యాంగ పౌరునిగా స్పందించి సుమోటో కేస్‌గా ఈ దోపిడీని, దొంగతనాన్ని ఆపండి. అవినీతిని పరిహరించండి ప్లీజ్‌.
అంతిమంగా ప్రజలకు చేతులెత్తి దండంపెడ్తూ వేడుకుంటున్నాను. రామం వంటి నాయకులు ఎప్పుడో ఒకరో ఇద్దరో పుడ్తారు. కాని మీరు ఎవరికి వారు ఒక్కోనాయకునిగా ఎదగండి. సింపుల్‌ ఫార్ములా..కోట్లను కుప్పలేస్తున్న వానిదగ్గరికి ఒక సమూహ జనశక్తిగా వెళ్లి నువ్వేం పనిచేస్తున్నావ్‌..నీకిన్ని ఆస్తులెక్కడివి..కోటానుకోట్లు ఏ అపక్రమ మార్గంలో వస్తున్నాయ్‌..అని బాజాప్తాగా నిలదీయండి. వ్యక్తి ఒంటరిగా ఎప్పుడూ బలహీనుడు..సంఘటితం కండి..చినుకు చినుకు కలిసి ఉప్పెనై విజృంభించండి.
రామం స్థాపించిన ‘జనసేన’ ఒక మహాశక్తి కేంద్రకం. ఎటువంటి అధికార వాంఛలేని, స్వంత ఆస్తులపై మమకారం లేని, ఏ పదవీ వ్యామోహం లేని లక్షమంది శాశ్వత కార్యకర్తలతో, ఒక నిరంతర మహోద్యమాన్ని ఈ దేశానికే ప్రేరణగా రూపొందించి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అతని ఆ మహాయజ్ఞంలో సమిధగా నా సర్వ స్థిర చరాస్తులన్నింటినీ ‘జనసేన ట్రస్ట్‌’కు ధారాదత్తం చేస్తున్నాను. ఆ విల్లు ఈ సూట్‌కేస్‌లో ఉంది. నా తరపున నిర్మల ఈ కేసులన్నింటిని కోర్టుల్లో ఫైల్‌ చేస్తుంది. మిగతా వ్యవహారాలన్నీ నా వారసురాలిగా కొనసాగిస్తుంది. నిర్మలే మున్ముందు నాకు వారసురాలు.
విలేఖరులందరూ తలలు వంచుకుని రాసుకుంటున్నారు. టి.వి. ఛానల్‌ వాళ్ళు కెమెరాల్లో ముఖాలు పెట్టి షూట్‌ చేస్తున్నారు. అటు ప్రక్క నిర్మల నిర్ఘాంతపోయి రాతిబొమ్మలా నిలబడి వింటోంది.
అప్పట్నుండి ఒక ప్రవాహంలా మాట్లాడ్తున్న లీల గొంతు ఆగిపోయింది చటుక్కున. ధార తెగి…నిశ్శబ్దమై..స్తబ్దమై
అందరూ ఆ అంతరాయానికి స్పందిస్తూ తలెత్తారు లీలవైపు…
కాని ఎదురుగా అప్పట్నుండి మెరుపులా కనిపించిన లీల అక్కడ లేదు. ఒక లిప్తకాలంలో సుడిగాలిగా కదిలి..ఉరికి.. ప్రక్కనే ఉన్న గాజు కిటికీ తలుపులను తెరుచుకుని చటుక్కున బయటికి కిందికి దూకింది…పదిహేనవ అంతస్తుపైనుండి…అకస్మాత్తుగా.
అందరూ గగుర్పాటుతో ఉలిక్కిపడి..కిటికీ దగ్గర చేరి..కిందికి చూస్తూ.
క్రింద రక్తపు మడుగులో లీల శవం..చుట్టూ ఎర్రగా రక్తం…సడన్‌గా జరిగిన సంఘటనకు విస్తుపోయి గుమికూడుతున్న జనం…కోలాహాలం.
కాన్ఫరెన్స్‌హాల్‌లో…టేబుల్‌పై లీల అప్పట్నుండి చెప్పిన డాక్యుమెంట్లతో నిలిచిన స్కాజెన్‌ తోలు సూట్‌కేస్‌…
కొందరు విలేఖరులు లీల మరణ దృశ్యాన్ని రికార్డ్‌ చేయడానికి పరుగు తీశారు కిందికి కెమెరాల్తో. హాల్‌నిండా గంభీర నిశ్శబ్దం అలుముకుంది.
ఏమిటి?…ఎందుకు?…ఎక్కడికి? లీల గొంతు ప్రతిధ్వనిస్తోంది.
ప్రశ్నలు ప్రశ్నలుగా నిర్ఘాంతపోయిన నిర్మల కళ్లనిండా నీళ్లు…ఎదుట ఏమీ కనబడడం లేదు. గాలి బరువెక్కుతుంది.

31

25

రామం కొద్దికాలం కోమాలో ఉండి కోలుకుని మొదటిసారిగా ‘జనసేన’ కేంద్రకానికొచ్చాడు ఆ రోజు.
ఉదయం ఎనిమిది గంటలు…
మనిషి చాలా బలహీనంగా ఉన్నాడు. బాంబు ప్రేలినప్పుడు వీపు భాగం ఛిద్రమై, పేలికలై…మాంసం ముద్దగా మారి…
వరుసగా ఎనిమిదిసార్లు ఆపరేషన్స్‌ జరిపి సెట్‌ చేసి…కుట్టి…తొడల నుండి మాంసాన్ని కత్తిరించి అతికి..కోలుకోవడం ఓ గండం గడిచి బయటపడి…
రామంను క్యాథీ తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి నడిపించుకొచ్చింది కారు నుండి ఆఫీస్‌లోని కుర్చీదాకా.
అత్యంత కీలకమైన సమావేశం అది.
”అందరికీ నమస్కారం సర్స్‌…శివ, గోపినాథ్‌గారు, మూర్తి గారు…మీకందరికి ధన్యవాదాలు…నన్ను కంటికి రెప్పకన్నా అధికంగా చూచుకున్నారు”.
”ఒక్కసారి అటు చూడండి” అన్నాడు మూర్తి…హాల్‌లో ఓమూలనున్న అక్రిలిక్‌ ట్రాన్స్‌పరెంట్‌ షీట్‌తో చేసిన పెద్ద మనిషెత్తు పెట్టెను చూపిస్తూ.
రామం తలను అటు త్రిప్పిచూశాడు. దాదాపు దానినిండా ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉన్నాయి.
”అవన్నీ మీరు తొందరగా కోలుకుని జనసేన కార్యకలాపాలకు స్వయంగా నాయకత్వం వహించాలని రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రేతర ప్రాంతాల్నుండి, ఎన్నారైలనుండి వచ్చిన ఉత్తరాలు…మెసేజ్‌లు”
”రియల్లీ… ఐ ఓ టు దెం…ఏం చేసి వాళ్ల ఋణం తీర్చుకోగలను…” చటుక్కున అతని కళ్ల నిండా నీళ్లు నిండాయి చలించిపోయాడు.
కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత…తేరుకుని…”చెప్పండి సర్స్‌…విశేషాలు”
గోపీనాథ్‌గారు ప్రారంభించారు.”మీకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి గాని..ఫర్‌ క్లారిటీ..రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భవిష్యత్తుపట్ల పెల్లుబుకుతున్న విశ్వాసంతో చైతన్యం వెల్లివిరుస్తోంది. అన్ని ‘జనసేన’ కార్యాలయాల్లో పౌరశిక్షణ తరగతులు సజావుగా సాగుతున్నాయి. మనం అనుకున్న శాశ్వత లక్షమంది నిస్వార్ధ జనసైనికులు తమ విధులను జనంతో కలసి ప్రేరక్‌లుగా పనిచేస్తున్నారు. అవసరమైతే జనసైనికులుగా ఫుల్‌టైమర్‌లుగా పనిచేయడానికి ఇంకో లక్షమంది సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం జనసేన సభ్యుల ఎన్‌రోల్‌మెంట్‌ ఒక కోటి డెబ్బయి లక్షలు. అహింస…క్రమశిక్షణ…సంస్కారం…ప్రశ్న…త్యాగం అంశాలుగా నిరంతర శిక్షణ కొనసాగుతోంది.
తర్వాత మూర్తిగారు మాట్లాడ్డం మొదలెట్టారు.”ముఖ్యమంత్రి తనే స్వయంగా అవినీతి నిర్మూలన కార్యక్రమానికి శ్రీకారం చుడ్తూ లంచగొండి నాయకులపై, మంత్రులపై యితరేతర అన్ని రాజకీయ పార్టీలనాయకులపై అవినీతిపరులైన ప్రభుత్వాధికారులపై కేసులు పెట్టిన తర్వాత…మొత్తం పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని ఒక ‘నాన్‌వయలెంట్‌ సివిల్‌ రెవల్యూషన్‌గా’ మీడియా అభివర్ణించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేసిన తర్వాత ఇది ఒక ‘జనసేన’ ఘన విజయంగా ప్రజల హృదయాల్లో నమోదైంది. దేశం యావత్తూ మన రాష్ట్రం వైపు, జనసేన వైపు పరిశీలనగా, ఆశతో చూస్తోంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరి జనచైతన్య వేదికలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చేసుకున్న దరఖాస్తులు, మనం పెట్టిన వేల కంప్లయింట్స్‌తో ఇనకంటాక్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ‘వాలంటరీ డిస్‌క్లోజర్‌ అండ్‌ టాక్స్‌’ పథకాన్ని ప్రవేశపెట్టి నల్లడబ్బును సేకరిస్తే నమ్మశక్యం కాని విధంగా లక్షా నలభై రెండు వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. రెండు వందల రెండు కాంట్రాక్ట్‌లు రద్దయి రీవర్కవుతున్నాయి. ఎసిబీ మన కంప్లయింట్స్‌ ఆధారంగా జరిపిన దాడుల్లో మొత్తం ఒక వేయి ఆరువందల అరవై కోట్ల రూపాయలు, ఎనిమిది వందల కిలోల బంగారం పట్టుబడింది. మొత్తం ఎనిమిది వందల పైచిలుకు కేసులు నమోదై కోర్టుల్లో నడుస్తున్నాయి. మొత్తానికి వ్యవస్థలో సమూలమైన మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. పాలక రాజకీయ పార్టీకి చెందిన మూడువందల పదిమంది, ప్రతిపక్ష…వామపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నూటా పద్దెనిమిదిమంది రాజకీయనాయకులు…ఎంపిటిసి స్థాయి నుండి మంత్రుల దాకా అవినీతి ఆరోపణల కింద ప్రజలచే దాడి చేయబడి, ప్రశ్నించబడి ఆధారాలతో సహా నిలదీయబడ్డప్పుడు సిగ్గువిడిచి ముక్కును నేలకు రాసిన సందర్భాలున్నాయి. చిత్రమేమిటంటే ఒకనిపై ఒకరు పోటీపడి, ఎగబడి సంపాదించుకున్న ఆరువేల ఐదువందల తొంబై ఆరు మద్యం షాపుల్లో ఐదువేల నాలుగువందల పదహారు మంది మాకు షాపులు వద్దని ఆఫర్లు వెనక్కి తీసుకున్నారు. ఆడవాళ్ల పేరుమీద అప్లికేషన్‌ పెట్టుకుని మద్యం షాపును దక్కించుకున్న వందమంది పాలకపక్ష, ప్రతిపక్ష రాజకీయ నాయకుల్లో ఏడ్గురు మంది ఎమ్మెల్యేల పెళ్లాలు మొగుళ్లను బహిరంగంగా ‘జనసేన’ కార్యకర్తల ఎదుట చీపుళ్లతో కొట్టి సత్కరించారు. మద్యం సిండికేట్లన్నీ పటాపంచలైపోయాయి. ధరలు నలభై శాతం తగ్గాయి. డాక్టర్లు ఫీజులను స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. ప్రతి వక్రబుద్దిగలవానిలో ఎక్కడ్నుండో ఎవరో ‘జనసేన’ కార్యకర్తలు తమను గమనిస్తూ అంతా రికార్డు చేస్తున్నారనే భయం వ్యాపించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ పకడ్బందైన నిఘాలో ఉన్నాయి. అందువల్ల ఆఫీసుల్లో పనులు చకచకా, సజావుగా ఆమ్యామ్యాలు లేకుండా ఆరోగ్యవంతంగా నడుస్తున్నాయి. మొన్ననే ఎన్నికల కమీషన్‌ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ రోజు తేది పది. ఇరవై నామినేషన్లకు చివరి తేది. ఇరవై రెండు విత్‌డ్రాయల్స్‌…వచ్చేనెల ఎనిమిదిన పోలింగు. పన్నెండున కౌంటింగు.
రామం అప్పటిదాకా కళ్లు మూసుకుని సావధానంగా వింటున్నవాడల్లా…నెమ్మదిగా…ఆగండని సైగచేసి..కళ్లు తెరచి సర్దుకుని కూర్చుని…”ఇంతవరకు జరిగిందంతా ప్రక్షాళనే..అసలు మన ‘జనసేన’ యొక్క ‘సంగ్రామ’ థ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఒక గురువు తన సర్వశక్తులను ఒడ్డి శిష్యుణ్ణి తయారుచేసిన తర్వాత ఆ శిష్యుడు ప్రతిభాపాటవపరీక్షల్లో పాల్గొన్నప్పటి ఉద్విగ్న పరిస్థితి ఇది. ప్రస్తుత రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఎలా ఉంది…”
”యిదివరకటిలా రెచ్చిపోయి ఒకనిపై ఒకరు ఎగబడి టికెట్ల కోసం పైరవీలు చేసుకోవడం, లాబీలు నడపడం, డబ్బుతో ఎవర్నయినా కొనగలమనే స్థితి లేకపోవడం వల్ల దొంగ నాటకాలు వేయడం అంతగా ఎక్కడా కనబడ్డం లేదు. అంతా గుంభనంగా, నివురుగప్పిన నిప్పులా, దొంగలుపడ్డ యింట్లోని పరిస్థితిలా ఉంది. లీల అనే కార్పొరేట్‌ మహిళ ఢిల్లీలో వందలమంది కేంద్ర రాజకీయులు, ప్రభుత్వ పెద్దలపై వందల కేసులు పెట్టి ఎలక్షన్‌ కమీషన్‌కు నేరచరితుల లిస్ట్‌ వేరే ఋజువుల్తో సహా ఇచ్చి ప్రకంపనలు సృష్టించి ఆత్మార్పణం చేసిన తర్వాత ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల పునాదులు కదులుతున్నాయి…”
”లీలనా..” అన్నాడు రామం వెంటనే…చటుక్కున అని క్యాథీ వైపు చూశాడు.
”ఔను రామం…లీలనే…ఆమె తనకు చెందిన సర్వ లీగల్‌ ఆస్తులను జనసేనకు డొనేట్‌ చేసి గతనెల రెండవ తేదీ ఒక విభ్రాంతికరమైన ప్రెస్‌మీట్‌ పెట్టి అనేక అవినీతికర సంబంధిత చిట్టాలను బహిర్గతపరిచి అనూహ్యంగా పదిహేను అంతస్తుల హోటల్‌ భవనంపైనుండి కిందికి దూకి ఆత్మార్పణ చేసుకుంది. లీల మరణం ఢిల్లీ పెద్దలకు చలిజ్వరం తెప్పించింది. ఎందరి చీకటి చరిత్రలో బయటపడి ఒక్కొక్కడు అదిరి చచ్చిపోతున్నాడు. అంతా కకావికలైంది”
”ఉహు…చెప్పండ్సార్‌”
”శివా చెప్పు…” అన్నాడు మూర్తి తప్పుకుంటూ
శివ చెప్పడం ప్రారంభించాడు. యింతవరకు ‘జనసేన’ ద్వారా ప్రజల్లో ఒక నీతివంతమైన సంస్కృతి, ప్రశ్నించే చైతన్యం, శాస్త్రీయంగా సమాజం, దేశం స్పృహతో ఆలోచించే విధానం అలవడ్డాయి. మన ‘జనసేన’ కేంద్రాలన్నింటికి ఈ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సచ్చరిత్ర గలిగి, అంకితభావంతో, విలువలు ప్రధానంగా ప్రజలకోసమే పనిచేసే విద్యావంతులైన యువకులు అనేకమంది ఆసక్తిచూపుతూ ముందుకొస్తున్నారు. మనం మన స్పందనను తెలియజేయాల్సిఉంది. ‘సంగ్రామ’ థలో మన పాలసీని ప్రకటించవలసి ఉంది. ప్రధానంగా ఈ సమావేశం అందుకే..
”డు యు హావ్‌ స్టాటిస్టికల్‌ డాటా ఆఫ్‌ ఆల్‌ దోజ్‌”
”యస్‌..”
”క్యాథీ ప్లీజ్‌ స్క్రీన్‌”
క్యాథీ వెంటనే క్షణాల్లో ఎల్‌సిడి ప్రొజెక్టర్‌ను స్టార్ట్‌ చేసింది.
తెరపై..నియోజక వర్గం…’జనసేన’ ఆమోదముద్ర కోసం అప్లికేషన్‌ పెట్టుకున్న అభ్యర్థి వివరాలు కదులుతున్నాయి.. రామం చేతిలోకి మానిటర్‌ను తీసుకుని మచ్చుకు ఐదారు చూచి…పాస్‌ చేసి
”చెప్పండి మూర్తి గారు..తర్వాత” ప్రధానంగా ‘జనసేన’ ఆమోదం పొందిన ఏ అభ్యర్థి అయినా ఏ రాజకీయ పార్టీ క్రిందికి రాడు. అతను ఇండిపెండెంట్‌. అంటే స్వతంత్ర అభ్యర్థియై ఉండాలి విధిగా. దరఖాస్తు చేసుకున్న కాండిడేట్లలో ఎవరో ఒకరికి ఐతే.. మన జనసేన ఆమోద ముద్ర తెలిపిన అభ్యర్థిని ఎంపిక చేయడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను మన విధాన నిర్ణాయక సంఘం తయారుచేసింది. జనసేన ఆమోదం కావాలంటే మొట్టమొదట అభ్యర్థి ఈ కండిషన్లను సంతృప్తి పర్చాలి…విందామా వాటిని… శివా వినిపించు..”
”శివా…” అన్నాడు రామం
”ఒకటి.. అభ్యర్థి ఆ నియోజక వర్గానికి స్థానికుడై ఉండాలి. రెండు…కనీసం పట్టభద్రుడై ఉండాలి. వయస్సు అరవై ఏళ్ల లోపు గలవాడై ఉండాలి. మూడు…విధిగా నిరాడంబర జీవితాన్ని గడపడానికి ఇష్టపడే తత్త్వాన్ని, జనంలో మమేకమై వాళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు గ్రహించి పరిష్కరించాలనే అనురక్తిని కలిగి ఉండాలి. నాలుగు…ఎటువంటి నేరచరిత్ర ఉండకూడదు. ఐదు..రాజకీయమంటే కొంతపెట్టుబడిపెట్టి గెలిచి దానికి వందరెట్లు సంపాదించుకోవడమనే ఒక ముద్ర ఉండి. ఆ కోణంలో ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఆ అభ్యర్థి నిరాకరించబడ్తాడు. అందుకు అభ్యర్థి యొక్క సాధారణ ప్రవర్తనను, తత్వాన్ని జనసేన స్వయంగా అధ్యయనం చేయిస్తుంది. ఆరు… ఎన్నికైతే అభ్యర్థి ఆ నియోజక వర్గం ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న జనసేన కార్యాలయ ప్రాంగణంలో శాసనసభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చేఅన్ని సౌకర్యాలున్న సాధారణ గృహంలోనే భార్యా పిల్లలతో నివాసముండాలి. జనసేన ఇచ్చే వాహనాది సదుపాయాలనే ఉపయోగించాలి. ఏడు..ఏ ఓటరుకైనా ఎన్నికైన శాసనసభ్యుడు పిలుపు దూరంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. ఎనిమిది… ప్రవర్తన బాగా లేనప్పుడు ప్రతి ఆరునెలలకొకసారి జనసేన నిర్వహించే జనాభిప్రాయ సేకరణలో నిరసన వ్యక్తమైనపుడు ఆ శాసనసభ్యుడు తన సభ్యత్వాన్ని వదులుకొని వెనుదిరిగి రావడానికి సంసిద్దుడై ఉండాలి. తొమ్మిది తన పదవీ కాలం ఐదేళ్లలో ప్రభుత్వం తరపున, జనసేన తరపున లభించే ఆదాయం మినహా ఎటువంటి అదనపు సంపాదననూ సమకూర్చుకోరాదు. ఇతర వ్యాపారాలు చేయరాదు. అతనికి, అతని కుటుంబ సభ్యుల సౌకర్యార్థం జనసేన సకల ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి పదవీకాలం ఐదేళ్లను ప్రజల, నియోజకవర్గ అభివృద్ది కోసమే పాటుపడాలి. పది…నీతివంతమైన జీవన సంస్కృతిని జనసేన తరపున ప్రజల్లో ప్రతిష్టించి పౌరునిగా ఆదర్శంగా స్వతంత్రంగా జీవించాలి…ఇవి పది నిబందనలు”.
”ఊ…బాగున్నాయి…ఒకసారి ఒక స్వతంత్ర అభ్యర్థి. మన జనసేన తన ఆమోదముద్ర వేసిన తర్వాత అతను ప్రజల అభిమానాన్ని చూరగొని ఎన్నికై రావడానికి మనం అవలంభించే పద్దతులను కూడా ఖరారు చేద్దామనుకున్నాం గదా గోపినాథ్‌ గారు…” అన్నాడు రామం సాలోచనగా.
”ఔను..అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. క్యాథీ మీరు వినిపించండి”
‘ఒకటి…ప్రజలను ఇన్నాళ్లుగా మోసం చేసిన ప్రజాకర్షక పథకాల గురించి ఏమీ ప్రస్తావించం. ‘ఉచితాలు వద్దు…ఉపాధి ముద్దు..’ యాచకులుగా కాదు ఆత్మగౌరవంతో జీవిద్దాం’, ‘వృద్దుల సంరక్షణ సామాజిక బాధ్యత’ ఇవి మన సిద్దాంతపరమైన నినాదాలు.రెండు..ఏ నియోజకవర్గంలోనైనా జనసేన ఆమోదముద్ర పొంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తనతో పోటీలో ఉన్న ఏ ప్రత్యర్థి గుర్తించీ తన ప్రచారంలో ప్రస్తావించడు..దుర్భాషలాడడు, విమర్శించడు. తను ఎన్నికైతే ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడో, ఏమేం సేవలు చేయగలడో వివరిస్తారు. సంస్కారవంతమైన భాషతో ప్రచారం నిరాడంబరంగా కొనసాగిస్తాడు. మూడు…ఎక్కడా రోడ్‌షో వంటి పిచ్చి పిచ్చి నడిరోడ్డు చిందులాటలు జరిపి ప్రజలకు అసౌకర్యం కలుగజేయరు. నాలుగు…నిర్ణీతమైన విశాల మైదానాల్లోనే పద్దతి ప్రకారం…డబ్బిచ్చి జనాన్నికొనుక్కుని రాకుండా నిజంగా తనపై, జనసేనపై ఉన్న అభిమానంతో వచ్చిన ప్రజలతోనే చాలా నిజాయితీగా తన గురించి క్లుప్తంగా చెప్పుకుంటాడు. నాలుగు…జనసేన ఆమోదమున్న అభ్యర్థులెవ్వరూ పోలీస్‌ సెక్యూరిటీని పోటీ చేసినపుడు గానీ, గెలిచిన తర్వాత గాని అంగీకరించరు. ప్రజల మధ్య స్వేచ్చగా తిరుగలేని వాడు ప్రజలకు మిత్రుడు కాడని జనసేన నమ్ముతుంది. ఐదు…జనసేన తరపున సుశిక్షితులైన జిల్లాకే చెందిన మూడువేల కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో మన అభ్యర్థి తరపున యింటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. నిరాడంబరంగా, స్వచ్ఛందంగా, వాళ్ల క్రమశిక్షణాయుతమైన ప్రచారమే అభ్యర్థి గెలుపుకు ప్రాణవాయువు. ఆరు…ప్రతి నియోజకవర్గంలోని స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా మాత్రం మన అభ్యర్థి ప్రతిరోజు ఓ పావుగంట ప్రజలనుద్దేశించి ఏ పరిస్థితుల్లో ఎన్నికలొచ్చాయి…అంతకు ముందు ఏం జరిగింది..జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు ఎలా ఉండాలి…ఎలా ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రజాధనం ఎలా కొల్లగొట్టబడింది..ఎలా ప్రజలపై ఋణభారం మోపబడింది. మనం ఎంత లోతు అప్పుల బురదలో కూరుకుపోయి ఉన్నాం..ఈ విషయాలను అంకెలతో సహా పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలి. ఏడు…అభ్యర్థికి అయ్యే పరిమితమైన ఈ ప్రచార ఖర్చును, కార్యకర్తల నిర్వహణ ఖర్చును, ఎక్కడా అతిగా అనిపించని ప్రచార సామాగ్రి ఖర్చును స్వచ్ఛందంగా ‘జనసేన’ భరిస్తుంది. ఎనిమిది…ప్రచార సమయంలో పకడ్బందీ సమయపాలనతో రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తి, శివలతో కూడిన సారథ్య బృందం తప్పనిసరిగా ఒక్కసారైనా ప్రతి నియోజక వర్గంలో పర్యటిస్తుంది. ప్రజలను కలుస్తుంది. తొమ్మిది…మన లక్ష్యం…ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల వెంట…యివీ తొమ్మిది సూత్రాలు” ఆగింది క్యాథీ.
”బాగున్నాయి…ఫర్‌ఫెక్ట్‌..సర్‌… యింతవరకు ఎన్ని నియోజకవర్గాలనుండి ‘జనసేన’ ఆమోదం కోసం దరఖాస్తులందాయి మనకు”
”అన్నీ…రెండవందల తొంభై మూడు శాసనసభా నియోజక వర్గాలకు ఒక్కో నియోజక వర్గానికి కనీసం యిరవై మంది నుండైనా అప్లికేషన్లయినా వచ్చి ఉంటాయి. ఐతే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే…చాలామంది ముప్పయ్యేండ్లవయస్సు లోపు వారే కాకుండా అందరూ బీద, వెనుకబడిన, దళిత, ఆర్థికంగా నిమ్నమధ్యతరగతికి చెందినవాళ్లే. ఆ జన్మ ధనవంతులు దాదాపు ఎవరూ లేరు.
”మనకు వాళ్లే కావాలి…వాళ్లే చరిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఏ వస్తువు తయారైనా, ఎక్కడ ఏ బృహత్తర నిర్మాణం జరిగినా వాటివెనుక వీళ్ల శ్రమే ఉంది. నాయకుడెప్పుడు కరుణార్థ్ర హృదయుడై, పీడిత జన పక్షపాతియై ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాత నంబర్‌వన్‌ ధనవంతుడు వారెన్‌ బఫెట్‌ తన నలభై ఏండ్ల క్రితం కొనుక్కున్న పాత యింట్లో నివసిస్తూ, అతి సాధారణ జీవితం గడుపుతూ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయనంత పెద్ద మొత్తంలో ముప్పయి బిలియన్‌ డాలర్లను దానం చేస్తూ…ధనవంతులపై విపరీతంగా టాక్స్‌ పెంచి పేదలను టాక్స్‌ నుండి విముక్తం చేయమన్నాడు. మన లక్ష్యం పేదవాని అభ్యున్నతి”.
”…..” కొద్దిసేపు మౌనం తర్వాత…”కొద్దిగా టీ తాగుదామా..క్యాథీ విల్‌ యు కైండ్లీ అరెంజ్‌ సం టీ ఫరజ్‌…” అన్నారు రామం చొరవగా.
బాంబు పేలుడు ఉదంతం నుండి రామం టీ తాగలేదని అందరికి తెలుసు. అతను కోలుకుని స్వయంగా టీ అడగడం ఎందుకో అందరిని ఆనందపర్చింది.
ఓ ఐదునిముషాల్లో టీ వచ్చింది.
క్యాథీ అందరికి టీ ని స్వయంగా కప్పుల్లో వంచి అందించి ప్రేమగా ఓ కప్పును రామంకు కూడా ఇస్తూ, అతని కన్నుల్లోకి చూచింది లిప్తకాలంలో.
అతని కన్నుల నిండా పొంగిపొర్లే కృతజ్ఞత.
”సర్‌..ఐతే…అందరి అప్లికేషన్స్‌ను మీరు కలిసి పరిశీలన చేయండి. ఎల్లుండి ఫైనలైజ్‌ చేసి కమ్యూనికేట్‌ చేద్దాం..శివా..ఫైనల్‌గా నిలుస్తున్న వాళ్ల గురించి మన గూడాచారి విభాగంతో సమగ్రంగా అధ్యయనం చేయించు. ఎక్కడా మనంతట మనం నిర్ణయం తీసుకోవద్దు. నామినేషన్స్‌ విత్‌డ్రా డేట్‌ తర్వాత మన విస్తృతమైన అన్ని నియోజక వర్గాల పర్యటనను ఫిక్సప్‌ చేయ్‌…సంగ్రామం థ ప్రారంభమైంది…”
కుర్చీలో నుండి మెల్లగా, ఆయాసంగా లేచి నిలబడ్డాడు రామం. వెంటనే చటుక్కున క్యాథీ అతన్ని పొదివి పట్టుకుంది.
కారులోకి ఎక్కి వెనక్కి చేరగిలపడ్తున్న రామంకు…కారు కదుల్తుండగా ఎందుకో శివ చెప్పిన లీల విషయం గుర్తొచ్చింది..ఢిల్లీలో పదిహేనంతస్తుల హోటల్‌ గదిలోనుండి కిందికి దూకి మరణించండం…
ప్రొద్దున తను ఇంట్లో నుండి బయల్దేరే ముందు ఎన్నో రోజుల నుండి చెక్‌ చేసుకోకుండా ఉండిపోయిన ఈమెయిల్స్‌ని తన లాప్‌టాప్‌లో పరిశీలిస్తుండగా ఆ రోజే కావచ్చు…చనిపోవడానికి కొద్ది గంటలకు ముందు తనకు డిస్పాచ్‌ చేసిన మెయిల్‌ జ్ఞాపకమొచ్చింది.
”రామం..ఈరోజు వాషింగ్టన్‌ డి.సి. ఏర్‌పోర్ట్‌ ఫస్ట్‌క్లాస్‌ లాంజ్‌లో..నాతో నువ్వున్నావు..లీలా, నీకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసింది. ప్రవేశించి భీకరంగా , వీరోచితంగా యుద్ధం చేస్తున్నావు. కాని కావాలనుకున్నప్పుడు పద్మవ్యూహం నుండి నిష్క్రమించడం నీకు తెలియదు. అయితే విషాదమేమిటంటే నిష్క్రమించడం తెలియదనే విషయం కూడా నీకు తెలియదు..నిజం రామం..పద్మవ్యూహ నిష్క్రమణ నాకు తెలియలేదు. నేను నక్షత్రాణ్ణి కాను. తారాజువ్వను. కాంతివంతంగా క్షణకాలం వెలిగి తప్పనిసరిగా నేలరాలిపోతాను…నీకు ఏమీ కాలేకపోయిన..లీల”.
రామం కళ్లలో సన్నని కన్నీటి పొర  ఏర్పడి హృదయం భారమైంది.
అప్పుడతనికి ఎక్కడ్నుండో ఆరుద్ర గీతం…’ప్రాప్తమున్న తీరానికి పడవ చేరిపోయింది.’ గీతం వినబడ్తోంది..సన్నగా..లీలగా.

32

26

సురేఖ దిగ్గున ఉలిక్కిపడి…మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న గోడ గడియారం దిక్కు చూచింది.
సమయం ఉదయం నాలుగ్గంటలు    ప్రక్కనున్న పక్కను చూచుకుంది. మున్సిపల్‌ వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ భర్త బాలకృష్ణ యింకా ఇంటికి రాలేదు. ప్రక్కన ఇద్దరు పిల్లలు…రమ్య నాలుగేళ్లు, బాబు కృష్ణ ఏడాదిన్నర…ఇద్దరూ అదమరచి నిద్రపోతున్నారు.
రాత్రంతా గడిచిపోతోంది. ఇతనింకా రాడేమిటి…ఎక్కడ ఎవన్తో తాగి, ఏడ తందనాలాడ్తున్నాడో…అసలే మున్సిపాలిటీ చెత్త..కంపు.
‘అమ్మచెప్పింది స్త్రీకి రెండు జీవితాలని
ఒకటి ఇక్కడ…మరొకటి అక్కడ
కాని అమ్మ చెప్పలేదు స్త్రీకి మరణాలెన్నో’
ఇంటర్‌ ఫెయిలై, వీడు…ఈ బాలకృష్ణ అనబడే డిప్లమో ఇంజనీర్‌..మున్సిపల్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గాణ్ణి తన తండ్రి మూడు లక్షలకు కొని మెడకు ఆవుమెడలో మొద్దులా కట్టి సంసారంలోకి పంపితే…మొదటి రోజు…శోభనపు రాత్రే తెలిసింది…వాడు పరమ పచ్చి తాగుబోతు..లంచగొండి వెధవ…అవినీతిపరుడు…సర్వ దుర్లక్షణాలూ మూర్తీభవించినవాడు.
కాని ఏం జేయగలదు తను…కిక్కుమనకుండా కాపురం చేస్తూ…భరిస్తూ..,
యిద్దరు పిల్లలు…రమ్య, బంగారు బొమ్మ…కాని చెవులు వినపడవు…కొడుకు కృష్ణ..మూగ..మాటలురావు.
భర్త బాలకృష్ణ…మున్సిపల్‌ రోడ్లు వేయించి, కాలువలు కట్టించి, కల్వర్టులు కట్టించి, బాక్స్‌ డ్రాయిన్‌లలో పూడికలు తీయించి…పైప్‌లైన్‌లు, వాటర్‌ పైప్‌లు…కాంట్రాక్టర్‌లు…వీడు…బిల్లులు..కాంట్రాక్టర్‌…కమీషన్లు..రాత్రిదాకా ఎవడో తాగిస్తే పీకలదాకా తాగి…ఊగుతూ, తూగుతూ…ఎప్పుడో రాత్రి రెండు గంటలకు…చేతిలో మల్లెపూలు.. నోట్లో విస్కీ కంపు…జేబులో కొన్ని నోట్ల మడతలు..
ఏమిటిది…వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌…జీతం నాల్గువేల రెండు వందల యాభై…
కాని ఇంట్లో కలర్‌ టి.వి., ఫ్రిజ్‌., హీరోహోండా మోటార్‌ బైక్‌..స్వంత ఇల్లు…ఈ మధ్య వింటున్నది ఎక్కడో రెండో సెటప్‌…ఏమిటిదంతా…
పాపం….పాపం…లంచాలు…దోపిడీ..,
”వద్దండీ ఈ పాపపు డబ్బు…పిల్లలు చూడండి ఈ పాప ఫలితంగా ఎలా మూగ, చెవుడు”
‘చెంప చెళ్లు…గూబ గుయ్యి’
అదంతే…యిదంతే…వీడు మానడు…వీడు మారడు.
ప్రక్కనున్న సెల్‌ మ్రోగింది. సమయం సరిగ్గా నాల్గూ ముప్పయ్యయిదు.
”హలో”
”ఏయ్‌..తలుపు తియ్యవే..” మాట ముద్ద ముద్ద….తూలి తూలి.
తలుపు తీస్తే…ఎదురుగా మనిషిరూపంలో ఓ పశువు…విస్కీ కంపు…ఉల్లిపాయల వాసన.
”ఎంతసేపే నీయవ్వ…మొద్దు నిద్రపోతానవా…”దబాయింపు.
”ఏంరా ఒళ్లు బలిసిందా..రాత్రంతా నిదురపోక ఇద్దరు పిల్లల్నేస్కోని ఎదురు సూత్తాన…పోరికి జ్వరంతో ఒళ్లు కాలిపోతాంది. ఎవడో పోయిస్తే గుద్దబల్గ తాగిందిపోయి నకరాల్‌ చేస్తానావ్‌…మూస్కో”
”ఏందే మాటల్‌ బాగత్తానై”
”…..”తమాయించుకుంది సురేఖ.
”గా జేబుల నాల్గువేలున్నై తీయ్‌…”
”ఎక్కడియీ నాల్గువేలు…”
”ఎవడో యిచ్చిండు నీకేందే…చెప్పినట్టు చేయ్‌….తీసి లోపల దాయ్‌…” గదమాయింపు.
”పాపపు ముండాకొడ్కా…గీ పాపపు సొమ్ము చేయబట్టే నా పిల్లల మాట పాయె, చెవుల్‌పాయె..ఎందుకురా….వద్దంటే ఇనవుగదరా…లంచగొండి ముండకొడ్కా…”బాలకృష్ణ చొక్కా గల్లా పట్టుకొంది సురేఖ.
”పా….బైటికి పా…గీ పాపపు సొమ్ము నా యింట్లద్దు. గా జనసేన పోరగాండ్లు నెత్తి నోరుపెట్కొని ఒర్రుతాండ్లుగాదురా….లంచం వద్దు…అవినీతి వద్దు అని…చదువుకున్నవో సిగ్గుశరం లేదు…పో..బైటికి పో…లంచం తీసుకుంటే నా యింట్లకు రావద్దు…పో ముండకొడ్క…” బాలకృష్ణను బైటికి వీధిలోకి నెట్టి లోపల్నుండి తలుపులుగొళ్లెం వేసుకుంది సురేఖ.
ఎందుకోగాని ఆమెకు పిచ్చి ఆనందం….తృప్తికలిగాయి.
ప్రతిఘటించి..తను ఒక ప్రశ్నగా మారినందుకా….?

***

ఇంజనీరింగు రెండవ సంవత్సరం చదువుతున్న మాధవికి మూడు రోజులుగా కంటికి కునుకు లేదు.
ఆమెకు అవమానంగా ఉంది. సిగ్గుగా ఉంది. నలుగుర్లో తలెత్తుకోలేకుండా ఉంది. చాలా అసహనంగా,కోపంగా, అసహ్యంగా కూడా ఉంది.
ఎవరిపైనా…ఎందుకు….?
రెండ్రోజుల క్రితం తన తండ్రి ప్రముఖ ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల…ఎమ్సెట్‌ కన్వీనర్‌..ఎంతో పెద్ద విద్యావేత్త… ముప్పయ్‌ రెండేళ్ల సర్వీస్‌….ప్రతిష్టాత్మకమైన ఎమ్సెట్‌ పరీక్షలకు సాధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించవలసిన గురుతర బాధ్యత.
కాని ఏంచేశాడు…పరీక్ష ప్రారంభమైన అరగంట లోపే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు. ఇంజనీరింగు పేపర్‌ లీక్‌…జిరాక్స్‌ కాపీలు…పంపకాలు…డబ్బులు…వేటలు….కట్టలు కట్టలు..చేతులు మారటాలు..
తనకు ముందురోజే డౌటొచ్చింది…యింటికి ఎవరెవరో ఏవో వేళకాని వేళల్లో కార్లలో… మోటార్‌బైక్‌లపై..బ్రీఫ్‌ కేస్‌లు….డబ్బు వాసన…ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాలేజ్‌ల వాసన…ఏదో గుసగుస…వ్యాపారం.
బెడిసిందెక్కడో…పేపర్‌ లీక్‌..ద్రోహచర్య బట్టబయలు…
నాన్న అరెస్ట్‌…లాకప్‌…కస్టడీలోకి తరలింపు…విచారణ.
ఎమ్సెట్‌ పరీక్ష వాయిదా..మళ్ళీ నిర్వహించేందుకు ప్రభుత్వ అంగీకారం.,
కాని లక్షలమంది విద్యార్థుల మానసిక స్థితి…టెన్షన్‌,…వాళ్ల ఉద్వేగాలు…ఎవరి తప్పు…ఎవరు బలి…ఎవరి నేరం…ఎవరికి శిక్ష.
మాధవికి చాలా అసహ్యంగాఉంది తన తండ్రిపై…అవినీతి పనులు చేస్తుంటే వాడితో కలిసి కాపురం చేస్తూ పాపపు డబ్బుతో కులుకుతున్న అమ్మపై…తమ ఇంట్లోనే ఉంటూ డిఎస్పీ హోదాలో ప్రతినిత్యం ఎందరినో యింటికి రప్పించుకుని కట్టల క్కట్టలను లంచంగా స్వీకరించే తన చిన్నాన్నపై…వారి లంచం డబ్బుతో స్లీవ్‌లెస్‌ జాకెట్టు వేసుకుని జులాయిగా తిరిగే చిన్నమ్మపై…అందరిపై..తన కుటుంబ సభ్యులందరిపై.
కాని..ఎలా….ఎలా..దీన్ని పరిష్కరించాలి.
”మాధవీ….మీ నాన్నేనట గదా…నిన్నటి ఎమ్సెట్‌ పేపర్‌ లీక్‌…”
ప్రశ్నలు-ప్రశ్నలు-తలదించుకుని నడవడాలు…సిగ్గుతో కుచించుకుపోవడాలు’
‘నాన్నా నీకు ఈ కుక్క బుద్దెందుకు…నీకున్నది ఒక్కగానొక్క కూతుర్ని నేనే.. అసలు నీ దగ్గరున్న నీ డబ్బే నీకు ఎక్కువ…యింకా మందికొంపలు ముంచే ఈ దొంగ డబ్బెందుకు. పైగా పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్న విద్యావేత్తవు…తగునా యిది. నీకు సిగ్గెందుకు లేదు…బుద్దెందుకు లేదురా ఓ దుర్మార్గపు, ఛండాలపు నాన్నా”
ఎన్నట్నుండి డిఎస్పీ చిన్నాన్న..యింకెవడెవడో ఒకటే హైరాన పరుగులు….అటురుకు..యిటురుకు..ఎవరికో ఫోన్‌ చేయ్‌..ఎవడ్నో బతిమాలు…
తెలుసు తనకు …నాన్న అనబడే వీడికి ఈ దౌర్భాగ్యపు దేశంలో ఏ జడ్జో అమ్ముడుపోయి బెయిలిస్తాడు. మళ్లీ వీడు బాజాప్తాగా యింటికి తిరిగొస్తాడు.
అందుకే కసిగా…దుఃఖంగా.. అసహ్యంగా…పరమ క్రూరంగా ఎదురుచూస్తోంది మాధమి మూడు రోజుల్నుండి… నిద్రాహారాలు మాని లోలోపల కుమిలిపోతోంది.
సరిగ్గా..తెలతెల్లవారుతుండగా…ఉదయం ఐదున్నర-ఓకారు యింటి ముందు ఆగి ఓ తలుపు రెక్క తెరచి…లోపల్నుండి ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల బెయిల్‌పై విడుదలై దిగి నిస్సిగ్గుగా యింటికి చేరుతూ
మెరుపులా…రేచుకుక్కలా ఉరికొచ్చింది మాధవి తండ్రి పైకి…చేతిలో డిఎస్పీ డెన్మార్క్‌ పిస్టల్‌ క్షణంలో బుల్లెట్ల వర్షాన్నికురిపించి…
శరీరం తూట్లు, తూట్లు…గావుకేక…మరుక్షణం నిశ్శబ్దం.
లక్షల మంది విద్యార్థుల జీవితాల ట్రాజడీ సంగతేమిట్రా తండ్రి బాస్టర్డ్‌…ఎన్ని జనసేనలొస్తే, మార్తారురా మీరు ముండాకొడ్కుల్లారా…బుద్దిరాని, బుద్ది లేని దరిద్రుల్లారా చావండి…” మాధవి శపిస్తోంది.
ఎదురుగా ఎర్రగా రక్తం…మధ్య ప్రశ్న ఆకారంతో రాంనివాస్‌ శవం.
మాధవి నేలపై మోకాళ్ల మీద కూర్చుని పిస్తోలు అలాగే చేతిలో ఉండగా ఘొల్లున ఏడుస్తోంది.
ఎందుకు….?

***

ఎప్రిల్‌ పదమూడో తేది…ఉదయం పదకొండు గంటలు.
వరంగల్లు నగరం…జనసేన ‘కేంద్రకం’. కార్యాలయంలో ఓ వెల్లివిరుస్తున్న పండుగ..నగరం నిండా రోడ్లపై ఎక్కడ బడితే అక్కడ జనం సంబరాలు…మిఠాయి పంపకాలు. బాణసంచా కాల్చడాలు..మైకుల్లో జనసేన పేద, సాధారణ కార్యకర్తల చైతన్య గీతాలు…ఒక నూతన ఉత్సాహం…విజయ మహోద్వేగం.
రాత్రి పొద్దుపోయే దాకా శాసనసభా స్థానాల ఫలితాల ప్రకటన కొనసాగుతూనే ఉంది. తెల్లవారగానే పెద్ద పెద్ద పతాక శీర్షికలతో దినపత్రికలు.
‘నూతన శకారంభం..’
‘భారత చరిత్రలో ఓ కొత్త మలుపు’
‘ప్రజల విజయం…అవినీతి అంతం’
‘మరో కొత్త చరిత్ర…జనసేన చారిత్రాత్మక విజయం’
టి.వి.లు…..మేధావుల చర్చలు…విశ్లేషణలు…అంతటా కోలాహలం.
”రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థుల తిరుగులేని విజయం-ఓడిపోయిన అభ్యర్ధులందరి డిపాజిట్లు గల్లంతు”
బ్రేకింగు న్యూస్‌
‘ప్రజల స్వప్నం సాకారమైన వేళ’
‘ఒక చీకటియుగం ముగిసింది. ప్రజల విజయంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం’
‘అప్పులు లేని…దోపిడీ లేని స్వచ్ఛమైన పాలనకు హామీ’
‘ఒక నూతన రాజకీయ సంస్కృతికి రూపకల్పన’
ఎన్నో ఆశలు..ఎన్నో అంచనాలు..ఎన్నో కలలు.,
రాత్రికి రాత్రి రాష్ట్రం నలుమూలల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా, జనసేన ఆమోద ముద్రతో, జనసేన హామీపై గెలిచిన రెండువందల ఎనభై రెండు మంది శాసనసభ్యులను జనసేన రక్షక దళాలు ప్రాణ సమానంగా కార్లలో తీసుకుని వచ్చి ‘కేంద్రకం’లో హాజరుపర్చాయి.
లేలేత ఎండ…విశాలమైన ప్రాంగణం…నిండా పచ్చని గడ్డి…చెట్లు…పూల మొక్కలు…అంతటా క్రమశిక్షణ నిండిన వ్యక్తుల కదలికలు.
సెంట్రల్‌ హాల్‌లో నూతన సభ్యులందరూ తమ తమ కుర్చీల్లో ఆసీనులయ్యారు. వెంటనే ఉద్వేగ భరిత క్షణాల మధ్య వేదిక పైకి నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. రామం,క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి గారు..ఎటువంటి అట్టహాసం లేకుండా.
అప్పటికే శాసనసభ్యులందరికీ జనసేన తరపున శుభాకాంక్షల లేఖలను, పుష్ప గుచ్ఛాలను పంపిణీ చేయించాడు శివ.
మైక్‌లో డాక్టర్‌ గోపీనాథ్‌ మాట్లాడ్డం ప్రారంభించారు…’మిత్రులారా మీకందరుకు జనసేన పక్షాన మరోసారి విజయ శుభాకాంక్షలు. జనసేన అతి తక్కువగా మాట్లాడ్తుంది. ఎక్కువగా పనిచేస్తుంది. ఆ పరంపరలో భాగంగా మన జనసేన వ్యవస్థాపకులు రామం మీకు శుభాకాంక్ష సందేశం వినిపిస్తారు. తర్వాత కొత్తగా ఎన్నుకోబడ్డ మొత్తం శాసనసభ్యులు పన్నెండు బస్సుల్లో మన జనపథం ప్రాంగణం నుండి హైద్రాబాద్‌ శాసనసభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ లాంఛనంగా గవర్నర్‌ గారిని కలిసి తదుపరి నూతన ప్రభుత్వ నిర్మాణ కార్యాన్ని నిర్ణయించుకుంటారు. అని చెప్పి కూర్చుని..
రామం నిలబడ్డాడు. నిశ్శబ్దంగా, వినమ్రంగా రెండుచేతులా జోడించి అందరికీ నమస్కరించి.,
”మిత్రులారా..మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు..జనసేన ఆమోదముద్రతో పోటీ చేసిన అందరూ గెలిచారు. ఒక్కరు కూడా ఓడిపోలేదు. పైగా ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేంత భారీ మెజార్టీతో గెలిపించారు. అంటే ‘జనసేన’ ఆలోచనలను, విధానాలను ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో, మనమీద ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారో సృష్టమవుతోంది. ఒకటే మీకు వినమ్రంగా విన్నవించుకుంటున్నాను…మనం..మనందరం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేద్దాం. ఒక కొత్త చరిత్రను, నీతిమయమైన భవిష్యత్తును నిర్మిద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ”ఇండిపెండెంట్స్‌ రూల్డ్‌ స్టేట్‌” పరిపాలనలోకి రాబోతోంది. దేశం, ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా మన పనితీరును పరిశీలిస్తోంది. జాగ్రత్తగా ప్రగతి పథంలో అడుగులు వేద్దాం కలసికట్టుగా.
మేము…జనసేన సారథ్య సంఘ సభ్యులం నల్గురం నాల్గు దిక్కులమై, లక్షమంది కార్యకర్తలు మీ చుట్టూ ఒక వలయమై కవచమై అన్నీ పదవులకూ, అధికారాలకూ అతీతంగా ప్రజల పక్షాన మిమ్మల్ని డేగ కళ్లతో గమనిస్తూనే ఉంటాం. యిచ్చిన మాట ప్రకారం నిజాయితీగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకోండి…జైహింద్‌”.
చప్పట్లు…కొద్దిసేపు.
అందరూ ఒకరి వెంట ఒకరు క్రమశిక్షణతో బయటికి ఆవరణలోకి వచ్చి కార్యకర్తలు సూచించిన స్థానాల్లో నిలబడ్డారు.
ఎదురుగా అరుగుపై రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తిగారు…శివ…నిలబడి.,
ముందు…అందంగా అలంకరించిన గద్దెపై జెండాకర్రకు కట్టిన మువ్వన్నెల జెండా.
”మూర్తిగారిని మన జాతీయ జెండాను ఆవిష్కరించవలసిందింగా ప్రార్థిస్తున్నాను” అన్నాడు రామం.
నాల్గడుగులు ముందుకు నడిచి..సీనియర్‌ పాత్రికేయుడు ‘అగ్ని’ వార్తా ఛానెల్‌ అధినేత మూర్తి పులకించిపోతూ జాతీయ జెండాను నూలు తాళ్లు లాగి  వినీలాకాశంలోకి ఎగరేసి…
భారత పతాక ఒక చారిత్రాత్మక నూతన అధ్యాయానికి ప్రతీకగా…గర్వంగా, ధీమాగా ఉజ్జ్వలంగా ఎగుర్తూండగా..
”వందేమాతరం…” గీతాలాపన ప్రారంభించింది స్వయంగా క్యాథీ, బిల్టిన్‌ మైక్రోఫోన్‌లో.
వందలమంది చేతులు దేశంపట్ల భక్తిప్రపత్తులతో జాతీయ పతాకానికి వందనం చేస్తూ,
అందరి కళ్లలోనూ ఓ బంగారు రంగు కల…ముత్యమంత ఆశ…కొండంత ఆత్మవిశ్వాసం…ఓ సుదీర్ఘ అవిశ్రాంత నిరంతర ప్రయాణం వైపు చూపు.

***

అప్పుడు…ఆ క్షణం,
‘అగ్ని’ టి.వి.చానల్‌లో ఆ రోజు ‘రాజకీయ ముఖచిత్రం’ అనే అంశాన్ని ముగ్గురు వ్యక్తులు విశ్లేషిస్తున్నారు.        ఒకరు…ఆబిడ్స్‌లో ఫుట్‌పాత్‌పై అరటిపళ్లమ్మే యాకూబ్‌, మరొకరు..సికింద్రాబాద్‌, అంబాసిడర్‌ లాడ్జ్‌లో పనిచేసే బాయ్‌ మల్లేశం, ఇంకొకరు…ఓల్డ్‌ సిటీ మక్కా మసీద్‌ దగ్గర కంకులు కాల్చి అమ్మే యాకమ్మ.
యాంకర్‌ ఆనందరావు అడుగుతున్నాడు. ”ఈ పెనుమార్పును మీరెలా అర్థం చేసుకుంటున్నారు”
అరవై ఆరేళ్ల యాకమ్మ మాట్లాడ్తోంది..ఉద్వేగంగా.

( సమాప్తం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా- 19

 

Ekkadi(1)
జీవితకాలమంతా పనిచేసి.. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా, లాయర్లుగా.. రిటైరై.,
ఉద్యోగ విరమణ అనేది అకస్మాత్తుగా ఎదురై ముందునిలబడే ఒక వీధిమలుపు. నిన్నటిదాకా ఫలానా పనికి పనికొచ్చిన మనిషి ఒక ఈనాటినుండి పనికిరాడు అని నిర్దారించబడే వేళ. కాని చాలామందిలో ఇంకా జవసత్వాలుంటాయి. బతుకునంతా వడబోసి వడబోసి కూర్చుకున్న అనుభవసారం ఉంటుంది. జీవితాన్ని పూర్తి మానవతా దృష్టితో వీక్షించగలిగే పరిణతి ఉంటుంది. జీవిత సంధ్యాసమయానికి చేరువౌతున్నకొద్దీ సంయమనంతో కూడిన, మనిషిపట్ల సానుభూతితో స్పందించగలిగిన సంస్కారం అలవడ్తుంది. ఐతే ఈ అపూర్వమైన ఒక సంపదను సమాజం ఉపయోగించుకోవడంలేదు. అన్నింటినీమించి ఉద్యోగవిరమణ చేసినవాళ్లకు పెద్దగా ఆర్థికావసరాలుండవు. అయ్యో జీవితంలో అనుకున్న కొన్ని పనులు చేయలేకపోయామే..యిప్పుడవి చేస్తే బాగుండునన్న జ్వలన ఒకటుంటుంది. దాన్ని సామాజిక ఉన్నతికోసం ఉపయోగించుకోవాలనుకున్నారు రామం, క్యాథీ, గోపీనాథ్‌.. మూర్తి అందుకే రాష్ట్రంలోని ప్రధానమైన ఎనిమిది హైద్రాబాద్‌, వరంగల్లు కరీంనగర్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సామాజిక సేవా భావం కలిగి, ఐచ్ఛికంగా వాళ్ళంతట వాళ్ళు తమతమ నైపుణ్యాలను అందివ్వగలిగితే అటువంటివారి సేవలను ఉపయోగంచుకునేందుకు వాళ్ల వివరాలను సేకరించమని ‘జనసేన’ సేవా విభాగానికి అదేశాలొచ్చాయి. పదిహేను రోజుల క్రితం ‘జనసేన’ యువ కార్యకర్తలు రామదండులా కదిలి విస్తృతమైన సంపర్కం చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ వివరాలను సేకరించి వాళ్ళను కలిసి మాట్లాడారు. వాళ్ల సహకారాన్ని, ఆశీస్సులను, సేవలను అర్థించారు. వయోజనులు చిరునవ్వులు చిందించే ముఖాలతో స్నేహహస్తాన్నందించారు. ఒక్కో కేంద్రంలో వందలమంది వివిధ వృత్తి నిపుణుల సమాచారం, అంగీకారం ప్రోగైంది. వెంటనే ‘జనసేన’ కేంద్రంనుండి ప్రతి నగరంలోనూ విశాలమైన అన్ని వసతులున్న భవనాలను అద్దెపద్ధతిపై మొదట సమకూర్చమని ఆదేశాలొచ్చాయి. అదేరకంగా.. ఆ రోజు..ఎనిమది మహానగరాల్లో ఎనిమది ‘జనసేన’ ప్రజాసేవా కేందాలు అన్నిరకాల అత్యంతాధునిక పరికరాలు, ఫర్నీచర్‌, ఉపకరణాలు, ఇతరేతర సమస్త సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డాయి.
ఒక్కో ప్రజాసేవా కేంద్రంలో సీనియర్‌ డాక్టర్లతో ఉచిత వైద్య విభాగం, ఇంజినీరింగు నిపుణులతో ఏ నిర్మాణ కార్యకలాపాల్లోనైనా పనికొచ్చే సలహాసహకార విభాగం, రిటైర్డ్‌ లాయర్లతో న్యాయ సహాయ విభాగం, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లతో విద్యా విషయ సహకార విభాగం.. యువజనుల కోసం వ్యాయామ, క్రీడా, సేవా విభాగం ఇలా అనేకరంగాలతో ఒక విస్తృతమైన సామాజిక వేదిక.. కౌన్సిలింగు కేంద్రం.. ఒక్కోచోట వీటితో ఓ ప్రజాక్షేత్రం.
ఆ పరంపరలో.. వరంగల్లులోని కొత్తవాడలో .. ఒక పెద్ద ప్రైవేట్‌ భవనంలో.,
‘జనసేన’ సామాజిక సేవా కేంద్రం ప్రారంభం.
ఉదయం పదిగంటల ముప్పయి నిముషాలు.. భవనం బయట వేలమంది జనం. ప్రజల్లో ఉప్పెనై పెల్లుబుకుతున్న చైతన్యం. ఎక్కడో ఓ కిరణంలా ఆశ. ఈ చీకట్లోనుండి, బురదలోనుండి.. అందరి ఆత్మాభిమానాన్ని శూలంతో పొడిచి గాయపర్చి.. రక్తం చిందించి, ఛిన్నాభిన్నం చేసి.. వీడు మా ప్రజాప్రతినిధి..అని చెబుతే తలెత్తుకునేలా కాకుండా.. సిగ్గుపడేలా, తలదించుకుని లోపల ఎక్కడో దాచుకునేలా.. సరిగా చదువురాని వాడు, సంస్కారం లేనివాడు, తెలివి అస్సలే లేనివాడు..పశువకు మాటొస్తే వలె మాట్లాడువాడు.. పరమఛండాలుడు.. ఈ గుండెలను పిండే దుస్థితినుండి తప్పించి – ఏదో ఒక వెలుగు ద్వారాన్ని తెరుస్తున్న ‘జనసేన’.
‘భగవంతుడా.. ఈ జనసేనను కాపాడు తండ్రి” అని మొక్కుకుంటోంది ఓ ఎనభై ఐదేళ్ళ వృద్ధ మహిళ.. బయట పోచమ్మగుడి దగ్గర.
”ప్రియమైన మిత్రులారా.. మనం చేస్తున్న జైత్రయాత్రలో భాగంగా.. ఈ సామాజిక సేవా కేంద్రాల స్థాపన ఒక ప్రధాన ఘట్టం. ఎంతో అనుభవమున్న ఎందరో ప్రముఖ డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, విద్యావేత్తలు.. ఎందరో మీపై ప్రేమతో, వాత్సల్యంతో ఉచితంగా నిరంతరం సేవ చేయడానికి సంసిద్ధులై మీ ముందు యిక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. దయచేసి జనసేన సేవలను వినియోగించుకోండి. తెల్లకార్డులు, పచ్చకార్డులు.. పైరవీలు.. నూటా నాల్గు అన్ని మాయలు.. ఎండమావులు. మనం మననే నమ్ముకుందాం. ముందుక సాగుదాం.. జనసేన.. రేపు ఒక ‘ప్రభంజనం’ కార్యక్రమాన్ని చేపడ్తోంది. ‘సమాచార చట్టం ఆర్‌టిఐ ప్రకారం సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లా కేంద్రాల్లో ఫస్ట్‌ మెజిస్ట్రేట్‌ కలెక్టర్లకు, ఎసిబి అధికారులకు, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులను, అభియోగాలతో కూడిన కంప్లెయింట్స్‌ను, సమగ్ర విచారణను కోరుతూ అధికారికంగా విన్నపాలను సమర్పించబోతున్నాం. యిది ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద ప్రజాప్రతిఘటన. ఈ విన్నపాల ఆధారంగా ఎసిబి వాళ్ళు దాడులు చేయాలి. కోర్టులు విచారణను ప్రారంభించాలి. కలెక్టర్లు విచారణకు ఆదేశించాలి. లేకుంటే వాళ్ళ భరతంకూడా బజారుకెక్కుతుంది. నిజమైన అహింసాయుతమైన ప్రజాచైతన్య విజృంభణ రేపు మొదలుకాబోతుంది. సోదరులారా కదలిరండి..ఒక్కో లింక్‌ కలిస్తే చెయిన్‌ ఔతుంది.. చెయిన్‌ తయారై లాగితే జగన్నాధరథం కదుల్తుంది. హరోం హర హర.. హరోం హర హర..” శివ చెబ్తున్నాడు వేదికపై జ్వలిస్తున్న అగ్నిలా.
ప్రక్కన వేదికపై.. రామం.. క్యాథీ.. డాక్టర్‌ గోపీనాథ్‌.. మూర్తి.,

25
”ఇప్పుడు .. ఈ జనసేన సామాజిక కేంద్రాన్ని ప్రారంభించడానికి.. కొత్తవాడ నివాసి, బీడీ కార్మికురాలు.. ఆకుతోట లచ్చమ్మను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆమె ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తూండగా ప్రముఖ రిటైర్డ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అమర్‌సింగు ఆమెకు సహకరిస్తాడు. అమర్‌సింగు గారి నేతృత్వంలో ఈ కొత్తవాడ కేంద్రం ప్రజలకు ప్రక్కలో ఆపద్భంధువులా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సెలవు..” శివ కూర్చున్నాడు.
వేదికపైకి.. బీడీ కార్మికురాలు వస్తూండగా జనసేన కార్యకర్తలు.. డాక్టర్‌ అమర్‌సింగు ఎదురేగి.. వెంట తోడ్కొని వచ్చి స్విచ్‌ ఆన్‌ చేయించి..
ఎదురుగా.. ఎల్‌సిడీ తెరపై.. ఒక దివిటీని ఎత్తిన స్త్రీ బొమ్మ ప్రత్యక్షమైంది.
వేలమంది హర్షాతిరేకాలతో చప్పట్లు. ఒక ఆనందోద్విగ్న సందోహ సముద్రం.. జన జాతర.
వేదికముందు పదులసంఖ్యలో మీడియా ప్రతినిధులు. టి.వి. కెమెరాలు.. పదుల సంఖ్యలో పాత్రికేయులు.
పులకించిపోతూ ఒక సీనియర్‌ పాత్రికేయుడు నరేందర్‌ తన ప్రక్కనున్న శ్రీనివాస్‌తో అంటున్నాడు.. ”చీమ తన శరీరంకన్నా ఎనిమిదిరెట్ల బరువుగల పదార్థాన్ని మోసుకుంటూ నిర్విరామంగా, అవిశ్రాంతంగా కదుల్తూ, ఒక రోజు దాదాపు పన్నెండు మైళ్ళు వెళ్తుందట.. ఈ రామం అనేవాడు ఒక చిన్న చీమలా ‘జనసేన’ కార్యక్రమాన్ని ప్రారంబించి మెలమెల్లగా చూశావా ఎలా ఓ ప్రభంజనమై, ఓ తుఫానై విజృంభిస్తున్నాడో. చావుకు భయపడనివాణ్ణి ఎవడూ చంపలేనట్టే..ఏ స్వార్థమూ లేక సర్వసంగపరిత్యాగియై ప్రజలకోసం ముందుకు సాగుతున్నవాణ్ణి ఎవరైనా ఏంజేయగలరు. వాడికి పదవీవద్దు. అధికారం వద్దు… గాంధీవలె.. గాంధీ ఎప్పుడూ ఏ పదవుల్నీ కావాలనలేదు కదా. వీడు అజేయుడు శ్రీనివాస్‌.. ఇంతపెద్ద ప్రజాస్పందనను ఎన్నడూ చూల్లేదు. అస్థిత్వ ఉద్యమాలు, తాత్కాలిక గర్జనలు, శంఖనాదాలు.. సమరశంఖాలు.. ప్రజలను కొనుక్కుని ఏవో ఒక్కరోజు నిర్వహిస్తే చూశాంగాని, ప్రజలు స్వచ్ఛందంగా ఇలా స్పందించడం అద్భుతమనిపిస్తోంది..” అంటున్నాడు.
సరిగ్గా అప్పటికి అదే అభిప్రాయంతో ఉన్న శ్రీనివాస్‌.. ”ఎందుకో ఇక ఈ సమాజం బాగుపడ్తుందని ఆశ కల్గుతోంది నరేందర్‌” అన్నాడు ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.
ఈలోగా ఆకుతోట లచ్చమ్మ సభను నిర్వహిస్తున్న శివ కోరికపై నాల్గుమాటలు మాట్లాడ్డానికి మైక్‌ ముందుకొచ్చింది.
”అందరికీ దండం.. నా వయస్సు డెబ్బయ్యేండ్లు. ఎనకట ఆరోక్లాస్‌ చదివిన.. నా ఒక్కగా ఒక్క కొడ్కు నక్సలైట్లల్లపోయి పోరాటం చేసి పోలీసుల చేతుల్ల చచ్చిండు. ఏం ఫికర్‌ లేదు. ఆర్మీల ఒక కాప్టెన్‌ చచ్చినంత గౌరవం.. నాకిప్పుడు గీ ‘జనసేన’ను సూత్తాంటే నా కొడ్కుకల నిజమైతాందనిపిస్తాంది. రామంను నా కొడ్కనుకుంటాన.. ఒక్కటే చెప్త.. ఒకసారి గీ గీసుకొండ మండలం గంగదేవిపల్లెకు పోయిన. ఆదర్శగ్రామం అది. ఊరిదంత ఒకతే కత్తు. ఒకటే కుటుంబం. గట్లనే మనది ఒక ఆదర్శ జిల్లా. ఒక ఆదర్శ రాష్ట్రం. ఒక ఆదర్శ దేశం కాదా.. ఐతది.. తప్పకుండ ఐతది.. మనం చేద్దాం.. మనమే చేద్దాం..”
అంతే.. ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పిడికిళ్ళెత్తిన జనం.. ”జనసేన” అని గొంతెత్తి నినదిస్తే,
ఆకాశం ప్రతిధ్వనిస్తున్నట్టు ”వర్ధిల్లాలి” అని ప్రతినినాదం.
”జనసేన..”
”జిందాబాద్‌”
”జై జనసేన”
”జై జై జనసేన..” .. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల రక్తగర్భ ఓరుగల్లు మానవ మహోత్తేజంతో పొంగి ఉరకలేస్తోంది.
తర్వాత డాక్టర్‌ అమర్‌సింగు సామాజిక సేవా కేంద్రం ప్రజలకు ఉచితసేవలను అందించే విధానం క్లుప్తంగా వివరించారు.
శివ..తర్వాత మైక్‌ ముందుకొచ్చి.. జనసేనతో కలిసి పనిచేయడానికి, అవినీతి ప్రక్షాళనలో పాలుపంచుకోవడానికి, పరిశుద్ధ భావి భారత పునర్నిర్మాణంలో తామూ ఒక భాగం కావడానికి సంసిద్ధత వ్యక్త ంచేస్తున్న ప్రజా సంఘాల పేర్లను ప్రకటిస్తాననీ, ఆయా సంస్థల బాధ్యులు ఒకరొకరుగా వేదికపైకి వచ్చి ప్రజలకు పరిచయం కావాలనీ ప్రకటించి ఒక్కొక్క సంస్థ పేరును చదవడం ప్రారంభించాడు.
”జిల్లా జర్నలిస్ట్స్‌ యూనియన్‌.. రచయితల సంఘం.. మానవ బాధ్యతల సంఘం.. జిల్లా చర్మకార సంఘం..జిల్లా పద్మశాలి సంఘం.. జిల్లా యాదవ సంఘం.. జిల్లా ఎన్‌జివోల సంఘం.. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం..” పట్టిక కొనసాగుతూనే ఉంది.
సరిగ్గా.. ఆక్షణంలో.. రాష్ట్రవ్యాప్తంగా ‘జనసేన’ నిర్వహిస్తున్న అన్ని ఎనిమిదికేంద్రాల్లో .. అన్ని వేదికలపై అటువంటి కార్యక్రమమే జరుగుతున్నట్టుగా వీడియో సంధానంలో ఉన్న క్యాథీ ఎదుటి లాప్‌టాప్‌ కంప్యూటర్‌ ద్వారా రామంకు తెలుస్తోంది.
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి విజయాన్ని సాధించడానికి ”అత్యాధునిక సాంకేతికత వినియోగానికి ఎన్నటికీ మారని స్థిరమైన భారతీయ జీవన విలువలను జోడించి, పరిపుష్టం” చేసిన విధానాలను అనుసరించాలని రామం ఉద్ధేశ్యం.
అతనికి చాలా తృప్తిగా ఉంది.. ప్రణాళికలో అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతూ ముందుకు దూసుకుపోగల్గుతున్నందుకు. ఐతే తను ఊహించినదానికంటే దాదాపు నాల్గురెట్లు ప్రజల ప్రతిస్పందన రావడం, అదీ చిన్న, పెద్ద, క్రింది, పైది.. అన్న తేడాలేకుండా అన్నివర్గాలనుండి ప్రతిచర్య ఉవ్వెత్తున రావడం అతనికి పరమానందంగా ఉంది. ఆ పులకింతలోనుండే ప్రక్కనే ఉన్న క్యాథీతో అన్నాడు..”  ”ఫెర్మీ అణుకేంద్రక విచ్ఛిత్తి సిద్ధాంతం జ్ఞాపకమొస్తోందిక్యాథీ.. కేంద్రకాన్ని గనుక అద్భుతమైన శక్తినుపయోగించి విచ్చిన్నం చేయగలిగితే విడివడే శకలం మూడు ముక్కలై శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క మళ్ళీ మూడుముక్కలై.. మళ్ళీ శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క.. ఇలా క్షణాల్లో గుణశ్రేఢిలో, ఒక శృంఖలచర్యగా సాగే నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియ ఎంతో బహుళమైన శక్తిని అంతిమంగా అందిస్తుందో,  అదేవిధంగా అణుకేంద్రక సమ్మేళన కార్యక్రమంలోకూడా ఒక్కో అణుకేంద్రకం సంలీనమైపోతూ మళ్ళీ అఖండమైన శక్తిని.. సూర్యునినుండి వికరణజ్వాలలవలె వెలువరిస్తుందో.. జనసేనలోకి ఒక్కో మనిషి అణుకేంద్రకంలా ప్రవేశించి.. ఎంత వేగవంతంగా న్యూక్లియర్‌ రియాక్షన్‌వలె బలోపేతమై పోతోందో.. చాలా ఆనందంగా ఉంది క్యాథీ మనం చేపట్టిన ఈ ప్రక్షాళన చర్య..”
క్యాథీ మౌనంగా.. నిండుగా.. పరిపూర్ణంగా నవ్వుతూ రామంలోకి చూచింది.
ఇద్దరి కళ్ళలోనూ నక్షత్రాలు నిండుగా పూచిన ఆకాశంలో ఉండే పరిపూర్ణ వింతకాంతి.
అప్పుడే రామం రక్షణను పర్యవేక్షించే రఘు రామం వెనుకనుండి కొద్దిగా పైకివంగి.. ”సర్‌ మీరిప్పుడు రాష్ట్రస్థాయిలో కొందరు పత్రికా సంపాదకులతో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొనే కార్యక్రమముంది సార్‌.. మన కేంద్రక కార్యాలయానికి బయలేర్దామా..” అన్నాడు గుసగుసగా.
”యస్‌.. గోపీనాథ్‌ సర్‌.. మీరు మిగతా విషయాలు చూడండి. మేం వెళ్ళిరామామరి ”అని ప్రక్కనున్న గోపీనాథ్‌ గారి అనుమతి తీసుకుని.. క్యాథీ కూడా లేచి రాగా.., సెంటరింగు చెక్కలతో చేసిన విశాలమైన వేదికపైనుండి టకటకా మెట్లపైనుండి దిగుతూండగా,
భూనభోంతరాలు దద్దరిల్లేట్టుగా ఓ బాంబు ప్రేలింది.
అంతా బీభత్సం.. మంటలు పొగ.. ధ్వంసం.. వేదిక చెక్కలు ఎగిరెగిరిపడ్తూ.. ప్రేలుడు.
పరగులు.. అరుపులు.. కకావికలు.. కేకలు.. విధ్వంసం.

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 18 వ భాగం

24

(గత వారం తరువాయి )

18

రాత్రంతా నిదురలేదు ముఖ్యమంత్రి గార్కి. అతనికి మేధావులను ఆ క్షణం చెప్పుతో కొట్టాలనిపించింది. మనిషికి సుఖాలు, సంపదలు, అధికారం.. యిలాంటివన్నీ ఉంటే సుఖంగా, సౌఖ్యంగా ఆనందకరంగా ఉంటుందని ఈ మేధావులైన రచయితలు, కవులు, యితరేతర సృజనకారులు చెప్పారు. అనేక సందర్భాల్లో అదంతా శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రిగారి గత నలభై సంవత్సరాల వ్యక్తిగత రాజకీయ జీవితం ఎంతో స్పష్టంగా చెబుతోంది.
ఎంతో పెద్ద ముఖ్యమంత్రి నివాసభవనం.. క్యాంప్‌ ఆఫీస్‌ కంప్లీట్లీ ఎయిర్‌ కండిషన్డ్‌, సకల సౌకర్యాలు.. ముట్టుకుంటే మాసిపోయేగోడలు. నడుస్తే అరిగిపోతుందా అన్నట్టు పాలరాతి నేల. వెన్నెల ముద్దవంటి బంగారు రంగు, మెత్తని పట్టు పాన్పు.. కాని..,
మనసునిండా మున్సిపల్‌ చెత్త. పాయఖాన కంపు. తలంతా పాకీవాడి బకెట్‌. ప్రొద్దునలేచినప్పట్నుండి తను ఇతరులను బ్లాక్‌మెయిల్‌ చేయడం, లేదా వెధవలందరూ తనను బ్లాక్‌మెయిల్‌ చేయడం. ఒకర్నొకరు వేటాడ్డం, ఎవడో ఒకడు తమను వెంటాడ్డం.. ఇదంతా నిజానికి అవసరమా మనిషికి.
అధికారం.. కుర్చీ.. పదవి.. మంత్రి పదవి.., ముఖ్యమంత్రి పదవి., ”అధికారంలో ఉన్న మజా.. అది అనుభవించితే తెలియనులే..” ఎక్కడో విన్నపాట.
ఉదయం… ‘అగ్ని’టి.విలో ఆ ‘రామం’ అనేవాడు ప్రసంగిస్తున్నపుడు అన్ని దిక్కుమాలిన కార్యక్రమాలను ప్రక్కనపెట్టి ఎవర్నీ తన చాంబర్‌లోకి రానివ్వద్దని, అన్ని టెలిఫోన్‌ హాట్‌లైన్లను కట్‌చేసి.. ప్రశాంతంగా .. సముద్రంలా పొంగిపోతూ విన్నాడు. విని..” నిజంగా వీడు రామంగాడు అనుకున్నాడు.
మనసు పవిత్రంగా, హృదయం నిష్కల్మషంగా.. తత్వం.. ఏ స్వార్థమూలేని పరిత్యాగకాంతితో నిండి.. మనిషి ఈ సకల తుచ్ఛమైన వాంఛలకు అతీతమైపోయిన తర్వాత.. వాడి ముఖంలో నిజంగా ఎంతో కాంతి, ఎంతో ఆకర్షణ.. ఎంతో జీవకళ.. ఎంత పరిపూర్ణతో.
నిండుపున్నమి చంద్రునిలా ముఖం.
అంటాడు.. ” ఈ తుచ్ఛమైన అధికారాన్నిపట్టుకు వేలాడ్తూ, కోట్లకు కోట్ల రూపాయలను దాచుకుంటూ.. ఎన్నాళ్ళు కొనసాగుతావు.. ఈ వెంపర్లాటకూ, సంపాదనకూ ఒక హద్ధు, ఒక అంతం ఉందా.. ఒక వేళ ఉంటే.. అది ఎంత..?”
తన గుండెలో చటుక్కున గుచ్చుకుందామాట.
ఐతే ఆ మాట డెబ్బయ్యారేండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు తెలియనిదా.. తెలుసు.. ఐతే చెప్పినవాడు ఎవడో దొంగ సన్యాసి బెంజ్‌కార్లో వచ్చి, ఫైవ్‌స్టార్‌ ప్రవర్తనతో ”ఆర్ట్‌ ఆఫ్‌ లివింగు” గురించి బూటకపు ఉపన్యాసం   చెప్పినట్టుగాకుండా..ఈ రామం అనేవాడు.. తన చదువును, ఉద్యోగ్యాన్ని, హోదాను, ఆస్తిపాస్తులను, సర్వసంపదలనూ వదలి ప్రజాపరం చేసి తను ఊరుబయట.. ఓ అతిసామాన్య పర్ణశాలవంటి కుటీరంలో జీవిస్తూ చెప్పడం.. ఎక్కడో హృదయంలో బాణం గుచ్చుకుని నాటుకుంది.
వాడు.. బమ్మెరపోతన చెప్పినట్టు.. ‘నవ్వు రాజిల్లెడు మోమువాడు, కృపారసమ్ము పై చల్లెడు వాడు..’
ఒక్కోసారి ధర్మాధర్మ విచక్షణ మన మనసును కల్లోల సముద్రంగా మార్చి.. కలవర పరుస్తున్నపుడు సత్యం ఒక కాంతిపుంజంలా విచ్చుకుంటుంది.
ముఖ్యమంత్రికనిపించింది.. ఎక్కడో తను ఓడిపోతున్నాడు.. అధర్మ రక్షణ చేస్తున్న తాను ఎక్కడో బురదలో కూరుకుపోతున్నాడు.. రామం.. ఉదయించే సూర్యునిలా అవక్రపరాక్రమంతో విక్రమించి విజయుడు కాబోతున్నాడు.
సరిగ్గా అప్పుడు ఉదయం ఐదుగంటల పదినిముషాలైంది. కారు మినిస్టర్స్‌ కాలనీలో రివ్వున దూసుకుపోతోంది. సన్నగా చినుకులు. పైన మేఘాలు నిండిన ఆకాశం.
అంతా నిర్మానుష్యం.
కారు ‘ఆ’ గోదాంలోకి పోయింది సూటిగా.
అంతారెడీ అప్పటికే.
రాంబాబు, శివరాజం.. ఢిల్లీ అధిష్టానం బాపతు మోహన్‌ సైగల్‌.. ముగ్గురూ రెడీగా ఉన్నారు.
మొత్తం పది నిముషాల కార్యక్రమం అక్కడ.
కారు ఆగగానే దిగి.. చకచకా లోపలికి .. ఒట్టి రేకులషెడ్డువంటి విశాలమైన గోదాంలోకి నడిచి..
ఎదురుగా.. ఒక గుట్టవలె.. సిమెంట్‌ ప్లాస్టిక్‌ సంచుల్లో కుట్టిన అన్నీ ఐదువందల, వేయిరూపాయల నోట్ల కట్టలు, పదులు, వందలు.. మొత్తం నెలరోజుల లెక్క వారానికి యాభై కోట్ల చొప్పున నాల్గు వారాల్లో రెండు వందల కోట్ల పార్టీఫండ్‌. నగదు. క్యాష్‌.. నోట్లు..
రెండ్రోజుల్లో రెండు లక్షలమంది జనంతో భారీ బహిరంగసభలు నిర్వహించాలన్నా, ఎక్కడన్నా ఏదైనా రాజకీయంగా మతకలహం సృష్టించాలన్నా, అర్జంటుగా ఏ ప్రతిపక్ష, లేదా స్వపక్ష ప్రతిపక్ష సభ్యున్నయినా కొనాలన్నా.. ఎక్కడన్నా ‘పే అండ్‌ యూజ్‌’ పద్ధతి పై రాజకీయం చేయాలన్నా.. అంతా టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌. నగదు దందా. ప్రతి రాష్ట్రం అధిష్టానానికి ఉడతాభక్తిగా వారానికో వందకోట్లు సమర్పించుకోవాలి. అదొక శాశ్వత సంప్రదాయం. ఎవడు ముఖ్యమంత్రయినా అంతే. ఈలోగా బుర్రున ముఖ్యమంత్రిగారి మొబైల్‌ మ్రోగింది.
”హలో..”
”ఊఁ.. నేనండీ.. నళినీ సదాశివం”
”హలో మేడం బాగున్నారా..”
నళినీ సదాశివం అధిష్టానంలో ”ఫండ్స్‌ ప్రాక్యూర్‌మెంట్‌ సెల్‌’ అధిపతి. జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి (నిర్వహణ)
”బోలీయే మేడం”
”సబ్‌ తయార్‌హై నా.. మోహన్‌సైగల్‌కో హాండోవర్‌ కర్‌దేనా ఓ పూరాపైసా.. అచ్ఛా గాడీ భీ దో ఉస్‌కో.. ఔర్‌ చోడ్‌ దో.. ఓ సంభాల్‌ లేంగే.. ఠీక్‌హై”
”హా మేడం..”
ఫోన్‌ కటైపోయింది అట్నుండి.
పెద్ద పెద్ద రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువ మాటలుండవు.. చేతలుంటాయంతే.
ముఖ్యమంత్రిగార్కి ఎందుకో ఈ తన దాదాపు యాభైఏండ్ల రాజకీయానుభవంలో .. మార్చిన నాలుగైదు జాతీయ పార్టీల్లో ఎప్పుడూ ఏదో ఓ మంత్రి పదవో, తత్సమానమైన ఇతర పదవేదో ఉండడం వల్ల.. ఏ పార్టీ ఐనా పార్టీ ఫండ్‌ క్రింద ఇండస్ట్రియలిస్ట్స్‌, భూస్వాములు, కాపిటలిస్ట్‌లు, మాఫియాలు, గుండాలు, ప్రభుత్వ పథకాల్లో కమీషన్ల రూపంలో నొక్కేయడాలు.. ఇటువంటి వనరులనుండి కోట్లకుకోట్లు పార్టీఫండ్‌ కింద లెక్కాపత్రంలేని డబ్బను గ్టుటలు గుట్టలుగా సమీకరించడం.. గోదాముల్లో, ప్రత్యేకంగా .. రహస్యంగా నిర్వహించే అపార్ట్‌మెంట్లలో, నేలమాళిగల్లో నగదు రూపంలో దాచి ఉంచడం.. పార్టీలో అత్యంత విశ్వసనీయమైన కుక్కవంటి వ్యక్తి నిర్వహణలో అంతా నడిపించడం.. ఎన్ని చూడలేదు తను.
ముఖ్యమంత్రి అంటే అధిష్టానం దృష్టిలో ఓ కుక్క. బాల్‌ విసిరి తెమ్మంటే తేవాలి. ఛూఁ.. అంటే పరుగెత్తాలి. కరువంటే కరవాలి.. వద్దంటే విడిచిపెట్టాలి.. ఒక్కోసారి ఒట్టిగానే భౌ భౌ అని అరవమంటే అరవాలి. అటు అఖండ అధికార పటాటోపపు మత్తు.. ఇటు ఆత్మాభిమానాన్ని చంపుకుని అధిష్టానం ముందు తలవంచుకుని ఓ కట్టుబానిస.
ఆ ‘జనసేన’ రామం అన్నట్టు.. మనిషికి ఈ దిక్కుమాలిన అధికార వ్యామోహంగానీ, మనసు చచ్చిపోతూండగా నిస్సిగ్గుగా తలదించుకునే బానిసత్వంగానీ అవసరమా. చరిత్రలో ఎవడుమాత్రం ఎన్నాళ్ళు జీవించి శాశ్వతమయ్యాడని. అలెగ్జాండర్‌నుండి బ్రిటిష్‌ సామ్రాజ్యందాకా.. నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారు గదా.  మరి.,
”సర్‌.. మొత్తం రెండువందల కోట్లు.. అన్నీ రెండు ఇన్నోవాల్లో సర్దుకున్నాన్సార్‌” అన్నాడు పార్టీ కార్యదర్శుల్లో ఒకడైన శివరాజం.
”ఔను.. వీటిని తీస్కొని ఆ సైగల్‌ గాడెక్కడికి పోతాడయ్యా”
”ఏమోసార్‌.. లంజకొడ్కు.. గత నెల మాత్రం చత్తీస్‌గఢ్‌లకెళ్ళిండ్సార్‌. అక్కడ అపోజిషన్‌ గవర్నమెంటుంది గదా.. దాన్ని పడకొట్టడానికి మనుషుల్ని కొనాలని..అంతకు ముందు ఓ చార్టర్డ్‌ ప్లేన్‌లో మన మూడు వందల కోట్లతో జార్ఖండ్‌కు పోయిండు. ఈ నార్త్‌ లంజాకొడ్కులు గింతకూడ వాసనరానీయర్సార్‌.. ఈసారి బహుశా ఈ డబ్బును మన ఎపిలనే ఎక్కడ్నో దాస్తడు.”
”ఫోనీ దొంగముండాకొడ్కు.. కని నెలనెలా ఈ రకంగా డబ్బు సమకూర్చడం కష్టమే శివరాజం..ఎక్కన్నుంచి తెస్తం.. ఎన్నని దొంగపనులు చేస్తం.. అవతల ఆ జనసేన ముండాకొడ్కులు ఒక్కొక్కని భరతంపట్టి జాడిస్తాండ్లు.. వ్చ్‌.. ఏదో కష్టకాలమే దాపురిస్తాంది.. సరేగని వాని వెహికిల్స్‌ పోంగనే జాగ్రత్తగా తాళాలేసి కీస్‌ పంపియ్‌.. ఇంక బ్యాలెన్స్‌ందుందిందుల..”
”ఏఁ. ఎంతసార్‌.. ఇరవై ఏడు కోట్లు..” శివరాజం అంటూండగా.,
‘ఏయ్‌ శివరాజం.. ఇరవై ఎనిమిది కదా.. నీయవ్వ ఎలాగూ లెక్కపత్రం లేదుగదా అని ఒకటి నొకేద్దామనుకుంటానవా..” అన్నాడు రాంబాబు. శివరాజం రాంబాబు దిక్కు గుర్రుగా, ఆల్సేషియన్‌ కుక్కవలె చూచి.. ”నీయవ్వ.. లెక్క ఒకటి తప్పిందన్కో .. యిప్పుడేమైంది. తింటమా..నువ్వు లేవా లెక్క చూచెడానికి.. ఓ ఒకటే తొందర నీ తల్లి..”
” అరెయ్‌.. లెక్కలు కిందిమీదికైతే ఎర్కేగదా.. పిట్టలోల్గె లేచిపోతరు..” ముఖ్యమంత్రి వెనుదిరిగి కారుదిక్కు నడుస్తూండగా.,
”సర్‌సర్‌.. ఈసారి మంత్రివర్గ విస్తరణలనన్న నన్ను ఓ కంట..” ప్రాధేయపూర్వకంగా శివరాజం గొణుగుతూ,
”చూద్దాం లేవయ్య.. అసలు మన సర్వైవలే కష్టంగున్నది..”
ముఖ్యమంత్రి చరాచరావచ్చి కార్లో కూర్చోగానే కారు బయల్దేరింది..పూర్తిగా రహస్యమైన ట్రిప్‌ కాబట్టి ఏ సెక్యూరిటీ, కాన్వాయ్‌, పటాటోపం లేని ప్యూర్‌ పర్సనల్‌ ట్రిప్‌.. చాలా హాయిగా ఉందతనికి.. అప్పటికే ఆయన మొబైల్‌ సైలెంట్‌ మోడ్‌లో అరుస్తూనే ఉంది.
అసహనంగా ఫోన్‌ ఎత్తాడు.. ”హలో..” అని. ఆ ఫోన్‌ హోంమంత్రి అప్పల్నాయుడుది. అప్పటికే ఎనిమిదిసార్లు వచ్చి వచ్చి వెయిటింగులో ఉంది. చాలా చికాకేసింది ముఖ్యమంత్రికి ఆ వ్యక్తి జ్ఞాపకం రాగానే. అతన్ని చూడగానే ఓ పందిని చూచినట్టు పైన ఓ బల్లో, తొండో పడ్డట్టు, ఓ బండెడు పేడ పైనబడ్డట్టు ఓ వికారమైన అనుభూతి. మొదట్నుండీ తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తనతో బలవంతంగా తన పనులన్నీ చేయించుకుంటున్నాడు. పదేండ్లక్రితం ఒట్టి కేబుల్‌ ఆపరేటర్‌ వెధవ అప్పల్నాయుడు.. ఇప్పుడు వాడొక క్యాబినెట్‌ర్యాంక్‌ మంత్రి. వాడి పెళ్ళాం ఎంపి. వాని తమ్ముడు ఎమ్మెల్యే. వేల ఎకరాల భూములు కబ్జా. వేల కోట్లరూపాయల సంపద.. మనిషి.. పశువుకే మాటొస్తే టైపు – నోరు తెరిస్తే అదొక మున్సిపల్‌ మోరి. సారా, లిక్కర్‌, బార్లు, పబ్‌లు, గనులు, హార్బర్‌, ఖనిజం ఎక్ప్‌పోర్ట్‌, ఇరవై రెండు ఇంజినీరింగు కాలేజిలు. రెండు మెడికల్‌ కాలేజీలు, రెండు షిప్పింగు కంపెనీలు. విదేశాల్లో రెండు హోటళ్ళు. యితర రాష్ట్రాల్లో నాల్గు పవర్‌ ప్రాజెక్ట్‌లు.. ఒక సామ్రాజ్యం వాడిది. ఒట్టి వీధిగుండా. ఒకప్పటి రౌడీషీటర్‌ ఇప్పుడు హోంమంత్రి. వాడికింద ఒకనిమీద ఒకడు పడిపడి బూట్లు నాకే ఐపిఎస్‌ ఆఫీసర్లు.. వేలకోట్ల సామ్రాజ్యం. అధిష్టానం దగ్గర పైవాళ్ల కటాక్షవీక్షణాలు వీడికి. డైరెక్ట్‌గా సూట్‌కేస్‌లకుసూట్‌కేసులు పార్టీ పెద్దలకు, సామంతులకు చక్రం తిప్పేవాళ్ళకు, ధనకనక వస్తు వాహనాదులతోపాటు కాంతామధువులు అన్నీ చేయిచాపినంత దూరంలో ఉంచి.. వాడికి ఎవన్ని ఎట్ల మేనేజ్‌ చేయాలో బాగా తెలుసు. తన కంట్రోల్‌ అస్సలే లేదు. వాడు తన మాట వినడు.. తనను ఖాతరు చేయడు.. ఎప్పుడూ ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలను పిల్లివెంట పిల్లల్లా వెంటతిప్పుకుంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. వీడూ పార్టీ రాష్ట్ర అధ్యకక్షుడు జయవిజయులు.. తోడుదొంగలు.. కత్తీ డాలూ.
యిప్పుడు వీడు ఉంచుకున్న ముండ చింతామణికి ‘రాజ్యసభ’ సీటు కావాలి. అధిష్టానంనుండి పైరవీ చేసుకుని అఫీషియల్‌గా రాష్ట్ర పార్టీ అధ్యకక్షుడు, ముఖ్యమంత్రి అంగీకారంతో ఒక లెటర్‌ తెచ్చుకొమ్మని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌తో చెప్పించుకుని.. ఒక లెటర్‌పెట్టి.. నిన్న రాత్రి రాష్ట్ర అధ్యకక్షుని సంతకం చేయించి.. పన్నెండు తర్వాత ఫుల్‌గా ఫుల్‌బాటిల్‌ తాగి తనదగ్గరికొచ్చి సంతకం పెట్టమంటాడా కాగితంపై.. సంతకం పెట్టడం గురించిగాక వాడింకొక మాట మాట్లాడడు. మాట్లాడనీడు. అతి కష్టంమీద ఆ కాగితం అక్కడ పెట్టిపో.. రేప్పొద్దున చూద్దామని పంపించగలిగాడు తను. పోతూ పోతూ ”రేప్పొద్దున చూస్తా కాదు.. రేప్పొద్దున చేస్తా అను” అని అరుచుకుంటూ వెళ్లిపోయాడు.. వాడివెంట పాతికమంది స్పెషల్‌ సెక్యూరిటీ, ప్రొటెక్షన్‌ పోర్స్‌.
”రామం.. నువ్వు చెప్పుతున్నది అక్షరాలా నిజమయ్యా.. మేమిద్దరం బయటికి రాలేని పీతిగుంటలో మునిగిపోయి ఉన్నాం.. సత్యం.. పరమ సత్యం.. సిగ్గుగా ఉంది.. అసహ్యంగా ఉంది.. జుగుప్సగా ఉంది నాపై నాకే.. కాని..?”
”ఏమైంది.. ఎక్కడున్నారు మీకోసం అరగంటనుండి వెయిట్‌ చేస్తున్నా చాంబర్లో.. ఎంతసేపు..” అరుస్తున్నాడా ఆంబోతు హోంమంత్రి అట్నుండి.
”వస్తున్నానయ్యా.. ఐదునిముషాల్లో.. వెయిట్‌ చెయ్‌..” అన్నాడు అసహనంగా. ఆయనకా క్షణం మొన్న టి.వి. ఇంటర్వ్యూలో ‘జనసేన’ రామం పదే పదే చెప్పిన ఆత్మగౌరవం, ఆత్మతృప్తి అనే పదాలు వందసార్లు జ్ఞాపకమొచ్చాయి. ఆ రెండూ ప్రస్తుతం తన దగ్గర అస్సలే లేవని అర్ధమై ఎందుకో అతనికి దుఃఖంముంచుకొస్తున్న ఫీలింగేదో కలిగి గిలగిల్లాడిపోయాడు. నిజంగానే ఈ వయసులో.. తను యాభై ఏండ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చినపుడు పార్టీ ఏదైనా ఋషుల్లాంటి వ్యక్తులుండేవాళ్ళు. శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, చంద్ర రాజేశ్వర్రావు, వందేమాతరం రామచంద్రరావు, పెండ్యాల రాఘవరావు.. మహానుభావులు.. అసలు స్వార్ధమే లేని ఆదర్శజీవులు. శాసనసభ అంటే పవిత్ర దేవాలయం. ప్రతి మనిషి కదలిక, నడక, మాట, ముచ్చట, ఆలోచన..సంభాషణ అన్నీ విశిష్టమే. అందరిలోనూ మానవ పరిమళం అక్కడ్నుండి.. పర్వతంపైనుండి రాయి కింది దొర్లిపడ్తున్నంత వేగంగా విలువలు పతనమై.. నైతికత ధ్వంసమై.. ఒక్క యాభై సంవత్సరాలలో భారతదేశంలోని శాసనసభలన్నీ .. పార్లమెంట్‌తో సహా మైక్‌లు విరిచి, బల్లలు చరిచి, అంగీలు చింపుకుని, పరమ చంఢాలమైన భాషతో తిట్టుకుని.. అంతా రోత. ఏమిటిది.. ఎందుకిలా.. నిజంగానే ఆ రామం అన్నట్టు నేరగాళ్ళందరూ శాసన సభల్లోకి ప్రవేశించారుగదా బాజాప్తాగా. ఆక్రమణ.. దురాక్రమణ జరిగింది.

గుండాలకు ప్రజాస్వామ్యపు అసలు రహస్యం తెలిసిపోయింది. అసలు ప్రజాస్వామ్యమే బూటకం. వంథాతం ఓటర్లలో ఏ ముప్పయ్యయిదు శాతం మందో ఓటేస్తే పద్దెనిమిదిశాతం ఓట్లను సంపాదించినవాడు గెలుస్తే. గెలిచినవాడు ఎంతశాతం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు.. పదిహేడుశాతం ఓట్లొచ్చి ఓడిపోయినవాడు ఎంతమందితో నిరాకరించబడినట్టు.. ఐనా ఒక నిరక్షరాస్యుడు, ఒక డాక్టర్‌, ఒక కూలీ, ఒక వైస్‌చాన్సలర్‌.. వీళ్ళందరూ పౌరులే ఐనపుడు అందరి ఓటు విలువ ఒకటే ఐనపుడు.. అసలా గణన విధానమే తప్పుకదా.. అందుకే వీధీరౌడీలు కూడా ఎన్నికల్లో అసలు ఓటు వేసే బడుగు ప్రజలను ఎలా లోబర్చుకుని, వశపర్చుకోవాలో, ఎలా భయపెట్టి మభ్యపెట్టాలో.. అన్ని పద్ధతులూ నేర్చుకున్నారు. పోలింగు తేదీకంటే ముందు రెండురోజులు సర్వవిధాలుగా ప్రజలను వెధవలను చేస్తే.. చెల్లు.. యిక ఐదేండ్లు ఆడింది ఆట పాడింది పాట. ఈ దేశంలో ఎలాగూ కోర్టులకు చెవులు, కళ్ళులేవు.. పోలీసులకు హృదయం, చేతులు లేవు.. మేధావులకు ధైర్యం, సమయం లేవు.
ఈ వ్యవస్థ శరీర సర్వాంగాలకూ కేన్సర్‌ చీడపట్టినట్టయి.,
బి.డబ్ల్యు.ఎమ్‌ కారు జారిపోతుంది విడిచిన బాణంలా.

రాజకీయాల్లో.. బ్లాక్‌మెయిల్‌ చేయడం.. బ్లాక్‌మెయిల్‌ చేయబడ్డం.. ఒక గొప్ప నీచమైన జూదక్రీడ.. ఆ పరంపరలో.. యిదివరకు ఎన్నో ప్రభుత్వాల్లో పంచాయితీరాజ్‌, ఎలక్ట్రిసిటీ, ఆర్థిక, రెవెన్యూ, ఆరోగ్య.. ఒకటేమిటి.. దాదాపు అన్ని శాఖలనూ మంత్రిగా నిర్వహించిన తనకు తెలియని రహస్యమేలేదు. తెలియని లోలోతుల విషయాలూ లేవు.. ఐతే జీవిత చరమథలో ముఖ్యమంత్రి కావడం ఒక వరమై.. ఒక అద్భుతావకాశమై.. ఓ అదృష్టమై.,
శేషజీవితమంతా మాజీ ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు గదా.. అని ఆశ.
కాని యిది ఒక శాపమై.. క్షణక్షణ నరకం, ఆత్మవంచన, అవమానాలు, క్షోభ.. అన్నింటినీ మించి మనసుకు నచ్చని ఎన్నో తప్పుడు పనులకు ఒడిగడ్తూ.. ఇన్నాళ్ళూ ఏదో కొద్దిగా గుండెల్లో మిగిలిన చెంచాడంత ఆత్మతృప్తికూడా ఇగిరిపోయి.. ముగింపులో ‘ముసలోడు ఛండాలపు పనులన్నీ చేశాడు. చేయనిచ్చాడు’ అన్న మచ్చ శాశ్వతమై.,
అవసరమా ఈ మచ్చ తనకిపుడు. ఈ మచ్చను ఇలాగే ఇంకా ధరిస్తే.. ఇన్నాళ్ళ జీవితమంతా బురదలో పోసిన అమృతమైపోదా.
ఉహుఁ.. లోపల..లోలోపల.. ఎక్కడో.. ఏదో తగలబడిపోతోంది ఎండిన అడవిలా.

ఒక నెలక్రితం గుఢాచార విభాగంలో నీతివంతులూ, తనకు బాగా విశ్వసనీయులైన ఓ పదిమంది అధికారులతో ప్రతి మంత్రి గురించీ, ప్రతి శాసనసభ్యుని గురించీ సమీకరించిన సమగ్ర నివేదిక జ్ఞాపకమొచ్చింది ఆయనకాక్షణం. ఒక రాత్రంతా ఆ వందల నివేదికలను పరిశీలించాడు తను.. ఏమున్నయందులో.. బురద.. చెత్త.. కంపు.. గబ్బు. ఎప్పుడూ ఎవ్వడూ శుభ్రం చేయలేని సముద్రమంత అవినీతి. దాదాపు ఎనభైశాతం మంది .. అందరూ నేరచరిత్రులే. ఓ సరియైన చదువులేదు. చరిత్రలేదు.. సంస్కారం అసలేలేదు. జ్ఞానం అంతకూ లేదు. .. అంతా రాక్షస గణం. తాను దానికి అధిపతి.. అంతే.
మొన్న రాత్రి తనవద్దకు వచ్చిన ఐదారుగురు మంత్రులు, యింకో ఏడెనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు.. బృందం గుర్తొచ్చింది ముఖ్యమంత్రిగారికి. వేలకోట్ల సాగునీటి ప్రాజెక్ట్‌లలో జరిగిన వేలకోట్ల అవినీతికి సంబంధించి సవివరమైన సమాచారంతోనే వచ్చారు వాళ్ళు. చాలా బహిరంగమైన దోపిడి. నిస్సిగ్గుగా ఎగబడి తినుడే.. అదీ ప్రపంచబ్యాంక్‌నుండి తెచ్చిన అప్పు డబ్బును.
అంతా నిజమే..నిజమే.. తనకు తెలుసు.
పవర్‌ ప్రాజెక్టులలో ఏ మంత్రి ఏ పార్లమెంట్‌ సభ్యుడు, ఏ బినామీదారు ఎంత దండుకుంటున్నాడో తెలుసు.. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ను అడ్డంపెట్టుకుని డిస్టిలరీస్‌.. ఎక్కడో అమెరికానుండి ఆంధ్రదేశందాకా విస్తరించడం తెలుసు తనకు. వాళ్లనుండి ఎవనికి అందిందివాడు కోట్లుకోట్లుగా తిని బలవడం తెలుసు. కార్పొరేట్‌ కంపెనీలకు భూముల అలాట్‌మెంట్‌ పేరుతో ఏ ఏ నాయకుడు ఎన్నెన్ని ఎకరాలు, సెజ్‌లపేరుతో గ్రామాలకు గ్రామాలను ఎలా పంచుకుతింటున్నారో.. రోడ్డు, భవనాలు, ఇసుక, బొగ్గు, అడవి, కలప, ఖనిజం, నీరు.. అంతా అంతా దోపిడీకి గురౌతున్నట్టు తెలుసు తనకు.
మొన్న తన చేయించిన సర్వేతో, ఇప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలో ఒక అవశేషంగా, మిగిలిన నీతిపరులైన ఏడెనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ల నేతృత్వంలో తయారుచేసిన ‘అవినీతి డాటా బ్యాంక్‌’ ఋజువుల్తోసహా.. తనదగ్గరుంది.. డాక్యుమెంట్లుగా.. అంతా తనకు తెలుసు.
తెలిసీ.. తెలువనట్టు.. కళ్ళు ఉండీ చూడలేనట్టు.. చెవులుండీ వినలేనట్టు.. నటిస్తూ.,
జీవిస్తూ.. మరణించినట్టు.. మరణించికూడా జీవిస్తున్నట్టు నటిస్తూ..థూఁ.. నీయమ్మ .. ఆ ‘జనసేన’ నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో … టి.విలో ఎవరో వేశ్య చెప్పినట్టు.. తమకంటే వేశ్యే నయంకదా.
అధిష్టానం.. పార్టీ.. పార్టీ సభ్యులు..ప్రజాప్రతినిధులు.. అధికారదాహంతో వికృతతాండవం చేస్తున్న వివిధ పార్టీ లాబీలు.. హైద్రాబాద్‌, ఢిల్లీ.. నడుమ వికృత మంత్రాంగం, యంత్రాంగం నడిపేవారు.. అందరూ చెప్పేదేమంటే.. ముఖ్యమంత్రి ఈ రొచ్చును ఈ కంపును, ఈ సర్వదరిద్రాన్ని భరిస్తూ, ధరిస్తూ.. నాయకత్వం వహిస్తూ.. ‘నడిపించండి.. నడిపించండీ రోతను’ అని కదా ఎప్పుడూ చెప్పేది.
కాని.. కాని.. ఉహుఁ.. యిక తనతో కాదు.. ఈ కుర్చీ, ఈ అధికారం.. ఈ నీచాతి నీచమైన పదవీవ్యామోహం.. అప్పులకుప్పపై దొంగ నాటకం.. ఖాళీ ఖజానాతో అబద్దాల పాలన.. వద్దు.. వద్దిక..,
కారు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందాగి.. దిగి.. గబగబాలోపలికి నడచి.,
చుట్టూ ఎందరో విజిటర్స్‌.. ఫైళ్ళతో అధికారులు.. పాత్రికేయులు.. టివివాళ్లు.. లోపల ఆంటీరూంలో హోంమంత్రి అప్పల్నాయుడు.. ఇంకా.. ఇంకా.,
బెల్లం చుట్టూ ఈగలు.
లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నాడో లేడో.. డోర్‌ దగ్గరగా పెట్టి అప్పల్నాయుడు ఒక వీధి రౌడీ మీదికురికొచ్చినంత రూడ్‌గా పైపైకొచ్చి,
”ఏమైందా కాగితం.. రాత్రిది.. చింతామణి రాజ్యసభ సీట్‌కు రికమెండేషన్‌ లెటర్‌. మీరు దాన్ని సంతకంచేసి నా ముఖాన పారేస్తే.. ఢిల్లీ లెవల్లో అన్ని ఏర్పాట్లూ చేసుకున్న”
”నేను చేయనయ్యా..”
”చేయవా.. ఎందుకు..” మాట ఏకవచనంలోకి దిగింది.
”ఒట్టి రోడ్‌సైడ్‌ మనుషులను పార్లమెంట్‌కు పంపడం సరియైందికాదు”
”ఏంటీ రోడ్‌సైడ్‌ మనిషా చింతామణి.. మరి నువ్వు, నేను, మన మంత్రులు, మనోళ్ళందరెవరు. సత్యహరిశ్చంద్రులా. పోవయ్యా.. ఏదో పెద్దమనిషివిగదా అని నీ సంతకం కావాలన్న. నువ్వు ఆ బోడి సంతకం చేయకుంటే పని ఆగిపోద్దనుకున్నవా. పై లెవల్ల ఎవనెవనికెంతియ్యాల్నో అన్ని ఇచ్చిపెట్టిన.. అందరూ పవర్లో ఉన్నంత సేపే తూర్పారపట్కొని పోతరు. పో.. నీతోనేంగాదు.. చూస్కుంట నీసంగతి..”అని విసవిసా, ఒక మామూలు మనిషిపై వీధిగుండా దాడిచేసి వెళ్లినట్టు.. ఓ వెంట్రుకముక్క పో అన్నంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు.,
ధూఁ.. నీయవ్వ..నిజంగానే ఏ విలువాలేని తనది ఏం బతుకు.,
పార్టీలో ప్రతివాడూ మాట్లాడేవాడే.. అందరూ ఒకర్నొకడు విమర్శించేవాడే.. అందరూ నీతిపరుల్లా మాట్లాడ్తూ ప్రతివాడూ మందికొంపలు ముంచుడే. ప్రతివాని వెనుకా ఎవడో ఒక గాడ్‌ఫాదర్‌.. ఎవనిదో దన్ను.. చివరికి అందరూ అక్కడ పైనుండి ఆడమంటే ఆడి, పాడమంటే పాడి.. కూర్చోమంటే కూర్చుని, నిలబడమంటే నిలబడి.. అంతా తోలుబొమ్మలాట.
ముక్కుతాళ్ళక్కడ.. ఒట్టి ఆడే బొమ్మలిక్కడ.
ఈ తోలుబొమ్మ జీవితం తనకు అవసరమా..?
ముఖ్యమంత్రి.. రాత్రి కూలంకషంగా పరిశీలించిన ఓ ఫైల్‌ఫోల్డర్‌ను తన టేబుల్‌ సొరుగులోనుండి బయటికి తీసి అప్రయత్నంగానే తెరచి ఓసారి తిరగేశాడు యథాలాపంగా. దాదాపు డెబ్బయిరెండు కేసులు.. మంత్రులు, శాసనసభ్యులు.. ఐఎఎస్‌ అధికారులు, వివిధ బోర్డు చైర్మన్లు.. వంటి హై ప్రొఫైల్‌ వ్యక్తుల జాతకాల చిట్టా.. ఋజువుల్తోసహా.,
ఎందుకో ఆయన తనకే అర్ధంగాని ఓ అంతర్వేదనలో.. నిర్వేదంలో.. నిశ్చేష్టలో కంపించిపోతూ.. అప్పుడతను కాలుతున్న కాగితంలా ఉన్నాడు.
కాగితం కాలిపోతూంటే అక్షరాలుకూడా కాలిపోతాయా..?

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 17 వ భాగం

(గత వారం తరువాయి)

17

ఒక్కసారిగా నూటా ఎనిమిది ప్రజాపనులు జరుగుతున్న ప్రాంతాలపై ‘జనసేన’ జరిపిన ‘ప్రక్షాళన’ యాత్ర ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. పత్రికలు, మీడియా.. తమ తమ రిపోర్టర్‌లందరినీ ‘జనసేన’ ప్రక్షాళన బృందాలు సమాచారచట్టం ఆధారంగా చేస్తున్న ‘ప్రశ్న’ కార్యక్రమాలను కవరేజ్‌ చేయడానికీ నియమించవలసి వచ్చింది.

గంటగంటకు అన్ని టి.వి. చానళ్ళలో వివిధ ప్రాంతాల్లో నాసిరకపు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సిగ్గుతో తలలు  వంచుకుని లొంగిపోవడం.. ఒక చోటనైతే నిస్సహాయుడైన ఓ కాంట్రాక్టర్‌ తన నిస్సహాతను ఏకరువుపెడ్తూ, పైన ఏ రాజకీయనాయకునికి, అధికారికి..ఎవరెవరికి ఎన్ని పర్సంటేజీలిచ్చి చివరికి ఎలా మోసానికి గురై.. యిప్పుడీ దుస్థితిలో ఇరుక్కుపోయడో వివరిస్తూ భోరున విలపించాడు సిగ్గుతో.
మొత్తానికి అధికారికంగా ప్రజాధనానికి సర్వాధికారులైన ప్రజలే ఒక సమూహంగా ఎదురుగా వచ్చి ప్రశ్నలు ప్రశ్నలుగా గుండెల్లోకి బాణాలను సంధించే పరిస్థితి ఒకరోజూ ఎదురౌతుందని ఊహించిన కాంట్రాక్టర్లు మింగలేక కక్కలేక గుడ్లప్పగించి, బిక్కచచ్చి లజ్జతో లుంగలు చుట్టుకుపోవడం అన్ని టి.వి. ఛానళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఐదారుచోట్ల కాస్త ముదురు కాంట్రాక్టర్లు మొదట ఎదురు తిరిగి, తను దుష్ట అనుచరవర్గంతో ‘జనసేన’ కార్యకర్తలపై దాడిచేసి, గాయపరిచి తలలను పగులకొట్టి దౌర్జన్యం జరిపి బీభత్సం సృష్టించారు. ఐతే ఈ విషయాలన్నీ మీడియాలో ప్రసారమై బయటి ప్రపంచమంతా చూస్తోందన్న భయం, జనసేన మనుషులు అడిగే ప్రశ్నలన్ని సమాచార చట్టం ప్రకారం అధికారులిచ్చిన సర్టిఫైడ్‌ కాపీలలో ఉన్నవే కావడం, నిజంగానే తాము చేస్తున్న కోట్లకొద్ది రూపాయల పనులు నాసిరకంగా ఉన్నట్టు జనసేన బృందాల్లో ఉన్న హైలెవెల్‌ సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తులు కళ్ళముందే జరుపుతున్న పరీక్షలద్వారా నిర్ధారిస్తూండడం, ఇన్నాళ్ళూ తమ దగ్గరినుండి లక్షలకు లక్షలు లంచాలను తిన్న అధికారులూ, పోలీసులూ, ఇతరేతర హైరార్కీ అందరూ తేలు కుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తూండడం.. ఇదంతా అయోమయంగా, పిచ్చిపిచ్చిగా, భయం భయంగా అనిపించి.. ఒక్క కాంట్రాక్టరైతే ఏమీతోచక, ఎవర్నీ ఏమీ చేయలేక అతని చొక్కాను అతనే పరపరా చింపుకుని గొడ్డులా అరిచాడు. ఆ అరుపు, ఆ ఉన్మాదస్థితి.. ఆ నిస్సహాయ దౌర్భాగ్యాన్ని దాదాపు అన్ని తెలుగు వార్తా చానళ్ళు పొద్దూ రాత్రనక అస్తమానం ప్రసారం చేశాయి.
23

బ్రేకింగ్‌ న్యూస్‌..
‘అవమానాన్ని భరించలేక ఒక అవినీతి కాంట్రాక్టర్‌ బహిరంగ రోదన’

‘ఏకు మేకై అవినీతి పర్వతాలను బ్రద్ధలు చేస్తున్న వైనం’
‘తెరవెనుక నిజాలను బయటపెడ్తున్న బినామీ కాంట్రాక్టర్లు’
‘రౌడీలందరూ రాజకీయ నాయకులూ, కాంట్రాక్టర్లయ్యారా!’
‘జనసేనను కదిపితే క్షణాల్లో వాని చరిత్ర బట్టబయలు’
‘గుప్పిట్లో నిప్పు.. విప్పుతే ముప్పు.. విప్పకుంటే తప్పు’

ఒక్కో ఛానల్‌ వాళ్ళవాళ్ళ శైలిలో ప్రత్యేక తరహా వాక్య విన్యాసాలు.. మొత్తానికి అందరికీ.. వార్తలు చదువుతున్నవారికి, వింటున్నవారికి, వార్తాపత్రికల్లో కథనాలను కంపోజ్‌ చేస్తున్నవారికి రిపోర్టర్లకు, అచ్చువేస్తున్న ప్రెస్‌మెన్‌కు, ఇన్నాళ్ళూ దుర్మార్గులకు కాపలాకాస్తున్న అట్టడుగు పోలీసులకు, అందరికీ పరమ ఆనందంగా ఉంది. చిన్న తెప్పలా వచ్చిన జనసేన ఒక ఉప్పెనగా మారి ఓ వినూత్న రీతిలో అవినీతి అంతానికి తిరుగులేని విధానాన్ని అమలు చేయడం చిత్రంగా, ఆశ్చర్యంగా.. పులకింతంగా ఉంది. ఎక్కడ చూచినా ‘జనసేన’ చర్చే.

‘జనంనాడీ’ ఇప్పుడు చూడండి.. అని ఓ ఛానల్‌లో ప్రజలముందు మైక్‌ ఉంచి వాళ్ళ అభిప్రాయాలను లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నారు.

‘నరకాసురుడు చచ్చిపోతే అబ్బా పీడవిరగడైపోయిందని జనమంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకున్నారట. జనసేన పుణ్యమా అని వందల వేలమంది నరకాసురుల వధ జరుగుతోందీ రోజు ఈ తెలుగునేలపై.. ఎన్ని దీపావళి పండగలు జరుపుకోవాలో అన్నంత ఉత్సాహంగా ఉంది..’ అంటున్నాడో నలభై ఏండ్లు పైబడ్డ పౌరుడు రోడ్డుపై నడచిపోతూ.
‘అరె.. మీతిమీరిపోయిండ్లు నాయకులు. సిగ్గుశరం లేకుండా దేశాన్ని పంచుకుని తినుడేనాయె. ఇన్నాళ్ళకు జనానికి వీళ్ళ పనిబట్టే విధానం దొరికింది. జనసేనకు ధన్యవాదాలు”
‘ప్రజలు.. ఒంటరిగా ఎంత బలహీనులో.. సమిష్టిగా అంత బలవంతులని యిది ఒక సజీవ ఉదాహరణగా నిరూపించింది.’
‘స్వార్థరహిత నాయకత్వం ప్రజలను ఎలా ఏకతాటిపై నడిపించి విజయాలను సాధిస్తుందో ఈ జనసేన ప్రతిఘటన వల్ల తెలుస్తోంది’
‘ఇగ కక్కుతరు కొడ్కులు..అరె కోట్లకు కోట్లు తినుడు. కిలోలకొద్ది బంగారం దోచుడు, దాచుడు.. ఎక్కడ్నుండొస్తానై యివన్నీ అని యిండ్లళ్ళ ఆడోళ్ళు కూడా అడ్గరు మొగోళ్ళను. అడిగేటోడు లేక జన్నెకిడ్సిన ఎద్దుల్లెక్క బలిసిండ్లు.. తీయాలె, ఒక్కొక్కన్ని తవ్వి బండారం బయటికి తీయాలె.. సంబురంగున్నది. జనసేనకు జై. దాని ఎన్క ఎవ్వడున్నడోగని వానికి దండం’
.. ఇలా సాగుతున్నాయి లైవ్‌ టెలికాస్ట్‌లో ప్రజాస్పందనలు.
‘ఇంకో ఐదు నిముషాల్లో.. జనసేన సృష్టికర్త రామం, జనసేన సిద్ధాంతకర్త డాక్టర్‌ గోపీనాథ్‌లతో ‘అగ్ని’ టి.వి. ముఖాముఖి. అగ్ని టి.వి. నిప్పు పిడికిలిని విప్పుతుంది.’ఏదో యాడ్‌.. కింద మూడు లైన్ల అక్షరాల స్క్రోలింగ్స్‌.

ఈ మూడు లైన్ల అక్షరాల కదలికలను, ప్రక్కన యింకో చిన్న అడ్వర్‌టైజ్‌మెంట్‌ డిస్‌ప్లేను, పైన ఇంకేదో రౌండింగ్‌ ఐటమ్‌, తెరపై యాంకర్‌ వాచకం.. ఏకకాలంలో ప్రేక్షకుడు ఈ తెరను చూస్తూ ఎంత హింసకు గురౌతాడో ఏ మేధావీ, పౌరహక్కుల వాళ్ళూ, ఈ మొద్దు ప్రభుత్వమూ ఆలోచించదు.
‘ఈలోగా.. గోవిందరావుపేట అనేచోట.. నిన్న జరిగిన ఉదంతాన్ని తిలకించండి’
ప్రొజెక్షన్‌ ప్రారంభమైంది

అక్కడ ఓ రెండు వందల మీటర్ల పొడవున్న రోడ్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం జరుగుతోంది. అటు ప్రక్క ఒక జెసిబి, టిప్పర్‌, రెండు కాంక్రీట్‌ మిక్సర్స్‌, రెండు లారీలు ఉన్నాయి. ఓ పదిమంది కార్మికులు పని చేస్తున్నారు. ఇద్దరు సగం నిలబడ్డ పిల్లర్‌కు ఉక్కు కడ్డీలను జతచేసి వెల్డింగ్‌ చేస్తున్నారు. కెమెరా దీన్నంతా చూపిస్తూంటే.. ప్రక్కన పచ్చగా పొలాలు, చెట్లు.. పెద్దగా సెలయేరులాంటి నీటి ప్రవాహపు జాడలు ఏవీలేవు. అసలక్కడ అంత పొడవైన వంతెన అవసరం ఉందా.. అని అన్పించే వాతావరణం ఉంది. చూస్తూంటే..మంత్రి, మంత్రి బామ్మర్దయిన కాంట్రాక్టర్‌, లోకల్‌ ఎమ్మెల్యే, ఆ ప్రాంత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌.. అందరూ కుమ్మక్కయితే ఫండ్స్‌ను పంచుకునేందుకు అసలు అవసరమే లేని కావలసిన డబ్బును దండుకునేందుకు వీలుగా నాసిరకం డ్యాం నిర్మిస్తున్నారనే పరమసత్యం అర్థమౌతోంది.
”నమస్కారం సార్‌. మీరేనాండి ఈ రాంపురం బ్రిడ్జ్‌ కంట్రాక్టర్‌. నా పేరు జగన్‌. జనసేన కార్యకర్తను” అని ఓ జనసేన కార్యకర్త అడిగాడు అక్కడున్న తెల్లని స్టార్చ్‌ బట్టలేసుకున్న నల్లని వ్యక్తిని. అతను బట్టలేసుకున్న ఎలుగుబంటులా ఉన్నాడు. అతని మెడలో నులకతాడంత మందం బంగారు గొలుసులు, రాళ్ళ బిళ్ళలు, రెండు చేతులకు రెండు ధగధగా మెరిసే బేస్‌లెట్లు, రెండు చేతులక్కలిపి ఎనిమిది ఉంగరాలు ఉన్నాయి.
”ఔను..” అన్నాడు అసహనంగా, నిర్లక్ష్యంగా
” ఈ కన్‌స్ట్రక్షన్‌, ప్రాజెక్ట్‌ డిటైల్స్‌ మా జనంకోసం డిస్‌ప్లే చేయాలెగద సార్‌”
”చేయాలె.. కని చేయలె..ఐతేంది.”
”యిప్పుడు చేస్తరా సర్‌”
”ఏమో చూస్తం.. అదంత అవసరమా”
”పోనీ.. మేం పెట్టాల్నా సార్‌ బోర్డును”
”మీరు పెడ్తరా.. మీ దగ్గర డిటైల్లున్నయా..”
”ఒక్క బోర్డుయేగాదు.. మీ అందరి చరిత్ర భూగోళాల వివరాలన్నీ మా దగ్గరున్నయ్‌ సార్‌. బొడ్డుబోయిన అంజయ్యగారూ.. బాబూ..” అని ఒక జనసేన కార్యకర్తను పిలిచి.. ”ఓ నలుగురు వెళ్ళి ఈ రాంపురం బ్రిడ్జ్‌ ‘పబ్లిక్‌ ప్రకటన’ బోర్డులను ఆ కొసకు, ఈ కొసకు పాతండయ్యా” అని పనిని పురమాయించి,
”ఊఁ.. చెప్పండి అంజయ్యగారు.. అసలు ఈ వర్క్‌కు ఆఫీషియల్‌ కాంట్రాక్టరెవరు”
”నీకు చెప్పడమవసరమా” అన్నాడు తలబిరుసుగా.
”చాలా అవసరం.. ఎందుకంటే యిది ప్రజల డబ్బు. మేం ప్రజలం” అన్నాడు జగన్‌ వెనుక నిలబడిన ఉన్న దాదాపు ఓ ఇరవైమంది యువకులు.
”చెప్ప..”
”సరే.. ఐతే మేమే చెప్తం. దీని అసలు కాంట్రాక్టర్‌ మంత్రి విశ్వేశ్వర్రావు తమ్ముడు జగపతిరావు. ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పనిని రెండుకోట్ల డెబ్బయి లక్షలకు ఓవర్‌ ఎస్టిమేషన్‌ వేయించుకుని.. గవర్నమెంట్‌లో మ్యామ్యాలిచ్చి సబ్‌ కాంట్రాక్ట్‌ క్రింది ఇక్కడి లోకల్‌ ఎమ్మెల్యేకు చెందిన మెసర్స్‌ వెంకటేశ్వరా కన్‌స్ట్రక్షన్స్‌కు రెండు కోట్ల రౌండ్‌ ఫిగర్‌కిచ్చి స్కిప్పయిండు. తర్వాత వాళ్ళు కూడా ఈ పనిని చేపట్టక ఈగిల్‌ అండ్‌ కంపెనీకి ఒక కోటీ ఎనభై లక్షలకిచ్చి పనిని మొదలుపెట్టి ఐదు లక్షల కమీషన్‌ మీద మీకు ఒక కోటీ డెబ్బయ్యయిదు లక్షలకిచ్చిండ్లు..మీరు..”
”వద్దు వద్దు.. యిగ చెప్పద్దు. అప్పటిక్కూడా ఆ ఎమౌంట్‌తో పనిచేస్తే పదిహేను లక్షల్నాకు మిగులుతై. కాని సిఇకి, ఇఇకి, ఎయికి.. వీళ్ళకు పదిశాతం, నక్సలైట్లకు పదిశాతం, ఎపిపి, జడ్‌పిటిసి, స్థానిక యువజన సంఘాలకు ఐదుశాతం.. అంతా తడిసి..వందల ముప్పయ్యిశాతమే మిగుల్తాంది టెండర్‌ కాస్ట్‌ల. గీ డబ్బుతో ఈ బ్రిడ్జ్‌కట్టుడు ఎవనితరంగాదు… నేను చావాల్నా .. ఏంజేయాలె”
”అసలెప్పుడైపోవాలె ఈ బ్రిడ్జ్‌.”
”మూడ్నెళ్ళ కిందట్నే హాండోవర్‌ చేయాలి.. గని యింక యాడాదైనా కాదు. యిగ నాతోని కాదు కట్టుడు. క్విటయ్‌పోత..”
”అసలిక్కడ బ్రిడ్జే అవసరంలేదు.. అక్కర్లేని దాన్ని కట్టేందుకు ఓ ప్రాజెక్ట్‌ తయారుచేసి.. ఉన్న కొత్త రోడ్డును డిస్మాంటిల్‌ చేసి, జనం రాకపోకలకు అంతరాయం కల్గచేసి.. యిప్పుడది పూర్తిగాక, వర్షాకాలంల మనుషులు నడ్వలేక..” జనసేన దళం సారధి రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రఘువీర్‌ అంటున్నాడు.
”ఔ…” అన్నాడు కాంట్రాక్టర్‌ అంజయ్య..అంగీకారంగా తలూపుతూ.
ఆ క్షణం.. అప్పట్నుండి జరుగుతున్న తతంగాన్నంతా మీడియా కెమెరాలు కవర్‌ చేస్తున్నాయనే స్పృహ కలిగి.. అంజయ్య భయంతో అదిరిపోయి.. తడబడ్తూ, తత్తరపడ్తూ.,
”జనానికి జవాబు చెప్పండి.. యిప్పుడు మీరేంజేస్తారు..”
”మంత్రి దగ్గరికి పోయి వందసార్లు మొరపెట్టుకున్న. ప్రతిసారీ ఫుట్‌బాల్‌ లెక్క బైటికి తంతాండు. మొన్నయితే గన్‌మాన్‌తోని మెడలుపట్టి బైటికి నూకించిండు..”
చటుక్కున.. అనూహ్యంగా.. అంజయ్య ఏడ్వడం ప్రారంభించాడు.
టి.వి లో ఆ స్ట్రిప్‌ ఐపోయింది..

వెంటనే యాంకర్‌ శ్రీరాం తెరమిదికొచ్చి.. గత ఒకటిన్నర నెలలకాలంలో ఆంధ్రదేశంలో ‘జనసేన’ అనే ప్రజాసంస్థను వరంగల్లులో స్థాపించి, అవినీతిలో, అనైతికతతో, లంచగొండితనంతో కూరుకుపోతున్న ప్రస్తుత సమాజాన్ని విలువలున్న పౌరసంఘంగా పునర్నిర్మాంచాలనే లక్ష్యంతో ఒక నిర్మాణాత్మక ప్రణాళికతో రంగప్రవేశం చేసిన ‘జనసేన’ వ్యవస్థాపకుడు రామం, ఆ సంస్థ సిద్ధాంతకర్త డాక్టర్‌ పి. గోపీనాథ్‌ యిప్పుడు ఈనాటి ‘ముఖాముఖి’లో మనతో మాట్లాడ్డానికి మన స్టూడియోలో ఉన్నారు. ఒక బిందువుగా పుట్టిన ‘జనసేన’ ఈ రోజు ఒక సింధువై విస్తరించింది. ‘అవగాహన’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు, ఏకకాలంలో ఓ ఇరవై లక్షలపైచిలుకు సమాజంలోని వివిధ వృత్తుల్లో, వివిధ స్థాయిల్లో, వివిధ రంగాలల్లో ఉన్న అనేకమంది పౌరులతో రెండే రెండు ప్రశ్నలున్న ప్రశ్నాపత్రంతో సర్వే చేసి విస్తృతమైన అభిప్రాయసేకరణ చేశారు. మేము ఈ సర్వే ఫలితాలనూ, జననాడిని యిదివరకే గణాంకాలతో సహా ప్రసారంచేశాం. కాగా..’ప్రక్షాళన’ పేరుతో వివిధ రంగాలకు చెందిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులను.. ఓ నూటా ఎనిమిదింటిని గుర్తించి, దాదాపు నలభై రెండు వేలకోట్ల విలువగల ప్రజోపయోగ నిర్మాణాల స్థితిగతులను తనిఖీ చేయడానికి ఈ దేశ రాజ్యాంగం ‘సమాచార చట్టం – 2005’ ద్వారా ప్రతి పౌరునికీ, సంక్రమింపజేసిన అధికారాన్ని చేతిలో ఓ అజేయమైన ఆయుధంగా ధరించి.. ఆ ప్రాజెక్టుల సర్వ సమాచారాన్ని సర్టిఫైడ్‌ కాపీలుగా వెంటతీసుకుని, ఆయా రంగాల్లో నిపుణులనుకూడా తమ తమ బృందాల్లో సభ్యులుగా స్వీకరించి.. ‘ప్రజాధన వినియోగాన్ని ప్రజలే తనిఖీ చేసుకుంటున్నారు’ అనే నినాదంతో మొన్న ఇరవైయవ తేదీన ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీయాత్రతో.. అనేకచోట్ల బయటపడ్డ నమ్మశక్యంగాని నిజాలను వెలికితీసి ప్రజలముందు, మీడియాముందు విప్పి పెడ్తూంటే.. కోట్లమంది దిగ్బ్రాంతికీ, ఉలిక్కిపాటుకు గురై.. అందరూ అవాక్కయిపోయారు. అసలు ఏం జరుగుతోంది. వేల లక్షలకోట్ల రూపాయలు ఇంత దారుణంగా భోంచేయబడ్తున్నాయా, అదీ ప్రజలపక్షాన అప్పుచేసి, రేపు పుట్టబోయే శిశువు నెత్తిపై కూడా అప్పును వారసత్వంగా మోపుతూ.. ఈ నాయకులు, ఈ అధికారులు ఇంత నిస్సిగ్గుగా దోచుకు తింటున్నారా అని విస్తుపోతున్న ఈ ఉద్విగ్న సందర్భంలో.. ‘జనసేన’ సంస్థ వ్యవస్థాపకులు..

”రామం గారూ.. నమస్కారమండీ..”
”నమస్కారం”.. తెరపై రామం ముఖం.. నవ్వుతూ.’జనసేన సంస్థ సిద్ధాంతకర్త.. ప్రముఖ సామాజిక శాస్త్ర గ్రంథాల రచయిత డాక్టర్‌ గోపీనాథ్‌.. నమస్కారం సార్‌..”
”నమస్కారం”
”చెప్పండి.. భారత జాతిపిత మహాత్మాగాంధి ‘అహింసా’ సిద్దాంతాన్ని ప్రవచించినపుడు.. ఎవ్వరూ దాన్ని ప్రశంసించలేదు సరికదా గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత నిజాయితే ప్రాణంగా గాంధీ తన అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని తీవ్రతరం చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్నప్పుడు అందరూ అవాక్కయి విస్తుపోయారు.. దాదాపు అదేరీతిలో.. నమ్మశక్యంగాని ఒక అతి సామాన్యమైన, సాధారణమైన సమాచార చట్టం అనే పౌరాధికారాన్ని ఒక వజ్రాయుధంగా ధరించి మీరు చేపట్టిన ఈ జనసేన జైత్రయాత్ర ఇపుడు దావానలంలా విస్తరించి చీకటి మనుషుల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించడం కాదు.. శతఘ్నులను ప్రేలుస్తున్నాయి.. ఈ వర్తమాన ఉద్విగ్న సందర్బంలో ప్రజలందరూ మిమ్మల్ని వినాలనీ, మీ ఆలోచనలను పంచుకోవాలనీ, మీతో కలిసి నడవాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. చెప్పండి.. అసలు ప్రజలను ఏ దిశలో మీ వెంట నడిపించాలని, అంతిమంగా ఏ లక్ష్యాలను సాధించాలని మీరనుకుంటున్నారు.”

రామం చాలా ప్రశాంతంగా చెప్పడం ప్రారంభించాడు. ”నిజానికి ఈ మితిమీరిన అవినీతి, అనైతికత, రాజకీయ నాయకుల అరాచక ప్రవర్తన ఒక్క మన రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన జాఢ్యంగానీ, సమస్యగానీ కాదు.. యిది ప్రస్తుతం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభలిన అంటువ్యాధిలాంటిదీ జాతీయ సమస్య. దీన్ని యుద్ధప్రాతిపదికపై ఎదుర్కొని ఎవరో ఒకరు రెండవ భారత స్వాతంత్య్ర సంగ్రామ స్థాయిలో అంతర్గత పోరాటం చేయకుంటే యిది భారత భావి తరాలను అంధకారంలోకి నెట్టి వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఒక చోట అసలు రోడ్డేలేకుంటే ఫర్వాలేదు. ఎవడో ఒకడు అందరికోసం ఎప్పుడో ఒకప్పుడు ఒక రోడ్డు వేస్తాడు. దానిపై అందరూ సౌకర్యవంతంగా నడుస్తారు. కాని అక్కడ లంచాలు మేసి మేసి ఒక దుర్మార్గుడు ఓ చెత్త, పనికిరాని, బొడుగు బొడుగు రాళ్ళతో అధ్వాన్నపు రోడ్డు వేస్తే.. యిక అక్కడ ఇంకో కొత్త రోడ్డు వేయడం సాధ్యంకాదు. ఉన్నదాన్ని తీసేయరాదు.. ఇట్‌ బికంస్‌ ఇర్రిపేరబుల్‌. అదిగో ఆవిధంగా కోటానుకోట్ల రూపాయలతో ఈ అధ్వాన్నపు రోడ్లవంటి ఎన్నో నిర్మాణాలు, పనులను చేసి ఈ దేశాన్ని చెత్తకుండీని చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.యిది హత్యకన్నా ఘోరమైన నేరం. దీన్ని నిర్దాక్షిణ్యంగా నిర్మూలించాలి.”

”అసలు మీ సిద్ధాంతమేమిటి”
”మాకు ఒకే ఒక పారదర్శకమైన లక్ష్యం ఉంది. దాన్ని సిద్ధాంతం అంటానికి వీల్లేదు. ఏ యితర రాజకీయ పార్టీల సిద్ధాంతాలతోనూ మాకు నిమిత్తం లేదు. ప్రమేయం లేదు, వ్యతిరేకతకూడా లేదు. మా గమ్యం ఒకటే. శాశ్వత ప్రాతిపదికపై ప్రతి పౌరున్నీ అహింసాయుతంగా ఒక ప్రశ్నించే పదునైన ఆయుధంగా రూపొందించడం. రాజ్యాంగబద్దంగా ఎవరైనా ఏంచేయాలి.. ఏం చేస్తున్నారు.. ఏదైనా చేయకూడని అసాంఘిక కార్యం చేస్తుంటే ఎందుకు చేస్తున్నావని నిలదీసి దోషిగా జనంలో నిలబెట్టడమే జనసేన ఏకైక కార్యక్రమం..”

”రాజ్యాధికారం చేపట్టడం సంగతి..”
”యిదివరకే చెప్పాం చాలా వేదికలపైన స్పష్టంగా. ‘జనసేన’ ఒక రాజకీయ పార్టీకాదు. ఇది ఎన్నికల్లో పోటీ చేయదు. ఇది రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించదు. ‘జనసేన’ కు ముందువరుసలో ఉన్న మేము.. ఎవరమూ ఏ నాయకత్వాన్నీ, పదవులనూ, సంపదలనూ ఆశించం. అసలు మాకు స్వంత ఆస్తులు ఉండవు. స్వంత ఆస్తి లేనివానికి స్వార్థం ఎందుకుంటుంది. అతి నిరాడంబరమైన జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తూ.. గాంధీ జీవితాంతం ప్రవచించిన నిరాడంబర జీవిత మాధుర్యాన్ని జనానికి ప్రయోగాత్మకంగా జీవించి చూపించాలనీ, మమ్మల్ని ప్రజలు విశ్వసించడానికి మూలమైన నమ్మకాన్ని కల్పించాలనీ ప్రయత్నిస్తున్నాం నిజాయితీగా. యిది ఈ దేశంలో ఏ నాయకుడూ చేయని పని.. ఇదివరకు మహానుభావులు వినోభా భావే నుండి బాబా ఆమ్టే వరకు నిస్వార్ధ జీవితాలను జీవించి చైతన్యాన్ని రగిలించినా.. వాటిని ప్రజాబాహుళ్యంలోకి ఒక మహోద్యమంగా శాశ్వతీకరించలేకపోయారు. ‘జనసేన’ ఒక నిజాయితీతో కూడిన పారదర్శకమైన జీవితాన్ని జీవించడం ఒక విశిష్ట సంస్కృతిగా పౌరులకు అలవాటు చేయాలని సంకల్పిస్తోంది. చెబుతే అతిగా అన్పిస్తుందిగాని.. రోడ్డుపై ఒక బంగారు బిళ్ళ పడివుంటే ‘మనది కాని దీన్ని మనం ముట్టుకోవద్దు’ అనే ఆత్మ సంస్కారంతో ఎవరికివారు దాన్ని చూస్తూ వెళ్ళిపోయే ఆదర్శ సమాజాన్ని ‘జనసేన’ లక్ష్యిస్తోంది.”
”రాజ్యాధికారాన్ని చేపట్టనప్పుడు వ్యవస్థపై మీకు ఎలా నియంత్రణ ఉంటుంది.”
”కౌటిల్యుడు చెప్పిన ‘రాజు..రాజగురు అనుబంధం’ గురించి మేం ఆలోచిస్తున్నాం. నిజానికి రాజు ప్రజలకూ, ప్రజాధనానికే రక్షకుడు, కస్టోడియన్‌ మాత్రమే. దుర్మార్గులైన పాలకులు దాన్ని ప్రజాధనానికి యజమానులుగా చిత్రించి  భక్షకులై అనుభవిస్తూ వస్తున్నారు. స్వార్థ చింతనతో ప్రజల అసలైన సంక్షేమావసరాలను రాజగురువు రాజుకు తెలియజేసినపుడు రాజు తు.చ. తప్పకుండా వాటిని అమలుచేసి ప్రజారంజకమైన, న్యాయబద్ధమైన పాలనను కొనసాగించాలి. ‘జనసేన’ విషయంకూడా అంతే. ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవాళ్ళలో ‘జనసేన’ ఆలోచనలనకు, విధానాలకు లోబడి నిస్వార్థ, ఆదర్శ ప్రజాజీవితాన్ని గడపడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినవాళ్ళకు ‘జనసేన’ ఆమోదముద్ర వేస్తుంది. ‘జనసేన’కు ప్రజల్లో నమ్మకంతో కూడిన ఆదరణ ఉంటే అపుడా అభ్యర్థి గెలుస్తాడు. అటువంటి అభ్యర్థి ‘జనసేన’ యొక్క ఒక అంగంగా, ప్రతినిధిగా ప్రభుత్వ నిర్మాణంలో, పరిపాలనలో పాల్గొంటాడు. స్థూలంగా ఇది మా ఆలోచనాధార. ఒక అతి ప్రధానమైన ఉద్యోగానికి అనేకమంది అభ్యర్థులు తమ దరఖాస్తులను పెట్టుకుంటే వాళ్ళలో అత్యుత్తమమైన వ్యక్తిని ఎలా ఎన్నుకుంటామో  పరమ పవిత్రమైన ప్రజాసేవకోసం శాసనసభ్యునిగా, లోకసభ సభ్యునిగా పనిచేయవలసిన ప్రజాప్రతినిధిని ఎంతో కూలంకషంగా పరిశీలించి, ఎటువంటి నేరచరిత్రఉన్నా, మా గూఢాచార వ్యవస్థ అధ్యయనంలో ఏమాత్రం దుష్టచరిత్ర ఉన్నా, వాణ్ణి కనీసం జనసేన దగ్గరిక్కూడా రానీయం. కనీస విద్యార్హతలు, వయోపరిమితులు, ఇతరేతర ప్రజాహిత సంబంధ ప్రత్యేకార్హతలు.. యివన్నీ కీలకాంశాలుగా పరిగణించబడ్తాయి.. ఏ క్షణాన్నైనా, ఏ మా వ్యక్తయినా ‘జనసేన’ నియమాలను ఉల్లంఘిస్తే వెంటనే ‘జనసేన’ తనవద్ద ఉన్న అతని అన్‌డేటెడ్‌ రాజీనామా లేఖను ఉపయోగించి ఆ వ్యక్తిని రీకాల్‌ చేస్తుంది. రాజకీయ వ్యవస్థలో విలువలు పూర్తిగా పతనమైపోతున్నాయి..కాబట్టి దుర్మార్గులైన నాయకులు ప్రజలకు ఆచరణయోగ్యంకాని అనేక హామీలనిచ్చి, ఆశలు కల్పించి కుర్చీపై కూర్చోగానే మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత వ్యవస్థలో దుర్మార్గ ప్రజాప్రతినిధులను వెనక్కి ‘రీకాల్‌’ చేసే ఏదో ఒక మార్గం, ఆయుధం ప్రజల దగ్గరుండాలి. ‘జనసేన’ దగ్గర ఉంటుందది. ఐతే ఎలా అనే దానిపైన యింకా స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ పార్టీలేవైనా, వామపక్ష పార్టీలతో సహా తమ పార్టీ నాయకుడెవడైనా తప్పు చేసినప్పుడు, స్కాంతో బయటపడ్డప్పుడు వాడిపైన ఏ చర్యా తీసుకోవడం లేదు. క్రమశిక్షణ చర్యలే లేవు. శిక్షించడం అసలే లేదు. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే…పత్రికారంగంలో ఏమున్నది.. ఏ పత్రికైనా అట్టతీసేస్తే అన్నీ ఒకటే అన్నట్టుగా.. రాజకీయపార్టీ పేరు ఏదైనా అవినీతి, లంచగొండితనం, అనైతిక ప్రవర్తనల విషయంగా అన్నీ ఒకే రీతిలో నీతిహీనంగానే ప్రవర్తిస్తున్నాయి. యిప్పుడు పరిస్థితి బాగా కుళ్ళిపోయి కంపువాసన కొడ్తోంది. దీన్ని వెంటనే ప్రక్షాళన చేయాలి.”

రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో, ఆశతో వింటున్నారు రామం ఎంతో ఓపెన్‌గా, నిజాయితీగా చెబుతున్న విషయాలను. పరిస్థితి ఒక మొక్క మొలకెత్తబోయేముందు భూమి పులకించిపోతున్నట్టుగా ఉంది.
యాంకర్‌ అన్నాడు.. ”యిప్పుడున్న రాజకీయ, సామాజిక వ్యవస్థ.. మీరు ‘జనసేన’ కోణంలో కలగంటున్న ఆదర్శ వ్యవస్థ.. స్వరూప స్వభావాల విషయంలో ఎలాంటి మౌలిక తేడాలను కలిగి ఉంటాయి. అది చెప్పండి.”
రామం మళ్ళీ అందుకున్నాడు. ”ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ అద్భుతమైన శాసనాలనే రూపొందించి కాగితాల్లో నిక్షిప్తం చేశాయి. కాని అమలులో మాత్రం ఆవగింజంతైనా చిత్తశుద్ధి లేదు. కాగా యిక్కడి ప్రభుత్వాలూ, ప్రజలూ ఇతర అన్ని ప్రపంచ దేశాల్లోవలె తాము నిర్మించిన తమ దేశశాసనాలను తామే గౌరవించరు, అమలు చేయరు సరికదా వాటిని వక్రీకరించి విపరీతార్థాలతో దోపిడీకి పాల్పడ్తారు. మీరు ఆశ్చర్యపోతారు. అనేక ప్రజాసంఘాలు సర్వేచేసి సమర్పించిన నివేదికల ప్రకారం వర్తమాన భారత రాజకీయాల్లో ఎనభై ఐదుశాతంమంది వీధి గూండాలు, రౌడీషీటర్లు, హంతకులు, నేరచరితులు ఉన్నారు.

వీళ్ళను క్రమంగా ఆ రంగంనుండి తప్పించడం అంతసుళువైన విషయంకాదు. భారత రెండవ స్వాతంత్య్ర సంగ్రామం తరహాలో ప్రజలు ఏ ఊళ్ళోవాళ్ళు ఆ ఊళ్ళో పోరాడ్తే తప్ప ఈ ప్రక్షాళన సాధ్యంకాదు. మొదటి స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌వాడనే శత్రువు స్పష్టంగా కళ్ళెదుటనే కనబడ్తూ ఉన్నాడు కాని ఇప్పుడు కనబడకుండా అవినీతిపరుల రూపంలో అదృశ్యంగా మనలో. మన ప్రక్కన, మన ఇంట్లోనే, మన కుటుంబసభ్యులుగా మన జాతిద్రోహులే కలిసిపోయి ఉన్నారు. కనబడని శత్రువుతో యుద్ధంచేయడం కష్టంకదా.. మీకొక అతి ప్రధానమైన రహస్యం చెబుతాను. చెప్పనా..”
”చెప్పండి..”
”ఈ దేశానికి నిరక్షరాస్యులైన భారత పౌరులతో ఎటువంటి హానీలేదు. కాని చదువుకున్నవారితో కొంత ప్రమాదం, బాగా చదువుకున్నవారితో ఇంకా భారీ ప్రమాదం పొంచివుంది. గత ఇరవై ఏళ్ళనుండి.. హర్షద్‌ మోహతా, కేతన్‌పరేఖ్‌ దగ్గర్నుండీ.. తెల్గీ.. ఈ మధ్య బయటపడ్ట అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల, కమ్యూనికేషన్‌ మంత్రిత్వశాఖ, కార్పొరేట్‌ కంపెనీల దాకా, ఖనిజాలు, గనులు, జలయజ్ఞాలు, ఛత్తీస్‌గడ్‌లో వందయూనివర్సిటీల స్థాపన, మెడికల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీల అనుమతుల్లో వేలకోట్ల అవినీతి. ఇవన్నీ ఏం చెబుతున్నాయి..ఉన్నత విద్యావంతుల్లోనే దొంగలు ఎక్కువగా ఉన్నారని ఋజువు చేస్తున్నాయిగదా. ఔనూ.. హౌటు కర్బ్‌ దిస్‌ ఈజ్‌ ద రియల్‌ ప్రాబ్లమ్‌”
”దీన్ని ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు మీరు..డాక్టర్‌ గోపీనాథ్‌గారు చెప్పండి”
”చాల సింపుల్‌.. మనిషి దొంగతనం చేస్తున్నపుడు దొంగతనాన్నెవరో చూస్తున్నారనే భయం ఉంటే చాలు. దొంగ భయపడి వెంటనే విరమించుకుంటారు. కాబట్టి మనిషిని అనుక్షణం గమనించే నిఘా కావాలి. అమెరికాలో సెటిలైట్‌ సర్వైలెన్స్‌ ఉంటుంది. ఎవనికివాడు నన్ను సిసి కెమెరాలో, ఆకాశంనుండి ఏ సెటిలైట్‌ వ్యవస్థో చూస్తోంది.. పట్టుబడ్తామని ఒళ్ళు దగ్గరపెట్టుకుని వెళ్తుంటారు రోడ్డుపై. యిక్కడకూడా అటువంటి ఈ దొంగనాయకులను వెంటాడే ఓ నిఘా వ్యవస్థ కావాలి. ‘జనసేన’ అదే. అదొక వాచ్‌డాగ్‌.. మా దగ్గర ‘జనసేన’ నిర్మాణం మూడు థల్లో ఉంటుంది. ఒకటి కేంద్రకం. దాంట్లో ఋషులవంటి నూటా ఎనిమిదిమందితో కూడిన సారధ్య బృందం ఉంటుంది. రామం, నేను ముందుంటాం. అధ్యకక్షుడు, కార్యదర్శి.. ఇటువంటి పదవులు లేవు. తర్వాత అంతర్‌వలయం. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు.. అన్ని జిల్లాల కార్యాలయాల బాధ్యులు. శిక్షణా విభాగం, క్రమశిక్షణా విభాగం, రక్షణ విభాగం, గూఢాచార విభాగం, ఆర్థిక విభాగం, విధాన విభాగం, విస్తరణ విభాగం, క్షేత్ర కార్యాచరణ విభాగం.. ఈ విధంగా ఎనిమిది సెక్టార్స్‌. దళాలుంటాయి. ఒక్కో విభాగంలో ఆయా రంగాల్లో నిపుణులైన, సాధికారత కల్గిన వ్యక్తులుంటారు. ఉదాహరణకు ఆర్థిక విభాగముందనుకో.. చార్టర్స్‌ అకౌంటెంట్స్‌, రిటైర్డ్‌ ఫైనాన్స్‌ సెక్రటరీలు, ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌.. ఇటువంటి వాళ్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా మిగతా వాటిల్లోకూడా. ఈ అంతర్‌వలయం అంతా నిరంతర ఉద్దీప్తతతో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, ప్రధానంగా పౌరుల్లో నైతిక విలువలను పెంపొందించడంలో, అనవసరంగా ఈ కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించాలనే దుర్భుద్ది నీకెందుకురా.. ఒక వ్యక్తికి నిజంగా ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు అవసరమా..ఏంజేస్తావ్‌ వీటితో.. వంటి జ్ఞానవికాసాన్ని కల్పించడంలో తలమునకలై ఉంటుంది. దీనికి వెలుపల ఒక బాహ్యవలయముంది. దీంట్లో ఆదర్శ భావాలున్న జనబాహుళ్యం ఉంటుంది. నిజానికి ప్రస్తుతం నాయకులకంటే ప్రజలే ఎక్కువగా కలుషితమై నీతిహీనులై ఉన్నారు. లంచాలు యిస్తారు, తీసుకుంటారు. అవకాశముంటే ఏ నీచమైన పనైనా చేస్తారు. వీడు మనిషికి వందిస్తే వీని సభకొస్తారు. మర్నాడు వాడు నూరిస్తే వాని సభకూ వెళ్తారు. ఉచితంగా ఇస్తానంటే కలర్‌ టి.వి. తీసుకుంటాడు. నగదు బదిలీ తీసుకుంటాడు. సైకిళ్ళు తీసుకుంటాడు. మోటార్‌సైకిళ్ళు, ఉచిత విద్యుత్తు, ఉచిత బియ్యం, ఉచిత బట్టలు.. ఉచితం ఏదైనా సరే.. తీసుకుంటాడు.. చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నమనుకుంటాడు. వీళ్లను సంస్కరించాలి. దేన్నయినా ఈ రాష్ట్రంలోగానీ, ఏ ఇతర రాష్ట్రాల్లోగానీ ఏనాడైనా..ఎవరైనా ప్రజలు దేన్నయినా మాకిది ఉచితంగా ఇమ్మని ఎప్పుడైనా అడిగారా. సిగ్గులేని నాయకులు వాళ్ళ ఓట్లకోసం బూటకపు ప్రజాకర్షక పథకాలను ప్రకటించి పబ్బం గడుపుకున్నారు తప్ప.. ఏ మనిషీ తనకు తానొక బిచ్చగాణ్ణి, నాకిది ఉచితంగా యిమ్మని ఎప్పుడూ అడగడు. ఇది మనిషి ‘రోషాని’కి, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. నీకంటె పెద్ద వెధవాయను నేను అన్నట్టు ఒకణ్ణి మించి ఒకడు ఉచితాలను ప్రకటించి, సబ్సిడీలను పెంచి, కమిషన్‌లను ప్రకటించి ప్రజలను భ్రష్టు పట్టించారు. నిజానికి .. ఇప్పటికీ ప్రభుత్వం ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 20 సబ్సిడీ యిచ్చి విచ్చలవిడిగా కుర్రకారు మోటార్‌బైక్స్‌పై పిచ్చితిరుగుడు, తిరగడానికి యిన్ని కోట్ల లీటర్ల పెట్రోల్‌ను.. రోజుకు ఇన్ని కోట్లరూపాయల సబ్సిడీని భరించడం అవసరమా. ప్రజలకు ఒకసారి తేరగా ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత అవి ఇవ్వడం మానేస్తే రేపు వాళ్ళే తిరగబడి గొడవలు చేస్తారు. ఈ దిక్కుమాలిన ప్రజాకర్షక పథకాలు వద్దు మహాప్రభో అని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, భారతీయ ఆర్థిక మండలి, వంటి సంస్థలు, పౌరహక్కుల, మానవ హక్కుల సంఘాలు, అమర్త్యసేన్‌ వంటి మేధావులు ఎప్పట్నుండో నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకుంటున్నారు. తోడుకుని తింటానికి ఆరోగ్యశ్రీలు, పద్దెనిమిదేండ్ల పోరగాండ్ల ఓట్లు దండుకోడానికి ఫీజ్‌ రీ ఎంబర్స్‌మెంట్‌, రైతుల ఓట్ల కోసం ఉచిత విద్యుత్తు.. విద్యుత్తును ఉచితంగా ఇస్తూంటే ఊళ్ళలో కొందరు రైతులు మోటార్‌ పంప్‌ ఆన్‌ చేసి పోతే రాత్రంతా అది నడుస్తూనే ఉంటుంది. అరాచకమైపోతోంది ఎన్నోచోట్ల.. అటుదిక్కు ఏదోరకంగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో నలభైశాతం అప్పులు, వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. కాబట్టి మళ్ళీ ఆదాయం సంపాదించుకునేందుకు నీతిమాలిన మద్యం వ్యాపారం. పదివేల కోట్ల కోసం జనానికి వాకిట్లోనే మద్యం అందుబాటు. బడి ఒడిలో, దేవాలయం ముంగిట ఎక్కడబడ్తే అక్కడ బార్లు, బ్రాండీషాపులు. పదివేలకోట్లు రాబడైతే.. మంత్రులు, ఎమ్మెల్యేలు.. అందరూ కలిసి ముప్పయ్యెనిమిది వేలకోట్లు ప్రజలనుండి పిండి దోపిడి.. సీసాపై యాభై రూపాయల ఎమ్మార్‌పి ఉంటే బహిరంగ దౌర్జన్యంతో డెబ్బయ్‌ రూపాయలకు అమ్మడం.. సిగ్గు చచ్చి ఎక్సైజ్‌, పోలీస్‌, నిఘా వ్యవస్థలు. సిండికేట్స్‌, మాఫియాలు, గూండారాజ్యాలు.. ఏమిటి.. ఏమిటిదంతా. పుచ్చిపోయింది వ్యవస్థ. అక్కడ ఒకవైపు ఆర్థిక శాఖే కదిలి మంత్రుల ముందు చేతులెత్తి నిలబడి ఈ ప్రభుత్వాలను నడుపలేమిక.. అని ఇంట్లో చారెడు బియ్యంలేక పిల్లలను పస్తులుంచవలసిన స్థితిలో ఉన్న ఇల్లాలులా రోదిస్తోంది.. ఏం జరుగుతోంది.. ఎటు పోతున్నాం మనం.. యిది.. ఈ దుష్టమైన భూమిపుండువంటి దురవస్థను ఎదుర్కోడానికి.. రిటైర్డ్‌ స్కిల్స్‌.. డాక్టర్లు, ఇంజినీర్లు, సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, దేశస్పృహ ఉన్న కత్తుల్లాంటి యువకులు, ఉద్యమకారులు.. వీళ్ళతో నిండిన బాహ్యవలయం. మొత్తం ‘జనసేన’ లక్షమంది పారదర్శకంగా జనసేన ‘కేంద్రకం’ ఈ లక్షమందిని పోషిస్తుంది – నడిపిస్తుంది.. నడుస్తుంది. ఈ సమాజాన్ని కొంగ్రొత్త మార్గంలో మున్ముందుకు తీసుకెళ్తుంది. కొత్త చరిత్రను రాస్తుంది.” చెబుతున్నారు డాక్టర్‌ గోపీనాథ్‌.

ఆనందం, ఆవేశం పట్టలేక యాంకర్‌ ఆనందరావు చప్పట్లుకొట్టాడు.. ”నిజంగా వ్యక్తిగతంగా నాక్కూడా ఎంతో సంతోషంగా ఉందిసార్‌. ఈ మా టి.వి. ద్వారా కొన్ని వందలమంది మేధావులను, పాత్రికేయులను, సూడో రాజకీయ విజ్ఞులను, విశ్లేషకులను ఇంటర్వ్యూ చేశానుగదా సార్‌ కాని ఇంత ధైర్యంగా, ఇంత ఖచ్చితంగా, యింత నిబద్ధతతో ఒక ప్రణాళికను తయారుచేసుకుని ముందుకొచ్చినవాళ్ళను చూడలేదు.. యింకా చెప్పండి..”
రామం అందుకున్నాడు.
”మన రాష్ట్రంలో అసలు పరిశ్రమలున్నాయా. యువత ఉపాధి సంగతేమిటి. విదేశీ నియంత్రణంలో ఉన్న ఎంఎన్‌సిలకు అనుబంధంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు తప్పితే ఈ రాష్ట్రంలో ఏవైనా భారీ పరిశ్రమలు పనిచేస్తున్నాయా ఆరోగ్యంగా, ఆర్థిక పరిపుష్టతతో. సాఫ్ట్‌వేర్‌ బహుళజాతి కంపెనీలు సామ్రాజ్యవాద రాజకీయాల్తో తమ తలుపులను భారతదేశంలో మూసేస్తే.. యిక్కడి ఇన్ని లక్షలమంది గతి ఏమిటి. ఎక్కడో స్విచ్‌ ఆఫ్‌ చేస్తే యిక్కడ లక్షల లైట్లారిపోతాయికదా. ఒకవైపు చైనా, కొరియా, థాయ్‌లాండ్‌, జపాన్‌ లాంటి దేశాలు పరిశ్రమలను ప్రపంచదేశాల గుండెల్లోకి విస్తరించుకుంటూపోతూంటే.. మన దేశీయులు చేవచచ్చి ఎందుకింత దద్దమ్మలుగా మిగిలిపోతున్నారు. వీళ్ళకెంతసేపూ కమీషన్ల యావతప్ప అసలు దేశం స్పృహలేదు. ఒక్క బొమ్మల పరిశ్రమ చూడు.. ప్రపంచమంతా మేడిన్‌ చైనా. అమెరికాలో చెప్పులు, పెన్నులు, కీచైన్‌లు, ఆహారం, చాక్లెట్స్‌, ఐస్‌క్రీం, కార్లు, మెమరీచిప్స్‌, బ్యాటరీలు.. అరెరె.. ఎన్ని.. ఎన్నెన్ని అన్నీ మేడిన్‌ చైనా.. కాని అమెరికావాడు ప్రపంచపోలీస్‌ కాబట్టి.. యిక్కడేదైనా అమ్ముకోండి.. కాని నాకు టాక్స్‌ కట్టండి. నా ఖజానాను నింపండి. నేను చెప్పిన మాట వినండి.. అని ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాడు. శాసిస్తున్నాడు. యిక్కడ మనం అద్భుతమైన మానవ వనరులుండి, సహజ ప్రకృతి వనరులుండి, అడవులుండి, నదులుండి, పర్వతాలుండి.. అన్నీ ఉండి అవినీతిలో కూరుకుపోయి మనను మనం గొంతులు పిసుక్కుంటున్నాం.. యిక్కడి ప్రజలకు నిజమైన స్పృహ లేకుండా చేసి ఈ పరమ దుర్మార్గ రాజకీయనాయకులు దేశద్రోహానికి తలపడ్తున్నారు. మనం భూమిపుండులో కూరుకుపోతున్నాం. ఇప్పుడు అర్జంటుగా ఏదో ఒకటి జరగాలి.. యిక్కడి భవిష్యత్‌ దృష్టిలేని నాయకులు ఒకటివెంట ఒకటిగా చేస్తున్న తప్పులవల్ల కోలుకోలేనంతగా ప్రజాసామాజికారోగ్యం ఆల్‌రేడీ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో ఆరువందలయాభై ఇంజినీరింగ్‌ కాలేజీలు, వందల సంఖ్యలో ఎంసిఎ, ఎమ్‌బిఎ, ఫార్మసీ కాలేజీలు అవసరమా. యాడాదికి ఏమాత్రం నాణ్యత, ప్రమాణాలు లేని రెండు లక్షల యాభైవేల యువకులు ఉద్యోగానికి పనికిరాని ‘హ్యూమన్‌ గార్బేజ్‌’గా మార్కెట్లోకి రావడం, నిరుద్యోగులై, దిక్కుతోచక రోడ్లమీద నింగిచూపులు చూచుకుంటూ వైట్‌ కాలర్డ్‌ లేబర్‌గా మారవలసిన దుస్థితి ఏమిటి.. ఎందుకు..రాష్ట్రం.. సమాజ రూపకల్పన, భవిష్యత్‌ దార్శనికత.. ఇవన్నీ పూర్తిగా లోపించి సమాజాన్ని అసమర్థ నాయకులు చీకట్లోకి నడిపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయ గుండాయిజం, కాన్సిట్యూషన్‌ వైజ్డ్‌ మాఫియా యిక్కడ సమాజాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తోంది. మేల్కోవాలి..మనం వెంటనే మేల్కోవాలి. లేకుంటే యిక శాశ్వత సమాధే.”
”కాని అహింసాయుతంగా.. మీరు మీ లక్ష్యాలను సాధించడం సాధ్యమయ్యే పనేనా..”
”తప్పకుండా సాధ్యమౌతుంది.. హింసతో నక్సలైట్లు నలభై ఏళ్ళుగా చేయలేని పనిని గత రెండునెలల్లో మేము చేయడం మీరు స్వయంగా చూస్తున్నారుగదా. తుపాకి ఏకకాలంలో ఒక వ్యక్తిని మాత్రమే చంపుతుంది. కాని అహింసాయుతంగా మేము చేపట్టిన రాజ్యాంగసమ్మత ప్రజాస్వామ్య ప్రక్షాళన, పరివర్తన వ్యక్తిని చంపదు సరికదా సమూలంగా, శాశ్వతంగా మారుస్తుంది. చట్టప్రకారం శిక్షిస్తుంది.. ఐతే.. విధిలేని పరిస్థితుల్లో.. హిందూ ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నట్టు.. యథా యధాహి ధర్మస్య.. తరహాలో.. దుర్మార్గుల దౌర్జన్యం హద్దులు మీరినపుడు, అవధులు దాటినపుడు ధర్మాగ్రహ ప్రదర్శన, దుష్టశిక్షణ అనివార్యమౌతుంది. నరకాసురవధ హత్యకాదు. దుష్టసంహారమౌతుంది. అలాగే దయ్యాలకు వేదపాఠం వినిపిస్తే ఎదురుదాడి చేసినట్టు. ఈ మాఫియాగ్యాంగ్‌లు మాపై ‘జనసేన’పై దాడిచేస్తాయని తెలుసు. అట్టి స్థితిని ఎదుర్కొనేందుకు మేము సుశిక్షితుమై, సశరీర సాయుధలమై ఉన్నాం. మా యువకుల ఒక్కో శరీరాంగం ఆయుధమే. ధర్మం దారితప్పినపుడు అవసరమైతే మనిషిని నిర్మూలించడానికి.. సీనియర్‌ సిటిజన్స్‌తో నిండిన.. అంటే వాళ్ళు డెబ్బయ్‌కిపైగా సంవత్సరాలు తృప్తిగా జీవించారు. జీవితానికి ఒక అర్ధవంతమైన ముగింపును కోరుకుంటున్నారు.. ఊర్కే యింకా యింకా అలా రాయిలా, రప్పలా జీవించి ఏమీ ప్రయోజనంలేదని నిర్ధారించుకున్న వయోవృద్ధులు ఒక ‘ఆత్మార్పణ దళం’గా మావద్ద ఉన్నారు. అవసరమైతే, అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళను బ్రహ్మస్తంగా ప్రయోగిస్తాం. ఎవడైనా ఒక పరమచంఢాలుడైన రాజకీయ నాయకుడు ఎవరిమాటా విననప్పుడు ఒక వరిష్ట ‘జనసేన’ వృద్ధ కార్యకర్త బహిరంగంగా, ప్రజల సమక్షంలో వాన్ని నిర్మూలించి వాడికి ‘మరణశిక్ష’ను అమలుచేసి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా లొంగిపోతాడు. వ్యూహాత్మక ఎత్తుగడలే అవసరమైనపుడు..”

టి.వి. ప్రసారం కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రం రాష్ట్రమంతా ఆ క్షణాన యిక ప్రళయించబోతున్న సముద్రాన్ని చూస్తున్నట్టు.. అప్రతిభులై మహదానందంతో ప్రసారాన్ని వింటున్నారు. వీక్షిస్తున్నారు.
అప్పుడాక్షణం.. చరిత్ర ఒక కొత్త పేజీని సింగారించుకుంటోంది.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -16 వ భాగం

( గత వారం తరువాయి )

16

ముందురోజు రాత్రి హైద్రాబాద్‌లో ‘జింఖానా గ్రౌండ్స్‌’లో జరిగిన ‘జనసేన’ అవగాహన బహిరంగ సభ ఎంతో విలక్షణంగా, విజయవంతంగా జరగడం రామంకు, గోపీనాథ్‌కు, క్యాథీకి, శివకూ.. ప్రధానంగా సలహాదారులుగా ఉండి వెన్నుతట్టిన ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తిగారికి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు, రాజీవ్‌శర్మ , జగన్నాథంలకు, మానవ హక్కుల సంఘం రాములు సార్‌కు, వేదికపై మాట్లాడిన యితర బాధ్యులకు .. ఎంతో ఆత్మతృప్తినీ, ఉత్తేజాన్నీ కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, మౌనంగా పరిస్థితిని గమనిస్తూ కూర్చున్న పరిశీలకుల్లో, భవిష్యత్తును అంచనావేస్తున్న వ్యూహకర్తల్లో ఒకరకమైన ఉత్సుకతను రేకెత్తించింది. భారత స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్నపుడు గాంధీ ఉన్నట్టుండి ‘అహింస’ సిద్ధాంతంతో ప్రతిఘటనను, సహాయ నిరాకరణను ప్రకటించిన రోజు తలలుపండిన రాజకీయ పోరాట యోధులు అందరూ పెదవివిరిచి, ఒకింత దాన్ని ఒక పనికిరాని వెకిలిచేష్టగా వ్యాఖ్యానించి, అబ్బే.. గీ గిచ్చుడు చర్యతో ఏనుగు మాటవింటుందా, అంకుశం పోటుపడాలిగాని.. పద్దతిలో వెటకారం చేసి గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత.. ఊహించని నిప్పురవ్వ మహారాజ్యాన్ని భస్మీపటలం చేసి రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తుంటే విస్తుపోయి తమ తప్పుడు అంచనాలకు సిగ్గుపడి తలలువంచుకున్నారు.
నిన్న జరిగింది అదే.. దాదాపు నెలరోజుల క్రితం ఒక ఊహకందని, ఊహిస్తే నమ్మశక్యంగాని, అహింసాయుతమైన ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్నీ, జనాన్ని ప్రశ్నించే పదునైన ఆయుధంగా మార్చి అవినీతి రాక్షసిపైకి ప్రయోగించే ఒక మహత్తర సాధనంయొక్క స్వభావాన్ని రామం తన ఆలోచనగా ప్రకటించినపుడు చాలామంది దాన్ని ఒట్టి అపరిపక్వ ఆలోచనగా కొట్టేశారు. అదసలు సాధ్యమయ్యేదేనా ఇది. అని కొందరు పరిహసించారు కూడా. చీమ ఏనుగును కుట్టి ఏం సాధిస్తుంది.. అని పెదవి విరిచారు. సాయుధులైన నక్సలైట్లు, అనేక ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమకారులు గత నలభై, యాభై ఏళ్ళుగా ప్రతిఘటిస్తూ ఈ ఘనీభవించిన అవినీతి పర్వతాన్ని ఒక ఇంచ్‌కూడా కదిపి పెళ్ళగించలేంది.. ఈ ప్రజాచైతన్య, ప్రక్షాళన వంటి సున్నిత కార్యక్రమాలతో ఏం జరుగుతుందిలే అని హేళన కూడా చేశారు కొందరు.
కాని మనిషి దుఃఖించాలంటే ఒంటిని గాయపరిచి హింసిస్తే లాభంలేదు. వాని హృదయం చలించి కరిగినప్పుడు మాత్రమే కన్నీటి చుక్క పొటమరిస్తుంది. అది ఎంతో గూఢమైన, సత్యమైన పరమ రహస్యం. ఆ రహస్యం నిన్న లక్షలమందిని ఏకకంఠంతో కదిలించే మహాశక్తిగా మార్చి చూపి ఊర్కే ప్రేక్షకుల్లా గమనిస్తున్న మేధావుల్ని దిగ్భాంత్రుల్ని చేసింది.
ఒక బిందువువంటి శుద్ధ ఆలోచన ఊహగా ఆరంభమై, భావంగా ఎదిగి, ఆలోచనగా పాదుకుని, ఆచరణగా విస్తరించి విస్తరించి, నియమాలుగా, సూత్రాలుగా,సిద్ధాంతాలుగా పరివర్తిన్నవేళ, ప్రయోగం ఫలించి అద్భుతమైన ప్రభావాలను ప్రసరించిన వేళ.. బిందువే ఒక సింధువును సృష్టిస్తూ తవనెంట లాక్కెళ్తున్నవేళ..,
”యిన్ని లక్షలమంది జనం తామంతట తాము.. ఎవరికి వారు. రాష్ట్రం నలుమూలల నుండి.. తమ స్వంత ఖర్చులతో.. స్వచ్ఛందంగా నాటి సభకు తరలి రావడం. ఎర్రటి ఎండలో గంటలకొద్దీ ఓపిగ్గా కూర్చొని.. ఎక్కడా జనాన్ని రెచ్చగొట్టేలా కాకుండా ఆలోచింపజేసే వక్తల ప్రసంగాలను విని ఆకలింపు చేసుకుని మమేకం కావడం. యిదంతా నన్ను పులకింపజేస్తోంది రామం. నిజంగా ఒక చిన్న అతి సున్నితమైన ఆలోచనను బ్రహ్మస్త్రంగా మలచి ప్రయోగించి చూపావయ్యా.. యామ్‌ ఎక్ట్స్రీమ్లీ హాపీ.. ఇప్పుడు మన ‘జనసేన’ బాధ్యులందరికి కోటి ఏనుగుల బలమొచ్చింది.. యిక పడగెత్తిన ఈ జనమహాసముద్ర తరంగ తురంగ ఉధృతిని నిలువరించడం ఎవరితరమూ కాదు.. యిప్పటికే బయట అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ప్రశ్నించేవాడూ, అడిగేవాడూ, నిలదీసేవాడూ లేనంతకాలమే ఎవని ఆటలైనా సాగేది. యిక ఈ దుష్టచదరంగం ఆటకు చెక్‌ పడ్డది..డాక్టర్‌ గోపీనాథ్‌ మాటలు గలగలా గోదావరీ ప్రవాహంలా సాగుతున్నాయి. ఆయన ఒక హర్షాతిరేక తాదాత్మ్యతలో మునిగిపోయాడు.
జనపథంలోని జనసేన ప్రధాన కార్యాలయం ప్రధాన సభామందిరంలో ఒక వలయసభ ఏర్పాటు చేయబడిందారోజు.. దానికి ఒక అధ్యకక్షుడు, ఒక అతిథి, ఒక వక్త.. అలా ఏవిధమైన సాధారణ సాంప్రదాయాలూ లేవు. మనుషులు.. మనసులు కలవడం, అభిప్రాయాలను, ప్రతిపాదనలను, అంతరంగాలను చర్చించుకోవడం, పంచుకోవడం.. ప్రజాస్వామ్యయుతంగానే కాని నిబద్ధతతో కూడిన క్రమశిక్షణతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం.. యిదీ అక్కడ ఇన్నాళ్ళుగా జరుగుతూ వస్తున్నది.. ఆ రోజూ జరుగవలసిఉన్నది కూడా.
ఆ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నేపథ్యంలో ఒక్క బోసినవ్వులు చిందిస్తున్న గాంధీ పటం మాత్రమే ఉంది. పటం క్రింద ఆనాటి సమావేశ లక్ష్యం ”ప్రక్షాళన సభ”అని బేనర్‌ ఉంది. రౌండ్‌ టేబుల్‌ మధ్య టేబుల్‌తో సమాన ఎత్తులో ఉన్న అందమైన చెక్కబల్లపై రెపరెపలాడ్తూ భారత జాతీయపతాక  హుందాగా ఎగుర్తోంది.
గత ఇరవైరోజుల క్రితం జనసేన ఎంపికచేసిన నూటా ఎనిమిది మంది ఋషులవంటి స్వార్థరహిత..రామం ఎన్నో ఏళ్ళుగా తన నిఘా విభాగాన్ని ఉపయోగించి, అధ్యయనాలు జరిపించి గుర్తించినవారే చాలామంది.. వ్యక్తులతో కూడిన ‘మార్గదర్శక సభ’  ఆరోజు సమావేశమైంది. అతి ప్రధానమైన ఆదేశిక సూత్రాలను రూపొందించి ఆచరణ విధానాలతోసహా ‘జనసేన’ మూల కార్యకర్తలకందించడం, అమలులో ముందుండి జనసేనకు నాయకత్వం వహించడం, కావలసివచ్చినపుడు ఏ అధికారినైనా, శత్రువునైనా, ఏ ప్రత్యర్థినైనా నిలువరించి ఎదుర్కోవడం.. సంస్థలో ప్రాణసమానమైన క్రమశిక్షణను స్వయంగా పాటిస్తూ, తమ విభాగంచే పాటింపజేయడం..యివీ మార్గదర్శక సభ సభ్యులు చేసేపని.
క్రమశిక్షణ.. సంయమనం.. సహనం. యివి ‘జనసేన’ యొక్క ప్రధానమైన ప్రాణసూత్రాలు.

ekkadi-April10
ఎవరికీ స్వార్థంలేకపోవడం, అధికార కాంక్షలకు కారణభూతమైన ఏ పదవులూ సంస్థలో లేకపోవడం, క్రమంగా మనిషిని ‘లౌల్యా’నికి అతీతంగా తయారు చేయగల ఉద్యమసంస్కారం ప్రతి కార్యకర్తలోనూ నిండి ఉండడం.. యివి అంకితభావం వల్ల అందరికీ సంక్రమించిన సులక్షణాలు.
సరిగ్గా నూటా ఎనిమిదిమంది ఉన్న ఆ ‘మార్గదర్శక సభను ప్రారంభిస్తూ, రామం లేచి నిలబడి.,
”మిత్రులారా.. ఈ నెలరోజుల తర్వాత మనం యిప్పుడు ఒక అతిముఖ్యమైన కీలకథకు చేరుకున్నాం. ఈ మాసం కాలంలో మనం ముందే అనుకున్నట్టు మన జనసేన సంస్థను ప్రజల్లో భవిష్యత్తులో అందరికీ ప్రాణసమానమైన అవసరంగా ప్రతిష్టించి వాళ్ళ హృదయాల్లో స్థాపించగలిగాం.. యిది సాధారణమైన విజయంకాదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నూటా అరవై కార్యాలయాలతో దాదాపు నాల్గు లక్షలపైచిలుకు సభ్యులు సైనిక సమానులైన కార్యకర్తలుగా ఉన్నారు. మనకు యిప్పుడు ‘జనసేన’ ఒక అజేయమైన సంస్థగా నిలబడ్డది. ఆకాశమంత ఎత్తులో. యిక మిత్రులారా.. మనం కార్యాచరణలోకి దూకబోతున్నాం. ప్రజలు అహింసా పద్ధతులను పాటిస్తూనే శాంతియుతంగా ఉద్యమిస్తూ సంఘటితంగా ఎన్నెన్ని అద్భుతాలు చేసి చూపించగలరో ప్రత్యక్షంగా రేపటినుండి మనం ఋజువు చేయబోతున్నాం. ‘ప్రక్షాళన’ యొక్క రూపురేఖలు మన కార్యాచరణ ఎలా ఉంటుందో పెద్దలు ‘అగ్ని’ వార్తా చానల్‌ అధినేత మూర్తిగారు మనందరికి వివరిస్తారు. మూర్తిగారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.” అని రామం ప్రశాంతంగా కూర్చున్నాడు కుర్చీపై,
ఆదేశికసూత్రాలలో, ప్రాథమిక జనసేన కార్యకర్తల శిబిరంలో నాయకులెప్పుడూ అతి తక్కువగా, సూటిగా, క్లుప్తంగా మాట్లాడాలని ఒక ప్రధాన అంశంగా శిక్షణ యివ్వబడింది. దాన్ని ప్రతిఒక్కరూ పాటిస్తారు.
మూర్తిగారు చేతిలో కొన్ని కాగితాలతో గంభీరంగా లేచి నిలబడి తన ముందున్న మైక్‌ను సవరించుకుని.,
ఆ హాల్‌లో సౌకర్యాలన్నీ అత్యాధునికంగా ఉన్నాయి. రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతున్న స్థలానికి ఎదుట ఒక పెద్ద ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ ఉంది. ప్రక్కనే యల్‌సిడి స్క్రీన్‌ ఉంది. ఇటు ప్రక్క మాట్లాడ్తున్న వక్త యొక్క ఫీలింగ్సు, హావభావలు స్పష్టంగా కనబడ్డానికి అతని లేజర్‌ ఇమేజ్‌ను చూపించే మరో తెర ఉంది. సభలో పాల్గొంటున్న ప్రతి సభ్యుని ముందు ఒక్కొక్క ఇండివిడ్యువల్‌ మైక్‌ ఉంది. హాల్‌ మొత్తం సెంట్రల్లీ ఏర్‌ కండీషన్డ్‌. కమ్యూనికేసన్‌ సౌకర్యాలు, డాటా సేకరణ, విశ్లేషణ, రాష్ట్రంలోని వందల కార్యాలయాలతో ఏ వ్యక్తితోనైనా సంధానించబడ్డానికి అత్యాధునిక ఏర్పాట్లు.. అన్నీ ఏ ప్రభుత్వ లేదా అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్‌ కంపెనీల కంటే కూడా ఆధునాతనంగా ఉండాలనీ క్యాథీ మొదట భావించి తను స్వయంగా పర్యవేక్షించి ఆ భవనాన్ని నిర్మింపజేసింది.
ఎదురుగా లేజర్‌ తెరపై మూర్తిగారి పొట్రేట్‌.
ఎల్‌సిడి స్క్రీన్‌పై ఒక విండో ఓపెనై.. జనసేన.. డాటా బ్యాంక్‌.. అని లోగోతో సహా ఒక స్క్రీన్‌ డిస్పే ్ల ఐ..,
అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
”మిత్రులారా.. ఒక చిన్న కథ చెబ్తా చాలా క్లుప్తంగా. ఒక తెలివైన భార్య, బ్రతుకనేర్చిన భర్త తాము నలభై ఏండ్ల వయస్సున్నపుడు కొన్ని బ్యాంకులను ట్రాప్‌ చేసి బ్యాంక్‌ అధికారులకు విపరీతంగా లంచాలిచ్చి నాల్గు కోట్ల రూపాయలను అప్పుచేసి అత్యాధునికమైన సర్వసౌకర్యాలున్న భవనాన్ని, కార్లనూ. అన్నీ సమకూర్చుకుని హాయిగా బ్రతకడం మొదలెట్టారు. నాల్గుకోట్ల రిపేమెంట్‌ టైం ముప్పయ్యయిదేళ్ళు, గ్రేస్‌ పీరియడ్‌ మరో పదేళ్ళు.. వడ్డీరేటు.. ఎంతోకొంత.. వాళ్ళకు తెలుసు ఈ నలభై ఐదు ఏండ్లకాలంలో తాము తప్పకుండా చచ్చిపోతామని. లంచాలు తీసుకుని అప్పిచ్చిన బ్యాంక్‌ అధికారులకూ తెలుసు నలభై ఐదేండ్ల తర్వాత తాము ఉద్యోగాల్లో ఉండమని.. నలభై ఏండ్ల తర్వాత.. ఈ పెళ్ళాం మొగులూ హాయిగా బ్రతికి హాయిగా చచ్చిపోయారు. బ్యాంక్‌ అధికారులు ఉద్యోగ విరమణ చేసి హాయిగా వాళ్ళూ చచ్చిపోయారు. చెల్లించవలసిన అప్పుల క్రింద నలభై ఏండ్ల తర్వాత వాళ్ళ పిల్లలిద్దరు అన్ని ఆస్తులనూ అమ్మినా అప్పులే తీరక, వడ్డీలు కట్టలేక.. ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు పిచ్చోడైపోయాడు.
మిత్రులారా.. అర్థమైందనుకుంటూ ఇపుడు నేను చెప్పింది.. ఎలా పసిగట్టారో గాని మన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులు బంగారు బాతువంటి ప్రపంచ బ్యాంక్‌ సంగతిని పసిగట్టారు. దాన్నుండి గత ఇరవై ఏండ్లలో ఎన్ని లక్షలకోట్లను తీసుకుని తిని మనకు ఎంత అప్పును వారసత్వంగా మిగిల్చిబెట్టారో ఇప్పుడు నేను చెబితే జనం గుండె పగిలి చచ్చిపోతారు. మంత్రులందర్ని ముఖాలపై ఉమ్మేస్తారు. ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులను చెప్పులతో కొడ్తారు.”
తెరపై వివరాలు కనబడ్డం మొదలైంది.
1999- ఎపిఇర్‌పి ప్రపంచబ్యాంక్‌ నుండి రూ. 1298.56 కోట్లు, మళ్ళీ రూ. 364 కోట్లు కర్నూల్‌ కడప ప్లాన్‌ కింద రూ. 555 కోట్లు, తుంగభద్ర రూ. 45 కోట్లు, తెలుగు గంగ రూ. 450 కోట్లు, ఖమ్మం.. వరంగల్‌ మరియు కోస్తా జిల్లాలకు రూ. 123.8 కోట్లు, యస్‌ఆర్‌బిసి క్రింద 939.85 కోట్లు, జూరాల, సోమశిల, సాగర్‌ ప్రాధాన్యతల పనికి రూ. 1095 కోట్లు.. చిత్రావతి నది రూ 78 కోట్లు, గన్నవరం రు. 34.8 కోట్లు, నిర్వాసితుల ఆరక్షణ క్రింద రూ. 136.18 కోట్లు, రు782 కోట్లు …యిలా చదివి చదివి మన నోరుపోతుంది. నా దగ్గర ప్రపంచ బ్యాక్‌, ఇంటర్నేషనల్‌  మానిటరీ ఫండ్‌, జపాన్‌ వంటి దేశాలనుండి తెచ్చిన అప్పుల జాబితా వివరాలు ముప్పైరెండు పేజీల నిండా ఉన్నాయి. వీటిని చూస్తే కంపరమెత్తుతోంది.
ఐతే…. మిత్రులారా… పెద్ద పెద్ద పరిశ్రమలు, దేశాలు అప్పుచేయకుండా ఎలా నిధులు సంపాదిస్తాయి. ఎలా సంక్షేమ పథకాలను చేపడ్డాయి  …అనే ప్రశ్నకు ఆర్థికశాస్త్రం ఏమంటోందంటే.భారీ ఋణాలనెప్పుడు ‘ఉత్పాదక రంగం’ కోసం చేయమంటోంది. ఉదాహరణకు.. ఒక ఉక్కు కార్మాగార నిర్మాణం కోసం వేయికోట్ల అప్పుచేస్తే.. అది ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత లాభాలతో అప్పు చెల్లించవచ్చు. కాని అనుత్పాదక రంగం కోసం అప్పు చేస్తే అవి శిరోభారమై వ్యవస్థను తినేస్తాయి.
ఐతే ఈ ఇర్రిగేషన్‌ ప్రాజెక్టుల క్రింద, రోడ్లు, ఆరోగ్యాభివృద్ధి, మురుగు కాల్వల అభివృద్ధి- మరమ్మత్తులు, వంతెనలు, విద్య.. ఆధునీకరణ.. ఇటువంటి అవ్యవస్థ రంగాల కోసం ఈ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు అప్పుతెచ్చి మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఐఎఎస్సాఫీసర్లు, ఇంజినీర్లు, మున్సిపల్‌స్థాయి నాయకులు.. అందరూ బినామీ పేర్లమీద కాంట్రాక్టర్లయి, సప్లయర్లయి, డెవలపర్సయి, కన్‌స్ట్రక్టర్లయి.. అంతా పంచుకు తినడమే.. పోనీ ఆ చేసిన కొద్దిపాటి పనుల్నైనా నాణ్యంగా, ప్రామాణికంగా చేస్తారా అంటే అదీలేదు. అంతా నాసిరకం. సిమెంట్‌ లేదు, ఇసుక లేదు. స్టీల్‌ లేదు.. అంతా దుమ్ము, దుబ్బ, రోత.. లోతుకుపోయి చూస్తే తెలుసుకుని గుండెలు పగిలి చస్తాం మనం.
పాపం.. మహానుభావులు.. కె. కన్నబీరన్‌, కె. బాలగోపాల్‌ 14 డిసెంబర్‌ 2003న ప్రపంచ బ్యాంక్‌కు సవివరంగా ఒక లేఖ రాశారు.. యిక్కడి అవినీతికర పరిస్థితులను సవివరంగా వివరిస్తూ అయ్యా మహాప్రభో మీరిచ్చే దీర్ఘకాలిక కోటానుకోట్ల అప్పులను మా వాళ్లు పంచుకుని, నంజుకుని తింటున్నారు. మీరు మీస్థాయిలో తగుమోతాదులో లంచాలనుతీసుకుని యిస్తున్న లక్షల కోట్ల ఋణాలను ఇకనైనా ఉదారంగా మా నెత్తిన రుద్దడం ఆపేయమనీ, మమ్మల్ని ఇంకా ఋణాల ఊబిలో ముంచవద్దనీ వేడుకున్నారు. నోబుల్‌ బహుమతి గ్రహీత. అమర్త్యసేన్‌ కూడా భారతదేశంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ నుండి పైరవీ చేసి తెచ్చుకుంటున్న అప్పు నిధులను స్వాహా చేస్తున్నాయి గానీ సక్రమంగా ఉపయోగించడం లేదనీ.. అందువల్ల యిక అప్పులీయడం దయచేసి బంద్‌ చేయండనీ అభ్యర్థించాడు. కాని ప్రపంచబ్యాంక్‌ వాడింటాడా.. కమీషన్లు తీసుకుని అప్పివ్వడం వానికిష్టం.. అప్పుచేసి పంచుకుతినడం యిక్కడ వీనికిష్టం.. అదీ తంతు.
ఐతే.. యిప్పుడు సరిగ్గా ఈ దౌర్భాగ్య దయనీయ స్థితిపైన మనం మన ప్రజాచైతన్య బాంబు పేల్చి మన మొదటి యుద్దాన్ని ప్రకటించబోతున్నాం.
మిత్రులారా జాగ్రత్తగా వినండి.. యిప్పుడు నేను చెప్పబోయేది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా.. కోట్లాది రూపాయల ప్రాజెక్ట్‌లుగా.. పద్దెనిమిది ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, ఇరవై ఆరు మేజర్‌ నేషనల్‌ రోడ్లనిర్మాణ పనులు, పద్దెనిమిది వంతెనల నిర్మాణాలు, ఇరవై ఎనిమది వివిధ మైనింగు ఆపరేషన్స్‌, పద్దెనిమిది మున్సిపాలిటీలలో ప్రపంచ బ్యాంక్‌ నిధులతో మురికివాడల అభివృద్ధి పనులు, ఎనిమిది గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకాలు, ఆరు పేద వృత్తిదారులకు ఉపకరణాల పంపిణీ పథకాలు.. ఇలా మొత్తం నూటా ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువకు తక్కువలేని పనులు అతి రోతగా, నాసిరకంగా, పంచుకుని మనం మనం తిందాం తరహాలో జరుగుతున్నాయి. వాటి పూర్తి వివరాలు యివిగో యివి.
ఎదుట ఎసిడీ స్క్రీన్‌పై ఒక్కో విండో ఒక ప్రాజెక్ట్‌ వివరాలు స్లైడ్‌షో వలె అంకెలతో సహా చూపిస్తోంది.
మనం ఈ నూటా ఎనిమిది ప్రాజెక్టులకు నూటా ఎనిమిది ‘జనసేన’ కమిటీలను ఆ పనులు జరుగుతున్న స్థలానికి దగ్గర్లో ఉన్న మన కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో.. ఆయా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఎక్స్‌పర్డ్‌ కమిటీ సారథిగా ఉంటాడు. ఉదాహరణకు..వరంగల్లులో ఎన్‌హెచ్‌ సెవెన్‌లో తొంభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌నుండి నూటా నలభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌ వరకు మొత్తం యాభై కిలోమీటర్లు రోడ్‌ లేయింగు వర్క్‌.. దీనికి.. ఇరవై ఎనిమిదిమంది జనసేన సభ్యులతో కలిపి కమిటీ వేస్తున్నాం. చైర్మన్‌ జి.పురుషోత్తమరావు. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌. ఆర్‌ అండ్‌ బి. రోడ్డు దాని పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలిసినవాడు. మరొక ఎమ్‌.టెక్‌ స్ట్రక్చర్స్‌ చదివిన యువ విద్యార్థి నాయకుడు ఆర్‌. గోఖలే ఉపసారథి. ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ మురళీమనోహర్‌ వ్యవహర్త. ధర్మసాగర్‌ ఇండిపెండెంట్‌ ఎం.పి.టి.సి., ఎమ్మే చదివిన యాదరిగి, ఇతరేతర యువకులు మొత్తం ఇరవై ఎనిమిది మంది టీం యిది.
మన దగ్గర ఈ ప్రాజెక్ట్‌, ఫండ్స్‌ వివరాలు.. అవి ఏ నాబార్డ్‌ శాంక్షన్‌ క్రింద విడుదలయ్యాయి, మొత్తం ఎప్పుడు ఎంత విడుదలయ్యాయి.. వాటికి టెండర్లు ఎప్పుడు పిలిచి ఎవరికి కాంట్రాక్ట్‌ అప్పజెప్పారు. ఆ కాంట్రాక్టరెవరు.. అతని వివరాలు.. వర్క్‌ షెడ్యూల్‌, వర్క్‌ స్పెసిఫికేషన్‌.. ఆ పని ఎప్పుడెప్పుడు ఎంతవరకు కావాలి. ఎప్పుడు ఫినిష్‌ కావాలి. ఆ సమాచారమంతా ”రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌ – 2005” క్రింద ఆయా సంబంధిత అధికారుల నుండి సర్టిఫైడ్‌ కాపీలను తీసుకుని సిద్ధంగా ఉంచాం. నిజానికి పని ప్రారంభిస్తున్నప్పుడు ఆ స్థలంలో ఆ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు పొందుపరుస్తూ ఒక ప్రజాప్రకటన ఉంచబడాలి. కాని అదక్కడ లేదు. అన్ని వివరాలతో మనమే కొన్ని బోర్డులు రాయించాం. అవి యివిగో..”
వెంటనే ఎస్‌డిసీ స్క్రీన్‌పై బోర్డులు కనిపించాయి
”మన ‘జనసేన’ కార్యకర్తల చేతుల్లో ఎప్పుడూ కొన్ని ప్లెకార్డులుంటాయి.. పని జర్గుతున్న ప్రతిరోజూ మనవాళ్ళు అక్కడ ఉండి నాణ్యతా ప్రమాణాలను చెక్‌ చేస్తారు. మెటీరియల్‌,మిక్సింగు నిష్పత్తులు, రీఇన్‌పోర్సింగు స్టీల్‌ క్వాలిటీ, క్యూరింగు.. బి.టి. రోడ్డయితే దాని స్పెసిఫికేషన్స్‌.. అన్నీ..”
స్క్రీన్‌పై ప్లెకార్డులు దర్శనమిచ్చాయి. ” ఈ ప్రాజెక్ట్‌ డబ్బు ప్రజలది”.. ”ప్రజల డబ్బు ప్రజలకు చెందాలి.” ”నాణ్యతా ప్రమాణాలు మాకు ప్రాణం”, ‘నిర్మాణంలో అవినీతి సహించం.” ‘జనం డబ్బుకు జనమే కాపలా”, కాపలా కుక్కలం – తప్పు చేస్తే కరుస్తాం” .. ఇవీ
”మిత్రులారా.. అసలు ఈ పనిని మనచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైన ఎంపిటిసిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుచేయాలి రాజ్యాంగం ప్రకారం.. కాని వాళ్ళే కాంట్రాక్టర్లయి దోచుకుంటున్నారు. కాబట్టే ఈ ప్రజల గర్జన, గాండ్రింపు అవసరమౌతున్నది.. మీరు మరో విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి.. మనం చేయబోతున్నది పూర్తిగా చట్టబ్దమైంది. సమాచారచట్టం ప్రకారమే మనం ప్రశ్నిస్తున్నాం. కాకుంటే ఒక బలమైన ప్రజావాణిని భరించలేనంత కటువుగా వినిపిస్తున్నాం.. ఇలా ప్రశ్నిస్తున్నామని.. ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు, సంబంధిత శాఖాధికారులకు ముందే తెలియజేశాం. అందరూ అంగీకారం తెలిపారు. తెలుపక తప్పదు వాళ్ళకు. లేకుంటే రేపు వాళ్ళే ప్రశ్నించబడ్తారు. ఎవ్రీథింగు యాజ్‌పర్‌ కాంస్టిట్యూషనల్‌ ప్రొవిజన్‌.. ఇక దీంతో చూడండి మిత్రులారా.. అధికార పీఠాలు కదుల్తాయి. ఇక నిశ్శబ్ద రక్తపాతరహిత విప్లవం రెక్క విప్పుతుంది.. గెట్‌ రెడీ.. జై జనసేన.. జై జై జనసేన..”
హాలునిండా చైతన్యం ఉప్పొంగి పొంగి వికసించింది.
నిస్వార్థమైన చింతన.. శుద్ధమైన ఆలోచన.. నిండైన అంకితభావం అక్కడి మనుషుల హృదయాల్లో తొణికిసలాడ్తున్నందువల్ల అందరి ముఖాల్లోనూ అతి సహజమైన జీవకాంతి, నిర్మలత్వం వెల్లివిరుస్తోంది. అందరిలోనూ విజయోత్సాహం ఉరకలెత్తుతోంది.
మూర్తిగారు కూర్చోగానే.. శివ లేచి.. ”మిత్రులారా.. వరంగల్లుకు సంబంధించిన ఎనిమిది కమిటీలవాళ్ళు.. బయట ప్రకటనా ఫలకంపై ఉన్న తమ తమ పేర్లను చూచుకుని సేవా విభాగం ఐదు నుండి తమ కమిటీకి సంబంధించిన ఆర్‌టిఐ సర్టిఫైడ్‌ కాగితాలు, ప్లకార్డులు.. అన్నీ తీసుకుని మీ కమిటీ సభ్యులతో విషయాలు చర్చించుకోవాలి. మేము యితర జిల్లాలలో ఉన్న మన మిత్రులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని సూచనలూ చేస్తాం.. ఈ రోజు తేదీ పదిహేను. సరిగ్గా ఇరవైయవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మనం అనుకున్న నూటా ఎనిమిది వర్క్‌ స్టేషన్ల దగ్గరికి ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఏకకాలంలో అన్ని కమిటీల వాళ్ళం హాజరౌతాం. ఇది భావి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతున్న ఓ మహత్తర ఘట్టం. మనం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం మిత్రులారా.. జై జనసేన…”
అందరూ నిశ్శబ్దంగా.. ఒక సైనిక శిబిరంలోలా నిబద్ధతతో విన్నారు.
వెంటనే… స్క్రీన్‌పై ‘జనసేన’ సమావేశ ముగింపు సంప్రదాయమైన లఘుచిత్రం ప్రత్యక్షమైంది.
ఒక దీపం.. ఆమె చేతిలో.. కదిలి కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఇంకాస్త కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఆ మూడు దీపాలూ కదిలి. మరికొన్ని దీపాలు.. మరిన్ని దీపాలు.. వత్తులు అంటుకుని వెలిగి వెలిగి .. ఎన్ని దీపాలో.. అన్నీ దీపాలే.,
అంతా తెల్లని కాంతి.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 15 వ భాగం

( గత వారం తరువాయి)

15

విపరీతమైన ప్రతిస్పందన ప్రవహిస్తోంది ‘జనపథం’లోకి. రాష్ట్రం నలుమూలలనుండి అనేక మంది ఆలోచనాపరులు ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లు,

విద్యాసంస్థలలోనుండి ఉత్తమ విద్యార్థులుగా నేపథ్యం గలవాళ్లు  ఎక్కువగా మహిళలు, సాహిత్యకారులు, కళాకారులు, కొద్దిమంది చిన్నస్థాయి పోలీసులు.. బీదలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అట్టడుగుస్థాయి వర్గం.. వీళ్ళు చురుగ్గా స్పందిస్తున్నారు.

దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టి.వి. వార్తా చానల్‌లో రామం.. లేదా డాక్టర్‌ గోపీనాథ్‌.. కొద్దిసార్లు క్యాథీలతో ముఖాముఖి ప్రసారాలు కొనసాగుతున్నాయి..’జనసేన’ ఆవిర్భావం, ఆలోచనలు, లక్ష్యాలు.. ప్రజాపాలనా రంగంలో విస్తరించిన అవినీతిని అంతమొందించేందుకు పథకాలు.. సంస్థ నిర్మాణం.. పారదర్శకత.. వీటిపై ఎక్కడ చూచినా చర్చ జరుగుతోంది. మంత్రి వీరాంజనేయులును విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సిఫారసుపై గవర్నర్‌ మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్‌ చేశాడు. మిగిలిన నలుగురు ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసి వివరణాత్మకమైన దర్యాప్తుకై ఒక కమిటీని నియమించింది.

పదిరోజుల్లో దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ‘జనసేన’ శాఖలు ఏర్పడ్డాయి.

ఒక కొత్త గాలి, కొత్త ఆలోచన వీచడం మొదలైంది.
విపరీతమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది మరోవైపు.

ఆపద సమయంలో ఆకలిగొన్న మందపైకి ఆహారపొట్లాలను విసిరితే మనుషులు పశువులకన్నా హీనంగా కొట్లాడుకోవడం కనబడ్తుంది. సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడగానే చుట్టూ ఉన్న నీరు మహోధృతితో సుడిగుండంగా రూపదాల్చడం మనం చూస్తూంటాం. ఒక ఖాళీ ఏర్పడగానే అక్కడికి చుట్టూ ఉన్న ద్రవ్యం చొచ్చుకురావడం ‘ఫిజిక్స్‌’లో చదవుకుంటాం. సరిగ్గా అదే జరుగుతున్నట్టుగా క్యాథీ గమనిస్తోంది.

”ప్రజలు ఈ విపరీతమైన అవినీతికర వాతావరణంతో విసిగి విసిగి.. ఈ దుస్థితిలోనుండి బయటపడ్డానికి ఎవరైనా పూనుకుని ఏదైనా చేస్తే బాగుండు.. మనం కూడా మంటకు గాలిలా తోడవుదాం అన్న ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు ఈ విపరీతమైన జనస్పందన తెలియజేస్తాంది.” అని డాక్టర్‌ గోపీనాథ్‌ వంక చూస్తూ అంది క్యాథీ.
అప్పుడు సరిగ్గా రాత్రి పదిగంటల యాభై నిముషాలైంది.

‘జనపథం’ బయట వాతావరణమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.

”ఈరోజు మన రాష్ట్రవ్యాప్త కార్యాలయాలన్నింటిలోకూడా మనం ముందే అనుకున్నట్టు ‘అవగాహన’ కార్యక్రమం నిర్వహించబడింది సార్‌. ఒక్కో కార్యాలయం నుండి దాదాపు లక్ష ప్రశ్నాపత్రాలను ప్రజల్లోని వివిధ స్థాయిలకు చెందిన జనానికి అందజేసి జవాబులురాయించి వెంటనే వాపస్‌ తీసుకుని క్రోడీకరణ చేశాం. వాటిని అన్ని జనసేన శాఖల్లోనుండి మన హైద్రాబాద్‌ సెంట్రల్‌ డాటా వెబ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే మనవాళ్ళు ఎనాలిసిస్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. రిపోర్ట్‌ సమ్మరీ చూస్తే చాలా ఆశ్చర్యం కల్గుతోంది రామంగారూ..” అంటున్నాడు శివ.

”చెప్పు శివా.. ఒక్కోసారి ఇటువంటి అభిప్రాయ సేకరణలనుండి మనం ఊహించని వింత ఫలితాలు ఫీడ్‌బ్యాక్‌ క్రింద మనకు చేరుతాయి. అవి మన భవిష్యత్‌ రూపకల్పనకు ఎంతో తోడ్పడ్తాయి..”

”సర్‌ మనం అందజేసిన ప్రశ్నాపత్రంలో రెండే రెండు ప్రశ్నలున్నాయి.. అవి., ఒకటి

అవగాహన (అతిగోపనీయం)

1) మీ చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం ఎంతమేరకు కలుషితమై ఉంది.
ఎ) కొద్దిగా     బి) చాలావరకు    సి) భరించలేని స్థాయికి
2) మీ పరిసరాల్లో అవినీతి ఏరూపంలో ఉంది..
……………………………………..
…………………………………….
మీపేరు :…………….. వృత్తి :………….. వయస్సు:………
అడ్రస్‌ :…………………….మొబైల్‌ నం.:……………….
గమనిక : మీరు రాస్తున్నది ఎవరికీ చెప్పబడదు. అతి రహస్యంగా ఉంచబడ్తుంది.

దాదాపు ఇరవై లక్షల ప్రశ్నాపత్రాలు ప్రజలకు అందజేయబడ్తే, అందులో బాధ్యతతో గరిష్టంగా పందొమ్మిది  లక్షల ముప్పయి రెండు వేల నలభై ఆరు మంది రెస్పాండయ్యారు. ఐతే చాలా ఆశ్చర్యంగా అందులో పందొమ్మిది లక్షల ఇరవై రెండు వేల నలభైమంది సామాజిక వాతావరణం ‘భరించలేని స్థాయిలో’ కలుషితమైందని జవాబు చెప్పారు. ‘కొద్దిగా’ అని చెప్పినవాళ్ళు అసలు లేనేలేరు. మిగిలిన అందరూ ‘చాలావరకు’ కలుషితమైందని బాధపడ్తున్నారు.

ఇక రెండవ ప్రశ్న.. ‘ మీ పరిసరాల్లో అవినీతి ఏ రూపంలో ఉంది’ అన్నదానికి.. అట్టడుగు వర్గాలు, చాలా విపరీతమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను, వ్యవస్థను తిట్టి తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు హాపీగా, డబ్బు సంపాదన విషయంలో నిశ్చింతగా ఉన్నారు కాబట్టి ప్రస్తుత సామాజిక స్థితిగతులపై మిగతా వాళ్ళున్నంత ఆగ్రహంగా లేరు. కాని ఆత్మానుగతమైన ఓ అపరాధ భావనతో ఈ పరిస్థితులు మారాలనిమాత్రం ఆకాంక్షిస్తున్నారు.

”మచ్చుకు విభిన్న వర్గాలకు చెందిన, భిన్న ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రతిస్పందనలను వినిపిస్తావా శివం” అన్నాడు డాక్టర్‌ గోపీనాథ్‌.

”ఓకే సర్‌.. వినండి..”అని శివం తన ముందున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ను సెట్‌ చేసుకుంటూ,

”ఊఁ.. ఇది .. ఒక హాకర్‌.. బి. అప్పారావు.. బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ, సెంటర్లో బండిపై అరటిపండ్లు అమ్ముతూ జీవిస్తాడు.. చదువురాదు.. ప్రక్కనున్న ఇంటర్‌ విద్యార్థితో ఫాం నింపించి మనకు జవాబిచ్చాడు.. మొదటి ప్రశ్న జవాబు.. సమాజం భరించలేనిస్థితిలో కలుషితమైందని.. రెండవ ప్రశ్నకు జవాబు.. థూ నీయమ్మ.. అవినీతి ఏ రూపంలో ఉంది.. అని అడుగుతున్నారా.. అన్ని రూపాల్లోనూ ఉంది. పోలీసుల రూపంలో, గుండాల రూపంలో, మున్సిపాలిటీ ముండా కొడ్కుల రూపంలో, రాత్రి కాకముందే లంజలరూపంలో, ఎమ్మెల్యేల రూపంలో, మంత్రుల రూపంలో, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని రాజకీయ పార్టీల రూపంలో.. ఇక బతకడమే కష్టంగా ఉంది సారూ. రోడ్లమీద అరటిపండ్లమ్మి రెండొందలు సంపాదిస్తే వందరూపాయలు అందరికి పంపకం.. మిగిలేది. వంద.. బొక్కలు తెల్లబడ్తానయ్‌గాని ఈ బతుకు బాగుపడ్తలేదు…”

శివ తలెత్తి ముగ్గురి ముఖాల్లోకీ చూశాడు.

”వీటి ప్రింటవుట్సన్నీ భద్రపర్చాలి శివా.. మనం రెండు మూడు రోజుల్లో వీటిని సమ్మరైజ్‌ చేసి.. ఒట్టి కీలుబొమ్మే ఐనా రాష్ట్ర గవర్నర్‌ను, తర్వాత ముఖ్యమంత్రిని కలిసి ప్రజల మనోగతాన్ని సాధికారికంగా వినిపించబోతున్నాం. తర్వాత మీడియా ద్వారా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది..” అన్నాడు రామం.

17

”యస్సార్‌.. ఇంకొక రెస్పాన్స్‌.. మరొక వర్గంనుండి.. ఇతని పేరు బి. రామచంద్రారెడ్డి. వయస్సు ముప్పయి రెండు. వృత్తి పోలీస్‌ కానిస్టేబుల్‌.. ఊరు వరంగల్‌.. మొదటి ప్రశ్న జవాబు.. సామాజిక వాతావరణం భరించలేని స్థాయిలో కలుషితమైందనే. రెండవ ప్రశ్న.. అంటాడు.. పోలీస్‌గా పుట్టడంకంటే ఏ క్లాస్‌ లంజెదగ్గరైనా కుక్కయిపుడ్తే ఎంతో సంతోషంగా ఉంటది. ఉన్న ఒక్క బిడ్డకు ఊరంతా మొగలే అని ఒక సామెత ఉంది.. పోలీస్‌ కానిస్టేబుల్‌కు అందరూ మొగలే. ఎస్సై, సి.ఐ, డిఎస్పీ.. క్యాంప్‌క్లర్స్‌, ఎస్పీ స్టెనో, ఎస్సై పెడ్లాం, సి.ఐ. ఉంచుకున్నది, డిఎస్పీ బిడ్డ, కొడుకు, బామ్మర్ది.. ఎందరయ్యో బాబు. ఒక వేళ పాళలేని కుక్కబతుకులు మావి.. యిక లంచాలా.. ఆదాయమా.. అధికారమా.. ఎవనికి ఎంత చేతనైతే గంత.. అందినకాడికి రిల్లుకుని ఉడాయించుడే. పోలీసుల సంస్కృతిలో ఏ పోలీసోడైనా తన క్రింది ఉద్యోగులకు పులి, పై ఉద్యోగులకు పిల్లి. మాకు రాజకీయ నాయకులందరూ మొగుళ్ళే. డబ్బు సంపాదన ప్రక్కనపెడ్తై.. ఈ సిగ్గూశరాలు లేని జీవితాలు జీవించడంకంటే బండకట్టుకుని బాయిలపడ్తే బాగుండనిపిస్తోంది. ఇగ ఈ దేశం ఎవడూ బాగుచేయలేనంత ఛండాలంగా చెడిపోయింది. గంతే..”

”ఊఁ.. జనం స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పమని ఎంకరేజ్‌ చేసి విషయాన్ని గోప్యంగా ఉంచితే చూడండి మనుషులు తమ మనసులోని మంటను ఎలా మనముందు ఆవిష్కరిస్తున్నారో.. ఇదీ ప్రజల అసలు అంతరంగం..” అంది క్యాథీ.

”ఒక మున్సిపల్‌ కార్పొరేటర్‌.. పేరు శ్రీనివాసరావు బర్రెల.. వార్డ్‌ యిరవై నాల్గు. వయస్సు ముప్పయి ఐదు. మొదటి ప్రశ్న జవాబు. సామాజిక వాతావారణం భరించలేని స్థాయిలో కలుషితమై చెడిపోయిందనే. ఇక రెండవ ప్రశ్న.. ఈ రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేటరన్నా, కౌన్సిలర్‌ అన్నా బ్రాకెట్లో కాంట్రాక్టరనే. పది లక్షలు ఖర్చుపెట్టి గెలిచిన. ఐదేండ్ల టర్మ్‌. యాడాదిగాకముందే ఇరవై రెండు లక్షలు సంపాదించిన. పొద్దున లేవగానే పైన ఎమ్మెల్సీ కింద మేయర్‌, అటు దిక్కు జిల్లా మంత్రి. పైరవీలు, పార్టీలు, దందాలు, ధర్నాలు, రాస్తారోకోలు. షానిటేషన్‌ కాంట్రాక్ట్‌, రోడ్ల కాంట్రాక్ట్‌, సిల్ట్‌ రిమూవల్‌ కాంట్రాక్ట్‌, మలేరియా ప్రెవెక్షన్‌, ఇందిరమ్మ ఇళ్ళ కథ.. వరల్డ్‌ బ్యాంక్‌ ఫండ్స్‌ కింద స్లమ్స్‌ డెవలప్‌మెంట్‌ కాంట్రాక్ట్‌.. ఏమాటకామాటేగని .. కేన్సర్‌ రోగంకన్న కడుహీనంగా ఈ అవినీతి రోగం ముదిరిన ఈ సిస్టంను ఎవడు బాగుచేస్తడు.. ఎట్టా బాగుచేస్తడు. మారె.. ఎవని చేతగాదు.. కాని..మేము విసిగిపోయినం. అందరం బురదల నిలబడ్డం.. బాగ తాగినప్పుడనిపిస్తది.. నీయమ్మ ఈ అన్యాయం బతుకు, పాపపు బతుకు వద్దని.. గుండెలల్ల ఎక్కడ్నో తప్పుచేత్తాన అన్న ఫీలింగు తినేస్తాంది. మంచిగా, సాఫ్‌గా నీతిగా బతుకుతే బాగుండు. కాని ఏ లంజకొడ్కు బత్కనిత్తడు.”

”ఒక సాధారణ పౌరుడు.. ఉదాహరణకు ఓ పెద్ద బట్టల దుకాణ్లో పనిచేసే గుమాస్తా, .. అలాంటివాళ్ళ ఫీలింగ్సు చెప్పు శివా..” రామం అడిగాడు
శివ వెంటనే తన చేతిలో ఉన్న కొన్ని కాగితాలనూ, లాప్‌టాప్‌ స్క్రీన్‌ను వెదికి ఒక్క నిముషంలో.. నంబర్‌ను వెదుక్కుని ఓ కాగితాన్ని బయటికి తీసి చదవడం ప్రారంభించాడు.

”ఇతను వందన బ్రదర్స్‌లో పనిచేసే ఒక గుమాస్తా.. గత ఐదేండ్లుగా చేస్తున్నాడు. పేరు – వల్లభనేని రామారావు. వయస్సు నలభై ఎనిమిది.. మొదటి ప్రశ్నకు జవాబు.. సామాజిక వాతావరణం ..మనమిచ్చిన మూడు ఆప్షన్స్‌ కాకుండా ఒక కొత్త ఆప్షన్‌ తనే రాశాడు.. ”భరించలేని, కాదు ఎవడూ బాగుచేయలేని స్థాయికి ఈ సమాజం చెడిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీ చెప్పాడుకదా యిక ఈ దేశాన్ని భగవంతుడుకూడా బాగుచేయడలేడని.. కాలుష్యం ఆ లెవెల్‌లో ఉంది. యిక రెండవ ప్రశ్న : మీరెవరోగాని ఈ ప్రశ్న కనీసం అడిగినందుకే నాకు పరమానందంగా ఉంది. దీనికి జవాబు తెల్సుకుని మీరేంజేస్తారో తెలియదుగాని కనీసం జనం గురించి కొందరు ఆలోచిస్తున్నందుకే రవ్వంత గర్వంగా ఉంది. యిక అవినీతి సంగతికదా.. చెబుతా.. వేయి రూపాయల కిరాయి కొంపలో కుక్కిన పేనువలె భార్యాపిల్లలతో గుట్టుచప్పుడు కాకుండా బ్రతుకేనేను మా ఓనర్స్‌ గొణుక్కుంటూ అప్పుడైదు వందలు అప్పుడైదు వందలుగా ఇచ్చే మూడువేల ఐదువందల రూపాయల జీతంతో ఎలా జీవిస్తానో ఆ భగవంతునికే ఎరుక.. యింట్లోనుండి బయటికి రాగానే మా వీధి మూలమీదో యాభైఫీట్ల వాకిలున్న విశాలమైన బిల్డింగు ఉంది. అది మా నగర ఎమ్మెల్యే ఉంపుడుగత్తె లలితాదేవిది. పొద్దున ఏడు గంటలనుండే ఆమె వాకిట్లో కార్లు, మోటార్‌ సైకిళ్ళు, ఆటోలు..ఫుల్‌ రష్‌. ఏంటయా అంటే.. ఎమ్మెల్యే గారితో చేయించుకోవాల్సిన అన్నిరకాల దిక్కుమాలిన పైరవీలకు బుకింగు పాయింట్‌ యిది. బుక్‌ ద కేస్‌, ఫిక్స్‌ ద రేట్‌.. టేక్‌ అడ్వాన్స్‌. పూర్తిగా బహిరంగ వ్యవహారం ఇది. పత్రికలవాళ్ళకు. పోలీసులకు, ప్రజాసంఘాలకు, నక్సలైట్లకు, సంఘ సంస్కర్తలకు.. అందరికీ తెలసిందే. ఏంజేస్తున్నారు ఎవరైనా. ఏమీ లేదు.. ఇంకాస్త ముందుకు రాగానే కుడిదిక్కు ఒక డిఎస్పీ ఉంచుకున్న రామలక్ష్మి ఇల్లు ఉంటది. యింటిముందు రెండు మనుషులకంటె పెద్దసైజు కుక్కలు. నిరంతరం ఇంట్లో బట్టలుతుకుడు దగ్గర్నుండి పిల్లల్ను బైటికి తీసుకుపోయి ఆడించేదాకా పోలీసుల చాకిరీ. ఉదయం, సాయంత్రం బుక్‌ ది కేస్‌.. టేక్‌ మనీ. అటుప్రక్క ఆడిటర్‌ రామనాథం. అన్ని రకాల ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ లావాదేవీలకు నగరంలో పెద్ద బ్రోకర్‌. ఆఫీసర్లకు అమ్మాయిలకు సప్లయ్‌ చేయడం దగ్గర్నుండి దొంగలెక్కలను స్కిప్‌ చేయడానికి, పన్ను ఎగవేయడానికి కోటి మార్గాలు వెదికి చూసి మందికొంపలు ముంచే పని. ఒక్క మా దుకాణం దొంగలెక్కలను కవర్‌ చేసినందుకు నేనే మొన్న రెండు లక్షల లంచమిచ్చిన. వాడు ఇరవై లక్షల పన్ను ఎగ్గొట్టించిండు. ఇంకో ఇవరై మీటర్లు నడువగానే ఒక ఇంద్రభవనం వంటి ఇర్రిగేషన్‌ సూపరింటెండ్‌ ఇంజినీర్‌ రామ్మూర్తి బిల్డింగు. (గారు అని సంబోధించడానికి సిగ్గనిపిస్తోంది) ఇరవై ఏండ్ల క్రితం ఆ స్థలంలోనే ఒక డొక్కు సైకిల్‌పై పోతున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా రామ్మూర్తి నాకు తెలుసు. అతను చిన్నప్పుడు మూడవక్లాసునుండి ఆరవక్లాస్‌దాకా నాకు క్లాస్‌మేట్‌. యిప్పుడు అతనికి ఒక పెళ్ళాం, ముగ్గురు ఉంపుడుగత్తెలు. కోట్ల ఆస్తులు. కిలోల బంగారం. దేవాదుల ప్రాజెక్ట్‌..ఎల్లంపల్లి.. ఓపెన్‌ కరప్షన్‌. అంతా బహిరంగమే.. ఏం జరుగుతోంది.. ఎవరేం పీకుతున్నారు వాళ్ళను (సారీ.. ఆవేశం, బాధ..దుఃఖం.. పేదవాడు ఒట్టిగా తిట్టుకోవడంకంటే ఏమీ చేయలేని నిస్సహాయ దుస్థితి) ఈ అవినీతిని చూడవలసినవాళ్లందరి కండ్లు చితికిపోయినయా.
వీటన్నింటిని మించి.. ఒక నగర రౌడీ.. రాజేందర్‌.. పిట్టల రాజేందర్‌.. వాని తండ్రి రౌడీ, వాని అన్న రౌడీ,  వాని పెండ్లాం ఆడ రౌడీ. వాడు విచ్చలవిడిగా నగరంమీద ఆంబోతులా పడి యింత అత్యాధునిక సమాజంలో అటవికంగా గుడిసెవాసులను, గవర్నమెంట్‌లో దొంగ అధికారులైన ఎఫ్‌సిఐ, గ్రేన్‌మార్కెట్‌, ఆప్కారీ, ప్రైవేట్‌ ఇంజినీరింగు కాలేజీలు, పాఠశాలలు, వేశ్యాగృహాలు, దొంగ సారాయి దుకాన్లు, రోడ్లకిరువైపుల ఉండే హాకర్ల హఫ్తాలు.. వానికి స్వయంగా మూడు  బినామీ బార్లు. వాని పెళ్ళానికి, ఉంపుడుగత్తెలకు ఆరు బ్రాండీ షాప్‌లు, లిక్కర్‌ షాపుల్లో ఎంఆర్‌పిని మించి ఇరవై శాతం ఎక్కువగా అమ్మే సిండికేట్‌లకు నాయకత్వం.. వీడు బహిరంగంగా బలిసి వెంట గుండా అనుచరులతో నెత్తిపై గొడుగు పట్టించుకుని ఊరేగుతూంటే.. ఒక్క..ఒక్క పోలీస్‌ అధికారిగానీ, కలెక్టర్లు, సబ్‌ కలెక్టరు, సిగ్గులేని పౌర సమాజం ఏం చేస్తోంది. గాజులు తొడుక్కుని కూర్చుంది.. అంతే..

…అబ్బా.. యిలా రాసుకుంటూపోతే యిదంతా ఒక గ్రంథమౌతుంది.

నిర్మూలన.. కుళ్ళిపోయిన దుష్టాంగ నిర్మూలన జరగాలి. అర్జంటుగా.
కాని ఎవరు చేస్తారు..? అదీ ప్రశ్న.. అదీ దుఃఖం.. అదీ నిస్సహాయత..”

శివ ఆగిపోయాడు.. చదవడం ముందకు సాగడంలేదు. గొంతు గద్గదమైంది.

వాతావరణమంతా..ఎవరో చనిపోతే దుఃఖం చుట్టూ వ్యాపించినట్టు.. విషాద గంభీరంగాఉంది. స్తబ్దత అంతా.

”ఈ ప్రజలకు ఓదార్పు కావాలి సార్‌.. రవ్వంత ప్రేమను, బ్రతుకు పట్ల పిడికెడు భరోసాను, ఒక తలనిమిరే అనునయింపును, కొద్దిగా వాత్సల్యాన్ని అందించే ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాల్సార్‌. నిజానికి అవినీతి మురుగు బురదలో కూరుకుపోయి ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎప్పుడో మృతిచెందాయి. ఈ సిస్టంను ఒక అంకుశం పోటుతో పునర్జీవింపజేయాలి..” అంటున్నాడు శివ..ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.

”మొత్తం పందొమ్మిది లక్షల ఇరవై రెండువేల నలభై మంది దుఃఖచరిత్రలు అవి శివా.. ఏ ఒక్కరూ నేను సంతోషంగా, ఆత్మసాక్షిగా, నీతిబద్ధంగా జీవిస్తున్నాడని చెప్పే పరిస్థితి లేదు. యిప్పుడు మనం వివిధ రకాల సామాజిక వర్గాల రోదనలను రికార్డ్‌ చేస్తున్నాం అంతే..ప్లీజ్‌ గొ ఎహెడ్‌..ఇంకో రెండు టిపికల్‌ కేస్‌లు విన్పించండి.” అన్నారు గోపీనాథ్‌.

శివ.. మరో కాగితాన్ని తీశాడు బయటికి.

”మూడు కేసులు విన్పిస్తున్నాను సార్‌. ఒకటి ఒక వేశ్యది. ఒకటి ఒక రచయితది. మరొకటి ఒక వైస్‌ ఛాన్స్‌లర్‌ది.. మొదటి కేస్‌.. పేరు బి. శ్యామల (నిజమైన పేరే) వయస్సు. ఇరవై ఏడు. వృత్తి శరీరాన్నమ్ముకోవడం. శరీరాన్నీ నమ్ముకోవడం. మొదటి ప్రశ్న : మూడవ ఆప్షన్‌కు టిక్‌ చేయబోయి.. మధ్యలో ఆగి.. రాసింది స్వయంగా.. అస్సలే భరించలేని కంపువలె ఈ సమాజం కలుషితమైపోయింది. రెండవ ప్రశ్న : నేను వేశ్యను. నాది అతినీతివంతమైన వృత్తి. సుఖాన్నందిస్తా, డబ్బు తీసుకుంటా. వృత్తి విషయంగా ఎటువంటి ఆత్మవంచన లేకుండా చాలా శుద్ధంగా, తృప్తిగా జీవిస్తున్నా. ఇప్పుడే పేపర్‌ చూచిన.. ఆంధ్రప్రదేశ్‌లో 6596 మద్యం షాపులను 7000 కోట్ల రూపాయలకోసం ప్రభుత్వం వేలం వేసి సంపాదించడంకంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వేశ్యాగృహాలను నడుపవచ్చనిపిస్తోంది. వేలంలో వందమంది మహిళలుకూడా పాల్గొని మద్యం షాపులను దక్కించుకున్నారట.. వాహ్‌ా.. భారతీయ పవిత్ర మహిళా నీకు జోహార్లు.. మహిళలందరం వీళ్ళందరికి హారతలు పట్టాలి. పోతే.. పత్రికలు చాలా స్పష్టంగా ఈ మద్యం షాపులు ఏఏ ప్రాంఆల్లో ఏఏ పార్టీవాళ్లు ఎన్ని దక్కించుకుని ఎవరెవరు సిండికేట్లుగా ఏర్పడ్డారో, ఏఏ మంత్రుల కొడుకులు, అల్లుళ్ళు, ఎక్కడెక్కడ ఎన్ని పదుల బార్లను నెలకొల్పబోతున్నారో రాశారు. సిగ్గులేని ఈ పార్టీల అధినాయకత్వం ఏంజేస్తోంది. వీళ్లపైన ఏ చర్యలూ తీసుకోకుండా ఎందుకిలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.. దేశాన్ని నడిబజార్లోపెట్టి మద్యం, మగువ, కమీషన్లు.. పర్సంటేజ్‌లు, ప్రమాణాలు లేని కాంట్రాక్ట్‌లు.. వీటిపేర దోచుకుంటూంటే.. వీళ్ళందరికంటే వేశ్యనైన నేను ఎంతో నీతిగా జీవిస్తున్నందుకు గర్విస్తున్నాను. ఈ రాజకీయ పార్టీల అధినేతలు నా కాలిగోటిక్కూడా సమానంకారు..”

చదువడం ఆగగానే.. గోపీనాథ్‌, రామం, క్యాథీ.. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు ఆ అమ్మాయి ఆత్మచైతన్యానికి పొంగిపోయారు.

శివ మరొక కాగితాన్ని ఎంపిక చేసి తీశాడు బయటికి.

”పేరు : కె. నరసింహారావు. వృత్తి : యిదివరకు ఉపాధ్యాయుణ్ణి. కాని రచయితను, కవిని. వయస్సు : అరవై ఏడు సంవత్సరలు. ఊరు : పరకాల.

మొదటి ప్రశ్న: నిస్సందేహంగా ఈ దేశం నైతికంగా కుళ్ళిపోయి కంపుకొడ్తోంది.

రెండవ ప్రశ్న : అసలు ఈ దిగజారిన రాజకీయాల వల్ల ధ్వంసమైపోయిన మానవ సమాజం, తద్వారా విజృంభిస్తున్న రాక్షస అరాచకత్వం.. వీటికి అసలు మూలాలెక్కడున్నాయో వెదకాలి. ఒక చిన్న కూలీపనికోసమైనా వ్యక్తిని ఎంచుకునేటప్పుడు వాడు ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించగలడా లేడా.. వానికా పనితనముందా లేదా అని పరీక్షించుకుని ఎంచుకుంటాం. కూలీల అడ్డాపైన. అలాగే చిన్న అటెండర్‌ పోస్ట్‌క్కూడా కనీసం ఎస్సెస్సీ క్వాలిఫికేషన్‌ ఉండాలని ఒక అర్హతను నిర్ధారిస్తాం. ఈ ఉద్యోగానికి యిది వయోపరిమితి.. అని ఓ రూల్‌ పెడ్తాం. ఫలాన పనికి ఈ నిపుణత కావాలని ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తాం. కాని భారతదేశంలో ఒక్క రాజకీయాలకు మాత్రం ఏ నిబంధనా లేదు.. ఎటువంటి అర్హతా లేదు..ఎవడైనా రాజకీయాల్లో ఎమ్మెల్యే కావచ్చు. ఎంపి కావచ్చు. మంత్రి కావచ్చు, ప్రజల నుదుటిరాతను రాసే శాసనకర్త కావచ్చు.. వాని ప్రతిభతో నిమిత్తం లేకుండా ఏ శాఖనైనా పరమఛండాలంగా, అసమర్థంగా నిర్వహిస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేయవచ్చు.. కాళ్ళు, చేతులు, శరీరం పనిచేయని ఎనభై ఏళ్ళ వయసుకు వచ్చినా యింకా యింకా ప్రజలనెత్తిపై కూర్చుని స్వారీ చేయవచ్చు.. పందికొక్కుల్లా దేశాన్ని తోడుకుని భోంచేయవచ్చు.. ఏమిటిది..ఎందుకిలా.. వీళ్ళకు మాత్రం ఒక మార్గదర్శకాల కోడ్‌, కనీస విద్యార్హత, ప్రభుత్వ ఉద్యోగులపై పోలీస్‌ ఎంక్వయిరీ చేయించినట్టు ప్రవర్తనపై నిఘా, పదవీ విరమణ వయస్సు ఎందుకుండకూడదు. వీళ్ళక్కూడా ఇలా కనీస అర్హతలను రాజ్యాంగబద్ధంగా నిర్ధారించి అమలుచేస్తే సగంకన్నా ఎక్కువ రాజకీయ దరిద్రం దానంతటదే పోతుంది. ఈ కోణంలో మేధావులు లోతుగా విచారణ చేయాలి. ప్రభుత్వాలపై కావలిస్తే కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలి.
”అసలు.. మనుషుల్లో నేను ఈ పనిచేయడం తప్పు. ఇది నైతికంగా కూడనిపని. నా చర్యవల్ల తోటి మానవ సమూహానికి ద్రోహం చేస్తున్నాననే స్పృహ ఎందుకుండడంలేదు. నాకనిపిస్తోంది. మనం ఇంకా అడ్వాన్స్‌డ్‌ స్టేజెస్‌లో ‘డబ్బు సంపాదించాలి.. ఎంత ఛండాలమైన పని చేసైనా సరే డబ్బు సంపాదించాలి.. ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత డబ్బును ఏదోవిధంగా సంపాదించాలి’ అని ఇన్ని దురాగతాలకు పాల్పుడ్తునవారికి స్పెషల్‌ కౌన్సిలింగు క్లాసులు నిర్వహించాలనుకుంటా మన జనసేన సభల్లో.. అందరి సమక్షంలో..”

‘ఎలా మార్తారు వీళ్ళు..’ అని రామం తనలోతాను గొణుక్కుంటున్నట్టుగా అనుకోవడం ప్రక్కనున్న క్యాథీకి వినిపించింది. ఆమె మౌనంగానే అతనివంక చూచి.. మళ్ళీ

శివ చదువబోతున్న మరో ప్రతిస్పందన దిక్కు దృష్టి మరల్చింది.

”ఒక చిన్న అంతరాయం సర్‌.. మనుషుల్లో పశ్చాత్తాపం ఉంటుందా.. యిది వినండి..”

నా పేరు.. (రాయను) వృత్తి : ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడిపాను. వయస్సు : యాభై సంవత్సరాలు. యిప్పుడు చర్లపల్లి జైలులో ఉన్నాను. జైలునుండే ఈ జవాబు.

మొదటిప్రశ్న:  సమాజం మహారోతగా కుళ్లిపోయింది.. ఇది పచ్చినిజం

రెండవప్రశ్న : నేను పద్నాల్గువందల కోట్ల స్కాం చేశాను. మనిషి ఎందుకు నావలె యింత ఘోరమైన తప్పు చేస్తాడు. దానికి జవాబు.. తప్పు చేసే అవకాశం ఉండడం, పట్టుబడే అవకాశాలు లేవని భరోసా లభించడం, అసలు అంత డబ్బు ఎందుకో తెలియని ఒకపిచ్చి వ్యామోమం.. అంతరాంతరాల్లో నిర్లజ్జతో కూడాన నేరతత్వం..అందువల్ల.

మొన్న జైల్లో ఉన్న నన్ను పరామర్శించడానికి వచ్చిన నా తండ్రి అడిగాడు.. ‘ఓరే.. నేనెప్పుడూ మాకోసం యిటువంటి దేశద్రోహచర్య, దొంగతనం చేయమని చెప్పలేదు కదరా..అసలెందుకు చేశావ్‌ తప్పు.. ” అని మర్నాడు నా యిద్దరు పిల్లలు. నా భార్య వచ్చి.. ‘మా కోసం యిన్ని వేల కోట్ల స్కాం చేయమని, తద్వారా మమ్మల్ని  సుఖపెట్టమని ఎప్పుడూ  మేం చెప్పలేదుగదా.. మేం సమాజంలో తలెత్తుకొని తిరక్కుండా ఈ నేరం ఎందుకు చేశారు” అని నిలదీశారు. ఎవరో కవి అన్నట్టు.. ‘సగం జీవితం నన్ను కన్నవాళ్ళ కోసం, సగం జీవితం నేను కన్నవాళ్ళకోసమే గడిచిపోయింది.. అసలు నా జీవితమేది.. అన్నట్టు అటు నన్ను కన్నవాళ్ళు ఇటు నేను కన్నవాళ్ళూ నేను చేసిన నేరాన్ని ప్రశ్నిస్తున్నపుడు…నిజంగానే అసలీ ఘోరమైన కోట్లాదిరూపాయల స్కాంను ఎందుకు చేసినట్టు ఎవరికోసం చేసినట్టు..సిగ్గనిపిస్తోంది. దుఃఖం ముంచుకొస్తోంది. నాపై నాకే అసహ్యం కల్గుతోది.. పశ్చాత్తాపంతో చెంపలేసుకోవాలనిపిస్తోంది.. ప్రద్నాల్గువందలకోట్ల ప్రజాధనాన్ని తిన్న నన్ను యింకా సజీవంగా, క్షేమంగా రాచమర్యాదలతో జైల్లో అతిధివలె చూచుకుంటూ, దేశద్రోహ నేరంక్రింద షూట్‌ చేయకుండా బ్రతకనివ్వడం ఈ దేశంలో ఉన్న ఉదాసీన అలసత్వానికి నిదర్శనం. ద్రోహికి సత్వరమే శిక్ష పడాలి..”

”ఊఁ.. ఔను.. ” అనుకున్నాడు రామం.. డాక్టర్‌ గోపీనాథ్‌ ఒక్కసారే.. ఎవరికి వారే.

”చివరి ప్రతిస్పందన సార్‌..”

నాపేరు రాంనరసింహారెడ్డి. వృత్తి  : వైస్‌ చాన్స్‌లర్‌ (యూనివర్సిటీ పేరు చెప్పను) వయస్సు అరవై ఏండ్లు.

మొదటి ప్రశ్న : నిస్సందేహంగా దేశం పూర్తిగా కుళ్ళిపోయింది.

రెండవ ప్రశ్న : విపరీతమైన పైరవీలు చేసి, రాజకీయ నాయకుల, మంత్రుల ప్రమేయంతోని, డబ్బుతోనే నేను కూడా వైస్‌ ఛాన్స్‌లర్‌ అయ్యాను. ఆ మాట కొస్తే. ఈ దేశంలోని వైస్‌ చాన్స్‌లర్లలో తొంభైశాతంకంటే ఎక్కువమంది నాలాగే అనేక అవినీతికర మార్గాలద్వారానే పదవుల్లోకొచ్చారు. కొండపైకి ఎక్కినతర్వాత కిందికి చూస్తే అంతా వివరంగా కనబడ్డట్టు.. ఇటువంటి ఉన్నతమైన స్థానంలోకి వచ్చాక పెద్దవాళ్ళ పనుల లోలోతుల్లోకి తొంగి చూస్తే మహాఛండాలంగా ఉంది. మొన్నకు మొన్న చూశాంగదా ప్రొఫెసర్‌గా సరస్వతీ దేవికీ, వైద్యునిగా ధన్వంతరికీ ప్రతిబింబంగా ఉండవలసిన ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఒక మెడికల్‌ కాలేజికి అడ్డదారిలో సహాయం చేయడానికి రెండుకోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడి దానికి కొనసాగింపుగా ఎసిబీ దాడిలో పద్దెనిమిది వందలకోట్ల రూపాయల నగదు, పదిహేను వందల కిలోల బంగారంతో దొరికిపోయాడు. అంతకుముందు జాతీయస్థాయి అత్యున్నత సంస్థ అఖిల భారత సాంకేతిక విద్యామండలి చైర్మన్‌పై, ఒక డైరెక్టర్‌పై ఎసిబి దాడిచేస్తే వందలకోట్లు దొరికాయి. విశ్వవిద్యాలయాలను నియంత్రించే యుజిసి అవినీతిపై వందల కథలున్నాయి. వీళ్ళపై ఏదో ఒక కఠిన చర్య తీసుకుని యిక మున్ముందు ఇటువంటి తప్పులు ఎవరూ చేయకుండా ప్రభుత్వం ఏదైనా చేయగలిగిందా. ఉహుఁ.. ఏం జరుగుతోంది. ఈ దేశం ఏమైపోతోంది. పవిత్రమైన విద్యావ్యవస్థలోకి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయాలు ఎంతస్థాయికి ప్రవేశించి వ్యాపించాయంటే.. వీటిని తొలగించి దీన్ని ఎవడూ శుభ్రం చేయలేరు. ఇందుకు తగ్గట్లు సర్వబలహీనతలకూ బానిసలైన యువకులు విశ్వవిద్యాలయ స్థాయిలో ఏ ప్రామాణికమైన స్థాయికీ చేరలేక, నాణ్యతను సాధించలేక పి.హెచ్‌డీ చేసిన వానికి ఒక్క దరఖాస్తును తప్పులేకుండా రాయడం చేతగాక, తప్పు లేకుండా నాల్గు ఇంగ్లీష్‌ వాక్యాలు మాట్లాడలేక.. అంతా ట్రాష్‌.. ఇక స్టాఫ్‌.. అన్నీ రాజకీయాలే. కుల రాజకీయాలు పార్టీ రాజకీయాలు, ఉగ్రవాద, మత రాజకీయాలు, బ్లాక్‌మెయిలింగు తంతులు.. చెదలు.. చెదలుపట్టిపోయిది విద్యావ్యవస్థ. పైకి ఒక మేడిపండు. లోపలంతా పురుగులు.. చెత్త.. చెదారం.. ప్రతి విశ్వవిద్యాలయం ఒక చెత్తకుండీ.. కష్టం. దీన్ని బాగుచేయడం కష్టం.. ఈ వారం నేను పదవీ విరమణ చేస్తున్నా.. ఏదో బాగు చేయాలని.. ప్రయత్నం చేసీ చేసీ అలసిపోయిన.. నా వశం కావడం లేదు.. సారీ..భారతదేశమా సారీ.. నన్ను క్షమించు తల్లీ.”

శివ చదవడం ఆపాడు.

ఏ లేఖ చదివినా.. కదిపినా కన్నీళ్లే.. ఏమిటిది..ఎలా.. ఈ స్థితికి పరిష్కారం ఏమిటి. ఎవనికివాడు వాని పనిచేసుకుని ప్రశాంతంగా బతుకనీయకుండా ప్రజాజీవితాల్లోకి రాజకీయాలు యింతలోతుగా చొచ్చుకురావడం అవసరమా. అన్ని టి.వి. వార్తాచానళ్లు ఇరవై నాల్గుగంటలు ఈ కుళ్ళు రాజకీయాలనే వార్తలుగా, చర్చలుగా, ఎపిసోడ్సుగా, వ్యాఖ్యలుగా.. ఇంకేదేదో పేర్లతో నిరంతరం ప్రసారం చేసీ చేసీ ప్రజలను హింసించడం., ఊదరగొట్టడం అవసరమా.
వ్చ్‌.. ఏదో చేయాలి.. ఏదో ఒకటి తప్పకుండా చేయాలి.
అందుకే ఈ ‘అవగాహన’

అల్లూరి సీతారామరాజు మన్యవిప్లవం ప్రకటించే ముందు పరిస్థితిని ఆకళింపు చేసుకునేందుకు దేశమంతా అవగాహన పర్యటన చేశాడు. గాంధీ బ్రిటిష్‌ ప్రభుత్వంపై సహాయ నిరాకరణ  ప్రతిఘటనను ప్రకటించేముందు విస్తృతంగా భారతదేశమంతా గ్రామగ్రామం పర్యటించి ప్రజల హృదయాన్ని అధ్యయనం చేశాడు.
అధ్యయనం ఎంతో అవసరమని భావించి.. దాదాపు వేయిమంది జనసేన కార్యకర్తలు రెండు ప్రశ్నలతో జనాన్ని కదిలిస్తే.. ఒక నిప్పుల సముద్రం గాండ్రించినట్టు.. గర్జించే ఆకాశం కన్నీళ్ళ తుఫానును వర్షించినట్టు.. అంతా దుఃఖం.. వేదన.. క్షోభ.. దిక్కులేని అనాధల్లా రోదన..
‘అవగాహన’ ఒక పిడికెడు గుండెలోని ఉప్పెనను విప్పి చూపించింది.

నలుగురూ విధిలేక ఒకరి మొగాన్నొకరు చూచుకుంటూండగా,

బయట ఆకాశం భీకరంగా గర్జించింది ఒక్కసారిగా.. టపటపా పెద్దపెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది.
శివ వాచీవైపు చూశాడు.

టైం పదకొండు గంటల యాభై నిముషాలైంది.
రామం మౌనంగా లేచి.. తన గదివైపు కదుల్తూ.. ”గుడ్‌నైట్‌..” అన్నాడు.

అంతా విషాద గంభీరం.

( సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 14 వ భాగం

16

(గత వారం తరువాయి )

14

ఊరు.. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల రక్తగర్భ.. వరంగల్లు.
స్థలం : జనఫథం
తేదీ : ఆగస్ట్‌ 20
సమయం : ఉదయం 10.30 గం.
వేదికపైన ఒక బేనర్‌ ఉంది.. జనసేన పరిచయసభ
వేదికపై నలుగురు వ్యక్తులున్నారు.. నేలపై.. తెల్లని పరుపులపైన.. ఎదురుగా నేలపై తెల్లని జంపుఖానల మీద దాదాపు వందమంది ఆహుతులు..
ఆచార్య డాక్టర్‌ గోపీనాథ్‌. రామం. క్యాథీ.. శివ.
ముందున్న వాళ్ళలో.. దాదాపు అన్ని తెలుగు న్యూస్‌ ఛానళ్ళ బాధ్యులు.. ప్రముఖ దినపత్రికల సంపాదకులు.. నగరంలోని సీనియర్‌ పౌరులు.. పౌరహక్కుల మేధోజీవులు.. యిదివరకు అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన డాక్టర్లు, ప్రొఫెసర్లు, రిటైర్డ్‌ ఐఎఎస్‌, రిటైర్డ్‌ ఐపిఎస్‌, ప్రజాసంఘాల వరిష్ఠ పౌరులు.. భారత దేశాన్ని స్వాతంత్ర సిద్ధిపూర్వం, తర్వాత లోతుగా ఎరిగినవాళ్ళు.. జీవితపు లోలోతులు పూర్తిగా, బాగా తెలిసినవాళ్ళు..,
డాక్టర్‌ గోపీనాథ్‌ ప్రారంభించాడు.. ”మిత్రులారా.. ఒక పెద్ద సామాజిక పెనుమార్పు అనివార్యంగా యధా యధాహి ధర్మస్య.. అనే రీతిలో కాలధర్మానికి అనుగుణంగా కూడా.. ఒక తుఫానువలె, ప్రజాచైతన్యం ఒకటి ఉప్పెనవలె ఉవ్వెత్తున రావలసిన సమయం ఇప్పుడాసన్నమైంది. అరవై సంవత్సరాల పూర్వం ఎంతో విలక్షణమైన స్వాతంత్య్ర సమరం సాగించి సాధించిన స్వేచ్ఛ యిప్పుడు చిన్నా భిన్నమై విచ్చలవిడితనంతో, అరాచకత్వంతో, అవసరానికంటే మించిన అధిక స్వంతత్రతో, హద్దులమీరిన వ్యక్తిస్వేచ్ఛతో రోగగ్రస్తమైపోయి ఉంది. ఏ కోణంలో, ఏ రంగంలో చూచినా బహుముఖంగా, భారత సమాజం భ్రష్టుపట్టి కుళ్ళిపోయి ఉంది. చూచినా, విన్నా జుగుప్స కల్గించే రీతిలో అవినీతి, లంచగొండితనం, బహిరంగ దోపిడీ, గుండాయిజం, మాఫియా కార్యకలాపాలు పెరిగి పెరిగి ఒక సాధారణ పౌరుడెవ్వడూ క్షోభననుభవించకుండా ప్రశాంతంగా జీవించే స్థితిలో లేరు.. ఈ నేపథ్యంలో.. మిత్రులారా.. నిన్న మనం మీడియాలో మనందరం సిగ్గుపడే మంత్రి వీరాంజనేయులు స్కాం గురించి కథనాలను విన్నాం.. చూశాం.. యిటువంటివి కోకొల్లలు. ఈ దుస్థితినుండి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసి ఎలా పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ ఈ కూలిపోతున్న వ్యవస్థను పునర్నిర్మించాలన్న ఒక దుఃఖపూర్వక అంతర్జ్వలన నుండి ఈ మన ‘జనసేన’ అవిర్భవించింది.
‘జనసేన’ ఒక రాజకీయ పార్టీ కాదు. దీనికి రాజకీయ అధికారం వద్దు. ఎలక్షన్లలో పోటీచేసి గెలిచి రాజ్యాధికారం చేపట్టాలనే సంకల్పమూ లేదు. ఇది ప్రజలకోసం పుట్టి, ప్రజలతో పెరిగి.. ప్రజలతోనే జీవించి ఉంటూ ప్రజలను రక్షించుకునే పవిత్రకార్యంతో ఎల్లప్పుడూ కొనసాగాలనే ఆదర్శ లక్ష్యంతో ఆవిర్భవిస్తున్న ప్రజావేదిక..’డాక్టర్‌ గోపీనాథ్‌ చాలా సంక్షిప్తంగా. క్లుప్తంగా.. మాట్లాడుకుంటూ పోతున్నాడు.
అక్కడప్పుడు ఒక హృదయ జ్వలనానుభవ వినిమయం జరుగుతోంది.
”మొదట నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్‌ గోపీనాథ్‌. జీవితకాలమంతా ఒక ఫిజీషియన్‌గా, ప్రొఫెసర్‌గా జీవించినవాణ్ణి. వరంగల్లు ప్రజలకు నేను బాగా తెలుసు. యిప్పుడు నా వయస్సు డెబ్బయి రెండేళ్ళు ‘సమాజం ఎలా ఉండాలి… ఎలా ఉంది.’ వంటి ఆరు పుస్తకాలు రాశాను. పార్టీలు ఏవైనా అనేకానేక వ్యక్తిగత కారణాలవల్ల ప్రస్తుత భారతదేశంనిండా కేంద్రంనుండి రాష్ట్రందాకా ముసలికంపు కొడ్తున్న వృద్ధ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. వెంటనే ఈ ముసలివర్గాలను వేదికపైనుండి దింపి సామాజిక రంగాల్లో యువరక్తాన్ని నింపాలని బలంగా నమ్ముతున్నవాణ్ణి. ఐతే అపారమైన అనుభవమున్న ఈ సీనియర్‌ సిటిజన్ల విలువైన సేవలను అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకునేందుకు తగిన నిర్మాణాన్ని చేపడ్తే సమాజం ఎంతో ఆరోగ్యవంతంగా, హుందాగా రూపుదిద్దుకుంటుందని నా విశ్వాసం.. యిప్పుడు.. మిస్టర్‌ రామం..” గోపీనాథ్‌ కూర్చున్నారు.
రామం లేచి నిలబడి రెండు చేతులు జోడించి అందరికీ వినమ్రంగా నమస్కరించి.. ” నాగురించి చాలా క్లుప్తంగా మీకు పరిచయం చేసుకుంటాను..” అని చుట్టూ ఒకసారి కలియజూచి.,
ఆ హాలులో ఉన్న అందరూ ఈ దరిద్రపు కక్షుద్ర, నీచ, స్వార్థ రాజకీయాల్తో విసిగి విసిగిన అలసటలోనుండి ఏదో ఒక కాంతిరేఖవలె తారసపడ్డ ఈ యువకెరటమన్నా ఓ ఆశావహమైన మార్పునూ. చైతన్యాన్నీ, భవిష్యత్తునూ రూపొందిస్తుందేమో అన్న జిజ్ఞాసతో పరిశీలనగా చూస్తూండగా.,
”పెద్దలు.. జీవితాన్నీ, సమాజాన్నీ, ఈ దేశాన్నీ ఎంతో లోతుగా ఎరిగిన విజ్ఞులారా.. నా పేరు రామం. నేను జన్మతః వరంగల్లువాణ్ణి. నా తండ్రి గత సంవత్సరమే పోయాడు. ఆయన మీకందరికీ తెలుసు. జీవితకాలమంతా రీజనల్‌ ఇంజినీరింగు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగు ప్రొఫెసర్‌గా పనిచేసిన సామాజిక వేత్త డాక్టర్‌ రామనాథం. నేను ఆర్‌.ఇ.సి. వరంగల్లులో డిగ్రీ పూర్తి చేసి, ఐఐటి మద్రాస్‌ నుండి ది హైయ్యర్‌ డిస్టింక్షన్‌లో ఎమ్‌టెక్‌ చేసి.. కాంపస్‌ సెలక్షన్‌లో ఎంపికై..భారతదేశపు అత్యుత్తమ విద్యావంతులైన యువత విదేశాలపాలైనట్టుగానే డాలర్ల, సుఖాల వ్యామోహంలో అమెరికా వెళ్లి పదకొండు సంవత్సరాలు నివసించివచ్చిన వాణ్ణి. ఐతే ప్రస్తుత భారత, ప్రధానంగా తెలుగు సమాజంలో..ఉంటే పుస్తకాల పురుగులు, లేకుంటే దిక్కుమాలిన వెధవలుగా తయారౌతున్న ఒక చిత్రమైన స్థితినుండి … రాజకీయాలంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఒక అంటరాని కలుషితరంగమని దూరంగా ఉంచుతున్న వర్తమానం నుండి.. నాన్న రాసిన అనేక పుస్తకాలను విపులంగా అమెరికా వెళ్లిన తర్వాతే అధ్యయనం చేసి.. చేసిన తప్పును తెలుసుకుని, చెంపలేసుకుని.. ఆలస్యంగానైనా.. ఈ పవిత్ర భారతదేశ పౌరునిగా నా బాధ్యతలను మదింపు చేసుకుని చాలా స్పష్టమైన లక్ష్యాలతో, ప్రణాళికతో అవినీతి నిర్మూలనకోసం, విలువల పునఃప్రతిష్టకోసం రంగప్రవేశం చేస్తున్నవాణ్ణి..”
అంతా నిశ్శబ్దం. వింటున్నారందరూ ఆసక్తిగా.. ఐతే ఎంతోగాఢమైన చింతనగల ఆ మేధోజీవులెవరికీ యింకా రామం గురించిన విలక్షణత ఏమీ కనబడలేదు.
”ప్రవేశం చాలా ఆలస్యంగానే జరుగుతోంది. పోల్చుకోవడం సరికాదేమోగాని.. గాంధీ తన నలభై ఆరవ సంవత్సరంలో ప్రజాఉద్యమంలోకి ప్రవేశించాడు. నెహ్రూ 32 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి దూకారు. మావో ముప్పయ్యయిందేడ్ల తర్వాత, నెల్సన్‌ మండేలా నలభై సంవత్సరాల వయసులో ప్రజాజీవితంలోకి వచ్చారు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా సరియైన సమయంలోనే నేను మీ అందరి ముందుకు వస్తున్నాని అనుకుంటున్నాను.”
”మిత్రులారా.. బ్రిటిష్‌ పాలకుల కబందహస్తాలనుండి విముక్తమైన భారతదేశం స్వాతంత్య్రానంతరం స్వదేశీయుల నీచరాజకీయాల్లో కూరుకుపోయి పరాయిపాలకులకంటే అతి భయంకరంగా దోపిడీ చేయబడ్తోంది. నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయాయి. లంచగొండితనం, అవినీతి చాలా బహిరంగంగా ఒక పౌరహక్కుగా మారి విలయతాండవం చేస్తోంది. క్రమశిక్షణ అనేది అన్ని రంగాల్లో లుప్తమైపోయింది. జవాబుదారితనం అనేది ఎక్కడా, ఎవరిదగ్గరా లేదు. విచ్చలవిడితనం, అతిస్వేచ్ఛ, సంస్కృతి విధ్వంసం, అరాచకత్వం అన్నీ తారాస్థాయికి చేరి పరిహసిస్తున్నాయి. ప్రజలకు కనీస ఉపాధి.. సరియైన ధరలకు సరుకులు, నాణ్యమైన సామాజిక జీవావరణ.. ఇవేవీ లేవు. అంతిమంగా అన్ని రంగాల్లోనూ ఎవరిపైనా ఎవరికీ నియంత్రణలేని, ఎవరికీ పట్టని ఉదాసీన, నిర్లక్ష్య, అసమర్థ వ్యవస్థ విస్తరించి సమాజం నిర్వీర్యమై చచ్చిన పాములా పడి ఉంది.”
చటుక్కున.. అనూహ్యంగా ఆహూతుల్లోనుండి ఎవరో ఆవేశంగా చప్పట్లు చరిచారు. అందరూ ఎవరా అది అని వెనక్కితిరిగి చూచారు. వెనుకవరుసలో ఎవరో ఓ యువకుడు.. బహుశా విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తేమో.
”మిత్రులారా.. సారీ మీ సమయాన్ని తీసుకుంటున్నాను. కాని ఈ మాత్రం వివరణాత్మక పరిచయం అవసరమే అనుకుంటున్నాను. ప్రజల్లో రాజకీయనాయకులంటే విశ్వాసం, పూర్తిగా నశించిపోయింది. రాజకీయమంటే క్విక్‌ మనీమేకింగు యాక్టివిటీగా ముద్రపడింది. ప్రజలసేవకోసమే రాజకీయాలు అన్న స్పృహ అస్సలే లేదు. అందువల్ల మేము మా ప్రాథమిక ధర్మంగా ప్రజలకు మాపై నమ్మకమేర్పడే విధంగా ముందుగా మా వ్యక్తిగత జీవితాలను ఆదర్శంగా జీవించి చూపించదలుచుకున్నాం. దయచేసి విజ్ఞులు ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాలను శ్రద్ధగా విని మాకు అవసరమైతే మార్గదర్శనం చేయాలని విన్నవించుకుంటూ.. ఒకటి.. ఇప్పుడు మనందరం కూర్చున్న కుటీరంవంటి నిరాడంబరమైన సౌకర్యాలున్న ఈ ప్రాంగణమే మా వసతి. ఇదే జనసేన కార్యాలయం. కార్యస్థలం. నిరంతరం దీని తలుపులు ప్రజలకోసం తెరిచిఉంటాయి. రెండు.. ఈ క్షణంవరకు మాకున్న సర్వసంపదనూ ఒక ట్రస్టీగా ఏర్పాటుచేసి దాని నిర్వహణలోకి తెస్తున్నాం. యికముందు మాకెవ్వరికీ వ్యక్తిగత ఆస్తులనేవి ఉండవు. మూడు.. జనసేన ఒక రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని ఏవేవో చేస్తామని వాగ్దానాలు చేసి దారితప్పే సంస్థ అసలేకాదు. కాని ప్రజలను చైతన్యవంతులనుచేసి మున్ముందు ‘జనసేన’ ఆమోదం ఉన్నవాళ్లనే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకునేస్థాయిలో రాజకీయ పక్షాలను ప్రభావితం చేసి తను ఒక మార్గదర్శక సంస్థగా మాత్రమే భావిప్రభుత్వాలను నడిపిస్తుంది. మిత్రులారా.. యిక్కడ ఒక విషయం ప్రత్యేకంగా మనవి, కాదు గుర్తుచేయాలి. బహుశా అనుకుంటాను ప్రపంచంలోనే ఎవరూ చేయని అద్భుత ప్రయోగాన్ని మన పూర్వీకుడైన గాంధీ చేసి చూపించాడు. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. చేపట్టలేదు. కాని ప్రజలనూ, ప్రభుత్వాలనూ తన నిబద్ధతతో, వ్యక్తిత్వంతో విపరీతంగా ప్రభావితం చేశాడు. ‘జనసేన’ పంథాకూడా సరిగ్గా అదే. ఇప్పుడు మీముందున్న ఈ టీంలో ఎవ్వరుగానీ, మున్ముందు ఎటువంటి సంస్థాగత పదవులను చేపట్టరు. నాల్గు .. ‘జనసేన’కు  హింసమీద నమ్మకంలేదు. ‘అహింస ద్వారానే గాంధీమార్గంలో అన్నీ సాధిస్తుంది. ఐతే ‘భయా’నికి మాత్రమే లొంగే మనిషిని భయపెట్టి పనులు చేయించేందుకు, సరియైన మార్గంలో పెట్టేందుకు వాడు చేస్తున్న తప్పులను ప్రజల సమక్షంలో బహిరంగపరిచి.. సిగ్గుపడేలా, తలవంచుకునేలా చేసి భయపెడ్తుంది. వెంటపడ్తుంది. సరియైన దారిలో పెడ్తుంది. దేనికీ లొంగని మనిషి ప్రజల సమక్షంలో దోషిగా నిలబెట్టబడ్డప్పుడు తప్పకుండా తన తప్పును ఒప్పుకుంటాడనీ, ప్రజలమాట వింటాడనే పరమసత్యాన్ని ‘జనసేన’ పూర్తిగా విశ్వసిస్తో ంది. ఆ సిద్ధాంతంపైననే పనిచేస్తుంది.”
అనూహ్యంగా వెనుకనుండి మళ్ళీ చప్పట్లు వినబడ్డాయి. ఐతే ఈ సారి ఒక వ్యక్తినుండి కాదు. ఐదారుగురు సంతోషాతిరేకాలతో స్పందించారు.
”ఐదు. సరియైన దిశానిర్దేశం జరుగకపోవడం, నైతిక బాధ్యతను వహించి విద్యాసంస్థలు.. అంటే ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాలదాకా ఎవరూ ఈ తరానికి, నైతిక ప్రవర్తన గురించీ, నీతి నియమాల గురించీ, బాధ్యతల గురించీ, చెప్పవలసినంతగా ఏ స్థాయిలోనూ చెప్పకపోవడంవల్ల ఏర్పడ్డ దురదృష్టకర ఖాళీని .. వెంటనే నైతిక విద్యాబోధన ద్వారా ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమస్థాయిలో చేపట్టి విజయవంతం చేయడం. ఈ క్రమంలో యిప్పటికే మనవద్ద సుశిక్షితులైన ఎనమిది వందల ఎనభై ఆరుమంది కార్యకర్తలున్నారు. అరవై నాల్గు జనసేన విభాగాలేర్పడ్డాయి రాష్ట్రవ్యాప్తంగా ఈ ‘ప్రక్షాళన’ కార్యక్రమమే జనసేనకు ప్రాణవాయువు. జీవం. జనసేన దీన్ని ఒక బహిరంగ మహోద్యమంగా చేపట్టబోతోంది మున్ముందు.. ఐదు.. ఒక చిన్న పిల్లాడిని నిలబెట్టి ఓ రూపాయి బిళ్లని ఉచితంగా ఇస్తే. ‘ఏమిటిది.. ఎందుకిస్తున్నారు.’ అని ఎంతో ఆత్మాభిమానంతో, రోషంతో ఎదురు ప్రశ్నిస్తాడు. ‘ఊర్కే ఉంచుకో’ అంటే పౌరుషంతో మన రూపాయి బిళ్లను మన ముఖానకొట్టి ”నేను బిచ్చగాణ్ణి” కానని తన ఆత్మగౌరవాణ్ణి ప్రదర్శిస్తాడు. కాని సిగ్గులేని అనేక భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను దండుకోవడంకోసం ప్రజాకర్షక పథకాలను.. పిల్లవానికి ఉచితంగా రూపాయినిచ్చి అవమానించినట్టు ఉచిత కలర్‌ టి.విలు, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్తు, ఉచిత నగదు.. ఇలా అనేక ఉచితాలను ఆశచూసి పేద ప్రజలను యాచకులుగా, సోమరిపోతులుగా, పనిదొంగలుగా మారుస్తున్నాయి. అట్టడుగు జనం ఈ దిక్కుమాలిన నిషావంటి జీవితాల్లో కూరుకుపోయి ప్రభుత్వమే తెచ్చి వాకిట్లోపెట్టి కవ్విస్తూ అమ్ముతున్న మద్యం అలవాటుకు బానిసలై ”హూమన్‌ గార్బేజ్‌” గా మారతున్నారు. కొద్దిగా ఉన్నవాడు ఇంకా ఇంకా సంపాదించుకునేందుకు అనేక అక్రమ మార్గాలద్వారా సాధ్యమౌతుంటే పేదలింకా నిరుపేదలుగా మారుతూ ఒక సన్నని విభజనరేఖ మనుషులను హావ్స్‌ అండ్‌ హ్యావ్‌నాట్స్‌గా వర్గీకరిస్తోంది. ఈ దుస్థితికి తోడుగా కులవ్యవస్థను కూలదోయవలసిన ప్రభుత్వం కులసంఘాలను ప్రోత్సహిస్తూ పాలనను కులాల ప్రాతిప్రదికన వాటాలు వేస్తోంది. మంత్రులకూ వాళ్లు నిర్వహించే శాఖలకు అసలు సంబంధమేలేదు. వెనుకట ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను, అవసరమనిపిస్తే చట్టసభల్లో లేనివాళ్లను పిలిపించి మంత్రులగా నియమించి పరిపాలనకు న్యాయం చేసేవాళ్లు. యిప్పుడు తమ కుల, రాజకీయ నేపథ్యాన్ని బట్టి బహిరంగంగా, నిస్సిగ్గుగా డబ్బును దండిగా దండుకోగలిగే శాఖలను డిమాండ్‌ చేసి లాక్కుని మరీ అనుభవిస్తున్నారు. లక్షలకోట్ల స్కాంలు ఋజువుల్తో సహా బయటపడ్తున్నా ఎవడూ ఎవనిపైన చర్యలే తీసుకోవడంలేదు. ఏమిటీ నిర్వీర్యత.. ఏమిటీ నిష్క్రియాపరత్వం. ఎన్నోసార్లు అసలు ప్రభుత్వాలున్నాయి లేవా అనే సందేహం అరచి ప్రశ్నిస్తోంది. వేలకోట్ల రూపాయల ఖనిజాల అవినీతి, టెలికమ్యూనికేషన్ల అవినీతి, భూకుంభకోణాల అవినీతి, మెడికల్‌ ఇంజినీరింగు కాలేజీల అవినీతి.. ఇలా లెక్కలేనన్ని స్కాంల వెల్లువల్తో దేశం గబ్బుపట్టిపోతోంది. చివరికి ‘రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడౌతాడనే’ విధంగా పూర్తిపతనం జరిగింది. ఐతే మేధావులు, బాధ్యతాయుతమైన పౌరులు కొందరు టి.వి. చర్చల్లో కొట్లాడుకోవడం తప్పితే క్రియాశీలకంగా చేసిన ఉద్దరణ చర్యలేవీలేవు.. ఇప్పుడెలా.?
దేశం వృద్ధ నాయకుల చేతుల్లో ఉంది. బంట్రోతు ఉద్యోగానిక్కూడా కనీస విద్యార్హతలను నిర్ధేశిస్తున్న మనం ఈ రాజకీయ పదవులకు కనీస విద్యార్హతలనెందుకు నిర్ధేశించడంలేదు. రాజకీయాలకు వయోపరిమితులెందుకు లేవు. కదలలేని వాడుకూడా కుర్చీలపై కూర్చుని స్వారీ చేయడమెందుకు?
ఇప్పుడు మనం చుట్టూ ముక్కుపుటాలు పగిలిపోయే దుర్గంధాన్ని భరిస్తూ.. శ్రీశ్రీ అన్నట్టు సందులలో పందులవలె కొనసాగడమా..మనవంటి బుద్ధిజీవులు యికనైనా కొరడా ఝుళిపించి ప్రజల సత్తా ఏమిటో చూపించడమా.. ‘ప్రజలు’ అనే నిర్వచనం యిప్పుడున్న ఈ జనానికి వర్తిస్తుందో లేదో నాకు తెలియదుకాని. ఎందుకంటే నాయకులు, ప్రభుత్వాధికారులు ఏవిధంగా నీతి రీతి తప్పి పశువులకన్నా హీనంగా ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలుకూడా ఎవడు ఏదిస్తే అది తీసుకుని, ఎవనిముందు వాని పాటపాడి, తానతందాన రీతిలో తమ అవిద్యను, అజ్ఞానాన్ని జోడించి అతిగా, స్మార్ట్‌గా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా మనచుట్టూ ఓ పెద్ద భూమిపుండులా విస్తరించి ఉంది. ఈ భూమిపుండులో చిక్కుకున్న మేకవలె కదుల్తున్నకొద్దీ యింకా యింకా లోపలికి కూరుకుపోతూ.. చూస్తూండగానే మరణం దగ్గరికి చేరుకుంటోంది.
మిత్రులారా.. యిక్కడున్న మనలో ప్రతివారూ నేనిప్పుడు చెప్పిన సంకక్షుభిత సందర్భం గురించే మథనపడ్తున్నారని నేననుకుంటున్నా.. యిక ఉద్యమిద్దాం.. ఉదాసీనత యిక ఏమాత్రం తగదు. అడుగులు ముందుకు వేద్దాం.. అందుకు మేం నడుంబిగించి సంసిద్దులమై ఉన్నాం. మీరు మాతో చేరి..లేక మమ్మల్ని మీతో కలుపుకుని ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుద్దాం.. కొత్త ప్రపంచ ద్వారాలను తెరిచి నూతన చరిత్రను సృష్టిద్దాం.”
రామం ఆగాడు వడగళ్ళవాన ఆగినట్టు..ఒక తుఫాను క్షణకాలం స్తబ్దించినట్టు.. నిశ్శబ్దం.
దాదాపు అందరూ అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టారు. కొందరు యువకులైతే అబ్బా యిన్నాళ్ళకు మాకు ఓ కాంతిరేఖ కనిపిస్తోందన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరై దీర్ఘమైన చప్నట్లతో పెల్లుబికే ఆవేశాన్ని ప్రదర్శించారు.
”ధన్యవాదాలు మిత్రులారా..” అని రామం కూర్చున్నాడు.
హాలునిండా ఒకరకమైన రిక్తత చోటు చేసుకుంది. అది భూమిలోనుండి పొరలను చీల్చుకుని మొలక ఈ విశాల విశ్వంలోకి తలెత్తుకున్నప్పటి బీభత్స నిశ్శబ్దం.
కొద్ది వ్యవధి తర్వాత.. డాక్టర్‌ గోపీనాథ్‌.. ” యిప్పుడు మిస్‌ జేమ్స్‌ హెచ్‌. క్యాథీ తనను పరిచయం చేసుకుంటారు.” అన్నారు ముక్తసరిగా.
క్యాథీ లేచి నిలబడి ఒకసారి అందరివంకా వినమ్రంగా చూచింది..మొట్టమొదటిసారిగా రెక్కలను సవరించుకుంటున్న ఎగురబోయే పక్షిలా.
అందరూ ఆమెవంక ఆసక్తిగా చూశారు.. ఆమె విదేశీయురాలు కావడం, ఆ వేదికపై ఆమె ఉండడం వెనుక ఆమె పాత్రపై ఉత్సుకత అందరికీ..వింటున్నారు శ్రద్ధగా.
”పెద్దలందరికీ నమస్కారం..” స్పష్టమైన తెలుగు. ”నా పేరు జేమ్స్‌ హెచ్‌. క్యాథీ. నేను అమెరికన్‌ జాతీయురాలిని. అమెరికాలోనే పుట్టి, అక్కడే పెరిగి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంనుండి 1997లో యూనివర్సిటీ టాపర్‌గా ఎంబిఎ పట్టా పుచ్చుకున్నదాన్ని. స్వతహాగా పరిశ్రమలు నడుపుతూ వ్యాపారంలో ఉన్న వ్యక్తిని నేను. రామంగారితో పదేళ్లక్రితం ఏర్పడ్డ పరిచయం.. స్నేహం.. ఒక వ్యక్తి ఒక మహోన్నత నిర్వచిత లక్ష్యంవైపు నడుస్తున్నపుడు వెంట ఉండడానికి యిష్టపడి.. పాలు పంచుకోవాలని తపించి ఒక అనుచరురాలిగా.. అతనితో ఈ విప్లవాత్మక.. నేను దీన్ని అహింసాయుత విప్లవమనే నిర్వచిస్తున్నాను. ఈ విప్లవాత్మక గమ్యాన్ని చేరేందుకు ఆయన వెంట నీడలా ఉందామని నిశ్చయించుకుని.. మీ భాషను, మీ మహోన్నత సాంస్కృతిక నేపథ్యాన్ని, మీ చరిత్రను, వారసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేసి..ఐచ్చికంగా మీ ముందు నిలబడ్డదాన్ని.. నన్ను మీరు ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తాను..” అని రెండు చేతులనూ జోడించింది వినయంగా.
చప్పట్లు.. ప్రశంసా పూర్వకమైన వ్యక్తీకరణ.
క్యాథీ కూర్చుంది.
తర్వాత.. డాక్టర్‌ గోపీనాథ్‌ పరిచయం చేస్తూండగా, ముప్పయ్యేళ్ల శివ వేదికపై లేచి నిలబడ్డాడు. చిన్నగా పెరిగిన గడ్డం. సన్నగా నిరాడంబరమైన వేషధారణ, లాల్చీ.. ప్యాంట్‌. కళ్ళద్దాలు. ముఖంపై నిశ్చలమైన స్థిరత్వం.
”నేను శివ. మాస్టర్‌ ఇన్‌ కార్డియోథొరాసిక్‌ సర్జరీ.. గుండె ఆపరేషన్లు చేయడం నా వృత్తి. ఐతే హృదయం గురించి తెలిసినవాణ్ణి. ఈ మన వర్తమాన భారత సమాజంలో హృదయంలోపిస్తోంది. దాన్ని పునఃప్రతిష్టించడం కోసం రామంగారి వెంట.. రాముని వెంట హనుమంతునిలా ఉందామని..అంతే..”
చప్పట్లు..
”మిత్రులారా.. ఇప్పుడు మనం ఓ పదిహేను నిముషాలు తేనీటి విరామం తీసుకుని.. మనం గడిపిన ఈ గంటసేపట్లో తెరపైకి తెచ్చిన కొత్త ఆలోచనలను పరస్పరం ఎవరికివారుగా పంచుకుని.. మళ్లీ సమావేశమౌదాం..” అని మైక్‌లో ప్రకటించారు డాక్టర్‌ గోపీనాథ్‌.
అప్పట్నుండీ ఏకబిగిన కొనసాగిన గంభీరత సడలి.. దాదాపు అందరూ లేచి నిలబడి.. ఊపిరి తీసుకుని.. బయటికి వరండాలోకి నడిచారు ఎవరికివారు.
వరండాలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన తేనీటి టేబుల్స్‌.. ప్రక్కనే బిస్కెట్లు.. పళ్ళ ముక్కలు.. కొందరికోసం పళ్ళ రసాలు..ప్రతి టేబుల్‌ దగ్గర వాలంటీర్స్‌.. క్రింద చుట్టూ పచ్చని గడ్డి.. పూలమొక్కలు. అక్కడక్కడ పావురాలు ఎగురుతూ.. మంచి అందమైన ల్యాండ్‌స్కేపింగును ఎవరో మంచి అభిరుచి ఉన్న మనిషి చేయించినట్టుగా.. మొత్తంమీద అంతటా క్రమశిక్షణ నిండిన అదోరకమైన గంభీర వాతావారణం ఆవరించి ఉంది చుట్టూ.
వచ్చిన వ్యక్తులందరూ జీవితాన్ని సీరియస్‌గా తీసుకుని సందర్భాన్ని అర్థవంతంగా ఆలోచించగల మేధోజీవులే. పాజిటివ్‌ అటిట్యూడ్‌తో పరిస్థితులను స్వీకరించడం మనిషికి అత్యంత అవసరమైన సంస్కారం. ఐతే దురదృష్టవశాత్తు వర్తమాన సామాజిక విశ్లేషకుల్లో ఎవనికివాడు ఓ ప్రపంచస్థాయి మేధావిగా భావించుకుంటూ ఎదుటిమనిషిలోని లోపాలను అన్వేషించడమేగాని తానుఎంతవరకు సహనశీలంగా, అంగీకార తత్వాన్ని కలిగి ఉన్నాడో ఆత్మపరీక్ష చేసుకోడు. ఈ తత్వంగలిగి కేవలం మాటలకు, చర్చలకు మాత్రమే పరిమితమయ్యే సూడో మేధావులను ఉద్యమకారులు గుర్తించి వారిని దూరంగా ఉంచడమో, తామే దూరంగా జరుగడమో చేయాలి. లేకుంటే వీరు కర్ణునిలాంటి మహావీరునికి శల్యసారధ్యం వహించినట్టు ఉద్యమహననానికి కారకులౌతారు. రామంకు, క్యాథీకి, డాక్టర్‌ గోపీనాథ్‌కు ఈ సంక్లిష్టమైన సున్నితమైన విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉంది.
”నాకెందుకో.. యిన్నాళ్ళకు ఏదో ఒక ఆశారేఖ కనిపిస్తోంది రామారావుగారూ..” అన్నాడు ప్రముఖ రచయిత, కవీ, నిజాయితీకి మారుపేరైన కాంతారావు తన ప్రక్కనే టీ చప్పరిస్తున్న పౌరహక్కుల నేత రాములుతో
”ఔను.. నాక్కూడా. దానికి సిద్ధాంతరీత్యా రెండు హేతువులున్నాయి. ఇంతవరకూ ఎవడు రాజకీయాల్లోకొచ్చినా అధికారాన్నీ, కుర్చీని ఆశించీ, రాజ్యాధికారం లక్ష్యంగానే వచ్చాడు. వచ్చిన మర్నాటినుండి డబ్బును దోచుకోవడమే వ్యాపకంగా పెట్టుకున్నాడు. వీళ్ళు మాకు అధికారం వద్దంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన. కాగా ఈ ఆదర్శ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న రామం..ఇతర వ్యక్తులందరూ స్వంత ఆస్తులనేవీ లేకుండా ప్రజలకోసమే ప్రజల సమక్షంలో పారదర్శకంగా, నిరాడంబరంగా జీవించేందుకు సిద్ధపడి రంగంలోకి దిగుతున్నారు. మనిషి స్వార్ధాన్నీ, సుఖవాంఛలనూ విడనాడితే క్రమంగా ముముకక్షువుగా మారుతాడు. యిది ఎంతో ఆరోగ్యవంతమైన పరిణామం.. చూద్దాం.. దీన్ని సమర్థించడం వెంట ఉండడం, వెంటనడవడం మన బాధ్యత.”
”ఔను.. నాకూ అలాగే అనిపిస్తోంది.”
ఇంతలో రామం, క్యాథీ వాళ్ల దగ్గరకొచ్చారు ఒక్కొక్కరిని పలకరిస్తూ, రామారావు. రాములు కరచాలనాలు చేసి తమను తాము సంక్షిప్తంగా పరిచయం  చేసుకుని.. ”బెస్టాఫ్‌లక్‌ రామం. వుయార్‌ హైలీ హోప్‌ ఫులాఫ్‌ సం బెటర్‌ థింగ్సు టు అక్కర్‌..” అన్నాడు రాములు ప్రసన్నంగా.
”థాంక్యూ సర్‌.. మనం కలిసి నడుద్దాం సర్‌..”
తర్వాత ఒక టి.వి న్యూస్‌ చానల్‌ అధినేత రాజేందర్‌రాజు రామంను పలకరించి.. ”కంగ్రాట్స్‌ రామంగారూ.. బెస్టాఫ్‌ లక్‌ ఇన్‌ యువర్‌ ఎండీవర్‌..” అంటున్నాడు.
ఇంతలో లోపల్నుండి.. ఎవరో మైక్‌లో అందరినీ తిరిగి తమ తమ సీట్లలోకొచ్చి ఆసీనులు కావాల్సిందిగా అనౌన్స్‌ చేస్తున్నారు.
లోపలికి కదిలారు ఒక్కొక్కరే.
ఇప్పుడు వేదికమీద ఎవరూ లేరు. ఒక్క డాక్టర్‌ గోపీనాథ్‌ మాత్రమే ఒకే ఒక కుర్చీలో కూర్చుని ఉన్నవాడు లేచి మైక్‌ ముందుకొచ్చి.. ”మిత్రులారా.. మనసులో ఒక ప్రణాళికగా ఉన్న ‘జనసేన’కు సంబంధించిన ఆలోచనలను మీ ముందుంచాం. ఈ శక్తివంతమైన ఊహకు రిహార్సల్‌గా నిన్న.. గూడెం అడవుల్లో భద్రాచలం గోదావరీ పరీవాహప్రాంత గిరిజన, మూలవాసీ సంఘం, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఒక ‘నిలతీత’ కార్యక్రమం జరిగింది. దాదాపు ముప్పయి ఏడు లక్షల ప్రపంచబ్యాంకు నిధులను వేయని రెండు రోడ్లను వేసినట్టు, అవి కొట్టుకుపోయినట్టు మంత్రి వీరాంజనేయులు నుండి చీఫ్‌ ఇంజినీర్‌, ఇ.ఇ. ఇత్యాది అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వరకు కుమ్మక్కై పంచుకున్న సత్యాన్ని సోదాహరణంగా ఋజువు చేసి.. అందరినీ కస్టడీలోకి తీసుకునేలా చేసిన సంగతి ఈ రోజు మీడియా ద్వారా మీకందరికీ తెలిసిందే. దీంతో జనంలో అధికారుల్లో, రాజకీయవర్గాల్లో ఒక వణుకు పుట్టింది. ఇది మన తొలి విజయం. ఈ సందర్భంగా మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలను యిక్కడ ఉటంకించడం ప్రధానమని భావిస్తున్నాను. ఏమిటంటే ఒక సామన్య పౌరుణ్ణి ఎక్కడైనా పోలీసులు ఏదో నేరంపై అరెస్ట్‌ చేస్తే అతను తానునిజంగా నిరపరాధినని ఎంత మొత్తుకొని తన వాదనకు ఆధారాలను చూపేందుకు ప్రయత్నించినా పోలీసులు అతని మాటను వినరు. నువ్వు చెప్పదల్చుకున్నదంతా పోలీస్‌స్టేషన్‌ కొచ్చిన తర్వాత అక్కడో లేక కోర్టులోనో చెప్పుకో అని గదమాయిస్తాడు. కాని ఇదే న్యాయాన్ని పెద్దలకూ, రాజకీయులకూ వర్తించకుండా పోలీసులు వాళ్లను వెనకేసుకొస్తున్నారు. ఋజువులను చూపించినా అవి కోర్టులో నిరూపణయ్యేదాకా వారు నిర్దోషులేననే వితండవాదం చేస్తూ కొంత వెసులుబాటు నివ్వడం, ఆలోగా వాళ్ళ లాయర్స్‌ కోర్టుద్వారా బెయిల్‌ తీసుకుని రావడం, ఈలోగా నిందితునికి షరా మామూలుగా గుండెనొప్పి రావడం – ఆస్పత్రిలో చేర్పించడం.. ఇదంతా ఓ డ్రామాగా మారింది. కాబట్టి ఈ కేస్‌లో మంత్రికీ, మిగతా అధికారులకూ జీప్‌ ఎక్కిన మరుక్షణమే గుండెనొప్పులు వస్తాయని ముందే ఊహించి, కస్టడీలోకి తీసుకుంటున్నపుడు ఒక హృద్రోగ నిపుణుణ్నికూడా వెంట సహాయయకునిగా ఏర్పాటుచేసుకోవాలని ఆదేశిస్తున్నాను.” అని.. ఇది నిజంగా ఒక అపూర్వమైన విజయం.. ఇంటువంటివి మున్ముందు ఎన్నో మనం తప్పకుండా సాధిస్తామనీ, ప్రజల్లో నిప్పువంటి చైతన్యాగ్నిని రగిలించగల్గుతామని విశ్వసిస్తూ.. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు ‘అగ్ని’ వార్తా ఛానల్‌ అధినేత మూర్తిగారిని ఆహుతులనుద్దేశించి తమ ప్రతిస్పందనను పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.”
మళ్ళీ నిశ్శబ్దం.. నిశ్శబ్ద గంభీరం.
యాభై ఆరు సంవత్సరాల ద్వారంపూడి కృష్ణమూర్తి.. పాత్రికేయ వర్గాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలను పొందుతున్న.. ఒకప్పటి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు సంపాదకుడు, ప్రస్తుతం ‘అగ్ని’ న్యూస్‌చానెల్‌కు సిఇవో ఐన మూర్తి చాలా నిలకడగా నడచి వేదికపైకి వచ్చి.,
స్థిరమైన గొంతుతో..”మిత్రులారా.. ఈ రోజు ఎంతోసుదినం. ఈ మనుషుల గురించి, ఈ భారత పౌరుల గురించి, ఈ వ్యవస్థ గురించి రోజురోజుకూ భ్రష్టుపట్టిపోతున్న దుష్ట రాజకీయ వికృత చర్యల గురించీ సీరియస్‌గా ఆలోచిస్తున్న కొద్దిమంది బుద్ధిజీవుల మనోవేదననూ, అసంతృప్తినీ, ప్రేక్షకపాత్ర మాత్రమే వహించక తప్పని అనివార్య పరిస్థితులనూ ఒక అతి ప్రధానమైన సందర్భంగా గుర్తించి ఈ దురవస్థనుండి బయటపడే మార్గాలను అన్వేషించడానికి ఈవిధంగా అంకితభావంతో మనందరం, సమావేశం కావడమే నాకు పరమ ఆనందాన్ని కల్గిస్తోంది. ఇటువంటి ప్రయోజనకరమైన సందర్భాన్ని సృష్టించినందుకు, మనందర్ని యిక్కడకు ఆహ్వానించినందుకు రామంకు క్యాథీకి డాక్టర్‌ గోపినాథ్‌ గారికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్లను అభినందిస్తున్నాను.”
వాతావరణం చాలా గంభీరంగా ఉంది.
”మిత్రులారా.. వ్యాపారమేదైనా దాని సక్సెస్‌ కేవలం రెండు విషయాలపైననే ఆధారపడి ఉంటుంది. అవి..ఒకటి వస్తువు యొక్క గరిష్టమైన నాణ్యత.. అతి తక్కువ ధర. అదేవిధంగా సుదీర్ఘమైన మానవ పరిణామ వికాసాల చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేస్తే తేలే విషయమేమిటంటే.. ఒక మనిషేకాదు. జీవి ఏదైనా అంతిమంగా ”భయా”నికి మాత్రమే లొంగుతుంది. ఏదో ఒక భయం లేనిది మనిషి వినడు. తప్పుచేస్తే అమెరికావాడు విపరీతమైన ఫైనేస్తాడని భయం. ఆరబ్‌ దేశాల్లో తప్పుచేస్తే చేతులుకాళ్లు నరికేస్తారని భయం.. చెప్పినట్టు వినకుంటే తాలిబన్లు ప్రాణాలు తీస్తారని భయం.. ఆలస్యంగా ఆఫీస్‌కు పోతే అబ్సెంటేస్తారనీ, జీతం కట్‌ చేస్తారనీ భయం.. చివరికి ఏ ఇంట్లోనైనా కూడని పని చేస్తే పిల్లలను ‘తండ్రి’ తంతాడని భయం.. ఐతే ఏ భయమూ లేకుండా నిస్సిగ్గుగా, జంకూగొంకూ లేకుండా బహిరంగంగా ఈ దేశఖజానాను, ఈ దేశ భూమిని, భూమిని తవ్వుకుని ఖనిజాలను, అడవులను, బొగ్గును, అప్పులు కూడా చేసి ఆ లక్షలకోట్ల డబ్బును.. తింటూనే,  ఏండ్లకు ఏండ్లుగా ఏళ్ళ పర్యంతం యింకా తినే కార్యక్రమాలను కొనసాగిస్తున్న రంగం..మన భారత రాజకీయ రంగం భ్రష్టుపట్టిపోయింది. ఈ భారత రాజకీయ నాయకులు ఎటువంటి భయమూ, సిగ్గూ లేకుండా ఈ దేశాన్ని తినీతినీ అంతా ఖాళీచేసి యిక దీన్ని ఎవ్వరూ రిపేర్‌ చేయలేని దయనీయస్థితికి తెచ్చిపెట్టారు. యిప్పుడీ దేశం బంగారురంగు అట్టపెట్టెలో ఏమీలేని ఒట్టి ‘డొల్ల’గా మిగిలి ఉంది. వీళ్ళకిప్పుడు..ఉచ్ఛలుపోయించే ఏదో ఒక ‘భయం’ కావాలి – ఆ ‘భయాన్ని’ సృష్టించగల్గితే మనం మన ఆలోచనలు.. మన ప్రయత్నాలు సఫలమైనట్టే..”
రామం చాలా జాగ్రత్తగా వింటున్నాడు మూర్తిగారి ప్రసంగాన్ని. మేనేజ్‌మెంట్‌ సైన్స్‌లో ఒక ప్రిన్స్‌పుల్‌ ఉంది. అది ‘లెటిట్‌ కం ఫ్రం అదర్‌సైడ్‌ ఆల్వేస్‌” అని .. విషయం ఎంత ప్రధానమైందైనా ఎదుటివ్యక్తితో మనం ప్రతిపాదిస్తే దాని విలువ అంతగా ఉండదు. అదే ప్రతిపాదన ఎదుటి వ్యక్తినుండి వస్తే సందర్భం ఉత్తేజకరంగా ఉంటుంది. అందువల్ల ఒక మంచి మేనేజర్‌ ఎప్పుడూ తనకు కావలసిన ప్రతిపాదన ఎదుటివ్యక్తినుండి వచ్చేట్టుగా పరిస్థితులను సృష్టిస్తాడు. బంతిని ఎంత బలంగా గోడకేసి కొడ్తామో అది అంత బలంగా వేగంగా తిరిగొస్తుందనే గ్రహింపుతో నిర్వహనక్రీడను కొనసాగిస్తాడు. అతనికి..సరిగ్గా ఊహించిన విధంగానే విజ్ఞుడైన మూర్తిగారు ప్రతిస్పందిస్తూండడం చాలా ఆనందాన్ని కల్గించింది.
”మిత్రులారా.. భయం అంటే చాలామంది.. కొట్టడం, చంపడం.. లేదా జైల్లోపెట్టడం.. నక్సలైట్లయితే హత్యలు చేసి పేల్చివేయడం.. లాంటి చర్యలతో భయానికి తప్పు నిర్వచనం ఇచ్చారు. ఇన్నాళ్ళూ?. అసలు భయం మనిషిని ప్రజల సమక్షంలో నిలబెట్టి ఋజువుల్తో సహా నిలదీసి దోషిగా ప్రూవ్‌ చేసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. ఎంత కిరాతకుడైనా ప్రజలమధ్య దోషిగా నిల్చున్నప్పుడు సిగ్గుతో తలవంచుకుని ‘క్షమ’నో, ‘శిక్ష’నో ఐచ్చికంగా కోరుకుంటాడు. దీనికి సజీవ ఉదాహరణ.. ఈ మధ్య టి.వి. ఛానళ్ళలో తప్పుచేస్తూ రెడ్‌హ్యాండ్‌గా పట్టుబడ్డప్పుడు చెట్టుకు కట్టేసి మహిళలు వాణ్ణి చెప్పుతో కొడ్తూంటే కిక్కురమనకుండా వాడు చెప్పుదెబ్బలు పడ్తున్న నిస్సహాయ దృశ్యాల్నే ఉదాహరణ. నేనీ తప్పు చేస్తే ప్రజలు ఋజువుల్తోసహా నడివీధిలో నన్ను నిలదీస్తారనే భయాన్ని మనం క్రియేట్‌ చేయగల్గితే.. చాలు.. మనం మన లక్ష్యం చేరుతాం. ఇది జరగాలంటే చాలా నిమగ్నతతో సమాచార సేకరణ జరగాలి.. అంకితభావంతో నిస్వార్థంగా పనిచేసే వందల వేలమంది నికార్సయిన, నీతిపరులైన కార్యకర్తలు కావాలి.. ఎటువంటి అధికార వాంఛాలేని నేతృత్వం కావాలి.. అవన్నీ మనకున్నాయి.. కాబట్టి మన ప్రయత్నం తప్పకుండా విజయవంతమౌతుంది.”
వెల్లువలా చప్పట్లు.. హర్షాతిరేకతతో నిండిన ప్రతిస్పందనలు..,
”ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా మిత్రులారా.. కరడుగట్టి పునాదులు బలపడి దుర్భేద్యంగా మనముందు నిలబడ్డ ఈ అవినీతి దుర్గం యింత సుళువుగా కూలిపోతుందా, నిర్మూలించబడ్తుందా అనే సందేహం మనలో కొందరికి కలగొచ్చు.. అడవి పెద్దదే కాని .. దాన్ని భస్మీపటలం చేయడానికి చిన్న అగ్గిపుల్ల చాలు. ఐతే కొన్ని సత్యాలు ప్రతిపాదనల స్థాయిలో ఉన్నపుడు నమ్మశక్యంగా ఉండవు. కాని ఋజువై కార్యరూపం దాల్చిన తర్వాత ఒక అద్భుతంగా మిగిలిపోతాయి చరిత్రలో.. ఒక ఉదాహరణ చెప్తా.. మొట్టమొదటి 1839లో స్కాటిష్‌క్‌ చెందిన ఒక సాధారణ కుమ్మరి మాక్‌ మిల్లన్‌ బైసికిల్‌ను కనిపెడ్తున్నపుడు.. రెండు చక్రాలతో ఒక యంత్రం నిట్టనిలువుగా పడిపోకుండా నిలబడ్తుందనీ, దానిపై ఒక మనిషి ఎక్కి కూర్చుని ప్రయాణం కూడా చేయవచ్చనీ, కాగా అతివేగంగా ముందుకు దూసుకుపోతుందనీ చెప్పినపుడు అందరూ హేళనగా నవ్వారు. వినే మా అందరి చెవుల్లో పువ్వులు కనిపిస్తున్నాయా అని గేలిచేశారు. పరిహసించారు. ఆ విషయాన్ని .. యిప్పటిక్కూడా మనం ఊహామాత్రంగా దృశ్యిస్తే నమ్మబుద్దికాదు. కాని నిజమైందికదా. ఒక నమ్మశక్యంకాని సత్యం సైకిల్‌గా రూపుదిద్దుకుని థాబ్దాలుగా సామాన్యుని వాహనమై ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తూనే ఉందికదా.. అందువల్ల ఒక ఆవిర్భావస్థితిలో కొన్ని పరమ సత్యాలు విశ్వసనీయంగా అనిపించవు. కాని అవి పరమాతిపరమ సత్యాలుగా ఋజువై చరిత్రలో నిలిచిపోతాయి. మిత్రులారా.. నాకు పూర్తి నమ్మకముంది. రామం ఎంతో దీర్ఘదృష్టితో, నిర్మలమైన హృదయంతో, నిస్వార్థంగా, ఎటువంటి అధికారకాంక్ష లేకుండా చేపట్టిన ఈ ‘ప్రక్షాళన’ కార్యక్రమం తప్పకుండా విజయవంతమౌతుంది. భారత రాజకీయ, సాంఘిక జీవితాల్లో పెనుమార్పును తెస్తుంది. యిప్పుడు మనందరం చేయవలిసింది ఆలోచనలను అమలుకాగల కార్యక్రమాలుగా ట్రాన్స్‌లేట్‌ చేయడం..చేద్దాం ఐకమత్యంతో. నేను నావంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తాననీ, మీ అందరి వెంట నడిచి నా విద్యుక్తధర్మాన్ని నెరవేరుస్తాననీ ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. జైహింద్‌.. జై జనసేన…”
”జై జనసేన..” హాలు దద్దరిల్లింది.. పదులనుండి వందల సంఖ్యకు కంఠాలు పెరిగి.. చినుకులు సెలయేరుగా మారుతున్నట్టు..,
రామం ఒళ్ళు పులకించింది. శరీరంనిండా రోమాలు నిక్కి నిలబడ్డాయి. మాటలకందని దివ్యానుభూతి ఏదో అతన్లో విద్యుత్‌వలె ప్రవహిస్తోంది.. మౌనంగా ప్రక్కనే ఉన్న క్యాథీ ముఖంలోకి చూశాడు. ఆమెకూడా పరవశించిపోతూ నిండుసముద్రంలా నవ్వింది.
”మూర్తిగార్కి ధన్యవాదాలు.. ఒక వరిష్ట పాత్రికేయులుగా ఎంతో దీర్ఘదృష్టితో వర్తమాన సంకక్షుభిత సందర్భాన్ని స్పష్టంగా విప్పిచెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ.. మా వెంట ఉంటానని భరోసా యిస్తూ మన ‘జనసేన’కు ఊపిరినందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇప్పుడు .. ప్రముఖ పౌరహక్కుల నేత.. సమాజంపట్ల ఎంతో బాధ్యతతో జీవిస్తున్న చింతనపరుడు ప్రొఫెసర్‌ రాములుగారు తమ అభిప్రాయాలను మనకు తెలియజేస్తారు.. ”డాక్టర్‌ గోపీనాథ్‌ చెబుతున్నారు మైక్‌లో.
చాలా క్రమశిక్షణ.. అనేకం ఏకమై.. ధారలు ఏరులై.. చినుకులు ప్రవాహమై.. ఒక నిశ్శబ్ద పరివర్తన.. ఆలోచనలు ఆలోచనలుగా మనుషులు వికసిస్తున్న సందర్భమది
చుట్టూ .. అంతా ప్రశాంతంగా ఉంది.

(సశేషం)

పిడికెడు పక్షి..విశాలాకాశం

417671_580561545289734_1052452842_n

పిడికెడు పక్షి.

తలపైకెత్తి చూచింది.యాభైరెండు ఫీట్ల ఎత్తైన దేవదారు వృక్షం పైనున్న తొర్రలోని తన గూడునుండి.విశాలమైన ఆకాశం నీలంగా..నిర్మలంగా కనబడింది.

కొత్తగా మొలచిన రెక్కలు.ఎంకా ఎగరడం తెలియని ఉత్సుకత.లోపల ఏదో తెలియని ఉద్వేగం.

చిన్ని కళ్ళతో తల్లిముఖంలోకి చూచింది.

తల్లి పక్షి కళ్ళనిండా శూన్యం.అభావం నిండిన ఒట్టి ఖాళీ.

తల్లిపక్షి కిందికి చూచింది.చాలా కింద,నేలపైన మగపక్షి సిద్ధంగా ఉంది.మెత్తని ఈకలు,పీచు,గడ్డి,ఆకులు..అన్నీ అమర్చి ఎదురుచూస్తోంది.పిల్లపక్షి ఒకవేళ ఎగరలేక కిందపడితే గాయపడకుండా ఉండడానికి.

తల్లి బిడ్డపక్షి ముక్కులోకి తన ముక్కును జొనిపి ముద్దాడింది.

రెండురకాల కిచకిచల ధ్వని.ఎడబాటు..వియోగం..బాధ..దుఃఖం..అన్నీ ఆ చిరుధ్వనిలో.

తల్లి తన స్వరసంకేతంతో కింద ఉన్న మగపక్షిని హెచ్చరించి అకస్మాత్తుగా పిల్లపక్షిని కిందికి నెట్టేసింది.

శిశుపక్షి కిందికి జారుతూ..ఉక్కిరిబిక్కిరౌతూ..పల్టీలుగొడ్తూ..అప్రయత్నంగానే అప్పటిదాకా మొలిచిన నునురెక్కలను విప్పి..చాచి..రిక్కించి.,

ఎగిరింది. మొట్టమొదటిసారిగా.

pidikedu

ఆశ్చర్యపోయిందది.తనింకా కిందికి జారిపోవడంలేదు.కాగా,పైకిలేస్తోంది.పైకి..ఇంకా పైపైకి.గాలిలో తేలిపోతూ.చెట్ల గుంపుల్లోనుండి,అడవిలోనుండి,నదులపైనుండి..విశాలనీలాకాశంలోకి.

చుట్టూ చూచింది.అన్నీ మేఘాలే.నీలిరంగు.చల్లగా.బంగారురంగు కాంతి.ఎటుచూచినా అనంతమైన నీలి.నిర్మలంగా.

పులకించిపోయింది పిడికెడంత పక్షిపిల్ల.

శిశుపక్షి సువిశాల అనంతాకాశాన్ని ఈదుకుంటూ పరుగెత్తుతోంది..మహానందంగా..పులకిస్తూ..గగనాన్ని జయిస్తూ.

తల్లిపక్షి అలా శూన్యంగా చూస్తూనేఉంది ఎగిరిపోతున్న బిడ్డ కనబడుతున్నంతసేపు.కనుమరుగయ్యేదాకా.

రెక్కలు రావడం..అందర్నీ విడిచి ఎగిరిపోవడం..జీవపరిణామంలో ఒక అతి సహజభాగంగా గుర్తిస్తూ.,

తల్లిపక్షి చెట్టు గూడులో మిగిలి.,

 

*                                                 *                                                                  *

 

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాధలంటారుగదా.

అనాధలుకాని పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నదేమిటి.సంరక్షణ.ఆలనాపాలనా.ఇలా జీవించు.ఇలా ఆలోచించు.ఇవి విలువలు.ఇవి కావు.ఇది తప్పు.ఇది సరియైంది.ఇది నైతికం..ఇది కాదు.ఈ  దారిలోవెళ్తే బాగుపడ్తావు..ఈ దారిలోవెళ్తే జారిపడ్తావు.ఇవన్నీ చెప్పేవాళ్ళు తల్లిడండ్రులుగదా.పిల్లలకు ఇవేవీ చెప్పనివాళ్ళుకూడా తల్లిదండ్రులేనా.బాధ్యతారాహిత్యంతో పిల్లలను బలాదూర్ గా జన్నెకిడిచిపెట్టే తల్లిదండ్రులను సమాజం ఎలా అర్థంచేసుకోవాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమంటే ఒక కుటుంబానికి తల్లిదండ్రులవంటిదికదా.కుటుంబంలో పిల్లలు ఏమి చదవాలి.ఎక్కడ చదవాలి.ఎలా చదవాలి.ఏ వృత్తిలో స్థిరపడ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది..ఇవన్నింటినీ   మార్గదర్శనం చేస్తూ తన ప్రజలను సరియైన దిశలో నడిపిస్తూ ప్రగతిపథంలో ముందుకు తీసుకుపోవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వాలదేగదా.

కాని ఏం జరుగుతోందిక్కడ.

అసలు ప్రజలను పట్టించునే నాధుడున్నాడా.కనీస ప్రజావసరాలేమిటి.విద్య,వైద్య,ఉపాధి వంటి కీలక రంగాల్లోనైనా కనీస శ్రద్ద ఉందా ఏ నాయకుడికైనా.లక్షలకు లక్షలమంది యువకులు ఒట్టిగా బేవార్స్ గా రోడ్లవెంట తిరుగుతూ మెలమెల్లగా అసాంఘికశక్తులుగా మారుతూంటే చూచి పట్టించుకునే వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఉందా.అసలు ప్రజాసంక్షేమ దృష్టితో ఆలోచించి జనాన్ని కన్నబిడ్దలవలె కనీసవసతులతో అభివృద్దిచేయాలనే సంకల్పం ఉందా ఏ ఒక్కరికైనా.పూర్తిగా నీతిహీనమైపోతున్న ఈ వర్తమాన రాజకీయ వ్యనస్థను ఎవరు ఎలా సరిచేయాలి.

ప్రజలు అనాధలౌతూ,పాలకులు కోట్లకు పడగలెత్తుతూ,ఎల్లెడలా బాధ్యతారాహిత్యం విషవలయమై ఆవరించిఉన్న ఈ ప్రస్తుత సంక్లిష్ట సందర్భంలో తమతమ విధులను నిర్వర్తించవలసిన వాళ్ళు నిర్వర్తించనపుడు..ఏంచేయాలి.

pidikedu-image

     ఎవరోఒకరు..ఇపుడే ఇపుడు అని చొచ్చుకురాకుంటే ఈ అరాచక విధానం ఇలాగే కొనసాగుతుందిగదా.

ప్రతి ప్రజాప్రతినిధీ ఒక వ్యాపారి.ప్రతి అధికారీ ఎవరో ఒకరికి భృత్యుడు.ప్రతి పౌరుడూ ఒక పరాన్నభుక్కు.ఎవరికందిందివాడు ఎగబడి ఎగబడి దోచుకుతినడమే.అంతా నిస్సిగ్గు ప్రవర్తన.నిర్భయమైన విచ్చలవిడి దోపిడీ.అంతా బహిరంగ దురాక్రమణలే.అన్నీ మాఫియాలు.భూ మాఫియాలు.ఇసుక మాఫియాలు.విద్యారంగ మాఫియాలు.మీడియా మాఫియాలు.మెడికల్ మాఫియాలు.వెరసి ప్రజాజీవన రంగాలన్నీ మాఫియాలే.  ప్రజలేమో ఏది ఉచితంగా ఇస్తే దాన్ని ఎగబడి తీసుకునేందుకు సంసిద్ధులౌతూ..కలర్ టి వి లు,లాప్ టాప్ లు,గ్రైండర్లు,మిక్సీలు,ఉచిత బియ్యం.ఉచిత విద్యుత్..ఏదైనా.

ప్రజలకు ఏది అవసరమో అది చెప్పక,ఏది అవసరమో అది చేయక,ఏవి అవసరంలేదో వాటినిమాత్రం చేయిచాపితే అందేంతదూరంలో ఉంచి..చుట్టూ ఒక మాయ.ఒక ఉచ్చు.ఒక మత్తు.

ప్రతి ఇంట్లో ఒక దీర్ఘచతురస్రాకార రూపంలో ఒక ఉరిత్రాడు.అది టి.వి.జనాల్ని బానిసల్ని చేసి ముఖ్యంగా ఆడవాళ్ళ పని గంటల్ని బుగ్గిపాలు చేసేది.మనుషుల్ని పశువులవలె కోట్లక్కోట్లకు వేలంవేసి కొని ‘క్రికెట్’ పేరుతో లక్షలమంది యువజనాన్ని అనుత్పాదక శక్తులుగా మారుస్తూ ఒక నిరంతర విషక్రీడను ఈ దేశప్రజలపై రుద్దుతూ ప్రభుత్వాలే జూద వ్యసనాన్ని నల్లమందు వాడకాన్ని అలవాటు చేసినట్టు అందిస్తూ,ఏ టి వి చానెల్ ను చూసినా ఒంటిపై బట్టలతో రతిక్రీడ సలుపుతున్న నీచ భంగిమలతో..జుగుప్సాకరమైన శృంగార ప్రసారాలతో..దిక్కుమాలిన నిరంతర రాజకీయ చర్చలతో,ప్రసారాలతో..నీతిహీనమైన రాజకీయ వ్యభిచార ప్రస్తావనలతో..ప్రజలను తప్పుతోవపట్టించే తాయెత్తుల,రుద్రాక్షల,కేశాల,దేవతుల వ్యాపార ప్రకటనలతో..డబ్బిస్తేచాలు ఏ ప్రకటననైనా ప్రసారం చేస్తాం అన్న బాధ్యతలేని దుర్మార్గ చానెల్స్..ఇవన్నీ అవసరమా అసలు ఈ ఎనభైశాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జనమున్న దేశంలో.

అన్ని రంగాల్లోనూ అతి.మనుషులకు అతి స్వేచ్ఛ..అతి ప్రవర్తన..అతి విశృంఖలత్వం..పిల్లలపై అతి గారాబం.అతి సంపాదన దాహం..అతి అధికార దాహం.అతి విజృంభణ..ఈ దేశంలో..ఎక్కడో ఏదో పట్టాలు తప్పుతున్న స్పృహ.శ్రీశ్రీ చెప్పినట్టు ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్దులౌతున్నట్టు ‘ అనుభవాలు.పూర్తిగా మృగ్యమౌతున్న దేశ స్పృహ..దేశభక్తి..పౌర,సామాజిక బాధ్యతల చింతన.అసలు ఏ ఒక్కరిలోనూ కానరాని ‘అందరికోసం ఒక్కడు..ఒక్కరికోసం అందరు ‘భావన.ఎలా.?

ఎవరో ఒకరు ముందుకు రావాలి.ధైర్యంగా ముందుకు దూకి పరిస్థితుల్ని చక్కదిద్ది ఒక నూతన ఉజ్జ్వల నాయకత్వంతో మళ్ళీ కొత్త సమీకరణాలను రూపొందించి కొత్తదారిని వేయాలి.

అందుకే..ఈ సమావేశం.సరికొత్త ప్రయోగం.తప్పుచేస్తున్న మనిషిని నిలదీసి సమాజమే ప్రశ్నించడం ప్రారంభిస్తున్న ఒక కొత్త దిశ.

రాజరాజనరేంద్రాంధ్ర గ్రంథాలయం.కుర్చీలో నారాయణ.పద్మభూషణ్.కవి.తన కవిత్వంతో గత నలభయ్యేళ్ళుగా ప్రజలను సమీకృతం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రజాకవి.ఒకనాటి స్వాతంత్ర్య సమరయోధుడు.ప్రక్కన అటు..ఇటూ ఇంకో ఐదుగురు సచ్ఛీలతను కలిగిన నిష్కలంక రచయితలు.అందరికీ ఆదర్శనీయులు .తనకంటూ స్వంత ఆస్తి ఏదీ లేనివారు  .

ప్రజలచే ఎన్నుకోబడని శాసకుడు రచయిత..అని ప్రవచించే శుద్దమానవుడు.

వారంక్రితం ఒక ప్రజా సంఘటనను ఏర్పాటు చేశాడు  నారాయణ .పదిమంది రచయితలు..ఐదారుగురు ప్రముఖ పత్రికా విలేఖరులు..మూడు శక్తివంతమైన టి వి చానళ్ళు..ముందు విజ్ఞులైన ప్రజలు.ప్రత్యేక ఆహ్వానితులుగా కలెక్టర్.ఎస్పీ.ఇప్పుడు విచారించే సమస్య తాలూకు ప్రభుత్వ అధికారులు.ఎస్ ఇ రోడ్స్ అండ్ బిల్డింగ్స్..క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్..మొదలైనవాళ్ళు.

రెండురోజుల క్రితం చింతలపల్లి దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కుప్పకూలి అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అప్పటికప్పుడే మరణించారు.  ఆగ్రహోదగ్రులైన ప్రజలు గుమిగూడి చేతికేది అందితే దాంతో విధ్వంసం సృష్టించారు.అక్కడున్న కాంట్రాక్టర్ తాలూకు యంత్రాలన్నింటినీ నాశనం చేశారు.వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి..తర్వాత అంతా మామూలే.కాంట్రాక్టర్ తానే పోలీసులకు లొంగిపోవుట..కోర్ట్ కేసు.రిమాండ్..పత్రికల్లో సంతాప వార్తలు.లోకల్ రాజకీయ నాయకుల సందర్శనలు.ఎక్స్ గ్రేషియా హామీలు..విచార ప్రకటనలు.

ఒక వారం తర్వాత అందరూ..అంతా మరచిపోయి..ఎవరిపనుల్లో వాళ్ళు.ఎవరి పరుగుల్లో వాళ్ళు.

సద్దు మణిగినతర్వాత..కాంట్రాక్టర్ మెల్లగా కలుగులోనుండి ఎలుకవలె..బెయిల్ పై విడుదలై.,

అప్పుడందింది ప్రజాకవి నారాయణ పంపిన ‘ప్రజావేదిక ‘పిలుపు కాంట్రాక్టర్ దేవసహాయానికి.

ప్రజావేదిక..పిలుపంటే జనశాసనంగా రూపొందించాడు నారాయణ.ఎలా అంటే..పిలుస్తున్నవాళ్ళు రవ్వంతకూడా మచ్చలేని నిఖార్సయిన మనుషులు.రచయితలు.రచయితలంటే ఒట్టి ఆదర్శాలు రాసి మరిచిపోయి ఆచరణలో ఎక్కడికో పారిపోయే దుర్మార్గులుకారనీ,మానవత్వానికి ఒక నమూనాగా నిలువవలసిన ఆదర్శమానవులనీ,అక్షరసేనానులనీ నిర్వచించి కూర్చాడు నారాయణ అటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా ఎంపికచేసి.వాళ్ళందరికీ వాళ్ళకున్న నైతిక వ్యక్తిత్వమే ఎనలేని బలం.వాళ్ళకు తోడుగా శక్తివంతమైన మీడియా.ప్రెస్.పిలుస్తే రాకుంటే మర్నాడు ప్రజళ్ళోకి ఈ ఉల్లంఘనను నేరంకింద పరిగణించబడి నిందితుడు దోషిగా ఋజువగుట.మీడియాద్వారా సమాజంలో ఇజ్జత్ పోవుట.పరువు పోతుందని భయం.

నారాయణకు తెలుసు మనిషిని లొంగతీసే శక్తి కేవలం భయానికే ఉందని.

సామాజిక నేరాలను చేస్తూ,కోట్లకొద్ది ప్రజా ధనాన్ని స్వాహాచేస్తూ నేరస్థులు తప్పించుకు తిరుగుతున్నారంటే దానిక్కారణం ఆ నేరస్థున్ని ప్రజలమధ్య ఋజువుల్తోసహా నిలబెట్టి పశ్చాత్తాపపడేట్టు చేయకపోవడమే.ఈ దేశంలో ఒక్క నేరస్తుణ్ణి పట్టుకుని నిలదీస్తే వానితోపాటు ఇంకో పదిమంది నేరస్థులు బయటపడ్తారు.దాన్ని ఒక్కసారి ధైర్యంగా బట్టబయలు చేయగల్గుతే పరువు భయంతో ప్రతివాడూ తన నడవడిలో మార్పుతెచ్చుకుంటాడు.అదీ నారాయణ చేయదల్చుకున్న చికిత్స.

కాగా..ప్రజావేదిక పిలిచిన తర్వాత ఏ అధికారైనా హాజరుకాలేదంటే..అతనిక్కూడా ఏదో పాత్ర ఉందని జనమనుకుంటారని భయం.వణుకు.ఆ స్థితిని సృష్టించాడు నారాయణ.

ప్రజావేదిక ఏ శిక్షా వేయదు.కేవలం నేరాన్ని అంగీకరింపజేసి తలవంచుకునేలా చేసి బుద్ది చెబుతుందంతే.ఒక్కసారి ప్రజావేదికపైకెక్కినవాడు వీపుపై ‘దోషి ‘ ముద్రను వేయించుకున్నట్టే.ఎదురుతిరిగితే పత్రికలూ,మీడియా ఏకి పారేస్తాయి.దానికితోడు ‘సమాచార హక్కు ‘చట్టం కింద సంపాదించిపెట్టుకున్న వివరాలు ప్రశ్నించబడే మనిషిని గుక్కతిప్పుకోకుండా పరేషాన్ చేసి వదుల్తాయి.మనిషిని ‘పరువు ‘అనే సున్నితమైన శిక్షతో పరివర్తింపజేయుట.

ప్రజావేదిక..స్థాపనప్పుడే చెప్పాడు నారాయణ..తమ సంస్థ లక్ష్యం ప్రజాహక్కులకూ,ప్రజాధనానికి కాపలాకుక్కలా ఉండడమేనని.

కుక్క దొంగను చూడగానే మొరుగుతుంది.కండను పట్టి  చెండాడుతుంది. అంతే.

*                       *                          *

“దేవసహాయంగారూ చెప్పండి..ఎందుకిలా..పదిహేను కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్ట్..పూర్తికాకముందే కూలిపోవుట..ఇద్దరు వ్యక్తుల నిండు ప్రాణాలు పోవుట.తప్పు చేసినందుకు మీకేమైనా పశ్చాత్తాపముందా..మీ ప్రాజెక్ట్ తాలూకు వివరాలన్నీ సమాచార హక్కు చట్టం కింద సేకరించినవి..ఇవిగో..ఇక్కడున్నాయ్.చెప్పండి.”

దేవసహాయం మౌనంగా తలవంచుకుని నిలబడ్డాడు.

చుట్టూ మూడు టి వి చానళ్ళ కెమరాలు రికార్డ్ చేస్తున్నాయి.విలేఖర్లు రాసుకుంటున్నారు.

అప్పటికే ‘ప్రజావేదిక ‘విచారణంటే ప్రజల్లో ఒక సంచలనాత్మక ఆసక్తి స్థిరపడింది.

“సర్..నేను సహజంగా నేరస్వభావమున్న మనిషిని కాదు.ఆ మాటకొస్తే ఈ సమాజంలో ఎవరూ సహజంగా నేరస్థులు కారు.డబ్బు సంపాదించాలనే కక్కుర్తి అందరికీ ఉంటుంది.ఐతే అవకాశాలు అందరికీ రావు.సుళువైన మార్గాలు ముందు పరుచుకుని ఉన్నపుడు ఏ మనిషైనా తప్పుచేస్తాడు.నా విషయంగాకూడా అదే జరిగింది.నిజానికి నేనిప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను.నా దుఃఖాన్ని బహిరంగంగా నిజాయితీగా పంచుకోవాలనుకుంటున్నాను.దయచేసి వినండి.”

పరివర్తన..మార్పు..ఆత్మక్షాళన.రియలైజేషన్.

“నేను ఈ ప్రాజెక్ట్ ను తీసుకునేనాటికి..అలాట్మెంట్ ఖర్చులు ప్రభుత్వ సెక్రెటరీలు..మాథ్యూస్ కు పదిహేను లక్షలు.సెక్రెటరీ ఫైనాన్స్ విఠల్ కు పదిహేను లక్షలు.జాయింట్ సెక్రెటరీ అలీహుస్సేన్ కు పదిలక్షలు..ఇంకా చిన్న చిన్న సెక్షన్ ఆఫీసర్లు..అంతా కలిపి పది లక్షలు.మన జిల్లామంత్రి తన గుండాలతో నాపై దాడి చేయించినపుడు భయంతో చేసుకున్న ఒప్పందంప్రకారం ఇచ్చిన మొత్తం ఒక కోటి.మంత్రిగారిపేరు మీకు తెలుసు కోమాకుల రాజేంద్రప్రసాద్. ముగ్గురు ఎమ్మెల్యేలు..రూలింగ్ పార్టీ జయలలితకు ముప్పై లక్షలు.ఇంకో ప్రక్క నియోజకవర్గ శాసన సభ్యుడు రుద్రరాజుకు ఇరవైఐదు లక్షలు.అప్పోజిషన్ పార్టీ ఎమ్మెల్యే రవికిరణ్ కు పన్నెండు లక్షలు.ఎస్ ఈ రామసుబ్బారెడ్డికి పదిహేను లక్షలు.క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ పెక్టర్ జాకబ్ కు పది లక్షలు.ఎ ఇ లు బాలక్రిష్ణ,రామలింగం,వి క్టర్..వీళ్ళకు  మనిషికి ఐదు లక్షలు.ఎమ్మెల్యే కొడుకు వాసుకు వాడు తాగివచ్చినప్పుడల్లా ఇచ్చినై పదిహేను లక్షలు.ఇట్ల మొత్తం ఐదుకోట్ల నలభై లక్షలు లంచాలకే పోతే ఇక నేను ఏ ప్రమాణాలతో కట్టగలను ఫ్లైఓవర్ ను.తక్కువ స్టీల్,ఎక్కువ ఇసుక,నాసిరకం ఫినిషింగ్.ఇంప్రాపర్ క్యూరింగ్.నేను తెచ్చిన అప్పులకు కోటి వడ్డీ.మొన్న ఫ్లైఓవర్ కూలిన తర్వాత పోలీస్ డి ఎస్ పి రామచంద్రయ్యకు ఇచ్చింది ఐదు లక్షలు.బెయిల్ గురించి జడ్జ్ పట్టాభిరామయ్యకు ఇచ్చింది పదిహేను లక్షలు.వెరసి నాకున్న అప్పులు ఇప్పుడు..పదహారు కోట్లు.ప్రతినెలా కట్టవలసిన వడ్డీలు ఎనిమిది లక్షలు.ఈ లంచగొండి దేశంలో ఊబిలోకి దిగీ దిగీ..ఇక ఆత్మహత్యే శరణ్యమయ్యే స్థితి దాపురించి..”..దేవసహాయం గొంతు గద్గదమై..ఎక్కెక్కిపడి ఏడుస్తూ..కుప్పకూలిపోయాడు.

హాలంతా నిశ్శబ్దంగా..విషాదంగా.దేవసహాయాన్ని పీల్చుకుతిన్న మనుషుల పేర్లు మంత్రితోసహా..అధికారులపేర్లు..అన్నీ బట్టబయలౌతూ.,గంభీర సానుభూతి.

తప్పులు జరుగుతున్నాయి.కుక్క నిద్రపోతోందికాబట్టి దొంగతనం జరుగుతోంది.కుక్క దొంగ పెడ్తున్న బిస్కిట్లను తినడానికి అలవాటైంది కాబట్టి..చివరికి కుక్కా,దొంగా కలిసి యజమానినే కరిచి,కండలు పీకి ,చంపి.,

నాలుగేండ్లక్రితం యువ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధి ఒక విస్తృతమైన ప్రజా అధ్యయనం చేస్తూ కనుక్కున్న ఒక పరమసత్యాన్ని ప్రకటించాడు.అదేమిటంటే..”ఈ దేశంలో అవినీతి ఎంత పెరిగిపోయిందంటే..ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం ఒక రూపాయిని అందిస్తే వివిధ మధ్యవర్తి దళారులు తినీ తినీ చివరికి కేవలం ఐదు పైసలను మాత్రమే లబ్దిదారులకు మిగులుస్తున్నారు “అని.

పద్మభూషణ్ నారాయణకు ఆ జ్ఞాపకం ఒక ములుకులా వచ్చి గుండెల్లో దిగినట్టనిపించింది.

కలెక్టర్ వికలమైన మనసుతో హాల్ నుండి బయటికొచ్చాడు.. లోపల ఉక్కపోతగా అనిపించి.

అప్పుడు..బయట దర్వాజా దగ్గర ఒక పదేళ్ళ చిన్న పిల్లాడు ఒక ప్లకార్డ్ పట్టుకుని నిలబడి ఉండడం కనిపించింది.

అట్టపై రాసిఉంది.”దయచేసి మా తరానికికూడా కొద్దిగా మిగల్చండి ప్లీజ్”అని.

ఆసక్తిగా చూస్తున్న కలెక్టర్ వైపు ఎమ్మార్వో రఫీక్ “ఈ కుర్రోడు ఆ పద్మభూషణ్ నారాయణ మనుమడు సతీష్ సర్” అంటున్నాడు.

 

*                           *                               *

సరిగ్గా అప్పుడే పిడికెడు పక్షిపిల్ల తన కొత్తగా మొలిచిన చిన్ని రెక్కలతో విశాల వినీలాకాశాన్ని ఈదుతూ..జయిస్తూ వెళ్తూనేఉంది.

పక్షికి ఒక్క గూడుతప్ప ఏ ఆస్తీ ఉండదు.

దానికి ఒక ఆకాశం..ఒక పచ్చని చెట్టు..చాలు.

 – రామాచంద్రమౌళి

 

 

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 13 వ భాగం

15

( గత వారం తరువాయి)

13

పంచాయితీరాజ్‌ మంత్రి వీరాంజనేయులకు ముచ్చెమటుల పట్టి నిప్పుల ప్రవాహంవంటి జ్ఞాపకం తెగిపోయింది.
పచ్చని అడవి నడుమ.. విశాలమైన చదునైన గడ్డిమైదానం.. చుట్టూ గుట్టలు.. దూరాన నీలివర్ణంలో కనిపిస్తున్న చెరువు.. అంతా ప్రశాంతమైన ప్రకృతి.
ఆ రోజు ప్రక్కఊరు మహదేవ్‌పూర్‌లో గిరిజన సంత., ముగిసి.. సాయంకాలం.. చుట్టూ పదూళ్ళ ప్రజలు ఎక్కడివాళ్లక్కడికి ఇండ్లకు చేరపోయే ప్రయాణంలో.. మధ్య కావాలని.. ఆ ప్రాంతంలో ‘పంతులుగారు దేవుడు’ అని పేరున్న రామన్న పిలుపు మేరకు అందరూ ఆ ఆకుపచ్చని గడ్డిమైదానంలో సమావేశమై,
వందలమంది గిరిజనులు.. పెద్ద, చిన్న, ముసలి, ముతక.. ఒంటిపైన సగం బట్టలు.. సగం బరిబాత.. దాదాపు అందరి చేతుల్లో ఓ కంక కర్ర.
అందరిచూపుల్లోనూ సెలయేటి నీటిలోని నిర్మలత్వం.. స్వచ్ఛత
జనం మధ్య.. ఎత్తుగా వేదిక.
”జనసేన.. ధన్యవాద సభ..” అని వెనుక పెద్ద పెద్ద అక్షరాలు.
గిరిజనబాంధవుడు పంచాయితీరాజ్‌.. మంత్రి శ్రీ వీరాంజనేయులు గార్కి, గిరిజన అభివృద్ధికి నిరంతరం శ్రమించే భగవత్‌ స్వరూపులు చీఫ్‌ ఇంజినీర్‌ బొలుగొడ్డు గురువయ్య గార్కి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణగార్కి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ముత్యాలు గార్కి, డివిజినల్‌ ఇంజినీర్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ గార్కి, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ జాన్సన్‌గార్కి.. న్యవాద మరియు అబినందన సభ. అధ్యకక్షులు మానవహక్కుల కమీషన్‌ చైర్మన్‌ జి. విశ్వనాథరావు గారు ప్రారంభకులు డాక్టర్‌ కె. గోపీనాథ్‌ గారు. నిర్వహణ.. భద్రాచలం గోదావరీ పరీవాహ ప్రాంత గిరిజన మూలవాసీ సంఘం మరియు జనసేన.
”అరె నీయమ్మ.. ఈ సభ వద్దుపో అని మొత్తుకున్నగదరా గుర్వయ్యా.. నాకెందుకో యిదంత చూస్తూంటే అదెందో ఉందని అప్పుడే అన్పించింది. యిప్పుడుసూడు ఈ ప్లాట్‌ఫాంమీద ఎవరెవరున్నరో, ఏం జర్గబోతోందో.. ఇగ తప్పించుకపోలేం.. ఉంటే ఇరుక్కపోయేటట్టున్నం.. నీయమ్మ. భూమిపుండుల చిక్కినంగాదుర..” మంత్రి వీరాంజనేయులు చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య చెవిలో గుసగుసగా అంటూండగానే.. ఎవరో గిరిజన ఉపాధ్యాయుడు ”యిప్పుడు మూడవ తరగతి చదువుతున్న నీలమ్మ మంత్రిగారికి అడవి మొగలిపూల గుచ్ఛం అందిస్తుంది” అని మైక్‌లో ప్రకటించాడు. వెంటనే ఓ నల్లని పాముపిల్లలా తళతళలాడ్తున్న ప్రాథమిక పాఠశాల అడవిపిల్ల మెరుపులా వేదికమీదికొచ్చి మంత్రిగారికి పెద్ద మొగలిపూల గుత్తినందించింది.
చుట్టూ మధురమైన సువాసన గుప్పుమని.,

”గుర్వయ్యా.. నాకు భయమైతాందిరా.. గీ అడవి సభల గిన్ని మన తెలుగుల ఉన్న అన్ని టి.వి. చానళ్లెందుకచ్చినై. గిన్ని పత్రికలోళ్ళెందుకచ్చిండ్లు.. గీ మేధావులలెక్క కన్పించే మనుషులు ఎందుకు గీ అడవిజనంల కల్సి ఉన్నరు.. ఏంటిదిదసలు..” మంత్రికి చెమటలు పోస్తున్నాయి.
దొంగ అందరికన్నా ముందు ప్రమాదాన్ని పసిగడ్తాడు.
”ఆగుండ్లి.. మీరనవసరంగా హైరాన పడకుండ్లి..” చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య గుంభనంగా అన్నాడు. గాని.. లోలోలప అతనికీ ఉచ్ఛపడ్తోంది.

పుష్పగుచ్చాలు.. స్వాగతవచనాలు.. ముగిసి.. సభానిర్వహణను సభాద్యకక్షులు, మానవ హక్కుల సంఘం చైర్మన్‌ విశ్వనాథరావుకు అప్పగించగానే.. ఆయన మొట్టమొదలుగా లేచి నిలబడి.. ప్రారంభవాక్యాలు చెప్తూండగా.,
”ఏదో అర్జంట్‌ పనుందని తప్పించుకుపోతే..” అన్నాడు మంత్రి సి.ఇ చెవిలో.
”అస్సలే బాగుండది.. అసలే ఆ అధ్యకక్షుడు హుమన్‌ రైట్స్‌ కమీషనోడు. .. వాసన చూత్తడు..”

”ఊఁ.. ” మంత్రి అసహనంగా.. భయంభయంగా కదుల్తూ.. ”నీ తల్లి ఏం సభరో ఇది.. గింతగనం జనం.. యింకా వత్తాండ్లు” అని గొణుక్కుంటూ, ఒంటినిండా చెమటతో అంగి తడిచిపోయింది. దూరంగా ఎక్కడో తన కార్ల కాన్వాయ్‌..పోలీసులున్నారు.. వెనుక ఒక నల్లయూనిఫాం గన్‌మన్‌ ఉన్నాడు నిలబడి నల్లని రాతివిగ్రహంలా.,
”.. నాకు ఈ గిరిజనులు మధ్య ఈ పూట గడపడం ఎంతో ఆనందంగా ఉంది.. ఒక ప్రత్యేక ధన్యవాద సభకు తప్పకుండా రావాలని ఈ మూలవాసీ నాయకులు నన్ను అడిగితే ఈ అడవి బిడ్డలతో జీవితాన్ని పంచుకుందామని..” అలా ఓ ఐదునిముషాల అధ్యకక్షుని ప్రసంగం సాగి సాగి.. ”ఇప్పుడు అసలు ఈ సభ ఎందుకు.. ఈ ధన్యవాదాలు ఎందుకు.. ఎవరికి.. గిరిజన జీవితాలను ఉద్దరించేందుకు ఈ వేదికపైనున్న ప్రముఖులు ఎలా ఈ వెనుకబడ్డ ఆదివాసీల బ్రతుకులను బాగుచేస్తున్నారు. ఈ విషయాలను మీకు పరిచయం చేసేందుకు భద్రాచలం గోదావరీ పరీవాహ ప్రాంత గిరిజన మూలవాసీ సంఘం అధ్యకక్షులు, వృత్తిరీత్యా ఉపాధ్యాయులు శ్రీ వినోభా తుట్టె గారిని ఆహ్వానిస్తున్నాను..” అని హెచ్‌ఆర్‌సి చైర్మన్‌ విశ్వనాథరావు ప్రకటించి కూర్చున్నారు. వెంటనే విపరీతమైన ఆనందాతిరేకాలతో చప్పట్లు.. ఒక సముద్రం పొంగినట్టు.
మైక్‌ముందుకు వినోబా తుట్టె.. మెల్లగా గంభీరంగా నడుచుకూంటూ వస్తూండగా .. ఇంకా ఇంకా ఆగని.. ఎడతెగని చప్పట్లు.
”వీనికెంత ఫాలోయింగుందిరా గుర్వయ్యా..” అన్నాడు మంత్రి అప్రయత్నంగానే.
”అధ్యక్షులు, పెద్దలు మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ శ్రీ విశ్వనాథరావుగారు. పంచాయితీరాజ్‌ మంత్రివర్యులు శ్రీ వీరాంజనేయులుగారు. ప్రియాతిప్రియమైన ప్రజలారా.. ఈ రోజు ఎంతో సుదినం.. ఎందుకంటే అతికీలకమైన కొన్ని విషయాలు ఈ రోజు బయటికి ప్రపంచానికి తెలియజేయబడి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ప్రధాన మలుపుకు కారణభూతం కాబోతున్న సభ యిది. మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పబోతున్న విషయాలను విని అర్థం చేసుకుని కళ్ళు విప్పాలె యికనైనా.. ఈ దేశం దాదాపు మొత్తం అవినీతి రాజ్యం, లంచగొండి రాజ్యంగా మారిపోయింది. కోట్లకు కోట్ల ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా ఎవనికి అందిందివాడు తింటూంటే దాన్ని కట్టడిచేసే నాథుడేలేడు..” వినోబా ప్రసంగం అగ్గి అంటుకున్న అడవిలా మొదలైంది. వేదిక ముందు మీడియా కెమెరాలు ఒళ్లు విరిచాయి. అంతా డాక్యుమెంటవుతోంది.

”సమాచార చట్టం – 2005 ప్రకారం.. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచబ్యాంకునుండి తీసుకున్న వందలకోట్ల అప్పును గిరిజన, ఆదివాసీ తెగల అభివృద్ధి గురించి ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించి వినియోగించమని నిధులను విడుదలచేసింది. ఆ వందలకోట్ల రూపాయల నిధులను మంత్రులు, శాసనసభ్యులు, ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు, ఇంజినీర్లు.. ఎలా విచ్చలవిడిగా భోంచేసి హాంఫట్‌ చేశారో.. మీరే స్వయంగా చూడండి..”
అప్పుడే చీకటిపడ్తున్న సాయంసంధ్యా సమయంలో.. వేదిక ప్రక్కనే ఉన్న తెరపై ఒక ఎల్‌సిడిలోనుండి ప్రొజెక్షన్‌ మొదలైంది.
”మన బర్లగూడెంనుండి తత్తరిపల్లెదాకా.. అంటే దాదాపు నాల్గున్నర కిలోమీటర్ల పొడవు డాంబర్‌ రోడ్‌ను పదిహేడు లక్షల రూపాయలు పెట్టి ఈ మంత్రిగారు, ఈ చీఫ్‌ ఇంజినీర్‌, ఈ ఇ.ఇ, డి.ఇ. ఎ.ఇ సార్లు మనకోసం వేశారట.. అది మొన్న వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిందట. మీలో ఎందరు ఆ రోడ్డుమీద నడిచిండ్రో.. ఎన్నాళ్లు  ఆ రోడ్డు అక్కడ ఉందో.. దాన్ని ఎవరైనా మీరు చూచిండ్రో.. కాస్త చూచి, ముచ్చట్లు విని చెప్పుండ్రి..”
మస్త్‌ తాగి.. గెస్ట్‌హౌజ్‌లో మాట్లాడ్తున్న మంత్రి వీరాంజనేయులు.. ప్రక్కన చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య, ఎస్‌.ఇ రమణ.. అందరూ.. వాళ్లు మాట్లాడ్తున్న మాటలు.. మైకుల్లో అందరూ వినేట్టు.. అడవి దద్దరిల్లిపోయేట్టు..,
”ఏయ్‌.. నాకిప్పుడు నాల్గు లక్షలు క్యాష్‌ కావాలె.. నీయవ్వ. మీ ఎస్టిమేషన్‌ ఎంతనో. ఆ రోడ్డు ఎక్కడ్నో .. కాంట్రాక్టరెవ్వడో.. అదంత నాకు తెల్వది.. టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌.. క్యాష్‌.. యిచ్చి నాతోని ఎక్కడెక్కడ కావాల్నో అక్కడ అన్ని సంతకాలు తీస్కోండి.. గంతే..” మంత్రిగారి గొంతు. బొమ్మ.. స్పష్టంగా.,

కాంట్రాక్టర్‌ రామలింగం ఐదు లక్షల రూపాయల వేయి నోట్ల కట్టలు హాండ్‌ బ్యాగులోనుండి తీస్తూ..
అందరూ చూస్తున్నారు.. కిమ్మనకుండ.. ఓ సినిమావలె.. అడవిజనం.. రికార్డు చేస్తున్న మీడియా, పోలీసులు.. ప్రెస్‌ పాత్రికేయులు.,
గాలి స్తంభించిపోయినట్టు నిశ్శబ్దం.

తర్వాత.. సినిమా నడచి, నడచి.. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణ గొంతు.. ”కాంట్రాక్టర్‌ రామలింగం జూన్‌ మొదటివారంలో బిల్‌ డ్రా చేసుకుంటాడు.. ఫైల్‌ క్లోజ్డ్‌.. డి.డిస్‌.. మళ్ళీ సెప్టెంబర్‌లో.. రోడ్‌ కొట్టుకుపోయిందనే నోట్‌ అప్రూవల్‌తో ఫైల్‌ క్లోజ్డ్‌ ఎల్‌.డిస్‌.. అర్ధమైందా..” క్లిప్పింగు కట్టయింది.

”అర్ధమైందా మిత్రులారా.. వేయని రోడ్‌కు.. పదిహేడు లక్షలు.. రాజీరా నుండి మోత్కుపల్లె దాకా లేని రోడ్డుకు ఇరవై లక్షలు.. అప్పనంగా తిని.. గిరిజనుల సొమ్మును వంతులవారీగా భోంచేసిన వేదికపైనున్న పెద్దలకు మనం ధన్యవాదాలు చెప్పి సన్మానం చేయాలెగదా.. ఏమంటారు.”
”చేయాలె చేయాలె..”
వందలమంది ఒంటిమీద సరిగ్గా బట్టల్లేనివాళ్లు.. డొక్కలెండిపోయినవాళ్ళు. ఆడ, మగ, పిల్లలు.. చేతుల్లో పాత, చీకిపోయిన చెప్పులను చేతుల్లోకి తీసుకుని.. ”సన్మానం చేయాలె..” అని అరుస్తున్నారు.

క్షణాల్లో వాతావరణం బీభత్సంగా మారిపోయింది.
”స్టాప్‌ ద ప్రొజెక్షన్‌..” అని అరిచాడు మంత్రి వీరాంజనేయులు..పిచ్చికుక్కలా మొరుగుతూ
ఐతే ఆ అరుపు చీఫ్‌ ఇంజనీర్‌ గురవయ్యకు తప్పితే ఎవరికీ వినబడలేదు.
జనం ఎగిసిపడ్డ కెరటంలా లేచి వేదికవైపు పరుగెత్తుకొస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఉలిక్కిపడ్డ మంత్రివెంట వచ్చిన ఓ పదిపన్నెండుమంది పోలీసులు గబగబా వేదికముందుకు పరుగెత్తుకొచ్చి., సరిగ్గా.. మంత్రిగారి వెనుక నిలబడ్డ పర్సనల్‌ సెక్యూరిటీ గన్‌మన్‌ అంజయ్య మాత్రం కదలకుండా, గన్‌ను సవరించుకోకుండానే ఊర్కే జర్గుతున్నదాన్ని అలా బొమ్మలా చూస్తూ.. ”మంచిపనైంది ముండాకొడుక్కు.. థూఁ..” అనుకుంటూండగా, నిశ్చింతగా, కదలకుండానే,
”మిత్రులారా.. మీరు సంయమనంతో కూర్చోండి.. యిక్కడ అన్నీ ఋజువులతో ఉన్నాయి.. హింస దేనికీ పరిష్కారం కాదు.. మేము జనసేన తరపున యిచ్చిన కంప్లెయింట్‌ను స్వీకరించి ఆంటీ కరప్షన్‌ బ్యూరోవాళ్లు ఈ మంత్రిగారి, చీఫ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌.. వీళ్ళందరి, వీళ్ల బంధువుల ఇండ్లపై సోదాలు ప్రారంభించారు కొద్దిగంటల క్రితమే. వీళ్ళకు సెల్‌ఫోన్‌లు రాకుండా మేము ముందే అన్నీ జామ్‌ చేశాం కాబట్టి వీళ్ళకీ విషయం తెలియదు. యిప్పటికే వీళ్ళందరి కొంపల్లో ఒక్కొక్కని దగ్గర కనీసం పదిహేను కోట్లకంటే ఎక్కువ నగదు.. కిలోలకొద్ది బంగారం, భూముల రిజిష్ట్రేషన్‌ కాగితాలు, ఎఫ్‌డీలు… అన్నీ బయటపడ్డాయి. యింకా బయటపడ్తున్నాయి.. పెద్దలు.. విజ్ఞులు.. మానవ హక్కుల చైర్మన్‌ విశ్వనాథరావుగారి సమక్షంలో సమాచారా చట్టం క్రింద మేం తీసుకొచ్చిన ఈ రెండు రోడ్ల నిర్మాణం తాలూకు సర్టిఫైడ్‌ కాపీలున్నాయి. వీటి ఫైల్‌ కాపీ ఉంది.. రోడ్లు అసలు వేయనేవేయకుండా డబ్బు తిన్నట్టు సంభాషణలు రికార్డయిన సి.డిలున్నాయి. ఇప్పుడు ఈ వందలమందిమి.. ఈ అవినీతిని ప్రతిఘటిస్తూ వందలసంఖ్యలో దరఖాస్తులనిస్తం.. వీటిని సుమోటో కేస్‌గా స్వీకరించి.. ప్రజలకు న్యాయం చేయవలసిందనీ, న్యాయాన్ని రక్షించవలసిందనీ.. లంచగొండితనంతో కుళ్ళిపోతున్న ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసే సుదీర్ఘ ఉద్యమ కార్యక్రమంలో మొదటి అడుగుగా జనసేన ప్రారంభించిన ఈ పోరాటయాత్రను ఆశీర్వదించవలసిందనీ విశ్వనాథరావుగార్ని ప్రార్థిస్తున్నాం. జైయ్‌ జనసేన.. జైజై జనసేన..జై జనసేన….”

నినాదాలు ఉప్పెనై ఆకాశం దద్దరిల్లిపోతోంది.. ప్రజావెల్లువ.. ఒక చైతన్య దీప్తి.
విశ్వనాథరావుకు ఎందుకో పరమానందమైంది.. అబ్బా.. ఇన్నాళ్ళకు.. ఎక్కడో ఈ మారుమూల.. ఈ అడవిలోనుండి ఒక ప్రతిఘటన ప్రారంభమైంది.. యిది యింకా యింకా అంటుకున్న అడవిలా విస్తరించి విస్తరించి పట్టణాలను, నగరాలను ఆవహించి విజృంభిస్తే ఎంత బాగుండు.. అని అనుకుంటూండగా..,

”సర్‌.. అదంతా ఒట్టి బూటకం సర్‌..” అంటున్నాడు ప్రక్కన మంత్రి వీరాంజనేయులు.. చీఫ్‌ ఇంజనీర్‌ గుర్నాదం మాత్రం తన నూటా పదికిలోల శరీరం చెమటముద్దయి తడిసిపోతూండగా అవాక్కయి..
”మంత్రిగారూ.. మిగిలిన ఇంజనీర్లందరూ.. మానవ హక్కుల ఉల్లంఘన క్రింద ఘోరమైన అపరాదం చేశారు.. మిమ్మల్ని సుమోటోగా నేను స్వీకరిస్తున్న ఈ కేసును విచారించే వరకు పోలీస్‌ కస్టడీలో ఉండేందుకు ఆదేశిస్తున్నాను…” అని విశ్వనాథరావు వేదికపైనున్న తన కుర్చీలోనుండి లేచి.. వేదికపైకి దూసుకువస్తున్న జనాన్ని అదుపులో ఉంచేందుకు మైక్‌ను స్వయంగా తీసుకూని..
”మిత్రులారా..నేను చెప్పేది వినండి..” అని అరుస్తూంటే,
”పందికొక్కులు లంజకొడ్కులు.. రోడ్లు.. చెర్వులు, కల్వర్టులు, చెక్‌డ్యాంలు.. ఎన్ని తింటర్రా.. ” అని అరుస్తున్నారెవరో.
వాతావరణం బీభత్సంగా ఉంది.
అడవి నుండి కార్చిచ్చు మీడియాద్వారా.. జిల్లా కేంద్రానికి.. హైద్రాబాద్‌కు.. జనసేన కార్యాలయం రామంకు, టి.వి.లను వీక్షిస్తున్న లక్షల జనాల్లోకి.. ప్రాకి ప్రాకి.,
”బ్రేకింగు న్యూస్‌.. అవినీతి ఉచ్చులో మంత్రి వీరాంజనేయులు. ఐదుగురు ఇంజనీర్లు..”
”పకడ్బందీ వ్యూహంతో అవినీతి భాగోతం బట్టబయలు చేసిన జనసేన”
”ఎవరీ జనసేన.. ఏమిటి వాళ్ళ లక్ష్యాలు”
”మంత్రి.. ఇంజినీర్లు మానవహక్కుల కమీషన్‌ అధీనంలోకి”

టి.వి. ఛానళ్ళన్నీ ఒకదానిపై ఒకటి పోటీపడి త్రోసుకుని త్రోసుకుని ప్రసారాలను చేస్తూనే ఉన్నాయి.
అడవి గర్భంలోనుండి ఒక అగ్నిబీజం మొలకెత్తి,
ఒక పిడికిలి వేల పిడికిళ్ళుగా, వేల వేల పిడుగులుగా విస్తరిస్తున్న క్షణం,
జనం మెదళ్ళల్లో.. ఒక ఆలోచన లక్షల ఉప్పెనలై.,

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -12 వ భాగం

14

(గత వారం తరువాయి)

12

రాత్రి పదకొండు దాటింది. వర్షం.
”ఏమైందయ్యా.. నీయవ్వ.. ఎంతసేపింకా. ఎస్‌యీ గాడేడి..” పంచాయితీరాజ్‌ మంత్రి వీరాంజనేయులు చిందులు తొక్కుతున్నాడు గెస్ట్‌హౌజ్‌లో. అసలే మంత్రి.. పైగా విస్కీ తాగాడు పీకలదాకా.
ముందర చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య కూర్చున్నాడు. ఎప్పుడో ఎనకట బి.యి. చదివి.. అత్తెసరు మార్కులతో పాసయి.. ఎప్పుడో ఎడ్డి జమానాలో ఎయిగా చేరి ‘పైరవీ’తో ఈ దేశంలో దేన్నయినా సాధించవచ్చనే సూత్రంతో మెట్లు ఎక్కీ ఎక్కీ. అలసి..
మొన్ననే తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక ఇఇపై ఎసిబి వాళ్ళు దాడిచేస్తే ఇరవై రెండు కోట్ల నగదు, ఐదు కిలోల బంగారం బయటపడ్తే భయంతో బాత్‌రూంకెళ్ళి ఉచ్ఛపోసుకుంటూనే అలా సరదాకు.. తనపై ఎవరైనా దాడి చేస్తేనో అనుకున్నాడు గురవయ్య..
కనీసం యాభై కోట్ల నగదు.. ఇరవై కిలోల బంగారం.. వందల ఎకరాల భూములు.. ఒక పెళ్ళాం.. ముగ్గురు ముండలు.. ఇంకా ఇంకా.. యిలా హనుమంతుని తోకంత లిస్ట్‌ కదిలింది మనసులో.
”గురవయ్యా వేరీజ్‌ ఎస్సీ” మంత్రి మళ్ళీ అరిచాడు గాడిద ఓండ్రపెట్టినట్టు.
యిక గురవయ్య గురకపెడ్తున్నట్టు గొంతువిప్పబోతూండగా సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణ, వెంట ఇఇ ముత్యాలు, డి.ఇ ఇస్మాయిల్‌, ఎ యి జాన్సన్‌. కంట్రాక్టర్‌ రామలింగం..అందరూ కలిసికట్టుగా పాలకడలిపై విష్ణుమూర్తి దగ్గరకు పైరవీచేస్తూ వచ్చిన దేవతల గుంపులా వచ్చారు. వచ్చి ‘పాహిమాం పాహిమాం’ స్టైల్‌లో నమస్కారం సార్‌ అన్నారందరూ.. ముక్తకంఠంతో..
అప్పటికే పరమ అసహనంతో.. అప్పటికే దాదాపు హాఫ్‌ విస్కీ బాటిల్‌ ఫినిష్‌ చేసిన మంత్రి..
”నీయమ్మ.. ఎప్పుడయ్యా యింకా, కానీయండి తొందరగా..” అని ఘీంకరించాడు.
”కమాన్‌.. ఎస్సీ.. సబ్‌మిట్‌” అని అరిచాడు సి.ఇ గురువయ్య.
”సర్‌..” అని ఎ.ఇ. ఇస్మాయిల్‌ ఒక ఫైల్‌ విప్పి.. ”రామన్న మండలం.. బర్లగూడెం మైల్‌స్టోన్‌ 2 బై 6 నుండి తత్తరపల్లె 6 బై 6 వరకు.. బిటిరోడ్‌ .. జుమ్‌లా నాల్గుకిలోమీటర్ల నాల్గు హెక్టామీటర్లు.. మొత్తం ఎనిమిది లక్షల నలభై వేలు.. ఎస్టిమేషన్‌..” చెప్పుకుపోతున్నాడు.
”స్టాప్‌..” అని అరిచినట్టు అన్నాడు మంత్రి.
చటుక్కున ఎ.ఇ. ఆగి..బిక్కచచ్చి..
”అది ఎయిట్‌ లాక్స్‌ చిల్లరైతే.. మన సంగతెంత.. గుర్వయ్యా..”
”సర్‌ మీది ట్వంటీ సర్సంట్‌.. అటే.. లక్షా అరవైవేలు..”
”ఏయ్‌..నాకిప్పుడు నాల్గులక్షలు క్యాష్‌ కావాలె..నీయవ్వ మీ ఎస్టిమేషన్‌ ఎంతనో..ఆరోడ్డు ఎక్కడ్నో.. కాంట్రాక్టరెవ్వడో..అదంత నాకు తెల్వది. టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌..క్యాష్‌ యిచ్చి నాతోని ఎక్కడెక్కడ కావాల్నో అక్కడ అన్ని సంతకాలు తీస్కోండి గంతే…”
”అట్లగాద్సార్‌..” ఏదో అన్నబోయాడు ఎస్‌ఇ రమణ.. ‘నీ సంతకాలెవరిక్కావాలిరా వెధవా’ అని లోలోపల గొణుక్కుంటూ. ఉహు..మంత్రి వినలే..నాల్గు లక్షలు..అంతే అంటాడు.
సి.ఇ గురువయ్య.. ”రమణ.. మనం మనం అంత చూచుకుందాంగాని.. కాంట్రాక్టరెవడు.. రామలింగంగదా.. ఆ రామలింగంతోని ఓ ఐదు లక్షల క్యాష్‌ యిమ్మను యిప్పుడు.. ” అని ఓ ఆర్డర్‌ వేశాడు.
”అరె రామలింగం.. ఓ ఐదియ్యారా బై”
కాంట్రాక్టర్‌ రామలింగం వినయంగా ఓ మరమనిషిలా.. తన తోలుసంచీలో నుంచి అన్నీ కొత్తవే.. వేయిరూపాయల కట్టలు ఐదు తీసి ముందర టీపాయ్‌మీద పెట్టాడు.
చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య నాల్గు కట్టలను సవినయంగా మంత్రిగారికిచ్చి.. ఒక కట్టను తన బుష్షర్ట్‌కున్న సోల జేబులో పెట్టుకుని.. ”మీరిక దయచేయండి సర్‌” అన్నాడు చాలా సింపుల్‌గా.
మంత్రి వీరాంజనేయులు పరమవికారంగా నవ్వి.. తన బ్రీఫ్‌కేస్‌లో నాల్గు వేయిరూపాయల కట్టలను పెట్టుకుని.. లేచి..” గురవయ్యా.. నేనిప్పుడు హైద్రాబాద్‌ వెళ్తాన – నువ్వు నాకు రేపు మధ్యాహ్నం ఫోన్‌చేయ్‌” అని రివ్వున బాణంలా బయటకు వెళ్ళిపోయాడు.
రెండు నిముషాల తర్వాత.. మంత్రిగారి కారు, కాన్వాయ్‌.. మందీమార్బలం వేగంగా దూసుకుపోయిన శబ్దం.. కర్ణకఠోరంగా వినబడింది.
వాతావరణం కొద్దిగా నిమ్మళపడి.. అంతా సర్దుకున్నాక.,
సి.ఇ. గురవయ్య చెప్పాడు.. ”చూడు రమణా.. మంత్రిగారిది ట్వంటీ, నాది ఫిప్టీన్‌, నీది, ఇఇది, ఎయిది.. తలొక టెన్‌..మొత్తం ఎంతైంది.”
”అరవై ఐదు శాతం”
”ఓకే.. మిగిలిన ముప్పయ్యయిదు రామలింగంది. ఎయ్‌ కాంట్రాక్టర్‌.. యిపుడు గీ లెక్కచెప్పు.. నాకు , మంత్రికి కలిపి ముప్పయ్యయిదు శాతానికి ఐదు లక్షలైతే మీ పర్సంటేజిలంత కలిపి ఎస్టిమేషన్‌ ఎంతుండాలె .. ఊఁ..”
డి.ఇ. ఇస్మాయిల్‌ చూస్తున్నాడు అతను ఐఐటి మద్రాస్‌నుండి ఎమ్‌టెక్‌ స్ట్రక్చర్స్‌ డిస్టింక్షన్‌లో పాసై నాల్గునెలల క్రితమే పిఎస్‌సీ ద్వారా గ్రూప్‌వన్‌లో పంచాయితీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్ట్‌ డిఇగా అపాయింటయిండు. అతనికి నాల్గునెలల నుండీ అంతా వింత వింతగా, పిచ్చిపిచ్చిగా, ఆశ్చర్యంగా, అసహ్యంగా కూడా ఉంది. అతను అంతకుముందు ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి విపరీతంగా ఉందని విన్నాడు గాని యింత దారుణంగా, జుగుప్సాకరంగా గుడినీ, గుడిలింగాన్నీ మింగేసే స్థాయిలో ఉందని తెలసుకుంటున్నకొద్దీ రోత కలగడం మొదలైంది.. ఏమిటిది.. భరించలేని ఈ లంచగొండి దుర్గంధాన్ని ఎలా శుభ్రం చేయాలి.,
కాలిక్యులేటర్‌ను చటుక్కున బైటికితీసి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ముత్యాలు ఎస్‌.ఇ. రమణకు అందివ్వబోయాడు.
”నాకిస్తావేమయ్యా ఫూల్‌.. చకచకా చేసి చెప్పు…” అన్నాడు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌. డి.ఇ ఇస్మాయిల్‌కు ఒంటిపైన జెర్రులు పాకుతున్నట్టనిపిస్తోంది. అప్పుడు మంత్రిగారున్నపుడే స్విచ్ఛాన్‌ చేసిపెట్టిన తన జేబులోని సెల్‌ఫోన్‌ కెమెరా, వాయిస్‌ రికార్డర్‌ పనిచేస్తున్నట్టుగా చెక్‌చేసుకుని అంతా ఓకే అని తెలుసుకుని..ఊపిరిపీల్చుకుని.. ఏమిటిది.. ఏంజరుగుతోంది.,
”సర్‌ పదహారు లక్షల చిల్లర.. సే.. పదిహేడు లక్షలు..” అన్నాడు జాన్సన్‌ తడబడ్తూ యాభై ఏడేండ్ల జాన్సన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఒక కానిస్టేబుల్‌ జీవితకాలమంతా కాలికింది చెప్పులా పనిచేసి పనిచేసి అరిగిపోయినట్టు ఉద్యోగం చేసీ చేసీ జీవితముగింపుకాలంలో రిటైర్మెంట్‌ముందు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ప్రమోషన్‌ పొంది.. ఏదో అలా నడిపిస్తున్నాడు. ఎక్కడో ఓ డిప్లొమా సర్టిఫికేట్‌ సంపాదించి, ఏవో కొన్ని బండగుర్తు పనుల్ని నేర్చుకుని, ఏ పనికి ఎంత పర్సెంటేజో యింకా బాగా అవగాహన చేసుకుని రిటైర్మెంట్‌ముందు చీపురుతో డబ్బును ఊడ్చుకుంటున్నాడు.
”ఓకె.. ఏయ్‌ ముత్యాల్‌..నువ్వు రేపు ఆ ఎ.ఇ. గానితో ఆ బి.టి. రోడ్‌కు పదిహేడు లక్షల ఎస్టిమేషన్‌ తయారు చేయించి..” అని చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య అంటూండగా,
ఇస్మాయిల్‌ వెంటనే అందుకుని అన్నాడు ”సర్‌.. ఆ రోడ్డు నాల్గులక్షల కంటె ఎక్కువ కాద్సార్‌..” మెరుపులా.
షాక్‌ తిన్నట్టయి సి.ఇ గురవయ్య ఇ..ఇ ముత్యాలు దిక్కు ఎ.ఇ. జాన్సన్‌ దిక్కు చూశాడు ”వాటీజ్‌ దిస్‌ నాన్సెన్స్‌” అన్నట్టు.., చూచి ”మాకు తెల్సులేవో.. మూస్కో.. ముత్యాల్‌ వాళ్ళతో కూడా సంతకాలు చేయించి నేనుకూడా చేసి రిటర్న్‌ చేస్తా. ఓకేనా..” అని లేవబోయాడు తన సోఫాలోనుండి. అప్పుడు గురవయ్య దగ్గరినుండి విస్కీ, చికెన్‌మసాల కలగలిసిన కంపు వాసన ఇస్మాయిల్‌ ముక్కుపుటాలను అదరగొట్టింది.
”సర్‌..” ముత్యాలు ఏదో గొణుగుతుండగా,
”ముత్యాలూ టైం షెడ్యూలేమిటంటే.. ఎండాకాలం, కాబట్టి మే లో మనం రోడ్డును వేశాం. క్వాలిటీ కంట్రోల్‌ ఇన్‌స్పెక్షన్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఇన్‌స్పెక్షన్‌ అన్నీ ఐపోయాయి. మే ఎండింగులో. ఎ.యి చెక్‌ మెజర్‌ చేసి బిల్స్‌ సబ్‌మిట్‌ చేశాడు. ప్రాసెస్‌ ఐపోయి కాంట్రాక్టర్‌ రామలింగం జూన్‌ మొదటివారంలో బిల్‌ డ్రా చేసుకున్నాడు. ఫైల్‌ క్లోజ్డ్‌.. డి.డిస్‌. మళ్ళీ సెప్టెంబర్‌లో ఈ ప్రాంతం వరదముంపు ప్రాంతం కాబట్టి భీకరంగా వచ్చిన వరదల తాకిడికి, ఉప్పెనకు బర్లగూడెం – తత్తరిపల్లె లోతట్టు ప్రాంత బి.టి రోడ్‌ పూర్తిగా నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. సి.ఇ, ఎస్‌.ఇ. అందరూ ఇన్‌స్పెక్ట్‌ చేసి రోడ్డు కొట్టుకుపోయిందని సర్టిఫై చేశారు.. మళ్లీ ఆ పాతఫైల్‌ను తీసి రీ సబ్‌మిట్‌ చేసి, రోడ్డు కొట్టుకుపోయిందనే నోట్‌ అప్రూవల్‌. ఫైల్‌ క్లోజ్డ్‌ ఎల్‌.డిస్‌.. అర్థమైందా”
”సర్‌.. అర్థమైంది సర్‌.. మనం యిదివరక్కూడా పాపికొండల దగ్గర గిరిజనపల్లె రాజీరా నుండి మోత్కుగూడెం దాకా ఇరవై లక్షల వర్క్‌.. ప్రపంచబ్యాంక్‌ లోతట్టు ప్రాంతాల అభివృద్ధి పథకం క్రింద ఇదేరకంగా.. అసలు రోడ్‌ వేయకుండానే.. వేసినట్టు.. ఆ తర్వాత వరదల్లో కొట్టుకుపోయినట్టు ఫినిష్‌ చేశాం గద్సార్‌. ఇదికూడా ఎగ్జాట్లీ అలాగేనన్నమాట.. అంతేనా సార్‌..” అన్నాడు ఇఇ ముత్యాలు కాస్త అమాయకంగానే.. విధేయంగాకూడా.
”అరె నీయవ్వ.. గింతవివరంగా చెప్తావేమయ్యా.. అర్థం చేసుకోవాలంతే..” అని చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య గబగబా బయటికెళ్ళి తన ప్రభుత్వ టాటాఇండికా ఎసి కార్లో కూర్చున్నాడు. వెంటనే మందకుమంద అందరూ సి.ఇ వెంట గొర్రెలమందలా నడిచి.. అతివినయంగా.. తలలూపి.. చెంపలేసుకున్నంత పనిచేసి,
”రామలింగం.. హాపీనా..” కాంట్రాక్టర్‌ను అనునయించాడు సి.ఇ.
రామలింగం తొండవలె పరమవికారంగా నవ్వి.. ”అయ్యా.. అఁయ్‌..” అన్నాడు తలూపుతూ
చీఫింజినీర్‌ కార్‌ మరుక్షణంలో జారి.. చీకట్లోకి మాయమైంది..హైద్రాబాద్‌ వైపు.
రెండు నిముషాల తర్వాత ఇఇ ముత్యాలు, ఎఇ జాన్సన్‌, కాంట్రాక్టర్‌ రామలింగం, అందరూ వాళ్ళ వాళ్ళ జీపులు, కార్లలో ఉడాయించి..
ఒక హత్యానంతర నిశ్శబ్దం మిగిలింది.
ఇంకా ఈ నగ్నలంచాల వ్యవస్థకు పూర్తిగా అలవాటుపడని ఇరవై ఎనిమిది సంవత్సరాల యువ ఇంజినీర్‌ ఇస్మాయిల్‌ భారంగా తన హీరోహోండా మోటార్‌సైకిల్‌ దిక్కు నడుస్తూండగా.,
ఎక్కడో ఫెళపెళమని ఉరుముతూ పిడుగుపడి.. వర్షం ఉన్నఫళంగా ఎక్కువైంది.
తన జేబులోని సెల్‌ఫోన్‌ కెమెరాను, వాయిస్‌ రికార్డర్‌ను స్విఛాఫ్‌ చేసి ఇస్మాయిల్‌ తన బైక్‌ను స్టార్ట్‌ చేశాడు.
వర్షం కురుస్తూనే ఉంది.. అర్ధరాత్రి.. నిశ్శబ్దంగా.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 11 వ భాగం

(గత వారం తరువాయి)

11

”మనం చిన్నప్పుడు..మూడో తరగతిలో ఉన్నపుడు చదువుకున్న ఓ కథ జ్ఞాపకముందా లీల.. ఒక రాజుంటాడు.. అతను దేవునిగురించి తపస్సు చేసి ప్రసన్నుణ్ని చేసుకుని వరంకోరుకోమంటే..తను ఏది ముట్టుకుంటే అది బంగారంగా మారాలని కోరుకుంటాడు..దేవుడు సరే అని అనుగ్రహించి అదృశ్యమైన తర్వాత అసలు కథ ఆరంభమౌతుంది. మంచాన్ని ముట్టుకుంటే మంచం బంగారం, కుర్చీని ముట్టుకుంటే కుర్చీ బంగారం..పెన్ను బంగారం..మన్ను బంగారం..అన్నం ముట్టుకుంటే అన్నం బంగారం, నీళ్ళు బంగారం..యిక తను ఏం తిని ఏం తాగి..ఎలా జీవించాలి..బంగారం తిని బంగారం తాగి..బంగారం..అదీ మీమాంస..ఈ ఒక్క చిన్న కథ చాలు మనిషి ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో తెలియచెప్పడానికి.. ఈ కథ వెనుక కోటి సిద్ధాంతాలున్నాయి..ఔనా..”రామం ఒక్కక్షణం ఆగి లీలవైపు చూశాడు భావరహితంగా.
ఆమె అతని ఎదుట.. ఏ అక్షరాలూ రాయకముందు ఖాళీ బ్లాక్‌బోర్డులా ఉంది.. ప్రశాంతంగా, భావగర్భితంగా.,
వాషింగ్టన్‌ డి.సి డల్లెస్‌ ఎయిర్‌పోర్ట్‌.. ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణీకుల ప్రత్యేక నిరీక్షణ హాల్‌.. ఎవరూ లేరు.. రిపోర్ట్‌ చేయగానే కతార్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగి ఒకామె అతివినమ్రంగా రిసీవ్‌ చేసుకుని.. వెయిటింగు హాల్‌లో కూర్చోబెట్టి.. యింకో యిరవై నిముషాల తర్వాత బోర్డింగు.. డల్లెస్‌నుండి హైద్రాబాద్‌ 3000 డాలర్లు.
తను ఏర్‌పోర్ట్‌కు వచ్చేటప్పటికే రామం తనకోసం నిరీక్షిస్తున్నాడు.
రామం అంటే క్రమశిక్షణ.. రామం అంటే ఒక ఆత్మనియంత్రణ .. రామం అంటే ఒక మనిషి రూపంలో ఉన్న ఆపాదమస్తక ప్రేమ.. రామం అంటే.. ఒక పవిత్రమైన దేవతా విగ్రహాన్ని నిర్మల హృదయంతో వీక్షిస్తున్నప్పటి అమర దివ్యానుభూతి.. రామం అంటే తృప్తి.
రామం చెప్పిన కథ లీలకు పచ్చని పచ్చి చెట్టు కాండానికి పదునైన బాణంలా దిగింది.
రాత్రి రామం తనతో ఫోన్లో మాట్లాడిన తర్వాత.. హోటల్‌కు వెళ్ళి.. స్నానించి.. పాలనురగలాంటి పడకపై చేరి, స్వర్గాన్ని తలదన్నే మహాద్భుత వాతావరణంలో అటు యిటూ దొర్లుతూ.,
ఉహుఁ… నిద్ర రాలేదు.. రాత్రంతా నిద్ర రానేలేదు.
తను యుఎస్‌లో ఉన్నప్పుడు.. మూడు సంవత్సరాలు.. టిసిఎస్‌లో ఉన్నప్పుడు.. తర్వాత సంస్థలు మారిన తర్వాత కూడా.. రామంతో గడిపిన ఎన్నో సందర్భాలు గుర్తొచ్చాయి లీలకు.. రాత్రంతా.
ఐనా. ఆ గతంలోకూడా తను రామంతో చేసింది ఏమీలేదు.. తను అతన్ని ప్రేమిస్తోందా.. అతణ్ణి యిష్టపడ్తోందా.. అతని తత్వాన్ని మెచ్చుకుంటూ అతనిలో తనుకోరుకుంటున్న పురుషుణ్ణి దర్శిస్తోందా.. అసలేమిటి.. అతను తనకు కావాలా.. లేక తనను తానతనికి అర్పించుకోవాలనుకుంటోందా. లేక అతని అపురూపమైన అందాన్ని తనకు తెలియకుండానే తాను మోహిస్తోందా. అతనిపట్ల తనకు ఏదైనా శారీరక లౌల్యం ఉందా.. అసలేమిటి? దీన్నేమంటారు.
ఏది ఏమైనా రామంపట్ల తనకున్నది ఆరాధన. ప్రేమ. వివశతకాదు.. ఉన్మాదం.. ఉన్మాదిలా తను అతనంటే పడిచస్తోంది.
రాత్రంతా నిద్రలేకుండా అతని ఆలోచనల్లోనే గడిపినపుడు.. ‘యింత సౌకర్యవంతమైన వాతావరణంలో రామం తనవెంట ఉంటే బాగుండును’ అని ఆశపడ్డదిగదా.. ఉంటే..ప్రక్కన..అతని కౌగిలిలో. ఉక్కిరిబిక్కిరౌతూ..దగ్గరగా… ఇంకా దగ్గరగా.. ఒకర్నొకరు హత్తుకుని.. ఇంకా ఇంకా కూడా.. అనుకుంది కదా.. ఆ అదేమిటి.
వ్చ్‌..,
క్యాథీ జ్ఞాపకమొచ్చింది లీలకు.
ఎక్కడో ఒక మొల దిగింది.. సుత్తితో ఓ కర్రచెక్కపై ఇనుపమొలను దిగ్గొడ్తున్నట్లు.. టక్‌ టక్‌ టక్‌.. దెబ్బలు.. సుత్తిదెబ్బలు.
మొల దిగుతోంది.. గుండెలోకి,
రాత్రంతా నిద్రలేక కళ్ళనిండా మంట,
కన్నీళ్లు.. జలజలా.,
‘గోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసినవారూ
జోడుగ నీతో ఆడీపాడీ కూరుములాడినవారూ
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎవడే తెలసినవాడూ..
పయనించే ఓ చిలుకా.. ఎగిరిపో.. పాడైపోయెను గూడూ’
పాట.. ప్రవహించే పాట.. మనిషిని ద్రవింపజేసి ప్రవహింపజేసే పాట.. రామం, తను ఎన్నోసార్లు ఒంటరిగా పార్క్‌లో కూర్చున్నపుడు.. ఎక్కడో తనను తాను కోల్పోయిన అత్మిక ఏకాంతంలో రామం అప్పుడప్పుడు ఈ పాటను మహాద్భుతంగా పాడేవాడు. ఆ గానం గుండెలను పిండి.. నలిపి.. భాషకందని ఓ నిశ్శబ్ద కల్లోలం,
ఎన్నడో తిరిగి యిటు నీ రాక..ఎవడే తెలిసినవాడూ.,
ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తారు.. అసలు తిరిగి వస్తారా.. ఎప్పుడు ఎవరు తిరిగివస్తారో.. అసలు రారో ఎవరికిమాత్రం ఎలా తెలుస్తుంది.
అసలీ రావడమేమిటి.. ఈ పోవడమేమిటి.. రాకపోవడమేమిటి.
వెళ్ళడం. రాకపోవడం రెండూ ఒకటేనా
”లీలా..”
”ఊఁ.. ” ఉలిక్కిపడింది లీల.
”ఎందుకు కళ్ళనిండా నీళ్లు”
”తెలియదు రామం” ఆమె అటువైపు.. గాజుపలకల కిటికీదిక్కు తిరిగి ఎయిర్‌ ఫీల్డ్‌లోకి చూస్తోంది. పెద్ద సిమెంట్‌ పలకలతో విశాలమైన ప్రాంగణం.. అక్కడక్కడ రెక్కలుచాచి నిలబడ్డ ఇనుప పకక్షుల్లా విమానాలు.

13
”లీలా.. నీకన్నీ తెలుసు.. నువ్వు నిజానికి పరిపూర్ణురాలివి. పరిపూర్ణత అనేది మనిషి పరిపక్వతకు పరాకాష్ట.. మాస్లో హైరార్కీ ఆఫ్‌ నీడ్స్‌ సిద్ధాంతం నీకు తెలుసు. మనిషి జీవితంలో అనివార్యంగా ఐదు స్థాయిల్లోనుండి ప్రయాణిస్తాడని ఆ మహానుభవుడు 1943లో చెప్పాడు. భౌతికావసరాలైన కూడు, గుడ్డ, నీడ.. తర్వాత రక్షణ, ప్రేమ.. ప్రేమకోసం పరితపన.. తర్వాత ఆత్మగౌరవం.. అంతిమంగా సెల్ఫ్‌ ఆక్చువలైజేషన్‌. మనిషి చివరికి ‘అసలు నేనెవరిని?’ అని ఎవరికివారు ప్రశ్నించుకునే అలౌకిక పరాకాష్ట.. యిక అక్కడ్నుండి మనిషి ఒక ఆదర్శమానవునిగా మారేందుకు ప్రయత్నిస్తాడు”
లీల వెనుదిరిగి రామం ముఖంలోకి చూచింది.. వ్యాకులంగా.
”ఐతే ఆ స్థితికి కొందరు వివేకవంతులు చాలా చిన్నవయసులోనే చేరుకుంటారు. కొందరు.. అంటే చాలా ఎక్కువమంది అసలా స్థాయికి రాకముందే చచ్చిపోతారు.. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌.. ప్రపంచ నంబర్‌ వన్‌ ధనవంతుడు యాభై మూడేళ్ళ వయసులోనే ఈ ఆదర్శమానవునిగా మారి తన ఆస్తులతో ‘మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌” వంటి దాతృత్వ సంస్థలను నెలకొల్పి విముక్తుడయ్యాడు వారెన్‌ బఫెట్‌ కూడా అంతే. మనిషికి గరిష్టమైన ఆత్మానందాన్నిచ్చే ఈ ఆదర్శస్థితినే భారత పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, బౌద్ధ వాజ్ఞ్మయంలో ‘నిర్వాణ’స్థితి అన్నారు. ఈ స్థితిని చేరేముందు మనిషి పొందే అనంత అంతః కల్లోలాన్ని.. యిప్పుడు నువ్వు పొందుతున్నావు.”
లీల ప్రశాంతంగా అతన్ని చూస్తోంది.
ఎదుట.. అతని వెనుకనున్న ప్రశాంతమైన నీలి ఆకాశంలోనుండి సూర్యోదయమౌతోంది.
స్పష్టంగా నీకేమి కావాలో నీకు తెలియడంలేదు లీలా”
”…….” ఆమెకు మాటలు పెగలడంలేదు.ఎందుకో గొంతులో ఏదో అడ్డుపడ్తున్నట్టు.. ఏదో దుఃఖం పొంగి శరీరమంతా వ్యాపిస్తున్నట్టు.,
”రా..మం..” చాలా అనూహ్యంగా లీల ఒక గాలితెప్పలా వచ్చి రామం గుండెలపై వాలిపోయింది. అతన్ని పూలతీగలా చుట్టుకుపోయి..వర్షించింది..ఎక్కెక్కిపడి ఏడుస్తోంది.. చిన్నపిల్లలా.
అక్కడ ఇద్దరే ఉన్నారు.. ఒక్కరేవలె.
ఒట్టి నిశ్శబ్దమే.. కాని కోటి సంభాషణలు. శతకోటి నివేదనలు.
రామం ఆమె తలను నిమిరాడు మృదువుగా.. ఒకటి.. రెండు.. పది క్షణాల తర్వాత.. లీల ఒక మైకంలోనుండి మేల్కొన్న మనిషిలా అతన్నుండి వెనక్కి జరిగి.. తలవంచుకుని నిలబడి.,
”అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశంమాత్రమే తెలుసు. నిష్క్రమణ తెలియదు..” అన్నాడు రామం.. ఒత్తి పలుకుతూ.. ఒక ప్రవచనంలా.
ఆమె తలెత్తి చూస్తూండగా.,
కతార్‌ ఏర్‌వేస్‌ ఆఫీసరొకామె వచ్చి.. ”షల్‌ వి మూవ్‌ ఫర్‌ బోర్డింగు మేం” అంది.. ఆమె ప్రక్కనున్న బ్రీఫ్‌ను యిమ్మన్నట్టున్న దేహభాషతో
ఇక తాము విడిపోవాలి. తప్పదు..
‘కలుస్తున్నాం అంటే..ఎప్పటికైనా తప్పకుండా విడిపోతామనికదా అర్థం’ అని ఎవరో కవి రాసిన వాక్యం స్ఫురించి,
మధ్య ఘనీభవించిన మౌనమే,
”ఓకే లీలా..సి యు..”
”…..”
లీల బ్రీఫ్‌ను ఆ వచ్చిన స్త్రీ చేతిలోకి తీసుకుంది.
కదిలారు అందరూ.. ఇద్దరు అటు.. రామం ఒక్కడు యిటు..
‘చివరికి ఎవరిదారి వారిదే..’
పోర్ట్‌లోపలికి నడుస్తూ లీల ఒకసారి రామం దిక్కు వెనుదిరిగి చూచింది.. ఆశగా.. శూన్యంగా కూడా.
రామం చేయూపాడు మంద్రంగా నవ్వుతూ.
ఐదు నిముషాల తర్వాత.. ఫస్ట్‌క్లాస్‌ రీజియన్‌లో.. కిటికీ ప్రక్కసీట్లో మెత్తని బెడ్‌వంటి సోఫాపై వెనక్కి ఒరిగి.. గట్టిగా నిట్టూర్చపోతూండగా మొబైల్‌ మ్రోగింది.
”హలో” అంది లీల యధాలాపంగా.
”మేం..” నిర్మల.. ఇండియా.. హైద్రాబాద్‌నుండి.
”ఎక్కడున్నారు మేడం” ఫ్లైట్‌లో ఉన్నా.
”వాషింగ్టన్‌ డి.సి.. రేపు హైద్రాబాద్‌లో ఉంటా నిర్మలా””ఒక అర్జంట్‌ మెసేజ్‌ మేడం..”
”చెప్పు..”
”మన హైద్రాబాద్‌లో ఎస్పీయం అని ఒక బిపిఓ ఉంది మేడం మియాపూర్‌ దగ్గర.. నూట అరవైమంది ఐటీ స్టాఫ్‌ పనిచేస్తున్న కంపెనీ. డెల్లాయిట్‌ అమెరికాతో పనిచేస్తోంది. ఎస్‌ఎపీ ఆపరేషన్స్‌లో దిట్ట. మంచి స్టాఫ్‌ ఉన్నారు. నెట్‌వర్త్‌ ఫిప్టీమిలియన్‌ డాలర్స్‌.. ఐతే నిన్న సౌతాఫ్రికానుండి యోల వెబ్‌హాస్ట్‌ కంపెనీవాళ్ళు మీకోసం ఫోన్‌ చేశారు. వాళ్లు ఇండియాలో ఒక వర్క్‌స్టేషన్‌కోసం వార్‌ ఫుటింగు బేసిస్‌పై సెర్చ్‌ చేస్తున్నారు. బెంగళూర్‌, హైద్రాబాద్‌, చెన్నై.. ఎక్కడైనా ఫర్వాలేదని. మీరు అందుబాటులో లేరుకదా.. అందుకని ఫ్రిలిమనరీస్‌ మాట్లాడాను.ఎస్పీయంను దృష్టిలో పెట్టుకుని ఆఫర్‌ మాట్లాడాను. రాజు అని దీని యండీ. వీడు దీన్ని ఫిప్టీ ఫైవ్‌ కిస్తానంటున్నాడు. అటు యోలా వాడు ఇదే కన్ఫిగరేషన్‌కు సిక్ట్సీ ఎయిట్‌ ఆఫర్‌ చేస్తున్నారు. సెటిల్‌ చేస్తే మనకు ఎంతో బాగుంటుంది. మేడం. థర్టీన్‌ మిలియన్‌ ఫ్రాపిట్‌.. ఖర్చులు పోను టెన్‌మిగుల్తాయి. ఇమ్మీడియేట్‌ డెసిషన్‌ తీసుకోకుంటే సియస్‌సివాడు తన్నుకుపోతాడేమో..”
అంతా అర్థమైంది లీలకు.
నిర్మల కత్తిలాంటి పిల్ల.. కోయడమే.
”మీరు అలాగే దోహానుండి సౌతాఫ్రికా వెళ్లి..”
ఒక్కక్షణం కూడా తేరుకోకముందే.. మళ్ళీ వ్యాపారం.. మళ్ళీ దందా.. మళ్లీ లాభం. మళ్ళీ సంపాదన.
‘యోలా.. అంటే.. అమెరికా సాన్‌ఫ్రాన్సిస్‌కో బేస్ట్‌ ఎంఎన్‌సి.. సౌతాఫ్రికాలో మొన్న మార్స్‌ 2007 నుండే ఆపరేషన్స్‌ ప్రారంభించారు. మంచి ట్రాక్‌ రికార్డున్నవాడు. ఎస్‌ఎపీలో విపరీతమైన ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌లో చొచ్చుకుపోతున్నాడు.. ఆలోచిస్తూనే లాప్‌టాప్‌ను తెరిచి లాగినై, మొబైల్‌లో మాట్లాడ్డం ప్రారంభించింది. ‘నిర్మలా..యోలా సిఇవో పేరు ట్రెరర్‌ హారిస్‌.. సీన్‌ క్రొట్టీ వైస్‌ ప్రెసిడెంట్‌.. తెలుసు .. మన డేటా బేస్‌లో వీళ్ళ హాట్‌లైన్‌ నంబర్సుంటాయి.. నా మూడ్‌ బాగాలేదు నిర్మలా. మొట్టమొదటిసారి నావంతుకు నువ్వు రేపుదయం జోహన్స్‌బర్గ్‌లో ఉంటాడు సియిఓ.. వెళ్ళి కలిసి నువ్వు డీల్‌చెయ్‌.. ఆన్‌ మై బిహాఫ్‌.. సెటిలయ్యేముందు వాడిని నాతో మాట్లాడించు. శాస్త్రిగారినుండి కావల్సినంత డబ్బు తీసుకో. పోయిరా.. ఫస్ట్‌ వెంచర్‌.. బెస్టాఫ్‌లక్‌..” అంది గడగడా.
ఊహించిన ఈ మహదావేశానికి నిర్మల సంతోషంతో ఎగిరెగిరిపడుంటుందని లీలకు తెలుసు.. పోనీ..డిజర్వింగు గర్ల్‌.. అనుకుని.,
”థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్‌ మేడం.. ఐ ఓ టు యు మేడం.. ఫరెవర్‌..” ఇంకా ఏదో అంటోంది నిర్మల..
నవ్వుకుంటూ లీల వెనక్కివాలి.. కళ్ళు మూసుకుంటూండగా ఫ్లైట్‌ టేకాఫ్‌ ఔతున్న కుదుపు.. ఏదో భీకరమైన పరుగు..
పరుగు.. పరుగు.. పరుగు.,
ఎక్కడికీ పరుగు.. ఎందుకీ పరుగు.
‘ఎన్నడో తిరిగి యిటు నీ రాక.. ఎవడే తెలిసినవాడు..’ ఎక్కడో కొండల్లోనుండి.. లోయల్లోనుండి సన్నగా వినిపిస్తున్నట్టు ఆత్మాంతరాల్లో.. పాట.
‘అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశరహస్యం తెలిసింది.. కాని నిష్క్రమణ తెలియదు..’
నిష్క్రమణ.. నిష్క్రమణ..,
ప్రవేశంకంటే.. అనేకసార్లు నిష్క్రమణే ప్రధానం.
ఐతే.. చాలామంది మనుషులకు ఈ నిష్క్రమణ రహస్యం తెలియదు.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 10 వ భాగం

(గత వారం తరువాయి)

10

బెంజ్‌ లిమో కారు గంటకు నూరు మైళ్ళ వేగంతో పోతోంది.
ఇంకో పదినిముషాల్లో కారు విలార్డ్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌ ముందుంటుంది. బయట వర్షం కురుస్తూనే ఉంది..ఎప్పటినుండో..కాస్త చిక్కగానే
‘వాతావరణం నా మనసువలెనే వుంది..మబ్బుపట్టి..ముసురు ముసురుగా..చికాగ్గా, అసహనంగా..రొచ్చుగా..’ అనుకుంది లీల.
యిప్పుడు తను డీల్‌ చేస్తున్న పని తన అత్యంత ఆంతరంగికురాలైన నిర్మలక్కూడా తెలియనిది. ఆఫీషియల్‌ షెడ్యూల్‌లో ఈ ఎలిమెంట్‌ లేదు. యిప్పుడు తను ఎవరి నెట్‌వర్క్‌లోనూ లేదు. పూర్తిగా ఇండిపెండెంట్‌ ఈ క్షణం..అంటే స్వేచ్ఛ..తన గురించి ఎవరికీ తెలియని ఒక అన్‌నోన్‌ అడ్రస్‌ తనిప్పుడు. ఇండియానుండి నిర్మలగానీ, యిక్కడి తమ ఏజంట్‌ రాబర్ట్‌ గానీ, యింకెవరిగ్గానీ తనెక్కడుందో ఈ క్షణం తెలియదు. ఇలాంటి సందర్భం ఒక్కోసారి పంజరంలోనుండి బయటపడ్డ పక్షిపొందే స్వేచ్ఛవంటిది. కాని ఈ స్వేచ్ఛలో ప్రమాదముంది. పంజరంలో ఉండే పక్షిని ఎవరూ కాల్చరు. బయటికొస్తే అది అందరికిచెందిన వస్తువై అందరి పాలౌతుంది. తనుకూడా అంతే. యిప్పుడు తాను ఎవరి రక్షణలోనూ లేదు. నిర్మల, రాబర్ట్‌ దృష్టిలో తానిప్పుడు అన్నెపోలిస్‌ హోటల్‌ లూయిస్‌లో ఉంది. తన అత్యంత అంతరంగికురాలైన నిర్మలక్కూడా చెప్పగూడని అతిగోపనీయ సందర్భాలలో లీల యిటువంటి రిస్క్‌తో కూడిన పనులను చేపడ్తుంది.
రామంకు మళ్ళీ ఫోన్‌ చేసింది. యిది ఆరవ ఫోన్‌. ఫోన్‌రింగవుతోంది. కాని ఎత్తడంలేదు. ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టినట్టున్నాడు.
ఆమెకు అహం దెబ్బతిని. ‘లీల అను నేను ఫోన్‌చేస్తే ఎత్తకపోవడమా’ అనే ఒక అహంకార శిఖరంపై జ్వలించిపోతోందామె.
విసుగ్గా ఫోన్‌ కట్‌చేసి.. టైం చూచుకుంది. రాత్రి ఎనిమిదీ నలభై,
చకచకా ముఖ్యమంత్రి రహస్య ఫోన్‌కు చేసింది. డైరెక్ట్‌ లైనది. మోస్ట్‌ కాన్ఫిడెన్షియల్‌ హాట్‌లైన్లలో ఒకటది.
”హలో..” మరుక్షణంలో ముఖ్యమంత్రి.
”గుడీవినింగ్సర్‌..నేను వాషింగ్టన్‌ డి.సి నుండి..వరల్డ్‌ బ్యాంక్‌ డొమైన్‌నుండి మాట్లాడ్తున్నాను.”
”ఊఁ.. గుడీవినింగమ్మా లీలా..హౌ ఆర్‌ యు..”
”బాగున్నాన్సార్‌..సర్‌ ఆ మన వరల్డ్‌ బ్యాంక్‌ డీల్‌..మొత్తం మూడువందల మిలియన్‌ డాలర్ల లోన్‌ అది. మున్సిపల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌. థర్టీ ఇయర్స్‌ పీరియడ్‌. వన్‌పాయింట్‌ సిక్స్‌త్రీ పర్సంట్‌ ఇంట్రస్ట్‌.. మనం అనుకున్న ప్రకారం డైరెక్టర్‌ ఫర్‌ ఇండియా రాబర్ట్‌ జాఘాను ఒక గంటలో కలువబోతున్నా..మనం మొన్న అనుకున్న కిక్‌బ్యాక్‌ స్ట్రక్చర్‌ ఓకే గదా సర్‌..ది సీజ్‌ ఫర్‌ యువర్‌ ఫైనల్‌ అప్రూవల్‌..”
”ఏం ఫర్వాలేదమ్మా..మూడు బిలియన్‌ డాలర్ల డీల్‌ను ఓకే చేసుకొచ్చే భగీరథ ప్రయత్నం చేస్తున్నావు..కిక్‌బ్యాక్స్‌, నీ కన్‌సల్టెన్సీ ఫీ..ఓకే. డోన్ట్‌వర్రీ..గో ఎహెడ్‌. వచ్చాక ఒకసారి పర్సనల్‌గా నాకు కలువు. పోన్లొద్దు..”అని వెకిలిగా నవ్వుతూ, అదోరకంగా వంకర్లుపోతూ మాట్లాడాడు..
దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల అప్పు..మున్సిపాలిటీల అభివృద్ధి..అంటే చెత్తకుండీల అభివృద్ధి అన్నమాట. ఒక చెత్తబుట్టనుఎవరో ఒకరు కుండీలో కుమ్మరిస్తే కుక్కలమంద చటుక్కున కుండీపైకి ఎగబడి కొట్లాడుకుంటూ ఆ కుళ్ళిన పదార్థాలను దేనికందింది అది నోట కరుచుకుపోతున్న దృశ్యం జ్ఞాపకమొచ్చింది లీలకు. ఇప్పుడీ పదిహేను వందల కోట్లలో ప్రపంచస్థాయి లంచాలు, జాతీయస్థాయి లంచాలు, ట్రాన్సిషనల్‌ ఫ్లో బాపతు లీకేజెస్‌, తనవంతు కన్సల్టెన్సీ ఫీలు అన్నీ పోను.. అన్ని మున్సిపాలిటీలకు పంచి..ఇక మంత్రులు, శాసనసభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కొందరు అసోసిషన్‌ నాయకులు (నోరు తెరువకుండా)..మున్సిపల్‌ ఇంజినీర్స్‌..ఇఇ, డియి, ఎయి, కార్పొరేటర్లు..అందరికీ పండుగ.
రుచికరమైన చికెన్‌ బిర్యానీ అప్పనంగా దొరికినపుడు బిచ్చగాండ్లు ఎగబడి ఎగబడి తింటున్నప్పటి ఆనందం ఉంటుందిక. రోడ్ల అభివృద్ధి అంటాడు, గుడిసెవాసుల సౌకర్యాలంటాడు. మురికివాడల ఉద్ధరణ అంటాడు..ఇంకా ఏవేవో క్లాజ్‌లు. మున్సిపాలిటీల అభివృద్ధి అంటే అందులో పనిచేసే వ్యక్తుల అభివృద్ధి కాదా అని ఒక వెధవ ఇంట్రపిటేషన్‌ చేస్తాడు..మొత్తం మీద దొంగలు దొంగలు కలిసి ప్రపంచ బ్యాంక్‌ రుణాలను పంచుకుంటారు. ఈ నిధులు సరిగా వినియోగించబడ్తున్నాయా లేవా అని ఫస్ట్‌క్లాస్‌ టిఎ, డిఎలు, ఫైవ్‌స్టార్‌ హోటళ్ళ అకామడేషన్లతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెద్దలొస్తారు పరిశీలనార్థం. అందరూ సంతుష్టులౌతారు ఇన్‌స్పెక్షన్‌ చేసి.. ఎందుకంటే ఎవరివాటా వాళ్లకు ముడ్తుంది జాగ్రత్తగా, రహస్యంగా, పదిలంగా, కాగితాలపై అప్పు ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికోసం వందల వేలకోట్ల సహాయాన్ని అగ్రదేశమైన అమెరికా ప్రపంచబ్యాంక్‌ ద్వారా ఉదారంగా,మానవతా దృష్టితో అప్పు ఇస్తోంది..ఒట్టి నామమాత్రపు వడ్డీరేటుపై. దాన్ని చాలా సమర్థవంతంగా వినియోగించి ప్రమాణాలను పాటించి, సక్రమంగా ప్రియారిటీ రంగాలకు పంచి అభివృద్ధి సాధించబడ్తోంది.. వెనుకబడిన దేశాలలో అని నివేదికలు వెళ్తాయి.
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నాక..ఖేల్‌ కతం తాలీ బజావ్‌.
ఎప్పుడు తిరిగి చెల్లించాలి అప్పు ప్రపంచబ్యాంక్‌కు. ముప్పయిఏండ్లు. పది సంవత్సరాల గ్రేస్‌ పీరియడ్‌. నలభై ఏండ్ల తర్వాత రాముడెవడో రాకాసెవడో. ఈ ముఖ్యమంత్రుంటాడా, ఈ మంత్రుంటాడా, ఈ మేయరుంటుందా..ఈ లంచాలు తిన్న దొంగలుంటారా. అన్నీ అరిగి కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైపోయిన మురుక్కాలువలు..కూలిపోయిన ఇళ్ళు..మళ్ళీఎప్పటి చిప్ప ఎనుగులోనే.,
కాని.. టంచన్‌గా ప్రతి క్వార్టర్‌కు తీసుకున్న అప్పుకు డాలర్లరూపంలో వడ్డీ మాత్రం తప్పకుండా కట్టాలి అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం. వడ్డీ తడిచి మోపెడై అసలును మించిపోతుంది. నలభై ఏండ్లలో ఈ తరం మారి..ఇంకా పుట్టని శిశువు నెత్తిపై ఋణభారం మోపబడి..అప్పులతో కొప్పులు పెట్టుకుని వయ్యారంగా కులుకుతున్న భారతదేశమా వర్థిల్లు.. తెలుగు సమాజమా వర్థిల్లు.
రాష్ట్రబడ్జెట్‌లో ఎంతశాతం అప్పులవడ్డీ కింద హరించబడ్తోందో సామన్య జనానికి విప్పిచెప్పితే పాలకుల బట్టలిప్పి చెప్పుల్తోకొడ్తారు.
అంతా రహస్యం..గోప్యం..కేన్సర్‌ రోగంవలె..ఎయిడ్స్‌ వ్యాధివలె.
యిదివరకు రోడ్డును తవ్వి ఏదైనా రిపేర్‌ చేస్తున్నపుడు ఒక బోర్డ్‌ పెట్టేవారు..’మరమ్మత్తు పనులు జరుగుతున్నవి’ అని. కాని ఆధునీకరణ పేరుతో వేస్తున్న లంచగొండితనం, వెర్రితలలు వేస్తున్న సంస్కృతిలో యిపుడు ఆ పనులకే ”అభివృద్ధి పనులు జరుగుచున్నవి” అని బోర్డు రాస్తున్నారు..అదీ అభివృద్ధి అంటే.
లీల ఫోన్‌ పెట్టేసి..ముందర టేబుల్‌పై ఉన్న లాప్‌టాప్‌ను క్లిక్‌ చేసి తను కలువవలసిన వ్యక్తిపేరు కోసం సర్చ్‌ చేసింది తన హిడెన్‌ ఫోల్డర్‌లో.
రాబర్ట్‌ జాఘా..డైరెక్టర్‌ ఫర్‌ ఇండియా. మొబైల్‌ నంబర్‌..ఈ రోజు తేది..ప్రక్కనే అపాయింట్‌మెంట్‌ టైం…తొమ్మిది గంటలు..అతను ప్రపంచ బ్యాంక్‌కు ప్రక్కవీధిలోనే ఉన్న విలార్డ్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌లో తనకోసం వేచి ఉంటాడు. మొబైల్‌లో తను సంప్రదించగానే తాము కలుసుకునే విధానం..చర్చించవలసిన విషయం. పట్టే సమయం..ఇతర కీలకమైన ఇచ్చిపుచ్చుకునే డబ్బు వివరాలు, చెల్లింపు పద్ధతి..ఇవన్నీ చెబుతాడు.
వెంటనే మొబైల్‌లో జాఘాకు డయల్‌ చేసింది.
మరుక్షణమే ఫోన్‌ ఎత్తాడు అట్నుండి.
”హాయ్‌..”
”హాయ్‌..గుడీవ్నింగు సర్‌, యామ్‌ లీల హియర్‌ ఫ్రం ఇండియా”
”యయ..ఐ హావ్‌ ఐడెంటిఫైడ్‌ యు. టెల్మీ”
”సర్‌ యామ్‌ రీచింగు యు సూన్‌..వితిన్‌ టెన్‌ మినట్స్‌”
”ప్లీజ్‌ డు కం. హౌ ఆర్‌ యు కమింగు..”
”యామ్‌ కమింగు బై ఎ బెంజ్‌ లిమో”
”దట్స్‌ బెటర్‌. ఐ హావ్‌ పీపుల్‌ ఎరౌండ్‌ మి. జస్ట్‌ ఐ విల్‌ స్కిప్‌ అండ్‌ కం ఇన్‌టు యువర్‌ లిమో..అండ్‌ వియ్‌ విల్‌ ఫైనలైజ్‌ ద డిస్కషన్‌ అండ్‌ డీల్‌ వితిన్‌ టెన్‌ మినట్స్‌..ఆర్యూ ఓకె విత్‌ దట్‌”
”యు మీన్‌..మనీ”
”యస్‌…”
”య”
”ప్లీజ్‌కం..ఐ షల్బీ వెయిటింగు”
లైన్‌ కట్టయింది
లీల నవ్వుకుంది..ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ కన్‌సల్టెన్సీ అనబడే దళారీ వ్యాపారంలోకి దిగకముందు అనుభవంతో.. ప్రారంభంలో డైరీలో రాసుకున్న తాత్పర్య వాక్యం జ్ఞప్తికొచ్చింది.
”కాంతా కనకాలకు లొంగని వాడెవ్వడూ ఈ ప్రపంచంలో లేడు” అని
కాగా..లీల ఒక ప్రధాన విషయాన్ని తన విస్తృతమైన అనుభవంనుండి గ్రహించింది. ఏమిటంటే..పైరవీ స్థాయి పైరవీ చేస్తున్న మొత్తం పెరుగుతున్నకొద్దీ పైరవీ స్ట్రెయిన్‌ తగ్గుతుంది. ఉదాహరణకు సరియైన దిశలో వెళ్తే ఒక మున్సిపల్‌ ఆఫీస్‌లో పైరవీ చేయడం కంటే ప్రైమినిస్టర్‌ ఆఫీస్‌లో పైరవీ చేయడం సుళువు. ఈ రహస్యాన్ని గమనించే కొందరు రాజకీయ నాయకులు కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి, కేంద్రమంత్రి..యిలాంటి సోపానపద్ధతిని పాటించకుండా నేరుగా ఢిల్లీలోనేష్టవేసి డైరెక్ట్‌ హై కమాండ్‌ లాబీయింగులోనే కాలం వెళ్ళబుచ్చుతూ చాలా ప్రయోజనాలూ, పదవులూ పొందుతుంటారు.
ఇరవై రెండు ఫీట్ల పొడవున్న లిమో..నల్లని కారు మెత్తగా, మెల్లగా..మక్‌మల్‌ గుడ్డపై గాజుగోలీలా విలార్డ్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హాటల్‌ ఫోర్చ్‌లోకి ప్రవేశించింది.
వెంటనే లీల మొబైల్‌లో జాఘాకు ఫోన్‌చేసి..,
మరుక్షణమే ఎత్తాడు ఫోన్‌..”కీపాన్‌ సిట్టింగు ఇన్‌ ద లిమో.. ఐ విల్‌ జాయిన్‌ యు ఎలోన్‌ వితిన్‌ ఫైవ్‌ మినట్స్‌”
”ఒకే సర్‌..” వినమ్రమైన జవాబు.
మిలియన్స్‌ డాలర్ల డీల్‌. డీల్‌నుబట్టి వినయవిధేయతలు.
ఒకటి.. రెండు..మూడు. క్షణాలు గడుస్తున్నాయి.
ఎందుకో చటుక్కున రామం ఆమె మదిలో మెదిలాడు.
తాను చేస్తున్న పనిలో కోట్ల రూపాయల ఆదాయం, ప్రయోజనం ఉండవచ్చు. కాని ఎందుకో ఆ క్షణం ఆమెకు తనకు తాను ఒక పెద్ద మున్సిపల్‌ పెంటకుప్పలో పురుగులా జరజరా కదిలి ఒక కంపు బురదలో కూరుకుపోతున్న అనుభూతి కలిగి.,
ఎందుకు..ఎందుకు ఈ వికారమైన అనుభూతి..ఏమిటిది.?
”దీన్నే ‘ఆత్మ’ అంటారు లీలా..మనిషి తెలిసి తెలిసి తప్పు చేస్తున్నపుడు ఆత్మ అగ్నయి దహిస్తుంది..”
‘అగ్ని.. అగ్ని.. అగ్ని – దహిస్తోందా తననిప్పుడు.’
బయట సన్నగా వర్షం..రాలుతున్న గుండుసూదుల్లా చినుకులు.
చిన్నగా లిమోకార్‌ డోర్‌పై చిన్న ‘నాక్‌’ వినిపించింది. వెంటనే లీల డోర్‌ను రిమోట్‌తో తెరిచి..,
వెంటనే మెరుపులా, నల్లనికోట్‌, టై ధరించిన ఓ నలభై ఐదేళ్ల చురుకైన వ్యక్తి లోపలికి చొచ్చుకొచ్చి లీల ఎదురుగా కూర్చున్నాడు.
ఇరవై రెండు ఫీట్ల పొడవుండే లిమో కార్లలో డ్రైవర్‌కు లోపల ఉన్న వ్యక్తులతో సంబంధం ఉండదు. వాహనాన్ని నడపడమే అతని పని. ఓనర్‌ ఇంటర్‌కాంలో ఎటు చెబితే అటు పోవడం అతని వృత్తిధర్మం. కారు లోపల ఏం జరుగుతోందో తెలుసుకునే యాక్సెస్‌ డ్రైవర్‌కుండదు. అంతా సీక్రటే.
లీల ఇంటర్‌కాంలో డ్రైవర్‌కు..”స్టార్ట్‌..అండ్‌ గో” అని చెప్పింది.
లిమో కదిలింది.. మెత్తగా..పూలబాణంలా.
”మిస్‌ లీల..ఈజిట్‌” అన్నాడు జాఘా మంద్రంగా.
”ఎస్‌..”
”వి హాడ్‌ ఎ డిటైల్డ్‌ రిస్కషన్‌ ఎర్లియర్‌ ఓవర్‌ ఫోన్‌. లేటర్‌.. ఫ్యూ డేస్‌ బ్యాక్‌ ఐ గాట్‌ యువర్‌ ఫైల్‌ ఆఫ్‌ ప్రపోజల్స్‌ అప్రూవ్డ్‌ బై ది ప్రెసిడెంట్‌ ఆఫ్‌ డబ్ల్యు. బి. యాజ్‌ ఐ టోల్డ్‌ యు, దేరార్‌ సం ఫార్మాలిటీస్‌ టు బి కంప్లీటెడ్‌..” చెబుతున్నాడు.
అమెరికన్స్‌ దగ్గర ఓ సుగుణముంది. అనవసర చెత్త మాట్లాడకుండా సూటిగా విషయంలోకొస్తారు..యిక్కడ లోవెల్‌లోనుండి ఎంతో క్రమశిక్షణ, సభ్యత, మర్యాద, పనిపట్ల అంకితభావం, నిజాయితీ, దేశభక్తి ఉన్నాయి. దాదాపు లంచగొండితనం కూడా కిందిస్థాయిలో లేదు. కాని పై స్థాయిలో విపరీతమైన కిక్‌బ్యాక్స్‌, పర్సెంటేజ్‌లు, సర్వ దుర్లక్షణాలూ తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే ప్రపంచ అవినీతికర దేశాల జాబితాలో అమెరికా కూడా చాలా అగ్రస్థాయిలోనే ఉంది.. ఐతే యిక్కడ సర్వదరిద్రాలతో బాధపడే ఇండోనేసియా వంటి దేశం ప్రపంచంలో అతి అవినీతికరదేశంగా ఉందంటే వాని అవసరాలను అర్థం చేసుకోవచ్చు. కాని తిని అరిగించుకోలేని పరమ సుఖాల మధ్య ఓలలాడే వీడికేం దరిద్రం..బుద్ది.. అంతే..కోవె అన్నట్టు లంచం తీసుకోవడం ఒక మానసిక రుగ్మత.
మరి తనో..?
‘పేడలో పురుగు…’రామం జ్ఞాపకమొచ్చాడు మళ్ళీ..గుండెల్లో నిప్పు చురుక్కున మండుతూ కాల్చినట్టు ఈ రామం జ్ఞాపకమొకటి.
”ఐ మేడ్‌ ఆల్‌ ద అరెంజ్‌మెంట్స్‌ మిస్టర్‌ జాఘా..”అంది వంకర్లు తిరుగుతున్న అమెరికన్‌ యాసలో.
”హౌమచ్‌..”
”వన్‌ పర్సంట్‌”
”ఐ టోల్డ్‌ యు..టు మాడిఫై ఎ లిటిల్‌..ఈజిట్‌”
”….” లీల మౌనంగా..శూన్యంగా చూచిందతనివైపు కావాలనే..కొద్ది పర్సంటేజ్‌ పెంపైనా కొన్ని కోట్ల రూపాయల తేడా తెస్తుంది.
”టెల్మీ..ఇఫ్‌ యు సే ఒకే.. థింగ్సు విల్‌ బి రిలీజ్డ్‌ టుమారో”
”ఓకే. వుయ్‌ మేకిట్‌ వన్‌ పాయింట్‌ టు ఫైవ్‌..”
”ఓకే..డన్‌..ప్లీజ్‌ టేకప్‌ ది ప్రాసెసాఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌ ఇమ్మీడియేట్లీ. ఐ థింక్‌ యు హావ్‌ ది ప్రొసీజర్‌..యిమ్లీడియేట్లీ ఐ విల్‌ డు మై బిజినెస్‌”
”ఓకే” లీల కుడిచేతి బొటనవ్రేలిని పైకెత్తి ముఖంనిండా నవ్వుతో ప్రతిస్పందించి,
చాలా అనూహ్యంగా జాఘా పైకొచ్చి ఆమెపైకి వంగి పెదవులపై పెదవులనాచ్చి ముద్దుపేర పెదవులను చీకడం ప్రారంభించాడు.
లీలకు కంపరమెత్తింది. పైన ఒక బొంతపురుగు వచ్చిపడ్డ ఫీలింగు కల్గింది..ఐతే కోట్ల రూపాయల వ్యవహారం.. అవసరం..సున్నితమైన అత్యున్నతస్థాయి డీల్‌.
ఎందుకో మళ్ళీ రామం గుర్చొచ్చాడు.
‘భూమిపుండులా..ఒకసారి అందులో కూరుకుపోవడం మొదలైందంటే.. కదులుతున్నకొద్దీ యింకా యింకా లోపలికి దిగిపోవడమేగాని బయటికి రావడముండదు లీలా’
తన ముఖంపై వాని ముఖం..తన పెదవులపై వాని పెదవులు..అంతా తడి..ఎంగిలి.. ఛీఛీ..
దాదాపు ఓ ఐదు నిముషాలు వాడు పెదవులను చీకి చీకి.. ఒంటిని తాకి తాకి..తడిమి తడిమి..లేచి..
”థాంక్యూ..ఎవ్రీథింగు విల్బీ డన్‌..”అని.,
రోడ్డుపై దూసుకుపోతున్న బాణంలా లిమో.
”మిస్‌..ఊఁ..లీ..లా..” అని సాగదీసి.. ”గెట్‌ ద కార్‌ రివర్టెడ్‌ టు హోటల్‌ ఎగైన్‌. ఐవిల్‌ గో ఔట్‌..”
వెంటనే లీల ఇంటర్‌కాంలో డ్రైవర్‌కు మళ్ళీ కారును హోటల్‌ విలార్డ్‌కు తిరిగి పొమ్మని చెప్పింది..మహావేగంగా వెళ్తున్న లిమో స్పీడ్‌ కంట్రోల్‌ చేసుకుని ఇంటర్‌స్టేట్‌ 95 పైనున్న దాన్ని మెల్లగా మెత్తగా బ్రిడ్జ్‌పైనుండి యూ టర్న్‌ తీసుకుని డ్రైవర్‌ తిరిగి వరల్డ్‌ బ్యాంక్‌ దాపులోనే ఉన్న విలార్డ్‌ ఖండాంతర స్థాయి హోటల్‌ దారి పట్టించాడు.
లీల టైం చూచుకుంది..హోటల్‌ నుండి తాము బయలుదేరి పద్నాల్గు నిముషాలైంది..అంటే మళ్ళీ తిరుగు ప్రయాణం పద్నాల్గు నిముషాలన్నమాట..
ఈలోగా మళ్ళీ వీడేంజేస్తాడోనని భయం..కంపరం.. రోత.
తెలివిగా.. నిశ్శబ్దంగా..ఏదో ఆలోచిస్తున్నట్టు..కళ్ళుమూసుకుని వెనకి కుర్చీలోకి సాగిలపడి ఒరిగింది..అంటే ‘నన్ను డిస్ట్రర్బ్‌ చేయొద్దు..నేనేదో తీవ్రంగా ఆలోచిస్తున్నాను.’ అన్న ముద్రను ఎదుటి మనిషిపైకి విసిరి..తప్పించుకుంటోందన్నమాట.
వెంటనే.. ఈ వరల్డ్‌ బ్యాంక్‌ అనే వ్యవస్థలోకి ఐదు సంవత్సరాల క్రితం ఒక రాజస్థాన్‌ గవర్నమెంట్‌ అసైన్‌మెంట్‌తో తాను ప్రవేశించిన విషయం గుర్తొచ్చింది లీలకు. కాలుపెట్టే ముందు కేస్‌ను పూర్తిగా అధ్యయనం చేసి లోలోతులను పరిశీలించి ప్రవేశించడం లీల దగ్గరున్న పెద్ద సుగుణం.
డబ్బున్నవాడూ, అధికారంలో ఉన్నవాడెప్పుడూ తన ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించే అనుచర అసురగణాన్ని తన చుట్టూ ప్రతిష్టించుకుంటాడు. అలాగే ప్రపంచంపై డబ్బుతో పెత్తనం చేయాలనే ఒక ప్రచ్ఛన్న సామ్రాజ్యవాద దుష్టవాంఛతో 1944లో తన వైట్‌హౌజ్‌, పార్లమెంట్‌ భవనం దాపులోనే వంద కార్యాలయాలతో 40 అంతస్తుల భవనంతో, పదివేలమందిఉద్యోగులతో వాషింగ్టన్‌ డి.సిలో ఒక అధికారిక కేంద్రాన్ని అమెరికా స్థాపించింది. నామమాత్రపు వడ్డీతో, మానవతా దృష్టితో బడుగు, వెనుకబడ్డ దేశాలను ఉద్దరించాలనే ప్రధాన లక్ష్యంతో నూటా ఎనభై ఆరు ప్రపంచదేశాలను సభ్యులుగా చేసి ”ఇంటర్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (|ఔష్ట్రఈ) మరియు ఇంటర్‌ నేషనల్‌ కాంట్రిబ్యూషన్‌ ఫర్‌ డెవలపింగు కంట్రీస్‌” పేరుతో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇరవై నాల్గుమంది డైరెక్టర్లతో ఒక పాలకవర్గాన్ని, నియంత్రణ సంఘాల్ని తమ చెప్పుచేతల్లో కీలుబొమ్మల్లా ఉండే దేశాల లంచగొండి వ్యక్తులతో నింపి దాని తీర్మాలన్నింటినీ ప్రజాస్వామ్యబద్దంగా చర్చించి ప్రపంచ ప్రజల సంక్షేమం దృష్ట్యా తీసుకుంటున్నట్టుగా ప్రపంచానికి చాటిచెబుతోంది. దాంట్లో ప్రతి పెద్ద దేశ వ్యవహారాలను చూడ్డానికి ఒక అమెరికన్‌ డైరెక్టర్‌గా ఉంటాడు. ప్రస్తుతం వరల్డ్‌ బ్యాంక్‌లో 186 సభ్య దేశాలుంటే బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌ మరియు ఇండియాలకు కలిపి ఒక భారతదేశ ప్రతినిధిఉన్నాడు అభిషేక్‌ ముఖర్జీ అని. పరిశీనలతో తెలిసిందేమిటంటే ఈ నియామకాలన్నీ కూడా వ్యక్తుల ప్రతిభనుబట్టి కాకుండా రాజకీయ ఒత్తిడి, పైరవీ, లంచాల ద్వారా మాత్రమే జర్గుతాయి. ఈ వ్యక్తుల ద్వారానే మిలియన్‌ కోట్ల డాలర్ల అప్పులు, వితరణ, దయాదాక్షిణ్యాలు, చర్చలు.. అన్నీ జర్గుతాయి. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ల కుర్చీలలో మకుటంలేని మహారాజులు. ప్రపంచ శాసకులు. అమెరికా అనే చక్రవర్తికింద అతివిధేయులైన సామంతరాజులు. బానిసలు.
అమెరికా తన మాట వినని దేశాలపై యుద్ధం ప్రకటించి ధ్వంసం చేస్తుంది. సుదీర్ఘకాల దమనకాండ తర్వాత ప్రజలు యిక నిస్సహాయస్థితికి వచ్చి కష్టాలు, కన్నీళ్ళతో కుమిలిపోతున్న దయనీయ సందర్భంలో ఆదుకుంటున్నట్టుగా ప్రపంచ ప్రజలకు ఒక ప్రకటనద్వారా తెలియజేసి ‘పునర్నిర్మాణం, అభివృద్ధి’ పేరుతో యుఎన్‌ఓ వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎమ్‌ఎఫ్‌ సంస్థలద్వారా బిలియన్‌ డాలర్లను అప్పుగా యిచ్చి మళ్ళీ తమ కాంట్రాక్టర్లనే రంగంలోకి దింపి ప్రధానమైన పెద్దపెద్ద పనులన్నీ తమ సంస్థలకే అప్పజెప్పి.. మళ్ళీ మన డబ్బు మన దగ్గరికే..మన అధికారం మనదే..మన అహంకారం  మనదే.. అనే ‘నక్క జిత్తు’ను ప్రదర్శిస్తుంది. దీన్ని సామ్రాజ్యవాదమన్నా, పెత్తందారీ విధానమన్నా, అధికార దురహంకారమన్నా.. యిదివరకు ఎన్నో థాబ్దాలుగా జరిగిందీ అదే. ప్రస్తుతం జరుగుతున్నదీ అదే..మున్ముందు జరుగబోయేదికూడా అదే.
అప్ఘనిస్తాన్‌పై దాడిచేసింది. తాలిబన్ల సమస్య నిజంగా ప్రపంచసమస్యే ఐనా..ప్రపంచ పోలీస్‌ పాత్ర వహించి, ఇటు పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని తానే పెంచిపోషిస్తూ..మళ్ళీ వడ్డీ వ్యాపారమే. ఇరాక్‌పై విరుచుకుపడి, కోలుకోకుండా ధ్వంసంచేసి.. వందల బిలియన్ల డాలర్లను అప్పుగా కుమ్మరించి..మళ్ళీ వడ్డీ వ్యాపారమే.
వ్యవస్థ ఏదైనా..దేశం ఏదైనా..సందర్భం ఏదైనా..బలహీనుని నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వాన్ని శాశ్వత బానిసను చేసి, తన మాటకు ఎదురులేని అధికారిన్ని చెలాయించడమే ..ఉన్నవాడు పుట్టినప్పట్నుండీ లేనివానిపై చేస్తున్న ప్రచ్ఛన్నదాడి. సంపన్నుడు బీదవానిపై దౌర్జన్యం. దీన్ని ప్రతిఘటించేందుకు మానవ చరిత్ర నిండా ఎన్నో యుద్ధాలు, ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో ఉద్యమాలు..ఎంతో రక్తపాతం.
ఐనా వ్యవస్థ మారిందా..మారుతున్నట్టనిపిస్తోందా..మారే సూచనలేమైనా కనిపిస్తున్నాయా..ఉహుఁ..నానాటికీ యింకా దిగజారిపోతున్నాయేమో.
అసలు 1778లో బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌. థామస్‌ జఫర్సన్‌ అనే ముగ్గురు వ్యక్తులు కూర్చుని రూపొందించిన అమెరికా రాజ్యాంగమే ఈ అధికార కేంద్రీకరణకూ, పెత్తందారీతనానికి వీలు కల్పిస్తూ ఆర్థిక విధానాన్ని స్పష్టంగా నిర్వచించింది. అవే..అమెరికా యొక్క కాపిటలిస్ట్‌ ఎకానమి, మార్కెట్‌ ఎకానమీ. వీటి ప్రకారం ప్రైవేటీకరణ అనేది వేళ్ళూనుకుని ఊడలుపారి పాతుకుపోయింది. రెండువందల సంవత్సరాలకు పైగా. సర్వసంస్థలన్నీ ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలోనే ఉంటాయి..వ్యాపారాలన్నీ ప్రైవేట్‌ సంస్థలే నడుపుతాయి..కాని అందరి జుట్టుమాత్రం ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఫిలడల్ఫియా రాష్ట్రంలోని పెన్సెల్వీనియా రాష్ట్ర నయగరాగా పిలవబడే ‘బుష్‌కిల్‌ జలపాతం’ దాని చుట్టు ప్రక్కలున్న అడవి అంతా ఒక కుటుంబానికి చెందిన .. వ్యక్తికి చెందిన ప్రైవేట్‌ ఆస్తి అని తెలుసుకుంటే మనం ఆశ్చర్యంతో కొయ్యబారిపోతాం.
”ఇటీజ్‌ రైనింగు లైక్‌ దిస్‌ సిన్స్‌ మార్నింగు..వెన్‌ డిడ్యూకం టు అమెరికా..”అన్నాడు జాఘా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏదో ఒకటి మాట్టాడాలని..లీలనుద్దేశించి.
పరధ్యానంగా..ఏదో లోకంలో మునిగి ఉన్న లీల ఉలిక్కిపడి…”యయ.. జస్ట్‌ ఫ్యూ అవర్స్‌ ఎగో.. ఐ విల్‌ బిఫ్లయింగు బ్యాక్‌ టు ఇండియా టునైటెగైన్‌” అంది జలజలా.
”ఓ…”
లిమో విలార్డ్‌ హోటల్‌ పార్కింగు యార్డ్‌లోకి ప్రవేశించింది. కారు ఆగగానే కదలకుండా లీల తన సీట్లో అలాగే కూర్చుంది కావాలనే. జాఘా లేచి.. నెత్తికి రూఫ్‌ తాకకుండా ఒక మెరుపువలె తన ప్రక్కన చేరి.. మళ్ళీ పైకివంగి కనురెప్పపాటు కాలంలో పెదవులపై పెదవులనుంచి గట్టిగా అదిమి ముద్దుపెట్టుకుని..,
‘ఛీ ఛీ.. మొద్దు ముండాకొడుకు..’ అని అనుకుంటూండగానే,
”బై బై..కంప్లీట్‌ ది ట్రాన్స్‌ఫర్‌ ప్రాసెస్‌ అండ్‌ రిపోర్ట్‌ సూన్‌.. బైబై..” అని లిమో దిగి చకచకా వెళ్ళిఫోయాడు పోర్చ్‌లోకి.
అంటే లంచం డబ్బును వాడి రహస్య అకౌంట్లలోకి వెంటనే బదిలీ చేయమని.,
అప్రయత్నంగానే లీల కార్లో..ఫ్లోర్‌ఫై తుపుక్కున ఉమ్మేసింది.
అసహ్యం కలిగింది.
ఎవరిపైన..జాఘాపైననా..తనపైననా..తను చేస్తున్న పనిపైననా. ఈ వ్యవస్థపైననా,
లిమో మళ్ళీ బయల్దేరింది ఇంటర్‌ స్టేట్‌ తొంభై ఐదుపై.. కాల్చబడ్డ తుపాకీ గుండులా.
ముడుచుకుపోయిన పువ్వులా..మురుక్కాలువలోపడ్డ వాన చినుకులా..పైన ఏదో వికారమైన పురుగు ప్రాకిన తర్వాత మిగిలే వికారమైన అనుభూతితో..లీల.
ఏమిటిది..ఛీ ఛీ.,
ఎందుకో లీలకు చటుక్కున దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్లు జలజలా రాలాయి..చలించిపోతోంది గాలిలో సన్నని కాగితం రెపరెపలాడ్తున్నట్టు.,
మనసంతా స్తబ్దత..ఎవరో నెత్తిపై సుత్తితో కొట్టినట్టు
ముందు కాన్ఫెరెన్స్‌ టేబుల్‌పై సైలెంట్‌ మోడ్‌లో నున్న తన మొబైల్‌ తెరపై కాల్‌ వస్తున్న సూచనగా బ్లింకవుతున్నట్టు కనిపిస్తోంది. అనాసక్తంగా చేతిలోకి తీసుకుని ఎత్తింది. ముఖ్యమంత్రి చాంబర్‌నుండి పర్సనల్‌ సెక్రటరీ మంజుల.
”హలో..గుడ్మార్నింగు మేం..”సన్నని మధురమైన గొంతు.
అక్కడ ఇండియాలో.. టైం ఎంతై ఉంటుంది..యిక్కడ రాత్రి..పదిం…అక్కడ ఉదయం ఏడున్నర దాటి..ఊఁ..
”గుడ్మార్నింగు మంజూ..చెప్పండి.”
”మీరు నిన్న సార్‌తో మాట్లాడిన వరల్డ్‌ బ్యాంక్‌ మున్సిపల్‌ బాపతు ఫండ్స్‌ శాంక్షనైతే…రెండుగంటల తర్వాత మీడియా మీటింగు పెట్టి తను ఎంతో కష్టపడి ప్రపంచ బ్యాంక్‌ అధికారులను ఒప్పించి బడుగు వర్గాల, మురికి వాడల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్‌ నిధులు పదిహేను వందలకోట్లను సాధించినట్టు పత్రికా ప్రకటనను జారీ చేస్తారు. వెయిటింగు ఫర్‌ యువర్‌ క్లియరెన్స్‌”
”ఆఁ.. మంజూ..ముఖ్యమంత్రిగారు పత్రికా ప్రకటన ఇవ్వవచ్చు. మూడువందల మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని ముప్పది సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించే .. కావలిస్తే మరో పది సంవత్సరాల గ్రేస్‌ పీరియడ్‌తో ఋణాన్ని ప్రపంచబ్యాంకు మంజూరు చేసింది. దీన్ని అధికారికంగా అనౌన్స్‌ చేయొచ్చిక. ఒక గంట క్రితమే క్లియర్‌ చేయించా..గో ఎహెడ్‌.”
”థాంక్యూ లీలగారూ..మీరు ఎప్పుడు ముఖ్యమంత్రిగారిని కలుస్తారు”
”ఆఫ్టర్‌ టు డేస్‌..ఎట్‌ ఢెల్హీ”
”థాంక్యూ..ఓకే..మేమ్‌” ఫోన్‌ పెట్టేసిన చప్పుడు.
నుదిటిపై పడ్తున్న ముంగురులను పైకి తోస్తూ..’ఏమిటీ జీవితం’ అనుకుంది లీల.
సరిగ్గా అప్పుడే మళ్ళీ మొబైల్‌ బ్లింక్‌ ఐంది.
”హలో..”
”రాబర్ట్‌ హియర్‌ మేం.”
వెంటనే..తను కొద్దిగంటల క్రితం వాషింగ్టన్‌ డి.సి డెల్లస్‌లో విమానం దిగడం..చెకౌట్‌ టైంలో.. టెక్సాస్‌ కంపెనీ.. త్రెట్‌.. నిర్మల హెచ్చరిక..తమ ఏజంట్‌..రాబర్ట్‌కు తెలియకుండా నిర్మలచే నియమించబడ్డ ప్రైవేట్‌ సెక్యూరిటీ..అంతా జ్ఞాపకమొచ్చింది లీలకు చకచకా.
”టెల్మీ”..
”దట్‌ టెక్సాస్‌ బాస్టర్డ్‌ హాజ్‌ బీన్‌ కిల్డ్‌ మేం..ద డెడ్‌ బాడీ యీజ్‌ డ్రాప్డ్‌ యిన్‌ పొకొనొ డీప్‌ ఫారెస్ట్‌ ఎట్‌ ఫిలడెల్ఫియా .. నథింగు టు వర్రీ మేం..యుకెన్‌ బ్రీత్‌…”
”ఓ..ఓకే..థాంక్యూ”
లైన్‌ తెగిపోయింది.
ఒక హత్య..ఒక కుట్ర..ఒక కుతంత్రం..చుట్టూ సుఖాలు, సౌకర్యాలు, అధికారం, అహంకారం..ఏమిటిదంతా,
”డ్రైవర్‌ హారీ..”
”యస్‌ మేం..”
”స్ట్రయ్‌టెవె గోటు అవర్‌ హోటల్‌ లోయిస్‌..అన్నెపోలిస్‌..ఓకే..”
”ఓకే మేమ్‌..”
”ఐయామ్‌ స్లీపింగు..డోన్డ్‌ డిస్ట్రబ్‌మి.”
”రైట్‌.. ”
లీల మనసు కల్లోల సముద్రంలా ఉంది. సముద్ర తీరంపై తను..ఎదురుగా భీకర శబ్దంతో అలలు.. ఎత్తయిన నీటిగోడ వచ్చీవచ్చీ తలను తీరానికి బాదుకుని..చిట్లి, చెదిరి..పగిలి..కకావికలై,
అలా ఎన్నిసార్లు.. ఎన్నిసార్లు సముద్రం ఒడ్డుపై గంటలగ్గంటలు ఒంటరిగా కూర్చుందో తను సముద్రంలోకి చూస్తూ. తనకు అత్యంత యిష్టమైన పనుల్లో అలా ఏకాంతంగా సముద్రంతో గడపడం మొదటిది.
దూసుకుపోతున్న లిమో కారు కిటికీ అద్దాన్ని కొద్దిగా, బయటికి చూచేందుకు  ప్రయత్నించిది లీల. నల్లగా చీకటి. కత్తిలా విసురుగా దూసుకు వచ్చిన గాలి. భయంకరమైన గాలి చప్పుడు..చిక్కగా వాన. ప్రక్క అదే రోడ్డుపై వందల సంఖ్యలో రేస్‌లోలా ఒకదాన్నొకటి దాటుకుంటూ పరుగెత్తుతున్న కార్లమందలు – తెల్లగా హెడ్‌ల్యాంప్స్‌. అటు ప్రక్కన ఎర్రని నిప్పుల సముద్రంలా టెయిల్‌ ల్యాంప్స్‌. బయటంత బీభీత్స వాతావరణం.. ఉద్విగ్నత.. లిప్తకాలమే ఐనా భరించలేక వెంటనే, మరుక్షణం కిటికీ అద్దాన్ని ఠక్కున మూసేసింది.
మళ్ళీ లోపల నిశ్శబ్దం.
కారు బయట బీభత్సం..లోపల నిశ్శబ్దం.
మనిషి బయట బీభత్సం..లోపలకూడా బీభత్సమే..బీభత్సమా అది..ప్రళయంకదా.
కళ్లు మూసుకుంది.
తను హైద్రాబాద్‌నుండి బయలుదేరిన దగ్గర్నుండి ఆరు కేసుల పరిష్కరణ. రెండు హత్యలు..ముప్పయి నలభై కోట్లకు పైగా ఆర్థిక లాభం రాగల లావాదేవీలు..ఎన్నో చాలెంజెస్‌..చదరంగం ఆటలోలా ఎత్తులు..వ్యూహాలు..కదలికలు.. ఏదో గర్వమనిపించే గెలుపు..ఐనా అర్ధంకాని ఓటమి.
కన్నంటుకుంది లీలకు..చటుక్కున గాఢనిద్రలోకి జారిపోయింది. లిమో కారు కాన్ఫరెన్సింగు సీట్‌ను స్ట్రెచ్‌ చేసుకుని ఒరిగి పడుకుంటే మెత్తని మంచంపై పడుకున్నట్టే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
లిప్తకాలంలో ఓ గాఢ స్వప్నం విచ్చుకుంది.
అది.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో..అట్లాంటిక్‌ స్మశానంగా ప్రపంచ ప్రసిద్ధిచెందిన ‘బెర్ముడా త్రికోణం’. అల్పపీడనమో, మనుషులకు ఇంతవరకు బోధపడని భౌతికేతర ఏ ప్రాకృతిక కారణమో, శాస్త్రాలకు ఇంతవరకు బోధపడని ఏ అహేతువో.. కొన్ని కిలోమీటర్లమేర వ్యాపించిన ఒక సువిశాల సముద్రతలంనుండి ఆకాశాంతరాల్లోకి వ్యాపించిన ఒక అదృశ్య జలశూన్యం. ఇంతవరకు ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన విమానాలు, నౌకలు ఏవైనా నమ్మశక్యంకానివిధంగాసుళ్లుతిరిగి అదృశ్యమై శాశ్వతంగా మళ్ళీ కనబడకుండా బెర్ముడా త్రికోణంలోకి కనుమరుగైపోవడం..ఒక మాయవలె, మంత్రంవలె.. అపార జలనిధిలోకి మహాభినిష్క్రమణం..ఎవరికీ అంతుపట్టని చిత్రం. శాస్త్రానికందని వింత. ‘బెర్ముడా త్రికోణం’ ఒక జలస్మశానం.
తను.. ఎక్కడనుండో..ఒక వర్షపు చినుకులా ఆకాశంలోనుండి రాలిపడి..ఒక మహాశూన్యంలోనుండి తెగిన చుక్కలా రాలి రాలి..చుట్టూ అంతా శూన్యం..ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి..ప్రాణం బిగబట్టుకున్న శరీర స్తంభన..వస్తోంది..క్రిందికి.. యింకా క్రిందికి..సర్‌ర్‌ర్‌న..,
వచ్చీ వచ్చీ..ఒక శూన్యనాళికలోకి ప్రవేశించినట్టు..క్రింద భీకరంగా సముద్రం..చుట్టూ సుడితిర్గుతున్న బలమైన గాలిగొట్టం.. పైకి లేచి, కిందికి నెట్టబడి..మళ్ళీ ఎత్తుకు ఎగిరి..ఈడ్చి క్రిందకు తన్నబడి..కొట్టుకుపోతోంది తను..మనిషి ఒట్టి కాగితపుముక్కకన్నా, ధూళికణంకన్నా అధ్వాన్నంగా ఎక్కడకో తరుమబడ్తోంది…పాతాళంలోకి, మళ్ళీ ఆకాశగర్భంలోకి.. సముద్రంలోకి.,
చటుక్కున సముద్రంలోకి.. యింకా లోలోకి..అందనంత లోతుకు..చిక్కని నీలి నీళ్ళలోకి కూరుకుపోతూ.. మునిగిపోతూ, కొట్టుకుపోతూ..
ఊపిరాడ్డంలేదు..శరీరం స్తంభించిపోతోంది. గాలి అందడంలేదు. శ్వాసాగిపోతోందా?
భయంతో ఉలిక్కిపడి. మెలకువ వచ్చి.,
తనింకా జీవించే ఉందా..చచ్చిపోయిందా..జలసమాధి ఐపోయిందా. ఆ బీభత్సం..ఆఁ.. ఆఁ..
లీల ఉలిక్కిపడి..భయంతో కంపించిపోతూ..ఒళ్ళంతా చెమటతో నిండిపోయి..గుండె దడదడా కొట్టుకుంటూ.,
‘అబ్బా..యిది కలా..హమ్మయ్య’ మెల్లమెల్లగా,
స్పృహ. వాస్తవం…తెలివి..మెలకువ..స్పృహ..స్పృహ..,
కల చెదిరింది..హమ్మయ్య.. తను చావలేదు..బతికేఉంది.
లిమోకారు యింకా పోతూనే ఉంది..గర్జించుకుంటూ..
బయటికి చూచి..కారు ఎక్కడుందో గుర్తుపట్టేందుకు ప్రయత్నించింది.
దూరంగా..లోయిస్‌ హోటల్‌ కన్పిస్తోంది..సరిగ్గా అప్పుడు లీల మొబైల్‌ ఫోన్‌ మ్రోగింది..బ్లింకవుతూ.
స్క్రీన్‌పై చూస్తూ స్విచ్‌ నొక్కింది..’రామం’
ఓహ్‌ా రామం..రామం..తను యిష్టపడే..తను ఆరాధించే తన మనసునిండా నిండి ఈ ప్రపంచంలో తనకు తప్ప ఎవరికీ తెలియని అదృశ్య, అజ్ఞాత వ్యక్తి రామం.
”రామం..”అంది ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ.
తను అమెరికానుండి ఇండియాకు వెళ్ళేలోగా రామం ఇక ఫోన్‌ చేయడనుకుంది. కాని చేశాడు..తనకోసం రామం ఫోన్‌ చేశాడు.
అప్పుడు లీల ఆకాశంలో ఎగుర్తున్న పక్షి.,
”లీలా..చెప్పు”
”రేపుదయం ఆరుగంటల ఫ్లైట్‌లో వాషింగ్టన్‌ డి.సి.డల్లెస్‌ నుండి ఇండియా వెళ్ళిపోతున్నా రామం”
”అసలిప్పుడు నువ్వు యుఎస్‌లో ఉన్నావా”
”ఔను.. ఐదు గంటల క్రితం వచ్చాను…ఉదయం వెళ్తున్నా”
”ఎక్కడున్నావ్‌”
”అన్నెపోలిస్‌.. హోటల్‌ లోయిస్‌..ఒక్కసారి మనం కలవాలి రామం. ప్లీజ్‌”
”అవసరమా లీలా”
”ఔను చాలా అవసరం”
”సరే.. రేపు ఉదయం ఒక గంటముందుగా..ఏర్‌పోర్ట్‌కు రా. నేను చెప్పిన టైంకు ముందు. అంటే, నాలుగ్గంటలకువిజిటర్స్‌ లాంజ్‌లో కలుస్తా..సరేనా..”
”ఓకే.. థాంక్యూ రామం. థాంక్యూ వెరీమచ్‌..”
”మంచిది లీలా..గుడ్‌నైట్‌”
మొబైల్‌ లైన్‌ తెగిపోయింది. ఏదో ఒక విద్యుత్‌ ప్రవాహం ఆగిపోయి, అదృశ్యమైన ఒక జీవవాహకం మరుక్షణమే మృతవాహకంగా మిగిలిపోయినట్టు., ఏదో ఖాళీ..శూన్యం. ఐనా రామం తనకు తాను ఫోన్‌చేసి మట్లాడినందుకు ఆమెకు ఏదో చెప్పలేని ఒళ్లంతా పులకింత..తృప్తి..సంతోషం..ఉద్వేగం.
రామం రేపుదయం తనకు కనబడ్తాడు..రామం రేపుదయం తనతో మాట్లాడ్తాడు. రామం రేపుదయం తనతో ..,
ఏదో హాయి.
లిమో కారు నెమ్మదిగా..మెత్తగా లోయిస్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ పోర్టికోలో ఆగుతోందిక..అబ్బా ఎంత హాయో..
లీల అప్పుడే పూర్తిగా విచ్చుకుంటున్న కలువలా పరవశించిపోతూ.,
టైం చూచుకుంది లీల లిమోనుండి క్రిందికి దిగుతూ
పదకొండూ నలభైనిముషాలు.

(సశేషం)

–రామా చంద్రమౌళి

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 9 వ భాగం

( గత వారం తరువాయి)

9

ఒక స్వరం కావాలిప్పుడు..ఒక గొంతు కావాలిప్పుడు. ఒక అంతర్ఘర్షణతో నిత్యం కుతకుత ఉడికిపోయే మనిషి తన అంతఃచేతనలో నుండి, తన ప్రజ్వలిత అంతర్లోకాల్లోనుండి భువి నుండి దివికి ఒక నభోపర్యంత కాంతిస్తంభమై ప్రకాశించగల వ్యక్తిత్వంతో భాసిల్లే ఒక ఆత్మధ్వని కావాలిప్పుడు.
కాలానికి ఒక ధర్మం ఉంది..ఒకే ఒక ధర్మం…దేన్నయినా సరే వృద్ధిపరచడం, క్షయింపజేయడం..యివి భౌతికంగా బయటికి కనిపించేవి.. చెట్టు చిగురించడం..మళ్ళీ ఆకులు రాలడం..కాలం గడుస్తున్నకొద్దీ ఏదైనా ఉదయించడం..ఒక నియమితకాలం గడవగానే అస్తమించడం..ఐతే అభౌతికంగా, అదృశ్యంగా నిరంతరం కాలం ప్రకృతి ధర్మాలకనుగుణంగా సకల చరాచర స్పష్టినంతా నియంత్రిస్తూ పోతూండడం..ఈ అతి ప్రధానమైన క్రియ అసలే కంటికి కనబడకుండా పూర్తి  ఒక అజ్ఞాత జీవచర్యగా కొనసాగుతూండడం..లేకుంటే..సరిగ్గా..కోడిగ్రుడ్డును పొదిగిన ఇరవై ఒకటవ రోజునే ఎందుకు కోడిపిల్ల  జీవాన్ని పోసుకుని కళ్ళుతెరుస్తుంది..ఇరవైయవ రోజో, ఇరవై రెండవ రోజో ఎందుకు ఈ జననం సంభవం కాదు. కాలం..కాలం.. విలువైన, శక్తివంతమైన, ఎవరికీ ఎప్పుడూ బోధపడని అతి విచిత్రమైన ఒక మితి..డైమెన్షన్‌..సర్వ సృష్టినీ శాసించే శక్తి.
రెండు కార్లు పోతున్నాయి..ఒక దానివెంట ఒకటి. ముందు రామం కారు. వెనుక క్యాథీ ఆడి కారు..బయట కుండపోతగా వర్షం. జర్మన్‌టౌన్‌ సెంటర్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌ నుండి ఓవల్‌నెస్ట్‌ సర్కిల్‌లో ఉన్న రామం ఇంటికి డ్రైవ్‌.. ఎదురుగా ఎర్రగా సిగ్నల్‌..
”ఆగుము..వేచి చూడుము..పొమ్ము”
‘దారి తెలుసుకుని..దారి స్పృహ కలిగి..నియమిత వేగంతో..ఆగి..చూచి..వేచి..సాగి..పొమ్ము..’
కావడి కొయ్యేనోయ్‌..కుండలు మన్నేనోయ్‌..కనుగొంటే సత్యమింతేనోయి,’
అసలీ కనుగొనడమేమిటి..జీవితాన్ని కనుగొనడం, దారిని కనుగొనడం, చీకటిని కనుగొనడం, వెలుగును కనుగొనడం.. చివరికి ఎవరివారు తనను తాను కనుగొనడం.. కనుగొనలేకపోవడం..కనుగొనలేక దుఃఖించడం.,
బుద్దుడు, అశోకుడు..సోక్రటీస్‌, ప్లేటో..పైథాగరస్‌..గెలీలియో..కోపర్నికస్‌..మహాత్మాగాంధీ..అందరూ ఎన్నోసార్లు.. ఎన్నో సందర్భాల్లో అరచి అరచి నినదించి అనేకానేక పరమసత్యాలను చెప్పినా..ఎవరూ వినకుండా..ఎవరిదారిన వాళ్ళు విముఖులై పారలౌకిక ప్రపంచం నిషాలో నిద్రిస్తున్నపుడు..మేల్కొలిపి..మేల్కొలిపి..అలసి.,
దుఃఖించడం..నిస్సహాయంగా, నిరామయంగా, అనివార్యమై దుఃఖించడం ఏమిటిది.. ?
మళ్ళీ మేనేజ్‌మెంట్‌ గురు స్టీపెన్‌ కోవె జ్ఞాపకమొచ్చాడు క్యాథీకి..అద్భుతమైన పుస్తకం ‘ఎనిమిదవ అలవాటు’ – ది ఎయిత్‌ హాబిట్‌..ఏమంటాడంటే..తనను తాను తెలుసుకోమంటాడు మనిషిని. ఐతే కోవె చెప్పిన కొత్త విషయాలేవీ కావివి.. అన్ని యిదివరకు తెలిసినవే..అన్నీ ఇదివరకు చెప్పబడ్డవే. అన్నీ జ్ఞానులైన మహానుభావులు ఇదివరకే గ్రంథస్థంచేసి ఒక ఆధ్యాత్మిక సంపదగా మనకందించి ఉంచినవే.
ఐతే.. పాతవాటినే..మళ్ళీ జ్ఞాపకంచేసి, మళ్ళీ తవ్వితీసి..మళ్ళీ వ్యాఖ్యానించి..మళ్ళీ మెరుగుపరిచి…రిటోల్డ్‌.. రీసర్చ్‌.. రీ కామెంట్‌..రి…రి….రీ పెయిర్‌.,
మనుషులందరూ దుఃఖిస్తున్నారు.. ఔనా, దుఃఖమునకు మూలం కోరిక..’ అనికదా బుద్ధుడు చెప్పింది..
ఇప్పుడు..ఎవరినడిగినా.,
‘నేను సంతోషంగాలేను..నాకు ఉద్యోగం లేదు.’
‘నాకు చాలినంత డబ్బులేదు’
‘నాకు అధికారం లేదు’
‘నేను చేస్తున్న వృత్తి నేను చేయదగిందికాదు. కాని విధిలేక చేస్తున్నాను.. షిట్‌’
‘నేను ఎంతో ప్రతిభావంతున్ని-కాని నన్నెవరూ గుర్తించట్లేదు’
‘అబ్బా నేను అలసిపోయాను-నా జీవితమంతా ధ్వంసమైపోయింది. ఇప్పుడెలా’
‘నాకవకాశాలు లేవు.. ఉంటే నా ప్రతాపం చూపించేవాణ్ణి’
‘నా భార్య నా మాట వినదు-నా ఇల్లొక నరకం’
‘నా పిల్లలు దరిద్రులు-ఎంతో కష్టపడి పెంచితే విశ్వాసఘాతకులై మిగిలారు’
‘అన్నీ ఒట్టి కలలే..అవి సాకారమయ్యే అవకాశాలే లేవు’
‘ఈ అవినీతికర భారతదేశంలో హాయిగా అందరూ చేతికందినంత మేరకు దోచుకుంటూ, తప్పించుకు తిరుగుతూ రాజాలా బ్రతుకుతున్నారు.. నేనేమిటి ఈ దరిద్రం’
అన్నీ ఇవే.. ఎక్కడ విన్నా యివే గొంతులు..యిటువంటివే అందరి అసంతృప్తి స్వరాలు.. యివే ఆరోపణలు.. యివే ఆత్మఘోషలు.
వీటన్నిటికీ మూలం..నొప్పి..పెయిన్‌..వేదన..అసంతృప్తత..ఫలితం అశాంతి..దుఃఖం
ఈ దుఃఖాన్ని అధిగమించి మనిషికి శాశ్వతమైన స్వాంతనను చేకూర్చగల శాంతికావాలి..ఎక్కడుందది..ఎలా దొరుకుతుందది.
అన్వేషణ..ఎడతెగని అన్వేషణ..నిరంతరాన్వేషణ.
కోవె అంటాడు ‘ఇప్పుడొక గొంతుకావాలి..మనిషి తనను..తన ఆత్మికమైన అంతరంగాన్ని, హృదయాన్ని తెలుసుకుని తననుతాను వ్యక్తీకరించుకోగలిగే ఒక స్వరం కావాలి..ది ఎయిత్‌ హాబిట్‌..తనను తాను నిరంతరం స్పృహలో ఉంచుకుంటూ, సచేతనంగా పదునుపెట్టుకుంటూ కొనసాగుతూనే..ఆత్మను ఒక స్వరంగా వ్యక్తీకరించుకోగల అద్భుతమైన అలవాటును మనిషి నేర్చుకోవాలి..ఒక తన స్వరాన్నే కాదు ఎదుటి మనిషి హృదయాన్ని కూడా స్వరంగా వినగల సహనంతో కూడిన సంస్కారంకావాలి.’
ఆకుపచ్చలైటు వెలుగుతూండగా..కార్లు దూసుకుపోతూ..క్యామ్‌ ఫ్రీ..రాయల్‌ క్రౌన్‌..మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..
ఎదురుగా బ్రూక్‌ ఫీల్డ్‌..ఓవల్‌ నెస్ట్‌ సర్కిల్‌.,
పెద్ద.. విశాలమైన..అట్టహాసాలేవీ లేని ఒక ఇంటిముందు..గ్యారేజ్‌ ఎదుట రెండు కార్లు ఆగి.,
‘నిరాడంబరత అనేది మనిషి తనను తాను పరిత్యాగించుకోవడానికి మొదటి సాధనం క్యాథీ’ అని ఎన్నోసార్లు రామం చెప్పిన వాక్యం జ్ఞాపకమొచ్చిందామెకు.
క్రమక్రమంగా దేన్నైయితే మనిషి మక్కువపడి మోహంతో, ఒక అలవాటును స్వంతంచేసుకున్నాడో దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వదులుకోవడమే పరిత్యాగమైతే..దేన్నయినా పరిత్యాగించడం అంత సుళువైన విషయమేమి కాదు. సుఖాలు, ఆడంబరాలు, అలంకారాలు, ధన, కామ, జిహ్వసంబంధ సర్వకామనలన్నీ మనిషిపై రాక్షస సమూహంలా దాడిచేసి ఆవహించిన తర్వాత లొంగి వివశమైపోవడంతప్ప ఒక్కోదాన్ని త్యజించి బయటపడడం దుర్లభం.
రామం. దేనికీ ఆధీనుడైపోయినట్టుగానీ, వశుడై లొంగిపోయినట్టుగానీ, బానిసైపోయినట్టుగానీ ఏనాడూ కనిపించలేదు సరికదా.. అన్నింటికీ అతీతుడై స్థిరపడినట్టే అనిపిస్తుందెప్పటికప్పుడు.
కారు దిగి.. తలుపులు తెరిచి..లైట్లు వేసి..క్యాథీకోసం స్వింగు డోర్‌ను ఇంకా తెరిచి పట్టుకున్నాడు.
క్యాథీ ప్రక్కనున్న ఎగ్జిక్యూటివ్‌ బ్రీఫ్‌ను చటుక్కున తీసుకుని..క్షణకాలంలో ఒత్తుగా కురుస్తున్న వర్షపు చినుకుల్లోనుండి లోపలికొచ్చేసింది.
రామంది విశాలమైన యిల్లు..ఎంతో యిష్టపడి..తను చేసే ప్రతిపనికి ఉత్తేజాన్నందించే వాతావరణాన్ని సమకూర్చేటట్టుగాపెద్ద హాల్‌లోని ప్రతి వస్తువునూ అమర్చుకున్నాడు.
అంటాడు..”మనకు తెలియకుండానే మనం పనిచేస్తున్న ప్రాంత వాతావరణయొక్క ప్రభావం మన మీద చాలా గణనీయంగా ఉంటుంది క్యాథీ. మంచి సాధకుడెప్పుడూ తన పరిసరాల్ని తను చేయబోయే పనికి అనుగుణంగా రూపొందించుకోవాలి.” అని.
ఏదో చిత్రమైన మోహకమైన పరిమళం అనుభవంలోకొచ్చింది. అన్నింటికంటే శక్తివంతమైన నిశ్శబ్దం.. సన్నని వానచినుకుల చప్పుడు.. పల్చని లేత వెలుగు.. హాయిగా ఉంది.. అంతా.
తెగిపోయిన ఒక ఎగ్జిక్యూటివ్‌కు ఉండవలసిన ఎనిమిదవ అలవాటు ‘మనిషికి ఉండవలసిన స్వంతగొంతు’ గురించి మళ్ళీ జ్ఞాపకమొచ్చిందామెకు. నిజానికి ప్రతి మనిషియొక్క వేలిముద్ర, ప్రతి జీవియొక్క నాడీస్పందన తాలూకు తరంగం భిన్నభిన్నంగా ఉన్నట్లే ప్రతి మనిషి యొక్క స్వరం కూడా భిన్నంగా ఉంటుందనీ, ఏ ఇద్దరి స్వరాలూ ఒకేరకంగా ఉండవనీ, స్వరం ఎవరిదైనా వాని అనివార్యతతోకూడిన అవసరం, ప్రతిభ, కాంక్షాతీవ్రత మరియు ఆత్మలయొక్క సమీకృత సంకేతంగా వెలువడ్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. స్వరం, స్వభావం, తీవ్రత, ప్రభావం సందర్భాన్నిబట్టి మారుతాయి కాని మూల లక్షణం మారదు. దాని మాడ్యులేషన్‌ మారదు.
చాలా ఉద్విగ్నంగా ఉంది క్యాథీకి.
రామం ఎదురుగా ఉన్న సింగిల్‌సీటర్‌ సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్న మరుక్షణమే చేతికిందున్న స్విచ్‌ను ఆన్‌ చేయడంవల్ల హాల్లో ఒకేసారి రెండుమూడు లైట్లు వెలిగాయి. వాతావరణం కూడా చిక్కని, తెల్లని పాలనురుగువంటి కాంతితోనిండి  జీవవంతమైంది.
సరిగ్గా అతనికి ఎదురుగా ఉన్న మరో విలువైన సింగిల్‌ సీటర్‌ సోఫాపై క్యాథీ కూర్చుని మోకాళ్ళపై తన బ్రీఫ్‌ను పెట్టుకుని తెరిచింది.
ఎంతో ప్రధానమైతే తప్పితే రామం ఎవరినీ యింటికి ఆహ్వానించడు. తనకు తెలిసి ఒకసారి లయన్‌బ్రిడ్జ్‌ సిఇఓ పీటర్స్‌ రాండ్‌, కాగ్నిజెంట్‌ విపి విలియం చుఫ్‌ను ఒక్కోసారి విడివిడిగా పిలిచాడు. అతి విలువైన వ్యక్తులు అతి ఖరీదైన కార్లలో తెగిన చుక్కల్లా అప్పుడప్పుడు రామం ఇంటికి వస్తూండడం, ఆ కాలనీ వాసులను ఆశ్చర్యపర్చడం క్యాథీకి తెలుసు.
”క్యాథీ.. ఈ వర్షంకురుస్తున్న రాత్రి నీకూ, నాకూ..మనిద్దరి భవిష్యత్తుకూ ఎంతో ప్రధానమైంది. చారిత్రాత్మకమైంది. నీకు ఇప్పటికే నేనిచ్చిన ఎజెండా ప్రకారం మనం చర్చించబోయే అంశాలు ఎంతో విలువైనవి. కీలకమైనవీ.. ఒక దేశానికి చెందిన కోట్ల ప్రజల జీవితాలను సమూలంగా ప్రభావితం చేసేవి. ఇప్పుడు నువ్వు జీవానివి.. ప్రాణానివి.. చేతనవు.. నడిపే మార్గదర్శివి..నేను శ్రోతను. శరీరాన్ని..ఆయుధాన్ని..కర్తను..నీవు పూర్ణ స్ఫూర్తివి..ఊఁ..కానీ..”అన్నాడు.
ఆ క్షణం రామం ముఖం అప్పుడే ఉదయిస్తున్న శిశుసూర్యునిలా ఉంది.
సరిగ్గా అప్పుడు ఎనమిది గంటల పన్నెండు నిముషాలైంది. ఒకగంట తమ సమాగమం. క్యాథీ ఒక ప్లాస్టిక్‌ ఫైల్‌ను బయటికితీసి మోకాళ్ళపై పెట్టుకుని..తెరిచి…కొన్ని కాగితాలను చదివేందుకు అనువుగా సర్దుకుని అంది…
అప్పుడు తెల్లని కాంతితో ఎదురుగా నిర్మలహృదయంవల్ల వెలిగిపోతున్న క్యాథీ ముఖాన్ని ఓ లిప్తకాలం చూచి.. రామం గంభీరంగా కనురెప్పలను మూసుకున్నాడు. ఆ క్షణం అతనిలో ఏదో వెలుగు పొటమరించి..మొలకై…విప్పారి.. విస్తరించి.,
యోగ సూత్రాలను ప్రవచించిన పతంజలి ఏమన్నాడంటే..’ఒక అసాధారణమై సాధించవలసిన లక్ష్యం గొప్ప బాధ్యతగా మనను ఉత్తేజపరుస్తున్నప్పుడు మనిషియొక్క సర్వచింతనలూ శకలాలు శకలాలుగా విడిపోయి హద్దులనధిగమించి మగ్నమైన మనసు సమస్తావధులను అతిక్రమిస్తుంది. అప్పుడు ఆత్మ బహుముఖమైన అన్ని దిశల్లో విస్తరించి ఒక కొత్త మహోన్నతమైన అద్భుతప్రపంచాన్ని కనుగొనేలా మనిషిని ఉద్యుక్తుణ్ణిచేస్తుంది. అని..ఇప్పుడు మనకు ఈ ప్రాణతుల్యమైన ప్రవచనమే మార్గదర్శి రామం’ అంది ఒక అశరీర వ్యవస్థ మాట్లాడ్తున్నట్టుగా.
రామం సమాధిలో ఉన్న వ్యక్తిలా ”అవును” అన్నాడు.
”ఇంకో ప్రధానమైన విషయాన్ని చెబుతాను రామం..మనలో కొద్దిమంది మాత్రమే గొప్ప పనులు చేయగలరు. కాని మనందరం గొప్పవికాని ఎన్నో మామూలు పనులను తప్పకుండా చేయగలం..గొప్ప ప్రేమతో..అంది మదర్‌ తెరేసా. ఇది మన భవిష్యత్‌ కార్యకలాపాలకు ప్రాతిపదిక..”
‘అవును..”
”నువ్వు అమెరికాకు టిసిఎస్‌ ఉద్యోగిగా వచ్చి ఈ నేలపై అడుగుపెట్టింది జూన్‌ ఇరవై ఆరు పందొమ్మిదివందల తొంభైఏడు. మొదట మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌చేసి కార్యకలాపాలను ప్రారంభించావు. నువ్వు అతిగోపనీయమైన కొన్ని నాసా ప్రొడక్ట్స్‌ను, అప్పుడే ఎస్‌ఎపీతో అద్భుతాలు ప్రదర్శిస్తూ వాల్‌మార్ట్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణను పర్యవేక్షిస్తూండేవాడివి. నాన్న..నేను అమెరికా వ్యాపారవ్యవస్థను శాసించే వాల్‌మార్ట్‌, కాట్స్‌కో, టార్గెట్‌, హోమ్‌ డిపోవంటి సంస్థలకు కొన్ని ఉత్పత్తులను సరఫరా చేసేవాళ్ళం..ఆ క్రమంలో మొట్టమొదటిసారిగా నాన్న జేమ్స్‌కోవె, నేను మీ రాక్‌విల్లే ఆఫీస్‌కువచ్చాం. అది అగస్ట్‌ ఇరవైరెండు..ఉదయం పదకొండుగంటల ఇరవై ఒక్క నిమిషం. ఆ క్షణమే నేను నిన్ను చూశాను. పలకరించాను. పరిచయం చేసుకున్నాను. భారతీయ ముహూర్తశాస్త్రం మీద విశ్వాసం గల వ్యక్తిగా ఆ మహత్తర క్షణాల్ని నాకు ప్రసాదించినందుకు కాలానికి నా ధన్యవాదాలు..”
”ఊఁ …”రామం మౌనంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”ఒక ఏడాది కాలంలో మనం పదకొండుసార్లు కలుసుకున్నాం. కలుసుకున్న ప్రతిసారీ మన మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది. నాకైతే గత ఎన్నో జన్మల నుంచి మన మధ్య ఓ అపూర్వమైన, ఈ సైన్స్‌కు అందని అదృశ్య అజ్ఞాత బంధముందని అనిపించేది. మొట్టమొదటిసారి ఎంతో ధైర్యంచేసి, భయంభయంగా నిన్ను ఓ రోజు రాత్రి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్‌కు ఆహ్వానించాను. అది జూలై ఎనిమిదవ తేది. నేను తెలుగు నేర్చుకునేందుకు కొన్ని పుస్తకాలు కావాలని అడిగాను. నువ్వు నవ్వి తెలుగు నేర్చుకోవడం అంత అవసరమా అని అన్నావు..నేను ఔనన్నాను. ఆశ్చర్యంగా మూడురోజుల్లో ఇరవై ఎనిమిది తెలుగు పుస్తకాలను భారతదేశంనుండి తెప్పించి ఇచ్చావు. తద్వారా నా పట్ల నీకున్న శ్రద్ధ అర్థమైంది.”
వింటున్న రామం పెదవులపై చిరునవ్వు వెలిగి మాయమైంది.
”ఆగస్ట్‌ పన్నెండవతేది, తొంభై ఎనిమిదిన అనూహ్యంగా డాడీ హార్ట్‌ ఎటాక్‌తో కన్ను మూసారు. అది ఒక పెద్ద షాక్‌ నా జీవితంలో. అకస్మాత్తుగా ఈ ప్రపంచంలో ఒంటరినైపోయాను. నా ఇరవై ఎనిమిదేళ్ళ జీవితంలో ఒక తండ్రిగానే తెలిసిన వ్యక్తి ఓ స్నేహితునిగా, సహచరునిగా, శ్రేయోభిలాషిగా, ఆత్మీయునిగా అనేక రూపాల్లో ఎంత బలంగా నాలోనాన్న ముద్రించుకుపోయాడో అప్పుడు ఏర్పడ్డ శూన్యం తెలిపింది. యిక నేను శూన్యం గురించీ, శూన్యానికి ముందు శూన్యం, తర్వాతి శూన్యం గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను. సున్నా ఒంటరిగా ఉన్నంతసేపు దాని విలువ సున్నాయే కాని దానికి అటో ఇటో ఒక ఒక్కటి చేరితే అది తప్పకుండా ఒక సంఖ్యయి కొత్త విలువను పొందుతుంది. అందుకే నా సంఖ్య ఒక అంకెగా చేరి నాకు విలువను సంపాదింపజేయగల వ్యక్తిగురించి అన్వేషించడం ప్రారంభించాను.”
”……”
”ఎందుకో భగవంతడు నిన్ను స్ఫురింపజేశాడు.. ఐ బిలీవ్‌ ఇన్‌ గాడ్‌. అనేక సిద్ధాంతాలు, వాదనలు ఘర్షణలతో వాదులాడుకునే అనేక ప్రపంచదేశాలు.. ఇండియాతో సహా ఎక్కడా భగవంతుడున్నాడని బహిరంగంగా.. రాజ్యాంగబద్దంగా ప్రకటించలేని వర్తమానంలో.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైనిక మరియు యుద్ధ పాటవాల్లో అగ్రదేశమైన అమెరికా  మాత్రం రాజ్యాంగబద్ధంగా కరెన్సీపైనా, ప్రమాణ పత్రాల్లో సహా..ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌’ అంటుంది. ఇది ఒకరకంగా మనిషి ఒట్టి నిమిత్తమాత్రుడనే పరమసత్యాన్ని అంగీకరించడమే..సరే..ఐతే, ఆ భగవంతుడే మనమధ్య ఓ వారధిగా ప్రవేశించి సంధానం చేశాడని నేను నమ్ముతాను మనస్పూర్తిగా..మూడు పెద్ద ఫ్యాక్టరీలు, విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యం, దాదాపు పది బిలియన్‌ డాలర్ల అసెట్‌ వాల్యూ ఉన్న నేపథ్యం నాదప్పటికి. వాటి నిర్వహణ, రక్షణ, భవిష్యత్తు..ఇవన్నీ నన్ను ఎంతో కలవరపెట్టేవి. కొద్దికాలం..’కిం కర్తవ్యం’ అనే ఆత్మశోధనతో గడిపాను. పిచ్చిగా, నిరామయంగా..నిర్వ్యాపారంగా..దేశమంతా తిరిగాను. ఈ విశాల దేశంలో నాకు తెలిసిన ప్రశాంతతను కలిగించే ఎన్నో ప్రదేశాల్లో శాంతికోసం వెదికాను. ఫిలడల్ఫియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడా.. కొలరాడో..ఒరెగాన్‌, ఫిట్స్‌బర్గ్‌.. ఇంగ్లాండ్‌, భారతదేశం, సింగపూర్‌..ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. ఐతే.. మనిషి ఎప్పుడూ తన బయటఉన్న ప్రపంచంలో అన్వేషిస్తాడు తప్ప..తనలోనే నిక్షిప్తమైఉన్న అంతరిక ప్రపంచాన్ని గుర్తించడు.. ఈ క్రమంలో ఎన్నెన్నో ప్రసిద్ధ పుస్తకాలను అధ్యయనం చేశాను. ఉహు.. బయట ఏమీ లేదని అర్థమైంది. ఏదైనా ఉందంటే అది జీవిలోపలేఉందనీ, అంతిమంగా మనిషి తనకోసం కాకుండా తనులేని ఇతర ప్రపంచాన్ని ప్రేమించగలిగినప్పుడే బోధపడ్తుందనీ తెలిసింది. అందుకే…ఇఫ్‌ యు రిమెంబర్‌, మూడు నెలలు నీకు కనిపించకుండా అప్పుడు నేనుమరుగైపోయాను..అప్పుడు నీతో పాటు రాక్‌విల్లేకు దగ్గర్లోనే ఉన్న ఇన్‌ఫోసిస్‌లో పనిచేసే హెచ్బార్‌ మేనేజర్‌ లీల నీతో సన్నిహితంగా ఉండేది. లీల తెలివికి, చొరవకు, చొచ్చుకుపోయే తత్వానికీ నేను ఎంతో అశ్చర్యపోయేదాన్ని. తమ క్లెయింట్స్‌తో ఆమె ఇంటరాక్టయ్యే పద్ధతికూడా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా ఉండేది. సడెన్‌గా..ఒక ప్రత్యేకమైన సందర్భంలో వాల్‌మార్ట్‌ డీలింగులో ఏర్పడ్డ స్టాగ్నేషన్‌ వల్ల నీవద్దకు టిసిఎస్‌కు వచ్చాను. కాని నువ్వు లేవు. ఉద్యోగానికి రాజీనామా చేశావని చెప్పారు..ఇదంతా మననం చేసుకోవడం ఇప్పుడెందుకంటే..స్పష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటే స్పష్టంగా ఒకసారి గతంలోకి తొంగి చూచుకొమ్మని శాస్త్రం చెబుతోంది.”
”……..” రామం నిగ్రహంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”పోలీస్‌లా నా మనుషులతో నీ గురించి పూర్తి వాకబు చేయించి డెట్రాయిట్‌లో నిన్ను కలిశాను మళ్ళీ. అప్పుడు ఉద్యోగి స్థితినుండి ఒక ఎంటర్‌ప్రున్యూర్‌్‌గా ఎదుగుతున్నావు నువ్వు. రిస్క్‌ తీసుకోకుండా ఒక డిపెండెంట్‌గా పనిచేసి జీతం తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయేవాడు ఉద్యోగి. ఒక నిర్దుష్ట లక్ష్యాన్ని చేరే క్రమంలో రిస్క్‌ను, చాలెంజ్‌స్‌ను స్వీకరిస్తూ అవరోధాలను ఎదుర్కుంటూ ముందుకు సాగేవాడు ఔత్సాహికుడు.. నీలో అప్పటికి పరిణతి చెందుతున్న ఎంటర్‌ప్రున్యుర్‌ కనిపించాడు నాకు. జ్ఞాపకముందా..ఆ రోజు మనం డెట్రాయిట్‌ మారియట్‌్‌ హోటల్‌లో కలిశాం.”
”ఊఁ …”
బయట వర్షం ఉధృతి పెరిగినట్లు కురుస్తున్న చినుకుల పెరిగే ధ్వని చెప్తోంది.

10
”అప్పటికి లీల అమెరికాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు వెళ్ళిపోయింది…ఆమె గురించి నువ్వు నాకు అప్పుడు చెప్పిన రెండు వాక్యాలు బాగా గుర్తున్నాయి. ఆమె…’ఈ అమెరికా ఉద్యోగం..ఈ చిన్నచిన్న లావాదేవీలు నాకు తృప్తి నివ్వడం లేదు రామం..తిమింగలం  మహాసముద్రంలో ఉండాలిగాని చెరువులోకాదు అని అన్నట్లు నువ్వు నాకు చెప్పావు. ఐతే తిమింగలానికి చెరువనేది ఒకటుంటుందనే విషయమే తెలియదనే విషయం ఆమెకు తెలియదని తెలిసి ఆమెపై నాకు జాలి కల్గింది. మనిషి తనను తాను అతిగా అంచనా వేసుకోవడం పతనానికి మొదటి థ.. సరే.. ఆ రాత్రి నిజానికి మనం.. కాదు నేను నిన్ను నీవేమిటో తెలుసుకున్నాను. నువ్వు నా ఊహకందని ఒక కొత్త నీ  మనోప్రపంచం గురించీ,  నీ  మూలాలు ఎక్కడైతే..ఆంధ్రదేశంలో ఉన్నాయో అక్కడి ప్రజల గురించిన తపనా..అక్కడి పతనమౌతున్న మానవతా నైతిక విలువల గురించీ, అరాచకంగా ప్రబలుతున్న విచ్చలవిడితనం గురించే, హింసాత్మక ఉద్యమాల గురించీ, జనంలో వెర్రి తలలు వేస్తూ విజృంభిస్తున్న దోపిడిగురించీ చర్చించావు. ఒక మానవ సమాజంలో తేవలసిన సామాజిక పెనుమార్పులను నీ వ్యూహాత్మక కార్యాచరణతో ఎలా సాధించాలనుకుంటున్నావో కూడా చెప్పావు.. అక్కడ పడింది బీజం..”
”ఊఁ..”
”సరే..అదలా పెడ్తే..ఒక రోజు మనం పిట్స్‌బర్గ్‌లో కావాలని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని, గుళ్ళో ప్రత్యేక పూజలు జరిపించి..ఒక లగ్జరీ రిక్రియేషన్‌ వెహికిల్‌ను తీసుకుని రెండు రోజులు అవగాహన యాత్ర చేశాం..పిచ్చి పిచ్చిగా, స్వేచ్ఛగా అమెరికా అంతా తిరుగుతూ..నిజమైన నిన్ను నేను..అసలైన నన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకున్నాం..జ్ఞాపకముందా ఆరోజు పెన్సెల్వేనియాలో వన్‌ ఫిప్టీ నైన్‌ ఎగ్జిట్‌ వద్ద ఉన్న రెస్ట్‌ ప్లాజా పార్కింగు ఏరియాలో..ఆ రాత్రి.. ఇదేవిధంగా ఒక భోరుమని వర్షం కురుస్తున్న రాత్రి..ఆర్‌విలో..బెడ్‌పై నువ్వు పడుకున్నావు..నేను ఎదురుగా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని.. సమాధిలో ఉన్న మనిషిలా ధ్యానముద్రలో..అప్పుడు మన మధ్య ఒక గాఢ గంభీర నిశ్శబ్దం మాత్రమే ఉంది.. మనిషి అప్పుడప్పుడు ఏదో ఒక అంతర్‌కల్లోలంలో మునిగిఉన్నపుడు..శరీరం ఒట్టి నిమిత్తమై చుట్టూ ప్రపంచం ఒక హేతువుగా మిగిలి అంతా మిథ్యాగత వస్తువుగా గోచరిస్తుంది..ఆ స్థితిలో..నువ్వు అంతర్లోకాల్లోనుండి..మహాభాగవతంలోనుండి ఒక పద్యాన్ని స్వగతంలోలా చదివావు..అది ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు భగవంతుడెక్కడున్నాడని గుచ్చిగుచ్చి ప్రశ్నించినపుడు.. తండ్రిని పిచ్చివాడా..భగవంతుడు ఇక్కడ..ఇక్కడ..అని ఎక్కడ చూపించగలను..ఎక్కడ వెదికితే అక్కడ..ఎక్కడ దర్శించగలిగితే అక్కడే ఉన్నాడు..అని చెప్పిన అద్భుతమైన పద్యం..”కలడు అంభోధి, కలండు గాలి, కలడు ఆకాశంబునన్‌, కుంభినిన్‌ గలడు, అగ్నిన్‌ దిశలన్‌..”చదివావు. పోతన రాసిన ఆ ధారాపాతమూ, ఆపాత మధురమూ ఐన ఆ పద్యాన్ని ధ్యాన ముద్రలో ఉండి విన్న నేను..నువ్వు ఆ పద్యాన్ని చదవడం పూర్తి చేయగానే..ఒక పారవశ్యమాధుర్యంలో సమాధియై ఆ పద్యాన్ని ఉన్నదున్నట్టుగా మొదటి అక్షరంనుండి చివరదాకా గడగడా రాగయుక్తంగా చదివి వినిపించాను.
నువ్వు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయావు..అసలేం జరిగిందో నీకర్థం కాలేదు..పోతన అసాధారణమైన, ప్రాణప్రదమైన పదాల కూర్పుతో రాసిన, పలకడానికే కష్టమైన ఆ పద్యాన్ని..అసలు తెలుగు భాషే రాని నేను ఒట్టిగా ఒక్కసారే విని ఉన్నదున్నట్లుగా పునరుత్పత్తి చేయడం నిన్ను అప్రతిభుణ్ణి చేసింది. అప్పుడు మొదటిసారిగా నాలో ఉన్న అసమాన జ్ఞాపక శక్తిగురించి తెలిసింది నీకు. నా మెదడు ఒక టేప్‌రికార్డర్‌ వంటిది..ఒకసారి దానికి ‘రికార్డ్‌’ కమాండ్‌ ఇస్తే అర్థం చేసుకోవడంతో నిమిత్తం లేకుండా మెదడులో అంతా ముద్రించబడ్తుంది. ఒక మిగిలింది రివైండ్‌ అండ్‌ ప్లే..మళ్ళీ చదువు క్యాథీ అని అడిగావు నువ్వు ఆ షాక్‌లోనుండి కోలుకుంటూ..నేను మారు మాట్లాడకుండా ఆ పద్యాన్ని మళ్ళీ మొదట్నుండి చివరిదాకా చదివి వినిపించాను. ఉక్కిరిబిక్కిరైన నువ్వు చటుక్కున నీ బెడ్‌పైనుండి లేచివచ్చి నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుని పెదవులపై గట్టిగా ముద్దుపెట్టుకున్నావు. అది మన మధ్య మొదటి..పవిత్రమైన చుంబనం.” ఆగి..మాట తడబడి..గద్గదమైపోయి.. చలించిపోతూ,
అప్పటిదాకా కళ్ళుమూసుకుని వింటున్న రామం..ఆమె చెబ్తున్న దృశ్యాన్ని మననం చేసుకుని..ఆనాటి జ్ఞాపకంలో తడిచి.,
మధ్య ఒక మాటలులేని మౌనం పెల్లుబికింది.
”తెలుగు బాషపట్ల ఎందుకో నాకు వ్యామోహం కలిగింది. నాన్న పోయిన తర్వాత ఆ దుఃఖాన్ని మరిచిపోయేందుకో, నన్ను నేను సంభాళించుకునేందుకో, లేక నన్ను నేను మరిచిపోయేందుకోగాని నేను చేసిన అతి ప్రయోజనకరమైన పని తెలుగును సమగ్రంగా నేర్చుకోవడం, తెలుగు వారసత్వ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవడం. ఆముక్తమాల్యద వంటి మహాకావ్యాన్ని స్వయంగా చదివి అర్థంచేసుకునే స్థితిని సాధించడం మామూలు విషయంకాదు. మనిషికి భగవంతుడు ప్రసాధించిన ప్రజ్ఞ ఒక వరమైతే దాన్ని ఎప్పటికప్పుడు పదునుపెట్టుకుంటూ నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం అదృష్టం. నేను అదృష్టవంతురాలిని. అందుకే ఎప్పుడూ సానుకూలధోరణే నన్ను నడిపిస్తూంటుంది. తెలుగు సాహిత్యంలో నన్ను వహ్వాయిది ఎంత అద్భుతం అని అనిపించిన వచనం మహాభాగవతంలో నరసింహావతార అవిర్భావ సందర్భంలో.. విష్ణుమూర్తి స్తంభాన్ని చీల్చుకుని వెలువడే మహాభీకర సందర్భాన్ని వర్ణించిన రెండున్నర పేజీల ఎవరైనా ఏకబిగిన చదువలేని వచనధార ఉంది.. అది ఒక అద్భుతం. దేశంలో ఏ ఒకటోరెండో శాతం అక్షరాస్యత ఉన్న కాలంలో పామరజనం కేవలం మౌఖికంగా విని అర్థంచేసుకుని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ధారణచేయగల అతిసాధారణ అలతి అలతి పదాలతో జీవితసత్యాలను సజీవ ఉపమానాలతో ఆటవెలదులుగా తెలుగుజాతికీ, ప్రపంచానికీ అందించిన ఏకైక తెలుగు మహాకవి యోగి వేమన. యిందరు మహానుభావులను కన్న పవిత్రనేలపై రామం అనబడే ఈ వ్యక్తి కూడా జన్మించడం ఎంత అదృష్టమో అని పరవశించిపోతాన్నేను.. రామం నువ్వు నా దృష్టిలో కారణజన్ముడవు..నువ్వు మాత్రమే నిర్వర్తించవలసిన కొన్ని ఘనకార్యాలు నీకోసం వేచి ఎదురుచూస్తున్నాయి. యిక సమయం ఆసన్నమైంది. ఒక సువర్ణ ఆధ్యాయానికి తెరలేవబోతోంది..ఒక కొత్త చరిత్రకు అంకురార్పణ జరుగబోతోంది..అందుకు ముహూర్తం నిర్ణయించాను రామం. అందుకు సర్వరంగాలనూ సన్నద్ధం చేశాను. సకల శక్తులనూ సమీకరించి ఉంచాను..యిక నువ్వు శంఖాన్ని పూరించడమే తరువాయి..”
రామంకు ఆ ముహూర్తం సంగతీ..కార్యక్రమ రూపకల్పన సంగతీ..అన్నీ తెలుసు. కాని..అన్నాడు..”ఎప్పుడు క్యాథీ” అని.
”ఈ రోజు ఆగస్ట్‌ పది..మనం యుఎస్‌ఎలో ఉన్న మన అన్ని లావాదేవీలనూ జీరో చేయడమో, కొన్నింటిని మనం మళ్ళీ యిక్కడికి ఫిజికల్‌గా తిరిగివచ్చి నిర్వహించవలసిన అవసరం లేకుండా రీషేప్‌ చేయడమో చేశాను. వాటి వివరాలు చెప్పనా.”
”ఊఁ..”
”నువ్విక్కడికి వచ్చి భవిష్యత్తులో ఆంధ్రదేశంలో నువ్వు నిర్వర్తించవలసిన భావికార్యక్రమాల నిర్వహణ దృష్ట్యా కొన్ని నిధులు అవసరమనే వాస్తవిక సత్యాన్ని గ్రహించి పదేళ్ళ కాలంలో మెరుగైన ఫలితాలనివ్వగల కొన్ని కంపెనీలను స్థాపించావు. అవి ఆర్‌వి కన్‌స్ట్రక్షన్స్‌, న్యూ ల్యాండ్‌స్కేపింగు పీపుల్‌, రామం రియల్‌ రిఆల్టర్స్‌, ఎబిసి లాగిస్టిక్స్‌, సిన్సియర్‌ కన్‌సల్టెంట్స్‌, రామం సిస్టమ్స్‌. ఇవి కాక ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది ఇండియన్‌ స్టోర్స్‌ అటాచ్డ్‌విత్‌ ఇండియన్‌ రెస్టారెంట్స్‌.. చెయిన్‌. వీటి విలువ ఎస్టాబ్లిష్‌మెంట్‌ టైంలో ఇరవై మిలియన్‌ డాలర్లు. దీంతో నువ్వు నీ స్నేహితులద్వారా నీకున్న మేనేజ్‌మెంట్‌ స్కిల్సన్నీ ఉపయోగించి పెట్టుబడి పెట్టిన క్యాపిటల్‌ మూడు బిలియన్‌ డాలర్స్‌. మిగతావన్నీ వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు.మనకు ఎక్కువగా సహకరించి డబ్బును సమకూర్చిన బ్యాంక్స్‌ బ్యాంకాఫ్‌ అమెరికా, సిటిగ్రూప్‌, మోర్గాన్‌ స్టేన్లే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, సన్‌ట్రస్ట్‌, క్యాపిటల్‌ వన్‌ ఫిన్‌.. వీటితో చాలా బ్యాంకులకు నాన్నకు చెందిన హోల్డింగ్సును మొదట సెక్యూరిటీగా చూపాం. తర్వాత బెస్ట్‌ పర్‌ఫార్మింగు కంపెనీస్‌ క్రింద మన సంస్థలకన్నింటికీ ఈ పైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో పరపతి పెరిగింది.
మన ప్రణాళిక పకడ్బందీగా ఉంది కాబట్టి డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలనను నిర్వహిస్తూ వచ్చాం. మొన్నటి మార్చి ఫైనాన్షియల్‌ ఇయర్‌ నాటికి మన సంస్థల పర్‌ఫార్మెన్స్‌ను ఖచ్చితంగా మదింపుచేశాను. యిప్పుడు మన నెట్‌ అసెట్‌ వ్యాల్యూ ఇరవైరెండు బిలియన్‌ డాలర్స్‌. నా తరపున ఉన్న హోల్డింగ్సు విలువ ఎనిమిది బిలియన్‌ డాలర్స్‌. మనం చెల్లించవలసిన లయబిలిటీస్‌ మొత్తం ఆరు బిలియన్‌ డాలర్స్‌. మన ఆర్థికస్థితిగతులు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నట్టు లెక్క”.
రామం తదేకంగా క్యాథీవైపు చూస్తున్నాడు.
ఒక పెద్ద ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తన బోర్డాఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగును జరుపుతున్నప్పుడు జరిగే ప్రధాన తతంగాన్నంతా క్యాథీ ఒక్కతే ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తోందీ..అనుకున్నాడు..ఈ ఒక్క మనిషి పదిమంది సమర్థులైన మేనేజర్లతో సమానం అనికూడా అనుకున్నాడు. కాగా విశ్వసనీయత సంగతో..ఆమెను నమ్మడమంటే తనను తాను, తన నీడనుతాను, తన ఆత్మనుతాను విశ్వసించినట్టే.
ఒకసారి క్యాథీతో తను చర్చించిన చిత్రమైన విషయం జ్ఞాపకమొచ్చింది రామంకు.
”క్యాథీ..ఒక మనిషి ఒక జీవితకాలంలో రెండు మూడు జీవితాలను జీవించడం, ఒక మనిషి యాభై ఏండ్లకాలంలో వందేళ్ళకాలం జీవించడం, మనిషి ఎన్నేండ్లయినా జీవిస్తూకూడా మరణిస్తూనే ఉండడం తెలుసా నీకు”. అన్నాడొకసారి తామిద్దరూ ఒక కంపెనీతో ప్రధాన వ్యాపార విషయాలను చర్చించడానికి, ఒక అగ్రిమెంట్‌ను సంతకం చేయడానికి డల్లెస్‌ వెళ్తున్నపుడు కార్లో.
”చెప్పు” అంది ఆసక్తిగా.
”ఒకతను ఉద్యోగరీత్యా ఒక ఉపాధ్యాయుడు..ఉపాధ్యాయునిగా అద్భుతంగా పాఠాలు చెప్పడం, ఉద్యోగానికి న్యాయం చేయడం..దాన్ని అలాగే నియమితకాలం వరకు కొనసాగించడం ఒక జీవితాన్ని జీవించడం. ఐతే ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఒక రచయితగా, ఒక పెయింటర్‌గా లేదా ఇంకేదోరంగంలో నిపుణునిగా తనను తాను మలచుకుని రాణించడం..అంటే మనిషి ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ జీవితాలను జీవించడం. కాగా మనిషి తన జీవితకాలంలో యిరవై ఐదేండ్లవరకు చదువు, తర్వాత ముప్పయి ఏండ్లు ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు సంపాదించి కొన్ని బాధ్యతలు నిర్వర్తించి, కొన్ని విజయాలు సాధించి..మొత్తం సమగ్రతను ఎనభైఏండ్లలో పూర్తిచేయగలిగినట్టయితే..అవే పనులను దాదాపు నలభై ఏండ్లలో సాధ్యంచేసినట్టయితే అది ఏభై ఏండ్లలో వందేండ్ల జీవితాన్ని జీవించడం వంటిది. ఒకడు అరవై ఏండ్లకు మంత్రికాగలిగితే మరొకడు ముప్పయ్యేండ్లకే మంత్రి ఐనట్టు..ఒకడు పుట్టి ఏ రంగంలోనూ రాణించక, దేన్నీ సాధించలేక ఒక ప్రాణమున్న వ్యర్థ పదార్థంగా మిగిలిపోవడం అంటే జీవిస్తూకూడా మరణిస్తూండడం..ఐతే మనం ఏ రకంగా జీవిద్దాం అనేదాన్ని మనిషి ఎవరికివారు ముందే నిర్వచించుకొని ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతే బాగుండేది. కాని యిప్పటికీ అరవై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోని ముప్పావుకన్న ఎక్కువ జనాభా. జీవిస్తున్నామంటే..బస్‌ అంతే.. అలా జీవిస్తున్నాం..అని ఉబుసుపోకకోసమే జీవిస్తున్నారు. చాలామంది దురదృష్టవశాత్తు సాధ్యమైనంత ఎక్కువ డబ్బును సంపాదిస్తే అంత బాగా జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న మూర్ఖులు. ఈ భావనే భారతదేశాన్ని కకావికలు చేసి అస్థిరపరుస్తూ ఎదగకుండా చేస్తోంది..”
”ఔను…ఈ విషయాన్ని నేను గ్రహించాను రామం” అంది క్యాథీ.
క్యాథీ ఏ విషయాన్నైనా సూక్ష్మస్థాయిలో అర్థంచేసుకుని తొందరగా ప్రతిస్పందించడంలో ఎంతో చురుకైంది. అదొక అసాధారణ ప్రతిభ.
”మనం సెప్టెంబర్‌ ఐదవతేదీన భారతదేశంలో ఉండేట్టుగా..అంటే మూడవతేదీ రాత్రి పది గంటల యాభై నిముషాల కతార్‌ ఏర్‌వేస్‌ ప్లయిట్‌ క్యుఆర్‌ టుఫిఫ్టీలో హైద్రాబాద్‌ బయలుదేరబోతున్నాం. మన భావి నిరాడంబర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ పర్యటనతో యిక ముందు ఎకానమీ తరగతుల్లోనే మన ప్రయాణం. ఆ రోజు మన ఇద్దరితోపాటు యిక్కడమనం తయారుచేసిన పదిమంది యువతీయువకుల బృందంకూడా యిక అమెరికాలో తమ కార్యకలాపాలను మూసేసి మన భావి రాజకీయ కార్యకర్తలుగా మనవెంట ఉంటారు. వీళ్ళందరూ గత మూడేళ్ళుగా మనతో భవిష్యత్తుగురించి లోతుగా చర్చిస్తూ, మన ఆలోచనలతో, మన లక్ష్యాలతో పూర్తిగా ఏకీభవించే వాళ్ళు. ఏడ్గురు యువకులు. ముగ్గురు యువతులు. యువకుల గ్రూప్‌కు శివ నాయకత్వం వహిస్తారు. కౌస్తుభ యువతులకు నాయకత్వం వహిస్తుంది. వీళ్ళు మన ప్రధానాంగాలు. యిప్పటికే ఈ మధ్య నువ్వు అనేక సార్లు హైద్రాబాద్‌ వెళ్ళి గోపీనాథ్‌ గారితో చర్చించావుగదా. కాగా ఆయనకూడా రెండుసార్లు యిక్కడికి స్టేట్స్‌ వచ్చి మనతో విపులంగా మనం చేపట్టవలసిన పంథా గురించి ఆలోచనలను పంచుకున్నారు. చాలాలోతుగా విశ్లేషించి మన భావి కార్యక్రమాలకు డాక్టర్‌ గోపీనాథ్‌ గారిని మన సిద్ధాంతకర్తగా, గురువుగా స్థిరీకరించాం. మనం స్థాపించబోయే సంస్థపేరు ‘జనసేన’. ఇది ఒక సామాజిక సంస్థ. రాజకీయ పార్టీకాదు. యిప్పటికే దీన్ని మనం హైద్రాబాద్‌లో రిజిష్టర్‌ చేశాం. నంబర్‌ 2305 అబ్లిక్‌ టు జీరో జీరోనైన్‌. గోపీనాథ్‌గారు దాదాపు ఆరు పేజీలుగల జనసేన మానిఫెస్టోను రాసి మనకు సబ్‌మిట్‌ చేస్తే మనం దాన్ని అంగీకరించి ప్రచురించి మన సభ్యులందరికీ పంపిణీ చేశాం. తర్వాత దానికి విపులమైన వివరణాత్మక పాఠాలను మరో పుస్తకంగా ప్రచురించాం. అది నూటా నలభైపేజీలు ఉంది. అది ‘జనసేన లక్ష్యాలు-కార్యాచరణ’ అనే పేరుతో మన మిత్రులందరికీ అందింది.”
రామంకు తను అనేక సందర్భాలలో క్యాథీతో చర్చించిన భవిష్యత్‌ కార్యాచరణ పథకాలను, సంస్కరణ తాలూకు చింతనను, తేవలసిన నిశ్శబ్ద విప్లవం తాలూకు పెనుమార్పుల మూలాలను చర్చించడం..ఆమె వాటిని ఒక క్రమంలో కూర్చడం..ఒక రూపురేఖనిచ్చి డాక్టర్‌ గోపీనాథ్‌ ద్వారా దానికి సిద్ధాంత స్వరూపాలను కల్పించడం..ఇదంతా ఒక పవిత్రమైన గురుతర బాధ్యతగా జ్ఞాపకమొచ్చి.,
”చెప్పు క్యాథీ..నువ్వు అసలైన మన కార్యరంగం గురించి చెబుతూంటే..నాకు నాలోకి నేను చూచుకుంటున్న అనుభూతి కలుగుతోంది. కాగా కార్యోత్సాహంకూడా ఉరకలేస్తోంది. నువ్వన్నట్టు ఇక మన శక్తివంతమైన ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. ప్రాతఃసమయం ఆసన్నమౌతున్నప్పుడు సూర్యోదయాన్ని ఎవడాపగలడు..ప్లీజ్‌ కంటిన్యూ..మనం ఇంత విపులంగా మనల్నిమనం సమీక్షించుకోవడం మున్ముందు సాధ్యంకాకపోవచ్చుకూడా..ఈ సన్నివేశం యిప్పుడెంతో ప్రధానమైంది..”
క్యాథీ సాలోచనగా రామం ముఖంలోకి చూచింది. అతను యోగముద్రలో ఉన్న ఋషిలా నిర్మలంగా ఉన్నాడు.
ఆమెకు ఎందుకో పుచ్చలపల్లి సుందరయ్య జ్ఞాపకమొచ్చాడు. ఒక బనారస్‌ హిందూ యూనివర్సీటీ స్థాపించిన మదన్‌మోహన్‌ మాలవీయ జ్ఞాపకమొచ్చాడు.
”మన కార్యక్షేత్రం వరంగల్లు. మనం ఏది చేసినా ప్రజలు మనను మొదట స్కాన్‌ చేస్తారు. త్యాగాల గురించీ సిద్ధాంతాల గురించీ, ఆదర్శాల గురించీ నీతులు చెప్పే నాయకులు తమ నిజజీవితంలో ఎంతవరకు వాటిని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు..అని ప్రశ్నించుకుంటారు. ప్రశ్నిస్తారుకూడా. అందుకని.. మనం వరంగల్లు నగరంలో..కాశిబుగ్గ నుండి మొగిలిచెర్ల పోయే రోడ్డుకు అనుకుని రెండు ఎకరాల స్థలంలో..బాలసంత గూడేనికి  యివతల..ఒక ఆశ్రమంవంటి కుటీరాన్ని నిర్మిస్తున్నాను. అందుకోసం భూసేకరణ, నిర్మాణం కూడా ప్రారంభమైంది..నీతో పాటు ప్రక్కనున్న చిన్న కుటీరంలోనీ అనుచరిగా.. సహచరిగా కాదు..”చటుక్కున ఆగింది క్యాథీ.,
”ఊ.. ఈ రెండూ వేర్వేరు కదా..కాని నా దృష్టిలో..మనిద్దరికి సంబంధించి ఈ రెండూ ఒక్కటే.. క్యాథీ.. శరీరం ఆత్మ వేర్వేరుగా మనలేవు. ఆ రెండూ తమ సంయుక్తతను విడిచిపెట్టడాన్నే మరణం అంటారు.” అన్నాడు రామం.
బయట వర్షం ఇంకా ఉధృతంగా కురుస్తూనే ఉంది.
”పక్క కుటీరంలో అహర్నిశలు శరీరంవెంట ఆత్మలా, వస్తువు వెంట నీడలా నేను నివాసముంటాను”
”ఊఁ..”
”భారతదేశంలో..ప్రధానంగా ఆంధ్రదేశంలో గత యాభై సంవత్సరాల రాజకీయ నేపథ్యాన్ని అనేక రాత్రులకు రాత్రులు మేల్కొని సమగ్రంగా అధ్యయనం చేశాను రామం. బ్రిటిష్‌ పరిపాలనలో ఉన్న కోస్తా జిల్లాలకు అధికారిగా వచ్చిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి నది సంస్పర్శతో ఎంత పులకించి అపర భగీరథునిగా నాల్గు జిల్లాలకు శాశ్వత సాగునీటి వసతిని ప్రసాదించి ఒక దేవునిగా మిగిలిపోయాడు, చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ ఒక బ్రిటిష్‌ అధికారిగా తెలుగు భాషపట్ల నావలెనే మోహావేశంతో కడపకేంద్రంగా తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు..తెలంగాణా జిల్లాలు నిజాం దుర్మార్గ దురహంకార పాలన క్రిందఅమానుషంగా ఎలా దోచుకోబడ్డాయి..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం..తదనంతర కమ్యూనిస్ట్‌ ఉద్యమ విఫలం..చీలికలు..రజాకార్లు..తర్వాత భూస్వాములే కాంగ్రెస్‌ నాయకులుగా రూపాంతరంచెంది..దాశరధి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలలో చెప్పినట్టు ప్యూడల్‌ వ్యవస్థ ఎలా ప్రజాస్వామిక ముసుగులోకి మారిందీ..ఇవన్నీ సవివరంగా అధ్యయనం చేశాను రామం. కాలం ఉరుముకుంటూ, గర్జించుకుంటూ ఆంధ్రదేశాన్ని ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది భారత స్వాతంత్య్ర ప్రకటన నాటికి.. ఐతే అసలు నిజమైన విషాదమంతా ఆగస్ట్‌, 15-1947 తర్వాతనే ప్రారంభమైంది. ఒక విషయం చెబుతే నువ్వు ఆశ్చర్యపోతావ్‌ రామం. 1955లో జవహర్‌లాల్‌ నెహ్రూచే శంకుస్థాపన చేయబడ్డ అతిపెద్ద మాసనరీ డామ్‌ ఐన నాగార్జునసాగర్‌ అప్పటి ప్లానింగు కమీషన్‌ చేత 80 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ప్రారంభించబడి చివరికి 1967లో ఇందిరాగాంధీచే ప్రారంభించబడ్డప్పుడు 91 కోట్ల రూపాయల నిధులతో పూర్తిచేయబడింది. అదే ప్రాజెక్టును యిప్పుడైతే నలభై వేల కోట్ల రూపాయలతో యిప్పటి దుర్మార్గులైన ఇంజినీర్లు నిర్మిస్తారు.. అందులో కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపిటీసిలు, కార్పొరేటర్లు, చీఫ్‌ ఇంజినీర్లు, ఇఇలు, డియిలు, ఎయిలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు.. ఇలా అందరూ వాటాలు వేసుకుని పంచుకు తింటారు. ప్రాజెక్ట్‌ పదిసంవత్సరాలు కాకుండానే తప్పకుండా కొట్టుకుపోతుంది. ఏమిటీ మార్పు. ఈ నిర్లజ్జతనానికి ప్రతీకలైన ఈ ప్రభుత్వాల, ప్రజల నీతిహీనత ఏ శాస్త్రానికీ అంతుబట్టడంలేదు. ఐతే ప్రజల ప్రవర్తన విషయంగా ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్‌ ఏమన్నాడంటే..”
”…..” రామం వింటున్నాడు..ఓ పాఠాన్ని ఆసక్తిగా వింటున్న విద్యార్థిలా.
”ప్రజలెప్పుడూ అవకాశవాదులు. ఒక చిన్న పిల్లవాన్ని ఏ కాపలాలేని మిఠాయి దుకాన్లో కూర్చోబెడితే అవకాశముంది కాబట్టి జిహ్వాచాపల్యంతో దొంగతనంగా మిఠాయి తింటాడు. ఏదైనా నిఘా ఉంటే దొంగతనానికి శిక్ష తప్పనిసరిగా ఉంటుందంటే అదే పిల్లవాడు మిఠాయి స్వాహా చేయడు సరికదా తనూ ఓ కాపలాదారుడుగా వ్యవహరిస్తాడు. ఈ అతి సున్నితమైన తేడాను ప్రజాపరిపాలనతో సంబంధమున్న ప్రతివ్యక్తీ ప్రాథమికంగా గమనించాలని చెప్పాడాయన.. అందుకే యధా రాజా తధా ప్రజా నానుడి పుట్టింది. యిప్పుడు ఈ సామెతను యథా ప్రజా తథా రాజాగా మార్చి విచ్చలవిడి దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దౌర్జన్యం యిక భరించలేని గరిష్ఠస్తాయికి చేరింది. దీన్ని ధ్వంసం చేయాలి. లేకుంటే యిక వ్యవస్థ ఎవరూ బాగుచేయలేని అథమాథమ స్థితికి చేరుకుంటుంది.”
”…..” రామం కళ్ళు ఆమెను నిశితంగా అధ్యయిస్తున్నాయి. ఆమె అప్పుడు మహాభారత రణక్షేత్రంలో అర్జునునికి తత్వబోధను చేస్తున్న కృష్ణుని ముఖంలా ఉంది పరిపూర్ణంగా.
”యిక్కడ పరిపాలనకు సంబంధించిన ఒక ప్రధాన విషయాన్ని మనం కూలంకశంగా పరిశీలించాలి రామం. దేశం ఏదైనా.. ప్రజలు..ఆమాటకొస్తే మనుషులు ఏ పరిస్థితుల్లో తప్పకుండా చెప్పినమాట వింటారు..అంటే జవాబు..దేశభక్తి.. దేశంపట్ల ప్రేమ..మనిషికి మనిషి పట్ల గౌరవం..మానవత్వం..మానవతా విలువలు..గాడిద గుడ్డు..ఇలా కోటి సమాధానాలొస్తాయి – కాని సత్యమేమిటంటే..భయం. నేను ఈ చేయకూడని పనిచేస్తే ఎవరో తప్పకుండా తనను శిక్షించి కష్టమో, నష్టమో కలుగజేస్తాడని గ్యారంటీ ఉన్నప్పుడు మాత్రమే మనిషి తప్పకుండా ఎదుటి మనిషి చెప్పినమాట వింటాడు. అంతిమంగా మనిషిని ఋజుమార్గంలో పెట్టేదీ, సరియైన మార్గంలో నడిపించేదీ ‘భయం’ ఒక్కటే. ఏదో ఒక భయం లేనిది మనిషి చెప్పినమాట వినడు. ఒకసారి ‘భయం’ పేరుతో మనిషిని సరియైన దారిలో పెట్టగలిగితే, తర్వాత కౌన్సిలింగు చేసి, బుజ్జగించి, బుద్దిచెప్పి, నిజమైన నీతి వాక్యాలను, విలువలను బోధపరిచి యిక వ్యక్తిని ఉత్తమునిగా, ఉన్నతునిగా మార్చవచ్చు. యిది ఒక సంక్లిష్టమైన సందిగ్థ స్థితి.. పాలకులకు తెలియాల్సిన పరిపాలనా రహస్యం.
మనిషిలో పాదుకొల్పాల్సిన భయానికి మారుపేరు ‘బ్లాక్‌మెయిలింగు’ పరిపాలనలో, రాజకీయాల్లో, అధికారిక వ్యవహారాల్లో, కార్పొరేట్‌ కల్చర్‌లో ‘బ్లాక్‌మెయిలింగు’ అనేది అతిశక్తివంతమైన ఒక టూల్‌. వెనుకటి భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఒక తిరుగులేని నియంతను తలపింపే పటిష్టమైన పాలనను కొనసాగిస్తున్న కాలంలో ఒక ప్రచారం బలంగా వినిపించేది. అమె గురించిన పాలనాపరమైన పుస్తకాలను చదివినా ఈ విషయం తెలుస్తుంది..ఏమిటంటే ఎవరైనా తనకు ఎదురుతిరిగినప్పుడు, తోక జాడించినపుడు, నక్‌రాలు చేసినప్పుడు ఒంటరిగా తన చాంబర్‌లోకి పిలిపించుకుని వాని చరిత్రభూగోళాన్ని విప్పే ఫైల్స్‌ను ముందుంచేదని. యికవాడు కిక్కురుమనకుండా నోరు మూసుకుని ‘కింనాస్తి’ అయ్యేవాడని.. యిది ఒక అతిప్రధానమైన అంశం. కాబట్టి ఒక ఉద్యమాన్నిగానీ, పరిపాలననుగానీ కొనసాగిస్తున్న ప్రతి సమర్థవంతుడైననాయకుడు తన ప్రధాన శత్రువు యొక్క , తన ఆంతరంగికుల యొక్క, అతి సన్నిహిత మిత్రులయొక్క ఆంతరంగిక ప్రవర్తనల రికార్డును ఎప్పటికప్పుడు తయారుచేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడుకూడా ఎదురుతిరిగేవాడెవడయ్యా అంటే మన రహస్యాలను ఎక్కువగా తెలుసుకోగలిగే మన దగ్గరి మిత్రులే. వాళ్ళే ద్రోహులుగా, కోవర్టులుగా మారుతారు. పురాణాల్లో యింటిదొంగ విభీషణుడు కోవర్ట్‌గా మారాడు, మహాభారత యుద్ధంలో శల్యుడు ఇన్‌ఫార్మర్‌గా మారాడు. శకుడు మిత్రుని రూపంలో ఉన్న శత్రువుగా ప్రవర్తించాడు. వీళ్ళ గురించి తగు జాగ్రత వహించకపోతే అసలు లక్ష్యాలు దెబ్బతిని అంతా మిస్‌ఫైర్‌ ఔతుంది. ఐతే ఈ మనుషులను సరిగ్గా గుర్తించే వ్యవహారాన్ని అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిమాత్రమే నిర్వహించాలి. అందుకే దీన్ని.. పరిశీలన.. నివేదన.. చర్య.. అనే ప్రధానమైన భాగాలుగా గల ఇంటెలిజెన్స్‌ బాధ్యతను నీకు ప్రథమ వలయ రక్షకులుగా ఉండే నేనూ, శివ తీసుకుంటాం. అత్యంత గోపనీయంగా ఈ మాడ్యూల్‌ ఉంటుంది. డైరెక్ట్‌ రిపోర్టింగు టు యు ఓన్లీ”…ఒక క్షణం ఆగి.,
”క్యాథీ మన జనసేన సంస్థ నిర్మాణ వివరాల్లోకి పోయేముందు..ఒకసారి స్థూలంగా ఈ అరవై సంవత్సరాల భారత రాజకీయ వ్యవస్థ యొక్క రూపురేఖలను మననం చేద్దాం..నువ్వన్నట్టు ఒక కీలకమైన గతం యొక్క చరిత్రను పునశ్చరణ చేసుకుంటే భవిష్యత్‌ ప్రణాళిక స్పష్టంగా మన కళ్ళముందు రూపుకడ్తుంది. ఐతే..ఏ కాలంలోనైనా ఎప్పుడూ దేశక్షేమం గురించి తీవ్రంగా స్పందిస్తూ ఆలోచించిన ఒక మేధోవర్గం ఉంటూనే వచ్చింది. వాళ్ళకు అధికారవ్యామోహం లేదు. స్పృహమాత్రమే ఉంది. ప్రగతికాంక్ష మాత్రమే ఉంది..” ఆగాడు రామం..ఎక్కడోతనను తాను కోల్పోతూ.
”భారత స్వాతంత్య్రం ప్రకటించబడ్డ కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే సంఘ స్వార్థపరశక్తులు విషకోరలతో విజృంభించడాన్ని శుద్ధ జాతీయవాదులందరూ గమనించారు. అప్పుడు ఓ వేయి పేజీల గ్రంథం చెప్పగల సారాంశాన్ని మహాకవి శ్రీశ్రీ ఒక్క పాటతో ప్రజానీకానికి నిద్రమత్తు విదివిస్తూ గర్జించాడు. అంటాడు.
‘స్వాతంత్రంవచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయీ
సాధించినదానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయీ’ అని  కర్తవ్యబోధను చేస్తూనే అప్పటికే విజృంభించిన రుగ్మతలను ఏకరువుపెట్టి ఒక హెచ్చరికను చేశాడు..చూడు
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు” అని వాపోయాడు. ఈ స్థితి ఈ అరవై ఏళ్ళలో ఏకొంచెమైనా మెరుగుపడలేదు సరికాదా యింకా యింకా కుళ్ళిపోయి, క్షీణించి శుభ్రంచేయలేనంత మురుగుగా నరనరాన వ్యాపించింది. అప్పుడే జాతీయ, రాష్ట్రస్థాయిలో దేశానికి భంగం కలిగించే పాలసీలనూ, విధానాలనూ ఎండగడ్తూ కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి 1978లో ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకాన్ని వెలువరించి ఒక షాక్‌ ట్రీట్‌మెంటిచ్చాడు. ఏం జరిగింది..ఒంటరిగా ఒకే ఒక యోధుని ప్రతిఘటన.. పుస్తక నిషేదం. ఎన్నో సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈ దుర్మార్గ సూడో ప్రజాస్వామిక వ్యవస్థలో ఇమడలేక మార్సిస్ట్‌-లెనినిస్ట్‌ కానూసన్యాల్‌ విభాగం పేరుతో పోరాటం చేసీచేసీ..యిక్కడ ఓ విషయం జాగ్రత్తగా గమనించాలి రామం.. పాలకుల దమనకాండకు, అణచివేతకు, విచ్చలవిడి దోపిడీకి వ్యతిరేకంగా గత నలభై ఏండ్లకు పైగా తెలుగు నేలపై జరుగుతున్న తీవ్రవాద ఉద్యమాలన్నీకూడా ఎందుకు విఫలమైపోయాయంటే..వాటిలో మెజారిటీ సందర్భాల్లో సామాన్య ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే. నక్సల్‌బరీలో ఓ భూపోరాట శక్తిగా..చిన్న మొక్కగా పొటమరించి నక్సలైట్‌ ఉద్యమంగా విస్తరించి, ఎదిగి శ్రీకాకుళ సాయుధ పోరాటంగా వెంపటాపు సత్యం, పంచాది నిర్మల, అధిభట్ల కైలాసం..వంటి అమరవీరుల నేతృత్వంలో అంటుకున్న అగ్నిలా ఉత్తర తెలంగా జిల్లాల గుండెల్లోకి విప్లవాగ్నియై విజృంభించినా..మొదట్లో మెడికల్‌, ఇంజనీరింగు విద్యార్థుల సామూహిక ప్రవేశంతో విద్యుత్తులా అడవుల్లోకి ప్రవహించినా..పీపుల్స్‌వార్‌గా మారి..అటు తర్వాత మావోయిస్ట్‌లుగా పేరుమార్చుకుని అనేక అంతర్గత కుమ్ములాటతో వర్గపోరాటంపేరుతో శత్రునిర్మూలనను చేపట్టి చివరికి పార్టీలోని వ్యక్తిగత కక్షలసాధింపు యంత్రాంగంగా పరిణమించి, అర్థంపర్థంలేని హింసలతో, హింసాత్మక చర్యలతో.. నిజంగా ద్రోహులుగాహిరంగంగా ముద్రపడ్డ ఏ ఒక్క రాజకీయ నాయకున్నీ, ఏ ఒక్క లంచగొండి ప్రభుత్వ అధికారినీ చంపకుండా చివరికి మావోయిస్ట్‌ ఉద్యమమంటే పోలీసులకూ, అడవుల్లో ఉండే ఎవరికో నడుమ జరిగే పాశవిక పరస్పర నిర్మూలనచర్యగా సామాన్యజనం అర్థంచేసుకునే స్థితికి చేరింది. ఐనా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడిన ఏ సిద్దాంతమైనా ఓ నలభై ఐదేండ్ల సుదీర్ఘకాలంలో తనముద్రను ప్రజల్లో వేయలేకపోయిందీ, జనాదరణను పొందలేకపోయిందీ, ప్రజల ఆమోదాన్ని పొందలేకపోయిందీ అంటే అది ఒక విఫలంకిందే లెక్క. ప్రతి ప్రయోగానికీ కొంత కాల అవధి ఉంటుంది… యిప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజనులు ఆదివాసీలు అరణ్యవనరుల దోపిడీకి ప్రతిఘటన పేరుతో అర్ధవంతమైన ఉద్యమాలు మధ్య భారతంలో జరుగుతున్నా..అవి ప్రధానంగా ప్రజాబాహుళ్యంలో నైతికపరమైన పరివర్తననూ, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనం నిర్మూలన దిశగా ఆలోచిస్తూ పనిచేయడం లేదు. అవి దారి తప్పాయి. అందుకే విద్యావంతులూ, అభ్యుదయవాదులెవ్వరూ ఈ ఉద్యమాలపట్ల ఆసక్తి చూపడంలేదు. కాడర్‌ రిక్రూట్‌మెంట్స్‌ బాగా తగ్గిపోయాయి. గత నెల నేను చత్తీస్‌గడ్‌, ఒరిస్సా లోతట్టు ప్రాంతాల అనేక గ్రామాల్లో పర్యటించినపుడు కొన్ని వందలమంది ఆదివాసీ పౌరులతో మాట్లాడాను. వాళ్ళు నిజానికి ఒకవైపు ప్రభుత్వ అనధికార ఏజన్సీ సాల్వజుడుం, పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌ దళాలు మారోవైపు అజ్ఞాత మావోయిస్ట్‌ దళాలమధ్య మింగలేక చావలేక నలిగిపోతున్నారు. వాళ్ళిప్పుడు అందరూ తమను విడిచిపెట్టి వెళ్ళి యిదివరకటిలా తమదారిన తమను ప్రశాంతంగా అడవిలో బ్రతకనిస్తే చాలు మహాప్రభో అన్న దుఃఖంనిండిన విసుగుదలతో ఉన్నారు. వాళ్ళకు ఈ దిక్కుమాలిన దోపిడీ రాజకీయాలపట్ల, రక్తపాతంపట్ల, పరస్పర హింసపట్ల, తనవాళ్ళను తామే నిర్మూలించుకోవడం పట్ల ఏమాత్రం ఆసక్తిలేదు. ఈ ‘హిట్‌ అండ్‌ మిస్‌’ సిద్ధాంతానికి కాలం చెల్లింది. యిప్పుడు ‘స్టే అండ్‌ హిట్‌’ సూత్రం కావాలి. ప్రజల్లోకివెళ్ళి ప్రజలతో కలిసి జీవిస్తూ ప్రజలతో మమేకమై, ప్రజలను విద్యావంతులను కాకుండా నైతికవంతులను చేసే ఒక వినూత్న నిశ్శబ్ధ విప్లవ పంథా యిప్పుడు కావాలి. ఈ ప్రభుత్వాలు అవినీతి, అధికారం, డబ్బు, లంచగొండితనం, మద్యం, మీడియా, వ్యామోహల సరఫరా అనే అదృశ్య ఉచ్చును ప్రజలపై విసిరి వాళ్ళను నిద్రబుచ్చి, బందీలను చేసి దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నాయి. దీనిని పునాదితో సహా పెకిలించి సమూలంగా నిర్మూలించాలి.. అలా చేయడం అసాధ్యంకాదు. ఈ స్థితి కుళ్ళి కుళ్ళి, ఆ దుర్వాసన చుట్టు ప్రక్కకు వ్యాపించి యిక భరించలేని స్థాయికి క్షీణించిపోయింది. పీతికంపులో ఎవరైనా ఎంతకాలం ఉండగల్గుతారు. నిజమైన ప్రజలు విసిగి విసిగి, అలసి అలసి ఏదో ఒక నిజాయితీగా సంస్కరించ సంకల్పించే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. స్వతంత్రం అరాచకత్వంగా, స్వేచ్ఛ విశృంఖలత్వంగా మారి గుండాయిజం, నేరం, మాఫియా చట్టసభల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, శాసనకర్తలుగా మారి రాక్షస హాహాకారాలు చేస్తున్న వర్తమానం ఎంత చెడిపోయిందో..ఈ రోజు దినపత్రికలోని ఈ న్యూస్‌ ఐటం చదివితే తెలుస్తుంది.
‘ఇక కిక్కేకిక్కు…మద్యం ఆదాయం ఏడువేల కోట్లు. ఈ సంవత్సరం తాజా మద్యం టెండర్ల ద్వారా నలభై ఎనిమిది కోట్లు ప్రభుత్వానికి లభించాయి. దీనికి లైసెన్స్‌ ఫీజుమొత్తాన్ని కలిపితే మద్యం టెండర్లపై లభించిన ఆదాయం మొత్తం రూ|| 7 వేల కోట్లకు చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద 650  మద్యం దుకాణాలకు 48,602 టెండర్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా దాచేపల్లి, నడికుడి గ్రామం రూ|| 5,21,11,111 షాపు ధర పలికింది కాగా ఈ సంవత్సరం
యిదివరకు మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు గాక కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చిన 60 శాతం మందికి కొత్త షాపులు దక్కాయి. కోస్తా జిల్లాలలో మద్యం వ్యాపారంలోకి మంత్రులు, శాసనసభ్యులు కూడా రంగప్రవేశం చేసి షాపులు దక్కించుకున్నారు.. ఐతే కొసమెరుపేమిటంటే.. మొన్నెన్నడూ కనీవిని ఎరుగని విధంగా వేలం పాటలో వందమంది మహిళలకు మద్యం షాపులు దక్కడం.
క్రిందనే ఇంకో న్యూస్‌ ఐటం ఉంది.
‘ఆదాయంకోసం ప్రభుత్వం వ్యభిచార గృహాలనుకూడా నడుపుతుందా’ అని హెడ్డింగు.
‘రాత్రి ఏడుగంటలు దాటిందంటే మహిళలు రోడ్లమీద నడచి క్షేమంగా ఇంటికి చేరలేకపోతున్నారు. రోడ్‌కు యిరువైపులా బహిరంగంగా నిస్సిగ్గుగా తాగుతూ దారినపోతున్న ఆడవాళ్ళపై నానా కారుకూతలు కూస్తున్నారు. దుర్‌వ్యాఖ్యలతో బూతులు మాట్లాడ్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా కాలేజీల ప్రక్కన, దేవాలయాల పక్కన బార్లకు, బ్రాందీషాపులకు పర్మిషన్‌ యిచ్చి విద్యార్థులనుకూడా తాగుబోతులుగా, అసాంఘికశక్తులుగా మారుస్తోంది. మహిళలను, యువతరానికి రక్షణ కల్పించి భాద్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వమే పూర్తిగా అనైతికంగామారి వెనుకటి పురాణకాలం నాటి రాక్షస పాలనను తలపిస్తోంది’ అని అల్వాల్‌ ప్రాంతంలోని పలుమహిళలు వాపోయారు. ఒకరైతే ఆగ్రహవేశాలతో ఊగిపోతూ ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించింది..ఆదాయమే ప్రధానమైతే ప్రభుత్వమే వ్యభిచార గృహాలనూ, జూదగృహాలనుకూడా నడపొచ్చుగదా అని వ్యాఖ్యానించారు’.
”వింటున్నావా రామం..స్త్రీ శక్తి స్వరూపిణీ అనీ, ఆదిశక్తి అనీ భారతదేశంలో భావిస్తారు గదా. అటువంటి పుణ్య భూమిపై ప్రభుత్వాలచేతనే స్త్రీ అవమానించబడి, అగౌరవపరచబడి ప్రవర్తిస్తూంటే..మంత్రులూ, శాసన సభ్యులూ మద్యం వ్యాపారంలో మునిగిపోతే..అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎక్కడ్నుండి ఎక్కడికి పతనమైపోతున్నారు. యింత జరుగుతూంటే ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యమకారులు, నక్సలైట్లు..మహిళాసంఘాలు..ఏంజేస్తున్నాయి. ప్రతిఘటించవలసిన వీరనారి మహిళ కూడా వంద బ్రాండీషాపులను నడుపడానికి సిద్ధపడ్తే…కనీసం సుమోటో కేస్‌గా స్వీకరించన్నా ఏ హైకోర్ట్‌ న్యాయమూర్తయినా ఈ దురాగతాలను ఆపవచ్చుగదా.” అంది క్యాథీ ఆవేశంగా, బాధగా.
”ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే ప్రభుత్వపరమైన అకృత్యాలలో ఇది ఒకటి మాత్రమే క్యాథీ. ఇలాంటి అకృత్యాలు ఇంకెన్నో కోకొల్లలున్నాయి. ఐతే అవి మద్యంవలె నేరుగా ప్రజాసంబంధాన్ని కలిగి ఉన్న వ్యవహారాలు కావు. నైన్త్‌క్లాస్‌, ఊర్మిళ టీచర్‌.. చెబుతుంది, ఆంటీ ఐ లౌయు వంటి బాలల మనసులను విషపూరితంచేసే సినిమాలకు అనుమతి, బ్లూ వెబ్‌సైట్లతో యువతను దోపిడీచేసే ఇంటర్‌నెట్‌ పార్లర్లు, రాత్రి పదకొండున్నర దాటితే మిడ్‌నైట్‌ మాసాలాలతో దాదాపు బూతు ఛానల్స్‌గా మారే అన్నీ టి.వి.ఛానళ్ళు, విచ్చలవిడి క్లబ్బులు, పబ్బులు…యివన్నీ సమాజం శరీరంమీద వెలసిన పుట్టకురుపులే. కేన్సర్‌రోగం బహుముఖీన దిశల్లో ఎంతోవేగంగా విస్తరిస్తోంది. దీనికి అతి త్వరలో భరించలేని నొప్పి కలిగినా సరే ఒక శాశ్వత శస్త్రచికిత్స జరగాలి.” రామం స్థిరంగా, నిశ్చలంగానే అన్నాడు.
ఇద్దరి మధ్య ఒట్టి నిశ్శబ్దం నెలకొంది కాస్సేపు..భాషలేని దుఃఖం ఎప్పుడూ మౌనంగానే పొగిలిపోతుంది.
బయట వర్షం కురుస్తూనే ఉంది.
”చాలా దుఃఖంగా, ఆందోళనగా…వేదనగా ఉంది క్యాథీ..సరే ఒకసారి ఫైనల్‌గా మన ‘జనసేన’ సంస్థాగత నిర్మాణ స్వరూపం, వివిధ అంగాలు, మూల విధానాలు..వీటి గురించి చెప్పు..నన్ను నేను ఒకసారి ట్యూన్‌ చేసుకుంటా చివరగా.. లెట్‌ ద ఫైనల్‌ పిక్చర్‌ ఎమర్జవుట్‌..”అన్నాడు రామం యోగనిద్రలో ఉన్నట్టు.
”యస్‌.. నేనూ అదే అనుకుంటున్నా రామం. మన సంస్థకు శిఖరాయనూనమైనవ్యక్తి సిద్ధాంతకర్త.. ఆయనను మనం ఆచార్య అని పిలుస్తాం. చంద్రగుప్తమౌర్యునికి చాణక్యునివలె, ప్రతాపరుద్రునికి యుగంధర మంత్రివలె, రాయలకు తిమ్మరుసువలె అతనే సంస్థకు అంతిమ మార్గదర్శి. మనకు ఆ స్థానంలో డాక్టర్‌ గోపీనాథ్‌ ఉంటారు. అతను జీవితాంతం ఒక కరుణార్థ్ర హృదయుడైన డాక్టర్‌గా, మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌గా ఆదర్శ జీవితాన్ని జీవించారు. ఎక్కడా మచ్చలేని చరిత్ర అతనిది. సమాజం గురించీ, మానవ సమాజ వికాసం గురించీ ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో ప్రజాసంఘాల్లో చురుకైన పాత్రపోషించారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వం వహించారు. గంభీరమైన వ్యక్తి. ఎంతో దీర్ఘమైన, లోతైన అధ్యయనంచేసి నువ్వే రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనను ఎంపిక చేశావు. మొట్టమొదట అతన్ని వరంగల్లులో కలిసి ఒక రోజంతా విపులంగా చర్చించి.. తర్వాత్తర్వాత దాదాపు ఇరవై రెండుసార్లు గోపీనాథ్‌గారు నీకు కలిశారు. సంస్థయొక్క మానిఫెస్టో రాసేందుకు రెండు దఫాలుగా రెండు నెలలు అమెరికా వచ్చి మనతో గడిపారు. చర్చించారు.. ఆలోచనలను కాగితంపై అక్షరబద్ధం చేశారు. ఐతే ప్రధానంగా మనది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది ఎన్నికల్లో పోటీచేయదు. రాజకీయ అధికారంకోసం ప్రాకులాడదు. కాని అతి శక్తివంతమైన ఒక ప్రజావేదికగా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వచర్యనైనా వాచ్‌ డాగువలె గమనిస్తూ, పరిశీలిస్తూ ఒక ఇన్‌స్పెక్టర్‌వలె ప్రవర్తిస్తుంది. ఈ రకమైన పరిశీలకునిగా మన సంస్థ పనిచేయడానికి మనకున్న అధికారాలేమిటి.. అన్నది ఒక ప్రాథమిక ప్రశ్న…దానికి జవాబేమిటంటే ..భారత రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు. ఈ దేశంలో శాసనబద్ధమైన ఎన్నో హక్కులు, బాధ్యతలు, విధులు, విధానాలూ అన్నీ సక్రమంగానే ఉన్నాయి. తప్పు జరుగుతున్నపుడు ఏ రాజకీయ చర్యనైనా, ఏ నాయకున్నైనా నిలదీసి ప్రశ్నించే అధికారం ప్రతి ఓటర్‌కు, పౌరునికే ఉంది. ఐతే యిప్పుడు ఏ ఓటరూ ఎవర్నీ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే వ్యక్తి ఒంటరిగా బలహీనుడు. నిస్సహాయుడు. ప్రశ్నించడానికి భయపడ్తాడు. యిప్పుడు ప్రశ్నించడం మనిషికి నేర్పి వాడి వెనుక ‘జనసేన’ నిలబడి బలమైన గొంతుతో ప్రశ్నింపజేస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిపనికీ అకౌంటబిలిటీ.. అంటే జవాబుదారీతనం క్రింద ఏ పౌరుడడిగినా సరియైన సమాచారాన్నందించాలని ‘సమాచార చట్టం – 2005’ ఘోషిస్తోంది. అసలు మన ప్రజా ఉద్యమానికి ఈ ఒక్క సమాచార చట్టం దన్ను చాలు. ఇటీజ్‌ ఎ పవర్‌పుల్‌ టూల్‌.. విచీజ్‌ నాటెటాల్‌ యూజ్డ్‌ ప్రాపర్లీ బై ఎనీవన్‌, ఎనీటైం, ఎట్‌ ఎనీ ఇన్‌స్టెన్స్‌. ఉదాహరణకు ఒక యంపీ తనకు వచ్చిన రెండుకోట్ల రూపాయల యంపీ ల్యాడ్స్‌ ఫండ్స్‌ సంగతేమిటి, అవి ఎప్పుడు ఏ విధంగా ఏఏ పనులకు ఖర్చుచేయబడ్డాయో చెప్పమని ఒక ఓటరు..ఒక పౌరుడు యంపీని అడిగితే.. అతను తప్పకుండా వివరాలను కాగితంపై లిఖితపూర్వకంగా చెప్పాలి. చెప్పకపోవడం, చెప్పననడం శాసనోల్లంఘన. ఒక కాంట్రాక్టర్‌ ఓ రోడ్డును వేస్తున్నపుడు దాని ఎస్టిమేటెడ్‌ కాస్ట్‌, అలాటెడ్‌ కాస్ట్‌, నిర్మాణం పూర్తిచేయవలసిన కాలం, ప్రమాణాల వివరాలు ఇతరేతర అమలుచేయవలసిన వివరాలన్నీ ఒక బోర్డుపై రాసిపెట్టి ప్రజల సమాచార నిమిత్తం పనిజరుగుతున్నచోట ఉంచాలి. దాన్ని ధైర్యంగా ఏ పౌరుడు ప్రశ్నించినా కాంట్రాక్టర్‌ సమాధానం చెప్పాలి…కాని యిప్పుడెవరూ ఎక్కడా అటువంటి బోర్డు పెట్టడంలేదు.. ఎవరూ అడగడం లేదు. ఎవడూ ప్రశ్నించడం ఏదు..ప్రశ్నింపబడడమూ లేదు.
అన్నీ ఉల్లంఘనలే. విస్మరణలు దబాయింపులు..బలుపు ఎక్కువైన గుండాలు, అధికారులు, మాఫియాలు అన్నీ కలిసి ప్రజాప్రయోజన చట్టాలను పీకపిసికి ఉల్లంఘించి బహిరంగంగా దౌర్జన్యం చేస్తున్నారు..ప్చ్‌…మనకెందుకులే అని ప్రతి పౌరుడూ లోలోపల ఎంత కుతకుతలాడి కుమిలిపోతున్నా ఎదిరించలేక భయంతో ఎక్కడా ధైర్యం చేసి ప్రశ్నించడం లేదు.
మనిషిని ఒక బలమైన, సజీవమైన బాధ్యతాయుతమైన ప్రశ్నగా మార్చడమే మన ఉద్యమం. మన లక్ష్యం. మన గమ్యం.
మనం ముందే ప్రకటిస్తాం..మనకు వ్యక్తిగతమైన ఆస్తులు లేవని..మున్ముందుకూడా ఉండవని. ఇప్పుడు సమకూర్చుకున్న ఆస్తులనే సంస్థను నడపడానికి నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న వ్యక్తుల పోషణకోసం, నిర్వహణకు మాత్రమే ఖర్చుచేస్తాం. యిక్కడ ప్రజలకు మనం ‘నిస్వార్థం’గా పనిచేస్తున్నామని చాలా విశ్వసనీయంగా చెప్పడమే మన నిజాయితీతో కూడిన ఉద్దేశ్యం. ఎటువంటి ఆడంబరమూలేని అతిసాధారణ జీవితాన్ని గడిపి చూపడం, దిక్కుమాలిన మండలాధ్యకక్షుని స్థాయిలోకూడా గన్‌మెన్‌ను ఫ్యాషన్‌గా పెట్టుకుని అట్టహాసంగా తిరగడం ఒక ఆనవాయితీఐన వర్తమాన సందర్భంలో మనం ఎప్పుడూ ఏ ప్రత్యేక భద్రతనూ అంగీకరించం. ఐతే రేపు మనకు ఎంతమంది అభిమానులూ, అనుచరులూ ఏర్పడ్డా కొంతమంది శత్రువులుకూడా తప్పకుండా తయారవుతారు కాబట్టి రహస్యంగా డేగకళ్ళతో నిన్నూ, నన్నూ, డాక్టర్‌ గోపీనాథ్‌నూ కనుపాపలకంటే పదిలంగా కాపాడే ఒక రహస్య, మనదే ఐన ప్రత్యేక రక్షక దళం ఒకటుంటుంది. అదెప్పుడూ మనవెంటే మనతోనే కదుల్తూంటుంది అదృశ్యంగా…నిరంతరంగా.
ఐతే..ఒక యంత్రంగానీ, ఒక వ్యవస్థగానీ, ఏదీ వంథాతం దక్షత కలిగి ఆదర్శంకానట్టే ఏ వ్యవస్థగానీ పూర్తిగా సున్నా శాతం దక్షతతో, పూర్తిగా నిరర్థకంకూడా కాదు..ఈ కోణంలో ప్రస్తుతం సమాజంలోని చాలామంది జనం ఈ దుర్మార్గ, నీతిహీన రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగి తాగుబోతులుగా, సోమరిపోతులుగా, పనిదొంగలుగా  మారుతున్నారో..ఆ మూలాలను విశ్లేషించుకుంటూ అయ్యో ఈ దుస్థితి నుండి ఎలా బయటపడాలి, ఈ వ్యవస్థ మళ్ళీ ఎలా  ఆరోగ్యదాయకమౌతుంది..అని తపిస్తూ, క్షోభపడ్తూ, నిజాయితీగా, బాధ్యతగా ఆలోచిస్తున్న ఒక వర్గంకూడా సమాజంలో ప్రచ్చన్నంగా ఉంది. వాళ్ళలో స్పృహ ఉంది. స్పందన ఉంది. కసిఉంది. ముందు మనం వాళ్ళను గుర్తించి మనలో కలుపుకోవాలి. లేదా మనమే వాళ్ళలో కలిసిపోవాలి.
ఈ క్రమంలో ముందు నువ్వు యుఎస్‌ఎలో ఉన్నప్పుడూ, నీతో సహ విద్యార్థులుగా నీ తత్వం తెలిసిన వాళ్ళలో ఎనిమిదిమంది మెరికల్లాంటి సహచరులను తయారుచేశావు. తర్వాత అనేక సార్లు ఇండియా వెళ్తు, ఆంధ్రదేశం విస్తృతంగా పర్యటిస్తూ ఒక స్పేడ్‌వర్క్‌వలె డాక్టర్‌ గోపీనాథ్‌గారి సంపర్కంతో మేధోసంపన్నులైన దాదాపు ఋషులవంటి నూటా ఎనభైరెండు మంది రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, రచయితలు, కళాకారులనుండి సీనియర్‌ సిటిజన్లను తయారుచేశారు. వీళ్ళందరూ ఒక్కొకరు ఒక జ్ఞాననిధి. జీవితాన్ని ఎంతో లోతుగా చూచినవాళ్ళు. సమాజంపట్ల అవగాహన కలిగిన వాళ్ళు. స్వాతంత్య్ర పూర్వ కాలంలో భారత సమాజంలో నెలకొని ఉన్న ఉన్నత మానవ విలువలు, అప్పటి నైతిక ఉజ్జ్వలత తెలిసిన వాళ్ళు. వీళ్ళందరూ మన డ్రైవింగు ఫోర్స్‌. కాగా యువతలో సరియైన ఆటిట్యూడ్‌, సమాజంపట్ల బాధ్యత ఉండాలి తప్పకుండా అన్న తత్వంగల దాదాపు ఎనిమిది వందలపైచిలుకు యువకులను మనం వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజిలు, కార్పొరేట్‌విద్యాసంస్థలు. వీటినుంచి ఎంపిక చేశాం. యిది మన కోర్‌ గ్రూప్‌. వీళ్ళందరూ బంగారం లోహం వంటివారు. వీళ్ళకు నువ్వు మన సీనియర్‌ సిటిజన్స్‌ ఫోర్స్‌ను జోడించి లోహాన్ని అగ్ని స్పర్శతో, సుత్తిదెబ్బతో ఆభరణంగా మార్చినట్టు ఒక శక్తివంతమైన మానవ సంపదగా మార్చాలి. తర్వాత వీళ్ళందరూ అతి సాధారణ జనాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఉద్యమంగా చేపడ్తారు. ఈ కార్యమ్రం ఒక అగ్నిజలవలె అంటుకుని విస్తరిస్తున్న థలో నువ్వు మన కార్యాచరణ ప్రణాళికలో అనుకున్నట్టుగా మీడియా..ప్రభుత్వంలో కూడా మనం ఈలోగా గుర్తించగలిగిన నిజాయితీగల ఆఫీసర్స్‌, అధికారులతో కలిసి యిక ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. యింతవరకు ప్రభుత్వ యంత్రాంగంలో ఐఎఎస్‌ స్థాయిలో పూర్తిగా పారదర్శకత, నీతి నిజాయితీ కలిగిన అధికారులు ఒక్క ముప్పదిరెండుమంది మాత్రమే ఉన్నారు. ఎస్పీలు పన్నెండుమంది మాత్రమే. ప్రభుత్వ యంత్రాంగంలో కరప్షన్‌ తారాస్థాయికి చేరిఉంది. ప్రతిరోజూ టి.విలో చూస్తున్నట్టు ఏ ఒక్క పట్టుబడ్డ అధికారిపై దాడిచేస్తేనో కోట్లు దొరుకుతున్నాయి. పట్టుబడకుండా, దాడికి గురికాకుండా తప్పించుకు తిరుగుతున్న లంచగొండి మహానుభావులు దేశంనిండా అన్ని ప్రభుత్వ శాఖల్లో కిక్కిరిసి ఉన్నారు. యిక ప్రక్షాళన ప్రారంభంకావాలి.
ఐతే.. యిక్కడ అతి ప్రధానమైన అంశం స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా ఏ పౌరుడైనా లంచం తీసుకోవడం ‘తప్పు’ అనే స్పృహ లేకపోవడం. ఒకర్ని చూచి ఒకరు ఎటువంటి భయమూ లేక అవకాశముంటే చాలా తెగబడి దోచుకోవడమే. దానికి ప్రజాప్రతినిధుల అండ నిండుగా, దండిగా ఉంది. ఎందుకంటే వీడికి వాడు వానికి వీడు పరస్పరం అండ. ఒక రెసిడెన్షియల్‌ కాలేజి మహిళా ప్రిన్స్‌పాల్‌ లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్తుంది. ఒక మహిళా ఉద్యోగి నకిలీ పోస్టల్‌ స్టాంపులమ్ముతూ పట్టుబడ్తుంది. సరసాదేవి కోట్లకు కోట్లుస్కాం చేసి పట్టుబడ్తుంది. రోడ్లు భవనాల శాఖ క్వాలిటీ కంట్రోల్‌ చేయవలసిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇష్టమొచ్చినట్టు నాసిరకం పనులు చేసినా లక్షలకు లక్షల లంచాలు మెక్కి పెండ్లాం పేర తనే బినామీ కాంట్రాక్టులు చేస్తూ, బార్లు నడుపుతూ పట్టుబడ్తాడు, ఎసిబిలో పనిచేసే ఉద్యోగే అవినీతితో లంచంతీసుకుంటూ దొరికిపోతాడు. హైకోర్టు జడ్జీలు కొందరు మ్యామ్యా తిని ఎవనికైనా బెయిల్‌ మంజూరు చేస్తారు..న్యాయరక్షకులుగా ఉండవలసిన కొందరు జడ్జీలను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని సుప్రీంకోర్టు ఆదేశించిన ఉదంతాలు కోకొల్లలు.. యిన్ని కేసులు ప్రతిదినమూ వెలుగులోకి వస్తూంటే ప్రభుత్వం మొద్దునిదురలో ఉందిగాని..చట్టం తనపని తాను చేసుకుపోతుందనే బుద్దిహీనమైన ఒక మాట చెప్పడం తప్పితే ఎప్పుడూ కఠినమైన క్రమశిక్షణాచర్యలు చేపట్టిన ఉదంతాలు లేనేలేవు. ఈ ఉదాసీనత వల్ల.. ప్రభుత్వంకూడా ఈ లంచగొండితనంలో భాగం కావడంవల్ల వ్యవస్థ అంతా నిర్వీర్యమై, అసమర్థమై, ఒట్టి శవప్రాయమై మిగిలిపోయింది. ఈరకంగా పట్టుబడ్డ వాళ్ళంతా తర్వాతర్వాత గుట్టుచప్పుడు కాకుండా మళ్ళీ విధుల్లోచేరి ఏరియర్స్‌తో సహా జీతాలను పొంది మళ్ళీ మళ్ళీ లంచాలు మెక్కుతున్నారు. అలా మళ్ళీ విధుల్లోచేరి తిరిగి రేచుకుక్కల్లా ఎగబడి దోచుకుతింటున్నవాళ్ళ వివరాలు తెలిస్తే గుండెలవిసిపోతాయి. యంత్రాంగమంతా పూర్తిగా చెదలుపట్టిపోయింది రామం.. ప్రజాధనమంతా ఈ పందికొక్కులపాలై వ్యవస్థ రోగగ్రస్తమైంది. యుద్ధప్రాతిపదికన ఈ అవినీతినీ, లంచగొండితనాన్నీ
రూపుమాపేందుకు ఒక ఉద్యమాన్ని అత్యవసరంగా నిర్మించాలి. ప్రభుత్వాలకు ఫండ్స్‌ ఎక్కడినుండి ఎన్నివచ్చినా దొంగలు దొంగలు పంచుకుని దండుకున్నట్టే మరుక్షణంలో మటుమాయం..ఇలా ఐతే ఎలా అని బుద్ది జీవులందరూ హడలిపోయి అవాక్కయిపోతున్నారు. లక్షలకోట్ల రూపాయలను ప్రపంచబ్యాంక్‌, ఐఎమ్‌ఎఫ్‌ వంటి సంస్థలనుండి అనేకానేక అభివృద్ధి పనులకోసమని అప్పుచేసి వాటాల వారిగా పంచుకోవడమే నిస్సిగుగా అర్థంచేసుకుంటూనే.. దేశాన్నంతా పర్యటిస్తూ ప్రజల స్థితిగతులను అధ్యయనం చేస్తున్న రాహుల్‌గాంధీకూడా ఒక సందర్భంలో ఈ దరిద్రపు లంచగొండితనపు తీవ్రతను గ్రహించి ప్రభుత్వ పథకాలనుండి ఒక రూపాయి విడుదలైతే అది ఐదు పైసలుగా లబ్దిదారులకు చేరుతోందని వాపోయాడు. ఇది ఈనాటి అడ్డూ అదుపూ లేని అవినీతి సామ్రాజ్యపు ముఖచిత్రం. యిక చదువుకున్న పౌరులు చేస్తున్న అకృత్యాలకైతే లెక్కేలేదు. ఎవడైనా టాక్స్‌లు ఎగ్గొట్టేవాడే. ప్రభుత్వరూల్స్‌లో ఉండే లొసుగులను వాడుకుని బొక్కసాన్ని ఖాళీచేసేవాడే. వ్యాపారాల్లో నిస్సిగ్గుగా ప్రభుత్వాన్నీ, ప్రజలనూ దగా చేసేవాడే. దేశంలో వాటర్‌ప్రైస్‌ కూపర్‌వంటి అంతర్జాతీయ ఆడిటర్ల నుండి మొదలుపెడ్తే స్థానిక ఆడిటర్లందరూ ప్రభుత్వ అధికారులకు బ్రోకర్లే తప్ప నిజాయితీగా లెక్కలను అప్పజెప్పేవారేలేరు. ‘ఆరోగ్యశ్రీ’ వంటి పథకాలద్వారా డాక్టర్లందరూ ప్రజాధనాన్ని భోంచేసేవారే.. వీడు వాడని, స్త్రీ పురుషుడని తేడా లేకుండా దేశాన్ని ప్రతివాడూ దోచుకుతినడమే. ఇదొక విరాట్‌స్వరూపమై వికృత విలయతాండవం చేస్తోంది. దీన్ని అర్జంటుగా అరికట్టాలి. ఫస్ట్‌ ప్రయారిటీ మనకిదే.” క్యాథీ చెబుతున్నప్పుడు గొంతులో ఆవేశం, బాధ, దుఃఖం..అన్నీ కలగలిసి ఆదోరకమైన జీర స్పష్టంగావినబడ్తోంది..పాపం, పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయి గిలగిల్లాడుతున్న భారత వ్యవస్థపట్ల వేదన ధ్వనిస్తోందామెలో.
రామం అన్నాడు..”నువ్వన్నట్టు యిది ఒక మహాపర్వతంలా పెరిగి వ్యాపించిన రుగ్మత క్యాథీ.. దీన్ని తెలుసుకుని నిర్మూలించేందుకు ఒక సుళువైన మార్గముంది..యిక్కడ ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు జవాబుదారీ ఐన ప్రభుత్వ ప్రతినిధి.. ప్రజాప్రతినిధి అంటే ప్రజలపక్షాన ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులనూ న్యాయంకోసం, ప్రజావసరాలకోసం ప్రశ్నించి ప్రజోపయోగమైన సంక్షేమ కార్యక్రమాలను చేయించవలసినవాడు. ఈ రెండు వ్యవస్థలూ ఇంటర్‌ డిపెండెంట్‌గా కలిసి ముందుకు సాగాలి న్యాయంగా ఒకరిని ఒకరు చెక్‌ చేసుకుంటూ ప్రజల ప్రగతికోసం పాటుబడాలి. కాని వాస్తవంలో అలాకాకుండా ఈ ఇద్దరూ ఇద్దరు కుమ్మక్కయిన దొంగల్లా కంచే భూమీ ఒకటై చేనును తిన్నట్టు తెగబడ్డారు. ది ఈజీ ఫార్ములా ఈజ్‌.. ఒక వ్యక్తి.. ఒక ప్రభుత్వ అధికారి లేదా ఒక ప్రజా ప్రతినిధి, లేదా ఒక ఆడిటర్‌, డాక్టర్‌, ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఉద్యోగి వంటి వ్యక్తి..వీళ్ళ ఒక పదిసంవత్సరాల కాలాన్ని తీసుకుని..మొదట్లో వాళ్ళ ఆస్తిపాస్తులెన్ని..వీళ్ళు ప్రతిసంవత్సరం ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సబ్‌మిట్‌ చేస్తున్న రిటర్న్‌లో ఎంత ఆదాయం చూపుతున్నారు..ప్రస్తుతం వీళ్ళ దగ్గర అనధికారికంగా పోగుపడ్డ ఆస్తుల విలువెంత..వీటి తేడాఎంత..ఆ తేడాను ప్రభుత్వం ఏక్షణాన్నైనా స్వాధీనం చేసుకోవచ్చు.. అని అనుకుంటే.. యిక ఆలోచించు..ఎన్ని..ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బైటికొస్తాయో. ప్రభుత్వం నిజాయితీగా ఉండి జనానికి..ఐచ్ఛికంగా మీరే మీ నల్లడబ్బును డిక్లేర్‌ చేయండి లేకుంటే కఠినాతి కఠినమైన శిక్ష ఉంటుందని ఒకరోజును డెడ్‌లైన్‌గా ప్రకటిస్తే బయటికొచ్చే డబ్బుతో ఈ దేశపు రోడ్లన్నీ నిండిపోతాయి. డబ్బు వెల్లువై పారుతుంది. ఐతే ఇది సాధ్యంకాదు. దీన్నే మనం సాధ్యం చేయాలి. ఏ పొలిటికల్‌ గవర్నమెంట్‌కూడా ఈ రకంగా ప్రవర్తించదు. ఎందుకంటే యిక్కడి రాజకీయవ్యవస్థ ‘ఇంటర్‌ డిపెండెంట్‌’. ముఖ్యమంత్రిని పార్టీ నామినేట్‌ చేస్తుంది. ప్రధానమంత్రిని పార్టీ నియమిస్తుంది. పార్టీ ఎమ్యెల్యేలను, ఎంపీలను తృప్తిపర్చేందుకు దిక్కుమాలిన సహాయాలపేరుతో దోపిడీకి పర్మిషనిస్తుంది. యిక విషప్రవాహం ప్రారంభమై దేశాన్ని ముంచెత్తుతుంది. అందుకే కీలక పదవులకు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రివంటి స్థానాలకు ప్రజలచే ప్రత్యక్షెన్నిక జరిగితే వెనుకఉండి కీలుబొమ్మను ఆడించే తరహా రాజకీయాలుండవు. స్థిరత్వముంటుంది. దేశగతి అటో ఇటో తేలిపోతుంది”. అని సాలోచనగా ఓ క్షణమాగి..”చూద్దాం..మనమేమి చేయగలమో..” అన్నాడు.
”ఇంకో విషయముంది రామం..అమెరికానుండి మొదలుకొని ఏ యితర దేశాల న్యూస్‌ ఛానల్స్‌నైనా గమనించు.. కొద్ది రాజకీయాలు ఉంటాయి. మిగతా అంతా రిపోర్టింగు ఉంటుంది. ఎడ్యూకేటివ్‌ ప్రసారాలు ఉంటాయి తప్ప.. ఈ తెలుగు ఛానల్స్‌లో ఉన్నట్టు ఇరవై నాల్గుగంటలు రాజకీయాలే ఉండవు. మీడియా కూడా అనవసరంగా పొద్దస్తమానం కుక్కల కొట్లాటను తలపించే చర్చలపేరుతో, వేదికలపేరుతో, ప్రతిస్పందనలపేరుతో, లైవ్‌ టెలికాస్ట్‌పేరుతో రాజకీయాలు..రాజకీయాలు. రాజకీయాలగురించే ఊదరగొట్టీ అదరగొట్టే ప్రజాజీవితాలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే దిశలో శక్తివంతమైన మీడియా ప్రయత్నంచేయడంలేదు సరికదా అనవసరంగా మామూలు జనజీవితాల్లోకి చొరబడి మానసిక అనారోగ్యకారకాలైన ప్రసారాలతో కాలుష్యం స్పష్టిస్తోంది.. ఒకసారి మీడియాతో జనం తరపున మాట్లాడి బ్రహ్మస్త్రాన్ని బ్రహ్మస్తంగానే వాడాలన్న స్పృహను కల్గించవలసిన అవసరముంది. లేకుంటే ప్రజోపయోగమైన న్యూస్‌ ఛానల్‌ ఎలా ఉండాలో చూపించేందుకు ఒక నమూనాగా మనమే ఒక వార్త ఛానల్‌ను ప్రారంభించాలి.. అది అవసరమేమో అనిపిస్తోంది.” అంది క్యాథీ.
”ఔను..”
”ఇక మన ఈనాటి సమావేశం ముగింపుకొచ్చింది రామం..ఈ సందర్భంగా రెండు ముఖ్య విషయాలు..ఒక మేనేజ్‌మెంట్‌ వ్యక్తిగా చెప్పాలి..”అంది క్యాథీ గంభీరంగా..కొద్దిగా ప్రకంపిస్తూ పూర్తిగా వ్యక్తిగతమైన సంస్పందనతో.
”చెప్పు క్యాథీ..”
”ఎందుకు కలిశామో మనం తెలియదు. ఈ భూమిపై ఎక్కడెక్కడో భిన్న ఖండాల్లో జన్మించిన మనం చాలా యాదృచ్ఛికంగా తటస్థపడి ఒకరి హృదయాన్ని ఒకరం అర్థం చేసుకుంటూ ఏకరీతి ఆలోచనా ధోరణివల్ల..బహుశా అనుకుంటూ..మార్క్స్‌ అండ్‌ ఎంగెల్స్‌ వలె..సన్నిహితమై, ఒకరికోసమొకరిమై, ఇద్దరమూ ఒకరేమోకూడా ఐ ప్రేయసీ ప్రియుడు, భార్యాభర్త, స్నేహితులు, ఆత్మీయులు, ఆత్మబంధువులువంటి పదనిర్వచనాలన్నింటికీ అతీతంగా ఎదిగి ఒక అపూర్వబంధంలో ఒదిగి జీవితాన్ని ఓ మహత్తర అనుభవంగా మలచుచున్నాం..ఐతే దీనికి సామాజిక నియమాల అంగీకారం లేదు. ఉండదు. నా దృష్టిలో అవసరంకూడా లేదు. యిది కేవలం నీకూ, నాకూ మాత్రమే సంబంధించిన హృదయానుగత బాంధవ్యం. దాన్ని మనం ఎంత పవిత్రంగాపదిలంగా కాపాడుకుంటాం, పరిరక్షించుకుంటాం అనేది మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. నా తరపున సహజమైన స్త్రీ సహనశీలతతో భూమిలా నేను ప్రవర్తిస్తా. నువ్వు విశాల హృదయంతో భూమినికూడా రక్షణకవచంలా అవరించిఉండే ఆకాశంలా నన్ను నీలో దాచుకోవాలి. నిజానికి పంచభూతాత్మకమైన ఈ చరాచర విశ్వంలో స్థూలంగా భూమీ, ఆకాశం వేర్వేరు కావచ్చు.. కాని సూక్ష్మంగా అవన్నీ ఒకటే.. అదే జీవితం..”
”……” శూన్యంగా ఆమెవంక చూస్తున్నాడు రామం.
”……” ఆమెకూడా శూన్యంగానే అతన్ని చూస్తోంది
‘పూర్ణమదః పూర్ణమిదః’.. ఎక్కడ్నో యిద్దరి ఆత్మల్లో ధ్వనిస్తోంది.
కలయిక నిమిత్తం..జీవితం సత్యం.
నడవడం సత్యం..దూరం మిథ్య
ఉదయం జననం..అస్తమయం మరణం
విచ్ఛిత్తి, సమ్మేళనం..స్థిరఅస్థిరాలు..అన్నీ జీవవ్యాపారాలు
విముక్తి అంతిమం.
”క్యాథీ నువ్వు ఆత్మవు..నేను శరీరాన్ని” అన్నాడు రామం.
”నాకు తెలుసు..కాని నీ నోట వినాలని పిచ్చికోరిక”
వర్షం బయట ఇంకా కురుస్తూనే ఉంది. ఫెళాఫెళార్భటులతో ఎక్కడో చటుక్కున పిడుగు పడింది. ఉలిక్కిపడ్డారిద్దరూ.
క్యాథీ బ్రీఫ్‌కేసును సర్దుకుని..లేచి నిలబడి..టైం చూచుకుంది.
పదీ పది.
”సి యు.. సి యు రామం” బయటికి నడిచిందామె.
యిక ఈ గదినుండి వెలుగు నిష్క్రమిస్తోంది..తర్వాతంతా ఒక వెలితి విస్తరిస్తుంది అనుకున్నాడు. కాని బయటికేమీ అనలేదు. నిండుగా, లిప్తంగా నవ్వాడు.
ఆమె చినుకుల్లో గబగబా నడచి వెళ్లి తన ఆడి కార్లో కూర్చుని స్టార్ట్‌ చేసింది.
కారు కదుల్తూండగా..రామం చేయూపాడు. కాని అది ఆమెకు కనిపించలేదు. వర్షం చినుకులు అడ్డొచ్చాయి.
కారు వీధిమలుపు తిరుగుతూండగా..రిక్తమైన హృదయంతో నిట్టూర్చి..ఎందుకో కళ్ళనిండా నిండిన సన్నటి నీటిపొరను స్పృహించకుండానే..ఆమె మనసునిండా పరుచుకున్న రామం స్మరణలో నిమీలితయై ఎక్కడనుండో..అంతరాంతరంగాల్లోకి వినిపిస్తున్నట్టుగా.,
‘రామం నిశాచర వినాశకరం..’
కారు వేగంగా ఫ్రెడరిక్‌ రోడ్‌పై ఇంటర్‌స్టేట్‌ 249పై వెళ్తూ వేగాన్నందుకుంది.

***

(సశేషం)

ramachandramouli–రామా చంద్రమౌళి

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 8 వ భాగం

( గత వారం తరువాయి)

8

9

కతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం క్యూఆర్‌ 51లో..మొదటి తరగతి విశాలమైన, సౌకర్యవంతమైన క్యాబిన్‌లో..కుర్చీని బెడ్‌వలె అడ్జస్ట్‌ చేసుకుని..వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని గంభీరంగా అలా మౌనంగా, ధ్యానంలో సమాధి ఐపోయిన స్థితిలో అలా ఒరిగి.,
లీల మనసులో ఒక గర్జిస్తున్న సముద్రముంది.
దూసుకుపోతున్న విమానం కింద ప్రళయిస్తున్న అట్లాంటిక్‌ మహాసముద్రముంది.
ఏ మహా సముద్రమైనా మనిషి హృదయంకంటే విశాలమైంది కాదు..లోతైందీకాదు అని తన అభిమాన కవి రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ చెప్పిన కవిత్వపాదాలు స్ఫురించాయెందుకో అప్పుడామెకు.
తను గాయపడిందా…పడితే ఎందువల్ల..రామం వల్లనా.
అసలు రామం తనను ఏమీ అనలేదు కదా.
అతను తనను ఏమీ అనకపోవడమే గాయపర్చడమేమో..అప్రత్యక్షంగా తను అతన్నుండి ఒక రసస్పర్శనూ, రవ్వంత  ప్రేమనూ, ఓ అనునయింపునూ కోరుకుంటోందా. కోరుకోకుంటే అతని స్మరణరాగానే మనసు ఎందుకింత శూన్యంగా మారి ఎడారి తుఫానులా సుళ్ళు తిరుగుతూ క్షోభిస్తోంది.
ఆమెకు చటుక్కున ఒడ్డునపడి గిలగిలా తన్నుకుంటున్న చేప జ్ఞాపకమొచ్చింది. తన స్థితి యిప్పుడదేనా. రామం విషయం రాగానే తను సాధించిన అపూర్వ విజయాలు, డబ్బు దర్పం, అహం…అన్నీ ఎక్కడివక్కడ మటుమాయమైపోయి.. ఒట్టి బేలగా, నిస్సహాయంగా అతి సాధారణ స్త్రీగా కుమిలిపోతోందెందుకు..ఏమిటీ అనిమిత్తత.
‘లెర్న్‌ టు బి సైలెంట్‌
లెట్‌ యువర్‌ ్వయట్‌ మైండ్‌
విజన్‌ అండ్‌ అబ్జార్బ్‌..’అని పైథాగరస్‌ నిశ్శబ్దం గురించి ఎంత అద్బుతంగా చెప్పాడు. ప్రతిరోజు ఆరువేల ఆలోచనలు చేసే మనిషి మెదడు రెండు ఆలోచనల నడుమ ఖాళీ లేకుండా సాగుతూ నిరంతరం సముద్ర కెరటాలవలె మనిషిని బాదుతూఉంటే నూతన మేధో జవసత్వాలను పొందేందుకు సాధ్యమైనంత ధ్యాన నిశ్శబ్ధాన్ని పాటించి ఉత్తేజాన్ని సాధించమని పాస్కల్‌ చెప్పాడు.
నిశ్శబ్దం.. నిశ్శబ్దం.,
చాలాసేపటినుండి లీల నిశ్శబ్దంగా ఉంది..కళ్ళుమూసుకుని. తనకు రామం అర్థం కావడంలేదా..లేక రామం గురించి అర్థం కావడం లేదా. ఆత్మసంబంధం అనేది భగవంతుని గురించి తెలుసుకోవడానికీ, భగవంతున్ని తెలుసుకోవడానికీ మధ్య ఉన్న తేడా అనికదా మహాత్మాగాంధీ చెప్పింది.
తనకు రామం గురించి తెలియడం లేదా..అసలు రామమే తెవియడం లేదా.
ఒక్క విమానం వేగంగా వెళ్తున్న శృతివంటి మోత తప్పితే విమానంలో అంతా బహుప్రశాంతంగా ఉంది. కొద్ది చలిగాకూడా ఉంది. తను గాడ నిద్రలో ఉందనుకుందేమో ఏర్‌ హోస్టెస్‌  అలికిడి లేకుండా మెల్లగా వచ్చి సుతారంగా పైనున్న పింక్‌కలర్‌ ఊలు శాలువాను మెడల వరకు సర్థి వెనక్కి వెళ్ళిపోవడం లీలకు లీలామాత్రంగా తెలుస్తోంది.
అరగంట క్రితం కొద్దిగా…అరపెగ్గు..సోడాతో కలపి సిప్‌ చేసిన గ్రీన్‌ లేబుల్‌ విస్కీ..ఎక్కడో గుండెల్లో నీలిమంటలా వ్యాపిస్తోంది.
మంట..మంట..మంట కనిపించకుండానే..అదృశ్యంగా ఉంటూనే కూడా మనిషిని దహిస్తుందికదా.
అన్నీ జ్ఞాపకమొస్తున్నాయి ఆక్షణం లీలకు ఎందుకో..లోలోపల ఎక్కడో వడగళ్ళవాన కురుస్తున్నట్టు
నిర్మల..ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తన నెట్‌వర్క్‌..దాదాపు ఎనభై ఎనిమిదిమంది సుశిక్షితులైన సైనికులవంటి ప్రజ్ఞావంతులైన తన అనుచరులు..సాధారణ వ్యక్తులనెవ్వరికీ సాధ్యంకాని వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్‌..ఎందరెందరో ఎన్నెన్ని రంగాలకో చెందిన క్లెయింట్స్‌…ఒక చూపుతో ఏ కార్పొరేట్‌ సంస్థనైనా తన పాదాక్రాంతం చేసుకోగల ప్రతిభ.. గుప్తంగా తనపై దాడికి ప్రయత్నించే శత్రువర్గం..తన రక్షణను నిరంతరం పర్యవేక్షించే తన రహస్య సెక్యూరిటీ..నెలకు దాదాపు ఆరుకోట్ల రూపాయల ఖర్చుతో మనగలిగే తన సిబ్బంది..అంతా వర్చువల్‌..అంతిమంగా వర్చువల్‌ రియాలిటీ.
” యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌..”విమానంలో ప్రకటన ప్రారంభమైంది.
ఇంకో పావుగంటలో విమానం డిస్టినేషన్‌..వాషింగ్టన్‌ డి.సి. డల్లెస్‌ ఏర్‌పోర్ట్‌లో దిగబోతోంది…అదీ సారాంశం.  మెల్లగా కనురెప్పలను విప్పి..ప్రశాంతంగానే.. ఒంటిపైనున్న శాలువాను సరిచేసుకుని..నెమ్మదిగా లాప్‌టాప్‌ను ఒళ్ళోపెట్టుకుని బూట్‌చేసి.. మెయిల్‌ తెరిచింది.
నిర్మలనుండి మూడు మెసేజెసున్నాయి.
ఒకటి..యిదివరకు చెప్పిందే..అన్నెపోలిస్‌ దగ్గరి లోఎస్‌ ఫైవ్‌స్టార్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో తొంభై ఒకటో నంబర్‌ డీలక్స్‌ కింగు సూట్‌ ఏర్పాటు.
తమ మేరీల్యాండ్‌ అపరేటర్‌, డిల్లయిట్‌ కంపెనీ లావాదేవీలు చూచే రాబర్ట్‌ కోవె ఏర్‌పోర్ట్‌కొచ్చి రిసీవ్‌ చేసుకుంటాడని రెండవది.
రాబర్ట్‌కు తెలియకుండా సెక్యూరిటీని ఇన్‌విజిబుల్‌ మోడ్‌లో మెక్సికన్‌ టీంకు చెందిన ముగాబే చూసుకుంటాడనీ, ఒక పావుగంటతర్వాత ముగాబే ఎక్స్‌ఎక్స్‌ఫైల్‌ టు టు నంబర్‌తో కాంటాక్ట్‌లోకొస్తాడని సూచన.. మూడవది.
ఈ మెసేజెస్‌తో నిర్మల స్కిప్పయిపోతోంది. తననుండి యిక ఆమెకు సెలవు. ఆమె డ్యూటీ ఐపోతుంది. గంట విరామం తర్వాత ఢిల్లీనుండి అఫ్జల్‌ తన సర్వీస్‌ గురించి డ్యూటీలోకొస్తాడు.
చటుక్కున దోహానుండి తను బయల్దేరుతున్నప్పుడు మెక్సికన్‌…కంపెనీ మనుషుల నుండి తనకు ప్రమాదంఉందని నిర్మల చేసిన హెచ్చరిక  జ్ఞాపకమొచ్చింది.
నవ్వుకుని..మళ్ళీ మెయిల్‌లోకి చూచింది. అరగంట క్రితం తను రామంకు చేసిన మెయిల్‌కు జవాబేమైనా వచ్చిందా అని వెదుకులాట..ఎదురుచూపు. ఆమె ఊహించినట్టుగానే రామం నుండి జవాబులేదు. రాదని ఆమెకు తెలుసు.
ఎందుకో ఆమెకు క్యాథీ జ్ఞాపకమొచ్చింది.
తామిద్దరిదీ ఒకటే వయసు..ఇద్దరూ అసాధారణ ప్రజ్ఞావంతులే. ఇద్దరూ డిస్టింక్షన్‌లో ప్రంపంచలోనే ప్రసిద్ధిచెందిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లోనుండి ఎంబిఎ పట్టాలు పొందినవాళ్ళే..ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అందగత్తెలే. ఇద్దరూ దైర్యశాలులుకూడా. నిశ్శబ్దంగా వ్యూహాత్మక కదలికలతో జీవితాన్ని చదరంగం ఆటలా కొనసాగించగల ప్రతిభాశీలులు.. కాగా డబ్బుక్కూడా కొదువలేని సంపన్నులే ప్రస్తుతం.
ఐతే క్యాథీ తనకు పోటీయా.. తనకు స్నేహితురాలా..తనకు శత్రువా..ఆమె తన దారికి ఒక అడ్డంకా..లేక ఏమీ కాదా..?
విమానం ఆగి..కారియర్‌ బస్‌ వచ్చి షంట్‌ఐ..విమానంలోని జనం, కదలికల్తో సంచలనం మొదలై ఫస్ట్‌క్లాస్‌లో ఉన్నదే యిద్దరు ప్రయాణీకులు. తను, యింకో అమెరికన్‌ కాన్సలేట్‌ ఆఫీస్‌ ఉద్యోగి. హాస్టెస్‌ వచ్చి ఎదుట వినమ్రంగా నిలబడి..’వెల్‌కం మేం’ అంది బస్‌లోకి..యిద్దరు ప్రవేశించగానే కదిలి.. రెండు నిముషాల్లో ఏర్‌పోర్ట్‌ చేరి..ఇమ్రిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి ఎవరో ఎదురొచ్చి ఫింగర్‌ ప్రింట్‌, ఐ బాల్‌ ఫోటోగ్రాఫింగు..అంతా ఓ ఐదునిమిషాల్లో కానిచ్చి.
డబ్బు..డబ్బు..డబ్బుతో హోదా..హోదాతో గౌరవం..గౌరవంతో మనిషిలో పొంగే ఉత్తేజం, ఉత్సాహం..దర్పం.. అహం…పర్వతం దగ్గరికి మనిషి …మనిషి దగ్గరికే పర్వతం.. అదీ తంతు,
బయటికి నడిచింది లీల.
ఎగ్జిట్‌ దగ్గర రాబర్ట్‌ కోవె రెడీగా ఉన్నాడు. తెల్లనివాడు, రాగి వెంట్రుకలవాడు. వినయము ఉట్టిపడువాడు..తమ భృత్యుడు
”వెల్‌కం మేం..”చేతుల్లో ఓ పెద్ద అందమైన పుష్పగుచ్ఛం,
”థ్యాంక్యూ”
సరిగ్గా అప్పుడే కనిపించాడు…మెరుపులా…అప్పుడెప్పుడో బాగ్దాద్‌లో మెక్సికోకు చెందిన జెన్‌రోవర్‌ కంపెనీ బిడ్‌ ఆఫర్‌ దగ్గర ఓ లిప్తకాలం చూచిన ఓ ముఖం..నల్లనిది. క్రూరమైంది…వికృతమైంది.
కార్పోరేట్‌ ప్రపంచంలో కత్తిమొనపై జీవించే ప్రతి ఉన్నత వ్యక్తి అనుక్షణం డేగకళ్ళతో పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగుతాడు అనుక్షణం…రక్షణ.. ఆత్మరక్షణ..ప్రాణరక్షణ లేకుంటే ప్రాణహరణ.
ప్రాణం కోల్పోవడానికీ, ప్రాణం తీయడానికీ నడుమ తేడా ఒక సన్నని కంటికి కన్పించని గీత .. అది ఎప్పుడు చెదిరిపోతుందో ఎవరికీ తెలియదు.
ఆ నల్లని ముఖం కన్పించిన మరుక్షణమే ఆమె సెల్‌ఫోన్‌లో ఓ ఎస్సెమ్మెస్‌ ప్రత్యక్షమైంది. þþ522 నంబర్‌. నల్లని ముఖాన్ని తోసుకుంటూ వెళ్తున్నట్టే ఇద్దరు దృఢమైన వ్యక్తులు వాని పైపైకి చొచ్చుకొస్తూ.. ఓవర్‌ ర్యాపింగు.
రెండు క్షణాల్లో స్పెషల్‌ ఎగ్జిట్‌ దగ్గర సుతిమెత్తగా నల్లని పొడవాటి ఇరవైరెండు ఫీట్ల బెంజ్‌  లిమో కారు వచ్చి ఆగింది. రాబర్ట్‌ వినయంగా ఒక తెరుచుకుంటున్న డోర్‌ వద్ద నిలబడి స్వాగతించి..లీల లోనికి ఎక్కగానే..మెరుపు వేగంతో తనూ ఎక్కి.. కారు మెరుపులా కదిలి.
లిమో కారును చూస్తూ చుట్టూ ఉన్న జనం..కొద్దిగా షాక్‌ ఔతూండగా.,ఐదు నిముషాల్లో..లిమోలో రాబర్ట్‌ కాన్ఫరెన్సింగు ప్రారంభించాడు.
గత రెండు నెలలుగా డిల్లయిట్‌ కంపెనీతో జరిపిన లావాదేవీలు, ఐబియంతో వాల్‌మార్ట్స్‌ సప్లయ్‌ చెయిన్‌ ప్రాజెక్ట్‌ విషయాలు, నాసాతో ఉన్న మోస్ట్‌ కాన్ఫిడెన్షియల్‌ ఆపరేషన్స్‌..కొత్తగా డిఫెన్స్‌ ఆపరేషన్స్‌కు సంబంధించిన మిలియన్‌ డాలర్ల ప్రాజెక్ట్‌ ప్రయత్నాలు, రిట్జ్‌-కార్టన్‌ హోటల్‌ కంపెనీతో ఒప్పందాలు..చెప్పుకుపోతున్నాడు.
లీల కళ్ళు మూసుకుని మౌనంగా వింటోంది.
మాట్లాడ్తున్నప్పటికంటే మాట్లాడవలసినప్పుడు మాట్లాడకుండా మనిషి పాటించే మౌనం ఎదుటి మనిషిని భయంకరంగా భయపెడ్తుంది. ఆ విషయం లీలకు తెలుసు.
లిమో కార్‌ ఇంటర్‌స్టేట్‌ 395 ద్వారా జోహాన్సన్‌ హైవేపై నుండి పరోల్‌ దిక్కు పరుగెడ్తోంది. మూడు సంవత్సరాలు తను అమెరికాలో ఉన్నప్పుడు ఎంతో సుపరిచితమైన రోడ్లే అవన్నీ. ఎదురుగా స్క్రీన్‌పై జిపియస్‌ రూట్‌ మ్యాప్‌ కదుత్తోంది.. సరిగ్గా యిరవై ఎనిమిది నిముషాల తర్వాత బెంజ్‌ లిమో హోటల్‌ లోయిస్‌ విశాలమైన అవరణలోకి ప్రవేశించింది.
కారుడోర్‌ తెరుచుకోగానే డ్రైవర్‌, రాబర్ట్‌..ఇద్దరూ తలపంకించి వినయంగా నిలబడి ఉండగా లీల దిగి..రిసిప్షన్‌ కౌంటర్‌ వైపు నడుస్తూండగా..
ఆమె మొబైల్‌ ఫోన్‌ మ్రోగింది.
స్క్రీన్‌పై రామం నంబర్‌.
అప్పటినుండీ ఒక మృత వాహకంగా ఉన్న రాగితీగలోకి చటుక్కున విద్యుత్తు ప్రవేశించనట్లయి.. ఆమె ముఖం వేయి వాట్స్‌ బల్బులా వెలిగి…
”హలో రామం” అంది చిన్నపిల్లలా..హుషారుగా..అప్పుడే రెక్కలు మొలిచి మొట్టమొదటిసారి ఎగుర్తున్న పక్షిపిల్లలా.
అట్నుంచి రామం ”హలో..”అన్నాడు.

(సశేషం)

–రామా చంద్రమౌళి

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 7 వ భాగం

(గత వారం తరువాయి)

7

బయట వర్షం కురుస్తూనే ఉంది…ఎడతెగకుండా
రామం గబగబా వచ్చి ఎప్పట్నుండో బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌ బుక్స్‌లో ఎదురుచూస్తున్న క్యాథీ ఎదురుగా కూర్చుని.. ”ఎక్స్‌ట్రీమ్లీ సారీ…ఫర్‌ లేట్‌..”అని గొడుగును ప్రక్కన డస్ట్‌బిన్‌పైపెట్టి.. అమె ముఖంలోకి చూచి.,
”ఎగ్జిక్యూటివ్స్‌ ఎప్పుడూ సమయపాలన చేస్తారుగదా” అంది..అని ”ఎప్పుడో కాఫీ చెప్పా..అరగంటయింది. తెస్తానుండు” అని లేచి కాఫీ కౌంటర్‌వద్దకు నడిచిపోయింది.

క్యాథీని చూస్తే వర్తమాన తరంలో సాధారణ అమెరికన్‌ యువతులు చేసే వెర్రిమొర్రి లక్షణాలేవీ కన్పించవెప్పుడూ. రోజురోజూకూ ప్రపంచవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్న విషసంస్కృతికి కొనసాగింపుగా అమెరికన్‌ విద్యార్థుల్లో కూడా విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. శరీరాన్ని గరిష్టంగా బహిరంగపర్చే వస్త్రధారణ…అసలు ఒంటిపై వస్త్రాలే లేనట్టు..బికినీకంటే కొద్డిగా మెరుగైన కురుచ నిక్కర్‌, పైన ఒక బ్రాను తలపించే అప్పర్‌.. మిగతా అంతా బహిరంగమే. ఎండాకాలమైతే మరీ నగ్నవిహారం. ఒంటిపై టట్టూలు శరీరంపై అక్కఅక్కడా  మెరిసే హాంగింగ్సు, ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నఖ సౌందర్యం., ఐతే ఇదంతా విద్యావిషయంగా ఉండవలసినంత శ్రద్దలేని ఎక్కువమంది స్థానిక అమెరికన్లలో. మరీ హద్దులు మీరి నల్ల అమెరికన్‌ యువతలో, ఎందుకో వీళ్ళలో చదువుపట్ల సహజంగానే ఆసక్తి తక్కువ. పాఠశాలలోకూడా విద్యా విషయక అంశాలకంటే నాన్‌ కర్రికులర్‌ యాక్టివిటీస్‌…పెయింటింగు, ఫీల్డ్‌ విజిట్స్‌, లెర్నింగు త్రూ లైబ్రరీ, అర్ట్‌ అండ్‌ మ్యూజిక్‌, వాచ్‌ అండ్‌ లెర్న్‌ విధానాలే ఎక్కువ. ఎకడమిక్‌ పాఠ్యాంశాల సాంద్రత, లోతు తక్కువ. తను పరిశీలించినంతవరకు యిక్కడ తయారవుతున్న విద్యార్థుల్లో ఎనభైశాతం సగటుకన్నా తక్కువ ప్రమాణాలు, మిగతావాళ్ళలో ఐదు నుండి పదిశాతం నాణ్యమైన పిల్లలు కనిపిస్తున్నారు. వీళ్ళది స్లో అండ్‌ స్టడీ ప్రాసెస్‌. భారతదేశంలో క్విక్‌ అండ్‌ రన్‌ విధానం. అమెరికా జనాభాలో ఒక శాతం ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల్లో బాలలు యిక్కడి అనేక విద్యా విషయక రంగాల్లో ప్రతిభావంతులుగా రాణిస్తూండడం ఒక చిత్రమైన విశేషం…ఉదాహరణకు ప్రతి సంవత్సరం జాతీయస్థాయిలో యిక్కడ నలభైవేల డాలర్ల నగదు, జ్ఞాపికతో గౌరవిస్తూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘నేషనల్‌ స్పెల్లింగు బీ అవార్డు’ పోటీల్లో గత పన్నెండేండ్ల కాలంలో ఎనిమిదిసార్లు భారతీయ బాలలే విజేతలు కావడం ఎంతో ప్రతిభావంతమైన సాధనగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
ఐతే భారతదేశంలో అనుకుంటున్నట్టు యిక్కడి సంస్కారవంతులైన యువతులెవ్వరూ అర్థనగ్న వస్త్రధారణ చేయరు. మోకాళ్ళదాకా స్కర్ట్‌, పైన బుష్‌షర్ట్‌పై ఓవర్‌కోట్‌..అలా చూడ్డానికి గంభీరంగా, గౌరవనీయంగా ఉండే పద్ధతిలోనే కనిపిస్తారు.
క్యాథీ తనకు మొట్టమొదట పరిచయమైననాటినుండి ఎప్పుడూ పరిపూర్ణమైన వస్త్రధారణతోనే కనిపించింది..అంటుంది… రామం పాత అమెరికా సినిమాలు చూడు గాడ్‌ ఫాదర్‌, గాన్‌ విత్‌ ద విండ్‌, సౌండాఫ్‌ మ్యూజిక్‌..అమెరికన్‌ స్త్రీ వేషభాషలు ఎంత ముచ్చగా ఉంటాయో..ఐ లైకిట్‌…అని.
నిజంగానే ప్రత్యేకమైన అభిరుచి, తత్వంగల స్త్రీ ఈమె. రెండు చేతుల్లో రెండు పొడవాటి కాఫీ కప్స్‌తో, రాపర్స్‌తో, నాప్‌కిన్స్‌తో సహా తీసుకుని వస్తూ,”ఏయ్‌” వై డోన్ట్‌ యు హెల్ప్‌ మీ..”అంది దగ్గరగా వస్తూ,
ఉలిక్కిపడ్డ రామం ”సారీ..”అంటూ ఆమె చేతిలోని సరంజామాను అందుకుంటూండగా,
”నువ్వు అబ్సెంట్‌మైండెడ్‌గా ఉన్నావెందుకో’ ఈరోజు” అందామె.
”ఔను క్యాథీ..ఐ లాస్ట్‌ మైసెల్ఫ్‌ టుడే..హైలీ డిస్టార్టెడ్‌..ఎందుకో నా గతం ప్రొద్దట్నుండీ నన్ను వెంటాడ్తోంది.
”అది తుపానుముందటి అలజడి…ఎ గేల్‌ బిఫోర్‌ ది హర్రికేన్‌”
”ఔననిపిస్తోంది నాక్కూడా”..ఎంత ఖచ్చింగా మనిషిని చదువుతుందీమె అనిపించింది రామంకు.
”అమృతం కురిసిన రాత్రి జ్ఞాపకముందా..”
”ఊఁ…తిలక్‌ కవిత్వంకదా..”
”ఔను..వెన్నెల్లో….”
‘వసుధైక గీతం’ లో అంటాడు,
‘భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది
భ్రుకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది
ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు
సూర్యుడుని చూడు నా తలమీద పువ్వు
అట్లాంటిక్‌ కల్లోల తరంగాల మేను వాల్చింది నేను
పసిఫిక్‌ లోతులలో రత్నాల్ని వెదికి తీసింది నేను
ఉత్తర ధృవాన ఒక పాదం దక్షిణ ధృవాన మరోపాదం
సర్వంసహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను-‘
”…వలె మన జీవితంలో కూడా ఎంతో ప్రధానమైందీ వర్షం కురుస్తున్న రాత్రి..జ్ఞాపకముందా..మనం మొట్టమొదట కలుసుకున్నది వర్షం కురుస్తున్న రాత్రే..మనం తర్వాత సన్నిహితంగా దగ్గరైన ప్రతి కలయికా వర్షం కురుస్తున్న సందర్భమే.. హైద్రాబాద్‌లో మన ‘రామం’ కంపెనీని ప్రారంభించిందీ ఎడతెగని వర్షం కురుస్తున్న రోజే..యిప్పుడు అత్యంత కీలకమైన మనిద్దరి జీవితాల దిశను నిర్ణయించుకుందామనుకుని సమావేశమైన ఈ రాత్రి..ఇప్పుడుకూడా వర్షం కురుస్తున్న రాత్రే.. ఐ లైక్‌ రెయి..చిన్నప్పుడు రైన్‌ రైన్‌ గో ఎవే అనే పాటను రైన్‌ రైన్‌ కంకం, డోన్ట్‌ గో ఎవే బట్‌ అల్వేస్‌ స్టే అని పాడేదాన్ని..”

8
”ఊఁ…”    నిజంగా రామంకు కూడా చాలా ఉద్వేగంగా ఉంది..ఈ రాత్రి తామిద్దరూ కలిసి తమ భవిష్యత్తును, సాధించవలసిన కఠోరమైన యాత్ర తాలూకు పథకాల రూపకల్పననూ పూర్తి చేయాల్సిఉంది. అందుకే గతవారంనుండి క్యాథీకి ఈనాటి ఈ కలయిక గురించి ప్రత్యేకంగా చెబుతూ వస్తున్నాడు. తను తన మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ క్యాథీ సమగ్రంగా చదివింది. నిజానికి తన గురించి తనకంటే ఎక్కువ క్యాథీకే తెలుసు. అందుకే ఒక అనుచరురాలిగా ప్రణాళికారచన బాధ్యతను ఆమెకే అప్పగించాడు.
ఐతే.. జరుగవలసిన చర్చకు…లోతుగా ఆలోచించి తీసుకొనవలసిన నిర్ణయాల తాలుకు తుది రూపమివ్వడానికి ఈ బార్నెస్‌ పుస్తకశాల వేదిక  కాదు..కలుసుకోడానికి మాత్రమే క్యాథీని యిక్కడికి రమ్మన్నాడు రామం..ఐతే..డిస్టర్బయి.. మనసంతా వికలమై.,
రామం ఎంత దాచుకుందామన్నా..యిక సాధ్యంకాక బయటికి తన్నుకొచ్చే జీవిస్తున్న ”లీల” తాలూకు జ్ఞాపకం మనసుతెరపై ప్రత్యక్షమైంది.
వద్దు..వద్దు..వద్దు..లీల బాపతు ఏ జ్ఞాపకాలూ వద్దు..ఆమెకు సంబంధించిన ఏ సంఘటనలూ స్మతిపథంలో వద్దు.. తను భరించలేడు..లీలయొక్క ఏ ప్రస్థావన హృదయంలో పొటమరించినా ఎందుకో శరీరమంతా ఒక కల్లోల సముద్రమై కంపిస్తోంది. చలించిపోతున్నాడు తను. బలవంతంగా లీల జ్ఞాపకాల్ని పక్కకు జరిపి.. నెట్టి.. మూసేసి,
”క్యాథీ..మనింటికి పోదాంపద ”
”… ఎందుకలా డిస్టర్బ్‌గా ఉన్నావ్‌ రామం..యువార్‌ నాట్‌ స్టేబుల్‌”
”యువార్‌ రైట్‌..ఎట్‌ లెటజ్‌ గో..” లేచాడు రామం ఆమె జవాబు కోసం ఎదురుచూడకుండా…అప్పటికి వాళ్ళు కాఫీ టబ్స్‌లోనుండి సగంకూడా తాగలేదు. అతనికి క్యాథీ కాఫీ తాగుతోందా..తాగిందా అన్న గమనింపుకూడా లేదు చకచకా తెచ్చుకున్న గొడుగును కూడా అక్కడే వదిలి బయటికి నడిచాడు. క్యాథీ అతనివైపు చిత్రంగా, కొద్ది ఆందోళనగా చూచి.. ఏమైందితనికివ్వాళ అనుకుంది. రామం గొడుగును ఆమె చేతిలోకి తీసుకుని బయటికి…అతని వెనకాల నడిచింది.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -6 వ భాగం

ekkadi-7

6

ఆ రోజు జూన్‌ 3వ తేదీ..గురువారం.
రామం మనసు ఉద్విగ్నంగా ఉంది. ఎందుకో దుఃఖంగా కూడా ఉంది. పొద్దటినుండీ మనసులో ఒక ప్రళయగర్జనై వినిపిస్తున్న పదం.. సిటిజన్‌షిప్‌..పౌరసత్వం. యిక కొద్దిసేపట్లో తను అమెరికా పౌరసత్వం స్వీకరించబోతున్నాడు..ఆరోజు.
మనిషి ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..ఎక్కడికో ఉపాధికోసం వలసవచ్చి..ప్రాంతాలు, దేశాలు మారి..పుట్టినదేశం, పెరిగిన దేశం, బ్రతుకుతున్న దేశం.. కన్నతల్లి, పెంచిన తల్లి, ఏమీకాని దయామయియైన ప్రేమను పంచుతున్న తల్లి.. తల్లి.. తల్లి హృదయమున్న స్త్రీ ఎవరైన ఎంత అద్భుతమైన జీవి. మాతృప్రేమ ఎంతో పవిత్రమైంది. మాతృమూర్తి..మాతృస్పర్శ..మాతృ క్షమ-
”వై ఆర్‌ యు సో సైలెంట్‌..సో డీప్‌” అంది క్యాథీ..ప్రక్కసీట్లోనుండి. కారు అప్పుడు అమెరికా మొట్టమొదటి రాష్ట్రమైన డిలావర్‌ నగరంలో యూనివర్సిటీ ఆఫ్‌ డిలావర్‌ కాంపస్‌లో, క్లేటన్‌ హాల్‌ ముందు పార్కింగు ఏరియాలోకి ప్రవేశిస్తోంది.
ఎర్రగా ఎండ..పచ్చగా చెట్లు చుట్టూ..ఒంటిని తడుముతున్న లేత, పల్చని గాలి.
”ఎందుకో క్యాథీ..మనసు చాలా భారంగా ఉంది..”అన్నాడు రామం కారును పార్క్‌ చేస్తూ.
క్యాథీ తనతో ఈ ఆరేండ్ల సాంగత్యంలో పట్టుబట్టి ఎంతో శ్రద్ధతో తెలుగు నేర్చుకుంది. భారతదేశం నుండి ఇరవై ఒక్క రోజుల్లో తెలుగు, గాజుల సత్యనారాయణ పెద్దబాలశిక్ష నుండి మొదట బాలల బొమ్మల రామాయణం, మహాభారతం, మహాభాగవతం నుండి అనేక పుస్తకాలను అపోషన పట్టింది. క్యాథీ అంటే దీక్ష – క్యాథీ అంటే ఏకాగ్రత. క్యాథీ అంటే కఠోర సాధన. ఇప్పుడు క్యాథీ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిపెరిగిన చాలామంది తెలుగు వాళ్ళకంటే శ్రేష్టమైన తెలుగు, అర్ధవంతమైన వ్యక్తీకరణ, మంచి భాష, ఉత్తమమైన ఉచ్ఛారణతో సంభాషించగలదు.
”నాకు తెలుసు.. ఒక భారతదేశ పౌరుడు ఈ అమెరికా గడ్డపై అనేక అర్హతలను సాధించి అమెరికా పౌరసత్వాన్ని స్వీకరిస్తున్న ఈ ఉద్విగ్న సందర్భంలో సున్నితమైన హృదయంగల నీవంటి మనిషి ఎంత తీవ్రంగా చలించిపోతాడో నాకు తెలుసు.. ఐనా అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించడమంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతున్నట్లు కాదుగదా రామం.. ఒసిఐ కింద ఉభయ పౌరసత్వ చట్టానికి లోబడి భారత పౌరునిగా కూడా నువ్వు కొనసాగుతావు కదా రామం.’
”ఔననుకో క్యాథీ.. కానీ..”
రామం కార్లోనుండి కిందికి దిగి..క్యాథీ ఒక ప్లాస్టిక్‌ ఫోల్డర్‌లో ఉన్న రామం తాలుకు కాగితాలన్నింటినీ పొదివి పట్టుకుని వెంట నడుస్తూ,
మౌనమే ఇద్దరి నడుమ.
ఎదురుగా యిటు మారియట్‌ హోటల్‌..అటు క్లేటన్‌ హాల్‌..యూనివర్సిటీ ఆఫ్‌ డిలావర్‌. చెక్‌ ఇన్‌ కౌంటర్‌లో రిపోర్ట్‌ చేయగానే.. క్యూ ‘బి’ అని చెప్పిందొకామె. లోపల పెద్దహాల్లో ఎ,బి,సి,డి. నాల్గు పెద్ద వరుసలు..అప్పటికే జనం ఎప్పుడో చేరి వరుసల్లో నిలబడి ఉన్నారు. ఓత్‌ టేకింగు సెరిమొనీకి సరియైన వస్త్రధారణతో రావాలని ఒక నిబంధన ఉంది కాబట్టి దాదాపు అందరూ ‘జెంటిల్‌డ్రెస్‌’ లో ఉన్నారు. స్త్రీలు, పురుషులు, అక్కడక్కడ పిల్లలు. కొందరి వెంటవచ్చిన క్యాథీవంటి స్నేహితులు, తల్లిదండ్రులు. అంతా కోలాహలంగా ఉంది. ఐతే దాదాపు అందరి ముఖాల్లోనూ తృప్తితో కూడిన వెల్లివిరుస్తున్న ఆనందం. ఎందుకంటే ప్రపంచం మొత్తంమీద సంపన్నమైన, బలమైన, పటిష్టమైన సర్వసత్త్వాక సార్వభౌమాధికారంగల అమెరికా దేశ పౌరసత్వాన్ని పొందబోతున్న చారిత్రక సందర్భమది.
యు.ఎస్‌. డిపార్ట్‌మెంటాఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ తరపున యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ వాళ్లు అతిక్రమశిక్షనాయుతంగా, దాదాపు నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో కొత్తగా పౌరసత్వం స్వీకరించబోతున్న అందరికీ చకచకా ఒక ప్రోగ్రాం షీట్‌ను అందించారు.
రామం ‘బి’ క్యూలో కొద్ది నిముషాలు నిలబడగానే..కౌంటర్‌ చేరువైంది. కౌంటర్లో ఉన్న అమెరికన్‌ యువతి ఒకామె వినమ్రంగా ‘గుడ్మానింగు’ చెప్పి చేయి చాపింది.
రామం తన కాల్‌లెటర్‌, గ్రీన్‌కార్డ్‌ అని పిలవబడే పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్‌ను ఆమెకందించాడు. ఆమె వెంటనే ఒక ప్లాస్టిక్‌ ఫోల్డర్‌ను. చేతికందించింది అందులో ఫిలడల్ఫియా డిస్ట్రిక్‌కు చెందిన న్యూట్రలైజేషన్‌ సెరిమొనీకి సంబంధించిన ఓత్‌ ఆఫ్‌ అల్లెజిఎన్స్‌ ప్లెడ్జ్‌ ఆఫ్‌ అల్లెజిఎన్స్‌. కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ యుఎస్‌ఎ వంటి కాగితాలన్నీ ఉన్నాయి.
దాదాపు రెండువందల యాభైమంది ఆ రోజు కొత్తగా అమెరికా పౌరసత్వం స్వీకరిస్తున్నారు. వివిధ దేశాలకు చెందినవాళ్ళు..చైనా, జపాన్‌, అరబ్‌ దేశాలు, భారతీయులు, కెనెడియన్స్‌, ఇంగ్లిష్‌, మెక్సికన్స్‌, ఆఫ్రికన్స్‌ ఎందరో. భిన్న దేశాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న వర్ణాలు,..విభిన్న తత్వాలు..ఏవేవో కారణాలవల్ల, దాదాపు ఎక్కువమంది జీవనోపాధి వెదుక్కుంటూ వచ్చినవాళ్ళు ఒక దేశపు గడ్డపై గత థాబ్దికాలం గడుపుతూ, యిక్కడి మనుషులతో, యిక్కడి జీవనవిధానంతో, సంస్కృతితో మమేకమై, లీనమై., ఇప్పుడిక..ఈ అగ్రరాజ్య వారసులు కాబోతున్న భావోద్విగ్న సందర్బం..,
ఒక గంటలో దాదాపు కొత్తగా ప్రతిజ్ఞ తీసుకునేవాళ్ళందరూ రిపోర్ట్‌ చేసిన తర్వాత..
అందర్ని సెంట్రల్‌హాల్‌లో కూర్చొమ్మని సూచన. రామం లోపలికి నడిచి ముందు నుండి మూడవ వరుసలో కూర్చున్నాడు. క్యాథీ ప్రక్కనున్న అతిథులకోసం ఉద్దేశించిన బ్లాక్‌లో కూర్చుంది. అంతా గంభీర నిశ్శబ్దం.
సరిగ్గా పదకొండు గంటల ముప్పది నిముషాలకు వెంట ఐదారుగురు వయసు మళ్ళిన వ్యక్తులు వెంటవస్తూండగా చీఫ్‌ జస్టిస్‌, యుఎస్‌ బ్యాంక్‌ రప్టసీ కోర్ట్‌ కెవిన్‌ జె. కారీ ప్రవేశించాడు. వేదికపైనున్న నియమిత కుర్చీల్లో అందరూ ఆసీనులు కాగానే..వాళ్ళ వెనుక ఉన్న విశాలమైన తెల్లని తెరపై..”ఫేసెస్‌ ఆఫ్‌ అమెరికా” పేరుతో ఒక వీడియో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. వందల ఏండ్ల క్రిందటి అమెరికా, కాలంతో..జీవితంతో..పోరాటం..పారిశ్రామికాభివృద్ధి.. ఎదుగుదల..వందల వేలమంది అమెరికా దేశంపట్ల అంకితభావంతో చేసిన అకుంఠితమైన కృషి..చివరకు సగర్వంగా నీలి గగన వీధుల్లో రెపరెపలాడుతూ అమెరికా జాతీయపతాకం..పదమూడు ఎరుపు, నీలి పట్టీలు..యాభై నక్షత్రాలు..జెండా ధగధగలు.
చీఫ్‌ జస్టిస్‌చే కొత్తగా పౌరసత్వం స్వీకరిస్తున్న అందరికీ స్వాగతవచనాలు..సంక్షిప్తంగా పౌర ప్రాముఖ్యత..అభినందనలు. వెంటనే యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్రిగేషన్‌ సర్వీస్‌ అధికారిచే ”మోషన్‌ ఫర్‌ అడ్మిషన్‌”..తర్వాత సంప్రదాయంగా చీఫ్‌ జస్టిస్‌చే అంగీకారం, ఆమోదం..ఆ తర్వాత..అందరూ లేచినిలబడి, అప్పటికే అందరికీ అందజేయబడ్డ చిన్న అమెరికా జెండాలను చేతుల్లో ధరించి, చేతులను ముందుకు చాచి, జాతీయ పతాకానికి వందనం చేస్తూ..ప్రతిజ్ఞ..”అదృశ్యుడైన దేవుని సన్నిధిలో అందరికీ స్వేచ్ఛా, న్యాయము సంప్రాప్తించాలని వేడుకుంటూ సార్వభౌమ అదికారాలకు ప్రతీకఐన అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయపతాకం సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను..”ఇలా సాగుతోంది.
అంతా గంభీర వాతావరణం..అందరి హృదయాల్లో ఎవరికివారికే అనుభవమౌతున్న మౌన సంఘర్షణ..తన శరీరంలోనుండి ఏదో భాగం విడిపోతున్నట్టు..కొత్తగా తన దేహంలోకి  ఏదో లీనమైపోతున్నట్టు..ఏదో ఒక ప్రాణసమానమైన పరివర్తన జరుగుతున్నట్టు..,
నా దేశం..నా భారతదేశం..నా ప్రజలు..నా సోదరులు..నా మాతృభూమి..నా నేల..నా గాలి..నా నీరు..నా ఆత్మ.,
ఎందుకో దుఃఖం..ఎందుకో గొంతుపెగలని ఉద్వేగం..కళ్ళలో ఎవరికీ తెలియని సన్నని కన్నీటి పొర. లోపల చేతులతో కడుపులో ఎవరో దేవుతున్నట్టు బాధ.,
ఏమైందిప్పుడు..రెండు దేశాల్లోనూ పౌరసత్వమేగదా..,అని ఓ ఆత్మ సమాధానం. స్వ స్వాంతన. అమెరికా జెండావందనం కాగానే..జాతీయగీతం..అందరూ నిలబడిఉండగానే..లెఫ్ట్‌నెంట్‌ కెవిన్‌ పీర్స్‌, రిటైర్డ్‌ పెన్సిల్వేనియా స్టేట్‌ పోలీస్‌ అధికారిచే ఉచ్ఛైస్వరంలో మహోత్తేజంగా అమెరికా జాతీయగీతాలాపన..ప్రౌడ్‌ టుబి ఎన్‌ అమెరికన్‌..’
సమాంతరంగాఎక్కడో..గుండెల కొండల్లో..’జనగణమణ..జయ జయ జయహే’..’వందేమాతరం..వందేమాతరం..’
చటుక్కున కట్టలు తెంచుకుంటోంది దుఃఖం రామంలో, జాతీయ గీతాలాపన ముగియగానే అందరితోపాటు రామం కూడా కూర్చుని.,
మరొకసారి చీఫ్‌ జస్టిస్‌ నూతన పౌరసత్వం స్వీకరించిన వ్యక్తులందరికీ అభినందనలు తెలిపి.. ఒక ప్రకటన చేయగానే హాలంతా చీకటై..,
జార్జ్‌ డబ్ల్యు బుష్‌ వైట్‌హౌజ్‌నుండి అభినందనలు తెలియజేస్తూ ఉత్తేజకర వీడియో సందేశం..స్పష్టమైన గంభీర ప్రదర్శనతో..అంటాడు..”వియ్‌ ఎడ్మిట్‌ యు ఏజ్‌ ఎ న్యూ సిటిజన్‌ ఆఫ్‌ అవర్‌ మదర్‌ లాండ్‌ అండ్‌ వియ్‌ వెల్‌కం యు టు ది అమెరికా ఫామిలీ.”
లైట్లు వెలిగి..ఒక నిశ్శబ్ద గంభీరత చెదిరి..,
అందరూ బయటికి హాల్లోకి రాగానే..యిదివరకటి. బి వరుస క్యూలోనే..ఒక విలువైన ప్లాస్టిక్‌ ఫోల్డర్‌లో ఉంచి.. ‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ నాచురలైజేషన్‌’ అందజేసి.,
అందరిలోనూ ఏదో తెలియని ఆనందం..వెల్లివెరిసే తృప్తి..ఏదో ఒక అద్భుతమైన స్థాయిని సాధించామనే విజయఛాయ.
నాచురలైజేషన్‌..సహజీకరణ..ఏది సహజం..జీవించే ప్రతి జీవికీ జీవించేహక్కు ఉండాలనీ, జీవించే స్వేచ్ఛ, సహజంగా, ప్రకృతిసిద్ధంగా ఎదిగే హక్కూ ఈ సృష్టినీ ప్రకృతినీ నియంత్రించే సర్వ భగవత్‌దత్త నియంత్రణలన్నింటినీ గౌరవిస్తూ, పాటిస్తూ.. ప్రకృతిలో ఒక భాగమై మాత్రమే కొనసాగుతానని..ఒక ధృవీకరణ..నాచురలైజేషన్‌.
అమెరికన్లలో అన్నింటికంటే గొప్పగా రామంకు నచ్చే సుగుణం..వాళ్ళ దేశంపట్ల వాళ్ళకున్న పవిత్రమైన ప్రేమ..భక్తి. దేశంకోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించగల త్యాగశీలత..మాతృభూమి పట్ల అపారమైన గౌరవం. అంకిత భావం. వాళ్ళ రక్తంలోనే దేశంపట్ల ప్రాణాలకంటే ఎక్కువగా ద్యోతకమయ్యే ఆత్మార్పణ తత్వం.
భారతదేశంలో..,
ఒకప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యచకితుల్ని చేసిన స్వతంత్ర భారత పోరాట ఐక్యత. భారత భూభాగంపై ఎక్కడికక్కడ పొటమరించి, పెల్లుబికి, వెల్లువై నినందించిన బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాటు..జాతి, మత, వర్ణ, వర్గ, లింగ, వయో భేదాలు లేకుండా ఏక త్రాటిపై కొనసాగిన స్వతంత్ర యుద్ధం.,
ఇప్పుడు..ఈ అరవై మూడు సంవత్సరాల తర్వాత ఏమైపోయాయి ఆ బంగరు రోజులు..’ఒక్కనికోసం అందరు – అందరి కోసం ఒక్కడు’గా నింగికి పొంగి ఎగిసిన ఆ ఐక్యతా శక్తులిప్పుడేవి. అసలీ తరానికి దేశ స్పృహ, దేశభక్తి, దేశ స్వతంత్ర పోరాట ధ్యాస..దేశ బాధ్యతల పట్ల ఆలోచన..నిబద్ధత..ఇవేవైనా ఉన్నాయా..ఎందుకీ తరం..శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు వలె పూర్తిగా నిర్వీర్యులై, పథభ్రష్టులై ఎందుకు మిగిలిపోతున్నారు. సమాజంలో దేశం గురించి ఆలోచింపజేసే విధానం ఈ తరానికి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యార్జనలో.. ఏస్థాయిలోనూ లేక.. అంతా కాగితపు పువ్వు వికసించినచందంగా. మిథ్య.. నైరూప్యత..ఉందా అంటే ఉంది, లేదంటే లేదు రకం అనిమిత్తత ఏర్పడి, వ్యాపించి..అంతా అస్తవ్యస్తత..చిందరవందర.. రిక్తత..వెరసి..ఎవరికివారే యమునాతీరే,
ఇక ఇప్పుడు..ఏదో ఒక భారీస్థాయి పరివర్తన జరగాలి..ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి ఎవరొఒకరు దారితప్పిపోతున్న ఈ తరాన్ని ఎవరో ఒకరు మళ్ళీ దారిలోకి మళ్ళించి పునస్సంధానం చేయాలి..లేకుంటే..ఒక నది..ఒక సముద్రం దారితప్పిపోయినట్టు..ఒక వ్యవస్థ. ఒక సమాజం, ఒక ఉజ్జ్వల వారసత్వంగల చరిత్ర భ్రష్టుపట్టిపోతుంది..ఐతే..
ఎలా..ఎలా..ఎలా..?

ekkadi-6
రామంకు గత కొన్నేళ్ళుగా భారతీయ వ్యవస్థ స్థితిగతులను అధ్యయనం చేస్తున్న బాపతు ఎన్నో జ్ఞాపకాలు కురుస్తున్న చినుకుల్లా మస్తిష్కంనిండా ఆవరించినై. అతనికి చాలా స్పష్టత ఉంది..గతం గురించి, వర్తమానం గురించి..సాధించి రూపుదిద్దవలసిన భవిష్యత్తు గురించి..అందుకే ఒకే సుదీర్ఘ యజ్ఞసదృశమైన ప్రణాళికాబద్ధ క్రతువును కొనసాగిస్తూ వస్తున్నాడు తను.
మౌనంగా యూనివర్సిటీ క్లేటన్‌ హాల్‌నుండి బయటికి నడుస్తున్న రామం వెంట అడుగులు వేస్తూ..అతని చేతిలోని ప్లాస్టిక్‌ ఫైల్‌ను తీసుకుని..సర్టిఫికేటాప్‌ నేచురలైజేషన్‌ను చూస్తూ అంది క్యాథీ..”బాధపడ్తున్నావా రామం..యుఎస్‌ఎ పౌరునిగా మారినందుకు” అని.
”ఉహుఁ..జన్మతః భారతదేశ పౌరున్నయి నా విధులను ఇదివరకు సక్రమంగా నిర్వహించనందుకు బాధపడ్తూనే .. భవిష్యత్తులోనైనా మనం అనుకుంటున్నట్టుగా నా మాతృభూమికోసం ఆ చారిత్రాత్మక కార్యక్రమాన్ని అమలు చేయగల్గుతానా అని ఓసారి ఆత్మవలోకన చేసుకుంటున్నాను క్యాథీ..”
”యుఆర్‌ డెఫ్‌నెట్లీ గోయింగు టు డు సంథింగు వండ్రఫుల్‌..”
”చేయాలి..ఏదో ఒకటి చేయాలి..”
కార్లో కూచున్నాక క్యాథీ అంది..”కారును..మహాలక్ష్మి టెంపుల్‌ దిక్కుపోనీ రామం..వుహావ్‌ టు డిస్కస్‌ సంథింగు సిగ్నిఫికెంట్‌..”
మౌనంగానే క్యాథీ దిక్కు చూశాడు రామం..కార్‌ను రివర్స్‌ చేసుకుంటూ. ఆమె అప్పుడు ఏ మేఘాలూలేని ఒట్టి నీలి ఆకాశంలా గంభీరంగా, గుంభనంగా ఉంది.
”ఏమిటో అది..”
”చెప్పాలా ఇప్పుడు”
”నీ యిష్టం”
”రామం..మన పరిచయమై, స్నేహితులమై ఎన్నేళ్ళవుతోందో జ్ఞాపకముందా”
‘ఉహు..చెప్పు నువ్వు”
”సరిగ్గా ఎనిమిది సంవత్సరాల నాల్గునెలల పదిరోజులైంది.”
”ఓ..సో ఆక్కురేట్‌”
”మరి..జీవితమంటేనే ఆక్కురేట్‌గా గడపవలసిన ఒక బృహత్కార్యం అనుకుంటాన్నేను.”
మళ్ళీ మధ్య మౌనం..అతని మనసు ఆ ఎనిమిదేళ్ళ సాంగత్యాన్ని స్కాన్‌ చేస్తూ వస్తోంది నిప్స్‌ వేగంతో..అంతిమంగా క్యాథీ దిక్కు అప్రయత్నంగా, ఆరాధనాపూర్వకంగా చూచి ‘ఒక అద్భుతమైన మనిషి’ అనుకున్నాడు లోలోపల.
”తామరతీగ నీట్లోనే పుట్టి నీట్లోనే పెరిగి నీటిలోనే అంతరించి పోతుంది. కదా..కాని జీవితాంతం నీరు తనను తాకకుండానే అతీతంగా ఉంటుంది. కలిసి ఉంటూకూడా ఏ సంబంధమూ లేక పరాయిగా జీవించడాన్ని ఏమంటారు రామం.” అంది.
కారు వేగాన్ని అందుకుని ఆటోమొబైల్‌ షోరూంలతో కిక్కిరిసి ఉన్న వాషింగ్టన్‌ రోడ్‌ మీదినుండి జారిపోతోంది.
”క్యాథీ.. వర్చువల్‌ లివింగు అండ్‌ రియల్‌ లివింగు..అని రెండు. ఏ సమాజంలోనైనా అది అమెరికాకానీ, భారతదేశంకానీ ఇంకేదైనా దేశంకానీ..మనుషులు కలిసి సుదీర్ఘకాలం జీవించినంత మాత్రాన నువ్వన్నట్టు నీరూ తామరాకులా వాళ్ళమధ్య అనుబంధమే ఏర్పడదు.ఎందరో ఉన్నారు నా అధ్యయనంలో..భార్యాభర్తలుగా కలిసి జీవితాంతం జీవించినా వాళ్ళు ఆత్మీయులు, స్నేహితులు కాదుకదా కనీసం పరిచయస్తులుకూడా కాలేకపోయినవాళ్ళు. నిజానికి పెళ్లి అనేది ఒక యాక్సిడెంట్‌. ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచంలో అన్నింటికంటే హాస్యపూరితమైన తతంగం పెళ్లిచూపుల పేరుతో ఒకమ్మాయి ఒకబ్బాయి ఎదురెదురుగా కూర్చుని ఒకర్నొకరు చూచుకోవడం. వాళ్ళు చూడగల్గింది. ఒట్టి బాహ్య రూపురేఖలనూ, చర్మసౌందర్యాన్నీ, వికారాలనేకదా. హృదయం ఎలా కనబడ్తుంది. యిక పెళ్ళి తతంగం పేరుతో ఒకటైన ఇద్దరు వాళ్ళవాళ్ళ వ్యక్తిగత తత్వాలు, అభిరుచులు, ప్రతిభావిశేషాలు, లక్ష్యాలు ఆధారంగా తమ తమ జీవితాలను ప్రారంభిస్తారు. అసలు అవగాహన యిక అప్పుడు బయటపడ్తుంది. ఆర్థిక పరమైన అంశాలు యిక ప్రతిభాశీలంగా పనిచేయడం మొదలౌతాయి. అతనుసంపాదిస్తున్నాడా, ఆమె సంపాదిస్తోందా. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు. ఎవరు ఎవరిపై ఎంతవరకు ఆధారపడి జీవిస్తున్నారు..ఈ మీమాంస మొదలౌతుంది. ఆర్థిక స్పష్టత ఏర్పడ్డ తర్వాతనే మనుషుల అసలురంగు బయటపడ్తుంది. మౌన ఘర్షణ..అంతరంగ వైరుధ్యాలు, తత్వవైరుధ్యాలు.. అనివార్యతలు.. క్రమక్రమంగా ఒకరితో ఒకరు రాజీపడడాలు.. మొదలై..ఈ లోగా పిల్లలు.. పిల్లలపట్ల అనివార్యమై పొటమరించే బాధ్యతలు, సంరక్షణ..రాజీ..రాజీ..రాజీ..చాలా రాజీపడి..బస్‌ జీవితాన్ని జీవించడమే తప్ప అర్థవంతంగా బతకడం ఉండదు. ఓ వందమందిని సర్వేచేసి..నీ జీవితంలో ఏం సాధించావ్‌..అని ప్రశ్నిస్తే, పెరిగిపెద్దయిన..ఏదో ఓ ఉద్యోగం చేసిన..పెళ్ళి చేసుకున్న..పిల్లలను కన్న..సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించే ప్రయత్నం చేసిన, ముసలోన్నయి చచ్చిపోయిన. ఇంతే..ఇంతకన్న ఎక్కువ ఎవడూ చెప్పడు..ఈ రొటీన్‌కంటే తొంభైశాతం మంది అదనంగా ఏమీ చెప్పరు. ఎందుకంటే అంతకంటే ఎవరూ ఏమీ చేయరుకాబట్టి..ఐతే..జీవిత చరమథలో..నీ భార్య, నీ ప్లిలలు, నీ స్నేహితులు.. వీళ్ళతో నీ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే..వ్చ్‌..అని పెదవి విరిచి..అంతా మిథ్యవంటి శూన్యపూరిత జవాబే వస్తుంది కాని..ఓహో అని పొంగిపోయే స్ఫోరకమైన జవాబేదీ రాదు. ఈ నిర్లిప్తతకు కలిసి దాదాపు నలభై ఏభై ఏండ్లు జీవించిన భార్యాభర్తలుకూడా అతీతం కాకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది..యిక్కడ బంధం సిమెంట్‌రోడ్‌పై ప్రవహించే నీరులా ముగుస్తుందిగాని..నగ్ననేలపై యింకే వానచినుకుల్లా మమేకం కాదు.
ఐతే.. ఏ పురుషునికి ఏ స్త్రీ భార్యగా లభించి వాళ్ళు జీవితరథానికి రెండు సమానమైన చక్రాల్లా గమనం సాగిస్తారో ముందుగా ఎవరికీ తెలియదు. పరస్పరం అనుకూలవతియైన భార్యో అనుకూలుడైన భర్తో లభించడం కేవలం వాళ్ల అదృష్టంగానే భావించవలసివస్తుందనే అన్ని అధ్యయనాలూ తెలియజేస్తున్నాయి. ఈ అనుకూలత అనేది ఒక హృదయ సంబంధమైన వ్యవహారం..అదే అంతిమంగా జీవితస్వరూప స్వభావాలనూ, సాఫల్యతనూ నిర్ధారిస్తుంది.” రామం ఏదో ఒక ఆంతరికలోకంనుండి మాట్లాడ్తున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు.
చటుక్కున అంతరాయం కలిగిస్తూ..”సంగతించే ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరి తత్వాన్ని మరొకరు పరిపూర్ణంగా అర్థంచేసుకుని ఒకరికోసం ఒకరు తమలో మార్పులను చేసుకోవచ్చుగదా. సర్దుబాటు, పరివర్తన, రీషేపింగు ఇవి మనుషులకు కొత్తజీవితాన్నీ, దాంపత్యంలో కొత్త స్ఫూర్తిని అందించగలవుగదా రామం..ఎందుకు మనుషులు తమ తత్వాన్నిపునరాకృతీకరించుకునే నిర్మాణంకోసం ప్రయత్నించరు. కలిసి నడవడం తప్పదని స్పష్టంగా తేలిపోయిన తర్వాత.. ఆ నడకను నిర్మాణాత్మకంగా, అర్ధవంతంగా మనుషులు మార్చుకుంటే బాగుంటుందిగదా..”అంది క్యాథీ.
”తప్పకుండా బాగుంటుంది. నిజానికి దాంపత్య వికాసం భార్యాభర్తల పరస్పర అవగాహన, ఎదుటి వ్యక్తిని భరించే సహనశీలత, త్యాగతత్వం, సర్దుబాటు.. వీటిపైన్నే ఆధారపడి ఉంటుంది క్యాథీ..ఇది మనిషి..ఇగో..అహంకు సంబంధించిన సున్నిత విషయం. ఎవరికోసంవారు కాకుండా ఒకరికోసం ఒకరం జీవిద్దాం, కలిసి నడుద్దాం, కలిసి సాధిద్దాం…కలిసి జీవితాన్ని సంయుక్తంగా పంచుకుందాం..కలిసే జీవితంలో విజయాలను సాక్షాత్కరింపజేసుకుందాం అన్న మూల భావన యిద్దరిలోగనుక ఉన్నట్టయితే యిక ఆ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. కాని ఎడ్లబండిని ఒక ఎద్దు ఒకవైపు ఇంకోఎద్దు మరోవైపు గనుక లాగుతున్నట్టయితే..బండి ముందుకు సాగదుసరికదా అక్కడే కూలబడి విరిగిపోతుంది కూడా..”
”ఎడ్లు ఏకశక్తిగా ఏర్పడి బండిని, అనుకున్న బాటలో సాఫీగా లాగడం నువ్వన్నట్టు అతి ప్రధాన విషయమైతే బండి రెండుచక్రాలూ ఒకే వ్యాసంతో అనుసంధానమై ఏకవేగంతో భ్రమించడం కూడా యింకో ముఖ్యమైన విషయంగా నువ్వు గుర్తిస్తున్నావా.”
యథాలాపంగా స్టీరింగు చేస్తున్న రామం ఉలిక్కిపడ్డట్టు క్యాథీ ముఖంలోకి చూశాడు. ఆమెయొక్క లోతైన దృష్టికి ఆశ్చర్యపోయాడు.
”అటువంటి పరస్పరానుకూలమైన రెండు చక్రాలు బండికి అమరడం ఆ బండియొక్క దక్షతకు దోహదపడ్తుంది. దాన్నే అదృష్టమందామా..”
”మే బీ..” నవ్వింది క్యాథీ గలగలా..ముత్యాలు రాలిపడ్డట్టు.
ఇంతకూ క్యాథీ ఎందుకిప్పుడు ఈ మహాలక్ష్మి గుడి ప్రోగ్రాం పెట్టినట్టు. కారు లైమ్‌స్టోన్‌ రోడ్‌పైనుండి వ్యాలీరోడ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు కారుకూడా క్యాథీదే. ఆడి. హైఎండ్‌. గాలిలో విడిచిన బాణంలా సర్రున..,
”వాటీద స్పెషాలిటీ టుడే క్యాథీ..వై డు యు అరేంజ్‌ దిస్‌ స్పెషల్‌ విజిట్‌..”
”జస్ట్‌ లైక్దట్‌’
ఏమై ఉంటుందబ్బా..ఉహు..ఊహకందట్లేదు..ఊర్కే ఆమెవైపు చూశాడు. చెరగని నవ్వు..అలసిపోని ముఖం. తాజా మల్లెపువ్వువలె..మెరిసే నీలికళ్లు నక్షత్రాల వలె.
ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీనుండి ఎంబిఎ చేసిన ఈ పిల్ల యింత నిబ్బరంగా, వినమ్రంగా, ఆత్మవిశ్వాసం నిండిన పూర్ణత్వంతో ఎప్పుడూ స్థిరంగా ఎలా ఉండగలుగుతుందో అని రామం యిప్పటికి వేయిన్నొక్కసారి ఆశ్చర్యపడ్డాడు. అది గమనించి.
”వై..దట్‌ లుక్‌..”అంది చిలిపిగా.
”ఉహు..” అని చిన్నగా నవ్వి..కారు లంకాస్టర్‌ పైక్‌ పైకి వచ్చి..హాకిస్సిన్‌ హిల్‌ మార్గంలోకి ప్రవేశించి దూసుకుపోతోంది. కొండపైప్రాంతం కాబట్టి..చల్లగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా, గంభీరంగా కూడా ఉంది. కార్లో నిశ్శబ్దంగా పనిచేసే ఎ.సి.. అంతా ఏదో ఉత్సుకిస్తున్న పారవశ్యం.
క్యాథీ..అప్పుడప్పుడు చటుక్కున జీవితానికి అన్వయిస్తూ మేనేజ్‌మెంట్‌ విషయాలను అద్బుతంగా ఉటంకిస్తుంది. మొన్న మొన్న తనకిష్టమైన ప్రపంచ ప్రఖ్యాత మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ రచయిత స్టీఫెన్‌ ఆర్‌.కోవె కొత్త పుస్తకం ”ఎనిమిదవ అలవాటు..ఫ్రమ్‌ ఎఫెక్టివ్‌నెస్‌ టు గ్రేట్‌నెస్‌” గురించి మహోద్వేగంతో చెప్తూ ఆ రచయిత ఎంతో స్ఫూర్తిని పొంది ఆ పుస్తకంలో ప్రస్తావించిన మహాత్మాగాంధీ కొటేషన్‌నొకదాన్ని చెప్పింది. ‘మనం చేస్తున్న పనికీ మనం చేయగల పనికీ గల తేడా దాదాపు ఈ ప్రపంచ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందేమో’ అన్నది ఆ సూక్తి.
నిజంగాఎంత అద్భుతమైన మేనేజ్‌మెంట్‌ పనిముట్టో అది.
”రామం.. నీకిది తెలుసా.. మనిషి అనే ఒక వస్తువుకాని ఈ జీవికి నాల్గు మితులు ..ఫోర్‌ డైమైన్షన్స్‌ ఉన్నాయి. ఒకటి మెదడు (మైండ్‌) రెండు శరీరం (బాడీ) మూడు హృదయం (హార్ట్‌.. గుండె కాదు) నాల్గు..వీటి సమిష్టి సమీకృత పదార్థమైన ఆత్మ (స్పిరిట్‌). ఎప్పుడూ ఏదో ఒకదాన్ని నేర్చుకోవడం మెదడు చేస్తే భౌతికంగా జీవింపజేసే ఉత్కృష్ట క్రియను శరీరం నిర్వహిస్తూంగా, ప్రేమతోనిండిన మానవ సంబంధాల నిర్వహణను హృదయం చేస్తూంటుంది. ఈ మూడు మహోన్నతమైనచర్యలను సమన్వయపరుస్తూ మనిషి ఆత్మ అర్థవంతమైన మానవపాత్రను నిర్దేశిస్తుంది. ఈ అవగాహన అద్భుతంగా ఉందిగదా రామం..” అంది క్యాథీ..కారు కొండపై నుండి మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి మెల్లగా ఆగుతూండగా.
రామం పులకించిపోయాడు. ఆమె చెబ్తున్న గాఢగంభీర విషయాన్ని వింటూ..ఈమెకు ఇంత లోతైన దృష్టి ఎలా అలవడిందో అని ఆశ్చర్యపోతూ..”ఊ” అన్నాడు కారును ఆఫ్‌చేసి..దిగుతూ.
అటువైపు నుండి క్యాథీకూడా కిందికి దిగింది.
చుట్టూ చాలా కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. అమెరికాలో నివాసముంటున్న భారతీయులు, తెలుగువాళ్లు రెండు మూడు రంగాల్లో గణనీయమైన తమదైన ముద్రను సామాజికంగా ఏర్పర్చారు. ఒకటి అనేక ప్రధాన నగరాల్లో దేవాలయాలను నిర్మించి నిర్వహిస్తూ అందర్నీ సంఘటితపర్చడం. రెండవది భారతీయ సంస్కృతిని శ్రద్ధగా కాపాడ్తూ కొండొకచో యితర దేశవాసులు ఆశ్చర్యపడే రీతిలో కళలను ప్రదర్శించడం, అనేక సందర్భాల్లో కూచిపూడి, కథక్‌, మణిపురివంటి నృత్యప్రదర్శనలు, సంగీత కచేరీలు. ప్రత్యేక పండుగరోజుల్లో ప్రవాస భారతీయులను ఎంతో విశేషంగా అలరిస్తూండడం. మూడవది.. తమ మూలప్రాంతాలకు దూరంగాఎక్కడో ఖండాంతరాల్లో జీవిస్తున్నామన్న స్పృహతో తమ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో సంగీతం, నృత్యం వంటి ఏదో ఒక అదనపు కళారంగాల్లో శిక్షణనిప్పించడం..ఈ క్రమంలో అనేక తెలుగు కుటుంబాలు తరుచూ కలుసుకోవడం, అనుభవాలను పంచుకోవడం, చేరువకావడం, ఇదంతా ఒక సామాజిక ఐక్యతా సాధన.
రెండేళ్ళక్రితం ఈ మహాలక్ష్మి దేవాలయం స్థాపించబడ్డప్పటినుండి ఎందుకో క్యాథీ బాగా ఆకర్షితురాలైంది. ఈ దేవాలయాన్ని ఒక తెలుగువ్యక్తి శర్మ స్వయంగా పూనుకుని వనరులన్నింటినీ సమీకరించి నిర్మించడం ప్రారంభించి తర్వాత్తర్వాత ఇంకొందరి సహకారంతో పూర్తి చేశాడు. ఒక ట్రస్ట్‌ను ఏర్పరిచి ఆయనే చైర్మన్‌గా ఉండి పూర్తి అంకితభావంతో మందిరాన్ని నిర్వహిస్తున్నాడు. ట్రస్ట్‌లో క్యాథీకి కూడా ఒక ప్రముఖస్థానం ఉంది. ఆలయ నిర్మాణంలోకూడా ఆమె కాంట్రిబ్యూషన్‌ కొంత ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆమెకు ఎంతో ఇష్టమైన పని.
చకచకా గుడిలోకి నడిచింది. ఆ రోజు గుడిలోని మూర్తికి ‘సరస్వతీ’ అలంకారం చేసి ఒడిలో అందంగా వీణను అలంకరించారు. ఎందరో అప్పటికే కూర్చుని నిష్టగా థసహస్ర కుంకుమ నామార్చన చేస్తున్నారు. ఐదవ రౌండ్‌ కొనసాగుతోంది. గంభీరమైన సామూహిక పఠనంతో సర్వస్వతీ స్తుతి..స్తోత్రం.
ఇద్దరూ ప్రధాన ఆలయం ముందుకు నిశ్శబ్దంగా చేరి..అక్కడే ఉన్న దాదాపు అరవై ఏళ్ళ వయసున్న శర్మగారు క్యాథీని, రామంను గమనించి దగ్గరగా వచ్చి..సాదరంగా పలకరించి..మౌనంగానే ఆయన చేసిన సూచనమేరకు పూజారి.. విగ్రహానికి హారతిచ్చి, ఇద్దరికీ హారతిని అందించి శఠగోపంతో ఆశీర్వదించి..,
చుట్టూ.. సుగంధ ద్రవ్యాల పరిమళం..గాలినిండా సామూహిక పఠన పవిత్రత ..ఏదో మంగళకర వాతావరణం..,
క్యాథీ చేతిలో ఒక కొబ్బరిముక్కను, కొద్దిగా పూలను ఉంచి..ఘంటధ్వని..గణగణ.,
మరో రెండు మూడు నిముషాల్లో అంతా ముగిసి..ప్రక్కన హాల్లో క్రింద ఆడిటోరియంలో ఏవో కార్యక్రమాలు నడుస్తున్నాయి. శాస్త్రీయ సంగీతం తాలూకు ఏదో గాత్రం శ్రావ్యంగా, సన్నగా వినబడ్తోంది.
”రా..” అని మళ్ళీ బయటికి దారితీసింది క్యాథీ.
మొత్తంమీద ఏదో ఓ ప్రధాన విషయాన్ని తన ముందు ప్రస్తావించేందుకు క్యాథీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది రామంకు.
బయటికి రాగానే..పచ్చగా, విశాలంగా ఉన్న గడ్డిపై కూర్చుంటూ,
”రామం.. నీకు చెప్పకుండా ఒక బృహత్తర కార్యక్రమాన్ని గత మూడు నెలలుగా నిశ్శబ్దంగా నిర్వహిస్తూ వస్తున్నాను. సడెన్‌గా చెప్పి సర్‌ప్రైజ్‌ చేద్దామని ఓ పిచ్చికోరిక. అందుకు నువ్వు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించిన ఈ రోజే సరియైందేమోనని ఈ టైంను ఎంచుకున్నా. సరిగ్గా నువ్వు భారత ఉపఖండంనుండి అమెరికాలోకి అధికారికంగా పౌరునివై ప్రవేశించిన, ఈరోజే .. నేను.. కాదు మనం యిటు ఈ అమెరికానుండి అధికారికంగా భారతదేశ వ్యాపారవ్యవస్థలోకి శక్తివంతంగా ప్రవేశిస్తున్నాం. ఈ రెండూ ఒకరోజే సంభవించడం యాదృచ్ఛికమే ఐనా చిత్రమే..”
”ఏమిటి క్యాథీ..వై యు ఆర్‌ సో ఎక్సైటెడ్‌”
”యస్‌..యామ్‌ రియల్లీ ఎక్సైటెడ్‌ టుడే..బికాజ్‌..వుయార్‌ నౌ రీచింగు టు స్టార్ట్‌ది మిషన్‌ విచ్‌ యు వర్‌ హిథర్‌ టు డ్రీమింగు.. ప్రపంచంలో అత్యున్నత అంతర్జాతీయ బహుళజాతి సంస్థల్లో ఒకటైన అసెంచుర్‌కు ఒక బిపిఓ ఔట్‌లెట్‌గాభారతదేశంనుండి ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు నేను అధీకృత కంపెనీ ఒకదాన్ని స్థాపించి గత నాల్గునెలలుగా ఆ కంపెనీ సిఇవో.. విలియమ్‌ డి. గ్రీన్‌తో చర్చలు జరుపుతూ వస్తున్నాను. అవి ఫలించి ఒక అంగీకారం కుదిరింది. ఈరోజు అమెరికా టైం ప్రకారం సాయంత్రం మేరీల్యాండ్‌ హోటల్‌ మెరియట్‌లో ఎంఓయుపై సంతకాలు చేయాలి. మనకు యుఎస్‌ఎ కు చెందిన నాల్గు ప్రాజెక్ట్స్‌.. మొత్తం నాల్గు మిలియన్‌డాలర్స్‌ విలువగలవి అప్పజెప్పబడ్తాయి. వాటితో ఆర్థికంగా పదునైన ఖడ్గంవలె మనం తయారై కార్యరంగంలోకి ప్రవేశిస్తాం.. ది ఫస్ట్‌ స్టెప్‌ విల్‌బి ఫర్మ్‌, రిజిడ్‌, స్టర్డీ అండ్‌ సాలిడ్‌. దీంతో మనం ఆంధ్రదేశంలో తేవాలనుకుంటున్న పెనుమార్పుకు శ్రీకారం జరుగుతుంది. యుద్ధం జరపాలనుకుంటున్నప్పుడు ఒక సమర్థవంతమైన వాహనం కావాలి. అది గుర్రమా, ట్రక్కా, హెలికాప్టరా, ఎఫ్‌ సిక్స్‌టీన్‌ కంకార్డా.. ఏదో ఒకటి. కావాలి మొత్తానికి. సరంజామాను సమకూర్చుకుంటున్నాం..  కంపెనీ పేరు..” ఆగింది క్యాథీ. గాఢ తపస్సులో ట్రాన్స్‌లో ఉన్న మనిషి మాట్లాడ్తున్నట్టుగా ఉందామె అప్పుడు.
”….” రామం వింటున్నాడు అభావంగా.
”కంపెనీ పేరు..రామం..”అంది ఒక్కక్షణం ఆగి.,
మళ్ళీ ప్రారంభించింది.
”పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే, పూర్ణస్య, పూర్ణమాదాయ, పూర్ణమేవావ శిష్యతే..” దటీజ్‌ అబ్‌సొల్యూట్‌  దిసీజ్‌ అబ్‌సొల్యూట్‌, అబ్‌సొల్యూట్‌ ఎరైజెస్‌ ఔటాఫ్‌ అబ్‌సొల్యూట్‌. ఇఫ్‌ అబ్‌సొల్యూట్‌ ఈజ్‌ టేకెనెవే ఫ్రమ్‌ అబ్‌సొల్యూట్‌.. ఆల్వేస్‌ అబ్‌సొల్యూట్‌ రిమైన్స్‌..అందుకే మన రామం కంపెనీ లోగో ఒట్టి శూన్యానికి ప్రతీకైన సున్నా..కాంతివంతంగా వెలుగుతూ ప్రజ్వలిస్తున్న సున్న..ఎ గ్లిట్టరింగు రింగు. ఇక స్లోగన్‌ టాగు..”చెప్పుకుపోతూనే ఉంది.
రామం ఆశ్చర్యపడ్తూ, ఆనందపడ్తూ, ఆమె దృష్టిలో తనే ఒక కేంద్రకమై కొనసాగుతున్నందుకు గర్విస్తూ.. పులకించిపోతూండగా.,
”ట్యాగు ఏంటంటే..”ఓ క్షణం ఆగి, అతనివంక చిలిపిగా, కవ్వింతగా చూచి
నిశ్శబ్దంగా సాధిస్తూపోయే నీ తత్వాన్ని ప్రతిబింబించే రెండే రెండు పదాలు..రేపు చరిత్రను సృష్టించబోతున్న రెండే రెండు బీజాక్షరాలతో కూడిన నినాదం..ప్రాణం, ప్రణవం..ప్రపంచం..”
”…” రామం ఆ క్షణం క్యాథీలో ప్రళయిస్తున్న స్త్రీ శక్తిని చూస్తున్నాడు.
ఏమిటీమెలో ఈ ఉద్ఘోష..అనుకున్నాడు
”చెప్పు” అన్నాడు అనూహ్యంగానే.
మళ్ళీ ఆమె వికసిస్తున్న పువ్వులా నవ్వి అంది..”జస్ట్‌ పర్‌ఫార్మింగు” అని..స్పష్టంగా, నిశ్చితంగా, స్థిరంగా చెప్పింది కంపెనీ తత్వాన్ని ప్రతిబింబించే ట్యాగులైన్‌ను.
ఔను.. జస్ట్‌ పర్‌ఫార్మింగు హియరాఫ్టర్‌..యిక సంచలనాత్మకంగా పనులను నిర్మాణాత్మక రీతిలో నిర్వహిస్తూ పోవడమే.. మడమ తిప్పకుండా, వెనక్కి తిరిగిచూడకుండా..ఏకోన్ముఖంగా,
ఐతే ఈ ‘రామం’ పేరేమిటి.. ఈమెకు తనపై ఈ అచంచలమైన విశ్వాసానీకీ, ఇష్టతకూ, ప్రేమకూ పునాది ఏమిటి.. నమ్మకం..ఒట్టి నమ్మకమేనా..అంతేనా.,
మనిషిపై మరో మనిషికి గట్టి నమ్మకం ఏర్పడ్డం మామూలు విషయము కాదు. మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలుగానే చెలామణి ఔతున్న స్వార్ధపూరిత వర్తమాన సందర్భంలో..మనిషిని మనిషి నమ్మడం.. అదీ ఈ స్థాయిలో నమ్మడం నిజంగా అపూర్వమే.
”రామం..నువ్వు స్వతహాగా లక్ష్యించిన గమ్యాలు గొప్పవి. ఒక అద్బుతమైన నూతన సమాజాన్ని సృష్టించాలని సంకల్పంచిన కాంక్ష గొప్పది…ఆ మహోన్నతమైన సాధనలో నీ వెంట ఒక స్నేహితురాలిగా పాలుపంచుకోవాలన్నది నా కోరిక..యిక్కడికి వచ్చిన్నాటినుండి నీ అన్ని సాహసోపేతమైన కార్యక్రమలూ నాకు తెలుసు..నీ వ్యూహాలు,  క్రమశిక్షణ, నిబద్ధత..నిర్వహణ..వీటన్నింటిలోనూ నీ నిజాయితీ..యివన్నీ యిన్నేళ్ళ నీ సాంగత్యంలో నాకు చాలా స్పష్టంగా తెలుసు.. అందుకే..యిక విమానం టేకాఫ్‌ కావలసిన సమయం ఆసన్నమైంది. నాకు తెలిసి ఒక మేనేజ్‌మెంట్‌ విద్యార్థిగా..ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఎందరో మహానుభావుల్లో ఉన్న అతి ప్రధానమైన జ్ఞానాలు నాల్గువిధాలు. ఒకటి మేధోసంబంధమైనదార్శనికత, రెండు శారీరక ప్రవర్తనను నియంత్రించే క్రమశిక్షణ, మూడు..హృదయ సంస్పందనలను కార్యోన్ముఖం చేసే కాంక్ష, నాల్గవది..అతి ప్రధానమైందీ ‘స్పృహ’ అనబడే ఆత్మ సంబంధియైన అంతఃచేతన. లూసియస్‌ సెనేకా అనే తత్త్వవేత్త ఏమన్నాడంటే..”మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఈజ్‌ హి హు హాజ్‌ హిమ్‌సెల్ఫ్‌ ఇన్‌ హిజ్‌ పవర్‌..’అని..మనిషి తనకున్న శక్తితో తనను తాను గుర్తించగలిగిననాడే నిజమైన శక్తిమంతుడు..”
క్యాథీ ఒక మనిషిగా ద్రవించి ప్రవహిస్తున్నప్పుడు రామం ఎప్పుడూ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదెన్నడూ. ఆమె ఓ జలపాతమౌతుంది అప్పుడప్పుడు.
”రామం.. అందరూ అడిగే ప్రశ్న ఒకటుంది..అది..నీవంటి లీడర్స్‌ పుడతారా లేక తయారుచేయబడ్తారా అని.. దీనిపైన ఎందరో విశ్లేషణాత్మక అధ్యయనాలను జరిపారు విపులంగా. ఐతే చివరికి చాలామంది అంగీకరించిన సత్యమేమిటంటే.. లీడర్స్‌ ఆర్‌ సెల్ఫ్‌ మేడ్‌ అని. ఒక నాయకుడు వాణ్ణివాడు మాత్రమే రూపొందించుకోవాలి. శిల ఉలితో తనను తానే చెక్కుకుని శిల్పంగా మలచుకొన్నట్టు. ఐతే యిక్కడ ఒక ప్రధానమైన విషయముంది రామం..లీడర్‌ ఎప్పుడు ఒకమేనేజర్‌ కాదు. నీకా విషయం తెలుసనుకో. ఐనా సందర్భం ఔచిత్యమైంది కాబట్టి మరోసారి చెబుతున్నా. డబ్ల్యు.బి. బెన్నిస్‌ ఏమన్నాడంటే ‘లీడర్సార్‌ పీపుల్‌ హు డు ది రైట్‌ థింగ్సు – మేనేజర్సార్‌ పీపుల్‌ హు డు థింగ్సు రైట్‌” సరియైన పనులనే చేయడం వేరు. పనులను సరిగా చేయడం వేరు…కదా” అని చటుక్కున ఆగి..నాలుక్కరుచుకుని., సిగ్గుపడ్తున్నట్టు తలవంచుకుని.,
”యువార్‌రైట్‌ క్యాథీ..” అన్నాడు రామం ప్రశంసాపూర్వకంగా.
”ఎనీ ఓవర్‌ యాక్షన్‌”
”నాటెటాల్‌..నెవర్‌ యువర్‌ ఓవర్‌”
”సో..రామం అనే కంపెనీకి సిఇఓ గారూ..యిక హైద్రాబాద్‌లో మన కంపెనీని స్థాపించే ప్రణాళికను యుద్ధప్రతిపాదికపై ప్రారంభిస్తారా. ఎట్‌ ది సేమ్‌ టైం..నా ఆఫర్‌ను అంగీకరించినందుకు ధన్యవాదాలు..” అంది ఆత్మీయత ఉట్టిపడ్తున్న స్వరంతో.
”థ్యాంక్యూ క్యాథీ..నిజానికి నువ్వు నా ఆత్మకు ఒక భౌతిక రూపానివి..ఈ ఒక వాక్యంకంటే ఇంక ఏమీ చెప్పలేను” అన్నాడు రామం కృతజ్ఞతాభావంతో పులకించిపోతూ అతనికాక్షణం  రెక్కలు మొలుస్తున్నప్పటి శిశుపక్షిలో కలిగే ఉద్వేగభరిత వివశత ఉండి.
”సాయంత్రం యిద్దరం మేరీల్యాండ్‌ మారియట్‌లో ఎంఒయుపై సంతకం చేద్దాం.. ఎ సెంచ్వుర్‌ సిఇఓ విలియమ్‌ డి. గ్రీన్‌తో…వెళ్దామా యిక…”
”దేవీగారి అజ్ఞమరి” నవ్వాడతడు ప్రసన్నంగా.
సరిగ్గా అప్పుడే మహాలక్ష్మి దేవాలయం నుండి  గుడిగంటలు మంగళప్రదంగా మ్రోగాయి..చుట్టూ గుంపులుగుంపులుగా ఉన్న ఎత్తైన చెట్లలోనుండి పకక్షుల గుంపులు నీలి ప్రశాంత ఆకాశంలోకి ఎగిరి నిష్క్రమించడం మొదలైంది. దార్శనికత, రెండు శారీరక ప్రవర్తనను నియంత్రించే క్రమశిక్షణ, మూడు..హృదయ సంస్పందనలను కార్యోన్ముఖం చేసే కాంక్ష, నాల్గవది..అతి ప్రధానమైందీ ‘స్పృహ’ అనబడే ఆత్మ సంబంధియైన అంతఃచేతన. లూసియస్‌ సెనేకా అనే తత్త్వవేత్త ఏమన్నాడంటే..”మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఈజ్‌ హి హు హాజ్‌ హిమ్‌సెల్ఫ్‌ ఇన్‌ హిజ్‌ పవర్‌..’అని..మనిషి తనకున్న శక్తితో తనను తాను గుర్తించగలిగిననాడే నిజమైన శక్తిమంతుడు..”
క్యాథీ ఒక మనిషిగా ద్రవించి ప్రవహిస్తున్నప్పుడు రామం ఎప్పుడూ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదెన్నడూ. ఆమె ఓ జలపాతమౌతుంది అప్పుడప్పుడు.
”రామం.. అందరూ అడిగే ప్రశ్న ఒకటుంది..అది..నీవంటి లీడర్స్‌ పుడతారా లేక తయారుచేయబడ్తారా అని.. దీనిపైన ఎందరో విశ్లేషణాత్మక అధ్యయనాలను జరిపారు విపులంగా. ఐతే చివరికి చాలామంది అంగీకరించిన సత్యమేమిటంటే.. లీడర్స్‌ ఆర్‌ సెల్ఫ్‌ మేడ్‌ అని. ఒక నాయకుడు వాణ్ణివాడు మాత్రమే రూపొందించుకోవాలి. శిల ఉలితో తనను తానే చెక్కుకుని శిల్పంగా మలచుకొన్నట్టు. ఐతే యిక్కడ ఒక ప్రధానమైన విషయముంది రామం..లీడర్‌ ఎప్పుడు ఒకమేనేజర్‌ కాదు. నీకా విషయం తెలుసనుకో. ఐనా సందర్భం ఔచిత్యమైంది కాబట్టి మరోసారి చెబుతున్నా. డబ్ల్యు.బి. బెన్నిస్‌ ఏమన్నాడంటే ‘లీడర్సార్‌ పీపుల్‌ హు డు ది రైట్‌ థింగ్సు – మేనేజర్సార్‌ పీపుల్‌ హు డు థింగ్సు రైట్‌” సరియైన పనులనే చేయడం వేరు. పనులను సరిగా చేయడం వేరు…కదా” అని చటుక్కున ఆగి..నాలుక్కరుచుకుని., సిగ్గుపడ్తున్నట్టు తలవంచుకుని.,
”యువార్‌రైట్‌ క్యాథీ..” అన్నాడు రామం ప్రశంసాపూర్వకంగా.
”ఎనీ ఓవర్‌ యాక్షన్‌”
”నాటెటాల్‌..నెవర్‌ యువర్‌ ఓవర్‌”
”సో..రామం అనే కంపెనీకి సిఇఓ గారూ..యిక హైద్రాబాద్‌లో మన కంపెనీని స్థాపించే ప్రణాళికను యుద్ధప్రతిపాదికపై ప్రారంభిస్తారా. ఎట్‌ ది సేమ్‌ టైం..నా ఆఫర్‌ను అంగీకరించినందుకు ధన్యవాదాలు..” అంది ఆత్మీయత ఉట్టిపడ్తున్న స్వరంతో.
”థ్యాంక్యూ క్యాథీ..నిజానికి నువ్వు నా ఆత్మకు ఒక భౌతిక రూపానివి..ఈ ఒక వాక్యంకంటే ఇంక ఏమీ చెప్పలేను” అన్నాడు రామం కృతజ్ఞతాభావంతో పులకించిపోతూ అతనికాక్షణం  రెక్కలు మొలుస్తున్నప్పటి శిశుపక్షిలో కలిగే ఉద్వేగభరిత వివశత ఉండి.
”సాయంత్రం యిద్దరం మేరీల్యాండ్‌ మారియట్‌లో ఎంఒయుపై సంతకం చేద్దాం.. ఎ సెంచ్వుర్‌ సిఇఓ విలియమ్‌ డి. గ్రీన్‌తో…వెళ్దామా యిక…”
”దేవీగారి అజ్ఞమరి” నవ్వాడతడు ప్రసన్నంగా.
సరిగ్గా అప్పుడే మహాలక్ష్మి దేవాలయం నుండి  గుడిగంటలు మంగళప్రదంగా మ్రోగాయి..చుట్టూ గుంపులుగుంపులుగా ఉన్న ఎత్తైన చెట్లలోనుండి పకక్షుల గుంపులు నీలి ప్రశాంత ఆకాశంలోకి ఎగిరి నిష్క్రమించడం మొదలైంది.

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ? – 5వ భాగం

Ekkadi(1)

(గత వారం తరువాయి )

5

మొబైల్‌ మ్రోగింది.
మనిషి తనను తాను ఎక్కడో పోగొట్టుకుని అవ్యవస్థితమై ఏదో ఒక ఆలోచనలో సమాధియైపోవడం, శవప్రాయమై అనిమిత్తమైపోవడం ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనుభవమయ్యే విషయమే. అప్పుడు ఏ కొద్ది అంతరాయమైనా మనిషిని ఉద్విగ్నుణ్ణి చేస్తుంది..ఉలిక్కిపడ్డాడు రామం.
మనసు సుడిగాలిలో కాగితపు ముక్కలా ఉంది.. ఒకరకంగా..యుద్ధంలో పాల్గొనబోయేముందు దీక్షాబద్ధుడైన సైనికునిలా ఉంది..యిక ప్రయాణం ప్రారంభించాలి.
‘హాలో..” అన్నాడు
”హై..” అటునుండి క్యాథీ.
”ఓ.”
”ఐయామ్‌ వెయిటింగు ఫర్యూ ఎట్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌..యుహావ్‌ గినెన్‌ టైం. హావ్యూ ఫర్గాట్‌”సారీ…ఐ ఫర్గాట్‌.. కమింగు నౌ..”
ఉన్నపళంగా లేచి..టకటకా బయటికి వచ్చి తన ఇన్ఫినిటీ, కారును స్టార్ట్‌ చేశాడు రామం.. వాటర్‌హాలో, డార్సీ స్ప్రింగు, అబ్జర్వేషన్‌ డ్రైవ్‌, కాంఫ్రీ, రాయల్‌ క్రౌన్‌.. కారు సర్రున జారిపోతోంది. బయట సన్నగా వర్షం.,
జ్ఞాపకాల వర్షం.. చినుకులు చినుకులుగా ఘటనలు,
జీవితంలోకి క్యాథీ అనే ఈ అమెరికన్‌ యువతి యొక్క ప్రవేశం యాదృచ్ఛికమే ఐనా..పోను పోను ఓ ప్రభావశీలమైన అనుబంధంగా మారడం..మనుషుల ప్రాంతాలు, మూలాలు, దేశాలు, నేపథ్యాలు..వీటితో ఏ సంబంధమూ లేకుండానే ఒక హృదయానుగతమైన అనురాగంతో చేరువై ఆత్మీయులుగా మారుతూండడం.. ఇదంతా ఓ చిత్రమైన ఏ నిరూపణకూ, తత్వానికీ, తత్వజ్ఞానానికీ అందని అంతరిక రహస్యమై.,
తను మొదట టిసిఎస్‌ స్టాఫ్‌గా రాక్‌విల్లీలో చేరిన తర్వాత రెండు నెలల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ఒక వారం రోజుల తేడాతో పరిచయమైన విశిష్టమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు ఇద్దరు. ఒకరు లీల. మరొకరు క్యాథీ. లీల తను చేరిన పదిరోజుల తర్వాత భారతదేశంనుండే టిసిఎస్‌స్టాఫ్‌గా మేనేజ్‌మెంట్‌ మాడ్యూల్‌లో హైద్రాబాద్‌ బ్రాంచ్‌నుండి వచ్చి చేరిన వ్యక్తి. ఆమె ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బెంగళూర్‌ నుండి బంగారు పతక గ్రహీత. క్యాంపస్‌ ఇంటర్వూలో తన వలెనే ఎంపిక చేయబడి చాలా మంచి జీతంతో ప్రవేశపెట్టబడ్డ వ్యక్తి. అప్పటికే ఆమెకు గొప్ప ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. విద్యార్థిగా ఉన్నపుడే ఎన్నో సంస్థలతో సంబంధాలు పెట్టుకుని అనేక విజయాలను సాధించి పెట్టిన మనిషి. ప్రధానంగా బిజినెస్‌ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగు కార్యకలాపాలను విస్తరించే ప్రత్యేక విధులకోసం ఆమెను రాక్‌విల్లీ ఆఫీస్‌కు పంపారు.
లీల..ఒక వ్యక్తే..కాని ఒక వ్యవస్థతో సమానం. మనిషి చేతలు, కదలికలు, నిర్ణయాలు, ఒక కేస్‌ను అధ్యయనం చేసే విధానం చాలా విలక్షణమైంది. ఆమె ఆలోచనలు పోలీస్‌లవి. చూపులు డేగవి. వ్యూహాలు సింహానివి. తెలివి చాణక్యునిది. వెరసి లీల అంటే విజయానికి ప్రతీక.
ఐతే.. లీల అందగత్తె.. లీల అహంకారి..లీల పొగరుబోతు.
అంటుంది..’నా అహంకారమే నాకు అలంకారం’ అని.

”ఐ లైక్‌ మెన్‌ ఆఫ్‌ మల్టిట్యూడ్స్‌.. బహుముఖ ప్రజ్ఞాశాలులంటే నాకిష్టం..”అంది మొదట తన్ను తాను పరిచయం చేసుకుంటూ. అంతకుముందు ఒక వారంరోజులు తనను ఆమె అతి వివరంగా పరిశీలించి అధ్యయనం చేసినట్టు తనకు తెలుసు. తను ఒక అసాధారణ ప్రతిభగల మెకానికల్‌ ఇంజనీరే కాకుండా, కాడ్‌కాం రంగంలో, ఫ్లెక్సిబుల్‌ మెషినింగు సిస్టమ్స్‌లో, స్పేస్‌ అప్లికేషన్‌ బేరింగ్సు రూపకల్పనలో సాప్‌ సాఫ్ట్‌వేర్‌ను సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వాడడం.. ఈ రంగాల్లో తన అసమాన ప్రతిభను లీల అద్భుతంగా పసిగట్టింది.
ఒకరోజు ‘స్టార్‌బక్‌ కాఫీ షాప్‌’ లో కలుసుకుందామని ప్రపోజ్‌ చేసి పర్సనల్‌గా ఒక గంటసేపు మాట్లాడింది. ఆ సంభాషణ తర్వాత కొంత చేరువైనట్టనిపించింది. మనిషి ఎంతో డైనమిక్‌ ఐనా చాలా లోతైన తాత్విక ఆలోచనలు గల సున్నితమైన దృఢసంకల్పంగల మనిషి..ఆమెకు తనదైన ఒక వ్యవహారశైలి ఉంది. చొరవ ఉంది. సింహంవలెనే పట్టువిడువకుండా వేటాడే గుణముంది. అన్నింటినీమించి అద్భుతమైన ధైర్యముంది.
ఐతే లీల గురించి అర్ధంగానిది ఆమె యొక్క ‘పాదరసం’ వంటి చంచల స్వభావం. దాన్ని అస్థిరత అనే వీలేలేదుగాని, అస్పష్టమైన సందిగ్ధతగా అర్థం చేసుకోవచ్చునేమో. మంచి ఇంగ్లీష్‌. మంచి వ్యక్తీకరణ..ఎదుటి మనిషిని రెండు నిముషాల్లో ఆకట్టుకునే దేహభాష.
ఎందుకో ఆమెతో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఏదో తెలియని ఆకర్షణకూడా పెరుగుతూ వచ్చింది తనలో. ఆమెను తరుచూ కలుసుకోవాలనీ, సాధ్యమైనంత ఎక్కువసేపు మాట్లాడాలనీ, ఎక్కవకాలం సాంగత్యాన్ని అనుభవించాలనీ అనిపించేది.
ఆమె అభిరుచులుకూడా తనను ఎంతో ఆకట్టుకున్నాయి. తనవలెనే ఆమెక్కూడా మధురమైన సంగీతాన్ని వినాలని కోరిక. ప్రకృతిని ఆరాధించే తత్వం..ముఖేశ్‌ పాటలను తను తదేకంగా వింటున్నపుడు ఓ చరణాన్ని అందుకుని హమ్మింగు చేసేది. ఒంటరితనాన్ని యిష్టపడ్తుంది. విపరీతంగా పుస్తకాలను చదువుతుంది. ఏ కారణంవల్లనైనా  డిస్టర్బ్‌ ఐనపుడు ఎటో ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది. ‘హిట్‌ అండ్‌ మిస్‌ కాకుండా..హిట్‌ అండ్‌ స్టే..అండ్‌ ఫేస్‌’ తత్వం ఆమెది.
‘జీవితం ఓ యుద్దం. పోరాడి గెలవాలి’ అనేది ఆమె సిద్ధాంతం. కారు మైల్‌స్టోన్‌ సెంటర్‌ మలుపు తిరిగింది..వర్షం ఉధృతమై చినుకులు చిక్కబడ్డాయి.
ekkadi -5

క్యాథీది లీలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. లీల జలపాతమైతే క్యాథీ మైదానథలో ప్రవహించే నది. నిండైన మనిషి. తొణకకుండా గంభీరంగా ఏ సమస్యనైనా తట్టుకుని శాంతంగా పరిష్కరించగల నేర్పరి. వెన్నెల ముద్దతో చేసిన మనిషిలా అతి సున్నితమైన, నాజూకైన సౌందర్యం ఆమెది. తేనెరంగు కళ్ళు, రాగిరంగు వెంట్రుకలు, గోధుమరంగు శరీరం. కళ్ళలో తొణికిసలాడే జీవకాంతి. అన్నింటినీ మించి క్రమశిక్షణతో కూడిన ప్రతిభ. చేస్తున్న పనిలో నిజాయితీ.
జన్మతః మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలోనుండి వచ్చింది క్యాథీ. తండ్రి జాన్సన్‌ మంచి ఇండస్ట్రియలిస్ట్‌. ఫోర్డ్‌, జియంసి, టయోటా కంపెనీలకు కొన్ని కారు విడిభాగాలను ‘జస్ట్‌-ఇన్‌-టైం’ పద్ధతిలో సరఫరా చేసే పరిశ్రమ ఉందతనికి. జీవితకాలమంతా ఆ పరిశ్రమను ఉన్నతీకరించడంలోనే గడిపిన వ్యక్తి. తల్లి మేరీ గృహిణి. ఒక్కతే కూతురు క్యాథీ. తన తర్వాత తన పరిశ్రమను నిర్వహించగల సమర్థను క్యాథీలో పాదుకొల్పేందుకు క్యాథీతో బి.ఎస్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ చేయించాడు. అందులో ఆమె యూనివర్సిటీ ఫస్ట్‌ వచ్చింది. అనెహర్బర్‌లో ఉండేవాళ్లు మొదట. తర్వాత డెట్రాయిట్‌కు మారి.,

పదేళ్ళక్రితం క్యాథీ పరిచయమైనపుడు తండ్రితో కలిసి తూర్పుతీరంలో, వాషింగ్టన్‌ డి.సి. మాంగోమెరీ, గేథర్‌ బర్గ్‌, మేరీల్యాండ్‌, వీటన్‌.. అటు వర్జీనియా ప్రాంతాల్లో ఔట్‌లెట్స్‌ తెరిచి వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌కోసం సాఫ్ట్‌వేర్‌ కావాలని తనదగ్గరికొచ్చారు. అప్పుడే మొదట ఆమెను చూడడం. తర్వాత్తర్వాత నాల్గయిదు సార్లు పనులకోసమే పదేపదే తనను కలిసింది. కలిసిన ప్రతిసారీ ఏదో తెలియని ఆకర్షణ ఆమె వైపు లాగేది. మనిషిలో ఏదో ప్రత్యేకత కనిపించేది. సహజమైన అమెరికన్‌ యువతుల్లో ఉండే ఫ్యాన్సీనెస్‌, శరీరాన్ని బహిరంగంగా ప్రదర్శించే లౌల్యం కొద్ది అతిగా అనిపించే ప్రవర్తనగానీ ఏవీ ఆమెలో లేవు. పద్ధతైన అణుకువతో నిండిన వినమ్రత, అవధుల్లోనే ఉంటూ ఎదుటిమనిషిపై జరిపే తెలివైన దాడి.. యివన్నీ తనను ఎంతో ఆకట్టుకునేవి.

ఎందుకోగానీ తనపట్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకుని..”ఐయామ్‌ ఫీలింగు టు బి ఎ ఫ్రెండాఫ్‌ యు” అంది క్యాథీ అకస్మాత్తుగా..ఓసారి..
ఆమె కళ్ళలోకి చూశాడాక్షణం తను. ఏదో అనిర్వచనీయమైన లాలస.
తనక్కూడా అలాగే అనిపించింది. ఐతే క్యాథీతో అనిపించిన ఈ ఉద్విగ్నానుభవం లీల విషయంగా అనిపించలేదు.
లీలలో ఒట్టి ఆకర్షణ ఉంది. కాని క్యాథీలో దాన్ని మించిన ఇంకేదో భాషకందని నిజాయితీకి, నిర్మలత్వానికి సంబంధించిన బలమైన ఉన్మీలన శక్తి ఉంది.
క్రమక్రమంగా క్యాథీ ఇంకా ఇంకా చేరువై..ఒకరి వ్యక్తిత్వంలోకి మరొకరు తొంగి చూచుకుని, ఒకరిగురించి మరొకరు ఇంకా వివరంగా, లోతుగా తెలుసుకుని ఒకర్నొకరు చదువుకుని,
”దీన్నేమంటారు” అని అడిగాడు తను ఒకరోజు పార్క్‌లో కూర్చున్నపుడు.
క్యాథీ అంది ”మె బి లవ్‌” అని.
”ఈజిట్‌”
స్పష్టాస్పష్టంగా, ద్వైదీభావంగా, ఒక్కోసారి డోలాయమానంగా..మనిషికి ఏది కావాలో ఏది వద్దో..ఆ కావలసింది ఏమిటో, వద్దనేది కూడా ఏమిటో..మోహానికీ, కామానికీ, ప్రేమకూ తేడా తెలియకుండా గాలిలో దూదిపింజవలె తేలిపోతున్నట్టనిపించే వయసులో.,
ఎక్కడో విన్నాడు తను..’జవానీమే సువ్వర్‌ భీ సుందర్‌ లగుతా హై’ అని
వయసువల్ల వస్తున్న పరితపనా ఇది. శారీరకంగా ఉధృతమౌతున్న భౌతిక వాంఛనా ఇది. మౌనంగా యుక్తతవల్ల అంతరాంతరాల్లో రగులుతున్న యవ్వనాగ్నా ఇది.
..ఐతే..ఈ పరితపన లీలపై ఎందుక్కలగట్లేదు.
లీల కూడా..స్పష్టంగా సంకేతాలిచ్చింది తనకు చేరువకావాలని..స్నేహం కావాలని..సాంగత్యం కావాలని..కాని.. అది ప్రేమా?..వ్చ్‌..ఏమో. ఆమె కూడా దాన్ని ప్రేమ అనిగానీ మనం ప్రేమించుకుందామనిగానీ..అంతకుమించి ఇంకేదైనా అనిగానీ అనలేదు తనతో.
కాని ఏదో ఉంది లీలకు తనపట్ల..ఆ ఏదో ఏమిటి..పోనీ తనక్కూడా లీలపట్ల ఆ ఏదో ఉందా..?
అప్పుడు తనకు ఇరవై తొమ్మిదేండ్లు..అమెరికాకు వచ్చి మూడవ సంవత్సరం.
టిసిఎస్‌నుండి రాజీనామా చేసి..కొన్నేళ్ళ తర్వాత భారతదేశం తిరిగివెళ్ళి ప్రజాజీవితంలోకి వెళ్లవలసిన లక్ష్యాలనుస్పష్టంగా నిర్వచించుకుని ఒక ఎంటర్‌ప్రునర్‌గా మారాలనీ, సర్వశక్తులనూ ఒడ్డి యిక సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలనీ, తనవంటి ఆలోచనా ధోరణే కలిగిన వ్యక్తులను ఇక్కడ అమెరికాలో, అక్కడ భారతదేశంలో గుర్తించి సమీకరించాలనీ నిర్ణయించుకుని ఒక్కసారే ఒక నెలరోజుల్లోనే మూడు స్వతంత్ర వ్యాపారసంస్థలను ప్రారంభించిన సందర్భంలో,
ఒకసారి.. చాలా సూటిగా తను లీలతో ఒకనాడు, క్యాథీతో మర్నాడు జీవితంగురించి చర్చించాడు.
లీల స్పష్టంగా చెప్పింది..’మన అభిరుచులు ఒక్కటే..కాని మన గమ్యాలు వేరు’ అని. తనకు పరిచయమై రెండున్నర మూడేళ్ళు గడిచేసరికి లీల ఆలోచనల్లో, ఎత్తుగడల్లో జీవితాన్ని వ్యూహాత్మకంగా జీవించాలని సరికొత్తగా నిర్వచించుకోవడంలో ఎంతో మార్పు కనిపించింది. ఉద్యోగరీత్యాగానీ, స్వంత ఆసక్తులవల్లగానీ లీల ఆ కాలంలో ఎన్నో దేశాలను, ముఖ్యంగా భారతదేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడ్డ, ఉద్యోగరీత్యా సంభవించిన సంబంధాల వల్ల చాలా విస్తృతంగా పర్యటించింది. అనేకమంది ప్రముఖులతో కాంటాక్ట్‌ ఏర్పడింది. సంపన్న వర్గాల్లో  బయటికి కనిపించని అనేక అంతర్గత రహస్యాలనూ, వ్యాపార మూలాలనూ, లావాదేవీలనూ, మనుషులను లోబర్చుకునే అనేకానేక మార్గాలనూ చాలా లోతుగా అధ్యయనం చేసింది. ఎవరిని ఎలా టాకిల్‌ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎలా లోబరచుకుని పనిచేయడానికి ఒప్పించాలి.. ఎవరిని ఎక్కడ భయపెట్టి ఎలా బ్లాక్‌మెయిల్‌ చేయాలి వంటి రాజకీయ, కార్పొరేట్‌ విధానాలన్నింటినీ సుళువుగా అలవర్చుకుంది. ఈ చీకటి వ్యాపారాత్మక ప్రపంచంలో లోలోతులకు దిగుతున్నకొద్దీ లీల వ్యక్తిత్వంలో ఎంతో గుణాత్మకమైన మార్పులు కొట్టొచ్చినట్టు కనబడేవి. ఒక్కోసారి తనను అతిక్రమించి నియంతలా మాట్లాడేది. ప్రవర్తించేది.
”వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి రామం.. మనందరం బురదలో కూరుకుపోయి ఉన్నాం. యిక స్వచ్ఛత గురించి ఆలోచించి లాభంలేదు. బస్‌.. వర్రీ ఎబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌.. అంతే. ఇదే జీవితం.. విజయం సాధించినవాడే గౌరవింపబడ్తాడు. విజయం ఎలా సంభవించిందన్నది ముఖ్యం కాదు. సాధించింది విజయమా కాదా అన్నదే ప్రధానం.”
”అంటే..”
”అంటే..ఎర్న్‌..సంపాదించు..ఇంకా సంపాదించు..ఎదుగు.. ఎదుగు..అంతే..”
”ఎంత సంపాదించు..ఎంత ఎదుగు..”
షాకై చూచింది..తుపాకీ గుండు తాకిన జంతువులా.
”ఉహు..రామం..నువ్వు మారవు. నీకు సిద్ధాంతాలు కావాలి”
”నేనదే అంటున్నాను. నువ్వు మారవు. నీకు కేవలం డబ్బే కావాలి..నీకు డబ్బు పిచ్చిపట్టింది.”
”కాదు..నాకు ఈ కార్పొరేట్‌, కరెప్టివ్‌ పొలిటికల్‌ బాస్టర్డ్స్‌, బ్రూరోక్రటిక్‌ ప్రభుత్వ అధికారులు. వీళ్లందరి మీద కసి ఉంది..రామం నువ్వు నన్ను స్టడీ చేయలేకపోతున్నావు..విశ్వనాథన్‌ ఆనంద్‌ అద్భుతంగా చెస్‌గేమ్‌ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపిస్తాడు. అలా ఎదుటిమనిషిని ఓడించడంలో ఒకరకమైన అద్భుతానందముంటుంది. నాకు ఆ ఆనందం కావాలి. ఆనందం నేను గెలుస్తున్నందుకు కాదు.. ఎదుటివాన్ని ఓడిస్తున్నందుకు..”
”నీ దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉంది లీలా..ఐతే దాన్ని పరిమితమైన నీ వ్యష్టి అభివృద్ధి గురించీ, నీ స్వంత వికాసం గురించి మాత్రమే వెచ్చించాలనుకుంటున్నావు. అంతకంటే ఇంకాస్త విశాలంగా సమిష్టివృద్ధి గురించి ఆలోచించగలిగితే..”
”స్టాపిట్‌..సమిష్టి ఎక్కడుంది రామం..ఒకప్పటి భారతీయ జీవన వ్యవస్థలో ‘ఒక్కరికోసం అందరు..అందరికోసం ఒక్కడు ‘ విధానం ఉండేది. కాలం గడుస్తున్నకొద్దీ మనుషుల్లో నైతిక పతనం సంభవిస్తూ సంభవిస్తూ ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే తరహాలో దిగజారిపోయి అసలు మానవతా విలువల స్పృహే లేక ఒక సంకక్షుభిత వాతావారణంలో కూరుకుపోయి..నువ్వు ఏ రంగమైనా తీసుకో..రాజకీయాలు..పచ్చి వ్యభిచారంకంటే హీనం. అత్యున్నత స్థాయిలో ఉన్న ఏ పార్టీ అధినేతనైనా తీసుకో. వేల, లక్షల కోట్లను గోడౌన్లలో నగదురూపంలో కట్టలకట్టలను గోనెసంచులో నింపుకు పెట్టుకుని కదూ రాజకీయాలు చేస్తున్నది. కార్పొరేట్‌ సెక్టార్‌లో సిఇవో అన్నా, ఎమ్డీ అన్నా, వైస్‌ ప్రెసిడెంట్‌ అన్నా ఏమిటి.. ఏ జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్ట్‌నైనా కిక్‌బ్యాక్‌లతో స్వంతం చేసుకోవాలని ప్రయత్నించే వెధవకదా. శివుని శిరసుపైనుండి గంగ ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి మున్సిపల్‌ మురుక్కాలువలోకి ప్రవహించినట్టు ఈ దిక్కుమాలిన అవినీతి సమాజంలో మున్సిఫల్‌కార్పొరేటరంటే వీధిస్తాయి కాంట్రాక్టరై, ఎమ్మెల్యే అంటే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కాంట్రాక్టరై, ఎంపీ అంటే జాతీయస్థాయి కాంట్రాక్టరై, మంత్రులందరూ అంతర్జాతీయ స్థాయి బ్రోకర్లయి, దళారులై, ముఖ్యమంత్రులు మధుకోడాలుగా నేరచరితులై.. ప్రభుత్వ యంత్రాంగమంతా చిలుంపట్టి, భ్రష్టుపట్టి, ఒక కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్ష్టర్‌పై ఎసిబి దాడిచేస్తే కనీసం ఇరవై కోట్లు బయటపడే స్థితి, జాయింట్‌ కలెక్టరైతే కనీసం వందకోట్లు, ఐఏఎస్‌ అయితే వందలకోట్లు.. ఏమిటి.. ఏమిటదిది.. ప్రజలైతే ఇంకా నీచంగా పతనమై తమను తాము అమ్ముకునే స్థితిలో చచ్చిపోతున్నారు. ఉచితంగా యిస్తే పేడను కూడా తినే తత్వాన్ని అలవర్చుకుంటున్నారు. ఓట్లకోసం ఈ దిక్కుమాలిన రాజకీయనాయకులు ఉచితంగా కలర్‌ టి.విలు యిస్తే తీసుకుంటారు. విస్కీ సీసాలు తీసుకుంటారు. నగదు బదిలీ ప్రలోభాలు కలిగిస్తే తలలూపుతారు. ఉచిత కరెంటు,  ఉచిత బియ్యం, ఉచిత విద్య, ఉచిత్య ఆరోగ్యం, ఉచిత బట్టలు, ఉచిత ఆహారం, ఉచిత మోటార్‌ సైకిల్‌. ఉచిత పెళ్లాం, ఉచిత మొగుడు..నీయమ్మ…ఈ ఉచితాలు ఎక్కడ్నుండిస్తావ్‌రా వెధవా అన్నీ నీస్వంత ఆస్తుల్లోంచి యివ్వరా చవటా అని ఏ ఒక్కడైనా ఎవెర్నైనా నిలదీసి ప్రశ్నిస్తున్నారా. నలభై రూపాయలకు కిలో బియ్యం అమ్ముతున్న మార్కెట్‌నుండి రెండ్రూపాయలకు కిలో బియ్యం అసలెలా పుడ్తాయి. ఇవి జన సంక్షేమ పథకాలా, జన సంక్షామ పథకాలా..ఎవరి డబ్బును దోచి ఎవరు ఎవరికి పెడ్తున్నారు. ఎవరు ఎవరిని మభ్యపెట్టి మాయచేసి నిద్రపుచ్చుతున్నారు. పౌరులను అత్యుత్తమ బాధ్యతలతో కూడిన సామాజిక కార్యకర్తలుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ప్రజాకర్షక పథకాలతో జనాన్ని సోమరిపోతులుగా, బిచ్చగాళ్లుగా, పరాన్నభుక్కులుగా మారుస్తూంటే ప్రశ్నించే ఒక్క మేధావైనా ఈ దేశంలో ఉన్నాడా. ఎన్నికల్లో సూటిగా ‘నగదు బదిలీ’ ..అంటే నేరుగా డబ్బునే లంచంగా యిస్తా ఓటర్లకు అని ఒక నాయకుడు ప్రణాళికగా ప్రకటిస్తే దాన్ని ఒక ఆర్థిక శాస్త్రవేత్త భలే భేషయిన ఆలోచనగా ప్రశంసించి పరమ కుచమర్థన స్థాయిలో  శ్లాఘిస్తే..అసలీ దేశం, ఈ వ్యవస్థ ఏమైపోతోంది. ఎక్కడికి పోతోంది. ఎట్నుండి ఏదిశలోకి ప్రయాణిస్తోంది.
దేశానికి వెన్నెముకవంటి యువత ఈ దేశంలో ఏ కార్యకలాపాల్లో మునిగి ఉందో చెప్పు రామం. ఏ స్థాయి యువతీ యువకుణ్ణయినా తీస్కో..చేతిలో సెల్‌ఫోన్‌, చేయిచాచితే బూతు వెబ్‌సైట్లతో విరాజిల్లే ఇంటర్నేెట్‌, టి.వి. ఆన్‌ చేయగానే ఒక సముద్ర కెరటంలా పైనబడే బూతురోత, దిక్కుమాలిన కుక్కలకొట్లాటవంటి ‘మేధావుల’ చర్చలు, అడ్డూ ఐపూలేని అవసరానికి మించి లెక్కకు మిక్కిలి ఆరువందల ఎనభై ఇంజినీరింగు కాలేజీలు, రెండున్నర లక్షలకు పైగా చెత్తవలె ప్రతి సంవత్సరమూ తయారై ఈ దేశపు రోడ్లమీద వ్యాపించే నాన్‌ ఎంప్లాయబుల్‌ ఫేక్‌ ఇంజనీర్ల కంపు. అసలు పాఠాలే చెప్పని ప్రొఫెషనల్‌ కాలేజీలు, ప్రమాణాలు, నాణ్యత అంటే ఏమిటో తెలియని విద్యాబోధనా పద్ధతులు, వ్యాపార కేంద్రాలుగా మారి విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలు..ఏ ఒక్క యువకునికైనా సమాజస్పృహ, దేశ స్పృహ ఉందా..ఈ దిక్కుమాలిన దుస్థితిని సరిచేద్దామన్న కనీస ఆలోచన ఉందా..”
”నేనూ అదే అంటున్న లీలా..కనీస ఆలోచనైనా ఉందా అని.. నీవంటి ప్రతిభాశీలియైన యువతికైనా దేశంగురించిన కనీస స్పృహ ఉండాలి గదా అని నేనంటున్నా..అందరూ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే..దీపాన్ని వెలిగించేదెవ్వరు.. నీవంటి జీనియస్‌ కనీసం సమాజం యింత బీభత్సంగా చెడిపోయిఉందని గ్రహించడమే విశేషం..ఐతే దానిని శుభ్రపర్చే మార్గం అన్వేషించి ఏదో ఒక పరిష్కారం కనుక్కొని అమలు చేయకుండా ఊర్కే ఎదుటివాళ్లను విమర్శిస్తూ కూర్చుంటే.. మిగతా వాళ్ళకూ మనకూ తేడా ఏమిటీ అని..”
లీల ఉలిక్కిపడి చూచింది రామంవైపు.
”నాకు ఈ వ్యవస్థమీద కసిగా ఉంది రామం”
”కాబట్టి..”
” ఈ అసమర్థ పాలకులు, అవ్యవస్థితమైన వర్తమానం, కొద్దిగా తెలివీ, నీతిహీనతా, ఎక్కువ ధైర్యం ఉన్న ఎవరైనా రాక్షసంగా ఎదిగి ఎదిగి విజృంభించగల ఈ ప్రస్తుతస్థితిలో ఒకసారి కసిగా ఈ వ్యవస్థలో ఆడుకుని నన్నునేను పరీక్షించుకోవాలనుకుంటున్నా..లైకె ఎ గేమ్‌ ఐ వుడ్‌ లైక్‌ టు మేక్‌ ది లైఫ్‌ ఎ ఛాలెంజింగు టాస్క్‌ అండ్‌ ఎంజాయ్‌”
”ఊఁ.. చివరికి ఏం సాధిస్తావ్‌..”

”ఆ ప్రశ్నే అనవసరం..ఆనందించడమే జీవితం..అందరూ పైశాచికమైన చర్య ప్రతిచర్యలతోనే ఆనందిస్తున్నారీ ప్రపంచంలో. ఇరాక్‌పై దాడిచేయం బుష్‌కు ఆనందం..ప్రజలను వెధవలను చేసి కోట్లు కోట్లను సంపాదించి ప్రపంచంనిండా బ్రాంచీలతో ఎదగడం, పైగా నీతులను, బోధనలనూ కొనసాగించడం భారతదేశపు ఏమతానికి చెందిన స్వామికైనా ఆనందం, ప్రజలపై డబ్బును కుమ్మరించి.. బిచ్చగాళ్ళ గుంపుపైకి కరెన్సీ నోట్లను ఎగజల్లి ఏరుకుంటూ వాళ్ళు కొట్టుకుని చస్తూంటే సంతోషించడం ఈ రాజకీయ నాయకులకు ఆనందం. కార్పొరేట్‌ ప్రపచంలో అంతులేని డబ్బును ప్రోగుచేసుకుంటూ  ఫోర్బెస్‌ జాబితాలోకి దూసుకుపోవాలనుకోవడం ఇంకొందరికి ఆనందం..ఎవని ఆనందాన్ని ఎవడు నిర్వచించగలడు. ఎవని ఆనందాతిరేకాలు తప్పని ఎవరిని ఎవడు నిరోధించగలడు. నో థియరీ ఫిట్స్‌ టు ద సిస్టమ్‌..”
”కుళ్ళిపోయి, భ్రష్టుపట్టిపోయి..తెలివైన సామాజిక స్పృహ ఉన్న మనవంటి యువతనుండి ఏదో ఒక చికిత్సను కోరుతున్న వర్తమాన భారతదేశస్థితిని నువ్వు చూస్తున్న దిశ లోపభూయిష్టంగా ఉంది.లీలా”
”కావచ్చు..మూడువేలకోట్ల రూపాయల స్కామ్‌లో కోర్టులో సాక్ష్యంచెబ్తూ హర్షద్‌మెహతా ఏమన్నాడో తెలుసా రామం.. నేను అంతా భారతదేశ సెబీ నిర్దేశించిన రూల్స్‌ ప్రకారమే చేశాను..తప్పేదైనా ఉందీ అంటే అది లోపభూయిష్టమైన మీ దిక్కుమాలిన రూల్స్‌లో ఉన్నాయి. దమ్ముంటే మీ రూల్స్‌ను సరిచేసుకుని సవరించుకోండి. లేకుంటే ఆ కుళ్ళులోనే కుళ్లిచావండీ అన్నాడు.. మొన్న వేలకోట్ల రూపాయల స్టాంప్‌పేపర్ల కుంభకోణంలో తెల్గీ కూడా అదే అన్నాడు..ఎక్కడని ఈ వ్యవస్థను రిపేర్‌ చేస్తావు రామం. దిస్‌ సిస్టమ్‌ ఈజ్‌ ఇర్రిపేరబుల్‌. దీని సర్వాంగాలూ కుళ్లిపోయినై..”
”అందుకే. మరమ్మత్తుకు లొంగనపుడు, సాధ్యంకానపుడు మొత్తం వ్యవస్థనే మార్చాలి. ధ్వంసానంతర పునర్నిర్మాణం జరగాలి.”
”కదా.. అందుకే ఈ వ్యవస్థయొక్క సంపూర్ణ ధ్వంసానికి నేను ఉపక్రమిస్తున్నా..తదనంతర పునర్నిర్మాణం నువ్వు చెయ్‌” అంది లీల స్పష్టంగా..నిశ్చలం.
అప్పుడు..ఆ రోజు కూడా భీకరమైన వర్షమే..ఈ చర్చ..ఒక సాయంకాలం రిహోబోత్‌ బీచ్‌ స్టార్‌బక్‌ కాఫీ షాప్‌లో జరిగింది. ఎదురుగా..లోపలికి చొచ్చుకొచ్చిన అట్లాంటిక్‌ మహాసముద్రం..ఒక ఎడతెగని నిరంతర తరంగ ఘోష మధ్య.
మొత్తంమీద లీల గురించి తనకు తెలిసిన మూడేళ్ళలో అర్థమైందేమిటంటే, ఆమె అసాధారణ ప్రతిభాశీలి. మృదు హృదయిని. సున్నిత మనస్కురాలు..కాని కఠిన క్రమశిక్షణతో కఠోర పరిశ్రమ చేసే తత్వం గలది. కొన్ని నిర్ణయాలను నిర్దయగా తీసుకుంటుంది. ప్రేమ అనే పదం ఆమెలో లేదేమో అన్నంత అతి తక్కువ మోతాదులో ఉంది. సంగీతాన్ని  యిష్టపడ్తుంది. తాత్విక స్పందనలుంటాయి. ఐతే ఎందుకో అలెగ్జాండర్‌లో ఉన్నట్టు ఈ సమస్త ప్రపంచాన్ని జయించాలన్నంత బలమైన ఉత్తీర్ణతాకాంక్ష ఉందామెలో. ఆమెది సున్నితమైన మల్లెపరిమళంవంటి అందం. సంభాషణ అర్ధవంతమైన ఆకాశంలా గంభీరమైంది.
”నాకో సంశయముంది రామం” అందొక సందర్భంలో ఆరోజే..అట్లాంటిక్‌ సముద్రం ముందు.
ఇద్దరూ ఇసుకలో నడుస్తున్నారప్పుడు..అలల రొద నడుమ.
రామం మౌనంగానే ఆమెవైపు చూశాడు.
”నేను నాకు తెలియకుండానే నిన్ను ప్రేమిస్తున్నానేమోనని..”యథాలాపంగానే కాని లోలోతుల్నుండి వస్తోందామాట.
”…..”
”చాలా జాగ్రత్తగా నన్ను నేను విశ్లేషించి చూచుకుంటే.. నువ్వు కొంతవరకు నాలో విస్తరించి ఇప్పటికే అల్లుకుపోయావని కూడా అనిపిస్తోంది.”
”…..”
”నీకేమనిపిస్తోంది”
”నిజానికి నాలో ఏ భావమూ లేదు లీలా..నా మనసంతా ఈ సహజమైన శారీరక స్పందలనకతీతంగా ఒక యుద్ధం ఆవరించి ఉంది. వ్యక్తి కంటే వ్యవస్థ, వ్యవస్థ కంటే మానవ సమూహం, మానవ సమిష్టి కంటే దేశం, దేశంకంటే విలువలతో కూడుకున్న ఆత్మ ఉన్నతి.. యివే అతి ప్రధానమై నానిండా ఒక సముద్రమై గర్జిస్తున్నాయి. సముద్రమంటే ఒట్టి నీరు.. ఒక్కోసారి మౌనమై, ఒక్కోసారి ప్రళయమై, అగ్నిపర్వతాలనుకూడా తన గర్భంలో దాచుకుని నిర్మలంగానవ్వే నీరు.. నాలో ఏదో నిర్గుణాత్మకమైన రాహిత్యత ఉంది లీలా..”
”…..” లీల మాట్లాడలేదు. కోటి ప్రశ్నలను, అర్ధింపులను నింపుకున్న చూపులతో చూచింది రామం వంక.
ఆ క్షణం అతనికి ఆమెపట్ల మమకారం నిండిన ‘ఈమె కావాలి’ అన్న భావం బలంగా కల్గింది.. వెంటనే ఆమె చేతినితన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు.
లీల పులకించిపోయింది.
కొద్దిసేపు అలాగే ఇద్దరూ నడచి..నడుస్తూనే..మౌనమై..కోటి సంభాషణలై..శతకోటి ఉద్వేగాలై.,
”నేను రేపు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను రామం..నన్ను నేను విజేతగా మల్చుకునేందుకు ప్రయోగాత్మకంగా ఈ లోపభూయిష్టమైన వ్యవస్థను నాకనుకూలంగా మలచుకునేందుకు యిక విజృంభించబోతున్నాను. చూస్తా..ఒక వ్యక్తి ఎలా ఒక బలీయమైనా శక్తిగా మారి శాసించగలదో సాధించి ఆత్మపరీక్ష జరుపుకుంటా.. అందుకే నీతో ఈ రోజు ప్రత్యేకంగా కలవాలని ఈ ప్రోగ్రాం..”
”మన యిద్దరి లక్ష్యాలు దాదాపు ఒకేరీతైనవి లీలా..ఐతే నీది దక్షిణ ధుృవమైతే నాది ఉత్తర ధుృవం..నువ్వు ఎన్నుకున్న దారీ, ఎంతో రిస్క్‌తో నిండిన సాహసోపేతమైన సాధన..అంతా గొప్పదే ఐనా లక్ష్యం ఋణాత్మకమైంది. నా దారీ నీ దారే ఐనా.. నా గమ్యం నిర్మాణాత్మకమైంది..”
”కావచ్చు..కాని..”లీల..ఒట్టిగానే నడిచింది వెంట..చాలాసేపు..ఏమీ మాట్లాడకుండా.
తర్వాత.. ఇసుకలోనుండి సముద్రంతో దూరమై..కార్లో పయనించి పయనించి డెలావర్‌..మేరీల్యాండ్‌.. పోర్‌ నైంటీఫైవ్‌ ఇంటర్‌స్టేట్‌..రాక్‌ విల్లీలో దిగిపోయింది.
చటుక్కున ఒక తార తెగిపోయింది..,
తర్వాత భారత కార్పొరేట్‌ వ్యవస్థలో, రాజకీయ, ఉన్నత సంపన్న వర్గాల వ్యూహాత్మక వ్యాపార లావాదేవీల్లో, కుతంత్ర రచనల్లో లీల ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం, విస్తరిల్లడం రామంకు తెలుస్తూనే ఉంది ఎప్పటికప్పుడు.
ఉండి ఉండి.. ఏ దేశంనుండో చటుక్కున ఏ రాత్రో, పగలో అకస్మాత్తుగా ఫోన్‌ చేస్తుంది లీల. నాల్గయిదు వాక్యాలు, లోలోపల గుప్తమైఉన్న ఆత్మ మాట్లాడ్తున్నట్టు వర్షమై కురుస్తుంది. అప్పుడప్పుడు అనూహ్యంగా అమెరికాలో కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది. ఒక మెరుపులా వచ్చి మరుక్షణం మాయమైనట్టు నిష్క్రమిస్తుంది.
మొత్తంమీద ఆమె మనసులో మాసిపోని ఓ ముద్రయి తనున్నాడు..ఉంటాడు..శాశ్వతంగా. ఆ విషయం తనకు తెలుసు.
ఐతే ఇటువంటి ఆత్మానుగత అంతస్సంబంధాన్ని ఏమంటారు.
వర్షం కురుస్తూనే ఉంది..చినుకులు ఎక్కువై, చిక్కనై..బయటా..అప్పట్నుండి లోపలా.,
కారును పార్కింగు ఏరియాలో ఆపి, పక్కనే ఉన్న గొడుగును తీసుకుని..దిగి..చీకటి అలుముకుంది అప్పటికే.. చుట్టూ అనేక దుకాణాలు..వందల కార్లు..వాల్‌మార్ట్‌, హోమ్‌ డిపో, రైట్‌ ఎయిడ్‌, పెట్‌మార్ట్‌, కోల్స్‌, బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌,
‘చాలా సేపే ఐంది – క్యాథీ ఎదురుచూస్తూంటుంది.’ అనుకుంటూ రామం వర్షంలో వడివడిగా అడుగులు వేసుకుంటూ.,
క్యాథీకి తనకూ నడుమ ఇప్పుడు జరుగబోయేది అతీ కీలక సమావేశం. రెండు జీవితాలకూ, రెండు అసమాన ప్రతిభా విశేషాలు ఒకటిగా సంధానమై ఒక నిర్ణయాత్మక శక్తిగా రూపొందడానికి ప్రాతిపదిక ఏర్పడే.. తమకు సంబంధించినంత వరకు ఓ అతి ప్రధాన సందర్భం..అందుకే క్యాథీని అవసరమైతే నాల్గయిదు గంటలసేపు విపులంగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా సిద్ధపడి రమ్మని చెప్పాడు రామం.
అతని మనసు నిజంగా వర్షం కురుస్తున్న రాత్రివలెనే చిత్రంగా, గంభీరంగా ఉంది.
చటుక్కున ఒక జ్ఞాపకం రామం హృదయంలో పిడుగై కురిసింది.

(సశేషం)

కవి రామా చంద్రమౌళికి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్ -2013’ పురస్కారం

ramachandramouliవరంగల్: వచన కవిత్వ పితామహుడు  కుందుర్తి ఆంజనేయులు   స్థాపించిన ప్రతిష్టాత్మక పురస్కారం ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్   అవార్డ్  -2013 ‘ ఈ సంవత్స్తరం వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళి ని వరించింది  . ఆయన ఇటీవల విడుదల చేసిన  ‘ అంతర’ కవిత్వ సంపుటికి ఈ గౌరవం దక్కింది  . పురస్కార కమిటీ కన్వీనర్ శీలా వీర్రాజు ఈ పురస్కార విషయాన్ని ప్రకటిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ లో  జరిగే ప్రత్యేక సభలో పదివేల రూపాయల నగదు,ప్రశంసా పత్రం,జ్ఞాపిక మరియు శాలువాతో ఘనంగా రామా చంద్రమౌళి ని సత్కరిస్తామని చెప్పారు. ఇంతవరకు 20 నవలలు,250 కి పైగా కథలు,9 సంపుటాల కవిత్వం వెలువరించి వరంగల్లు ప్రతిష్టను ఖండాంతర పరచిన మౌళి గారికి ఈ పురస్కారం రావడం ఈ కాకతీయుల గడ్డకు ఒక అదనపు అలంకారంగా సాహిత్యాభిమానులు భావిస్తూ రామా చంద్రమౌళి ని అనేక సాహితీ ప్రియులు అభినందించారు .

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 4 వ భాగం

( గత వారం తరువాయి)

4

Ekkadi(1)

తన కొత్త ఇన్‌ఫినిటీ కార్‌లో దూసుకుపోతున్నాడు నలభై ఏళ్ళ రామం. ఇంటర్‌ స్టేట్‌ టు సెవన్టీపై..వేగం ఎనభై ఎమ్‌పిహెచ్‌. దాదాపు గంటకు నూటాపది కిలోమీటర్లు.. టైర్ల ధ్వని బీభత్సంగా..కార్లమంద..అప్పుడే కురిసి వెలిసిన వర్షపు నీరు దూసుకుపోతున్న కార్ల టైర్ల రాపిడివల్ల ఆవిరిగామారి తెల్లని పొగమంచువలె ఎగిసి,ఎవరో వెంటపడి తరుముతూంటే పరుగెత్తుతూ పారిపోతున్నట్టు ఎవరికివారు కార్లలో మందలు మందలుగా ఒకటే.. పరుగు. ఏదైనా అడ్డొస్తే తునాతునకలై ఎక్కడో ఎగిరి పడ్తుందన్నంత వేగం..మనిషికి ఇంత విధ్వంసకర వేగం అవసరమా అని అనిపించే ఒకణ్ణి మించి మరొకరి దూకుడు. గ్లోబల్‌ పొజిషనింగు సిస్టంలోనుండి ఆమె అరుస్తోంది..’టేక్‌ ఎగ్జిట్‌’ అని
రామం జిపిఎస్‌సిస్టం విన్నప్పుడల్లా ఆశ్చర్యంతో, పులకింతతో, మనిషి సాధిస్తూ వస్తున్న ఈ అనేక విజయాలపట్ల గర్వపడ్తూంటాడు. ఒక ఇంజినీర్‌గా ఈ ఊహాతీత సౌఖ్యాల సాధన అతనికి ఓ అద్భుతంగా తోస్తూంటుంది. వాషింగ్టన్‌ నేషనల్‌ పైక్‌.. ఫాదర్‌ హర్లే రోడ్‌.. టంగు టంగు.. ఘంట వంటి అలర్ట్‌ శబ్దం. ఎదురుగా స్టీరింగు పానల్‌ తెరపై సిక్స్‌ట్రాక్‌ రోడ్‌ బొమ్మ.. గుండ్రగా ఎంట్రీ, ఎగ్జిట్‌ రోడ్లతో కలిసి బ్రిడ్జ్‌ బొమ్మ., అందులో కారును సూచిస్తూ కదుల్తున్న బాణం ఎర్రగా.. లోపల్నుండి సమాంతరంగా సిడిలోనుండి సన్నగా వినిపిస్తున్న కంఠ ధ్వని..బయట వర్షం మళ్ళీ ఆరంభమై.,
”సాప్ట్‌ సిడి” అన్నాడు రామం. ఠక్కున వీణధ్వని ఆగిపోయింది. లోపల ఎవరో ఓ మనిషి కూర్చుని చెబుతున్న విషయాలన్నింటినీ విని అతి ఖచ్చితంగా, విధేయంగా చేస్తున్నట్టు..రిడ్జ్‌రోడ్‌ జంక్షన్‌.. ఎదురుగా ఎర్రని స్టాఫ్‌ లైట్లు.. మెల్లగా కారుకు బ్రేక్‌ వేస్తూ,
చీకటి ముంచుకొస్తోంది ఒక పెద్ద సముద్ర కెరటంలా..అందరూ గుంపులు గుంపులుగా ఆగితే..ముందున్న  కార్ల ఎర్రని టెయిల్‌ ల్యాంప్స్‌ సమూహం కణకణలాడే నిప్పుల ప్రవాహంవలె..ఎదురుగా ప్రక్క అప్‌స్ట్రీమ్‌లో..వస్తున్న కార్లమంద హెడ్‌లాంప్స్‌..పచ్చని కాంతితో ప్రవహిస్తున్న కరిగిన ఇనుమువలె..టు సెవెన్టీ ఎక్స్‌ప్రెస్‌ వే నుండి బయటికొచ్చి. ఎడమదిక్కు అబ్జర్వేషన్‌ డ్రైవ్‌లోకి..ఎదురుగా ఎర్రనిలైట్లు ఆకుపచ్చగా మారగానే..కదలికల్లో ఓ చైతన్యం…మళ్ళీ కార్ల పరుగు..
రాయల్‌ క్రౌన్‌..విలియం గిబ్స్‌ ఎలిమెంటరీ స్కూల్‌. మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..డార్సిమిల్‌ రోడ్‌..’టేక్‌ లెఫ్ట్‌’ అని జిపిఎస్‌లోనుండి సూచన..వాటర్స్‌ హాలో..బ్రూక్‌ ఫీల్డ్‌..ఓల్‌నెస్ట్‌ సర్కిల్‌..నౌ..యు రీచ్చ్‌ యువర్‌ డిస్టినేషన్‌..గమ్యం..ఇల్లు చేరుట..,
మనిషి నిజానికి ఎప్పుడు తన గమ్యాన్ని..ఇంటిని..లక్ష్యాన్ని చేరినట్టు..తను ప్రారంభమౌతున్న చోటును..తను చేరవలసిన గమ్యాన్ని స్పష్టంగా నిర్వచిస్తే మానవ మేధతో నిర్మితమైన ఈ ఉపగ్రహ, సంచార, ఉత్సర్గ గ్రాహక వ్యవస్థ ఖచ్చితంగా దారిని చూపిస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది. దారి తప్పితే సవరించి మళ్ళీ సరియైన దార్లోకి మార్గదర్శనం చేస్తుంది. మళ్ళీ దారితప్పుతూంటే హెచ్చరికకూడా చేసి దాదాపు తిట్టినంతపని చేస్తుంది.
కాని జీవితంలోనో.,
ఎందరికి తన జీవితం ఎక్కడ ప్రారంభమౌతోందో..తను చేరవలసిన గమ్యం ఏమిటో తెలుస్తుంది. ఎవరికైనా తన గమ్యం నిర్వచించుకుంటే దారి తెలుస్తుంది దారి తెలిస్తే దిశ, దూరం..దూరంతో వేగం స్పృహ..వేగంతో కాలం అంచనా.. కాలంతో తన ప్రణాళిక..పథకం..పథకంతో వ్యూహం.,
ఎవరినైనా ఓ మనిషిని ఎంచుకుని..నువ్వు రేపేం చేస్తావు..నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు. ప్రత్యేకంగా సాధించవలసిన లక్ష్యాలేవైనా నీకున్నాయా అని అడిగితే..పెళ్లిచేసుకుంటా, పిల్లలను కంటా, వీలైనంత ఎక్కవ డబ్బు కూడబెడ్తా.. పద్ధతి ఏదైనా ఫర్వాలేదు. డబ్బును గుట్టలు గుట్టలుగా పోగెేస్తా అని తప్పితే భిన్నమైన ఒక నిర్మాణాత్మక జవాబును ఎంతమంది ఇవ్వగలరు.
ఓ పుచ్చలపల్లి సుందరయ్యలా ఈ దేశంకోసం జీవించవలసిన తను భవిష్యత్తులో పిల్లలుంటే తన నిర్దేశిత లక్ష్యాలను చేరలేనని పిల్లలను కనకుండా ఎందరు కఠోర, త్యాగపూరిత నిర్ణయాలు తీసుకోగల్గుతారు.
అసలు భవిష్యత్తునే ఊహించలేని ఈ తరం..అస్తవ్యస్తంగా ఉన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడ్తూ దిక్కుమాలిన నీతిహీన, అనైతిక, అసమర్ధ ప్రభుత్వాల పాలనలో మగ్గుతున్న సమాజంలో..ఏమని ‘రేపు’ను స్వప్నించగల్గుతుంది. ఇక విలువలు, నీతి, నిజాయితీ, నైతికత.. వీటిగురించి కనీసం ఆలోచనైనా చేయగల్గుతుందా.,
రామం కారును గ్యారేజిముందు ఆఫ్‌ చేసి.. దిగి..సన్నగా కురుస్తున్న చినుకుల్లో..నాల్గడుగులు వేసి..తన ఇంటి తలుపులను తాళం చెవితో తెరిచి..ముందు గదిలో బూట్లు విడిచి, రాక్‌లో పెట్టి.,
‘ఇక తనకు కూడా..ఎప్పుడో పదేళ్లకు ముందు స్పష్టంగా నిర్వచించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కార్యరంగంలోకి దూకవలసిన సమయం ఆసన్నమైందా..’అనే ప్రశ్న..బాధ్యత…ఉద్యుక్తత ఉదయంనుండీ మనసులో పదేపదే కదుల్తూ.,
రామంకు గతవారంనుండీ మనసు మబ్బుపట్టిన ఆకాశంలా, గాలి దుమారంలో ఎడారిలా, కల్లోల సముద్రంలాఉంది. గతం.. ఏళ్ళకు ఏళ్ళుగా అనుభవించిన సంఘర్షణ..మేధోపరంగా ఒట్టి పుస్తకాల పురుగులా జీవిస్తూ.. ఉద్యోగం,వృద్ధి, సుఖవంతమైన జీవితం, విలామయమైన వ్యష్టి వికాసం..వీటినే పరమావధిగా భావిస్తూ నిర్మించుకున్న స్వప్న ప్రపంచంనుండి.. నాన్న.. నాన్నను తను అమెరికా వచ్చిన తర్వాతనుండే నిజంగా అర్ధం చేసుకున్నాడు.
‘నాన్న’..నాన్న జ్ఞాపకం రాగానే మనసు బకెట్‌లోని నీళ్ళను చేతితో లొడపెట్టినట్టు కల్లోలమై పోయింది.
రెండేళ్ళక్రితం నాన్న తన దగ్గరికి..యిక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో, మేధావుల సమావేశాల్లో, తెలుగు సంఘాలు ఏర్పాటుచేసిన సభల్లో మాట్లాడ్డానికి వచ్చినపుడు తనుకూడా ప్రతి సమావేశానికీ వెంటవెళ్ళాడు. నాన్న చేసిన అర్ధవంతమైన, అవశ్యమైన సామాజికాంశాలతోకూడి మనిషిని ప్రశ్నించే అనేక ఆలోచనాత్మకమైన ప్రసంగాలను ఒక ‘భారతీయ యువకుడిగా’ జీర్ణించుకుని ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. చిన్ననాటినుండి పుస్తకాలు..చదువు..చదువు..ర్యాంకులు..స్థాయి..క్వాలిఫికేషన్‌ పెంచుకోవడం, స్టార్‌ స్టూడెంట్‌గా ఎదగడం..స్కూల్‌ ఫస్ట్‌..కాలేజి ఫస్ట్‌..స్టేట్‌ ఫస్ట్‌..ఐఐటిలో చేరాలని లక్ష్యం..ఐఐటీయన్‌ కాని జీవితం ఛీ.. ఏం జీవితం అని అహర్నిశలు పుస్తకాలు పుస్తకాలు..ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌.. శక్తి నిత్యత్వ సూత్రాలు, అణుధార్మిక సిద్ధాంతాలు, అత్యాధునిక శాస్త్ర పురోగతులు. కృత్రిమ మేధో విశ్లేషణలు..ద్రవ్య ప్రతిదవ్య భావనలు..నియమాలు. ఇవే ఇవే.,
రాత్రింబవళ్ళు..లైబ్రరీ..ఇంటర్నెట్‌..వికీపీడియా..డిజిటల్‌ పుస్తకాలు..ఐఐటీ మద్రాస్‌ హాస్టల్‌లో..ఎన్ని రాత్రులో.. ఒక అసాధారణ మేధోజీవిగా రామం అనే తనకు ఓ పేద్దపేరు. 1959లో ప్రారంభించబడి భారతదేశంలోనే ఒక అత్యుత్తమ విద్యాసంస్థగా పేరున్న ఐఐటి మద్రాస్‌నుండి మెకానికల్‌ ఇంజినీరింగులో..ఎమ్‌టెక్‌లో బంగారు పతకాన్ని సాధించడం ఒక సుందర స్వప్నం.

third week fig-2
నాన్న అప్పటికే రీజినల్‌ ఇంజినీరింగు కాలేజ్‌ వరంగల్‌లో ప్రొఫెసర్‌..అమ్మ తను హైస్కూల్‌లో ఉన్నపుడే పోయింది. అమ్మంటే ఒక దేవత అనే తీయని జ్ఞాపకం.. అమ్మ అంటే నవ్వు..అమ్మ అంటే ఒక ఆశీర్వాదం..అంతే తెలుసు తనకు..నాన్న అంటే ఋషి..పుస్తకాలు..పాఠం..బోధన..జ్ఞానం..ఒక సజీవ సిద్ధాంతం..తను పుట్టినప్పటినుండీ తనకు తెలిసిందీ, తను ఆడుకున్నదీ, తన పరిసరాలూ అన్నీ పుస్తకాలే..అంతా నాన్నే.
నాన్న చెప్పేవాడు..పుస్తకాలు రెండు రకాలని..ఒకటి విద్యావిషయక శాస్త్రాలు..గణితం, భాష, చరిత్ర, భౌతిక, రసాయనికి శాస్త్రాలు..ఇవి..ఈ ప్రపంచ భౌతిక జీవితం గురించి చెప్పేవి. రెండు సృజనాత్మక పుస్తకాలు..కవిత్వం, శాస్త్రాలు, సంగీతం, కళలు, జీవితాధ్యయనాలు, దేశచరిత్రలు..పరిణామ సిద్ధాంతాలు, మనిషి పరిణామ ప్రక్షిప్తాలు, ఇతిహాలు, తత్వ, ఆధ్యాత్మిక శాస్త్రాలు..ఇవి..మనిషి గురించి, జీవితం గురించీ, జీవిత పరమావధి గురించి, హృదయం గురించి, అంతిమంగా ఈ సృష్టి ఏమిటి..గురించీ..ఒక అనంతానంత ఆత్మ దర్శనం.
దాదాపు.. ఎమ్‌.టెక్‌ పూర్తయి..స్వర్ణపతకం పొంది..రెండు మూడు ప్రఖ్యాత కంపెనీలలో కాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వచ్చి.. ఓహ్‌ా.. పందొమ్మిది వందల తొంభై ఏడు..అనుకున్న ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి..అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షి పిల్ల పొందే అవ్యక్త మహానుభూతి..కాన్వొకేషన్‌ జరిగి..గవర్నర్‌ చేతులమీదుగా బంగారు పతకాన్ని మెడలో వేయించుకుని..పొంగి పొంగి.,
నాన్నకూడా వచ్చాడు ఆ కీలకమైన సభకు. ఆహుతుల్లో ఒకనిగా కూర్చుని కాన్వొనేషన్‌ను తిలకించాడు. అప్పుడు ఆయన కేవలం తండ్రి.. అప్పటికే ఆయన రీజినల్‌ ఇంజినీరింగు కాలేజిలో పేద్ద పేరున్న మెకానికల్‌ ఇంజినీరింగు ప్రొఫెసర్‌. ఐతే అనేక సామాజికశాస్త్ర, సాహిత్య గ్రంథాలు రాసిన రచయితగా నాన్నకు పెద్దపేరు..రాష్ట్రపతినుండి, రాష్ట్రప్రభుత్వంనుండి ఉత్తమ అధ్యాపకునిగా పురస్కారం పొందినవాడు. అతి తక్కువగా మాట్లాడేవాడు.. అనర్ఘళంగా ఉపన్యసించేవాడు.. అతి నిరాడంబరంగా ఒక నమూనాగా జీవించేవాడు.
ఆ రాత్రి.. భీకరంగావర్షం కురుస్తున్న రాత్రి..పన్నెండు దాటిందేమో.,హాస్టల్‌కు నాన్నా..తనూ తిరిగొచ్చి..నాన్నకు తను పొందిన బంగారు పతకాన్ని చూడమని ఇచ్చి..అతని కళ్ళలోకి తనకీ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా చూచిన క్షణం..
”వెల్‌ డన్‌ మై బాయ్‌..”అన్నాడు నాన్న..ఒక తండ్రి.
”థాంక్యూ నాన్నా..”నాన్నా అని పిలిపించుకోవడమే ఆయన కిష్టం.
”ఇటువంటి..ఎమ్‌టెక్‌లో స్వర్ణపతకాన్ని నలభై ఏళ్ళక్రితమే మీరు సాధించారుగదా నాన్నా..ఏమనిపిస్తోంది మీకు.”
‘ది ట్రెడిషన్‌ కంటిన్యూస్‌. అప్పుడు నాకుగానీ..ఇప్పుడు నీకుగానీ ..ఒక అధ్యాయం ముగిసింది నాన్నా..ఇప్పుడు మనిషి ఒక చౌరస్తాలోకి వచ్చి నిలబడ్డాడు. ఈ కీలకమైన సందిగ్ధసమయంలో మనిషి తన జీవితాన్ని నిర్దేశించగల ప్రధాన నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది.. ఐతే..” అని ఓ క్షణం ఆగి..తన కళ్ళలోకి చూశాడు నాన్న ఎంతోసూటిగా..బాగా జ్ఞాపకం తనకు ఆ చూపు ..గుచ్చుకున్న ఆ చూపు.,
”ఐతే.. మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి రావద్దు. ఆచితూచి, మనిషిగా పరిపూర్ణమైన జ్ఞానంతో అడుగుముందుకు వేయాలి.”
”…..”ఒట్టిగా వింటున్నాడు తను.
”మనిషి ప్రధానంగా వ్యష్టి జీవి.ఎంతసేపూ నూటికి తొంభైఐదు శాతం మందికి తను, తన భార్య, తన పిల్లలు, తన పరివారం, తన సంపద..తన అభివృద్ధి.. తన సంతోషం..ఇవే. ఐతే ప్రకృతిసహజంగా మనిషి. ఆ మాటకొస్తే ఏ జీవియైనా సంఘజీవి అనే ప్రాథమిక సూత్రాన్ని మరిచి, తన సహ మానవులపట్ల, జీవులపట్ల, సమాజంపట్ల..సంఘ బాధ్యతలపట్ల మనిషి ఆలోచించడం క్రమంగా మరచిపోతూ..”
”అర్థమైందా రామం..”
”ఊఁ.. ఔతోంది”
”మనిషి ఎప్పుడూ సమాజంలోనుండి ఎదుగుతాడు. ఉదాహరణకు ఒక ఐఐటీయన్‌గా నువ్వీ డిగ్రీ పొందడానికి ప్రభుత్వం..అంటే ఈ భారత ప్రజలు దాదాపు ఇరవై ఐదు లక్షలు నీపై ఖర్చు చేశారు..నువ్వనుకుంటావు..నిన్ను నేను కన్నాను, కొంత నేను చదివించాను..ఎక్కువగా రేయింబవళ్ళు కష్టపడి నువ్వు చదువుకున్నావు.సాధించావు..అని..అది పాక్షిక సత్యమే. పూర్తి సత్యంకాదు. ఐఐటి అనే ఈ మహత్తరమైన ప్రజల డబ్బుచే నిర్మించబడ్డ సంస్థ సమాజపరంగా చేస్తున్న విద్యాదాన క్రతువువెనుక లక్షలమంది అతి సామాన్యపౌరుల చెమటతో నిండిన డబ్బే ఖర్చవుతున్న సంగతి..”
”….”
”కొన్ని బయటికి కనిపించవు. కనబడకుండా గుప్తంగానే దాగి ఉంటాయి అగ్నిలా..ఇక్కడే మనిషి బాధ్యతాయుతంగా ఆలోచించాలి.. వ్యష్టిగా కాదు.. సమిష్టికోసం..”
”అంటే..”
”నీకిప్పుడు టిసిఎస్‌లో సెలక్షన్‌ వచ్చింది. నువ్వు యుఎస్‌ఎ – మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో జూన్‌ పదిన రిపోర్ట్‌ చేయాలి. హెచ్‌వన్‌బి వీసాగీసా, నీ ఫ్లైట్‌ టికెట్‌ ..అన్నీ రెడీ చేయబడ్డాయ్‌..ఔనా..”
”ఔను..”
”నలభై ఏండ్ల క్రితం నాకిదే జరిగింది..రీజినల్‌ ఇంజినీరింగు కాలేజి మొదటి బ్యాచ్‌ విద్యార్థిని నేను..ఎమ్‌ఇ చేసి.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో..అరబ్‌ దేశమైన బహ్రాన్‌లో..అరామ్‌కో అనే ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తి కంపెనీలో ట్వంటీ కె డాలర్లతో ఉద్యోగం వచ్చింది..నా మిత్రులు, నా ప్రొఫెసర్లు, అందరూ ఆ అదృష్టానికి ఎంతగానో అభినందించారు.. కాని నేనా ఉద్యోగంలో చేరలేదు. తిరస్కరించాను.” ఆగిపోయాడు నాన్న.
” మా నాన్నా ఒక సాధారణ ప్రాథమిక పాఠశాల పంతులు. నిజాయితీకి ప్రతీక. అన్నాడు..’ఇన్నాళ్ళూ నిన్ను కని, సాది, పెంచి పెద్దచేసిన నన్నూ, అమ్మనూ నువ్వు అర్థాంతరంగా ఈ వృద్ధాప్యంలో విడిచి వెళ్ళడం ఎంతవరకు న్యాయమో తెలియదు నాన్నా..కాని..నిన్ను ఈ దేశపు బీదాబిక్కి ప్రజలు పన్నులరూపంలో సమకూర్చిన డబ్బుతో ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డ మేధోజీవివైన తర్వాత ఈ దేశంపట్ల, ఈ ప్రజలపట్ల, ఈ సమాజంపట్ల, నీకెటువంటి బాధ్యతా లేదా నాన్నా. నీ అద్భుతమైన తెలివితేటలు ఈ దేశంకోసం, ఈ దేశప్రగతికోసం, ఉపయోగపడొద్దా..అవన్నీ నిన్ను పోషించే వేరే ఇతర దేశాలకోసమే ధారపోయాలా.’ అని..”
”……”
”ఒక రాత్రంతా ఆలోచించాను..నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజుకూడా ఇలాగే..కుండపోతగా వర్షం..ఎడతెగని వర్షం.. మర్నాడు నిర్ణయం తీసుకున్నాను..అరామ్‌కోలో చేరలేదు. ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాను. స్థిరంగా, లోతుగా, బాధ్యతాయుతంగా ఆలోచించి చివరికి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగు కాలేజిలో లెక్చరర్‌గా చేరాను.. ఎందుకంటే టీచర్‌ ఒక జ్యోతివంటివాడు..ఒక జ్యోతి లక్షల దీపాలను వెలిగిస్తుంది. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కాంతిమయం చేస్తుంది.. ఇన్నాళ్లుగా నేను చేస్తున్నదదే..నేను కొన్ని తరాలను తయారు చేస్తున్నాను.” చెప్పుకుపోతున్నాడు నాన్న ఒక ట్రాన్స్‌లో ఉన్న మనిషిలా.
”మంచి టీచర్‌ ఒక అంకెవంటివాడు రామం. ఒట్టి సున్నాల్లాంటి విద్యార్థులు అతని ప్రక్కన చేరి విజ్ఞానవంతులై పదులు, వందలు, వేలు, లక్షల సంఖ్యలుగా విస్తరిస్తారు. విద్యాదానం ఒక యజ్ఞం..ఒక క్రతువు..ఒక అదృష్టం..”
”…..”
”ఐతే ఎవరి జీవితం వారిది. తత్వాలు కూడా ఎవరివి వారివే. అప్పటి సామాజిక, వ్యక్తిగత సందర్భంలో వ్యక్తి విజ్ఞతనుబట్టి తగు నిర్ణయం తీసుకోవాలి. నౌ ఇటీజ్‌ లెప్ట్‌ టు యు..”
”…..”నాలో ఒక అనిశ్చితి.. కాని అవగతమౌతున్న మనిషి బాధ్యత.. జీవిత పరమార్థం.
ఇన్నాళ్ళూ వ్యక్తిగత వృద్ధి..వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నడక..ఇవన్నీ హస్తగతమైనాయి. ఇప్పుడు ఇక ‘నడత’ గురించిన స్పృహ కావాలి. అందరిలా పుట్టినం, ఎదిగినం, సంపాదించినం, పిల్లలను కన్నాం, చచ్చినం.. కాకుండాఏదో ఒక విలక్షణమైన మహా సంకల్పాన్ని ఒక పరిమితమైన పరిధిలోనే విస్తరించిఉన్న చూపును యిక విస్తృతపరచాలి. ఈ భారత సమాజాన్నీ, రాజకీయాలనూ, ప్రజల స్థితిగతులనూ, లోలోతుల్లోకి పయనించి చూడవలసిన నిజమైన జనజీవితాలనూ, అడవులను.. ఆదివాసీలను, గిరిజనులకు, విస్మరించబడ్డ బడుగుజాతులను.,
ఐతే.. వర్తమానాన్ని అంతర్జాతీయ మానవ సమాజంతో పోల్చి చూచినపుడు మాత్రమే పేదరికం, దరిద్రం, అవిద్య, కుళ్ళు రాజకీయాలు, అవినీతి, అనైతికత..ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు ఒక విపులమైన అధ్యయనం చేయాలి తను. ఒక రాహుల్‌ సాంకృత్యాయన్‌వలె, ఇంగ్లండ్‌లో చదివి దక్షిణాఫ్రికాలో ఒక మామూలు మనిషిలా అడ్వకేట్‌ జీవితం జీవిస్తూనే ప్రపంచ రాజకీయాలను శాసించగల మహావ్యక్తిగా ఎదిగిన గాంధీవలె, దేశాంతర పర్యటనలతో తనను తాను తెలుసుకున్న అనిబిసెంట్‌ , జిడ్డు కృష్ణమూర్తివలె..ఇప్పుడు ఒక అధ్యయనాత్మక జీవితాన్ని కొంతకాలం గడపితే.. తర్వాత కార్యరంగంలోకి దూకితే..,
అదే అన్నాడు రామం అతని తండ్రితో..,
”మన్య విప్లవం ప్రారంభించడానికి ముందు అల్లూరి సీతారామరాజు విస్తృతంగా దేశమంతా పర్యటించి ప్రజల జీవితాలను అధ్యయనం చేశాడు. గాంధీకూడా అహింసా విప్లవోద్యమంలో దూకేముందు కాశ్మీర్‌నుండి కన్యాకుమారి దాకా అధ్యయన యాత్ర జరిపాడు. ఐతే..ఇప్పుడు భారతదేశం ఇంగ్లీష్‌వాడు పాలించినప్పటికంటే అనేకరెట్లు చెడిపోయి, పతనమై పోయి, కుళ్ళిపోయి ఉంది. భారతేతరులు పరిపాలించినపుడు ఎక్కడ జనం తిరుగబడ్తరోనన్న భయంతో ఒళ్లుదగ్గరపెట్టుకుని మెదిలారు. కాని యిప్పుడు మనల్ని పాలిస్తున్న మనవాళ్ళుమాత్రం నిస్సిగ్గుగా, నీతిహీనంగా ప్రజలను పీడించుకు తింటున్నారు. సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు. పందికొక్కుల్లా అందినంత మేరకు స్వాహాచేసి ఇకిలిస్తున్నారు.”
”…..” శ్రద్ధగా వింటున్నాడు రామం.
”ఓట్లకోసం ఏమైనా చేయగల నిర్లజ్జ రాజకీయాలు ఈ దేశానికి శాపంలా దాపురించాయి. గత కొన్ని థాబ్దాలుగా వృద్ధనాయకత్వంలో దేశం మగ్గిపోతోంది. కొత్త మేధావితరం రాజకీయాల్లోకి రావడంలేదు. రాజకీయాలన్నీ మాఫియాలు, గుండాలు, నేరచరితులు, దొంగలు, దోపిడీదారులతో భ్రష్టుపట్టిపోయాయి. అధికారంకోసం ఏ దౌర్భాగ్యపు పనికైనా సిద్ధపడి పాలకులు విలువలను భూస్థాపితం చేశారు. దేశభక్తి, సామాజిక బాధ్యత, విలువలు, నైతికత, ఆత్మ.. యివన్నీ ఒట్టి కాలంచెల్లిన పదాలుగా మిగిలిపోయాయి. విషాదమైన విషయమేమిటంటే ప్రజలను ఈ ప్రభుత్వాలు తాగుబోతులుగా సోమరిపోతులుగా, అవినీతిపరులుగా, ఒట్టి కుక్కగొడుగులవంటి పారసైటిక్‌ తరంగా తయారుచేస్తున్నాయి. యధారాజా తథాప్రజా ధోరణిలో ప్రజలుకూడా పూర్తిగా అవినీతిపరులై ఎవనికి అందిందివాడు దోచుకుతింటున్నాడు. ఒక మున్సిపల్‌ ఇంజినీర్‌ ఇంటిపై దాడిచేస్తే కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్తున్నాయి. జనం ఈ రోజు విని రేపు అన్నీ మరిచిపోతున్నారు. ఎక్కడా జవాబుదారీతనం లేదు. ఒకవైపు హద్దులు మీరిన మీడియా, విచ్చలవిడి సినిమాలు, అతిస్వేచ్ఛాయుత వాతావరణంలో ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ సౌకర్యాల విషవలయంలో చిక్కి యువత నిర్వీర్యమై, దారితప్పి, పుట్టుకతోనే వృద్ధులుగా మిగిలి.. దేశం దేశమంతా వృద్ధ నాయకత్వంతో, అసమర్థులైన యువ వృద్ధులతో నిండి కుళ్లిపోతోంది రామం. ఏ కొద్దో మేధోసంపద ఉన్న నీవంటి క్రీమ్‌ విదేశాలపాలై ఈ దేశాన్ని అనాథను చేస్తోంది. ఈ దేశం కుక్కల పాలైపోతోంది రామం..” చటుక్కున ఆగిపోయాడుాన్న.
తలెత్తి చూస్తే..ఎదుట తండ్రి కళ్ళనిండా నీళ్ళు..పొంగిపొర్లుతున్న దుఃఖం అతని మాటలను సమాధి చేసింది.
ఇద్దరిమధ్య ఒట్టి నిశ్శబ్దం.
నిశ్శబ్దం ఒక్కోసారి ఎంతో శక్తివంతంగా సంభాషిస్తుంది. గర్జిస్తుంది. నినదిస్తుంది..నిలదీస్తుంది.
”..ఇప్పుడీ దేశానికి శస్త్ర చికిత్స జరగాలి రామం..బహుముఖంగా విరుచుకుపడ్తున్న అవినీతి, లంచగొండితనం ఈ భారత సమాజాన్ని కేన్సర్‌లా పీడిస్తోంది. ఒక తరిమెల నాగిరెడ్డి ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకం రాసినప్పటి పరిస్థితి ఏమాత్రం మెరుగు పడకపోగా యింకా యింకా ఎన్నిరెట్లో కుళ్ళిపోయింది. కంపుకొడ్తోంది. దిస్‌ నీడ్స్‌ ఎ ప్రెషరైజ్డ్‌ వాషింగు, రాథర్‌ డిస్ట్రాయింగు అండ్‌ రీకన్‌స్ట్రక్టింగు..”
”ఔను..” స్థిరంగా జవాబు చెప్పాడు తను.
సరిగ్గా అప్పుడే ఫెళఫెళారావంతో ఎక్కడో పిడుగుపడింది. బాగా గుర్తు తనకు.. స్థితి తెలుసు తనకు.. తన ధర్మమూ, తన బాధ్యతా తెలుసు తనకు.. గురి తప్పకుండా బాణాన్ని సంధించి లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు నిగ్రహం, సంయమనంతో కూడిన పరిణతీ, ప్రావీణ్యం, సాధనా అవసరం.
అందుకే.. వ్యూహాత్మకంగానే తను అమెరికా వచ్చాడు.
మొట్టమొదట తను అమెరికా భూభాగంపై అడుగుపెట్టింది వాషింగ్టన్‌ డి.సి డల్లెస్‌ ఏర్‌పోర్ట్‌లో.. తొంభై ఏడు మే పదిహేనవ తేదీ సాయంత్రం నాల్గుగంటల ముప్పయి నిముషాలకు.
రాక్‌ విల్లేలో ఆఫీస్‌ …టాటా కన్‌సల్టేన్సీ లో హైటెక్‌ ఇంజినీరింగు, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌, సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవహారాలు చూచేవాడు తను. కనీసం ఒక ఏడాది పాటు టాటాస్‌తో ఉండాలని ప్లేస్‌మెంట్‌ అగ్రిమెంట్‌. హండ్రెడ్‌ కె పేమెంట్‌ పర్‌ ఆనం.
మేరీల్యాండ్‌ విలేజ్‌ గ్రీన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో మకాం. ఇక ప్రయాణం, ప్రయోగం, భవిష్యత్‌ పథక ప్రణాళిక  ప్రారంభం.
అమెరికాతో ఇండియన్స్‌కు ఉన్న వలసల అనుబంధం ఎంతో సుదీర్ఘమైందని రామంకు అతితొందరగానే అర్థమైంది  దాదాపు గత ఎనభై సంవత్సరాల నుండి భారతదేశం నుండి, ఆంధ్రదేశం నుండి కూడా విపరీతంగా వలసలు జరిగాయి. ఐతే ఎవరు వలస వచ్చినా ఒక మేధోపరమైన విలక్షణతతోనే యుఎస్‌ఎకు వచ్చారు. మొదట ఎక్కువగా  డాక్టర్లు, వ్యాపారులు, ఏ ఆధారమూ లేకుండా అలా గాలికి వచ్చి స్థిరపడ్డ బాపతు ఎక్కువైతే, తొంభైలలో అనూహ్యంగా వచ్చిన బూంవల్ల మాత్రం ఐటి ఇండస్ట్రీ ఈ వలసల వెల్లువను ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది. ఐతే గతంలో వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఇండియన్స్‌ అంటే గౌరవనీయులై మేధోజీవులన్న సామాజిక విలువను యిక్కడ స్థిరపర్చి పదిలపర్చారు. ఈ పరంపర ఉధృతంగా కొనసాగి న్యూజెర్సీ, డెట్రాయిట్‌లాంటి చోట తెలుగువాళ్ల సంఖ్యాబలం ఎంత పెరిగిందంటే..అంతటా ఇండియన్‌ స్టోర్స్‌ ప్రత్యేకంగా నెలకొల్పబడ్డాయి. కాగా రాజకీయాలనుండి మొదలుపెట్టి భారత సంతతి జనం అనేక అమెరికా జీవనరంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. అమెరికాలోని మొత్తం డాక్టర్లలో ముప్పయి ఎనిమిది శాతం మంది భారతీయ డాక్టర్లు, ముప్పయి ఆరుశాతం ప్రతిష్టాత్మక నాసాకేంద్ర శాస్త్రజ్ఞులు, దేశ శాస్త్రవేత్తల్లో పన్నెండుశాతం, మైక్రోసాఫ్ట్‌లో ముప్పయినాల్గుశాతం,ఐబియంలో ఇరవై ఎనిమిదిశాతం, ఇంటెల్‌, జిరాక్స్‌లాంటి బహుళ జాతి కంపెనీల్లో పదిహేడు పదిహేను శాతం భారతీయులే విస్తరించి పోయారంటే..విస్తృతి ఎంత ఉధృతంగా జరిగిందో ఊహించవచ్చు.
ఐతే తొంభైలలో అమెరికాలోకి వచ్చిపడ్డ చెత్త చెదారం మాత్రం యిక్కడి నాణ్యతా ప్రమాణాలను బాగా దెబ్బతీసి ఒక రకమైన నిస్పృహను మిగిల్చి క్రమక్రమంగా భారతదేశం నుండి వలసలు తగ్గడానికి కారణం కావడం మాత్రం ఒక పచ్చినిజంగా జరిగింది. పెరుగుట విరుగట కొరకే అనేసూక్తి నిజమైంది కూడా. వేలు చూపితే కొండబాకే తత్వమున్న తెలుగువాళ్ళు అనేక అమెరికా సామాజిక రంగాల్లోకూడా చొరబడ్డారు.,
ఈ నేపథ్యంలో నిలబడ్డ వర్తమానం మాత్రం.. వాల్‌మార్ట్‌, జెయింట్‌. కాట్‌స్కో వంటి భారీ వ్యవస్థల్లో సేల్స్‌మెన్‌, మెయింటెనెన్స్‌ పీపుల్‌, ల్యాండ్‌ స్కేపర్స్‌, రోడ్‌ వర్కర్స్‌ వంటి అన్ని ప్రజా వినిమయ రంగాల్లో చిన్నస్థాయి ఉద్యోగాల్లో ఉన్న స్థానిక అమెరికన్లకు..’ఈ ఎక్కడనుండో వచ్చిన భారతీయులు మమ్మల్ని దోచుకుంటున్నారు అన్న కొంగ్రొత్త భావన కల్గుతున్నట్ట్థుానిక భారతీయుల అనుభవాలు చెబుతున్నాయి.
అడవి అంటుకోవద్దు..ఒకసారి నిప్పురవ్వ ఎండిన చెట్లనడుమ పడిందంటే ఆ బడబాగ్నిని నియంత్రించడం ఎవరితరమూకాదు. గత నాల్గుయిదు సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజంలో ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా వంటి దేశాల్లో స్థానికేతరుల ఉనికి అక్కడి పౌరులను అసహనానికి గురిచేస్తున్న ఉదంతాలు పదేపదే పొటమరించడం.. ఒక విపరీత పరిణామం.
ఐతే చాలామంది సాధారణ అమెరికన్లు పౌరులుగా ఎంతో సంస్కారవంతులు. ప్రేమమయులు. క్రమశిక్షణ గల ఉత్తమపౌరులు. అందరిలోనూ ఎంతో గొప్పగా భాసించేది వాళ్ల దేశంపట్ల వాళ్ళకున్న విపరీతమైన ప్రేమ, దేశభక్తి, సమాజంపట్ల ఉన్న అంకితభావం. పౌరవిధులపట్ల స్పృహ. ఉదయం వాకింగు చేస్తున్నపుడు ఎదురైన ఏ అమెరికనైనా ప్రేమగా,నవ్వు ముఖంతో ‘హాయ్‌’అని పలకరిస్తాడు. కాని ఇండియన్స్‌ పలకరించలేకపోవడం సర్వసాధారణంగా కనబడే విషయం. అమెరికన్స్‌ ఎందుకో చదువులో..ఉంటే మహాగొప్పగా..లేకుంటే సగటుకంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
ఐతే.. చాలామంది అమెరికన్లు దురాశపరులు కారు. సంపాదించిన దాన్ని తమ తక్షణావసరాలకోసం, జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడం కోసం, ప్రధానంగా నాణ్యమైన ఆహారంకోసం, అలంకరణ, ఆరోగ్యంకోసం ఖర్చుచేస్తారు. కడుపు చంపుకుని పొదుపుచేసి తెలుగువాళ్లవలె డబ్బును దాచిదాచి ఆస్తులు, సంపదలు కూడబెట్టుకోవాలన్న యావలేదు వీళ్ళకు. తెలుగువాళ్ళలో వలె సంపాదన మొదలుపెట్టి తన తరంతోపాటు భావి ఇంకో ఐదు తరాలు సుఖపడేట్టు మందికొంపలు ముంచయినా కూడబెట్టే దుష్టసంస్కృతికూడా అమెరికన్లలో లేదు. తను కష్టపడి ఏదో ఒక ఆదాయం కల్గించే పనిచేసి జీవిస్తూ పిల్లలను వాళ్ల కాళ్ళమీద వాళ్ళు నిలబడే ప్రయత్నమే అందరూ చేస్తారు. పారదర్శకమైన జీవితం వాళ్ళ విశిష్టత.
భారతసమాజంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలు, బీదరికం, నిరుద్యోగం, అవిద్య మనుషులందరినీ ఒకేచోట, ఒకేవిధంగా, జీవించే వీలు కల్పించలేకపోతుంది. కాని శతాబ్దాల పర్యంతం కొనసాగిన అనేక దూరదృష్టిగల పాలకుల పరిపాలనా పద్ధతులు, సంస్కరణల వల్ల ప్రస్తుతం ఎక్కువగా ఆర్థిక నిమ్నోన్నతులు లేని సమసమాజం అమెరికాలో వేళ్ళూనుకుంది. అందరికీ కనీసాదాయం, కనీస వసతి, కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్థితి సాధించడం సాధారణ విషయమేమీకాదు. భారతదేశంతో పోల్చుకుకంటే అనైతికత, విచ్చలవిడితనం, అవినీతి, లంచగొండితనం, రాజకీయ కాలుష్యం అమెరికాలో అస్సలే లేవు.
ఈ నేపథ్యంలో..,
రామం డ్రెస్‌ మార్చుకుని, డ్రాయింగు రూంలోకి వచ్చి..అప్పటినుండీ మనసునిండా ఒక వీడియో కార్యక్రమంలా కదిలిన గతాన్ని పునశ్చరణ చేసుకుంటూనే.,
తను అమెరికా వచ్చిన మొట్టమొదటిరోజు నుండి..ఒకటే ఆలోచన..ఒకటి..ఎప్పటికైనా..సాధ్యమైనంత త్వరగా భారతదేశానికి వెళ్లిపోవాలి..ఈ లోగా తను వర్తమాన భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న సర్వరుగ్మతలనూ రూపుమాపగల పరిష్కారాలను తయారు చేసుకోవాలి. రూపొందించుకోవాలి వాటిని పకడ్బందీగా అమలు చేయగల కార్యాచరణ ప్రణాళికను రచించుకోవాలి.
ఉద్యమం అంటే హింసాయుతమైన, రక్తపాతంతో కూడిన దౌర్జన్యకర ప్రజాప్రతిఘటనే కానవసరంలేదు. అర్ధవంతమైన హృదయ పరివర్తనతో కూడిన చైతన్యంకూడా ఉద్యమమే ఔతుంది. విప్లవం అంటే పెనుమార్పేగాని వేల లక్షలమంది ఆత్మార్పణతో నిండిన హింసాత్మక ఘటన కాదు. మనుషుల్లో సమూలమైన, నీతివంతమైన ప్రవర్తనను నెలకొల్పడం, అప్పటికే పతనమై ఉన్న మానవీయ మూలవిలువలను పునఃప్రతిష్టించడం కూడా ఒక అతి ప్రధానమైన విప్లవం క్రిందే లెక్క. ప్రశాంతంగా కూడా విప్లవాలు సాధ్యమౌతాయని తన అంచచల విశ్వాసం. అందుకు పటిష్టమైన సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలి. రెండు..ఏ పెనుమార్పును ప్రవేశపెట్టాలన్నా మొదట తగిన ఆర్థిక పరిపుష్టత కావాలి. ప్రారంభథలో డబ్బు చేతిలో లేకుండా ఉద్యమాలను నిర్మించడం సులభసాధ్యం కాదు. కనీస పోషణలేకుండా కార్యకర్తలు ఒక పోరాటంలో నిలబడలేరు. అందువల్ల ఒక నియమితకాలం కష్టపడి కొంత డబ్బును అతివేగంగా సంపాదించాలి. ‘ధనం మూలం మిదం జగత్‌’ అన్నది ఎవరూ విస్మరించలేని పరమసత్యం.
మూడవది.. ప్రజా ఉద్యమాలెప్పుడూ ఒకే ఒక వ్యక్తిచే నిర్మించబడి, నిర్వహించబడితే విజయవంతంకావు. ఒకే ఆలోచనా విధానం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం కలిగిన కొంతమంది మూలవ్యక్తుల భాగస్వామ్యం ప్రతి ఉద్యమ నిర్మాణంలో ప్రారంభథలోఅవసరం. భారతదేశ సమూల మార్పును కాంక్షించే తనవంటి ఎందరో యువకులు, వ్యక్తులు ఎందరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్లను గుర్తించడం, సమీకరించడం, ఒకచోట చేర్చడం, అందరినీ కలిపి ఒక శక్తిగా ఏకీకృతం చేయడం.. అప్పుడు ఒక సిద్ధాంతబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగడం.. ఇదంతా ఒక దీర్ఘకాలిక, జీవసమానమైన ప్రణాళిక.
ఒక మార్క్స్‌, ఒక మావో జుడాంగు, ఒక హోచిమిన్‌, ఒక గాంధీ..వీళ్లందరూ తమవైన విలక్షణమైన మానవీయ వ్యూహాత్మక సిద్దాంతాలతో ఈ మానవ సమాజానికి వివిధ జీవనసూత్రాలనందిస్తేగదా ఆ బలమైన పునాదుల మీద అనేక సమాజాలు, దేశాలు నిర్మితమై ఎదిగి ఈ రోజు మనగల్గుతున్నాయి.ఐతే..ఆ సిద్ధాంతాలు కాలపరీక్షకు నిలబడి మారుతున్న మానవ సమాజంలో ఎన్నేళ్ళు నిలబడగలిగాయి..ఎంతకాలం మనగలిగాయి..ఇంకా సజీవంగా ఉన్నాయా, కాలగర్భంలో కలిసి అంతరించిపోయాయా అన్నది వేరే విషయం.
ఏమైనా..ఒక సామాజిక పెనుమార్పుకు మాత్రం ఒక సూత్రబద్ధమైన సిద్ధాంతం, విపులమైన మానిఫెస్టో, విధానం అవసరం.. దాన్ని రూపొందించుకోవాలిప్పుడు తను..ఐతే లీలా మాత్రంగా ప్రస్తుత పరిస్థితికి పరిష్కారాలనబడే పద్ధతుల గురించి ఎప్పట్నుండో తను తన సహానుభూతిగల మిత్రులతో చర్చిస్తూనే ఉన్నాడు. అవి కార్యరూపం ధరించేందుకు సమయం ఆసన్నం కాబోతోందిక.
రామం నిశ్శబ్దంగా సోఫాలో ఒరిగి..అలా నిర్వ్యాపారంగా చూస్తు ఉండిపోయాడు. ఎదురుగా..చిన్నప్పటినుండీ  తనకున్న అలవాటును ప్రతిబింబిచే ఒక చిత్రం ఉంది. గోడపై..ఒక ముఖ్యవాక్యాన్ని ఎదురుగా ఉదయం లేవగానే కనబడేవిధంగా బెడ్‌రూంలో గోడకు అతికించుకునేవాడు తను. మరుపు రాకుండా..’మనిషి దొంగ’ అని రాసిపెట్టుకున్నాడు ఎన్నో నెలలు. అది పైకి అసత్యమేమో అనిపించినా ఆత్మసమీక్ష స్థాయిలో అదే సత్యమని ఎవరి అనుభవం వారికి చెబుతుంది.
ఇప్పుడు.. ఎదురుగా ఉన్న మందపు డ్రాయింగు షీట్‌పై..ఒక బొమ్మవేసి ఉంది. కుళాయి నుండి వడివడిగా నీళ్ళు ఒక కుండలో పడ్తున్నాయి. ఆ నీళ్ళపై ‘దేశప్రజల ఆర్థిక వనరులు’ అని రాసి ఉంది. ఆ నీటిధార క్రింద ఒక కుండ ఏర్పాటు చేయబడి ఉంది. దానికి అడుగు లేదు.కుండపై ‘భారతదేశం..ప్రజలు..ప్రజాసంక్షేమం’ అని రాసి ఉంది. కుండలో ఒక్క నీటి బొట్టుకూడా పడకుండా సూటిగా నీళ్లుమొత్తం క్రింద ఉన్న బకెట్‌లో పడి, నిండి పొంగి పొర్లిపోతున్నాయి. బకెట్‌ఫై ‘మంత్రులు..రాజకీయనాయకులు..దళారులు..ప్రభుత్వ అధికారులు’ అన్న అక్షరాలున్నాయి.
భారతదేశపు భావి ప్రధానిగా భావించబడ్తున్న రాహుల్‌ గాంధీ ఒక సందర్భంలో భారతదేశంలో ఊడలుదిగిన అవినీతి గురించి చెబుతూ ‘ఈ దేశంలో ప్రభుత్వం ఒక రూపాయిని ప్రజాపథకాలకు అందిస్తే కనీసం ఐదు పైసలు కూడా లబ్దిదారులకు అందడంలేదు’ అని వాపోడం జ్ఞాపకమొచ్చింది రామంకు.
‘ఈ దేశంలోనుండి అవినీతి లంచగొండితనం  అనే రక్కసిని మనందదరం ఏకస్తులమై పారద్రోలాలి’ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో ఉద్ఘాటించడం స్ఫురణకొచ్చింది.. పారద్రోలవలసిన రాష్ట్రపతే ‘మనందరం కలిసి పారద్రోలాలి’ అని నిస్సహాయంగా అంటే.. ఇక పారద్రోలవలసింది ఎవరు.

( సశేషం)

ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? 3 వ భాగం

( గత వారం తరువాయి)

3

third week fig-1

వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
చుట్టూ విపరీతమైన మీడియా వ్యక్తుల ఒత్తిడి. టి.వి. ఛానళ్ళవాళ్ళు, పత్రికలవాళ్ళు, ఒక మంత్రి హత్య జరిగింది కాబట్టి జాతీయస్థాయి టి.వి. వాళ్ళు..ఒకటే హడావుడి.. ఈ దేశంలో ఇంత స్వేచ్ఛ, యింత మీడియా కవరేజ్‌, యింత అతి ప్రవర్తన అవసరమా అని వేయవసారి విసుక్కున్నాడు ఎస్పీ విఠల్‌. గెస్ట్‌హౌజ్‌లో మంత్రిగారి హత్య జరిగిన బెడ్‌రూం ప్రక్కగదిలో కూర్చున్నాడు ఒంటరిగా బోనులో సింహంలా. బయటంతా పోలీసులు వాసన.. హడావుడి.. మంత్రిగారి శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నం..మంత్రి బంధువుల రాక..రాళ్ళవానలా..అంతా బీభత్సం.
విఠల్‌లోనుండి విస్కీ మత్తు పూర్తిగా దిగిపోయింది.
‘కథ’ను ఎంత పకడ్బందీగా అల్లినా..డిపార్ట్‌మెంట్‌లో తనకు విధేయులైన చెంచాగాళ్ళను ఎంత మందిని పురమాయించి ఉద్యుక్తుల్ని చేసినా..ఇటువంటివే ఎన్నో హత్యలను తను ఇదివరకు విజయవంతంగా చేసినా..ఎందుకో చిత్రంగా విఠల్‌కు భయం కల్గుతోంది. ఎన్నడూ లేంది.
ఎందుకు.. రాక్షసుడిలాంటి, రాయిలాంటి తనకు భయమెందుకు.
వర్షం బయట ఉధృతంగా కురుస్తున్నా విఠల్‌ ముఖం నిండా అతనికి తెలియకుండానే చెమటపట్టింది.. ఏదో సన్నని వణుకు.
సరిగ్గా అప్పుడు మ్రోగింది విఠల్‌ మొబైల్‌.
”హలో” అన్నాడు. అన్‌నోన్‌ నంబరది.
”విఠల్‌.. అనవసరంగా తొందరపడ్డావ్‌” అటు ప్రక్కనుండి గంభీరమైన నిశ్చలమైన ఓ స్త్రీ గొంతు.
మొదట షాకై..క్షణకాలం తత్తరపడి..తర్వాత అదిరిపడి. మరుక్షణం ఆ కంఠాన్ని లీల స్వరంగా గుర్తించి..కంపితుడై,
”మేడమ్‌..”అన్నాడు ఆందోళనగా.
”ఇలా చేయవలసింది కాదు” అదే స్థిరత్వం గొంతులో. సారీ మేడం..”
”ఇట్సాల్‌రైట్‌.. ఒక ఎంక్వయిరీ కమీషనొస్తుంది..బయట పడ్డానికి ముందు నిన్ను అక్కడ్నుండి ట్రాన్స్‌ఫర్‌ చేపిస్తా.. నీతో నాకు చాలా పనుంది. ధైర్యంగా ఉండు”
”థ్యాంక్యూ మేడం”
”నువ్వు అళ్లిన కథనే కొనసాగించు. కథ బాగానే ఉంది..ఊఁ. తాగడం బాగా తగ్గించి తక్కువగా మాట్లాడ్డ మంచిదేమో విఠల్‌ నీకు ఊఁ..”
”ఔను మేడం.”
ఫోన్‌ పెట్టేసింది లీల అటువైపునుండి.
నిజానికి విఠల్‌ అప్పుడాక్షణం లీల గొంతువిని అదిరిపడ్డ వణుకునుండి కోలుకోకుండానే..వెంటనే పోలీస్‌ బ్రెయిన్‌తో లీల చేసిన నంబర్‌ను డిస్‌ప్లే చేసి కోడ్‌ చూచుకున్నాడు. 0974.. అని ఉంది. నైన్‌ సెవెన్‌ ఫోర్‌..అంటే దోహా..కతార్‌.,
ఎక్కడో ఓ అరబ్‌దేశంలో ఉన్న లీలకు..తను చేసిన హత్య విషయం ఇంత వివరంగా..ఇంత తొందరగా.,
చటుక్కున విఠల్‌కు జ్ఞాపకమొచ్చింది..మంత్రికీ, తనకూ కలిపి ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ రెండువందలకోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను యిప్పించింది లీలేనని. తమ గొడవను సెటిల్‌ చేయమని తనే ఈ మధ్య లీలను సంప్రదించడంకూడా వెంటనే స్ఫురించింది.
విఠల్‌ ఖంగుతిని..’తనెరిగిన కొద్దమంది అద్భుతమైన అతి తెలివితేటలున్న వ్యక్తుల్లో ఈ లీల ఒకతి’ అని ఎందుకో అనుకున్నాడు లిప్తకాలం.. వెంటనే ముఖంమీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ.,
జ                జ        జ
విఠల్‌తో మాట్లాడి మొబైల్‌కాల్‌ కట్‌చేసిన లీల టైం చూచుకుంది. దోహాలో ఉదయం ఆరుగంటల పదినిముషాలు.. ఇండియాలో ఎనిమిది దాటింది.
క్షణకాలం చనిపోయిన మంత్రి విశ్వనాధరెడ్డితో ఉన్న లావాదేవీలను పునశ్చరణ చేసుకుంది.. ”పూర్‌ ఫెలో..నోటి దురుసున్న ఒట్టి ఆవేశపరుడు..”అని నిట్టూర్చి..నిర్మలను పిల్చుకుంది లైన్‌లోకి.
”నిర్మలా..ఏమైంది..”
”మీ ప్రోగ్రాం మొత్తం రీషెడ్యూల్‌ చేశాను మేడం. ముందనుకున్నట్టు మీరు ఢిల్లీకి రాకుండా..వాషింగ్టన్‌ వెళ్తారు. రెండు రోజుల స్టే అక్కడ..ఔనా.”
”ఎగ్జాట్లీ..ఫుట్‌ మీ టోటల్లీ ఫ్రీ నిర్మలా”
”ఎస్‌ మేం..యు ఆర్‌ కంప్లీట్లీ రిలీవ్డ్‌.. మీకెవరూ కాల్‌ చేయరు. అన్ని కాల్స్‌ను జామ్‌ చేస్తాను”
”దట్స్‌ గుడ్‌..”
”మీకు ఈ పూటే తొమ్మిదీ పదికి కతార్‌ ఎయిర్‌వేస్‌లో గష్ట్ర.51 ఫస్ట్‌క్లాస్‌లో వాషింగ్టన్‌ డి.సి.కి టికెట్‌ బుక్‌ చేశా మేడం. రిసిప్షన్‌లో ఇ-టికెట్‌ తీసుకోండి.. పదమూడు గంటలు ప్రయాణం. సాయంత్రం యుఎస్‌ టైం నాల్గున్నరకు అక్కడకు చేరుకుంటారు. మేరీల్యాండ్‌లో ఉంటారు మీరు కాబట్టి లోయిస్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ అన్నెపోలిస్‌ హోటల్‌లో డీలక్స్‌ కింగు సూట్‌ మీ పేర బుక్‌ చేయబడి ఉంది. మీకు మన ఏజంట్‌ ప్రకాశ్‌ రిచర్డ్స్‌ అనే డ్రైవర్‌ నిచ్చి ఏర్‌పోర్ట్‌కు కారును పంపుతాడు..”
”థాంక్యూ నిర్మలా..వెల్‌డన్‌”
”హాపీ స్టే మేం..”
”థాంక్యూ”
అటువేపునుండి నిర్మల నిష్క్రమించింది. ఎంత చురుకైన ఎగ్జిక్యూటివో అనుకుంది లీల.

Ekkadi(1)
‘రెండురోజులు..ఫ్రీ..స్వేచ్ఛ..వినీలాకాశంలో ఎగిరే పక్షి తను..’ఎందుకో ఆమె అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షికూనలా పులకిస్తూ సంబరపడిపోయింది.
‘ఒక అద్భుతమైన టీ తాగితే ఎలా ఉంటుంది.’ అని అనిపించి,
చటుక్కున లేచి.. కిచెన్‌ ఓవెన్‌లోనుండి కంపోజ్ట్‌ టీ..రెండు నిముషాల్లో తెచ్చుకుని..ఎంత గ్రాండ్‌ హోటల్స్‌ ఇవి.. అన్నీ చాచిన చేయికి అందేవిధంగా..లాంజ్‌లోకి వచ్చి..విశాలమైన గాజు కిటికీ సన్నని తెరలనుజరిపి ఎదురుగా గర్జిస్తున్న నీలి సముద్రం..దూరంగా లంగరు వేసిన నౌకలు..పైన ఎర్రగా ఆకాశం..పురిటినొప్పులు పడ్తున్న ప్రకృతి..ఒక సూర్యశిశువు జన్మించాలిప్పుడు..లెట్‌ మీ సీ ఇట్‌.
పసిపిల్లయిపోయింది లీల.
చాలా అనాలోచితంగా. ఆమె టకటకా తన బ్లాక్‌బెర్రీ ఫోన్‌తో ఎంపిఫోర్‌ ట్రాక్‌ చేసి బటన్‌ను ఆన్‌ చేసింది.
తనకెంతో యిష్టమైన ముఖేశ్‌ పాట..’లౌట్‌ కే ఆఁ..లౌట్‌ కే ఆఁ…’
పాట ఒక సముద్ర కెరటమై పురి విప్పుకుని విస్తరిస్తూండగా..టీని మృదువైన పెదవులలో కొద్దికొద్దిగా చప్పరించి.. కళ్ళుమూసుకుని..కుర్చీలో వెనక్కి ఒరిగి..
శరీరంలోనుండి.. ఆత్మ విడివడి వియుక్తమౌతున్నట్టు…ఏదో విభాజ్యమై..ఏదో సంయోగం చెంది..ఎక్కడో ఒక అనుస్పర్శతో పులకించి.. వివశయై.,
తంత్రి మీటబడి..ఒక రసధ్వని పుట్టి..విస్తరిస్తూ..వ్యాపిస్తూ..భాషకందని ఏదో తాదాత్మ్యతలో అన్నీ కోల్పోతూ.. అంతర్ధానమైపోతూ..లీనమైపోతూ..అదృశ్యమైపోతూ,
‘ఎక్‌ ఫల్‌హై హస్‌నా, ఏక్‌పల్‌ హై రోనా
ఏక్‌ పల్‌ హై మిల్నా ఏక్‌ పల్‌ బిచడ్‌నా
దునియాహై దోదిన్‌కా మేలా…’అంటున్నాడు ముఖేశ్‌.
ఎంత సత్యం.. స్థూలంగా జీవితమైవరిదైనా అంతిమంగా అంతా ఇంతేగదా.
మనిషి వెళ్ళిపోయి..పాడిన పాట మిగిలిపోయి..పాటతో ఒక జీవిత సారాంశం చిరస్మరణీయ సంపదగా మిగిలిపోయి.. ఏదోపోయి..ఏదో మిగిలి..అసలు పోయేదేమిటి..చివరికి మిగిలేదేమిటి..నిజానికి పోవడానికిగానీ మిగిలిపోవడానికిగానీ మనిషి దగ్గర ఏదైనా ఉందా. శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం ఎక్కడైనా వ్యవస్థీకృతమైన శక్తి ఎప్పుడూ స్థిరమేకదా..రూపాలు మారవచ్చుగానీ శక్తి పరిమాణం మారుతుందా..పరిణామక్రమాలు వేరుకావచ్చు కాని రూపాంతరస్థాయిలో నిక్షిప్తమై ఉండే శక్తి స్థిరమూ, శాశ్వతమూ, అనంతమూ ఐ..చివరికి మిగిలేది శూన్యమేగదా.,
పూర్ణమదః పూర్ణమిదః
పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావ శిష్యతే
శూన్యం నుండి శూన్యాన్ని తీసివేసినా, శూన్యానికి శూన్యాన్ని కలిపినా..శూన్యంతో శూన్యాన్ని హెచ్చవేసి, భాగించి.. భిన్న భిన్న సహస్రాంశ సూక్ష్మాలుగా విభజించినా..సత్యమై, నిత్యమై పరిఢవిల్లే పరమ పచ్చి నిజం శూన్యమేకదా-
కళ్ళు మూసుకున్న లీల మనసు సముద్రమై మథనం చెందుతోంది.
నిశ్చలత్వం. అనిశ్చితి..స్థిరత..డోలనం..మథనం..మళ్ళీ ఏకత..ఇదంతా ఏమిటి?
మూసిన కళ్ళవెనుక ఏదో గాఢమైన, లోతైన, సాంద్రమైన..స్పష్టంగా తెలియని ఏదో అవ్యక్తత.,
ఏమిటది..తెలియని ఆ ఏమిటో ఏమిటది.?
అన్వేషణ..లోపల..లోపల్నుండి యింకా లోపలివైపు..’ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు లీనమై..ఆ ‘లోపలివైపు’ ..నక్షత్రాలను చిమ్ముకుంటూ రసోద్విగ్నయానం చేస్తున్న ఆత్మ ఒక ఉల్కవలె విశ్వాంతరాల గర్భాల్లోకి చొచ్చుకొని చొచ్చుకునిపోతూ పతనమౌతున్న క్షణం..ఒక బిందువై జన్మించే అన్వేషణ, వివేచనై.. విశ్లేషణై, విస్తరించి విస్తరించి.. ఉహుఁ.. అర్థంకావడంలేదు..అంతు చిక్కడంలేదు..భౌతికం అభౌతిమై, మిథ్య ఒక వాస్తవమై..సత్యం పరమ సత్యంగా భాసిస్తూ ఋజువుగా అనుభవమౌతున్న మహోద్వేగ క్షణాలు..వ్యక్తీకరించేందుకు భాషకు లొంగుతాయా. అనేక సందర్భాల్లో మనిషి తట్టుకోలేని మహోగ్ర ఉద్విగ్నతలను బయటి ఏ భాషలోనైనా వ్యక్తీకరించలేక ఓడిపోయి..సుళ్ళు తిరుగిపోతూ బిగ్గరగా ఏడ్చి.. పిచ్చిగా నవ్వి.. పొంగి పొర్లి తుఫానులా తల్లడిల్లిపోయిన అనుభవాలు ఎందరికి లేవు.
ఐతే.. ఈ అంతర్‌లోకాంతరాల్లోకి తొంగి చూడగల సంస్కారం, తత్వం, అభిరుచి ఎందరికుంటుంది..దీన్నేుకృతమంటారా. కృతాలూ, దృష్టాలూ..ఇవన్నీ ఏమిటి..సుకృతాలూ, కనబడని అదృష్టాలూ ఏమిటి..అసలీ కనబడడం, కనబడకపోవడమేమిటి. చూపు, దృష్టి ఏమిటి.. ఉందీ అంటే కనబడడమా. లేదూ అంటే కనబడకపోవడమా. కనబడనివన్నీ లేనట్టా. సమస్త విశ్వాంతరాల చుట్టూ క్షేత్రమై వ్యాపించి ఉన్న ఏ శక్తితరంగాలూ కంటికి కనబడ్డం లేదు కదా. అంతమాత్రాన అవి లేవని నిర్ధారించలేముకదా. ఉన్నాయని మన రేడియో తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు, అనేక వర్గీకరణలకు చెందిన కాంతి తరంగాలు..ఇవన్నీ తమ అద్భుత చర్యలతో ప్రమేయాలై ఋజువు చేస్తున్నాయికదా. మనిషికి తెలిసిన ఈ కొద్ది అదృశ్య తరంగశక్తులు కాకుండా..మనిషి ఇంకా పసికట్టని అనేకానేక వింత శక్తి స్వరూపాలు ఈ సృష్టిలో ఇంకెన్నున్నాయో.
హృదయ తరంగాలుంటాయా..ఒక మనిషి తనకు చెందిన ఒక హృదయ పౌనఃపున్యంతో స్పందిస్తున్న మరో మనిషియొక్క హృదయ తరంగాలతో అనుసంధానమై ప్రతిచర్యించగలడా.
వ్చ్‌.. ఏమో,
చీకటే శాశ్వతం..వెలుగే అప్పుడప్పుడు మధ్య మధ్య అతిథిలా వచ్చి ‘దిన’మై మనను భ్రమింపజేస్తోందనే వాదన నిజమేనా. వెలుగును విశ్లేషిస్తే ఏడు రంగులుగా విడిపోయినట్టు చీకటిని విశ్లేషిస్తే.. వింతైన అద్భుతాలు బయటపడ్తాయా,
లీల ఒక శ్వాసిస్తున్న సముద్రంలా కళ్ళు మూసుకుని..సమాధియై పోయింది.
ఆకాశపర్యంతం విస్తరించిన ఒక మహావాయుస్తంభనలో తను చిన్న ధూళి కణమై తేలిపోతున్నట్టు..అంతా తేలిక, అగమ్యం. శూన్యోత్సర్గం-
నిశ్శబ్దం..గడ్డకట్టిన నిశ్శబ్దం..అభేద్యమైన నిశ్శబ్దం.
కాలం గడుస్తోంది..ఆమె పూర్తిగా అభౌతికమైపోయింది.
..అప్పుడు మ్రోగింది ఆమె మొబైల్‌ఫోన్‌.
ఉలిక్కిపడి..చటుక్కున ఎత్తి..
నిర్మల
నిర్మల కాల్‌ చేయవలసిన ప్రోగ్రాం ఏమీలేదు. ఐనా ఎందుకు చేస్తోంది.
”నిర్మలా..”అంది.
”….”జవాబు లేదు. ఏదో గర్ర్‌ర్‌ర్‌మని ధ్వని. లైన్‌ డిఫెక్టివ్‌.,
”నిర్మలా..”మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. కొద్దిసేపు ఏవేవో శబ్దాలు వినిపించి ఓ అర నిముషం తర్వాత లైన్‌ తెగిపోయిది. మనసులోనుండి ఏదో ఓ మహాపర్వత భారం తొలగిపోయినట్టయి..,
ఎదురుగా అదే దృశ్యం..నిరంతరంగా సంఘర్షించే సముద్రపు అలలు. నీలి గగనం..నీలి నీరు..మధ్య రగులుకోబోతున్న కొలిమిలా ఎర్రగా నిప్పుముద్ద..సూర్యోద్భవం.
సూర్యోదయం..నిత్యనూతనమైన..అతిసాధారణమైన.. అతి సహజమైన..ప్రాణప్రదమైన, జీవాధారమైన..సూర్యోదయం.
దేవుడున్నాడా.. లేడా.. ఉంటే ఎలా ఉన్నాడు,ఎక్కడున్నాడు, ఆ ఉన్నది ఆడదా, మగాడా, వాడు లేక ఆమె రూపమేమిటి.. వాడి వెనుక మర్మమేమిటి..ఈ మీమాంసను ప్రక్కనబెడ్తే..తన దృష్టిలో ప్రత్యక్షదైవం సూర్యుడే..కనబడేవాడు.. కనిపింపజేసేవాడు.. కనువిప్పుకలిగించేవాడు. సర్వశక్తులకూ శక్తికేంద్రకమై  సకల చరాచర సృష్టికి మూలమై భాసించేవాడు. ప్రధానంగా తనకూ, తన జీవిత రూపకల్పనకు స్ఫూర్తిప్రదాతయై ఒక ఊపిరిగా గుండెల్లో నిత్యమై జ్వలించేవాడు. తన వ్యక్తిత్వ వికాసానికి అజ్ఞాత నిత్యప్రేరకుడు.

third week fig-2
రథస్యైకం చక్రం భుజగయమితా స్సప్తతురగాః
నిరాలంబో మార్గ శ్చరణవికల స్సారథి రవిపి|
రవి ర్యాత్యేవాస్తం ప్రతిదిన మపారస్య నభసః
క్రియాసిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే||
ఎంత గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయమిది..
ఒంటి చక్రమేగల రథాన్ని అధిరోహించి వచ్చేవాడు..అసలు ఒంటి చక్రం పడిపోకుండా నిలబడ్తుందా..ఒంటి చక్రం నిలబడాలన్నా, నిలబడి పయనించాలన్నా కొంత కనీస భ్రమణవేగాన్ని కలిగి ఉండాలి. లేకుంటే అది కూలిపోతుంది. అంటేకదలిక.. కనీస వేగంతో కూడిన కదలిక జీవిపురోగతికి అత్యంతావశ్యకమని చెప్పడం.. సప్తాశ్వరథమారూఢం.. ఏడు గుర్రాలు తెలుపురంగుకు మూలమైన సప్తవర్ణాలకు ప్రతీకలే ఐనా..ఏడు శక్తులు గుర్రాలవలె వివిధ దిశలలో రథాన్ని.. అంటే మనిషిని లాక్కుపోతున్నపుడు వాటన్నింటిని సమన్వయపరిచి ఏకశక్తిగా..సింగిల్‌ వెక్టార్‌గా రూపొందించుకోవాలి.. అంటే మనిషి తనలో నిబిడీకృతంగా ఉన్న వివిధ శక్తులను గుర్తెరిగి వాటిని సమీకృతపరచుకుని ఏకలక్ష్య గమనంతో గమ్యంవైపు సాగాలి. రథసారధి అనూరుడు. తొడలు లేనివాడు. కనీసవేగంతో ఒంటిచక్రపు రథాన్ని నడుపుతూ, ఏడు గుర్రాలను సమన్వయపరుస్తూ, అదుపులో ఉంచుకుంటూ క్రమశిక్షణతో నిండిన కాలస్పృహతో పయనం సాగించేవాడు. అంటే జీవితమనే గమనానికి సారధ్యం వహించేవానికి అంగవైకల్యం ఏవిధంగానూ ఒక అవరోధం కాదు- అని. గుర్రాలను నియంత్రించే పగ్గాలు.. పాములు. సజీవమైన పగ్గాలు సక్రమంగా పనిచేయాలంటే సమర్థవంతమైన పాలనతో కూడిన నిర్వహణ ముఖ్యం..అందుకు పాటవం కావాలి. అన్నింటినీ మించి ప్రతి దినమూ భూగోళానికంతటికీ సంబంధించి కాలధర్మానికీ, సృష్టి నియమాలకూ లోబడి నియమిత ప్రాంతంలో, నియమిత కాలంలో సూర్యుడక్కడకు చేరి, విధులను నిర్వర్తించి ఉదయాస్తమయ ధర్మాలను పాటించాలి.. ఒక నిర్దుష్ట మార్గాన్ని అతి ఖచ్చితంగా పాటించాలి. ఐతే.. ఏ దారీలేని ఆకాశమార్గంలో.. మేఘాల్లో..ఎప్పటికప్పుడు దారిని తెలుసుకుంటూ, పథభ్రష్టత చెందకుండా ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రయాణం కొనసాగించాలి. జీవితంలో లక్ష్యాలను చేరేందుకు ఎప్పటికప్పుడు ఎవరికివారు తమతమ దిశను తామే నిర్దేశించుకుంటూ జాగ్రత్తగా సాగాలి..అని లేకుంటే దారితప్పి ఆత్మధ్వంసంతో మనిషి పతనం కావడం ఖాయం.. ఇంత వ్యక్తిత్వవికాస పాఠం సూర్యునితో, సూర్యునివల్ల..సూర్యునిద్వారా.,
తను ఎం.బి.ఎ చేస్తున్నపుడు మౌళిసార్‌ చెప్పిన ‘ఆదిత్య హృదయ వివరణ’. ఇది ఎంత గొప్ప అన్వయం. జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా సూర్యుణ్ణి మించిన స్ఫూర్తి ప్రదాత ఇంకెవరుంటారు.,
ఆకాశంనుండి ఒక నక్షత్రం రాలిపడ్డ అనుభూతి కలిగి..చటుక్కున తెగిపోయి..ఉలిక్కిపడి,
టైం చూచుకుంది లీల. ఎనిమిదీ పది. తొమ్మిదీ నలభైకి యుఎస్‌ఎ ఫ్లైట్‌..తయారుకావాలి.,
ఇంతకూ నిర్మల ఎందుకు ఫోన్‌ చేసినట్టు,
చకచకా నిర్మలకు నంబర్‌ కలిపింది..రింగై..”నిర్మలా..”
”మేడం..పావుగంటనుండి మీకోసమే ప్రయత్నిస్తున్నా..లైన్‌ కలువడంలేదు”
”చెప్పు..”
”ఒక అలర్ట్‌ న్యూస్‌”
”మనం. ఇరాక్‌ యుద్ధం తర్వాత రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా విపరీతమైన ప్రాజెక్ట్స్‌ దొరుకుతాయని ఒక మూడునెలలకాలం కేవలం మిడిలీస్ట్‌ కార్యకలాపాలపైననే దృష్టి పెట్టాం జ్ఞాపకముందా. బస్రా పవర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌స్టలేషన్‌కు సంబంధించి అమెరికా కంపెనీ ఆల్టెక్‌ పవర్‌ ఇన్‌కార్పొరేషన్‌తో కలిసి ఇండియాకు చెందిన మన క్లెయింట్‌ రమేశ్‌ సహానీకి రెండు మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ ఇప్పించాం..జ్ఞాపకముందా..ఆ డీల్‌లో మెక్సికోకు చెందిన జెన్‌రోవర్‌ అండ్‌ కంపెనీతో గొడవపడ్డాం.. మీరు ఒకసారి మెక్సికోకూడా వెళ్ళొచ్చారు. రోజర్స్‌, మైకేల్‌, మిసెస్‌ బర్గర్‌,మిస్‌ హోస్టలర్‌..ఊఁ..ఐతే నిన్నరాత్రి ఎవరో గుర్తుతెలియని దుండగులు రమేశ్‌ సహానీని గుజరాత్‌ గాంధీనగర్‌లో కృష్ణ ఐమాక్స్‌ థియేటర్‌లో తన కీప్‌తో కలిసి సినిమా చూస్తూండగా కాల్చి చంపారు..ఎవరో ఆ పాతపగను పర్సూ చేస్తున్నారు..మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇపుడు మిసెస్‌ బర్గర్‌ గ్రూప్‌ మార్చి అలెక్స్‌ మైకేల్‌ గ్రూప్‌లో ఉందట. ఆమెకు మీరు..మీ గురించిన పూర్తి వివరాలు తెలుసు. చాలా పదునైన మనిషి – యంగు అండ్‌ బ్యూటిఫుల్‌. ఆమె ఫోటోను మీకు మెయిల్‌ చేస్తున్నా. మొన్ననే ఆమె ఇండియాకు వచ్చి వెళ్ళినట్టు తెలిసింది..”
చెప్పుకుపోతోంది నిర్మల..ఒక పోలీసాఫీసర్‌కంటే స్పష్టంగా,
యంగు అండ్‌ బ్యూటిఫుల్‌..నిర్మల కూడా. కార్పొరేట్‌ రంగాల్లోగానీ, దుర్మార్గమైన నీచరాజకీయాల్లోగానీ, మాఫియా గ్రూపుల్లోగానీ కీలకమైన వ్యక్తులు వ్యక్తిగతమైన ఆసక్తులతో ద్రోహపూరిత చర్యలతో ప్లాట్‌ఫాం మారడం ఎంతో సహజమే.. ఐతే, నాయకత్వం వహించేవాళ్లు ఎప్పుడూ ‘ఎదుటివాడు దొంగ..ద్రోహి’ అనే దృష్టితోనే అనుక్షణమూ వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఎక్కడైతే అత్యంత సుఖవంతమైన సౌకర్యాలూ, అధికారాలూ ఉంటాయో ప్రక్కనే తత్‌వ్యతిరేకమైనప్రాణభయంతో కూడిన ప్రమాదాలూ, రిస్కూ పొంచి ఉంటాయి. ఉన్నతస్థాయి నిర్వహణలన్నీ తాడుపై పరుగువంటివి. పరుగును మరచి నడకకొనసాగిస్తే లోయల్లోకి పత్తాలేకుండా కూలిపోతారు..ధ్వంసమైపోతారు.
”ఓకే నిర్మలా..”
”టేక్కేర్‌ మేం..” లైన్‌ కట్‌ చేసింది.
”… ” లేచి..అద్భుతమైన పరిమళం నిండిన బాత్‌రూంలోకి నడిచింది లీల. గోరువెచ్చని నీటి షవర్‌క్రింద స్నానం కానిస్తూ,
ఆమె మెదడు పాదరసంలా జ్ఞాపకాలను తవ్వుతోంది. మార్చి 20, 2003న ప్రారంభమైన ఇరాక్‌ యుద్ధంలో అమెరికా సేనలు ఇరాక్‌ సమాజాన్ని కకావికలు చేసిన విధ్వంసం తర్వాత, యుఎస్‌ 35 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని ఇరాక్‌ పునర్మిర్మాణం కోసం ప్రకటించిన తర్వాత, యిక అంతర్జాతీయ స్థాయి రాబందులన్నీ ఇరాక్‌ నేలపై వాలడం మొదలైంది. మల్టీనేషనల్‌ కంపెనీల ముసుగువేసుకున్న ఈ దిక్కుమాలిన కంపెనీలన్నీ దేశం ఏదైనా ఒకే ఒక అనైతిక మూలసిద్ధాంతాన్ని కలిగి ఉంటాయి. అదేంటంటే ‘పే అండ్‌ యూజ్‌’. నిజానికి ఇది ప్రైవేట్‌ టాయ్‌లెట్‌ ఆపరేటర్ల స్లోగన్‌. ఇదే నినాదం అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు కూడా ఖచ్చితంగా పాటిస్తాయి. దేశమేదైనా, వ్యక్తి ఎవరైనా డబ్బుకు లొంగని వాడెవడూ ఉండడు. గో ఎ హెడ్‌ అండ్‌ కాప్చర్‌. అంతే. ఆ క్రమంలో అమెరికాకు చెందిన ఫిలిప్‌ బ్లూమ్‌ కంపెనీతోకలిసి మెక్సికోకు చెందిన జెన్‌ రోవరో 1.2 బిలియన్‌ డాలర్ల పవర్‌ ప్రాజెక్ట్‌లను బస్రా, కుర్దిష్‌, రుమాలియాలలో చేజిక్కించుకున్నపుడు మెల్లగా తను ప్రవేశించి 0-2-బి. ఒకటి, 0.4 ఒకటి, 0.3 ఒకటి ఇలా మూడు సబ్‌ కాంట్రాక్ట్‌లను రమేశ్‌ సహానికి యిప్పించింది. అందువల్ల జెన్‌ రోవర్‌ కొన్ని ప్రాజెక్టులను కోల్పోవలసి వచ్చింది తన వల్ల. అదీ తనపై వాళ్ళ పగ.అప్పుడైతే..రెండు నెలల బాగ్దాద్‌లోనే మకాం వేసింది తను ”ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌” పథకం క్రింద బైజి, రుమాలీయాలలో మన బిహెచ్‌ఇఎల్‌ 8.7 బిలియన్‌ రూపాయలతో నాల్గు గ్యాస్‌ టర్బయిన్‌లను నెలకొల్పడంలో మాత్రం తక్కువ అవినీతి జరిగిందా. సైట్‌ ఇంజనీర్‌ నాయర్‌, వాసుదేవ్‌, అలెగ్జాండర్‌, షర్మిల సక్సేనా.. వీళ్ళందరు ఎన్ని లక్షలు..కోట్లు తిన్నారో.. చరిత్రలన్నీ అవినీతి కంపు..వ్యాపారాలన్నీ పుట్టకురుపుల్లాంటి కుళ్ళు.,
స్నానం ఐపోయింది..ఒక చెత్త జ్ఞాపకం తెగిపోయింది. బయటకొచ్చి చకచకా పదినిముషాల్లో తయారై..యిక యిప్పుడెవడూ రారు తనకోసం..ప్యూర్లీ పర్సనల్‌ మూవ్‌మెంట్స్‌..రూంలోని ఇంటర్‌కాంలోనే రిసిప్షనిస్‌కు దోహా ఏర్‌పోర్ట్‌కు టాక్సీకోసం చెప్పి,
అద్దంలో..తనను తాను తృప్తిగా చూచుకుని..పొంగిపోతూ.,
కిందికి..ట్యాక్సీలోకి..పావుగంట తర్వాత దోహా ఏర్‌పోర్ట్‌లోకి..మరో పది నిముషాల్లో కతార్‌ ఏర్‌ వేస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫస్ట్‌క్లాస్‌..ఎ- త్రీ టు కిటికీ దగ్గరి ఫ్లాట్‌బెడ్‌లాంటి సీట్లోకి.. మరో పదినిముషాల్లో విమానం గర్జిస్తూ టేకాఫై ..గగనతలంలోకి.,
మళ్ళీ..శృతిలా కొనసాగుతున్న విమాన గర్జన మధ్య గడ్డకట్టిన నిశ్శబ్దం.
పదమూడు గంటల ప్రయాణం..బాగ్దాద్‌, బస్రా, ఫ్రాంక్‌ఫర్ట్‌…అట్లాంటిక్‌ మహాసముద్రంపై నాల్గుగంటలు..డెట్రాయిట్‌, పెన్సెల్వీనియా, బూస్టన్‌, న్యూయార్క్‌.
మళ్ళీ…అంతర్లోకాల్లోకి ప్రయాణం.,
రామం జ్ఞాపకమొచ్చాడు లీలకు.
జ్ఞాపకమొచ్చాడు అనడం తప్పేమో..మరిచిపోతేగదా జ్ఞాపకం రావడానికి.. కొన్ని జ్ఞాపకాలు నిరంతరం ఒక అనునాదంలా హృదయంలో సజీవంగా కదుల్తూనే ఉంటాయి. మెలకువలోనైనా..నిద్రలోనైనా.
రామం ఒక ప్రత్యేకమైన అతీత వ్యక్తి.

ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? – 2 వ భాగం

ekkadi-2( గత వారం తరువాయి )

2

రాత్రి పన్నెండుగంటల నలభై రెండు నిముషాలు.ఎస్పీ విఠల్‌ చాలా అసహనంగా, చికాగ్గా..ఎందుకో పొయ్యిమీది గిన్నెలో మరుగబోతున్న నీటిలా ఉడికిపోతున్నాడు.

ఎండాకాలం.. ఉంచుకున్న మూడవ ఆడదాని మూడవ అంతస్తులోని ఎ సి గదిలో ఒంటరిగా..రివాల్వింగు చైర్‌లో అటు ఇటూ కదుల్తూ..నిప్పుకణికలా కణకణలాడ్తున్నాడు.
అంత అసహనం ఎందుకో అతనికే అంతుపట్టడంలేదు. కాని ఎందుకో ఏదో చేయాలని మాత్రం చాలా కసిగా ఉందతనికి.

ఎదురుగా టేబుల్‌పై ఆరోజే కొత్తగా సీల్‌తీసి పొద్దట్నుండి తోలుకేస్‌లో పెట్టుకున్న యుఎస్‌ఎ బెరెట్టా సర్వీస్‌ రివాల్వర్‌ ఉంది. తళతళా మెరుస్తూ, నిగనిగలాడ్తూ కొత్త పిస్టల్‌ పొద్దట్నుండీ లాడ్జింగు గదిలో తనకోసం ఎదురుచూస్తున్న కొత్త ఆడదానిలా కవ్విస్తూనే ఉంది.

పిస్టల్‌ను ఎప్పుడు వాడుదామా అని తొందర.. ఎవర్నయినా కాల్చి చంపితే ఎంత బాగుండుననే అజ్ఞాత కాంక్ష.. గులగుల.. ఉవ్విళ్ళూరే హింసోన్మాదం. ముట్టుకోవాలనీ, ముద్దుపెట్టుకోవాలనీ ఏదో తెలియని మోహం..,

ప్రతి మనిషిలోనూ తనకు తెలియకుండానే హింసను బలంగా యిష్టపడే పశుప్రవృత్తి అజ్ఞాతంగా ఉంటుందా.. అందుకే సినిమాల్లో ఫైటింగు దృశ్యాలను ప్రతిమినిషీ ఆనందిస్తాడా..వీధుల్లో ఎవరైనా కొట్లాడుకుంటూంటే అందుకే అందరూ ఆసక్తిగా తిలకిస్తూ ఆనందిస్తారా. చిన్నపిల్లలు అందుకే తూనీగనిస్తే రెక్కలనూ, తోకనూ పీకేసి హింసిస్తారా..బొద్దింకనిస్తే చీపురుపుల్లతో గుచ్చి గుచ్చి అందుకే చంపుతారా. మనిషిలో గుప్తంగా జ్వలించే ఈ హింసాపిపాస ఏమిటి.?

ప్రక్కనే టేబుల్‌పై తనకిష్టమైన ఫ్రెంచి విస్కీ 25 సంవత్సరాల ఏజ్డ్‌ గిన్లేవిట్‌ విస్కీ సీసా ఉంది. అప్పటికే రెండు పెగ్గులు దాటింది.. మూడవ పెగు సగం ముగిసి సోడా, ఐస్‌ ముక్కలు..ఏదో వెలితి..ఏదో ఉద్వేగం..ఏదో,

ఆ ఏదో ఏమిటి.. ఏమిటి కావాలి తనకు.,

యింతకుముందే డైమండ్‌ నెక్లెస్‌ కొనివ్వలేదని ఈ నంబర్‌ త్రీ అలిగి తనతో పడుకోకపోవడం కారణమా..ఆ మంత్రి వెధవ తమ మద్యవ్యాపార, వ్యవహార లావాదేవీల లెక్కలను మాట్లాడుకుందామంటే తమ జిల్లాకు పర్యటనకని వచ్చి గెస్ట్‌హౌజ్‌లో ఉండికూడా తనకు అపాయింట్‌మెంటివ్వకపోవడం కారణమా..పొద్దట్నుండీ ఈ కొత్త పిస్టల్‌ కవ్విస్తూండడం కారణమా..వ్చ్‌..ఏమో

మళ్ళీ కొద్దిగా విస్కీని సిప్‌ చేశాడు విఠల్‌. కసివల్ల కావచ్చు ఇంకా ఇంకా తాగాలనే కోరిక పురులు విప్పుకుంటోంది. రాత్రి ఎనిమిది తర్వాత అపాయింట్‌మెంట్సన్నీ కాన్సిల్‌ చేసుకుని సలుపుతున్న మనసుతో ఈ నంబర్‌ త్రీ యింటికొచ్చాడు. నేరుగా.. గంటన్నరసేపు.. బాగానే గొడవ జరిగింది. అరేబియా గుర్రంలా కవ్వించే ఆడది రంజని.. ఉహు..అస్సలే పడుకోలేదు. మొండికేసింది. ఎంత బతిలాడినా వినలే..తలుపులేసుకుని కనుమరుగైంది. కుంపటిలా కోరిక. ఇదస్సలే పడుకోదు.. అటు ఆ మంత్రిగానిపై కోపం పాదరసం లెవెల్‌ వలె పెరిగి పెరిగి తారాస్థాయికి చేరుతోంది. తామిద్దరికీ చెంది బినామీ పేర్లతో గ్యాస్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంలో ఏడాదిగా నడుస్తున్న రెండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ లెక్క, జిల్లాలో వాడి బామ్మర్దిపేర, తన ఉంపుడుగత్తె రంజని పేర నడుస్తున్న ఏడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హైద్రాబాద్‌లో ఎనభై రెండు కోట్ల ఫ్లై ఓవర్‌ కాంట్రాక్ట్‌, దేవాదుల ప్రాజెక్టుకు మెటల్‌ పైపుల సప్లయ్‌, ఇరవై రెండు కోట్ల సబ్‌ కాంట్రాక్ట్‌, పద్దెనిమిది భూమి పంచాయితీల సెటిల్‌మెంట్లు, మంత్రి ఇన్‌స్ట్రక్షన్‌పై.. ఒక హత్య.. రెండు శాల్తీల గల్లంతు కేసులు.. అన్నీ కలిపి… కోట్లకు కోట్ల లెక్క తేలాల్సి ఉండగా.,

‘లంజాకొడ్కు నక్‌రాల్‌ చేస్తాండు’

మనిషిని అధికారం, నిర్భయం, ధీమా, అహం..ఇవి కళ్ళుండగానే గుడ్డివాణ్ణి చేసి ధైర్యం పేరుతో ఉన్మాదిగా మారుస్తాయి. విఠల్‌లోకి అహం కట్టలు తెంచుకుని ప్రవహించడం మొదలైంది.
అప్రయత్నంగానే విఠల్‌ టేబుల్‌పైన విస్కీ సీసా ప్రక్కనే ఉన్న కొత్త బెరెట్టా పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఒక బ్రహ్మస్తంలా చేతిలోకి ఆయుధం రాగానే ఒట్టి రాగి తీగలోకి విద్యుత్తు ప్రవేశించినట్టయింది. విఠల్‌.. విఠల్‌ ఐపిఎస్‌గా మారి.. ఒక జిల్లాకు ఎస్పీగా సర్వం సహాధికారిననే స్పృహ కలిగి.. ఎదురులేని నియంతకు గల శక్తి తెలిసి..,

ఏదో తెగింపు కట్టలు తెంచుకుంటూండగా.,

సెల్‌ఫోన్‌ను తీసి మినిస్టర్‌కు ఫోన్‌ చేయాలనుకుంటూండగా…, అట్నుండే కాల్‌..”విఠల్‌..రా..యిప్పుడ్రా..గెస్ట్‌హౌజ్‌లో ఉన్న..తెగ తొందరపడిపోతున్నావ్‌గదా..తేల్చుకుందాంరా.. లెక్కలను..”అంటున్నాడు మంత్రి.

వెధవ..మెట్రిక్యులేట్‌ ..నోరుతెరిస్తే..పశువుకు మాటొచ్చినట్టు..ఫైల్‌ చదువరాదు..ఎండార్స్‌మెంట్‌ రాయరాదు.. అధికారులు చెప్పేది విని..మళ్ళీ వాళ్ళకే ఉల్టా చెప్పి..నవ్వులాట..మంత్రి పదవి వెధవలకు ఓ నవ్వులాట థూ నీయమ్మ.. భారత రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ఎంతసేపూ ఎలా అధికారంలో కొనసాగాలా, ఎలా పార్టీఫండ్‌ పేరుతో దండుకోవాలా అని అన్ని రాజకీయపార్టీలు సంకీర్ణ సహకారాల పేరుతో ఒకన్నొకడు బ్లాక్‌మెయిలింగు, సిగ్గువిడిచి బహిరంగంగానే ప్రజాధనం దోపిడి.. పెచ్చుమీరిపోయిన విచ్చలవిడి అవినీతి. ఎవనిపైన ఎవనికీ అదుపులేని అసమర్థ పరిపాలన.. ఎక్కడా కనిపించకుండా శాశ్వతంగా కనుమరుగైపోయిన క్రమశిక్షణ.,

బెరెట్టా పిస్టల్‌పై మోడల్‌ నంబర్‌ ధగధగా మెరుస్తోంది జుఎఔ. 8085 డిస్టింక్టివ్‌ సీరియల్‌ నంబర్‌. 25-03-92 సీరిస్‌ మ్యాగజైన్‌. ధర తొంభై వేలు.. కొన్న కోటిరూపాయల పిస్టల్స్‌ ఖరీదులో నలభైశాతం కిక్‌ బ్యాక్స్‌.

కిక్‌.. బ్యాక్‌.. వెనక్కి తన్ను.. వెనుకనుండి తన్ను.. వెనుక వీపుపై తన్ను.

ఎవని వీపుపై ఎవరు తన్నుట?..ఎవరి వీపుపైనైనా ఎవరైనా తన్నుట.

విఠల్‌ కొత్త పిస్టల్‌ను ప్యాంట్‌ బెల్ట్‌వెనుక, ముడ్డి దగ్గర పదిలంగా గుచ్చుకుని చకచకా నడిచాడు కిందికి.. కిందికి రాగానే తన అక్యురా కార్‌ను స్టార్ట్‌ చేసి మంత్రి బసచేసి ఉన్న గెస్ట్‌హౌజ్‌ దిక్కు పోనిచ్చాడు. ఒక మర్డర్‌కేస్‌లో లిక్కర్‌ కాంట్రాక్టరొకణ్ణి సేవ్‌ చేసినందుకు ఈ అక్యురా కార్‌ను వారంక్రితం తన మూడవ ఆడదాని పేర రిజిస్ట్రేషన్‌ చేసి లంచమిచ్చిన సంగతి ఎందుకో స్ఫురించింది విఠల్‌కు.. తిరుగులేని అధికారాలు తనవి.. ఎదురులేని మగాడు తను.

గెస్ట్‌హౌజ్‌ చేరుకుని, కారును పార్క్‌చేసి సూటిగా మంత్రిగారి ఆంటీరూంలోకి నడిచాడు విఠల్‌ వడివడిగా. అక్కడ విజిటర్స్‌ ఎవరూ లేరు.. అర్ధరాత్రి దాటింది కదా.

ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్‌ మాత్రం కునికిపాట్లు పడ్తూ బెడ్‌రూం దగ్గర నిలబడి నిద్రలో జోగుతూ.. వాని దగ్గరా విస్కీ వాసన గుప్పుమంది.

‘నమ ..స్తే సర్‌” అన్నాడు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌. వాడి పేరేమిటో తెలియదు. డ్రెస్‌లో ఉన్నాడు. బెల్ట్‌కు పిస్టల్‌ ఉంది. కళ్ళు ఎర్రగా..మాట ముద్దముద్దగా ఉంది.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు.

గదిలోకి పోగానే మంత్రిగారి దగ్గర్నుండీ విస్కీవాసనే.

అంతా మత్తులో గమ్మత్తుగా జోగుతూ, తూగుతూ, ఊగుతున్న వేళ.,

ఒకడు భద్రతకోసం నియమించబడ్డవాడు.. మరొకడు ప్రజలందరి భద్రతకు హామీగా నిలబడవలసినవాడు, ఇంకొకడు మంత్రిగా రాజ్యాంగబద్దంగా ప్రజల భద్రతకూ, సంక్షేమానికీ బాధ్యత వహిస్తానని ప్రమాణం చేసినవాడు.. అందరూ విస్కీమత్తులో చిత్తయి ఉన్న వేళ.,

ఐనా తాగుబోతుల డబ్బులతో నడుపబడ్తున్న ఈ దిక్కుమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వాలు నీతి తప్పి, రీతి తప్పి విశృంఖలంగా, నిర్లజ్జగా ప్రవర్తిస్తున్న వర్తమాన సంకక్షుభిత సందర్భంలో..ఈ సన్నివేశం సమకాలీన భారత సమాజాన్ని ప్రతిబింబిస్తోందా..అనుకున్నాడు విఠల్‌.

ఎందుకో.. ఎదురుగా విశాలమైన డబుల్‌ కాట్‌ మంచంమీద విలాసంగా ఒరిగిఉన్న మంత్రి తలపై ఉన్న వాచ్‌దిక్కు దృష్టిపోయింది విఠల్‌కు. టైం ఒంటిగంట పది నిముషాలు.

”ఊఁ.. ఏందయ్యా.. తెగ గోల చేస్తున్నావ్‌ లెక్కలూ లెక్కలో అని..”

”…..” విఠల్‌ ఎదురుగా సోఫాలో కూర్చుని ఒట్టిగా, నిర్లిప్తంగా మంత్రివైపు చూశాడు.

”చెప్పు.. ఏం చేద్దాం..”

”ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ పనులకోసం ఫ్లై ఓవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కోసం.. నేనొక్కణ్ణే నా తరపున నూటా పదికోట్ల పెట్టుబడి పెట్టిన. మీరు వాటి సంగతే మాట్లాడ్డంలేదు. మీ బార్లు, సెటిల్‌మెంట్లు, భూముల లావాదేవీలు.. వీటన్నింటి కింద నాకు దాదాపు నా లెక్క ప్రకారం నలభై కోట్లు రావాలి. మొన్న మీ కీప్‌ రంజనికి సెటిల్‌మెంట్‌ కింద పద్దెనిమిదెకరాల భూమిని ఫ్రీగా ఇప్పించిన కేస్‌లో ఒక మర్డర్‌ కూడా చేయించవలసి వచ్చింది..”

”ఓకే.. ఓకే..ఐతే.. ఇప్పుడేంది”

” నాకు క్యాష్‌ కావాలి”
”ఎంత…”
”రెండు వందల కోట్లు”
”ఊఁ..”
”అక్కెరుంది నాకు”
”ఇప్పుడు లేవు..”
”అట్లంటెట్ల”

”ఇవ్వాళ ఉదయం చూచినౌగద..ముఖ్యమంత్రికే ఎసరుపెట్టిన..జంగు షురువైంది..పరేషాన్లున్న. అధిష్టానం నుంచి వార్నిగచ్చింది..మనుషుల్ని కొనాలె..”
”అందుకే చెబ్తున్న.. సెటిల్‌మెంట్‌ చేయమని”

”అరే.. రేపు కాబోయే ముఖ్యమంత్రిని నేనే..పొద్దుగాల్నుంచి మీడియా అంత చూచినౌకద. కోడై కూస్తాంది లోకం..”
”అని నువ్వనుకుంటానౌ. హై కమాండ్‌కు ఎదురు తిరిగినవని ఉన్న మంత్రి పదవి పోద్దని నా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ చెప్తానై..”
”అట్లనా..ఓరి కుక్కలకొడ్కా..నమక్‌ హరాం..శుభం పల్కురా పెండ్లికొడ్కా అంటే గిట్ల మాట్లాడ్తానౌర..అరేయ్‌..”
”మాటలు మంచిగా రానియ్‌..”
”ఏందిర నీతో మంచిగా మాట్లాడేది.. ఆఫ్టరాల్‌ ఒక ఎస్పీగానివి.. వెంట్రుక ముక్క లెక్క పీకేస్తే బంగాళాఖాతంల కొట్కపోవాలె నాకొడ్కా..”
”హోల్డ్‌ యువర్‌ టంగు మిస్టర్‌ మినిస్టర్‌” విఠల్‌కు తెలుసు ఎక్కడా తమ సంభాషణ రికార్డ్‌ కావడంలేదని.
”ఏందిరా హోల్డ్‌..బొచ్చు..ఇప్పుడు నాదగ్గర పైసల్లేవు.. పో.. పీకుతవా..”
”మీరు హద్దులు మీరి మీట్లాడ్తున్నారు. ప్లీజ్‌”

మంత్రి బోనులోపెట్టి కొట్టిన పులిలా మహోగ్రంగా ఉన్నాడు. అతను అంతకు ముందే ఒక రహస్య స్థావరంలో తను ప్రత్యేకంగా యిష్టపడి తెప్పించుకున్న ఓ పల్లెటూరి ఇరవై ఏళ్ళ యువతితో కుతిదీరా రమించి, అలసి.. తృప్తిగా పీకలదాకా తాగి, యిష్టమైన చికెన్‌ కబాబ్‌ తిని.. ఉదయం మీడియాతో రాజకీయంగా, ఎత్తుకు ఎత్తి కుదిపిన కుదుపుల చక్కిలగిలికి పొంగి.. అంతా మత్తు.. ఆనందం.. వెర్రి సంతోషం.. పరవశోన్మాదం..

తెరవెనుక మాస్టర్‌మైండ్‌ లీల ఆశీర్వాదం.,
”అరే ఎస్పీ.. ఏందిరా నీల్గుతానౌ”
”మాటలు.. మాటలు..”
”మాటలేందిరా..అట్లనే అంట..ఒక్క పెన్‌ స్ట్రోక్‌తో శంకరగిరిమాన్యాల్‌బడ్తవ్‌ బిడ్డా”

”అరే..దొంగవెధవా. నీ దిక్కుమాలిన చిట్టా విప్పిన్నంటే అదిరిపడి గుండెపగిలి చస్తవ్‌..జనం రేపు నీ నోట్లె ఊంచుతరు.. పొలిటికల్‌ బాస్టర్డ్‌.. నువ్వేందిరా నాయి పీకేది. ఇయ్యాల పవర్లుంటవ్‌ రేపు పోతవ్‌.. నీలాంటి బాస్టర్డ్స్‌ ఎందరు మారినా శాశ్వతంగా కుర్చీలల్ల ఉండి ఈ ప్రభుత్వాలను నడిపేది మేమేకాదురా గూట్లే.. షటప్‌”
”నన్నే షటప్‌ అంటవా..”
”ఔ అంట..మళ్ళీ మళ్ళీ వందసార్లంటు..నా పైసల్‌ పారేయ్‌బే”
”బే..”అవాక్కయిన స్తబ్దత.
”ఔ.. బేనే.. డబ్బుసంగతి చెప్పు ముందు. రెండు వందల కోట్లు”
”లెవ్‌.. ఏంజేస్తవ్‌”
”ఏంజేస్తనా..” ఆఁ.. ఏంజేస్తవ్‌రా”

”విఠల్‌ పిచ్చికుక్కయి పోయాడు. తలలో విజృంభిస్తున్న విస్కీ విస్ఫోటనం విచక్షణను చంపేసింది. ప్రక్కనున్న టీపాయ్‌మీది గాజుఫ్లవర్‌ వేజ్‌ను తీసి నేలకేసి కొట్టాడు బలంగా. అది భళ్ళున శబ్దంచేసి పగిలి ముక్కలుముక్కలైంది.

వెంటనే బయట నిద్రలో జోగుతున్న గన్‌మెన్‌ లోపలికి పరుగెత్తుకొచ్చి.. అప్రయత్నంగానే సర్వీస్‌ రివాల్వర్‌ను బయటికి తీసి.. ఎస్పీ విఠల్‌ దిక్కు, మంత్రి దిక్కు బిక్కుబిక్కున షాకై చూస్తూండగానే,

తృటికాలంలో.. విఠల్‌ మెదడులో తను ఆ రోజే సీల్‌ తీసిన తన బెరెట్టా పిస్టల్‌ జ్ఞాపకమొచ్చి.. తళ్ళుక్కున ఓ మెరుపు మెరిసినట్టయి.. హింసావాంఛ సముద్రంలా పొంగి, క్షణంలో వేయితలల సర్పమై పడగ విప్పి.. జస్ట్‌ ఫర్‌ ఫన్‌.

‘ఈ మంత్రిగాన్నిప్పుడు చంపితే ఎలా ఉంటుంది..చంపితే ఏమౌతుంది. మజాగా ఉంటుందికదా’ అని అనిపించి,

విఠల్‌ లిప్తకాలంలో తన నవనవలాడే కొత్త బెరెట్టా పిస్టల్‌తో గన్‌మెన్‌ను కాల్చాడు. క్షణంలో వేయవవంతుకాలంలో కొత్త తూటా కానిస్టేబుల్‌ గుండెలో దిగబడి, ఫౌంటెన్‌లా రక్తం చింది..చావుకేక గెస్ట్‌హౌజ్‌  దద్దరిల్లేలా విస్ఫోటించి.. మరుక్షణమే నేలపైకి కూలిపోతున్న గన్‌మెన్‌ చేతిలోని రివాల్వర్‌ను నేలపై పడకుండా అందుకుని..మరుక్షణమే దాన్ని మంత్రిపైకి గురిచూచి.. ట్రిగ్గర్‌ను నొక్కి.,

బుల్లెట్‌ మెరుపులా దూసుకుపోయి..మంత్రి తలను వందముక్కలు చేసి..అరిచే సమయంకూడా లేక ”తప్‌” మని  మంత్రి శరీరం మంచంపైనుండి కిందపడి..అంతా రక్తం..ఎర్రగా..జయ్‌ఁమని చిమ్ముతూ విస్తరిస్తూ.,
‘అసలేం జరిగింది.’

వ్చ్‌.. ఏమో చుట్టూ ప్రపంచం గిరగిరా..కసిగా..పిచ్చిపిచ్చిగా..ఆనందంగా.

విఠల్‌ చేతిలో రివాల్వర్‌తో నిలబడి..పడగెత్తిన విస్కీమత్తు శరీరం నిండా గర్జిస్తుండగా ఏదో ఒక కుదుపు..షాక్‌.

ఐతే విఠల్‌ పోలీస్‌ బుర్ర మెరుపులా మెరిసింది. వెంటనే గన్‌మెన్‌ పిస్టల్‌పైనపడ్డ తన వేలిముద్రలను చకచకా దస్తీతో తుడిచి, మళ్ళీ భద్రంగా వాడి శవం చేతిలో ఉంచి..
పేరు తెలియని గన్‌మన్‌ శవం దిక్కూ,  క్షణం క్రితం తనను ఏం పీక్కుంటౌరా’ అని హూంకరించి మరుక్షణమే దిక్కులేని కుక్క చావుచచ్చి కింద నేలకు కరుచుకుని పడున్న మంత్రి మృతశరీరం దిక్కూ, గిర్రున తిరుగుతున్న బుర్రతో, కళ్ళతో చూచి.. దీర్ఘంగా, గంభీరంగా శ్వాస ఎగపీల్చుకుని, నిట్టూర్చి.,

‘ఇట్స్‌ ఓ.కే..’ అనుకుని,

తూగుతూ ఒక్కో అడుగువేసుకుంటూ గదినుండి బయటికొచ్చి..’ఇప్పుడెలా’ అనుకుంటూ,

పోలీస్‌ మెదడు దీర్ఘకాల శిక్షణలవల్ల అతిసహజంగానే నేరపూరితమై ఎప్పుడూ పాదరసంలా సంచలితంగా ఉంటుంది.
బయటికి.. వరండాలోకి వచ్చి నిలబడ్డ విఠల్‌..అప్పట్నుండీ ఉరుముతున్న ఆకాశం విషయం గమనించనేలేదు. ఉన్నట్టుండి కుండపోతగా వర్షం మొదలై గాలివానతో మెరుపులు ముసురుకుంటూండగా.ఉలిక్కిపడ్డట్టయి..,
చకచకా ఓ కథ రూపుదిద్దుకుంటోంది విఠల్‌ పోలీస్‌ మెదడులో,

ఉదయం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంత్రిగారు నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన తర్వాత..అనేకమంది ముఖ్యమంత్రి అభిమానులనుండి, శిబిరాలనుండి మంత్రిగారికి పుంఖానుపుంఖాల బెదిరింపు కాల్స్‌ వచ్చాయి పొద్దంతా. అందుకు ఆయనెంతో ఆవేదనచెంది భయపడ్డారు. ప్రాణభయంకూడా ఉందని చర్చిండానికి అసాధారణ వేళే ఐనా అర్ధరాత్రి ఏకాంతంగా మాట్లాడ్డానికి ఎస్పీగా తనను రమ్మని కబురుచేస్తే తను వచ్చాడు. సీరియస్‌గా మాట్లాడ్తున్న మంత్రి తన సహజధోరణిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తూ ముచ్చటిస్తున్న సందర్భంలో.. తాము అప్పటినుండీ గమనించని ముఖ్యమంత్రి వీరాభిమానియైన గన్‌మెన్‌ అనూహ్యంగా తన రివాల్వర్‌ను తీసి మంత్రిగారికి గురిపెట్టి బండబూతులు తిట్టడం మొదలెట్టాడు. అవాక్కయిన తను గన్‌మెన్‌ను వారించి సర్దిచెప్పే ప్రయత్నం చేసే లోపలే.. బాగా తాగిన మత్తులో ఉన్న గన్‌మన్‌ టకటకా పిస్టల్‌ను మంత్రిగారిపైకి కాల్చాడు. వెన్వెంటనే కుప్పకూలిన మంత్రి.. పెనుగులాటలో ఆత్మరక్షణార్థం, మంత్రిని రక్షించే ప్రయత్నంలో భాగంగా తను అనివార్యమై గన్‌మన్‌ కాల్చడం.. అంతా క్షణాల్లో జరిగి.,

మంత్రిగారి మరణం.. వెన్వెంటనే గన్‌మన్‌ మరణం కూడా,     కావలిస్తే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మంత్రీ, గన్‌మన్‌ ఇద్దరూ తాగినట్టు ఎలాగూ రిపోర్ట్‌ వస్తుంది. మంత్రి శరీరంలో కానిస్టేబుల్‌ బుల్లెట్‌, కానిస్టేబుల్‌ శరీరంలో తన రివాల్వర్‌ బుల్లెట్‌ ‘ఈ కథ బాగుంది. సరిగ్గా అతికింది’ అనుకున్నాడు విఠల్‌.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు. అనుకున్నాడు విఠల్‌. శవాలూ ఉన్న బెడ్‌రూంలోకి వెళ్ళి, చేతికి దస్తీ చుట్టుకుని ప్రక్క వార్ట్‌రోబ్‌లో ఉన్నమంత్రిగారి బ్రీఫ్‌కేస్‌ను తెరిచాడు. ఆశ్చర్యం..నిండా బంగారు బిస్కెట్‌ బిళ్ళలు. మరుక్షణమే బ్రీఫ్‌కేస్‌ను మూసి.. టకటకా బయటికొచ్చి..వర్షంలో తన కారు డిక్కీ తెరిచి … క్రింద టూల్‌ బాక్స్‌దగ్గర బ్రీఫ్‌కేస్‌ను భద్రంగా సర్ది..ప్రశాంతంగానే డిక్కీని లాక్‌ చేసి..మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ వరండాలోకి వచ్చి నిలబడి..దీర్ఘంగా ఊపిరిపీల్చుకుని నిట్టూర్చి,
లోపల విస్కీ మత్తు విచ్చుకుపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది విఠల్‌కు.

ఆ క్షణం అతని మెదడులో..మంత్రి మరణంవల్ల తమ మధ్య లావాదేవీల్లో ఎంత నష్టమొస్తుంది..ఈ బంగారు బిస్కెట్ల విలువెంతుంటుంది.. మిగతాది ఎలా రాబట్టాలి..వంటి ఆలోచనలు చినుకుల్లా కురుస్తూండగా..,

ఈ గన్‌మన్‌ మరణం ఏమిటి..ఎందుకు..జస్ట్‌ఫర్‌ ఫన్‌ కదా..తన కొత్త పిస్టల్‌ను ఉపయోగించి పైశాచికంగా ఆనందించాలనే అంతర్గత రాక్షసవాంఛేనా,
ఐనా.. బూటు కింద ఒక చీమ ఎందుకు పడిచస్తుంది..పండిన టమాటాపై బూటుకాలు పడి చితికితే..వాటి
వెనుక హేతువేమిటి..అందుకు కారణమేమిటి..వంటి ఆలోచనలు..మీమాసం ఎందుకు..అనవసర పిచ్చిగానీ,
వ్చ్‌.. అంతా ట్రాష్‌.
విఠల్‌ చకచకా తన సెల్‌ఫోన్‌ను డయల్‌చేసి డిఎస్పీ ప్రకాశ్‌ను తన మందీ మార్బలంతో గెస్ట్‌హౌజ్‌కు రమ్మని  ఆదేశిస్తూ..,
అప్పుడు..ఆక్షణం..అంతా ప్రశాంతంగా..గంభీరంగానే ఉంది.

( సశేషం)

ఎక్కడి నుండి ఎక్కడి దాకా…? -మొదటి భాగం

rama intro

ముప్పది ఐదు సంవత్సరాల పరిపూర్ణ స్త్రీ లీల ఒంటిపైనున్న మెత్తని ఉన్ని శాలువను సున్నితంగా సవరించుకుంది. విమానం నిండా గంభీర నిశ్శబ్దం..మేఘాలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న గర్జనవంటి మౌనధ్వని..గాత్రం ప్రవాహంలా సాగుతూంటే ఒక అంతర్లీనంగా వినిపించే ప్రాణప్రదమైన శృతివలె.

                ఫస్ట్‌క్లాస్‌ కేబిన్‌లో..అతి సౌకర్యవంతంగా..ఏర్‌హోస్టెస్‌ల కన్నుసన్నలలో..ముప్పదిఆరువేల ఫీట్ల ఎత్తులో, గంటకు తొమ్మిదివందల కిలోమీటర్ల వేగంతో..,

                అతివేగం..అతి అతిక్రమణ..అతి దూసుకుపోవడం..ఇవన్నీ ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిశ్చలంగా,ఎంత గంభీరంగా ఎంత ఉత్సుకతతో నిండి ఉంటాయో…తన జీవితంలోవలె.

                ఎదురుగా ఇరవైమూడు అంగుళాల ఎల్‌సీడీ కంప్యూటర్‌ కం టి.వి. తెరపై ‘దోహా’ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువకాబోతున్న తమ విమానం ఏరియల్‌ వ్యూ కనబడ్తోంది..నాలుగ్గంటల క్రితం హైద్రాబాద్‌ ఏర్‌పోర్ట్‌లో ఐదు గంటలకు విమానంలోకి ఎక్కిన తర్వాత..బాంబే మీదుగా అరేబియా సముద్రం..సముద్రంపై వందల కిలోమీటర్ల ప్రయాణం..

                మనిషి ఒదిగి ఒదిగి, వంగి వంగి, నంగి నంగి తలవంచుకుని నిలబడి ఉన్నంతసేపు ఈ ప్రపంచం నీపై స్వారీ చేస్తూనే ఉంటుంది. నీపై ఉక్కుపాదాన్ని మోపి తాడనం చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి తల విదిలించి, నిక్కి నిలబడి ప్రశ్నించడం, ఎదురుతిరగడం, ఎదురొడ్డి నిలబడడం, బిగించిన పిడికిలితో సమాజంపై స్వారీ చేయడం మొదలెట్టిన తర్వాత..ప్రపంచం చిన్న బొచ్చు కుక్కపిల్లలా మనిషికి స్వాధీనమైపోవడం, లొంగిపోవడం, వెంట అతి వినమ్రంగా నడిచివస్తూండడం.. ఇదంతా తెలుస్తూంటుంది విజ్ఞులకు.

ప్రపంచం నువ్వు జవాబు చెప్తున్నంతసేపు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఒక్కసారి నువ్వే ప్రశ్నించడం ప్రారంభిస్తే అది ఖంగుతిని తనే జవాబుదారీగా మారి జవాబులు చెబుతూనే ఉంటుంది. స్వారీ సమర్థవంతంగా చేస్తే గుర్రం నీకు లొంగిస్వాధీనమౌతుంది. అసమర్థంగా ఉంటే కింద నేలపై పడేసి పెక్కపెక్క తన్ని తరిమేస్తుంది.

అందుకే సమర్థుడైన నిర్వాహకుడు ఎప్పుడూ పగ్గాలను తన దగ్గర, తన అధీనంలో ఉంచుకుంటాడు.  ఎవరో చెబితే తను వినడం వేరు.. తను చెబుతూంటే ప్రపంచం వినయంగా విని విధేయంగా ఉండడం వేరు,

ఎందుకో లీల హృదయం వర్షించబోయేముందు, ఉరిమే ముందు ఆకాశంలా గంభీరంగా, ఆవేశంగా, ఉద్విగ్నంగా ఉంది.

ఒంటరితనం..మనిషిని వెంటాడ్తుంది.. గతాన్ని తవ్వి తవ్వి గాలివానలా ధ్వంసించి ధ్వంసించి, చిలికి చిలికి.. ఒక్కొక్కప్పుడు పుండును కాకిలా పొడిచి పొడిచి రక్తసిక్తం చేసినట్టు ..నొప్పి..హృదయంలో నొప్పి..అంతరాంతరాల్లో గుప్తమై రగిలే నొప్పి..బాధ..కసి..క్షోభ.. కన్నీళ్ళు..అపజయాలు..ఆకలి..దిక్కులేనితనం, నిస్సహాయత…అవమానాలు..తలవంచుకుని రాత్రులు రాత్రులు ఏడ్వడాలు..,

కాలేజిలో.. గణితం సబ్జెక్టులో ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ తనే..కాలుక్యులస్‌..సంకలీకరణ..ఇంటిగ్రేషన్‌..రెండు అవధులు.. లోయర్‌ లిమిట్‌.. అప్పర్‌ లిమిట్‌..జీరోనుండి ఇన్‌ఫినిటీ..విస్తరణ. శూన్యంనుండి ప్రారంభమై విస్తరిస్తూ విస్తరిస్తూ..ఎదిగి ఎదిగి..వ్యాపించి వ్యాపించి..అనంతానంతాల పర్యంతం ఒక క్షేత్రమై.,

విస్తరణ..విస్తరణ.,

జీవితాన్ని ఎవరికి వారు నిర్మించుకుంటూ, కూలిపోతూ, ఓడిపోతూ, పాఠాలను నేర్చుకుంటూ మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించుకుంటూ..జీవించడమంటే నిజానికి ఒక అంతులేని నిరంతర నిర్మాణక్రియను కొనసాగించడమే కదా.

నిజానికి..జీవితాన్ని నిర్మించుకోవడం..తన దృష్టిలో ఒక ఇసుకగూడును కట్టడం వంటిది..కాలు తీయగానే కూలిపోవడం..మళ్ళీ సరిగ్గా మెత్తి, మరమ్మత్తులు చేసుకుని..ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక భౌతిక ఉనికిని..ఒక స్వప్నాన్ని ఆకృతీకరించడం..గూడు అందంగా కట్టడం ఒక అధ్యాయమైతే దాన్ని అలా కొనసాగించడం, కాపాడుకోవడం, రక్షించుకోవడం..ఆ క్రమంలో గూడును ఆనందించడం మరో అధ్యాయం. నిజానికి ఈ రెండవ అధ్యాయమే కీలకమైంది.. ప్రధానమైందికూడా.

అరేబియా సముద్రంపై విమానం ఎగురుతున్నపుడు..తన హృదయం ఎంత ఉద్విగ్నమైపోయిందో.

సముద్రం లోతైందా..మనిషి హృదయం లోతైందా..సముద్రం విశాలమైందా. మనిషి హృదయం విశాలమైందా..అనంతమైన అలజడితో, కల్లోలంతో నిత్యం ప్రళయగర్భయై భాసిల్లే మహాసముద్రం నిజానికి నిత్యపోరాటంతో జీవించే నిజమైన మనిషితో పోల్చినపుడు..ఒక సమాంతర ప్రతీకగా,

మనిషి..సముద్రం – సముద్రం..మనిషి.

ఎర్నెస్ట్‌ హెమింగ్వే నవలతో రూపొందిన సాహసోపేతమైన ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ది సీ’ సినిమా జ్ఞాపకమొచ్చింది లీలకు.

పోరాటం.. పోరాటం.. నిరంతరం ఎడతెగని పోరాటం..అంతులేని పోరాటం. బ్రతకడానికి.. ఆకలి తీర్చుకోడానికి.. డబ్బు సంపాదించడానికి .. అధికారంకోసం.. పేరు ప్రతిష్టలకోసం.. శాశ్వతమైన తన అహంతో నిండిన ఆత్మతృప్తి కోసం.. పోరాటం.. కుట్రలు..కుతంత్రాలు.. పెనుగులాటలు.. వ్యూహాలు.. పాచికలు.. మందుపాతరలు..పెదవులపై చిరునవ్వులు.. మోసపూరిత పథకాలు.. ఎన్నో,     విమానం మెల్లగా ఆగడం..కాబిన్‌ లగేజ్‌నుండి అటెండెంట్‌ చేతికందివ్వగా తన అతి ఖరీదైన సామ్‌సొనైట్‌ బ్యాగ్‌ను తీసుకుని లేచి.. ఒకడుగు వేయబోతూండగా..హోస్టెస్‌ మిస్‌ హాస్టలర్‌ వినమ్రంగా తల పంకించి.. అంతా మౌనమే..కాని చిరునవ్వులు చిందే పెదవులు..పలకరించే కళ్ళు..ముకుళించే ముఖాలు..వ్యాపారమే ఐనా పరిమళించే మానవ సౌరభాలు..,

 

లీల ప్రీమియం ఎంట్రీలోకి ప్రవేశిస్తూ, తన బ్లాక్‌బెర్రీ సెల్‌ఫోన్‌ను స్విఛాన్‌చేసి ‘మెమో’ షీట్‌ తెరిచింది.

15 మే అపాయింట్‌మెంట్స్‌.

స్టే ఎట్‌ గ్రాండ్‌ రీజన్సీ ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌ రూం. నంబర్‌ 206. మహమ్మద్‌ రఫీక్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తాడు.

మూడు అపాయింట్‌మెంట్స్‌. భారత జాయింట్‌ సెక్రటరీ టు డిపార్ట్‌మెంటాఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ అండ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, రాంసక్సేనా, మినిస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, గవర్నమెంటాఫ్‌ అస్సాం అరుణ్‌ ఉజ్లేకర్‌, నీరజారావ్‌ కౌన్సిల్‌ ఎట్‌ ఫ్రాన్స్‌..మొత్తం రెండు గంటల నలభై నిముషాలు ఇంటరాక్షన్‌. నాల్గువందల ముప్పయి రెండు కోట్ల రూపాయల డీల్‌. తర్వాత దోహా స్థానిక ఇండస్ట్రియలిస్ట్‌ మహమ్మద్‌ బిన్‌ ఉసామాతో డిన్నర్‌..నాలుగు గంటలు నిద్ర..ఉదయం ఆరుగంటల పది నిముషాలకు ఎమిరేట్స్‌ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

ఎందుకో ఒకసారి తనవైపు తనే చూచుకుంది లీల..ఏర్‌కండిషన్డ్‌ బస్‌ దిగుతూ మక్‌మల్‌ మడతల మధ్య ధవళవర్ణంలో ధగధగా మెరుస్తున్న మంచిముత్యంలా ఉంది తను.

ప్రపంచాన్ని మొట్టమొదట ఆకట్టుకునేది మనిషి బాహ్యరూపు..అందం..ఆకర్షణ. ఆ తర్వాత ఆ మనిషి వ్యక్తీకరణ, ప్రతిభ, తెలివితేటలు..ఆ తర్వాత ఆర్థిక, అధికారిక, వ్యాపారాత్మక లావాదేవీలు – ఇవన్నీ ఎంతో స్పష్టంగా తెలుసు లీలకు.

లీలకు మనుషుల మూలతత్వాల గురించి చాలా విపులమైన లోతైన అవగాహన ఉంది. ఆమె ఎదుటి వ్యక్తులతో చాలా తక్కువగా, అవసరమైనపుడు మాత్రమే మాట్లాడ్తుంది. ఎక్కువగా చూపులతో అధ్యయనం చేసి మొదట ఎదుటి మనిషిలోని బలహీనతలను కనిపెడ్తుంది. ప్రతి మనిషికీ ఏదో ఒక బలహీనత ఉంటుందని బలంగా నమ్ముతుందామె. అది డబ్బు కావచ్చు, కాంతా కనకాలు కావచ్చు, అధికార వ్యామోహం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు..ఏదో ఒకటి. ఏదో ఒక వ్యామోహం ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ బలహీనతను గ్రహించి సరిగ్గా అక్కడ దెబ్బకొట్టగలిగితే వాడే విజయుడు.

భారతదేశంలో ఎంత పెద్దమనిషైనా తప్పకుండా ఏదో ఒక ప్రలోభానికి లొంగుతాడు. ఎంత ఉన్నతస్థానంలో ఉన్నవాడైనా తప్పకుండా ఏదో ఒకదానికి అమ్ముడుపోతాడు. దాసోహమై తనను తాను కోల్పోతాడు. నిశ్శబ్దంగానే మనుషులను, వాళ్ళ దిక్కుమాలిన వ్యామోహ వివశతలను పసిగట్టి చెస్‌ ఆటలో పావులను కదిపినట్టు ఒక్కో వ్యూహాత్మక కదలికతో జయిస్తూ వస్తున్న తను గత థాబ్దకాలంపైగా సాధించిన విజయాలు తనకు ఒక నిషానూ, మత్తునూ కలిగించే అనుభవాలుగా మిగిలిపోయాయి. ఇంత పెద్ద మనుషులు ఇంత సుళువుగా చిత్తయిపోతారా అని ఆశ్చర్యంతో తాను బిత్తరబోయిన సందర్భాలెన్నో.,

ఐతే..చాలా సమయాల్లో అవసరానికి మించి అతిగా మాట్లాడ్డం అనే అతిపెద్ద బలహీనతని లీల ఎంతో ప్రధాన విషయంగా గమనించింది. నిజానికి ఒక ఎగ్జిక్యూటివ్‌ యొక్క వ్యూహాత్మక మౌనం ఎదుటి మనిషిలో ‘భయం’ కల్గిస్తుంది.

first week fig-1

‘ఎగ్జిట్‌’ దగ్గరికి రాగానే తనూహించినట్టుగానే రఫీక్‌ వడివడిగా ఎదురొచ్చి ఒక అందమైన, విలువైన పూలబొకే అందించి, ఆమె చేతుల్లోని బ్యాగ్‌ను అతి వినయంగా అందుకున్నాడు.

”వెల్కం మేడం” అన్నాడు ముద్దముద్దగా.

ఆమె మాట్లాడలేదు. ఒక చిర్నవ్వు చిలకరించి మౌనంగా, గంభీరంగా అతని వెంట నడిచింది. అలా నడుస్తున్నపుడు విరజిమ్ముతున్న విద్యుత్‌కాంతుల నడుమ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో ఆసక్తిగా అవాక్కయి తనను గమనిస్తున్నట్టు ఆమె గమనించింది.

రఫీక్‌ డోర్‌ తెరుస్తూండగా బయట సిద్ధంగా ఉన్న బిఎండబ్ల్యు కారు వెనుక సీట్లోకి చేరిందే తడవ..కారు మెత్తగా.. సర్రున నల్లని త్రాచుపాములా కదిలింది.

వేగం.. గాజుపలకపై ఇనుప గోళీలా..దూసుకుపోయే వేగం.,

తన ప్రతి క్యాంప్‌ ఏర్పాట్లను తన అత్యంత అంతరంగిక కార్యదర్శి నిర్మల స్వయంగా పర్యవేక్షిస్తుంది..మినట్‌ టు మినట్‌ కదలికలు, ప్రాంతాలు, వ్యక్తులు, వ్యవహారాలు, రక్షణ, బాధ్యతల అప్పగింతలు..అన్నింటినీ మించి ఫాలోఅప్‌, మానిటరింగ్‌.. వీటి విషయంలో నిర్మల నిజంగా సుపర్బ్‌.

‘యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌…’ఇంగ్లీష్‌లో ప్రకటన..ఎన్ని వందలసార్లు విన్నదో తను విమానాల్లో పయనిస్తూ..ఇక విమానం భూమిపైకి దిగబోతోంది. సీట్‌ బెల్ట్స్‌ పెట్టుకోండి, సీట్లను నిటారుగా ఉంచుకోండి. సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ మోడ్‌లోనే ఉంచండి..వంటి అంశాలు..చివరికి పైలట్‌ ‘దయతో ప్రయాణంలో సహకరించినందుకు మీకందరికీ ధన్యవాదాలు..’అని ఓ సాంప్రదాయ వినమ్ర నివేదన.

ర్ర్‌ర్‌ర్‌మని ..విమానం టైర్లు నేలను తాకిన మ్రోతతో కూడిన భీకర ధ్వని.. కుదుపు. విడిచిన బాణంవలె దూసుకుపోతున్న గాలిధ్వని..ఒక పెద్ద సంరంభం.

ప్రక్కనున్న కిటికీలోనుండి చూచింది లీల. దోహా నగరం విద్యుత్‌కాంతులతో మిలమిలా మెరిసిపోతోంది. కతార్‌ ఎయిర్‌వేస్‌ ప్రధాన స్థావరం. అరబ్‌ దేశాల గుండెలా ఎదుగుతున్న అంతర్జాతీయ విమానయాన క్షేత్రం. ఇస్లాం సాంప్రదాయాలను పాటిస్తూనే వడివడిగా అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్న అత్యాధునిక విమానయాన సంస్థ కతార్‌.

తన ఆల్‌ గోల్డ్‌ వాచ్‌ చూచుకుంది లీల.

ఎనిమిది గంటల పన్నెండు నిముషాలు..’ఇప్పుడు నిర్మల తనతో మాట్లా..’అని మనసులో అనుకుంటూండగానే ఆమె సెల్‌ఫోన్‌ మోగింది.

”గుడీవినింగ్‌ మేడం..మీ కారు దోహా మాల్‌ దాటి అల్‌ ఖలీషా రోడ్‌లోకి ప్రవేశిస్తోందా..”

”ఎస్‌ నిర్మలా..”

”ఇంకో పన్నెండు నిముషాల్లో మీరు హోటల్‌ గ్రాండ్‌ రీజన్సీలో ఉంటారు. ఫ్రెషప్‌ కాగానే..సరిగ్గా తొమ్మిది గంటలకు రాంసక్సేనా ఐఎఎస్‌ మీ గదికొస్తాడు. అతను ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ‘పరిశ్రమలు – పర్యావరణ కాలుష్యం..నివారణ’ అంశంపై మాట్లాడ్డానికి రెండ్రోజుల క్రితమే ఫ్రాన్స్‌లో ఉన్నాడు. మీతో మాట్లాడి ఆ ఎనభైకోట్ల రూపాయల ఎబిటు జీరోఫైవ్‌ బాపతు డీల్‌ను ఫైనల్‌ చేస్తాడు. అందుగ్గాను మనం అతనికి ఆరుకోట్ల క్యాష్‌ను స్విస్‌ బ్యాంక్‌ హిడెన్‌ కాతాకు బదిలీ చేస్తాం.. మేడం ఒకసారి మీ లాప్‌టాప్‌లో రెండు నిముషాల క్రితం నేను మీ జడ్‌ మెయిల్‌కు పంపిన ఫోల్డర్‌లో చూడండొకసారి. ఓవర్‌ వ్యూ వస్తుంది.. సి యు మేం..”గడగడా, స్పష్టంగా, పొల్లుపోకుండా చెప్పుకుపోయింది నిర్మల.

ఎందుకో లీల చిన్నగా నవ్వుకుని..లాప్‌టాప్‌ను తెరిచింది. ప్రపంచంలోనే అతి సన్నని లెనోవా 0.9 ఇంచ్‌ కంప్యూటర్‌ అది. చకచకా రిడిఫ్‌ మెయిల్‌ తెరిచి తన రహస్య పన్నెండవ ఇ మెయిల్‌ క్లిక్‌ చేసింది. నిముషమున్నర క్రితం వచ్చిన నిర్మల మెయిలది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాం ఇన్ఫోటెక్‌ అనే సంస్థ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ వ్యాల్యూ ప్రైస్‌వాటర్‌ కూపర్‌ మదింపుద్వారా నాల్గువేల కోట్లుగా నిర్దారించబడింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెజ్‌ల ఏర్పాటుక్రింద భారత ప్రభుత్వానికి భూమి కేటాయింపు గురించి ధరఖాస్తు పెట్టుకుంది. నూటా యాభై ఎకరాలను కనీస నామమాత్రపు ధర క్రింద రాం ఇన్ఫోటెక్‌కు కేటాయిస్తే నాల్గు సంవత్సరాలలో స్థలాన్ని అభివృద్ధిపర్చి, పరిశ్రమను స్థాపించి, మూడు వేలమందికి ఉపాధి..,

..ఇలా ఉంది ఫైల్‌-

‘అంతా ట్రాష్‌.. చెత్త…’అనుకుని వాస్తవస్థితిని ఉజ్జాయింపుగా అంచనా వేసింది లీల. నూటా యాభై ఎకరాలను ఎకరానికి యాభైవేల చొప్పున కొనుక్కుని ఏడున్నరకోట్ల పెట్టుబడితో నాల్గుసంవత్సరాల తర్వాత మూడువందల కోట్ల ఆస్తిగా మార్చుకోవాలని దుష్టమైన ప్రణాళిక. అందులో ముఖ్యమంత్రి బామ్మర్ధి కొడుకు పేరుమీద ఇరవైకోట్ల నగదు లంచం, భారీ పరిశ్రమల మంత్రి ఉంపుడుగత్తెకు పదికోట్లు.. మిగతా తతంగమంతా ప్రవీణ్‌రెడ్డి చూచుకోవాలి. ఆ పరంపరలో క్లియరెన్స్‌కోసం ఒక క్లెయింట్‌గా తమను ఆశ్రయించాడు ప్రవీణ్‌రెడ్డి. ‘లీలకు కేస్‌ అప్పజెప్పి కూచుంటే అంతా నిశ్చింత. బేఫికర్‌. ముందే కన్సల్టెన్సీ ఫీ మాట్లాడుకుని డాక్యుమెంట్లన్నీ ఇస్తే యిక అన్ని లెవెల్స్‌లో లీల తనే మేనేజ్‌ చేసుకుని పనిని సాధించిపెడ్తుంది.. బ్లాక్‌ యాక్టివిటీస్‌ చేయడానికి లీల హైలీ రిలయబుల్‌ వైట్‌ ఏజెంట్‌. ముందే అంతా స్పష్టం..’

లంచాల కింద ఇరవైరెండు కోట్లు..తన ఫీ ఐదు కోట్లు..టైం పీరియడ్‌ మూడు నెలల పదిరోజులు-

కేస్‌ స్టేటస్‌.. స్టేట్‌ గవర్నమెంట్‌నుండి అన్నీ క్లియరై..అనుకూలమైన రిమార్క్స్‌తో ఫైల్‌ భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు పంపబడింది..పద్నాల్గు రోజుల క్రితం. ఫైల్‌ నంబర్‌ ఎఫ్‌ఫోర్‌ / టు త్రీ ఫైవ్‌ సిక్స్‌ / ఇండస్ట్రీస్‌ / 09 తేది 6 జూన్‌ రెండువేల తొమ్మిది.

అంతా అర్ధమైంది లీలకు.

తమకు అప్పటికే రెండుకోట్ల అరవై లక్షల అడ్వాన్స్‌ ముట్టింది. లంచాలు ఎనిమిది కోట్ల చిల్లర ఖర్చయింది.. ఇప్పుడు జాయింట్‌ సెక్రటరీ రాంసక్సేనా స్వయంగా ‘సెజ్‌’ శాంక్షన్‌ కాగితాలను తన దగ్గరకు తెచ్చిస్తాడు. అదీ ఏర్పాటు.

ఈ పనిని సాధించడానికి తన ఆధీనంలో పనిచేసే ఎందరో రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లలో ఫార్మర్‌ హోం సెక్రటరీ రాజన్‌ పిళ్ళై ఎంతో సహకరించారు. పిళ్ళై, రాంసక్సేనా యిద్దరూ బాటిల్‌మేట్స్‌..రూట్‌ దొరికింది. సరియైన పనికి సరియైన నైపుణ్యంగల మనిషిని వెదికిపట్టుకుని ఆ పనిని అప్పజెప్పి నిర్విఘ్నంగా సాధించడమే ఒక మంచి మేనేజర్‌ లక్షణం.

నవ్వొచ్చింది లీలకు..ఈ ప్రపంచంలో ఎవడైనా డబ్బుకు లొంగేవాడేకదా..ఒకడు ఎక్కువకు, మరొకడు ఇంకా ఎక్కువకు.. కాని లొంగడం మాత్రం ఖాయమైన వర్తమానంలో మనిషి ‘మార్కెట్‌’గా మారి…వ్చ్‌, క భ్రాంతిమయ అనుభూతి ఆమెను ఆకస్మాత్తుగా ఆవహించింది. ఎక్కడి ఆంధ్రప్రదేశ్‌లో తూఫ్రాన్‌ వద్ద వెంకట్రావ్‌పల్లె దగ్గరి సెజ్‌..ఎక్కడి ఢిల్లీ…ఎక్కడి ప్రవీణ్‌రెడ్డి, ఎవరీ లీల..ఎక్కడి దోహా..ఎవరీ రాంసక్సేనా..ఆ భూమి తాలూకు కాగితాలను యిక్కడ..ఈ అరబ్‌ గడ్డపైకి తెచ్చి తనకు యివ్వడమేమిటి..?

వ్యాపారం..అంతా వ్యాపారం..డబ్బు..డబ్బు..,

మార్క్స్‌ అన్నట్లు..మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలేనా?

కారు ట్రాఫిక్‌ను చీల్చుకుంటూ డి- రింగ్‌రోడ్‌, అల్‌ సౌదన్‌, ఫరీజ్‌ అల్‌ అమిర్‌ రోడ్‌ మీదుగా..గ్రాండ్‌ రీజెన్సీ హోటల్‌ చేరుకుని..పొర్టికోలో ఆగి-

మెరుపులా రఫీక్‌ కిందికి దిగి..డోర్‌ తెరిచి.,

అద్భుతమైన హోటల్‌ అది. రోజుకు రెండువేల యాభై యుఎస్‌ డాలర్స్‌. గేట్‌ దగ్గర ఆరున్నర అడుగులఎత్తు ఓ షోమ్యాన్‌ వినయంగా వంగి సలాం చేసి..,

డబ్బు.. డబ్బు..డబ్బుతో హోదా..హోదాతో గౌరవం..గౌరవంతో తృప్తి, అహం..అహం ఒక ఎడతెగని నిషా.. రాజ్యాలూ, రాజ్యాధికారాలూ అన్నీ అహంతో సంభవించిన దర్పంతోనే ధ్వంసమైపోయినట్టు అరుస్తూ చెప్పే మానవ చరిత్ర.,

రఫీక్‌ అప్పటికే రిసెప్షన్‌లోనుండి లేజర్‌ మానిటర్‌ను తీసుకుని, పెద్ద హాల్‌కు ఒక ప్రక్కన ఉన్న కాంతులీనే లిఫ్ట్‌ దగ్గరికి తోడ్కొనిపోయి,

…రెండు వందల ఆరు..ఎగ్జిక్యూటివ్‌ సూట్‌..చుట్టూ గాజు తలుపుల్లోనుండి.. స్విమ్మింగ్‌ పూల్‌.. దూరంగా సముద్రం.. ఇటు ప్రక్క గార్డెన్‌..సన్నగా సంగీతం..వాతావరణం నిండా ఏదో భాషకందని మత్తు..శరీరాన్ని వీణతంత్రులను మీటినట్టు పులకింపజేసే పరిమళం., గాలినిండా ఏదో మహత్తరమైన వివశత.

”మేడం ..షలై టేక్‌ లీవ్‌.. మై డ్యూటీ ఈజోవర్‌..మార్నింగ్‌ మిస్టర్‌ నాయర్‌ విల్‌ కం ఎట్‌ ఫైవ్‌ థర్టీ.. టు టేక్‌ యు టు ఏర్‌పోర్ట్‌..’రఫీక్‌.,

”ఓకే..థ్యాంక్యూ.”

రఫీక్‌ వంగి..సలాం చేసి..అతను దృఢంగా..కండలు నిండిన శరీరంతో అరబ్‌ గుర్రంలా ఉన్నాడు. వీళ్ళందర్నీ ఇండియా నుండి నిర్మల ఏర్పాటు చేస్తుంది. రఫీక్‌కు వెళ్ళేప్పుడు రిసెప్షన్‌లో ఐదువందల డాలర్ల టిప్‌ ముడ్తుంది. అతని రోజుకూలీ వేయి డాలర్లు కాకుండా. ఊహకందని పేమెంట్స్‌. ప్రతి రహస్య కార్యకలాపం చాలా ఖరీదుగానే ఉంటుంది మరి.

రఫీక్‌ వెళ్ళగానే..వెన్నెల ముద్దలా ఉన్న డబుల్‌ బెడ్‌పై ఒక్క క్షణం ఒరిగి కళ్ళు మూసుకుంది లీల.

‘కన్ను తెరిస్తే ఒక ప్రపంచంలో నువ్వు ,

కన్ను మూస్తే నీలోనే ఒక గర్జించే ప్రపంచం..’ఎవరివో కవితాపంక్తులు.

వేగం.. వేగం..ఒక అతివేగవంతమైన ప్రపంచంలో కాలాన్ని వేటాడ్తూ తను..తనను వెంటాడ్తూ కాలం..ఊపిరి సలపని పరుగులో పూర్తిగా మృగ్యమైపోయిన విచక్షణ..తనలోకి తను తొంగి చూచుకోలేని తీరికలేనితనం..నిజానికి ఒక్కసారైనా ఆత్మలోకి అవలోకించుకోడానికి తనకే తెలియని ఏదో భయం.

అసలేంచేస్తోంది తను..ఎక్కనినుండి మొదలై ఎక్కడికి కొనసాగుతోంది తన గమనం..అసలు తనకు ఒక గమ్యం అనేది ఉందా..తన అంతిమ లక్ష్యం ఏమిటి?

సుడిగాలిలోని కాగితం ముక్కకు ఒక థ, దిశ ఉంటుందా.?

ఎందుకో ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టయి..దిగ్గున లేచి..బాత్‌రూంలోకి వెళ్ళింది. అన్నీ స్వర్గాన్ని మరిపించే ఏర్పాట్లు. మంచుతుంపరలు కురుస్తున్నట్టు కాంతి. తెల్లని వెండి మేఘాల తరగలపై నడుస్తున్నట్టు నేల..సన్నగా ఏదో మృదుధ్వని..పరిమళం.,

స్నానం కానిచ్చి..బట్టలను మార్చుకుని..డ్రైయర్‌కింద ఆరబెట్టకున్న జుట్టును విరబోసుకుని..డ్రెస్సింగ్‌ టేబుల్‌ముందు ..బంగారు చెంపలకు ఓలె క్రీం కొద్దిగా పూసి..,

‘ఎంత అందంగా ఉంది తను’ అనుకుంది లీల ఎదుట అద్దంలో తనను తాను చూచుకుంటూ..నాల్గడుగులు వెనక్కునడచి., బెడ్‌పై వాలి.,

టైం ఎనిమిదీ యాభై ఐదు.,

సెల్‌ఫోన్‌ మ్రోగింది.. నిర్మల.

”మేం. రాం సక్సేనా ఈజ్‌ ఆన్‌ద వే. వితిన్‌ ఫైవ్‌ మినట్‌ హి విల్బీ..”

ఫోన్‌ కట్‌ చేసింది ఏమీ మాట్లాడకుండానే

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..ఓ అక్సర్‌ యాద్‌ ఆతీహై..’అనూహ్యంగా ముఖేశ్‌ గీతం వినబడింది చానల్‌ మ్యూజిక్‌లో..సన్నగా.,

కత్తితో వెన్నముక్కను ఎవరో కోస్తున్నట్టు..సర్‌ర్‌ర్‌మని ఏదో..చటుక్కున సముద్రమై పొంగిన దుఃఖం..ఆకాశమంత ఎత్తున్న అల విరిగి పైనబడ్డట్టు ఏదో బీభత్స విధ్వంసం..

ఒక్కపాట..ఒక్క చరణం..మనిషిని ఇంతగా కకావికలు చేస్తుందా..?

వ్చ్‌.,

సరిగ్గా అప్పుడే..బయట బజర్‌మ్రోగింది.

లీలకు తెలుసు..వచ్చింది రాం సక్సేనా అని..చేతిలోని లేజర్‌ రిమోట్‌తో బయటి డోర్‌ తెరిచింది.

ఔను రాంసక్సేనానే..”గుడీవినింగ్‌ మేడం” అన్నాడు వస్తూనే.

‘ప్లీజ్‌’ అంది..ఎదుట ఉన్న సోఫా చూపిస్తూ.

రెండు నిముషాల మౌనం..నిశ్శబ్దం..తర్వాత..అతను తన బ్రీఫ్‌కేస్‌ను తెరిచి ఒక అందమైన ప్లాస్టిక్‌ ఫోల్డర్‌ను ఆమెకు వినయంగా అందించాడు.

సక్సేనా యిదివరకు ఢిల్లీలో జరిగిన ఒక పెళ్ళివిందులో తనకు పరిచయం. పిళ్ళై చేశాడు.

”శాంక్షన్‌ ప్రోసీడింగ్సాఫ్‌ దట్‌ సెజ్‌..మిస్టర్‌ ప్రవీణ్‌రెడ్డీస్‌..”

”ఊఁ..”కాగితాన్ని పరిశీలనగా, మెరుపుపాటుకాలంలో చూచి,

”హౌమచ్‌ యుహావ్‌ రిసీవ్డ్‌ సోఫార్‌”

”టు క్రోర్స్‌ మేడం. మిస్టర్‌ పిళ్ళై కన్‌సెంటెడ్‌ దిస్‌ అసైన్‌మెంట్‌ యాజె ప్యాకేజ్‌ ఫర్‌ ఫోర్‌ క్రోర్స్‌..”అని అర్ధాంతరంగా ఆగి.,

”ఐనో..ఐనో..”

”ఆల్‌రెడీ.. దిస్‌సెజ్‌ శాంక్షనీజ్‌ పబ్లిష్డ్‌ ఇన్‌ ఎస్టర్‌డేస్‌ గెజిట్‌”

”ఓకే..”

లీల చకచకా తన లాప్‌టాప్‌ను తెరిచి..ఏదో అకౌంట్‌లోకి వెళ్ళి ఇ-ట్రాన్స్‌ఫర్‌ ఆపరేషన్‌ ప్రారంభించి.,

”యు వాంట్‌ దిస్‌ మనీ టు బి క్రెడిటెడిన్‌ యువర్‌ జడ్‌ టు జడ్‌..హిడెన్‌ అకౌంట్‌..ఈజిట్‌”

”యస్‌ మేం..”

”నౌ దిసీజ్‌ డన్‌..యు కెన్‌ వెరిఫై..”

”నాట్‌ నెసెసరీ మేం..ఐ బిలీవ్‌”

దొంగల మధ్య నిజాయితీ, క్రమశిక్షణ, వృత్తిధర్మంపట్ల నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. హవాలా లావాదేవీలన్నీ ప్రపంచవ్యాప్తంగా కాగితంముక్కకూడా ఆధారంలేకుండా అందుకే నిక్కచ్చిగా జరుగుతున్నాయి..కోట్లకు కోట్లుగా.

రాంసక్సేనా లేచి..” ఐ టేక్‌లీవ్‌ మేం..ఆల్వేస్‌ వుయ్‌ విల్‌బీ ఎట్‌ యువర్‌ డిస్పోజల్‌” అని వినయంగా తలపంకించి,

డబ్బు ముందు..వాడు ఐ ఎ ఎస్సా..ఆర్మీ ఆఫీసరా..రాజకీయ నాయకుడా..అన్న మీమాంస లేదు. లొంగిపోవాల్సిందే.. రేటు మారుతుందంతే.

అతను వెళ్ళిపోయాడు.

కాగితాన్ని బ్రీఫ్‌కేస్‌లో పెట్టింది. ఈ ఫైల్‌ క్లోజ్‌. హైద్రాబాద్‌ పోగానే ఇంకో యాభై లక్షల రూపాయలను పంచిపెడితే ఈ సెజ్‌ ప్రవీణ్‌రెడ్డి పరమైపోతుంది. భూమి వానివశమైపోయే కాగితాలన్నీ చకచకా తయారౌతాయి. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ింద మిగిలిన రెండు కోట్ల నలభై లక్షలు తన బినామీ అకౌంట్‌లో జమైపోతుంది.

అన్నీ అంకెలు…ఒక అంకెప్రక్కన ఎన్నో ఎన్నో సున్నాలు.

అంకె లేకుంటే ప్రక్కనున్న సున్నాల విలువ సున్న. ప్రక్కన సున్నాలు లేకుంటే ఒంటరి అంకె విలువ విలువ లేనిదే.,

తను ఒక అంకెనా..ఒక సున్నానా..వాటి సమ్మేళనమా.,

అస్సాం పవర్‌ మినిస్టర్‌ అరుణ్‌ ఉజ్లేకర్‌ అపాయింట్‌మెంట్‌ తొమ్మిదీ యాభై నిముషాలకు..ఇంకా అరగంట టైముంది.

చకచకా లిక్కర్‌ ర్యాక్‌ తెరిచింది..మాకల్లన్‌ విస్కీ బాటిల్‌. సోడా సీసా, ఐస్‌క్యూబ్స్‌.. క్రిస్టల్‌ గ్లాస్‌లో మిలమిలా మెరుస్తూ స్వర్ణద్రవం.

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..’

ఏవైతే మరిచిపోవాలనుకుంటూంటామో..ఆ జ్ఞాపకాలే ఎందుకో మళ్ళీ మళ్ళీ వెంటాడ్తూంటాయి మనిషిని.

జ్ఞాపకాలు ముఖంపై వర్షపు చినుకుల్లా..శిరసుపై చిరుజల్లు ముసురులా, మూసిన కళ్ళపై ముసిరే తూనీగల్లా.. ఒంటరిగా నడుస్తున్నపుడు తలపై రాలే పొన్నపూల జల్లులుగా,

ఎక్కడో వీణతీగ మ్రోగి..రాగాలను చిందించి..మైమరపించి..చటుక్కున తెగి..అతికి..మళ్ళీ తెగి..,

అతను జ్ఞాపకమొచ్చాడు..అతను..పన్నెండేండ్లక్రింద పరిచయమై, ఒక మానవ పరిమళమై..ఒక స్పర్శించే వీచికై..ఒక అర్థంకాని ఏదో ఐ..అతను..అతను..అతను.,

మనసు నిండా ఒక సముద్ర గంభీర నిశ్శబ్దం.. స్తబ్ద ప్రళయం..మౌన అలజడి.,

అస్సాం మంత్రి అరుణ్‌ రావడానికి..ఇంకా పదినిముషాలు.

తెలుసు..ఆ కేస్‌ వివరాలన్నీ లీలామాత్రంగా మేథోపథంలో ఉన్నాయి. డిబ్రూగడ్‌లో స్థాపించబడ్తున్న రెండు వందల తొంబయ్‌ మెగావాట్ల పవర్‌ప్లాంట్‌లో రెండు గ్యాస్‌ టర్బయిన్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘మిత్రా కన్‌స్టక్షన్‌’కు యిప్పించాలి. నూటా ఎనభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌. మిత్రా కన్‌స్ట్రక్షన్‌ కాకతీయ గ్రూప్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన దామెర లక్ష్మయ్యది. స్వంత రాష్ట్రంలో కాంట్రాక్ట్‌లు చేస్తే బద్‌నాం ఔతున్నామని ఇతర రాష్ట్రాలకు ఎగబాకుతున్న కంపెనీ. పదికోట్ల డీల్‌. గ్యాస్‌ రేట్‌ ఒడంబడికలో తను చేస్తున్న రేటు పెంపుదలతోనే ఎనిమిది కోట్ల లాభం వాడికి. చిన్న వెంట్రుకవాసి రేటు తేడా కొన్ని కోట్ల రూపాయల ఫలిత ప్రభావాన్ని చూపిస్తుంది.

సరిగ్గా పది నిముషాల తర్వాత కాలింగ్‌ బజర్‌ మ్రోగింది. తెలుసు లీలకు ఆ వచ్చింది అరుణ్‌ అని.

బెడ్‌పై కొద్దిగా సర్దుకుంటూనే.. లేజర్‌ రిమోట్‌తో డోర్‌ తెరిచి..

‘రాజకీయ నాయకులు, మంత్రులంటే పచ్చి లంజలకంటే కడహీనులు’ అనుకుంటూండగానే,

”గుడ్‌ మార్నింగ్‌ మేడం…”

వీడికి మార్నింగ్‌..ఈవినింగ్‌., నైట్‌ ..తేడాలు తెలియట్లేదనుకుని.,

”బోలియే ఉజ్లేకర్‌ సాబ్‌..కైసేహై ఆప్‌” అంది.

”బహుత్‌ మజేమే..”

”హమ్‌ ఆప్కో..”

”పూరా యాద్‌ హై..ఇస్‌ హఫ్తామే ఓ లక్ష్మయ్య సాబ్‌కా కాగజ్‌ దస్తకత్‌ కర్కే బేజ్‌దేంగే…పూరా కామ్‌ హోగయా.. బేఫికర్‌..”

”కామ్‌ హోతేహీ..ఆప్‌కా కిసీ ఆద్మికో ఢిల్లీమే 9390109293 నంబర్‌ మే కాంటాక్ట్‌ కర్లేకే పూరా దో కరోడ్‌ క్యాష్‌.. దౌజంట్‌ నోట్స్‌ లేజానా..ఓ ఆర్డర్‌లేకే హమ్‌కో ఫాక్స్‌ కర్‌దేనా..ఠీక్‌ హై”

”ఠీక్‌ హై మేడమ్‌..ఏక్‌ దమ్‌..పూరా క్యాష్‌ మిలేగా క్యా”

”హా..వోహీ చాహియేనా ఆప్‌కో”

”హా”

అతను లేచాడు.. మరో రెండు నిముషాల్లో ఆమెవైపు భయం భయంగా, కొద్దిగా ఆశగా ఆకలిగా చూచి..నీళ్ళు నములుతూ.., బై” అంది లీల.

ఖేల్‌ కతమ్‌..తాలీ బజావ్‌.,అరుణ్‌ ఉజ్లేకర్‌ నిష్క్రమించాడు.

లీలకు అస్సాం గ్యాస్‌ పవర్‌ ప్లాంట్‌లో జపాన్‌ ప్రభుత్వం పరస్పర అభివృద్ధి పథకాల, పరస్పర సహకార ప్రణాళికల కింద ముప్పయి ఎనిమిది మిలియన్ల ఎన్స్‌ అప్పు..ఆ తతంగమంతా జ్ఞాపకమొచ్చింది.

అప్పు అంతా ప్రజలవంతు..ఆనంద తాండవాలన్నీ, అనంత సుఖాల భోగాలన్నీ ప్రభుత్వాధికారులదీ, రాజకీయ నాయకులదీ ఐన ఈ వర్తమానం దేశాన్ని ఎవరికెవరికి, ఎంత దారుణంగా కుదువ బెడ్తోందో తలుచుకుంటే..అయ్యో పాపమనిపించి, నిట్టూర్చి.,

ఆకలి అనిపించింది లీలకు..అకస్మాత్తుగా.,

ముందరున్న స్క్రీన్‌పై చికెన్‌ టిక్కా, ఖలీఫా తందూరి ముర్గా ఆర్డర్‌ చేసింది.

ఎదురుగా..పల్చని బంగారు మాకల్లన్‌ విస్కీ ద్రవం..తెల్లని మంచుపూల వలె ఐస్‌.,

ఒక సిప్‌ చేసి.,

ప్రపంచం యావత్తు ఆనంద సముద్రంలో తేలిపోతున్నట్టనిపించి,

ఏ మనిషికైనా తన దుఃఖమే ప్రపంచదుఃఖం..తను అనభవిస్తున్న తన ఆనందమే చుట్టూ ఉన్న ప్రపంచ మానవాళి అందరి ఆనందమనుకుంటూ..ఒక భ్రాంతిలో బ్రతుకుతూ..ఒక మార్మిక ఆత్మవ్యంజనలో..,

ఇంకా గంట సమయం ఉంది..ఆ రోజు మూడవ కేస్‌ నీరజా రావ్‌తో. ఒక జర్మనీ కంపెనీ భారతదేశంలో స్థాపించాలనుకుంటున్న ఆటోమొబైల్‌ కంపెనీ తాలూకు అన్ని క్లియరెన్స్‌లు, ల్యాండ్‌ అలాట్‌మెంట్‌.. వగైరా ఏర్పాట్లన్నీ.. మూడువేల కోట్ల ప్రాజెక్టు. అందులో స్పెషల్‌ గ్రేడ్‌ రోవర్‌ వెహికిల్స్‌ను ఆరేళ్ళపాటు ఇండియన్‌ డిఫెన్స్‌ కోసం కొనుగోలు చేసేందుకు యంఓయూపై అడ్మిరల్‌ కులకర్ణీతో ఒప్పందం..డీల్‌-

‘అబ్బా..యిప్పుడు ఓపిక ఉందా..ఇదంతా చేయడానికి..’అనుకుంది లీల.

లేదు.. అని గోముగా జవాబొచ్చింది లోలోపల్నుండి.

వెంటనే నిర్మలకు ఫోన్‌ కలిపింది లీల..

‘నిర్మలా..కెన్‌ యు గెట్‌ నీరజారావ్‌ ఆన్‌ లైౖన్‌ ఫర్‌ డిస్కషన్‌..ఐ కాంట్‌ మీట్‌ హర్‌ పర్సనల్లీ నౌ..ఐ షల్‌ డిస్పోజ్‌హర్‌ ఓవర్‌ ఫోన్‌ ఓన్లీ.’

‘యస్‌ మేం. ఐ విల్‌ బి బ్యాక్‌ టు యు ఆఫ్టర్‌ టెన్‌ మినట్స్‌’

లైన్‌ తెగిపోయింది.,

ఒక దేశపు సైనిక శిబిరాల్లోనైనా తన సంస్థలో ఉన్న క్రమశిక్షణ ఉంటుందా. నిబద్ధత ఉంటుందా. బాధ్యతలపట్ల ఇంత అంకితభావముంటుందా అని అనిపించింది లీలకాక్షణంలో.

ఈ రోజు లీల ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. భారతదేశం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఏ పనంటే ఆ పని.. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, సైనిక, రాయబార సకల రంగాల్లో ఏదైనా సరే.. ఆ పనిని అతి విశ్వసనీయంగా నిర్వహించగల ఏకైక శక్తి.. లీల.

లీల అంటే..నమ్మకం..గ్యారంటీ..లీలంటే ఒక ఓటమి ఎరుగని విజయం..లీలంటే ఒక వ్యూహాత్మక కార్పొరేట్‌ ఎత్తుగడ.. ఒక ఆధిపత్య ప్రతీక.

మొబైల్‌ సన్నగా ప్రకంపించింది.

”హలో”

” మేడం. నేను నీరజా రావ్‌ని..”

”హై..హలో నీరజా..చెప్పు..”

”మీరు చెప్పిన పనులన్నింటినీ విజయవంతంగా ముగించాను మేడం. రిపోర్ట్స్‌న్నీ నా దగ్గరున్నాయి. జర్మనీ ఆటోమొబైల్‌ జెయింట్‌ రోవర్‌కు ఆదిలాబాద్‌ దగ్గర వందా యాభై ఎకరాల స్థల కేటాయింపు, వాళ్ళు తయారుచేసే డిఫెన్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌కు ఆరేళ్ళపాటు పర్చేజ్‌ గ్యారంటీ ఒప్పందం..అంతా ఓకే..సంబంధిత అధికారులు, నాయకులు, మంత్రులు..అందరూఓకె. పద్దెనిమిది కోట్ల లంచాలు..మిసలేనియస్‌ ఖర్చులు ఇంకో రెండు కోట్లు. వెరసి మీరు ఈ డీల్‌ను ముప్పయికోట్లకు ఓకే చేసుకోవచ్చు. మేడం, రోవర్‌వాళ్ళు ఐదుకోట్లు మన కువైట్‌ అకౌంట్‌లో రేపు వేస్తామంటున్నారు. మీరు ఓకే అంటే.. ఐ విల్‌ వెయిట్‌ ఫర్‌ యువర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌.”

నీరజా రావ్‌ ఐఐఎమ్‌ బెంగళూర్‌ యంబిఎ క్వాలిఫైడ్‌. మెరుపులాంటి మేధ.. చూపితే కొండ ప్రాకే తత్వం. తన కన్‌సెల్టెన్సీలో మిడిల్‌ ఈస్ట్‌ ఇంచార్జ్‌. కాని పైకి మాత్రం ఫ్రాన్స్‌లోని రోవర్‌ కంపెనీలో రెసిడెంట్‌ కన్‌స్టలెంట్‌..

అంతా బినామి..

ఎక్కడా..తమ పేరు ఉండదు బాహాటంగా..అంతర్గతంగా మాత్రం అంతటా తమ పేరే ఉంటుంది.

ఉండీలేనట్టుగా..లేకా ఉన్నట్టుగా అనిపించేదే లీల కదా.

లీల ఒక మిథ్య…ఒక సత్యం..ఒక స్వప్నం..ఒక సందిగ్ద సందర్భం..భయంకొల్పే వాస్తవం..అంతిమంగా ఒక ఓటమి ఎరుగని విజయం.

చటుక్కున ఏదో తోచినట్టు ఉలిక్కిపడి..నీరజారావ్‌కు ఫోన్‌ కలిపింది క్షణంలో. ఆమెతో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ డ్యూటీలో ఉన్న తమ ఇన్నర్‌ సర్కిల్‌ అసోసియేట్స్‌ లీల స్పెసిఫిక్‌ టూర్‌లోఉన్నప్పుడు హై అలర్ట్‌లో హాట్‌లైన్‌పై అందుబాట్లో ఉండి క్షణాల్లో ఆన్‌లైన్‌లో కొస్తారు పిలవగానే. లీల కంపెనీ పనిసంస్కృతి అది.

‘వెల్‌ నీరజా..రోవర్‌తో డీల్‌ పక్కా చెయ్‌’. మనం లాస్ట్‌ డిస్కషన్‌లో మెక్సికన్‌ కంపెనీ రిచర్డ్‌సన్‌ పవర్‌ సిస్టమ్స్‌ గురించి చర్చించాం. గుర్తుందా. కువైట్‌లో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూరపాటి అండ్‌ సన్స్‌ గ్లోబల్‌ టెండర్‌కు అడ్డుతగుల్తున్నాడు వాడు. వాళ్ళ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వచ్చే ఇరవై ఎనిమిదిన ఫ్రాంక్‌ఫర్ట్‌ వస్తున్నాడు. డిటెయిల్స్‌, ఫ్లైట్‌ నంబర్‌, హోటల్‌..వివరాలన్నీ నీకు మెయిల్‌లో వస్తాయి. వాణ్ణి టాకిల్‌ చేయాలి. వినకుంటే వాటర్స్‌ హాలో రోడ్‌లో ఆరోజు రాత్రి ఒక రోడ్‌ యాక్సిడెంట్‌పేర వాణ్ణి లేపెయ్యాలి. వాడు ఆరోజు జాన్సన్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో ఒక పార్టీలో పాల్గొంటాడు. ఆపార్టీనుండి వస్తూండగా..ప్లీజ్‌ నోట్‌’

”ఓకే మేం..”

”గెట్‌ బ్యాక్‌ టు మీ..ఆన్‌ ట్వంటీ నైన్త్‌ ఈవినింగ్‌ ఎట్‌ సిక్సోక్లాక్‌ పాజిటివ్లీ”

”యస్‌ మేం..”

ఫోన్‌ పెట్టేసి..టకటకా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలోని ఒక సీనియర్‌ మంత్రి విశ్వనాథరెడ్డికి లైన్‌ కలిపి..”మీరు రేపు ఉదయమే..ఎనిమిది గంటలలోపు ప్రెస్‌మీట్‌ పెట్టి ముఖ్యమంత్రి పనితీరుపై, అసమర్థతపై మండిపడ్తూ తీవ్రపదజాలంతో ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వండి. చదరంగం ప్రారంభమైంది. ఒక పావు కదపాలిప్పుడు మనం. మీకది ఉపయోగకరంగా ఉంటుంది..”అని ఆదేశించింది.

”యస్‌ మేడం..”

గుండెల్లో ఏదో ఉద్వేగం..ఒకని మరణశాసనం..ఒక ప్రభుత్వ పతనానికి ముహూర్తం.,

కళ్ళు మూసుకుంది..అలసటగా.

ఎదురుగా..విశాలమైన గాజుతలుపుల కారిడార్‌లోనుండి..చొచ్చుకొచ్చి నిరీక్షిస్తున్న నీలి సముద్రం. అలల ఎడతెగని చప్పుడు..లయబద్ధంగా..నిరంతరంగా..వింటోంది..వింటూనే ఉంది..,

ఆమెకర్ధమౌతోంది.. ఆమె బయట.. ఎదుట మాత్రమే కాదు.. తన లోలోపలకూడా ఒక నిశ్శబ్ద సముద్రం గర్జిస్తోందని,

టైం చూచుకుంది లీల కొద్దిసేపైన తర్వాత. రాత్రి రెండూ యాభై నిముషాలు.

ఈ దిక్కుమాలిన ప్రపంచంలో రాజకీయాల్లోగానీ, ఇతరేతర ఏ కీలక రంగాల్లోగానీ అతిప్రధానమైన నిర్ణయాలన్నీ రాత్రుళ్లే జరిగిపోతాయి. రాత్రుళ్ళు వ్యూహించుట..పగళ్ళు అమలు..ఒక రేయింబవళ్ళు వేట,

ఎందుకో ఆమెకు తన ఇష్టమైన ‘ఎర్త్‌’ బ్లూరే డివిడి చూడాలనిపించింది. లాప్‌టాప్‌లోనుండి ఎదుట ఉన్న శాంసంగ్‌ హోం థియేటర్‌ సిక్ట్సీ ఫోర్‌ ఇంచెస్‌ టి.విలోకి డిస్ని నేచర్‌ ‘ఎర్త్‌’ ఫైల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసి ‘ప్లే’ నొక్కింది.

‘ఎర్త్‌’..అంటే..భూమి..ఫృథ్వి..పుడమి..ధరణి.,

స్త్రీ.. అంటే అన్నింటినీ భరించేది..ధరించేది..ధరణేకదా., టి.వి. తెరపై విశాలంగా ఒక ఎడారి విచ్చుకుని పరుచుకుంది. ఒక ఒంటరి గ్రద్ద..విశాలంగా విప్పుకున్న రెండు రెక్కలు.. పరుగెత్తుతోంది..పైన ఆకాశం..క్రింద భూమి,

లీల అలసిపోయిన ప్రతిసారీ ఈ ‘ఎర్త్‌’ డివిడిని చూస్తుంది..చూడగానే హృదయం రీచార్జ్‌ ఔతుంది. తను పునరుత్తేజిత ఔతుంది. ఈ భూమిపై చిగురించి, ఎదిగి, ఒదిగి, వికసించి, నశించి, దహించుకుపోయి, శిథిలమై, ఒట్టి అవశేషంగా మిగిలి..స్తబ్దమై..నిర్జీవమై..మళ్ళీ చిగురించి..,

‘వలయం వలయేతి..’

చక్రం.. కాలచక్రం..ఋతుచక్రం.. జీవచక్రం..జ్ఞానచక్రం..జగమంతా ఒక అవ్యవస్థిత చక్రగమనం.. చక్రభ్రమణం,

ఏనుగు శరీరం ఎంతో పెద్దది. కళ్ళు ఎంత చిన్నవో,

పక్షి ఏదైనా..రెక్కలు రెండు..ఎంత చిన్నవో..ఈదవలసిన ఆకాశం ఎంత విశాలమైందో..

గుర్రం కాళ్ళు ఎంత  సన్ననివి..కాని, దాని వేగం ఎంత ప్రచండమైంది. ఐతే జీవితమంతా పరుగే..పుట్టి భూమిపైన పడ్డ మరుక్షణం నుండి చచ్చేవరకు గుర్రం నిరంతరం రేయింబవళ్ళు ఎప్పుడూ నిలబడి ఉండడమే. అలసట ఎరగకుండా.. విధేయంగా, సహనంగా..ఎంత శిక్ష..జీవితకాల శిక్ష.

రెక్కలు మొలుస్తున్నపుడు ప్రతి పక్షీ ఎంత పులకించిపోతుంది,

పుడ్తున్నపుడు ఏ మొక్కయినా ఎంత అందంగా ఉంటుంది జీవకాంతితో.

ప్రతి జలపాతం..క్రింద పడి..పతనమై..చితికి…చింది..స్థూల ప్రవాహం ఒక సూక్ష్మ విస్తరణగా, వ్యాప్తిగా మారి..ఉత్థానం..పతనం..శృంగం, ద్రోణి – శిఖరం..లోయ..చీకటి, వెలుగు..ఉదయం, అస్తమయం..ప్రక్కప్రక్కనే, వెంటవెంటనే,

ఒక జింకను ఒక పులి వేటాడ్తోంది.. ఆకలిగా, కసిగా, దీక్షగా..తెరపై .,

ఆ క్షణం ముందు పులి పొడ జింకకు తెలియదు.. జింక ఉనికి పులికి తెలియదు..ఒకదానికి మరొకటి తటస్థపడగానే.. ఆత్మరక్షణ..వేట..వేటాడబడ్డం.,

భూమ్మీది ఈ సకల చరాచర జీవరాశులన్నీ జీవించడానికి పోరాడ్తూనే, ఆత్మరక్షణ కోసం వ్యూహాత్మకంగా బ్రతుకంతా యుద్ధం చేస్తున్నాయి..కదా.

యుద్ధం..యుద్ధం..జీవితమంటే..యుద్ధం..పోరాటం.,

ఎవరితో..?

సముద్రాలు..ఎడారులు..అడవులు..ఆకాశం..ఈ సమస్త జీవజాలం..,

అంతా ఏనాడూ ఎవరికీ అర్ధంకాని ఒక వ్యవస్థ..ఒక పాఠం..ఒక సజీవ బోధన..అంతా ఉండి చివరికి ఏదీ ఉండదని నిరంతరం ఒక సత్యాన్ని ప్రవచించే ప్రజ్వలిత చేతన.,

లీల మనసునిండా ఒక ఛాయామాత్రంగా సమస్త సృష్టి.. క్రమంగా వ్యాపించి..అల్లుకుపోతూ..ఎక్కడో తెలిపోతూ.,

గాలి కనబడ్తుందా..?ప్రశ్న.

కనబడదు కాబట్టి గాలిలేనట్టు కాదుగదా.

కనబడనివన్నీ లేనట్టా.. కనబడేవన్నీ ఉన్నట్టా..,ప్రతి మనిషికీ తెలిసే ‘ఆకలి’ ఉన్నట్టా లేనట్టా.

ఎందుకో ఆమె హృదయపు లోపొరల్లో అన్నమయ్య కీర్తన కదిలి సన్నగా వినిపించడం మొదలైంది.

‘అంతర్యామీ..అలసితి..సొలసితి..’

లీల కళ్ళు మూసుకుంది.

ఎందుకో ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండి..దుఃఖం పొంగి పొంగి,

అప్పుడామె తీరాన్ని చేరబోతున్న సముద్రపుటలలా..కల్లోలంగా ఉంది.

(సశేషం)

ఎవరిదో..ఒక అనుమతి కావాలి

ramachandramouli

పుట్టిన కోడిపిల్ల నడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత

పగిలిన పైపెంకు ఒక విసర్జితావశేషమే కదా.. ఆలోచించాలి

అనంతర చర్యల గురించీ, సాపేక్ష అతిక్రమణల గురించీ, ఉల్లంఘనల గురించీ

చూపులు స్తంభించినపుడు శూన్యమయ్యే నిశ్చలనేత్రాల గురించీ

ఊర్కే..అలసి..రోడ్డు ఫుట్‌పాత్‌పై కూలబడి శిథిలమవ్వడం గురించీ

 

…చాలాసార్లు అన్నీ చెప్పడం నీకు చేతకాదు

జీవితంలో ఎవరికైనా ఎదుటిమనిషితో

చెప్పినవాటికంటే చెప్పకుండా ‘రహస్యం’ చేసినవే ఎక్కువ

 

ఒక చీకటి బిలంలోకి

ఎండుటాకు గాలిలో రాలిపోతున్నప్పటి..విశుద్ధ అనివార్యతను ఊహించగలవా

కొన్నిసార్లు ఏమీచేయలేని నిష్క్రియత్వం,

అలా అద్దంపై ఘనీభవిస్తున్న నీటి బిందువువలె

ఒట్టి దుఃఖపు ఊట..యిసుకను తోడ్తున్నకొద్దీ కన్నీటి జల

కళ్ళు సముద్రాలకు పర్యాయాంగాలా

పాదాలు శరీరాన్ని…గుండెను..మనసునుకూడా మోసుకుని నడుస్తున్నపుడు

ఎవరో రబ్బర్‌ కొసలను లాగి సాగదీస్తున్నట్టు..స్ట్రెచ్‌.,

పరవశమే, కాని..ఏదీ అర్థంకాదు

పెళ్ళాం అర్థంకాదు..పిల్లలు అర్థంకారు.. ఉద్యోగం అర్థంకాదు

రాజకీయాలు అర్థంకావు.. అరాచకాలర్థంకావు

చివరికి జీవితం అర్థంకాదు-

 

చటుక్కున..సుడిగుండంవలె ఒక ఖాళీ ఏర్పడ్తుంది లోపల

అలలు అలసటలేకుండా ఒడ్డుకు తలబాదుకుంటున్నట్టు నిశ్శబ్దవేదన

ఏమి కావాలో తెలియదు.. ఏమి వద్దోకూడా తెలియదు

కాని ఏదో కావాలనిమాత్రం తెలుసు

ఆ ‘ఏదో’ కోసం అన్వేషణ

మనిషిలో, బ్యాంక్‌లో, కుర్చీలో.. ఆమె కళ్ళలో, నవ్వులో

అంతా తుంపర తుంపరగా ముసురు

ముందరున్న పాదముద్రలలో వెదుకులాట

వైకుంఠపాళీ అరుగుపై గవ్వల విదిలింపు

నిచ్చెనలకోసం ఉబలాటం

పాములేమో నోళ్ళు తెరచి, పడగవిప్పి హూంకరింపు

చేతులు రెండూ యిక తెరువవలసిన తలుపులు

 

తీరా..ఇప్పుడు

ఎదుట లోడెడ్‌గన్‌ ఎక్కుపెట్టబడి సిద్ధంగా వుంది

ఇనుపబూట్లు, ఇనుప టోపీ, ఇనుప కవచం

బిగపెట్టబడ్డ శ్వాస.. చికిలించిన కళ్ళు..కాని

…ఎక్కడినుండో..ఎవరిదో..ఒక అనుమతి కావాలి-