గోదావరి గుండె తడి ఎండ్లూరి కవిత్వం

 

లక్ష్మణ్ ఆదిమూలం 

Lakshman copyనదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత అభివృద్ది చెందుతాయి . నాగరికత ఉన్న చోటనే సాహిత్యం పుడుతుంది . నదికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది .  . దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద నది గోదావరి . ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు సాహిత్యంలో గోదావరి పయనాన్ని , తీర ప్రాంతాలలోని దేవాలయాలను వర్ణిస్తూ సాగిన సాహిత్యం అపారం.

ఆధునిక కాలంలో వచ్చిన దృక్పదంలో  కవిత్వంలో మార్పు వచ్చింది . సాహిత్యంలో కొత్త కోణం వెలుగులోనికి రావడం జరిగింది . అటువంటి కవిత్వం లోని రెండు కోణాలు ఎండ్లూరి సుధాకర్ రావు గోదావరి నది పై రాసిన కవిత్వంలో కన్పిస్తాయి . ఒక ప్రక్క గోదావరి అందాలను , గోదావరితో తనకు ఉన్న అనుబంధాన్ని కవిత్వీకరిస్తూనే , మరొక వైపు గోదావరి గుండె ఆవేదనను ఆవిష్కరించారు ఎండ్లూరి సుధాకర్ .

గ్రీష్మ కాలంలో గోదావరి స్వరూపాన్ని , ఎండిపోతున్న గోదావరిని చూసిన రచయిత తన గుండెలోని బాధని వ్యక్తం చేసాడు …

“నాన్న కొట్టినప్పుడు /ఒక మూల ముడుచుకొని

పడుకున్న అమ్మలా ఉంటుంది …

ఎండాకాలపు గోదావరి /నీటి కొవ్వు కరిగిపోతూ

పలచబడుతున్న  జలచర్మంతో /ఎనీమియా  పేషెంటులా ఎంతో జాలిగొలుపుతుంది “

గోదావరి నది చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం , అందాలను వర్ణించడం , వాటిని చూసి మురిసిపోవడమే కాదు మరో కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత “ఒక సాయంత్రం గోదావరి “ అనే కవిత లో ….

“గోదావరికే గొంతుంటే / జల భాషలో శతాబ్దాల గుడిసె కథలు చెప్పేది /

సాయంత్రం షిఖారులో /  గోదావరి మనోహరిలా కాదు /గొప్ప భారాన్ని దాచుకున్న తల్లిలా కనిపిస్తుంది “.

నాకు ఈ  జన్మ నిచ్చిన  తల్లిదండ్రుల ఆప్యాయతలను , అనురాగాలను స్మరణకు తెచ్చావు అంటూ “నువ్వు అమ్మా నాన్నవే గోదావరి” అనే కవిత లో “ నా బాల్య జ్ఞాపకాల అంతర్ ఝరీ !!/ ణీ ఒడ్డు ఒడిలో తలపెట్టుకున్నప్పుడు /అమ్మ దగ్గిర వున్నట్టుంటుంది ,ణీ ఇసుక మేనిపై పోర్లాడుతున్నప్పుడు /నాన్న గుండెల మీద ఆడుకుంటున్నట్లే వుంటుంది / నువ్వు అమ్మా నాన్నవే గోదావరి ! “

ఒకవైపు గోదావరిని ప్రత్యక్ష దేవతగా కొలిచే వారే ఆ నదీ  గోదావరిని కలుషితం కావడానికి కారణం అవుతుంటే చూసి భరించలేని కవి ఆవేదన కవిత్వ రూపంలో కన్పిస్తుంది .  పరిశుభ్రత పాటించాలని వచ్చిన కవితలు ఉన్నాయి .

భారతదేశంలో ముఖ్యమైన పన్నెండు నదులకు ఒక్కొక నదికి ఒక సంవత్సరానికి పుష్కరాలు జరుగుతాయి . ఆ సమయంలో నదులు ఎలా కాలుష్యానికి గురి అవుతున్నాయో   రచయిత  గత గోదావరి పుష్కరాల సమయంలో  వెలువరించిన పుష్కర కవితలు ఈ కోణం  నుంచి  ఆలోచించి వచ్చిన కవితలే ….

గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షల యాత్రికులు శుభ్రత  పాటించక పోవడం  వల్ల గోదావరి ఎంతగా కలుషితం అయ్యిందో , గోదావరి పుష్కరాల తర్వాత గోదావరిని చూసిన కవి ఆవేదన ఇలా వ్యక్తీకరించారు .

“పుష్పాలు రాలిపోయిన కొమ్మల్లా /పుష్కరాల తర్వాత /రాత్రిపూట గోదావరి

రహస్యంగా దగ్గడం గమనించాను /దుర్భరమైన దుర్వాసనలో

మూగతల్లి ముఖం మీద /మురికి టీగలు వాలడం పసిగట్టాను

గోదావరి నీటినాడి  పట్టుకుంటే తెలిసింది/ఆమె పుష్కర జ్వరంతో బాధపడుతోందని “………కలుషితంగా మారుతున్న ఆ గోదావరమ్మ నీటికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఖండిక .

పుష్కరాల సమయంలో గోదావరి కలుషితం కావడం వలన స్నానానికి వచ్చే యాత్రికుల ఇబ్బందులను గుర్తు చేస్తారు రచయిత ఈ కింది ఖండికలో …

“యాత్రికులకు గమనిక …పుష్కర స్నానాలయ్యాక

ఏ డెట్టాలు తోనో మళ్లీ ఒళ్లు కడుక్కోండి

ఎంత ధర్మ వుఆదుల వారికైనా

చర్మ వ్యాధులు రాకమానవు

అద్దర్లో మినిగినా …ఇద్దర్లో మినిగిగా …దద్దుర్లు తప్పవు “.

పుష్కరాలు అంటే అందరికి గుర్తుకు వచ్చేది రాజమండ్రి ,కొవ్వూరు , బాసర , ధర్మపురి ,కోటిపల్లి ఇలా ప్రసిద్ధ మైన ప్రదేశాలు అందరు అక్కడే స్నానాలు ఆచరించి గోదావరిని మురికి చేయకండి , ఇలా చూడండి ప్రకృతి ఒడిలోని గోదావరమ్మ ను అంటూ పాపికొండల మధ్య ఉన్న గోదావరిని స్పురణకు తెస్తాడు రచయిత

“పుష్కర యాత్రికులారా /మురికి రేవుల్లో ఏం మునుగుతారు ?

/అలల నగల ధగధగల /గిరిజన ప్రకృతి గోదావరి

/పాపికొండల నడుమ /పసుపు పూలదండలు దాల్చి

/అమ్మవారిలా కనబడుతుంది /ఆమెను చూసిరండి

అనుభూతి పుణ్యం లభిస్తుంది”.

అందుకే భక్తుడు కానీయండి ,  సగటు మనిషి కానీయండి గోదావరి కలుషితం కావడానికి కారణం  అయ్యామని మమ్మల్ని క్షమించమని ఆర్తిగా అర్దిస్తాడు ఈ  క్రింది ఖండికలో ఎండ్లూరి

“తల్లీ గోదావరి  /మేము జలహంత కులం

మాది విషవింత కులం  /నీ  అందాల

జల మంగళ  సూత్రాలను  /మలమూత్రాలతో అపవిత్రం చేశాం

పాపాత్ములమూ /అమ్మ వొడిని  పాడు చేసే పసిపాపలము

మన్నించవమ్మా  /పుష్కర పునీత మాతా !”

Yendluri_sudhakar

గోదావరి గొప్పతనాన్ని కీర్తిస్తూ గడిపేయడమే కాదు , కలుషితమై పోతున్న గోదావరిని  నిర్మలంగా  చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ,అందరు నడుం కట్టి పరిశుభ్రం చేయాలని పుష్కరాల తరవాత చేయావల్సిన కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు రచయిత ఈ ఖండికలో …

“గోదావరి /మురికి నీటి అద్దంలో

ముందు ముందు /ఎవరి ముఖాలూ కనబడవు

రండి నడుం కడదాం !/గోదావరి మురికి ముఖం కడుగుదాం !

శాస్త్రాలతో కాదు /శాస్త్రీయంగా /శాశ్వతంగా . . .

ఈ విధంగా గోదావరి నదీ ప్రస్థానం ఎంతటి వైశిష్ట్యాన్ని పొందిందో , సాహిత్యంలోను గోదావరి కవిత్వ రూపంలోనూ అంతే ప్రాచుర్యం సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా పుష్కర సమయంలో గోదావరి నది కలుషితం అవుతుందో ఈ కవిత్వం నిదర్శనం . సగటు మనిషికి అనుభూతిని కలిగించడంలోను ,వాస్తవాలను ప్రబోధించడమే నేటి కవిత్వం యొక్క ఉద్దేశ్యం వాటితో పాటు గోదావరి వ్యధను ప్రతి వ్యక్తి ఆలోచించేలా చేస్తుంది  ఎండ్లూరి  కవిత్వం .

*