అణచినవాడే శూరుడు! లొంగిపోతే పతివ్రత!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల మధ్య పోలికల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, తేడాలు కూడా ఉన్నాయి కనుకే. అంటే, తేడాల మధ్యనే పోలికలను గుర్తిస్తున్నామన్నమాట. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సుసూక్ష్మమైన పోలికలను చూద్దాం:

మొదటి పోలిక

రెండు కథలూ ఎటువంటి దేవతారోపాలూ లేని ఇద్దరు మానవుల గురించి, అందులోనూ ఇద్దరు పురుషుల గురించి చెబుతున్నాయి. ఆ చెప్పడంలో మళ్ళీ ఒక తేడా ఉంది. నలుని ఉదాసీనంగానూ, విధి లేదా ఒక అదృశ్యశక్తి అతని కష్టాలకు కారణమైనట్టుగానూ కథకుడు చిత్రిస్తున్నాడు. అతణ్ణి విధి చేతిలో పావుగానే తప్ప, కష్టాల నుంచి గట్టెక్కడానికి పురుష(మానవ) ప్రయత్నం చేసినవాడిగా చూపించడం లేదు. ఇందుకు భిన్నంగా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు, దమయంతి క్రియాశీలగా కనిపిస్తుంది. అంటే, దమయంతి అనే స్త్రీకి గల క్రియాశీల స్వభావాన్ని కథకుడు బహిర్గతం చేస్తూనే, దానిమీద పలచని తెర వేసి, నలుడు అనే పురుషుడి ముఖంగా కథ చెబుతున్నాడన్న మాట.

స్త్రీ, పురుష స్వామ్యాల కోణం నుంచి చూస్తే, భారతీయ తాత్వికతకు గల ప్రత్యేకతను ఇది వెల్లడిస్తుంది. ఎలాగంటే, సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యం మీద పురుషస్వామ్యాన్ని ప్రతిష్టించడమే ఇక్కడ జరిగింది కానీ, తాత్విక స్థాయిలో స్త్రీస్వామ్యాన్ని పూర్తిగా అణగదొక్కలేదు. అంతర్లీనంగా రెండు స్వామ్యాల మధ్య ఒక రాజీసూత్రం కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం భారతీయ స్వభావంలోనూ, చరిత్రలోనూ ఉంది. మనది నేటికీ బహుళ దేవీ, దేవుల ఆరాధనా రూపంలో బహురూప ఆస్తికత కొనసాగుతున్న దేశమని చెప్పుకున్నాం.

ఓడిసస్ నలుడికి భిన్నం. నలుడిలో ఉదాసీనత కనిపిస్తే, ఓడిసస్ లో క్రియాశీలత కనిపిస్తుంది. నలుడు ఎంత యోధుడో మనకు తెలియదు. కథకుడు ఆ కోణానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఓడిసస్ ను యోధుడిగా చూపించడానికి కథకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతను ట్రాయ్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత పన్నెండు ఓడలలో సహచరులను వెంటబెట్టుకుని సాహసయాత్ర ప్రారంభించాడు. ఒక పట్టణం మీద పడి జనాన్ని చంపి స్త్రీలను, సంపదను సహచరులతో కలసి పంచుకున్నాడు. యోధలక్షణంతోపాటు ఇది అతని పురుష, లేదా మానవ ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అతనికి పరీక్షలు, కష్టాల పరంపర ప్రారంభమవుతుంది. నలుడు ఎదుర్కొన్న పరీక్షలు, కష్టాల వెనుక ప్రతికూల(కలి), అనుకూల(కర్కోటకుడు) శక్తులు ఉన్నట్టే, ఓడిసస్ వెనుక కూడా (జియస్, పోసిడియన్, అయోలస్, హెర్మెస్) ఉన్నారు. అయితే, నలునికి భిన్నంగా ఓడిసస్ మానవీయమైన తెలివితోనూ, వీరత్వంతోనూ, పురుషకార్యంతోనూ కష్టాలనుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తాడు. నలుని విషయంలో కథకుడు విధిపాత్రను ప్రముఖంగా సూచిస్తున్నట్టు కనిపిస్తే; ఓడిసస్ విషయంలో పురుషయత్నాన్ని ప్రముఖంగా సూచిస్తాడన్నమాట.

ఓడిసస్ ఒంటి కన్ను రాక్షసుడైన పోలిఫెమస్ బారినుంచి బయటపడిన తీరే చూడండి. అతని చేత మద్యం తాగించి నిద్రపుచ్చడంలో, అతని కన్ను పొడిచేసిన తర్వాత పొట్టేళ్ళ కడుపుకు వేలాడుతూ తప్పించుకోవడంలో ఓడిసస్ బుద్ధిబలాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ తదుపరి ఘట్టంలో అయోలస్ అనే వాయుదేవుడినుంచి సహాయం పొందుతాడు. అయితే సహచరులు చేసిన తప్పువల్ల మళ్ళీ కష్టాల్లో పడతాడు. ఆ తర్వాత నరమాంసభక్షకులు ఉండే దీవికి చేరుకుని అక్కడ ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితుడవుతాడు. పదకొండు ఓడలను, ఎంతోమంది సహచరులను కోల్పోవడం రూపంలో అందుకు ప్రతిఫలం చెల్లించుకుంటాడు.

download

అక్కడినుంచి సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుని, తన సహచరులను ఆమె పందులుగా మార్చివేసినట్టు తెలిసి ఆమెను శిక్షించడానికి ఒక కత్తి తీసుకుని బయలుదేరతాడు. అప్పుడతనికి హెర్మెస్ అనే దేవుడి సాయం లభిస్తుంది. సిర్సేను లొంగదీసుకుని సహచరులను రక్షించుకోవడమే కాక, ఆమెతో పడకసుఖం కూడా పొందుతాడు. ఆమె సూచనపై అధోలోకానికి వెళ్ళి పితృదేవతలకు తర్పణం ఇస్తాడు. ఆ తర్వాత సౌరద్వీపానికి వెడతాడు, మరోసారి తుపానులో చిక్కుకుని, ఉన్న కొద్దిమంది సహచరులనూ, ఓడనూ కూడా కోల్పోతాడు. ఒంటరిగా ఇంకో దీవికి చేరి అక్కడ కలిప్సో అనే అప్సరసతో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. మళ్ళీ తెప్ప మీద బయలుదేరి విధ్వంసానికి గురై ఈదుకుంటూ వెళ్లి కొందరు బాలికల సాయంతో ఫేషియన్లను కలుస్తాడు. వారు అతణ్ణి ఓడలో క్షేమంగా స్వస్థలానికి పంపిస్తారు. అక్కడ అతను పెనెలోప్ స్వయంవరపరీక్షను వీరోచితంగా ఎదుర్కొని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు.

ఇలా అనుకూల శక్తులనుంచి సాయం పొందుతూనే ప్రతికూలశక్తులను బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ ఎదుర్కొంటూ అనేక కష్ట నష్టాలనుంచి పురుషప్రయత్నంతో బయటపడిన మానవమాత్రుడిగా ఓడిసస్ ను చిత్రించే కథకుని వ్యూహం అడుగడుగునా స్ఫురిస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా నలదమయంతుల కథలో ఇటువంటి బుద్ధిబలాన్ని సమయస్ఫుర్తిని దమయంతి ప్రదర్శిస్తుంది. రెండు కథల్లోనూ దేవతలపై మనిషిది పైచేయిగా చూపడం కనిపిస్తుంది. ఇంకొక విధంగా, చెప్పాలంటే దేవతల మధ్యలోంచి క్రియాశీలుడైన నరుడు ఆవిర్భవించడం గురించి ఈ కథలు చెబుతున్నాయి.

రెండవ పోలిక

ఇది మరింత సుసూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన పోలిక. ఇక్కడ జోసెఫ్ క్యాంప్ బెల్ తన విశ్లేషణలో పేర్కొన్న female principle అడుగుపెడుతుంది. ఆ మాటను ‘స్త్రీ సూత్రం’ గా అనువదించుకుందాం. ఓడిసస్ కథలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది కనుక ముందు దాని గురించి చెప్పుకుందాం. ఓడిసస్ కు– నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతి; సిర్సే, కలిప్సో అనే అప్సరస,లు నౌసికా అనే బాలిక, ఎథెనా అనే అనుకూల దేవత వరసగా తారసపడతారు. అందమైన యువతి రూపంలో అతనికి ఎదురై, సమ్మోహన పరచిన తొలి అనుభవం నరమాంసభక్షకుల రూపంలో పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చింది. ఆ తర్వాత ప్రతికూలశక్తిగా ఓడిసస్ కు ఎదురైన సిర్సే చివరికి అతనికి లొంగిపోయి అనుకూలశక్తిగా మారిపోయింది. అతను ఆమె పొందును అనుభవించడమే కాక ఆమె నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని మార్గదర్సనం కూడా పొందాడు. సిర్సే దగ్గరే అతని నగ్నత్వం గురించిన ప్రస్తావన వస్తుంది.

ఇక కలిప్సో మొదటినుంచీ అనుకూలత పాటించిన అప్సరస. ఆమెతో అతను ఎనిమిదేళ్ళు కాపురం చేయడానికి కారణం, మోహపాశంతో తనను బంధించివేసింది కనుకనే. ఆమెకు ఇష్టంలేకపోయినా ఆ పాశాన్ని తెంచుకుని బయటపడ్డాడు. సిర్సే దగ్గర ఎదురైన నగ్నత్వ భయానికి భిన్నంగా కలిప్సో దగ్గర అతనికి వస్త్రం లభించింది. మళ్ళీ నౌసికా అనే బాలిక తారసపడిన సందర్భంలో నగ్నత్వప్రస్తావన వచ్చింది. అప్పుడతను పూర్తి నగ్నంగా మారాడు. అయితే, ఆ బాలిక అతనికి వస్త్రం కూడా ఇచ్చి రాజభవనానికి తీసుకువెడుతుంది. చివరగా అతను కొడుకును, భార్యను కలసుకోడానికి ఎథెనా సాయపడుతుంది. ఈ ‘స్త్రీ సూత్రా’నికి కీలకమైన తాత్వికమైన వివరణ ఉంది. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

నలదమయంతుల కథకు వస్తే; ఈ స్త్రీ సూత్రం అన్నది ఓడిసస్ కథలో కనిపించినంత స్పష్టంగానూ, వివరంగానూ కాక, లీలగా ధ్వనిస్తూ ఉంటుంది. ఈ కథలో ప్రధాన స్త్రీపాత్ర దమయంతి ఒక్కతే. ఆమె అప్సరసో, లేక అందమైన అపరిచిత యువతో కాదు, నలునికి అర్థాంగి. కాసేపు ఆ సంగతిని పక్కన పెట్టి ఓడిసస్ కథలోని స్త్రీ సూత్రాన్ని ఆమెకు అన్వయించుకుని చూద్దాం. దమయంతిని వివాహమాడాకే నలునికి కష్టాలు మొదలయ్యాయి. ఆమెతో ఉన్నప్పుడే అతడు నగ్నంగా మారాడు. ఆమె చీరలోని అర్థభాగంతోనే తన నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. చివరికి ఆ చీరను తెంచుకుని బయటపడ్డాడు. తిరిగి దమయంతిని కలసుకున్న సందర్భంలోనే పోగొట్టుకున్న తన వస్త్రాన్ని మళ్ళీ సంపాదించుకుని, ధరించి నలుడిగా మారాడు. ఓడిసస్ కథలోనూ, ఈ కథలోనూ కూడా స్త్రీ సమక్షంలో పురుషుడి నగ్నత్వానికీ, వస్త్రానికీ ఏదో ప్రతీకాత్మక, తాత్విక ప్రాముఖ్యం ఉన్నట్టు అనిపిస్తుంది.

oedipus

ఈ నగ్నత్వ ప్రస్తావన వచ్చే మరో ప్రసిద్ధ కథ ఊర్వశీ-పురూరవులది. ‘నువ్వు ఎప్పుడైతే నాకు నగ్నంగా కనిపిస్తావో అప్పుడే నిన్ను విడిచి వెళ్లిపోతాను’ అని ఊర్వశి పురూరవుడికి షరతు పెడుతుంది. ఒకరోజున పురూరవుడు నగ్నంగా కనిపించేసరికి అతణ్ణి విడిచి వెళ్లిపోతుంది. ఈ కథకు వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చూద్దాం.

ఇక్కడ ఇంకొక విషయం గుర్తుచేసుకోవాలి. పైన చెప్పిన స్త్రీ సూత్రమూ, లేదా స్త్రీ స్వామ్య, పురుష స్వామ్యాలలో గ్రీకు తాత్వికతకు, భారతీయ తాత్వికతకు తేడా ఉందని చెప్పుకున్నాం. గ్రీకు తాత్వికతలోనే కాక సామాజిక స్థాయిలో కూడా స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య తీవ్ర ఘర్షణా, ఒకదానిపై ఒకటి పై చేయిని చాటుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో పురుషుడు విజయం సాధించి వీరుడిగా, క్రియాశీలిగా ఆవిర్భవించడం ఉన్నాయి. భారతీయ తాత్వికతలో స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య ఘర్షణతోపాటు సర్దుబాటు, సయోధ్య ఉంటూనే; సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యంపై పురుషస్వామ్యం పై చేయిని చాటుకోవడం ఉంది. అయితే, పురుషుని నరుడిగా, వీరుడిగా, క్రియాశీలిగా అవతరింపజేయడం భారతీయ, గ్రీకు సందర్భాలు రెండింటిలోనూ ఉమ్మడి అంశం.

ఈ కోణంలోకి వెళ్లినప్పుడు భారతీయ, గ్రీకు పురాణ కథలలోనే కాక; ప్రపంచ పురాణ కథలు అనేకంలో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బాబిలోనియా పురాణ కథలో మర్దుక్ అనే దేవుడు తియామత్ అనే స్త్రీశక్తిని, లేదా దేవతను చంపుతాడు. తియామత్ పై రాక్షసి అన్న ముద్ర పడుతుంది. అది, స్త్రీ స్వామ్యం నుంచి పురుషుడు వీరత్వంతో బయటపడి క్రియాశీలి అవడానికి ప్రతీక. మన రామాయణానికి వస్తే, రాముడు తాటక అనే రాక్షసిని చంపుతాడు. లక్ష్మణుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోస్తాడు. కృష్ణుడు పూతన అనే రాక్షసిని చంపుతాడు. ఇంద్రుడు ఉష అనే దేవతను చంపుతాడు. నరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అర్జునుడు పులోమ, కాలక అనే రాక్షసస్త్రీలను కాకపోయినా వారి సంతానాన్ని చంపుతాడు. ఊర్వశి అనే అప్సరసతో పొందుకు నిరాకరిస్తాడు. ఓడిసస్ సిర్సేను చంపకపోయినా ఆమెపై కత్తి దూస్తాడు.

అర్జునుని నరుడు అన్నట్టుగానే రామాయణంలో రాముని నరాంశను నొక్కి చెప్పడం కనిపిస్తుంది. ‘నేను దశరథ మహారాజు కొడుకుని, మనిషిని మాత్రమే’ నని రాముడు ఒక సందర్భంలో చెప్పుకుంటాడు. అలాగే రాముని ‘పురుషోత్తముడు’ అన్నారు. అంటే ప్రపంచ పరిణామంలో ఒక దశలో స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించి వీరుడు, సాహసి, క్రియాశీలుడైన నరుని ఆవిర్భవింపజేయవలసిన అవసరం కలిగిందని ఈ కథలన్నీ సూచిస్తున్నాయన్న మాట.

స్త్రీపై రాక్షసి అన్న ముద్ర వేయడమే కాక, పురుషుడి కష్టాలకు, అతడు ఆత్మన్యూనతలోకి, నిష్క్రియత్వంలోకి జారిపోవడానికి స్త్రీయే కారణమన్న సూచనను ఉద్దేశపూర్వకంగానో, అనుకరణప్రాయంగానో ఆయా పురాణ కథలు అందిస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్ని పోలికలు చూడండి…నలదమయంతుల కథలో నలుడు దమయంతిని పెళ్లాడిన తర్వాతే రాజ్యం కోల్పోయి కష్టపరంపరలో చిక్కుకుంటాడు. ప్రవాస జీవితం గడుపుతూనే బాహుకుడనే పేరుతో, వికృత వేషంలో, అంటే మారువేషంలో దమయంతి ‘పునస్స్వయంవరా’నికి వెడతాడు. పెనెలోప్ తో వివాహం అయిన తర్వాతే ఓడిసస్ యుద్ధానికీ, అక్కడినుంచి సముద్రంలో సాహసయాత్రకు బయలుదేరి వెళ్ళి పదేళ్లపాటు అనేక కష్టానష్టాలకు గురై చివరికి నోమన్ అనే మారుపేరుతో బిచ్చగాడి వేషంలో పెనెలోప్ పునస్స్వయంవరానికి వెడతాడు.

రాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళి అక్కడినుంచే నేరుగా సీతాస్వయంవరానికి వెళ్ళి సీతను వరిస్తాడు. ఆ తర్వాత పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేస్తాడు. అలాగే, పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లే ముందు బ్రాహ్మణ వేషాలలో అరణ్యవాసమే చేస్తున్నారు. ద్రౌపదితో వివాహం తర్వాతే వారు అర్థరాజ్యం పొందారు, ఆ రాజ్యాన్ని కోల్పోయి ఈసారి ద్రౌపదితోపాటు మళ్ళీ అడవుల పాలయ్యారు. వారు రాజ్యం కోల్పోవడం వెనుక ద్రౌపది పాత్ర కూడా ఎంతో కొంత ఉంది.

అయితే, ఈ పోలికలు అన్నీ అచ్చు గుద్దినట్టు ఒకే సూత్రాన్ని అనుసరించడంవల్ల కాకపోవచ్చు. కొన్ని కథానిర్మాణంలో అనుకరించిన స్థూలమైన పోలికలు కావచ్చు. స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం మాత్రం అన్నింటిలోనూ సమానం. ఉదాహరణకు, నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల నిర్మాణం స్థూలంగా ఒకలానే ఉంటుంది. కానీ నలదమయంతుల కథలో వాస్తవంగా క్రియాశీల అయిన దమయంతి ముఖంగా కాక, ఉదాసీనుడైన నలుని ముఖంగా కథ చెబుతుంటే; ఓడిసస్ కథలో ఓడిసస్ నే క్రియాశీలుడిగా చూపిస్తూ అతని ముఖంగా కథ చెబుతున్నాడు. స్త్రీ స్వామ్యంమీద పురుష స్వామ్యం పైచేయిని నొక్కి చెప్పడం రెండింటా సమానం. అదే మిగతా ఉదాహరణలలోనూ కనిపిస్తుంది.

రామాయణకథ తెలిసిన వారికి ఒక సందేహం కలిగితీరాలి. అదేమిటంటే, తాటక, పూతన తదితరులే కాక, రావణుని చెల్లెలు అయిన శూర్పణఖ కూడా రాక్షసి అయినప్పుడు రావణుని భార్య అయిన మండోదరి ఎందుకు కాలేదన్నది. పౌరాణిక సంప్రదాయం మండోదరిని పతివ్రతగానూ, ఉత్తమురాలిగానూ గుర్తిస్తుంది. దీనికి మనం చెప్పుకోగలిగిన తార్కిక సమాధానం బహుశా ఒక్కటే: స్త్రీస్వామ్యంలో ఉన్న స్త్రీలు రాక్షసులు, పురుష స్వామ్యాన్ని, పురుషుడి ఆధిపత్యాన్ని అంగీకరించిన వారు ఉత్తమురాళ్ళు, పతివ్రతలు అయ్యారన్నమాట!

అదలా ఉంచితే, ఇక్కడినుంచి మనం మరిన్ని తాత్వికపు లోతుల్లోకి వెళ్లవలసి ఉంటుంది. అది తర్వాత…

 -కల్లూరి భాస్కరం

నగ్నదేహాలతో నలుడూ, ఓడిసస్…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఓడిసస్, అతని సహచరులు మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ఈసారి సౌర(సూర్య)ద్వీపం వారి గమ్యం. అక్కడికి వెళ్లడానికి సిల్లా(Scylla), చరిబ్దిస్(Charybdis) అనే రెండు పరస్పర విరుద్ధాల మధ్య నుంచి సాగే ఒక మార్గం ఉంది. ఓడిసస్ దానిని ఎంచుకున్నాడు. ఈ మార్గాన్ని మనకు తెలిసిన భాషలో ‘ద్వైతమార్గం’ అందాం.

సౌరద్వీపం చేరుకున్నాక ఓడిసస్ నిద్రపోతుండగా అతని సహచరులు మానవ సహజమైన ఆకలితో ఆ ద్వీపంలోని అనేక పశువులను నరికి వండుకు తిన్నారు. ఆ తర్వాత అక్కడినుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. అంతలో ప్రచండమైన పడమటి గాలి వీచి పెనుతుపాను సృష్టించింది. ఓడనూ, ఓడిసస్ సహచరులనూ కూడా ముంచి వేసింది. ఓడ స్తంభానికి వేల్లాడి ఓడిసస్ ఒక్కడే ప్రాణాలు దక్కించుకున్నాడు.

అతని యాత్రలో ఇది పతాకఘట్టం!

ఓడిసస్ నీళ్ళ మీద తేలుతూ సిల్లా, చరిబ్దిస్ ల మధ్యగా తొమ్మిదిరోజులపాటు ప్రయాణించి పదో రోజున ఒగీగియా అనే దీవికి చేరుకున్నాడు. అక్కడ లేత పచ్చిక బయళ్ళు, పూతోటలు, ద్రాక్షతోటలు, పక్షుల కిలకిలారావాల మధ్య ఒక గుహలో కలిప్సో అనే అప్సరస నివసిస్తోంది. ఆమె తియ్యని గొంతుతో పాటలు పాడుతూ తన మగ్గం ముందు అటూ ఇటూ తిరుగుతూ బంగారపు కండెతో వస్త్రం నేస్తోంది.

ఓడిసస్ కు ఆమె ఆతిథ్యమిచ్చి తిరిగి అతను శక్తిని పుంజుకునేలా చేసింది . ఆమెతోనే అతను ఎనిమిదేళ్లు గడిపేశాడు. సిర్సే నేర్పిన పాఠాలను కలిప్సో సాహచర్యంలో మరింత ఒంటబట్టించుకున్నాడు. ఎట్టకేలకు ఆమెను విడిచి వెళ్ళే సమయం వచ్చింది. త్వరగా అతన్ని తదుపరి యాత్రలోకి ప్రవేశపెట్టమని హెర్మెస్ ద్వారా జియస్ కలిప్సోకు కబురుచేశాడు. ఆమె అయిష్టంగానే అంగీకరించింది. ఓడిసస్ ఒక తెప్పను నిర్మించుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె అతనికి స్నానం చేయించి చక్కటి దుస్తులు కట్టబెట్టింది. అతను వెడుతుంటే ఆమె ఒడ్డున నిలబడి వీడ్కోలు చెప్పింది.

అయితే, తన కొడుకు పోలిఫెమస్ కన్ను పొడిచేసినందుకు ఇప్పటికీ ఓడిసస్ మీద పోసిడిన్ కోపంగానే ఉన్నాడు. ఒక పెను తుపానును ప్రయోగించి ఓడిసస్ ఉన్న తెప్పను ధ్వంసం చేయించాడు. ఓడిసస్ రెండు పగళ్ళు, రెండు రాత్రులు ఈదుకుంటూ వెళ్ళి, ఫేషియన్లు అనే నౌకా నిపుణులు ఉండే ఒక దీవికి చేరుకున్నాడు. అప్పుడతను పూర్తి నగ్నంగా ఉన్నాడు. అదే సమయంలో నౌసికా అనే రాచబాలిక తన నేస్తాలతో కలసి ఆడుకోడానికి సముద్రతీరానికి వచ్చింది. వాళ్ళు ఆడుతున్న బంతి నీళ్ళలో పడిపోయింది. దాంతో అంతా కేకలు పెట్టారు. ఒక గుబురు మాటున ఉన్న ఓడిసస్ ఆ కేకలు విని, చెట్టుకొమ్మతో తన నగ్నత్వాన్ని కప్పుకుంటూ ఇవతలకు వచ్చాడు. అప్పుడా బాలికలు అతనికి కట్టుకోడానికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకెళ్ళారు.

ఆరోజు రాత్రి ఫేషియన్లు అతనికి విందు ఇచ్చారు. ఆ పదేళ్ళలో తను చేసిన సాహసయాత్రల గురించి, పడిన కష్టాల గురించి ఓడిసస్ వాళ్లకు చెప్పాడు. అతనిపై సానుభూతి చూపిన ఫేషియన్లు, అతను స్వస్థలానికి వెళ్ళడానికి ఒక ఓడను, సిబ్బందిని ఏర్పాటుచేశారు. అతను ఒళ్ళు మరచి సుఖంగా నిద్రపోయేవిధంగా ఓడను తీర్చిదిద్దారు. ఓడ కెరటాలపై ఊయలలూగుతూ సాగిపోతుంటే ఓడిసస్ తీయని గాఢనిద్రలోకి జారిపోయాడు. అదెంత గాఢనిద్ర అంటే, చావుతో సమానమైనంత! అంటే, ఓడిసస్ ఇప్పుడు మార్మిక జగత్తు నుంచి బాహ్యప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడన్నమాట. ఈ దశలో అతనికి మార్గదర్శనం చేసే బాధ్యతను ఎథెనే అనే దేవత స్వీకరించింది.

ఇలా ఉండగా, అక్కడ ఓడిసస్ భార్య పెనెలోప్ కు పునస్స్వయంవరం ఏర్పాటైంది. ఎంతోమంది వీరులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ పెనెలోప్ ప్రాసాదంలో ఆతిథ్యం పొందుతున్నారు. దాసీలతో వాళ్ళు కామకలాపాలలో మునిగి ఉన్నారు. దాంతో ఆ ప్రాసాదం ఓ వ్యభిచారగృహంగా మారిపోయింది. ఓడిసస్ కొడుకు తెలెమాకస్ వాళ్ళ మధ్య బరువెక్కిన హృదయంతో నిట్టూర్పులు పుచ్చుతూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఎథెనా మారువేషంలో వెళ్ళి తెలెమాకస్ కు కనిపించింది. అతనామెకు స్వాగతం చెప్పాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత, ‘నీ తండ్రి వస్తున్నాడు. అతనికి ఎదురువెళ్ళు’ అని ఎథెనా అతనికి సలహా ఇచ్చి ఫలానా మార్గంలో వెళ్ళమని చెప్పింది. అలా తండ్రీ-కొడుకు కలసుకునే ఏర్పాటు చేసింది.

untitled

 

ఆ తర్వాత ఆమె ఒక అందమైన రాకుమారుని వేషంలో సముద్రపు ఒడ్డున ఓడిసస్ కు కనిపించింది. ఆమె చేతుల్లో ఒక పొడవాటి ఈటె ఉంది. ఆమెను చూడగానే ఓడిసస్ కు ఎంతో సంతోషం కలిగింది. ఎథెనా అతన్ని ఒక బిచ్చగాడి రూపంలోకి మార్చేసింది. తండ్రీ, కొడుకులు ఒక పందుల కాపరి గుడిసెలో కలసుకున్నారు. ఆ తర్వాత ఓడిసస్ స్వగృహంలోకి అడుగుపెట్టాడు. అతన్ని అతని కుక్క, ఒక వృద్ధదాది తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేదు. అతని మీద గూఢచర్యం సాగించిన వృద్ధ దాది అతని మోకాలి మీద ఒక పంది చేసిన గాయాన్ని చూసి గుర్తుపట్టింది. ఓడిసస్ ఆమెను చూపులతోనే వారించి, అక్కడి అతిథులు దాసీలతో నిస్సిగ్గుగా సాగించే కామకలాపాలను కాసేపు గమనిస్తూ ఉండిపోయాడు.

ఆ తర్వాత స్వయంవరఘట్టం మొదలైంది. ఓడిసస్ కు చెందిన అత్యంత శక్తిమంతమైన వింటిని ఎత్తి పన్నెండు గొడ్డళ్లను ఎవడైతే ఛేదిస్తాడో అతన్ని పెనెలోప్ వరిస్తుంది… అదీ పరీక్ష! లక్ష్యాన్ని ఛేదించడం కాదు సరికదా, కనీసం వింటికి నారి కూడా బిగించలేక అంతా తెల్ల మొహం వేశారు. అప్పుడు బిచ్చగాడి రూపంలో ఉన్న ఓడిసస్ ముందుకు వచ్చాడు. అవలీలగా వింటిని పైకెత్తి నారి బిగించి పన్నెండు గొడ్డళ్ళనూ ఛేదించాడు. అతనికి దేవతల సహకారం కూడా లభించింది. ఆ తర్వాత అతను స్వయంవరంలో పాల్గొన్న వీరులను కూడా అంతం చేశాడు.

అతనే ఓడిసస్ అన్న సంగతి తెలిసిపోయింది. పెనెలోప్ భర్తను సమీపించి, ’శయ్యాగారం సిద్ధమవుతోం’దని చెప్పింది. ఆపైన, ‘ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మీ యాత్ర గురించీ, మీరు పడ్డ కష్టాల గురించీ అన్నీ నాకు చెప్పాలి’ అంది.

download

ఎథెనా

 

***

జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో విశ్లేషించిన ఓడిసస్ కథ చదువుతున్నప్పుడు నలదమయంతుల కథ గుర్తొచ్చి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. సరే, పరిమిత స్థాయిలో సీతా, ద్రౌపదీ స్వయంవరాలను కూడా ఈ కథ గుర్తు చేస్తున్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, నేను గమనించినంతవరకూ, మన పండిత లోకం ఈ పోలికలను గుర్తించి విస్తృతంగా చర్చించిన దాఖలా లేకపోవడం!

కేవలం స్థూలమైన పోలికలకే ఇంత ఆశ్చర్యపోవాలా, అవి యాదృచ్ఛికం కావచ్చు, లేదా మన కథలనే వాళ్ళు తీసుకుని ఉండచ్చని పాఠకులలో కొందరైనా ఈపాటికి అనుకుంటూ ఉంటారు. కానీ నాకు అర్థమైనంతవరకూ ఈ పోలికలు అంత ఆషామాషీ వ్యవహారం కావు. వాటి వెనుక కొన్ని సిద్ధాంతాలు, సూత్రీకరణలూ ఉన్నాయి. అంతకన్నా విశేషంగా కొన్ని తాత్విక సామ్యాలు ఉన్నాయి.

ఆ రకంగా చూసినప్పుడు నలదమయంతులు-ఒడిసస్ పెనెలోప్ ల కథలలో ఉన్న పోలికలను మూడు అంచెలలో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అవి: 1. స్థూలమైన పోలికలు. 2. సూక్ష్మమైన పోలికలు. 3. సుసూక్ష్మమైన పోలికలు.

స్థూలమైన పోలికలు

రెండు కథల్లోనూ భార్యాభర్తల మధ్య వియోగం సంభవించింది. భర్త ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రెండు కథల్లోనూ దేవతల ప్రమేయం ఉంది. రెండింటిలోనూ భార్య పునస్స్వయంవరం ఉంది. కాకపోతే, దమయంతి పునస్స్వయంవరం భర్తను తన దగ్గరకు రప్పించుకోడానికి అనుసరించిన ఒక చిట్కా మాత్రమే. కానీ పెనెలోప్ స్వయంవరం నిజంగా జరిగింది. అదొక్కటే తేడా. భర్త ఏళ్ల తరబడి దేశాలు పట్టిపోయి భార్యకు దూరమైనప్పుడు భార్య పునర్వివాహం చేసుకోవచ్చునన్న సామాజిక నీతిని రెండు కథలూ ప్రతిబింబిస్తూ ఉండచ్చు కానీ, నలదమయంతుల కథలో కథకుడు దమయంతి పునర్వివాహప్రయత్నాన్ని ఒక చిట్కాగా మార్చేసి దమయంతి పాతివ్రత్యానికి ప్రాధాన్యమిచ్చాడు. ఓడిసస్-పెనెలోప్ ల కథలో ఇందుకు భిన్నంగా జరిగింది. నిజానికి పెనెలోప్ కూడా పునస్స్వయంవరాన్ని ఒక చిట్కాగానే ప్రయోగించి ఉండచ్చు, ఆమె కూడా దమయంతిలానే పతివ్రత కావచ్చు. అలా అనుకున్నప్పుడు మహాభారత కథకుడు కథనంలో చూపిన ఒడుపును హోమర్ (పెనెలోప్ కు నిజంగా పున్స్స్వయంవరం జరిపించడం ద్వారా) చూపించలేకపోయాడనాలి. మొత్తానికి రెండుకథల్లోనూ భార్యాభర్తలు చివరికి ఒకటయ్యారు. కథ సుఖాంతమైంది. కథాచట్రానికి సంబంధించినంతవరకూ ఇవీ రెండుకథల మధ్య ఉన్న స్థూలమైన పోలికలు.

సూక్ష్మమైన పోలికలు

రెండు కథల వివరాలలోకి వెడితే తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించే మాట నిజమే. కానీ సూక్ష్మంగా చూస్తే పోలికలూ కనిపిస్తాయి. ఉదాహరణకు, నలుడి కష్టాలకు అడవి వేదికైతే, ఓడిసస్ కష్టాలకు సముద్రం వేదికైంది. బహుశా ఉభయుల ప్రాదేశిక నేపథ్యంలో ఉన్న తేడా ఇందుకు కారణం కావచ్చు. విస్తారమైన అడవులు ఉన్న భారతదేశ నేపథ్యం నలుడిది. గ్రీకులకు ఉన్న నౌకాయాన నేపథ్యం ఓడిసస్ ది.

ఇక రెండు కథల్లోనూ నగ్నత్వం, వస్త్రాల ప్రస్తావన ఏదో ఒక రూపంలో రావడం ఒక పోలిక. నలుడు పక్షులను పట్టుకోడానికి తన కట్టుబట్టను తీసి వాటిపై విసురుతాడు. అవి వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. అప్పుడు నలుడు నగ్నంగా అయిపోతాడు. దమయంతి చీరలో అర్థభాగాన్ని కట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకుంటాడు. కథ చివరిలో దమయంతిని తిరిగి కలసుకునే సందర్భంలో, తను దావానలం నుంచి కాపాడిన కర్కోటకుని తలచుకోవడం, పోయిన తన వస్త్రం తిరిగి అతని వద్దకు రావడం, దానిని కట్టుకోగానే నలునిగా మారిపోవడం జరుగుతాయి.

K11.11Hermes

హెర్మెస్

ఓడిసస్ కథకు వస్తే, అతడు సిర్సే అనే అప్సరస దగ్గరకు బయలు దేరినప్పుడు హెర్మెస్ అనే దేవుడు ఎదురై, ‘సిర్సేతో నువ్వు నిరభ్యంతరంగా పడకసుఖం అనుభవించు కానీ, ఆమె నిన్ను నగ్నంగా మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోకు’ అని హెచ్చరిస్తాడు. ఓడిసస్ కలిప్సో అనే మరో అప్సరస దగ్గరికి వెళ్లినప్పుడు ఆమె బంగారు కండెతో వస్త్రం నేస్తూ ఉంటుంది. ఎనిమిదేళ్లపాటు తనతో కాపురం చేసి ఓడిసస్ తిరిగి యాత్ర ప్రారంభించబోయే ముందు కలిప్సో అతనికి స్నానం చేయించి చక్కని వస్త్రం కట్టబెడుతుంది. పోసిడిన్ తను ప్రయాణించే తెప్పను ధ్వంసం చేయించినప్పుడు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిన ఓడిసస్, ఫేషియన్ల దీవికి నగ్నంగానే చేరుకుంటాడు. అక్కడ బాలికల కేకలు విని చెట్టు కొమ్మతో నగ్నత్వాన్ని కప్పుకుంటూ గుబురులోంచి బయటకు వస్తాడు. అప్పుడా బాలికలు అతనికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకువెడతారు.

పేరు మార్పులోనూ నలునికీ, ఓడిసస్ కూ పోలిక ఉంది. కర్కోటకుడు నలుని రూపాన్ని వికృతంగా మార్చివేయడమే కాకుండా అతని పేరు బాహుకుడిగా మార్చివేస్తాడు. ఓడిసస్ ఒంటికన్ను రాక్షసుడైన పోలిఫెమెస్ ను కలసినప్పుడు తన పేరు ‘నోమన్’ అని చెబుతాడు.

కథ చివరిలో దమయంతిని కలవబోయే ముందు నలుడూ, పెనెలోప్ ను కలవబోయే ముందు ఓడిసస్ మారువేషంలోనే ఉండడం ఇంకొక పోలిక. కర్కోటకుడు నలుని వికృతరూపిగా మార్చివేస్తే, ఎథెనా అనే దేవత ఓడిసస్ ను బిచ్చగాడిగా మార్చివేస్తుంది. బాహుకుడే నలుడు కావచ్చుననే అనుమానంతో దమయంతి కొడుకును, కూతురినీ కేశిని అనే పరిచారికతో బాహుకుని దగ్గరకు పంపించినట్టే, ఎథెనా ఓడిసస్ దగ్గరికి అతని కొడుకు తెలెమాకస్ ను పంపిస్తుంది. నలదమయంతుల కథలో కేశిని అనే పరిచారిక నలుని గుర్తించే ప్రక్రియలో భాగస్వామి అవుతుంది. అలాగే ఒక వృద్ధదాది ఓడిసస్ ను గుర్తుపడుతుంది. ఇది వేరొక పోలిక.

సుసూక్ష్మమైన పోలికల గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

హోమర్ చెప్పిన ‘నరు’ని కథ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)తమాషా ఏమిటంటే, బృహదశ్వుడనే ఆ ముని నలదమయంతుల కథంతా చెప్పి ధర్మరాజుకు అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు. అప్పటికే జూదమాడి రాజ్యం కోల్పోయి అడవుల పాలైన ధర్మరాజు ఇప్పుడా విద్యను ఏం చేసుకుంటాడు? పోనీ నలునిలా జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడా అంటే అదీ లేదు. యుద్ధంలో గెలుచుకున్నాడు.

అలాగే, నలదమయంతులది ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథ అనుకున్నామా…తీరా చూస్తే కథకుడు ఒకచోట కాస్త పరాకు పడ్డట్టున్నాడు. ఇంద్రాదుల మహిమతో అదృశ్యంగా ఉండి దమయంతి దగ్గరకు నేరుగా వెళ్ళిన నలుడు, ఆమె చెలికత్తెలకు ఎలా కనబడినట్టు?

సరే, విషయానికి వస్తే; నలదమయంతుల కథను నాలుగు పొరల్లో అన్వయించుకోడానికి అవకాశం ఉంది:

మొదటి పొర

ఇది మామూలుగా అందరికీ అర్థమైపోయే పొర. ఎటువంటి దేవతారోపాలూ లేని నలుడు-దమయంతి అనే సాధారణ మానవమాత్రుల జంట ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నలుడికి జూదమనే వ్యసనముంది. అతను జూదంలో రాజ్యంతోపాటు మొత్తం సంపదను అంతా కోల్పోయి భార్యతో సహా కట్టు బట్టలతో అడవుల పాలయ్యాడు. ఆ తర్వాత ఇద్దరికీ వియోగం సంభవించింది. ఇద్దరూ అష్టకష్టాలు పడ్డారు. చివరికి ఇద్దరూ మళ్ళీ ఒకటయ్యారు. తిరిగి అతనికి రాజ్యం లభించింది.

స్థూలంగా ఈ పొర మానవజీవితంలోనూ, సంసారంలోనూ ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి, మానవసంకల్పానికి వ్యతిరేకంగా విధి ఆడే ఆట గురించి, కష్టాలను వెన్నంటే సుఖాలూ ఉండడం గురించి, పురుషప్రయత్నంతో కష్టాల నుంచి గట్టెక్కడం గురించి చెబుతుంది.

ఇది పూర్తిగా ఇద్దరు మానవమాత్రుల గురించి చెబుతున్న కథ అన్నది, ఈ పొరలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వివరం.

రెండవ పొర

అదనంగా ఈ పొరలో ప్రధానంగా రెండు విషయాలలో కథకుడు అడుగుపెడుతున్నాడు. ఈ కథాచిత్రణ వెనుక తన ఉద్దేశాన్ని లేదా తన దృక్కోణాన్ని వెల్లడిస్తున్నాడు. మొదటిది, యాగాలు మొదలైన పుణ్యకార్యాలు చేయడం, శౌచం ఎంత ముఖ్యమో చెప్పడం. నలుని ఆవహించడం కలికి మొదట్లో సాధ్యం కాలేదు. ఎందుకంటే, అతడు పుణ్యకార్యాలు చాలా చేశాడు కనుక. కానీ, ఒకరోజు అతను మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు కనుక వెంటనే కలి ఆవహించాడు. అంటే శౌచం ఎంత ప్రధానమో కథకుడు చెబుతున్నాడు. అయితే, అదే కలి నలుని పాచికలలోకి తన బంటును అవలీలగా ప్రవేశపెట్టగలిగాడు. కారణం, జూదం అనేది ఎలాగూ చెడ్డ వ్యసనమే కనుక.

untitled

ఇక రెండవది, కష్టమైనా, సుఖమైనా; భర్త తప్పు చేసినా, ఒప్పుచేసినా అతనిని వెన్నంటి ఉండడమే భార్య ధర్మమనీ, ఆమే పతివ్రత అనీ దమయంతి పాత్ర ద్వారా చెప్పడం మీద కథకునికి ఆసక్తి. దమయంతి పతివ్రత కనుకనే తనను కామించిన కిరాతకుని శపించి చంపగలిగింది. అయితే, పునస్స్వయంవరానికి సిద్ధపడడంతో ఆమె పతివ్రతాగుణంపై నలునికి సందేహం కలిగింది. కేవలం అతనిని తన దగ్గరికి రప్పించే ఉద్దేశంతో ఒక్క ఋతుపర్ణునికి మాత్రమే పునస్స్వయంవరం గురించి వర్తమానం పంపించానని ఆమె చెప్పడంతో అతని సందేహం తీరిపోయింది.

అదే సమయంలో, భర్త ఏ కారణం చేతనైనా భార్యకు చాలాకాలంపాటు దూరంగా ఉన్నప్పుడు ఆమె పునర్వివాహం చేసుకోవచ్చునన్న ఒకనాటి సామాజికనీతినీ ఈ పునస్స్వయంవరం ప్రస్తావన వెల్లడిస్తూ ఉండచ్చు.

మూడవ పొర

ప్రకృతి లేదా స్త్రీ క్రియాశీల, పురుషుడు ఉదాసీనుడన్న సూత్రాన్ని ఈ పొరలో అన్వయించడానికి అవకాశం ఉంది. ఈ కథ నలుని ముఖంగానే చెప్పినట్టు, నలుని పాత్రే ఎక్కువ కొట్టొచ్చేలా ఉన్నట్టు పైకి అనిపిస్తుంది. కథకుడు పురుషప్రాధాన్యవాది అన్న విషయాన్ని ఇతర అంశాలు కూడా ద్రువీకరిస్తూనే ఉన్నాయి. కానీ కొంచెం నిశితంగా చూడండి…తమ ఇద్దరి సంబంధం విషయంలో దమయంతే ఎక్కువ చొరవ తీసుకున్నట్టు, నలుని తన వద్దకు రప్పించుకోవడంలో ఆమే ఎక్కువ క్రియాశీలంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతుంది.

దమయంతి మీద నలుడు మనసు పడినా తొలి చొరవ దమయంతిదే. ఆమె నలుని కోసం తపిస్తూ శుష్కించడం తెలిసి తండ్రి నలుని రప్పించడానికే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. నలుడు స్వయంవరానికి బయలుదేరడమైతే బయలుదేరాడు కానీ, ఇంద్రాదులు ఎదురై తమ తరపున దూతగా వెళ్ళి తమలో ఒకరిని పెళ్లాడమని దమయంతికి చెప్పవలసిందిగా కోరినప్పుడు అతను వారి కోరిక తీర్చడానికి దమయంతిని వదలుకోడానికి సిద్ధపడ్డాడు. ఆడిన మాట తప్పవని తెలిసే నిన్ను ఈ కోరిక కోరామని ఇంద్రుడు అనేసరికి తన ప్రతిష్టను కాపాడుకోడానికి దమయంతినే త్యాగం చేయడానికి మొగ్గుచూపాడు. దమయంతిని కలసి ఇంద్రాదుల కోరిక చెప్పి, దేవతల ఆగ్రహం నుంచి తనను రక్షించమని నలుడు కోరడంలో దమయంతిపై వలపుమీద స్వార్థానిదే పై చేయి అయింది.

దమయంతి స్పందన వేరు. ఆమె ఎలాగైనా నలుని పెళ్లాడడానికే నిశ్చయించుకుంది. నలుని ప్రతిపాదనకు మొదట్లో దుఃఖంలో కూరుకుపోయినా వెంటనే తేరుకుని ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగా అని ఆలోచించింది. నలుడు ఆ ప్రయత్నమే చేయలేదు. ‘ఇంద్రాదుల సమక్షంలోనే నిన్ను వరిస్తాను, అప్పుడు నీకు ఆడి తప్పిన దోషం రా’దని ఉపాయం చెప్పింది. నలుడు చేసిందల్లా ఆమె మాటను ఇంద్రాదులకు చేరవేయడమే.

తీరా ఇంద్రాదులు నలుగురూ ఆమె ఎత్తుకు పై ఎత్తు వేసి నలుని రూపంలో ప్రత్యక్షమయ్యేసరికి వారిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుని, అసలు నలుని గుర్తించి అతని మెడలో దమయంతి దండ వేసింది. ఈవిధంగా నలుని పెళ్లాడడంలో క్రియాశీల పాత్ర దమయంతిదే కాని నలుడిది కాదు.

ఆ తర్వాత నలుడు జూదంలో సమస్తాన్నీ కోల్పోయి అడవి పాలైనప్పుడు కూడా దమయంతి అతనితోనే ఉంది. అందుకు భిన్నంగా ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెను విడిచేసి వెళ్ళినది నలుడే. అంటే, ఇక్కడ కూడా నలుడు తన మనోభావాలకే ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా స్వార్థాన్నే చాటుకున్నాడన్నమాట.

పుట్టింటికి చేరుకున్న దమయంతి నలుని తన వద్దకు రప్పించుకోవడంలోనూ అడుగడుగునా క్రియాశీలంగా వ్యవహరించింది. తల్లితో తండ్రికి చెప్పించి నలుని వెతకడానికి బ్రాహ్మణులను పంపించే ఏర్పాటు చేసింది. నలుడు అజ్ఞాతంగా ఉంటాడన్న సంగతిని ఆమె ఉహించడమే కాదు; భార్యను వదిలేసి వెళ్ళడం న్యాయమా అని వెళ్ళిన ప్రతిచోటా సభలలో ప్రశ్నించమనీ, దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చుననీ బ్రాహ్మణులకు చెప్పి పంపించింది. ఋతుపర్ణుని దగ్గర పనివాడుగా ఉన్న బాహుకుడనే వ్యక్తి తనకు సమాధానం చెప్పాడని తెలపగానే, తనకు ‘రెండు మూడు రోజుల్లో’ పునస్స్వయంవరం జరపబోతున్నట్టు ఋతుపర్ణుడు ఒక్కడికే కబురు అందేలా చూసింది. ‘రెండు మూడు రోజుల్లో’ అని అనిపించడం కూడా నలుని రప్పించే వ్యూహంలో భాగమే. నలుని కంటె వేగంగా రథం తోలగలిగినవారు ఇంకొకరు లేరని ఆమెకు తెలుసు. అంత తక్కువ వ్యవధిలో జరగబోయే పునస్స్వయంవరానికి అయోధ్యనుంచి వందల మైళ్ళ దూరంలో ఉన్న విదర్భకు ఋతుపర్ణుని ఎవరైనా తీసుకురాగలిగితే, అది నలుని గుర్తించడానికి ఒక ముఖ్యమైన ఆధారం అవుతుందని ఆ కబురు పంపేటప్పుడే దమయంతి అనుకుందన్నమాట. ఈవిధంగా దమయంతి క్రియాశీలగానే కాక ఎంతో ఉపాయశాలిగానూ వ్యవహరిస్తుంది. ఇక బాహుకుడే నలుడన్న సంగతిని నిర్ధారణ చేసుకోడానికి అతనితో దమయంతి ఆడిన మైండ్ గేమ్, అందులో విజయం సాధించడం ఆమె బుద్ధికుశలతకు పరాకాష్ట.

నాలుగవ పొర

ఇది సంక్లిష్టమే కాక, కొంత వివరంగా చెప్పుకోవలసిన పొర. ఇందులో కొన్ని తాత్విక అంశాలు చర్చలోకి వస్తాయి. అవి ఎలాంటివో తెలుసుకోవాలంటే, ఒక గ్రీకు ఇతిహాస కథతో నలదమయంతుల కథకు ఉన్న పోలికల గురించి మొదట చెప్పుకోవాలి. ఆ ఇతిహాసం, హోమర్ (క్రీ. పూ. 85౦) చెప్పిన ‘ఒడిస్సే’(Odissey). హోమర్ ఇలియడ్(Iliad) అనే మరో ప్రసిద్ధ ఇతిహాసాన్ని కూడా చెప్పాడు. అది ట్రాయ్ యుద్ధం గురించి. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓడిసస్(Odisseus) అనే యోధుడి కథ ‘ఒడిస్సే’. ఈ రెండూ ప్రతిపాదించే తాత్వికతలలో మౌలికమైన తేడా ఉంది. ముందుగా, జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో చర్చించిన ఒడిస్సే కథను వీలైనంత క్లుప్తంగా చెప్పుకుందాం.

ఓడిసస్ ఇథకా అనే ప్రాంతానికి చెందినవాడు. అతని భార్య పేరు పెనెలోప్. ఓడిసస్ ట్రాయ్ యుద్ధంలో పాల్గొంటాడు. ఆ యుద్ధం పదేళ్ళపాటు జరుగుతుంది. ఆ పదేళ్లూ అతను భార్యకు దూరమవుతాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అతను సహచరులను వెంటబెట్టుకుని పన్నెండు ఓడలలో సాహసయాత్ర ప్రారంభిస్తాడు. ముందుగా థ్రేసియన్లకు చెందిన ఇస్మారస్ అనే పట్టణంపై దాడి చేసి, జనాన్ని చంపేసి అక్కడి సంపదను, స్త్రీలను పంచుకుంటారు. అక్కడినుంచి తిరిగి యాత్ర ప్రారంభించిన తర్వాత జియస్ అనే దేవుడు పెద్ద తుపాను సృష్టిస్తాడు. ఓడ తెరచాపలు చిరిగి చీలికలు పీలికలైపోతాయి. అందరూ పూర్తిగా అదుపు తప్పి తొమ్మిదిరోజుల పాటు కెరటాలు ఎటు నెడితే అటు కొట్టుకుపోతారు. చివరికి తుపాను వారిని తెలిసిన ప్రపంచపు సరిహద్దులను దాటించి అజ్ఞాత ప్రపంచంలోకి తీసుకు వెడుతుంది.

పదో రోజున తామర పువ్వులు తినే(Lotus Eaters) జనం ఉండే భూమికి చేరుకుంటారు. ఓడిసస్ అనుచరులు తామర పువ్వులను తినగానే తామెవరో మరచిపోయి అక్కడినుంచి రావడానికి నిరాకరిస్తారు. ఓడిసస్ వాళ్ళను బలవంతంగా ఓడల్లోకి లాక్కువెళ్ళి, కట్టిపడేసి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు.

ఇప్పుడు అడుగడుగునా కష్టాలు, పరీక్షలు ఎదురయ్యే ఒక మార్మిక ప్రపంచంలోకి ఓడిసస్, అతని ఓడలు అడుగుపెట్టాయి. మొదట వారు ఒంటి కన్ను రాక్షసులు ఉండే భూమికి చేరుకుంటారు. వాళ్ళలో ఫోలిఫెమెస్ అనేవాడు మరింత భీకరంగా ఉంటాడు. అతను పోసిడన్ అనే దేవుడి కొడుకు. పోసిడస్ సముద్రంలో పెద్ద పెద్ద అలలకు ప్రభువు. మన వరుణదేవుడి లాంటివాడు. తన పొట్టేళ్ళ మందతో కలసి పోలిఫెమెస్ ఒక గుహలో నివసిస్తూ ఉంటాడు. ఓడిసస్ తన సహచరులలోంచి మెరికల్లాంటి వాళ్ళను పన్నెండుమందిని వెంటబెట్టుకుని ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. లోపల పుష్కలంగా వెన్న, మీగడ, ;పాలు; గొర్రెల మందలు ఉంటాయి. కాసేపటికి ఒంటికన్ను రాక్షసుడు వస్తాడు. అతణ్ణి చూడగానే భయపడి అంతా దాక్కుంటారు. రాక్షసుడు వాళ్ళను కనిపెట్టి అతిపెద్ద బండరాయితో గుహను మూసేసి వాళ్ళలో ఆరుగురిని తినేస్తాడు. ఓడిసస్ వాడికొన ఉన్న ఒక గుంజను సిద్ధం చేసుకుంటాడు. తర్వాత రాక్షసుడి దగ్గరికి వెళ్లి, తన పేరు నోమన్ అని చెప్పి అతనికి ద్రాక్షసారా ఉన్న ఒక పెద్ద తోలుతిత్తిని ఇస్తాడు. రాక్షసుడు ఆ సారా తాగేసి నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు ఓడిసస్ గుంజతో అతని కన్ను పొడిచేస్తాడు. రాక్షసుడు పెడబొబ్బలు పెడుతూ చేతులతో తడుముకుంటూ వెళ్లి గుహను మూసిన బండరాయిని తొలగించి ప్రవేశమార్గంలో తను కూర్చుంటాడు. ఓడిసస్, మిగిలిన ఆరుగురు భారీ పొట్టేళ్ల కడుపుకు వేల్లాడుతూ బయటపడతారు.

అక్కడినుంచి ఓడలలో బయలుదేరి అయోలస్ అనే వాయుదేవుడి దీవికి చేరుకుంటారు. ఆ దీవిలో అయోలస్ ఆరుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళతో నివసిస్తూ ఉంటాడు. కొడుకులకు కూతుళ్ళనే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతను ఓడిసస్ కు తొమ్మిదేళ్ళ వయసున్న ఒక ఎద్దు చర్మంతో చేసిన సంచీలో ప్రయాణానికి తోడ్పడే రకాల వాయువులనుల కట్టి ఇస్తాడు. ఆ తర్వాత బలమైన పడమటి గాలి వీచి ఓడలను వేగంగా ముందుకు తీసుకు వెళ్ళేలా చేశాడు. పదో రోజుకు స్వస్థలానికి దగ్గర అవుతుండగా, ఓడిసస్ నిద్రపోతుండడం చూసి అతని సహచరులు ,అయోలస్ ఇచ్చిన తోలుసంచిలో ఏవో నిధి నిక్షేపాలు ఉంటాయనుకుని దానిని తెరుస్తారు. అంతే, ఒక ప్రచండ వాయువు వీచి ఓడలను అయోలస్ దీవికే తిరిగి తీసుకొస్తుంది. ఈసారి వారికి ఆతిథ్యమివ్వడానికి, సహకరించడానికి అయోలస్ తిరస్కరిస్తాడు.

భగ్నహృదయాలతో అందరూ తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ఈసారి ఏ వాయువూ వారికి సహకరించదు. ఏడో రోజున నరమాంస భక్షకులు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితులైపోతారు. ఆమె ఆ దేశపు రాజుగారి కూతురు. వారిని తన ఇంటికి తీసుకెడుతుంది. ఆమె తల్లిదండ్రులు ఒక పర్వతం ఆకారంలో భయంకరంగా ఉంటారు. తండ్రి ఓడిసస్ బృందంలో ఒకడిని పట్టుకుని తినబోతుంటే అందరూ భయపడి ఒడ్డుకు పరుగెడతారు. తండ్రి సింహనాదం చేయగానే అన్ని వైపుల నుంచీ లెక్కలేనంత మంది నరమాంస భక్షకులు వచ్చి వీరి మీద పడతారు. ఎంతో మందిని చంపేస్తారు. ఒక్క ఓడిసస్ ఓడను తప్ప మిగిలిన ఓడలను ధ్వంసం చేసేస్తారు.

Circe_by_cemac

గ్రీకు అప్సరస సిర్సే

 

 

ఓడిసస్ మిగిలిన సహచరులతో కలసి తిరిగి యాత్ర్ర ప్రారంభిస్తాడు. సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుంటాడు. సిర్సే సూర్యుని వల్ల సముద్రానికి కలిగిన కూతురు. మానవాళికి వెలుగునిచ్చేది ఆమే. ఓడిసస్ పంపించిన మనుషులు అడవిలోకి వెళ్లి నునుపు రాళ్ళతో కట్టిన సిర్సే భవంతిని సమీపిస్తారు. ఆ భవంతికి అన్ని వైపులా తోడేళ్లు, సింహాలు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి ఏదో మందు పెట్టడంతో అవి పూర్తిగా సాధుజంతువులుగా మారిపోయాయి. ఓడిసస్ సహచరులను చూసి అవి పెంపుడు కుక్కలలా తోక ఊపాయి. వారికి లోపలినుంచి తియ్యని గొంతుతో సిర్సే పాడుతున్న పాట వినిపించింది. వారు ఆమెను పిలిచారు. ఆమె బయటికి వచ్చి వాళ్లందరినీ లోపలికి ఆహ్వానించింది. వారంతా మంత్రించినట్టుగా లోపలికి వెళ్లారు. యురిలోకస్ అనే అతనికి మాత్రం ఇందులో ఏదో కుట్ర ఉందన్న అనుమానం కలిగి బయటే ఉండిపోయాడు. సిర్సే ఎత్తైన ఆసనాల మీద అందరినీ కూర్చోబెట్టి మందు కలిపిన ఆహారమూ, మద్యమూ ఇచ్చింది. దాంతో వారు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. సిర్సే వారిని మంత్రదండంతో తాకి పందులుగా మార్చేసి వారి ముందు పందులు తినే ఆహారం వేసింది.

ఇది చూసి భయపడిన యురిలోకస్ వెళ్ళి ఈ సంగతి ఓడిసస్ కు చెప్పాడు. ఓడిసస్ ఒక పెద్ద కంచు ఖడ్గాన్నీ, విల్లమ్ములను తీసుకుని సిర్సే భవంతికి బయలుదేరాడు. హెర్మెస్ అనే దేవుడు ఒక యువకుని రూపంలో, స్వర్ణదండం పట్టుకుని అతనికి ఎదురయ్యాడు. సిర్సే మాంత్రికతనుంచి అతన్ని కాపాడే ఒక దివ్యమైన మూలికను ఇచ్చాడు.

“సిర్సే నిన్ను మంత్రదండంతో తాకడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఆమె మీదికి కత్తి దూయి. అప్పుడామె వెనక్కి తగ్గి తనతో పడక సుఖాన్ని అనుభవించమని కోరుతుంది. అందుకు సందేహించకు. తన అందచందాలతో ఆమె నిన్ను అలరించి సుఖపెడుతుంది. అయితే నీపట్ల ఎలాంటి మోసానికీ పాల్పడనని ముందే దేవుడి సాక్షిగా ఆమె చేత ప్రమాణం చేయించు. ముఖ్యంగా ఆమె నిన్ను పూర్తి నగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ససేమిరా ఒప్పుకోకు” అన్నాడు.

ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. సిర్సే అతనికి లొంగిపోయింది. తను పందులుగా మార్చిన ఓడిసస్ సహచరులను తిరిగి మనుషులుగా మార్చేసింది. వారు వెనకటి కంటే యవ్వనవంతులుగా, అందగాళ్ళుగా మారిపోయారు. ఓడిసస్ సిర్సే పొందులోనే ఎనిమిదేళ్లు గడిపేశాడు. ఆ తర్వాత సిర్సే,

“నువ్విప్పుడు ఇంకో యాత్ర చేయాలి. అధోలోకానికి( అంటే మన పాతాళం అన్నమాట)వెళ్ళాలి. అక్కడ హేడ్స్, భయం గొలిపే పెరెస్ఫోన్ ఉంటారు. భవిష్యత్తును చెప్పే తేబన్ టిరేసియస్ కూడా ఉంటాడు. అతన్ని ప్రసన్నం చేసుకోవాలి. నీకు మేలు జరుగుతుంది.” అని చెప్పి అతనికి మార్గదర్శనం చేసింది.

ఓడిసస్ తిరిగి ఓడలో బయలుదేరి ప్రపంచం అంచులకు పయనించాడు. సిమ్మేరియన్లు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం పొగమంచుతోనూ, మేఘాలతోనూ కప్పబడి ఉంది. అక్కడ నిరంతరం రాత్రే కానీ పగలు లేదు. ఓడిసస్ అక్కడ ఒక కందకంలో– అంటే ఊర్ధ్వమార్గంలో కాకుండా– అధోమార్గంలో పితృదేవతలకు తర్పణం విడిచాడు. అన్నివైపుల నుంచి ప్రేతాత్మలు వచ్చి ఆశ్చర్యంతో కేకలు పెట్టాయి. అక్కడ ఓడిసస్ తన తల్లిని, టెరేసియస్ ను, ఫియడ్రాను, అగమెమ్నాన్ ను, యాచిలెస్ ను, క్రీటు రాజు మినోస్ ను, ఇంకా ఎందరో పితృదేవతలను, దండం పుచ్చుకుని మృతులకు శిక్షలు విధించే జియస్ కొడుకును (మన యముడన్న మాట) దర్శించాడు. అయితే, పెరెస్ఫోన్ వల్ల తనకు హాని జరుగుతుందేమోనని భయపడి తిరిగి సిర్సే దగ్గరికి వచ్చాడు. ఆమె నుంచి అంతిమ ఆదేశాలు పొంది తిరిగి యాత్ర ప్రారంభించాడు.

మిగతా కథ, విశేషాలు తర్వాత….

-కల్లూరి భాస్కరం

 

 

 

దమయంతి ఆడిన ‘మైండ్ గేమ్’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతుల కథ ఇదీ…

దమయంతి గురించి నలుడూ, నలుడి గురించి దమయంతీ విన్నారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఓ రోజు దమయంతి గురించే తలపోస్తూ నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అంతలో ఒక హంసల గుంపు ఎగురుతూ వచ్చి అతని ముందు వాలింది. వాటిలో ఒక హంసను అతను పట్టుకున్నాడు. ‘నన్ను విడిచిపెడితే నీ గుణగణాలను దమయంతికి చెప్పి నీ మీదే ఆమెకు ప్రేమ కలిగేలా చేస్తా’నని హంస అంది. నలుడు దానిని విడిచి పెట్టాడు.

గుంపుతో కలసి హంస విదర్భపురానికి వెళ్ళి ఉద్యానవనంలో చెలికత్తెలతోపాటు విహరిస్తున్న దమయంతి ముందు వాలి, కావాలని ఆమె చేతికి చిక్కింది. ‘నీ ప్రియతముడైన నలుడి దగ్గరనుంచి వచ్చాను. నేను ఎంతోమంది రాజుల్ని చూశాను. సకలగుణసౌందర్యంలో నలుడికి ఎవరూ సాటి రారు. నువ్వు నారీరత్నం, అతను పురుషరత్నం. మీ కలయిక ఇద్దరికీ మరింత శోభనిస్తుంది’ అంది.

దమయంతి సంతోషించింది. ‘నలుడి గురించి నాకు చెప్పినట్టే, నా గురించి కూడా నలుడికి చెప్పవా’ అని ప్రార్థించింది. హంస మళ్ళీ నలుడి దగ్గరకు వెళ్ళి దమయంతి గుణ రూపాలను వర్ణించి చెప్పింది. అప్పటినుంచీ ఇద్దరిలోనూ పరస్పర అనురక్తి పెరిగిపోయింది. ఎంతసేపూ నలుడి తలపులతోనే గడుపుతూ దమయంతి నిద్రాహారాలకు దూరమై శుష్కించింది. చెలికత్తెలు భయపడి ఆమె తండ్రి భీముడికి ఈ విషయం చెప్పారు. నలుని ఎలా రప్పించాలా అని ఆలోచించి అతను కూతురికి స్వయంవరం చాటించాడు.

రాజులందరూ ఆ స్వయంవరానికి బయలుదేరి వెళ్లారు. అలాగే నలుడూ బయలుదేరాడు. ‘యుద్ధంలో వీరమరణం చెంది స్వర్గానికి వచ్చి సకల సుఖాలూ అనుభవించడం రాజులకు పరిపాటి కదా, ఇప్పుడు ఎందుకు రావడం లే’దని ఇంద్రుడికి అనుమానం వచ్చింది. నారదుని కారణం అడిగాడు.  ‘అతిలోక సుందరి అయిన దమయంతికి స్వయంవరం జరుగుతోంది, రాజులందరూ పరస్పర కలహాలు విడిచిపెట్టి, స్వయంవరానికి వెడుతున్నారు. అందుకే స్వర్గానికి రావడం లే’దని నారదుడు చెప్పాడు.

దాంతో ఆ స్వయంవరాన్ని చూడాలని ఇంద్రుడు కూడా వేడుక పడ్డాడు. అగ్ని, యమ, వరుణులతో కలసి భూలోకానికి వచ్చాడు. వారికి నలుడు కనిపించాడు. ‘మా తరపున దూతగా వెళ్ళి, మేము చెప్పినట్టు చేస్తావా?’ అని ఇంద్రుడు అతన్ని అడిగాడు. ‘తప్పకుండా! ఏం చేయమంటారో చెప్పండి’ అని నలుడు అన్నాడు. ‘దమయంతి దగ్గరకు వెళ్ళి మాలో ఒకరిని వరించమని చెప్పా’ లని ఇంద్రుడు అన్నాడు. నలుడు విస్తుపోయాడు. ‘నేను కూడా అందుకే వెడుతున్నాను. మీకు ఆ సంగతి తెలిసీ ఇలా కోరడం న్యాయమా?’అన్నాడు. ‘నువ్వు ఇచ్చిన మాట తప్పవని తెలిసి ఈ కోరిక కోరాం. ఇది దేవతలకు ఇష్టమైన కార్యం, కాదనకుండా చేసిపెట్టు. నేరుగా రాజగృహంలోకి ఎలా వెడతాననే సందేహం పెట్టుకోకు. నిన్ను ఎవరూ అడ్డుకోరు’ అన్నాడు ఇంద్రుడు.

చేసేది లేక నలుడు దమయంతి మందిరానికి చేరుకున్నాడు. అతణ్ణి చూసి చెలికత్తెలు అదిరిపడి, ఇతడెవరా అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. నలుడు తనను దమయంతికి పరిచయం చేసుకుని,’ఇంద్ర, అగ్ని, యమ, వరుణ దేవులు నన్ను నీ దగ్గరకు దూతగా పంపించారు. తమలో ఒకరిని పెళ్ళాడి, తమ అందరికీ సంతోషం కలిగించమని చెప్పమన్నారు’ అన్నాడు.

ఆ మాట వినగానే దమయంతి దుఃఖంతో కుప్పకూలింది. ‘నేనెక్కడ…ఇంద్రాది దేవతలెక్కడ? నేనెప్పుడూ వాళ్ళకు మొక్కుతూ ఉంటాను. నేను నీ ధనాన్ని. నీ కోసమే స్వయంవరం పేరుతో రాజులందరినీ ఇక్కడికి రప్పించాను. నువ్వే నా భర్తవు. నువ్వు ఒప్పుకోకపోతే ఉరేసుకునో, విషం తాగో, అగ్నిలో దూకో ఆత్మహత్య చేసుకుంటాను’ అంది.

‘మహాశక్తిమంతులు, లోకపాలకులు, సంపన్నులు, తేజస్వులు అయిన దేవతలను కాదని; వారి పాదధూళిపాటి కూడా చేయని నా లాంటి మనుష్యుని కోరుకుంటావా? దేవతల ఇష్టం తీర్చకపోతే మనుషులు అధోగతి చెందుతారు. కనుక వారికి ఇష్టం కలిగించి నన్ను కాపాడు’ అని నలుడు అన్నాడు.

దమయంతి చెక్కిళ్లపై కన్నీరు ధారలు కట్టింది. చాలాసేపు దుఃఖిస్తూ ఉండిపోయి, ఆ తర్వాత, ‘నీకు ఆడి తప్పిన దోషం కలగని ఒక ఉపాయం తట్టింది. ఇంద్రాదులు స్వయంవరానికి వస్తే, వాళ్ళ ఎదుటే నిన్ను వరిస్తాను’అంది. నలుడు ఇంద్రాదుల దగ్గరకు వెళ్ళి దమయంతి అన్న మాటలు చెప్పాడు.

‘నలుని తప్ప ఇంకొకరిని వరించదట! ఎలా వరించదో చూద్దాం’ అని ఇంద్రాదులు నలుగురూ అనుకుని నలుని రూపంలోనే స్వయంవరానికి వెళ్లారు. ఎదురుగా అయిదుగురు నలులు ఉండడంతో, అసలు నలుని ఎలా గుర్తించాలో తోచని దమయంతి, మీరే మీ నిజరూపాలను ధరించి నలుని గుర్తించేలా చేయండని దేవతలను ప్రార్థించింది. దాంతో, రెప్పపాటులేని కళ్ళతో, చెమట లేని దేహాలతో, భూమిని అంటని పాదాలతో నలుగురూ ఆమెకు కనిపించారు. ఆమె అసలు నలుని మెడలో దండ వేసింది.

ఇద్దరికీ వివాహం జరిగిపోయింది.

***

ఇంద్రాదులు తిరిగి దేవలోకానికి బయలుదేరారు. దారిలో వారికి కలి ఎదురయ్యాడు. ఎక్కడికి వెడుతున్నావని ఇంద్రాదులు అడిగారు. ‘దమయంతి స్వయంవరానికి’ అని కలి చెప్పాడు. ‘ఇంకెక్కడి స్వయంవరం? అది అయిపోయింది. దమయంతి నలుడనే వాడిని వరించిం’దని వారు చెప్పారు. దాంతో కలికి నలుడి మీద కోపం వచ్చింది. అతన్ని రాజ్యభ్రష్టుని చేయడానికీ, ఆ దంపతులకు వియోగం కల్పించడానికీ నిర్ణయించుకున్నాడు. నలుడు ద్యూతప్రియుడనే సంగతి తెలిసి అతని పాచికలలోకి ప్రవేశించమని ద్వాపరం అనే తన బంటును నియోగించాడు. తను నలునిలో ప్రవేశించాలని చూశాడు కానీ, నలుడు యాగాలు మొదలైన పుణ్యకర్మలు చేసినవాడు కావడంతో అది సాధ్యం కాలేదు. అదను కోసం కలి నిరీక్షిస్తుండగా, ఒక రోజున నలుడు మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మరచిపోయి సంధ్యావందనానికి ఉపక్రమించడంతో ఇదే అదను అనుకుని కలి అతనిలో ప్రవేశించాడు. ఆ తర్వాత పుష్కరుడు అనే వాడి దగ్గరకు వెళ్ళి, ‘నువ్వు నలుడితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలుచుకో’ అని చెప్పాడు. అతనికి సహాయకుడిగా వృషుడు అనే వాడిని ఇచ్చి, పాచికలు తీసుకుని తను కూడా పుష్కరునితో కలసి నలుడు దగ్గరికి వెళ్ళి తమతో జూదమాడమని ఆహ్వానించాడు.

కొన్నేళ్లపాటు నలుడు జూదానికి బానిసై చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ లోపల అతనికి ఇంద్రసేనుడు అనే కొడుకు, ఇంద్రసేన అనే కూతురు కలిగారు. దమయంతి పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపేసి తను నలుడితో ఉండిపోయింది. ఇద్దరూ కట్టుబట్టలతో మిగిలి రాజధానిని విడిచిపెట్టారు. మంచినీళ్ళతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఒక రోజు తన ఎదురుగా బంగారు రెక్కలతో తిరుగుతున్న కొన్ని పక్షులను చూసి, వాటిని పట్టి ఆకలి తీర్చుకోవచ్చు ననుకుని తన కట్టుబట్టను నలుడు వాటిపై విసిరాడు. అవి బట్టతో సహా ఎగిరిపోయి, ‘నీ రాజ్యాన్ని, ధనాన్ని హరించిన పాచికలమే మేము. నీ వస్త్రాన్ని కూడా అపహరించడానికి ఇలా పక్షి రూపంలో వచ్చా’మని చెప్పాయి.

నలుడు దమయంతి చీరచెరగును తనకు చుట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. ఇద్దరూ ఒకే వస్త్రంతో అడవి దారి పట్టారు. ఆకలి, దాహాలకు తోడు; నడిచి నడిచి అలసిపోయిన దమయంతి ఒకచోట ఆదమరచి నిద్రపోతున్న సమయంలో నలుడు తను కట్టుకున్న చీర భాగాన్ని తెంచుకుని ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నిద్రలేచి భర్తను వెతుక్కుంటూ వెడుతున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఒక కిరాతుడు కొండచిలువను చంపి ఆమెను కాపాడాడు. ఆ తర్వాత అతను తన పొందు కోరేసరికి ఆగ్రహించిన దమయంతి అతన్ని చావమని శపించగా అతను చచ్చి పడిపోయాడు. ఆమె భర్తను వెతుక్కుంటూ ఒక మునిపల్లె చేరుకుంది. అక్కడి మునులు, ‘నీ భర్త కనిపిస్తాడు. కష్టాల నుంచి గట్టెక్కుతారు’ అని ఆమెకు భవిష్యత్తు చెప్పి అదృశ్యమయ్యారు. దమయంతి ముందుకు వెడుతుండగా ఒక వ్యాపారుల బృందం కనిపించింది. వారు సుబాహు అనే రాజు నగరానికి వెడుతున్నామని చెప్పగా ఆమె వారి వెంట వెళ్లింది. వ్యాపారులు దారిలో ఒక చోట నిద్రపోతుండగా ఒక మదపు టేనుగు వారిలో కొందరిని తొక్కి చంపేసింది. మిగిలినవారితో కలసి దమయంతి చివరికి సుబాహు నగరానికి చేరుకుంది. రాజమాత ఆమెను చూసి, దాదిని పంపి తన దగ్గరకు పిలిపించుకుని వివరాలు అడిగింది. దమయంతి భర్తకు దూరమయ్యానని మాత్రం చెప్పి సైరంధ్రీ వ్రతంలో ఉన్నా నంది. ‘బ్రాహ్మణులను పంపి నీ భర్తను వెతికిస్తాను. నువ్వు నా దగ్గర ఉండు’ అని రాజమాత అంది. దమయంతి ఒప్పుకుంది.

untitled

***

నలుడు దారుణ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక రోజున అడవి అంటుకుని ఆకాశానికి అంటేలా మంటలు లేచాయి. ఒక నాగకుమారుడు ఆ మంటల్లో చిక్కుకుని చేస్తున్న ఆర్తనాదాలు నలునికి వినిపించాయి. అతను వెంటనే మంటల మధ్యలోకి వెళ్ళి నాగకుమారుణ్ణి రక్షించాడు. తన పేరు కర్కోటకుడనీ, ఒక ఋషి శాపం వల్ల కదలలేననీ, తనను ఎత్తుకుని ఒక సరోవరం తీరంలో విడిచిపెట్టవలసిందని అతను కోరాడు. నలుడు అలాగే చేశాడు. అప్పుడు కర్కోటకుడు అతన్ని కాటేశాడు. దాంతో నలుడు పాత రూపం కోల్పోయి వికృతరూపిగా మారిపోయాడు. ‘నీ మంచి కోసమే నేను ఇలా చేశాను. నీ శరీరంలో నా విషం ఉన్నంతకాలం నీకు ఎవరి వల్లా ప్రాణహాని ఉండదు. నీకు యుద్ధాలలో విజయమూ, భార్యతో కలయికా, రాజ్యవైభవమూ కలుగుతాయి. నీ నిజరూపాన్ని ఎప్పుడు పొందాలనుకుంటే అప్పుడు నన్ను తలచుకో. నువ్వు పోగొట్టుకున్న వస్త్రం నీ దగ్గరకు వస్తుంది, దానిని ధరించగానే నీ నిజరూపం వస్తుంది. అయోధ్యా నగరంలో ఇక్ష్వాకువంశస్థుడైన ఋతుపర్ణుడనే రాజు ఉన్నాడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి అతనికి నీకు తెలిసిన అశ్వహృదయ మనే విద్యను ఇచ్చి అతని దగ్గరనుంచి అక్షహృదయ మనే విద్య తీసుకో. బాహుకుడు అనే పేరుతో అతని దగ్గర వంటవాడిగా ఉండు’ అని కర్కోటకుడు చెప్పి అదృశ్యమయ్యాడు.

నలుడు ఋతుపర్ణుని కలసుకుని, తను అశ్వశిక్షలోనూ, వంటలోనూ నేర్పరిననీ, నీ కొలువులో చేర్చుకోవలసిందనీ కోరాడు. ఋతుపర్ణుడు అంగీకరించి అతన్ని అశ్వాధ్యక్షుడిగా నియమించి, వార్ష్ణేయుడు, జీవలుడు అనే ఇద్దరిని అతనికి సహాయకులుగా ఇచ్చాడు.

***

నలుడు రాజ్యం కోల్పోయిన సంగతి విదర్భరాజు భీముడికి తెలిసింది. కూతురు, అల్లుడు ఏమైపోయారో నని అతను దుఃఖిస్తూ వారిని వెతకడానికి అన్ని చోట్లకూ బ్రాహ్మణులను పంపించాడు. నలదమయంతుల ఆచూకీ చెప్పినవారికి వేయి గద్యాణాలు, వారిని వెంటబెట్టుకుని వచ్చినవారికి వేయి గోవులు, అగ్రహారాలు ఇస్తానని ప్రకటించాడు.

భీముడు పంపిన బ్రాహ్మణులలో ఒకడైన సుదేవుడు సుబాహుపురం చేరుకుని రాజగృహాన్ని సందర్శించి అక్కడున్న దమయంతిని చూశాడు. ఆమెను ఏకాంతంగా కలసుకుని తను వచ్చిన పని చెప్పాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన రాజమాతకు దమయంతి విదర్భరాజు కూతురన్న సంగతి తెలిసింది. ఆమె సంతోషంతో దమయంతిని కౌగలించుకుని ‘నీ తల్లి, నేను అక్కచెల్లెళ్లమే’ నని చెప్పింది. ఆమె దగ్గర సెలవు తీసుకుని సుదేవునితో కలసి దమయంతి పుట్టింటికి వెళ్లింది.

ఈసారి భీముడు నలుని వెతకడానికి బ్రాహ్మణులను నియోగించాడు. ‘నలుడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా అజ్ఞాతంగా ఉంటాడు కనుక, భార్యను ఏమాత్రం కనికరం లేకుండా విడిచిపెట్టి వెళ్ళడం న్యాయమా అని మీరు వెళ్ళిన ప్రతి చోటా సభలలో ప్రశ్నించండి. దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చు’ నని దమయంతి బ్రాహ్మణులకు చెప్పింది.

ఋతుపర్ణుని సభకు వెళ్ళి వచ్చిన పర్ణాదు డనే బ్రాహ్మణుడు, అతని కొలువులో నూరు గద్యాణాలకు పనిచేస్తున్న బాహుకుడు అనే ఒక వికృతరూపుడు తన ప్రశ్నకు సమాధానం చెప్పాడని దమయంతికి చెప్పాడు. అతడే నలుడు అయుంటాడని భావించిన దమయంతి ఈసారి సుదేవుని పిలిపించి, తనకు రేపో, ఎల్లుండో పునస్స్వయంవరం జరగబోతున్నట్టు ఋతుపర్ణునికి చెప్పమని పంపించింది.

***

ఋతుపర్ణుడు ఆ స్వయంవరానికి వెళ్లడానికి ఉత్సాహపడ్డాడు. వార్ష్ణేయుని వెంటబెట్టుకుని బాహుకుడు రథచోదకుడుగా విదర్భపురానికి బయలుదేరాడు. వాయువేగంతో రథం తోలుతున్న బాహుకుని నేర్పుకు ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతుండగా అతని ఉత్తరీయం జారిపడిపోయింది. వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తెస్తాడనీ, వేగం తగ్గించమనీ బాహుకునితో అన్నాడు. ‘ఇంకెక్కడి ఉత్తరీయం? అది పడిన చోటునుంచి వందమైళ్ళ దూరం వచ్చేశా’మని బాహుకుడు చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు, ‘అందరికీ అన్ని విద్యలూ తెలియకపోయినా ప్రతివారికీ ఏదో ఒక విద్యలో నేర్పు ఉంటుంది. నేను వస్తువుల గుంపును ఒకసారి చూస్తే చాలు వాటి సంఖ్య చెప్పేస్తాను. కావాలంటే ఆ చెట్టు చూడు. దానికి ఆకులు, పండ్లు ఎన్నున్నాయో చెబుతాను. రెండు కొమ్మలకు పదివేల ఒకటి ఉంటే, మిగిలిన కొమ్మలకు రెండువేల తొంభయ్యే ఉన్నాయి’ అన్నాడు. ‘అయితే లెక్కపెట్టవలసిందే’ నంటూ బాహుకుడు రథం ఆపి దిగి, ఆ చెట్టును కూలదోసి లెక్కపెట్టాడు. సరిగ్గా ఋతుపర్ణుడు చెప్పినన్నే ఉన్నాయి. ఆశ్చర్యపోయిన బాహుకుడు ఆ విద్యను తనకు ఉపదేశించమని కోరాడు. దీనిని అక్షహృదయం అంటారని చెప్పి ఋతుపర్ణుడు అతనికి ఉపదేశించాడు. సంతోషించిన బాహుకుడు, ‘నీకు అశ్వహృదయం అనే నా విద్యను ఉపదేశిస్తాను, స్వీకరించు’ అన్నాడు. ‘ప్రస్తుతానికి నీ దగ్గరే ఉంచుకో. నేను కావలసినప్పుడు స్వీకరిస్తాను.’ అని ఋతుపర్ణుడు అన్నాడు.

అక్షహృదయం పొందగానే కలి అతన్ని విడిచిపెట్టేశాడు. వికృతరూపం తప్ప మిగిలిన దోషాలు అన్నీ తొలగిపోయాయి. రథం విదర్భపురంలోకి ప్రవేశించింది. రథం చప్పుడు వినగానే దమయంతికి అది నలుని రథధ్వనిలా అనిపించింది. తీరాచూస్తే నలుడు కనిపించలేదు. దాంతో నిరాశ చెందింది. భీముడు ఋతుపర్ణునికి తగిన విడిది ఏర్పాటుచేశాడు. పురంలో ఎక్కడా స్వయంవరం మాటే వినిపించకపోవడం, మిగతా రాజులెవరూ కనిపించకపోవడం చూసి ఋతుపర్ణుడు అనుమానపడ్డాడు. ‘దమయంతి ఇంకొకరిని పెళ్లాడే అధర్మానికి పాల్పడుతుందని తను ఎలా అనుకున్నాడు, స్వయంవరం అనగానే తగుదునమ్మా అనుకుంటూ ఎలావచ్చాడు’ అనుకుంటూ సిగ్గుపడ్డాడు.

ఋతుపర్ణుడు అయోధ్యరాజనీ, వార్ష్ణేయుడు సూతపుత్రుడనీ తెలిసింది కనుక మూడో వ్యక్తి అయిన బాహుకుడు ఎవరో తెలుసుకుని రమ్మని కేశిని అనే పరిచారికను దమయంతి పంపించింది. రథశాల దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న బాహుకుని దగ్గరకు కేశిని వెళ్ళి, ‘ఇక్కడికి ఏ పని మీద వచ్చావు, మీతో ఉన్న మూడో వ్యక్తి ఎవరు?’ అని అడిగింది. బాహుకుడు వచ్చిన కారణం చెప్పి, మూడో వ్యక్తి వార్ష్ణేయుడనీ, నలునికి రథచోదకుడిగా ఉండేవాడనీ చెప్పాడు.

దమయంతిని కలిసి బాహుకుని మాటలూ, ఆకారం గురించి కేశిని చెప్పింది. అతడే నలుడని దమయంతికి అనుమానం కలిగింది. ‘అతను ఋతుపర్ణుని వంటలవాడట కదా…అతని వంట గురించి తెలుసుకుని రా’ అని దమయంతి మళ్ళీ కేశినిని అతని దగ్గరికి పంపింది. కేశిని వెళ్ళి వచ్చి ‘అతని గురించి ఏం చెప్పను? అతను మామూలు మనిషి కాదు. అలాంటివాడిని ఇంతవరకు చూడలేదు, వినలేదు. నిజంగా అతన్ని దేవుడు అనచ్చు’ అంటూ అతను వంట చేయడంలో ఎన్ని మహిమలు ప్రదర్శిస్తాడో వర్ణించి చెప్పింది. దాంతో అతని వంటకాలు కొన్ని తీసుకురమ్మని దమయంతి మళ్ళీ కేశినిని పంపింది. కేశిని తెచ్చి ఇవ్వగానే వాటిని రుచి చూసిన దమయంతికి అతడు నలుడే నని మరింత గట్టిగా అనిపించింది. ఈసారి కొడుకునీ, కూతురునీ ఇచ్చి కేశినిని బాహుకుడి దగ్గరికి పంపించింది. వాళ్ళను చూడగానే కంట తడిపెట్టుకుంటూ బాహుకుడు తన ఒళ్ళో కూర్చొబెట్టుకున్నాడు. అంతలోనే జాగ్రత్తపడుతూ ‘వీళ్ళను చూడగానే నా పిల్లలు గుర్తొచ్చారు’ అని కేశినికి చెప్పి, ‘నువ్విలా మాటి మాటికీ రావడం బాగుండదు, ఇక రావద్దు’ అన్నాడు. ఇది తెలిసి, అతడు నలుడే నని పూర్తిగా నిర్ధారణకు వచ్చిన దమయంతి తండ్రికి చెప్పి అతన్ని తనవద్దకు రప్పించింది.

బాహుకుడు దమయంతిని కలిశాడు. తనకు పునస్స్వయంవరం అన్న సంగతిని ఋతుపర్ణుడు ఒక్కడికే తెలియబరిచారనీ, అది నలుని విదర్భకు రప్పించడానికి మాత్రమె నని దమయంతి మాటల ద్వారా అతనికి తెలిసింది. దాంతో అతను కర్కోటకుడిని తలచుకోవడం, పక్షులు అపహరించిన అతని వస్త్రం తిరిగి అతని దగ్గరికి రావడం, అతను దానిని ధరించాగానే నలుని రూపంలోకి మారిపోవడం వెంటనే జరిగిపోయాయి.

దంపతులు ఇద్దరూ తిరిగి ఒక్కటయ్యారు.

నలుడు అక్కడినుంచి నిషధపురానికి వెళ్లి పుష్కరుని కలిశాడు. ‘నా రాజ్యాన్ని గెలుచుకోడానికి వచ్చాను. నాతొ యుద్ధమైనా చెయ్యి. జూదమైనా ఆడు’ అని అతణ్ణి ఆహ్వానించాడు. పుష్కరుడు జూదానికే మొగ్గు చూపించాడు. అందులో అతడు నలుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. నలుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

***

ఈ కథను ఇంకా క్లుప్తం చేసి చెప్పచ్చు కానీ, కొన్ని కారణాల వల్ల ఈమాత్రం వివరంగా చెప్పవలసివచ్చింది. నలుని గుర్తించి, రప్పించడానికి దమయంతి చేసిన ప్రయత్నాలు; బాహుకుడే నలుడా అన్నది నిర్ధారించుకోడానికి అతనితో ఆడిన ‘మైండ్ గేమ్’ —ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథనరీతిని పట్టి చూపి, పురాణ కథలకు భిన్నంగా తోపిస్తాయి. అంతకంటే విశేషం, ఒక గ్రీకుపురాణకథతో ఈ కథకు పోలికలు ఉండడం!

దాని గురించి తర్వాత….

 -కల్లూరి భాస్కరం

నలుడు-నరుడు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)
అందరికీ ప్రత్యక్షంగా కనిపించేదాన్ని, లేదా అనుభవంలో ఉన్నదాన్ని నిజమని అంటాం. నిజాన్ని నిరూపించడానికి ఆధారాలు ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. నిజం అనే మాటకు భిన్నమైనది భావన. Perception అనే ఆంగ్లపదాన్ని భావనగా అనువదించుకోవచ్చు ననుకుంటాను. భావన అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండచ్చు. భావనను నిరూపించడం ఒక్కొక్కసారి కష్టం కావచ్చు. అందుకు తగినన్ని ఆధారాలు ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది నిజం కాదని కొట్టి పారేయడమూ కష్టమే.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, నలదమయంతుల కథ పరిశీలనలో నేను ఈ నిజమూ-భావనల మధ్య సతమతమవుతుండడమే!

పురాణ, ఇతిహాసాలలో నరుడు అనే వాడిని సిద్ధసాధ్యయక్షకిన్నర కింపురుష గంధర్వదేవతాదులతో కలిపి చెప్పడం చూస్తుంటాం. అంటే, నరుడు వేరు, పైన చెప్పిన మిగిలిన వారంతా వేరు అనే అర్థం అందులో ధ్వనిస్తూ ఉంటుంది. కానీ నేటి సాధారణ హేతుబుద్ధితో ఆలోచిస్తే పైన చెప్పిన పేర్లు అన్నీ నరుడికి ఉపయోగించిన జాతి, తెగ, లేదా వృత్తి వాచకాలే ననీ; కనుక వారు కూడా నరులే ననీ అనిపిస్తుంది. అలాంటప్పుడు, నరుడు వేరు, పైన చెప్పినవాళ్లు వేరు అన్నట్టుగా ఎందుకు చెప్పినట్టు?
చాలా వ్యాసాల క్రితం, ఒక వ్యాసంలో ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చాను. నలదమయంతుల కథను పరిశీలించేటప్పుడు ఇంకొకసారి తెచ్చి, మరింత విపులంగా చర్చించవలసిన అవసరం కనిపించింది.

ఒకరకంగా ఇది ఎలాంటిదంటే, ఒక ఇంద్రజాలికుడు తను చేసిన గారడీని, లేదా సృష్టించిన భ్రమా ప్రపంచాన్ని తనే నిజమని నమ్మడం లాంటిది. పురాణ, ఇతిహాసాలకు ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది. నిర్దిష్టమైన భాష, శైలి ఉంటాయి. అది– దేవతలు, పక్షులు, పాములు, పర్వతాలు, నదులు, మానవులతో సహా చరాచరప్రపంచం మొత్తం ఒక అలౌకిక స్థాయిలో కలగలిసిపోయి ఉండే అద్భుతప్రపంచం. అందులో మామూలు మనిషి కూడా అతిమానుష స్వభావంతో ఉంటాడు. అందుకే మనం పురాణ ఇతిహాస పాత్రలను మామూలు మనుషులుగా కాక; అతిమానుషులుగా, అసాధారణులుగా చూడడానికే అలవాటు పడిపోతాం. కానీ మామూలు మనిషిని కూడా గుర్తించకతప్పదు కనుక, అతనిని నరుడు అనే పేరుతో అతిమానుషులతో కలిపి పౌరాణికుడు చెబుతున్నాడన్నమాట.

ఉదాహరణకు, మహాభారత పాత్రలను కొన్నింటిని తీసుకుందాం. పాండవులను కానీ, ద్రౌపదిని కానీ మనం మామూలు మనుషులుగా చూడం. వారి పుట్టుక నుంచి పెరిగి పెద్దైన తర్వాత చేసిన పనులు, వ్యవహరించిన తీరు వరకు, దాదాపు అన్నింటి చుట్టూ ఒక అతిమానుషత్వం, అద్భుతత్వం ఆవరించి ఉంటాయి. పాండవులు దేవతల అంశతో పుట్టినవాళ్లు. ద్రౌపది యజ్ఞగుండం వద్ద అయోనిజగా ప్రత్యక్షమైంది. అర్జునుడు అసామాన్య వీరుడు. తపస్సు చేసి అనేక దివ్యాస్త్రాలను సంపాదించినవాడు. ఇంద్రుని ఆహ్వానం మీద దేవలోకం వెళ్ళి అర్థసింహాసన గౌరవం అందుకున్నవాడు. పాండవులు, ద్రౌపదే ఏమిటి; దుర్యోధనుడితో సహా మహాభారతంలోని ప్రధానపాత్రలన్నీ దేవతాంశతోనో, రాక్షసాంశతోనో పుట్టినవే. ఆ విషయాన్ని కథకుడు ప్రారంభంలోనే చెబుతాడు.

అయితే, ఈ అతిమానుష, అద్భుత ప్రపంచంలో ముందుకు వెడుతున్నకొద్దీ; సిద్ధసాధ్యకిన్నర కిన్నర కింపురుష యక్షరాక్షసగంధర్వదేవతల మధ్య చిక్కుకున్న నరుడనే మామూలు మనిషిని బయటికి లాగి ముందుకు తేవలసిన అవసరం కథకుడికి కలిగింది. ఆ అవసరం ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగిందనే ప్రశ్నలోకి పూర్తిస్థాయిలో వెళ్లడానికి పూర్వరంగంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నరుడు అనే మామూలు మనిషిని ముందుకు తేవడం కథకుడు తప్పనిసరై చేసిందే తప్ప అంత ఇష్టంతో చేసిన పనిగా అనిపించదు. అర్జునుడికే నరుడు అనే పేరు ఉండడమే చూడండి. మహాభారతంలో నరుడు అనే పేరు అర్జునుడికి తప్ప మరొకరికి లేదు. మిగిలిన పాండవులు, ఇతరులు నరులు కాదా అన్న ప్రశ్నను కాసేపు ఇక్కడ మరచిపోదాం. ఒక కోణంలో చూస్తే మహాభారతంలో నాయకుడు లేదా హీరో అర్జునుడే. అతను నరుడు కూడా, అంటే మామూలు మనిషి కూడా నన్నమాట. ఆవిధంగా చూస్తే కథకుడు పరోక్షంగా మామూలు మనిషిని కథానాయకుడిగా చేసి మహాభారతకథ చెబుతున్నాడన్న మాట.

అదే సమయంలో, మామూలు మనిషిని కథానాయకుని చేసి; పురాణ, ఇతిహాసాలకు ఉన్న ప్రత్యేక రూప, స్వభావాలను చెరపడం కథకుడికి ఇష్టం లేదు. లేదా శ్రోతలు కూడా అలాంటి కథను ఇష్టంగా వినకపోవచ్చు కూడా. కనుక అర్జునుడు నరుడు మాత్రమే కాదు, మరోవైపునుంచి చెప్పుకుంటే, ఇంద్ర వరప్రసాదంతో, అంటే దేవతాంశతో జన్మించినవాడు. ఇంకా ఎన్నెన్నో విశేషణాలు ఉన్నవాడు. అతను నరుడే అయినా మామూలు నరుడు కాదు; నరుడనే ఒక ఆదిముని అవతారం. ఆపైన నారాయణుడనే దేవుడితో(నరనారాయణులు) కలిపి చెప్పవలసినవాడు. అంటే మామూలు మనిషిని ముందుకు తెస్తూనే కథకుడు మళ్ళీ అతనికి దివ్యత్వాన్ని ఆపాదిస్తూ అతని చుట్టూ ఒక కాంతివలయాన్ని సృష్టిస్తున్నాడన్న మాట.

అర్జునుని నరునిగా పదే పదే నొక్కి చెప్పడం అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో కనిపిస్తుంది. అందులో కథకుడు అర్జునుని నరునిగా పరిచయం చేయడం మామూలుగా కాక, చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించడానికి వెళ్ళి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు కిరాత వేషంలో వెళ్ళి అర్జునుడు వేటాడిన ఒక వరాహాన్ని తను కూడా బాణంతో కొట్టి పడగొట్టి అది తనదే నంటాడు. అప్పుడు వారిద్దరి మధ్యా యుద్ధం జరుగుతుంది. అర్జునుని శౌర్యధైర్యాలను మెచ్చుకున్న శివుడు వరం కోరుకోమంటాడు. పాశుపతాస్త్రం ఇమ్మని అర్జునుడు అడుగుతాడు. ఆ సందర్భంలో శివుడు, “పూర్వజన్మలో నువ్వు నరుడనే దేవరుషివి, నారాయణుడికి సఖుడివి” అంటాడు.
arjuna

అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన సంగతి తెలిసి ఇంద్రుడు, ఇతర దిక్పాలకులతో కలసి అతని దగ్గరకు వస్తాడు. “నువ్వు నరుడనే పూర్వఋషివి. బ్రహ్మ నియోగంతో మనుష్యుడవై ఉత్తమ క్షత్రియకులంలో పుట్టావు” అంటాడు. అర్జునుడికి అతను ఒక దండాన్ని, మిగిలినవారు తమ తమ అస్త్రాలను ఇస్తారు. ఆ తర్వాత, దేవలోకానికి వస్తే, మరికొన్ని దివ్యాస్త్రాలు ఇస్తానని ఇంద్రుడు అతనికి చెప్పి రథం పంపిస్తాడు. అర్జునుడు రథమెక్కి దేవతల రాజధాని అమరావతికి వెడతాడు. “నరుడనే ఆదిమునే ఇతని రూపంలో జన్మించా” డనుకుంటూ దేవతలందరూ అతనిని చూడడానికి వెడతారు. అప్పుడే దేవవేశ్య అయిన ఊర్వశికి, అర్జునుడికి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది.
అర్జునుడు తన విడిదిలో గంధర్వుల సంగీతగోష్ట్టిని ఆనందిస్తుండగా; వెన్నెల రాత్రి తెల్లని చీరకట్టుకుని, సుగంధద్రవ్యాలను అలదుకుని, రకరకాల సువాసనలను విరజిమ్మే పూలు ముడుచుకుని, ఇంద్రుని మందిరం నుంచి బయలుదేరి అందెల రవళితో ఊర్వశి అర్జునుడి మందిరానికి వచ్చింది. ఆమెను చూస్తూనే అర్జునుడు భయభక్తులతో లేచి నిలబడి నమస్కరించాడు. ‘అమ్మా’ అని సంబోధిస్తూ, “నా మీద పుత్రప్రేమతో, నాకు శుభం కలిగించడానికి వచ్చి నన్ను కృతార్థుని చేశావు” అన్నాడు. అంటే, ఆమె రాకకు కారణం పసిగట్టాడా అన్నట్టుగా ముందరి కాళ్ళకు బంధం వేసాడన్నమాట.

తన కళ్ళనే తుమ్మెదలతో అర్జునుడి అందమనే మధువును తాగుతున్న ఊర్వశి అతని మాటలకు ఉలికిపడింది. “నీ గుణగణాల గురించి మునుల ద్వారా విని నీ పొందు కోరి వస్తే, నన్ను అమ్మా అని పిలుస్తావేమిటి? నేను నీకు తల్లిని ఎప్పుడయ్యాను? దేవలోకవేశ్యలమైన మా దగ్గర ఇలాంటి వావివరసలు నడవవు. ఈ లోకంలో స్త్రీ, పురుషులు విచ్చలవిడిగా క్రీడిస్తారు. అదిక్కడ తప్పు కాదు. ఈ లోకానికి వచ్చావు కనుక నువ్వు కూడా దివ్యపురుషుడివే. కనుక నా కోరిక తీర్చు.” అంది.

“ధర్మానికి ద్రోహం చేసే ఇలాంటి మాటలు నువ్వు నాతో మాట్లాడడం న్యాయమా? లోకాలను పుట్టించేది, గిట్టించేది దేవతలే కనుక వాళ్ళు ఎలా నడచుకున్నా తప్పులేదు. కానీ నేను కర్మభూమిపై జన్మించినవాణ్ణి. కర్మిష్టిని. ఇక్కడి ఆచారం నాకు పనికిరాదు. మా వంశకర్త అయిన పురూరవుడికి భార్యవు కనుక, ఇంద్రుని సేవించుకునేదానివి కనుక నువ్వు నాకు తల్లివి అవుతావు. నన్ను పుత్రవాత్సల్యంతో చూడు” అన్నాడు అర్జునుడు నిర్వికారంగా.

దాంతో ఊర్వశి కోపించడం, నపుంసకుడివి కమ్మని అర్జునుని శపించడం, అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా మారడానికి అతడు ఆ శాపాన్ని ఉపయోగించుకోవడం…అనంతర పరిణామాలు.

అర్జునుని మాటల్ని జాగ్రత్తగా గమనించండి…అతనొక సాధారణ మానవుడిలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవతలు ఎలాగైనా ఉండచ్చు, మేము మనుషులమని అతను ఒత్తి చెబుతున్నాడు. దేవతలకు, మనుషులకు మధ్య ఒక విభజనరేఖ గీస్తున్నాడు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు మొదలైన వారి నుంచి నరుని, అంటే మామూలు మనిషిని తప్పించి; అతనికి తనదైన ఒక ప్రత్యేకత ఉన్నట్టు ధ్వనింపజేసిన అరుదైన సందర్భాలలో ఇది ఒకటి. బహుశా ఇదే మొదటిదేమో కూడా. ఎవరి గురించి అయినా గొప్ప చేసి చెబుతున్నప్పుడు, ఇతడు మామూలు మనిషి కాదంటూ, మనిషిని చిన్నబుచ్చి చెప్పడం మహాభారత కథకుడు సాధారణంగా అనుసరిస్తూ వచ్చిన వైఖరి. ‘ఇతడు కేవల మర్త్యుడు కాడు’ అనీ, ‘ప్రకృతిజనుడు కాడు’ అనీ అనడం చాలాచోట్ల కనిపిస్తుంది.

అది అలా ఉంచితే, అర్జునుడు ఉర్వశిని తిరస్కరించడానికే కాక; ఊర్వశి-పురూరవుల సంబంధానికి కూడా ఆసక్తికరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

ప్రస్తుతానికి వస్తే, రోమశుడనే ముని ఇంద్రుని సందర్శించడానికి వెళ్లి, అతని పక్కన అర్థసింహాసనాన్ని అధిష్టించిన అర్జునుని చూసి ఇతడెవరని అడుగుతాడు. “ఇతడు నరు డనే మహర్షి. నరలోకంలో పుట్టాడు” అని ఇంద్రుడు చెబుతాడు. చివరిగా, అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించాడన్న సంగతి వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రునికి తెలుస్తుంది. అతడు, “దేవతలు అర్జునుడికి పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు ఇచ్చారటగా! అలాంటి నరుడు యోధుడై ఉన్నప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవడి తరం?” అని సంజయుడితో అంటాడు.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. అర్జునుడు నరుడన్న సంగతిని పదే పదే నొక్కి చెప్పడమూ, పాండవుల యుద్ధప్రయత్నాలూ ఏక కాలంలో జరుగుతున్నాయి. అర్జునుడు దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదించుకునే క్రమంలోనే అతణ్ణి నరుడిగా కథకుడు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాడు. ఇటువంటి నరుడు యోధుడిగా యుద్ధం చేసేటప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవరికి సాధ్యమని ధృతరాష్ట్రుడితో అనిపిస్తున్నాడు. యుద్ధం సమీపిస్తున్న కొద్దీ, యుద్ధమధ్యంలో కూడా నర నారాయణుల గురించి భీష్ముడు మొదలైన పాత్రల చేత చెప్పించబోతున్నాడు. అర్జునుని నరునిగా పరిచయం చేస్తున్న పై ఘట్టానికి సరిగ్గా ముందే; యుద్ధానికి అనుకూలంగా భీముడు, ద్రౌపది ధర్మరాజుతో చాలా వాడిగా, వేడిగా చర్చిస్తారు.

ఈ విధంగా చూసినప్పుడు అర్జునుని నరునిగా చెప్పడానికీ, యుద్ధానికీ ఏదో ముడి ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎలాంటిదో ముందు ముందు వెల్లడవుతుందేమో చూద్దాం.

***
ప్రస్తుత సందర్భంలో మనం గుర్తించవలసిన మరో విశేషం ఏమిటంటే, అర్జునుని నరునిగా పరిచయం చేసిన ఘట్టం వెనువెంటనే, నల దమయంతుల కథ ప్రారంభమవుతుంది. ఇంకా విచిత్రంగా, మా మాదిరిగా ఇన్ని కష్టాలు పడిన నరులు ఎవరైనా ఉన్నారా అని బృహదశ్వు డనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడా ముని నల దమయంతుల కథ చెప్పడం ప్రారంభిస్తాడు.

వారి పరిచయం సాదా సీదాగా, ఇంకా చెప్పాలంటే ఓ చందమామ కథలానూ, జానపద కథలానూ ప్రారంభమవుతుంది. నలుడు నిషధదేశపు రాజు వీరసేనుడి కొడుకు; దమయంతి విదర్భరాజు భీముని కూతురు, అంతే! వారు దైవాంశ సంభూతులు కారు. వారి పుట్టుక వెనుక ఎలాంటి దైవ కారణాలూ లేవు. వారి చుట్టూ ఎలాంటి కాంతి వలయాలూ లేవు. వారు గొప్ప గొప్ప పనులు ఏవీ చేయలేదు. మొదట వారు ఓ మామూలు ప్రేమికులు, ఆ తర్వాత మామూలు దంపతులు. అనేక కష్ట నష్టాలకు గురై, ఒకరికి ఒకరు దూరమై, ఆ తర్వాత కష్టాల నుంచి బయటపడి తిరిగి ఒకటైన మానవమాత్రులు వారు.

నలదమయంతుల కథానిర్మాణం చాలా చిక్కగా, మంచి నేర్పరి అయిన కథకుడు అల్లినట్టుగా ఉంటుంది. అందులో ఎత్తులు, పై ఎత్తులు, ఉపాయాలు, వ్యూహాలు, విస్మయం గొలిపే మలుపులు ఉంటాయి. భారతీయ సాహిత్యంలో కథ, నవలా లక్షణాలు ఉన్న తొలి కథ ఇదే ననిపిస్తుంది. ఈ మాట ఇంతవరకు ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు.

కథ, ఇతర విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

‘ఆమె మెచ్చినదే అందం’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నల దమయంతు లిద్దరు మనఃప్రభవానలబాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారల చందనచారుచర్చలన్

మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్న ఈ ప్రసిద్ధపద్యం నల దమయంతులనే ప్రేమికుల విరహతాపం గురించి చెబుతోంది. ఆ తాపాన్ని ఉపశమింపచేసుకోడానికి వారు శీతలోపచారాలను ఆశ్రయించడం గురించి చెబుతోంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు; ‘మా మాదిరిగా భూమిని, రాజ్యాన్ని, బంధువులను విడిచిపెట్టి అడవులపాలై జంతువులతో కలసి జీవిస్తూ కష్టాలు పడిన నరులు ఇంకెవరైనా ఉన్నారా’ అని బృహదశ్వుడు అనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు ఆ ముని నలదమయంతుల కథ చెబుతాడు.

నలుడు నిషధదేశపు రాకుమారుడు, దమయంతి విదర్భరాజు కూతురు.
నాకు ఎందుకో మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు…అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు, వివాహసంబంధాలు కనిపిస్తాయి. నలదమయంతుల కథ దగ్గరికి వచ్చేసరికి అది భిన్నమైన కథగా అనిపిస్తుంది. అందులోనే స్త్రీ-పురుష సంబంధాలలో మొదటిసారిగా మనసు, ప్రేమ, విరహం మొదలైన సుకుమారభావనలు అడుగుపెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. అంతకు ముందున్న కథలకు, ఈ కథకు ఉన్న తేడాను వీలైనంత క్లుప్తంగా చూద్దాం.
ఆదిపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్న రురుడు-ప్రమద్వరుల కథ, వివాహం నిశ్చయమైన ఒక జంట గురించి చెబుతుంది. ఆవిధంగా వారిద్దరి మధ్య వివాహానికి ముందే అనురాగం ఏర్పడడానికి అవకాశం ఉంది కానీ, దానిని ప్రేమకథగా చెప్పలేం. ప్రమద్వర పాముకాటువల్ల మరణించగా తన ఆయుర్దాయంలో సగం ఆమెకు ధారపోసి రురుడు ఆమెను బతికించుకుంటాడు. ఆ తర్వాత వారి వివాహం జరుగుతుంది.

ఆ తర్వాత చెప్పుకోవలసింది యయాతి-దేవయాని; యయాతి-శర్మిష్టల త్రికోణ సంబంధకథ. రాచకూతురు అయిన శర్మిష్టపై అసూయతో, ఆమె కన్నా తను ఆధిక్యతను పొందాలనే కోరికతో దేవయాని యయాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కనుక వారిద్దరిదీ ప్రేమ సంబంధమని చెప్పడానికి లేదు. పైగా యయాతి శర్మిష్టమీదే తప్ప దేవయానిపై మనసు పడినట్టు కనిపించడు. శుక్రుడిపట్ల భయంతోనో, గౌరవంతోనో అతను దేవయానిని పెళ్లాడినట్టు కనిపిస్తాడు. కనుక అది ఒకవిధంగా నిర్బంధవివాహం.

nala

తొలిచూపులోనే అతనిని ఆకర్షించింది శర్మిష్ట. అయితే ఆ ఆకర్షణకు కారణం ఆమె అందమే కానీ, అందులో ప్రేమగా చెప్పదగిన మానసికకోణం ఏమీ లేదు. ఇంకా విశేషమేమిటంటే, యయాతితో తన సంబంధంలో మొదట చొరవ తీసుకున్నది శర్మిష్టే. అందుకు కూడా అసలు కారణం, దేవయానికి పట్టిన అదృష్టం తనకు పట్టలేదన్న చింతే. భర్త లేకపోవడంతో ఇంత యవ్వనమూ వృథా కావలసిందేనా అన్న విచారంతోపాటు; దేవయాని భర్తను, సంతానాన్ని పొందినట్టు తను పొందలేకపోయానే అన్న బాధా ఆమెలో ఉంది. పైగా యయాతికి, తనకు మధ్య ఉన్నది దాసి-యజమాని సంబంధమని ఆమె గుర్తుచేస్తుంది. అంటే, వారిది ప్రేయసి-ప్రియుల సంబంధం, భార్యా-భర్తల సంబంధం కాదు సరికదా; సమానుల మధ్య సంబంధం కూడా కాదన్నమాట. ఆపైన ఆమె ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతుంది. ఇలా ఏ కోణంలో చూసినా వారిది శారీరక సంబంధమే తప్ప ప్రేయసీ, ప్రియుల మధ్య తప్పనిసరిగా ఉండవలసిన మానసికబంధం కాదు.

శకుంతలా-దుష్యంతుల కథకు వస్తే, అది పైకి ప్రేమకథలా కనిపించే మాట నిజమే కానీ, అది గాంధర్వవివాహం అనే చట్రంలో జరిగిన కథ. పైగా అది ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే మానసిక బంధాన్ని కాకుండా ప్రధానంగా భార్య-భర్త-సంతానం మధ్య ఉండే ధార్మిక సంబంధాన్ని, గృహస్థధర్మాన్ని వేదప్రమాణంతో నొక్కి చెబుతుంది. ఆ తర్వాత వచ్చే గంగ-శంతనుడు, సత్యవతి-శంతనుల కథల్లో ప్రేమ, మనసు కాక పురుషుడిలోని కాముకత్వానిదే పై చేయి అవుతుంది. ఇక గాంధారి-ధృతరాష్ట్రులది, కుంతి,మాద్రి-పాండురాజులది పెద్దలు నిర్ణయించిన వివాహసంబంధం. వీటికి భిన్నంగా అంబ-సాల్వులది ప్రేమకథగా కనిపిస్తుంది. కానీ అది నలదమయంతుల కథలా పూర్తిస్థాయిలో చిత్రించిన కథ కాదు.

ఆ తర్వాత వచ్చేది హిడింబా-భీముల సంబంధం. ఇది పై కథలకు భిన్నంగానూ, శర్మిష్ట-యయాతి కథకు దగ్గరగానూ కనిపిస్తుంది. ఎలాగంటే, హిడింబా-భీముల కథలో కూడా చొరవ హిడింబదే. అసలు ప్రకృతి రీత్యా చూసినా స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ తీసుకునేది స్త్రీయే నంటూ రాంభట్లగారు ‘జనకథ’లో ఇలా రాస్తారు:

జంతువుల్లో మగ జంతువు ఉదాసీన, ఆడజంతువు క్రియాశీల. ఆడజంతువు సమ్మతించనిదే మగజంతువు దాని దరిదాపులకు కూడా చేరజాలదు. ఆమె కటాక్షం కోసం మగజంతువులు పుట్టుకతో సౌందర్యాన్ని సంతరించుకుంటున్నాయి. అయితే మగ జంతువు ఈడేరేదాకా ఆ సహజసౌందర్యం పొటమరించదు. అది ప్రకృతి పెట్టిన ఆన.
మనిషికి కూడా సహజసౌందర్యం ఉంటుంది. ప్రకృతి పెట్టిన ఆన ప్రకారం అది యౌవనారంభంలో వ్యక్తమవుతుంది. జంతువుల్లా పురుషుడు కూడా ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల. ఈ సత్యాన్ని ప్రపంచంలో ఒక్క సాంఖ్యతత్వం మాత్రమే చెప్పింది. మన పురాణాల్లో రాజులు తమ కూతుళ్లకు స్వయంవరం చాటిస్తారు. ఈ స్వయంవరాన్నే డార్విన్ “నేచురల్ సెలెక్షన్” అన్నాడు. ‘వధూ’ అంటే స్త్రీ సామాన్యవాచకం. ‘వరః’ అంటే కోరదగ్గవాడు. ఈ మాటల్ని బట్టే పురుషుడు ఉదాసీనుడని తేలుతుంది.

అదే పుస్తకంలో ఇంకో చోట ఆయన ఇలా అంటారు:

జంతుప్రపంచాన పోతులు సహజాలంకారాలను సంతరించుకుని పుడతాయి. అందులో సింహం, చీంబోతు, పొట్టేలు, వృషభం –వాటి దర్పమే వేరు. ఋతుకాలాన పెంటి జంతువుల చుట్టూ ఈ పోతుజంతువులు చేరి ప్రదర్శనలు ఇస్తూ ఉంటాయి. ఎన్ని జంతువు లెంత ప్రదర్శనలు చేసినా పెంటి జంతువు అందులో బక్కపోతునే వరిస్తుంది. దాన్నే నేచురల్ సెలెక్షన్ అన్నాడు డార్విన్. అదే స్వయంవరం. వరణం దక్కని పోతులు పరస్పరం పోట్లాడుకుంటాయి.

జంతుప్రపంచం దాటివచ్చిన జనప్రపంచం కూడా అంతే. ‘ఆడది మెచ్చినదే అందం. మొగాడి కన్ను మసక’ అంటుంది మధురవాణి. ఆమె నోట ఈ మాట పలికించిన అప్పారావుగారు ఎంత గొప్ప శాస్త్రవేత్తో! వరమాల దక్కని పురుషులు కూడా జంతువుల్లానే పోట్లాడుకునే వారంటాయి మన పురాణాలు. ఈ స్వయంవరణ రహస్యం నేటికీ పరమ రహస్యంగానే ఉంది.

పురుషుడు ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల అన్న సూత్రీకరణకు యయాతి-శర్మిష్టల సంబంధం అతికినట్టు సరిపోతుంది. అలాగే భీమ-హిడింబల సంబంధం కూడా.
వారణావతంలో లక్క ఇంటి దహనం నుంచి పాండవులు తప్పించుకున్న తర్వాత ; హిడింబుడు అనే రాక్షసుడు, అతని చెల్లెలు హిడింబ ఉండే అరణ్యానికి చేరుకుంటారు. భీముని చూడగానే హిడింబకు అతనిపై కోరిక కలుగుతుంది. హిడింబునికి, భీమునికి జరిగిన యుద్ధంలో హిడింబుడు మరణించిన తర్వాత కుంతి, పాండవులు అక్కడినుంచి బయలుదేరతారు. వారితో హిడింబ కూడా బయలుదేరుతుంది. భీముడు అందుకు అడ్డు చెబుతాడు. అప్పుడు ధర్మరాజు జోక్యం చేసుకుని ఆమెను కూడా రానివ్వమంటాడు.
ఆ తర్వాత కుంతిని హిడింబ ఏకాంతంగా కలసుకుని ‘మన్మథ వాంఛ అన్ని ప్రాణులలోనూ సాధారణమే అయినా స్త్రీలలో అది మరింత విశేషంగా ఉంటుంది. భీమునిపై కోరికతో చుట్టాలను, చెలులను విడిచిపెట్టి వచ్చాను. మీరు నా ఇష్టాన్ని కాదంటే ఆత్మహత్య చేసుకుంటా’నని అంటుంది. నా దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయని కూడా చెబుతుంది. కుంతికి ఆమె మీద ఇష్టం కలుగుతుంది. తన మాటను, అన్న ధర్మరాజు మాటను మన్నించి ఆమెను చేపట్టమని కుంతి భీమునికి చెబుతుంది. ఇందువల్ల నీకు పుత్రసంతానం కలుగుతుందని, నీ తండ్రి పాండురాజు కూడా సంతోషిస్తాడని అంటుంది. భీముడు ఒప్పుకుంటాడు. అయితే పుత్రసంతానం కలిగే వరకే మా ఇద్దరి సంబంధం అని షరతు పెడతాడు. ‘నువ్వు శుచిగా ఉంటూ ఉత్తమ స్త్రీ గుణాలతో భీముడికి ప్రీతి కలిగేలా నడచుకో. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి. రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండం’డని హిడింబకు కుంతి చెప్పింది.

సరే, ఇందులో చొరవ హిడింబదే నన్న సంగతి అర్థమవుతూనే ఉంది. పైగా భీమునిపై ఆమెకు కలిగిన కోరిక శారీరకమైనదేనని ఆమె మాటలు వెల్లడిస్తున్నాయి. కుంతి దగ్గర పచ్చిగా ఆ సంగతి బయటపెట్టింది కూడా. కనుక, ప్రేమ, మనసు అనే నాజూకు భావనలకు అక్కడ అవకాశం లేదు. అలాగే, ఈ మొత్తం ఘట్టంలో వారిద్దరి మధ్య వివాహం అనే మాటే రాలేదు. రాకపోగా, నీకు కొడుకు కలుగుతాడు, పాండురాజు కూడా సంతోషిస్తాడని కుంతి భీమునితో అంటోంది. అంటే, ఇక్కడ వివాహవిధి కన్నా సంతానం పొందడమే ప్రధానంగా కనిపిస్తోంది. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి, రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండండని హిడింబకు కుంతి చెప్పడం కూడా, అది సాధారణ దాంపత్య సంబంధానికి భిన్నమైన సంబంధంగా ధ్వనింపజేస్తోంది. పుత్రుడు కలిగేవరకే మా సంబంధం అని భీముడు అనడం, అది అవసరార్ధం కల్పించుకున్న తాత్కాలిక సంబంధమేనని స్పష్టంగా చెబుతోంది. హిడింబ ఆటవిక స్త్రీ అనుకుంటే, భీముడికి, ఆమెకు కలిగినది అసమసంబంధం కనుక ఈ చిత్రీకరణ దానికి అనుగుణంగానే ఉంది. సంతానం కోసం ఆటవిక స్త్రీలతో సంబంధం పెట్టుకుని, సంతానం కలగగానే వారిని విడిచిపెట్టిన ఉదంతాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇది నేటికీ గిరిజన, గిరిజనేతరుల మధ్య జరుగుతున్నదే. చరిత్ర అవిచ్చిన్నతకు ఇదొక ఉదాహరణ.

హిడింబ-భీముల సంబంధం తర్వాత చెప్పుకోవలసింది ద్రౌపది-పాండవుల సంబంధం. అందులో కూడా ప్రేమ అనీ, మానసికమైనదనీ చెప్పదగిన బంధమేమీ లేదు. అది కూడా ప్రధానంగా రాజకీయ అవసరార్ధం జరిగిందిగానే కనిపిస్తుంది. ద్రౌపదిని వెంటబెట్టుకుని అర్జునుడు, భీముడు ఇంటికి వచ్చి, భిక్ష తెచ్చామని తల్లితో అన్నప్పుడు, దానిని అయిదుగురూ పంచుకోండని తల్లి అన్నప్పుడు, ‘ఆమెను చూడగానే పాండవులు అయిదుగురూ మన్మథ బాణాలకు గురయ్యారు’ అంటాడు కవి. ఆ మాట ప్రధానంగా శరీరకవాంఛనే సూచిస్తోంది.

కాకపోతే, రాచకూతురుగా, తండ్రిచాటు బిడ్డగా ద్రౌపదికి, ఆటవిక స్త్రీగా హిడింబకు ఒక స్పష్టమైన తేడా ఉంది. భీముడితో సంబంధంలో హిడింబ చొరవ తీసుకుంటే; పాండవులతో సంబంధంలో ద్రౌపది, తండ్రి ఎలా వంచితే అలా వంగే మైనపు ముద్ద, మౌనమూర్తి అయింది. తను స్వయంవరంలో అర్జునుని వరించినా, అత నొక్కడికే భార్య అయ్యే హక్కును ఆమె పొందలేక పోయింది. ఆవిధంగా అది ఉత్తుత్తి స్వయంవరమే అయింది.

ఆ తర్వాత వచ్చేదే నలదమయంతుల కథ. పైన చెప్పుకున్నట్టు, ప్రేమ, మనసు, విరహం వంటి దినుసులతో ఈ కథ; పై కథలకు భిన్నంగా, దాదాపు ఆధునిక ప్రేమ కథలకు దగ్గరగా ఉంటుంది. అంతేకాదు, కనీసం ఉన్నత కుటుంబాలకు పరిమితమై చెప్పుకున్నా ప్రేమ, పెళ్లి అనేవి కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చెందినవే తప్ప రాజకీయ అవసరం కోసమో, మరొక అవసరం కోసమో పెద్దలు మెడ వంచి రుద్దేవి కావని చెబుతున్నట్టు ఉంటుంది. ఇలా ఈ కథలను ఒక క్రమంలో పేర్చుకుని చూసినప్పుడు మహాభారతం స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని కూడా చెబుతోందా అనిపిస్తుంది.

దమయంతి విదర్భరాజు కూతురు అన్నప్పుడు, అది నేటి మహారాష్ట్రలోని విదర్భనే సూచిస్తోందనుకుంటే, బహుశా ఇది దక్షిణ భారతం దిశగా భౌగోళిక విస్తరణ క్రమాన్నీ వెల్లడిస్తూ ఉండచ్చు. దానికి తగినట్టే స్త్రీపురుష సంబంధాలు మొరటుతనం నుంచి నాజూకును సంతరించుకుంటూ ఉండచ్చు.

మరింత విపులమైన పరిశీలన చేయవలసిన ఆ అంశాన్ని అలా ఉంచితే, నలదమయంతుల కథలో చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి తర్వాత….

-కల్లూరి భాస్కరం

ఏకలవ్యుడి బొటనవేలు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఏకలవ్యుడి గురించి రాద్దామని మొదలు పెట్టబోయేసరికి ఒక ఉదంతం గుర్తొచ్చింది…

అప్పుడప్పుడే నేను కాలేజీ చదువులోకి అడుగుపెట్టాను. మా నాన్నగారు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. ఆ సమయంలోనే కరటూరి సత్యనారాయణగారు వాణిజ్యపన్నుల అధికారిగా ఉండేవారు. సత్యనారాయణగారు కవి కూడా. ఆయన అప్పటికే కొన్ని పద్యకావ్యాలు రాశారు. కొత్తగా ‘కరుణాసౌగతము’ అనే ఖండకావ్యం రచించారు. అది బుద్ధుడికి సంబంధించిన కొన్ని కథలను దండగుచ్చిన కావ్యం. ఆ కావ్య ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు.

వాణిజ్యపన్నుల అధికారికి సంబంధించిన కార్యక్రమం కదా… పట్టణంలోని వర్తకప్రముఖులందరూ రంగంలోకి దిగారు. ఉభయగోదావరి జిల్లాలలోని పలువురు సాహితీ ప్రముఖులను వక్తలుగా ఆహ్వానించారు. అందులో సంప్రదాయ, ఆధునిక అన్న తేడా చూపించలేదు. అలా ఆ సభ, ఓ అరుదైన ఉభయసాహితీ సమ్మేళనం. ఆధునికులలో నాకు బాగా గుర్తున్న పేరు ఆవంత్స సోమసుందర్ గారు. సంప్రదాయపండితులలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు కూడా ఉన్నట్టు జ్ఞాపకం. స్థానిక సాహితీ ప్రముఖులు దిగుమర్తి సీతారామస్వామిగారు సభాధ్యక్షులు. మా నాన్నగారు వక్తలలో ఒకరు.

ఇంటికి వాహనం పంపించారు. మా నాన్నగారితో నేనూ వెళ్ళాను.

సభ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో. మేము వెళ్ళేటప్పటికే కుర్చీలు చాలావరకు నిండిపోయాయి. ఎక్కువమంది వర్తకులే. వారి మెడల్లో ఒంటిపేట బంగారపు గొలుసులు, చేతికి బంగారపు చెయిన్ తో రిస్టువాచీలు, వేళ్ళకు రవ్వల ఉంగరాలు జిగేలుమంటున్నాయి. సాహితీ ప్రముఖుల ఎదురుకోలు సన్నాహాలు, పన్నీటి చిలకరింపులు, స్వాగతాలు వగైరాలు ముగిసిన తర్వాత సభ ప్రారంభమయింది. కనీసం పదిమంది వేదికను అలంకరించినట్టు జ్ఞాపకం.

bhasaram garu

ఆవిష్కరణ ముగిసి ప్రసంగాలు జరుగుతున్నాయి. వివరాలు నాకు గుర్తులేవు కానీ, ‘ఎవరో రసమా. భావమా?” అనే చర్చ లేవదీశారు. చూస్తుండగానే ఆ చర్చ సంప్రదాయ, ఆధునికుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. సభాస్థలి వేడెక్కింది. అసలే కిక్కిరిసిన సభ. ఆపైన వేసవి కాలం. పైన పంకాలు తిరుగుతున్నా ఆ గాలి సరిపోవడం లేదు. వేసవి తాపానికి తోడు సభా తాపం. వర్తకశ్రేష్టులకు వేదిక మీద ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. బిక్కమొహాలు వేసి బెదురుచూపులు చూస్తున్నారు. వారి స్థూలకాయాలు కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతున్నాయి.

వక్తలను నియంత్రించడానికి అధ్యక్షులవారికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఎలాగో ఆవేశ కావేషాలు సద్దుమణిగి ఊపిరి పీల్చుకున్నాక సోమసుందర్ గారిని మాట్లాడమన్నారు. ఆయన ‘కరుణా సౌగతము’ అనే ఆ కావ్యంలోని అంగుళిమాలుని కథను ఎత్తుకుని, దానికి మహాభారతంలోని ఏకలవ్యుని కథ కూడా మేళవించి, ‘గురువులందరూ శిష్యద్రోహులే’ నంటూ కొత్త మంట రాజేశారు. దాంతో మళ్ళీ సంప్రదాయసాహితీవేత్తలనుంచి నిరసన…ఉభయుల మధ్య వాగ్యుద్ధం…

కాసేపటికి మా నాన్నగారి వంతు వచ్చింది… ఆయన ఒక స్వీయపద్యంతో ప్రసంగం ప్రారంభించారు. ఆ పద్యం ఇదీ!

నలువకు నాల్గు నాల్క లట నర్తనమాడెడు నీ తనుప్రభల్

తలకొక దారి వింత గతులన్ మెరయించిన మోసపోయి వా

దులు గొని మచ్చరింతురు బుధుల్ తదుదగ్రరుషాతమమ్ముపై

వెలిగెడు నీదు చిర్నగవు వెన్నెల పండువు మాకు భారతీ!

ఓ సరస్వతీదేవీ! బ్రహ్మదేవుడికి నాలుగు నాల్కలు కదా. ఆ నాలుకల మీద నువ్వు నాట్యం చేస్తూ ఉంటావు. అప్పుడు నీ శరీర కాంతులు పండితులకు ఒక్కొక్క విధంగా వింత గతుల్లో మెరిసిపోతూ కనిపిస్తాయి. దాంతో వారు మోసపోయి వాదులాటకు దిగి మత్సరం పెంచుకుంటారు. ఉగ్రమైన ఆ చీకటి నాలుకలపై వెలిగే నీ చిరునవ్వే మాకు వెన్నెల పండుగ- అని ఈ పద్యానికి అర్థం.

ఆశ్చర్యం! పద్యం ముగిసిందో లేదో, సభ అంతా చప్పట్లు… నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం హఠాత్తుగా మలయమారుతం వీచినట్టుగా వర్తక సభాసదుల ముఖాల్లో ఏదో తెలియని ఉల్లాసం. వారికి ఆ పద్యంలోని భావం అర్థమై కాదు. మా నాన్నగారని అనడం కాదు కానీ, పద్యం బాగా చదువుతారని ఆయనకు పేరు. శ్రావ్యమైన పద్యగానంతో సభ మీద ఆయన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు.

సరే, ఆయన సందర్భోచితంగా పద్యాన్ని ఎత్తుకున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆ వెంటనే పండిత సత్కారం నిర్వహించిన వర్తకముఖ్యుని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య ఈసారి సభలో నవ్వులు పూయించింది…

‘ఈయనెవరో మహానుభావుడు. ఈయనకు సంప్రదాయం తెలుసు. జంట వస్త్రాలతో సత్కరించాడు. నేను చాలా సభల్లో చూస్తూ ఉంటాను. శాలువా కప్పుతూ ఉంటారు. అలా ఏకవస్త్రం ఎవరికీ ఇవ్వకూడదు. పైన శాలువా కప్పుకుని కింద అలా వదిలేయాలనో ఏమిటో వాళ్ళ ఉద్దేశం’ అన్నారాయన. పండితచర్చ ఏమీ అర్థం కాక అంతసేపూ బిక్కచచ్చి ఉన్న వర్తకశ్రోతలకు అర్థమయ్యే మాటలివి. ఆ రిలీఫ్ వాళ్ళలో కనిపించింది.

కావ్యం మీద ఆయన ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు. కానీ గురువులందరూ శిష్యద్రోహులే నన్న సోమసుందర్ గారి వ్యాఖ్యను ప్రస్తావించి, ‘అది ద్రోహం కాదు, శిష్యులపై గురువు చూపిన విశేష అనుగ్రహం’ అనడం మాత్రం గుర్తుంది. ఎంత మా నాన్నగారు అయినా, ఆయన మాట నన్ను ఒప్పించలేకపోయింది.

***

నేను ఒక ప్రత్యేక అవసరం కోసం కరటూరి సత్యనారాయణగారిని బ్రాహ్మణేతరకవిగా చెప్పాల్సివస్తోంది. ఆయన బుద్ధుడి కథలు ఇతివృత్తంగా ఆ కావ్యం రాయడమే చూడండి…బుద్ధుడి కథలతో బ్రాహ్మణకవులు రాసిన కావ్యాలు అంత ఎక్కువగా కనబడవు. తిరుపతి వెంకటకవుల ‘బుద్ధచరిత్రము’, పింగళి-కాటూరి కవుల ‘సౌందరనందము’ వంటివి కొన్ని మినహాయింపులు. బుద్ధుడి పట్ల బ్రాహ్మణేతరకవులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నట్టు కనిపిస్తుంది. కవులనే ఏమిటి, బ్రాహ్మణేతర మేధావులకు కూడా. తెలుగువాళ్లలో బుద్ధుడిపై, బుద్ధుడి తాత్వికతపై ఆసక్తితో ప్రత్యేక అధ్యయనాలు చేస్తూవచ్చిన వారిలో బ్రాహ్మణేతర మేధావులే ఎక్కువగా కనిపిస్తారు. చరిత్రలోకి వెడితే బుద్ధుడి కాలంలో, బహుశా ఇంకా అంతకుముందే వైదిక/సనాతన ధోరణులకు సమాంతరంగా భిన్న తాత్విక ధోరణి ఒక్కోసారి జ్ఞాతంగా, ఒక్కోసారి అజ్ఞాతంగా ప్రవహిస్తూనే ఉందని అర్థమవుతుంది. వెనకటి రాజుల కాలంలో భర్త వైదికమతాన్ని అభిమానిస్తే, భార్య బౌద్ధాన్నో, జైనాన్నో ఆదరించడం, వాటికి చెందిన వ్యవస్థలకు దానాలు చేయడం కనిపిస్తుంది. ఈ విషయంలో స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు ఒక సామ్యం కనిపిస్తుంది. బి.ఎస్.ఎల్. హనుమంతరావుగారు రాసిన ఆంధ్రుల చరిత్రలో ఇందుకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.

ఆశ్చర్యమేమిటంటే, ఏనాడో బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచీ ప్రారంభమైన సమాంతర తాత్వికత అనే పాయ ఒక అంతర్వాహినిగా మారి, కాలం కల్పించిన హద్దులను దాటుకుంటూ తెలుగునేల మీద నేటికీ ప్రవహిస్తూ ఉండడం!

***

సోమసుందర్ గారు ప్రస్తావించిన అంగుళిమాలుడి కథ ఇలా ఉంటుంది…

అంగుళిమాలుడు తక్షశిలలో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. మంచి చురుకు, ప్రతిభ ఉన్నవాడు. దాంతో తోటి విద్యార్థులకు అతనిపై అసూయ కలిగింది. గురువుగారికి అతనిపై ఉన్నవీ, లేనివీ నూరిపోశారు. ఆయన అంగుళిమాలుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు. విద్యాభ్యాసం ముగిసి గురుదక్షిణ చెల్లించే సందర్భం వచ్చింది. ‘వెయ్యిమంది చిటికెన వేలు ఖండించి వాటిని నాకు గురుదక్షిణగా చెల్లించు’ అని అంగుళిమాలుని గురువు ఆదేశించాడు.

గురుదక్షిణ చెల్లించితీరవలసిందే. లేకపోతే గురుద్రోహం అవుతుంది. నేర్చుకున్న విద్య ఒంటబట్టకపోగా శాశ్వతంగా అపకీర్తిని మోయవలసివస్తుంది. కనుక గురువు కోరిన దక్షిణ చెల్లించడానికే అంగుళిమాలుడు సిద్ధపడ్డాడు. ఒక అరణ్యంలో ఉంటూ దారినపోయేవారిని అటకాయించి, చంపి వారి చిటికెన వేలును ఖండించి తీసుకునేవాడు. వాటన్నింటినీ మాలగా గుచ్చి తన మెడలో వేసుకునేవాడు. అందువల్ల అతనికి ‘అంగుళిమాలుడు’ అనే పేరు వచ్చింది. అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేళ్ళు అయ్యాయి. ఇంకొక్క వేలు దొరికితే వెయ్యీ పూర్తవుతాయి.

బుద్ధుడు అంగుళిమాలుడు ఉన్న అడవిమీదుగా ఒంటరిగా సంచారానికి బయలుదేరాడు. అనుయాయులు అంగుళిమాలుడి గురించి చెప్పి, వద్దని వారించారు. బుద్ధుడు వినలేదు. అంగుళిమాలుడు బుద్ధుణ్ణి చూశాడు. ఈరోజుతో వెయ్యి చిటికెన వేళ్లూ పూర్తవుతాయనుకుని సంతోషిస్తూ బుద్ధుణ్ణి అడ్డగించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అందకుండా బుద్ధుడు ముందుకు వెళ్లిపోయాడు. అంగుళిమాలుడు ఆయన వెంటపడ్డాడు. కానీ ఆయనను అందుకోలేకపోయాడు. అలసిపోయి చెమటలు కక్కుతున్న స్థితిలో ‘ఆగు’ అని ఒక్క కేక పెట్టాడు. బుద్ధుడు ఆగాడు. అంగుళిమాలుడు బుద్ధుని సమీపించాడు. అతని చేతిలో కత్తి ఉంది. అయినా బుద్ధుడు ఏమాత్రం తొణక కుండా అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అలాగే నిలబడిపోయాడు. అంగుళిమాలునికి ఆశ్చర్యం కలిగింది. చేతిలో ఉన్న కత్తి జారిపోయింది. బుద్ధుని పాదాల మీద పడ్డాడు. ఆ క్షణంలోనే బుద్ధుని అనుయాయిగా అతను పునర్జన్మ ఎత్తాడు.

***

ఇప్పుడు ఏకలవ్యుని కథకు వద్దాం.

మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసంలో ఇతని కథ ఉంది. దాని ప్రకారం ఏకలవ్యుడు హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కొడుకు. ద్రోణాచార్యుని ప్రసిద్ధిని విని ఆయన దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. వెళ్ళి ద్రోణుని కలిశాడు. అతను నిషాదుడు(బోయ)కనుక అతణ్ణి శిష్యుడిగా చేసుకోడానికి ద్రోణుడు ఒప్పుకోలేదు. దాంతో ఏకలవ్యుడు ఆయన అనుమతి తీసుకుని, మట్టితో ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకుని భక్తితో దానికి మొక్కుతూ విలువిద్యను సాధన చేసి ప్రావీణ్యం సంపాదించాడు.

అలా ఉండగా పాండవులు, కౌరవులు కలసి గురువు ద్రోణాచార్యుని అనుమతి తీసుకుని ఏకలవ్యుడు ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. వేట కుక్కలను తీసుకుని వారి వెంట భటులు కూడా వెళ్లారు. ఆ కుక్కల్లో ఒకటి మిగిలిన కుక్కలనుంచి వేరుపడి ఏకలవ్యుడున్న చోటికి వెళ్ళి అతణ్ణి చూసి మొరగడం ప్రారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు ఎంతో లాఘవంగా ఏడు బాణాలను దాని నోట్లోకి ప్రయోగించి నోరు మూశాడు. అది ఆ బాణాలు అలా ఉండగానే కురుపాండవుల దగ్గరకు పరుగెత్తింది. వారు దానిని చూడగానే ఆశ్చర్యపోయారు. అంత లాఘవంగా బాణాలు ప్రయోగించింది ఎవరా అనుకుంటూ వెతుకుతూ ఏకలవ్యుడున్న చోటికి వచ్చారు. దుమ్ము కొట్టుకున్న బలిష్టమైన దేహంతో, జడలు కట్టిన జుట్టుతో, జింక చర్మం ధరించి, ధనుర్బాణాలు పట్టుకుని ఉన్న ఏకలవ్యుడు వారికి కనిపించాడు. అతనిపై వారికి అసూయ కలిగింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘నువ్వెవరు, ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నా’వని అడిగారు. తను హిరణ్యధన్వుని కొడుకునని, ద్రోణుని శిష్యుడినని అతను చెప్పాడు.

untitled1

హస్తినాపురానికి తిరిగి వచ్చిన కురుపాండవులు ఇదంతా ద్రోణుడికి చెప్పారు. ఆ తర్వాత అర్జునుడు ఒక్కడే ఏకాంతంగా ద్రోణుని కలుసుకున్నాడు. ‘విలువిద్యలో నాకు ఎవరూ సాటిరాని విధంగా విద్య నేర్పుతానని మీరు మాట ఇచ్చారు. విలువిద్యలో నేనే కాదు, ముల్లోకాలలోనూ ఎవరూ ఆ బోయవాడికి సాటి రారు. నాకంటే, మీకంటే, లోకంలో అందరి కంటే ధనుర్విద్యలో అతడు నేర్పరి. పైగా మీ ప్రియశిష్యుడే నట’ అంటూ ఎత్తిపొదుపు మాటలు మాట్లాడాడు.

ద్రోణుడు అదిరిపడ్డాడు. ‘పద, అతణ్ణి చూద్దాం’ అంటూ అప్పటికప్పుడు అర్జునుని వెంటబెట్టుకుని ఏకలవ్యుడు ఉన్నదగ్గరకు వెళ్ళాడు. ఏకలవ్యుడు ఆయనకు ఎదురేగి పాదాభివందనం చేసి, ‘నేను మీ శిష్యుడిని, మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ విలువిద్య నేర్చుకున్నాను’ అన్నాడు. ‘అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. ‘ఇది నా దేహం, ఇది నా సంపద, వీళ్ళు నా పరిజనం. వీటిలో మీకు ఏది ఇష్టమో చెప్పండి, సంతోషంగా ఇస్తాను’ అని ఏకలవ్యుడు అన్నాడు. ‘నీ కుడి చేతి బొటనవేలును ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. వెంటనే ఏకలవ్యుడు బొటనవేలును ఖండించి ద్రోణుడి చేతుల్లో పెట్టాడు. ఆ బొటనవేలుతోనే అతని విలువిద్యా లాఘవమూ పోయింది. అర్జునుడి మనసు చల్లబడింది.

***

సరే, ఏకలవ్యుడిపై అర్జునుడి అసూయ, ద్రోణుడు అతనికి చేసిన అన్యాయం ఈ కథలో ఒక కోణం. చాలా కాలంగా చర్చలో ఉన్న కోణం. సౌదా తన ‘అపూర్వ పురాణకథలు’లో చిత్రించిన బర్బరీకుని పాత్ర కూడా ఇలాంటిదే. ఒక ఆటవిక స్త్రీకి భీముని వల్ల జన్మించిన బర్బరీకుడు కూడా మంచి విలుకాడు. అతను మహాభారత యుద్ధంలో పాల్గొనాలని ఉత్సాహపడతాడు. కానీ కృష్ణుడు అది జరగనివ్వడు. పైగా యుద్ధానికి ముందు అతణ్ణి ‘వీరబలి’ ఇస్తారు. దానికి ఉపశమనంగా అతని శిరస్సుకు యుద్ధాన్ని తిలకించే అవకాశం ఇస్తారు.

నేను ముందుకు తెచ్చే ప్రశ్నలు భిన్నమైనవి. అసలు విలువిద్యలో ఎవరు గురువు, ఎవరు శిష్యుడు అన్నది వాటిలో మొదటిది. ఏకలవ్యుడు అనే బోయకు ద్రోణుని గురువుగా చేసుకుని ఆయన దగ్గర ఉన్న అస్త్రవిద్య అంతా నేర్చుకోవలసిన అవసరం ఏమిటన్నది రెండవది.

మొదటి ప్రశ్నకు వస్తే, అసలు విలువిద్య ప్రప్రథమంగా ఆటవికులది, అంటే ప్రస్తుత సందర్భంలో ఏకలవ్యుడిది. కనుక విలువిద్యలో ఆటవికులే అసలు గురువులు. ఈ దృష్ట్యా ద్రోణుడి లాంటి మైదానప్రాంతవాసులు ఆటవికులకు శిష్యులు కావడమే న్యాయం. కానీ ఇక్కడ తలకిందులవుతోంది. ఆటవికుడైన ఏకలవ్యుడు శిష్యుడు, మైదానవాసి అయిన ద్రోణుడు గురువు అవుతున్నారు. విషాదం ఏమిటంటే, తనదైన విద్యను పరుల నుంచి ఏకలవ్యుడు నేర్చుకోవాలని అనుకోవడం.

ఇక్కడ ఇంకో తేడా కూడా ఉంది. విలువిద్య ఆటవికులలో లేదా ఆదిమ జాతులలో ప్రధానంగా అన్నసంపాదనలో భాగంగా పుట్టిందే తప్ప మనుషుల్ని చంపే మారణాయుధంగా కాదు. విల్లు, బాణాలే కాక; ఇతర ఆయుధాలు కూడా అన్న సాధనాలుగా పుట్టినవే. రాంభట్ల కృష్ణమూర్తిగారి ‘వేదభూమి’ నుంచి ఉటంకించుకుంటే; శావేజీ ద్వితీయదశకు వచ్చేసరికి (మోర్గాన్ ప్రాక్చరిత్రను శావేజీ, బర్బరదశలుగా విభజించాడు. మళ్ళీ ఒక్కొక్క దశనూ మూడు అంతర్దశలుగా విభజించాడు) మనిషి నిప్పులో చేపల్ని కాల్చుకుని తినగలిగే స్థితికి వచ్చాడు. రాతి పనిముట్లతో ముడిగల చెట్టుకొమ్మను గదగా మలచుకున్నాడు. గట్టి కొయ్యతో త్రిశూలాన్ని చేసుకున్నాడు. త్రిశూలం అంటే మూడు కొనలూ పైకి ఉండే ఆయుధం కాదు. ఒక కొన వెనక్కీ, రెండు కొనలు ముందుకీ ఉండేది. అలాంటి అమరికే చేపల్ని పట్టుకోడానికి అనువుగా ఉంటుంది. పాశం కూడా చేపల్ని పట్టుకోడానికి ఉద్దేశించినదే. ఇక మూలమట్టంగా ఉండే కొయ్యను చక్రంగా మలచుకుని జంతువుల మీద ప్రయోగించేవాడు. అది జంతువును పడగొట్టనైనా పడగొడుతుంది, గురి తప్పితే విసిరిన వాడి చేతికే తిరిగి వస్తుంది. దీనిని తెలుగులో ‘వలరి’ అన్నారు. అరవంలో ’వలయత్తడి’ అన్నారు. ఆస్ట్రేలియా ఆదివాసులు ‘బూమరాంగ్’ అన్నారు. గద, త్రిశూలం, పాశం, చక్రం అనే ఆయుధాల పుట్టుక నేపథ్యం ఇదీ.

ధనుర్బాణాల విషయానికి వస్తే, అవి శావేజీ తృతీయదశ ప్రారంభంలో పుట్టాయి. ధనుర్బాణాలు చాలా సంక్లిష్టమైన యంత్రం. వేల సంవత్సరాల అనుభవం రాసిపడిన తర్వాతే ఈ గుణాత్మక నైపుణ్యం అలవడిందని రాంభట్ల అంటారు. అదివరకటి ఆయుధాలు ముఖాముఖీ ప్రయోగించడానికి మాత్రమే వీలైనవి. బాణాలను చాటునుంచి కూడా ప్రయోగించవచ్చు. అందుకే ఈ ఆయుధానికి మహత్యాలు పుట్టాయని ఆయన అంటారు.

ఇక్కడ జరిగింది ఏమిటంటే, అన్న సంపాదనలో భాగంగా ఆటవికులు సృష్టించిన ధనుర్బాణాలు ఆటవికేతరుల చేతికి వచ్చేసరికి మారణాయుధంగా మారిపోయాయి. అంటే, వాటి ప్రయోజనమే మారిపోయింది. ద్రోణుడు విలువిద్యను సాధనచేసి, ప్రావీణ్యం గడించింది, ఒక మారణాయుధంగా మాత్రమే! క్షత్రియులకు మారణాయుధంగానే విలువిద్యతో అవసరం కనుక ద్రోణుడు క్షత్రియ కూటమికి దగ్గరగా ఉన్నాడు. అది ఉభయులకూ లాభదాయకమైన సంబంధం. కనుక తన విద్యను అతను ఇంకొకరికి ఇచ్చే ప్రశ్న లేదు.

విలువిద్యతో ఏకలవ్యుడి అవసరం వేరు. అతనింకా అన్న సంపాదనకోసం విల్లమ్ములపై ఆధారపడే ఆటవిక దశలోనే ఉన్నాడు. అందుకు సరిపోయే విలువిద్య అతనికి అడవిలోనే లభిస్తుంది. ద్రోణుడి దాకా వెళ్ళనవసరమే లేదు. ఏకలవ్యుడు అడవికి కాబోయే రాజు కావచ్చు కానీ, అతనికి రాజ్య విస్తరణ దాహం ఉండే అవకాశం లేదు. శత్రుభయం ఉండే అవకాశమూ తక్కువే. ఒక వేళ ఉందనే అనుకున్నా; కురు-పాండవుల యుద్ధంలో మాదిరిగా భారీ సైనిక, ఆయుధసంపద, సంక్లిష్టమైన వ్యూహప్రతివ్యూహ చాతుర్యం అవసరంలేదు.

ఒక పోలిక చెప్పాలంటే, కత్తులు, కటార్లతో రెండు గుంపుల మధ్య జరిగే ఘర్షణకూ; శతఘ్నులు, ట్యాంకులు, యుద్ధవిమానాలతో రెండుదేశాల మధ్య జరిగే యుద్ధానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో; విలువిద్య అవసరంలో ఏకలవ్యుడికీ, అర్జునుడి లాంటి క్షత్రియుడికీ అంత తేడా ఉంటుంది.

అయినా సరే, ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? అంత విద్యను అతను ఏం చేసుకుంటాడు?! ఈ ప్రశ్నలను ఇంతవరకు ఎవరూ ముందుకు తెచ్చినట్టు లేదు.

తెగిన ఏకలవ్యుడి బొటనవేలు చెబుతున్న కథ కంటె, చెప్పకుండా దాచిన కథ వేరే ఉందా?! మనకు తెలియదు.

మరో అంశంతో వచ్చేవారం…

 

 

సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగు స్థానమే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎనిమిది వ్యాసాల క్రితం విడిచిపెట్టిన ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంలోకి తిరిగి వెడదాం…

అభినయంతో కూడిన మాంత్రిక వాస్తవికతకు మహాభారతంలోని సర్పయాగం, ధృష్టద్యుమ్న ద్రౌపదుల జన్మ వృత్తాంతం అద్దం పడుతున్నాయని చెప్పుకున్నాం. సంస్కృత భారతంలో కనిపించే ఆ చిత్రణ నన్నయ అనువాదంలో లోపించిందని కూడా చెప్పుకున్నాం. అయితే, సర్పయాగ ఉదంతంలో కొంత పరోక్షంగానూ, ధృష్టద్యుమ్న, ద్రౌపదుల వృత్తాంతంలో ప్రత్యక్షంగానూ ఇంకో విశేషం కూడా ఉంది. అది, మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ‘మహాభారతతత్త్వ కథనము’లో చెప్పిన ప్రకారం సంస్కృత భారత కథనం ఇలా ఉంటుంది…

ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. అప్పుడు యాజుడు,

“త్వరగా నీ భార్యను యజ్ఞవేదిక దగ్గరికి రప్పించు. ఆమె హవిస్సును స్వీకరించాలి. ఆమెకు కొడుకు, కూతురూ కూడా కలగబోతున్నారు” అంటూ ద్రుపదుని తొందరపెట్టాడు. యాజుడికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉంది.

ద్రుపదుని భార్యకు కబురు వెళ్లింది. కానీ ఆమె రాలేదు.

“నేను రజస్వలనయ్యాను. ఇలాంటి అస్పృశ్యస్థితిలో వెంటనే యజ్ఞస్థలికి రాలేను. స్నానం చేసి వస్తాను. అంతవరకూ ఆగండి” అని కబురు చేసింది.

అప్పుడు యాజుడు-

“ఇది యాజుడు(అంతటివాడు) సిద్ధం చేయగా, ఉపయాజుడు(అంతటివాడు) అభిమంత్రించిన హవిస్సు. నువ్వు ఎలా ఉన్నాసరే, ఈ ప్రయోగంలో ఆలస్యం జరగడానికి వీల్లేదు. (నువ్వు రా, రాకపో) మేము శుక్లశోణిత సంబంధం లేకుండానే స్త్రీపురుషుల జంటను పుట్టించగలం” అన్నాడు.

వెంటనే హవిస్సును హోమం చేశాడు. అప్పుడు కిరీట, కవచాలతో; ఖడ్గ, ధనుర్బాణాలతో జ్వాలావర్ణంలో ఉన్న ఒక పురుషుడు గర్జిస్తూ అగ్నిగుండం నుంచి అవతరించాడు. అదే సమయంలో ఒక అసమాన సుందరి యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమయింది. ఆమె శరీర సుగంధం దూరదూరాలకు వ్యాపిస్తోంది. స్వర్గలక్ష్మే మనిషి రూపం ధరించిందా అన్నట్టుగా ఉంది.

“ఈమె క్షత్రియ వినాశనం అనే ఒక దేవకార్యాన్ని నిర్వహిస్తుంది. ఈమె వల్ల కౌరవుల్లో భయోత్పాతం పుడుతుంది” అని ఆకాశం నుంచి ఒక అదృశ్యవాణి వినిపించింది.

వారే ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది.

***

హవిస్సును స్వీకరించడానికి ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం…నేను వెంటనే రాలేననీ, కొంతసేపు ఆగమనీ ఆమె కబురు చేయడం…ఆమె వచ్చినా రాకపోయినా శుక్ల, శోణిత సంబంధం లేకుండానే మేము స్త్రీ, పురుష జంటను సృష్టించగలమంటూ యాజుడు హవిస్సును అగ్నికి అర్పించడం…తక్షణమే అగ్నిగుండం నుంచి ధృష్టద్యుమ్నుడూ, యజ్ఞవేదిక మీద ద్రౌపదీ ప్రత్యక్షమవడం…ఈ సన్నివేశాల క్రమాన్ని ఒకసారి ఊహించుకోండి.

ఇందులో ఒక తొందర, ఒక టెన్షన్; సంభాషణ, అభినయంతో కూడిన ఒక నాటకీయత; అవన్నీ కలసి ఒక పతాకసన్నివేశానికి దారితీస్తుండడం స్పష్టంగా కనిపిస్తాయి. అంతిమంగా ఆ పతాకఘట్టం అప్పటికప్పుడు ఇరువురు స్త్రీ, పురుషుల అవతరణ అనే అద్భుతాన్ని ఆవిష్కరించింది!

ఇందులో అనుసరించిన నమూనా మనం ఇంతకుముందు చెప్పుకున్నదే. అది, సామూహిక నృత్యం, గీతం, అభినయం; లేదా మరో సామూహిక చర్య రూపంలో ఆదిమసమాజాలు అన్నీ అనుసరిస్తూ వచ్చిన మాంత్రిక ప్రక్రియే. భౌతిక వాస్తవికతపై భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా కోరుకున్న భౌతిక ఫలితాలను సాధించగలమన్న ఊహే దీనికి ప్రాతిపదిక. న్యూజీలాండ్ లోని మావోరీ తెగకు చెందిన యువతులు పొలానికి వెళ్ళి ఆలుగడ్డల పంట వృద్ధిని నృత్య, గీతాల ద్వారా ఎలా అభినయిస్తారో గతంలో చెప్పుకున్నాం.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ ఘట్టంలోనూ, సర్పయాగ ఘట్టంలోనూ కూడా యాగమే ఈ మాంత్రిక అభినయానికి సందర్భం అవుతోంది. నిజానికి ధృష్టద్యుమ్న, ద్రౌపదుల ఉదంతంలో రెండు అద్భుతాలు జరిగాయి. మొదటిది, వారు ప్రత్యక్షమైన తీరు అయితే, రెండవది శుక్ల, శోణిత సంబంధం లేకుండానే; అంటే పురుషుడు-స్త్రీ కలయిక లేకుండానే వారు జన్మించడం. యోని సంబంధం లేదు కనుక వారు ‘అయోనిజు’లు. ‘అయోనిజ’గా మనకు పరిచయమైన మరో పాత్ర, సీత. ప్రస్తుత సందర్భంలో ధృష్టద్యుమ్న ద్రౌపదులే కాక; స్వయంగా ద్రుపదుడు, ద్రోణుడు మొదలైనవారు కూడా యోని సంబంధం నుంచి పుట్టినవారు కాదు కనుక ‘అయోనిజు’ల కిందికే వస్తారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. కానీ సీత, ద్రౌపదుల విషయంలో చెప్పినట్టుగా మిగిలినవారి విషయంలో అయోనిజ కోణాన్ని సంప్రదాయం నొక్కి చెప్పడం లేదని కూడా అనుకున్నాం.

అలాగే ధృష్టద్యుమ్న, ద్రౌపదుల అవతరణ వెనుక ద్రుపదుని అసలు లక్ష్యం రాజకీయ సంబంధి. తనను అవమానించిన ద్రోణుడిపై పగ తీర్చుకునే కొడుకును పొందడమే అతని ప్రధాన లక్ష్యం. కిరీట, కవచాలతో, ఖడ్గ, ధనుర్బాణాలతో గర్జిస్తూ ధృష్టద్యుమ్నుడు జన్మించడం ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉంది. అది శత్రువుకు ఇవ్వవలసిన సందేశమూ ఇస్తూనే ఉంది. లౌకికంగా చెబితే, తనను ఓడించగల ఒక వీరుని ద్రుపదుడు సిద్ధం చేశాడన్న కబురు ద్రోణుడికి అందుతుంది. ఆ వీరుని ద్రుపదుడు దత్తు చేసుకుని ఉండవచ్చు. యాజ, ఉపయాజుల సాయంతో జరిపిన తంతు దత్తతకు సంబంధించిన తంతే కావచ్చు. అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న మాంత్రిక రూపాన్ని ఒక రాజకీయ అవసరానికి వాడుకుని ఉండచ్చు.

ద్రుపదుడి యజ్ఞానికి పూర్వరంగంలో జరిగింది గుర్తుచేసుకున్నా రాజకీయ అవసరానికే మాంత్రిక రూపాన్ని వాడుకున్నారన్న సంగతి అర్థమవుతుంది. అన్న యాజుడికంటే తపశ్శాలి అయిన ఉపయాజుడు స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి ఒప్పుకోలేదు. ఏడాదిపాటు ద్రుపదుని తన చుట్టూ తిప్పుకున్న తర్వాత, ధనం అవసరమైన తన అన్నను అడగమని చెప్పాడు. అన్నకు సహాయకుడిగా మాత్రమే తను యజ్ఞంలో పాల్గొన్నాడు. ఈ వివరాలు ఈ యజ్ఞం వెనుక ఏదో మాయ ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. విచిత్రం ఏమిటంటే, సర్పయాగం కూడా అటువంటి అనుమానాలనే కలిగిస్తుంది.

ఇంకొకటి కూడా చూడండి. ద్రుపదుడు కొడుకునే కోరుకున్నాడు తప్ప యజ్ఞవేదిక మీద కూతురు కూడా ప్రత్యక్షమవుతుందని మొదట అనుకోలేదని పై వివరాలు సూచిస్తున్నాయి. యాజుడు హోమం పూర్తి కావస్తున్న దశలోనే కొడుకూ, కూతురూ కూడా కలగబోతున్నారని చెబుతాడు. అతనికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉందని ఆ సందర్భంలో కథకుడు అంటున్నాడు. పైగా ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అవతరించిన తీరు ఒక్కలానే లేదు. ధృష్టద్యుమ్నుడు అగ్నిగుండంలోంచి ఉద్భవిస్తే, ద్రౌపది యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమైంది. అనంతర కథాక్రమాన్ని చూసినప్పుడు, సాక్షాత్తు అగ్నిగుండం నుంచి అవతరించిన ధృష్టద్యుమ్నుని కంటే యజ్ఞవేదిక మీద అవతరించిన ద్రౌపదే మహాభారతంలో కీలకపాత్ర అయింది.

ఇంకా విచిత్రం ఏమిటంటే, ద్రోణుని వధించడమే లక్ష్యంగా ద్రుపదుడు పొందిన కొడుకు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయాడు. ద్రోణుడు అస్త్రసన్యాసం చేసిన తర్వాతే, అంతా వద్దు వద్దంటున్నా వినకుండా ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శిరస్సును ఛేదించాడు. ఒక లక్ష్యంతో అగ్నిగుండం నుంచి పుట్టించినవాడు అలా చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ద్రౌపది అవతరించినప్పుడు అదృశ్యవాణి ఆమె గురించి చెప్పినట్టుగా ధృష్టద్యుమ్నుని గురించి చెప్పలేదు. కనుక అదృశ్యవాణి అనేది, జరిగిపోయిన కథను జరుగుతున్నట్టు చెప్పడంలో కథకుడు చేసిన ఆపాదనగా అర్థమవుతూనే ఉంది. అలా చూసినప్పుడు అసలు యజ్ఞమే ఒక ఆపాదన కావచ్చు. ద్రౌపదే అగ్నిగుండం నుంచి ఉద్భవించిందనీ, ధృష్టద్యుమ్నుడే యజ్ఞవేదిక మీద ప్రత్యేక్షమయ్యాడనీ చెప్పి ఉంటే అది భవిష్యత్తులో వారు నిర్వహించబోయే పాత్రలకు తగినట్టు ఉండేది. అయితే, ద్రుపదుడి కోణం నుంచి చూసినప్పుడు, కూతుర్ని పొందడం కన్నా కొడుకును పొందడమే అతని తక్షణావసరం కనుక, కొడుకు అగ్నిగుండం నుంచి పుట్టడమే అర్థవంతం కావచ్చు.

ద్రుపదుని భార్య సరళి ఇందులో మరో ఆశ్చర్యం. దత్తత స్వీకారమైనా, యజ్ఞమైనా ధర్మపత్నీ సమేతంగా చేయవలసిందే. సంప్రదాయం ప్రకారం, ధర్మపత్ని పక్కన లేనిదే భర్త ఎలాంటి శుభకార్యాలూ చేయకూడదు. కానీ ఇక్కడ ద్రుపదుని భార్య దగ్గరలేకుండానే యజ్ఞం జరిగిపోతోంది. అందులోనూ అది పుత్రునికోసం జరుగుతున్న యజ్ఞం. కబురు పంపినప్పుడు, నేను రజస్వలస్థితిలో అస్పృశ్యంగా ఉన్నాననీ, స్నానం చేసి వచ్చేవరకూ ఆగండనీ ఆమె చెప్పి పంపింది. ఈ వివరాల రీత్యా చూసినా అది ఎలాంటి యజ్ఞం అన్న అనుమానం కలుగుతుంది.

లేక, దత్తత స్వీకారం లేదా యజ్ఞం అనే తంతు కన్నా ముఖ్యమని భావించిన ఒక అంశాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు ఈ చిత్రణను ఉపయోగించుకుంటూ ఉండచ్చు. అది మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

పైన చెప్పిన మొత్తం ఉదంతాన్ని ఓసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి…ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదుని భార్యను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రుపదుడు, ద్రోణుడు పుట్టిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, సంతానోత్పత్తికి స్త్రీ సంబంధం అవసరం లేదని మరోసారి నొక్కి చెప్పడానికి కథకుడు ఈ ఘట్టాన్ని వాడుకున్నాడా అనిపిస్తుంది. ద్రుపదుని భార్య యజ్ఞవేదిక దగ్గరకు రానీ, రాకపోనీ; తను సిద్ధం చేసి, ఉపయాజుడు అభిమంత్రించిన హవిస్సే స్త్రీ, పురుషులను పుట్టిస్తుందని యాజుడు చెబుతున్నాడు. ఆవిధంగా సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను నిరాకరిస్తున్నాడు. నిజానికి ఇక్కడ ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదునికీ, ద్రుపదుని భార్యకూ కూడా భౌతికంగా ఎలాంటి పాత్రా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, ఇద్దరూ ఉద్భవించేనాటికి యవ్వన, లేదా కౌమారదశలో ఉన్నట్టు వారిని వర్ణించిన తీరు చెబుతోంది. కనుక, హవిస్సును స్వీకరించడానికి వెంటనే ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం, నేను అశుచిగా ఉన్నానని ఆమె వర్తమానం పంపడం, ఆమె రాకపోయినా సరే, శుక్ల, శోణిత సంబంధం లేకుండా మా మంత్రశక్తే పని జరిపిస్తుందని యాజుడు అనడంలో అర్థం లేదు. అయినా సరే, ద్రుపదుని భార్యను ముగ్గులోకి లాగి మరీ ఆమె అవసరాన్ని తోసిపుచ్చడం; సంతానోత్పత్తికి స్త్రీ అవసరం లేదని ఇంకోసారి నొక్కి చెప్పడానికే అనిపిస్తుంది. ఈ విధంగా ఇది మాతృస్వామ్య-పితృస్వామ్యాల ఘర్షణలో ఒక పార్శ్వాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***

ravi_varma-draupadi_carrying_milk_honey1

ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంపై పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగార్ల మధ్య జరిగిన వాదోపవాదాల గురించి తెలుసుకోవడం ఈ సందర్భంలో ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా పెండ్యాలవారి వాదం ఎలా ఉందో చూద్దాం:

ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది దత్తులు కావచ్చునని నిరూపించడానికి పెండ్యాలవారు ప్రయత్నించారు. ఆయన ఇలా అంటారు:

“ఇతడు(ధృష్టద్యుమ్నుడు) అగ్నిగుండమున జన్మించెనని మహాభారతములో నున్నది. కానీ ద్రోణ సంహారమే ప్రయోజనముగా నగ్నియం దయోనిజుడై జన్మించిన ధృష్టద్యుమ్నుడు యుద్ధములో ద్రోణుని జయించి వధించి యుండవలెను. అట్లు గా కితడు అస్త్రసన్యాసము గావించి యోగశక్తిచే ప్రాణములు విడిచిన ద్రోణశవకంఠమును మాత్రమే ఖండించియున్నాడు. ద్రోణవధ కితడు నిమిత్తమాత్రుడై యున్నాడు గాని, యితనివలన నైన దేమియు లేదు. ఇంతమాత్రమున నిత డగ్ని యంద యోనిజుడై యేల జన్మించెనో తెలియకున్నది.”

“కావున నితడు ద్రోణవధార్థము దత్తతగా స్వీకరింపబడినవాడనియు, నితని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను.”

“ద్రౌపది ద్రుపదునకు ధృష్టద్యుమ్నునితోబాటు దత్తపుత్రిక యని నా యభిప్రాయము. పుత్రేష్టిని బట్టియు, పంచేంద్రోపాఖ్యానమును బట్టియు విచారించి చూడగా ఋషికన్యయైన యామెను ద్రుపదుడు దత్తపుత్రికగా స్వీకరించె ననియే తోచుచున్నది.”

ఇక్కడ పెండ్యాలవారు “ఇతని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను” అని అనడం ప్రత్యేకించి ఆకర్షించే అంశం. ‘గ్రంథస్వభావం’ అనడం ద్వారా ఆయన ఎనభై, తొంభై యేళ్ళ క్రితమే సాహిత్యచర్చలోకి రూపా (form) న్ని తీసుకొస్తున్నారు. సంప్రదాయసాహిత్యంలో దివ్యత్వ లేదా అద్భుతత్వ ఆరోపాల కింద దృశ్యాదృశ్యంగా ఉన్న వాస్తవికతను, చరిత్రను గుర్తించడానికి ఈ రూప సంబంధమైన అవగాహన కీలకమైన తాళంచెవి.

అదలా ఉంచితే, వారణాసివారు సంప్రదాయ పాఠాన్ని ఉన్నది ఉన్నట్టు సమర్థిస్తూ పెండ్యాలవారి వాదాన్ని ఖండిస్తారు. సంప్రదాయపాఠం గురించి ఆయన అభిప్రాయం ఇదీ:

“ఈ ద్రౌపదీధృష్టద్యుమ్నాద్యుత్పత్తులు దివ్యకృత్యములు. ఆ దివ్యకృత్యములను బోధించుచున్న భాష దివ్యభాష. అట్టి మహాభారతమును తలక్రిందు చేసినవారు విమర్శకులు.”

“ఇంతమాత్రమున కిత డగ్ని యందేల జన్మించెనో?” అన్న పెండ్యాలవారి వ్యాఖ్యకు వారణాసివారి సమాధానం ఇలా ఉంటుంది:

“ఇదేమి శంక? ఇంత పని చేయగలవాడైనపుడే అగ్నియందు జన్మించునని యున్నదా యేమి? మంత్రసంస్కృతమైన హవిస్సునందు ద్రోణాంతకుడగు పుత్రుని జన్మింపజేయు అమోఘశక్తి యేర్పడినది. అట్టి హవిస్సు అగ్ని యందుంచబడినది. అందుచే నగ్ని నుండియే జన్మించెను. దీనికి శంక యేమున్నది?”

అయితే, ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శవ కంఠాన్ని మాత్రమే ఖండించాడన్న పెండ్యాలవారి వాదాన్ని తోసిపుచ్చుతూ, ద్రోణుడు ప్రాణాలతో ఉండగానే ధృష్టద్యుమ్నుడు అతని కంఠాన్ని నరికాడని వారణాసివారు నిరూపించిన తీరు సమంజసంగా అనిపిస్తుంది.

ఇంతకు మించి ఆసక్తి గొలిపేది శుక్ర(శుక్ల), శోణితాలపై ఈ ఇరువురి మధ్య జరిగిన చర్చ. పెండ్యాలవారు ఇలా అంటారు:

“స్త్రీపురుషుల శుక్రశోణిత సమ్మేళనము లేకుండగ జన్మ మొక్క శుక్లముచేతనే కలుగునని పూర్వపాశ్చాత్యశాస్త్రము లేవియు నంగీకరింపవు. ద్రోణజన్మకథ జూడగ ఘృతాచి యను నప్సరస భరద్వాజునకు ద్రోణుని గని యా బాలుని ద్రోణ కలశములో బెట్టగ భరద్వాజుడే పెంచి పెద్దవానిని జేసి యాతనికి ద్రోణుడని పేరు బెట్టి యుండె నని తోచును.”

శుక్ర, శోణిత సంబంధం లేకుండానే మనుషులతో సహా ప్రాణులు అనేకం పుట్టడం సాధ్యమే నని వారణాసి వారు అంటూ ఇందుకు సమర్థనగా వైశేషిక, వేదాంత దర్శనాల నుంచి; ఛాందోగ్యోపనిషత్తు నుంచి కొన్ని వాక్యాలను ఉదహరిస్తారు. ఛాందోగ్యోపనిషత్తు ప్రకారం, సంతానోత్పత్తిలో పురుషుడిది నాలుగవ స్థానమైతే, స్త్రీది అయిదవ స్థానం మాత్రమే. వారి వాదం ఇలా ఉంటుంది:

“(వైశేషిక దర్శనంలో) యోనిజము, అయోనిజము అని శరీరము ద్వివిధమనియు, శుక్రశోణిత సంబంధము లేకయే ధర్మవిశేషముచే కలుగునట్టి దయోనిజమనియు, నట్టిది దేవతల యొక్కయు, ఋషుల యొక్కయు శరీరమనియు, నట్టి అయోనిజు లుండిరనియు చెప్పబడినది.”

శుక్ర, శోణిత సంబంధంలేకుండానే క్రిమి కీటకాలు, చెట్లు మొదలైనవి పుట్టడం లేదా అని ఆయన ప్రశ్నిస్తూ, మనుషుల్లోనూ అది ఎలా సాధ్యమో ఛాందోగ్యోపనిషత్తును ఉటంకిస్తారు. దాని ప్రకారం, ఈ లోకంలో జన్మించడానికి అయిదు మార్గాలు ఉన్నాయి. 1. ద్యులోకం, అంటే ఆకాశం 2. పర్జన్యం, అంటే మేఘం. 3. భూమి. 4. పురుషుడు. 5. స్త్రీ. వారి వారి అర్హతలను బట్టి అవరోహణ క్రమంలో ఈ మార్గాలలో జన్మిస్తారు. 4(పురుషుడు), 5(స్త్రీ) స్థానాల కలయిక వల్ల సంతానం కలుగుతుందని చెప్పారే కానీ, మిగిలిన స్థానాలలో కలగదని చెప్పలేదు. కనుక ద్రోణుడు మొదలైనవారు అయిదవ స్థానమైన స్త్రీతో నిమిత్తం లేకుండానే, నాలుగవ స్థానమైన పురుషునిద్వారానే పుట్టారు. ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మొదలైనవారు 4,5 స్థానాలతో; అంటే పురుష-స్త్రీ సంబంధంతో నిమిత్తం లేకుండానే పుట్టారు.

ఇదీ వారణాసి వారు వినిపించిన వాదం.

సంతానోత్పత్తిలో స్త్రీ స్థానం అట్టడుగుకి జారిపోవడం, పురుషుడిని స్త్రీ కంటే పైన ఉంచడం ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయాలు. మాతృస్వామ్యంపై విజయం సాధించే ప్రయత్నంలో పురుషుడు సృష్టినే తలకించులు చేస్తున్నాడన్నమాట!

కొత్త అంశంతో వచ్చే వారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

చరిత్రలో ఒక అద్భుతం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎప్పుడో క్రీస్తు పూర్వ కాలంలో యూదుమతం, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవం మనిషిలోని బుద్ధిని లేదా ఇంగితజ్ఞానాన్ని తృప్తి పరచడానికి ప్రయత్నించాయని, క్రైస్తవం విద్యావ్యాప్తికి కృషి చేసిందనీ హెచ్. జి. వెల్స్ అన్న మాటే చూడండి…

ఈ మాట వెలుగులో మనల్ని పరిశీలించుకుంటే ఏమనిపిస్తుంది?!

ఇప్పటికీ మనదగ్గర బుద్ధి అనే పాత్రను ఖాళీగా ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తున్నామనిపిస్తుంది. పైగా దానిని ఇంత అయోమయపు మట్టితో నింపుతున్నాం కూడా. మన దేశం ఇంకా క్రీస్తుశకంలోకి రాలేదనడానికి ఇది కూడా ఒక నిదర్శనం.

ఈ సందర్భంలో నాకొకటి గుర్తొస్తోంది. ఓ రోజు పొద్దుటే టీవీలో ఒక ప్రసిద్ధ పౌరాణికుని ప్రవచనం వింటున్నాను. ఆయన భారతదేశం ఎంత గొప్పదో వివరిస్తున్నారు. ఇతర దేశాలకు భిన్నంగా ఇది కర్మభూమి అనీ, యజ్ఞభూమి అనీ, మిగతా భూములు పవిత్రమైనవి కావనీ అంటున్నారు. అలా కాసేపు ఆత్మస్తుతి, పరనింద చేసి, చివరగా భారతదేశం మొత్తమే ఒక దేవాలయం అని తేల్చారు.

విచిత్రం ఏమిటంటే, ఆయన సరిగ్గా ఆ మాటలు అంటున్నప్పుడే కింద వార్తలు స్క్రోల్ అవుతున్నాయి. వాటిలో ఒక టీచర్ అయిదేళ్ళ పసిపిల్లపై అత్యాచారం జరిపిన వార్త కూడా ఉంది!

ఆయన మాటలకూ, కింద స్క్రోల్ అవుతున్న ఆ వార్తకూ మధ్య ఎంత అంతరం, ఎంత అవాస్తవికత వ్యాపించి ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తాను. అంతకు మించి భయపెట్టేది అందులోని ఆత్మవంచన. ఆపైన ఆయన ఇంకో ఉద్ఘాటన కూడా చేశారు. అగ్ని ఆరాధన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదన్నదే ఆ ఉద్ఘాటన. నాకు ఆశ్చర్యమూ, బాధా కూడా కలిగాయి. ఆయనకు కొంచెం చరిత్ర తెలిస్తే ఎంత బాగుండుననిపించింది. నిజానికి అగ్ని ఆరాధన ప్రపంచమంతటా ఉంది. ఆ సంగతి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కూడా.

పురాతన మతాలకు భిన్నంగా యూదుల జుడాయిజం, క్రైస్తవం అనే రెండు పుస్తక మతాలు వ్యక్తుల బుద్ధికి పదును పెట్టే ప్రయత్నం చేస్తే; వ్యక్తులలోని ఇంగితజ్ఞానాన్ని చిన్నబుచ్చి, బుద్ధిని మొద్దుబారేలా చేసే ప్రయత్నం నేటికీ మనదేశంలో జరుగుతూనే ఉందన్న మాట!

దీనిని విమర్శగా కాక, ఆత్మవిమర్శగా తీసుకోవాలని కోరుతూ విషయంలోకి వెడతాను.

***

ప్రపంచంలో యూదుల ప్రాముఖ్యానికి కారణం, వారు లిఖిత సాహిత్యాన్ని అందించడమే నని వెల్స్ అంటారు. అంతేకాదు, ప్రపంచ చరిత్రను, శాసనాల సంపుటిని, ఉపదేశ గ్రంథాలను, కవిత్వాన్ని, కల్పిత సాహిత్యాన్ని, రాజకీయభావజాలాన్ని లిఖిత రూపంలో ప్రపంచానికి మొట్టమొదటగా అందించినది యూదులే. వీటిని పొందుపరచుకుంటూ క్రీ.పూ. 4-5 శతాబ్దాలలో రూపొందినదే హిబ్రూ బైబిల్. అదే క్రైస్తవంలో ‘ఓల్డ్ టెస్ట్ మెంట్’గా వ్యవహారంలోకి వచ్చింది.

యూదులు ప్రపంచం మొత్తంలోనే ఒక విలక్షణమైన జాతి. తటస్థంగా చెప్పుకుంటే, వారిలా విపరీతమైన వేధింపులకు, ఊచకోతకు గురైనవారు; వారిలా కొన్ని వందల ఏళ్లపాటు ప్రవాసదుఃఖాన్ని అనుభవించినవారు ఇంకొకరు కనిపించరు. చరిత్రపూర్వకాలం నుంచి, ఆధునిక కాలం వరకు వారి ఆరాట,పోరాటాలకు ఒక అవిచ్ఛిన్నచరిత్ర ఉండడం మరింత ఆశ్చర్యం గొలుపుతుంది. చరిత్రపూర్వకాలంలో ఈజిప్షియన్లు, చాల్దియన్లు తదితరులతో మొదలుపెట్టి ఆధునిక కాలంలో హిట్లర్ కత్తికి మెడవంచడం వరకు వారు పడిన హింసలోనూ ఒక క్రమం కనిపిస్తుంది.

అలాగే, రోమన్ల కంటే ముందు బహురూప ఆస్తికతను తుడిచిపెట్టి ఏకరూప ఆస్తికతను స్థాపించిడానికి ప్రయత్నించినవారు యూదులే. అది క్రీస్తుపూర్వ కాలంలో! అప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం క్రీస్తుశకంలో క్రైస్తవంతో ఒక కొలిక్కి వచ్చింది.

 

యూదులు లేదా హిబ్రూలు సెమెటిక్ జాతి. మొదట్లో వారికంత ప్రాముఖ్యమూ, గుర్తింపూ లేవు. క్రీ.పూ. 1000కి ముందే వారు జుడియాలో స్థిరపడ్డారు. ఆధునిక చరిత్రకారులనే ప్రమాణంగా తీసుకుంటే అది, మన మహాభారత కాలం కంటే కూడా ముందు. ఆ తర్వాత జెరూసలెం వారి రాజధాని అయింది. వారికి దక్షిణంగా ఈజిప్టు; ఉత్తరంగా సిరియా, అసీరియా, బాబిలోన్ ఉన్నాయి. అప్పట్లో చక్రం తిప్పుతూ వచ్చిన ఈ సామ్రాజ్యాల మధ్య ఒక రహదారిగా జుడియా ఉండేది. ఆ విధంగా యూదుల అస్తిత్వం మంచికైనా, చెడుకైనా ఈ సామ్రాజ్యాలతో పెనవేసుకోవలసివచ్చింది.

ప్రారంభంలో యూదులు అంత నాగరికులూ కారు, ఐకమత్యంగానూ లేరు. వారిలో చదవడం, రాయడం తెలిసినవారు కూడా చాలా కొద్దిమంది. మన కశ్యపప్రజాపతి, దక్షప్రజాపతిలా వారికి కూడా ఒక ప్రజాపతి(పేట్రియార్క్) ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయన బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి(క్రీ.పూ. 1750)కాలం వాడని అంచనా. అబ్రహాం నాయకత్వంలో యూదులు సంచారజాతిగా ఉండేవారు. బైబిల్ కథనం ప్రకారం, అబ్రహాం కనాన్ అనే ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ పాడి పంటలతో తులతూగే ఈ ప్రాంతాన్ని మీకు నివాసంగా చేస్తున్నానని చెప్పాడు.

అబ్రహాం కొడుకు మోజెస్. అతని కాలంలో యూదులు ఈజిప్టుకు బందీలయ్యారు. చాలాకాలం పాటు అక్కడ ప్రవాస జీవితం గడిపారు. ఆ తర్వాత నలభై ఏళ్లపాటు దేశదిమ్మరులుగా గడిపారు. అప్పటికి పన్నెండు తెగలుగా విస్తరించారు. అయితే, అబ్రహాం తమకు వాగ్దానం చేసిన కనాన్ తీరప్రాంతాన్ని ఏజీయన్లు అయిన ఫిలిస్తీన్లు అప్పటికే ఆక్రమించుకుని ఉన్నారు. ఆర్యులు తరిమేస్తే ఫిలిస్తీన్లు అక్కడికి వలస వచ్చారని ఇంతకుముందు చెప్పుకున్నాం. అబ్రహాం వారసులు కనాన్ ఆక్రమణకు ప్రయత్నించారు. ఏవో కొన్ని కొండ ప్రాంతాలు మాత్రమే వారి చేజిక్కాయి. కొన్ని తరాలపాటు అబ్రహాం వారసులు ఆ కొండప్రాంతాలలో అనామక జీవితం గడిపారు. మధ్య మధ్య వారికీ, ఫిలిస్తీన్లకు, అక్కడున్న చిన్న చిన్న ఇతర తెగలవారికి ఘర్షణలు జరుగుతూనే ఉండేవి. బైబిల్ లోని బుక్ ఆఫ్ జడ్జెస్ లో వాటి వివరాలు ఉన్నాయి.

జడ్జీలు అంటే ఇక్కడ యూదుల పూజారులు. వారే యూదులను పాలించేవారు. కానీ, యుద్ధాలకు నాయకత్వం వహించే వ్యక్తి అవసరమని భావించి క్రీ.పూ.1000 ప్రాంతంలో పూజారుల స్థానంలో యూదులు సౌల్ అనే అతన్ని రాజుగా చేసుకున్నారు. ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో సౌల్ మరణించాడు. ఫిలిస్తీన్లు అతని మృతదేహానికి మేకులు కొట్టి ఒక గోడకు వేలాడదీశారు.

సౌల్ కొడుకే డేవిడ్! ‘డేవిడ్ అండ్ గోలియెత్’ కథలో హీరో. యూదుల చరిత్రలో ఎంతోకొంత స్వర్ణయుగంగా చెప్పుకోదగింది అతని కాలమే. అందుకు కారణం, ఫొనీషియన్ల నగరమైన టైర్ తో వారికి ఏర్పడిన స్నేహసంబంధాలు.

untitled

ఆ నగరాన్ని హీరామ్ అనే రాజు పాలించేవాడు. అతను మంచి మేధావి, ఉత్సాహవంతుడు. ఫొనీషియన్లు నౌకావర్తకంలో ఆరితేరినవారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. సాధారణంగా వారి వర్తక నౌకలు ఈజిప్టు మీదుగా ఎర్ర సముద్రానికి చేరుకునేవి. అయితే, ఈజిప్టు అప్పుడు అల్లకల్లోలంగా ఉంది. ఆ మార్గంలో మరికొన్ని ఇతర ఆటంకాలూ ఎదురయ్యాయి. దాంతో హీరామ్ ఎర్రసముద్రం చేరుకోడానికి వేరే మార్గాన్ని వెతుక్కోవలసివచ్చింది. యూదుల కొండ ప్రాంతం నుంచి వెళ్ళే మార్గం అనుకూలంగా కనిపించింది. హీరామ్ డేవిడ్ తోనూ, ఆ తర్వాత అతని కొడుకు సోల్మన్ తోనూ స్నేహం చేశాడు. అతని సాయంతోనే జెరూసలెంలోని ఆలయం, గోడలు, రాజప్రాసాదం నిర్మాణమయ్యాయి. దానికి ప్రత్యుపకారంగా తమ ప్రాంతం మీదుగా ఎర్ర సముద్రానికి వెళ్ళే మార్గాన్ని హీరామ్ ఉపయోగించుకోడానికి, తమ భూభాగం మీద నౌకలను నిర్మించుకోడానికి యూదులు అనుమతించారు. అప్పటినుంచి జెరూసలెం మీదుగా ఫొనీషియన్లు అటు ఉత్తరంవైపు, ఇటు దక్షిణంవైపు పెద్ద ఎత్తున వర్తకం సాగిస్తూవచ్చారు. ఈ క్రమంలో యూదుల రాజు సోల్మన్ కూడా అంతకుముందు ఎన్నడూ ఎరగని సంపదను, వైభవాన్ని గడించాడు. చివరికి ఈజిప్టు ఫారో కూడా తన కూతురిని అతనికిచ్చి పెళ్లి చేశాడు.

అయితే యూదుల వైభవం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. సోల్మన్ మరణించిన తర్వాత ఈజిప్టు ఫారో షిషాక్(శశాంక్?) జెరూసలెంపై దాడి చేసి మూలమట్టంగా దోచుకున్నాడు. యూదుల రాజ్యంలోని ఉత్తరప్రాంతం జెరూసలెం నుంచి వేరుపడి, ఇజ్రాయిల్ పేరుతొ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. జెరూసలెం, జుడా రాజధానిగా ఉండిపోయింది.

పులి మీద పుట్రలా హీరామ్ కూడా మరణించాడు. దాంతో టైర్ నగరం నుంచి యూదులకు అందే సాయం ఆగిపోయింది. ఈజిప్టు మరోసారి బలం పుంజుకుంది. ఇజ్రాయిల్, జుడా రాజ్యాలు రెండూ అటు ఉత్తరరాన సిరియా, అసీరియా, బాబిలన్; ఇటు దక్షిణాన ఈజిప్టుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోవడం ప్రారంభించాయి. క్రి. పూ. 721లో ఆసీరియా ఇజ్రాయిల్ ను కబళించి అక్కడి యూదులను బందీలను చేసింది. దాంతో ఇజ్రాయిల్ చరిత్రలోనే అదృశ్యమైపోయింది. క్రీ.పూ. 608 వరకు ఎలాగో అస్తిత్వాన్ని కాపాడుకున్న జుడాకూ చివరికి ఇజ్రాయిల్ కు పట్టిన గతే పట్టింది. మీదులు, పర్షియన్లు, చాల్దియన్లతో యుద్ధాలలో అసీరియా తలమునక లవుతున్న సమయంలో ఈజిప్టు ఫారో నెకో-2 అసీరియాపై దాడి చేసి జుడా మీద పడ్డాడు. అతనితో జరిగిన యుద్ధంలో జుడా రాజు జోసయ్య ఓడిపోయి, హతుడయ్యాడు. జుడా ఈజిప్టుకు సామంత రాజ్యం అయింది. అసీరియన్లతో జరిగిన యుద్ధంలో గెలిచి, బాబిలోన్ ను ఆక్రమించుకున్న చాల్దియన్ రాజు నెబుచాద్ నెజ్జర్ ఈజిప్టు ఫారో నెకో-2ను వెళ్ళగొట్టి జుడాను ఆక్రమించుకున్నాడు. జెరూసలెంలో తన కీలుబొమ్మను రాజుగా ఉంచి బాబిలోన్ నుంచే దానిని పాలించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. జనం తిరుగుబాటు చేసి బాబిలోన్ అధికారులను ఊచకొత కోశారు. దాంతో నెబుచాద్ నెజ్జర్ జుడా రాజ్యం మొత్తాన్నే తుడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. జెరూసలెం మీదపడి దోచుకుని నగరాన్ని తగలబెట్టాడు. జనాన్ని బందీలుగా బాబిలోన్ కు పట్టుకుపోయాడు.

క్రీ.పూ. 538లో పర్షియన్ రాజు సైరస్ బాబిలోన్ ను ఆక్రమించుకునేవరకు వారు అక్కడే ఉన్నారు., ఆర్యుడైన సైరస్ వాళ్ళందరినీ ఒకచోట చేర్చి తిరిగి స్వదేశానికి పంపేశాడు. జెరూసలెంలోని ఆలయాన్ని, గోడలను పునర్నిర్మింపజేశాడు.

పాలకోసం రాయి మోసినట్టుగా, రెండు వివరాల కోసం ఈ చరిత్ర అంతా తడమాల్సి వచ్చింది. మొదటిది, ఋగ్వేదం ‘పణు’లుగా పేర్కొన్న ఫొనీషియన్లతో యూదుల మైత్రి గురించి చెప్పుకోవడం. రెండవది, బాబిలోన్ జీవితం వారిలో తెచ్చిన మార్పు.

బాబిలోన్ వారిని నాగరికులుగా మార్చడమే కాదు, సంఘటితం చేసింది. అంతకంటె ముఖ్యంగా వారిని రాజకీయ ప్రజగా మార్చింది. హిబ్రూ బైబిల్ ను, తమవైన సంప్రదాయాలను వారు రూపొందించుకున్నది బాబిలోన్ లో ఉండగానే. బందీలుగా బాబిలోన్ కు వెళ్ళిన వారికి, స్వేచ్చ పొంది తిరిగి స్వదేశానికి చేరుకున్న వారికి మధ్య ఎలాంటి పోలికా లేదు. ప్రపంచంలో అప్పటికి ఎవరికీ లేని ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకున్నారు. అందులో ప్రముఖ పాత్ర వహించింది, సరికొత్త రకానికి చెందిన వ్యక్తులు. వారే, ప్రవక్తలు!

ఈ ప్రవక్తలు రక రకాల మూలాల నుంచి వచ్చినవారు. ఉదాహరణకు ఎజేకిల్ అనే ప్రవక్త పూజారుల కులానికి చెందినవాడు. అమోస్ అనే ప్రవక్త గొర్రెల కాపరులలా గొర్రె చర్మం ధరించేవాడు. వీరికి ఒకరి అనుమతి కానీ, పదవిలో ఒకరు ప్రతిష్టించడం కానీ ఉండవు. వీరు ఒక్క ధర్మదేవతకు తప్ప మరెవరికీ విధేయత ప్రకటించరు. వారు నేరుగా జనంతో మాట్లాడతారు. ‘దేవుడు నాతొ ఇలా పలికిస్తున్నా’ డని చెబుతారు. వీరు అణువణువునా రాజకీయాన్ని రంగరించుకుని ఉండేవారు. ఈజిప్టు, అసీరియా, బాబిలోన్ ల మీద తిరగబడమని జనాన్ని ఉద్బోధించేవారు. సోమరితనం నిండిన పూజారి వ్యవస్థను, రాజుల దుర్మార్గాలను ఖండించేవారు. వీరిలో కొందరు సంఘ సంస్కరణకు కూడా పూనుకున్నారు.

ఈ ప్రవక్తల ఉద్బోధలకు అక్షర రూపమిచ్చి భద్రపరిచేవారు. యూదులు ఎక్కడికి వెళ్ళినా వాటిని తమ వెంట తీసుకువెళ్ళారు. ఈ సరికొత్త మత స్ఫూర్తిని వెళ్ళిన ప్రతిచోటా వెదజల్లారు. సామాన్య ప్రజానీకాన్ని పూజారుల నుంచి, ఆలయాల నుంచి, రాజుల నుంచి తప్పించి ధర్మదేవతకు అభిముఖంగా నిలబెట్టారు. మానవాళి చరిత్రలో ఇదే వారికి అత్యంత ప్రాముఖ్యాన్ని కల్పించింది. వ్యక్తిగత నైతికతను నొక్కి చెప్పడం రూపంలో యూదులు ప్రపంచానికి ఒక కొత్త శక్తిని అందించారు.

వెనకటి నగర రాజ్యాలలోని దేవుణ్ణి మనుషులు తమ చేతులతో తయారుచేసి దేవాలయంలో ప్రతిష్టించేవారు. ఆ దేవాలయాన్ని శత్రువులు కూలగొడితే దానితోపాటు దేవుడు కూడా కుప్పకూలేవాడు. కానీ యూదుల దేవుడు ఒక కొత్త ఆలోచన. ఆయన అదృశ్యంగా ఉంటాడు. ఏదో ఒక నగరానికి, ప్రాంతానికీ పరిమితం కాడు. పూజారులకు, బలులకు అతీతంగా అయన స్వర్గంలో ఉంటాడు. దేవాలయం కేంద్రంగా ఉన్న నాటి నగర రాజ్యాలు, వాటిపై జరిగే దాడులు, బలులు మొదలైనవి యూదుల దేవుడి అవతరణకు చారిత్రక నేపథ్యం అన్న సంగతి అర్థమవుతూనే ఉంది.

ముందే చెప్పినట్టు యూదులది పుస్తక మతం. బైబిల్ వాళ్ళకు సర్వస్వం. అదే వారిని సంఘటితంగా ఉంచింది. అంతే కాదు, జెరూసలెం వారికి నామమాత్రపు రాజధాని మాత్రమే; వారి నిజమైన రాజధాని బైబిలే. ‘యూదులు పూర్తిగా ఒక సరికొత్త ప్రజారూపం. వారికి ఒక రాజు లేడు, ఒక ఆలయం లేదు, కేవలం లిఖిత అక్షరమే వారిని కలిపి ఉంచింది’ అంటారు వెల్స్.

***

ఇక ఇప్పుడు బయలుదేరిన చోటికి మళ్ళీ వెడదాం. ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. అప్పటికి ప్రపంచ వర్తకం అంతా సెమిటిక్కులైన ఫొనీషియన్ల చేతుల్లోనే ఉండేదని, వారి వర్తక నౌకలు బ్రిటన్, అట్లాంటిక్ ల వరకు; ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు, బహుశా భారత దేశానికీ వెళ్ళేవని వెల్స్ అంటారు. అలా వెళ్ళిన సందర్భంలోనే పణులు లేదా ఫొనీషియన్లు ఋగ్వేదంలోకి ప్రవేశించి ఉంటారు. తాము వర్తకం జరిపే దేశాలలో వారు కాలనీలు ఏర్పాటుచేసుకునే వారు. మిగతా చోట్లలో సెమెటిక్కులకు, ఆర్యులకు ఘర్షణలు జరుగుతున్నట్టే ఇక్కడా జరగడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఘర్షణలే ఋగ్వేదానికి ఎక్కి ఉండవచ్చు.

మన దగ్గర చరిత్ర స్పృహ ఉండి ఉంటే, ఫొనీషియన్లు, యూదుల గురించిన ఎంతో కొంత చరిత్ర మనం కూడా నమోదు చేసి ఉండేవారమేమో! యూదుల పుస్తకమతం గురించిన ప్రస్తావన మన పురాణ, ఇతిహాసాలలో కూడా కనిపించేదేమో! మనకూ, పురాతన నాగరికతలకూ మధ్య ఒక చారిత్రక వారధి రూపుకట్టి ఉండేది. మనకు మనం ఆపాదించుకునే విశిష్టతలు, ప్రత్యేకతల గురించిన ఊహలకు అంతగా అవకాశం ఉండేది కాదు.

అదలా ఉంచితే, ఆర్యుల రాకతో ఫొనీషియన్లతో సహా సెమెటిక్కుల ప్రాభవం ప్రతిచోటా ఎలా అదృశ్యమైపోయిందో వెల్స్ రాస్తారు. క్రీ.పూ. 17వ శతాబ్ది నాటికి మొత్తం నాగరిక ప్రపంచాన్ని సెమెటిక్కులే ఏలుతూ ఉండేవారు. అయితే, క్రీ.పూ. 3వ శతాబ్ది నాటికి ప్రపంచమంతటా సెమెటిక్ ప్రాబల్యాన్ని ఆర్యులు తుడిచిపెడతారనీ, సెమిటిక్కులు ఆర్యుల కింద అణగిమణగి జీవించవలసి వస్తుందనీ, తలోవైపుకీ చెదిరిపోవలసివస్తుందనీ ఎవరూ ఊహించి ఉండరు. ఒక్క అరేబియాలోని సంచార జాతులైన బెడోవిన్లు ఆర్యుల దాడినుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకోగలిగారు. మరోవైపు యూదులు అనే చిన్న సమూహం ఇంత సంక్షోభంలో కూడా జెరూసలెంలో తమ పురాతన సంప్రదాయాలను అంటిపెట్టుకుని సంఘటితంగా ఉండిపోయారు. వారిని అలా సంఘటితంగా ఉంచినది, వారి బైబిలు!

చరిత్రలో ఇంకో అద్భుతం కూడా జరిగింది. ఆర్యుల కత్తికి తలవంచి గతవైభవాన్ని కోల్పోయిన బాబిలోనియన్లు, సిరియన్లు, ఫొనీషియన్లతో సహా అనేకులు క్రమంగా యూదు మతంలోకి ఆకర్షితులై బైబిల్ భాషే మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు, టైర్, సిడాన్, కార్తేజ్, స్పెయిన్ లోని ఇతర ఫొనీషియన్ నగరాలతోపాటు ఫొనీషియన్లూ హఠాత్తుగా చరిత్రనుంచి అదృశ్యమైపోయారు. ఒక్క జెరూసలెం లోనే కాక, అంతకుముందు ఫొనీషియన్లు అడుగుపెట్టిన స్పెయిన్, ఈజిప్టు, అరేబియా, తూర్పు దేశాలతో సహా ప్రతిచోటా అంతే హఠాత్తుగా యూదులు ప్రత్యక్షమయ్యారు.

మిగతా విశేషాలు తర్వాత…

సూర్యుని పండుగే క్రిస్టమస్!

bull sacrifice of Mitras

శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది…

ఆయన ఓ సినిమా పాటలో ‘బతుకు బరువు’ అని కాబోలు, రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు చూసేవారికి తెలిసిన పేరే. బతుకు బరువు అనే మాట వినగానే ఆయన భారంగా నిట్టూర్చి, ‘బతుకు మా సెడ్డ బరువు’ అంటే ఇంకా బాగుంటుం దన్నారట. ఆ మాట శ్రీశ్రీకి నచ్చి అలాగే ఉపయోగించారు. దీనికి ఓ బరువైన ముగింపు కూడా ఉంది. ఆ మరునాడే చదలవాడ కన్నుమూశారు!

పాపం, ఆ సవరణ సూచించిన సమయంలో చదలవాడ గుండెల్లో ఎంత బతుకు భారం మోస్తున్నారో! మరునాడే ఆయన మరణానికీ, ఆ సవరణకూ ఎలాంటి ముడి ఉందో తెలియదు. తెలిసే అవకాశంలేదు.

నిజమే, బతుకు మా సెడ్డ బరువే. ఇంతకీ మనిషి చరిత్రలో బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పుడు మారిందని అడిగితే, కచ్చితంగా చెప్పడం కష్టమే. లేక, మొదటినుంచీ అంతేనా?! ప్రకృతిశక్తులతో పోరాడుతున్న సమయంలోనూ బతుకు మా సెడ్డ బరువుగా అనిపించే ఉంటుంది. అయితే, అప్పుడు మనిషి ప్రకృతిశక్తులతో సంఘటితంగా పోరాడి ఉంటాడు. మనిషికి మనిషి తోడన్న భరోసా బతుకు భారాన్ని ఎంతో కొంత తగ్గించి ఉంటుంది. కానీ మనిషి మనిషితోనే పోరాడవలసిన దశ వచ్చేసరికి ఆ భరోసా పలచబారి బతుకు మా సెడ్డ భారంగా మారిపోయిందా?!

మొత్తానికి ఇహలోకం నరకమై, బతుకు భారమైపోయింది. కనుక కాసింత సుఖ సంతోషాలనిచ్చే స్వర్గం కోసం పాకులాడక తప్పదు. అంతవరకు ప్రకృతిశక్తులపై దేవతారోపణ చేసి ప్రసన్నత కోసం ప్రార్థించి ఉండచ్చు. కానీ తోటి మనిషే క్రౌర్యం మూర్తీభవించి కాలయముడు అయినప్పుడు ఒక చల్లని దేవినో, కరుణామయుడైన ఓ దేవుణ్ణో మానవరూపమిచ్చి సృష్టించుకోవడం అనివార్యమవుతుంది.

అసలు ఈ బతుకనే మా సెడ్డ బరువే లేకపోతే ఎలా ఉంటుంది?! అప్పుడు కావలసింది జన్మరాహిత్యం, లేదా మోక్షం. పోనీలే, ఈ జన్మలో సుఖం లేకపోతే వచ్చే జన్మలోనైనా ఉండకపోతుందా? దాంతో పునర్జన్మ మీద ఆశ…

ఇది చదివి నేనేదో ఆస్తిక-నాస్తిక చర్చలోకి వెడుతున్నానని దయచేసి అనుకోవద్దు. చరిత్రలోకి వెడితే, బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పటినుంచీ అయిందో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని నా తాపత్రయం.

   ***

ఈ బతుకు బరువవడం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో విధంగా అయుండచ్చు. మనం రోమన్ సామ్రాజ్యం గురించి చెప్పుకుంటున్నాం కనుక అప్పుడు ఏం జరిగిందో చూద్దాం.

క్రీస్తుశకం మొదటి రెండు శతాబ్దాలకు వచ్చేసరికి రోమన్ సామ్రాజ్యంలో మనిషి ఆత్మ సంక్షుభితం అయిపోయిందనీ, అంతులేని బాధా, నిస్పృహలలోకి జారిపోయిందనీ హెచ్.జి. వెల్స్ అంటారు. నిర్బంధమూ, క్రౌర్యమూ స్వైరవిహారం చేస్తూవచ్చాయి. గర్వించడానికీ, వైభవప్రదర్శనకూ లోటు లేదు. కానీ గౌరవప్రదమైన జీవితం, ప్రశాంతత, నిలకడైన సుఖసంతోషాలు లోపించాయి. పేదలు తిరస్కృతికి, అవమానానికి, దుర్భరమైన పీడనకు గురయ్యేవారు. అలాగని సంపన్నులు సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. నిరంతర అభద్రతలోనూ, ఎంతకూ తీరని కోరికల దాహంతోనూ అలమటించేవారు. రోమ్ నగరాలలో అర్థచంద్రాకారంలో రంగస్థలాలు ఉండేవి. అవే పౌరజీవితానికి కేంద్రంగానూ, కీలకంగానూ ఉండేవి. అక్కడ మనుషులకు, పశువులకు ప్రాణాంతకమైన పోరు జరుగుతూ ఉండేది. ఆ పోరులో వారు/అవి పడే చిత్రహింసలోనూ, అప్పుడు మడుగులు కట్టే ఎర్రని రక్తంలోనూ, పోరాడి పోరాడి నేల కొరిగే ఆ దురదృష్ట జీవుల్లోనూ వికృతానందాన్ని వెతుక్కునేవారు. కానీ అంతరాంతరాలలో అందరిలోనూ ఒక అశాంతి గూడుకట్టుకుని ఉండేది. అది మతరూపంలో వ్యక్తమవుతూ ఉండేది.

ప్రతి మతంలోనూ క్రమంగా ఆత్మ గురించిన భావన ఏర్పడుతూ వచ్చింది. మరోపక్క తర్కానికి అందని, చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో బహుదేవతారాధన సాగుతూనే ఉంది. మతంలో ఓదార్పును వెతుక్కునే ప్రయత్నంలో ఈజిప్షియన్లలో అమరత్వంపై కోరిక బలంగా వ్యక్త మవడం ప్రారంభించింది. అంతవరకు ఏ మతంలోనూ లేని అమరత్వ భావనను ప్రపంచానికి పరిచయం చేసింది ఈజిప్షియన్ మతమేనని వెల్స్ అంటారు. ఈజిప్టు విదేశీ దురాక్రమణలకు గురవుతూ, ఈజిప్టు దేవతలు రాజకీయ ప్రాముఖ్యాన్ని కోల్పోతున్న కొద్దీ, అమరత్వంలో ఓదార్పును వెతుక్కోవడం ఈజిప్షియన్లలో బలీయమవుతూ వచ్చిందని ఆయన అంటారు.

విదేశీ దురాక్రమణలు మన దేశం మీదా జరిగాయి కనుక, ఒకవైపు బహుదేవతారాధన, ఇంకోవైపు ఆత్మ, అమరత్వం గురించిన ఆలోచనలతో ఈజిప్షియన్ అనుభవం మన దగ్గరా ప్రతిబింబించి ఉండచ్చు. ఈ సందర్భంలో వెల్స్ మన దేశం గురించి ప్రస్తావిస్తూ, బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచే ఈ దేశంలోని ఆడా, మగా జీవితానందాలను త్యాగం చేసేవారనీ, వివాహబంధాన్ని, సంపదను నిరసించేవారనీ, ఇహ లోకపు ఒత్తిడులు, సమస్యలనుంచి తప్పించుకుంటూ ఆధ్యాత్మిక శక్తుల కోసం పాకులాడేవారనీ, ఆ ప్రయత్నంలో శరీరాన్ని హింసించుకునే వారనీ, ఏకాంత జీవితానికి మొగ్గు చూపేవారనీ ఆయన అంటారు. గ్రీకులలో కూడా ఇలాంటి ఆత్మహింసా పద్ధతులనే అనుసరించే పంథాలు ఉండేవి. ఆ పంథాలవారు శరీర అవయవాలను నరుక్కునే వరకూ వెళ్ళేవారు. మన దగ్గర కూడా మధ్యయుగాలలో వీరశైవం మొదలైన పంథాలలో ఇటువంటి పద్ధతులు ప్రబలంగా ఉండేవి. జుడియా, అలెగ్జాండ్రియాలలోని యూదు తెగల్లో కూడా ఇహలోక జీవితం మీద తీవ్ర వైముఖ్యం ఉండేది. క్రీస్తు శకం తొలి రెండు శతాబ్దాలలో ఈ ధోరణి ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రతి ఒకరూ మోక్షం గురించిన అన్వేషణలో తలమునకలయ్యేవారు. ఆ కాలపు పరిస్థితుల వల్ల కలిగిన నిరాశా, నిస్పృహలే అందుకు కారణమని వెల్స్ అంటారు. అంతకు ముందు దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన ఒక సమష్టి మతవ్యవస్థ ఉండేది. దేవాలయం పట్ల, పూజారి పట్ల జనంలో అచంచలమైన భక్తివిశ్వాసాలు ఉండేవి. నియమనిబంధనలపై, మతపరమైన తంతుపై పట్టింపు ఉండేది. ఈ కాలానికి వచ్చేసరికి అవి అంతరించాయి. దుర్భరమైన బానిసత్వం. క్రౌర్యం, భయాందోళనలు, ఆత్మన్యూనత, స్వార్థం, అట్టహాసం పడగవిప్పిన నాటి వాతావరణంలో ప్రతి ఒకరూ విరక్తికీ, అభద్రతకూ లోనయ్యేవారు. జీవితం పట్ల నిరాసక్తత, నిస్పృహలలోనే శాంతిని వెతుక్కునే వారు.

ఈజిప్టులో టొలెమీ చక్రవర్తి నిర్మింపజేసిన సెరాపియమ్ లో పీడితులు, తాడితుల కన్నీళ్లు వరదలు కట్టేవి…

   ***

రోమ్ సామ్రాజ్యం విస్తరించిన కొద్దీ ఈ సెరాపిస్-ఐసిస్ ఆరాధనా రూపం పశ్చిమ యూరప్ కు కూడా వ్యాపించింది. సెరాపిస్-ఐసిస్ ఆలయాలు, పూజారి వ్యవస్థ, అమరత్వం గురించిన ఆకాంక్షలు స్కాట్లాండ్, హాలండ్ ల దాకా వెళ్ళాయి. అయితే దీనితో పోటీపడే మతాలూ చాలానే ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది మిత్రాయిజం. ఇది పర్షియన్ల మతం. సంస్కృతంలో మిత్రు డంటే సూర్యుడని చెప్పుకున్నాం. బ్రాహ్మణులలో సంధ్యావందనం సూర్యుని ఉద్దేశించినదే. సంధ్యావందన మంత్రాలలో మిత్ర శబ్దం వస్తుంది. బ్రాహ్మణులలో, బహుశా క్షత్రియులలో కూడా మిత్రావరుణులు ఋషులుగా ఉన్న గోత్రాలవారు ఉన్నారు. క్షత్రియులలో సూర్యవంశ క్షత్రియులున్న సంగతి తెలిసినదే. పురాచరిత్ర కాలంలో సిరియాను మితానీ అనే తెగవారు పరిపాలించారు. వీరు మిత్ర సంబంధీకులే. ఒకనాటి అమెరికాతో సహా ప్రపంచమంతటా సుర్యారాధన ఉండేది. ఇంకా విశేషమేమిటంటే, డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్టమస్ కు, సుర్యారాధనకు సంబంధం ఉంది. అసలు డిసెంబర్ 25 సూర్యుడికి సంబంధించిన రోజు. సుర్యారాధకులను, అంటే మిత్రమతం వారిని క్రైస్తవులుగా మార్చే ప్రయత్నంలో వారికి ముఖ్యమైన రోజునే క్రిస్టమస్ గా మార్చారు. అంటే క్రైస్తవ మతంలో కూడా తనకు ముందున్న వివిధ ఆరాధనా పద్ధతులను తనలో కలుపుకునే థియోక్రేసియా జరిగిందన్నమాట. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశంలోకి ఇప్పుడు వెళ్ళలేం.

మిత్రమతం సెరాపిస్-ఐసిస్ ఆరాధనలా సంక్లిష్టమైన, అధునాతనమైన (అప్పటికి) ఆరాధనా విధానం కాదు. ఇది జంతుబలుల కాలానికి చెందిన మతం. ఈ మతం వారు ఒక మంచె మీద ఎద్దును ఉంచి డానిని బలి ఇచ్చేవారు. భక్తులు ఆ మంచె కింద నిలబడి ఆ ఎద్దు నుంచి ప్రవహించే రక్తంలో తడిసేవారు. ఈ రక్తం నుంచి కొత్త జీవితం పుట్టుకొస్తుందని నమ్మేవారు.

పై రెండే కాక మరెన్నో ఆరాధనా పంథాలు ఉండేవి. మన దేశంలో ఇప్పటికీ వివిధ కులాలవారికి, లేదా వేర్వేరు సామాజిక స్థాయులకు చెందినవారికి తమవైన ఆరాధనాపద్ధతులు, దేవీదేవతామూర్తులు ఉన్నట్టే, బానిసలతో సహా రోమన్ సామ్రాజ్యంలోని జనాలకూ ఉండేవి. రోమన్ నగరాలు అన్నింటిలోనూ అందరు దేవతలకు లెక్కకు మించిన ఆలయాలు ఉండేవి. అవిగాక రోమన్ల ప్రధానదైవమైన జూపిటర్ ఆలయం తప్పనిసరిగా ఉండేది. మరోవైపు రాజకీయ విధేయతను చాటుకోడానికి మొక్కుబడిగానైనా సీజర్ అలయానికీ వెళ్ళేవారు. అయితే, తమను ఈతిబాధలనుంచి కాపాడగలిగిన దయగల తల్లిగా ఐసిస్ నే నమ్ముకునేవారు.

ఆపైన మరెందరో స్థానిక దేవతలు ఉండేవారు. కొందరు దేవతల రూపాలు చిత్రవిచిత్రంగానూ ఉండేవి. ఉదాహరణకు సెవిల్లే అనే దేవత. ఫొనీషియన్లు కార్తేజ్ నగరంలో చాలాకాలంగా పూజిస్తూ వచ్చిన వీనస్ కు, ఈ దేవతకు సంబంధం ఉంది. మరోవైపు ఒక గుహలోనో, భూగర్భ ఆలయంలోనో మిత్రుని ఆరాధన జరుగుతూనే ఉండేది. ఇందులో సైనికులు, బానిసలు పాల్గొంటూ ఉండేవారు. మరోచోట యూదులు తమ ప్రార్థనామందిరంలో బైబిల్ చదువుకునే వారు. యూదుల దేవుడు అదృశ్యంగా ఉంటాడు. వారు విగ్రహారాధనకు విముఖులు. బహుశా వారు సీజర్ ఆలయానికి వెళ్ళి మొక్కడానికి, అక్కడ జరిగే పూజా తంతులో పాల్గొనడానికి వ్యతిరేకించి ఉంటారు. అలాగే, రోమన్ పాలకులు ఆదరించే ఇతర దేవుళ్ళను కూడా! అది వారికి రాజకీయంగా చిక్కులు తెచ్చిపెట్టే ఉంటుంది.

ఇంతకీ ఈ వివరాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టే బహురూప ఆస్తికత క్రీస్తుశకానికి ముందూ, ఆ తర్వాత మరికొంతకాలమూ రోమన్ సామ్రాజ్యంలోనూ ఉండేదని చెప్పడానికే. రోమన్ సామ్రాజ్యంలోనే కాదు, దాదాపు ప్రపంచమంతటా ఉండేది. ఈ సందర్భంలోనే మతరంగంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పునూ గుర్తుచేసుకోవాలి. అదేమిటంటే, పైన చెప్పుకున్న వాటిలో అనేకం ఇష్టదేవతారాధనలు. వ్యక్తిగత ముక్తిని లేదా బాధలనుంచి విముక్తిని కోరే ప్రైవేట్ ఆరాధనలు. అంతకు ముందున్న మతరూపం ఇలాంటిది కాదు. అది వ్యక్తిగతం కాక, సామూహికం, సాంఘికం. అది పారలౌకికం-లౌకికం, లేదా మతం- ప్రభుత్వం అన్న విభజన లేని దశ. ఉదాహరణకు నగర దేవతారాధన ప్రధానంగా రాజ్యానికి సంబంధించిన తంతు. ఆ తర్వాతే వ్యక్తిగతమైన తంతు. అప్పట్లో బలులు, పూజలు సామూహిక, బహిరంగ చర్యలే కానీ ప్రైవేట్ చర్యలు కావు. పైగా అవి సమష్టి భౌతిక అవసరాల కోసం జరిపే చర్యలు.

ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేసుకోవాలి. మతమూ, రాజకీయమూ ఇలా గాఢంగా పెనవేసుకున్న స్థితిలో రెండింటినీ విడదీయడానికి; అంటే రాజకీయం నుంచి మతాన్ని తప్పించడానికి మొదట ప్రయత్నించింది గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు. విశేషమేమిటంటే, రెండువేల సంవత్సరాల క్రితమే మతాన్నీ, రాజకీయాన్నీ విడదీయాలన్న ఆలోచన జరిగినా, ఇప్పటికీ దాని సాధ్యాసాధ్యాల గురించీ, దాని అవసరం గురించీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం! కనీసం మనదేశానికి పరిమితమై చూసినా ఈ విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత ఏర్పడలేదు. ఇంకోటి గమనించాలి. గ్రీకులు గానీ, రోమన్లు గానీ మతాన్నీ, రాజకీయాన్ని విడదీయాలని అనుకోడానికి కారణం- నాటి బహురూప ఆస్తిక ధోరణులే. ఈ పరిస్థితిలో ప్రభుత్వం, లేదా రాజ్యం ఏదో ఒక మతం వైపు అతిగా మొగ్గడం కందిరీగల తుట్టను కదపడమే నని వారు గ్రహించి ఉంటారు.

మొత్తానికి మతరంగంలో ఎన్ని మార్పులు జరిగినా అవన్నీ బహురూప ఆస్తికత అన్న చట్రంలోనే! ఆ చట్రం చెక్కు చెదరలేదు. కానీ ముందు ముందు ఆ చట్రం మీదే దెబ్బ పడబోతోంది. రాజకీయం నుంచి మతాన్ని వేరు చేయడానికి చూసిన రోమన్ పాలకులే క్రమంగా ఒకే ఒక అధికారికమతం వైపు అడుగు వేయబోతున్నారు. క్రౌర్యం, దౌర్జన్యం, పీడన, కన్నీళ్లు నిండిన నాటి పరిస్థితులలో; ఇంత శాంతి కోసం, కారుణ్యం కోసం సామాన్యజనం పరితపించడంలో ఆశ్చర్యంలేదు. పరోక్షంగా పాలకులను కూడా ఆ వాతావరణం ప్రభావితం చేయడంలోనూ ఆశ్చర్యంలేదు. దానికితోడు, అప్పటికి ఎంతో కాలంగానే ధర్మం, నీతి, కరుణ నిండిన ఒకే దేవుడి గురించిన భావనను యూదులు ప్రచారం చేస్తున్నారు. చివరికి అలాంటి దేవుడిలో శాంతిని వెతుక్కోడానికి నాటి పరిస్థితులు రోమ్ ప్రజానీకాన్ని మానసికంగా సిద్ధం చేశాయి.

మనం ఇప్పుడిక జీసస్ దగ్గరికి వస్తున్నాం!

     ***

తొలి రోమన్ చక్రవర్తి ఆగస్టస్ సీజర్ కాలంలో జీసస్ జుడియాలో జన్మించాడు. ఆయన గురించిన మొత్తం చరిత్రలోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు. కాకపోతే క్రైస్తవ సిద్ధాంతానికి ఒక రూపమిచ్చిన సెయింట్ పాల్ గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన అసలు పేరు సౌల్. ఆయన ఎన్నడూ జీసస్ ను చూడలేదు. పైగా మొదట్లో జీసస్ బోధలను వ్యతిరేకించాడు. జీసస్ ను శిలువ వేసిన తర్వాత స్వల్ప సంఖ్యలో ఉన్న ఆయన అనుచరబృందాన్ని హింసించడంలో ప్రముఖపాత్ర వహించాడు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా క్రైస్తవంలోకి మారి, తన పేరును పాల్ గా మార్చుకున్నాడు. ఆయన మంచి జిజ్ఞాసి అనీ, మేధావి అనీ, తన కాలం నాటి మతధోరణులను ఎంతో ఆసక్తిగా, లోతుగా ఆకళించుకున్నవాడనీ చెబుతారు. యూదుమతాన్ని, మిత్రమతాన్ని, అలెగ్జాండ్రియాలోని నాటి ఇతర మతాలను బాగా అధ్యయనం చేశాడు. వాటిలోని అనేక అంశాలను క్రైస్తవంలోకి తీసుకొచ్చాడు. ఉదాహరణకు, ఈజిప్టు దేవుడు ఓసిరిస్. ఈయన చావు-పుట్టుకల చక్రానికి ప్రతీక అని చెప్పుకున్నాం. సెయింట్ పాల్ జీసస్ కు ఓసిరిస్ తో సామ్యం చూపించి ఓసిరిస్ అనుయాయులను క్రైస్తవం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. జీసస్ కు కూడా పునరుత్థానాన్ని, అంటే చావు-పుట్టుకల చక్రాన్ని ఆపాదించాడు. అలాగే సూర్యారాధకులను క్రైస్తవం వైపు ఎలా ఆకర్షించారో పైన చెప్పుకున్నాం.

రోమన్ పాలకులు అనేకులు మొదట్లో క్రైస్తవాన్ని అంగీకరించలేదు. అణచివేయడానికి ప్రయత్నించారు. క్రీ. శ. 303 లో, డయోక్లెటియన్ చక్రవర్తి కాలంలో చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బైబిల్ రాతప్రతులను జప్తు చేసి ధ్వంసం చేశారు. క్రైస్తవులకు చట్ట రక్షణను తొలగించారు అనేకమందిని చంపేశారు. పుస్తకాలను ధ్వంసం చేయడం ఇక్కడ ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవలసిన విషయమని హెచ్. జి, వెల్స్ అంటారు. అక్షరానికి ఉన్న శక్తి ఆ కొత్త మతాన్ని సంఘటితంగా ఉంచుతోందని నాటి పాలకులు గ్రహించారు. క్రైస్తవం, జుడాయిజం అనే ఈ ‘పుస్తక మతాలు’ జనాన్ని విద్యావంతుల్ని చేసిన మతాలని కూడా వెల్స్ అంటారు. చదివి, అర్థం చేసుకోగలిగినవారివల్లే ఇవి అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. ఇక్కడే వెల్స్ ఇంకో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. పురాతన మతాలు ఏవీ ఈ రెండు మతాల్లా మనిషి బుద్ధికీ, మేధకు పని కల్పించే ప్రయత్నం చేయలేదు. అంటే పురాతన మతాల దగ్గరికి వచ్చేసరికి మనం బుద్ధిని, మేధను పక్కన పెట్టేయాలి.

క్రైస్తవాన్ని తుడిచిపెట్టడానికి డయోక్లెటియన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనేక ప్రాంతాలలో సాధారణ ప్రజలే కాక, అధికారులు కూడా క్రైస్తవంలోకి మారిపోయారు. క్రీ.శ. 317లో, అప్పటి గలేరియస్ చక్రవర్తి క్రైస్తవం పట్ల సహనం పాటించాలని ఉత్తర్వు జారీ చేశాడు. క్రీ.శ. 324లో కాన్ స్టాన్ టైన్ చక్రవర్తి మరణశయ్య మీద ఉండి బాప్టిజమ్ తీసుకుని క్రైస్తవంలోకి మారాడు. తన సైనిక ఫలకాల మీదా, జెండాల మీదా క్రైస్తవ చిహ్నాలు ఉండేలా ఆదేశించాడు.

ఆ తర్వాతే కొన్నేళ్లకే క్రైస్తవం రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతం అయిపోయింది. అంతవరకూ దానితో పోటీ పడిన పురాతన మతాలు అన్నీ అదృశ్యమైపోయాయి. లేదా క్రైస్తవంలో కలిసిపోయాయి. క్రీ.శ. 390లో థియోడోసియస్ చక్రవర్తి అలెగ్జాండ్రియాలోని బ్రహ్మాండమైన జూపిటర్ సెరాపిస్ విగ్రహాన్ని నేలమట్టం చేయించాడు. 5వ శతాబ్దినుంచి రోమన్ సామ్రాజ్యంలో అంతటా క్రైస్తవ ప్రార్థనా మందిరాలూ, క్రైస్తవ పూజారులే!

చక్రవర్తి నేలమట్టం చేయించిన జూపిటర్ సెరాపిస్ విగ్రహం, నిజానికి నేలమట్టమైన బహురూప ఆస్తికతకు ప్రతీక మాత్రమే. ఇలా ఏకరూప ఆస్తికతలోకి అడుగుపెట్టిన రోమ్, ఈ విషయంలో ప్రపంచానికే అతి పెద్ద వరవడి అయింది. అప్పటికీ బహురూప ఆస్తిక పంథాలను అనుసరిస్తూనే ఉన్నవారిని వెతికి వెతికి మరీ పట్టుకుని వారిపై మంత్రగాళ్ళు లేదా మంత్రగత్తెలన్న ముద్ర వేసి చంపుతూ వచ్చారు. అది నిఘంటువుకు witch-hunt అనే మాటను అందించింది.

మిగతా విశేషాలు తర్వాత….

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)–కల్లూరి భాస్కరం

 

 

 

 

అమ్మ…దేవత…జయలలిత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నాకు ఇక్కడ ఒకసారి వర్తమానంలోకి రావాలని బలంగా అనిపిస్తోంది…

అలాగని నేనిప్పుడు ప్రస్తావించబోయే అంశాలు, గత కొన్ని వ్యాసాలుగా చర్చిస్తున్న అంశంతో సంబంధం లేనివి కావు. మన పురాచరిత్రకూ; లౌకిక, పారలౌకికతలతో జమిలిగా అల్లుకున్న మన సంక్లిష్ట మనస్తత్వానికీ, చర్చించబోయే అంశాలకూ ఏదో ముడి ఉందనుకుంటున్నాను. లోపలికి వెడుతున్నకొద్దీ అది ఎలాంటిదో అర్థమవుతుందేమో చూద్దాం.

తమిళనాడు, పురాచరిత్రకోణంనుంచి నాలో ప్రత్యేకమైన కుతూహలం రేకెత్తిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం పురాచరిత్రకు స్పష్టమైన వర్తమాన ప్రతిబింబంలా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రెండోసారి జైలుకు వెళ్ళి పదిహేనురోజులు ఉండిరావడమే చూడండి… ఆమె జైలుకు వెళ్లినప్పుడు అభిమానులు, అనుయాయుల నిరసనతో రాష్ట్రం అట్టుడికింది. ఆ నిరసనలో కోపమే కాక, దుఃఖం కూడా ఉంది. భవిష్యత్తు గురించి భయం కూడా ఉండచ్చు. తమ నాయకుడు/నాయకురాలు ఇలాంటి విషమపరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అభిమానులు ఆత్మహత్యకు సైతం పాల్పడడం తమిళనాడులోనే ఎక్కువగా చూస్తుంటాం. ఈసారి కూడా ఆత్మహత్యలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని జయలలిత విజ్ఞప్తి కూడా చేశారు. సరే, రాజకీయనాయకులు చేసే అలాంటి విజ్ఞప్తిలో, ‘తనకు ఇంత అభిమానుల బలం ఉంది సుమా’ అని ఇతరులకు చేసే ఒక హెచ్చరికా ఇమిడి ఉంటుంది, అది వేరే విషయం.

జయలలిత అశేష అభిమానుల దృష్టిలో కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆమె ‘అమ్మ’. జనానికి నిత్యజీవనభారాన్ని ఎంతో కొంత తగ్గించే కొన్ని జనప్రియ(పాపులిస్ట్) పథకాలను ఆమె అమలు చేశారు. ఆవిధంగా ఆమెను ‘అమ్మ’ అని పిలుచుకోవడంలో అభిమాన, ఆత్మీయతలతోపాటు ఆరాధనాభావం కూడా కలగలసి ఉంటుంది. అంటే, అమ్మ అక్షరాలా ‘దేవత’ అయిపోతుంది. ఆమె సాక్షాత్తు అమ్మ, దేవత అనే భావన జనంలో ఎంత బలంగా ఏర్పడిపోతుందంటే; ‘ముఖ్యమంత్రి’ అన్న లౌకిక నామం ఆ అభిమానపు వెల్లువలో కొట్టుకుపోతుంది. అంతేనా? ముఖ్యమంత్రి చట్టబద్ధంగా, నీతినిజాయితీలతో, జవాబుదారీ పాలన అందించాలన్న భావనకూ అదే గతి పడుతుంది. ‘అమ్మ’ తమను చల్లగా చూసినంతవరకూ ఆమె వ్యక్తిగత నీతినిజాయితీలు ఎలా ఉన్నా జనానికి అనవసరం.

నేనిక్కడ కేవలం జయలలితనే వేలెత్తి చూపించడం లేదు. ఆమె స్థానంలో ఆమెలా జనాభిమానాన్ని పొందిన ఎవరున్నా ఇదే జరుగుతుంది. లౌకిక ప్రపంచానికి చెందిన పాలకునిలో వ్యక్తిగత లోపాలు ఎన్ని ఉన్నాసరే, తమ భౌతికజీవితానికి మేలు చేసే పనులు చేసినప్పుడు అతనికి/ఆమెకు పారలౌకిక ప్రపంచానికి చెందిన దేవుడు/దేవతతో అభేదం కల్పించి విగ్రహంగా మార్చడం తరతమ భేదాలతో దేశమంతటా ఉంది. కాకపోతే, తమిళనాడు జనాలలో మాత్రం ఇది మరింత పతాకస్థాయిలో వ్యక్తమవుతుంటుంది. తాము అభిమానించి ఆరాధించేవారికి ఆలయాలు నిర్మించడం కూడా అక్కడే ఎక్కువ. మన రాష్ట్రంలోనూ ఇటీవల ఇలాంటి ధోరణులు కనిపించినా తమిళనాడే దీనికి తగిన నమూనా అనిపిస్తుంది.

ఈ మనస్తత్వ మూలాలు ఎక్కడున్నాయని వెతుకుతూ వెనక్కి వెడితే, బహుశా మనం పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన నగరరాజ్యాల దశకు చేరుకుంటాం. ఆనాటి జనం నగర దేవతకు గుడి కట్టుకుని ఆమె చుట్టూ తమ లౌకిక, పారలౌకిక జీవితాన్ని గాఢంగా అల్లుకునేవారు. ఆ దేవత కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. పరిపాలన అంతా దేవత పేరు మీదే జరిగేది. వ్యవసాయభూములకు దేవతే యజమాని. భూముల పంపకానికి దేవాలయమే కేంద్రంగా ఉండేది. అన్నవితరణా అక్కడే జరిగేది. తమకు జీవనోపాధిని కల్పించేది, అన్నం పెట్టేది దేవతే కనుక అందులో లౌకికం, పారలౌకికం అన్న తేడాకు అవకాశమే లేదు.

ఆ ఛాయలే కాలం కల్పించిన వేల సంవత్సరాల హద్దులను దాటుకుంటూ తమిళనాడులోకి ఇప్పటికీ ప్రవహిస్తున్నాయా అనిపిస్తుంది. ఇక్కడ జయలలిత రూపంలో పాలక స్థానంలో ఉన్నది మనిషి కావచ్చు; కానీ ఆమె దేవతలానే తమకు పని కల్పించి, అన్నం పెట్టినప్పుడు దేవతే అవుతుంది. ఇదంతా కేవలం ఊహాప్రాయంగా తీసుకొచ్చిన పోలిక కాదు. ఈజిప్టు, మెసపొటేమియా, ఏజియన్, సింధు నాగరికతల నాటి నగర రాజ్యాల ఉమ్మడి వారసత్వం ప్రత్యేకించి దక్షిణభారతంలో, అందులోనూ తమిళనాడులో నేటికీ గజ్జె కడుతోందనడానికి అనేక చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. దానిని అలా ఉంచి, గత కొన్ని వ్యాసాలుగా చర్చించుకుంటున్న విషయానికి పరిమితమై చెప్పుకుంటే; రాజ్యం విస్తరిస్తూ కేంద్రీకృత అధికారం అనే అంకుశం జనజీవితంపై బిగుసుకుంటున్నకొద్దీ , ఆర్థిక అసమానతలు, బానిసత్వం, పీడన పెరిగిన కొద్దీ జనం తమను ఈతిబాధలనుంచి గట్టెక్కించే ఇష్టదేవతల కొలుపులూ పెరుగుతూవచ్చాయి. దాంతోపాటే, నగరరాజ్యాల కాలంవరకూ కొనసాగిన సమష్టి ఆరాధనా పద్ధతుల స్థానంలో వ్యష్టి(వ్యక్తిగత) ఆరాధనా పద్ధతులూ అడుగుపెట్టాయి. రోమన్ల కాలంలో ఆ పరివర్తన ఎలా ఎందుకు జరిగిందో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ఇంకొకటి గమనించాలి. లౌకికమైన ముఖ్యమంత్రి లాంటి పదవికి, పారలౌకికమైన దేవత హోదాకు మధ్య హద్దులు చెరిగిపోవడం; దాంతోపాటే లౌకికమైన అవినీతి తదితర బలహీనతలు కూడా పారలౌకికమైన గంగలో కలసి పోవడం కేవలం చదువుసంధ్యలు లేని అట్టడుగువర్గాల ఊహలోనే సంభవిస్తాయని అనుకోవద్దు. ధనవంతులు, విద్యావంతులలోనూ ఇదే ధోరణి ఉంటుంది. కాకపోతే అట్టడుగువర్గాలలో ఇది నాటుగానూ, మోటుగానూ వ్యక్తమైతే; మిగతావారిలో నాజూకుగానూ, మెరుగుపెట్టిన భాషలోనూ వ్యక్తమవుతుంది.

నా కీ సందర్భంలో ఒక వ్యక్తిగతమైన విషయం గుర్తుకొస్తోంది.

***

నాకప్పటికి ఇరవయ్యేళ్లు దాటాయేమో! మా ఊళ్ళో ఉన్నప్పటి సంగతి. ఓ రోజు నేను నిద్ర లేచేసరికి, మా ఇంటి దక్షిణం వైపు దొడ్లో మా నాన్నగారు, మా పినతండ్రిగారు దంతధావనం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు కిటికీలోంచి నా చెవిన పడ్డాయి. వారిద్దరూ కంచి పరమాచార్యకు చాలాకాలంగా చాలా దగ్గరి అనుయాయులు. మా పినతండ్రిగారు వృత్తిరీత్యా పౌరాణికులు. ఆయన సహజమైన తన కథనచాతుర్యంలో భక్తి తన్మయత్వాన్ని రంగరించి ఒక ముచ్చట చెబుతున్నారు. నాన్నగారు ఊకొడుతూ వింటున్నారు. నేను కూడా ఆసక్తిగా వింటూ ఉండిపోయాను.

“అన్నయ్యా, ఏం జరిగిందో విన్నావూ? చెన్నపట్నం(మా పినతండ్రిగారు మద్రాసును ఎప్పుడూ చెన్నపట్నం అనే అనేవారు)లో ఆ చెట్టియార్ లేడూ! నువ్వూ వినే ఉంటావు. కోటీశ్వరుడు. తస్సదియ్య, గుర్రప్పందాల మీద సంపాదించాడు. చాలా వ్యాపారాలు పెట్టాడు. దొంగనోట్లు అచ్చేస్తాడని కూడా చెప్పుకుంటారు. అయితేనేం, శ్రీవారికి(కంచి పరమాచార్యకి) పరమభక్తుడు. ఏమైందో, గుర్రప్పందాలు కలసి రావడం మానేశాయి. వ్యాపారాల్లో నష్టం వచ్చింది. దాంతో లబోదిబో మంటూ శ్రీవారి దగ్గరకు పరుగెత్తాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. శ్రీవారు అంతా విన్నారు. కాసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత “మీ ఇంట్లో ఎక్కడైనా పత్తిచెట్టు ఉందా?” అని అడిగారు. అతను ఆశ్చర్యపోతూ, “ఉంది” అన్నాడు. “వెంటనే దాన్ని తీయించు. నీకు కలసివస్తుంది” అని శ్రీవారు అన్నారు. వాడు అలాగే చేశాడు. దాంతో వాడికి మళ్ళీ దశ ఎత్తుకుంది.”

ఈ ముచ్చట చెబుతున్నప్పుడు ప్రధానంగా ఆయన దృష్టిలో ఉన్నది చెట్టియారూ, అతని గుర్రప్పందాలూ, దొంగనోట్లూ, వ్యాపారాలూ కావు. అతనికి సలహా ఇచ్చి గట్టెక్కించిన కంచి పరమాచార్యులవారి మహిమా, వారి మీద తన భక్తిప్రపత్తులూ…

నాది ఉడుకు రక్తం. దానికితోడు ఆధునికమైన వాసనలు. ఇది వినగానే చాలా కోపం వచ్చింది. గుర్రప్పందాలు ఆడేవాడి మీదా, అందులోనూ దొంగనోట్ల ఆరోపణ ఉన్నవాడి మీదా కంచివారు అనుగ్రహం ఎలా చూపిస్తారనుకున్నాను. మా పినతండ్రి గారి స్పందన, నా స్పందన గీత గీసినట్టు ఎలా వేరైపోయాయో చూడండి! పారలౌకికానికి చెందిన కంచివారి మహిమావిశేషాన్ని ఒత్తి చెప్పడం మీదే ఆయన ఆసక్తి. చెట్టియారు అంత డబ్బు ఎలా సంపాదించడన్న లౌకిక విషయం మీద ఆయనకు పెద్ద ఆసక్తీ లేదు, పట్టింపూ లేదు. కానీ నా తక్షణ స్పందన చెట్టియారు మీదా, అతను సంపాదించిన పద్ధతి మీదే, అంటే లౌకికం మీదే!

చెప్పొచ్చేదేమిటంటే, భారతదేశం ఇప్పటికీ మా పినతండ్రిగారి దగ్గరే భద్రంగా ఉంది, నా దాకా(నా లాంటి చాలామంది దాకా) రాలేదు.

ఆ తర్వాత చాలాకాలానికి ఆవేశం తగ్గి ఆలోచించిన కొద్దీ ఆయన స్పందనలో కూడా ఒక సహేతుకత, ఒక తర్కమూ లేకపోలేదనిపించింది. అంటే, ఇప్పుడు నేను ఉభయస్పందనలకు మధ్య ఒక తటస్థ పాత్ర తీసుకుంటున్నాను. ఎలాగంటే, చెట్టియారులో కూడా లౌకికం, పారలౌకికం అనే రెండు కోణాలు ఉన్నాయి. లౌకిక కోణంలో అతడు చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ ఉండవచ్చు. దానిపై నిఘా ఉంచి దోషి అని తేలితే అతనిని శిక్షించవలసింది లౌకిక యంత్రాంగం, అంటే ప్రభుత్వం. పారలౌకిక కోణానికి వస్తే, అతడు కంచి పరమాచార్యులవారికి భక్తుడు. ఆయనను నమ్ముకున్నవాడు. కనుక అందుకు ప్రతిగా కంచివారు అతన్ని కష్టాల నుంచి గట్టెక్కించారన్నమాట! ఇలా అన్నానని, కంచివారి చర్యనో, లేదా పత్తి మొక్క ఇంట్లో ఉండకూడదన్న నమ్మకాన్నో నేను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నానని అనుకోవద్దు. ఇందులో నా వ్యక్తిగతానికి తావులేదు.

ఇంకొంచెం స్పష్టంగా అర్థమయ్యే ఉదాహరణతో కూడా దీనిని చెప్పుకోవచ్చు. ఒకతను అవినీతిమార్గంలో సంపాదించి స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని గుట్టలకొద్దీ దాచుకున్నాడనుకుందాం. అతను ఏ విదేశాలకో వెళ్లదలచుకుని విమానంలో టిక్కెట్టు బుక్ చేసుకుంటాడు. నువ్వు అక్రమంగా డబ్బు సంపాదించావు కనుక నీకు టిక్కెట్టు ఇచ్చేదిలేదని ఎయిర్ లైన్స్ వాళ్ళు అనరు. అది వాళ్ళ పని కాదు. అనకపోగా, ప్రయాణంలో అతని డబ్బుకు సరితూగే వసతులన్నీ కల్పించి అతన్ని ఎంతో మర్యాదగా చూస్తారు. అతని డబ్బు ఎలాంటిదన్నది పట్టించుకోవలసింది ప్రభుత్వమూ, అందులోని ఆదాయం పన్ను శాఖ మాత్రమే.

కానీ ఆ లౌకిక వ్యవస్థ ఉండవలసినంత బలంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆ వ్యవస్థను నడిపేవారు కూడా ఆ తానులో ముక్కలే కనుక. లౌకిక వ్యవస్థ చొరడానికి సాహసించని పారలౌకికపు హద్దులు ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. మన అనుభవంలో లౌకికం, పారలౌకికం కలసిపోవడమే కాదు; లౌకికాన్ని, పారలౌకికం పూర్తిగా లోబరచుకుంటుంది. లౌకికంగా మనం తప్పు పనులు ఎన్నైనా చేయవచ్చుగాక, పారలౌకికం వాటిని ప్రక్షాళన చేసేస్తుంది. కనుక మన అంతిమ హద్దు లౌకికం కాదు, పారలౌకికం మాత్రమే. ఇదేదో నేను విమర్శదృష్టితో అంటున్న మాటగా దయచేసి పొరబడవద్దు. కేవలం చారిత్రక తటస్థ దృష్టితో అంటున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ పారలౌకిక ప్రాబల్యం మనకు క్రీస్తుశకానికి పూర్వంనుంచీ ఇప్పటికీ పదిలంగా వస్తున్న చారిత్రక వారసత్వం.

ఇంకోవైపు నుంచి చూడండి…ఇది వర్తమానంతో నేరుగా ముడిపడి ఉన్న చాలా గంభీరమైన విషయమే తప్ప, ఆషామాషీ విషయం కాదని మీకే అర్థమవుతుంది. ఎలాగంటే, ఇప్పుడు మన దేశం అవినీతితో మహాయుద్ధం చేస్తోంది, లేదా చేస్తున్నాననుకుంటోంది. పాలకులు మారితేనో, లోక్ పాల్ లాంటి (లౌకిక) వ్యవస్థలలోనో దీనికి పరిష్కారం ఉంటుందనుకుంటోంది. కానీ నా ఉద్దేశంలో దీనికి పరిష్కారం పారలౌకిక ప్రపంచాన్ని శాసించే లోకపాలకుడైన ఆ భగవంతుడి చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ లేదు.

క్షమించాలి…ఈ విషయంలో నేనంత ఆశావాదిని కాదు.

***

ఎంతమంది గమనించారో కానీ, లౌకిక, పారలౌకికతల పద్మవ్యూహంలో పడి గిజగిజలాడిన చరిత్ర పాశ్చాత్యసమాజాలకూ ఉంది. అంతేకాదు, అది ప్రాచ్య(తూర్పు)మతాల పుణ్యమంటూ వారు ఆడిపోసుకోవడమూ ఉంది. ప్రాచ్య మతాలు అన్నప్పుడు మనవే కాక, ఈజిప్టు, మెసపొటేమియా తదితర ప్రాంతాల మతాలు కూడా వస్తాయి. తేడా అల్లా ఆ పద్మవ్యూహంలోంచి బయటపడడానికి పాశ్చాత్యసమాజాలు ప్రయత్నించాయి. ‘పారలౌకికం’ అనే సరిహద్దు రాయిని అతి కష్టం మీద పెకలించి, వెనక్కి జరిపి, ఆ చోట్లో ‘లౌకికం’ అనే సరిహద్దు రాయిని ప్రతిష్టించుకున్నాయి. రెండింటి మధ్య సమతూకం తేవడానికే కాక, లౌకికం వైపు ఒకింత ఎక్కువ మొగ్గు చూపించాయేమో కూడా. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, పారలౌకికత కన్నా ముందు మనం జీవించే ఈ లౌకిక జగత్తును మరింత వాసయోగ్యం చేద్దామన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రాచ్య, పాశ్చాత్యుల మధ్య ఉన్న దృష్టిభేదాన్ని ఎత్తి చూపిన పాశ్చాత్య రచయితలు కొందరు గుర్తొస్తున్నారు కాని, సర్ జేమ్స్ ఫ్రేజర్ ను ఒక్కరిని ఉదహరించుకుందాం. పనిలో పనిగా ఆయన ప్రాచ్య మతాల ప్రభావం యూరప్ ను పాడుచేసిందని ఒక రాయి కూడా విసిరాడు. తన Golden Bough అనే బృహద్రచనలో ఇలా అంటాడు:

Greek and Roman society was build on the conception of the subordination of the individual to the community, of the citizens to the state; it set to the safety of the commonwealth, as the supreme aim of conduct, above the safety of the individual whether in this world or in a world to come. Trained from infancy in this unselfish ideal, the citizens devoted their lives to the public service and were ready to lay them down for the common good…

All this was changed by the spread of Oriental religions which inculcated the communion of the soul with God and its eternal salvation as the only objects worth living for, objects in comparison with which the prosperity and even the existence of the state sank into insignificance. The inevitable result of this selfish and immoral doctrine was to withdraw the devotee more and more from the public service, to concentrate his thoughts on his own spiritual emotions, and to breed in him a contempt for the present life which he regarded merely as a probation for a better and an eternal…

A general disintegration of the body politic set in. The ties of the state and the family were loosened; the structure of society tended to resolve itself into its individual elements and thereby to relapse into barbarism; for civilization is only possible through the active co-operation of the citizens and their willingness to subordinate their private interests to the common good.

పాశ్చాత్య ప్రభావాలే మన లాంటి ప్రాచ్యదేశాలను పాడు చేశాయని మనం ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం. అలాంటిది ప్రాచ్య మతాలే పాశ్చాత్యులను పాడు చేశాయని ఫ్రేజర్ అనడం విచిత్రంగా ఉంటుంది. పైగా పారలౌకికాన్ని లౌకికం భ్రష్టు పట్టించిందని మనం అనుకుంటుంటే, పారలౌకికమే లౌకికాన్ని భ్రష్టు పట్టించిందని ఫ్రేజర్ అంటున్నాడు. ప్రాచ్య మతాలు వెయ్యేళ్ళపాటు యూరప్ సమాజాన్ని నాశనం చేస్తే, చివరికి రోమన్ చట్టాన్ని, అరిస్టాటిల్ తాత్వికతను పునరుద్ధరించడం ద్వారా మధ్యయుగాలనాటికి యూరప్ తిరిగి తనవైన పురాతన కళా సాహిత్యాలు, జీవితాదర్శాలు, ప్రవర్తనాసరళి, ఆరోగ్యవంతమైన, పురుషప్రయత్నంతో కూడిన ప్రాపంచిక దృక్పథంవైపు మళ్లిందని ఆయన అంటాడు. ఆ సందర్భంలో ప్రాచ్య మతాల తీరు గురించి పై వ్యాఖ్యలు చేశాడు. వాటి సారాంశాన్ని ఇలా చెప్పుకోవచ్చు:

వ్యక్తి ప్రయోజనాలకన్నా సమష్టి ప్రయోజనాలు, పౌర ప్రయోజనాలకన్నా రాజ్యం ప్రయోజనాలు ప్రాధాన్యం వహించే విధంగా గ్రీకు, రోమన్ సమాజాల నిర్మాణం జరిగింది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ వాటి ఉన్నతోన్నత లక్ష్యం సమష్టి సంపదా, శ్రేయస్సులే తప్ప వ్యక్తిగత సంక్షేమం కాదు. చిన్నతనం నుంచీ నిస్వార్థతను నూరిపోయడం వల్ల పౌరులు ప్రజాశ్రేయస్సుకు తమ జీవితాన్ని అంకితం చేసేవారు. ఉమ్మడి హితం కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. ప్రాచ్య మతాల వ్యాప్తితో ఇదంతా మారిపోయింది. పరమాత్మలో ఆత్మను లీనం చేయడం, ముక్తిని పొందడం తప్ప ఈ లోకంలో సాధించవలసిన లక్ష్యాలు ఏవీ లేవని అవి నొక్కి చెబుతాయి. దాంతో ఈ లోకంలో అభ్యుదయాన్ని సాధించాలన్న తపనే కాక రాజ్యం ఉనికి కూడా అప్రధానంగా మారిపోయింది. ఈ స్వార్థపూరిత, అనైతిక సిద్ధాంతం భక్తులను సమష్టి హితం నుంచి తప్పించివేసింది. లౌకిక జీవితంపై విముఖతను నూరిపోసింది. లౌకిక జీవితం కేవలం పరలోక జీవితానికి అవసరమైన శిక్షణ పొందడానికి మాత్రమే నన్న భావనను కలిగించింది. దాంతో రాజకీయవ్యవస్థ విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. రాజ్యానికీ, కుటుంబానికి మధ్య సంబంధాలు సడలిపోయాయి. సామాజిక నిర్మాణం వ్యక్తుల స్థాయికి కుదించుకుపోయింది. అది ఆటవిక ధోరణులకు దారితీయించింది. ఎందుకంటే, నాగరికత అనేది పౌరుల క్రియాశీల సహకారంతోనూ, తమ వ్యక్తిగతప్రయోజనాలకు బదులు ఉమ్మడి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడంతో మాత్రమే సాధ్యమవుతుంది.

ఫ్రేజర్ చేసిన ఈ వ్యాఖ్యలు మనలో చాలామందికి కోపం తెప్పించే మాట నిజమే. వీటిలో యూరోపియన్ అహంకారమూ తొంగి చూస్తూ ఉండచ్చు. ఆయన ఇంత గొప్పగా చెప్పుకున్న యూరోపియన్ సమాజం కడిగిన ముత్యమని భావించే అమాయకులు ఎవరూ లేరు. కాకపోతే, మిగతా సంగతులు పక్కన పెట్టి, లౌకికం-పారలౌకికం అనే ఒక్క అంశానికి పరిమితమైనప్పుడు ఆయన మాటలు మనం మొహం చూసుకోడానికి అద్దంలా ఏమైనా ఉపయోగపడతాయా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవచ్చు.

మిగతా విశేషాలు తర్వాత…

 

 

 

 

 

ఈజిప్టులో ‘ఈశాని’ పూజ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

జూలియస్ సీజర్ తనను దేవుడిగా ప్రకటించుకుని, గుడి కట్టించుకోవడం; రోమ్ ను సామ్రాజ్య దశవైపు మళ్ళించడం ఒక దానితో ఒకటి సంబంధం లేనివి కావు. రెండింటిలోనూ ఉన్నది ఒకటే…అది వ్యక్తి ప్రాధాన్యం. వ్యక్తి రాజకీయ సామ్రాజ్యానికి అధికారకేంద్రం అయినట్టే, ఆస్తిక సామ్రాజ్యానికీ అవుతున్నాడు. గణతంత్రవాదులు సీజర్ ను చంపగలిగారు కానీ గణతంత్రాన్ని మాత్రం బతికించుకోలేక పోయారు. సీజర్ వరవడిలోనే రోమ్ క్రమంగా సామ్రాజ్యదశవైపు అధికారికంగా మళ్ళిపోయింది.

అయితే ఇక్కడ కొంత తేడా ఉంది. సీజర్ దేవుడిగా అవతరించినా అప్పటికి అనేకమంది దేవీ, దేవతలలో ఒకడు మాత్రమే. కానీ రాజకీయ సామ్రాజ్యంలో మాత్రం చక్రవర్తి ఏకైకుడు. ఆస్తికరంగాన్ని కూడా అలాంటి సామ్రాజ్యంగా మార్చడానికి మరికొంత కాలం పట్టింది. అందులో రోమన్లు పోషించిన కీలక పాత్ర గురించి చెప్పుకోబోయే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళడం అవసరం.

పురాచరిత్రలో ఒక ముఖ్యమైన తెగ అసీరియన్లు. వీరు మొదట్లో మెసపొటేమియాలోని బాబిలోనియా సామ్రాజ్యానికి ఉత్తర, తూర్పు దిక్కులలో సన్నని పీలికలా ఉండే టైగ్రిస్ నదీలోయలో ఉండేవారు. లోపలికి అంత తేలిగ్గా చొరడానికి వీలు లేని విధంగా ఆ లోయ చుట్టూ కొండలు. అసీరియన్లు క్రూరత్వానికి మారు పేరు. వీరి దేవుడు ఆసూర్. ఆ దేవుడి పేరు మీదనే వీరు ఆసూరు అనే నగరాన్ని, ఆ తర్వాత నినవే అనే నగరాన్ని కట్టుకున్నారు. మన పురాణ, ఇతిహాస ప్రసిద్ధులైన అసురులతో ముడిపెట్టుకుని అసీరియన్ల గురించి చెప్పుకోవలసిన ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే…

కాలక్రమంలో గొప్ప సైనిక శక్తిగా ఎదిగిన ఆసీరియన్లు క్రీ.పూ. 745 నాటికి బాబిలోనియాను ఆక్రమించుకున్నారు. బాబిలోనియా అప్పటికి అత్యధిక జనాభాతో, నినవే కన్నా చాలా పెద్ద నగరం. అక్కడి ప్రధాన దైవం బెల్ మర్దుక్. ఆసీరియన్లు ఆసూర్ అనే దేవుడిని కొలిచే వారే అయినా, బెల్ మర్దుక్ పై కూడా భక్తిప్రపత్తులు చాటుకునేవారు. మర్దుక్ పూజారులనే కాకుండా, బాబిలోనియాలోని వర్తకలను కూడా మర్యాదగా చూసేవారు. అంతేకాదు, శత్రువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన చరిత్ర తమకు ఉన్నా ప్రజలతో మాత్రం సామరస్యంగా ఉండేవారు. వాళ్ళ మనసు గెలుచుకోడానికి ప్రయత్నించేవారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, విజేతలు విజితులను(ఓడిపోయినవారిని) తమలో లీనం చేసుకోవడం కాక, తామే విజితులలో, వారి విశ్వాసాలలో కలసిపోవడం అప్పటి విధానం. అసీరియన్లలో సర్దనాపలస్ అనే పాలకుడు పూర్తిగా బాబిలోనియన్ గా మారిపోవడమే కాదు, ఆ నగరాన్ని గొప్ప మేధోనగరంగా తీర్చిదిద్దాడు. అప్పట్లోనే అతను మట్టి పలకల రూపంలో ఉండే పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశాడు.

అయితే, నూట యాభై ఏళ్ల తర్వాత, క్రీ. పూ. 606లో మెసపొటేమియా ఆగ్నేయదిశనుంచి సెమెటిక్ జాతికి చెందిన చాల్దియన్లు, ఈశాన్య దిశనుంచి పర్షియన్లుగా గుర్తింపు పొందిన ఆర్యులైన మీదులు చుట్టుముట్టేసరికి ఆసీరియన్ రాజ్యం కుప్పకూలింది. ఉత్తరదిశలో నినవే నగరాన్ని కూడా కలుపుకుంటూ సియాక్జెరెస్ నాయకత్వంలో మీదుల రాజ్యమూ, బాబిలోనియాలో చాల్దియన్ రాజ్యమూ అవతరించాయి. మీదుల రాజ్యం తూర్పున భారతదేశ సరిహద్దుల దాకా విస్తరించింది.

చాల్దియన్లలో చివరి పాలకుడైన నబోనిడస్ విజ్ఞానవ్యాప్తిలో అసీరియన్ పాలకుడైన సర్దనాపలస్ ను కూడా మించిపోయాడు. పురాచరిత్ర మీద అతను పరిశోధనలు చేయించాడు. అప్పటికి రెండు వేల ఏళ్ల క్రితం బాబిలోనియాలో అక్కాడియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి సారగాన్ రాజ్యకాలాన్ని పరిశోధింపజేసి, నిర్ధారణ చేయడం ఆయన చేసిన పనుల్లో ఒకటి.

అదే సమయంలో నబోనిడస్ ఒక అనాలోచితమైన పని కూడా చేశాడు. అది చివరికి అతని రాజ్యానికే ఎసరు పెట్టింది. అదెలా జరిగిందంటే, బాబిలోనియా జనంలో అనైక్యతా ధోరణులు నానాటికీ పెరుగుతుండడం నబోనిడస్ గమనించాడు. ఆ రోజుల్లో ప్రజల లౌకిక, మత జీవితాలు రెండింటికీ దేవుడే కేంద్రబిందువుగా ఉండేవాడు. దేవుళ్ళ నందరినీ ఒక చోట చేర్చితే జనంలో ఐక్యత ఏర్పడుతుందని నబోనిడస్ అనుకున్నాడు. ఎక్కడెక్కడ ఉన్న స్థానిక దేవతల నందరినీ బాబిలోనియా నగరానికి రప్పించి, వారికి అక్కడ దేవాలయాలు నిర్మింపజేయడానికి ప్రయత్నించాడు. రాజ్యంలో ప్రధాన దైవం బెల్ మర్దుక్ కనుక ఆ దేవుడి పూజారులు మంచి పలుకుబడీ, ప్రాభవాలతో మిగిలిన పూజారులకంటే ఉన్నతస్థితిలో ఉండేవారు. నేటి మన తిరుమల పూజారుల్లా అన్నమాట. స్థానిక దేవుళ్ళ నందరినీ రాజధానిలో కేంద్రీకరించి మర్దుక్ పక్కనే చోటు కల్పించే నబోనిడస్ ప్రయత్నం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

దాంతో వారు నబోనిడస్ నే పక్కకు తప్పించాలని పథకం వేశారు. పొరుగునే మీదు రాజ్యాన్ని ఏలుతున్న పర్షియన్ పాలకుడు సైరస్ తో కుమ్మక్కయ్యారు. సైరస్ బాబిలోనియా మీదికి యుద్ధానికి వచ్చాడు. కోట గోడల అవతల ఇరు సైన్యాలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సైరస్ దే పైచేయి అయింది. అంతలో కోట ద్వారాలు తెరచుకున్నాయి. సైరస్ తన సైన్యంతో లోపలికి ప్రవేశించాడు. అతనికి అక్కడ ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు.

బైబిల్ కథనం ప్రకారం, ఆ సమయంలో యువరాజు బెల్షజ్జర్ విందు ఇస్తున్నాడు. అంతలో ఒక చెయ్యి ప్రత్యక్షమై గోడ మీద నిప్పు కణికల్లా వెలిగే అక్షరాలతో కొన్ని మార్మికమైన మాటలు రాసింది. అవి అర్థం కాని యువరాజు అప్పటికప్పుడు డేనియల్ అనే ప్రవక్తను రప్పించి వాటి అర్థం చెప్పమని కోరాడు. ‘దేవుడు మీ రాజ్యానికి రోజులు లెక్కించాడు. మీ రాజ్యాన్ని అంతమొందించాడు. మిమ్మల్ని తాసులో పెట్టి తూచినప్పుడు మీలో ఎన్నో సుగుణాలు లోపించిన సంగతి బయటపడింది. దాంతో మీ రాజ్యాన్ని మీదులకు, పర్షియన్లకు ఇవ్వాలని నిర్ణయించాడు’ అని డేనియల్ ఆ మాటలకు అర్థం చెప్పాడు.

ఆ రోజు రాత్రే బెల్షజ్జర్ ను హత్య చేశారు. నబోనిడస్ ను బందీగా పట్టుకున్నారు. ఆ విధంగా పర్షియన్ల బాబిలోనియా ఆక్రమణ ఎంత ప్రశాంతంగా, చడీచప్పుడు లేకుండా జరిగిపోయిందంటే, ఆ సమయంలో కూడా మర్దుక్ ఆలయంలో నిత్యపూజాదికాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయట!

ఆ గోడమీది రాత రహస్యం బహుశా మర్దుక్ పూజారులకు తెలిసి ఉంటుందని హెచ్.జి. వెల్స్ చమత్కరిస్తారు.

Rembrandt_-_Belshazzar's_Feast_-_WGA19123

  ***

ఇంతకీ విషయమేమిటంటే, నబోనిడస్ తెలివితక్కువగా తలపెట్టి తన రాజ్యానికే ముప్పు తెచ్చుకున్న దేవుళ్ళ కేంద్రీకరణ చర్యనే అనంతర కాలంలో రోమన్లు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఈ మధ్యలో కనీసం మూడు, నాలుగువందల సంవత్సరాల అంతరం ఉంది. అప్పటికి రాజకీయంగా కేంద్రీకృత అధికారానికి అలవాటు పడుతున్నట్టే, ఆస్తికరంగంలో కూడా కేంద్రీకృత ధోరణులకు జనం అలవాటు పడుతూ ఉండాలి. అయితే అప్పటికి కూడా బహురూప ఆస్తికత కొనసాగుతూనే ఉంది. నబోనిడస్ చర్య ప్రధానదైవమైన మర్దుక్ ప్రాభవాన్ని తగ్గిస్తుందన్న ఉద్దేశంతో పూజారులు వ్యతిరేకించి ఉండచ్చు కానీ, స్థానిక దేవతల అస్తిత్వం మీద వారికి వ్యతిరేకత ఉండే అవకాశం లేదు.

రోమన్లు తమ అధీనంలో ఉన్న విశాల భూభాగాలపై ఏకీకృత నాగరికతను రుద్దడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రాంతానికీ ఇంకో ప్రాంతానికీ మధ్య ఎన్నో వ్యత్యాసాలు, సంస్కృతుల మధ్య అసమానతలు ఉండేవి. హెచ్.జి. వెల్స్ ఈ సందర్భంలో రోమన్ గణతంత్రాన్ని బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంతో పోలుస్తారు. రాజ్యం అంతటా అక్కడక్కడ రోమన్ స్కందావారాలూ, కాలనీలూ ఉండేవి. వాటిలో జనం రోమన్ దేవతలను పూజించేవారు. లాటిన్ మాట్లాడేవారు. అయితే, రోమన్ ఆక్రమణకు ముందు నుంచీ ఉన్న నగరాలు, పట్టణాలలో మాత్రం జనజీవితం ఎప్పటిలానే ఉండేది. రోమన్ అధికారానికి లొంగి ఉంటూనే అక్కడి జనం తమ వ్యవహారాలను తామే నడుపుకునేవారు. తమ దేవీ దేవతలను తమ పద్ధతిలో పూజించుకునేవారు.

మత తాత్విక రంగాలలో మార్పులు లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే, అవి బహురూప ఆస్తికత అనే చట్రం లోపలే జరుగుతూ వచ్చాయి. అంతకుముందు పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన జనం వందలు, వేల తరాలపాటు దేవాలయం చుట్టూ తమ జీవితాలను, ఆలోచనలను అల్లుకుని జీవించారు. మతపరమైన తంతును ఎంతో శ్రద్ధగా జరిపేవారు. నిత్యవిధులకు ఏమాత్రం భంగం కలిగినా ఏదో కీడు జరుగుతుందని భయపడేవారు. బలులు ఇచ్చేవారు. ఏదో మార్మికతా, అంతుపట్టని నిగూఢతా వారి ఆలోచనలను ఆక్రమించుకుని ఉండేవి. ఆర్యీకృత ఆధునిక ప్రపంచానికి వారి దేవతలు భయానకంగానూ, తర్కరహితంగానూ కనిపించవచ్చుకానీ, వారు మాత్రం గాఢస్వప్నంలో ఆయా దృశ్యాలను, వస్తువులను ఎంత స్పష్టంగా చూస్తామో అంత స్పష్టంగా వారిని దర్శించేవారు. వారితో మమేకమయ్యేవారు. అదొక స్వాప్నిక జగత్తు. ఆ కాలంలో సుమేరియాలో కానీ, ఈజిప్టులో కానీ ఏదైనా నగరాన్ని ఇతరులు జయించినప్పుడు మహా అయితే, అక్కడి దేవీ దేవతల పేర్లు మారేవేమో కానీ, పూజా విధానం, దాని వెనుక ఉండే స్ఫూర్తీ అలాగే ఉండేవి. స్వప్న ప్రపంచంలోని మూర్తులు మారేవే తప్ప స్వప్నం మాత్రం యథాతథంగా కొనసాగేది. తొలినాటి సెమెటిక్ విజేతలు, సుమేరియన్ల ఆలోచనా సరళి, ఆరాధనా పద్ధతులు ఒకలానే ఉండేవి కనుక సెమెటిక్ విజేతలు సుమేరియన్ల మత సంస్కృతులను దాదాపు యథాతథంగా స్వీకరించేవారు. ఈజిప్టుకు వస్తే, గ్రీకు టోలెమీల పాలనలోనూ, రోమన్ సీజర్ల పాలనలోనూ కూడా ఈజిప్టు దేవాలయాలు, పూజారివ్యవస్థ, పూజావిధానాలు ఈజిప్టువిగానే ఉండిపోయాయి.

విజేతలు, విజితులు ఒకరితో ఒకరు కలసిపోయినట్టే వారి దేవతలూ కలసిపోయేవారు. దీనినే థియోక్రేసియా అన్నారని ఇంతకుముందు చెప్పుకున్నాం. క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దేవతల మధ్య పోలికలు లోపించి విలీనానికి అవకాశం లేనప్పుడు వారి మధ్య ఒక సంబంధాన్ని కల్పించేవారు. ఉదాహరణకు గ్రీకులు తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి ముందు ఏజియన్లు అమ్మవారి రూపంలో స్త్రీదేవతను పూజించేవారు. గ్రీకులు ఆక్రమించుకున్నాక ఆ స్త్రీదేవతను ఒక పురుషదేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా ఇద్దరినీ విలీనం చేసుకున్నారు. అలాగే ఒక జంతు దేవతకు, పక్షి దేవతకు, సర్పదేవతకు, నక్షత్రదేవతకు, సూర్యుడికి, లేదా ఒక ఖగోళ విశేషానికి మానవ రూపమిచ్చో, లేదా యథారూపంలోనో పూజించేవారు. ఒక్కోసారి ఓడిపోయిన వారి దేవతలను క్షుద్రదేవతలుగా పరిగణించేవారు. ఆస్తిక చరిత్ర అంతా ఇలా దేవీదేవతలను ఇచ్చిపుచ్చుకోవడం, రాజీపడడం, స్థానిక దేవతలను సంస్కరించడమే నని హెచ్.జి. వెల్స్ అంటారు.

గమనించే ఉంటారు… వెల్స్ ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశ చరిత్ర చెప్పడంలేదు. అయినాసరే, పైన చెప్పిన ప్రక్రియ మనదేశపు దేవీ, దేవతలకు కూడా పూర్తిగా అన్వయిస్తుంది. వేర్వేరు దేవీదేవతలను పూజించేవారు ఇరుగుపొరుగున ఉన్నప్పుడు వారిని ఏకం చేయవలసివచ్చేది. అమ్మవారి రూపంలో స్త్రీ దేవతను ఆరాధించేవారిని, పురుష దేవుణ్ణి ఆరాధించేవారిని ఏకం చేయడం; సాధారణంగా ఆ ఇరువురి దేవతల మధ్య దాంపత్య సంబంధాన్ని కల్పించడం రూపంలో జరిగేది. శక్తి, శివుడు ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోని అనేక ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఈ సయోధ్య సూత్రం మీద ఆధారపడే అభివృద్ధి చెందినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. భ్రమరాంబా, మల్లికార్జునస్వామీ కొలువైన శ్రీశైలక్షేత్రాన్నే తీసుకుంటే, భ్రమరాంబ మొదట్లో ఆ ప్రాంతంలోని ఆటవికులైన చెంచులు పూజిస్తూ వచ్చిన అమ్మవారి రూపమని చెబుతారు. అప్పట్లో ఆమె ఉగ్రరూపిణి కూడా. బ్రాహ్మణీయ సంప్రదాయం ఆ రూపాన్ని స్వీకరించి, సాత్వికమూర్తిగా మలచి, బహుశా చెంచుల పూజా పద్ధతులను కూడా సంస్కరించి శివుని రూపమైన మల్లికార్జున స్వామి సరసన ప్రతిష్టించింది. ఆది శంకరాచార్య శ్రీశైలక్షేత్రంలో ప్రముఖ పాత్ర పోషించారనీ, అమ్మవారి ముందు వారే శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని క్షేత్రచరిత్ర చెబుతోంది. చెంచులు భ్రమరాంబను తమ ఆడబడుచుగానూ, మల్లికార్జున స్వామిని అల్లుడిగానూ చెప్పుకుంటారు. అక్కడి పూజారి వ్యవస్థలో కూడా సర్దుబాటు కనిపిస్తుంది. మల్లికార్జునస్వామి అర్చకులు బ్రాహ్మణేతరులైన జంగములైతే, అమ్మవారి అర్చకులు బ్రాహ్మణులు. శ్రీ కాళహస్తి క్షేత్రానికి కూడా ఇదేవిధమైన ఆటవిక, బ్రాహ్మణీయ సంబంధం కనిపిస్తుంది. భక్త కన్నప్ప కథ దానికి సూచన. భద్రాచల క్షేత్రం అవతరించింది కూడా ఇలాంటి సయోధ్య సూత్రం మీదే. గిరిజన మహిళ అయిన పోకల దమ్మక్కకు రాముడు కలలో కనిపించి తనకు గుడి కట్టమని కోరినట్టు స్థలపురాణం చెబుతోంది. భద్రాచలం ప్రసాదంలో విప్పపూలు కూడా ఇవ్వడం గిరిజన సంబంధాన్ని సూచిస్తుంది.

ప్రసిద్ధ దేవాలయాలు అనేకం కొండలు, గుట్టలు, అడవుల్లో ఉండడానికి కూడా అనేక కారణాలను చెప్పుకోవచ్చు. వ్యవసాయ విస్తరణలో భాగంగా ఆటవిక, గిరిజన తెగలు ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు జనావాసాలను విస్తరించేవారు. వ్యవసాయ భూమినీ, దేవాలయం ఉన్న ప్రాంతాన్నీ కూడా ‘క్షేత్రం’ అనడం రెండిటికీ ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉండచ్చని ఇంతకు ముందు ఒక వ్యాసంలో అన్నాను. వ్యవసాయ, జనావాసాలు విస్తరించడమంటే రాజ్యం విస్తరించడమే. శ్రీశైలంలోని ఆలయమే కాక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో కూడా పురాతన దేవాలయాలు అనేకం ఎత్తైన, పటిష్టమైన ప్రాకారాలతో, ద్వారాలతో, బురుజులతో అక్షరాలా కోటలను తలపిస్తూ ఉంటాయి. ఆవిధంగా పుణ్యక్షేత్రం రాజులకు రెండవ రాజధానిగా ఉండేదనుకోవచ్చు. దేవుడికి చేసే ఉపచారాలు కూడా రాజోపచారాలే. స్థానిక దేవీ దేవతలను, పూజా విధానాలను సంస్కరించి, బ్రాహ్మణీయ సంప్రదాయంలో విలీనం చేయడం రూపంలో సామదాన ఉపాయాలను అనుసరిస్తూనే; అవసరమైతే, భేద, దండోపాయాలను కూడా అమలు చేసే ఏర్పాటుకు వీలుగా దేవాలయ నిర్మాణం ఉండేదనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే, దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన పురాతన నగర రాజ్యాల సరళీ వీటిలో ప్రతిబింబిస్తూ ఉండచ్చు. ఈ మాట అంటున్నప్పుడు, ప్రాచీన సుమేరుసంస్కృతికీ, ప్రత్యేకించి దక్షిణభారత సంస్కృతికీ ఉన్న పోలికల చర్చలోకి పరుగుపెట్టాలని కీబోర్డు మీద నా వేళ్ళు ఉత్సాహపడుతున్నాయి కానీ, దాంతోపాటు పై విషయాలు అనేకం మరింత విపులంగా చెప్పుకోవలసినవి కనుక ఆ ఉత్సాహానికి కళ్ళెం వేయక తప్పదు.

పైన జంతు దేవత, సర్ప దేవత, నక్షత్రదేవత అని హెచ్. జి. వెల్స్ అన్నప్పుడు వాటితో కూడా మనకున్న సామ్యాలకు లెక్కే లేదు. కుక్కకు కాలభైరవ రూపమిచ్చి జంతురూపంలోనూ, మనిషి రూపంలోనూ కూడా కొలవడం మన దగ్గర ఉంది. అలాగే, నందిని శివునికి వాహనమైన వృషభ రూపంలోనే కాక మానవ రూపంలోనూ చెప్పుకుంటాం. విష్ణువు వాహనమైన గరుత్మంతుడు అనే పక్షి విషయంలోనూ అంతే. సర్పానికీ, సూర్యచంద్రులకీ, ఇతర ఖగోళ విశేషాలకు మానవ ఆకృతిని ఇవ్వడం మన దగ్గరా మామూలే. సర్పాన్ని యథారూపంలో పూజించడమూ ఉంది.

ఇలాంటి బహురూప ఆస్తికత మన దేశంలో సమకాలీన వాస్తవం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం.

   ***

దేవతల కూర్పులు, చేర్పులు, మార్పుల (థియోక్రేసియా) ప్రక్రియను వెల్స్ ఈజిప్టు నేపథ్యం నుంచి వివరిస్తారు. ఇందులో దొర్లే దేవీ, దేవతల పేర్లు కొత్తగా అనిపించి ఆసక్తి గొలపక పోవచ్చు కానీ, వారిలో మన దేవీ, దేవతల పోలికలను పట్టుకుంటూ వెడితే ఆసక్తిని కలిగించవచ్చు.

ఈజిప్టు నగరరాజ్యాల దశనుంచి, ఐక్య సామ్రాజ్యంగా అభివృద్ధి చెందే క్రమంలో థియోక్రేసియా పెద్ద ఎత్తున సంభవించింది. వారి ప్రధాన దైవం ఓసిరిస్. ఈజిప్టు చక్రవర్తి(ఫారో) భూమి మీద ఈ దేవుడి ప్రతిరూపం. ఓసిరిస్ బలులు స్వీకరించే పంటల దేవుడు. విత్తనాన్ని భూమిలో పాతిపెట్టడం, దానినుంచి మళ్ళీ మొక్క రావడం –చావు, పుట్టుకల చక్రానికి ప్రతీకగా చెబుతారు. ఈ పంటల దేవుడు కూడా అంతే. చచ్చి మళ్ళీ పుట్టడమంటే, మృత్యుంజయత్వమే. ఆవిధంగా ఓసిరిస్ మృత్యుంజయుడు. మన శివుడు కూడా మృత్యుంజయుడు. ఈ మృత్యుంజయత్వాన్నే మనం అమరత్వం అంటాం. ఈ అమరత్వం అనే భావనను ఈజిప్షియన్లే ప్రపంచానికి పరిచయం చేశారని వెల్స్ అంటారు. అందుకు ప్రత్యేకమైన సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అందులోకి తర్వాత వెడదాం. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉంటాయి కనుక ఓసిరిస్ సూర్యుడు కూడా. ఆ తర్వాత ఓసిరిస్ ను ఎపిస్ అనే వృషభదేవుడిగా గుర్తించడం ప్రారంభించారు. అప్పుడతని అర్థాంగి ఐసిస్. ఆమె హేతర్ అనే పేరు ఉన్న గోదేవత కూడా. అంతేకాదు, ఆమె చంద్రవంక, సముద్రం నుంచి ఆవిర్భవించిన తారా కూడా. తార మన అమ్మవారి పేర్లలో ఒకటి. అమ్మవారి తల మీద, శివుని తల మీద చంద్రవంక ఉంటుంది. మన లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవిస్తుంది.

ఓసిరిస్ చనిపోయిన తర్వాత ఐసిస్ కు హోరస్ అనే కొడుకు పుడతాడు. ఇతడు మొదట్లో మన గరుత్మంతుడిలాంటివాడు. ఇతనే ఆ తర్వాత ఓసిరిస్ అవుతాడు. ఐసిస్ చంద్రవంక మీద నిలబడి కొడుకుని ఎత్తుకుని ఉన్న రూపంలో కనిపిస్తుంది. ఈ రూపం బాల వినాయకుణ్ణి ఎత్తుకుని ఉన్న పార్వతిని గుర్తుచేస్తుంది. వృషభం, సూర్యుడు, చంద్రుడు, సర్పం మొదలైనవి నాటి బహురూప ఆస్తికతకు గుర్తుగా ఈజిప్టు, మనదేశపు ఆస్తికతలలోనే కాక, పురాతన ఆస్తికతలు అన్నిటా ప్రధాన పాత్ర వహించాయి. ఎంతో ఆసక్తికర సమాచారం ఉన్న ఆ కోణంలోకి ఇప్పుడు వెళ్లలేం.

గ్రీకులు ఈజిప్టును జయించిన తర్వాత నూతనంగా నిర్మించిన అలెగ్జాండ్రియా నగరం ఈజిప్టు మతజీవితానికే కాక, హెల్లెనిక్ (పురాతన గ్రీసు, దానిని దగ్గరలో ఉన్న దీవులు, క్రీటు ద్వీపం, ఆసియా మైనర్ తీరప్రాంతం, ఇటలీ దక్షిణ ప్రాంతాలను ఇలా పిలిచేవారు) ప్రపంచ మతజీవితం మొత్తానికి కేంద్రస్థానం అయింది. మొదటి టోలెమీ చక్రవర్తి అలెగ్జాండ్రియాలో ‘సెరాపియమ్’ అనే బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మింపజేసి, అందులో ఒకవిధమైన త్రిమూర్తులను ప్రతిష్టింపజేశాడు. వారు: సెరాపిస్, ఐసిస్, హోరస్ లు. సెరాపిస్ మరెవరో కాదు, ఓసిరిస్-ఎపిస్ లను కలిపేసి సృష్టించిన దేవుడు. నిజానికి ఈ త్రిమూర్తులు వేర్వేరు దేవుళ్ళు కారు, ఒకే దేవుడికి భిన్న అంశలు. ఈ సెరాపిస్ నే గ్రీకుల జియస్ (ఈయన మన బ్రహ్మ దేవుడిలాంటివాడు) గానూ, రోమన్ల జూపిటర్ గానూ, పర్షియన్ల సూర్యదేవుడిగానూ గుర్తిస్తారు.

హెల్లెనిక్ ప్రభావంతో ఈ త్రిమూర్తుల ఆరాధన ఉత్తరభారతం, పశ్చిమ చైనాల వరకూ వ్యాపించిందని వెల్స్ అంటారు.

మన దేశంలో అమ్మవారిని పూజించినట్టే అసంఖ్యాక భక్తులు ఐసిస్ ను ఆరాధించేవారు. ఆ చల్లని తల్లి తమను కష్టాలు, కడగండ్ల నుంచి గట్టెక్కిస్తుందని నమ్మేవారు. ఐసిస్ అనే పేరు మన ఈశాని(పార్వతి)ని గుర్తుచేస్తూ ఉండచ్చు. ఆమె స్వర్గరాణి. దేవాలయాలలో ఆమె హోరస్ ఎత్తుకుని ఉన్న రూపంలో ఉంటుంది. ఆమె ముందు దీపారాధన చేసి, నైవేద్యాలు అర్పించేవారు. విశేషమేమిటంటే, ఐసిస్ ఆలయంలో అర్చకులు శిరోముండనం చేసుకునేవారు. బ్రహ్మచర్యం పాటించేవారు.

మన అమ్మవారి ఆలయాలలోని మనకు చిరపరిచితమైన దృశ్యాల ప్రతిబింబాన్ని ఈ వివరాలలో మీరు ఈపాటికి స్పష్టంగా పోల్చుకుని ఉండవచ్చు.

అదీ సంగతి!

 

 

మిగతా విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

 

 

 

 

మన వర్తమానాన్ని గుర్తు తెచ్చే రోమన్ గతం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

విషయం ఎక్కడినుంచి ఎక్కడిదాకా వెళ్ళిందో చూడండి….

దృష్టద్యుమ్న, ద్రౌపదల జన్మవృత్తాంతం చెప్పుకుంటూ, మాంత్రిక వాస్తవికతలోకి వెళ్ళి, అక్కడినుంచి, ఋగ్వేదంలో చెప్పిన పణులు ఫొనీషియన్లే కావచ్చునన్న కోశాంబీ ఊహను పట్టుకుని, వారితోపాటు యూదుల గురించి చెప్పుకోబోయి, అంతలో బహురూప, ఏకరూప ఆస్తికతల చర్చలోకి వెళ్ళి, రోమన్ల దగ్గరికి వచ్చాం!!!

ఓసారి వెనక్కి వెళ్ళి తొలి అడుగు ఎక్కడ వేశామో గుర్తుచేసుకోవాల్సినంతగా విషయం ఇన్ని దారులుగా చీలిపోవడం ఇదే మొదటిసారేమో! అయినా తప్పదు. నిండా మునిగాక చలేమిటి!?

ఆర్యులుగా చెప్పుకునే నోర్డిక్ జాతులవారు తరిమేస్తే, ఆసియా మైనర్(నేటి టర్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతం)కు పశ్చిమంగా ఉన్న ఏజియన్లు తలోవైపుకీ చెదిరిపోయారనీ, వారిలో ఒకరైన ఎట్రూస్కన్లు ఇటలీ మధ్యభాగంలోని అడవుల్లోకి వచ్చి స్థిరపడ్డారనీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆర్య తెగలు అక్కడికి కూడా చొచ్చుకువచ్చే నాటికి ఎట్రూస్కన్లు బలపడి రాజ్యాన్ని స్థాపించుకున్నారు.

అలా ఇటలీలోకి చొచ్చుకు వెళ్ళిన ఆర్య తెగల్లో రోమన్లు ఒకరు. వారు లాటిన్ మాట్లాడేవారు. ఎట్రూస్కన్లు ఆర్య తెగలను చాలాకాలంపాటు అణచి ఉంచారు. పురాతన కాలనిర్ణయం ప్రకారం రోమ్ నగరం క్రీ.పూ. 753లో అవతరించింది. చరిత్రకు తెలిసే నాటికి అది ఒక చిన్న వర్తక నగరం. అప్పటికి యాభై ఏళ్ల క్రితమే ఫొనీషియన్లు ఉత్తర ఆఫ్రికాలో కార్తేజ్ అనే నగరాన్ని నిర్మించుకున్నారు. పది లక్షల మంది జనాభాతో కార్తేజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద నగరం. భవిష్యత్తులో రోమ్ కూ, కార్తేజ్ కూ మధ్య ‘ప్యూనిక్ యుద్ధా’ల పేరుతో మూడు యుద్ధాలు జరిగి కార్తేజ్ రేఖాపటం మీద అదృశ్యం కాబోతోంది.

క్రీ.పూ 6వ శతాబ్ది నాటికి రోమన్లు పుంజుకుని ఎట్రూస్కన్ల రాజ్యాన్ని కూల్చేసి రోమ్ ను కులీనుల ఆధిపత్యంలో రిపబ్లిక్ గా మార్చారు. కులీన కుటుంబాలను ‘పేట్రీసియన్ల’నీ, సామాన్య ప్రజానీకాన్ని ‘ప్లెబియన్ల’నీ అనేవారు. ఇక్కడ కొంచెం ఆగి క్రీ.పూ. 6వ శతాబ్ది గురించి కొంత చెప్పుకోవాలి.

క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్యమైన శతాబ్దం. ఈ శతాబ్ది గురించి హెచ్. జి. వెల్స్ ఇలా రాస్తారు:

క్రీ.పూ. 6వ శతాబ్దితో ప్రారంభించి తదుపరి శతాబ్దాలలో ప్రతిచోటా పురాతన సంప్రదాయాలు కుప్పకూలిపోయాయి. నైతికత, మేధో విచారణ(intellectual inquiry) సంబంధమైన సరికొత్త స్ఫూర్తి జనంలో అంకురించింది. ఆ స్ఫూర్తి ఆ తదుపరి కాలంలోనూ మానవాళి పురోగమనం అంతటా అంటిపెట్టుకునే ఉంది. చదవడం, రాయడం అనేవి అంతవరకు పురోహితుల గుప్తసంపదగా ఉంటూ వచ్చాయి. కానీ ఇప్పుడవి ఇతరులకూ అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే, గుప్పెడు మంది పాలక తరగతికి, సంపన్నులకే పరిమితమయ్యాయి. గుర్రం ప్రయాణసాధనంగా వినియోగంలోకి రావడం, రోడ్ల నిర్మాణం జరగడంతో రాకపోకలు పెరిగాయి. వర్తక లావాదేవీలను మరింత సులభతరం, సరళం చేస్తూ నాణేల రూపంలో డబ్బు వినిమయం అడుగుపెట్టింది.

ఈ నేపథ్యంలో బలపడిన రోమ్, మానవాళి చరిత్రలోనే మహత్తరమైన ఈ పరిణామ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.

ఇక్కడే రేఖామాత్రంగా ఒక అంశాన్ని స్పృశించి ముందుకు వెడతాను. పురాతన నాగరికతల అంతటా ప్రసరించినట్టే క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రభావం మనదేశం మీదా ప్రసరించింది. బౌద్ధ, జైనాలు అప్పుడే పుట్టాయి. అయితే, పాశ్చాత్య సమాజంలో ఆ ప్రభావం ఒక క్రమగతిలో అభివృద్ధి చెందుతూ తార్కికాంతానికి చేరుకుంటున్నట్టు కనిపిస్తే, మన దేశంలో మాత్రం అది స్తంభించడమే కాకుండా తిరోగమనం పట్టినట్టు అనిపిస్తుంది. ఆ స్తంభన నేటి 21వ శతాబ్ది నాటికి కూడా అలాగే ఉందనిపిస్తుంది. కనీసం మత, తాత్విక రంగాలకు పరిమితమై చెప్పుకున్నా భారత్ ఇంకా క్రీస్తుశకంలోకి రాలేదన్న నా సూత్రీకరణకు ఇది కూడా ఒక దోహదాంశం కావచ్చు. ప్రస్తుతానికి మరీ లోతులోకి వెళ్లకుండా ఈ ప్రస్తావనను ఇక్కడితో వదిలేస్తాను.

రోమ్ అనేక కొత్త పోకడలకు ప్రారంభాన్ని ఇచ్చింది. అనేక విషయాలలో చరిత్రను తిరగరాసింది. మత,తాత్విక రంగాలలో అవి ఎలాంటివో చెప్పుకునే ముందు లౌకిక రంగంలో ఏం చేసిందో చెప్పుకుందాం:

రోమ్ కు ముందు పురాతన నాగరికతలలో పరిపాలనా రూపం భిన్నంగా ఉండేది. ఒక వీరుడు లేదా విజేత ఒక నగరరాజ్యాన్ని పాలించేవాడు. ఆ నగరం ఒక గుడి కేంద్రంగా అభివృద్ధి చెందినదయ్యుండేది. ఆ గుళ్ళో ఒక వ్యవసాయదేవత కొలువై యుండేది. ఇందుకు భిన్నంగా రోమన్లది మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌర కేంద్రిత పాలన. ఆర్యులు అప్పటికింకా గణతంత్ర(రిపబ్లిక్) వ్యవస్థలోనే ఉన్నారు. ఆవిధంగా చరిత్రలోనే మొదటిసారిగా ఆర్యుల గణతంత్ర విధానంలో విశాలప్రాంతాన్ని ఏలినవారు రోమన్లు!

గణతంత్రం అన్నప్పుడు మోర్గాన్ ను కూడా కలిపి చెప్పుకుంటే తప్ప రోమన్ల గురించి పూర్తిగా చెప్పుకున్నట్టు కాదు. ఆధునిక చరిత్ర శిక్షణకు చెందిన హెచ్. జి. వెల్స్ లాంటి చరిత్రకారులు సాధారణంగా ఆ కోణంలోకి వెళ్లరు. అసలు విషయానికి మరింత దూరమైపోతాం కనుక మనమూ ఇప్పుడు అందులోకి వెళ్లలేం. అదలా ఉంచితే, చరిత్రకారులు రోమన్ విస్తరణను నాలుగు దశలుగా వర్గీకరించారు. మొదటిది, క్రీ.పూ. 390తో రోమ్ ను గాల్స్ ఆక్రమించుకోవడంతో మొదలై, క్రీ.పూ. 240లో తొలి ప్యూనిక్ యుద్ధంతో ముగుస్తుంది. ఆ దశను ‘ఏకీకరణ గణతంత్రం (Assimilative Republic) అన్నారు. అంతకుముందు చాలా కాలంనుంచీ కులీనులకు, సామాన్యులకూ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఈ దశకు చేరే నాటికి తగ్గుముఖం పట్టి ఒక రాజీ ఏర్పడింది. ఈ దశలో మరీ సంపన్నులూ లేరు, మరీ పేదలూ లేరు. ఇది స్వేచ్చా స్వాతంత్ర్యాలు కలిగిన రైతుల గణతంత్రం. ఈ రైతులు వ్యవసాయం చేస్తూనే అవసరమైనప్పుడు సైనిక విధులు నిర్వర్తించేవారు. ఈ దశలో రోమ్ కేవలం ఇరవై చదరపు మైళ్ళ విస్తీరణం కలిగిన చిన్న నగరం. అదే పరిపాలనా కేంద్రం. రోమన్లు జయించిన నగరాలలోని పౌరులకు కూడా వోటు హక్కు ఉండేది. వాటిలో కొన్నింటికి స్వయంపాలన స్వేచ్చ ఉండేది. అలాగే వర్తక స్వేచ్చ, రోమన్లతో వివాహసంబంధం కల్పించుకునే స్వేచ్ఛ ఉండేవి. రోమన్లు కీలక ప్రాంతాలలోనూ, వలసలలోనూ పౌరస్థావరాలను ఏర్పాటు చేసేవారు. ఈ విధానాల ఫలితంగా ఓడిపోయిన నగరాలలోని పౌరులు కూడా క్రమంగా రోమన్లుగా మారిపోయారు. పెద్ద యెత్తున రోడ్ల నిర్మాణం జరిగింది. మొత్తం ఇటలీ అంతటా లాటినీకరణ జరిగింది. క్రీ.పూ. 89 నాటికి ఇటలీలోని స్వతంత్రపౌరులు అందరూ రోమ్ నగరపౌరులుగా గుర్తింపు పొందుతున్నారు. విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు… వాళ్ళు అక్కడికి వెళ్లగలిగి ఉండాలి!

ఇది రాస్తున్నప్పుడు, మన దేశంలో కూడా, అప్పటికి గణతంత్రదశలో ఉన్న ఆర్యుల విస్తరణ సరిగ్గా ఇలాగే జరిగిందా అని నాకు అనిపిస్తోంది. కొన్ని పోలికలూ గుర్తుకొస్తున్నాయి. మరో సందర్భానికి దానిని వాయిదా వేద్దాం.

రోమన్లు తమ ఏలుబడిలో ఉన్న అన్ని నగరాలకు, ప్రాంతాలకు పైన చెప్పిన విధంగా పౌరసత్వాన్ని విస్తరింపజేయడం; రాజ్య విస్తరణలో అంతవరకూ ఎరగని ఒక విశేష ప్రక్రియ. వెనకటి పాలకులు అనుసరిస్తూ వచ్చిన ప్రక్రియను రోమన్లు పూర్తిగా తల కిందులు చేశారు. ఎలాగంటే, వెనకటి పాలకులు ఏ ప్రాంతాన్ని అయినా జయించినప్పుడు వాళ్ళే ఓడిపోయిన జనంలోనూ, వాళ్ళ సంస్కృతిలోనూ, ఆరాధనా పద్ధతులలోనూ కలసిపోయేవారు. ఇందుకు భిన్నంగా రోమన్లు ఓడిపోయిన జనాన్నే తమలోకి, తమ పద్ధతులలోకి కలుపుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య వివరం. దీనితో కూడా మన దేశ అనుభవానికి పోలిక ఉంది.

ఇక, మొదటి ప్యూనిక్ యుద్ధం ముగిశాక రోమన్లు తమ విస్తరణలో రెండవ దశలోకి అడుగుపెట్టారు. సీసిలీని జయించడం దీనికి ప్రారంభం. సిసిలీ మంచి సారవంతమైన నేల. అక్కడి జనం చెమటోడ్చి పనిచేసేవారు. దాంతో ఆ ప్రాంతం రోమ్ ను మరింత సంపన్నం చేయగల అవకాశం కనిపించింది. దాంతో, దానిని రోమన్ ప్రజల ‘ఎస్టేట్’ గా ప్రకటించారు. కులీనులలో, సామాన్యులలో కూడా మంచి పలుకుబడి, స్థోమత ఉన్నవారు సిసిలీ అందించే సంపదలో పెద్ద వాటా కొల్లగొట్టారు. ఈ అనుభవం మనకు ఈనాడు బాగా తెలిసిన వలసవాదాన్ని గుర్తుచేస్తుంది. ఇదే సమయంలో యుద్ధాలు పెద్ద సంఖ్యలో బానిసలనూ అందించాయి. బానిసల ప్రవేశంతో వ్యవసాయోత్పత్తి బాగా పెరిగింది. ఎస్టేట్లు, బానిసవ్యవస్థ గణతంత్ర స్వభావాన్ని మార్చాయి. ఈ పరిణామక్రమంలో చితికిపోయింది సామాన్యులు. వారు వ్యవసాయం చేస్తూనే సైనికవిధులు నిర్వర్తించేవారని చెప్పుకున్నాం. వారు యుద్ధాలనుంచి తిరిగి వచ్చేసరికి వ్యవసాయం మూలపడి ఉండేది. వ్యవసాయోత్పత్తిలో వాళ్ళు బానిసలతో పోటీ పడాల్సివచ్చేది. ఆ క్రమంలో వారు రుణగ్రస్తులయ్యేవారు. సిసిలీ రోమ్ చేతుల్లోకి వెళ్ళినట్టే సామాన్య రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లారు. అంతకు ముందు ఈ సైనిక రైతులు ప్రభుత్వంలో వాటా కోసం రెండువందల ఏళ్ళు పోరాడారు. ఆ తర్వాత వందేళ్లపాటు ప్రభుత్వంలో వాటాతోపాటు అన్ని హక్కులూ అనుభవించారు. మొదటి ప్యూనిక్ యుద్ధం వాటన్నింటినీ హరించివేసి పరిస్థితిని మొదటికి తెచ్చింది. దీనిని సాహసిక సంపన్నుల గణతంత్రం (Republic of Adventurous Rich Men) అన్నారు.

ఇక్కడ కూడా పురాకాలం నుంచి చరిత్రకాలం వరకూ మన దేశం పొందిన అనుభవాలతో పోలికలు నాకు గుర్తుకొస్తున్నాయి…

ఇక్కడొకసారి రోమన్ గణతంత్ర సభల గురించి చూద్దాం. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నట్టే అప్పుడు కూడా రెండు సభల వ్యవస్థ ఉండేది. మొదటిదీ, ముఖ్యమైనదీ సెనేట్. ఇందులో కులీనులు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు. ఇది స్వభావంలో నేటి అమెరికన్ సెనేట్ కు కన్నా బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు దగ్గరగా ఉంటుంది. ప్యూనిక్ యుద్ధాలనుంచీ మూడువందల సంవత్సరాలపాటు సెనేటే రోమన్ల రాజకీయ చింతనకు, క్రియాశీలతకు కేంద్రంగా ఉండేది. ఇక రెండవ సభ అసెంబ్లీ. సూత్రరీత్యా రోమ్ లోని పౌరులందరూ ఇందులో సభ్యులే. రోమ్ కేవలం ఇరవై చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉన్న తొలి రోజుల్లో ఈ సభ సమావేశాలు తగిన హాజరుతో అర్థవంతంగా జరిగేవేమో. కానీ, రోమ్ ఇటలీ సరిహద్దులను కూడా దాటిపోయి విస్తరించిన తర్వాత ఈ సభ దాదాపు తంతుగానూ, అలంకారప్రాయంగానూ మారిపోయింది. కొమ్ము బూరాలు ఊది ఈ సభ సమావేశమవుతున్నట్టు ప్రకటించేవారు. పని పాటలు లేనివాళ్లతోనూ, అల్లరిచిల్లరి వాళ్లతోనూ సభ నిండిపోయేది. అదే క్రీ.పూ. నాలుగవ శతాబ్దిలో అయితే సెనేట్ మీద అసెంబ్లీ తగుమేరకు అంకుశంలా పనిచేసేది. సామాన్య ప్రజానీకం తమ హక్కులను ఉద్ఘాటించుకోడానికి అందులో తగినంత ప్రాతినిద్యం ఉండేది. ప్యూనిక్ యుద్ధాలు ముగిసే నాటికి ఈ సభపై ప్రజల నియంత్రణ అదృశ్యమైపోయింది. దాంతో గుప్పెడుమంది ప్రముఖులది ఇష్టారాజ్యమైంది.

రెండో ప్యూనిక్ యుద్ధం ముగిసేనాటికి సామాన్యుడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఒక్కోసారి ఉన్న వ్యవసాయభూమినీ కోల్పోయి మరింత పేదరికంలోకి జారిపోయాడు. రాజకీయ అధికారం, ప్రాతినిధ్యం లోపించడంతో సమ్మె, తిరుగుబాటు రూపంలో వారు తమ నిరసనను చాటుకోవలసి వచ్చింది. ఎస్టేట్లను రద్దుచేయాలనీ, తమ భూముల్ని తిరిగి తమకు ఇవ్వాలనీ రుణాలను పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ మాఫీ చేయాలని కోరుతూ చేసిన ఈ సమ్మెలూ, తిరుగుబాట్లూ ఫలించకపోగా అణచివేతను మరింత తీవ్రం చేశాయి. మరోవైపు, క్రీ.పూ. 73లో స్పార్టకస్ నాయకత్వంలో బానిసలు తిరగబడ్డారు. వాళ్ళలో కొందరు గ్లాడియేటర్లుగా పోరాటశిక్షణ పొందినవారు కనుక ఈ తిరుగుబాటు కొంత ప్రభావం చూపినా రెండేళ్లలో దానిని అత్యంత క్రూరంగా అణచివేశారు. స్పార్టకస్ ను ఓడించడంలో క్రాసస్ అనే సేనాని ప్రముఖ పాత్ర పోషించాడు. రోమ్ కు దక్షిణంగా ఉన్న అప్పియన్ వే అనే రహదారి పొడవునా ఆరువేలమంది స్పార్టకస్ అనుయాయులను కొరతవేసి చంపారు.

images0OYXY65E

పైన చెప్పిన రైతుల సంక్షోభంలో కూడా వర్తమాన భారతీయ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడచ్చు….’ఎస్టేట్లు’, రైతులు భూముల్ని కోల్పోవడం నేటి ‘సెజ్’ లనూ, భూసేకరణ రూపంలో నేటి భారతీయ రైతులు కోల్పోతున్న భూముల్ని గుర్తుచేయచ్చు. అలాగే వ్యవసాయంలో పోటీని ఎదుర్కోలేక చితికిపోతున్న నేటి రైతులూ, వాళ్ళ రుణ మాఫీ డిమాండ్లూ, ఆమేరకు ప్రభుత్వాల హామీలూ వగైరాలు కూడా.

ఇప్పటినుంచీ రోమ్ విస్తరణలో మూడవ దశ మొదలైంది. దానిని సైనిక నాయకుల గణతంత్రం(Republic of the Military Commanders) అన్నారు. ఇదెలా జరిగిందంటే, రెండో ప్యూనిక్ యుద్ధానికి ముందువరకు రైతులే సైనిక విధులు నిర్వర్తించేవారు. తమ స్తోమతను బట్టి ఆశ్వికదళంలోనో, పదాతి దళంలోనో చేరి యుద్ధం చేసేవారు. సమీపంలో జరిగే యుద్ధాలకు ఈ ఏర్పాటు సరిపోయేది. కానీ రోమ్ విస్తరిస్తూ దూర దూర ప్రాంతాలలో యుద్ధాలు చేయవలసివచ్చినప్పుడు ఈ సేన సరిపోలేదు. దానికితోడు, బానిసల సంఖ్య, ఎస్టేట్లు పెరిగిపోయి తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడంతో రోమ్ కోసం యుద్ధం చేయాలన్న ఉత్సాహం కూడా రైతుల్లో క్షీణించింది. దాంతో, కిరాయి సేనను సమకూర్చుకోవలసిన అవసరం తలెత్తింది. సామాన్యప్రజల్లోంచి వచ్చిన మారియెస్ అనే సేనాని ఆ దిశగా మొట్టమొదటి అడుగువేశాడు.

ఉత్తర ఆఫ్రికాలోని పరిస్థితులు అందుకు కారణమయ్యాయి. రోమన్లు కార్తేజ్ ను కుప్పకూల్చాక జుగర్తా అనే అతను అక్కడ ఒక అర్థఆటవిక రాజ్యాన్ని నెలకొల్పి రోమ్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. అతన్ని అణగదొక్కే బాధ్యతను రోమన్ సెనేట్ మారియెస్ కు అప్పగించింది. ఆ ప్రయత్నంలో మారియెస్ కిరాయి సేనను సమకూర్చుకుని, శిక్షణ ఇచ్చి జుగార్తాపై విజయం సాధించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. తన కిరాయి సేన అండతో మారియెస్ ఏకు మేకయ్యాడు. సెనేట్ తో సహా రోమ్ లోని ఏ శక్తీ అతన్ని దారికి తేలేకపోయాయి. కులీన వర్గానికి చెంది, జుగర్తాపై యుద్ధంలో మారియెస్ కింద పనిచేసిన శుల్లా అనే సేనానికి మారియెస్ ను అణిచే బాధ్యతను అప్పగించారు. వాళ్ళిద్దరికీ జరిగిన యుద్ధాలలో రెండువైపులా అనేకమంది రాజకీయప్రత్యర్థులను ఊచకోత కోశారు. వేలాదిమందికి మరణశిక్ష అమలు చేశారు. ఎస్టేట్లను అమ్మేశారు. ఒక పక్క వీరిద్దరి అంతర్యుద్ధం, మరోపక్క స్పార్టకస్ తిరుగుబాటు రోమ్ ను సైనిక గణతంత్రం వైపు బలమైన అడుగులు వేయించాయి. లుకల్లస్, పాంపే ‘ది గ్రేట్’, క్రాసస్, జూలియెస్ సీజర్ మొదలైన మహా సేనానుల పేర్లు తెరమీదికి వచ్చాయి. లుకల్లస్ ఆసియా మైనర్ ను జయించి, ఆర్మేనియాలోకి కూడా చొచ్చుకు వెళ్ళి, అంతులేని ప్రైవేట్ సంపదతో విశ్రాంతజీవితం గడిపాడు. స్పార్టకస్ తిరుగుబాటును అణిచేసిన క్రాసస్ పర్షియా మీద దాడి చేసి అక్కడి పార్థియన్ల చేతిలో ఓడిపోయి హతుడయ్యాడు. ఆ తర్వాత పాంపే, సీజర్ల మధ్య శత్రుత్వానికి తెరలేచింది. కాస్పియన్ సముద్రం వరకూ విస్తరించిన రోమన్ అధికారాన్ని పటిష్టం చేయడంలో పాంపే ప్రధాన పాత్ర పోషించాడు. గాల్ (ఇప్పుడు ఫ్రాన్స్, బెల్జియెం లు ఉన్న ప్రాంతం) మీద జెర్మన్ల దాడిని తిప్పికొట్టి, దానిని రోమన్ అధికారం కిందికి తెచ్చిన సేనానిగా సీజర్ ప్రసిద్ధిలోకి వచ్చాడు. అతను బ్రిటన్ లోకి కూడా రెండుసార్లు చొచ్చుకు వెళ్ళాడు కానీ దాని స్వాధీనానికి ప్రయత్నించలేదు.

ఇదంతా జరుగుతున్న క్రీ.పూ. మొదటి శతాబ్ది మధ్యనాటికి కూడా రోమన్ సెనేట్ నామమాత్రంగా నైనా అధికార కేంద్రంగా కొనసాగుతూనే ఉంది. ఆయా పదవుల్లో నియామకాలు దాని ద్వారానే జరుగుతున్నాయి. అందులోని సభ్యులు గణతంత్ర సంప్రదాయాలను, చట్టాలను పరిరక్షించడానికి పంటిబిగువు పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్లలో ప్రసిద్ధమైన పేరు-సిసిరో. అయితే, రైతులు చితికిపోవడంతో పౌరసత్వస్ఫూర్తి అంతరించి పోయింది. క్రాసస్ జీవించి ఉన్నప్పుడు అతనూ, పాంపే, సీజర్ ‘త్రిమూర్తులు’గా అవతరించి, సెనేట్ ను నామ మాత్రం చేసి, రోమ్ సామ్రాజ్యాన్ని మూడు ముక్కలుగా పంచుకుని శాసిస్తూ వచ్చారు. క్రాసస్ మరణించిన తర్వాత పాంపే, సీజర్ రంగం మీద మిగిలారు. వారిద్దరి ఘర్షణలో పాంపే సెనేట్ పక్షం వహించి, చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న ఆరోపణతో సీజర్ ను విచారణకు రప్పించేలా ఉత్తర్వులు జారీ చేయించాడు.

నాటి నిబంధనల ప్రకారం, ఏ సేనానీ తన అధికార పరిధిలోని ప్రాంతాన్ని దాటి ముందుకు రావడానికి వీల్లేదు. సీజర్ అధికార ప్రాంతానికీ, ఇటలీకీ మధ్య సరిహద్దు రుబికాన్ అనే ప్రదేశం. ‘విజయమో వీర స్వర్గమో’ అన్న నినాదంతో సీజర్ ఆ హద్దును దాటి పాంపే మీదికి, రోమ్ మీదికి యుద్ధానికి (క్రీ.పూ. 45లో) వెళ్ళాడు. ఆ యుద్ధంలో విజయం సాధించాడు. సైనిక సంక్షోభ సమయాల్లో ‘నియంత’ను ఎన్నుకుని అతనికి అపరిమిత అధికారాలిచ్చే సంప్రదాయం అప్పటికే రోమ్ లో ఉండేది. దానిని అనుసరించి పదేళ్ళ కాలపరిమితికి సీజర్ ను నియంతగా ఎన్నుకున్నారు. అయితే ఆ తర్వాత సీజర్ దానిని శాశ్వత నియామకంగా మార్పించుకున్నాడు. రోమన్లు ఎంతో అసహ్యించుకునే ‘రాజు’ అనే మాట కూడా ఆ సందర్భంలో వినిపించింది. రాజు కావడానికి సీజర్ ఒప్పుకోకపోయినా, సింహాసనాన్నీ, రాజదండాన్నీ మాత్రం స్వీకరించాడు. ఆ తర్వాత అతను ఈజిప్టు వెళ్ళి గ్రీకు టోలెమీ వంశానికి చెందిన ఆఖరి ఏలిక అయిన క్లియోపాత్రా ప్రేమలో పడ్డాడు. ఈజిప్టులో రాజును, లేదా రాణిని అక్షరాలా దైవంగానే కొలుస్తారు కనుక సీజర్ ఆ భావనను రోమ్ కు వెంటబెట్టుకుని వచ్చాడు. ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో సీజర్ విగ్రహాన్ని ప్రతిష్టించి ‘అజేయుడైన దేవుడు’ అని రాయించిన ఒక శిలాఫలకాన్ని అక్కడ ఉంచారు. ఆరిపోతున్న దీపం లాంటి రోమ్ గణతంత్రస్ఫూర్తి ఒక్కసారిగా నిరసన రూపంలో భగ్గుమంది. సెనేట్ లో సరిగ్గా పాంపే విగ్రహం పాదాల దగ్గరే సీజర్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. సీజర్ తోనే రోమ్ తన విస్తరణలో నాలుగవ దశ అయిన ‘సామ్రాజ్య’దశ (Empire) వైపు తొలి అడుగులు వేసింది.

ఆ తర్వాత పదమూడేళ్లకు సీజర్ దగ్గరి బంధువు ఆక్టేవియన్ సీజర్, మార్క్ ఆంటోనీ అనే ప్రత్యర్థిపై విజయం సాధించి రోమ్ పై ఆధిపత్యాన్ని సాధించాడు. అయితే అతను దేవుడిగా, రాజుగా ఉండడానికే కాదు సరికదా, నియంతగా ఉండడానికి కూడా ఒప్పుకోలేదు. సెనేట్ ప్రతిపత్తిని, ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాలను అతను పునరుద్ధరించాడు. అందుకు కృతజ్ఞతగా సెనేట్ అతనిని రాజు అనకపోయినా దానికి సమానమైన ‘ప్రిన్సెపెస్’, ‘అగస్టస్’ అనే బిరుదులతో గౌరవించింది. అగస్టస్ సీజర్ తొలి రోమన్ చక్రవర్తి అయ్యాడు.

అగస్టస్ వల్ల సెనేట్ తిరిగి ఊపిరి పోసుకున్నట్టు కనిపించినా అది తాత్కాలికమే అయింది. క్రమంగా రోమన్ చరిత్రలోంచి సెనేట్ అదృశ్యమైపోయింది. దాని స్థానాన్ని చక్రవర్తి, అతని అధికారులూ భర్తీ చేశారు. క్రమంగా రోమ్ విస్తరణా ఆగిపోయింది.

***

రోమ్ సైనిక నియంతృత్వానికి మళ్లిన తీరులో బహుశా పాకిస్తాన్ అనుభవం గుర్తుకువస్తూ ఉండచ్చు…

అదలా ఉంచితే, ‘ఈ రోమ్ చరిత్ర అంతా మాకు చెప్పాలా, మేము పుస్తకాలలో చదువుకోలేమా’ అని పాఠకులలో కొందరైనా అనుకుంటూ ఉంటారన్న శంక ఇది రాస్తున్నంతసేపూ నన్ను వేధిస్తూనే ఉంది. అయితే, ఒక ఊరటా లేకపోలేదు. అదేమిటంటే, రోమ్ పరిణామాల అద్దంలో భారతదేశ ప్రతిఫలనం గురించి మధ్య మధ్య సూచిస్తూ రావడం! అలాగే ఒకనాటి గణతంత్రం విచ్ఛిన్నమై ఏకవ్యక్తి పాలనకు దారి ఇచ్చిన క్రమాన్నీ ఇందులో స్పష్టంగా చూడచ్చు. ఇవి నా భవిష్య వ్యాసాలలో ఉపయోగించుకోదగిన ముఖ్యమైన మార్కింగులూ కావచ్చు.

 

 

 

 

 

 

 

 

చరిత్ర అద్దంలో ‘హిందుత్వ’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నేను ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో చెప్పాను…

వేల సంవత్సరాల గతం– కాలమూ, ప్రాంతమూ విధించిన హద్దులను దాటుకుంటూ మనం ఊహించని రీతిలో వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. యూదుల గతం ఇందుకు ఇంకొక ఉదాహరణ.

యూదులు పురాచరిత్రలో/చరిత్రలో కనీసం మూడువేల అయిదువందల సంవత్సరాలుగా కనిపిస్తున్నారు. విశేషమేమిటంటే, వారు అంత సుదూరగతంలో ప్రపంచానికి అందించిన ఒక భావన, ఈ క్షణాన మనదేశంలో ఒక వర్గం నోట ఒక విలక్షణమైన వాదం వినిపించడానికి కారణమవుతోంది. ఆ వర్గం, హిందుత్వవాదులు. ఇది ఒకవిధంగా సున్నితమూ, వివాదాస్పద అంశమే కానీ, యూదుల గురించి చెప్పడానికి పూర్వరంగంలో ఆ అంశంలోకి వెళ్ళడం అనివార్యమవుతోంది. ఈ వ్యాసాలు అన్నింటిలో పాటిస్తున్నట్టే, చారిత్రక తటస్థతను పాటిస్తూ అందులోకి వెడతాను.

‘హిందూ’ అనేది ఒక ‘మతం’ కాదని పలు సందర్భాలలో హిందుత్వ సిద్ధాంత వాదులు నొక్కి చెప్పడం చూస్తూ ఉంటాం. హిందూ అనేది ‘ఒక జీవనవిధానం’ అని వారు అంటుంటారు. ఈమేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉటంకిస్తూ ఉంటారు. మతంగా కాకుండా, ఒక జీవనవిధానంగా ఉండడం ప్రపంచం మొత్తం మీద హిందువుల ప్రత్యేకతగా వారు ఉద్ఘాటిస్తూ ఉంటారు. ఈవిధంగా వారికి సంబంధించినంతవరకు ‘మతం’ అనే మాటకు, ‘జీవనవిధానం’ అనే మాట ప్రత్యామ్నాయపదంగా మారింది.

అయితే, చారిత్రక దృష్టితో చూసినప్పుడు, తమది ‘మతం’ కాదని వారు అనడంలో కొంత నిజం ఉంది, కొంత నిజం కానిది ఉంది. మతం అనే మాటను విశాలార్థంలో తీసుకున్నప్పుడు ఒకానొక ఆధ్యాత్మిక విశ్వాసాన్నీ, ఆరాధనా పద్ధతినీ అనుసరించేది ప్రతిదీ ఒక మతమే. ఆవిధంగా హిందూకు పూర్వరూపమైన వైదికం కూడా ఒక మతమే. బౌద్ధ, జైనాలను కూడా మతమనే అంటాం. అయితే, ఇవి క్రీస్తుపూర్వ కాలానికి చెందిన మతాలు. క్రీస్తుశకానికి దగ్గరగా, లేదా క్రీస్తుశకంలోకీ వస్తే, క్రైస్తవం, ఇస్లాం అనే రెండు మతాలు, ‘మతం’ అనే మాటను విశాలార్థం నుంచి తప్పించి; నేడు మన ఊహలో ఉన్న రూఢ్యర్థాన్ని లేదా పరిమితార్థాన్ని ఆ మాటకు ఇచ్చాయి. ఆ మతాల స్వభావం అందుకు అవకాశమిచ్చింది. ఎలాగంటే, అవి ఏకేశ్వర మతాలు! ఆ మతాలకు ఒక ప్రామాణిక పవిత్ర గ్రంథం ఉంటుంది.

ఇక్కడ యూదుల ప్రమేయం ఏమిటంటే, ఈ ఏకేశ్వర భావనను, పవిత్రగ్రంథ భావనను ప్రపంచానికి అందించినది వారే. అది కూడా క్రీస్తుపూర్వ కాలంలోనే. ఆవిధంగా మతం అనే మాటకు నేటి రూఢ్యర్థం యూదుల వల్ల వచ్చింది. క్రీస్తుపూర్వ కాలంలో వారు ప్రారంభించిన ఆ ప్రక్రియ క్రైస్తవంతోనూ, ఇస్లాంతోనూ ఒక కొలిక్కి వచ్చింది. అంతకంటే విశేషంగా అదే ప్రక్రియ, కాలాన్ని క్రీస్తుపూర్వంగానూ, క్రీస్తుశకంగానూ విభజించి కాలగణనానికి ఒక కొండగుర్తునూ ఇచ్చింది.

కనుక, ‘ఏకేశ్వర భావన కలిగి, ఒక ప్రామాణిక పవిత్రగ్రంథం ఉన్నదే మతం’ అనే రూఢ్యర్థంలో తీసుకున్నప్పుడు, తమది మతం కాదన్న హిందుత్వ వాదుల వాదనలో నిజం ఉంది. అలా కాకుండా, మతం అనే మాటను క్రీస్తుపూర్వపు విశాలార్థంలో తీసుకున్నప్పుడు వైదికమతంలానూ, బౌద్ధమతంలానూ హిందుత్వ కూడా ఒక మతమే అవుతుంది. ‘హిందూ’ అనేది ఒక మతం కాదనడంవల్ల ఇప్పుడు ఎలాంటి విచిత్ర పరిస్థితి ఏర్పడిందంటే, దానిని గుర్తించడానికి ఒక సరైన మాట లేకుండా పోయింది. చివరికి ‘హిందు’, ‘హిందుత్వ’అనే మాటలతో సరిపెట్టవలసివస్తోంది.

ఇంతకీ సారాంశం ఏమిటంటే, హిందూ అనేది మతం కాదని అనడంలో హిందుత్వ సిద్ధాంత వాదులు చెప్పకనే చెబుతున్నది, అది క్రైస్తవం లానూ, ఇస్లాంలానూ ఒక పవిత్ర గ్రంథం కలిగిన ఏకేశ్వరమతం కాదనే! అయితే ఆ మాట వారు స్పష్టంగా అనడం లేదు. హిందూ ఏకేశ్వరమతం కానప్పుడు సహజంగానే అది ‘బహుళేశ్వర మతం’ అవుతుంది. అప్పుడది ఏకేశ్వర, బహుళేశ్వర మత చర్చగా పరిణమిస్తుంది. కానీ, హిందుత్వ సిద్ధాంతవాదులు హిందూ అనేది బహుళేశ్వర మతం అని కూడా స్పష్టంగా అనడం లేదు. హిందూకు సంబంధించి మతం అనే భావననే తీసుకురావడానికి వారు ఇష్టపడడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా హిందూ ‘ఒక జీవన విధానం’ అనే మాటను ప్రచారంలోకి తెస్తున్నారు.

దానికి ఒక స్పష్టమైన నేపథ్యం ఉంది. అది, ‘మతతత్వం వర్సెస్ లౌకికవాదం’ అనే పేరిట చాలాకాలంగా జరుగుతున్న రాజకీయ చర్చ. తమది మతతత్వం అంటూ లౌకిక వాదులు అదే పనిగా దాడి చేస్తున్నారు కనుక, హిందూ ‘ఒక మతం’ అనే భావననే తోసిపుచ్చడం హిందుత్వ వాదులకు ఒకానొక వ్యూహంగా మారింది. మతం అనే భావననే నిరాకరించడమంటే, మతాలకు సంబంధించిన చరిత్రను, చర్చను కూడా నిరాకరించడమే. అప్పుడీ చర్చ మొత్తం అకడెమిక్ చర్చకు ఏమాత్రం సందివ్వని రాజకీయ వ్యూహాత్మక చర్చగా పరిణమిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.

హిందూ ‘ఒక జీవన విధానం’ అన్నప్పుడు కూడా దానికి ఒక స్పష్టమైన నిర్వచనం సాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. ప్రపంచంలోని ఏ ఇతర సమాజాలలోనూ, సంస్కృతులలోనూ లేని విలక్షణ జీవనవిధానం హిందువులకు మాత్రమే ఉందని– రెండు రెళ్ళు నాలుగు అన్నంత స్పష్టంగా నిరూపించనప్పుడు ఆ మాట కూడా బ్రహ్మపదార్థం లాంటి ఒక అనిర్వచనీయ భావనగానే మిగిలిపోతుంది.

 

***

చరిత్రలోకి వెడితే భిన్నదృశ్యం కనిపిస్తుంది. ‘ఒక మతం కాకపోవడం, ఒక జీవన విధానం కావడం’ అనేది హిందువుల ప్రత్యేకత అన్న వాదాన్ని మాటవరసకు అంగీకరిస్తే, అది ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా ఉన్న ప్రత్యేకతే. ఒకింత వివరంగా చెప్పుకుంటే, ఆ ప్రత్యేకత ఇలా ఉంటుంది:

ఒకప్పుడు జనం ఒక దేవినో, దేవుడినో కాకుండా అనేకమంది దేవీ, దేవతలను పూజించేవారు. ఇది ‘బహుళ దైవారాధన’. దీనిని ఒకవిధమైన ‘ఆస్తిక ప్రజాస్వామ్యం’ అనచ్చు. వేరే దేవీ, దేవతలను పూజించేవారు ఒక ప్రాంతాన్ని జయించినప్పుడు ఆ ప్రాంతంలోని దేవీ, దేవతలను కూడా సాధారణంగా సొంతం చేసుకునేవారు. అంటే, విజేతలు, విజితులు (ఓడిపోయినవారు) ఒకరి దేవీ, దేవతలను ఒకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఆస్తికరంగంలో పాలు, నీళ్లలా కలసిపోయేవారు. ఆ విధంగా దేవీదేవతల సంఖ్య కూడా పెరిగేది. జనం కలసిపోయి చుట్టరికాలు కల్పించుకున్నట్టే, దేవీ, దేవతల మధ్య కూడా చుట్టరికాలు ఏర్పడేవి. ఈ ప్రక్రియను చరిత్రకారులు ‘థియోక్రేసియా’అన్నారు. ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా, ఇప్పటికీ మనదేశంలోనూ జరుగుతూ వచ్చిన ఈ ప్రక్రియను హెచ్.జి. వెల్స్ (A Short History of the World) చాలా ఆసక్తికరంగా వివరించారు. అలాగే, రాజులను, చక్రవర్తులను దైవాంశ సంభూతులుగా కొలుస్తూ వాళ్ళకు గుడి కట్టడం కూడా ఉండేది.

దీనంతటినీ వ్యవహార సౌలభ్యం కోసం ‘బహురూప ఆస్తికత’ అనీ, దీనికి భిన్నమైనదానిని ‘ఏకరూప ఆస్తికత’ అనీ అందాం.

పైన చెప్పిన ‘బహురూప ఆస్తికత’ స్థానంలో క్రమంగా ‘ఏకరూప ఆస్తికత’ అడుగుపెట్టింది. ఏకరూప ఆస్తికత అడుగుపెట్టి బలపడడాన్నే నేటి మన కాలగణనలో క్రీస్తుశకం పేరిట కొండగుర్తుగా మార్చుకున్నట్టు పైన చెప్పుకున్నాం. ఆవిధంగా బహురూప ఆస్తికత క్రీస్తుపూర్వపు చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.

ఇక్కడే ఇంకో తమాషా ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రజాస్వామ్యం వైపు వెళ్లిన, లేదా వెళ్లాలని భావిస్తున్న ప్రపంచం; ఆస్తికరంగంలో మాత్రం (మనదేశం వంటి మినహాయింపులతో) దానికి భిన్నమైన మార్గంలో, అంటే ఏకరూప ఆస్తికతలోకి వెళ్లింది. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా తనను చెప్పుకునే పాశ్చాత్యక్రైస్తవ ప్రపంచం ఆస్తికంగా మాత్రం ఏకరూపతకు మళ్ళడం విచిత్రంగా ఉంటుంది. ఆ ఏకరూప ఆస్తికతను పురోగామిరూపంగా కూడా అది విశ్వసించింది. అందుకే తన వలసగా మార్చుకున్న భారత్ తో సహా అనేక దేశాలను క్రైస్తవీకరించే ప్రయత్నాలకు పాశ్చాత్యప్రపంచం మద్దతు ఇచ్చింది. కానీ అది బెడిసికొట్టడంతో వెనకడుగు వేసిన ఉదాహరణలూ ఉన్నాయి. చర్చితో పోరాడిన చరిత్ర కూడా తనకు ఉంది కనుక మతాన్నీ, రాజకీయాన్నీ అది విడదీసింది. తను ఆస్తికరంగంలో ఏకరూపతకు మళ్లినా రాజకీయంగా బాహుళ్యంవైపు, అంటే ప్రజాస్వామ్యంవైపు మొగ్గింది కనుక, అందులో భాగంగా భిన్న ఆస్తిక విశ్వాసాల ఉనికిని సూత్రప్రాయంగానైనా అది గుర్తిస్తుంది.

ఇస్లాం ప్రపంచానికి వస్తే, పాశ్చాత్యప్రపంచంలా అది ఏకరూప ఆస్తికతలోకి మళ్లినా, రాజకీయ ప్రజాస్వామ్యానికి పూర్తిగా మళ్లలేదు. కాలగణనం నుంచి చెప్పుకుంటే ఈ రెండు ప్రపంచాల మధ్యా ఉన్న ఒక పోలిక- క్రీస్తుపూర్వ కాలానికి చెందిన బహురూప ఆస్తిక నుంచి, క్రీస్తుశకానికి చెందిన ఏకరూప ఆస్తికతలోకి అవి రెండూ అడుగుపెట్టడం.

మనదేశానిది పూర్తిగా భిన్నమైన అనుభవం. మనం మొదటినుంచీ, ఇప్పటివరకూ కూడా భిన్న మతాలు, పంథాలు, ఆరాధనాపద్ధతుల రూపంలోని బహురూప ఆస్తికతలోనే ఉన్నాం. ఇందుకు మనదేశ భౌగోళిక పరిస్థితులు కూడా కొంత దోహదం చేశాయని కోశాంబీ సూత్రీకరణ. అలాగని మన దేశంలో అక్కడక్కడైనా ఏకరూప ఆస్తికతను విధించడానికి ప్రయత్నం జరగలేదని కాదు. క్రీస్తుపూర్వకాలంలో బౌద్ధం అనే ఉదాహరణ ఒకటి కనిపిస్తుంది. అయితే, బౌద్ధం స్వతస్సిద్ధంగా క్షీణించడం వల్ల నేటి హిందూకు పూర్వ రూపమైన వైదిక లేదా సనాతనమతం దాని స్థానంలోకి విస్తరించిందా, లేక బౌద్ధాన్ని అణగదొక్కి విస్తరించిందా అన్న ప్రశ్నకు అవకాశం ఉంది. అందులోకి నేను మరి అంత లోతుగా వెళ్లలేదు కనుక ప్రస్తుతానికి దానిని ప్రశ్నగానే వదిలేస్తాను. మనదేశంలో అక్కడక్కడ ఏకరూప ఆస్తికత విధించడానికి జరిగిన ఇతర ప్రయత్నాలు క్రీస్తుశకంలోకే వస్తాయి. వీరశైవ, వైష్ణవ మతాలు మొదలుకుని బ్రిటిష్ కాలంలో బ్రహ్మ సమాజం తదితర ఏకేశ్వర మతాలవరకూ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఏకరూప ఆస్తికతకు చెందిన క్రైస్తవ, ఇస్లాంల వరవడిలో పుట్టినవి.

బహురూప ఆస్తికత నుంచి ఏకరూప ఆస్తికతకు మళ్లడం అనేది అంత సునాయాసంగా ఏమీ జరగలేదు. అందులో ఎంతో పీడన, హింస ఉన్నాయి. పాశ్చాత్య ప్రపంచమూ, ఆ తర్వాత ఇస్లామూ బహురూప ఆస్తికతను పనిగట్టుకుని తుడిచిపెట్టి మరీ క్రీస్తుశకంలోకి అడుగుపెట్టాయి. ఈ కోణంనుంచి (ఇంకా మరికొన్ని కోణాలనుంచి కూడా) చూసినప్పుడు మనదేశం ఇంకా క్రీస్తుశకంలోకి రానే లేదు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా ఒకటి రెండు సందర్భాలలో ప్రస్తావించాను.

విచిత్రం ఏమిటంటే, క్రైస్తవ, ఇస్లాం మతాలలా తమది ఒక ‘మతం’ కాదనీ, ‘జీవనవిధాన’మనీ హిందుత్వ సిద్ధాంత వాదులు అంటూనే; మళ్ళీ ఆ మతాలనే వరవడిగా తీసుకుంటూ ఆ ‘జీవనవిధానా’న్నే ‘ఏకరూప జీవనవిధానం’గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇంకొకటి కూడా చేస్తున్నారు. అది, క్రీస్తు పూర్వదశనుంచీ ఈ దేశంలో ఉన్న ఒకవిధమైన ఆస్తిక ప్రజాస్వామ్యాన్నీ, నేటి రాజకీయ ప్రజాస్వామ్యాన్నీ కలగాపులగం చేయడం! ఈ దేశం మొదటినుంచీ ప్రజాస్వామ్యదేశమే(రాజకీయంగా, సామాజికంగా కూడా) నని విస్తృతార్థంలో నొక్కి చెబుతూ, దానికి ఆస్తిక ప్రజాస్వామ్యాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

క్రీస్తుపూర్వ దశకు చెందిన బహురూప ఆస్తికతలో ఇప్పటికీ అధికారికంగా కొనసాగుతున్న దేశం ఒక్క మనదేశం తప్ప ఈ క్షణాన నాకు ఇంకొకటి స్ఫురించడం లేదు. క్రీస్తుపూర్వ కాలంలో బహురూప ఆస్తికతనుంచి తనను కాపాడుకోడానికి ఏకరూప ఆస్తికత ఎంతో పెనుగులాడవలసివచ్చింది. అజ్ఞాతజీవితం కూడా గడపవలసివచ్చింది. అలాంటిది, చరిత్ర తిరగబడి, ఏకరూప ఆస్తికత దాడిని కాచుకుంటూ నేడు బహురూప ఆస్తికత బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది.

నేటి సువిశాల ఏకరూప ఆస్తిక సాగరంలో బహురూప ఆస్తికతను కాపాడుకుంటున్న ఒంటరి దీవి మనదేశం!

***

మన దేశంలో బహురూప ఆస్తికత ప్రత్యక్ష సత్యం కనుక మరీ ఎక్కువ ఉదాహరణలు ఇచ్చుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి కులానికీ, ప్రతి తెగకూ, ప్రతి ప్రాంతానికీ తమవైన దేవీ, దేవతలు ఉన్నారు. తమవైన పూజాప్రక్రియలు ఉన్నాయి. ఒక్క అమ్మవారి పూజల్నే తీసుకుంటే అందులో ఉండే వైవిధ్యం అంతాఇంతా కాదు. కొన్ని కులాల పూజల్లో జాతరలు, జంతుబలులు, గరగ నృత్యాలు, శరీరాన్ని హింసించుకోవడం మొదలైనవి ఉంటే; కొన్ని కులాల పూజల్లో సాత్విక నైవేద్యాలు, అష్టోత్తరశతనామాలు, సహస్రనామాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలైనవి ఉంటాయి.

ఈ సందర్భంలో ఆది శంకరాచార్య గురించి ప్రస్తావించుకోవడం అవసరం. ప్రామాణిక చరిత్రకు తెలిసినంతవరకు మనదేశంలో తొలి మత సంస్కర్త ఆయనే. స్థూలంగా చెప్పుకుంటే, యజ్ఞాలు, జంతుబలులు ప్రాధాన్యం వహించే ఒకనాటి వైదిక మతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సంస్కరించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. మరోవైపు, జానపద పూజా పద్ధతులనూ, విశ్వాసాలనూ కూడా ఆయన చక్కదిద్దడానికి చూశారు. నేడు క్షుద్రపూజలుగా చెప్పుకునే కొన్ని రకాల ఉగ్రపూజా పద్ధతులను సాత్వికం చేయడం ఆది శంకరాచార్య ప్రధాన సంస్కరణగా కనిపిస్తుంది. ‘పంచాయతనం’ పేరుతో దేవీ దేవతల సంఖ్యను పరిమితం చేయడానికైతే ఆయన చూశారు కానీ, బహురూప అస్తికతను పూర్తిగా ఏకరూప ఆస్తికతగా మాత్రం మార్చలేదు. మన దేశస్వభావమూ, స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను అయిదుగురు దేవీ దేవతలకు పరిమితం చేసి ఉండవచ్చు. ఆ అయిదుగురు దేవీ, దేవతలు: అంబిక, సూర్యుడు, గణపతి, కుమారస్వామి, విష్ణువు. దాంతోపాటు పూజా విధానాన్ని సరళమూ, సాత్వికమూ చేశారు. అయితే శంకరాచార్యులవారి ప్రయోగాలు పూర్తిగా విజయవంతమయ్యాయని చెప్పలేం.

శంకరాచార్య కాలం గురించే వివాదం ఉంది. ఆయన క్రీస్తు శకానికే చెందినవారన్న వాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఏకరూప ఆస్తికత దిశగా ఆయన ఆలోచన చేశారా అనిపిస్తుంది. తాత్విక స్థాయిలో ఆయన అభివృద్ధి చేసిన అద్వైత సిద్ధాంతంలో దాని ఛాయలు కనబడవచ్చు. పూజా విధానం మేరకు పంచాయతనానికి పరిమితమయ్యారు.

శంకరాచార్యులవారి గురించి ఈ నాలుగు మాటలూ ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు చెప్పినవే కానీ, ఇది సమగ్ర, పరిశీలనా కాదు, అందుకు ఇది సందర్భమూ కాదు.

***

క్రీస్తు పూర్వకాలానికి చెందిన బహురూప ఆస్తికత ఏకరూప ఆస్తికతలోకి పయనించి క్రీస్తుశకాన్ని అవతరింపజేయడం రోమన్ సామ్రాజ్యకాలంలో జరిగింది. హెచ్, జి. వెల్స్ చిత్రించిన ఆ పరిణామక్రమాన్ని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

అది తర్వాత…

పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు!

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)మనిషికీ, కాలానికీ మధ్య కనిపించని పెనుగులాట నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబోలు…

మనిషి అనే చిన్నపిల్లవాడు ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు. అదిప్పుడు సైకతశిల్పాలనే ఒక కళారూపంగా కూడా ఎదిగి ఉండచ్చు, అది వేరే విషయం. ఇసుక గూడు కట్టినంతసేపూ స్థిరంగానూ, నిజంగానూ అనిపిస్తుంది. కానీ కాలం ఆ వెంటనే, లేదా మరునాడో దానిని కూల్చివేస్తుంది. అలాగే కాలగతిలో మనిషి తను ఉండే ప్రాంతానికీ, దేశానికీ సరిహద్దులూ, తనకు కొన్ని రకాల గుర్తింపులూ(identities) కల్పించుకుంటూ ఉంటాడు. కానీ కాలం వాటిని చెరిపివేస్తూ ఉంటుంది. కొత్త సరిహద్దులు, గుర్తింపులు ఏర్పడుతూ ఉంటాయి.

సారాంశం…కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదు!

కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదన్న సంగతిని గ్రహించడమే మనిషి పరిణతికి ఒక కొలమానం కావచ్చు. లేదా, ఎప్పటికప్పుడు కొత్త సరిహద్దులను, గుర్తింపులను కల్పించుకుంటూ సాగడమే మనిషి పరిణతికి నిజమైన కొలమానం అని కూడా ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. వీటిలో ఏది కరెక్టు అన్న వివాదంలోకి దిగడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ మొదటిదే కరెక్టు అనుకుంటే పురాచరిత్రలోకి వెళ్ళడం ఆ పరిణతికి ఏ కొంచెమైనా దోహదపడుతుందా…?

నేను ఇంతకు ముందు ఒకసారి నా అనుభవాన్ని రాశాను. అది, ఒక టీవీ చానెల్ లో కొందరు కాశ్మీరీ యువతీ యువకులు రెండు పక్షాలుగా విడిపోయి ఒక చర్చలో పాల్గొన్న సందర్భం. మొదటినుంచీ ఆ కార్యక్రమాన్ని చూడకపోవడంతో ఎవరు ఏ పక్షమో వెంటనే తెలియలేదు. ఎందుకుంటే, వారి రూపురేఖలు, ఆహార్యమూ ఒక్కలానే ఉన్నాయి. క్రమంగా వారిలో ఒక పక్షంవారు ముస్లింలనీ, ఇంకో పక్షంవారు కాశ్మీరీ పండిట్లనీ తెలిసింది. ఆ క్షణంలో నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక జ్ఞానశకలమూ మెరుపులా నా మెదడును తాకింది. దాంతోపాటు అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, కాశ్మీరీలను కాశ్మీరీలుగానే తప్ప ముస్లింలుగానో, పండిట్లుగానో గుర్తించకూడదని! ఎవరేమనుకున్నా నా నిర్ణయస్వేచ్ఛ నాది.

రెండు పక్షాలవారూ రక్తసంబంధీకులని వారి రూపురేఖలే చెబుతున్నాయి. చర్చ సందర్భంలో వాళ్ళలో కొందరు ఆ మాట అన్నారు కూడా. కానీ మధ్యలో వాళ్ళలో కొందరు మతపరమైన కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. మతపరమైన వేర్వేరు గుర్తింపులతో వారిద్దరి ప్రపంచాలూ వేరై పోయాయి. భౌగోళికంగానూ, మనుషుల పరంగానూ వారికి పరస్పర భిన్నమైన భావాలు, బంధాలు, విశ్వాసాలు ఏర్పడ్డాయి. అయితే, గుర్తింపులు వేరయ్యాయి కానీ, ఉనికి మారలేదు. ఫలితంగా… ఘర్షణ!

ఇంతకీ ఈ గుర్తింపుల ప్రస్తావన దేనికంటే…

బైబిల్ లో ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. అది, డేవిడ్ అండ్ గోలియత్. డేవిడ్ ఒక యూదు. బలంలోనూ, ఆకారంలోనూ సామాన్యుడు. గోలియత్ ఒక ఫిలిస్తీన్. బలంలోనూ ఆకారంలోనూ అసామాన్యుడు. పన్నెండు అడుగులవాడు. ఇప్పుడు ఇజ్రాయిల్, పాలస్తీనా అని పిలుచుకునే ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఫిలిస్తీన్లు, యూదులు పోరాడారు. ఉభయ సైన్యాలూ ఎదురెదురుగా నిలిచాయి. ఫిలిస్తీన్ సైన్యంలో అతి భీకరంగా ఉన్న గోలియత్ ముందుకు వచ్చాడు. అతన్ని చూడగానే యూదులు బెదిరిపోయి వెనకడుగు వేశారు. ఇలా గోలియత్ ముందుకురావడం, యూదు సేనలు భయపడి తోకముడవడం నలభై రోజులు సాగింది. అప్పుడు యూదురాకుమారుడు డేవిడ్ ధైర్యం చేసి గోలియత్ తో తలపడడానికి ముందుకొచ్చాడు. గోలియత్ ది భుజబలం అయితే, డేవిడ్ ది బుద్ధిబలం. ఒడిసెల్లోంచి రాళ్ళు విసరడంలో అతను నిపుణుడు కూడా. డేవిడ్ ఒక గులకరాయిని ఒడిసెల్లో పెట్టి గోలియత్ కణతకు తగిలేలా విసిరాడు. అంతే, గోలియత్ మొదలు తెగిన చెట్టులా కూలిపోయాడు.

untitled

ఈ కథ వినగానే మనకు రామాయణంలో కుంభకర్ణుడు గుర్తుకొస్తాడు. అతనిది కూడా భీకరమైన ఆకారం. అతను యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే వానరులు భయంతో తలోవైపుకీ చెదిరిపోతారు. వారు కూడా అప్పుడు రాళ్ళతోనూ, చెట్లతోనూ యుద్ధం చేశారు. చివరికి రాముడు బాణప్రయోగంతో కుంభకర్ణుని చంపేశాడు.

రాంభట్ల వెర్షన్ (వేదభూమి)ప్రకారం, ఫిలిస్తీన్లు మొదట క్రీటు దీవిలో ఉండేవారు. ఆవిధంగా వారు ఏజియన్లు. భూకంపం, అగ్నిప్రమాదం, గ్రీకు దాడుల ఫలితంగా వారు అప్పట్లోనే నేటి ఇజ్రాయిల్-పాలస్తీనా ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డారు. వారిని ‘పులిసేతు’ లనేవారు. అదే ఫిలిస్తీన్ అయింది. మన దగ్గర మ్లేచ్చులు, అప్రాచ్యులు అనే మాటల్లానే, ఫిలస్తీన్ కూడా తిట్టుపదంగా మారింది.

హెచ్. జి. వెల్స్ ప్రకారం కూడా ఫిలిస్తీన్లు ఆసియా మైనర్ కు పశ్చిమంగా ఉన్న ఏజియన్ ప్రాంతం నుంచి మధ్యధరా సముద్రపు ఆగ్నేయ తీరంలోకి వలస వచ్చి నగరాలు కట్టుకున్నారు. వీరి వలసకు కారణం, ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్న మూడు ముఖ్యరకాలకు చెందిన సంచారజీవులలో ఒకరైన ఆటవిక నోర్డిక్ జాతివారు వచ్చి పడడం. ఇది క్రీ.పూ. 1200, లేదా ఒకింత ముందు జరిగింది. వీరితో పురాతన రేఖాపటం మీదికి కొత్త పేర్లు వచ్చాయి. వీరి చేతుల్లో ఇనప ఆయుధాలు ఉన్నాయి. వీరు గుర్రాలు పూన్చిన రథాలు వాడుతున్నారు. ఉత్తర సరిహద్దులలో వీరు ఏజియన్, సెమెటిక్ నాగరికతలకు ముప్పుగా మారారు. వీరే మీదులు, పర్షియన్లు, కిమ్మెరియన్లు, ఆర్మేనియన్లు, ఫ్రిజియన్లు, గ్రీకులు, తదితరులుగా చరిత్రకు పరిచయమయ్యారు. వేర్వేరు పేర్లతో ఉన్నా వీరంతా ఆర్యులు. ఒకే మూలభాషనుంచి చీలిపోయిన వేర్వేరు ఆర్యభాషలు మాట్లాడేవారు. వీరు ఒకవైపు పశువులను కాచుకుంటూ, ఇంకోవైపు నగరాల మీద దాడులకు, దోపిడీలకు పాల్పడేవారు. క్రమంగా మరింత బలపడి పశ్చిమాన ఉన్న నాగరికులైన ఏజియన్ల నగరాలను ఆక్రమించుకుని వారిని తరిమివేయడం ప్రారంభించారు. దాంతో ఏజియన్లు కొత్త ప్రదేశాలు వెతుక్కున్నారు. కొంతమంది నైలు నదీ డెల్టాలో స్థిరపడాలని చూశారు కానీ ఈజిప్షియన్లు వాళ్ళను తరిమేశారు. ఎట్రూస్కన్లు గా పరిచయమైన కొందరు ఆసియామైనర్ నుంచి జలమార్గంలో ఇటలీ మధ్యభాగంలోని అడవుల్లోకి వచ్చి స్థిరపడ్డారు. ఈ వలసల్లో భాగంగా మధ్యధరా ఆగ్నేయ తీరానికి వచ్చినవారే ఫిలిస్తీన్లు.

ఈ చారిత్రక సమాచారం విసుగు పుట్టించచ్చు కానీ, ఎంతో అవసరమయ్యే ఈ వివరాలను ఇక్కడ ఇవ్వాల్సివస్తోంది. ఎందుకంటే, పైన చెప్పుకున్న అనేక పేర్లతో భారత దేశపురాచరిత్రకు కూడా సంబంధముంది. ఈ పేర్లు భిన్న ఉచ్చారణతో మన పురాణ, ఇతిహాసాలకు కూడా ఎక్కాయి. దీని గురించి ముందు ముందు చెప్పుకోవలసి రావచ్చు.

ప్రస్తుతానికి వస్తే, రాంభట్ల ఉద్దేశంలో పులిసేతులు లేదా ఫిలిస్తీన్లు ఆర్యులే! అంటే, వారు ఏజియన్ ప్రాంతంలోకి ముందే వచ్చి స్థిరపడినవారై ఉండాలి. చరిత్రకాలంలో వాళ్ళు ఇస్లాంలోకి మారారు. వారే కాదు, పురాకాలంలో మధ్య ఆసియా, పశ్చిమాసియాలకు చెందిన ఆర్యతెగలు అనేకం ఇస్లాంలోకి మారాయి. ఫిలిస్తీన్ల విషయానికే వస్తే, ఆర్యులుగా వారు పాశ్చాత్యప్రపంచానికీ, కొంతవరకు మనకూ యూదుల కంటే ఎక్కువ దగ్గర కావాలి. కానీ ఇస్లాం మతస్తులుగా వారు పాశ్చాత్యప్రపంచానికి విరోధులయ్యారు. పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికీ, ఇస్లామిక్ ప్రపంచానికీ క్రూసేడ్ల కాలంనుంచి, ఇప్పటివరకు జరుగుతున్న ఘర్షణలను ‘సంస్కృతుల మధ్య ఘర్షణ’ గా చెప్పుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో నేడు జరుగుతున్న అతి పెద్ద ఘర్షణ ఇదే కూడా.

అంతమాత్రాన పాశ్చాత్యప్రపంచానికి యూదులు నెత్తి మీది దేవుళ్లేమీ కారు. ‘ఆర్యత్వం’ ఒక ఉన్మాదంగా ప్రకోపించి హిట్లర్ యూదులపై సాగించిన ఊచకోత ఇటీవలి చరిత్రే. అయితే, ముస్లింలు అనే ‘పెద్ద శత్రువు’తో పోల్చితే యూదులు ‘చిన్న శత్రువు’ కనుకా; ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సూత్రరీత్యా పాశ్చాత్యులకు యూదులు ఇప్పుడు మిత్రవర్గం అయ్యారు.

మన విషయానికి వస్తే, ఇస్లాం ప్రపంచం వెలుపల ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కావడంవల్ల; మొదటి నుంచీ జాతుల విముక్తి పోరాటాలను సమర్థించే విధానం వల్ల మన దేశం పాలస్తీనా పక్షం వహిస్తూ వచ్చింది. కానీ క్రమంగా దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తొంభై దశకం నుంచే యూదుల దేశమైన ఇజ్రాయెల్ కు దగ్గరవడం ప్రారంభించింది. కాంగ్రెస్ అనుసరిస్తూ వచ్చిన ముస్లిం అనుకూలతా, దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే వైఖరీ—రెండూ కలసివచ్చి, బీజేపీ మొదటినుంచీ ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతూ వచ్చింది. ఈ మధ్య పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ పెద్దయెత్తున దాడులు జరిపి వందల సంఖ్యలో పౌరులను చంపడాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబట్టడం; ఎన్డీయే ప్రభుత్వం అందుకు తిరస్కరించడం తెలిసినదే.

కాలగమనంలో పాత గుర్తింపులు పోయి కొత్త గుర్తింపులు ఎలా ఏర్పడుతూ ఉంటాయో; దాంతోపాటే మిత్రత్వశత్రుత్వాలు జాతిభేదాలను, ప్రాంత భేదాలను ఎలా అధిగమిస్తాయో చెప్పడానికే ఈ వివరణ. అదలా ఉంచితే, కాలం కల్పించిన అన్ని రకాల హద్దులను ముంచేస్తూ పురాచరిత్ర వర్తమానంలోకి ఎలా ప్రవహిస్తుందో గ్రహించడానికి చక్కని ఉదాహరణ—నేటికీ కొనసాగుతున్న పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణ. అలాగే, అతిపురాతన కాలం నుంచి నేటివరకు నిరంతర ఘర్షణకేంద్రంగా కొనసాగుతూ కాలానికి సవాలుగా నిలిచిన ఏకైక ప్రాంతం, బహుశా పశ్చిమాసియా.

ఫొనీషియన్ల గురించి చెప్పుకుంటూ యూదుల దాకా వచ్చాం. ఫొనీషియన్లు, యూదుల మిత్రత్వంతోపాటు ప్రత్యేకంగా యూదుల గురించే చెప్పుకోవలసింది ఉంది. అందులోకి వెళ్ళే ముందు…

***

ఇంతకుముందు వ్యాసంలో సుమేరుకు చెందిన గిల్గమేశ ఇతిహాసం(Epic of Gilgamesh)లోని ఎంకిడు పాత్రతో మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుడికి పోలిక ఉందని చెప్పాను. పైన చెప్పిన గోలియత్, కుంభకర్ణుని గుర్తు తెస్తాడన్నాను. ఈ సందర్భంలో రామాయణ సంబంధమైన మరికొన్ని పోలికలూ గొలుసుకట్టుగా గుర్తొస్తున్నాయి. విషయం పక్కదారి పట్టే మాట నిజమే కానీ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పుకునే అవకాశం రాదన్న శంకతో ఇప్పుడే చెప్పాలనిపిస్తోంది.

చరిత్రకు తెలిసినంతవరకు తొలి అతిపెద్ద సామ్రాజ్యం(క్రీ.పూ. 500 ప్రాంతం) పర్షియన్లది. పర్షియన్లు కూడా ఆర్యులేనని పైన చెప్పుకున్నాం. వారిది జొరాష్ట్రియన్ మతం. భారత్ సరిహద్దులవరకు విస్తరించిన పర్షియన్ సామ్రాజ్యంలో మధ్యాసియా, పశ్చిమాసియాలు కూడా అంతర్భాగాలు. అంతటి మహాసామ్రాజ్య పాలకుల మతం నేడు భారత్ లోని కొద్దిమంది పార్శీలకు మాత్రమే పరిమితమవడం కాలవైచిత్రులలో ఒకటి. ఆనాడు పర్షియన్ ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడింది చిన్నదేశమైన గ్రీస్ ఒక్కటే. పర్షియన్లలానే గ్రీకులు కూడా ఆర్యులే. పర్షియన్ చక్రవర్తి డరియస్ ‘ది గ్రేట్’ 1200 యుద్ధనౌకలతో పర్షియాను ఒక సముద్రశక్తిగా మార్చాడు. అందుకు ఫొనీషియన్ల సహకారం తీసుకున్నాడు. 300 నౌకలు ఫొనీషియన్లు సమకూర్చినవే.

అంతటి బలవత్తరుడైన డరియస్ కూడా గ్రీసును లొంగదీసుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. హెరడోటస్ అనే చరిత్రకారుడు రాసిన ఆ వివరాలు ఎంతో ఆసక్తిగొలిపేవే కానీ ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేం. డరియస్ కొడుకు క్జెరెక్సెస్ ఎట్టకేలకు గ్రీసును జయించగలిగాడు. కానీ అది తాత్కాలిక విజయమే అయింది. చివరికి గ్రీకులే పర్షియన్ సామ్రాజ్యానికి చరమ గీతం పాడారు. అప్పటినుంచే అలెగ్జాండర్ ‘ది గ్రేట్’ చరిత్రలోకి వచ్చాడు.

సృష్టిలో రెండు విరుద్ధశక్తులు ఆధిపత్యం కోసం సంఘర్షిస్తూ ఉంటాయనీ, వాటిలో ఎటువైపు ఉండాలో మనుషులు నిర్ణయించుకోవాలనీ జొరాష్ట్రియన్ మతం చెబుతుంది. మొదటిది, మంచితోనూ, వెలుగుతోనూ నిండినదైతే; రెండోది, చెడుతోనూ, చీకటితోనూ నిండినది. అలాగే, ప్రతి కర్మకూ ఫలితం తప్పదన్న కర్మసిద్ధాంతాన్ని కూడా ఈ మతం చెబుతుంది. పర్షియన్లు మిత్రుని, అంటే సూర్యుని ఆరాధించేవారు. సూర్యుడు వెలుగుకు ప్రతీక.

రామాయణానికి వస్తే, రాముడు సూర్యవంశ క్షత్రియుడు.

పర్షియన్ల గురించి H.A. Davies అనే చరిత్రకారుడు (AN OUTLINE HISTORY OF THE WORLD) ఇంకా ఇలా అంటాడు: The Persians were, in many ways, a highly civilized people, and they had many admirable qualities, of which perhaps the most striking were their love of truth, their belief that it was disgraceful to fall into debt, and their courage.

రామాయణంలో, మొదటి సర్గ లోని రెండవ శ్లోకం (కో న్వస్మిన్ సాంప్రతం లొకే గుణవాన్ కశ్చ వీర్యవాన్/ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః) ప్రకారం రాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్కు, దృఢవ్రతుడు. గమనించండి…సూర్య సంబంధంతోపాటు; గుణగణాలలోనూ రాముడికీ, పర్షియన్లకూ మధ్య పోలికలు అచ్చుగుద్దినట్టు ఎలా ఉన్నాయో! ఇవి యాదృచ్ఛికం అనుకుంటారేమో, కాదు. పర్షియన్లకు, రామునికే కాక; రాజ్యస్థాపకులైన సారగాన్, హమ్మురాబీలకు కూడా ఇవే గుణగణాలనూ, సూర్యసంబంధాన్ని ఆపాదించారు. ప్రస్తుతం ఇందులోకి లోతుగా వెళ్లలేం.

untitled

ఇంతకంటే స్పష్టమైన ఇంకో పోలిక చూద్దాం. రాముడు రావణ సంహారం కోసం వానరసైన్యంతో కలసి లంకకు బయలుదేరితే, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఇద్దరికీ సముద్రం అడ్డు వచ్చింది. సముద్రంలో వారధి నిర్మించి లంకకు వెళ్లాలని రాముడు అనుకున్నాడు. వారధి నిర్మాణానికి సహకరించమని కోరుతూ మూడురోజుల పాటు సముద్రుని ప్రార్థించాడు. ఆ మూడు రోజులూ దర్భలు పరచుకుని సముద్రతీరంలోనే పడుకున్నాడు. అయినా సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. అప్పుడు రాముడికి ఆగ్రహం కలిగింది. భయంకరులైన దానవులతో నిండిన ఈ సముద్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాను అంటూ విల్లు అందుకుని ధనుష్టంకారం చేసి సముద్రునికి గురిపెట్టి బాణాలు ప్రయోగించాడు. అయినా సముద్రుడు లొంగలేదు. దాంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించదానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై వారధి నిర్మాణానికి దారి ఇచ్చాడు.

ఇక హెరడోటస్ నమోదు చేసిన చరిత్ర ప్రకారం, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి వెడుతూ సముద్రానికి అడ్డంగా వారధి నిర్మింపజేశాడు. దానికి మద్దతుగా కొన్ని నౌకలను ఉంచారు. అంతలో పెద్ద తుపాను సంభవించి ఆ నౌకలను చెదరగొట్టేసింది. దాంతో క్జెరెక్సెస్ కు సముద్రం మీద కోపమొచ్చింది. పర్షియన్ చక్రవర్తినైన తనను ఇలా అవమానించడానికి సముద్రానికి ఎంత ధైర్యం అనుకున్నాడు. సముద్రుని బంధించినట్టుగా కొన్ని సంకెళ్ళను సముద్రంలోకి వేయించి, దానికి మూడు వందల కొరడా దెబ్బలు తినిపించవలసిందిగా ఆదేశించాడు.

పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన యుద్ధాల చరిత్రలో మన హనుమంతుడి లాంటి పాత్ర కూడా ఒకటి ఉంది. అతని పేరు, ఫిలిప్పైడ్స్. గ్రీసు దేశస్థుడు. మారథాన్ అనే చోట పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన తొలి యుద్ధంలో అతనొక ముఖ్యపాత్ర పోషించాడు. ఒలింపిక్స్ తో పరిచయమున్నవారికి మారథాన్ అనే పేరు పరిచితమే. పరుగుపోటీకి అది పర్యాయపదమైంది. హనుమంతుడికి మారుతి అనే పేరు ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించగలవాడిగా హనుమంతుడు ప్రసిద్ధుడు. అతడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. సీతను చూసిన తర్వాత రావణుని కూడా చూసి, రాముని సందేశం అందించాడు.

ఇప్పుడు ఫిలిప్పైడ్స్ ఏం చేశాడో చూద్దాం. గ్రీసులో స్పార్టా, ఏథెన్స్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. స్పార్టాన్లు భూయుద్ధంలో నిపుణులు. ఏథేనియన్లు నౌకాయుద్ధంలో నిపుణులు. పర్షియన్ల దాడి గురించిన భోగట్టా అందడంతో సాయం కోరుతూ స్పార్టాన్లకు ఏథేనియన్లు కబురు పంపించారు. సమయం తక్కువగా ఉండడంతో అత్యంత వేగంగా వెళ్లగలిగినవాడు కావాలి. ఎక్కువ దూరం పరుగెత్తడంలో శిక్షణ పొందిన ఫిలిప్పైడ్స్ ను అందుకు నియోగించారు. అతను ఏథెన్స్ లో బయలుదేరాడు. స్పార్టా అక్కడికి 150 మైళ్ళ దూరం. పైగా దారి అంతా కొండలు, గుట్టలు, సెలయేళ్ల మయం. ఫిలిప్పైడ్స్ మరునాటికల్లా స్పార్టా చేరుకుని కబురు అందించాడు. సాయం అందించడానికి సిద్ధమే కానీ, పౌర్ణమి తర్వాత, అంటే ఆరురోజులకు కానీ తాము బయలుదేరలేమని వారు చెప్పారు. ఆ సమాచారం అందుకుని ఫిలిప్పైడ్స్ అంతే వేగంగా తిరుగు ప్రయాణం సాగించి ఏథెన్స్ చేరుకున్నాడు. దారిలో పార్థెనియాస్ అనే కొండ దగ్గర పాన్ అనే దేవుడు అతనికి కనిపించి మీకు విజయం కలుగుతుందని చెప్పాడట. ఆ తర్వాత ఫిలిప్పైడ్స్ మారథాన్ చేరుకుని యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ యుద్ధంలో ఏథేనియన్లు గెలిచారు. స్పార్టాన్లు ఆరు రోజుల తర్వాత బయలుదేరి వచ్చేసరికే యుద్ధం అయిపోయింది.

గెలుపు వార్తను కూడా ఫిలిప్పైడ్సే ఏథెన్స్ కు పరుగు పరుగున మోసుకెళ్ళాడు. ఏథెన్స్ చేరుతూనే తీవ్ర ఉద్వేగానికి లోనై చేతిలోని డాలు విసిరేసి, “మనం గెలిచాం” అంటూ ఆనందంతో ఒక్క గావుకేక పెట్టి, అప్పటికప్పుడు గుండె ఆగి కుప్పకూలి పోయాడు.

 

 

 

 

ప్రపంచ చరిత్రలో మనం!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి చెప్పాను… కానీ చాలా వ్యాసాలు గడిచాయి కనుక మరోసారి గుర్తుచేసుకోవలసివస్తోంది…
1986లో కాబోలు…నేను మొదటిసారి కోశాంబీని చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలు చెందానంటే కొన్ని రోజులపాటు భూమికి ఆమడ ఎత్తులో ఊరేగాను. అప్పుడు నా కళ్ళను కమ్మేసిన విస్మయపు మెరుపు ఇప్పటికీ అలాగే ఉందేమో కూడా. నాలోని పురాచరిత్రాసక్తికి ఇంధనం అందించిన ఆ పుస్తకం, Myth and Reality. పురాకాలాన్ని ఒక అద్భుతంగా నా ముందు ప్రదర్శించిన అంశాలు ఆ పుస్తకంలో చాలా ఉన్నాయి.

వాటిలో పణుల గురించి చెప్పినది ఒకటి.

ఋగ్వేదంలో పణుల ప్రస్తావనను ఉటంకిస్తూ కోశాంబీ ఇంకో మాట అన్నారు. అదేమిటంటే, పురాచరిత్రకు చెందిన ఫొనీషియన్లే పణులు కావచ్చునని! మనం ఒక మిత్ గానూ, విశ్వాసంగానూ చూడడానికి అలవాటుపడిన ఋగ్వేదాన్ని(అలాగే ఆయా సందర్భాలలో మహాభారతం లాంటి ఇతిహాస కథలను, పురాణ కథలను కూడా) ఆయన ఆ మాటద్వారా చరిత్ర వాకిట నిలబెడుతున్నారు. అదే నాలో ఉత్తేజానికి, విస్మయానికి కారణం.

ఆ తర్వాత రాంభట్ల ఆ పురాకాలపు అద్భుతత్వంలోకి నన్ను మరింతగా తీసుకెళ్లారు. కోశాంబీకి, రాంభట్లకూ ఒక పోలిక ఉంది. రాంభట్ల శైలి వ్యాకరణ సూత్రాలలా ఉంటే, కోశాంబీ శైలి గణితసూత్రాలలా ఉంటుంది. అన్నట్టు కోశాంబీ గణితశాస్త్రజ్ఞుడు కూడా. మనదేశానికి సంబంధించి కోశాంబీ, రాంభట్లా ప్రస్తావించిన అనేక పురాచారిత్రక వివరాల గురించీ; వ్యక్తులు, తెగలు, ప్రదేశాల పేర్లు వగైరాల గురించీ అదనపు సమాచారాన్ని సంపాదించడానికి నాకు చాలాకాలం పడుతూ వచ్చింది. అది ఇప్పటికీ పూర్తి కాలేదు. విచిత్రంగా, ఆ అదనపు సమాచారమూ; కోశాంబీ, రాంభట్ల నిర్ధారణలకు ధ్రువీకరణా పాశ్చాత్య పురాచరిత్రకారుల రచనల్లో కనిపిస్తూ వచ్చాయి. పురాకాలంలో ప్రపంచమంతా— కనీసం భారత్, మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ ల మేరకే చూసినా— ఒకే చరిత్రను పంచుకున్నాయనడానికి ఇది సాక్ష్యం.

ఇందులో ఒక తమాషా ఉంది. ఎంత ప్రపంచ చరిత్ర రాస్తున్నా భారతీయ చరిత్రకారుల రచనలు పాశ్చాత్య కేంద్రితం(centric) గానూ, పాశ్చాత్యచరిత్రకారుల రచనలు భారత్ కేంద్రితంగానూ ఉండవు. అంటే, తను పాశ్చాత్య చరిత్ర చెబుతున్నానన్న స్పృహ భారతీయ చరిత్రకారునిలోనూ, తను భారత్ చరిత్ర చెబుతున్నానన్న స్పృహ పాశ్చాత్య చరిత్రకారునిలోనూ నిర్దిష్టంగా ఉండదన్న మాట. పురాకాలానికి చెందిన ఒక ప్రాంతం, ఒక రాజ్యం, లేదా ఒక తెగ గురించి రాసేటప్పుడు అది అసలే ఉండదు. కానీ చాలాచోట్ల ఉభయుల రచనల్లోనూ ఉమ్మడి అంశాలు, పేర్లు దొర్లుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, రాంభట్ల అందించిన ఒక ఆసక్తికర సమాచారాన్నీ, పేర్లనూ పట్టుకుని పాశ్చాత్య చరిత్రకారుల రచనల్లో వాటి వివరాలు మరిన్ని సంపాదించడానికి నాకు పదిహేనేళ్లు పట్టింది. సరే, రాంభట్ల గారికి సోర్సు చెప్పే అలవాటు అంతగా లేకపోవడమూ ఒక కారణం. పై అనుభవం ఎంతో వివరంగానూ, ఉత్కంఠతో కూడిన ఒక కథలానూ చెప్పుకోవలసినది కనుక ఇప్పుడు నేను అందులోకి వెళ్లను.

ప్రస్తుతానికి వస్తే, ఋగ్వేదంలో పేర్కొన్న పణులు, పురాచరిత్ర కాలానికి చెందిన ఫొనీషియన్లే కావచ్చునన్న కోశాంబీ ఊహను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికిప్పుడు నాకు అందుబాటులో ఉన్న హెచ్.జి. వెల్స్ రచన A SHORT HISTORY OF THE WORLD ఆధారంగా ఫొనీషియన్ల గురించి చెప్పుకుందాం.
***
అంతకంటే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళక తప్పదు…

ఇప్పటి నుంచి 9వేల సంవత్సరాల వెనక్కి వెడితే, అంటే క్రీ.పూ. 7000 నాటికి దిగువ మెసపొటేమియా (నేటి ఇరాక్ ప్రాంతానికి ఇది పురాతన నామం. ఇక్కడి పురాతన జనం సుమేరియన్లు. వీరి పేరు మీద దీనిని సుమేరియా అని కూడా అన్నారు. రెండు నదుల మధ్య ఉంది కనుక ‘లంక’ అని కూడా అనచ్చు)లో యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల మధ్య సుమేరియన్లు నగరరాజ్యాలు స్థాపించుకున్నారు. దాదాపు ఇదే సమయంలో నైలు నదీ లోయలో ఈజిప్ట్ ప్రజలూ నగర రాజ్యాలను స్థాపించుకున్నారు. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే తొలి రాజ్యాలు.

నగరాలు వేటికి అవే స్వతంత్ర రాజ్యాలు. ప్రతి నగరానికీ ఒక దేవుడూ, పూజారీ ఉంటారు. పూజారే రాజుగా ఉంటాడు. ఒక నగరం ఇంకో నగరాన్ని ఆక్రమించుకోవచ్చు. ఆ నగర దేవుణ్ణి ఎత్తుకు పోయి తమ నగరంలో ప్రతిష్టించుకుంటే, ఆ నగరం వారి స్వాధీనంలోకి వచ్చేసినట్టే. ఓడిపోయిన నగరం గెలిచిన నగరానికి కప్పం చెల్లించుకుంటుంది. సుమేరియన్ల నగరం ‘నిప్పూరు’లో ఒక పురాతన శాసనం దొరికింది. ఆ శాసనంలో తొలి ‘సామ్రాజ్యం’ పేరు నమోదైంది. దాని పేరు ‘ఈరిచ్’. ఈ నగర దేవుడూ, రాజుగా ఉన్న పూజారీ పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్రసముద్రం వరకూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

‘నిప్పూరు’లో ‘ఊరు’ ఉంది చూడండి; అది మన తెలుగు ‘ఊరు’కు సమానార్థకమే. సమానార్థకమేమిటి, అది పదహారణాల తెలుగు మాటే కావచ్చు. అసలు మెసపొటేమియాలో ‘ఊరు’ అనే పేరుతోనే ఒక నగరం ఉండేది. మెసపొటేమియాకు చెందిన గిల్గమేశుని ఇతిహాసంలో(The Epic of Gilgamesh) గిల్గమేశుని నగరం పేరు ‘ఊరు’. ఇందులోని ఎంకిడు అనే పాత్రకు, మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుని కథకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ ‘ఎంకిడు’ అనే పేరు కూడా తెలుగు పేరులానే ధ్వనిస్తూ ఉండచ్చు. వీటి గురించి మరింత వివరంగా చెప్పుకునే అవకాశం ముందు ముందు వస్తుందేమో చూద్దాం. దానిని అలా ఉంచితే, ఆఫ్రికా ఊళ్ళ పేర్లలో కూడా ‘ఊరు’ ఉన్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నాం. రూట్స్ నవలలో కుంటా కింటే ఊరి పేరు జఫూరు.

పద్ధతిగా వ్యవసాయమూ, సేద్యపునీటి వ్యవస్థా, దేవాలయనిర్మాణమూ ప్రారంభమైంది కూడా మెసపొటేమియా, ఈజిప్టులలోనే. సామాజిక వ్యవస్థలు ఏర్పడిందీ అక్కడే. అంటే, ఈ ప్రాంతాల ప్రజలు కొంత మేరకైనా కడుపులో చల్ల కదలకుండా స్థిరజీవితానికి అలవాటుపడినవాళ్ళన్నమాట. స్థిరజీవితం ఉన్నచోటే నాగరికత పుడుతుంది. చరిత్రకు తెలిసినంతవరకు వీరే తొలి నాగరికులు. సుమేరులకు లిపి కూడా తెలుసు.

ఆ తర్వాతి కాలంలో, అంటే, క్రీ.పూ. 6000-3000 మధ్యలో టైగ్రిస్ నది ఎగువన అసీరియన్లు నగరాలను స్థాపించడం ప్రారంభించారు. అప్పుడే, ఆసియా మైనర్(నేటి టర్కీ చుట్టుపక్కల ప్రాంతం)లోనూ, మధ్యధరా సముద్ర తీరంలోనూ, దీవుల్లోనూ చిన్న చిన్న తెగలు నాగరికతవైపు అడుగులేస్తున్నాయి. ఇదే కాలంలో భారత్, చైనాలలో కూడా ఇదే విధమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. అంటే, ఇది మన దేశంలో సింధు నాగరికతకు చెందిన కాలం అన్న మాట.
ఇలా ఉండగా సుమేరు, ఈజిప్టు ప్రజల ప్రశాంత జీవన సరస్సును కల్లోల పరిచే ఒక పెద్ద పరిణామం త్వరలోనే జరిగింది— అది సంచార తెగల రూపంలో!
ఆ కాలంలో మూడు ముఖ్య ప్రాంతాలలో, మూడు ముఖ్య రకాలకు చెందిన సంచారజీవులు ఉండేవారు. మొదటి రకం, యూరప్ అడవుల్లో వేటాడుతూ, పశువులను కాచుకుంటూ జీవిస్తున్న నోర్డిక్ జాతివారు. క్రీ.పూ. 1500కు ముందు వీరు తొలి నాగరికులకు తెలియరు. రెండవ రకం, తూర్పు ఆసియాలో విశాల పచ్చిక మైదానాలలో జీవించే వివిధ మంగోల్ తెగలు, హున్నిస్ తెగలు. వీరు అప్పటికి గుర్రాలను మచ్చిక చేస్తున్నారు. వేసవి, శీతాకాల శిబిరాల మధ్య సంచారజీవితం గడుపుతున్నారు. హున్నిస్ తెగలకు, నోర్డిక్ తెగలకు మధ్య రష్యా చిత్తడి నేలలు, కాస్పియన్ సముద్రమూ అడ్డుగోడలుగా ఉన్నాయి. మూడవరకం, సిరియా, అరేబియా ఏడారుల్లో సంచారజీవితం గడుపుతున్న సెమిటిక్ తెగలు. వీరు గొర్రెలను, మేకలను, గాడిదలను కాచుకుంటున్నారు. వీరూ, పర్షియా దక్షిణ ప్రాంతంలో ఉన్న నల్లజనం ఈలమైట్లూ మొదటిసారిగా తొలి నాగరికుల(సుమేరియన్లు, ఈజిప్షియన్లు) సంపర్కంలోకి వచ్చారు. సెమెటిక్ తెగలవారు ఒకపక్క తొలి నాగరిక ప్రాంతాలపై దాడులు చేస్తూ, మరోపక్క వారితో వర్తక వ్యాపారాలు సాగించేవారు.

ఇక్కడ స్థిరజీవులకు, సంచారజీవులకు మధ్యనున్న తేడా గురించి హెచ్. జీ. వెల్స్ రాస్తారు.

స్థిరజీవనం సాగించే వ్యవసాయదారులకన్నా సంచారజీవులు దృఢంగా ఉంటారు. జనాభా పరిమితంగా ఉంటుంది. వీరికి శాశ్వత దేవాలయాలు కానీ, పటిష్టమైన పూజారివ్యవస్థ కానీ ఉండవు. అలాగని వీరిది అంతగా అభివృద్ధి చెందని జీవన విధానమని అనుకోనవసరం లేదు. వ్యవసాయదారులతో పోల్చితే, వీరిది అనేకవిధాలుగా సంపూర్ణజీవితం. ప్రతి వ్యక్తీ తన రక్షణ తను చూసుకోగలిగేలా ఉంటాడు. గుంపులో ఒకడుగా ఉండడు. వీరిలో నాయకుడికే ఎక్కువ ప్రాముఖ్యం, పూజారికి తక్కువ ప్రాముఖ్యం.

విస్తారమైన ప్రదేశాలను చూస్తారు కనుక సంచారజీవులకు విశాల జీవన దృక్పథం అలవడుతుంది. స్థిరజీవుల తీరు తెన్నుల్ని వారు ఆకళించుకుంటారు. అపరిచితులను చూడడానికి అలవాటుపడతారు. పచ్చికభూముల విషయంలో వారు ఇతర తెగలతో పోటీ పడవలసివస్తుంది. ఆ పోటీ సహజంగానే ఘర్షణలకు దారితీస్తుంది. కనుక అందుకు అవసరమైన వ్యూహాలను వారు రచించుకోవలసివస్తుంది. కనుమలు, కొండలు, గుట్టల మీదుగా ప్రయాణిస్తూ ఉంటారు కనుక, వ్యవసాయదారులకు కన్నా వారికి లోహాలతో ఎక్కువ పరిచయం ఏర్పడుతుంది. ఆవిధంగా వారు మంచి లోహశాస్త్రనిపుణులు(metallurgists) అవుతారు. కంచును కనిపెట్టినదీ, ఇనుమును కరిగించడం నేర్చిందీ కూడా సంచారజీవులే ననడానికి ఆధారాలున్నాయి. ముడి ఇనుమునుంచి ఇనుమును వేరు చేసి తయారు చేసిన తొలి పరికరాలలో కొన్ని, తొలి నాగరికతాప్రాంతాలకు చాలా దూరంగా, మధ్య యూరప్ లో దొరకడం ఇందుకొక సాక్ష్యం.

మరోవైపు, స్థిరజీవనులకు వస్త్రాలు నేయడం, కుండలు చేయడం, ఇతర నిత్యావసరవస్తువులను తయారుచేయడం తెలుసు. ఇలా సంచార, స్థిరజీవనుల మధ్య ఉన్న జీవన వైవిధ్యం ఒకవిధమైన ఇచ్చిపుచ్చుకునే సంబంధాలకూ దారి తీయడంలో విశేషం లేదు. అందులో ఒకవైపు దోచుకోవడం, ఇంకోవైపు వర్తక సంబంధాలను నెరపడం–రెండూ ఉంటాయి. ప్రత్యేకించి సుమేరియా గురించే చెప్పుకుంటే, దానికి ఒక పక్క ఎడారులున్నాయి. ఇంకో పక్క వివిధ ఋతువులు ప్రభావం చూపే ప్రాంతం ఉంది. సంచారజీవులు పంటభూములకు దగ్గరలో గుడారాలు వేసుకుని ఉండడం పరిపాటి కావచ్చు. వీరు వర్తకానికీ, దొంగతనానికీ కూడా పాల్పడుతూ ఇండచ్చు. నేటికీ జీప్సీలలో ఇది చూస్తూ ఉంటాం. (మన దగ్గర కూడా పల్లెటూళ్లలోనూ, పట్టణ, నగర శివార్లలోనూ ఖాళీ ప్రదేశాలలో గుడారాలు వేసుకునే సంచారజీవుల్ని ఇప్పటికీ చూస్తూ ఉంటాం). సంచారజీవులు తమ వెంట తెచ్చిన విలువై రాళ్ళ(నవరత్నాలు)నూ, లోహాలనూ, తోలునూ; వేటాడే జాతులవారైతే జంతుచర్మాలనూ ఇచ్చి, స్థిరజీవనులనుంచి కుండలు, పూసలు, గాజు, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకునేవారు.

ఇలా ఉండగా…

క్రీ.పూ. 2750 (జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ. 2350) నాటికి ఈ సెమెటిక్ తెగలలోంచి ఒక మహానాయకుడు అవతరించాడు. అతను చదువుసంధ్యలు లేని ఒక బర్బరుడు(బార్బేరియన్). అతను సుమేరియా మొత్తాన్ని జయించాడు. పర్షియా సింధుశాఖనుంచి మధ్యధరాసముద్రం వరకూ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నాడు. అతని పేరు సారగాన్. అతని ప్రజలు అక్కడియన్లు. సారగాన్ తన ప్రజలకు సుమేరు లిపిని నేర్పించి, సుమేరు భాషను అధికారభాషగా, విద్యావంతుల భాషగా అమలు చేశాడు. ఇతను, ఇతని వంశీకులు సుమేరు ప్రజలతో, వారి భాషా సంస్కృతులతో పాలు, నీళ్లలా కలసిపోయారు.

200 ఏళ్ళ తర్వాత అమొరైట్లు సుమేరియాను ఆక్రమించుకుని తొలి బాబిలోనియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీనిని హమ్మురాబీ(క్రీ. పూ. 2100… జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ.1728) మరింత పటిష్టం చేశాడు. ప్రపంచానికి తొలి శిక్షాస్మృతిని ఇచ్చిన రాజుగా ఇతన్ని చెబుతారు.

ఇతని కాలంలోనే సెమెటిక్కులు ఈజిప్టును ఆక్రమించుకుని షెపర్డ్ రాజుల పేరుతో పాలించారు. అయితే, వీరు ఈజిప్టు భాషాసంస్కృతులతోనూ, ప్రజలతోనూ మమేకం కాలేదు. క్రీ. పూ. 1600 లలో ఈజిప్టులో పెద్ద యెత్తున ప్రజోద్యమం తలెత్తి వీరిని పారదోలింది.

ఫొనీషియన్ల గురించి చెప్పుకునే ప్రయత్నంలో ఈ చరిత్ర అంతా తడమాల్సివచ్చింది. ఇంతకీ విషయమేమిటంటే, సారగాన్, హమ్మురాబీ, షెపర్డ్ రాజుల్లానే ఫొనీషియన్లు కూడా సెమెటిక్కులు. వీరు సముద్రయానం చేస్తూ నావికులుగా, వర్తకులుగా ప్రసిద్ధి చెందారు. వీరు తొలి నౌకావర్తకులలో ఒకరు. మొదట్లో పశ్చిమ ప్రాంతంలో, ఎక్కువగా స్పెయిన్ లో ఉండేవారు. హమ్మురాబి కాలం నాటికి వీరు మధ్యధరా సముద్రప్రాంతం అంతటా విస్తరించి వలసలు ఏర్పాటు చేశారు. మధ్యధరా తూర్పు తీరం వెంబడి వీరు నెలకొల్పిన రేవు పట్టణాలలో టైర్, సిడాన్ ముఖ్యమైనవి. ఆఫ్రికా ఉత్తరతీరంలో వీరు నిర్మించిన నగరం కార్తేజ్. ఒకప్పుడు పది లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం అది.

ఫొనీషియన్లు మధ్యధరా జలాలలో తిరిగిన తొలి నావికులలో ఒకరే కానీ, తొలి నావికులు కారు. వారికి ముందే మధ్యధరా సముద్రతీరంలోనూ, దీవుల్లోనూ కొన్ని పట్టణాలూ, నగరాలూ ఉండేవి. బాస్క్, బెర్బర్, ఈజిప్షియన్ తెగలతో రక్తసంబంధం, భాషా సంబంధం ఉన్న ఏజియన్ జాతి లేదా జాతులకు చెందినవి ఇవి. వీరినే గ్రీకులుగా పొరబడతారు కానీ, కాదు. గ్రీకులకు పూర్వులైన వీరి నగరాలు గ్రీస్, ఆసియా మైనర్, మైసీనియా, ట్రాయ్ లలో ఉన్నాయి. వీరికే చెందిన క్రీటు ద్వీపంలోని క్నోసోస్ అప్పటికి మంచి ఉచ్చ దశలో ఉంది. ఈ ఏజియన్లే చరిత్రకు తెలిసిన తొలి నావికులు.

మన సింధు నాగరికత లానే క్రీటు నాగరికత కూడా ఒక విస్మృతనాగరికత. 19 వ శతాబ్ది చివరిలో జరిపిన పురావస్తు తవ్వకాలలో క్రీటు నగరం క్నోసోస్ బయటపడింది. అప్పటినుంచే ఏజియన్ నాగరికతా వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలిసింది. క్రీ.పూ. 1400 నాటికి క్రీటు కూడా మన సింధు నాగరికత లానే హఠాత్తుగా అంతరించిపోయింది. తవ్వకాలలో బయటపడిన క్నోసోస్ శిథిలాలలో అగ్నిప్రమాదం, భూకంపం సంభవించిన ఆధారాలు కనిపించాయి. అవి రెండూ కబళించగా మిగిలిన దానిని గ్రీకులు దోచుకుని ఉంటారని ఊహ.

క్నోసోస్ నిజానికి ఒక నగరం కాదు, ఒక పెద్ద రాజప్రాసాదం మాత్రమే. క్రీటు పాలకుని పేరు మినోస్. ఈజిప్టు ఫారో లానే ఇది కూడా రాచరిక నామం. క్నోసోస్ కు మొదట్లో కోటగోడలు లాంటివి ఏవీ ఉండేవి కావు. రాజప్రాసాదంలో స్నానశాలల వంటి వసతులన్నీ ఉండేవి. క్రీటులో స్త్రీపురుషుల మధ్య పూర్తి సమానత్వం ఉండేది. నాటి క్రీటు స్త్రీలు ధరించిన దుస్తులు నేటి కాలపు దుస్తుల్ని తలపించేలా ఉంటాయి. క్రీటు ప్రజలు ఒక నిరంతర ఉత్సవ వాతావరణంలో ఉల్లాసంగా జీవించినవారుగా కనిపిస్తారు. స్త్రీపురుషుల జిమ్నాస్టిక్సే కాదు, యెడ్ల యుద్ధాలు(bull fights) కూడా క్రీటులో ఉండేవి. ఇప్పటికీ స్పెయిన్ యెడ్ల యుద్ధాలకు ప్రసిద్ధమే.
01bulfight.xlarge1

విశేషమేమిటంటే, ఇప్పటి బుల్ ఫైటర్లు ధరించే దుస్తులకు, అప్పటి క్రీటు బుల్ ఫైటర్లు ధరించిన దుస్తులకు పోలిక ఉండడం!

క్రీటు వాసులు ఎంతో అందమైన కళాత్మకమైన జీవితం గడిపేవారనడానికి వారి దుస్తుల తీరేకాక, తవ్వకాలలో బయటపడిన మృణ్మయపాత్రలు, శిల్పాలు, చిత్రాలు, నగలు, దంతపు వస్తువులే సాక్ష్యం. వారికి లిపి కూడా ఉండేది. గృహ బానిసలు, పారిశ్రామిక బానిసలు ఉండేవారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, డేడలస్ అనే ఒక క్రీటు వాసి విమానం లాంటి ఒక ఎగిరే వాహనాన్ని తయారు చేశాడనీ, అది సముద్రంలో కూలిపోయిందనే వివరం, అనంతర కాలంలో క్రీటును ఆక్రమించుకున్న గ్రీకుల పురాగాథలలోకి ఎక్కింది. మన రామాయణంలో చెప్పిన పుష్పక విమానానికి మూలం ఇదేనేమో తెలియదు. క్రీటులకు ఉల్కాపాతం ద్వారా లభించిన ఇనుము మాత్రమే తెలుసు. గాడిదలే తప్ప గుర్రం తెలియదు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, గ్రీకుల ఆక్రమణ కంటే ముందే క్రీటు దీవి పక్కన తిష్ట వేసిన సెమెటిక్ సంచారజీవులైన ఫొనీషియన్లు క్రీటుపై దాడులు చేస్తూ ఉండేవారు. మరోవైపు ఉత్తర దిశనుంచి గ్రీకు నావికులు దాడులు చేస్తూ ఉండేవారు. ఈ దాడుల ఫలితంగానే క్రీటు రాజప్రాసాదం చుట్టూ కోటగోడలు లేచాయి. ఆ రోజుల్లో నావికులు వర్తకవ్యాపారాలే కాక, దోపిడీలు చేస్తుండేవారని పైన చెప్పుకున్నాం.

ఫొనీషియన్లు క్రీటు వాసుల తర్వాతే చరిత్ర తెర మీదికి వచ్చి ఉండచ్చు కానీ, వారిని కూడా క్రీటులానూ, మరికొన్ని పురా నాగరికతల్లానూ పాత ప్రపంచానికి పరిమితం చేస్తూ కాలగర్భంలోకి నెట్టి వేసే ఒక కొత్త కెరటం త్వరలోనే మరింతగా ఉధృతంగా విరుచుకు పడింది. పైన చెప్పుకున్న గ్రీకులు ఆ కెరటంలో ఒక భాగమే. అది తొలి నాగరిక ప్రపంచాన్ని అంతం చేసి సరికొత్త ప్రపంచానికి జన్మ నిచ్చింది. ఆ కెరటం పేరు, ఆర్యులు!

ఈ మధ్యలో, ఇప్పుడు యూదులుగా మనకు బాగా తెలిసిన హిబ్రూలకు, ఫొనీషియన్లకు మధ్య ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు ఏర్పడి, ఫొనీషియన్ల సముద్రవర్తకం మరింత విస్తరించింది. అందులోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. క్రీటుతో సహా పైన చెప్పినదంతా(మధ్యలో మన గురించిన ఒకటి రెండు ప్రస్తావనలు తీసేస్తే) పాశ్చాత్యచరిత్రకారుని వెర్షన్ మాత్రమే. ఇందులో మన దేశం తాలూకు లింకులను గుర్తించాలంటే రాంభట్ల, కోశాంబీల వెర్షన్లు చూడాల్సి ఉంటుంది. ఇలా అనడమైతే తేలిగ్గా అన్నాను కానీ, పూర్తి స్థాయిలో అది ఇప్పట్లో సాధ్యమని చెప్పలేను.

దేవతల కుక్క

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

మళ్ళీ కథలోకి వెడదాం…

ఉపయాజుడు సహాయకుడిగా ద్రుపద దంపతుల చేత యాజుడు పుత్రకామేష్టి చేయించాడని చెప్పుకున్నాం. అప్పుడు మంత్ర, ఆహుతులతో తృప్తుడైన అగ్ని వల్ల ఒక పుత్రుడు పుట్టాడు. అతని దేహం అగ్నిజ్వాలలా ఉంది. ఒక చేతిలో కత్తి,                                 ఇంకో చేతిలో విల్లు ధరించాడు. నెత్తి మీద కిరీటం ఉంది. రథాన్ని అధిరోహించి ఉన్నాడు.

ఆ తర్వాత యజ్ఞకుండం లోంచి ఒక అమ్మాయి పుట్టింది. ఆమె దేహం నల్ల కలువలా, కోమలంగా, ఎలాంటి వంక లేకుండా, కలువ గంధంతో ఉంది. ఆమె కళ్ళు కలువపత్రాలలా ఉన్నాయి. ఆమె దివ్యతేజస్సుతోనూ, ప్రసన్నంగానూ, సంతోషంగానూ ఉంది.

కొడుకుకి ధృష్టద్యుమ్నుడనీ, కూతురికి కృష్ణ అనీ ఆకాశవాణే నామకరణం చేసింది. ఈ విధంగా కొడుకును, కూతురిని పొందినందుకు సంతోషించిన ద్రుపదుడు యాజునికి దక్షణలిచ్చి, బ్రాహ్మణులను పూజించాడు. ఆ తర్వాత ధృష్టద్యుమ్నునికి ధనుర్వేదం నేర్పించాడు. కృష్ణకు యుక్తవయసు రాగా వివాహప్రయత్నం ప్రారంభించాడు.

ధృష్టద్యుమ్న, ద్రౌపదుల (ద్రుపదుడి కూతురు కనుక కృష్ణ ద్రౌపది అయింది) పుట్టుక గురించి ఆదిపర్వం, సప్తమాశ్వాసంలో నన్నయ కథనం ఇంత మేరకే ఉంది. కానీ సంస్కృత భారతంలో ఆసక్తికరమైన అదనపు సమాచారం ఉంది. అందులోకి వెళ్ళే ముందు నన్నయ కథనం విడిచిపెట్టిన కొన్ని సందేహాల జాగాలను చూద్దాం.

***

మొదటిది, తన అన్న యాజునితో పుత్రకామేష్టి జరిపించుకోమని ద్రుపదునికి సలహా ఇవ్వడానికి ఉపయాజుడు ఏకంగా ఏడాది సమయం ఎందుకు తీసుకున్నట్టు? ఈ ఏడాదిలో ఏం జరిగి ఉంటుంది? ద్రుపదుని కోరికకు తగిన అబ్బాయిని, అమ్మాయిని వెతకడానికి అంత సమయం పట్టిందనుకోవాలా? వారిద్దరినీ ద్రుపదుడు దత్తు తీసుకున్నాడనీ, పుత్రకామేష్టి అన్నది దత్తత స్వీకార ప్రక్రియను సూచిస్తోందనుకుంటే ఆ ఏడాది వ్యవధి అర్థవంతంగానే కనిపిస్తుంది.

ఇంతకన్నా ఎక్కువ అనుమానాన్నే కాక, ఆశ్చర్యాన్ని కూడా రేకెత్తిస్తున్నవి; ఉపయాజుడు తన అన్న గురించి అన్న మాటలు. నాకు సంపద మీద కోరిక లేకపోయినా మా అన్నకు ఉందని అతను చెబుతున్నాడు. పైగా, సంపద కోరుకునేవాడు అది మంచిదా, చెడ్డదా అన్నది పట్టించుకోడనీ, తన అన్న అలాంటివాడే ననీ- ఒక పండు ఉదాహరణద్వారా ఉపయాజుడు చెబుతున్నాడు. ఆపైన యాజుడు కుటుంబభారాన్ని మోస్తున్నాడని కథకుడే ఆ తర్వాత అంటున్నాడు. (కుటుంబ పోషణకోసం) తన అన్న ఎలాంటి అపవిత్రధనానికైనా ఆశపడతాడని ఉపయాజుడు అనడంలో ద్రుపదుని ధనం అలాంటిదే నన్న సూచన స్పష్టంగా ఉంది. ఈ సందర్భంలో, అంటే ధృష్టద్యుమ్న, ద్రౌపదుల పుట్టుక సందర్భంలో, ద్రుపదుని ధనం ఎందుకు దోషభూయిష్ఠం అయినట్టు? ఈ ప్రశ్నకు ఇతరత్రా నమ్మశక్యమైన సమాధానం దొరకనప్పుడు అంతిమంగా, అనివార్యంగా కలిగే అతిపెద్ద అనుమానం; ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదైనా ‘గూడుపుఠాణీ’ ఉందా అన్నదే!

గూడుపుఠాణీ ఉందనే ఉనుకుంటే, అన్న కంటే ఎక్కువ తపశ్శాలి అన్న కీర్తి తనకు ఉంది కనుక, అందులో తను భాగస్వామి కావడానికి ఉపయాజుడు నిరాకరించి అన్న పేరు సూచించడం అర్థవంతంగానే ఉంటుంది. అన్నకు కుటుంబభారం ఉండడం ఒక వెసులుబాటు. కుటుంబపోషణకోసం అన్నప్పుడు మంచి ధనం, చెడ్డ ధనం అన్న విచక్షణలో కొంత మినహాయింపు ఉంటుంది. అయితే, స్వయంగా పుత్రకామేష్టి చేయించడానికి నిరాకరించిన ఉపయాజుడు అన్నకు సహాయంగా ఎందుకు వెళ్లాడన్న ప్రశ్న వస్తుంది. తనే ద్రుపదునితో క్రతువు చేయిస్తే ఉపయాజుడు అందులో ప్రత్యక్షభాగస్వామి అవుతాడు. అన్నకు సహాయకుడిగా పాల్గొంటే పరోక్షభాగస్వామి మాత్రమే అవుతాడు. తీవ్రతలో రెండింటి మధ్యా సహజంగానే తేడా ఉంటుంది. దానికి తోడు సోదరధర్మం అనే అదనపు కవచం ఉపయాజునికి ఉంది.

‘గూడుపుఠాణీ’ అనకపోతే, ఇప్పుడు అంతకంటే ఒకింత ఎక్కువ మర్యాదగా ధ్వనించే ‘రాజకీయం’ అనుకున్నా అనుకోవచ్చు. ద్రోణుడి మీద పగ తీర్చుకోడానికి సమర్థుడైన కొడుకునూ, అర్జునుని వరించగల కూతురునూ కనాలనే ద్రుపదుని నిర్ణయం, రాజకీయ నిర్ణయం! ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ద్రుపదుడు చేసిన పని, ప్రతిరోజూ బ్రాహ్మణుల నివాసాలకు వెడుతూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం! ఈ సందర్భంలో ద్రుపదునికి బ్రాహ్మణులతో రెండు రకాల అవసరం ఉంది. మొదటిది సరే, ప్రతీకారం తీర్చుకోవడం కూడా ఒక ‘యజ్ఞ’మే కనుక దానిని జరిపించవలసింది బ్రాహ్మణులే. గణసమాజంలో లేదా పురాతన సమాజంలో మతకర్మ, లౌకిక కర్మ అంటూ విడి విడిగా లేవనీ; ప్రతిదీ మతకర్మే ననీ ఇంతకుముందు చెప్పుకున్నాం.

రెండోది, ద్రుపదుని పగకు లక్ష్యమైన ద్రోణుడు బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణులను మంచి చేసుకుని వారి మద్దతును కూడగట్టుకోవడం ద్రుపదునికి ఒక రాజకీయ అవసరం.

ఇక్కడ ద్రుపదుడికి సర్పయాగఘట్టంలోని జనమేజయునితో పోలిక అచ్చుగుద్దినట్టు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది. జనమేజయుడు అర్జునుని మునిమనవడు, అభిమన్యుని మనవడు. అతని తండ్రి పరీక్షిత్తును నాగప్రముఖులలో ఒకడైన తక్షకుడు చంపుతాడు. అందుకు తక్షకుని మీదే కాక నాగులందరి మీదా జనమేజయుడు పగబడతాడు. దీని పూర్వాపరాల గురించి నా సర్పయాగవ్యాసాలలో వివరంగా రాశాను కనుక ఇప్పుడు వాటిలోకి పూర్తిగా వెళ్ళకుండా ప్రస్తుత సందర్భానికి అవసరమైన ఒకటి, రెండు అంశాలకు పరిమితమవుతాను.

మొదట దీర్ఘసత్రయాగం చేసిన తర్వాత జనమేజయుడు సర్పయాగానికి పూనుకుంటాడు. అంతకంటే ముందు అతడు చేసిన మొదటి పని-పురోహితుని కోసం అన్వేషణ. ద్రోణునిపై పగ తీర్చుకునే ప్రయత్నంలో ద్రుపదుడు చేసింది కూడా అదే. బ్రాహ్మణులను మంచి చేసుకుంటూ తనతో పుత్రకామేష్టి చేయించగల యాజ్ఞికుని అన్వేషణలో పడతాడు. జనమేజయుని విషయానికి వస్తే, అప్పుడప్పుడే అంత పెద్ద సత్రయాగం (సత్రయాగం పన్నెండేళ్ళపాటు జరిగే యాగం) చేసినవాడు అంతలోనే పురోహితుని వెతుకులాటలో పడడమేమి టనిపిస్తుంది. అందులోనే ఉంది అసలు మర్మం. అతనికి కావలసింది ఎవరో ఒక పురోహితుడు కాదు, నాగులతో సంబంధం ఉన్న పురోహితుడు! ఎందుకంటే తను నాగసంహారానికి బయలుదేరుతున్నాడు. తన రాజ్యంలోని బ్రాహ్మణులలో అనేకమంది అప్పటికే నాగులతో బంధుత్వాలు కల్పించుకున్నారు. కనుక నాగుల వధలో వారి మద్దతు అతనికి కీలకం అవుతుంది.

పురోహితుని అన్వేషణలో జనమేజయుడు అనేక మున్యాశ్రమాలను సందర్శిస్తాడు. అలాగే శ్రుతశ్రవుడు అనే మునిని కలసుకుని, అతని కుమారుడు సోమశ్రవసుని తనకు పురోహితునిగా ఇమ్మని అడుగుతాడు. కొన్ని షరతులమీద ఇవ్వడానికి శ్రుతశ్రవుడు ఒప్పుకుంటాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితుని చేసుకుని నాగులపై ప్రతీకార చర్యకు పూనుకుంటాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, సోమశ్రవసుని తల్లి నాగజాతిస్త్రీ. ఆ విధంగా అతనికి నాగులతో సంబంధం. నాగసంబంధీకుడు పురోహితుడుగా ఉండగా తను నాగులను ఊచకోత కోస్తే తన రాజ్యంలోని నాగసంబంధీకులలో తన చర్యపట్ల ఆగ్రహం కొంతైనా పలచనవుతుంది. కొంత మేరకైనా తన చర్యకు నైతిక ఆమోదం లభిస్తుంది. ఇదీ పురోహితుని ఎంపికలో జనమేజయుడు పాటించిన రాజకీయపు మెళకువ.

నేటి ప్రజాస్వామిక రాజకీయాలలో కూడా ఇలాంటి మెళకువలను పాటించడం మనం చూస్తుంటాం. ఉదాహరణకు, ఒక ప్రభుత్వమో పార్టీయో తమపట్ల వివక్షతోనో, వ్యతిరేకతతోనో వ్యవహరిస్తోందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర వర్గాల వారు, లేదా ఆయా కులాల వారు ఆరోపించినప్పుడు; ఆ ఆరోపణను ఖండించడానికి ఆ వర్గాలవారినీ, కులాలవారినే బరిలోకి దింపుతుంటారు. ద్రుపదుడు, జనమేజయుడు పాటించినది సరిగ్గా ఇలాంటి రాజనీతినే.

Snakesacrifice

***

నన్నయ అనువాదం మీద నాకు అతి పెద్ద ఫిర్యాదు ఏమిటంటే, సంస్కృత భారతంలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలను ఆయన తన అనువాదంలోకి తీసుకురాకపోవడం. ఆయన ఏ ఉద్దేశంతో వాటిని పరిహరించాడో తెలియదు. ఏ ఉద్దేశంతో పరిహరించినా సంస్కృతభారతానికి ఉన్న పురాచారిత్రకతా లక్షణం తెలుగు భారతంలో చాలాచోట్ల లోపించింది. ఉదాహరణకు, జనమేజయుడు ఎవరో ఒక పురోహితుడి కోసం కాక, నాగజాతితో సంబంధం ఉన్న పురోహితుని కోసం అన్వేషణలో పడ్డాడన్న వివరం సంస్కృత భారతంలో ఉంది తప్ప తెలుగు భారతంలో లేదు. దాంతో కొందరు బ్రాహ్మణులకు నాగజాతీయులతో సంబంధం ఏర్పడిందన్న పురాచారిత్రక సమాచారం, జనమేజయుని చర్యలోని రాజకీయకోణం ఆ మేరకు మరుగున పడ్డాయి. అలాగని తెలుగు భారతం వాటిని పూర్తిగా మరుగుపరచిందా అంటే అదీ జరగలేదు. వాటిని ఎత్తి చూపే సాక్ష్యాలు తెలుగు భారతంలోనూ, అదే ఘట్టంలో వేరే చోట్ల కనిపిస్తూనే ఉంటాయి.

ఇలాగే, ద్రుపదునితో జరిపించిన పుత్రకామేష్టి గురించి కూడా సంస్కృత భారతంలో ఉన్న అదనపు సమాచారాన్ని, చిత్రణను నన్నయ పరిహరించాడు.

అదలా ఉంచితే, ద్రుపద, జనమేజయులు ఇద్దరి ఉదంతాలనూ కూడా ఇంతకు ముందు చెప్పుకున్న జార్జి థాంప్సన్ పరిశీలనల వెలుగులో చర్చించవలసిన అవసరం ఉంది. అంతేకాదు, జనమేజయుని సందర్భంలో కోశాంబీని కూడా ఉటంకించుకోవలసిన అవసరం ఉంది.

సర్పయాగానికి ముందు జనమేజయుడు కురుక్షేత్రంలో సత్రయాగం జరుపుతుండగా ఒకరోజున సరమ అనే దేవశుని(దేవతల కుక్క) కొడుకు సారమేయుడు అనేవాడు ఆ యాగప్రదేశానికి ఆడుకోడానికి వెడతాడు. అప్పుడు జనమేజయుని తమ్ముళ్ళు ముగ్గురు-శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు-అనేవారు సారమేయుని కొడతారు. సారమేయుడు ఏడుస్తూ వెళ్ళి ఆ సంగతి తల్లి సరమకు చెబుతాడు. సరమ కోపంతో జనమేజయుని దగ్గరకు వెళ్ళి, ‘నీ తమ్ముళ్ళు ఏమాత్రం కనికరం, వివేకం లేకుండా నిరపరాధుడైన నా కొడుకును కొట్టారు. మంచి, చెడు ఆలోచించకుండా సాధుజీవులకు హాని చేసేవారికి అనుకోని ఆపదలు వస్తాయి’ అని హెచ్చరించి వెళ్లిపోయింది.

సరమ మాటలకు జనమేజయుడు ఆశ్చర్యపోయాడు. యాగం పూర్తి చేసిన తర్వాత హస్తినాపురానికి వెళ్ళి సరమ హెచ్చరికకు ప్రతిక్రియగా శాంతి, పౌష్టిక విధులు నిర్వహించడానికి పురోహితుని అన్వేషణలో పడతాడు. ఆ తర్వాతి ఘట్టాలు అన్నీ అతని సర్పయాగానికి పూర్వరంగాన్ని కల్పించడానికి ఉద్దేశించినవి. నన్నయ భారతం చెబుతున్నది ఇంతవరకే. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో కొన్ని లింకులు తెగిపోయి స్పష్టత లోపించిన సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు భారతంలో తెగిపోయిన లింకులు’ అనే శీర్షికతో దీనిని నేను నా సర్పయాగవ్యాసాలలో చర్చించాను.

ఇందుకు భిన్నంగా సంస్కృత భారతంలో స్పష్టత కనిపిస్తుంది. ప్రధానంగా సంస్కృత భారతాన్ని ఆధారం చేసుకున్న పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘మహాభారత చరిత్రము’ ప్రకారం, జనమేజయుడు సత్రయాగం పూర్తి కాగానే తక్షకుని నివాసమైన తక్షశిల(నేటి పాకిస్తాన్ లో ఉన్న తక్షశిల ఒకప్పటి విద్యాకేంద్రం)పై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకుంటాడు. యుద్ధానికి ముందు యాగం జరిగింది చూడండి…ఇంతకుముందు చెప్పుకున్నట్టు, వాస్తవికంగా జరగబోయే యుద్ధంలో విజయాన్ని భ్రాంతిపూర్వకంగా ముందే సాధించడానికి ఈ యాగం. అయితే తక్షకుని, మరికొందరు ముఖ్యనాగులను అతను చంపలేదు. బహుశా వాళ్ళు తప్పించుకుని ఉంటారు. ఆ తర్వాత తన సహాధ్యాయి ఉదంకునితో ప్రోద్బలంతో తక్షకుని, ఇతర నాగులను చంపి శత్రుశేషం లేకుండా చేయడానికి సర్పయాగం తలపెడతాడు. అయితే బ్రాహ్మణులలోని నాగసంబంధీకుల మధ్యవర్తిత్వంతో అది మధ్యలో ఆగిపోతుంది.

తెలుగు భారతంలోనే కాక సంస్కృత భారతంలో కూడా ఒక విషయంలో స్పష్టత లోపించింది. అది సరమ హెచ్చరికకు సంబంధించినది. నీ తమ్ముళ్ళు నా కొడుకును అన్యాయంగా కొట్టారు కనుక నీకు అనుకోని ఆపదలు సంభవిస్తాయని జనమేజయుని సరమ హెచ్చరించినా, నిజానికి ఆ తర్వాత ఆపద సంభవించింది జనమేజయునికి కాదు; తక్షకునికీ, ఇతర నాగులకూ! కనుక సరమ మాటలు కథకు అన్వయించడం లేదు. అయితే, కోశాంబీ(The Culture & Civilization of Ancient India in Historical Outline) వివరణనుంచి చూసినప్పుడు కొంత అన్వయానికి వీలు కలుగుతుంది. ఎలాగంటే…

శత్రువులనుంచి కప్పం గుంజుకోడానికి ముందు దూతను పంపించి వారిని భయపెట్టడం ఆర్యులు అనుసరిస్తూ వచ్చిన ఒక పద్ధతి. సరమ దౌత్యం దానినే సూచిస్తుంది.

మహాభారతంలో కంటే ముందు సరమదౌత్యం ఋగ్వేదంలో కనిపిస్తుంది. అది చాలా ప్రసిద్ధం కూడా. ఇంద్రుడు దూతగా పంపిన సరమ అనే శునక దేవతకు, పణులకు మధ్య జరిగిన సంభాషణ రూపంలో అది ఉంటుంది. ఇంద్రుడికి పశువులను కప్పంగా చెల్లించమని సరమ అడుగుతుంది. పణులు అందుకు తిరస్కరిస్తారు. అప్పుడు, మీకు ఆపదలు సంభవిస్తాయని సరమ వారిని హెచ్చరిస్తుంది. తదనంతర పరిణామం, ఇంద్రుడు వాళ్లమీద దాడి చేయడం.

దీనికి వ్యాఖ్యాతల వివరణ మరో విధంగా ఉంటుంది. దాని ప్రకారం, పణులు ఇంద్రుడి పశువులను దొంగిలించారు. వాటిని తిరిగి తనకు అప్పగించమనీ, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ సరమను పంపి ఇంద్రుడు వారిని హెచ్చరించాడు. వాస్తవంగా సరమ-పణుల సంభాషణ రూపంలోని ఆ మంత్రంలో పణుల దొంగతనం గురించి లేదు. కనుక అది వ్యాఖ్యాతల కల్పన కావచ్చు.

దానిని అలా ఉంచితే, మన ప్రస్తుత సందర్భానికి అవసరమైన ఒక ముఖ్యమైన వివరాన్ని ఇక్కడ కోశాంబీ అందిస్తున్నారు. ఋగ్వేదంలోని ఈ సరమ-పణుల సంభాషణ, నిజంగా జరిగిన ఒక చారిత్రక ఘటనను తంతు రూపంలో స్మరించుకుంటోంది. అంటే, ఒక సందర్భంలో అలా దూతను పంపి శత్రువును కప్పం అడగడం, ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం, శత్రువు తిరస్కరించడంతో దాడి చేయడం, ఆ దాడిలో విజయం సాధించడం జరిగి ఉంటాయి. ఆవిధంగా ఈ దౌత్యప్రక్రియ ఒక ఆనవాయితీగా, లేదా మతకర్మగా మారిపోయింది. పురాసమాజంలో లౌకిక కర్మకు, మతకర్మకు తేడా లేదన్న సంగతిని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఒక మంచి ఫలితం ఇచ్చిన ఏ కర్మ అయినా మతకర్మగా మారిపోతుంది. అది మతపరమైన తంతులో భాగమవుతుంది. అందుకే సరమ-పణుల సంభాషణ ఋగ్వేద మంత్రంగా మారిపోయింది.

ఇక్కడ ఇంకొక ముఖ్య విశేషమేమిటంటే, ఈ సరమ-పణుల సంభాషణ రూపంలోని మంత్రం ఉచ్చరించడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు, అందులో అభినయం కూడా ఉంటుంది (“The exchange of words was not merely chanted, but obviously meant to be acted out, therefore the ceremonial commemoration of some historical event” అని కోశాంబీ వివరణ). అంటే, యుద్ధానికి ముందు విజయాన్ని అపేక్షిస్తూ చేసే యాగంలో ఈ సరమ-పణుల సంభాషణ ఒక తంతు రూపంలో మంత్రపూర్వకంగానూ, అభినయపూర్వకంగానూ భాగమవుతుందన్న మాట. జనమేజయుడు తక్షశిల పై దాడికి ముందు చేసిన సత్రయాగ సందర్భంలోనే అతనితో సరమ సంభాషణ జరగడం గమనార్హం.

పైన చెప్పుకున్నట్టు, ‘నీకు అనుకోని ఆపదలు వస్తా’యని సరమ జనమేజయుని హెచ్చరించినా, వాస్తవానికి ఆపద సంభవించింది తక్షకునికీ, ఇతర నాగులకూ కనుక, సరమ మాటలు కథకు అన్వయించని మాట నిజమే. అయితే, ఒక తంతులో భాగమైన ఆనవాయితీగా దానిని చూసినప్పుడు అన్వయం కుదురుతుంది.

ఒకానొక చారిత్రక ఘటన అనంతరకాలంలో మంత్రరూపంలోకి, అభినయరూపంలోకి మారి తంతులో ఎలా భాగమవుతుందో చెప్పడానికి కోశాంబీ ఇంకో ఉదాహరణ ఇస్తారు. అది, ‘సీమోల్లంఘన’. పూర్వం ఆశ్వయుజమాసంలో, అంటే శరత్కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేవారు. ఆ రోజుల్లోనే విజయదశమి పండుగ వస్తుంది. ఆ పండుగ పేరులోనే యుద్ధ సూచన ఉంది. ఈ సందర్భంలో ఆయుధాలను పూజిస్తారు. యుద్ధానికి వెళ్ళేముందు రాజులు ఒక తంతు రూపంలో సీమోల్లంఘన జరుపుతారు. అంటే తమ రాజ్యం సరిహద్దులను దాటతారు. అది యుద్ధానికి వెడుతున్నట్టు అభినయపూర్వకంగా సంకేతించడం. మహారాష్ట్ర మొదలైన చోట్ల ఇప్పటికీ దసరా సందర్భంలో సీమోల్లంఘనను అభినయిస్తారు. శమీపత్రాలను(జమ్మి ఆకులను) ఒకరికొకరు ఇచ్చుకోవడమూ ఉంది. పూర్వం శూలం, గద, విల్లు మొదలైన ఆయుధాలను జమ్మి కొయ్యతోనే తయారు చేసేవారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లబోయేముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదే దాచుకున్నారు…

సరే, దీనిపై మరిన్ని వివరాలలోకి ఇప్పుడు వెళ్లలేం కనుక, విషయానికి వద్దాం. సంస్కృత భారతంలో జనమేజయుని సర్పయాగ ఘట్టం, సరమ దౌత్యఘట్టం లానే నాటకీయంగానూ, అభినయంతోనూ ఉంటుంది. నన్నయ అనువాదంలో ఈ రెండూ లోపించాయి. అలాగే, సంస్కృత భారతంలో ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ ఘట్టం కూడా అంతే నాటకీయంగానూ, అభినయంతోనూ ఉంటుంది. మళ్ళీ నన్నయ అనువాదంలో ఇవి లోపించాయి. వాటి గురించి చెప్పుకునే ముందు, విషయాంతరంలా కనిపించినా ఒక ఆసక్తికరమైన చరిత్రను పాఠకులతో పంచుకోవాలనిపిస్తోంది. అది, పైన సరమ ఉదంతంలో చెప్పుకున్న ‘పణు’ల గురించి.

అది వచ్చే వారం…

 

 

యజ్ఞమూ…మాంత్రిక వాస్తవికతా…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

యాజుడు ద్రుపద దంపతుల చేత పుత్రకామేష్టి చేయించాడని అన్నప్పుడు…

నా కిక్కడ జార్జి థాంప్సన్ ను తీసుకు రావలసిన అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది. నిజానికి ఆయన్ను తీసుకురావడం ఇంత అలవోకగా జరగాల్సింది కాదు. కానీ ఆయనను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలంటే అందుకు చాలా వ్యాసాలు తీసుకుంటాయి. అదే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అలాగని పూర్తిగా వాయిదా వేసే అవకాశమూ కనిపించడం లేదు. కనుక థాంప్సన్ అనే సముద్రంలోకి దూకడం అనివార్యమవుతోంది. త్వరగానే పైకి తేలడానికి ప్రయత్నిస్తాను.

నేను చాలా ఏళ్ల క్రితం మాంత్రిక వాస్తవికత (Magical Realism) మీద థాంప్సన్ రాసిన ఒక చిన్న పుస్తకం చదివాను. ఎంత థ్రిల్లయ్యానో చెప్పలేను. నృత్యం, కవిత్వం, సంగీతం, నాటకం మొదట ఒకటిగా ఎలా ఉండేవో, క్రమంగా ఎలా విడిపోయాయో అందులో ఆయన రాశారు. నేను థ్రిల్ అవడానికి అదొక కారణమైతే, మన సంస్కృత, దేశీయ నాటకాలు, ఇతర దృశ్య రూపాలు, జానపద కళల పరిణామ క్రమానికి కూడా ఆయన పరిశీలన యథాతథంగా అన్వయించేలా ఉండడం అంతకంటే పెద్ద కారణం. థాంప్సన్ తనకు బాగా తెలిసిన గ్రీకు, ఇతర యూరోపియన్ సంప్రదాయాల గురించే రాశారు తప్ప మన సంప్రదాయం ఆయనకు అంత బాగా తెలుసునని చెప్పలేం. కానీ ఆ పుస్తకం అద్దంలో మన సంప్రదాయాన్ని కూడా చూసుకోవచ్చు.

STUDIES IN ANCIENT GREEK SOCIETY

ఆ పుస్తకం నా దగ్గరనుంచి ఎలా మాయమైందో తెలియదు. దాని కోసం ఎంతో గాలించాను. దొరకలేదు. నెట్ లో వెతికాను. కనిపించలేదు. మరింత గట్టిగా శోధిస్తే కనిపించేదేమో తెలియదు. ఈ లోపల ఆయన రాసిన మరో పుస్తకం దొరికింది. దాని పేరు, STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AGEAN. రాంభట్ల గారు ఒకటి, రెండు విషయాలలో జార్జి థాంప్సన్ పేరు ప్రస్తావించడంతో వాటి గురించి ఉంటుందనే కుతూహలంతో ఆ పుస్తకం తెప్పించుకున్నాను. కానీ రాంభట్ల పేర్కొన్న సమాచారం అందులో దొరకలేదు. ఆయనకు సోర్సు చెప్పే అలవాటు లేకపోవడం ఓ సమస్య. కానీ పై పుస్తకంలో నేను పోగొట్టుకున్న పుస్తకంలోని విషయాలు కొంతవరకు ఉన్నాయి.

ఇందులో THE ART OF POETRY పేరుతో ఒక అధ్యాయం ఉంది. దాని ప్రారంభంలోనే నాకు ఇంకో ఆశ్చర్యం. కవిత్వం పుట్టుక, దాని స్వభావాల గురించి చెప్పడం ఈ అధ్యాయంలోని విషయమనీ, దానిని ఒక సైంటిఫిక్ అంశంగా తను చర్చించబోతున్నాననీ ఆయన అంటారు. కవిత్వాన్ని కవిత్వం కోసమే ఆస్వాదించి ఆనందించేవారికి ఈ రకమైన పరిశీలన అంత సమంజసంగానూ, ఆకర్షణీయంగానూ కనిపించకపోవచ్చనీ, కానీ నిజానికి శాస్త్రీయదృక్పథం నుంచి కవిత్వాన్ని అధ్యయనం చేయడంలో మరింత ఎక్కువ ఆనందం ఉంటుందనీ అంటారు. ఇక్కడ ఆశ్చర్యం దేనికంటే, ఈ వాక్యాలు చదవడానికి చాలా ముందే, 1992లో, ‘కవిత్వంలో వస్తు రూపాలు’ అనే శీర్షికతో నేను రాసిన వ్యాస ప్రారంభం ఇలా ఉంటుంది: ‘ఆధునిక కవిత్వంలో వస్తురూప పరిణామం గురించి చెప్పుకోవడం అంటే బతికి ఉండగానే పోస్ట్ మార్టం చేసినట్టు కొంత బాధగానే ఉంటుంది. అయినా చరిత్రకు అదేమీ ఉండదు.’ george derwent thompson

నా ‘కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు’ పుస్తకం (2006)లో ఈ వ్యాసం ఉంది. కవిత్వాన్ని లేబరేటరీలో బల్ల మీద పెట్టి ఏ వాక్యానికి ఆ వాక్యాన్ని, ఏ పదానికి ఆ పదాన్ని విరిచి చూసి ఒక శాస్త్రవేత్తలా పరిశీలించాలనే ఒక ‘అకవిత్వ’ దాహం నాలో కలుగుతూ ఉంటుంది. థాంప్సన్ వాక్యాలకూ, నా వాక్యాలకూ పోలిక ఉండడమే నా ఆశ్చర్యానికి కారణం.

థాంప్సన్ ఈ అధ్యాయంలో పురామానవ పరిణామ కోణం నుంచి కవిత్వ పరిణామక్రమాన్ని చర్చించడం నాకు ప్రధాన ఆకర్షణ. గ్రీకు కవిత్వపు పురాచరిత్ర వెలుగులో ఈ పరిశీలన చేస్తున్నప్పటికీ గ్రీకు కవిత్వానికే పరిమితం కాననీ, ఆదిమజాతులకు చెందిన పాటలు, నృత్యాలతో పాటు; ఇప్పుడు అందరికీ బాగా తెలిసిన ఇంగ్లీష్ కవిత్వాన్ని, ఆధునిక యూరోపియన్ కవిత్వ పరిణామంలో ఇప్పటికీ వెనకటి దశే కొనసాగుతున్న ఐరిష్ కవిత్వాన్ని కూడా ఉపయోగించుకుంటాననీ ఆయన అంటారు. ఆయన చెప్పకపోయినా ఈ పరిశీలన మన కవిత్వ పరిణామక్రమానికీ యథాతథంగా అన్వయిస్తుంది.

ఆయన పరిశీలన ఇంకా ఇలా ఉంటుంది:

ఆధునిక ఇంగ్లీష్ కవిత్వానికీ, గ్రీకు కవిత్వానికీ ముఖ్యమైన తేడా, గ్రీకు కవిత్వం సంగీతబద్ధంగా ఉండడం. గ్రీసులో పురాకాలంలో శుద్ధవాద్యసంగీతం లేదు. వాద్యసంగీతం విధిగా కవిత్వాన్ని అంటిపెట్టుకుని ఉండేది. ఐరిష్ కవిత్వం కూడా అంతే. ఇదేదో అనుమానప్రమాణంతో అంటున్న మాట కాదు. ఇది ఇప్పటికీ ఐరిష్ కవిత్వంలో ఒక సజీవ వాస్తవం. ఈ సందర్భంలో ఐరిష్ కవిత్వంతో థాంప్సన్ ప్రత్యక్షఅనుభవాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం:

“ఎంతో కాలంగా నాకు అచ్చులో తెలిసిన కొన్ని ఐరిష్ కవితలను మొదటిసారి ఒక నిపుణుడైన రైతు గాయకుడు సంప్రదాయ పద్ధతిలో గానం చేస్తుంటే విన్నాను. ఆ సందర్భాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు పూర్తిగా సరికొత్త అనుభవం. ఐరిష్ కవిత్వానికి ఇంకొక లక్షణం ఉంది. ఇంగ్లీష్ ప్రజలు చాలా మంది దృష్టిలో ఇంగ్లీష్ కవిత్వం మూసేసిన పుస్తకం. కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారిలో కూడా కవిత్వం అనేది వారి నిత్యజీవితంలోకి పెద్దగానూ, ప్రగాఢంగానూ ప్రవహించే విషయం కాదు. ఐరిష్ మాట్లాడే రైతాంగం విషయం ఇందుకు భిన్నం. వారి దృష్టిలో కవిత్వానికి పుస్తకంతో పనిలేదు. వాళ్ళలో చాలామంది ఇటీవలి వరకు నిరక్షరాస్యులు. కవిత్వం వాళ్ళ పెదవుల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ కవిత్వాన్ని ప్రేమిస్తారు. వారి దైనందిన సంభాషణలో కూడా కవిత్వం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన ఘటన జరిగినప్పుడు దానిపై అప్పటికప్పుడు పాట కట్టి తమ అనుభూతిని ప్రకటించుకుంటారు. ఇటీవలివరకు అనేక ఐరిష్ గ్రామాలలో శిక్షణ పొందిన సాంప్రదాయిక గాయకుడు ఒక్కరైనా ఉండేవారు. ఆశువుగా కవిత్వం చెప్పే నేర్పు వారికి ఉంటుంది. ఆ క్షణంలో పొందిన ఉత్తేజాన్ని బట్టి అతను చెప్పే కవిత్వం, నేటి ఆధునిక ఇంగ్లీష్ కవిత్వం కన్నా కూడా ఎక్కువ వివరణాత్మకంగా ఉంటుంది.

నాకు బాగా తెలిసిన ఒక గ్రామంలో ఒక ప్రసిద్ధ కవి ఉండేవాడు. ఆయన చనిపోయి నలభై ఏళ్లయింది. ఆయన కవితలన్నీ చాలావరకూ ఆశువుగానూ, సందర్భానుసారంగానూ చెప్పినవే. ఆయన గురించి ఆయన కుటుంబ సభ్యులు ఒక విషయం చెప్పారు. ఆయన చనిపోయిన రోజు రాత్రి కూడా మంచం మీద పడుకుని మోచేతి మీద తల పెట్టుకుని ప్రవాహంలా కవిత్వం చెబుతూనే ఉన్నారట.

ఈయన తన వెనకటి తరానికి చెందిన కవి వద్ద శిక్షణ పొందిన వృత్తి కవీ, అసాధారణ ప్రజ్ఞావంతుడు అయితే కావచ్చు కానీ, మిగిలినవారికీ, ఇలాంటి వృత్తి కవులకు మధ్య మరీ అంత మందమైన గీత గీయడం కష్టం. స్థాయిలోనే తేడా ఉండచ్చు కానీ అందరూ కవులే. వాళ్ళ సంభాషణ చూస్తుండగానే కవితాత్మకంగా మారిపోతూ ఉంటుంది. “

ఈ సందర్భంలో థాంప్సన్ మరొకరి గురించిన ముచ్చట కూడా చెప్పారు. ఓ రోజు సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్నఆ గ్రామంలో ఆయన పచార్లు చేస్తూ ఆ ఊరి బావి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక తెలిసినామె కనిపించింది. ఆమె ఒక వృద్ధ రైతుమహిళ. అప్పుడే బొక్కెనలో నీళ్ళు నింపుకుని సముద్రం వైపు తదేకంగా చూస్తూ నిలబడి ఉంది. ఆమె భర్త చనిపోయాడు. ఏడుగురు కొడుకులు. ఏడుగురూ ‘కట్టకట్టుకుని’ (ఆమె అభివ్యక్తి) మసాచూసెట్స్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ కు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఒక కొడుకు దగ్గరనుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది. ‘ఈ చివరి రోజుల్లో మా దగ్గర సుఖంగా ఉందుగాని, వచ్చేయి, నువ్వు సరే నంటే ప్రయాణానికి డబ్బు పంపిస్తా’మని దాని సారాంశం. ఈ విషయం ఆమె థాంప్సన్ తో చెప్పింది. ఆ తర్వాత; కొండలు, బండలు ఎక్కుతూ; ఎగుడు దిగుడు పచ్చిక బీళ్ళ మీద నడుస్తూ జీవితంలో తను పడిన కష్టాల గురించి, తను పోగొట్టుకున్న కోళ్ళ గురించి, పొగచూరిన చీకటి గుయ్యారం లాంటి తన చిన్న ఇంటి గురించి వర్ణించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అమెరికా గురించి మాట్లాడడం మొదలు పెట్టింది. ఆమె ఊహలో అమెరికా అంటే బంగారపు దేశం. అక్కడ కాలిబాటల మీద కూడా బంగారం దొరుకుతుందట. ఆ తర్వాత కార్క్ నగరానికి రైలు ప్రయాణం గురించి, అట్లాంటిక్ దాటడం గురించి మాట్లాడింది. ఆపైన తన శరీరం ఐరిష్ మట్టిలోనే కలసి పోవాలన్న తన కోరిక గురించి చెప్పింది. ఆమె మాట్లాడుతున్న కొద్దీ ఉత్తేజితురాలు కావడం ప్రారంభించింది. ఆమె భాష క్రమంగా మరింత ప్రవాహగుణాన్ని సంతరించుకోసాగింది. అది మరింత ఆలంకారికతను, లయాత్మకతను, శ్రావ్యతనూ పుంజుకుంటూ వచ్చింది. ఆమె దేహం స్వాప్నికమైన ఒక ఊయెలలో ఊగిపోతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆమె బొక్కెన తీసుకుని నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయింది. తను కవినన్న భావన ఏ కోశానా లేని ఈ నిరక్షరాస్య వృద్ధ మహిళ మాటల్లో కవిత్వానికి ఉండే అన్ని లక్షణాలూ ఉన్నాయని థాంప్సన్ అంటారు. ఇది ఒక ‘పూనకం’(inspired) అంటాడాయన. కవిని పూనకం పట్టినవాడని అనడంలో అర్థమేమిటో తెలుసుకోవాలంటే, ఈనాటికీ ఆదిమజాతుల పెదాలపై నర్తించే ఆదిమకవిత్వంలోకి తొంగి చూడాలంటారు. అయితే, వాళ్ళ సమాజం గురించి కొంతైనా తెలుసుకుంటే తప్ప వారి కవిత్వం అర్థం కాదు.

 

***

ఆధునికతలోకి, లిఖిత కవిత్వంలోకి చాలా ముందే అడుగుపెట్టిన యూరప్ అనుభవం నుంచి చూసినప్పుడు, ఐరిష్ ప్రజల్లో (వారూ యూరొపియన్లే అయినప్పటికీ) వెనకటి ఆశుకవిత్వ సంప్రదాయం కొనసాగుతూ ఉండడం థాంప్సన్ కు సరికొత్త అనుభూతిని కలిగించి ఉండవచ్చుకానీ, అది మనకు అంత ఆశ్చర్యకరం కాదు. మన దేశంలో ఆశుకవిత్వంతో సహా వివిధ సాంప్రదాయిక ప్రక్రియలు ఇప్పటికీ అంతో ఇంతో ఉన్నాయి.

దానిని అలా ఉంచితే కవిత్వం ఒక ప్రత్యేకమైన వాక్కు అంటారు థాంప్సన్. కవిత్వం పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవడమంటే మనిషి ఎలా పరిణామం చెందాడో తెలుసుకోవడమే. మరీ ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకుండా, వాక్కుకు, కవిత్వానికి పరిమితమై చెప్పుకుంటే, వాక్కు అనేది సామూహికశ్రమలో భాగంగా పుట్టింది. శ్రమ చేసేటప్పుడు కండరాల కదలికకు అది సాయపడుతుంది. ఆవిధంగా శ్రమలో భాగమైన వాక్కును శ్రమకు కారణంగా, లేదా చోదకంగా మనిషి అర్థం చేసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం మాట అనుకుంటున్నది, అతని దృష్టిలో కేవలం మాట కాదు, మంత్రం! ప్రపంచవ్యాప్తంగా ఆదిమసమాజాలు అన్నీ నోటి నుంచి వెలువడిన మాటకు ఒకే విధమైన మాంత్రికతను ఆపాదించుకున్నాయి.

శ్రమ సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ, శ్రమలో గొంతు పాత్ర తగ్గిపొతూ వచ్చింది. వ్యక్తులు సమూహంగానే కాక విడివిడిగా కూడా పనిచేసే స్థాయికి ఎదిగారు. అయితే సామూహిక ప్రక్రియ వెంటనే అదృశ్యం కాలేదు. అది, ఒక అసలు కార్యాన్ని ప్రారంభించబోయే ముందు ప్రదర్శించే రిహార్సల్ రూపంలో మిగిలింది. ఇంతకు ముందు అసలు కార్యంలో భాగమైన సామూహిక కదలికలే ఒక నృత్యరూపంలో రిహార్సల్స్ గా మారాయి. ఈ మూకాభినయనృత్యం ( mimetic dance) ఇప్పటికీ ఆదిమజాతులలో ఉంది. అయితే, నృత్యంలో వాచికాభినయం ఉన్న చోట, ఆ వాచికం మాంత్రిక రూపం తీసుకుంది. అందుకే అన్ని భాషలలొనూ రెండు రకాల వాగ్రూపాలు కనిపిస్తాయి. మొదటిది, నిత్యజీవితంలో మాట్లాడుకునే సాధారణ వాక్కు. రెండవది, కవితాత్మకమైన వాక్కు. క్రతువు, అద్భుతత్వం, లయాత్మకత, మాంత్రికతలతో కూడిన సామూహిక చర్యలకు తోడ్పడే సాంద్రత ఈ కవితాత్మకమైన వాక్కులో ఉంటుంది.

ఈ విధంగా చూసినప్పుడు సాధారణ వాక్కు కంటే కవితాత్మక వాక్కే ప్రాథమికం అని తేలుతుంది. అందుకే ఇప్పటికీ ఆదిమ సమాజాలలో కవితాత్మక వాక్కు, సాధారణ వాక్కుల మధ్య తేడా పూర్తిగా ఏర్పడలేదు. ఐరిష్ ప్రజల దైనందిన సంభాషణ కూడా కవితాత్మకంగా ఉంటుందని అనడంలో మనకిది కనిపిస్తుంది. ఆదిమ సమాజాలలో దైనందిన సంభాషణ కూడా కవితాత్మకం అయినప్పుడు వారి కవిత్వం మాంత్రికం అవుతుంది. వాళ్లకు తెలిసిన కవిత్వ రూపం పాట ఒక్కటే. ఆ పాట ఏదో ఒక శారీరకమైన చర్యను అంటిపెట్టుకుని ఉంటుంది. వారి పాట, ఏ పనీ లేని తీరిక సమయంలో పాడుకునేది కాదు. పనిలో భాగంగా పాడుకునేది. వారికి పని-పాట వేరువేరు కావు. రెండూ ఒకటే. వారు పని ద్వారా ఏ భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారో పాట ద్వారా కూడా అదే భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బాహ్య వాస్తవికతను మార్చి దానినుంచి తమకు అనుకూలమైన ఫలితాలను పొందడానికి, మాంత్రిక స్వభావం కలిగిన పాట రూపంలో బాహ్య వాస్తవికత మీద భ్రాంతి వాస్తవికతను ప్రయోగిస్తారు.

 

అదీ విషయం!

ఈ సందర్భంలో మావొరీలు (న్యూజీలాండ్) జరిపే పొటాటో నృత్యాన్ని థాంప్సన్ ప్రస్తావించారు. ఆడపిల్లలు ఆలుగడ్డలు పండించే పొలానికి వెళ్లి పంట ఎదుగుదలకు అవసరమైన తూర్పు గాలి వీస్తున్నట్టు, వర్షం పడుతున్నట్టు, పంట మొలకెత్తి పెరుగుతున్నట్టు తమ శరీరపు కదలికల ద్వారా సూచిస్తూ పాట పాడుతూ నృత్యం చేస్తారు. అంటే వాస్తవంగా తాము కోరుకునేది ఊహాత్మకంగా సాధిస్తారు. వాస్తవికమైన క్రియకు భ్రాంతిపూర్వక క్రియను జోడించడమే మాంత్రికత.

యాజుడు జరిపించిన పుత్రకామేష్టి గురించి చెప్పుకుంటున్న ప్రస్తుత సందర్భంలో పైన చెప్పుకున్న ప్రతి వివరమూ గుర్తుపెట్టుకోవలసినవే. రిహార్సల్స్ రూపంలో జరిపేది సామూహిక నృత్యమే కానవసరం లేదు. సామూహికంగా జరిపే ఏ చర్య అయినా కావచ్చు. యజ్ఞం, యాగం, ఇష్టి వగైరాలు కూడా సామూహిక చర్యలే. ఒక వాస్తవిక ప్రయోజనం కోసం బాహ్య వాస్తవికతపై భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడమే వాటి ఉద్దేశం. అసలు యుద్ధంలో విజయం సాధించడానికి ముందు యాగం జరుపుతారు. అది యుద్ధానికి రిహార్సల్స్. అందులో విజయాన్ని భ్రాంతి పూర్వకంగా ముందే సాధిస్తారు. ఆ భ్రాంతి పూర్వక విజయం అసలు విజయాన్ని కట్ట బెడుతుందని నమ్మకం. ఇంకో ఉదాహరణ చూడండి…వర్షాలు పడనప్పుడు సహస్రఘటాభిషేకం చేస్తారు. అంటే ఆ జల పుష్కలత్వం గురించిన భ్రాంతి వాస్తవికత, వాస్తవికమైన జల పుష్కలత్వాన్ని ఇస్తుందని నమ్మకం. యజ్ఞంలో నెయ్యి, ధాన్యాలు వగైరాలే కాదు, పట్టుబట్టలు మొదలైనవి కూడా ఆహుతి చేస్తారు. అందువల్ల పుష్కలమైన పాడితోపాటు, అన్ని రకాల సంపదలూ లభిస్తాయని నమ్మకం. ఒక విత్తనం ఒక పెద్ద పండ్ల మొక్కను ఎలా ఇస్తోందో, అలాగే ఒక ఆహుతి అనంతమైన సంపదను ఇస్తుందని భావించారు.

మహాభారతంలో ఇటువంటి మాంత్రిక వాస్తవికతకు అద్దం పట్టిన ఘట్టాలలో సర్పయాగం; ద్రౌపదీ, ధృష్టద్యుమ్నుల జననం ఉన్నాయి.

మిగతా విశేషాలు వచ్చేవారం…

–కల్లూరి భాస్కరం

దత్త పుత్రిక ద్రౌపది?

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి ద్రుపదుడు రెండు రకాల ఆలోచనలు చేశాడు. మొదటిది, ద్రోణుని చంపగల కొడుకును పొందడం. రెండవది, అర్జునునికి భార్య కాగల కూతురుని పొందడం.

మొదటి కోరికలో కేవలం ప్రతీకార సంబంధమైన భావోద్వేగం ఉంటే, రెండో కోరికలో ముందుచూపు కలిగిన రాజకీయవ్యూహం ఉంది. అర్జునుని వరించగల కూతురిని పొందడం అంటే, పాండవులతో బంధుత్వం ద్వారా వారిని ద్రోణుడికి వ్యతిరేకంగా తనవైపు తిప్పుకోవడమే.

ద్రుపదుడి రెండు కోరికలనూ మనుష్యధర్మం నుంచి లేదా మనుష్య స్వభావం నుంచి అర్థం చేసుకుందాం. సహజపద్ధతిలో భార్య ద్వారా కొడుకును, కూతురిని కని ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే, సహజపద్ధతిలో కనే సంతానం సరిగ్గా ఒక కొడుకు, ఒక కూతురే అవుతారని ఎలా చెబుతాం? ఒకవేళ అయినా, ఆ కొడుకు ద్రోణుని చంపగలిగినవాడూ, కూతురు అర్జునుని వరించగలిగినదీ అవుతారన్న నమ్మకం ఏమిటి? ఆవిధంగా అది చీకట్లో రాయి విసరడం లాంటిది. దానికితోడు, వారు పుట్టి, పెరిగి తన ప్రతీకార సాధనకు ఉపయోగపడడం అనేది ఎంతో ఓపికతో నిరీక్షించవలసిన దీర్ఘకాలిక ప్రణాళిక కూడా.

ప్రతీకారేచ్ఛతో ఉన్న ద్రుపదుడు అంత అనిశ్చితమైన దీర్ఘకాలిక ప్రణాళిక అమలుజరిగే వరకూ వేచి చూడడం కష్టం. ఇంకో కోణం నుంచి చూస్తే, నిజానికి ద్రుపదుడు అంతకాలం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. రాజు తన రాజ్యంలో, లేదా తన గణంలో ఉన్న జనం అందరికీ తండ్రి లాంటివాడే కనుక; ద్రోణుని చంపగల శౌర్యసాహసాలు ఉన్న ప్రతి యువకుడూ ద్రుపదుడికి కొడుకే అవుతాడు. అలాగే అర్జునుని వరించగల ప్రతి అమ్మాయీ కూతురే అవుతుంది. ఒకవేళ తన రాజ్యంలో లేదా తన గణంలో అలాంటివారు లేనప్పుడు అతను దత్తు చేసుకోవచ్చు.

ఈ సందర్భంలో దత్తు గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. దత్తు గణసమాజకాలంనుంచీ వస్తున్న ప్రక్రియ. మోర్గాన్ తన ‘పురాతన సమాజం’లో వివరించిన ప్రకారం అమెరికా ఆదివాసులలో దత్తత స్వీకారం ఇలా ఉంటుంది:

దత్తు చేసుకుని కొత్తవారిని సభ్యులుగా తీసుకునే హక్కు గణానికి ఉంటుంది. యుద్ధంలో పట్టుబడిన వారిని చంపెయ్యడమో, లేదా దయదలచి ఏదైనా గణంలోకి దత్తు తీసుకోవడమో చేసేవారు. దత్తులకు కూడా గణ హక్కులన్నీ లభిస్తాయి. వారిని సొంత మనుషులుగానే చూస్తారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తల్లి, తండ్రి వగైరా వరసలే వారికి ఆపాదిస్తారు. మొదట్లో, అనాగరిక యుగం తొలి దశలో యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసుకునేవారు. మలి దశలో ఉన్న ఆదివాసులలో బానిసలు లేరు. అంటే, యుద్ధ ఖైదీలను దత్తు చేసుకునేవారన్న మాట.

దత్తు తతంగంలో భాగంగా, జనం రెండు వరసల్లో ఒకరి ఎదురుగా ఒకరు నిలబడతారు. వారి చేతుల్లో కర్ర, లేదా కొరడా లాంటివి ఉంటాయి. దత్తు కాబోయేవారు ఆ రెండు వరసల మధ్య నడుస్తూ వారితో దెబ్బలు తింటారు. దీనిని గాంట్ లెట్ (gauntlet) అంటారు. పట్టుబడిన ఖైదీలనో, లేదా ఇతర గణాలకు చెందినవారినో ఇలా దత్తు చేసుకుని, వారికి గణంలో చనిపోయినవారి స్థానమిచ్చి సంఖ్యను భర్తీ చేసుకుంటారు. గణంలో సభ్యుల సంఖ్య తగ్గిపోతున్నప్పుడు ఇలా సంఖ్య పెంచుకుంటారు. అయితే ఇటువంటివి చాలా అరుదుగా జరుగుతాయి. ఒక దశలో సెనెకాలలో డేగ గణం వారి సంఖ్య తగ్గిపోయి అది అంతరించేలా ఉన్నప్పుడు తోడేలు గణం నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని దత్తు చేసుకున్నారు. ఇందుకు రెండు గణాలూ సమ్మతించాయి. ఇరాక్యూలలో తెగసమితి సమావేశంలో దత్తు జరుగుతుంది. అది ఇంచుమించు మతకర్మ రూపం తీసుకుంటుంది.

సమితి సమావేశమయ్యాక, దత్తు చేసుకోబోతున్న వ్యక్తి ఏ గణం వాడో, అతని పేరేమిటో, అతను ఎలాంటివాడో, అతన్ని ఎందుకు దత్తు చేసుకుంటున్నారో, అతనికి పెట్టబోయే పేరు ఏమిటో సమితి నాయకులలో ఒకరు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు అతని రెండు చేతులూ పట్టుకుని దత్తత పాట పాడుతూ సమావేశభవనంలో ఈ చివరినుంచి ఆ చివరివరకూ నడుస్తారు. మిగతా జనం ప్రతి చరణం చివరా పల్లవి ఎత్తుకుంటారు. పాట చరణాలు అన్నీ పూర్తయ్యేవరకూ అలా సమావేశభవనంలో ఈ చివరినుంచి ఆ చివరి వరకూ మూడు చుట్లు చూడతారు. దాంతో దత్తు పూర్తవుతుంది.

ఒక్కోసారి ఇతరులను అభిమాన సూచకంగా దత్తు చేసుకోవడమూ జరుగుతుంటుంది. సెనెకాలలో డేగగణం వారు తనను అలాగే దత్తు తీసుకున్నారని మోర్గాన్ అంటారు.

దత్తు తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక వ్యక్తిగత విషయంగానో, సేవాభావంతో ముడిపడిందిగానో మారిపోయింది. ఉదాహరణకు, పిల్లలు లేనివారు ఎవరినైనా ఇష్టమైతే దత్తు చేసుకోవచ్చు, లేదా మానేయచ్చు. అలాగే కొందరు అనాథలను దత్తు చేసుకుంటారు. రాజకీయనాయకులు, ఆయా స్వచ్ఛంద సంస్థలవారు గ్రామాలనో, వెనకబడిన జిల్లాలనో దత్తు చేసుకుంటున్నామని చెబుతుంటారు. కానీ, గణసమాజంలో ఒక దశలో దత్తత అవసరంగానూ, అనివార్యంగానూ మారిపోయింది. సమాజనిర్మాణంలో భాగం అయింది. అది గణం నుంచి ప్రజలకు, లేదా పౌరులకు మారుతున్న దశ. గ్రీకులలో ఆ దశ గురించి మోర్గాన్ చర్చించారు.

మనం క్రూరమైన చట్టాలను ‘డ్రాకోనియన్’ చట్టాలు అంటాం. డ్రాకో(క్రీ.పూ. 624) అనే వ్యక్తి గ్రీకు తెగలలోని అధీనియన్ల కోసం చేసిన కఠిన చట్టాల కారణంగా ఆ పేరు వచ్చింది. అంటే, అప్పటికి గణం తాలూకు ఆచారాలు, అలవాట్ల స్థానే లిఖిత శాసనాలు తయారు చేసుకోవలసిన స్థాయికి గ్రీకులు పెరిగారన్నమాట. చట్టాల అవసరమైతే కలిగింది కానీ అప్పటికి చట్టాలు చేసే నేర్పు మాత్రం పట్టుబడలేదు. ఆ తర్వాత ధెసియస్(ఇతని తేదీ తెలియదు), సోలోన్(క్రీ.పూ. 594), క్లీస్తెనెస్(క్రీ.పూ. 509) అనే ముగ్గురు ఈ పరివర్తనలో ముఖ్యపాత్ర పోషించారు. క్లీస్తెనెస్ నాటికి ఈ పరివర్తన ఒక కొలిక్కి వచ్చింది. నేటికీ నాగరికదేశాల్లో కొనసాగుతున్న ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థకు రూపునిచ్చినది ఇతనే. అత్తికా అనే ప్రాంతాన్ని ఇతను నూరు ‘డెమో’(పట్టణం)లుగా విభజించాడు. ఆ పట్టణంలో ఉన్నపౌరులు అందరూ డెమోలు. వారు తమ పేర్లను, ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి. అప్పుడే వారికి పౌరహక్కులు లభిస్తాయి. డెమోలకు స్థానిక స్వపరిపాలనాధికారం ఉంటుంది. వీరొక ‘డెమార్క్’ ను ఎన్నుకుంటారు. ఈ డెమో అన్న మాటనుంచే డెమోక్రసీ అనే మాట వచ్చింది.

చూడండి…మనం గణం నుంచి పౌరుల దగ్గరకు వచ్చేశాం. ఇలా నాలుగు వాక్యాలలో చెప్పేసుకున్నాం కానీ, ఈ పరివర్తన జరగడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. అందుకు ఎంతో తెలివీ, అనుభవమూ అవసరమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, గణవ్యవస్థ అనే తల్లిని శిథిలం చేసి ఈ పౌరవ్యవస్థ అనే శిశువు పుట్టింది.

ఇంతకీ గణవ్యవస్థను శిథిలం చేస్తూ ఈ పరివర్తన ఎందుకు సంభవించిందని ప్రశ్నించుకుంటే, గణ నిర్మాణమూ, గణ స్వభావమూ, గణానికి గల పరిమితులే అందుకు కారణమన్న సమాధానం వస్తుంది. గణం అనేది ఒక వ్యక్తి అనుకుంటే, గణంలో ఉన్నవారు అందరూ ఆ వ్యక్తికి గల వివిధ అవయవాల లాంటివారు. వ్యక్తికి విడిగా అవయవాలకు ఉనికి ఉండదు. అలాగే గణం బయట గణసభ్యులకు ఉనికి ఉండదు. అదసలు ఊహించడానికే సాధ్యం కాని విషయం. చెరువులోని చేపలు గట్టు మీద ఎలా బతకలేవో గణసభ్యులు కూడా గణం వెలుపల బతకలేరు.

కానీ, పైన చెప్పిన సోలోన్ (క్రీ.పూ. 594)కు ముందు గ్రీకు తెగలలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణదశలో ఉన్న జనం తప్పనిసరై ఉన్న చోటు వదిలి దూరప్రాంతాలకు పోవలసివచ్చింది. వ్యక్తులలోని సాహసప్రవృత్తి, వర్తక వాణిజ్యాలు, యుద్ధాలు మొదలైనవి ఇందుకు కారణమయ్యాయి. దాంతో వీరికి సొంత గణాలతో సంబంధాలు తెగిపోయాయి. మరో గణంతో సంబంధం ఏర్పడలేదు. ఆ విధంగా వీరు ఏ గణంతోనూ సంబంధం లేకుండా త్రిశంకు స్థితిలో ఉండిపోవలసివచ్చింది. క్రమంగా వీరి సంతానం కూడా పెరిగింది. ఏ గణంతోనూ సంబంధం లేకపోవడం అంటే ప్రభుత్వ పరిధిలోకి రాకపోవడమే. ప్రభుత్వ పరిధిలోకి రాని వారికి గుర్తింపు, గౌరవం కాదు సరికదా, ఉపాధి హక్కు, మత హక్కు, సహజవనరులలో భాగస్వామ్యంతో సహా ఏమీ ఉండవు. అది చావుతో సమానం. దీనికి పరిష్కారం, ఆయా గణాలవారు దయదల్చి వీరిని తమలో చేర్చుకోవడం. అక్కడ వచ్చింది దత్తతకు ప్రాధాన్యత.

గణాలకు గణాలు (లేదా కుటుంబాలకు కుటుంబాలు) తరలి వస్తే, ఒక గణంగా వారిని తెగలలోకి చేర్చుకోవచ్చు. వ్యక్తులుగా వస్తేనే అది కష్టమవుతుంది. అప్పుడు వారిని దత్తు చేసుకోవడమే మార్గం. అందులో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. పేరు ప్రతిష్టలు, ఆస్తి ఉన్నవారికి దత్తత ద్వారా గణంలో సభ్యత్వం తేలిగ్గా లభించవచ్చు. కానీ పేదలకు అది కష్టమవుతుంది. గ్రీసులో క్రమంగా అలాంటి వారి సంఖ్య పెరిగిపోయింది. అది పెద్ద సంక్షోభానికి దారి తీసింది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలోనే గణవ్యవస్థ నుంచి పౌరవ్యవస్థకు పయనించడం సంభవించింది. అప్పటి ఆ ప్రయోగాలే నేటి ప్రజాస్వామికనిర్మాణాలకు మాతృకలయ్యాయి. నేటి పార్లమెంటు ఎగువసభ, దిగువసభ మొదలైనవి ఆ ప్రయోగాలనుంచి పుట్టినవే.

దత్తత గురించి చెప్పుకుంటూ చాలా దూరం వచ్చేశాం. మళ్ళీ అందులోకి వెళ్ళేముందు మరో రెండు ఆసక్తికర విషయాలు చెప్పుకోవాలి. గ్రీకు సమాజం గణదశనుంచి పౌరదశకు మళ్లడంలో గణసంబంధ ఆచారాలు, అలవాట్ల స్థానే కొత్త శాసనాలు తయారుచేసుకోవలసి వచ్చిందని పైన చెప్పుకున్నాం. ఆధునిక భారతదేశంలో మన అనుభవం కూడా ఇలాంటిదే. వివిధ ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, అలవాట్లు ఉన్న ఈ దేశప్రజలను ఒక జాతిగా నిర్మించే ప్రయత్నంలో మన దగ్గరా ఇలాంటి శాసన నిర్మాణం జరిగింది, ఇంకా జరుగుతోంది. వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా)స్థానే ఉమ్మడి పౌర స్మృతిని నొక్కి చెప్పడం ఒక ఉదాహరణ.

రెండోది, గణదశనుంచి పౌరదశకు మళ్లడంలో గ్రీకుల అనుభవాన్ని మనకూ వర్తింపజేసుకోవచ్చు. అందులో మరింత ఆసక్తికరం ఏమిటంటే, మన వర్ణ, లేదా కులవ్యవస్థ చరిత్రనూ దాని నుంచి మనం పునర్నిర్మించుకోవచ్చు.

ఇప్పుడు మళ్ళీ దత్తతకు వస్తే…

సోర్సు చెప్పలేదు కానీ రాంభట్లగారు (జనకథ) అరుంధతీ, వశిష్టుల వివాహం గురించి ఒక ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు. దాని సారాంశం ఇలా ఉంటుంది:

సప్తర్షి మండలంలో వశిష్టుని పక్కనే ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని కొత్త దంపతులకు చూపిస్తారని మనకు తెలుసు. ఈ ఆచారం ఎప్పటినుంచి వస్తున్నదో తెలియదు. అరుంధతీ వశిష్టులు తమ తమ గణాలలో జంట మనువు కట్టి, జీవితాంతం ఆ మనువుకు కట్టుబడి ఉన్న తొలి జంట అన్న సంగతిని అది సూచిస్తూ ఉండచ్చు. ఆవిధంగా వారు ఆదర్శ దంపతులయ్యారు.

అయితే, ఆ మనువు సాధ్యం కావడానికి పూర్వరంగంలో పెద్ద కసరత్తు జరిగింది. ఎందుకంటే, వారిద్దరి గణాలూ అప్పటికి ఇంకా గణవివాహదశలో ఉన్నాయి. జంట మనువులతో వాటికి పరిచయం లేదు. అయినాసరే, ఒకరి మీద ఒకరు మనసు పడిన అరుంధతీ, వశిష్టులు జంట మనువు ఆడాలనుకున్నారు. అందుకు రెండు గణాలవారూ అనుమతించాలి. మామూలుగా అయితే అనుమతి అంత తేలిక కాదు. కానీ అప్పటికే కొన్ని తెలిసిన వ్రాతాల(మనువుకు యోగ్యమైన కొన్ని గణాలు కలసి వ్రాతంగా ఏర్పడతాయి)వారు జంట మనువుల్లోకి అడుగుపెట్టారు. పులస్త్య, పులహవ్రాతాలు వాటిలో ఉన్నాయి. కనుక అరుంధతీ, వశిష్టుల గణాలవారు కాస్త మెత్తబడ్డారు. అయితే, గణధర్మాన్ని భంగపరచి ఆ మనువును సాధ్యం చేయడం ఎలా?

అప్పుడు అరుంధతి గణదాయీలు (గణంలో పెద్దరికం వహించే మహిళలను గణదాయీలంటారు. తద్దినం మంత్రాలలో ఇప్పటికీ ‘దాయీ’ అనే ఈ వైదిక పరిభాషాపదం వినిపిస్తుంది. విశేషమేమిటంటే, గ్రీకు పురాణాలలోనూ ఈ పదం ఉంది. ఉదాహరణకు, హోమర్ దాయీలనే మాట) ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. అది, జంట మనువు ఉన్న వ్రాతాలవారికి అరుంధతి, వశిష్టులను దత్తత ఇవ్వడం. అందుకు ఇద్దరి గణాల వారూ అనుమతించారు. అరుంధతిని దత్తత తీసుకోడానికి పులస్త్యవ్రాతం లోని ఒక గణం వారు, వశిష్టుని దత్తత తీసుకోడానికి పులహ వ్రాతంలోని ఒక గణం వారు అంగీకరించారు. ఆ విధంగా వారిద్దరూ జంట మనువు ఆడారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా ఉన్నాయి కానీ, అది మరెప్పుడైనా.

ఇప్పుడు కూడా దత్తత స్వీకారాలు జరుగుతూ ఉండచ్చు కానీ అవి పెళ్లిళ్ళలా, బంధుమిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుగుతున్న దాఖలాలు కనిపించవు. శాస్త్రోక్తంగా జరిపించగల పురోహితులు ఉన్నారో లేరో కూడా తెలియదు. నేను ఇంతవరకు శాస్త్రోక్తంగా జరిగిన దత్తత స్వీకారం ఒకే ఒకటి చూశాను. అది కూడా నా చిన్నతనంలో. మా పెద్దమ్మగారి అబ్బాయిని దత్తు ఇచ్చారు. కొవ్వూరు(ప.గో. జిల్లా)లో, అటూ ఇటూ ఉన్న బంధుమిత్రుల సమక్షంలో ఆ కార్యక్రమం భారీగా జరిగింది. అది మూడు రోజుల తంతు. నాకది లీలగా మాత్రమే గుర్తుంది కానీ, ఆ తర్వాత ఆ తతంగానికి సంబంధించిన వివరాలు తెలిసాక; ఆ మూడు రోజుల్లోనూ మా పెద్దమ్మ వైపు వాళ్ళలో ఎంతో దుఃఖమూ, విషాదమూ గూడు కట్టుకుని ఉండేవా అనిపిస్తూ ఉంటుంది. దత్తత ఇస్తున్న అబ్బాయి మరణించడం, అతనికి అంత్యక్రియలు జరిగిపోవడం, ఆ తర్వాత దత్తత తల్లిదండ్రులకు అతను మళ్ళీ పుట్టడం ఆ మూడురోజుల తంతులోనూ మంత్రపూర్వకంగా జరిగిపోతాయి.

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

పరిశోధిస్తే ఈ దత్తత స్వీకార ప్రక్రియలో గణసమాజపు ఆనవాళ్ళు కచ్చితంగా దొరుకుతాయి. పైన చెప్పుకున్న అమెరికా ఆదివాసులు, గ్రీకులు జరిపిన దత్తత తంతుకు, శాస్త్రోక్తమైన మన తంతుకు మధ్య బహుశా పోలికలూ కనిపిస్తాయి. వేల సంవత్సరాలుగా తరం వెంట తరానికి ప్రవహిస్తున్న ప్రపంచ వారసత్వం అది.

ఇంకొకటి ఏమిటంటే, గణ సమాజంలో మతకర్మలు, లౌకిక కర్మలు అనే తేడా లేదు. ప్రతిదీ మతకర్మే. మంత్రపూర్వకంగా జరగవలసిందే. ఇప్పుడా కోణంలోకి వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం.

ఇంతకీ విషయమేమిటంటే, ద్రోణుని చంపగల కొడుకును, అర్జునుని వరించగల కూతురుని ద్రుపదుడు మంత్ర పూర్వకంగా దత్తు తీసుకుని ఉండచ్చు. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అభిప్రాయం, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది దత్త సంతానమనే.

కథలోకి వెడితే…

ద్రోణునిపై ప్రతీకారానికి నిర్ణయించుకున్న ద్రుపదుడు ప్రతిరోజూ బ్రాహ్మణుల నివాసాలకు వెడుతూ వారిని ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించాడు. అలాగే ఒకరోజున గంగాతీరంలో వానప్రస్థంలో ఉన్న కాశ్యపగోత్రీకులైన యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు సోదరులను దర్శించుకున్నాడు. వారిద్దరిలోనూ తపోమహిమలో అధికుడైన ఉపయాజుని మరింతగా ఉపాసించి,‘సత్పుత్రుడు కలిగేలా నాచేత క్రతువు చేయించు. నన్ను కృతార్థుణ్ణి చేయి. నీకు లక్ష గోవులను ఇస్తాను’ అన్నాడు.

‘నాకు సంపద మీద కోరిక లేదు. ఆ కోరిక ఉన్న వారి దగ్గరకు వెళ్ళు’ అని ఉపయాజుడు అన్నాడు. అయినాసరే, ద్రుపదుడు ఒక ఏడాదిపాటు పట్టుదలగా అతన్ని ప్రార్థించాడు. మెత్తబడిన ఉపయాజుడు,‘ఓసారి మా అన్న ఈ వనంలో వెడుతుండగా నేల మీద ఒక పండు కనిపించింది. అది శుచా, అశుచా అనేది చూడకుండా ఆ పండు తీసుకున్నాడు. అలాగే ఫలం కోరుకునేవాడు, దానిని అంటిపెట్టుకుని ఉన్న దోషాలను పట్టించుకోడు. కనుక నువ్వు వెళ్ళి మా అన్న యాజుని ఆశ్రయించు. అతడు నీ కోరిక తీర్చగలడు’ అన్నాడు.

వెంటనే ద్రుపదుడు వెళ్ళి యాజుని కలసుకున్నాడు. అతను వేదవేత్త, తపశ్శాలి అయినప్పటికీ ఉంఛవృత్తితోనూ, భిక్షాటనతోనూ కుటుంబభారాన్ని మోస్తున్నాడు. ద్రుపదుడు ఉపయాజుని కోరినట్టే అతన్ని కూడా కోరి, లక్ష గోవులు ఇస్తానన్నాడు.

యాజుడు ఒప్పుకున్నాడు. నువ్వు కోరుకున్న కొడుకూ, కూతురూ పుడతారు అంటూ హామీ ఇచ్చి యజ్ఞానికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకుని, తమ్ముడు ఉపయాజుడు సహాయకుడుగా ద్రుపద, కోకిలాదేవిల చేత పుత్రకామేష్టి చేయించాడు.

మిగతా విశేషాలు తర్వాత…

( కల్లూరి భాస్కరం )

 

 

 

 

 

ఎందరో ‘అయోని’జులు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఈ వ్యాస పరంపరలో మహాభారత పరిశీలననుంచి వీలైనంత త్వరగా బయటకు వద్దామని ఉంది. అందుకు ఇంకా ఎన్ని వ్యాసాల సమయం పడుతుందో ఈ క్షణాన నాకు అంచనా లేదు. బహుశా మరో పది వ్యాసాలు? ఉహూ…ఇప్పుడే కమిట్ అయిపోతే, దానిని నిలబెట్టుకుంటానన్న ధైర్యం లేదు.

అసలు మహాభారత పరిశీలననుంచి ఎప్పటికైనా బయట పడడం సాధ్యమా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. దానిని అలా ఉంచితే, ఇప్పుడీ వ్యాసాల సందర్భంలో మహాభారతం నుంచి బయటపడాలనుకోడానికి కారణం ఉంది. ఇప్పటికే చాలాచోట్ల ఆయా అంశాలను ప్రస్తావించి వదిలేశాను. ఆ ఖాళీలను పూరించుకుంటూ వెళ్ళాలి. ఆపైన ఇతిహాసంనుంచి పురాచరిత్ర మీదుగా చరిత్ర కాలంలోకి-వర్తమానం వరకూ -రావాలన్నది నేను వేసుకున్న పథకం. ఇతిహాసం దగ్గరే తిరుగుతూ ఉంటే నా పూర్తి పథకంలోకి వెళ్ళడం ఆలస్యమవుతూ ఉంటుంది.

సరే, ఇదంతా నా బాధ. నా బాధను పాఠక ప్రపంచం బాధగా మార్చడం సబబు కాదు కనుక ఇక్కడితో వదిలేస్తాను.

మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగిన పరివర్తన గురించి, ఆ పరివర్తనను దాదాపు ప్రపంచ పురాణ కథలు అన్నీ ప్రతిఫలిస్తూ ఉండడం గురించి ఇంతకు ముందు పలు సందర్భాలలో రాశాను. మరిన్ని ఆసక్తికరమైన వివరాలను మహాభారత నేపథ్యంనుంచే చెప్పుకుందాం. ద్రౌపది జన్మవృత్తాంతం వాటిలో ఒకటి.

అంతకంటే ముందు, ఆమె తండ్రి ద్రుపదుడు, అతని మిత్రుడు ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతాలూ చెప్పుకోవలసినవే. సీతలానే ద్రౌపదిని ‘అయోనిజ’ (అంటే, స్త్రీ యోని నుంచి పుట్టనిది) అంటారని మనకు తెలుసు. ఆ మాటనే యథాతథంగా అన్వయించుకుంటే ద్రుపదుడు, ద్రోణుడు కూడా అయోనిజులే. అయినాసరే, సంప్రదాయం వారిని అయోనిజులని ఎందుకు అనలేదో తెలియదు.

ద్రౌపది తండ్రి ద్రుపదుడు. అతని తండ్రి పేరు పృషతుడు. పాంచాలరాజు అయిన పృషతుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అప్సరస అయిన మేనక పువ్వులు సేకరిస్తూ కనిపించింది. ఆమెను చూడగానే పృషతునికి స్కలనం జరిగింది. దానిని అతను తన పాదంతో కప్పాడు. అప్పుడు మరుత్తుల అంశతో దానినుంచి ద్రుపదుడు పుట్టాడు. పాదం నుంచి వచ్చాడు కనుక అతనికా పేరు వచ్చింది.

పృషతునికి భరద్వాజుడు మిత్రుడు. పృషతుడు తన కొడుకు ద్రుపదుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి తను పాంచాలరాజ్యాన్ని పాలించడానికి వెళ్లిపోయాడు. అంతకుముందు భరద్వాజునికీ పృషతునికి ఎదురైన అనుభవమే ఎదురైంది. అతను గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఓ రోజున గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఘృతాచి అనే అప్సరస జలక్రీడలాడుతూ కనిపించింది. ఆమెను చూడగానే భరద్వాజుడికి కోరిక కలిగింది. స్కలనం జరిగింది. దానిని అతను ఒక ద్రోణి(దొప్ప)లోకి తీసుకున్నాడు. దానినుంచి శుక్రుని అంశతో ఒక శిశువు పుట్టాడు. ద్రోణినుంచి పుట్టాడు కనుక అతనికి ద్రోణుడనే పేరు వచ్చింది.

పృషత, భరద్వాజులలానే ద్రుపద, ద్రోణులు కూడా మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకేచోట వేదాధ్యయనం చేసి, విలువిద్య నేర్చుకున్నారు. కొంతకాలానికి ద్రుపదుడు తండ్రి స్థానంలో పాంచాలరాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడనే మునివద్ద విలువిద్యలో మరింత ప్రావీణ్యం సంపాదించి ఆగ్నేయాస్త్రంతో సహా అనేక దివ్యాస్త్రాలు సంపాదించాడు. ఆపైన తండ్రి భరద్వాజుని ఆదేశంతో కృపుని చెల్లెలు అయిన కృపిని పెళ్లిచేసుకున్నాడు. వారికి అశ్వత్థామ అనే కొడుకు పుట్టాడు.

ఇక్కడ కృప, కృపిల జన్మవృత్తాంతం కూడా చెప్పుకోవాలి. వారు కూడా ‘అయోనిజు’లే. గౌతమ గోత్రీకుడైన శరద్వంతునికి కలిగిన కవలపిల్లలు వారు. శరద్వంతుడు పుడుతూనే శరసమూహంతో పుట్టాడు. వేదాధ్యయనాన్ని ఇష్టపడకుండా ధనుర్వేదం నేర్చుకున్నాడు. ఇంద్రుడు అతనికి భయపడ్డాడు. అతని తపస్సు చెరచమని చెప్పి ‘జలపది’ (మూలంలో ఈ మాట ‘జానపది’. దీనర్థం జానపదస్త్రీ. నన్నయ ఈ మాటను జలపదిగా మార్చాడు)అనే అప్సరసను పంపించాడు. ఆమెను చూడగానే శరద్వంతునికి స్కలనం జరిగింది. అది ఒక శరస్తంభం మీద రెండు భాగాలుగా పడింది. ఒక భాగం నుంచి మగ శిశువు, ఇంకో భాగం నుంచి ఆడశిశువు పుట్టారు.

శరద్వంతుడు ఆ ఆశ్రమాన్ని విడిచి మరో చోటికి వెళ్లిపోయాడు. అంతలో ఆ ప్రాంతానికి శంతనమహారాజు వేటకు వచ్చాడు. ఆ పిల్లలను చూశాడు. జాలి కలిగింది. వారిని హస్తినాపురానికి తీసుకెళ్లి కృపుడు, కృపి అనే పేర్లతో పెంచాడు. కొంతకాలానికి శరద్వంతుడు శంతనుని దగ్గరకు వచ్చి వారు తన సంతానమే నని చెప్పి, కృపునికి ఉపనయనం చేసి, వేదాలు, ధనుర్విద్య నేర్పించాడు. శంతనుని కొడుకైన భీష్ముడు కూడా కృపుని ఆదరంగా చూస్తూ కురుపాండవులకు విలువిద్య నేర్పడానికి నియోగించాడు.

కురుక్షేత్రయుద్ధంలో పాల్గొని కౌరవపక్షంలో ప్రాణాలతో మిగిలిన ముగ్గురు వీరులలో (మిగిలిన ఇద్దరు: అశ్వత్థామ, కృతవర్మ) కృపుడు ఒకడు. యుద్ధం తర్వాత ధర్మరాజు కూడా అతనిని వెనకటి ఉపాధ్యాయ పదవిలోనే నియమించాడు.

ద్రోణుడి విషయానికి మళ్ళీ వస్తే, కుటుంబ పోషణకు ధనం అవసరం కనుక ద్రోణుడు పరశురాముని దగ్గరకు వెళ్ళి యాచించాడు. ‘నా దగ్గర ఉన్నదంతా దానం చేసేశాను. అస్త్రశస్త్రాలు తప్ప ఏమీ లేవు. కావాలంటే వీటిని తీసుకో’’ అని పరశురాముడు అన్నాడు. అంతకంటే అత్యుత్తమ ధనం ఏముంటుందంటూ ద్రోణుడు సంతోషంగా వాటిని స్వీకరించాడు. అక్కడినుంచి తన బాల్యమిత్రుడు, పాంచాలరాజు అయిన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ స్నేహాన్ని గుర్తు చేశాడు. ద్రుపదుడు రాజ్యగర్వంతో అతన్ని తూలనాడాడు. ‘నీ స్థాయి మరచి మాట్లాడుతున్నావు. ఒక పేదబ్రాహ్మణునికీ, రాజుకీ స్నేహమేమిటి? ధనవంతుడితో దరిద్రుడికీ, పండితునితో మూర్ఖునికీ, వీరుడితో భీరుడికీ స్నేహం ఎలా సాధ్యమవుతుంది? స్నేహమైనా, వివాహమైనా సమానులతోనే సాధ్యం. అదీగాక రాజులకు మిత్ర, శత్రు సంబంధాలు అవసరాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. నీలాంటి పేద విప్రులతో రాజులకు అవసరార్థమైన స్నేహం ఎప్పుడూ కలగదు. కనుక వచ్చిన దారిని పో’ అన్నాడు.

ద్రోణుడు ఆ అవమానానికి తల ఎత్తుకోలేకపోయాడు. మారు మాట్లాకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. భార్యను, కొడుకునీ, అగ్నిహోత్రాన్నీ, శిష్యులనూ వెంటబెట్టుకుని హస్తినాపురం దారి పట్టాడు. అక్కడ అతనికి కురు, పాండవులతో పరిచయమైంది. వారు అతని గురించి భీష్ముడితో చెప్పారు. భీష్ముడు అతనికి ఆశ్రయమిచ్చి కురు, పాండవులకు అస్త్రశస్త్రాలు నేర్పడానికి నియోగించాడు.

విద్యాభ్యాసం ముగిసింది. గురుదక్షిణ చెల్లించే సమయం వచ్చింది. ద్రుపదుడు తనకు చేసిన అవమానం హృదయశల్యంగా మారి అన్నేళ్లుగానూ ద్రోణుని నొప్పిస్తూనే ఉంది. ప్రతీకార క్షణం కోసం అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. ద్రోణుని ఓడించి బంధించి ప్రాణాలతో తన ముందు నిలబెట్టడమే తన గురుదక్షిణ అని కురుపాండవులకు చెప్పాడు. కౌరవులు ఆ పని చేయలేకపోయారు. అర్జునుడి నాయకత్వంలో పాండవులు ద్రుపదుని అవలీలగా ఓడించి బంధించి ద్రోణుడి ముందు ఉంచారు. ద్రోణుడి పగ చల్లారింది. ములుకుల వంటి మాటలతో ద్రుపదుని కుళ్లబొడిచి విడిచిపెట్టాడు. అటు ద్రుపదుడు కూడా ద్రోణునిపై ప్రతీకారం తీర్చుకోడానికి తన ప్రయత్నాలు తనూ మొదలుపెట్టాడు.

ఇది ఆదిపర్వం, ఆరవ ఆశ్వాసంలో నన్నయ చెప్పిన కథ. కానీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ‘మహాభారత చరిత్రము’లో చెప్పిన ప్రకారం ద్రోణుడు ద్రుపదుని ఊరికే విడిచిపెట్టలేదు. పాంచాలరాజ్యంలో గంగకు ఉత్తరంగా ఉన్న అహిచ్ఛత్రాన్ని తనకు ఇచ్చే షరతు మీద విడిచిపెట్టాడు. అహిచ్ఛత్రానికి మాకంది రాజధాని. గంగకు దక్షిణంగా కాంపిల్య రాజధానిగా ఉన్న భాగమే ద్రుపదునికి మిగిలింది. ఆ విధంగా అహిచ్ఛత్రంపై అధికారం ద్రోణుడికి, అతని తర్వాత అతని కొడుకు అశ్వత్థామకు లభించింది. పెండ్యాలవారు ఏ సోర్సు నుంచి ఈ సమాచారం ఇచ్చారో చెప్పలేదు. నా దగ్గర ఆది సభారణ్యపర్వాలు ఉన్న సంస్కృత భారతం లేకపోవడంతో ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకునే అవకాశం కలగలేదు. అయితే, తిక్కన అనువదించిన భాగంలో కూడా పాంచాలరాజ్యంలో కొంత ప్రాంతానికి అశ్వత్థామ ఉత్తరాధికారి అన్న సూచన ఉంది. ఎన్నో ఆసక్తికర వివరాలు ఉన్న ఈ కోణాన్ని నా సర్పయాగ వ్యాసాలలో చర్చించాను. విస్తరణ భయం వల్ల ప్రస్తుతం అందులోకి వెళ్లను.

కాకపోతే ఒక్క విషయం చెప్పుకోవాలి. కురుక్షేత్రయుద్ధం కేవలం కురు,పాండవుల యుద్ధమేనని చాలామంది అనుకుంటారు. కానీ, ‘wheel within the wheel’ (చక్రంలో చక్రం) అన్నట్టుగా, అది ఇంకా అనేకమంది వ్యక్తులు, వర్ణాలు, తెగలు తమ పాత పగలు, కక్షలు తీర్చుకోడానికి సొంత అజెండాలతో అనుకూల పక్షంలో చేరి సాగించిన యుద్ధం. అందుకే అది ఆనాటి ప్రమాణాలలో ఒక మహాయుద్ధంగా పరిణమించి, ప్రజల మనసులలో ఒక బలమైన పురాస్మృతి గానూ, దేశాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిన ‘జలచ్ఛాయ’(watershed)గానూ మారినట్టు అనిపిస్తుంది. ఇటీవలి కాలానికి చెందిన రెండు ప్రపంచయుద్ధాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇది మరింత బాగా అర్థమవుతుంది. అసలు కేవలం కురుక్షేత్ర యుద్ధం గురించే చెప్పుకోవడం ప్రారంభిస్తే దానికదే ఒక ఉద్గ్రంథం అవుతుంది. ఆ పని ఇంతవరకు ఎవరైనా చేశారో(నవల, కథ, నాటకం లాంటి ప్రక్రియలను మినహాయిస్తే) లేదో తెలియదు. నాకైతే ఉత్సాహం అయితే ఉంది కానీ…ఏమో?!

Wheel within the wheel లాంటిదే ద్రోణ-ద్రుపదుల శత్రుత్వం కూడా!

ప్రస్తుతానికి వస్తే,‘అయోనిజు’ల జాబితాలో ద్రౌపది మొదలైనవారే కాక ద్రుపదుడు, ద్రోణుడు, కృపుడు, కృపి కూడా చేరినట్టు పై కథనాలు చెబుతున్నాయి. నిజానికి ఈ జాబితా ఇంకా చాలా పెద్దది. వశిష్టుడు, అగస్త్యుడు, శుకుడు, ఋష్యశృంగుడు మొదలైనవారు కూడా ఇందులోకి వస్తారు. ఇక్కడ కూడా గతంలో చెప్పుకున్నట్టు, మహిమతో కూడిన ‘దేవధర్మా’న్ని, మహిమలేవీ లేని ‘మనుష్యధర్మా’న్ని కలగలపడం కనిపిస్తుంది. ఉదాహరణకు, ద్రోణుడు, ద్రుపదుడు యోని సంబంధం లేకుండా వీర్యం నుంచే పుట్టినట్టు కథకుడు చెప్పాడు. అయితే, ద్రోణుడు కృపిని పెళ్లి చేసుకుని సహజపద్ధతిలోనే ఆమె ద్వారా అశ్వత్థామను పొందాడు. ద్రుపదుడు కూడా మనుష్య ధర్మం ప్రకారమే కోకిలాదేవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి సహజపద్ధతిలో సంతానం కలిగిందా లేదా అన్న వివరంతో కథకు సంబంధం లేదు. ఒక ప్రత్యేకమైన ఆకాంక్షతో ద్రుపదుడు సంతానంగా పొందిన ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మాత్రమే కథకు అవసరమయ్యారు కనుక వారి గురించే మనకు తెలుసు.

ravi_varma-draupadi_carrying_milk_honey1

‘అయోనిజు’ లన్న ఒక్క అంశాన్ని పక్కన పెడితే, మిగిలిన వివరాలు; అంటే, ద్రోణుడు ద్రుపదుని ధనసాయాన్ని కోరడానికి వెళ్ళడం, అతడు అవమానించడం, ద్రోణుడు హస్తినాపురాన్ని ఆశ్రయించడం, వారి మధ్య పగ, ప్రతీకారం, యుద్ధం వగైరాలు అన్నీ మన సాధారణ బుద్ధికీ, తర్కానీకీ అందే మనుష్య స్వభాన్నీ, లేదా మనుష్య ధర్మాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే, దేవ, మనుష్య ధర్మాలను కలగపడంతోనే వస్తుంది చిక్కు. పూర్తిగా దేవధర్మాన్నో, లేదా మనుష్యధర్మాన్నో కథకు ఆపాదిస్తే మనం అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఆ రెండింటినీ కలగలిపినప్పుడు, అందులో కథకుడికి ఏదో వ్యూహం ఉందన్న అనుమానం కలగడం, అతడు దేనినో మరుగుపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడనిపించడం సహజం.

ప్రస్తుత సందర్భంలో అదేమిటని ప్రశ్నించుకుంటే, సంతానం కలగడానికీ, యోనికీ ఉన్న సంబంధాన్ని అతడు మరుగుపరుస్తున్నాడు. సంతానం కలగడానికి యోని సంబంధం అవసరం లేదనీ, పురుషుని వీర్యం నుంచే నేరుగా సంతానం కలగడం సాధ్యమేననీ అతడు చెబుతున్నాడు. నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఆనాడే ఉందనడానికి నిదర్శనంగా కొందరు దీనిని అత్యుత్సాహంతో సమర్థించవచ్చు. కానీ టెస్ట్ ట్యూబ్ ప్రక్రియలో కూడా పురుష శుక్ల, స్త్రీ శోణితాల మధ్య కలయిక తప్పనిసరి. కానీ, ద్రోణుడు, ద్రుపదుల పుట్టుకలో ఆ కలయిక ఉన్నట్టు కథకుడు చెప్పడం లేదు.

ఇంతకీ ఇలా యోని సంబంధాన్ని పరిహరించడంలో కథకుని ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న వేసుకుంటే, రెండు సమాధానాలు స్ఫురిస్తాయి. మొదటిది, పృషతుడు, భరద్వాజుడు, శరద్వంతుడు మొదలైనవారు సంతానం కన్నది తక్కువ సామాజిక స్థాయి కలిగిన స్త్రీ ద్వారా కావచ్చు. వారు ఆటవిక, గిరిజన తెగలకు చెందినవారో, జానపదులో కావచ్చు. గంగ, సత్యవతి మొదలైన వారిని ఉదహరించుకుంటే ఇలాంటి సంబంధాలు; నదీ తీరాలు, ఇతర జలవనరుల తావులు లైంగిక క్రీడా స్థలాలు అయిన దశకు చెందినవి కావచ్చు. కోశాంబీ దీని గురించి ఇచ్చిన సమాచారాన్ని మరో సందర్భానికి వాయిదా వేస్తాను.

ఇక రెండో సమాధానానికి వస్తే, సంతానం కనడానికి యోని సంబంధం…ఆ మాటకొస్తే అసలు స్త్రీ సంబంధమే అవసరం లేదని కథకుడు చెప్పదలచుకున్నాడు. అంటే అతను మాతృస్వామ్యం మీద పితృస్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్నాడు. స్త్రీకి మాత్రమే సాధ్యమయ్యేదీ, పురుషుడికి సాధ్యం కానిదీ, సంతానాన్ని కనడం! ఆ తేడా పురుషుని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. పురుషునికి కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెబితే తప్ప మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయం సంపూర్ణం కాదు. కథకుడు అదే చేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సందర్భాన్ని అతడు పై కథలలోని పురుషుల న్యూన స్త్రీ సంబంధాన్ని కప్పి పుచ్చడానికి కూడా వాడుకుంటున్నాడు.

పురుషునికి కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పే ప్రయత్నం ఎంతవరకు వెళ్ళిందంటే, అందుకు యోని సంబంధమే కాక, వీర్యసంబంధం కూడా అవసరం లేదని చెప్పేవరకూ!

ఉదాహరణకు,‘సంకల్ప’ మాత్రంగానో, లేక మనసునుంచో సృష్టి చేసినట్టు చెప్పే కథలు కనిపిస్తాయి. బ్రహ్మ మానసపుత్రులుగా మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు పుట్టారనీ; మరీచికి కశ్యప ప్రజాపతి పుట్టాడనీ, కశ్యపుని వల్ల చరాచరప్రాణులన్నీ పుట్టాయనీ ఆదిపర్వం తృతీయాశ్వాసం చెబుతోంది. అదెలాగంటే, బ్రహ్మ కుడి బొటనవేలి నుంచి మళ్ళీ దక్షుడు; ఎడమ బొటన వేలి నుంచి ధరణి అనే స్త్రీ పుట్టారు. వారిద్దరికీ అనేక మంది కొడుకులు పుట్టి సాంఖ్యయోగాభ్యాసంతో మోక్షం పొందారు. ఆ తర్వాత దక్షుడికీ, ధరణికీ యాభైమంది కూతుళ్ళు మాత్రమే కలిగారు. కొడుకులు లేకపోవడంతో దక్షుడు కూతుళ్లకే పుత్రీకరణ చేసి వారిలో పది మందిని ధర్ముడనే మనువుకీ, ఇరవయ్యేడుమందిని చంద్రుడికీ, పదముగ్గురిని కశ్యపునికీ ఇచ్చాడు. వారి నుంచి మొత్తం జీవులన్నీ పుట్టాయి.

ఇందులో గణసమాజ కోణం నుంచి చెప్పుకోవలసిన విలువైన సమాచారం చాలా ఉంది. ప్రస్తుతానికి దానిని అలా ఉంచితే, ఇందులోని ప్రారంభ వివరాలు పురుషుడి ముఖంగానే సృష్టి జరిగినట్టు, పురుషులే ముందు పుట్టినట్టు చెబుతున్నాయి. అయితే, సృష్టి చేయడంలో స్త్రీ పాత్రను పూర్తిగా నిరాకరించే అవకాశమూ లేదు. కనుక రెండవ దశలో స్త్రీని తీసుకొస్తున్నాయి. ఆ స్త్రీ కూడా మళ్ళీ బ్రహ్మ ఎడమ బొటన వేలి నుంచే పుట్టింది.

విశేషమేమిటంటే, ఇలా పురుషుడి ద్వారానే సృష్టి జరిగిందని చెప్పడం మన పురాణ, ఇతిహాస కథలలోనే కాక ఇతర పురాణ, ఇతిహాస కథలలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకు, క్రీ.పూ. 9వ శతాబ్దికి చెందిన యెహోవా సృష్టి గాథ ఇలా ఉంటుంది:

యెహోవా భూమినీ, ఆకాశాన్నీ సృష్టించాడు. అయితే వర్షం కురిపించకపోవడంతో భూమిమీద మొక్కలు, మూలికలు మొలకెత్తుకు రాలేదు. భూమిని దున్నడానికి మనిషీ పుట్టలేదు. అయితే, భూమిలోంచి ఒక పొగమంచు పైకివచ్చి నేలను తడిపింది. ఆ మట్టిలోంచి యెహోవా మనిషిని సృష్టించాడు. అతని ముక్కుపుటాలలోకి ప్రాణాన్ని ఊదాడు. అప్పుడు మనిషి ప్రాణిగా మారాడు. ఆ తర్వాత యెహోవా తూర్పు దిక్కున ఈడెన్ లో ఉద్యానవనాన్ని ప్రతిష్టించాడు. మనిషిని అందులో ఉంచాడు. చూడడానికి ఆహ్లాదం గొలుపుతూ, మంచి ఆహారాన్ని అందించే ప్రతి చెట్టునూ, మొక్కనూ అందులో సృష్టించాడు. వాటి మధ్యలో రెండు వృక్షాలను కల్పించాడు, ఒకటి, జీవ వృక్షం; రెండవది, మంచి, చెడులకు చెందిన జ్ఞానవృక్షం. ఆ ఉద్యానవనానికి నీరు అందించడానికి ఒక నదిని సృష్టించాడు. ఆ నది మళ్ళీ నాలుగు నదులుగా చీలింది. మనిషిని ఆ ఉద్యానవనంలో ఉంచిన యెహోవా, దానిని జాగ్రత్తగా సంరక్షిస్తూ సాగు చేస్తూ ఉండమన్నాడు. అయితే ఒక హెచ్చరికా చేశాడు. ఈ ఉద్యానవనంలోని ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు స్వేచ్ఛగా తినచ్చు కానీ, జ్ఞానవృక్ష ఫలాన్ని మాత్రం తినద్దనీ, తింటే మరణిస్తావనీ అన్నాడు.

ఆ తర్వాత యెహోవా మనిషికి సాయపడడానికి జంతువులను సృష్టించాడు. ఇంతా చేశాక అతనికి మంచి తోడు లేదన్న సంగతిని గమనించి అతనికి గాఢనిద్ర ఆవహిల్లేలా చేశాడు. అతని పక్కటెముక నొక దానిని తీసి, ఆ తీసిన ప్రదేశాన్ని మాంసంతో పూరించి, పక్కటెముకను స్త్రీగా మార్చి అతనికి తోడుగా ఇచ్చాడు.

ఆ తర్వాత వారు నిషిద్ధ ఫలాన్ని ఆరగించి ‘పతనం’ కావడం, వారికి సంతానం కలగడం సంభవించాయి.

ఈ కథ కూడా మొదట పురుష ముఖంగానే సృష్టి జరిగినట్టు చెబుతూ, స్త్రీని ఆ తర్వాత ప్రవేశపెడుతోంది.

మిగతా విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

 

విష్టరాగ్ని కన్యలూ…విస్టాల్ వర్జిన్సూ…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

అజ్ఞానం అనను కానీ, జ్ఞానశూన్యత రకరకాలుగా ఉంటుంది. అలాంటిదే విశ్వాసం కూడా. మందిలో ఒకడిగా జీవించడానికి మనం జ్ఞానశూన్యతనో, విశ్వాసాన్నో నటించడం కూడా ఒక నిత్యావసరంగా మారుతూ ఉంటుంది. రాంభట్లగారు అప్పుడప్పుడు చెబుతూ వచ్చిన పాఠాలలో అది ఒకటి. ‘మనకు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు, దృక్పథాలు ఉన్నాసరే, మందికి మరీ దూరంగా ఉన్నట్టు కనిపించకూడదు. మంది గొంతును అనుకరిస్తూ ఉండాలి. వాళ్ళలో కలసిపోవాలి’ అంటూ తన జీవితం నుంచే ఉదాహరణలు ఇస్తూ ఉండేవారు. అందులో ఎంతైనా వాస్తవం ఉందని అనిపించేది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ మెళకువ నాకు పట్టుబడిందని చెప్పలేను. నావరకూ ఎందుకు, రాంభట్లవారే తన పాఠాన్ని తను ఎంతవరకు జీర్ణించుకున్నారో అనుమానమే.

దేశాలు, సంస్కృతుల మధ్య విపరీతమైన తేడాలను ఊహించుకోవడమూ; తన దేశం లాంటి దేశం, తన సంస్కృతి లాంటి సంస్కృతి మరెక్కడా లేదనుకోవడమూ జ్ఞానశూన్యతకు ఒకానొక ఉదాహరణగా నాకు కనిపిస్తుంది. కొన్ని కొన్ని ప్రత్యేకపరిస్థితులలో అలా అనుకోవలసిన అవసరం ఏర్పడుతుందని నేను కూడా అంగీకరిస్తాను. అయితే ఒక అవసరాన్ని జ్ఞానశూన్యత స్థాయికి సాగదీయడంలోని ఔచిత్యమే ప్రశ్నార్థకం అవుతుంది.

పురాచరిత్రలోకి వెళ్ళినకొద్దీ దాదాపు ప్రపంచమంతా ఒకే సంస్కృతిని పంచుకుందనడానికి ఆధారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఒక్క అగ్నినే తీసుకుంటే, అగ్నిహోత్రాలు, అగ్నికార్యాలు, అగ్నిసాక్షులు, యజ్ఞాలు మన ఒక్క సంస్కృతిలోనే ఉన్నాయని మనలో చాలామంది అనుకుంటారు. కానీ ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా అగ్ని అతని జీవితంలో ఒకే విధమైన పాత్ర నిర్వహించింది. ఒకేవిధమైన పవిత్రతకు సంకేతంగా నిలిచింది.

అగ్ని గురించే చెప్పుకోవడం ప్రారంభిస్తే, పైకి తేలదానికి కనీసం ఓ పది వ్యాసాల వ్యవధి పడుతుంది. కనుక కొన్ని విశేషాలకే ప్రస్తుతం పరిమిత మవుతాను. అమెరికా ఆదివాసీ తెగ అయిన ఇరాక్యూల గురించి, వారి సమాఖ్య పనితీరు గురించీ మోర్గాన్ అందించిన సమాచారం ఇలా ఉంటుంది:

పక్క పక్కనే ఉన్న బంధుగణాలు పరస్పర రక్షణ కోసం సమాఖ్యలుగా ఏర్పడేవి (మనం ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్నట్టు గణాలు కొన్ని కలసి వ్రాతంగా ఏర్పడడం లాంటిదే ఇది కూడా). ఉత్తర అమెరికాను కనుగొనే నాటికి వివిధ ప్రాంతాలలో అనేక సమాఖ్యలు ఏర్పడి ఉన్నాయి. అలా సమాఖ్యలుగా ఏర్పడడం మేధా పరిణతికి సూచన. వీటిలో ఇరాక్యూ సమాఖ్య ఒకటి, అది అయిదు స్వతంత్ర తెగలతో ఏర్పడింది. ఈ అయిదు తెగలూ ఒకే ప్రభుత్వం కింద సమాన ప్రతిపత్తితో ఉంటాయి. తెగలు తమ ప్రతినిధులుగా కొందరిని ఎన్నుకుంటారు. వారిని ‘శాకెమ్’ అంటారు. సమాఖ్యలో శాకెమ్ లు యాభైమంది వరకూ ఉంటారు. అవసరమైనప్పుడు ఆయా నిర్ణయాలు చేయడానికి వీరందరూ సమావేశమవుతూ ఉంటారు. ఒక్కో తెగ, వంతుల వారీగా ఆ సమావేశనిర్వహణ బాధ్యత తీసుకుంటుంది.

ఒకటి, రెండు రోజుల ముందే శాకెమ్ లు అంతా తమ సహాయకులతో వచ్చి సమావేశస్థలానికి దూరంగా మకాం చేస్తారు. సమావేశ బాధ్యత తీసుకున్న తెగ శాకెమ్ లు పొద్దుటే వచ్చి వారిని పలకరించి వెడతారు. సమావేశం రోజున శాకెమ్ లు అందరూ చర్మం దుస్తులు ధరించి ఓ కట్టెల కట్ట చేత్తో పుచ్చుకుని సమావేశస్థలానికి వస్తారు. అక్కడ వారికి సమావేశాన్ని నిర్వహించే తెగవారు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అంతా వలయంగా నిలబడతారు. సమావేశాన్ని నిర్వహించే శాకెమ్ తూర్పు దిక్కున నిలబడతాడు. మిగిలిన శాకెమ్ లు మిగిలిన దిక్కుల్లో నిలబడతారు. ఆ తర్వాత శాకెమ్ లు అందరూ ఉత్తరం నుంచి ప్రారంభించి మూడుసార్లు ఆ వలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. సమావేశ నాయకుడు మళ్ళీ తూర్పున తన స్థానంలో నిలబడతాడు. తన చేతిలో ఉన్న కట్టెల కట్టను వలయంలో తన ముందు ఉంచుతాడు.

ఉత్తరం నుంచి ప్రారంభించి మిగిలిన శాకెమ్ లు కూడా అదే చేస్తారు. మళ్ళీ అదే క్రమంలో తాము తెచ్చుకున్న చర్మాన్ని కిందపరచి దాని మీద కూర్చుంటారు. అప్పుడు నాయకుడు లేచి తన సంచిలోంచి రెండు కట్టెలు, ఇంత పీచు తీసి కట్టెలను రాపాడించి నిప్పు చేస్తాడు. వలయంలో అడుగుపెట్టి తను ఇంతకుముందు ఉంచిన కట్టెలకు నిప్పు ముట్టిస్తాడు. ఆ తర్వాత ఆ కట్టెలతో మిగిలిన శాకెమ్ లు ఉంచిన కట్టెలకు కూడా నిప్పు ముట్టిస్తాడు. ఆయన సంజ్ఞ చేయగానే ఆయనతోపాటు శాకెమ్ లు అందరూ మళ్ళీ మూడుసార్లు అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి, ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణం కూడా చేసి తమ తమ స్థానాలలో నిలబడతారు.

తాము అందరం పరస్పర స్నేహ అభిమానాల వెచ్చదనాన్ని పంచుకున్నామనీ; సమావేశాన్ని ఎంతో ఆత్మీయంగా, ఐకమత్యంగా జరుపుకుంటామనీ చెప్పడం ఈ మొత్తం తతంగానికి అర్థం. ఇందులో రెండు కట్టెలను రాపాడించి నిప్పు చేయడమే చూడండి. అగ్గిపెట్టెల వంటి సాధనాలు లేని కాలంలో నిప్పు చేసే పద్ధతి అది. దానిని మనవాళ్లు అరణి అంటారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వారికి ఎదురై, తన అరణి(నిప్పు చేయడానికి ఉపయోగించే కొయ్యలు)ఒక లేడి కొమ్ములకు చిక్కుకుందనీ, అది పారిపోయిందనీ, దాంతో తను అగ్నికార్యం చేయలేకపోతున్నాననీ, ఆ లేడిని పట్టుకుని నా అరణిని నాకు ఇవ్వవలసిందనీ అడుగుతాడు.

pix02

అనంతర కాలాలలో ఆయా పనులు సులువుగా చేయడానికి సాయపడే కొత్త కొత్త పరికరాలు ఎన్ని వచ్చినా తద్దినాలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాలలో పురాకాలం నాటి పరికరాలనే ఇప్పటికీ వాడడం చూస్తూ ఉంటాం. నిన్న మొన్నటి వరకు (బహుశా కొన్ని చోట్ల ఇప్పటికీ) యజ్ఞాలు మొదలైన వాటిలో శ్రోత్రియులు అరణి మథించి నిప్పు చేసేవారు. అంటే, పురాసామగ్రి కూడా విశ్వాసంలో భాగమైపోయిందన్నమాట.

ఇక మన పురాణ, ఇతిహాసాలనుంచి అగ్ని ప్రాధాన్యాన్ని ఎత్తి రాయడం ప్రారంభిస్తే దానికి అంతే ఉండదు. అగ్నిసాక్షిగా స్నేహాలు, పరిణయాల గురించి చెప్పనే అవసరం లేదు. రామాయణంలో రాముడు, వానరరాజు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహం చేస్తారు. ఇంతకు ముందు చెప్పుకున్న అంగారపర్ణుని కథలో, పాండవుల వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేకపోవడంతో వారిని క్షత్రియులుగా గుర్తించలేకపోయానని అంగారపర్ణుడు అంటాడు. కురుక్షేత్ర యుద్ధ శిబిరాలలో కూడా బ్రాహ్మణ, క్షత్రియవీరులు రోజూ ఉదయమే అగ్నికార్యం చేసేవారని భైరప్ప తన ‘పర్వ’ నవలలో రాశారు. ఆర్యులు బళ్ళమీద అగ్నిహోత్రాన్ని పెట్టుకుని మరీ కైబర్-బొలాన్ కనుమల మీదుగా భారతదేశంలోకి అడుగుపెట్టారని శ్రీపాద అమృత డాంగే రాశారు.

ఎలాగూ మోర్గాన్ ను ప్రస్తావించుకున్నాం కనుక, కాస్త పక్కదారి పడుతున్నట్టు అనిపించినా సరే ఒక అంశాన్ని మీతో పంచుకోవాలన్న ఉత్సాహం కలుగుతోంది,
కొన్నేళ్ళ క్రితం టీవీలో ప్రసారమైన ఒక తమిళ డబ్బింగ్ సినిమా నాలో ఎంతో ఆసక్తిని రేపింది. దాని పేరు ‘అఖండుడు’. విక్రమ్ అందులో హీరో. అదేదో ఆర్ట్ సినిమా అనుకుంటారేమో, కాదు. నూటికి నూరు పాళ్ళు కమర్షియల్ మసాలా దట్టించిన సినిమా. అందులో నన్ను ఆకర్షించినవి రెండు: మొదటిది, బంగారం పని చేసే ఒక విశ్వబ్రాహ్మణుని కుటుంబనేపథ్యంతో ఆ సినిమా కథ అల్లడం. హీరో ఆ కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబ వాతావరణాన్ని, వారి సెంటిమెంట్లతో సహా అతి సహజంగా దర్శకుడు రవి కుమార్ కళ్ళకు కట్టించాడు. నేను గమనించినంతవరకు తమిళ సినిమాలు అన్నింటిలో ఈ నేటివిటీ టచ్ తప్పనిసరిగా ఉంటుంది. తెలుగు సినిమాలలో అది కనిపించదు. సరే, ఇది సినిమాలకు సంబంధించిన చర్చ కాదు కనుక వదిలేద్దాం.

ఇక నన్ను ఆకర్షించిన రెండో విషయానికి వస్తాను. హీరో జనాన్ని కాల్చుకుతినే ఒక రాజకీయనాయకుని చంపేస్తాడు. అతన్ని జైల్లో పెట్టి విచారణ ప్రారంభిస్తారు. అతను హత్య చేసిన సంగతిని పోలీసులు నిరూపించలేకపోతారు. దాంతో అతన్ని విడుదల చేస్తారు. విడుదలై అతను ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి ముందు పీట వేసి దానిమీద అతనిని కూర్చోబెట్టి తల్లి, తండ్రి అతని తలకు చమురు పెడతారు. తర్వాత తల్లి అతనికి అభ్యంగన స్నానం చేయిస్తుంది.

ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు అందులో నాకు లీలగా గణసమాజం తాలూకు అవశేషం తోచింది కానీ అదేమిటన్నది తెలియలేదు. ఆ తర్వాత మోర్గాన్ ‘పురాతన సమాజం’ లో రాసిన వాక్యాలు చదవగానే ఆశ్చర్యపోయాను. గ్రీకు గణసమాజంలోని ఫ్రాట్రే(ఇది మనం చెప్పుకున్న వ్రాతం లాంటిది), తెగ, జాతి గురించిన ప్రకరణంలో ఐస్కలస్ అనే అతను రాసిన ‘యూమెనాయిడ్స్’ అనే రచనను మోర్గాన్ ప్రస్తావించాడు. అందులో ఒరెస్టస్ అనే అతను తల్లిని చంపుతాడు. అతనికి శిక్ష పడకుండా చూడడానికి అతని ఫ్రాట్రే ప్రయత్నిస్తుంది. ఒక వ్యక్తి విరోధి గణానికి చెందిన ఎవరిపైన అయినా ప్రతీకారం తీర్చుకుంటే, అతనిని శిక్షనుంచి తప్పించే బాధ్యత అతని గణానిది, లేదా ఫ్రాట్రేదే. అది గణసమాజ నీతి.

‘ఒకవేళ ఒరెస్టస్ శిక్ష తప్పించుకుంటే అతని మీద ప్రోక్షించడానికి, అంటే శుద్ధిస్నానం చేయించడానికి ఫ్రాట్రే వద్ద నీళ్ళు సిద్ధంగా ఉన్నాయా?’ అని ఎరిన్సిస్ అనే వ్యక్తి ఆ సందర్భంలో అడుగుతాడు.

ఐస్కలస్ రాసిన ఆ ‘యూమెనాయిడ్స్’ అనే ఆ రచన ఏమిటో, ఒరెస్టస్ తల్లిని ఎందుకో చంపాడో తెలుసుకోడానికి ఇంటర్నెట్ గాలించాను. దొరకలేదు. కానీ, ప్రస్తుత సందర్భానికి ఎరిన్సిన్ అడిగిన ప్రశ్న ఒక్కటి చాలు. శిక్ష తప్పించుకున్న నేరస్తుని శుద్ధిస్నానం చేయించాలని అది చెబుతోంది. ఇరవయ్యొకొటో శతాబ్దిలోని ఒక తమిళ సినిమా దానినే చూపిస్తోంది. అంటే, గ్రీకు గణసమాజానికే కాకుండా బహుశా మొత్తం గణసమాజాలు అన్నింటికీ చెందిన ఒక పురాతన ఆచారాన్ని ఆ సినిమా వెల్లడిస్తోంది. గణసమాజపు ఆచారాల గురించిన పూర్తి అవగాహనతో ఆ సినిమా దర్శకుడు ఆ సన్నివేశాన్ని చిత్ర్రించి ఉండకపోవచ్చు. అప్పటినుంచీ ఇప్పటివరకూ కొనసాగుతున్న ఆ ఆచారాన్ని అతను సమాజం నుంచే తీసుకుని ఉండవచ్చు. అయినా ఆ చూపును అభినందించాల్సిందే.

గణసమాజ లక్షణాలు తమిళులలో మరింత ఎక్కువ పదిలంగా ఉన్నాయని రాంభట్ల కూడా అంటారు. ఎక్కువా, తక్కువా అన్నది అలా ఉంచితే, మన దేశం లాంటి తూర్పు దేశాలలోనే కాక, పాశ్చాత్య సమాజాలలోనూ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక మాట అంటే షాకింగ్ గా ఉండచ్చు. భాషలో, నుడికారంలో, పెళ్లిళ్లు, శ్రాద్ధాల వంటి తతంగాలలో వేదకాలపు గణ సమాజలక్షణాలను మనం నిలుపుకున్నట్టే; పాశ్చాత్యులు కూడా కొన్నింటిలో నిలుపుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పాశ్చాత్యుల ఆయా సందర్భాలలో పాటించే ఆచారాలను, అలవాట్లను గమనిస్తే; మనతో సమానంగా వారు కూడా వేదకాలపు సంస్కృతిని పంచుకుంటున్నారని అర్థమవుతుంది. సంస్కృతుల మధ్య మనం గీసుకునే గీతలు చెరిగిపోవడం కళ్ళకు కడుతుంది.

ఈ పోలికలకు సంబంధించి ఇప్పుడు మరీ ఎక్కువ వివరాలలోకి వెళ్ళను. ఒకటి చెప్పాలంటే, ‘బార్బెక్యూ’. అది వేదకాలం నుంచీ కొనసాగుతున్న సాముదాయిక విందు కార్యక్రమం. దానిని ‘శూలమాంసం’గా రాంభట్ల పేర్కొన్నారు.

అమెరికాలో ఇళ్లముందు బార్బెక్యూ పొయ్యిలు ఇప్పటికీ కనిపిస్తాయి. దగ్గరలోని అడవుల్లోకో, తోటల్లోకో వెళ్ళి బార్బెక్యూ చేసుకోవడం కనిపిస్తుంది. Margaret Mitchell రాసిన ఐతిహాసిక నవల (1936) GONE WITH THE WIND 1860ల నాటి అమెరికా అంతర్యుద్ధాన్ని, దాని అనంతర పరిస్థితులను చిత్రిస్తుంది.

అందులోని నాయిక స్కార్లెట్ బార్బెక్యూకు వెళ్ళినప్పుడే తను కోరుకున్న యువకుని నుంచి ప్రేమ తిరస్కారానికి గురవుతుంది.

రచయిత్రి ఇలా రాస్తుంది:

They crossed the river and the carriage mounted the hill. Even before Twelve Oaks came into view Scarlett saw a haze of smoke hanging hazily in the tops of the tall trees and smelled the mingled savory odors of burning hickory logs and roasting pork and mutton.
The barbecue pits, which had been slowly burning since last night, would now be long troughs of rose-wood embers, with the meats turning on spits above them and the juices trickling down and hissing into the coals.

మాంసభోజన ప్రియులనే కాక, మద్యప్రియులను కూడా అలరించే సందర్భం బార్బెక్యూ. యవ్వనారంభంలో ఉన్న యువతీ, యువకుల్లో ప్రేమలూ, మోహాలూ పురివిప్పి నర్తించే సందర్భం కూడా. ‘న్యూ వరల్డ్’ గా చెప్పుకునే అమెరికాలో అతి పురాతనమైన వేదకాలపు ఒక ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతున్న ఆ దృశ్యం ఒక్కసారిగా మనల్ని వేల సంవత్సరాల గతంలోకి తీసుకువెళ్లి ఆశ్చర్యచకితం చేస్తుంది. యూరోపియన్ల ద్వారానే ఈ ఆనవాయితీ అమెరికాకు బదిలీ అయిన సంగతి తెలుస్తూనే ఉంది. అదలా ఉంచితే, యూరోపియన్లకు వేదకాలపు సంస్కృతితో సంబంధముందనని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది.

వేదకాలపు జనానికి కూడా రకరకాల అగ్నులతో పరిచయముంది. వాటికి వారు పేర్లు పెట్టారు. ఉదాహరణకు, అగ్నిపర్వతాలనుంచి వెలువడే అగ్ని ‘పర్వతీయాగ్ని’. అగ్నిపర్వతం నుంచి ప్రవహించే లావా ‘సరస్వతీయాగ్ని’. నేల నెర్రెలలోంచి వెలువడే అగ్ని ‘మహీయాగ్ని’. అడవుల్లో రాజుకునే అగ్ని ‘వానస్పత్యాగ్ని’. పిడుగుపాటు వల్ల పుట్టే అగ్ని ‘వైద్యుతాగ్ని’. తాత్కాలికంగా బస చేసిన చోట వేసే నెగడు ‘వాసతేయాగ్ని’.

వీటిలో వాసతేయాగ్ని మినహా మిగిలినవి ప్రకృతి సిద్ధంగా సంభవించే అగ్నులు కాగా; జనం వినియోగించే అగ్నిని మళ్ళీ మూడు రకాలుగా విభజించారు. వాటిలో మొదటిది గార్హస్పత్యాగ్ని. ఇది గృహస్థులు ఇంట్లో ప్రతిష్టించుకునే అగ్ని. రెండవది, ఆహవనీయాగ్ని. వసంతారంభంలో ఊరి బయట వెలిగే అగ్ని ఇది. మూడవది దక్షిణాగ్ని. దీనికే ‘విష్టరాగ్ని’ అని కూడా పేరు. ‘విష్’ అంటే మహాజనం అని అర్థం. ఇది సాముదాయిక అగ్ని అన్నమాట. ఈ మూడింటికీ త్రేతాగ్నులని పేరు.

విష్టరాగ్నిని ఆరకుండా కాపాడే బాధ్యత కన్యలది. అందుకే వారిని విష్టరాగ్నికన్యలు అన్నారు. అగ్ని ఆరాధకులైన పారసీకులకు విష్టరాగ్ని దేవాలయాలు ఉంటాయి. విశేషమేమిటంటే, యూరప్ లో ఇటలీలో కూడా విష్టరాగ్ని దేవాలయాలు ఉండేవి. ఈ అగ్నిని కాపాడే కన్యలను వారు ‘విష్టాల్ వర్జిన్స్’ అన్నారు. ఈ విష్టాల్ శబ్దంలోని విష్ అనే మాట వేదకాలపు సంస్కృతంతో యూరప్ కు ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది.

Sir James Frazer రాసిన The Golden Bough ప్రకారం, ఇటలీలో నేమి అనేచోట డయానా అనే దేవతను పూజిస్తారు. ఆమెకే ‘విష్టా’ అని కూడా పేరు. ఆమెకు జరిపే పూజా తతంగంలో అగ్నికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. ఏటా ఆగస్టు 13న ఆ దేవతకు ఉత్సవం జరుగుతుంది. అది వేసవి సమయం. ఆ దేవాలయం ఉన్న తోపు అంతటా స్త్రీలు దీపాలు వెలిగిస్తారు. చర్చిలో కొవ్వుత్తులు వెలిగించే ఆనవాయితీకి ఇదే మూలం కావచ్చు. ఆ రోజున ఇళ్ళలో కూడా అగ్నిహోత్రం దగ్గర పూజా తంతు జరుపుతారు. డయానా దేవతకు ఉన్న విష్టా అనే పేరు, ఆమె ఆలయంలో నిరంతరం పవిత్రాగ్ని వెలుగుతూ ఉండడాన్ని సూచిస్తుంది. దేవాలయానికి ఈశాన్యంగా గుండ్రని నిర్మాణం ఉంటుంది. డయానాను విష్టా రూపంలో ఇక్కడ పూజిస్తారు. ఇక్కడి పవిత్రాగ్నిని విష్టాల్ వర్జిన్స్ ఆరకుండా కాపాడుతూ ఉంటారు. ఇది అనాది కాలం నుంచీ నిన్న మొన్నటివరకూ ఉన్న ఆచారం.

యూరప్ ఉత్తరభాగమైన లేప్లాండ్ లో విష్టరాగ్ని కన్యలు నేడు కూడా కనిపిస్తారని రాంభట్ల అంటారు. అది ధ్రువప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కనుక, రాత్రులు కనిపించని దీర్ఘవసంతం ఉంటుంది. వసంతారంభానికి ముందు ఇళ్లలోని అగ్నిని, అంటే గార్హస్పత్యాగ్నిని ఆర్పేస్తారు. ఆ తర్వాత కన్యలు అరణి మథించి నూతనాగ్నిని చేస్తారు. అదే విష్టరాగ్ని. ఊళ్ళో అంతా ఆ అగ్నిని తీసుకువెళ్లి గార్హస్పత్యాగ్నిని వెలిగించుకుంటారు. ఇక ఊరి బయట ఆహవనీయాగ్ని వెలిగినంతకాలం కన్యలు గాంధర్వ సంబంధాలు పాటిస్తారు. అందువల్ల వాళ్ళ కన్యాత్వానికి భంగం కలగదు. వసంతంలో అంతా ఆరుబయటే భోజనాలూ, విహారాలు సాగించే ఆ కాలాన్నే వేదాలు యజ్ఞ ఋతువు అన్నాయని రాంభట్ల వివరణ. మంచుపడే ప్రదేశాలలో ఆరుబయట సాగించే ఆ జీవనంలో భాగమే బార్బెక్యూ కూడా. మన దగ్గర కూడా కార్తీక మాసంలో వనభోజనాలు ఉన్నాయి.

గ్యాస్ పొయ్యిలు వచ్చిన ఈ రోజుల్లో సంగతి ఏమో కానీ, కట్టెలు, బొగ్గులు వాడిన రోజుల్లో శ్రోత్రియ కుటుంబాలలోనూ, ఎంతో కొంత మడీ, ఆచారం పాటించే కుటుంబాలలోనూ పురుడు, మైల వంటివి సంభవించినప్పుడు శుద్ధి తర్వాత పొరుగింటి నుంచి నిప్పు తెచ్చుకుని పొయ్యి వెలిగించుకునేవారు. ఆచారాలు వేల సంవత్సరాల కాలం వెంబడి ఎలా ప్రవహిస్తాయో తెలిపే ఇలాంటి ఉదాహరణలకు అంతేలేదు. కాలాన్నే కాదు, దేశాలను, ప్రాంతాలను కూడా అవి జయిస్తాయి. Sir James Frazer వివిధ దేశాలు, ప్రాంతాలలోని అగ్ని సంబంధ ఆచారాల గురించి మరెంతో సమాచారం ఇచ్చారు. అవన్నీ దాదాపు యావత్ప్రపంచం ఒకే సంస్కృతిని పంచుకున్న సంగతిని వెల్లడిస్తాయి.

వచ్చే వారం మరికొన్ని విశేషాలు…

 

  -కల్లూరి భాస్కరం

గణసమాజంలో మనసు తీరాకే మనువు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

మనిషి ఎప్పుడూ తను ఉన్న పరిస్థితుల మధ్య జీవిస్తాడు. తనకున్న పరిమితులలో జీవిస్తాడు. అలా జీవించడమూ, జీవించడం గురించి ఒక మూసలో ఆలోచించడమూ అతనికి అలవాటుగా మారతాయి. గతంలో దానికి భిన్నమైన పరిస్థితులలో పరిమితులలో మనిషి జీవించాడని కానీ; భవిష్యత్తులో జీవించబోతున్నాడనికానీ సాధారణంగా అతను అనుకోడు. అలాంటి ఊహను అతను ప్రతిఘటిస్తాడు. ఆవిధంగా ఆలోచనలు, అలవాట్లు ఒక సంప్రదాయంగా, లేదా విశ్వాసంగా ఘనీభవించిపోతాయి. అది ఒకవిధమైన స్తబ్ధత. కానీ మనిషి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చలనమూ సంభవిస్తూ ఉంటుంది. స్తబ్ధతా, చలనాల మధ్య అతనికి తెలియకుండా నిశ్శబ్ద ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.

గడిచిపోయిన కాలంలో మనిషి పరిస్థితులలోనూ; దానికి అనుగుణంగా అతని ఆలోచనలు, అలవాట్లలోనూ మార్పు సాపేక్షంగా ఎక్కువ కాలం తీసుకుంటూ వచ్చింది. అంటే అతను ఎక్కువ కాలం స్తబ్ధతకు అలవాటుపడ్డాడు. ఒక కీలకమైన మార్పు సంభవించడానికి కొన్ని తరాలు పట్టేది. కానీ ఇప్పుడు చూస్తే మార్పు సాపేక్షంగా అతి తక్కువ కాలం తీసుకుంటోంది. ఒక తరంలోనే ఇప్పుడు మనం అనేక మార్పులు చూస్తున్నాం. చలనశీలత ఒక ఝంఝామారుత వేగాన్ని సంతరించుకుంది. ఆ ప్రచండత్వం నుంచి తనను తాను నిలదొక్కుకోడానికి స్తబ్ధత పంటిబిగువు పోరాటం చేస్తోంది. నిజానికి ఏదో ఒక పరిమాణంలో ఈ పోరాటం అన్ని కాలాలలోనూ జరుగుతూనే వచ్చింది. గెలుపు, ఓటములు తారుమారు అవుతూనే వచ్చాయి. ఇప్పటి పోరాటం ఎలా పరిణమిస్తుందో కాలానికి వదిలేద్దాం.

నేటి చలనవేగానికి ఉదాహరణలను చెప్పుకుంటూ వెడితే అదే ఒక ఉద్గ్రంథం అవుతుంది. ఆ అవసరం కూడా లేదు. ఎన్నో ఉదాహరణలు మీ కళ్ల ముందే ఉన్నాయి. ఒక ఆత్మీయమైన ఉత్తరం కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూ ‘పోస్ట్’ అనే కమ్మని కేకకు చెవులు రిక్కించుకున్న రోజులు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఉత్తరాలు, పోస్ట్ మ్యాన్ కేక ఆరోవేలుగా మారిపోయాయి. తొంభై దశకం ప్రారంభంవరకు మధ్యతరగతి యువకుడు గవర్నమెంటు ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం, కనీసం నాలుగో తరగతి ఉద్యోగం వచ్చినా చాలని కలలు కనడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచీ కనీసం ఒక్కరైనా విదేశంలో ఉన్నారు. పౌరాణికులవారు సాంప్రదాయిక విలువల గురించి, జీవనం గురించి, వేషభాషల గురించి మధ్య మధ్య నిట్టూర్పులు పుచ్చుతూ ప్రవచనం చేస్తూ ఉండవచ్చు. కానీ అదే సమయంలో ఆయన కొడుకో, మనవడో ఏదో ఒక ‘మ్లేచ్ఛ దేశం’ లో మ్లేచ్ఛ ఆచారాల మధ్య జీవిస్తూ ఉండవచ్చు. భక్తి తన్మయంతో ఆ ప్రవచనాలు వింటున్న శ్రోతల పిల్లలూ డిటో కావచ్చు. ఎంత గుప్పిట్లో పట్టుకోవాలనుకున్నా కాలం వేళ్ళ సందుల్లోంచి జారిపోతూనే ఉంటుంది.

ఈ మాత్రం వాక్యాలతో మీ ఊహ కీ ఇచ్చి ఇక్కడితో వదిలేస్తాను.

***

మనిషి చరిత్రలో గణసమాజం కూడా సాపేక్షంగా ఎక్కువ కాలాన్ని తీసుకుంది. తన పరిస్థితులు, పరిమితులు, అనుభవాల పరిధిలో మనిషి తన జీవనం తాలూకు విలువలను, వ్యవస్థలను, విశ్వాసాలను రూపొందించుకుంటూ వచ్చాడు. కాలం వెంబడి ఆ ప్రక్రియ అప్పుడే కాదు, ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. మన ఇష్టాయిష్టాలతో కాకుండా, కాలం అనే కళ్ళద్దాలతో చూసినప్పుడు గతాన్ని మనం తటస్థంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది.

‘కన్య అంటే అవివాహిత మాత్రమే తప్ప పురుష సంపర్కం లేనిది కాదు’ అన్న వాక్యం; కన్య గురించిన నేటి మన ఊహను తలకిందులు చేసి షాక్ ఇస్తున్న మాట నిజమే. అప్పుడు షాక్ అబ్జార్వర్ గా పనిచేసేది తటస్థ దృష్టి మాత్రమే.

ఋతుమతి అయితే పురుష సంపర్క దోషం పోతుందన్న సూత్రం, ఆమె కన్యగా సంతానం కన్న అనంతర పరిస్థితికీ వర్తిస్తుంది. అంటే అప్పుడు కూడా ఆమె కన్యగానే ఉంటుంది. ఉన్నప్పుడు పరాశరుడు సత్యవతికి, దుర్వాసుడు(లేదా సూర్యుడు) కుంతికి ప్రత్యేకంగా కన్యాత్వ వరాన్ని ఇవ్వనవసరంలేదు. నిజంగా ఆ వరాన్ని వారు ఇచ్చి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే, కన్యకు పురుష సంపర్కం దోషం కాదన్న పురాతన ధర్మాన్ని వారు పాటించిఉండవచ్చు. ఆ పురాతన ధర్మానికి కాలం చెల్లి, ఋతుమతి కావడానికీ, కన్యాత్వానికీ పూర్వుల దృష్టిలో ఉన్న ముడి తెగిపోయి, కన్య గురించి ఇప్పటి ఊహ బలపడిన తర్వాత కన్యాత్వ వరం అనే కల్పన చేయవలసిన అవసరం కథకుడికి కలిగి ఉండవచ్చు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కన్యకు పురుష సంపర్కం గణసమాజానికి చెందిన నీతి. గణసమాజంలో దానిని దోషంగా కాదు సరికదా, గుణంగా కూడా భావించినట్టు కనిపిస్తుంది. గణసమాజం అంతరించినా ఆ సమాజం తాలూకు లక్షణాలు అనంతర కాలంలోకి ప్రవహిస్తూనే వచ్చాయి. అలా మన పురాణ ఇతిహాసాలకూ ఎక్కాయి. ఇప్పటికీ మన అనేక ఆచారాలలో, భాషలో, నుడికారంలో గణ సమాజ లక్షణాలు కనిపిస్తాయి.

కన్య విషయానికే వస్తే… ఇద్దరు పండితులను ఉటంకించుకోవలసిన అవసరం నాకిక్కడ కనిపిస్తోంది. ఒకరు, రాంభట్ల కృష్ణమూర్తి. ఇంకొకరు, తిరుమల రామచంద్ర.

రాంభట్లవారి ‘జనకథ’ సామాజిక పురామానవశాస్త్రా(సోషల్ యాంత్రొపోలోజీ)నికి తెలుగులో ఒక వ్యాకరణ గ్రంథం లాంటిది. వివాహవ్యవస్థా, స్త్రీ-పురుష సంబంధాలూ గణదశనుంచీ ఇప్పటి వరకూ ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో అందులో ఆయన రాశారు. నేడు వివాహ సమయంలో, ఇతర సందర్భాలలో చదివే వేదమంత్రాలలో గణసమాజం తాలూకు లక్షణాలు ఎలా ప్రతిఫలిస్తున్నాయో సోదాహరణంగా ప్రస్తావించారు. పెళ్లి, స్త్రీ-పురుష సంబంధాలతో ముడిపడిన అనేక విషయాలను ఆయన రాశారు కానీ వాటన్నింటిలోకీ వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం. కనుక కన్య గురించి ప్రస్తుతానికి పరిమితమవుదాం.

గణదశలో మనిషి గుర్తించిన తొలి తప్పు అన్నా-చెల్లెళ్ల మధ్య సంబంధం అంటారు రాంభట్ల. దాంతో కొన్ని ఇతర గణాలతో సంబంధం పెట్టుకునేవారు. ఇలా మనువు కలసిన గణాలు అన్నీ కలసి వ్రాతంగా ఏర్పడతాయి. అప్పటికే పశుపాలనతోపాటు పరిమితంగా వ్యవసాయం ప్రారంభమైంది. వ్యవసాయానికి స్థిరజీవితం అవసరం కనుక గ్రామాలు ఏర్పరచుకోవడమూ మొదలైంది. పరిమిత స్థాయిలో పశుపాలననే కాక, వ్యవసాయాన్ని కూడా మొదట్లో స్త్రీలే నిర్వహించేవారు. కానీ మందలు పెరిగేసరికి గ్రామ పరిసరాలు చాలలేదు. పచ్చికబీళ్లను వెతుక్కుంటూ సంచారం అవసరమైంది.

ఈ సంచారదశలోనే అన్నోత్పత్తిలో స్త్రీలు క్రియాశూన్యులయ్యారు. పచ్చిక బాగా ఉన్నచోట వ్రాతాలు కొన్ని రోజులు ఒకేచోట స్థిరంగా ఉండే అవకాశం దొరికేది. వ్రాతంగా ఏర్పడకముందు గణసభ్యులు అందరూ ఒకే గృహంలో ఉండేవారు. ఆ తర్వాత ప్రత్యేకంగా కన్యాశాలలు, వటు(పెళ్లికాని మగవాడు)శాలలు ఏర్పడ్డాయి. అప్పటికే జంట వివాహాలు కూడా మొదలయ్యాయి. జంట వివాహాలు నేటి వివాహాల లాంటివే కానీ కొంత తేడా ఉంది. ఆ వివాహానికి ఇరు గణాలవారూ అనుమతించాలి. నాటి జంట వివాహాలలో ఆస్తి మీద స్త్రీపురుషులకు ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. పురుషుడు ఒక్క స్త్రీతోనూ, స్త్రీ ఒక్క పురుషుడితోనూ ఉండాలి. అయితే, ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోయి మారు మనువు చేసుకోవచ్చు. ఈలోపల స్త్రీ అయితే తన సొంత గణానికి వెళ్లిపోవచ్చు. పురుషుడు అత్త గణంలోనే ఉండిపోవాలి. జంట విడిపోయిన తర్వాత వారి ఆస్తి వారి గణాలకు బదిలీ అయిపోతుంది. ఈ మారు మనువులు కూడా ఏడు వరకే మర్యాద. ఏడో మనువుకైనా కట్టుబడి ఉండిపోతే ఆ స్త్రీ గౌరీదేవితో సమానం. అది కూడా విఫలమైతే అది చాలా అవమానకర పరిస్థితి. అలాంటివారిని సప్తవిధవలంటారు. ఆ నింద పురుషుడికీ వర్తిస్తుంది.

గురజాడవారి కన్యాశుల్కం అనగానే రాంభట్లవారికి ఒళ్ళు తెలియదు. అందులో గణసమాజ లక్షణాలు ఉట్టిపడే వాక్యాలను తరచు ప్రస్తావించేవారు. మారుమనువుల గురించి ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. అలాంటిదే సప్తవిధవల గురించిన ప్రస్తావన.

లుభ్దావధాన్లు, రామప్పంతులు, మధురవాణిల మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

లుభ్దా: మీ కల్పనైతేనేం, మరొహరి కల్పనైతేనేం, బుద్ధి పొరపాటు నాది. మధ్యవెధవలతో నాకేం పని. వెంటనే బయల్దేరిపోయి ఆ అగ్నిహోత్రావధాన్లునే అడుగుతాను.

రామ: మాటలు మా జోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. నన్నేనా వెధవలు అంటున్నాడు?

మధు: నన్ను కూడా కలుపుకోవాలని వుందా ఏమిటండీ?

రామ: నన్ను మటుకు వెధవ కింద కట్టావూ?

మధు: నేనుండగా వెధవలు మీరెలా అవుతారు?

రామ: నన్ను సప్తవెధవని చేశావు. మరి ఇంకా తరవాయి యేం వుంచావు?

ప్రస్తుతానికి వస్తే, జతకట్టిన దంపతులు చిన్న చిన్న పర్ణశాలల్లో ఉండేవారు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఈడొచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ఉండరు. కన్యలు కన్యాశాలలో, వటువులు వటుశాలలో ఉంటారు. ఇలాంటి శాలలను నిద్రాశాలలు అంటారు. నేటికీ ఆదివాసుల్లో నిద్రాశాలలు కనిపిస్తాయి. వాటిని ‘ఘోతుల్’ అంటారు. ఆ దశలో జత దొరకని కన్యనే విధవ అంటారు. మగవారిని విధురులంటారు. విధురులు సామాన్యంగా సోమం చేస్తూ ఉంటారు. సోమం అంటే ఒక తీగ. దానిని నలగ్గొట్టి రసం పిండుతారు. ఆ రసాన్ని వడగొట్టి కొయ్యతొట్టెల్లో నిలవ ఉంచుతారు. సోమం చేసేవారినే సోములు అంటారు. వారు రాత్రింబవళ్ళు వటుశాలలోనే ఉంటారు కనుక కన్యలకు తొలి అనుభవం ఈ సోములతోనే కలుగుతుంది.

అపరాహ్ణం(మధ్యాహ్నానికి, సాయంత్రానికి మధ్య కాలం) వేళ కన్యలు, వటువులు బయటకి వచ్చి స్వేచ్ఛావిహారం సాగిస్తారు. అన్నా-చెల్లెళ్ళు కాకుండా మాత్రం జాగ్రత్తపడతారు. తప్పుకు పాల్పడితే మాత్రం మరణదండన తప్పదు. అన్నలు తప్ప మిగిలినవారు అందరూ గంధర్వులు. అదే గాంధర్వం. గాంధర్వం అష్టవిధ వివాహాలలో ఒకటిగా ధర్మశాస్త్రాలకు, పురాణ, ఇతిహాసాలకు ఎక్కింది. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం ఆడడం మనకు బాగా తెలిసిన కథ. గణదశలో ఉన్న అన్ని సమాజాలలోనూ ఈ గాంధర్వం ఉండేదని అనడానికి ఆధారాలు కనిపిస్తాయి.

ఈ సందర్భంలో గ్రీకు వివాహచరిత్రపై పుస్తకం రాసిన జర్మన్ శాస్త్రవేత్త బాకోఫెన్ ను రాంభట్ల ప్రస్తావించారు. ‘హెటాయరిజం’ అనే మాటను తొలిసారి వెలుగులోకి తెచ్చినవాడు బాకోఫెన్. అది గ్రీకుల గణవివాహదశను సూచించే మాట. ఆ మాటే మన దగ్గర గాంధర్వం అయింది. ఆరోజుల్లో కన్యలతో క్రీడించడం తప్పు కాదని ఆ మాట చెబుతుంది. మోర్గాన్ సహా పండితులు ఎందరో బాకోఫెన్ పుస్తకాన్ని ప్రామాణికంగా భావించారు.

ఒకరినొకరు ఇష్టపడినంతకాలం కలసి ఉండడానికి చేసుకునే ఒప్పందమే గాంధర్వం. ఏ ఒకరు కోరుకున్నా ఒప్పందం రద్దైపోతుంది. ఆ తర్వాత కూడా ఏ ఒక్కరైనా ఇంకొకరి వెంటపడితే తప్పు. తప్పుకు శిక్ష ఉంటుంది. రాంభట్ల గారి వివరణ ప్రకారం; ఈ సోమ, గాంధర్వ పద్ధతుల వల్ల కన్యలు గర్భవతులు కావచ్చు. అది తప్పు కాదు. అందువల్ల వారి కన్యాత్వం చెడదు. గాంధర్వం గురించిన ఈ వివరాల వెలుగులో శకుంతలా-దుష్యంతుల కథను సరికొత్తగా అన్వయించుకున్నప్పుడు, ఆశ్చర్యంగా ఆ కథ తలకిందులవుతుంది. మనకు తెలిసిన కథ ప్రకారం, శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుని, గర్భవతిని చేసి; ఆ తర్వాత నువ్వెవరో నాకు తెలియదన్న దుష్యంతుడే మోసగాడు(చివరికి ఇద్దరూ ఒకటవుతారు, అదలా ఉంచుదాం). శకుంతల అమాయకంగా మోసపోయిన యువతి. కానీ, గాంధర్వం గురించి పైన ఇచ్చిన వివరణ ప్రకారం చూసినప్పుడు, దుష్యంతుడు ఒప్పందం నుంచి బయటపడినా, శకుంతల అతని వెంటబడింది. ఆ విధంగా తప్పు ఆమెది అవుతుంది.

మళ్ళీ విషయానికి వస్తే, ఈ గాంధర్వ సంబంధాలు ఇక చాలు, పెళ్లి చేసుకుంటాననుకున్న కన్య ఒక వరుని ఎంచుకుని తండ్రికి చెబుతుంది. అప్పుడు వధువు తండ్రి వరుని తండ్రిని కలసి వివాహానికి ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలో వధువు మంచితనం గురించి వరుని తండ్రికి చెబుతాడు. వివాహమంత్రాలలో భాగమైన ఋగ్వేదం, పదో మండలం, 85వ సూక్తంలోని మూడవ ఋక్కు ప్రకారం తండ్రి మాటలు ఇలా ఉంటాయి: ‘ఈ అమ్మాయి అన్నను చంపలేదు, భర్తను చంపలేదు, కొడుకును చంపలేదు, ఇందుకు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు సాక్షులు. ఈమెకు లక్ష్మి వర్చస్సు కలుగుగాక.’

ఆ తర్వాత వధువు తండ్రి వరునికి ఒక ఎద్దును ఇస్తాడు. ఆ సందర్భాన్ని మధుపర్కం అంటారు. ఆ సమయంలో చదివే మంత్రంలో ‘గోః గోః’ అని చదువుతారు(వేదాలలో ఎద్దును కూడా గో శబ్దంతోనే సూచిస్తారు). తర్వాత ఎద్దును దూరంగా తీసుకుపోయి చంపి దాని రక్తంలో సోమం కలిపి ‘మధుపర్కం మధుపర్కః మధుపర్కో మధుపర్కః’ అని కేకపెడతారు. ఆ కేక విని వరుడు అక్కడికి వెళ్ళి మధుపర్కపానం చేస్తాడు. ఆ సందర్భంలో కన్యాదాత వధూవరులకు పెట్టే వస్త్రాలకు మధుపర్కాలన్న పేరు వచ్చింది.

కన్యాదాత వధువును వరునికి అప్పగించేటప్పుడు అగ్ని ముఖంగా చదివే మంత్రాలు వధువు గతాన్ని చెబుతాయి. ‘నీ తొలి భర్త సోముడు. రెండో భర్త గంధర్వుడు. మూడో భర్త అగ్ని’ అని వాటి అర్థం. ఆ తర్వాత, ‘ఈమెను సోముడు గంధర్వుడికీ, గంధర్వుడు అగ్నికీ ఇవ్వగా; అగ్నినైన నేను ధనార్జనకూ, పుత్రులను కనడానికీ నీకు ఇస్తున్నాను’ అని వరుని ఉద్దేశించిన మంత్రాలు చెబుతాయి.

ఇప్పటికీ పెళ్లి తర్వాత ‘పునస్సంధానం’ పేరుతో కొంత తంతు జరుపుతారు. పానుపు వేయించి దాని మీద రెండు బొమ్మలు పెడతారు. ఆ బొమ్మల మధ్య ఒక కర్ర ఉంచుతారు. ఆ కర్రకు గంధర్వుడని పేరు. దానర్ధం, ఆ దంపతులు ఒకటి కావడానికి గంధర్వుడు అడ్డుపడతాడన్నమాట. అప్పుడు చదివే మంత్రం ప్రకారం, ‘అయ్యా, విశ్వావసుగారూ, తమర్ని యాచిస్తున్నాను. ఈమెను విడిచిపెట్టి తరుణవయస్కురాలైన మరొక అమ్మాయిని కోరుకోండి’ అని కన్యాదాత చేతులు జోడించి గంధర్వుని ప్రార్థిస్తాడు.

mahabharata1

కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు సంస్కృత భారతాన్ని యథాథంగా గద్యంలోకి అనువదించిన ‘సభాపర్వ’ భాగానికి తిరుమల రామచంద్రగారు ఉపోద్ధాతం రాస్తూ ఇలా అంటారు:

మన జీవితాన్ని మలుపు తిప్పే కర్మకాండలోని మంత్రాలు కొన్నింటిని పరిశీలించినా, ముఖ్యంగా వివాహమంత్రాలు పరిశీలించినా ప్రాచీన గణాల పూర్వాచారాలు తొంగి చూస్తాయి. ప్రతి కర్మకూ ప్రారంభంలో ఆచమనానంతరం అగ్నిహోత్రం చుట్టూ కూర్చతోగాని, చేతితో గాని ప్రదక్షిణంగా నీటిని ప్రోక్షించడం ఉంటుంది…

ప్రాచీన గణాలలో అన్నా చెల్లెళ్ల సంపర్కం నిషిద్ధం, అనిష్టం, తప్పు, టాబూ. ఇది ఒక్క ఈజిప్టు వారిలో తప్ప ప్రపంచమంతటా నేటికీ పాటిస్తున్న నీతి. దీనికి సంబంధించి తెలుగులో ఒక పల్లెటూరి వచనం ఉంది:

తల్లివాయి తప్పులేదు, కూతురువాయి కూర్చవచ్చు, అత్తవాయి అదృష్టం, చెల్లెలు వాయి చెప్పరాదు

దీనికి యమ-యమీ సంవాదం మనకు ప్రమాణం.

కొన్ని ప్రాచీన గణాలలో ఒక విచిత్రమైన ఆచారం ఉండేది. ఈ గణానికి సంబంధించిన గ్రామాలలో మధ్యన నిప్పు ఉండే గుడిసె ఉంటుంది. దానికి అటు ఇటు విడిగా చెరి ఒక పొడుగాటి గుడిసె-శాల ఉంటుంది. నిప్పున్న గుడిసెల బృందంలో వంటా, వార్పూ జరుగుతాయి. ఆ రెండు వరసల శాలలలో ఒకదానిలో యువకులు, రెండవడానిలో యువతులు- అవివాహితులు పడుకుంటారు. భోజనానంతరం స్త్రీల శాలలో మొదట ముఖ్యమైన వస్తువులు భద్రపరుస్తారు. వాటిని వృద్ధులు కాపాడతారు. ఆ వృద్ధులు ఒక్కొక్కప్పుడు చిన్నపిల్లలను ఆప్యాయతతో చూసినా తప్పులేదు. ఆ రెండు శాలలలో ఉన్న యువతీ యువకులు ప్రేమించుకుంటారు. వివాహాత్పూర్వ సంపర్కమూ కలగవచ్చు . కలిగిన తర్వాత పెద్దలకు తెలియజేస్తారు. వారు సక్రమంగా అగ్ని ఎదుట వివాహం తంతు జరిపిస్తారు. ఈ ఆచారం మధ్యప్రదేశ్ లోని కొన్ని అనాది జాతులలో పూర్వం ఉండేది. యువతీ యువకుల శాలలను ఘోత్ అంటారు.

ఆ తర్వాత తిరుమల రామచంద్ర గారు వివాహకాండలోని పైన చెప్పిన మంత్రాలనే ప్రస్తావించారు.

అన్నా-చెల్లెళ్ల సంబంధాన్ని నిషేధించడం గురించీ, రామచంద్రగారు ప్రస్తావించిన అగ్ని ప్రాధాన్యం గురించీ చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటే; అగ్నిసాక్షి, అగ్ని ప్రాధాన్యం మన సంస్కృతిలోనే ఉన్నాయనే అపోహ చాలామందికి ఉంటుంది. కానీ అమెరికా ఆదిమ వాసులతో సహా, గణసమాజం అంతటా అగ్నికి అంతే ప్రాధాన్యం ఉంది. వారిలోనూ వివిధ సందర్భాలలో మనం జరిపే తంతు లాంటివే ఉన్నాయి.

మిగితా విశేషాలు తర్వాత…

 

 

 

 

 

 

 

ఋతుమతీ పునః కన్యా…

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

స్త్రీ-పురుషుల మధ్య సయోధ్య తప్పనిసరి. లేకపోతే సృష్టి జరగదు. అయితే, లింగభేదం వల్ల వారి మధ్య సంఘర్షణా ఒక్కొక్కసారి అనివార్యమవుతూ ఉంటుంది. స్త్రీ పురుషుణ్ణి తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పురుషుడు ప్రతిఘటిస్తాడు. అలాగే స్త్రీని కట్టడి చేయాలని పురుషుడు ప్రయత్నిస్తాడు. స్త్రీ ప్రతిఘటిస్తుంది. ఇద్దరి మధ్యా ఒక వ్యూహాత్మక, నిశ్శబ్ద పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో వారి మధ్య సర్దుబాటు క్షణాలూ ఉంటూ ఉంటాయి. ఇలా చూసినప్పుడు స్త్రీ-పురుషుల చరిత్ర సమస్తం సయోధ్య-సంఘర్షణల చరిత్రే.

నాకీ సందర్భంలో ప్రసిద్ధ కథకుడు ఓ. హెన్రీ రాసిన ఒక కథ గుర్తొస్తోంది. పేరు గుర్తులేదు కానీ విషయం మాత్రం గుర్తుంది. కాకపోతే వివరాలలో ఒకింత తేడా వస్తే రావచ్చు:

కాయకష్టం చేసుకుని జీవించే ఒక పల్లెటూరి జంట. వారు ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. భర్త ఓ ఉద్రేక క్షణంలో ‘నీకు విడాకులు ఇచ్చేస్తా’నని భార్యతో అంటాడు. ‘మరీ మంచిది, నేనూ అదే కోరుకుంటున్నా’నని భార్య అంటుంది. ‘అయితే, విడాకులు మంజూరు చేసే జడ్జి దగ్గరకు వెడదాం పద’ అంటాడు. ఇద్దరూ బండి కట్టుకుని పట్నానికి బయలుదేరతారు. జడ్జి ఇంటికి వెడతారు. భార్య వల్ల తను ఎలా కష్టాలు పడుతున్నాడో భర్త చెబుతాడు. భర్త తనను ఎలా కాల్చుకుతింటున్నాడో భార్య చెబుతుంది. మాకు విడాకులు ఇప్పించండని ఇద్దరూ అడుగుతారు.

‘మీకు విడాకులు మంజూరు చేస్తాను. అయితే, దానికి ఇంత రుసుము చెల్లించాలి(ఆ రుసుము అయిదురూపాయలు అనుకుందాం). ఆ డబ్బు మీ దగ్గర ఉందా?’ అని జడ్జి అడిగాడు.

భర్త దగ్గర సరిగ్గా అయిదు రూపాయలే ఉన్నాయి. చొక్కా జేబులోంచి అయిదురూపాయల నోటు బయటకు తీసి జడ్జి ముందు ఉంచాడు. జడ్జి ఆ నోటు తీసుకుని వారికి విడాకులను మంజూరు చేస్తూ ఆమేరకు ఇద్దరికీ చెరో పత్రమూ ఇచ్చాడు. ‘ఇకనుంచి మీరు భార్యాభర్తలు కాదు. ఎవరి దారిన వారు వెళ్లిపోవచ్చు’ అన్నాడు.

అప్పటికే బాగా చీకటి పడిపోయింది. విడాకుల పత్రం చేతికి వచ్చాక ఒకరి మీద ఒకరికున్న కోపతాపాలు చల్లబడిపోయాయి. వచ్చేటప్పుడు భార్యాభర్తలుగా కలసి వచ్చినా, ఇప్పుడు విడాకులు తీసుకున్నారు కనుక ఎవరి దోవన వారు పోవలసిందే. అతనైతే బండి మీద వెళ్ళిపోతాడు. తనీ రాత్రి వేళ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు కదా అనుకుంటూ ఆమె బిక్కమొహం వేసింది.

అతను ఆమెను చూశాడు. జాలి కలిగింది. ‘నాతో బండి మీద రా’ అన్నాడు. ఆమె బతుకుజీవుడా అనుకుంది. ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఇకనుంచీ తాము భార్యాభర్తలు కామన్న నిజాన్ని తలచుకుంటూ ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. రేపటి పరిస్థితిని, ఇక తాము భార్యాభర్తలం కామన్న సంగతినీ ఊహించుకుంటున్న కొద్దీ; ఎవరి బతుకు వారు బతకవలసిందేనన్న నిజం వారిని కుంగదీయడం ప్రారంభించింది. విడాకులు తీసుకున్నందుకు పశ్చాత్తాపమూ, ఒకరి మీద ఒకరికి ప్రేమ, జాలి క్రమంగా ముంచెత్తాయి. ‘పొద్దుటే అతను ఇంత కూడు తిని పనికి పోతాడు. తను లేకపోతే అతనికి ఎవరు వండిపెడతారు? ఎంత ఇబ్బంది పడతాడు?’ అనుకుంటూ ఆమె!,,,’తను లేకపోతే నాకు ఎలా గడుస్తుంది? నేను లేకపోతే తనకు మాత్రం ఎలా గడుస్తుంది?’ అనుకుంటూ అతను! …తమ దగ్గరున్న విడాకుల పత్రాన్ని తలచుకుంటే వారికి ఒంటి మీద తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్టు అనిపిస్తోంది.

ఊరు చేరేసరికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ‘మనం కలిసే ఉందాం. విడాకుల్ని రద్దు చేయమని అడుగుదాం’ అని భర్త అన్నాడు. దిగులు మాయమై భార్య ముఖం సంతోషంతో విప్పారింది. ‘సరే’ అంది.

మరునాడే ఇద్దరూ బండి కట్టుకుని జడ్జి దగ్గరకు వెళ్లారు. తమ నిర్ణయం చెప్పి, విడాకులు రద్దు చేయమని అడిగారు. ‘సరే, రద్దు చేస్తాను. అందుకు కూడా రుసుము చెల్లించాలి(అయిదురూపాయలు అనుకుందాం). మీ దగ్గర ఆ డబ్బు ఉందా?’ అని జడ్జి అడిగాడు. ఆ జంట తెల్లబోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘మా దగ్గర ఆ డబ్బు లేదు’ అని అతను అన్నాడు.

‘మీ దగ్గర ఆ డబ్బు ఎప్పుడుంటే అప్పుడు వచ్చి చెల్లించి విడాకుల రద్దుపత్రం తీసుకు వెళ్లం’డని జడ్జి అన్నాడు.

సరే నంటూ నిరుత్సాహంగా ఆ జంట అక్కడినుంచి వెళ్ళిపోయారు.

మరునాడు పొద్దుటే వాళ్ళు ఇద్దరూ మళ్ళీ జడ్జి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి ముఖంలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. అతను జడ్జి ముందు అయిదు రూపాయల నోటు ఉంచాడు. జడ్జి ఆ నోటు తీసుకుని విడాకులను రద్దు చేస్తూ ఇద్దరికీ చెరో పత్రమూ ఇచ్చాడు. వారు అప్పుడే పెళ్ళైన కొత్త జంటలా ఒకరినొకరు మురిపెంగా చూసుకుంటూ వెళ్ళిపోయారు.

ఓ. హెన్రీ కథల్లో ఉండే కొసమెరుపు లేదా ట్విస్టు ఈ కథలోనూ ఉంది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, అయిదు రూపాయలు చెల్లించి విడాకుల రద్దు పత్రం తీసుకోమని చెప్పి జడ్జి పంపేసిన తర్వాత ఆ జంటకు ఏం చేయాలో తోచలేదు. అయిదురూపాయలు తాము ఇప్పట్లో సంపాదించడం కష్టం. కనుక అతను ఆ రోజు రాత్రి జడ్జి ఇంట్లో దొంగతనం చేశాడు. తను జడ్జికి ఇంతకుముందు ఇచ్చిన అయిదురూపాయలు దొరికింది. మరునాడు ఆ నోటే జడ్జికి ఇచ్చాడు. తన దగ్గర అయిదురూపాయలు మాయమైన సంగతి ఆ తర్వాత కానీ జడ్జీకి తెలియలేదు.

ఇది న్యాయవ్యవస్థపై సెటైర్ గా రాసిన కథ అని తెలుస్తూనే ఉంది. దానిని అలా ఉంచితే, మనకిప్పుడు కావలసినంతవరకు స్త్రీ-పురుషుల మధ్య సంఘర్షణ-సయోధ్యల గురించి కూడా ఈ కథ చమత్కారం మేళవించి చెబుతోంది.

***

మన ధర్మశాస్త్రాలు స్త్రీ-పురుష సంబంధాల విషయంలో పట్టు-విడుపులు లేని వైఖరిని అనుసరిస్తాయని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అవి ఎంతో సడలింపునూ పాటించాయి. నిజానికి ధర్మశాస్త్రాలు చండశాసన ప్రవృత్తి గల ఒక వ్యక్తి లేదా వ్యక్తుల ఊహల్లోంచి పుట్టినవి కావు. అవి సమాజంలోంచి పుట్టినవి. స్త్రీ-పురుష సంబంధాలతో సహా సామాజిక సంబంధాల పరిణామ చరిత్రను నమోదు చేస్తూ పోయినవి. అయితే అవి కొన్ని సందర్భాలలో అసమానతలు, వివక్ష కలిగిన నిర్దిష్ట సామాజిక సంబంధాల పక్షం వహించిన మాటా వాస్తవం. ధర్మశాస్త్రాల గురించి నాకు పైపైన కలిగిన అభిప్రాయం మాత్రమే ఇది. సూక్ష్మంగా పరిశీలించినప్పుడు నా అభిప్రాయాలను సవరించుకోవలసిన అవసరం వస్తుందేమో చెప్పలేను.

కేవలం తటస్థ, చారిత్రక దృష్టినుంచి చెప్పుకుంటే, స్త్రీ శీలం గురించి నేడు మనకు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలనుంచి చూసినప్పుడు పూర్వుల అభిప్రాయాలు చాలా విచిత్రంగానూ, ఆసక్తికరంగానూ, ఇంకా చెప్పాలంటే అమాయకంగానూ అనిపిస్తాయి. ఉదాహరణకు, తిక్కన భారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసంలో ధర్మరాజుకు వ్యాసుడు ప్రాయశ్చిత్త విధానాలను చెబుతూ అన్న కింది మాటలు నన్ను ఆశ్చర్యచకితం చేశాయి:

పరపురుషసంగమంబున బరిహృతయై యున్న యట్టి భామిని శుద్ధిం

బొరయు రజస్వలయై కంచరయగ భస్మమున శుద్ధమైన విధమునన్

పరపురుషునితో సంబంధం వల్ల విడిచిపెట్టబడిన స్త్రీ, బూడిదతో కంచు శుభ్రమైనట్టుగా రజస్వల కావడం ద్వారా శుద్ధి అవుతుందని ఈ పద్యానికి అర్థం.

స్త్రీ శీలానికి, ఆమె రజస్వల కావడానికీ ఇలా ముడిపెట్టడం నేడు మన ఊహకు అందని విషయం. సంస్కృత భారతంలో దీనినే ఇలా చెప్పారు:

స్త్రియ స్త్వాశంకితాః పాపా నోపగమ్యా విజానతా,

రజసా వా విశుధ్యంతే భస్మనా భాజనమ్ యథా           

దీనికి శలాక రఘునాథశర్మగారి అనువాదం ఇలా ఉంది:

వివేకము కలవాడు పాపము చేసిరను శంక గల స్త్రీలను పొందరాదు. బూడిద పాత్రను శుద్ధి చేసినట్లు రజస్సు వారిని శుద్ధి చేయును.

తిక్కన పద్యంలో అర్థం సూటిగా ఉంటే, శ్లోకంలో అర్థం కొంత అస్పష్టంగా ఉంది. అనువాదంలోనూ అదే అస్పష్టత ఉంది. వివేకం ఉన్నవాడు పాపం చేశారన్న శంక కలిగినప్పుడు ఆ స్త్రీలను పొందరాదని మొదటి వాక్యం చెబుతోంది. బూడిద పాత్రను శుద్ధి చేసినట్లుగా రజస్సు వారిని శుద్ధి చేస్తుందని రెండో వాక్యం చెబుతోంది. అంటే, రెండో వాక్యం మొదటి వాక్యాన్ని నిషేధిస్తోందన్న మాట. (స్త్రీ పరపురుష సంగమానికి పాల్పడినా) రజస్వల అయినప్పుడు శుద్ధి జరిగి ఆ పాపం పోతుందని ఈ వాక్యం చెబుతోంది. అప్పుడు మొదటి వాక్యం విధించే నిషేధం తొలగిపోతుంది. కానీ శ్లోకం ఆ సంగతిని సూటిగా చెప్పడం లేదు.

అంతకన్నా ఆశ్చర్యం, తిక్కన పద్యంలోనూ, సంస్కృత శ్లోకంలోనూ వ్యక్తమైన అభిప్రాయానికి సమర్థన, ఒకింత తేడాలో, నాకు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగారి రచనలో కనిపించింది! ‘కౌణ్డిన్యస్మృతిః’ (ఎమెస్కో ప్రచురణ, 2010) అనే రచనలో,‘స్త్రీలు’ అనే శీర్షిక కింద ఆయన ఇలా రాశారు:

అనిచ్ఛన్తీ తు యా నారీ బలాత్కారేణ దూషితా,                                                                           

రాజోదర్శనతహః పశ్చాద్విశుద్ధ్యతి; నా సంశయః

తా. ఇష్టపడకపోయినా బలాత్కరింపబడి దూషితురాలైన స్త్రీ రజోదర్శనానంతరం పరిశుద్ధురాలవుతుందని ధర్మశాస్త్రకారుల నిర్ణయం. దీనిలో సందేహం లేదు.

రజస్వల, అంటే ఋతుమతి కావడంతోనే స్త్రీ పరిశుద్ధురాలు అవుతుందనడం, స్త్రీ శీలం గురించిన మన ఊహల్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. స్త్రీ శీలంపట్ల ఉన్న ఇంత సరళమైన భావనతో, శీల భంగానికి ఇది చూపించే పరిష్కారంతో నేడు ఎవరూ ఏకీభవించరని మనకు తెలుసు. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి అవుతుందన్న ఊహలో   ఎంతో అమాయకత్వం ఉంది. మరోవైపు, స్త్రీ శీలం గురించి మనకంటే, మన పూర్వులే చాలా ఉదారంగానూ, విశాలంగానూ ఆలోచించారన్న అభిప్రాయం కూడా ఈ ఊహ కలిగిస్తుంది. అందులో స్త్రీ-పురుష సంబంధాల పట్ల గొప్ప సర్దుబాటు వైఖరి ఉంది.

దాంతోపాటు, తటస్థంగా చెప్పుకుంటే; స్త్రీ శీలం గురించిన పై భావన మరికొన్ని విలక్షణ పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. ఎలాగంటే, స్త్రీ నెల నెలా ఋతుమతి అవుతుంది. ఋతుమతి కావడంతోనే అంతకుముందు పురుషసంబంధం తాలూకు దోషం అంతా పోయి తిరిగి శుద్ధి అవుతుంది. ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థాలను వివరించుకో నవసరం లేదు. తన ఇష్టం లేకుండా బలాత్కరింపబడిన స్త్రీలు ఋతుమతి కావడంద్వారా శుద్ధి పొందుతారని పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అంటున్నారు. అయితే పూర్వుల ఊహ నుంచి చూస్తే, ఎటువంటి పురుష సంగమం ద్వారానైనా సరే, ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధిపొందుతుంది.

మొత్తం మీద చూస్తే, ఒక దశలో స్త్రీకి సంబంధించిన ఇతరేతర అంశాలపై కంటే, ఆమెకు గల ఋతుకాల ధర్మం మీదే పూర్వులకు ఎక్కువ పట్టింపు ఉండేదని అనిపిస్తుంది. ఋతుకాలమే వారి ఊహలో ఎక్కువ ప్రాధాన్యాన్ని పొందినట్టు అనిపిస్తుంది. అది సంతానయోగ్య కాలం కూడా కనుక సంతానానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని కూడా తోస్తుంది. ఋతుకాలంలో సంతానం పొందడం స్త్రీకి ఒక హక్కుగా గుర్తించారన్నఅభిప్రాయానికి సైతం శర్మిష్ట-యయాతి కథే కాక మరికొన్ని కథలు అవకాశమిస్తాయి. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి పొందుతుందని పూర్వులు భావించడం ఋతుకాల ప్రాధాన్యానికి పొడిగింపే.

ఇప్పటి మన అవగాహనలో ఇది విపరీతంగా, అనైతికంగా తోచే మాట నిజమే. కానీ, అప్పటి పరిస్థితులు, అప్పటి ఒత్తిడులు, స్త్రీ-పురుష సంబంధాల గురించిన అప్పటి అవగాహన అలాంటివి కావచ్చు. అపారమైన భౌగోళిక విస్తీర్ణం, పరిమిత జనాభా ఉన్న ఆ కాలంలో సంతానోత్పత్తే అన్నింటికంటే ఉన్నతంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. సంతానవతికి, లేదా సంతానవంతుడికి ఆనాడే కాదు, నిన్న మొన్నటివరకు సమాజంలో ఎక్కువ గౌరవ ప్రతిష్టలు ఉండేవన్న సంగతి మనకు తెలుసు.

భూమిపై కానీ, ఇతర ఆస్తులపై కానీ ఉమ్మడి యాజమాన్యం పోయి, వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడిన తర్వాత; ఫలానా పురుషుడికే స్త్రీ సంతానం కనవలసిన అవసరం కలిగింది. భర్తకు సంతాన సామర్థ్యం లేనప్పుడు ధర్మశాస్త్రాలు నియోగాన్ని అనుమతించాయి.

ముందుజన్మలో ద్రౌపదిగా పుట్టబోతున్న ఇంద్రసేనకు శివుడు ప్రత్యక్షమై నీకు అయిదుగురు భర్తలు లభిస్తారని అన్నప్పుడు ఆమె ఏమందో మరోసారి గుర్తుచేసుకుందాం: ‘స్త్రీకి ఒక్కడే పతి కావడం లోక ప్రసిద్ధం. ఆపత్కాలంలో నియోగవిధిని బట్టి అన్యపురుష సంపర్కాన్ని చెప్పారు. మూడో పురుషునితో సంబంధం పెట్టుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నాలుగో పురుషునితో సంబంధం వల్ల ఆమె పతిత అవుతుంది. అయిదవ పురుష సంబంధంతో బంధకి అవుతుంది. కనుక నాకు అయిదుగురు భర్తలు వ’ద్దని ఆమె అంటుంది. కురుసభలో ద్రౌపదిని అవమానించినప్పుడు కర్ణుడు ఆమెను బంధకి అంటూ ఎద్దేవా చేస్తాడు. ఇంద్రసేన అన్న పై మాటల్లో స్త్రీపురుష సంబంధాలపట్ల ధర్మశాస్త్రాలు ప్రదర్శించిన సర్దుబాటు వైఖరి అంతర్లీనంగా కనిపిస్తుంది.

ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, పెండ్యాలవారితో తను జరిపిన వాదోపవాదాలలో సంప్రదాయపక్షం వహించిన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నియోగవిధిని సమర్థిస్తారు కానీ, వితంతు వివాహాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు. నియోగవిధి ఆమోదయోగ్యమై, వితంతు వివాహం కాకపోవడం వెనుక పైకి ఎలాంటి హేతుబద్ధతా కనిపించదు. బహుశా ఆస్తి సంబంధమైన అభ్యంతరాలు దాని వెనుక ఉండవచ్చు.

అదలా ఉంచితే, ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి పొందుతున్న భావన పురాణ కథలలోని ఒక ముఖ్యమైన మర్మాన్ని, లేదా కల్పనను బట్టబయలు చేస్తోంది. అది, కన్యాత్వ వరం!

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

ఈ కన్యాత్వ వరం గురించి వెనకటి వ్యాసాలలో చాలా చెప్పుకున్నాం. క్లుప్తంగా మరోసారి గుర్తు చేసుకుంటే, పరాశరుడు సత్యవతికి, దుర్వాసుడు, సూర్యుడు కుంతికి, శివుడు ద్రౌపదికి కన్యాత్వవరం ఇచ్చారు. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధురాలవుతుందన్న పై ఊహను ఇక్కడ వర్తింపజేసి చూడండి. స్త్రీ ఋతుమతి కావడానికి ముందు పురుష సంగమం పొందినా, ఋతుమతి కావడంతోనే శుద్ధి అవుతుందంటే అర్థం ఏమిటి? ఆమె వెనకటి స్థితికి, అంటే కన్యగా ఉన్న స్థితికి తిరిగి వెడుతుందనే. అలాంటప్పుడు ఆమెకు కన్యాత్వ వరం అంటూ ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే అప్పుడు ఆమె కన్యే!

దీనినిబట్టి తేలుతున్నది ఒకటే…కన్య అంటే వివాహం కాని స్త్రీ మాత్రమే. పురుష సంపర్కం పొందని స్త్రీ అని కాదు.

గణసమాజంలో కూడా కన్య అంటే వివాహం కాని స్త్రీయే తప్ప పురుషసంపర్కం లేనిదని కాదు.

దాని గురించి తర్వాత…

 – కల్లూరి భాస్కరం

 

పాండవుల పుట్టుకపై చర్చ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

సంప్రదాయ పాఠం లేదా వివరణ విడిచిపెట్టిన ఖాళీలను గురించి ఇంతకుముందు చాలా ఉదంతాలలో చెప్పుకున్నాం. కొన్ని మరోసారి గుర్తు చేసుకుందాం:

యయాతి-శర్మిష్టల సంబంధమే చూడండి. వారిద్దరూ మనకు తెలిసిన అర్థంలో భార్యాభర్తలు కారు. యయాతి అధికారిక భార్య అయిన దేవయానికి శర్మిష్ట దాసి మాత్రమే. అయినాసరే, యయాతికి శర్మిష్టకు సంబంధం ఏర్పడి ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో చివరివాడైన పూరునికే రాజ్యాధికారం లభించింది. ‘నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ నువ్వు భర్తవే’ అనీ,‘భార్య, పుత్రుడు, దాసి వారింపలేని ధర్మాలు’ అనీ శర్మిష్ట అన్న మాటలు సూటిగా ఉండి మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఇటీవలి అమెరికా సహా ఒకనాటి బానిస సమాజాలు అన్నిటా దాసిపై, లేదా బానిసపై కూడా యజమాని లైంగిక హక్కును చలాయించిన సంగతి మనకు తెలుసు కనుక, ఆనాడు శర్మిష్ట ఆ హక్కు గురించే మాట్లాడుతున్నట్టు మనం ఈరోజున తేలికగా పోల్చుకోగలం.

ఈవిధంగా శర్మిష్ట మాటల్లో కూడా పురాచరిత్ర వ్యక్తమవుతోంది.

విశేషమేమిటంటే, మహాభారత కథకుడు ఎంతో విలువైన ఈ పురాచారిత్రక సమాచారాన్ని దాచకుండా అందిస్తున్నాడు. అంతకన్నా విశేషం ఏమిటంటే, సాంప్రదాయిక వ్యాఖ్యాతలు యయాతి-శర్మిష్టల సంబంధం ఎలాంటిదో వివరించకుండా మౌనం పాటించడం!

ఇంకో ఉదాహరణకు వస్తే, సత్యవతి, కుంతి కన్యగా ఉన్నప్పుడే సంతానాన్ని కన్నారు. అయినా సరే, ఇద్దరిలో కొంత తేడా ఉందని చెప్పుకున్నాం. పరాశరుని వల్ల సత్యవతికి వ్యాసుడు జన్మించడం వెనుక దైవ సంబంధం కానీ, వరప్రభావం కానీ ఏమీ లేవు. పరాశరుడు ఒక మునే కానీ దైవం కాదు. కానీ కుంతి కర్ణుని కనడం వెనక దుర్వాసుని వరంతోపాటు సూర్యుడనే దైవం ఉన్నారు. సత్యవతి, కుంతి మధ్య ఎందుకు ఈ తేడా అంటే మనకు అర్థమయ్యేది ఒక్కటే…మహాభారత కథకుడు పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారి తల్లి అయిన కుంతికి ఒక ప్రత్యేకతను లేదా విశిష్టతను ఆపాదిస్తున్నాడు.

ఇలాంటి తేడాయే; ద్రౌపదీ-జటిలుడనే ముని కూతురూ, అజిత అనే రాచకూతురుల మధ్య కూడా కనిపిస్తుంది. జటిలుని కూతురు పదకొండుమందినీ, అజిత అయిదుగురినీ పెళ్లిచేసుకున్నట్టే; ద్రౌపది కూడా అయిదుగురిని పెళ్లాడింది. కానీ జటిలుని కూతురూ, అజితల వివాహం వెనక ఎటువంటి వరాలు, శాపాలు, దైవ కారణాలు ఉన్నట్టు కథకుడు చెప్పలేదు. ద్రౌపది వివాహం వెనుకే అలాంటివి ఉన్నట్టు చెబుతున్నాడు. కారణం కుంతి విషయంలో చెప్పుకున్నదే. ద్రౌపది పాండవుల భార్య, తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు!

ఇప్పుడు నియోగ పద్ధతిలో సంతానం కనడం గురించే చూడండి…తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగ పద్ధతిలో సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి ఆదేశించింది. వ్యాసుడు ఒక మునే తప్ప దైవం కాదు. కుంతికి దుర్వాసుడు ఉపదేశించినట్టుగా అంబిక, అంబాలికలకు, వారి దాసికి ఏ మునీ వచ్చి సంతాన మంత్రాన్ని ఉపదేశించలేదు. సహజప్రక్రియలోనే వారికి వ్యాసుని వల్ల సంతానం కలిగారు. తనకు దుర్వాసుని మంత్రం, సూర్యుని అనుగ్రహం ఉన్నప్పటికీ, సంస్కృత భారతం ప్రకారం కుంతి నవమాసాలు మోసే కర్ణుని కంది. దీర్ఘతముడు అనే ముని కూడా బలి అనే రాజు భార్యకు నియోగపద్ధతిలో, సహజప్రక్రియలోనే సంతానం ఇచ్చాడు. కల్మాషపాదుడనే రాజు భార్యకు వశిష్టుడు నియోగపద్ధతిలో, సహజవిధానంలోనే కొడుకును ఇచ్చాడు.

VanaParva

పాండురాజు కూడా నియోగ పద్ధతిలో తనకు సంతానం ఇమ్మనే కుంతిని అడిగాడు. ఆ విధంగా కలిగే సంతానం కూడా అన్నివిధాలా ఔరసునితో సమానమే నని కూడా అన్నాడు. నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని ఎలా తలచుకోమని కుంతి అనడంలో కూడా, తను కనవలసింది స్త్రీ-పురుష సంపర్కం ద్వారా అందరూ కనే సంతానమే తప్ప మరొకటి కాదన్న సూచన ఉండనే ఉంది. తీరా అందుకు అంగీకరించిన తర్వాత, తనకు దుర్వాసుడు ఇచ్చిన వరాన్నీ, ఆ వరప్రభావంతో ఏ దేవుణ్ణి తలచుకుంటే ఆ దేవుడు వచ్చి తనకు సంతానం ఇస్తాడన్న వివరాన్నీ ఆమె పైకి తీసింది. ఏ దేవుణ్ణి తలచుకోమంటావో చెప్పమని పాండురాజును అడిగింది. అలా క్రమంగా ఆమెకు దైవ సంబంధం వల్ల ముగ్గురు కొడుకులు, మాద్రికి ఇద్దరు కొడుకులు కలిగినట్టు కథకుడు చెబుతున్నాడు.

తనకు నియోగపద్ధతిలో సంతానం ఇమ్మని అడిగినప్పుడు పాండురాజు దృష్టిలో ఉన్నది తను పుట్టిన విధానమే. అంబాలికకు నియోగపద్ధతిలో వ్యాసుని వల్ల తను ఎలా పుట్టాడో ఆ ప్రక్రియలోనే తనకు సంతానం ఇమ్మని అతను కుంతిని అడిగాడు. ఆ సంగతి మహాభారతంలోనే స్పష్టంగా ఉంది(ఆదిపర్వం, పంచమాశ్వాసం, 59). కుంతికి గల వరమూ, ఆ వరప్రభావంతో దేవతలు వచ్చి ఆమెకు సంతానం ఇచ్చే అవకాశమూ అతని దృష్టిలో లేవు. అతనికి అంతవరకూ వాటి గురించి తెలియదు కూడా. ‘పరపురుషుని ఎలా తలచుకుంటా’మని కుంతి అన్నప్పుడూ తనకు దుర్వాసుడు ఇచ్చిన వరం ఆమె దృష్టిలో లేదు. అంటే, పాండురాజు, కుంతీ కూడా ఆ సమయంలో కేవలం నియోగం గురించే ఆలోచిస్తున్నారు. తీరా నియోగానికి తను ఆమోదించిన తర్వాత దుర్వాసుని వరం గురించీ, దేవతల గురించీ కుంతి చెబుతున్నదంటే, ఆ మాటలు నిజానికి ఆమెవి కావు, కథకుడివి. కారణం స్పష్టమే. తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారికి దైవసంబంధాన్ని ఆపాదించవలసిన అవసరం అతనికి కనిపించింది.

అదే సమయంలో కథకునిలోని వైరుధ్యాన్ని చూడండి…ఒకపక్క, కుంతికి సహజప్రక్రియలోనే సంతానం కలిగినట్టు తనే సూచిస్తున్నాడు. ఇంకోపక్క, దానికి మహిమను, దైవసంబంధాన్ని జోడిస్తున్నాడు…

***

మహాభారత కథకుని ప్రత్యేకతే అది. అతను నిజం దాచడు. కాకపోతే ఆ నిజంపై కల్పన అనే ఒక పారదర్శకమైన ముసుగు కప్పుతాడు. అందులోంచి నిజం కనిపించిపోతూనే ఉంటుంది.

పాండవుల పుట్టుకనే తీసుకోండి. కాస్త హేతుబద్ధంగా ఆలోచించేవారికి ఆ పుట్టుకపై తప్పనిసరిగా కొన్ని సందేహాలు కలుగుతాయి. భారత కథను ఉన్నదున్నట్టు తీసుకుంటూ విశ్వాసంలో భాగం చేసుకునే ఇప్పటివారికి, ఈ సందేహాలు ఈ కాలంలోనే పుట్టిన పెడధోరణిగా కనిపిస్తాయి. కానీ విశేషమేమిటంటే, పాండురాజు, మాద్రి మరణించిన తర్వాత కుంతి పాండవులను వెంటబెట్టుకుని కొందరు మునులతో కలసి హస్తినాపురానికి వచ్చినప్పుడు అక్కడి జనంలోనే కొందరికి పాండవుల పుట్టుకపై అనుమానాలు కలిగిన విషయాన్ని కథకుడు దాచకుండా చెబుతున్నాడు.

సంస్కృత భారతం ప్రకారం, పాండురాజు కన్నా గొప్పగా కనిపిస్తున్న వీరు అతని కొడుకులు ఎలా అవుతారని కొందరూ; కుంతి, మాద్రి పతివ్రతలు కనుక పాండురాజు కొడుకులేనని మరికొందరూ అనుకుంటే; పాండురాజు ఎప్పుడో శాపగ్రస్తుడైనప్పుడు ఇంత చిన్న వయసు పిల్లలు అతనికి ఎలా కలుగుతారని ఇంకొందరు అనుకున్నారట. అప్పుడు కుంతి వెంట వచ్చిన మునులే కాక, దేవతలు కూడా వీరు పాండురాజు కొడుకులే నని చెప్పారట. పాండవుల పుట్టుకను కొందరు అనుమానించిన సంగతిని మాత్రం తెలుగు భారతం పరిహరించింది.

శతశృంగం నుంచి పాండవులను హస్తినాపురానికి తీసుకొచ్చినప్పుడు వారి వయసు ఎంత అన్న విషయంలో కూడా సంస్కృత, తెలుగు భారతాల మధ్య తేడా కనిపిస్తుంది. పాండవులు ఒక్కొక్కరి వయస్సులలోనూ ఏడాది తేడా ఉందని చెబుతూనే, హస్తినాపురానికి వచ్చినప్పుడు ఆ అయిదుగురూ అయిదేళ్ళ వయసు వారిగానే కనిపించారని సంస్కృత భారతం చెబుతోంది. తెలుగు భారతం పాండవుల వయసులలో ఏడాది తేడా ఉందని అంటూనే హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజు వయసు పదహారేళ్లని చెబుతోంది.

పాండవుల పుట్టుక గురించి సంప్రదాయవర్గాలలోనే ఎంతో చర్చ జరిగింది. ఆ వివరాలు చెప్పుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ చర్చకు తెరతీసిన తెలుగువారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి, చారిత్రక దృష్టి నుంచి మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారే. వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన ‘మహాభారతతత్త్వకథనము’లో పెండ్యాలవారి అభిప్రాయాలను ఖండించారు.

పెండ్యాలవారి వాదం ప్రకారం, పాండవుల జన్మస్థానమైన శతశృంగం నేటి టిబెట్టే. ఒక స్త్రీ అనేకులను పెళ్లాడే ఆచారం టిబెట్టులోనే ఉందని ఆయన అంటారు. అయిదుగురూ ద్రౌపదిని పెళ్ళాడడం ఎలా ధర్మబద్ధమని ద్రుపదుడు ప్రశ్నించినప్పుడు, మా పూర్వుల ఆచారాన్నే మేము పాటించదలచుకున్నామని ధర్మరాజు జవాబిస్తాడు. ఆ మాట టిబెట్టులోని ఆచారాన్నే సూచిస్తుందనీ పెండ్యాలవారు అంటారు. పాండవులు విదేశీయులే కాక, ధర్మరాజుకు విదేశీ భాష (టిబెట్ కు చెందిన భాష) తెలుసు నంటూ మహాభారతంలోని ఒక సందర్భాన్ని ఆయన ఉదహరించారు. అదేమిటంటే:

ధర్మరాజును ధృతరాష్ట్రుడు యువరాజుగా అభిషేకించిన తర్వాత అతను విపరీతమైన జనాదరణను పొందాడు. దుర్యోధనుడు దానిని సహించలేకపోయాడు. తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు. పుత్రప్రేమకు లొంగిపోయిన ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతం అనే ప్రాంతానికి వెళ్లమన్నాడు. పాండవులు కుంతితో కలసి వారణావతానికి బయలుదేరారు. అప్పుడు, హస్తినాపురంలో వారిని అభిమానించే జనం కూడా వారివెంట కొంత దూరం వెళ్లారు. అలాగే విదురుడు కూడా వెళ్ళాడు. అక్కడ ఉన్నవారికి వినిపించినా అర్థం కాని మాటలతో ధర్మరాజుకు విదురుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయాడు.

విదురుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతి ధర్మరాజు దగ్గరికి వచ్చి, విదురుడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగింది. ధృతరాష్ట్రుడు మీ హితం కోరేవాడు కాదనీ, మీకు అపకారం చేస్తాడనీ, ఆహారంలో విషం కలిపే అవకాశం, అగ్ని ప్రమాదం మొదలైన వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలనీ; దుర్యోధనుని కుట్ర కనిపెడుతూ అందుకు చేయవలసిన ప్రతీకారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాననీ విదురుడు చెప్పినట్టు ధర్మరాజు తల్లితో అన్నాడు. విదురుడు ధర్మరాజుతో మాట్లాడింది విదేశీ భాషలోనే ననీ, అది టిబెట్ భాష కావచ్చుననీ పెండ్యాలవారు అంటారు.

అంటే ఆ భాష ధర్మరాజుకే కాక విదురుడికీ తెలుసునన్న మాట.

ఇంకా విశేషం ఏమిటంటే, ఇంద్రుని వల్ల అర్జునుడు ఒక్కడే కుంతికి పుట్టాడనీ, ధర్మరాజు, భీముడు ఆమెకు పుట్టలేదనే భావన కలిగించే వాక్యాలు సంస్కృత భారతంలో ఉన్నాయి. ‘బ్రహ్మచర్యవ్రతంలో ఉన్న పాండురాజుకు ధర్మదేవత ప్రత్యక్షంగా ధర్మరాజును పుట్టించాడు. అలాగే, మహాబలవంతుడైన భీముని వాయుదేవుడు ఇచ్చాడు. ఇంద్రుని వల్ల కుంతికే అర్జునుడు పుట్టాడు’ అని సంస్కృత భారతం(ఆది-అ 126)అంటోంది.

కుంతికి పృథ అనే పేరు ఉంది కనుక, పాండవులలో ఒక్క అర్జునుడికే పార్థుడనే(పృథ కొడుకు పార్థుడు అవుతాడు)పేరు ఉంది కనుక వాస్తవంగా కుంతికి పుట్టింది అతనొక్కడే కావచ్చునని పెండ్యాలవారి అనుమానం. యముడు, వాయువు తలచుకున్న వెంటనే కొడుకుల్ని ఇవ్వగా, ఇంద్రుడు ఏడాది పాటు తపస్సు చేస్తే కానీ కరుణించని సంగతిని ఆయన ఉదహరిస్తారు. ఇంకోచోట ఆయనే, పురాణ మునులలో ధర్ముడు, వాయువు అనే పేర్లతో ఇద్దరు మునులు; ఇంద్రుడు అనే పేరుతో ఇద్దరు మునులు ఉన్నారనీ, వీరి పేర్లతో ఋగ్వేదంలో సూక్తాలు కూడా ఉన్నాయనీ; కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఈ మునుల వల్ల కలిగి ఉండే అవకాశం ఉందని అంటారు. భైరప్ప అన్వయం కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

పెండ్యాలవారి వాదాలను ఖండించడంలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఇటువంటి హేతుబద్ధ పరిశీలన, గ్రంథస్థ వివరాల జోలికి వెళ్లకుండా మునులు, దేవతలు చెప్పిన మాటలనే ప్రమాణంగా తీసుకున్నారు. అంటే, ఆయన వాదనలో కేవలం విశ్వాసానిదే పై చేయి అయిందన్న మాట.

మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

 

 

మహాభారతంలో ఒక భౌగోళిక వివరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

తనకు క్షేత్రజులను ఇమ్మని కుంతిని కోరుతూ పాండురాజు ఇంకో సంగతి కూడా గుర్తుచేశాడు…

అది, కుంతి చెల్లెలు శ్రుతసేన కూడా క్షేత్రజులను కనడం! కేకయరాజు శారదండాయని భార్య శ్రుతసేన. తనవల్ల పుత్రసంతానం కలగకపోవడంతో నియోగపద్ధతిలో సంతానం కనమని కేకయరాజు భార్యకు చెప్పాడు. అప్పుడు శ్రుతసేన పుంసవన హోమం చేయించి ఋత్విజుల ద్వారా ముగ్గురు కొడుకులను కంది.

అయితే, పాండురాజు ప్రతిపాదనకు కుంతి వెంటనే ఒప్పుకోలేదు. ‘నువ్వు భరతకులశ్రేష్ఠుడివి. నీకు మేము ధర్మపత్నులం. పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటాం?’ అంది. ‘అదీగాక మా మీద నీ అనుగ్రహం ఉంటే సంతానం అదే కలుగుతుంది. అలాంటి ఒక పుణ్యకథను నేను పౌరాణికుల ద్వారా విన్నాను’ అంటూ ఆ కథ చెప్పింది.

“పూర్వం వ్యుషితాశ్వుడు అనే రాజు ఉండేవాడు. అతను పురువంశంవాడు. వంద అశ్వమేధయాగాలు చేశాడు. అతని భార్యపేరు భద్ర. వారికి సంతానం కలగలేదు. అతను భార్యతో విపరీతకామాసక్తితో నిరంతరం సంగమించేవాడు. దాంతో అతనికి రోగం వచ్చింది. ఆ రోగంతో కన్ను మూశాడు. భర్త వియోగాన్ని భార్య భరించలేకపోయింది. ‘నువ్వు లేకుండా నేను జీవించలేను. నేనూ నీతోనే వస్తాను. లేదా నీ లాంటి కొడుకులనైనా నాకు ఇవ్వు’ అంటూ భర్త శవాన్ని కౌగలించుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడా శవంలోంచి ఒక దివ్యవాణి వినిపించింది. ‘విచారించకు. నీకు కొడుకులు కలిగేలా వరమిస్తున్నాను. ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదో రోజున గానీ, పద్నాలుగో రోజున గానీ శుచిగా పాన్పు మీద పడుకుని నన్ను తలచుకో’ అని చెప్పింది. ఆమె అలాగే చేసింది. అప్పుడామెకు ముగ్గురు సాల్వులు, నలుగురు మద్రులు- మొత్తం ఏడుగురు కొడుకులు కలిగారు”.

ఈ కథ చెప్పిన కుంతి,‘ఆ రాజులానే నువ్వు మమ్మల్ని అనుగ్రహించి సంతానం పొందు’ అని పాండురాజుతో అంది. పాండురాజు దానికి సమాధానం చెప్పలేదు. ‘వెనకటి కాలంలో స్త్రీలు పురుషుల అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరించేవారనీ, అఖిలప్రాణి సాధారణమైనధర్మం పాటిస్తూ ఋతుకాలం తప్పకుండా తమ తమ వర్ణాలలో స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ కూడా సంబంధం పెట్టుకునేవా’రని అంటూ, ఉద్దాలకుని కథ చెప్పాడు. ఆ కథలో ఉద్దాలకుని భార్యను ఒక వృద్ధవిప్రుడు సంతానం కోసం కామించగా, ఆమె కొడుకు శ్వేతకేతుడు ఆగ్రహించాడు. ‘ఇకనుంచి స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, అందువల్ల సకల పాపాలూ చుట్టుకుంటాయనీ, ఈ మేరకు తను కట్టడి చేస్తున్నాననీ, దీనిని మనుషులందరూ పాటించా’లనీ శాసించాడు.

కుంతి, పాండురాజుల మధ్య సాగిన ఈ కాస్త సంభాషణా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఉదాహరణకు, నీ చెల్లెలు శ్రుతసేన భర్త నియోగంతో క్షేత్రజులను కందని కుంతితో పాండురాజు అన్న తీరు చూస్తే, తన చెల్లెలు ఎలా సంతానం కన్నదో అక్కకే తెలియదా అనిపించి, అసంబద్ధంగా కనిపిస్తుంది. లేదా, తన కోరికను సమర్ధించుకోవడం కోసం, తన చెల్లెలు సంగతిని కుంతికి పాండురాజు గుర్తుచేశాడనుకుంటే బహుశా అది రెండు సూచనలు చేస్తోంది: మొదటిది, క్షేత్రజులను కనడం అనే ఆనవాయితీ, అందులో తప్పు లేదన్న భావనా అప్పటికే పాతుకుని ఉండడం. రెండోది, కుంతి కన్యగా ఉన్నప్పుడు కర్ణుని కన్న ఉదంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆమె సామాజిక నేపథ్యంలో క్షేత్రజసంతానం ఏమంత ఆక్షేపణీయం కాకపోవడం. భైరప్ప తన ‘పర్వ’ నవలలో కూడా కుంతిది నిమ్నసామాజికవర్గంగా చిత్రిస్తారు. ఆమెకు ఒక తరం వెనకే, ఆమె కంటే ఉన్నత సామాజికవర్గంగా కనిపించే భరతకులానికి చెందిన క్షత్రియకుటుంబం నియోగ పద్ధతిని ఆశ్రయించి క్షేత్రజ సంతానాన్ని(వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్ర, పాండురాజులు జన్మించడం)పొందిన మాట నిజమే. కానీ అప్పటికే ఉన్నత సామాజిక వర్గాలలో అది ఆక్షేపణీయంగా మారుతూ ఉండవచ్చు.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

అదే సమయంలో ఇంకొకటి జరుగుతూ ఉండచ్చు. అది,నిమ్నసామాజికవర్గాల ఊర్ధ్వచలనం(upward mobility). పాండురాజుకు కుంతిని ఇవ్వడం ద్వారా భరతకుల క్షత్రియులతో వియ్యమందుతున్న భోజకులకు(కుంతి దత్తత తండ్రి కుంతిభోజుడు భోజక తెగకు చెందిన యాదవుడు) కుంతి పుట్టింట కన్యగా ఉండి కొడుకును కన్న సంగతిని రహస్యంగా ఉంచవలసిన అవసరం కనిపించి ఉండవచ్చు. భైరప్ప అన్వయం ఇంచుమించు ఇలాగే సాగుతుంది.

నా అభిప్రాయంలో దీనిని మరోలా చూడవచ్చు: క్షేత్రజ సంతానం పట్ల కానీ, కన్యాగర్భం పట్ల కానీ ఉన్నత, నిమ్న సామాజిక వర్గాలలో(అలాంటి స్పష్టమైన విభజన నిజంగా ఉందనుకుంటే) ఎటువంటి అభ్యంతరాలు, లేదా ఆమోదాలు ఉన్నాయో మనకు కచ్చితంగా తెలియదు. మనకూ, వారికీ మధ్య; భిన్న కాలాలకు, విలువలకు చెందిన కథకుడు ఉన్నాడు. మన ఎదురుగా ఉన్నది; అతని అభ్యంతరాలను, లేదా ఆమోదాలను కూడా సూచించే వ్యాఖ్యాన రూపంలోని కథ మాత్రమే. అతని గుప్పిటి సందులలోంచి జారిపడే వాస్తవాల తునకలే మనకు ఆధారం. ఆ తునకల ఆధారంగానే కథను మనం పునర్నిర్మించుకోవాలి. కుంతి-పాండురాజుల సంభాషణలో క్షేత్రజుల గురించి జరిగిన చర్చ అలాంటి తునకలలో ఒకటి.

క్షేత్రజ సంతానాన్ని ఆక్షేపణీయంగా భావించడం ప్రారంభించిన ఉన్నత సామాజిక వర్గానికి పాండురాజు ప్రతినిధి అనుకుందాం. క్షేత్రజ సంతానం అంత ఆక్షేపణీయం కాకపోయినా, ఊర్ధ్వచలనంలో భాగంగా ఆ ఆనవాయితీనుంచి బయటపడాలనుకునే నిమ్నసామాజికవర్గానికి కుంతి ప్రతినిధి అనుకుందాం. అప్పుడు వారిద్దరి సంభాషణా కొంత అర్ధవంతంగా కనిపిస్తుంది. తమ స్థాయిలో క్షేత్రజ సంతానం గౌరవప్రదం కాదని పాండురాజుకు తెలుసు. తన అన్న ధృతరాష్ట్రుడికి అలాంటి అవసరం లేదన్న సంగతి అతని దృష్టిలో సహజంగానే ఉంటుంది. తను క్షేత్రజ సంతానం పొందితే సాటివారిలో తలవంపుగానే ఉంటుంది. కానీ ఒక దశలో అంతకంటే గత్యంతరం లేదని అతనికి అనిపించింది. క్షేత్రజ సంతానానికి కుంతిని ఒప్పించడంతోపాటు, బహుశా అంతకంటే ఎక్కువగా తను సమాధానపడడానికి అతను ఎక్కువ సమయం తీసుకోవలసి వచ్చింది. ఎక్కువ ఆలోచనా, ధైర్యమూ చేయవలసి వచ్చింది. సమర్ధింపులనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఏకాంతంలో తన బాధను కుంతి దగ్గర వెళ్లబోసుకోవడం, పన్నెండురకాల కొడుకుల గురించి వివరించడం, క్షేత్రజులు ఔరసులకు ఏమాత్రం తక్కువ కారని అనడం, వెనకటి కాలంలో స్త్రీ-పురుష సంబంధాలు ఎలా ఉండేవో చెప్పడం, కుంతి చెల్లెలి ఉదాహరణను ప్రస్తావించడం -కుంతిని మానసికంగా సిద్ధం చేయడంగానూ, అంతకంటే ఎక్కువగా తను మానసికంగా సిద్ధపడే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.

కుంతి సమస్య వేరు. తన సామాజిక నేపథ్యం రీత్యా క్షేత్రజసంతానం ఆమెకు అంత ఆక్షేపణీయం కాదు. ఆ విషయంలో స్వయంగా తనకే అనుభవం ఉంది కూడా. కానీ ఇప్పుడు తను భరతకుల క్షత్రియుల కోడలు. తన స్థాయి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ క్షేత్రజ సంతానం వైపు మళ్లడం ఆమెకు స్థాయీ పతనంగా కనిపిస్తుంది. డానికి తోడు తోటికోడలు గాంధారి ఆమె కళ్ల ముందు ఉంటుంది. గాంధారికి క్షేత్రజ సంతానం కనవలసిన అవసరం లేదు. కనుక క్షేత్రజ సంతానం కనడం కుంతికీ సాటివారిలో తలవంపే. అయితే, పాండురాజుకులానే ఆమెకూ గత్యంతరం లేదని తెలుసు.

ఈ మొత్తం చర్చ అంతా ఎక్కడ ఎలా ప్రారంభమైందో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సంతానం లేని తనకు ఉత్తమగతులు ఉండవన్న పాండురాజు చింత నుంచి ఇదంతా ప్రారంభమైంది. అయితే, అంత స్పష్టంగా చెప్పకపోయినా ఇక్కడ ఆస్తిహక్కు, వారసత్వాల గురించిన చింత కూడా ఉంది. క్షేత్రజులు కూడా ఔరసుల లానే బంధువులు, దాయాదులు అవుతారని పాండురాజు అనడమే చూడండి. అలా అనడంలో ఆస్తిహక్కు గురించిన కోణమూ బయటపడుతూ ఉండచ్చు. ఈ కోణం నుంచి చూసినప్పుడు పాండురాజు-కుంతి సంభాషణ రూపంలో పైకి కనిపించే కథ వెనుక, కనిపించని కథ చాలా ఉందని అనిపిస్తుంది. కురు-పాండవుల మధ్య ఆస్తి పోరాటం తాలూకు మూలాలు అక్కడినుంచే ఉన్నాయని కూడా అనిపిస్తుంది. పాండురాజు-కుంతి సంభాషణలో కనిపించని టెన్షన్ చాలా ఉన్నట్టూ అనిపిస్తుంది.

వందల సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న పురాణ కథల విషయంలో ఒక సమస్య ఉంది. అవి కాలగతిలో ఒక విశ్వాసంగానూ; ప్రశ్నలకు, అనుమానాలకు, హేతుబద్ధతకు అతీతంగానూ ఘనీభవించిపోతాయి. వాటిని ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోడానికి అలవాటుపడిపోతాం. వాటిని తార్కికంగానూ, హేతుబద్ధంగానూ పరిశీలించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఘనీభవస్థితి నుంచి అవి కరగడం ప్రారంభించి కొత్త కోణాలను బయటపెడుతూ కొత్త రూపాలు తీసుకుంటాయి.

ఏదో విధంగా తను సంతానవతి కావడం మినహా గత్యంతరం లేదని తెలిసినా, కుంతి భర్త దగ్గర వెంటనే బయటపడలేదు. తన వెనకటి సామాజిక నేపథ్యమూ, క్షేత్రజుని కనడంలో తనకున్న పాత అనుభవమూ ఆ క్షణంలో ఆమెను కెలుకుతూ ఉండచ్చు. మారిన తన సామాజికస్థాయి కారణంగా ఆమెలో కొంత జంకు, భర్త దృష్టిలో పలచనవుతానన్న భయమూ ఉండడం సహజమే. అందుకే భరతకుల శ్రేష్ఠుడవైన నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటామంది. తనతోపాటు, సవతి అయిన మాద్రిని కూడా కలుపుకుంది. అంటే, ఈ విషయంలో మొత్తం బాధ్యతను తనొక్కతే తీసుకోడానికి కుంతి సిద్ధంగా లేదన్న మాట. మాద్రిని కూడా భాగస్వామిని చేస్తే తనపై ఉన్న చిన్నతనపు భారం కొంత ఆమెకు బదిలీ అవుతుంది. ఆ తర్వాత నియోగపద్ధతిలో నకుల, సహదేవులను కనడం ద్వారా మాద్రి ఇందులో పూర్తి భాగస్వామిని అయింది కూడా.

పాండురాజు వల్ల తమకు సంతానం కలిగే అవకాశం లేదని కుంతికి తెలుసు. అలాగే, తను పురుష సంపర్కంతోనే సంతానం కలుగుతుందని తెలియని అమాయకురాలేమీ కాదు. కనుక, నీ అనుగ్రహం ఉంటే మాకు సంతానం అదే కలుగుతుందని ఆమె అనడంలో అర్థంలేదు. భర్త కోరికను వెంటనే ఆమోదించి తను తేలికవకూడదనే ఉద్దేశంతో ఆమాట అన్నట్టు తెలుస్తూనే ఉంది. ఆపైన, ఆమె చెప్పిన కథ వల్ల ఆ ఉద్దేశం మరింత హాస్యాస్పదమైన మలుపు తిరిగింది. చనిపోయిన భర్తను కౌగలించుకుని భార్య ఏడుస్తూ సంతానం ఇమ్మని అడిగినట్టూ, అప్పుడు, నీకు సంతానం కలిగేలా వరమిస్తున్నానని భర్త కళేబరం నుంచి దివ్యవాణి పలికినట్టు, ఆమెకు ఏడుగురు కొడుకులు కలిగినట్టు ఆ కథ చెబుతోంది.

కాస్త లోతుగా పరిశీలిస్తే పైకి అమాయకంగా కనిపించే ఈ కథలో అతితెలివి దాగి ఉన్న సంగతీ అర్థమవుతుంది. చనిపోయిన భర్త కూడా భార్యకు సంతానం అనుగ్రహించగలడని కుంతి ముఖతా కథకుడు చెబుతున్నాడు. అంటే, భర్తకు దివ్యత్వం (దివ్యవాణి)ఆపాదిస్తున్నాడు. కానీ మరోవైపు, వ్యుషితాశ్వుని భార్యకు మనుష్య ప్రక్రియలోనే సంతానం కలిగిన విషయాన్నీ తనే బయటపెడుతున్నాడు. ఎలాగంటే, వ్యుషితాశ్వుడు పురువంశ రాజు. అతని భార్యకు కలిగిన ఏడుగురు కొడుకులలో నలుగురు సాల్వులు, ముగ్గురు మాద్రులు. అంటే వారు సాల్వ, మద్రతెగలకు చెందిన పురుషుల ద్వారా కలిగిన సంతానమన్న మాట. దీనినిబట్టి ఇందులో భర్త నియోగం కూడా లేదనీ, భర్త మరణించాక భార్య ఇతరుల వల్ల సంతానం కన్నదనీ తెలిసిపోతోంది. పైగా, ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదవరోజు, లేదా పద్నాలుగవరోజు సంతానం పొందడానికి యోగ్యమైన సమయమన్న వివరాన్ని కూడా ఈ కథ చెబుతోంది. ఈ విధంగా కథకుడు ఎన్నోచోట్ల చేసినట్టుగా మనుష్యధర్మం మీదే దేవధర్మం లేదా దివ్యత్వం అనే ముసుగు కప్పి శ్రోతలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎప్పటిలా విఫలయత్నంగా మారుతోంది.

అంటే ఏమిటన్నమాట? భర్త కోరికకు వెంటనే ఆమోదించనట్టు కుంతి కనిపిస్తూనే, ఆ కోరికకు అనుకూలించే కథే చెబుతోంది.

ఇక్కడినుంచి పాండురాజు అక్షరాలా స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్ర గురించి చెప్పడం ప్రారంభించాడు. వెనకటి కాలంలో స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఋతుకాలంలో ధర్మం తప్పకుండా స్వపురుషులతో, పరపురుషులతో సంతానం కనేవారని చెప్పడం దీనికి ప్రారంభం. ఆ తర్వాత ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు దానిని ఎలా నిషేధించాడో కూడా చెప్పాడు. నిషేధించినప్పుడు తను కుంతిని క్షేత్రజసంతానం కనమని అడగడం ఎలా పొసగుతుందనే ప్రశ్న వస్తుంది. దానికి పాండురాజే ఆ వెంటనే సమాధానం ఇస్తున్నాడు. శ్వేతకేతు నిషేధం మనుష్యజాతికి చెందిన స్త్రీల పరపురుష సంబంధానికి మాత్రమే వర్తిస్తుంది. అది పశుపక్షులకూ, ఉత్తరకురుభూములలోని వారికీ వర్తించదు. పశుపక్షులలోనూ, ఉత్తర కురుభూములలోనూ వెనకటి ధర్మమే అమలు జరుగుతోంది!

అదీ సంగతి…స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్రలో భాగంగా పాండురాజు వాటి ప్రాంతీయభేదాల గురించి కూడా చెబుతున్నాడు. అంతేకాదు, కుంతిని క్షేత్రజులను ఇమ్మని అడుగుతున్న పాండురాజు ఇప్పుడు భార్యల సహితంగా హిమాలయాలకు అవతల ఉత్తర కురుభూములలోనే ఉన్నాడు!

మహాభారతంలో స్పష్టమైన భౌగోళిక వివరాన్ని అందిస్తున్న ఘట్టాలలో ఇదొకటి.

పాండురాజు, అతని భార్యల ప్రయాణమార్గాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. మన్మథక్రీడలో ఉన్న మృగదంపతులను అన్యాయంగా చంపిన తర్వాత, మగమృగం తనను శపించిన తర్వాత విరక్తుడై తపస్సు చేసుకోవాలనుకున్న పాండురాజు భార్యలతో కలసి ఉత్తరదిశగా ప్రయాణం సాగించాడు. నాగశైలాన్ని, చైత్రరథాన్ని, హిమవంతాన్ని దాటివెళ్ళాడు. సురులు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉన్నాడు. అక్కడినుంచి మళ్ళీ బయలుదేరి ఇంద్రద్యుమ్న మనే కొలనునూ, హంసకూటాన్నీ దాటి ఎత్తైన శిఖరం కలిగిన శతశృంగం అనే పర్వతానికి చేరుకున్నాడు. అది కూడా సిద్ధులు, దేవతలు, యక్షులు నివసించే ప్రాంతం. ఆ శతశృంగంలోని ఉత్తరభాగంలో తపస్సు చేసుకుంటున్నాడు.

స్వర్గానికి వెళ్ళే మార్గంలోనే శతశృంగం ఉంది. దివ్యవిమానంలో వచ్చిపోయే దేవతలతో ఆ ప్రాంతం ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. అప్పుడే ఊర్ధ్వలోకాలకు వెడుతున్న మునులు అతనికి కనిపించారు. ఆరోజు అమావాస్య కనుక బ్రహ్మను దర్శించడానికి బ్రహ్మలోకానికి వెడుతున్నామని చెప్పారు. పాండురాజు, భార్యలతో సహా వారి వెనక బయలుదేరేసరికి, మిట్టపల్లాలతో నిండిన ఈ మార్గంలో సుకుమారులైన కుంతీ, మాద్రులు నడవలేరనీ, అదీగాక ఇది దేవతలు వెళ్ళే మార్గాలనీ చెప్పి మునులు వారించారు. దాంతో పాండురాజు శతశృంగంలోనే ఆగిపోయి సంతానం కోసం ఆలోచన ప్రారంభించాడు.

అంటే, ఉత్తరంగా హిమాలయాలకు అవతల ఉన్న ప్రాంతాన్నే ఉత్తరకురుభూములు అంటారన్నమాట. హిమాలయాలకు ఇవతల ఉన్న ప్రాంతం కురుభూమి కనుక, అవతల ఉన్నవి ఉత్తర కురుభూములు అవుతాయి. పాండురాజు ఉన్న శతశృంగం ఉత్తరకురుభూములలో భాగమే. ఆ ప్రాంతమంతటా సిద్ధులు, యక్షులు, దేవతలు, మునులు నివసిస్తున్నారు. గమనించండి, అక్కడ ‘మనుషులు’ ఉన్నట్టు భారతం చెప్పడం లేదు.

పురాకాలంలో జాతులు, తెగల వర్గీకరణకు సంబంధించి ఇది ఒక ఆసక్తికరమైన వివరం. ఒకవిధమైన జీవనశైలిని, ఆచారాలను, ఆహారవిహారాలను పాటించేవారికి; భిన్నమైన జీవనశైలి, ఆచారాలు, ఆహారవిహారాలను పాటించేవారు తమకంటే పూర్తి భిన్నులుగా కనిపించడం సహజమే. అవి వారికి విచిత్రంగానూ, అద్భుతంగానూ కనిపించడం కూడా సహజమే. ఆ విలక్షణత వారికి ఒక మాంత్రికతను, మార్మికతను ఆపాదింప చేసేలానూ ఉండచ్చు. తమకంటే అన్నివిధాలా భిన్నులనే భావనతో వారిని వేరే పేర్లతో పిలిచి ఉంటారు. ముఖ్యంగా మన ప్రస్తుతాంశానికి సంబంధించి, అక్కడ స్త్రీ-పురుష సంబంధాలు కూడా కురుభూములలో కంటే భిన్నంగా ఉంటాయి.

శతశృంగంనుంచే స్వర్గానికి వెళ్ళే మార్గం ఉంది. అది కూడా మిట్టపల్లాలతో ఉంటుంది. అంటే, స్వర్గం మరెక్కడో లేదు, ఈ భూమి మీదే ఉందని ఈ వివరాలు చెబుతున్నాయి. హిమాలయాలకు అవతల ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు భౌగోళికంగా వేర్వేరు దేశాల పేర్లతో ఉండి ఉండవచ్చు. పాండురాజు ప్రయాణమార్గాన్ని సూచిస్తూ మహాభారతం పేర్కొన్న స్థలనామాల ఆధారంగా ఇప్పటి ప్రదేశాలను, దేశాలను గుర్తించడం ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు. కానీ మనకు బాగా తెలిసిన హిమాలయాలను పేర్కొంది కనుక ఈ మొత్తం ఘట్టం భౌగోళిక సమాచారాన్ని ఇస్తున్నదనడంలో సందేహం లేదు.

మహాభారతంలో ఉత్తరకురుభూముల ప్రస్తావన, అదే స్వర్గమన్న సూచన, అక్కడ స్త్రీ-పురుషసంబంధాలు భిన్నంగా ఉంటాయన్న సంగతీ ఇక్కడ ఒక్కచోటే కాదు; చాలా చోట్ల వస్తుంది. ఆ వివరాలలోకి ఇప్పుడు పూర్తిగా వెళ్లలేం. కాకపోతే ఒక విషయం చెప్పుకోవాలి. పాండురాజు ప్రయాణ సమాచారం హిమాలయాలను కూడా దాటిపోయే మన పూర్వుల సంచార పరిధిని వెల్లడిస్తోంది. అంతేకాదు, ఆయా ప్రాంతాలు, మనుషులతో వారికి గల సంబంధాల వైశాల్యాన్నీ సూచిస్తోంది. దేశాలు, ప్రాంతాలు, మనుషుల మధ్య నేడు ఉన్నట్టు కృత్రిమమైన హద్దులు ఏవీ లేని కాలం అది. అటువంటి ఆ కాలం మన పూర్వుల దృష్టి వైశాల్యాన్ని ఎంత నిరవధికంగా పెంచి ఉంటుందో; రక రకాల ప్రాంతాలు, వ్యక్తులతో సంబంధాలు వారికి ఎటువంటి అనుభవాలు కలిగించాయో, వారి ప్రాపంచిక దృష్టిని ఏమేరకు ప్రభావితం చేసి ఉంటాయో-ఈరోజు అనేక హద్దులు, పరిమితులలో జీవించే మన ఊహకు అందడం కష్టం. మన పూర్వులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన ప్రపంచాన్ని చూశారన్న చరిత్రకారుడు హెచ్.జి.వెల్స్ మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి.

ప్రస్తుతానికి వస్తే, చివరిగా, కల్మాషపాదుడనే రాజు నియోగించడంతో, అతని భార్య వశిష్టుని వల్ల అశ్మకుడనే కొడుకును పొందిన ఉదంతాన్ని కూడా పాండురాజు కుంతికి చెప్పాడు. తర్వాత కుంతి నియోగపద్ధతిలో సంతానం కనడానికి అంగీకరించింది. తనకు పూర్వం దుర్వాసుడు ఇచ్చిన వరం గురించి చెప్పింది. ఆ మంత్రప్రభావంతో ఏ దేవతను ఆరాధించినా వారు వచ్చి తనకు సంతానం ఇస్తారనీ, ఎవరిని ఆరాధించాలో చెప్పమనీ అడిగింది. పాండురాజు యమధర్మరాజును ఆరాధించమని చెప్పగా కుంతి అలాగే చేసింది. అప్పుడు ఆమెకు ధర్మరాజు పుట్టాడు. ఆ తర్వాత వరసగా వాయుదేవుని వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు ఆమెకు కలిగారు. ఆ తర్వాత మాద్రి కోరగా కుంతి వరప్రభావం వల్ల ఆమెకు కూడా నకుల, సహదేవులు కలిగారు.

పాండవుల జననంలో కూడా మళ్ళీ తెలివిగా దేవధర్మం, మనుష్యధర్మాలను జోడించడం ఉంది. దానితోపాటు, మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

-కల్లూరి భాస్కరం

మూడు ‘క్షేత్రా’ల ముడి

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నే నిప్పుడు ఒక విచిత్రమైన తర్కానికి లోనవుతున్నాను. దాని గురించి ముందుగా చెప్పాలనిపిస్తోంది.

ఈ వ్యాసాలను కేవలం ‘చూసే’ వారు ఉంటారు. యధాలాపంగా చదివేవారు ఉంటారు. ఆసక్తితో, ఇష్టంతో, లోతుగా చదివేవారు ఉంటారు. ఒకవిధమైన ఆసక్తి ఉన్నా అయిష్టంగా చదివేవారు ఉంటారు. ఆసక్తి లేకుండా కేవలం అయిష్టంగా చదివేవారు ఉంటారు. పాఠకులలో అనేక రకాలు. నేను కూడా ఇలాంటి పాఠకరకాలలో ఒక రకానికి చెందినవాణ్ణే కనుక ఈ వైవిధ్యాన్ని గౌరవిస్తాను.

ఈ పాఠకరకాలలో ఒక రకంవారికి, లేదా కొన్ని రకాల వారికి ‘మళ్ళీ మళ్ళీ ఇదేల భారతం’ అనిపిస్తూ ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళ దాకా ఎందుకు? ఎంతోమంది మహాపండితులు రాసిన భారతం, రామాయణం, పురాణాలు, ధర్మశాస్త్రాల సంగతులు నేనెందుకు రాస్తున్నానని ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది.

నేను విచిత్రమైన తర్కానికి లోనవుతున్నా నన్నది -ఇదిగో, ఇక్కడే!

నిజానికి నేనివి రాస్తున్నప్పుడు భారతం గురించి రాస్తున్నానన్న స్పృహ నాలో లేదు. భారత కథలు, పాత్రలు, ఘట్టాల గురించి ఇంతగా రాస్తున్నప్పుడు ఇది భారతం గురించి కాకుండా ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది తర్కం. సంగతేమిటంటే, భారతం మిషతో నేను భారతదేశం గురించి రాస్తున్నాను. భారతంలో కనిపించే భారతదేశ మూలాల గురించి, మన మూలాల గురించి రాస్తున్నాను. భారత, రామాయణాలను, పురాణాలను, ధర్మశాస్త్రాలను ఒకానొక కాలానికి చెందినవిగా మాత్రమే చూస్తూ; కాలమనే నదిలో ప్రవహిస్తున్న వాటికి ఆనకట్ట పడినట్టు ఊహించుకుంటున్నవారికి నేను భారతం గురించి మాత్రమే రాస్తున్నట్టు కనిపిస్తుంది. మరల ఇదేల భారతం అనిపిస్తుంది. కానీ నా అవగాహన వేరు. నా ఊహలో కాలమనే నదిలో ప్రవహిస్తున్న భారతరామాయణాదులకు ఎలాంటి ఆనకట్టలూ లేవు. చాలామందికి అవి గతంలా అనిపిస్తాయి. కానీ అవి నాకు వర్తమానం!!!

ఇంకోలా కూడా చెప్పుకుందాం. మనం ఇప్పటికీ మనిషి గురించి చెప్పుకుంటున్నాం. ‘మళ్ళీ ఇదేల మనిషి గురించి’ అనుకోవడం లేదు. కానీ ఈ మనిషి ఎప్పటివాడు? మనం ఇప్పటికీ విశ్వం గురించీ, ప్రపంచం గురించీ మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ విశ్వమూ, ప్రపంచమూ ఎప్పటివి? మనం ఇప్పటికీ భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ భారతదేశం ఎప్పటిది? అలాగే, భారతరామాయణాదులే కాదు; ప్రపంచ వాజ్మయం సమస్తం -మనిషి, విశ్వం, ప్రపంచం, భారతదేశం లాంటివే. కనుక వాటి గురించి ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం.

ఇంకా నా ఉద్దేశంలో భారతం అంటే భారతదేశమే. భారతం గురించి చెప్పుకోవడం అంటే, భారతదేశం గురించి చెప్పుకోవడమే. ఇంకా చెప్పాలంటే ఒకనాటి ప్రపంచం గురించి చెప్పుకోవడమే. ఇంత వైవిధ్యవంతమైన ప్రపంచంలో ఏ విషయంలోనైనా ‘ఇది కచ్చితం’‘ఇది ఇంతే’ అనగలిగిన సాహసం ఏ మానవమాత్రుడికీ ఉండదని నేను నమ్ముతాను. అయినాసరే, ఒక విషయంలో మాత్రం నా అనుభవంనుంచి ఒకింత కచ్చితానికి దగ్గరగా మాట్లాడతాను. అదేమిటంటే, భారతంతో (అలాగే ఇతర పురాతన వాజ్మయంతో)తగు మేరకు పరిచయం లేకపోతే భారతదేశమూ, ప్రపంచమూ కూడా అర్థం కావు. సమకాలీనమైన ఏ సమస్య పైన అయినా మీరు సాధికారంగా మాట్లాడదలచుకుంటే, భారతం సహా పురావాజ్మయంతో మీకు కొంత పరిచయం ఉండితీరాలి!

ఒక ఇతిహాసం పేరే ఒక దేశానికి పేరైన ఉదాహరణ నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో మరొకటి లేదు. మళ్ళీ నేనిక్కడ భారతాన్నో, మరొకదాన్నో గ్లోరిఫై చేస్తున్నానని అనుకోవద్దు. నేను కవిత్వం రాయడం లేదు. అక్షరాలా ఉన్న మాట చెబుతున్నాను.

ఈ వ్యాసాల క్రమంలో ఇదే వివరణను-అచ్చంగా ఈ మాటల్లో కాకపోయినా-అప్పుడప్పుడు ఇచ్చుకుంటూనే వచ్చాను. అయినా మరోసారి ఇవ్వవలసి రావడం చూస్తే, నాకు ‘బ్రాహ్మణుడు-మేక’ కథ గుర్తొస్తోంది. ఆ కథలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞానికి మేకను తోలుకుపోతుంటే, ఆ మేకను కాజేయాలనుకున్న కొందరు దొంగలు దారిలో తలో చోటా కాపు కాసి,‘అదేమిటి అయ్యవారూ, కుక్కను తోలుకుపోతున్నారు’ అంటారు. నలుగురూ అలా అనేసరికి బ్రాహ్మణుడు అవునేమో ననుకుని దానిని వదిలేసి పోతాడు.

నేను కూడా ఆ బ్రాహ్మణుడిలా మోసపోకుండా జాగ్రత్త పడడానికే ఈ ఆత్మవిమర్శ లాంటి వివరణ.

***

మన ప్రాచీనులు లైంగికత్వాన్ని, స్త్రీ-పురుష సంబంధాలను మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన దృష్టి నుంచి చూశారనీ; లైంగిక సుఖాన్ని ప్రకృతిలో భాగంగా, అతి సహజంగా, స్వచ్ఛ, పవిత్ర కార్యంగా అర్థం చేసుకున్నారనీ కిందటి వ్యాసంలో అన్నాను. పురాచరిత్ర కోణం నుంచి ఇది చాలా ముఖ్యమైన వివరం. మనలో చాలామందికి ఈ విషయంలో తలకిందుల అభిప్రాయం ఉంది. లైంగికత విషయంలో మన పూర్వులు చాలా నిష్ఠను, కట్టడిని, నైతికతను పాటించారనీ; మన దగ్గరకు వచ్చేసరికి అవి పలచబారిపోయాయనీ వారు భావిస్తారు. ఈ విషయంలోనే కాక ప్రతి విషయంలోనూ వెనకటి తరాలవారి కంటే నేటి తరాలు అన్నివిధాలా పతనమై పోయాయనే ఒక సూత్రీకరణ వినిపిస్తూ ఉంటుంది. లోతుగా చూస్తే, ఈ అభిప్రాయంలో నిజం కన్నా అపోహే ఎక్కువ.

నేను లైంగికతపై ప్రాచీనుల దృష్టి గురించి పై మాటలు రాసిన తర్వాత, యధాలాపంగా ‘SEXUAL LIFE IN ANCIENT GREECE’ (ByHANSLITCH-1952 ముద్రణ) అనే పుస్తకం తిరగేయడం ప్రారంభించాను. ఈ పుస్తక రచయిత అక్కడక్కడ చేసిన వ్యాఖ్యలు నా అభిప్రాయాన్ని నూటికి నూరుపాళ్లూ ధ్రువీకరించేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. గ్రీకు కామెడీలో లైంగికోద్దీపక లక్షణం, అశ్లీలం చాలా ఎక్కువ పాళ్లలో ఉండడం గురించి రచయిత రాస్తూ, ప్రాచీనులు లైంగికత్వాన్ని చాలా అమాయకంగానూ, సహజంగానూ చూశారనీ, దానిపై ఎలాంటి రహస్యాల ముసుగులూ వేయలేదనీ అంటాడు. పైగా, లైంగికతను సమస్త ప్రాణుల అస్తిత్వానికి మూలమైన ప్రాథమిక అవసరంగా మతవిశ్వాసకోణంనుంచి చూసి ప్రస్తుతించారంటాడు(పేజీ-153).

అంతేకాదు,‘Religion And Erotic’ అనే అధ్యాయంలో,‘మతపరమైన అవసరాన్ని, మతపరమైన ఆకాంక్షను సఫలం చేసుకోవడం వెనుక చాలావరకూ లైంగికతే ఉందనీ, కొన్ని సందర్భాలలో అది ఉద్దేశపూర్వకంగా కూడా వెల్లడవుతుందనీ’ రచయిత అంటాడు(పేజీ-180). ఈ వాక్యం చూసినప్పుడు మనకు తాంత్రిక ధోరణులు గుర్తుకొస్తాయి.

అలాగే, లైంగికత విషయంలో యూదు-క్రైస్తవ దృక్పథం గురించి రచయిత ప్రస్తావిస్తాడు(పేజీ-180). మన దగ్గర ‘ఇనుప కచ్చడాలు కట్టుకున్న ముని మ్రుచ్చు’లన్నట్టుగానే, యూదు-క్రైస్తవ దృక్పథం కూడా శరీరాన్ని అన్ని విధాలా కష్టపెట్టుకోవాలనీ, కృశింపచేసుకోవాలనీ చెబుతుంది. అదే మనిషికి గొప్ప నైతికాదర్శమంటుంది. దేవతలు లైంగిక వాంఛకు అతీతులనీ, పవిత్రజీవితం గడిపినవారికే మరణానంతరం ఉత్తమగతి లభిస్తుందనీ అంటుంది. ఏకపక్షంగా ఈ అభిప్రాయాలను సమర్ధించేవారికి లైంగికతకు, మతానికి చాలా దగ్గర సంబంధం ఉందన్న సంగతిని అర్థమయ్యేలా చెప్పడం కష్టమంటాడు రచయిత.

లైంగికతకు, మతానికి ఉన్న ఈ ముడి గ్రీకు సమాజ, సంస్కృతులకే పరిమితం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంతో సహా ప్రాచీన సమాజాలు, సంస్కృతులు అన్నిటా ఈ ముడి ఉంది. తాంత్రిక ధోరణుల గురించి పైన ప్రస్తావించుకున్నాం. కేవలం పురాచరిత్ర కోణం నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రాచీన సమాజాలు మతపరమైన తంతులో లైంగికతను కూడా భాగం చేసి, అక్షరాలా దానిని ‘సెలెబ్రేట్’ చేసుకున్నాయి. ఆధునిక కాలంలోనూ కొత్త కొత్త రూపాలలో ఈ ముడి కనిపిస్తూనే ఉంది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్న ఈ కోణం గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తే ఇప్పట్లో పైకి తేలడం కష్టం. కనుక ప్రస్తుతానికి వస్తే…

***

పన్నెండు రకాల కొడుకుల గురించి చెప్పిన పాండురాజు, ఔరసులతో అన్ని విధాలా తులతూగే క్షేత్రజులను తనకు సంతానంగా ఇమ్మని కుంతిని కోరాడు. ఔరసుడి నుంచి అపవిద్ధుడి వరకూ ఉన్న ఆరు రకాల కొడుకులూ బంధువులే కాక దాయాదులు కూడా అవుతారన్నాడు. ఈ ఆరుగురిలోకి వచ్చే క్షేత్రజుడు, గూఢోత్పన్నుడు అనే రెండు రకాలవాళ్లూ నిజభర్తకు కలిగినవారు కాదు. అయినా సరే, వారు బంధువులే కాక, ఆస్తి హక్కు కలిగిన దాయాదులు కూడా అవుతారని చెప్పడం ద్వారా పాండురాజు వీరిని పూర్తి స్థాయిలో ఔరసులుగా గుర్తిస్తున్నాడు. మిగిలిన ఆరు రకాల వాళ్ళలో కూడా కానీనుడు, సహోఢుడు, పౌనర్భవుడు అనే ముగ్గురు కూడా నిజభర్తకు కలిగిన వాళ్ళు కాదు. పాండురాజు వీరిని బంధువులుగా గుర్తిస్తున్నాడు. ఇప్పటి వారసత్వ చట్టం గురించి నాకు అంతగా తెలియదు కానీ, అందులో ఇంత సడలింపు ఉంటుందని మాత్రం నేను అనుకోను. తెలిసినవారు చెప్పాలి.

ఈ ‘క్షేత్రజుడు’ అనే మాట పుట్టుక గురించి నా ఊహలు పరి పరి విధాలుగా పోయాయి. సంతానం కనే స్త్రీని క్షేత్రంగా, సంతానాన్ని ఇచ్చే పురుషుని బీజంగా, లేదా విత్తనంగా చెప్పడం ఉంది. ఈ క్షేత్ర, బీజాల పోలిక వ్యవసాయం విస్తరిస్తున్న దశకు చెందినదని అనిపిస్తుంది. మగవాడి చేయి పైన, స్త్రీ చేయి కింద అవడం కూడా అప్పటినుంచే నని పురాచరిత్రకారులు అంటారు. ఈ క్షేత్రం, బీజం అనే మాటలు కూడా వ్యవసాయానికి చెందినవే. స్త్రీ, పురుష సంబంధాలతో సహా మొత్తం సమాజ, సాంస్కృతిక జీవితం మీద వ్యవసాయసంస్కృతి ఎంత లోతైన ప్రభావం వేసిందో చెప్పడానికి ఇదొక ఆధారం కావచ్చు.

 

పంటను ఇచ్చే వ్యవసాయభూమి క్షేత్రమైనట్టే, సంతానాన్ని కనే స్త్రీ కూడా క్షేత్రం అయింది. ఆవిధంగా వాటి మధ్య పోలిక కుదిరింది. వ్యవసాయభూమిలానే స్త్రీని కేవలం క్షేత్రంగా గుర్తించడమంటే ఏమిటన్నమాట? వ్యవసాయభూమి ఏ ఒకరి యాజమాన్యం కిందో ఉండకుండా ఉమ్మడి వనరుగా ఉన్న దశ ఉందనుకుందాం. అప్పుడు ఆ భూమిలో విత్తు నాటిన వాడికే పంట మీద హక్కు ఉన్నట్టుగా; స్త్రీ క్షేత్రంలో బీజావాపన చేసినవాడికే సంతానం మీద హక్కు ఉంటుంది. శర్మిష్ట కథలో చెప్పుకున్నట్టుగా, ఋతుమతి అయిన స్త్రీకి వివాహంతో సంబంధం లేకుండా సంతానం పొందే హక్కు ఉందనుకుంటే, తన క్షేత్రంలో పుట్టే సంతానం మీద ఆ దశలో ఆమెకే హక్కు ఉండడానికీ అవకాశం ఉంది. గంగా-శంతనుల కథలో తనకు పుట్టే సంతానాన్ని ఏమైనా చేసుకునేలా శంతనుడితో గంగ ఒప్పందం చేసుకోవడమే చూడండి. అంటే ఆమె తన క్షేత్ర హక్కును స్థాపించుకోదలచిందన్న మాట. ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ నవలలో ఇచ్చిన అన్వయాన్ని బట్టి చూస్తే, గంగ తనకు కలిగిన ఏడుగురు సంతానాన్నీ తన దగ్గరే ఉంచుకుని; ఎనిమిదో సంతానమైన భీష్ముని విషయంలో శంతనుడు అడ్డు చెప్పాడు కనుక అతన్ని శంతనుడికి ఇచ్చేసి, ఒప్పందం నుంచి తప్పుకుంది.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

ఇంకో సినేరియోను చూద్దాం. క్షేత్ర ప్రాధాన్యం, బీజ ప్రాధాన్యం అనే మాటలూ, వాటి గురించిన చర్చా సంప్రదాయవర్గాలలో కూడా కనిపిస్తాయి. ఎక్కడ ఏ ప్రాధాన్యాన్ని వర్తింపజేయాలన్నది ఒక్కోసారి చిక్కుముడిగా పరిణమిస్తుంది. ఉదాహరణకు, సత్యవతి-పరాశరుడు; అంబిక, అంబాలిక-వ్యాసుల సంబంధాన్నే చూద్దాం. వ్యాసుడు మత్స్యకన్యకు పుట్టినా, ఆయనను సంప్రదాయం ‘పరాశరుని కొడుకుగా’; లేదా ‘పరాశరుని కొడుకుగా కూడా’ గుర్తిస్తుంది. పరాశరుని వర్ణమే ఆయనకు ఇస్తుంది. అంటే అక్కడ బీజప్రాధాన్యం చెబుతోందన్న మాట. అదే, క్షత్రియులైన అంబిక, అంబాలికల దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడి వల్ల వారికి కలిగిన చిత్రాంగద, విచిత్రవీర్యులను క్షత్రియులుగా చెబుతోంది. అంటే అక్కడ క్షేత్రప్రాధాన్యాన్ని చెబుతోంది. అలాగే, అంబిక దాసికి వ్యాసుడి వల్ల కలిగిన విదురుని దాసుడుగా, శూద్రుడుగా చెప్పడంలో కూడా క్షేత్రప్రాధాన్యమే ఉంది.

దీనినిబట్టి ఒకటి అనుకోవాలి: పురుషుడు కేవలం సంతానం కోరి ఒక స్త్రీ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే, అందుకు ఆమె ఒప్పుకుంటే ఆ సంతానం పురుషుడికే చెందుతుంది. అక్కడ బీజప్రాధాన్యం వర్తిస్తుందన్న మాట. తెలుగు భారతంలో పరాశరుడు సంతానం కోసమే సత్యవతి పొందు కోరినట్టు లేకపోయినా (నేను సంస్కృత భారతం ఇంకా చూడలేదు) సత్యవతి-పరాశరుల సంబంధాన్ని భైరప్ప ఇలాగే అన్వయిస్తారు. ఒకవేళ పురుషుడు కేవలం లైంగిక సుఖం కోసమే స్త్రీతో సంబంధం పెట్టుకుంటే, అప్పుడు ఆ స్త్రీ కనే సంతానం ఆమెకే, అంటే క్షేత్రానికే చెందుతుంది. గంగా-శంతనుల సంబంధం నిజానికి అలాంటిదిగానే కనిపిస్తుంది. చిత్రాంగద, విచిత్రవీర్యుల విషయానికి వస్తే, తన కోడళ్ళకు సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి నియోగించింది కనుక, ఆ సంతానానికి క్షేత్రప్రాధాన్యం కలిగి వారు క్షత్రియులయ్యారు. ప్రస్తుత సందర్భంలో పాండురాజు కూడా క్షేత్రపద్ధతిలో సంతానం ఇమ్మని కుంతిని అడుగుతున్నాడు కనుక, అంటే నియోగిస్తున్నాడు కనుక ఆ సంతానం అతనికే చెంది, అతనిలానే క్షత్రియులవుతారు.

వ్యవసాయభూమిపై ఉమ్మడి యాజమాన్యం పోయి వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడిన దశలో సినేరియో కొంత మారుతుంది. భూయజమాని తన క్షేత్రంలో తను పండించుకోవచ్చు, లేదా ఇంకొకరికి తన క్షేత్రాన్ని అద్దెకు ఇవ్వచ్చు. అప్పుడు క్షేత్రానికి యజమాని వేరొకరు అయినా పంట, పండించినవాడిదే అవుతుంది. వ్యవసాయ క్షేత్రానికి, స్త్రీ క్షేత్రానికి ఉన్న పోలికే పూర్వుల దృష్టిని ప్రముఖంగా ఆక్రమించుకుందనీ, వ్యవసాయక్షేత్రానికి వర్తింపజేసిన నీతినే యథాతథంగా స్త్రీ క్షేత్రానికీ వర్తింప జేశారనీ అనేక ఉదాహరణలను గమనిస్తే అనిపిస్తుంది.

ఇక, క్షేత్రం అనే మాట మరో సందర్భంలో కూడా కనిపిస్తుంది. అది: ‘పుణ్యక్షేత్రం’ అనడంలో. దేవాలయం ఉన్న చోటును పుణ్యక్షేత్రం అంటాం. ఇంతకీ వ్యవసాయక్షేత్రం, స్త్రీ క్షేత్రం, పుణ్యక్షేత్రం అనే ఈ మూడు క్షేత్రాలకూ మధ్య ఏమైనా ముడి ఉందా? ఉన్నట్టే కనిపిస్తుంది. లైంగిక సంబంధాన్ని, పునరుత్పత్తిని పూర్వులు మతకోణంలోంచి చూసి ఒక పవిత్రవిధిగా పరిగణించారు కనుక; వ్యవసాయ, స్త్రీ క్షేత్రాలు రెండూ పునరుత్పత్తికి చెందినవే కనుక ఆ రెండింటికీ పుణ్యక్షేత్రంతోనూ ఒక ముడి ఏర్పడింది. సౌభాగ్య(fertility)వర్ధనాలుగా వ్యవసాయ, స్త్రీ క్షేత్రాల మధ్య ఉన్న పోలికా, వాటిపై అభివృద్ధి చెందిన మతపరమైన తంతు, అందులో భాగమైన తాంత్రికతలో స్త్రీకి గల పాత్ర గురించి చెప్పుకోవలసింది చాలా ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పుకున్నట్టు వ్యవసాయం మనిషి చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అంతకుముందు లేనంత అన్న పుష్కలత్వాన్ని వ్యవసాయం ఇచ్చింది. వ్యవసాయంతోనే స్థిరనివాసాలు ఏర్పడడం, జనాభా పెరగడం తదితర పరిణామాలు సంభవించాయి.

అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం కోసం అడవుల్ని నరకడం, జనాన్ని వ్యవసాయంవైపు మళ్ళించడం, వ్యవసాయభూముల విస్తరణకు వీలుగా స్థిర జనావాసాలను ఏర్పాటు చేయడం అంత తేలికగా జరగలేదు. సామదాన దండోపాయాలను ఆశ్రయించవలసి వచ్చింది. వ్యవసాయాన్ని పవిత్రకార్యంగా సూచించే క్రమంలో దేవాలయం ఉన్న ప్రదేశం పుణ్యక్షేత్రం అయినట్టే; వ్యవసాయభూమి కూడా క్షేత్రం, అంటే పుణ్యక్షేత్రం అయింది. వ్యవసాయక్షేత్రాలు ఉన్న చోట దేవాలయక్షేత్రాలూ అవతరించాయి. సుమేరు, సింధు నాగరికతలలో వ్యవసాయభూములు దేవాలయ అధీనంలోనే ఉండేవి. ఏటా దేవాలయంలోనే పాచికలు వేసి భూములు పంచేవారు. మన దగ్గర కూడా దేవాలయాలకు మాన్యాలు కల్పించడం ఉంది. దేవాలయంలో ‘క్షేత్ర’పాలకులుగా కొందరు దేవతలు ఉంటారు. వ్యవసాయక్షేత్రాలకూ కాపలాదారులు అవసరమే.

ఇక స్త్రీ క్షేత్రానికీ, పుణ్యక్షేత్రానికీ ఉన్న ముడిని చూద్దాం. ఇందుకు దేవాలయాలలో మైథున చిత్రాలే గొప్ప సాక్ష్యం. సౌభాగ్య వర్ధనానికి- స్త్రీ, వ్యవసాయ, పుణ్యక్షేత్రాలు మూడూ కేంద్రాలే. సుమేరు, సింధు, గ్రీకు సహా ప్రాచీన సమాజాలు అంతటా దేవాలయాలలో ‘పవిత్ర వ్యభిచారం’ జరుగుతూ ఉండేది. దేవాలయాలలో శృంగారకేళి అన్న మాట వినడానికే మనకు ఈ రోజు చాలా కంపరంగా ఉంటుంది. కానీ లైంగిక క్రియకు, దేవాలయానికి ఒకే విధమైన పవిత్రత్రను ఆపాదించిన ప్రాచీనుల దృష్టిలో అది అపవిత్రం కాదు.

క్షేత్రంతోపాటు కలిపి చెప్పుకునే మరో మాట తీర్థం. ఈ తీర్థం కూడా సౌభాగ్యవర్ధన కేంద్రమే. పురాతన కాలంలో మతపరమైన ప్రతి పండుగా, ప్రతి ఉత్సవం, ప్రతి తీర్థక్షేత్రాలూ లైంగిక విశృంఖల సందర్భాలే. తీర్థాలు, తిరునాళ్ళలో ఇలాంటి ముచ్చట్లు ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ప్రముఖ రచయిత్రి లత ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు శివరాత్రికి పట్టిసీమ(ప.గో. జిల్లా) తీర్థానికి వెళ్ళి రాత్రివేళ కారులో తిరిగివస్తున్నప్పుడు గోదావరి గట్టు పొడవునా జంటలు కనిపించాయని రాశారు.

కోశాంబీ AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY లో ఇలా అంటారు:

When local gods were adopted as relatives, attendants, incarnations, variants of Brahmin deities, while the locality coincided with or developed into a centre of production, or of trade, there arose great religious pilgrimage centers like Banaras, Mathura and Nasik (page-45)

(స్థానిక దేవతలను [బ్రాహ్మణీయ దేవతలకు] బంధువులుగా, సేవకులుగా, అవతారాలుగా, బ్రాహ్మణ దేవతలలోనే భిన్న రకాలుగా మలచుకున్న చోట్ల; అప్పటికే ఉత్పత్తి కేంద్రంగానో, వర్తక కేంద్రంగానో ఉన్న చోట్ల, లేదా ఆ దిశగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలోనే బెనారస్, మథుర, నాసిక్ లాంటి గొప్ప యాత్రాక్షేత్రాలు అవతరించాయి)

                                                                                                   మిగతా వచ్చే వారం

-కల్లూరి భాస్కరం

‘నియోగ’ సంతానం…ఓ మపాసా(?) కథ…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చెహోవ్ తర్వాత…బహుశా చెహోవ్ తో సమానంగా… నేను (నాలా ఇంకా చాలామంది) అభిమానించే మహాకథకుడు గయ్ డి మపాసా. చాలా ఏళ్లక్రితం చదివిన ఆయన కథ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ కథ పేరు The Legacy అని ఓ బండ జ్ఞాపకం. నా దగ్గర ఉన్న మపాసా కథల పెద్ద సంపుటాలు రెండింటిలో ఆ కథ కోసం వెతికాను. ఆ పేరుతో ఏ కథా కనిపించలేదు. ఇంటర్నెట్ లో గాలించాను. అందులోనూ కనిపించలేదు. నా దగ్గర ఉన్న అన్ని పుస్తకాలనూ శోధిస్తే ఆ కథ ఉన్న సంపుటం దొరుకుంతుందేమో తెలియదు. ఇంతకీ ఆ కథ ఆయన రాసిందా, ఇంకొకళ్లు రాసిందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయినా, ప్రస్తుత సందర్భానికి సరిపోయేమేరకు అందులోని ఇతివృత్తం గుర్తుంది కనుక ఆ వెతుకులాటను, అనుమానాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఒక వృద్ధ వితంతువు. ఆమెకు యుక్తవయసు వచ్చిన ఓ మనవరాలు. ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడూ, ఆమే ప్రేమించుకున్నారు. ఆమె నాయనమ్మ(అమ్మమ్మ?) దగ్గర పెళ్లి మాట తెచ్చింది. ఏ కొద్దిపాటి ఆస్తీ లేని ఓ గుమస్తాకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తర్వాత మెత్తబడింది. వారి పెళ్ళికి ఒప్పుకుంటూనే ఒక షరతు పెట్టింది. రెండేళ్లలో(ఒక ఏడాదిలోనేనా?) తనకు పండంటి ముని మనవణ్ణి (మునిమనవరాలినా?) ఇస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుందని మనవరాలితో చెప్పింది. ఆమేరకు విల్లు కూడా రాయించింది.

పెళ్లయిపోయింది. అప్పటినుంచీ ఆ అబ్బాయిలో(బహుశా అమ్మాయిలో కూడానా?) ఆస్తికి సంబంధించిన టెన్షన్ మొదలైపోయింది. గడువులోపల తాము ఆ వృద్ధురాలి షరతు నెరవేరిస్తేనే ఆస్తి దక్కుతుంది. వాళ్ళిద్దరూ కలసుకున్నప్పుడల్లా ఆస్తి గురించిన టెన్షన్ దే పై చేయి కావడం ప్రారంభించింది. ఇంకేముంది? వారిద్దరి మధ్య శారీరకమైన కలయిక అసాధ్యమైపోతూ వచ్చింది. తమ మధ్య ఆ సంబంధం కలగడానికి వారు చేయని ప్రయత్నం లేదు. హానీమూన్ కు సరే, ఎలాగూ వెడతారు. ఆ తర్వాత కూడా శృంగారోద్దీపనకు సాయపడుతుందనుకునే ప్రతి ప్రదేశానికీ వెళ్లారు. ప్రతి చిట్కానూ ఉపయోగించారు. ఫలితం శూన్యం.

ఈలోపల రోజులు, మాసాలూ గడిచిపోతున్నాయి. టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అలా ఉండగా ఒక రోజున వారి ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. ఆమె గర్భవతి అయింది. మగపిల్లవాడిని(లేక ఆడపిల్లనా?) ప్రసవించింది. ఉయ్యాలలో వేసినప్పుడో, నామకరణం చేసినప్పుడో గుర్తులేదు కానీ స్నేహితులను, బంధువులనూ పిలిచి వేడుక జరుపుకున్నారు.

అయితే పసివాడిలో(లేదా పసిదానిలో) తండ్రి పోలికలు మచ్చుకైనా కనిపించడం లేదని వచ్చినవాళ్లు గుస గుసలాడుకున్నారు.

ఆ దంపతులలో మాత్రం కొండంత బరువు దిగిపోయినట్టు పెద్ద రిలీఫ్. మొత్తానికి గడువులోపల తాము వృద్ధురాలి కోరిక తీర్చారు. అంతకంటే ముఖ్యంగా, ఆస్తి దక్కింది!

ప్రేమ గొప్పదే, అంతకన్నా డబ్బు గొప్పదని చెప్పడం కథకుడి ఉద్దేశమైనట్టు తెలిసిపోతూనే ఉంది. కథనం ఎంతో హాస్యాన్ని, ఉత్కంఠనూ పండిస్తూ సాగిపోతుంది. దానిని అలా ఉంచుదాం. ఇందులో మనకు కావలసిన ఒక ముఖ్యమైన వివరం ఉంది: అది, మన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్ర ప్రసిద్ధమైన ‘నియోగం’! ఇక్కడ మనవరాలు, ఆమె భర్తా కలసి సంతానం కన్నది ‘నియోగ పద్ధతి’లోనే. కాకపోతే అది రహస్య నియోగం. అది కూడా ఆస్తి కోసం.

1951

తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగపద్దతిలో సంతానం ఇవ్వమని సత్యవతి తన కొడుకైన వ్యాసుణ్ణి పురమాయించడం మనకు తెలుసు. అలాగే, నియోగ పద్ధతిలో తనను సంతానవంతుణ్ణి చేయమని పాండురాజు తన పెద్ద భార్య అయిన కుంతిని ప్రార్థించాడు. ఇలా నియోగ పద్ధతిలో సంతానం కనమనో, లేదా ఇవ్వమనో కోరిన ఉదాహరణలు మహాభారతంలో ఇంకా ఉన్నాయి.

‘నాకు కొడుకులను ఇవ్వు’ అని కుంతిని పాండురాజు చేతులు జోడించి మరీ ప్రార్థించేముందు వారిద్దరి మధ్యా కొంత సంభాషణ జరుగుతుంది. అందులో కూడా దేవధర్మమూ, పురాచరిత్ర రూపంలోని మనుష్యధర్మమూ కలగలసి కనిపిస్తాయి. అందులోకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగిందో ఒకింత ముందునుంచీ చెప్పుకుందాం:

అన్న ధృతరాష్ట్రుడు రాజ్యం చేస్తున్నాడు. తమ్ముడు పాండురాజు దండయాత్రలు చేసి, రాజులను జయించి, గొప్ప గొప్ప ధనరాశులు తెచ్చి అన్నగారికి ఇచ్చాడు. అయితే, తండ్రి విచిత్రవీర్యుడిలానే పాండురాజుకు స్త్రీ లోలత్వం ఎక్కువ. దానికి తోడు వేట వ్యసనం. భార్యలు కుంతి, మాద్రులతో కలసి అతను వనవాసం చేస్తూ వేటతో వినోదిస్తూ ఉండేవాడు. తమ్ముడికి అవసరమైన సంభారాలన్నీ ధృతరాష్ట్రుడు అడవికే పంపిస్తూ ఉండేవాడు.

అలా ఉండగా ఓ రోజున పాండురాజు యథావిధిగా వేటకు వెళ్ళాడు. ఒక్క మృగమూ కనిపించలేదు. దాంతో అతనికి కోపం వచ్చింది. అంతలో ఒక లేడి జంట మన్మథవాంఛతో క్రీడిస్తూ కనిపించింది. పాండురాజు కఠినహృదయంతో వాటి మీద బాణాలు ప్రయోగించాడు. అవి కుప్ప కూలిపోయాయి.

వాటిలో కొనప్రాణంతో ఉన్న మగమృగం పాండురాజుతో మనిషిలా మాట్లాడుతూ,’నేను కిందముడనే మునిని. ఈమె నా భార్య. ఈ కీకారణ్యంలో మేమిద్దరం మృగరూపం ధరించి రతిసౌఖ్యాన్ని అనుభవిస్తుండగా మామీద బాణాలు ప్రయోగించావు. వేట రాజుల కర్తవ్యం కనుక మృగరూపంలో ఉన్న మమ్మల్ని నువ్వు చంపడంలో తప్పులేదు. అయితే చూశావూ… కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా రతిక్రీడలో ఉండి పరుగెత్తలేని స్థితిలో ఉన్నమృగాలనూ, ప్రసవించే మృగాలనూ, రోగంతో బాధపడే మృగాలనూ చంపరు. అలాంటిది, ధర్మం తప్పరని పేరు పొందిన భరతాది రాజుల వంశంలో పుట్టి కూడా ఈ అధర్మాన్ని నువ్వు ఎలా చేశావు?’ అన్నాడు.

ఆ మాటతో పాండురాజుకు కోపం వచ్చింది. ‘శత్రువుల నైనా క్షమించి విడిచిపెడతారు కానీ, మృగాలు కనిపిస్తే రాజులు చంపకుండా వదలరు. నమ్మించి చంపినా, మాయాబలంతో చంపినా తప్పవుతుంది కానీ; ఇలా చంపడం తప్పుకాదు. పూర్వం అగస్త్యముని మృగమాంసంతో నిత్యశ్రాద్ధం చేస్తూ, మృగాలను చంపడం రాజులకు దోషం కాదని నిర్ణయించాడు. ఇందుకు నన్ను ఎలా నిందిస్తావు?’ అన్నాడు.

బాణపు నొప్పితో గిల గిల లాడిపోతున్న ఆ మృగం,సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో నిరపరాధులమైన మమ్మల్ని చంపావు కనుక, నువ్వు కూడా ఇలాగే నీ భార్యతో సంగమించేటప్పుడు మరణిస్తావు. నీ భార్య కూడా నిన్ను అనుసరిస్తుంది’ అని శపించాడు. ఆ తర్వాత ఆ మృగదంపతులు కన్ను మూశారు.

ఇక్కడ రెండు కారణాల చేత కథకుడికి చేతులెత్తి మొక్కుతున్నాను. మొదటిది, రతిసౌఖ్యాన్ని అనుభవిస్తున్న, ప్రసవిస్తున్న, రోగంతో బాధపడుతున్న మృగాలను; కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా చంపరని అనడం. రాజులకు వేట కర్తవ్యం అంటూనే కథకుడు ఎరుకలను వారికంటే ఉన్నతులుగా చూపిస్తున్నాడు. కేవలం వినోదం కోసం వేటాడే రాజుల తీరును గర్హిస్తున్నాడు. తిరుమల రామచంద్రగారు ‘హంపీ నుంచి హరప్పా దాక’ అనే స్వీయచరిత్రలో వినోదం కోసం జంతువులను చిత్రహింస పెట్టడంలోని అమానుషత్వాన్ని ప్రత్యక్షసాక్ష్యంతో చిత్రిస్తారు.

ఇక రెండవది, అంతకంటే ఆశ్చర్యచకితం చేసేది,‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో…(సర్వప్రాణులకు సాధారణంబయి ఇష్టంబగు సుఖావసరంబున నున్న మమ్ము…) అనే మాట మృగంతో అనిపించడం! విశేషమేమిటంటే, ఇదే మాటను కథకుడు మరి కొన్ని సందర్భాలలో మరికొందరి నోట అనిపిస్తాడు. తనకు కొడుకులను ఇమ్మని కుంతిని అడిగిన సందర్భంలోనే పాండురాజు ధర్మబద్ధమైన ఒక పురాణ కథ చెబుతాను విన మంటూ,‘పూర్వం స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా సంచరిస్తూ అఖిల ప్రాణి సాధారణంబైన ధర్మంబున తమ తమ వర్ణాలలో ఋతుకాలం తప్పకుండా స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ సంబంధం పెట్టుకునే వారని అంటాడు. ఆ తర్వాత దానిని ఎలా నిషేధించారో వివరిస్తూ ఒక కథ చెబుతాడు.

అదేమిటంటే, ఉద్దాలకుడనే ముని ఉండేవాడు. అతని భార్య గొప్ప సాధ్వి. వారికి శ్వేతకేతు డనే కొడుకు. అతను తపస్సంపన్నుడు. అలా ఉండగా, అతని తల్లి ఋతుమతి అయింది. అప్పుడు ఒక వృద్ధవిప్రుడు వారింటికి అతిథిగా వచ్చాడు. కొడుకులు లేని ఆ విప్రుడు కొడుకుకోసం ఉద్దాలకుని భార్య పొందు కోరాడు. దాంతో శ్వేతకేతుకు కోపం వచ్చింది. ఇది ధర్మవిరుద్ధమనీ, ఇకనుంచీ స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, పెట్టుకుంటే సకలపాపాలూ చుట్టుకుంటాయనీ, మనుషులందరికీ ఈ విధమైన కట్టడి చేస్తున్నాననీ ప్రకటించాడు.

మరో సందర్భం చూద్దాం. తన కొడుకు విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత కురువంశానికి నువ్వు ఒక్కడివే మిగిలావు కనుక రాజ్యపాలన చేపట్టి, వివాహం చేసుకుని, సంతానం కనమని భీష్ముడితో సత్యవతి అంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముడు,‘దేవరన్యాయం’తో, అంటే నియోగ పద్ధతిలో విచిత్రవీర్యుని భార్యలకు సంతానం కలిగించే మార్గం ఉందని అంటూ దీర్ఘతముడనే ముని గురించి చెబుతాడు.

మమత అనే స్త్రీకి ఉతథ్యుడనే ముని వల్ల కలిగినవాడు దీర్ఘతముడు. అతను తల్లి కడుపులో ఉన్నప్పుడు బృహస్పతి వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. అతడు ‘దేవరన్యాయం’తో మమత పొందు కోరాడు. కడుపులో ఉన్న దీర్ఘతముడు కోపించి, ఇది ధర్మవిరుద్ధమంటూ అడ్డుచెప్పాడు. అందుకు ఆగ్రహించిన బృహస్పతి ‘సర్వభూతేప్సితమైన’ ఈ కార్యంలో నాకు అడ్డు చెప్పావు కనుక పుట్టుగుడ్డివి కమ్మని శపించాడు. అందుకే అతనికి దీర్ఘతముడనే పేరు వచ్చింది.

విచిత్రం ఏమిటంటే, తన తల్లిని బృహస్పతి కాంక్షించడం ధర్మవిరుద్ధమని అడ్డుచెప్పిన ఈ దీర్ఘతముడే సంతానం లేని బలి అనే రాజు కోరిన మీదట అతని భార్యకు ‘దేవరన్యాయం’తో సంతానం ఇస్తాడు. సరే, అది వేరే కథ. ‘మామతేయుడు’, అంటే మమత కుమారుడు అనిపించుకున్న దీర్ఘతముడు మాతృస్వామ్య వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చని కోశాంబీ అంటారు.

ప్రకృతి సహజమైన లైంగిక సుఖాన్ని ‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణంబైన ధర్మం’గా,‘సర్వభూతేప్సితమైన’, అంటే అన్ని ప్రాణులూ ఇష్టపడే కార్యంగా మహాభారత కథకుడు చెప్పడం నాకు ఎంతో అపురూపంగానూ, ఊహల్లో ఒకవిధమైన తాజాదనాన్ని నింపేదిగానూ అనిపిస్తుంది. ఈ చిత్రణ ప్రకృతి అంత సహజంగానూ, సూక్ష్మంగానూ ఉంది. మన పూర్వులు మనిషి సహజాతాలుగా ఆహార, నిద్రా, భయాలతో కలిపి మైథునాన్ని కూడా చెప్పడంలోనూ ఈ ప్రకృతిసహజత్వమే ఉన్నట్టుంది. కాలగతిలో జరిగింది ఏమిటంటే, లైంగిక సుఖాన్ని ఒక అవసరమైన సుఖంగా, సర్వప్రాణిధర్మంగా గుర్తించడం కూడా మరచిపోయే స్థాయికి ఆ మాట నిషిద్ధపదాల జాబితాలో అట్టడుగుకు చేరిపోవడం. సమాజం, కట్టుబాటు, నీతి, న్యాయం లాంటి అనేకానేక పొరల మాటున ‘లైంగిక సుఖం’ గురించిన మౌలిక భావన మటుమాయమైపోయింది. లైంగిక సుఖం అనే మాట చుట్టూ రకరకాల మందమైన పొరలు చుట్టుకుంటూ పోయిన అనుభవంనుంచి చూసినప్పుడు;‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’గా,‘సర్వభూతేప్సిత కార్యం’గా చెబుతున్న మన పూర్వులు లైంగిక సుఖాన్ని ప్రకృతికి అతి దగ్గరగా, ప్రకృతిలో భాగంగా; ఎటువంటి ఆచ్ఛాదనలూ లేని ఒక వినిర్మల, స్వచ్ఛ, పవిత్రధర్మంగా చూశారా అనిపిస్తుంది.

లైంగికవాంఛ విషయంలో ఒక కట్టడి, ఒక పరిమితి, ఒక హద్దు తప్పనిసరిగా ఉండవలసిందే. ఇక్కడ విషయం అది కాదు. పెండ్యులం ఒకవైపునుంచి, పూర్తిగా దానికి వ్యతిరేకమైన దిశకు తిరిగిపోవడం. అంటే సమతూకం లోపించడం. లైంగికత్వాన్ని కేవలం ప్రకృతిధర్మంగా అర్థం చేసుకోవడమనే పురాకాలపు ఒక పరాకాష్ట(extreme)నుంచి, లైంగికత్వాన్ని కేవలం ఒక సామాజిక నియతిలో భాగంగా చూసే మరో పరాకాష్టకు పయనించడం. ఆవిధంగా ప్రకృతిధర్మానికి, సామాజికధర్మానికి మధ్య తూకం తప్పిపోయింది. దీని పర్యవసానాలను మనం ఇప్పుడు బహుముఖంగా చూస్తున్నాం.

స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం, లైంగికతల విషయంలో మన పూర్వులు నేటి మన ఊహకు అందని, విచిత్రంగా కూడా అనిపించే సువిశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారని అన్నది అందుకే.

ప్రస్తుతానికి వస్తే,‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’,‘సర్వభూతేప్సిత కార్యం’ అనడంలో కథకుడు లైంగికతకు చెందిన పురాచరిత్రను కూడా చెబుతున్నాడు. కుంతి-పాండురాజు సంభాషణలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

***

చనిపోయిన ఆ మృగదంపతులను చూసి పాండురాజు బాధపడ్డాడు. అతనిలో పశ్చాత్తాపంతోపాటు వైరాగ్యమూ కలిగింది. ఎంత గొప్ప కులంలో పుట్టినా కర్మఫలం అనుభవించక తప్పదనుకున్నాడు. ఇక అన్ని బంధాలనూ విడిచిపెట్టి మునివృత్తిని స్వీకరించి, అన్ని ప్రాణులనూ సమబుద్ధితో చూస్తూ, హింసకు దూరంగా శేషజీవితాన్ని గడపాలనుకున్నాడు. కుంతి, మాద్రులకు తన నిర్ణయాన్ని చెప్పి, వారిని హస్తినాపురానికి వెళ్లిపొమ్మని కోరాడు. మేము చావనైనా చస్తాము కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళమని వారు చెప్పారు. అయితే నాతోనే ఉండండని వారికి చెప్పి, తమ దగ్గర ఉన్న అమూల్య మణిహారాలను, ఏనుగులను, గుర్రాలను, గోవులను, ధనధాన్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా మిగిలినవాటిని ధృతరాష్ట్రునికి పంపేశాడు.

ఆ తర్వాత, తనలానే తపస్వులుగా మారిన భార్యలిద్దరితో కలసి ఉత్తరదిశగా ప్రయాణం ప్రారంభించాడు. హిమాలయాలను కూడా దాటి, దేవతలు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంత కాలం ఉండి, అక్కడినుంచి మరింత ముందుకు వెళ్ళి శతశృంగం అనే ప్రదేశానికి చేరుకుని తపస్సు ప్రారంభించాడు.

ఆ శతశృంగం కూడా ఎందరో దేవతలు, సిద్ధులు, యక్షులు నివసించే ప్రదేశం. స్వర్గానికి వెళ్ళే మార్గం అక్కడికి దగ్గరలోనే ఉంది. దివ్యవిమానం మీద వచ్చిపోయే దేవగణాలతో ఆ మార్గం కోలాహలంగా ఉంటుంది. అక్కడి ఉత్తరభాగంలో పాండురాజు తపస్సు చేసుకుంటూ ఉండగా ఓ రోజున వేలాదిమంది మునులు ఆ స్వర్గమార్గంలో పై లోకాలకు వెడుతూ కనిపించారు.

‘ఎక్కడికి వెడుతున్నా’రని పాండురాజు వారిని అడిగాడు.

‘ఈ రోజు అమావాస్య. ఎక్కడెక్కడి ఋషిగణాలు, పితృదేవతలు బ్రహ్మను సేవించుకోడానికి ఈ రోజున బ్రహ్మలోకానికి వెడుతుంటారు. మేము కూడా అక్కడికే వెడుతున్నా’మని వారు చెప్పారు.

అప్పుడు భార్యలిద్దరితో కలసి పాండురాజు వారి వెనక బయలుదేరాడు. మిట్టపల్లాలతో నిండిన ఆ మార్గంలో వాళ్ళు అతి కష్టం మీద నడుస్తున్నారు. మునులు వెనుదిరిగి చూశారు. కుంతి, మాద్రుల కష్టాన్ని గమనించారు.

‘వీళ్ళు అతి కోమలులు. కొండలు, గుహలతో నిండిన ఈ క్లిష్టమైన మార్గంలో వీళ్ళు రాలేరు. కనుక ఇక్కడ ఆగిపొండి. పైగా ఇవి దేవతలు వెళ్ళే దారులు’ అని పాండురాజుకు చెప్పారు.

‘మునులైనా సరే, సంతానం లేనివారు స్వర్గద్వారాన్ని చేరుకోలేరని విన్నాను. పుత్రులు లేని వారికి స్వర్గం లభించదని వేదం చెబుతోంది. నేను కొడుకులు లేని వాణ్ణి. ఏం చేయగలను?’ అని పాండురాజు మునులతో నిస్పృహగా అన్నాడు.

మునులకు అతని మీద జాలి కలిగింది. యోగదృష్టితో జరగబోయేది చూశారు. ‘నువ్వు పుత్రులు లేనివాడివి కావు. దైవకారణంతో నీకు యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల వరం వల్ల కొడుకులు కలుగుతారు. నీకు అక్షయలోకాలు సిద్ధిస్తాయి. కనుక సంతానం కోసం ప్రయత్నించు’ అని ముందుకు సాగిపోయారు.

ఆగిపోయిన పాండురాజు ఆలోచనలో పడ్డాడు. ‘మనిషి పుడుతూనే దేవ, ఋషి, పితృ, మనుష్యరుణాలనే నాలుగు రుణాలతో పుడతాడు. ఆ రుణాలను తీర్చుకుంటే తప్ప పుణ్యలోకాలు లభించవు. నేను మొదటి మూడు రుణాలనుంచీ బయటపడ్డాను. చనిపోతే అన్ని రుణాలూ తీరిపోతాయి కానీ; శ్రాద్ధాలతోనూ, సంతానంతోనూ తీరే పితృరుణం చనిపోయినా తీరదు. అదెలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మృగశాపం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదు’ అనుకుని దుఃఖించాడు.

ఒక రోజున కుంతితో ఏకాంతంగా మాట్లాడుతూ తన బాధంతా చెప్పి,‘ఇతరమైనవేవీ ఆలోచించకుండా ధర్మబద్ధంగా నాకు సంతానం ఇచ్చే వేరొక మార్గం చూడ’ మని కోరాడు. పన్నెండు రకాల పుత్రుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు:

  1. ఔరసుడు: తన వర్ణానికే చెందిన భార్య వల్ల తనకు కలిగిన కొడుకు ఔరసుడు. 2. క్షేత్రజుడు: తనకు సంతానం లేనప్పుడు నియోగ పద్ధతిలో అర్హుడైన వేరొక పురుషుని ద్వారా తన భార్యకు కలిగే కొడుకు క్షేత్రజుడు. 3. దత్తుడు: వేరొకరి కొడుకును శాస్త్రోక్తంగా దత్తత చేసుకుంటే అతడు దత్తుడు. 4. కృత్రిముడు: తల్లిదండ్రులు లేని అనాధను చేరదీస్తే అతడు కృత్రిముడు. 5. గూఢజుడు: తన భార్యకు పరపురుషుని వల్ల రహస్యంగా కలిగిన కొడుకు గూఢజుడు. 6. అపవిద్ధుడు: తల్లిదండ్రులు విడిచి పెట్టేసినప్పుడు దగ్గరకు తీసి పెంచితే అతడు అపవిద్ధుడు. 7. కానీనుడు: పుట్టింట్లో ఉన్నప్పుడు పెళ్లి కాకుండా కొడుకును కంటే అతడు కానీనుడు.8. సహోఢుఢు: గర్భవతి అని తెలిసో తెలియకో ఒకామెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు కలిగే కొడుకు భర్తకు సహోఢుఢు. 9. క్రీతుడు: ఇంకొకరి కొడుకును కొనుక్కుంటే అతడు క్రీతుడు. 10. పౌనర్భవుడు: భార్యా, భర్తలు విడిపోయినప్పుడు; లేదా భర్త మరణించినప్పుడు భార్యకు ఆ తర్వాత మరొకరి సంబంధంవల్ల కొడుకు పుడితే అతడు ఆమె అసలు భర్తకు పౌనర్భవుడు. 11. స్వయందత్తుడు: తల్లిదండ్రులు లేనివాడు, లేదా తల్లిదండ్రులు వదిలేసినవాడు తనంతట తాను ఇంకొకరికి అమ్ముడుపోతే అతడు స్వయందత్తుడు. 12. జ్ఞాతుడు: అన్నకో, తమ్ముడికో పుట్టినవాడు వరసకు తనకు కూడా కొడుకే. అటువంటివాడు జ్ఞాతుడు.

పన్నెండో రకం పుత్రుడి విషయంలో తేడాలున్నట్టున్నాయి. వర్ణసాంకర్యం వల్ల కలిగిన కొడుకును పారశవుడిగా, పన్నెండో పుత్రుడిగా మనుధర్మశాస్త్రం చెబుతోంది. మొదటి ఆరు రకాల పుత్రులూ బంధువులు, దాయాదులూ అవుతారనీ; చివరి ఆరు రకాల పుత్రులూ బంధువులు మాత్రమే అవుతారనీ పాండురాజు అంటాడు. దాయాదులకు ఆస్తిలో వాటా ఉంటుంది. పాండురాజు ఇంకో మాట కూడా అంటాడు…బంధువులు, దాయాదులు అయిన కొడుకులందరూ ఔరసునికి ఏమాత్రం తక్కువ కారు. వాళ్లలో క్షేత్రజుడు మరింత శ్రేష్ఠుడు. అందులోనూ దేవరన్యాయంతో పుట్టినవాడు ఇంకా శ్రేష్ఠుడు. కనుక నా నియోగంతో ధర్మమార్గంలో క్షేత్రజులను కనవలసిందని కుంతిని కోరాడు.

మిగతా వచ్చేవారం…

 

 

 

 

 

అత్తా-కోడళ్ళ వారసత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఇంకో కోణం నుంచి చూద్దాం…

ద్రౌపది పాండవులు అయిదుగురినీ పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది నిర్ణయించవలసింది ఎవరు?

స్వయంవరంలో ద్రౌపది వరించిన అర్జునుడా? కాదు. పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజా? కాదు. ద్రౌపది తండ్రి ద్రుపదుడా? కాదు. వ్యాసుడా? కానే కాదు…

ఆ నిర్ణయం తీసుకోవలసింది నిజానికి ఇటు కుంతి! అటు ద్రౌపది!

కథకుడు ఏంచేస్తున్నాడంటే, నిజంగా నిర్ణయాధికారం ఉన్న వీరిద్దరినీ పక్కకు తప్పిస్తున్నాడు. మౌనమూర్తులుగా నిలబెడుతున్నాడు. ఏవిధంగానూ నిర్ణయాధికారం లేని పాత్రల చేతికి ఆ అధికారాన్ని అప్పగిస్తున్నాడు. అందుకు సంబంధించిన ధర్మమీమాంసలో వారిని భాగస్వాములను చేస్తున్నాడు. ఈ వివాహానికి వారిచేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, స్త్రీ చేతిలో ఉన్న అధికారాన్ని పురుషుడికి అప్పజెబుతున్నాడు. అనగా, వ్యవస్థనే ఉద్దేశపూర్వకంగానూ, వ్యూహాత్మకంగానూ తలకిందులు చేస్తున్నాడు.

అయితే, ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు వ్యవస్థను తలకిందులు చేయడం అనే ఈ పనిని అతడు రాతితో గోడకట్టినట్టుగా చేయడం లేదు. వదులు వదులుగా చేస్తున్నాడు. తను వ్యవస్థను తలకిందులు చేస్తున్న సంగతి తెలిసిపోయేలా మధ్య మధ్య క్లూలు విడిచిపెడుతూ చేస్తున్నాడు. అది కథానిర్మాణ దక్షత పలచబారడం వల్ల కావచ్చు, లేదా వెనకటి వ్యవస్థ గురించిన అవశేషాలను సూచించడం అనివార్యమయ్యీ కావచ్చు…

అసలు ‘స్వయంవరం’ అనే మాటే చూడండి. ఆ మాటను వాస్తవికార్థంలో తీసుకుంటే ఒక స్త్రీ, పురుషుణ్ణి తనకు తానుగా వరించడం గురించి చెబుతుంది. అంటే, ఎవరిని భర్తగా వరించాలన్నది స్త్రీకి గల సంపూర్ణ స్వయంనిర్ణయాధికారం. ఇందులో ఇతర పురుషులకు ఎలాంటి పాత్రా లేదు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్న ఐరిష్ కథలో ఈ స్వయంవర లక్షణం మరింత స్పష్టార్థంలో కనిపిస్తుంది. ఆ కథలో మీవే అనే రాచకూతురు అయిలిల్ అనే రాకుమారుని స్వయంవరంలో తనే వరించింది తప్ప అతడు ఆమెను వరించలేదు. ఆ విషయం మీవే అతనితో స్పష్టంగా అంటుంది కూడా. అంతేకాదు, ఇంకా అనేక విషయాలలో మీవే తన మాతృస్వామిక హక్కును, స్వేచ్ఛను నొక్కి చెబుతుంది.

అయితే, ప్రస్తుత సందర్భంలో కథకుడు ‘స్వయంవరం’ అంటూనే ద్రౌపదిని ఒక మరబొమ్మగా మార్చిన సంగతి తెలిసిపోతూనే ఉంది. ఆమెతో అర్జునుని మెడలో దండవేయించి, ఆ తర్వాత ఆమె పాత్ర ఏమీ లేనట్టు పక్కన పెట్టేశాడు. అలాగే, పాండవులు అయిదుగురినీ పెళ్లాడాలా వద్దా అనే విషయంలో ఆమెకు గల నిర్ణయాధికారాన్ని కాస్తా తీసుకెళ్లి ధర్మరాజు, ద్రుపదుడు, వ్యాసుల చేతుల్లో పెట్టాడు.

ఈరోజున మనకు బాగా అర్థమయ్యే ఒక పోలికతో ఈ పరిస్థితిని చెప్పుకుందాం. నేటి ప్రజాస్వామిక భారత రాజ్యాంగం ఎన్నికలలో దళితుల వంటి బలహీనవర్గాలకు, స్త్రీలకు కొన్ని స్థానాలు రిజర్వు చేసింది. ఒక మహిళ, గ్రామ సర్పంచి కావచ్చు; ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నిక కావచ్చు; మంత్రిగా నియమితురాలు కావచ్చు. అయితే ఈ పదవులూ, నియామకాలు చాలా సందర్భాలలో కేవలం సాంకేతికంగా మారి, వారు ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోతారు. గ్రామంలోని మోతుబరులో, ఇతర సందర్భాలలో భర్తో ఆమెను కీలుబొమ్మగా మార్చి వ్యవహారాలను తామే చక్కబెడుతూ ఉంటారు.

ద్రౌపది విషయంలో కూడా మనకు ఇదే కనిపిస్తుంది. స్వయంవరం అనేది వెనకటి వ్యవస్థకు చెందిన ఒక ప్రక్రియ. ఒక దశలో అది లాంఛనంగా మారిపోయింది. కనుక ఆ లాంఛనాన్ని పాటిస్తూ ద్రౌపదికి స్వయంవర హక్కును, అంటే, తన వివాహం విషయంలో స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చినట్టే ఇవ్వాలి, మళ్ళీ ఆ హక్కును ఆమె నుంచి తీసేసుకుని పురుషుడికి అప్పగించాలి!

ఇక్కడ కథకుడు చేసింది అదే.

కుంతి విషయానికి వద్దాం. తన కొడుకులు అయిదుగురూ ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలా, వద్దా అనే విషయంలో సంపూర్ణ నిర్ణయాధికారం ఆమెదే! అది ఆమె అత్తగారు అంబాలిక(పాండురాజు తల్లి)నుంచి, తన అత్తకు అత్త అయిన సత్యవతి నుంచి సంక్రమించిన మాతృస్వామిక హక్కు. ద్రౌపదికి అత్తగా తనూ, కోడలిగా ద్రౌపదీ కూడబలుక్కుని అమలు చేయవలసిన స్త్రీహక్కు. ఇందులో పాండవులకు, ద్రుపదుడికి, వ్యాసుడికి ఎలాంటి నిర్ణయాధికారమూ లేదు.

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

సత్యవతి తన మాతృస్వామిక హక్కును కోడళ్ళు అయిన అంబిక, అంబాలికాలతో ఎలా అమలు చేయించిందో తెలిసినదే. కొడుకైన విచిత్రవీర్యుడు చనిపోయి, కురువంశం నిర్వంశమయ్యే పరిస్థితిలో ఆమె తన మాతృస్వామిక నిర్ణయాధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే, తమ్ముడి భార్యలైన అంబిక, అంబాలికలను చేపట్టి వారితో సంతానం కనమని తన సవతి కొడుకు భీష్మునితో చెప్పింది. భీష్ముడు నిరాకరించడంతో పరాశరునివల్ల తనకు కలిగిన వ్యాసుని అందుకు నియోగించింది. ఆ సందర్భంలో,‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో తల్లికీ అలాగే ఉంటుం’దని కూడా నొక్కి చెప్పి తన హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించింది.

సత్యవతి…అంబిక, అంబాలిక…కుంతి…ద్రౌపది..! ఇదీ వరుసక్రమం!

ఈ అత్తా-కోడళ్ళ క్రమాన్ని ఒకసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి. చూసినప్పుడు వీరి మధ్య మీకు ఎన్నో సారూప్యాలు, సమానధర్మాలు కనిపిస్తాయి. ఒక స్పష్టమైన, తమవైన హక్కులు కలిగిన ఒక అత్తా-కోడళ్ళ వారసత్వక్రమం కనిపిస్తుంది. ఒక అవిచ్ఛిన్న మాతృస్వామిక వారసత్వానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అర్థమవుతుంది. అయితే అలా అర్థమవడం కథకుని ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు. కనుక ఈ వారసత్వ క్రమంవైపు మన చూపు మళ్ళకుండా అతడు యథాశక్తి ప్రయత్నిస్తాడు. వీరిమధ్య పురుషస్వామ్యం తాలూకు విలువలను, పురుషుల పాత్రలను తెచ్చిపెట్టి, చర్చను వాళ్ళ మధ్యనే కేంద్రీకృతం చేసి విషయాన్ని కలగాపులగం చేస్తాడు. గంద్రగోళం సృష్టిస్తాడు. మన కళ్ళముందు గారడీ చేస్తాడు. అయితే, విచిత్రం, అది తగినంత శిక్షణ లోపించిన గారడీగా పరిణమిస్తుంది.

పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడే విషయంలో నిర్ణయాధికారం కుంతిదేననీ ఒకవైపు కథకుడు సూచిస్తూనే ఉన్నాడు. భిక్ష తెచ్చామని భీమార్జునులు అనగానే, దానిని అయిదుగురూ ఉపయోగించుకోండని కుంతి ఏమాత్రం తడుముకోకుండా వెంటనే అనేసింది. అంటే అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించేసిందన్నమాట.

ఆ తర్వాత, అంతమంది పురుషులూ కలసి ధర్మనిర్ణయం పేరుతో తలబద్దలు కొట్టుకోవలసిన అవసరమే లేదు. కానీ కథకుడు ఆ విధంగా మాతృస్వామిక అవశేషమైన ఆ నిర్ణయాన్ని కుంతి నోటితో ప్రకటింపజేస్తూనే, ఆ తర్వాత తన పని మొదలుపెడుతున్నాడు. అదేమిటంటే, కుంతి మాటల్లో కనిపిస్తున్న మాతృస్వామ్య అవశేషం మన దృష్టికి రాకుండా చేయడం, ద్రౌపది వివాహాన్ని పురుషస్వామ్యానికి అనుకూలంగా మలచడం! ఆ ప్రయత్నంలో భాగంగానే, భీమార్జునులు ద్రౌపదిని తెచ్చిన సంగతి తెలియక, రోజూలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకుని పొరబడి కుంతి అలా అన్నట్టు చిత్రిస్తున్నాడు. ఆ చిత్రణ ఇసుకగూడులా ఎలా పరిణమించిందో ఇంతకు ముందు చెప్పుకున్నాం.

కిందటి వ్యాసంలో ఇంకో ముఖ్యమైన వివరం నా చూపుల్ని తప్పించుకుంది. పాండవులు ద్రౌపది స్వయమవరానికి వెడతారనే కాదు, ఆ అయిదుగురూ ద్రౌపదిని పెళ్లాడతారని కూడా కుంతికి తెలుసు. వ్యాసుడు పాండవులకు ఎదురై చెప్పిన ద్రౌపది జన్మవృత్తాంతంలో ఆ సూచన ఉంది, చూడండి.

భీమార్జునులు ద్రౌపది అనే భిక్ష తెచ్చామని అనగానే కుంతి అయిదుగురినీ ఉపయోగించుకోమని అందంటే, ఊరికే అనలేదు. ఈ మాటను కేవలం తల్లి మాటను కొడుకులు గౌరవించాలనే సాధారణార్థంలో తీసుకోకూడదు. వాస్తవంగా ఈ మాట ద్వారా కుంతి కొడుకులను ఆదేశించే తన మాతృస్వామిక అధికారాన్ని చెలాయిస్తోంది. ఇది శాస్త్రనిబంధన లాంటిదే. ఎందుకంటే, పాండవులకు కుంతి తల్లి మాత్రమే కాదు, యజమానురాలు కూడా. తండ్రి కుటుంబానికి ఎలా యజమానో అలా అన్నమాట. తండ్రి మాటను కొడుకులు ఎలా పాటించాలో ఇక్కడ తల్లి మాటను అలాగే పాటించితీరవలసిందే.

ఒక ఉదాహరణ చూడండి…ఏకచక్రపురంలోని తమ ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు ద్రౌపది స్వయంవరం గురించి చెప్పినప్పుడు, ద్రుపదనగరానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని పెద్దకొడుకుగా ధర్మరాజు తీసుకోలేదు. కొడుకుల అభిప్రాయాన్ని గమనించి, ద్రుపదనగరానికి వెడదామని కుంతే అంది. అప్పుడు ‘నువ్వు ఆదేశించినట్టే చేద్దా’మని పాండవులు అని తల్లితో కలసి ద్రుపదనగరానికి బయలుదేరారు. భిక్ష తెచ్చామని అనగానే అయిదుగురినీ ఉపయోగించుకోమని అనడం కూడా అలాంటిదే. ఆ తర్వాత ద్రౌపది వివాహంపై ద్రుపద, వ్యాసులతో జరిగిన చర్చలో ‘గురువులలోనే పరమ గురువు అయిన మా తల్లి చెప్పింది కనుక’ ద్రౌపదిని మేము అయిదుగురమూ పెళ్లాడవలసిందే’ నని ధర్మరాజు నొక్కి చెప్పాడు.

కనుక ఆ ఇంటికి యజమాని ధర్మరాజు కాదు, కుంతి! ద్రౌపది వివాహాన్ని ఎంతగా పురుషస్వామ్యానికి నప్పించడానికి ప్రయత్నించినా, కుంతే ఆ కుటుంబానికి యజమానురాలన్న మాతృస్వామిక ధర్మాన్ని కథకుడు దాచలేకపోయాడు. ఇక్కడ తల్లీ-కొడుకుల సంబంధాన్ని సాధారణార్థంలో(తల్లి పెద్దరికం, పూజనీయత వగైరా) తీసుకున్నారంటే పొరబడినట్టే. ఎందుకంటే, ఆ కుటుంబానికి ధర్మరాజు యజమాని కాకపోవడం, కుంతి యజమానురాలు కావడం పైకి కనిపించేటంత ఆషామాషీ విషయం కాదు. అది ఒకవిధంగా శాస్త్రసంబంధమైన నిష్కర్ష!

కుటుంబ సంబంధాలు గీత గీసినట్టు సప్రామాణికంగా ఉండవలసిన ఆనాటి దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటిలో ఆషామాషీని, అమాయకత్వాన్ని ఊహించడమే అసాధ్యం. కుటుంబ యాజమాన్యంపై తల్లీ-కొడుకుల మధ్య పోటీ ముగిసి, యాజమాన్యం కొడుకుకి బదిలీ అయిన పురుషస్వామ్యం తాలూకు నిబంధనలనుంచి చూస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. పురుషస్వామ్యాన్ని నొక్కి చెప్పడమే ఒకానొక ముఖ్య లక్ష్యంగా అవతరించిన రామాయణాన్నే తీసుకోండి. యాజమాన్య కోణం నుంచే చూసినప్పుడు, రామాయణ కథ మొత్తానికి ‘పితృవాక్య పరిపాలనే’ కీలకం. అలాగే, తండ్రి తర్వాత పెద్ద కొడుకే యజమాని. రాముడు-ఆయన సోదరుల సంబంధంలో అదే కనిపిస్తుంది.

అంటే ఏమిటన్న మాట? మాతృస్వామిక వ్యవస్థలో యజమానురాలైన కుంతి ఆదేశాన్ని శిరసావహించి పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడారు! పితృస్వామిక వ్యవస్థలో యజమాని అయిన తండ్రి దశరథుని ఆదేశాన్ని శిరసావహించి రాముడు అడవికి వెళ్ళాడు! ఈ రెండు ఉదాహరణాలూ వ్యవస్థలు ఎలా తలకిందులయ్యాయో సూత్రప్రాయంగా చెబుతాయి.

ఇంకా కావాలంటే పితృస్వామిక వ్యవస్థలో స్త్రీ స్థానం ఏమిటో సందేహాతీతంగా చెబుతున్న మనుస్మృతిలోని మాటలే చూడండి. మనుస్మృతిలోని పంచమాధ్యాయంలో ‘స్త్రీధర్మములు’ అనే శీర్షిక కింద ఉన్న రెండు శ్లోకాలు ఇలా చెబుతున్నాయి:

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా

న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి

బాల అయినా, యువతి అయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏ కార్యాన్నీ చేయతగదు.

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణిగ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్

స్త్రీ బాల్యంలో తండ్రి అధీనం లోను, యవ్వనంలో భర్త అధీనంలోను, భర్త మరణించిన తరువాత పుత్రుల అధీనంలోనూ ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.

[మనుధర్మశాస్త్రము (మనుస్మృతి), తెలుగు రచన: కె.వై.ఎల్. నరసింహారావు]    

ఇంకా విశేషమేమిటంటే, స్త్రీ స్వాతంత్ర్యాన్ని కట్టడి చేసి, పురుషస్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం ఒక దశలో ప్రపంచ స్థాయిలో జరిగింది. కనుక మూస పోసినట్టు పురుషస్వామ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. మన మనుస్మృతి లాంటి స్మృతులను ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలు సృష్టించుకున్నాయి. మగపిల్లవాడికి ఒక వయసు వచ్చాక, అతనిని బాధ్యతాయుతుడైన కుటుంబ యజమానిగా, అంటే పురుషస్వామ్య ప్రతినిధిగా మలిచే ఒకానొక ప్రక్రియను ప్రతి సమాజమూ కల్పించుకుంది. తల్లితో సహా స్త్రీల ప్రభావం నుంచి ఉద్దేశపూర్వకంగా పక్కకు తప్పించడం అందులో భాగం. ఆ ప్రక్రియ అతనికి ‘రెండో జన్మ’ నిస్తుంది. ఆ ప్రక్రియనే మన సంప్రదాయం ఉపనయనం గానూ, ఉపనయన సంస్కారం పొందిన వాడిని ‘ద్విజన్ము’డి గానూ పేర్కొంది. పురాతనసమాజాలు అన్నిటా ఇది అందరికీ అమలు చేసిన ప్రక్రియ అయినా మన వ్యవస్థలో మాత్రం కొన్ని కులాలకే పరిమితమైంది.

ఎలెక్స్ హేలీ ‘రూట్స్’ నవలలో కథానాయకుడైన కుంటా కింటేను ‘పురుషు’డిగా మలచే ప్రక్రియ గురించి సుదీర్ఘంగా రాస్తాడు. అది నాలుగు నెలలపాటు సాగే కష్టసాధ్యమైన ప్రక్రియ. ఓ రోజున అయిదారుగురు వ్యక్తులు పెద్దగా కేకలు పెడుతూ, ఈటెలతో బెదిరిస్తూ ఊరి మీదికి వచ్చి పడతారు. ఒక్కొక్క ఇంట్లోకే చొరబడి, పది పదకొండేళ్ళ కుర్రాళ్లను బయటకు లాగి, వాళ్ళ ముఖాలకు ముసుగులు కప్పి ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుపోతారు. వారిలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, నిబ్బరాన్ని, సమయస్ఫూర్తిని పెంచే అనేక క్లిష్టమైన శారీరక, మానసిక పరీక్షలకు గురిచేస్తారు. ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోగల విధంగా వారిని తీర్చిదిద్దుతారు. ఆ పరీక్షలలో విఫలమైతే అంతకన్నా సిగ్గుచేటు ఉండదన్న అభిప్రాయాన్ని వారిలో నూరిపోస్తారు. చివరిగా వారికి ‘సుంతీ’ కూడా జరుగుతుంది. ఆ నాలుగు నెలల తర్వాతా వారు సంపూర్ణ ‘పురుషుడు’గా మారి ఇంటికి తిరిగివస్తారు. అక్కడినుంచి వారికి పూర్తిగా కొత్తజీవితం ప్రారంభమవుతుంది. ఇక వారు తల్లిదండ్రుల ఇంట్లో ఉండరు. వారికి ప్రత్యేకంగా తమదైన నివాసం ఏర్పడుతుంది. గ్రామ పెద్దలు వారికి కొద్దిపాటి పొలంతోపాటు, ఊరికి సంబంధించిన కొన్ని బాధ్యతలు అప్పజెబుతారు.

మగపిల్లవాడిని ‘ద్విజన్ము’డిగా మార్చే ఈ ప్రక్రియలో తల్లి ప్రభావాలనుంచి అతణ్ణి దూరం చేయడం, తల్లికీ, తనకూ మధ్య ఎడం పాటింపజేయడం కూడా భాగం. శిక్షణ ముగించుకుని కుంటా కింటే తిరిగి ఊళ్ళోకి అడుగుపెట్టిన ఘట్టాన్ని, తల్లి పట్ల అతని దృక్పథంలో వచ్చిన మార్పును రచయిత ఇలా చిత్రిస్తాడు:

“తెల తెల వార్తూండగా ఊళ్ళో అడుగుపెట్టిన కుర్రవాళ్ళకి జనం నవ్వుతూ, తుళ్లుతూ, నాట్యం చేస్తూ, చప్పట్లు చరుస్తూ స్వాగతమిచ్చారు. ఆడవాళ్ళు ‘ఏయ్! ఓయ్!’ అని పట్టరాని సంతోషంతో పగలబడి నవ్వుతూ కేకలు వేశారు. కుర్రవాళ్లు తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో నెమ్మదిగా నడిచారు. మొట్టమొదట వాళ్ళ పెదాల మీంచి చిరునవ్వులు చిందలేదు; నోట్లోంచి మాట ముత్యాలు రాల్లేదు. గంభీరంగా ఉండిపోయారు.

తల్లి తనకేసి ఆపుకోలేని ప్రేమతో పరుగెత్తుకుని వస్తున్నప్పుడు కుంటాకి తను కూడా అట్లాగే ఆమెవైపు ఉరుకెత్తి వాటేసుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. మొహం మాత్రం సంతోషంతో వెలిగిపోతోంది. బింటా కొడుకు మెడ చుట్టూ చేతులు వేసింది. చెంపల్ని చేతుల్తో తడిమింది. కళ్ళవెంట సంతోషబాష్పాలు కారుతుంటే, “కుంటా, కుంటా” అని నెమ్మదిగా గొణిగింది. కుంటాకి తనిప్పుడు పురుషుణ్ణని స్ఫురణకొచ్చి వెనక్కి తప్పుకున్నాడు. ఆమె వీపుకి వేళ్ళాడే ఉయ్యాలలో ఏడుపు మొదలెట్టిన పసిగుడ్డుని స్పష్టంగా చూసే మిషతో తల్లి నుంచి వెనక్కి తప్పుకున్నట్టు నటించాడు. ఉయ్యాల్లోకి చేతులు దోపి రెండు చేతులతో చిట్టి తమ్ముణ్ణి పైకెత్తుకున్నాడు.

……….

కుంటా తమ్ముణ్ణి ఎత్తుకుని పాకలోకి వస్తుంటే బింటా కొడుకు ప్రక్కనే నడుస్తూ మురిసిపోయింది…ఇరుగుపొరుగు అమ్మలక్కలు బింటాతో “నీ కొడుకు ఎంత కళకళలాడుతున్నాడమ్మా! మగకళ ఎంత కొట్టొచ్చినట్టు కానొస్తోందే!” అంటూ వ్యాఖ్యానాలు చేస్తోంటే కుంటా వినిపించుకోనట్లే నటించాడు. కానీ, ఆ మాటలతని చెవులకు సంగీతంలా వినిపించాయి.

….ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోతూ బింటాకి మాటలు కరువయ్యాయి. అమ్మకోసం తను ఎంత తపించిపోయాడో, యింటికి తిరిగివస్తే ఎంత ఆనందంగా ఉందో ఆమెకు చెప్పాలనుకుంటూ ఉవ్విళ్లూరాడు. కానీ నోరు పెగల్లేదు. అమ్మతో సహా యే స్త్రీతోగానీ అటువంటి ముచ్చట్లాడ్డం పురుషలక్షణం కాదని అతనికి తెలుసు.

………

కుంటా ఆ రోజే కొత్త పాకలోకి మారాడు. బింటా కొడుక్కి కావలసిన సమస్త సామగ్రీ అమర్చిపెట్టింది. ఆఖరికి ప్రార్థన చేసుకోటానికి అవసరమైన పట్టా కూడా సమకూర్చిపెట్టింది. తల్లి “నీకిది అవసరమవుతుందిరా, అదవసరమవుతుందిరా” అంటూ రకరకాల పనిముట్లు సామాన్లు చేరుస్తుంటే కుంటా అసంతృప్తిగా గుర్రుమన్నాడు. అదొద్దు, ఇదొద్దు అంటానికి కారణాలు దొరక్క తల గోక్కున్నాడు.

“తలలో పేలు పడ్డట్టున్నై. కుక్కుతా, రారా” అంటూ బింటా ముందుకొచ్చింది.

“వొద్దు” అన్నాడు కుంటా అసహనంగా. బింటా కోపంగా నసుగుతూ వెళ్లిపోయింది.”

                                                                         [ఏడు తరాలు (ROOTS), తెలుగు: సహవాసి]

***

స్త్రీ-పురుష సంబంధాల గురించి, స్త్రీ ‘శీలం’ గురించి మనకిప్పుడు పట్టువిడుపులు లేని, మతవిశ్వాసంతో పోల్చదగిన నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలకు పునాదులు వేసి, కాలగమనంలో వాటిని పటిష్టం చేసుకుంటూ వెళ్లింది మన పూర్వీకులే. అయితే, స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం విషయంలో మన అనుభవాలూ, ఆలోచనలకీ; పూర్వీకుల అనుభవాలూ, ఆలోచనలకీ ఒక విచిత్రమైన తేడా ఉంది. వీటి విషయంలో పూర్వీకులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారు. మన దగ్గరికి వచ్చేసరికి అది ఇరుకుగానూ, వైవిధ్యరహితంగానూ మారిపోయింది. ఒక్క చిన్న పోలికతో చెప్పుకుంటే, మన పూర్వీకులు ఒక పెద్ద తానును కత్తిరించే పనిలో పడ్డారు. మన దగ్గరకు వచ్చేసరికి అది ఒక చొక్కా గుడ్డ అయింది…

మరికొంత వచ్చేవారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

మోర్గాన్ కన్నా ముందు వ్యాసుడే చెప్పాడు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

సూక్ష్మంగా పరిశీలిస్తే, ద్రౌపది వివాహం కల్పించిన ధర్మసంకటం నుంచి కథకుడు అంత తేలిగ్గా ఏమీ బయటపడలేదు. ఇప్పటి మాటలో చెప్పాలంటే చాలా ‘టెన్షన్’ పడ్డాడు. గుంజాటన పడ్డాడు. నిజమాలోచిస్తే అతనికి ద్రౌపది అయిదుగురిని వివాహమాడడంలోని ‘అసంబద్ధత’ రాను రాను చిన్న గీతగా మారిపోయి, దానిని శాస్త్రానికి నప్పించడం ఎలాగన్నదే పెద్దగీతగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ‘దేవధర్మం’నుంచి సమస్యను ఎంత నరుక్కు వద్దామని అతడు చూసినా ‘మనుష్యధర్మం’ తాలూకు చిక్కులు అతని అంతఃకరణను వేధిస్తూనే వచ్చాయి.

ధర్మతత్వం తెలిసిన ధర్మరాజు, కుంతి, ద్రుపదుడు తమలో తాము సమస్యను పరిష్కరించుకోలేకపోయిన స్థితిలో వ్యాసుడంతటి వాడు రంగప్రవేశం చేయడమే చూడండి… సమస్య ఎంత సంక్లిష్టమో అదే చెబుతుంది. విచిత్రమేమిటంటే, వ్యాసుడికి కూడా ఇది దేవధర్మం అని నిష్కర్షగా చెప్పి సందేహాలకు తెరవేయడం సాధ్యం కాలేదు. ఆయన కూడా దేవధర్మం-మనుష్య ధర్మం అనే రెండింటి మధ్యా ఊగిసలాడడం కనిపిస్తుంది. ఆయన కంటె ముందు ధర్మరాజూ అలాగే ఊగిసలాడాడు. దాని గురించి మొదట చెప్పుకుందాం.

ద్రౌపదితో తమ అయిదుగురి వివాహాన్ని సమర్థించుకోడానికి ధర్మరాజు రెండు అంశాలను ముందుకు తెచ్చాడు: మొదటిది, గౌతమ గోత్రీకుడైన జటిలుడనే ఋషి కూతురు(ఆమె పేరు చెప్పలేదు) తపఃప్రభావంతో ఏడుగురు ఋషులకు భార్య అయినట్టు; దాక్షాయణి అనే మునికన్య,‘ప్రచేతసు’లనే ఒకే పేరుతో ఉన్న పదకొండుమందిని వివాహమాడినట్టు కథల్లో వింటుండడం. రెండవది, గురువులలోనూ పరమగురువు అయిన తల్లి ఆదేశాన్ని, విధి నిర్దేశాన్ని అతిక్రమించడానికి వీలు లేదు కనుక.

దీనిప్రకారం, ద్రౌపదిని తాము అయిదుగురూ వివాహమాడడం వెనుక దైవ కారణం లేదా దేవధర్మం ఉందనే సమర్థన సంపూర్ణంగా సరిపోతుందని ధర్మరాజు అనుకోవడం లేదన్నమాట. దానికి మనుష్యధర్మాన్ని కూడా తోడు తెచ్చుకుంటున్నాడు. ఎలాగంటే, జటిలుడనే ఋషి కూతురు గురించి, దాక్షాయణి గురించి చెప్పడంలో మనుష్యసంబంధమైన అటువంటి ఆనవాయితీ ఉందని చెప్పడమే ధర్మరాజు ఉద్దేశంగా కనిపిస్తుంది. గమనించండి…జటిలుడి కూతురు, దాక్షాయణి అనేకమందిని వివాహమాడడం వెనుక దేవధర్మం లేదా దైవకార్యం ఉందని చెప్పడం లేదు. కుంతి, ద్రౌపదుల వెనక అలాంటివి ఉన్నప్పుడు; జటిలుడి కూతురు, దాక్షాయణిల వివాహం వెనక కూడా ఉండి తీరాలి. అప్పుడే ఆ పాత్రల మధ్య సమధర్మాన్ని, సమన్యాయాన్ని స్థాపించినట్టు అవుతుంది. కానీ కుంతి, ద్రౌపదులను మాత్రమే మనుష్యధర్మం నుంచి మినహాయిస్తున్న కథకుడూ, కథకుని పాఠాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్న వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వంటి సంప్రదాయ పండితులూ జటిలుడి కూతురు, దాక్షాయణిల విషయంలో ఆ సూత్రాన్ని అన్వయించడం లేదు. అన్వయించకపోగా ఇక్కడ కథకుడు ధర్మరాజు ముఖతా ద్రౌపది వివాహాన్ని సమర్థించడానికి ఆ ఇద్దరినీ వాడుకుంటున్నాడు.

వ్యాసుడు, కర్ణుడు ఒకేవిధంగా(మునుల వరం, సద్యోగర్భం; కర్ణుడికి అదనంగా సూర్యసంబంధం)జన్మించినప్పటికీ ఇద్దరికీ ఒకేవిధమైన ప్రతిపత్తిని ఇవ్వలేదని చెప్పుకున్నాం. ఇక్కడ కుంతి, ద్రౌపదులతో పోల్చినప్పుడు జటిలుడి కూతురు, దాక్షాయణిల విషయంలో కూడా అదే జరిగింది. సంప్రదాయ పాఠం పూరించకుండా విడిచిపెట్టిన ఖాళీలలో ఇది కూడా ఒకటి.

ఇక ద్రౌపదితో తమ వివాహాన్ని సమర్థించుకోడానికి ధర్మరాజు చెప్పిన రెండో కారణానికి వస్తే, గురువులలోనే పరమ గురువు అయిన తల్లి చెప్పింది కనుక ఈ వివాహం జరిగితీరవలసిందే నంటున్నాడు. అంటే ఈ మాటతో అతడు పూర్తిగా సాధారణబుద్ధితో మనుషులందరూ అర్థం చేసుకోగల మనుష్యధర్మంలోకి జారిపోతున్నాడు. తల్లి ఆదేశాన్ని కొడుకు పాటించాలనడం వెనుక ఎలాంటి దేవధర్మమూ, దైవకారణమూ ఉండనక్కరలేదు. అది అసలు సిసలు మనుష్యధర్మం మాత్రమే.

ఆశ్చర్యమేమిటంటే, దేవధర్మం, దైవకారణాలనుంచి అంతిమంగా మనుష్యధర్మంలోకి జారిపోయే ఈ క్రమం వ్యాసుని మాటల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ధర్మరాజు ధర్మతత్వజ్ఞుడు కనుకా, అతడు ధర్మం తప్పే ప్రసక్తి లేదు కనుకా; కుంతీదేవి కూడా అబద్ధమాడే ప్రశ్న లేదుకనుకా; వీరి అభిప్రాయమే దేవతల అభిప్రాయం కూడా కనుకా మరేమీ ఆలోచించకుండా ద్రౌపదిని ఈ అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేసేయమని మొదట ద్రుపదునికి చెప్పాడు. తదుపరి మెట్టులో, దీని వెనుక అసలు రహస్యం వేరే ఉందంటూ నాటకీయంగా ద్రుపదుని చేయిపట్టుకుని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి తాను చెప్పబోయే రహస్యానికి ఒక గంభీర వాతావరణం కల్పించాడు. అది ద్రుపదుడిపై ఆడిన ఒక ‘మైండ్ గేమ్’ అనే సంగతి తెలిసిపోతూనే ఉంది.

ద్రౌపది వెనకటి జన్మలో ఇంద్రసేన అనే పేరు కలిగిన ‘పరమ పతివ్రత’ అంటూ వ్యాసుడు ఆమె కథ చెప్పడం ప్రారంభించాడు. ద్రౌపది అయిదుగురికి భార్య కాబోతోంది కనుక ఆమె పాతివ్రత్యం గురించి శ్రోతలు పరిపరి విధాలుగా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ‘పరమ పతివ్రత’ అనే వ్యూహాత్మకమైన మాట ద్వారా ముందే కట్టడి చేస్తున్నాడన్న మాట. ఆ వెంటనే ఆమె ఎంత పతివ్రతో సోదాహరణంగా చెప్పాడు. ఆ తర్వాత ఆమె కామేచ్ఛ గురించి, ఆమె కోరికపై మౌద్గల్యుడు అయిదు అందమైన పురుషరూపాలు ధరించి ఆమెతో సంగమించడం గురించి, ఆమె అప్పటికీ సంతృప్తి చెందని స్థితిలో అతడు ఆమెను వదిలేసి తపస్సుకు వెళ్లిపోవడం గురించి(సంస్కృత పాఠం ప్రకారం ఆమెకు మరుజన్మలో అయిదుగురు భర్తలవుతారని మౌద్గల్యుడు శపిస్తాడు), ఆమె శివుడి గురించి తపస్సు చేసి అయిదుగురు భర్తలను, కన్యాత్వాన్ని పొందబోవడం గురించి చెప్పాడు.

ravi_varma-draupadi_carrying_milk_honey1

ఇక్కడే ఇంద్రాది దేవతలు పాండవులుగా జన్మించారని అంటూ దానివెనుక ఉన్న దైవకార్యం గురించి కూడా వ్యాసుడు చెప్పాడు. అదేమిటంటే, వైవస్వత మనువు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తూ దీక్షలో ఉండి ప్రాణిహింస మానేశాడు. అప్పుడు మనుషులందరూ మరణం లేకుండా దేవతలతో సమానంగా అమరులైపోయారు. దాంతో దేవతలు దానిని సహించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మవాళ్ళను భయపడవద్దని చెబుతూ, ఎప్పటిలా యముడు మనుషుల ప్రాణాల తీసే బాధ్యతను నిర్వర్తిస్తాడనీ, ఆ వైవస్వతుని వీర్యంతోనూ, మీ (దేవతల) వీర్యంతోనూ సూర్యతేజస్వులైన అయిదుగురు పుట్టి యముడికి సాయపడతారనీ అంటాడు. అంటే, ఈ మాటల ద్వారా కథకుడు రాబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని సూచిస్తున్నాడన్న మాట.

ఆ తర్వాత ఒకే ఇంద్రుడు అయిదుగురు ఇంద్రులుగా మారి యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల అంశతో పాండవులుగా జన్మించడం గురించి వ్యాసుడు చెప్పాడు. ఆపైన ద్రుపదుడికి దివ్యదృష్టి ఇచ్చి ద్రౌపదీ, పాండవుల పూర్వదేహాలు కూడా చూపించాడు. ఇలా ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం వెనుక ఉన్న శాపాలు, వరాలు, మహిమల రూపంలోని దేవధర్మాన్ని, దైవ కార్యాన్ని చెప్పిన తర్వాతా; అందుకు సాక్ష్యంగా ద్రౌపదీ, పాండవుల పూర్వ రూపాలు కూడా చూపించిన తర్వాతా వ్యాసునికి కానీ, ద్రుపదుడికి కానీ ఇక సందేహాలు ఉండడానికి వీల్లేదు.

కానీ చూడండి…పై కథనంతో ద్రుపదుడు కాదు సరికదా, స్వయంగా వ్యాసుడు కూడా సమాధానపడలేదన్న అభిప్రాయం అనంతర వాక్యాలను బట్టి అనిపిస్తుంది. ‘మనుష్యధర్మా’న్ని కూడా జోడిస్తే తప్ప పైన చెప్పిన దేవధర్మం, దైవకార్యాలను నమ్మరని వ్యాసుడికే అనుమానం వచ్చినట్టుంది. దాంతో దేవధర్మం అనే మెట్టు మీదనుంచి మనుష్యధర్మం అనే మెట్టు మీదికి ఒక్కసారిగా దిగిపోయాడు. పూర్వం నితంతుడనే రాజర్షి కొడుకులు అయిదుగురు అజిత, అనే రాకుమార్తెను స్వయంవరంలో గెల్చుకుని వివాహం చేసుకుని ఆమె ద్వారా సంతానం పొందారని చెప్పాడు. గమనించండి, ఈ వివాహం వెనుక ఎటువంటి వరాలు, శాపాలు, మహిమలు, దేవధర్మాలు, దైవకార్యాలు ఉన్నట్టు వ్యాసుడు చెప్పలేదు. ఆవిధంగా ఇది పూర్తిగా ‘మనుష్యధర్మం’ కిందికి వచ్చే వివాహమే. అంటే, ఇది కూడా జటిలుడనే ముని కూతురు ఏడుగురు ఋషులను, దాక్షాయణి అనే ఆమె పదకొండుగురు ప్రచేతసులను పెళ్లి చేసుకోడం లాంటిదే.

చివరిగా వ్యాసుడు,‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవు గావున…’అన్నాడు.

***

అదీ సంగతి!!!

నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. సంభ్రమాశ్చర్యాలతో కాసేపు అవాక్కునైపోయాను. దూకుతూ దూకుతూ ఉన్న నా మాటల జలపాతం కాస్తా ఎవరో మంత్రించినట్టు మధ్యలోనే స్తంభించినట్టు అయిపోయింది. నా లాప్ టాప్ కీబోర్డు మీద కదలడానికి వేళ్ళు మొరాయించాయి. చీకట్లో తడుముకుంటున్న కళ్ళకు హఠాత్తుగా ఒక మెరుపుతీగ తాకినట్టుగా ఈ వాక్యం నా బుద్ధిని తాకి వేయి వోల్టుల కాంతితో నింపివేసింది!

‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవు గావున…’

అంటే ఏమిటన్నమాట…పురాకాలంలో మహాత్ములు ఒకే స్త్రీని వివాహమాడిన చరిత్రలు ఉన్నాయని వ్యాసుడు చెబుతున్నాడు! ఇంకాస్త వివరంగా చెప్పుకుంటే, ఒకే స్త్రీని పలువురు పురుషులు పెళ్లిచేసుకోవడం అనే మనుష్యధర్మం అమలుజరిగిన ఒకానొక పురాచారిత్రక విశేషాన్ని ఈ వాక్యం ద్వారా వ్యాసుడు సూచిస్తున్నాడు!

అంటే, వ్యాసుడు ఈ వాక్యం ద్వారా అక్షరాలా పురాచరిత్రను చెబుతున్నాడు!

మహాభారతాన్ని పురాచరిత్రగా, పురామానవపరిణామ చరిత్రగా, చరిత్రగా చూస్తున్న నా దగ్గర, వ్యాసుడు పలికిన ఈ ఒక్క వాక్యం విలువను తూచగల తూనికరాళ్ళు లేవు. పురాచరిత్ర కోణం నుంచి మహాభారతాన్ని ‘డీకోడ్’ చేసే ప్రయత్నంలో కచ్చితంగా ఈ వాక్యం ఒక విలువైన ‘కీ’. చరిత్రలో ఏ గొప్ప రహస్యచ్ఛేదనానికీ తీసిపోని రహస్యచ్ఛేదనం ఇది. నావరకు నాకు ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు…

వ్యాసుడే కాదు,‘జటిలు డనే ఋషి కూతురు గురించి, దాక్షాయణి అనే ఆమె గురించి కథల్లో వింటూ ఉంటా’మని అంటూ ధర్మరాజు ఉపయోగించిన ‘కథ’ అనే మాట కూడా పురాచరిత్రను సూచించేదే.

ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, వ్యాసుడూ, ధర్మరాజూ కూడా ఒకప్పటి గణవివాహదశ గురించి చెబుతున్నారు. దేవధర్మం, దైవకార్యం లాంటి ముసుగులు అన్నీ తీసేసి మరీ చెబుతున్నారు. ‘ప్రచేతసులనే పదకొండుగురు సోదరులను దాక్షాయణి పెళ్లాడిం’దని చెప్పడంలో ఈ గణసమాజ లక్షణం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సోదరులందరికీ ఒకే పేరు ఉందంటే వారందరూ ఒకే గణానికి చెందినవారని అర్థం.

మహాభారతంలో గణసమాజ చరిత్ర!! ఎంత అద్భుతం!! వేలు, వందల సంవత్సరాలుగా ఈ దేశంలో మహాభారతం పఠన పాఠనాలలో ఉంది. కానీ ఏ ఒక్క పండితుడూ ఈ అద్భుతాన్ని గమనించినట్టు లేదు. ఇది నా పరిశీలనను మరింత ఉత్సాహవంతం, ఉత్తేజభరితం చేస్తున్న కోణం.

41S2DEZ512L

లూయీ హెన్రీ మోర్గాన్ అనే పండితుడు గణ సమాజంపై భగవద్గీతతో, బైబిలుతో పోల్చదగిన ఒక ప్రామాణిక గ్రంథం రాసిన సంగతిని ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించాను. దాని పేరు ‘ANCIENTSOCIETY’(పురాతన సమాజం). అమెరికా ఆదివాసుల మధ్య పన్నెండేళ్ళు గడిపి, వాళ్ళతో పూర్తిగా మమేకమై, వారికి దత్తుడుగా వెళ్ళి గణదశలో ఉన్న వారి సమాజాన్ని అన్నివైపులనుంచీ శోధిస్తూ 1877లో ఆయన ఆ పుస్తకం రాశాడు. గ్రీకు, రోమన్ సహా ఇతర గణసమాజాల లక్షణాలతో తన అధ్యయనాన్ని సమన్వయించాడు. భౌగోళిక దూరాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకనాటి గణసమాజాలు అన్నిటా ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలను వెల్లడించాడు.

చెప్పొచ్చేదేమిటంటే, లూయీ హెన్రీ మోర్గాన్ తన గ్రంథంలో ఏ వివాహదశలనైతే చర్చించాడో వాటిలోని ఒకానొక వివాహదశ గురించే మన వ్యాసుడు, ధర్మరాజు చెబుతున్నారు. ఇంకో ఆశ్చర్యానికి కూడా మీరు సిద్ధం కావాలి. అదేమిటంటే, గణవివాహదశ గురించి 19వ శతాబ్దంలో మోర్గాన్ చెప్పడానికి చాలా ముందే మన వ్యాసమహర్షి చెప్పడం!

మోర్గాన్ చెప్పిన గణసమాజ సంబంధాల గురించి ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటూ ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేశాను. మరోసారి వాయిదా వేయక తప్పడం లేదు.

ఇప్పుడు మళ్ళీ ద్రౌపది వివాహం దగ్గరికి వెడదాం.

***

ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం కథకునిలో చాలా ‘టెన్షన్’ పుట్టించిందని మొదట్లో చెప్పుకున్నాం. దానినే మరికొంత విస్తరించుకుంటే…

ద్రౌపది వివాహంలో ఎదురైన ధర్మ సంకటం గురించిన చర్చ వాస్తవానికి రెండు దశల్లో జరిగింది. మొదటిది, పైన చెప్పుకున్న ద్రుపదుడు, ధర్మరాజు, వ్యాసుల మధ్య చర్చ జరిగిన చర్చ. రెండోది, అంతకుముందే కుంతి, పాండవుల మధ్య జరిగిన చర్చ. రెండో దశ చర్చలో వరాలు, శాపాలు వగైరాల రూపంలో ద్రౌపది వివాహాన్ని ఎలాగో ధర్మబద్ధం చేయడానికి కథకుడు ప్రయత్నిస్తే, మొదటి దశ చర్చలో కుంతి అన్న ఒక మాట ద్వారా ధర్మబద్ధం చేయడానికి ప్రయత్నించాడు.

అదేమిటంటే, స్వయంవరంలో గెలుచుకున్న ద్రౌపదితో కలసి భీమార్జునులు ఇంటికి వచ్చిన తర్వాత తామొక భిక్ష తెచ్చామని తల్లితో అనగా, ద్రౌపదిని తెచ్చిన విషయం తెలియక ఎప్పటిలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకున్న కుంతి,‘మీరు అయిదుగురూ దానిని ఉపయోగించుకోండి’ అనడం.

కథకుడు ఆమాటనే ఉపయోగించుకున్నాడు. అయితే ద్రౌపదిని తెచ్చిన విషయం కుంతికి తెలియక అలా అందన్న కథకుని కల్పన మొత్తం రాతితో గోడకట్టినట్టుగా కాక, ఇసుక గూడులా మారిపోయిన సంగతి మామూలు బుద్ధికే తెలిసిపోతోంది. అదెలాగో చెప్పుకోవాలంటే, కుంతి,పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ద్రుపదుడి నగరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి ద్రౌపది స్వయంవరం గురించి వారికి చెప్పిన దగ్గరనుంచీ ఎత్తుకోవాలి.

ఆ బ్రాహ్మణుడు ద్రౌపది స్వయంవరం గురించే కాక, ఆమె జన్మవృత్తాంతం మొత్తం చెప్పి అర్జునుడికి భార్యకావడం కోసమే ద్రుపదుడు యజ్ఞం చేసి ద్రౌపదిని పొందాడని కూడా చెప్పాడు. అప్పుడు అర్జునుడితో సహా పాండవులు అందరూ ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లాలనుకోవడం సహజమే. పైగా స్వయంవరానికి నిర్ణయించిన పరీక్ష కూడా అర్జునుడి లాంటి మేటి విలుకాడు తన ప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశం. అదీగాక, రాచకన్యకు ఏర్పాటు చేసిన స్వయంవరాన్ని ఏ రాచబిడ్డా వదలుకోడు. అది పరువు కూడా కాదు.

కనుక పాండవులు ద్రుపదనగరానికి వెళ్లడానికి ఉత్సాహపడ్డారు. ఆ సంగతిని కుంతి గమనించిందని కూడా కథకుడు ఆ వెంటనే చెబుతున్నాడు. అయితే, స్వయంవరం మాట ఎత్తకుండా,‘ఇక్కడే చాలాకాలం ఉండిపోయాం, ఎంతకాలం ఇక్కడ ఉన్నా ఉపయోగమేముంది, పరుల ఇంట్లో ఎంత కాలం ఉంటాం, దక్షిణ పాంచాలం ఎంతో బాగుంటుందనీ, పాంచాలరాజు ధార్మికుడనీ విన్నాం, అదీగాక అక్కడి గృహస్థులు బ్రాహ్మణులకు అడగకుండానే చక్కటి భోజనం పెడతారట, అక్కడికి వెడదాం’ అంది. పాండవులు సరే, నువ్వు ఆదేశించినట్టే చేద్దాం అని తల్లితో కలసి బయలుదేరారు.

ఇక్కడ కుంతి స్వయంవరం గురించి ఎత్తకుండా, తాము పాంచాలరాజ్యానికి వెళ్లడానికి ఇతర కారణాలు చెప్పింది కనుక; పాండవులు స్వయంవరానికి వెళ్లదలచుకున్నారన్న సంగతి ఆమెకు తెలియదని కథకుడు అనడానికి అవకాశమున్నా అది పొసగదు. రాచబిడ్డలైన పాండవులు స్వయంవరానికి వెళ్ళి తీరతారనీ, వెళ్ళి తీరాలనే రాచసంప్రదాయం కుంతికి తెలియకుండా ఉండదు. అదీగాక, అర్జునుడికి భార్య కావడం కోసమే ద్రుపదుడు ద్రౌపదిని పొందాడనే సంగతి ఆమె కూడా వింది కనుక పాండవులు స్వయంవరానికి వెళ్లదలచుకున్నారన్న సంగతి ఆమెకు తెలియకపోయే ప్రసక్తే లేదు.

సరే, పాండవులు ద్రుపద నగరానికి బయలుదేరి వెడుతున్నారు. అప్పుడు వారికి వ్యాసుడు ఎదురయ్యాడు. ‘ఒక మునికన్య భర్త కోసం తపస్సు చేసిందనీ, శివుడు ప్రత్యక్షం కాగా భర్త కావాలని అయిదు సార్లు అడిగిందనీ, నీకు మరుసటి జన్మలో అయిదుగురు భర్తలవుతారని శివుడు ఆమెకు చెప్పాడనీ, ఇప్పుడామె పాంచాలరాజు కూతురుగా పుట్టి పెరిగిందనీ, ఆమెకు స్వయంవరం ప్రకటించారనీ, మీరు ద్రుపదపురానికి వెడితే మేలు జరుగుతుందనీ’ పాండవులకు వ్యాసుడు చెప్పాడు. అప్పుడు కుంతి అక్కడే ఉంది.

కనుక ఈవిధంగా కూడా పాండవులు ద్రౌపదీ స్వయంవరానికే వెడుతున్నారని కుంతికి తెలుసు!

ఆ తర్వాత మార్గమధ్యంలో వారికి కొందరు బ్రాహ్మణుల గుంపు కనిపించింది. మీరు ఎక్కడికి వెడుతున్నారని పాండవులు వారిని అడిగారు. ద్రౌపదీ స్వయంవరాన్ని చూడడానికి ద్రుపదపురం వెడుతున్నామని చెప్పారు. కుంతి, పాండవులు వాళ్ళతో కలసి ద్రుపదపురం వైపు ప్రయాణం సాగించారు.

కనుక పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లదలచుకున్న సంగతి కుంతికి తెలియకపోయే ప్రశ్న లేదు.

కుంతీ సహితంగా పాండవులు ద్రుపదనగరానికి చేరుకున్నారు. బ్రాహ్మణవేషంలోనే స్వయంవరంలో పాల్గొన్నారు. కుంతి విడిదిలో ఉండిపోయింది. పాండవులు తాము స్వయంవరానికి వెడుతున్నట్టు కచ్చితంగా తల్లితో చెప్పే ఉండాలి. కనుక, వాళ్ళు రోజూలానే ఆహారభిక్షకు వెడుతున్నట్టు కుంతి అనుకునే అవకాశమే లేదు.

అర్జునుడు మత్స్యయంత్రం కొట్టాడు. ద్రౌపది అతణ్ణి వరించింది. ఇంతమంది రాజులను స్వయంవరానికి ఆహ్వానించి, వారిని కాదని ద్రౌపదిని ఒక బ్రాహ్మణుడికి కట్టబెట్టడం రాజులను అవమానించడమే నని కర్ణ దుర్యోధనాదులు ద్రుపదునిపై దండెత్తారు. భీమార్జునులు వారిని ఎదుర్కొన్నారు.

అయితే, ఈ లోపలే, స్వయంవరం ముగిసిన వెంటనే ధర్మరాజు, నకుల, సహదేవులు విడిదికి చేరుకున్నారు. అంటే ఏమిటన్న మాట? అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెల్చుకున్న సంతోషకరవార్త ఆ ముగ్గురూ తల్లికి చెప్పేసి ఉండాలి. చెప్పకపోవడానికి కారణం లేదు.

ఆ తర్వాత, కర్ణ, దుర్యోధనాదులను ఓడించిన భీమార్జునులు ద్రౌపదిని వెంటబెట్టుకుని విడిదికి వచ్చారు. భిక్ష తెచ్చామని అన్నారు. ద్రౌపదిని తెచ్చిన సంగతి తెలియని కుంతి, ఎప్పటిలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకుని అయిదుగురినీ ఉపయోగించుకోమని అందని కథకుడు చెబుతున్నాడు.

ఈ కల్పన ఇసుకగూడు అన్న సంగతి తెలిసిపోవడంలేదా?

ఇంతకీ కథకుడు ఇంత అమాయకమైన కల్పన ఊరికే చేశాడనుకుంటున్నారా? కాదు. అతను ముఖ్యమైన కొన్ని అంశాలను మరుగుపుచ్చడానికి చేశాడు. వాటి గురించి తర్వాత…

 

 -కల్లూరి భాస్కరం

 

ద్రౌపది వివాహం: జంట సంకటం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కొన్నేళ్ళ క్రితం ఖుష్బూ అనే సినీనటి చేసిన ఒక వ్యాఖ్య చాలామందికి గుర్తుండే ఉంటుంది…

‘ఈ రోజుల్లో వివాహానికి ముందు ఆడపిల్లలకు లైంగిక సంబంధముండడం ఏమంత పెద్ద విషయం కాద’ని దాని సారాంశం. దానిపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీవీ చానెళ్లలో చర్చలు జరిగాయి. నిజమే… ఆ వ్యాఖ్యను ‘దైవ దూషణ’ను మించిన అపచారంగా భావించడం సహజమే!

వేరే దేశాల అనుభవం ఎలా ఉన్నా, మన దేశంలో ఇప్పటికీ వివాహానికి ముందు ఆడపిల్లల లైంగిక సంబంధం, ఊహించడానికే దారుణమైన విషయం. దానిని ఏ రకంగా సమర్థించినా అది మనోభావాలను గాయపరుస్తుంది. కారణం, వివాహం అనే చెలియలికట్ట మన మనస్సులలో ఒక బలమైన సెంటిమెంట్ గా, అచంచలమైన విశ్వాసంగా పాతుకు పోవడమే. లైంగిక సంబంధం విషయంలో ‘వివాహానికి ముందు, తర్వాత’ అనేది ఏవిధంగానూ చెరపడానికి వీల్లేని శిలారేఖ.

నిజానికి వివాహానికి రెండు పార్స్వాలు ఉన్నాయి. ఒకటి- వ్యవస్థకు, కట్టుబాటుకు, ఆర్థికతకు సంబంధించిన లౌకికపార్శ్వం. రెండవది-సెంటిమెంటుకు, విశ్వాసానికి, భావోద్వేగాలకు సంబంధించిన పార్శ్వం. తటస్థంగా చెప్పుకుంటే, చరిత్రకు అందనికాలంలో కొన్ని లౌకిక కారణాల వల్లనే వివాహవ్యవస్థ ఏర్పడింది. కాలగతిలో అది ఒక సెంటిమెంట్ గా, విశ్వాసంగా, భావోద్వేగ అంశంగా మారి మన ఊహల్లో జీర్ణించుకుంది. ఇప్పుడు విచిత్రంగా అనిపించవచ్చు కానీ, వివాహం అనేది వ్యవస్థీకృతం అవుతున్న కాలంలో దానికి వ్యతిరేకమైన సెంటిమెంటు, విశ్వాసం, భావోద్వేగాలు ఉండి; వివాహవ్యవస్థను అవి ప్రతిఘటించి ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ప్రపంచ వాఙ్మయం అంతటా కనిపిస్తాయి. ఈ వ్యాసాల క్రమంలో వాటి గురించిన ప్రస్తావన ముందు ముందు రావచ్చు.

చరిత్ర లోతుల్లోకి వెళ్లి ఒక పోలిక చెప్పుకోవాలంటే, అది వ్యవసాయం! వ్యవసాయం ఆహారోత్పాదనలో ఒక పురోగామి చర్య. కానీ వ్యవసాయాన్ని నామోషిగా భావించి, అందులో భాగం కావడానికి నిరాకరించి, సాంప్రదాయిక ఆహార సంపాదనకే కట్టుబడిన జాతులు ఉన్నాయి. అది కూడా సాధ్యం కానప్పుడు దొంగతనాన్ని ఆశ్రయించిన జాతులు ఉన్నాయి. కోశాంబీ ‘AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY’ లో ఈ జాతుల గురించి కొంత చర్చ చేశారు.

లైంగిక సంబంధాల విషయంలో వ్యత్యాసాలు ఎలా ఉన్నా వివాహాన్ని మాత్రం ఒక ఉన్నతోన్నత విలువగా, వ్యవస్థగా దాదాపు ప్రపంచమంతా గుర్తించింది. ఆ గుర్తింపు వెనుక సంప్రదాయం కొన్ని వందలు, వేల సంవత్సరాలపాటు సాగించిన అకుంఠిత కృషి ఉంది. వివాహాన్ని వ్యవస్థీకరించడంలో సంప్రదాయం ఎదుర్కొన్న సవాళ్ళు, అనుభవాలు ఇప్పుడు మన ఊహకు అందగలిగినవి కావు. ఆ సవాళ్లలో నాటి వ్యవస్థాపరమైనవే కాక, ప్రకృతి పరమైనవి కూడా ఉన్నాయి. దేనినైనా వ్యవస్థీకరిస్తున్నప్పుడు ప్రకృతిధర్మానికి కూడా కత్తెర వేయక తప్పదు. అలాగని వివాహమనే కట్టడి చేయడంలో సంప్రదాయం పూర్తిగా కఠినంగా వ్యవహరించిందనుకోవడం కూడా పొరపాటు. ఎన్నో సడలింపులకు, సర్దుబాట్లకు అది చోటిచ్చింది. ఒక్కోసారి వివాహవ్యవస్థపైన ప్రకృతిసహజమైన లైంగికతకు, స్త్రీ-పురుష మనోభావాలకు పై చేయిని అంగీకరించడమూ అనివార్యమైంది.

మన సంప్రదాయానికే వస్తే, ధర్మశాస్త్రాలు ఎనిమిది రకాల వివాహాలను, పన్నెండు రకాల సంతానాన్ని అంగీకరించడమే ఉదాహరణ. వివాహవ్యవస్థకు అనుగుణంగా స్త్రీ-పురుష స్వేచ్ఛను, లైంగికతను నియంత్రించలేనప్పుడు; వాటికి అనుగుణంగా వివాహవ్యవస్థలోనే సర్దుబాట్లు చేయవలసివచ్చింది. దాని ఫలితమే అన్ని రకాల వివాహాలు, అన్ని రకాల సంతానాలు. వీటి గురించి వివరంగా చెప్పుకునే సందర్భం ముందు ముందు వస్తుందేమో, చూద్దాం.

విశేషమేమిటంటే, ఇన్ని వందలు, వేల సంవత్సరాల అనుభవంలో కూడా వివాహం అనేది అందరికీ ఒకే విధంగా వర్తించేలా పూర్తిగా వ్యవస్థీకృతం కాలేదు. ఎప్పటికైనా పూర్తిగా వ్యవస్థీకృతం అవుతుందో కాదో కూడా చెప్పలేం. ఇప్పుడు వివాహేతర ‘సహజీవనా’న్ని న్యాయవ్యవస్థ గుర్తించడాన్నే చూడండి. మనదేశపు అనుభవంనుంచే చూస్తే, వివాహవ్యవస్థ అన్ని కులాలలోనూ, అన్నివర్గాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ ఒకేలా లేదు. ఒక ఉదాహరణ: మారు మనువులు. కొన్ని కులాలలో మారు మనువులుంటే కొన్ని కులాలలో లేవు.

గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో మారుమనువుల ప్రస్తావన వస్తుంది:

‘మా సూపరెంటు పిల్లలతో ఉన్న రెండో పెళ్లి దొరసాన్ని పెళ్లాడి సుఖంగా ఉండలేదా?’ అని హెడ్ కానిస్టీబులు  అంటాడు.

‘మావగారి అబిప్పరాయం పెయ్యతో టొచ్చిన ఆవు మేలు కాదా అని’ మునసబు అంటాడు. ‘ముసలి బాపనోడు (లుబ్ధావధాన్లు) యెదవ గుంటని పెళ్లాడితే మీ నేస్తం కరణపోణ్ణి (రామప్పంతుల్ని) ఆ ముసలాడి యెదవ కూతుర్ని (మీనాక్షిని) పెళ్లాడమని బోద సెయ్యరాదా?’ అంటాడు.

‘మనకేల మావా? గవునర్ మెంటూ దేవుళ్లూ బ్రాహ్మలూ వారి నేరాలు వారివి’ అని హవల్దార్ అచ్చన్న అంటాడు.

‘మనలో మారుమనువు లుండేవి కావా?’ అని మునసబు అంటాడు.

చెప్పొచ్చేదేమిటంటే, ఇప్పుడు తాతముత్తాతల ఆస్తుల్ని అనుభవిస్తున్నవారికి, వారు ఆ ఆస్తులు కూడబెట్టడానికి ఎంత శ్రమించారో తెలియనట్టే; వివాహాన్ని ఒక సెంటిమెంటుగా విశ్వాసంగా జీర్ణించుకున్న మనకు, ఆ కట్టడికి రూపమివ్వడంలో సంప్రదాయం ఎంత చెమటోడ్చిందో తెలియదన్నమాట.

 

***

ravi_varma-draupadi_carrying_milk_honey1

కన్యాత్వంతో పీటముడి ఉన్న వివాహం గురించి అవసరమైన ఈ నాలుగు మాటలూ చెప్పుకున్న తర్వాత విషయంలోకి వద్దాం.

మహాభారత కథకుడు కన్యాగర్భం, ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం అనే రెండు ధర్మసంకటాలను ఎదుర్కొన్నాడని ఇంతకు ముందు అనుకున్నాం. నిజానికి ద్రౌపది వివాహంలో ఒకటి కాదు, రెండు ధర్మసంకటాలు ఉన్నాయి. మొదటిది, అయిదుగురిని వివాహమాడడం; రెండోది కన్యాత్వం. అదెలాగంటే, పెద్దవాడైన ధర్మరాజు మొట్టమొదట ఎప్పుడైతే ద్రౌపది పాణిగ్రహణం చేశాడో అప్పుడామె కన్యావస్థనుంచి వివాహితావస్థకు మారిపోతుంది. ఆ తర్వాతి నలుగురూ కన్యను కాక వివాహితను పెళ్లాడినట్టు అవుతుంది. అది శాస్త్రవిరుద్ధం. ఆవిధంగా ద్రౌపది వివాహం జంట సంకటంగా పరిణమించిందన్న మాట. ఈ రెండు సంకటాలను కథకుడు జమిలిగా ఎలా పరిష్కరించాడో చూద్దాం:

ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెల్చుకున్నాడు. తల్లి చెప్పడంతో పాండవులు అయిదుగురూ ఆమెను పెళ్లాడడానికి నిర్ణయించుకున్నారు. ధర్మరాజు ఈ నిర్ణయాన్ని ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడి ముందు ఉంచాడు. ఆశ్చర్యపోయిన ద్రుపదుడు,‘ఒక పురుషుడికి అనేక మంది భార్యలు ఉండచ్చు కానీ, అనేకమంది పురుషులకు ఒక్కతే భార్య అన్నది ఏ యుగంలోనూ ఏ కథల్లోనూ వినలేదు. నువ్వేమో అన్ని ధర్మాలూ తెలిసినవాడివి. కనుక నువ్వు మాట్లాడేది ధర్మవిరుద్ధం కావడానికి వీల్లేదు. అయినా దీనిపై రేపు నువ్వు, నేను, కుంతీదేవి, దృష్టద్యుమ్నుడు చర్చించుకుని నిర్ణయం తీసుకుందా’ మన్నాడు.

ఆ తర్వాత హఠాత్తుగా వేదవ్యాసుడు ద్రుపదుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు ద్రుపదు డాయనకు ధర్మరాజు ప్రతిపాదన గురించి చెప్పి,‘మీరు ఎరగని లోకాచారాలు ఉండవు కనుక మీరే ఇందులో ధర్మాధర్మ నిర్ణయం చేసి, ధర్మసంకరం కాకుండా చూడవలసిం’దని ప్రార్థించాడు.

అప్పుడు ధర్మరాజు జోక్యం చేసికొని,‘పరిహాసంగా కూడా నేను ఎప్పుడూ అధర్మం మాట్లాడలేదు. ధర్మం తప్పలేదు. కనుక తగునా, తగదా అనే ఆలోచన మానేసి ద్రౌపదిని మా అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేయం’డని నిశ్చితంగా చెప్పాడు. ఆపైన,‘పూర్వం గౌతమ గోత్రానికి చెందిన జటిలు డనే ఋషి కూతురు తపః ప్రభావంతో ఏడుగురు ఋషులకు భార్య అయిందనీ, దాక్షాయణి అనే ముని కన్య ప్రచేతసులనే ఒకే పేరు గలిగిన పదకొండుమందికి భార్య అయిందనీ కథల్లో వింటూ ఉంటాం. అదీగాక, గురువులలోనే పరమ గురువు అయిన మా తల్లి ఆదేశాన్ని, విధి నిర్దేశాన్ని త్రోసిపుచ్చడం సాధ్యం కాదు’ అని మరోసారి నిష్కర్షగా అన్నాడు.

అప్పుడు ద్రుపదుడు ‘ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించడం మన వల్ల కాదు. త్రిలోకపూజ్యుడు, త్రికాలవేది అయిన వ్యాసమహర్షి ఎలా చెబితే అలా చేద్దాం’ అన్నాడు. దానికి వేదవ్యాసుడు,‘ధర్మరాజు ధర్మతత్వం తెలిసినవాడు. కనుక అతను ధర్మ మార్గం తప్పే ప్రశ్న లేదు. అలాగే దేవతామూర్తి అయిన ఈ కుంతీదేవి నోట కూడా అబద్ధం రాదు. వీళ్ళ మాటలూ, దేవతల అభిమతమూ రెండూ ఒకటే. కనుక నిస్సంకోచంగా నీ కూతురిని ఈ అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేయి. అదీగాక, దీని వెనుక ఒక రహస్యం ఉంది. వినడానికి నువ్వు ఇష్టపడితే చెబుతాను విను’ అంటూ ద్రుపదుని చేయి పట్టుకుని ఏకాంతప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఇలా చెప్పడం ప్రారంభించాడు:

“ద్రౌపది పూర్వజన్మలో ఇంద్రసేన అనే పరమ పతివ్రత. మౌద్గల్యుడు అనే మహాముని భార్య. కర్మవశాత్తూ ఆ మునికి కుష్టువ్యాధి వచ్చింది. దానికితోడు వృద్ధాప్యం. ఆపైన అతికోపం. అయినాసరే, అతని దుర్గంధంతో సహా అన్నీ భరిస్తూ, ఏమాత్రం అసహ్యించుకోకుండా ఇంద్రసేన అతనికి భక్తితో సేవలు చేస్తూ ఉండేది. అతను తిన్న తర్వాత అతని ఎంగిలినే తను తింటూ ఉండేది. ఒకరోజున అలా తింటుండగా అన్నంలో తెగిపడిన అతని వేలు ఒకటి కనిపించింది. ఇంద్రసేన ఏవగించుకోకుండా దానిని తీసి పక్కన పెట్టి ఎంతో ఇష్టంగా ఆ అన్నం తింది.

మౌద్గల్యుడు అది చూశాడు. ఆమె భక్తికి మెచ్చుకున్నాడు. ‘నీకు ఏది ఇష్టమో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. ‘నాకు కామేచ్ఛ ఎక్కువగా ఉంది. నువ్వు తపశ్శక్తితో ఈ బీభత్సరూపం వదిలేసి అందమైన అయిదుగురు పురుషుల రూపం ధరించి నాతో రమించి నన్ను సంతోషపెట్టు’ అని ఇంద్రసేన అంది. అప్పుడు ఆ ముని ఆమెకు ఇష్టమైనట్టు అయిదు దేహాలు ధరించి అనేకచోట్ల విహరింపజేస్తూ అనేక వేల సంవత్సరాలపాటు ఆమెతో రమించాడు. ఆవిధంగా తను తృప్తి చెందిన తర్వాత ఆమెను వదిలేసి తను తపస్సుకు వెళ్లిపోయాడు.

అయితే, ఇంద్రసేన తృప్తి చెందలేదు. కొంతకాలానికి మరణించి కాశీరాజు కూతురుగా పుట్టింది. భర్త దొరకకపోవడంతో చాలాకాలం కన్యగానే ఉండిపోయింది. తన దౌర్భాగ్యస్థితికి విచారించి భర్త కోసం శివుని ఉద్దేశించి తపస్సు ప్రారంభించింది. అప్పుడు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు ఆమెపై ప్రీతి చెంది ఆమె దగ్గరకు వచ్చి, వచ్చే జన్మలో మా అంశతో పుట్టేవారికి భార్య కావలసిందని కోరారు. ఇంద్రసేన తపస్సును కొనసాగించింది. అది క్రమంగా ఉగ్రతపస్సు అయింది. అప్పుడు ఆమెకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు పతిదానం చేయమని అయిదుసార్లు అడిగింది. సరే, నీకు వచ్చే జన్మలో అయిదుగురు భర్తలు లభిస్తారని శివుడు అన్నాడు.

‘ఎక్కడైనా ఒక స్త్రీకి ఒక్కడే భర్త. పలువురు భర్తలు ఉన్నట్టు ఏ కథల్లోనైనా విన్నామా? ఇలాంటి లోకవిరుద్ధమైన వరం నాకు వద్దు’ అని ఇంద్రసేన అంది. అప్పుడు శివుడు,‘నీకు అయిదుగురు భర్తలైనా నా వచనప్రభావం వల్ల అది ధర్మబద్ధమే అవుతుంది. నీ మీద దయతో ఇలాంటి వరం ఇస్తున్నా’ నన్నాడు. ‘అలా అయితే, ఆ అయిదుగురు భర్తలతో నేను ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంగమించేటప్పుడు నాకు కౌమారాన్ని (అంటే కన్యాత్వాన్ని), పతి సేవాభాగ్యాన్ని, కామోపభోగాన్ని, సౌభాగ్యాన్ని ఇవ్వవలసిం’దని ఇంద్రసేన అడిగింది. శివుడు సరే నన్నాడు…”

ఈ ఘట్టాన్ని వ్యాసుడు మరికాస్త పొడిగించి, దేవతలకు మేలు చేయడం కోసం ఇంద్రుడే అయిదు రూపాలు ధరించి యమ, వాయు, ఇంద్ర, అశ్వినుల అంశతో పాండవుల రూపంలో మనుష్యజన్మ ఎత్తాడంటూ ఆ కథ కూడా చెప్పాడు. ఈవిధంగా కాశీరాజు కుమార్తెగా పుట్టిన ఇంద్రసేనే ఈ జన్మలో ద్రౌపదిగా యజ్ఞవేదిలో జన్మించిందని చెప్పిన వ్యాసుడు,‘ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే, ద్రౌపది, పాండవుల పూర్వదేహాలు చూడు’ అంటూ ద్రుపదునికి దివ్యదృష్టి ఇచ్చాడు. అప్పుడు ప్రకాశవంతమైన మణులు పొదిగిన విచిత్ర కిరీటాలతో, బంగారు ఆభరణాలతో, తాటి చెట్టంత ఎత్తైన దేహాలతో పాండవులూ; ఆ అయిదుగురికి భార్య కావడం కోసం తపస్సు చేసిన సకల లావణ్యమూర్తి అయిన ఆ కన్యకా పూర్వదేహాలతో ద్రుపదుడికి కనిపించారు. అతను ఆశ్చర్యపోయాడు.

వ్యాసుడు ఇంకా ఇలా అన్నాడు:

“పూర్వం నితంతుడనే రాజర్షి ఉండేవాడు. అతనికి సాల్వేయుడు, శూరసేనుడు, శ్రుతసేనుడు, బిందుసారుడు, అతిసారుడు అనే అయిదుగురు కొడుకులు ఉండేవారు. వారు మహా పరాక్రమవంతులు. అన్యోన్య స్నేహానికి, ఐకమత్యానికి కూడా ఆ సోదరులు ప్రసిద్ధులయ్యారు. వారు అయిదుగురూ ఔశీనరుడనే రాజుకూతురు అజితను స్వయంవరంలో గెల్చుకుని వివాహమాడారు. ఆమె వల్ల అయిదుగురూ విడివిడిగా సంతానం పొందారు.

వెనకటి మహాత్ములకు సంబంధించి కూడా ఇలాంటి చరిత్రలు ఉన్నాయి. కనుక పాండవులు అయిదుగురికీ ఒకరి తర్వాత ఒకరుగా ద్రౌపదిని ఇచ్చి పాణిగ్రహణం చేయించు. ఇది మనం చేసేది కాదు, దైవనిర్ణయం.”

ద్రుపదుడు అంగీకరించాడు.

***

Back-To-Godhead-5-Husbands-of-Draupadi

ఇది తెలుగు భారతంలోని కథ. సంస్కృత భారతంలో కొంత తేడా కనిపిస్తుంది. దాని ప్రకారం, మౌద్గల్యుడు ఇంద్రసేన కోరినట్టు ఆమెతో అయిదు రూపాలతో చిరకాలంపాటు సుఖించిన తర్వాత విరక్తుడై తపస్సుకు వెళ్లిపోవాలనుకుంటాడు. అప్పుడు,‘నేనింకా తృప్తి చెందలేదు, నన్ను విడిచిపెట్టి వెళ్లద్దు’ అని ఇంద్రసేన అంది. ‘నువ్విలా నాతో అనకూడని మాట అన్నావు కనుక ద్రుపదుని కూతురిగా పుట్టి అయిదుగురు భర్తలను పొందు’ అని మౌద్గల్యుడు ఆమెను శపించాడు. అప్పుడు ఖిన్నురాలైన ఇంద్రసేన శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ‘నువ్వు పై జన్మలో ఉత్తమస్త్రీవి అవుతావు. దేవేంద్రుడితో సమానులైన అయిదుగురు నీకు భర్త లవుతారు. నువ్వొక దైవకార్యానికి నిమిత్తమవుతావు’ అని వరమిచ్చాడు. అప్పుడు ఇంద్రసేన,‘నేను ఒక్క భర్తనే అడిగితే అయిదుగురు భర్తలంటున్నావేమిటి? ఒక స్త్రీకి ఒక్క భర్తే కానీ బహు భర్తలు ఉండకూడదు కదా?’ అంది. ‘నువ్వు పతిని ఇవ్వమని అయిదుసార్లు అడిగావు కనుక ఈ వరం ఇచ్చా’నని శివుడు అన్నాడు.

దానికి ఇంద్రసేన,‘ స్త్రీకి ఒకే భర్త ఉండాలనీ, పురుషుడికి అనేకమంది భార్యలు ఉండవచ్చుననీ మునులు నిర్ణయించారు. అదే లోకధర్మం. ఆపత్కాలంలో నియోగవిధిని బట్టి, భర్తకంటె అన్య పురుషుడితో సంబంధాన్ని చెప్పారు. మూడో పురుషుడితో సంబంధం ఉంటే ప్రాయశ్చిత్తం చెప్పారు. నాలుగో పురుషుడితో సంబంధం వల్ల పతితురాలు అవుతుందని చెప్పారు. అయిదో పురుషుడితో సంబంధం వల్ల బంధకి అవుతుంది. ఇదీ ధర్మమార్గం. కనుక నాకు బహు భర్తలు వద్దు. నాకు అదే తప్పకపోతే ఒక వరం ఇవ్వు. ఒక్క పతితో ఉన్న ప్రతిసారీ నాకు కన్యాత్వం కలిగేలా అనుగ్రహించు’ అంది. శివుడు సరే నన్నాడు.

***

తెలుగు, సంస్కృత పాఠాలు రెంటిలోనూ కొన్ని సందేహాలు కలుగుతాయి. మొదటిది, నీకు అయిదుగురు భర్త లవుతారని మౌద్గల్యుడు శపించినప్పుడు; అలాంటి శాపం ఇవ్వవద్దనీ, ఒక్క భర్త మాత్రమే లభించేలా దానిని సవరించమనీ అతనినే ఇంద్రసేన కోరి ఉండవచ్చు. కానీ కోరకుండా శివుని గురించి తపస్సు చేసింది. అప్పుడు కూడా ధర్మబద్ధంగా ఒక్క భర్తనే ఇవ్వమని అడగవలసింది పోయి, అయిదుసార్లు భర్తనిమ్మని అడిగింది. శివుడు అయిదుగురు భర్తలను ఇస్తాననేసరికి, అదెలా కుదురుతుంది, ధర్మబద్ధంగా ఒక్క భర్తనే ఇవ్వమని అడిగింది. అలా కానప్పుడు, ఒక్కొక్క భర్తతోనే ప్రత్యేక సంగమాన్ని, కన్యాత్వాన్ని ఇవ్వమని కోరింది. అంటే, ఒక భర్త దగ్గరనుంచి ఇంకో భర్తవద్దకు మారిన ప్రతిసారీ తను కన్యగా మారిపోవాలని ఆమె కోరిందన్నమాట.

చూడండి… ’ఒక భర్త-అయిదుగురు భర్తలు’ అనే అంశం చుట్టూ విషయం ఎలా పరిభ్రమిస్తోందో! ‘ద్రౌపదికి అయిదుగురు భర్తలు’ అనే విషయాన్ని చెప్పడం కథకుడికి ఎలాగూ తప్పదు. కానీ అందుకు ఏవో ప్రత్యేకకారణాలు చెప్పడానికి ప్రతి దశలోనూ ప్రయత్నిస్తున్నాడు. ఒక స్త్రీకి ఒకే భర్త అనే ధర్మాన్ని మధ్య మధ్య తీసుకు వస్తున్నాడు. లేదా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ద్రౌపది అయిదుగురికి భార్యే అయినప్పటికీ ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు ఆ ఒక్కడికే భార్య. ఆమెకు ఆ ఒక్కడే భర్త. ఎందుకంటే, ఒక భర్త దగ్గరనుంచి ఇంకో భర్త దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె కన్యగా మారిపోతుంది. అప్పుడామె ‘అక్షతయోనిత్వం’ పొందుతుందన్న మాట. ఈ విధంగా చూసినప్పుడు ద్రౌపదికి అయిదుగురు భర్తలనడం కథకుడి దృష్టిలో కేవలం సాంకేతికవివరం, లేదా లోక వ్యవహారం మాత్రమే. నిజానికి ఆమె ప్రతిసారీ, ప్రతి ఒక్క భర్త దగ్గరకూ వెళ్ళేటప్పుడు కన్యగానే వెడుతుంది కనుక, అతనితో ఉన్నంతసేపూ అతనొక్కడే ఆమెకు భర్త. ఆమె ఏ భర్తతోనూ లేని కాలం ఉందనుకోండి, అప్పుడామె కన్యగానే ఉండిపోతుంది. ఆ సమయంలో ఆమె పంచభర్తృత్వమే కాదు, వివాహం కూడా రద్దైపోతుంది! ఇదో విచిత్రమైన పరిస్థితి.

అందుకే ద్రౌపదిని ‘పంచకన్యల’లో ఒకరుగా చెప్పారా?! సంప్రదాయం ప్రకారం, అహల్య, ద్రౌపది, కుంతి, తార(రామాయణంలో వాలి భార్య), మండోదరి(రావణుని భార్య) పంచకన్యలు. వీరిలో మండోదరి సంగతి తెలియదు కానీ; మిగిలిన నలుగురికీ ఒకరి కంటే ఎక్కువమంది పురుషులతో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. అహల్య గౌతముడనే మునికి భార్యకాగా, ఇంద్రుడు ఆమెను కామించి సంబంధం పెట్టుకున్నాడు. కుంతి సంగతి తెలిసినదే. వాలి మరణించిన తర్వాత తార, వాలి తమ్ముడైన సుగ్రీవునికి భార్య అయింది. వీరందరికీ ఒకరిని మించి పురుషులతో సంబంధమున్న స్థితిలో ఆ దోషాన్ని నివారించడానికి వీరిని నిత్యకన్యలుగా సంప్రదాయం చెబుతోందనుకోవాలి.

ద్రౌపదికి ఒకడే భర్త అన్న విషయాన్ని కథకుడు ఇంకో విధంగా కూడా చెబుతున్నాడు. పూర్వజన్మలో ఆమె మౌద్గల్యుడి ఒక్కడికే భార్య. అతన్నే అయిదురూపాలు ధరించి తనతో సంగమించమని కోరింది. ద్రౌపదిగా జన్మించినప్పుడు ఆమెకు భర్తలైన పాండవులు కూడా ఇంద్రుడనే ఒక్కడికే భిన్న రూపాలు మాత్రమే. ఇలా చూసినా ద్రౌపదికి ఒకడే భర్త.

మొత్తానికి ‘ఒక స్త్రీకి ఒకడే భర్త’ అన్న వివాహవ్యవస్థలోకి ద్రౌపదిని తీసుకురావడానికి వరాలు, శాపాలు, దైవనిర్ణయాల రూపంలో కథకుడు ఆశ్రయించిన ఉపాయాలు అర్థమవుతూనే ఉన్నాయి. ఆ విధంగా ఒక ధర్మసంకటం నుంచి అతను బయట పడ్డాడు. పాండవులలో పెద్ద అయిన ధర్మరాజును పెళ్లాడిన తర్వాత, ద్రౌపది కన్యాత్వాన్ని కోల్పోయి వివాహిత అవుతుంది కనుక, అప్పుడు తర్వాతివారైన భీమార్జున నకుల సహదేవులు ఒక ‘వివాహిత’ను పెళ్లాడడం అనే శాస్త్రవిరుద్ధమైన పరిస్థితి తలెత్తుతుంది కనుక దానికి పరిహారంగా ఆమెకు శివుడు కన్యాత్వవరం ఇచ్చినట్టు చెప్పాడు. ఆవిధంగా రెండో ధర్మ సంకటం నుంచి బయటపడ్డాడు.

తెలుగు భారతంలో ఇలా ఉంది: “…ముందర ధర్మపుత్రునకు ద్రుపదరాజపుత్రిం బాణిగ్రహణంబు సేయించి తొల్లి యేవురకు వివాహంబు సేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరు వరంబున గౌమారంబు వడసిన యక్కన్యకం గ్రమంబున భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన…”

మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

-కల్లూరి భాస్కరం