చలం వారసత్వం నిజంగా అందుకున్నామా ?

chalam
చలం కేవలం రచయిత కాదు. ఒక సాహితీ విప్లవం. ఒక సామాజిక ఉద్యమం.
నిర్ధిష్టమైన prescribed విలువల్లో కుంచించుకుపోతున్న మానవతలోని ప్రేమతత్వాన్ని, సత్యశోధనని తన రచనలతో ఉద్దీపనం చేసిన ఋషి. ప్రపంచ సాహిత్యంలోని నవీనపోకడలతో ధీటుగా తెలుగు రచనల్ని చేసి, తెలుగువారికి కాకుండా పోయిన ఒక తపస్వి.
మనమే ఒప్పుకోలేని మనలోని నిజాల్ని మనకు పరిచయం చేసిన చలాన్ని అర్థంచేసుకుంటే మనలోని వికారాల్ని, మకిలిని మనం అంగీకరించాలనే భయంతో కావొచ్చు, అతన్నే కాదన్నాం. ఎన్నో సంవత్సరాల విమర్శలు, వ్యక్తిగత ధూషణలు,అభాండాల మధ్యన చలం ఇంకా తన రచనలతో ఒక్కోతరాన్నీ కుదుపుతూనే ఉన్నాడు. సమాజానికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు.
చలం తరువాత ఎందరో రచయితలు వచ్చారు. ఎన్నో వాదాలు పుట్టాయి. సమాజంలో ఎంతో మార్పు జరిగిందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పటికీ చలం పేరు ఒక వివాదమే. ఇప్పటికీ చలం వేడివేడి చర్చలకు మూలమే. ఈ పరిణామాల దృష్ట్యా చలం సమకాలీన సమాజానికి రిలవెంట్ అనడంలో సందేహం లేకపోయినా, “చలం ప్రస్తుతం ఎంత రిలవెంట్?” అనే ప్రశ్న ఖచ్చితంగా అవసరం. దానికి సమాధానం కావాలి.
రెండోది చలం వారసత్వం గురించి. పాఠకులుగా, వ్యక్తులుగా చలం వారసత్వాన్ని ప్రతితరంలోనూ కొందరు అందిపుచ్చుకుని చదువుతూ, అనుభవిస్తూ,ప్రశ్నిస్తూ, పోరాడుతూనే ఉన్నారు. తెలుగు సమాజం మాత్రం ఇంకా చలాన్ని ఎలా ఓన్ చేసుకోవాలో తెలీని తికమకలోనే ఉంది.
నిజానికి ముఖ్యమైన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది. చలం తత్వాన్ని, దార్శనికతని,సత్యాన్వేషణని, శోధనని, శైలిని, శిల్పాన్ని, విషయాల్ని కొనసాగించిన రచయితలు ఎవరైనా ఉన్నారా అనేది. నిన్న వడ్డెరచండీదాస్, ఈరోజు కాశీభట్ల వేణుగోపాల్ వంటివారు ఏదో ఒక రూపంలో కొంత చలాన్ని తలపించినా, చలం వారసత్వాన్ని ఆపాదించేంత విశాలత్వం రచనలద్వారా, వ్యక్తిత్వాల ద్వారా వెలిబుచ్చారా అనేది ప్రశ్నార్థకమే.
అందుకే, ఒక సమాజంగా తెలుగు వారు చలం వారసత్వాన్ని అందుకున్నారా? తెలుగు రచయితల్లో చలం వారసత్వాన్ని కొనసాగిస్తున్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. సమాధానాలు ఉన్నాయో లేవో తెలీని ప్రశ్నలు. చర్చకు నాందిగా మాత్రం ఖచ్చితంగా పనికొచ్చే ప్రశ్నలు.
తాంబూలాలు ఇచ్చేశాం….ఇక మీదే ఆలస్యం….