అవును నిజంగా కవిత్వమొక తీరని దాహమే!

rajyasri2

( డాలస్ లో మే 24 నుంచి జరగనున్న తానా సభల్లో  పాల్గొంటున్న ముఖ్య అతిథుల్లో  ఒకరైన  కేతవరపు రాజ్యశ్రీ సాహిత్య నేపథ్యం )

నా సాహితీ ప్రస్థానం గురించి చెప్పాలంటే నిజానికి మాది సాహితీ నేపధ్యమున్న కుటుంబం. మా పితామహులు కీ||శే|| విద్వాన్‌ మహాకాళి వేంకటేశ్వరరావుగారు చెళ్లపిళ్ల వారి శిష్యులు. జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారు, మా తాతగారు కలిసి చదువుకున్నారు. మా తాతగారు బహుభాషా కోవిదులు. పదవీ విరమణానంతరం ఖ.జు., ఉఊ చేసి విద్యార్జనకి వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు. వీరు ”శ్రీ వేంకటేశ్వర శతకము”, ”రవీంద్రుని జీవిత సంగ్రహము” ”కృష్ణకుమారి”, చరిత్ర విషయక నవలలు, హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ (ఇంగ్లీషులో), జాగ్రఫీలో పాఠ్యాంశాలు, తెలుగు టు ఇంగ్లీషు పాకెట్‌ డిక్షనరీ, ఇలా అనేక ఇతర రచనలు చేశారు. నిత్య విద్యార్థికి మల్లే, డెభై యేళ్ల వయసులో కూడా ఇంగ్లీషులో కొత్త పదాలకు అర్థాలు డిక్షనరీ చూసి తను నేర్చుకుని, మాకు ఆ పదప్రయోగం చేస్తూ వాక్యనిర్మాణం కావించమని చెప్పమని ప్రోత్సహించేవారు. చక్కని భాషా పరిజ్ఞానం, స్ఫూర్తి వారి దగ్గర నుంచి నాకు లభించిన అమూల్య సంపద.

మా నాన్నగారు కీ||శే|| మహాకాళి వేంకటరావుగారు తండ్రిని మించిన తనయులు. కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారి శిష్యులు. అడపా దడపా వారిని మా ఇంటికి పిలిచి, కాలనీ వారందరిని సమావేశపరచి వారి ప్రసంగాలు ఏర్పాటు చేసేవారు. వారు రచించిన రామాయణ కల్పవక్షంలోని పద్యాలు మాచేత బట్టీ కొట్టించి, ఆయన ముందు చెప్పించేవారు. నాన్నగారు వృత్తిరీత్యా ఎ.జి. ఆఫీసులో ఆడిట్‌ ఆఫీసరు, ప్రవృత్తిరీత్యా కవి, నటులు, నాటక రచయిత, జ్యోతిష వాస్తు శాస్త్ర పండితులు. ”అయోమయం”, ”అదేమిటి” అనే హాస్య నాటకాలు రచించి, నటించారు. ఎ.జి. ఆఫీసులో ”తెలుగు నాటక సమితి”, ”రంజని” సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులు.
జ్యోతిష శాస్త్రంలో విశేషప్రతిభ కనపరచినందుకు ”దైవజ్ఞ శిరోమణి” అనే బిరుదును పొందారు. శ్రీ లలితా ఉపాసకులు. చిన్నతనంలోనే మాకు ”లలితా సహస్రనామ” పారాయణం, పూజావిధానం నేర్పించారు. తనతోపాటు కవిసమ్మేళనాలకూ, సాహితీ సమావేశాలకు తీసుకెళ్లేవారు. మా అమ్మ శ్రీమతి ప్రభావతి ప్రముఖ వీణావిద్వాంసురాలు. సంగీత సాహిత్యాల నేపధ్యంలో పెరగడం వలన, అమ్మ నుంచీ వీణ వాయించడం, నాన్న దగ్గర నుంచి సాహిత్యాభిలాష సహజంగా అలవడినాయి.

 

చేతన ఆవిర్భావం :
1991లో ”చేతన సచివాలయ సారస్వత వేదిక” అనే సాహితీ సంస్థ ఆవిర్భవించినది. కొంతమంది సాహితీమిత్రులు కలిసి ‘చేతన’ అనే మొక్కని నాటారు. యాంత్రికమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు, వారి అంతరంగాల్లో కవిత్వం పట్ల నిగూఢంగా వున్న ఆర్తిని తృప్తిపరచి మనోల్లాసం కలిగించడానికి   ”చేతన” సంస్థ ఆవిర్భవించింది. చేతన నెలనెలా సాహితీ వెన్నెలలు వెదజల్లుతూ, చర్చలూ-గోష్ఠులూ, కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చింది.
అనేకమంది ప్రముఖ సాహితీమూర్తులు ‘చేతన’ వేదిక మీద ప్రసంగించారు. శ్రీయుతులు మధురాంతకం రాజారాం, ఆచార్య తిరుమల, అద్దేపల్లి రామ్మోహన్‌రావు, తనికెళ్లభరిణి, నండూరి రామకృష్ణమాచార్య ఇలా అనేకమంది సాహితీవేత్తలు ప్రసంగించి సచివాలయ కవులకూ రచయితలకూ స్ఫూర్తినిచ్చారు.

అప్పటి నుంచి అన్ని పత్రికలకు నా కవితలు పంపడం, అవి ప్రచురింపబడటం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.
తరువాత వరసగా అన్ని ప్రక్రియలలో కవితలు రాయాలని ”సిసింద్రీలు” అనే మినీ కవితల సంకలనం, ”వెన్నెల మెట్లు” అనే రెక్కల ప్రక్రియలో పుస్తకం, అలాగే సాహితీకిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు గారి మానస పుత్రిక, ”వ్యంజకాలు” అనే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఆయనకంటే ముందు నేనే 108 వ్యంజకాలు రాసి ”బొమ్మబొరుసు” అనే పుస్తకం వెలువరించాను.

‘అక్షరం’ మీద కవిసమ్మేళన సభలో పాల్గొని ”అక్షరం నన్ను వేధిస్తోంది” అనే కవిత చదివాను. ఈ అక్షరం అప్పటి నుంచి నన్ను వెంటాడి, చివరకు అక్షరం మీద 108 ముక్తకాలు రాసి ”అక్షర కేతనం” అనే పుస్తకం వెలువరించాను.

తరువాత ”తృప్తీ నీవెక్కడ” (2011)లో వచన అనే కవితా సంకలనాన్ని కూడా వెలువరించాను.

”ఊహల వసంతం” కవితా సంకలనానికి విశ్వసాహితీ సంస్థవారు ఉత్తమ గ్రంధ పురస్కారం, అలాగే నెల్లూరు సృజన సాహిత్య వేదికవారి ఉత్తమ గ్రంధ పురస్కారం లభించాయి. రెండో హనీమూన్‌ అనే కవితకు ఉత్తమ హాస్యకవితా పురస్కారం లభించింది.

మా అమ్మ ప్రభావతిగారితో ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్లడం, నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న భగవద్గీత, నాలో కొంత ఆధ్యాత్మికతను పెంపొందించాయి. ఎవరెన్ని పుస్తకాలు రాసినా, తృప్తి అనేది సంతృప్తిలోనే వుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ”సాహితీ కిరణం” మాసపత్రికలో ఆధ్యాత్మిక కాలమ్‌ నిర్వహిస్తూ చిన్న చిన్న కధలతో ఆధ్యాత్మిక గుళికలను అందరికీ అర్థమయ్యే విధంగా రాస్తున్నాను. ఆధ్యాత్మికత అంటే అదేదో ముసలివాళ్లకి సంబంధించిన విషయంగా చాలా మంది అనుకుంటారు. అందుకే ఆధ్యాత్మికతను నిత్య జీవితంలో జరిగే సంఘటనలతో పోలుస్తూ చిన్న చిన్న కధల ద్వారా వ్యక్తీకరించాను. విద్యార్థులు సైతం వీటిని చదివి, మాకు ఇలాంటి విషయాలు తెలియవండీ, ఇవి చదివిన తరువాత మాకు చాలా విషయాలు తెలిసాయంటూ ఉత్తరాల వర్షం కురిపించారు.
వీటన్నిటినీ సంకలంన చేసి ”నీలోకి నువ్వు” ”ఆధ్యాత్మికత వృద్ధులకేనా” అనే రెండు ఆధ్యాత్మిక గుళికల పుస్తకాలు వెలువరించి డా|| రమణాచారి, ఐఎఎస్‌గారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశాను. ఇప్పటివరకు 10 పుస్తకాలు, అనేక సామాజిక వ్యాసాలు, కొన్ని కథలు రాశాను.

అలా మొదలైన నా సాహితీ ప్రస్థానం, ఇప్పుడు హైదరాబాదులోని సాహితీ సంస్థలన్నిటి ద్వారా సత్కారాలు పొందడమే కాక వారివారి సభలలో నన్ను వివిధ హోదాలలో ఆహ్వానించి, గౌరవిస్తున్నారు. శ్రీ త్యాగరాయగానసభలో ప్రత్యేకంగా నా చేత ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు.
”కవిత్వం ఒక తీరని దాహం” అన్నారు శ్రీశ్రీ. అది నా పట్ల నూటికి నూరుపాళ్లూ నిజమనిపిస్తోంది. మొదట్లో నేను సాహిత్యం మీద మక్కువ చూపిస్తే ఇప్పుడు సాహిత్యం నన్ను వెంటాడుతోంది.  నాకు స్ఫూర్తిదాతలైన మా తాతగారు, అమ్మానాన్నలు, ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
బిరుదులు
1. ”సాహిత్య శ్రీ” – అఖిల భారతీయ భాషా సమ్మేళన్‌ భోపాల్‌ వారిచే
2. ”ప్రజ్ఞాశ్రీ” – శ్రీ కిరణ్‌ సాంస్కృతిక సంస్థ వారిచే
పురస్కారాలు
1. ”మదర్‌ థెరిసా” – షి ఫౌండేషన్‌ వారిచే
2. ”స్త్రీ శక్తి” – కళా నిలయం వారిచే
3. ”కళా పురస్కారం” – జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ వారిచే
4. ”ఉత్తమ మాతృమూర్తి పురస్కారం” – సుధా ఆర్ట్స్‌ వారిచే
5. ”సాహితీ పురస్కారం” – తంగిరాల ఫౌండేషన్‌ వారిచే
6. ”ఉత్తమ రచయిత్రి” – విశ్వసాహితీ వారిచే
7. ”ఉత్తమ కవయిత్రి” – రావూరి కాంతమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ వారిచే
8. ”ఉగాది పురస్కారం” & ”సంక్రాంతి పురస్కారం” – వైష్ణవి ఆర్ట్స్‌ వారిచే
9. ‘దసరా’ పురస్కారం – చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే
10. టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక పురస్కారం – పద్మసాహిత్య పరిషత్‌ వారిచే
11. సప్తపదిలో తోడు నీడ పురస్కారం – జి.వి.ఆర్‌. ఆరాధన వారిచే
12. దామోదరం సంజీవయ్య స్మారక పురస్కారం – సాంఘిక సంక్షేమ శాఖ, ఆం.ప్ర. వారిచే
13. పట్టాభి మెమోరియల్‌ పురస్కారం – పట్టాభి కళాపీఠం వారిచే