ప్రతి వాక్యం ప్రతిఘటనే!

mouli

 

“…for a brave and kindly-natured comrade is as dear to a man as his own brother.” (Odyssey, Book IX, 585-86).

1

మౌళీ నాకు ఫోన్ చేసి ‘ నా కవితాసంపుటి ‘ ఆకు కదలని చోట ‘ ఈ 21 న ఆవిష్కరణ వుంది. దాని మీద నీ అభిప్రాయం రాస్తే బాగుంటుంది” అన్నాడు. మొదట్లో నేను తటపటాయించాను. నేనెప్పుడు తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని అంత క్షుణ్ణంగా అనుసరించలేదు. ” నా కంటే  బాగా రాసే వాళ్ళు, అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు ” కదా అన్నట్టు అన్నాను. ” లేదు. నువ్వే రాస్తే బాగుంటుందని…” అన్నాడు మౌళి. నేను అభ్యంతరంగానే ఒప్పుకున్నాను- మౌళీ కవిత్వానికి నేను న్యాయం చేయలేనేమోనన్న భయంతో!

ఫోను ముగించగానే పుస్తకం పేరు మరొకసారి గుర్తు తెచ్చుకున్నాను. ‘ఆకు కదలని చోట ‘ – వెంటనే ఫిలిప్పైన్ కమ్యునిస్టు పార్టీ స్థాపించిన విప్లవకారుడు, కవి హోస్ మారియా సిసోన్ రాసిన ‘గెరిల్లా యోధుడు కూడా ఓ కవే ‘ అన్న కవితలోని మొదటి వాక్యాలు గుర్తొచ్చాయి.

“ఆకు కదలికకు,

చితికిన రెమ్మకు,

నది అలజడికి,

నిప్పు వాసనకు,

వెనుదిరిగినపుడు రాలే బూడిదకూ

ప్రతీ అలికిడికీ అప్రమత్తం అయ్యే

గెరిల్లా యోధుడుకూడా ఓ కవే”

ఇక్కడ సిసోన్ ఒక విషయం చెప్పకనే చెప్పాడు – సున్నితత్వం (sensitivity) లో గెరిల్లా యోధునికీ, కవికీ తేడా లేదని.

చేగువేరా తన పిల్లలకు రాసిన వీడుకోలు లేఖలో విప్లవకారుడి సున్నితత్వం గురించి “ప్రపంచం నలుమూలలలో ఎక్కడ అన్యాయం జరిగినా అంతరాంతరాల్లో నుండి ప్రతిస్పందించగలగాలి” అని రాస్తాడు. బహుశా అలాంటి సున్నితత్వం వలనే మౌళీ బస్తర్ నుండి సిరియా వరకూ, తెలంగాణా ఉద్యమం నుండి టర్కీ శరణార్థుల వరకు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆ పరిస్థితిలో తనను తాను మమేకం చేసుకొని  (identify)  సంఘీభావం (solidarity) తెలుపుతూ కవితలు రాసాడు.

2

మౌళికి నటించటం రాదు. తానేం చూస్తాడో అదే రాస్తాడు. తన చుట్టూ పరిసరాలను, మారుతున్న ప్రపంచాన్నీ, దోపిడీని, అణిచివేతనీ, ప్రకృతిని, రాజుకుంటున్న విప్లవాన్ని- నిజాయితీగా ‘witness’ చేస్తాడు.  ఇలాంటి కవిత్వాన్ని అమెరికన్ కవియిత్రి, మానవహక్కుల ఉద్యమకారిణీ అయిన కెరోలిన్ ఫోర్ష్ ‘Poetry of Witness’ అంటుంది. ఈ రకమైన కవిత్వన్నే రాసే Yannis Ritsos అనే గ్రీకు మహాకవి, మౌళీ కి ఇష్టమైన కవి కావటంలో ఆశ్చర్యం లేదు. Ritsos ఎంత ప్రమాదకరమైన కవి అంటే అతని కవిత్వ జ్వాలకు ఎదురుగా నిలబడలేక 1936 లో గ్రీకు దేశపు ఫాసిస్టు ప్రభుత్వం అతని కవిత్వాన్ని కాల్చి దగ్ధం చేసింది. Ritsos ని  మౌళీని ఇద్దరినీ కలిపే ఓ మౌలిక స్వభావం- నిజాయితీ. తమ అక్షరాల పట్ల నిజాయితీ. తమ జీవితాలలో నిజాయితీ. తమ ఉద్యమాలకూ, భావజాలలకూ నిజాయితీ. తమ చుట్టూ ప్రపంచంతో నిజాయితీ.

ఈ నిజాయితీనే మౌళీ కవిత్వానికి అస్తిత్వం, ప్రాణం.

ఓ నైరూప్య వినియోగదారుడికోసం నిజాన్ని కూడా  న్యూస్ అన్న పేరుతో కమోడిటీ చేసి కృత్రిమంగా మార్కెట్లో అమ్ముతున్న తరుణంలో మౌళీ రాస్తున్నటువంటి కవిత్వం, సాహిత్యం ఓ ప్రత్యామ్నాయ చరిత్రనే  సృష్టించగలదు.

3

స్పానిష్ మహా కవి నెరుడా తన నోబెల్ ప్రసంగంలో కవి గురించీ ఇలా అంటాడు.

“ప్రజలందరిలాగ తాను కూడా ఉత్పత్తి సంబంధాల్లో పాల్గొంటూ, మిగిలిన మనుషుల పట్ల వారి పనుల పట్ల సున్నితత్వంతో వ్యవహరిస్తూ, రోజువారి సామాన్య జీవితపోరాటాలలో పాలుపంచుకుంటూ, చెమటలు కక్కుతూ ఆహారాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా మానవత్వం సమూహంగా కనే ఓ మహోన్నత కలలో తాను కూడా భాగస్వామయినప్పుడు.. ఆ కవి కవిత్వం చారిత్రాత్మకమవుతుంది”

మౌళీ కూడా అలాంటి కవే. ప్రజలలో, పోరాటాలలో మమేకమైన కవి. కవిత్వం సామాన్య ప్రజలకోసమని అనుకునే కవి. అందుకే తాను పాఠాలు చెప్పే తరగతిలోని విద్యార్థులకు కవిత్వం కూడా చెప్తూ, కవిత్వం చదవటాన్ని, రాయటాన్ని  ప్రోత్సహిస్తూ, వారు రాసిన కవిత్వాన్ని పత్రికలకు పంపిస్తూ ఉంటాడు.

ఎందుకంటే మౌళి దృష్టిలో కవిత్వం ప్రజాస్వామికమైనది.

4

మౌళీ కవిత్వంలో మరొక ముఖ్యమైన అంశం జ్ఞాపకం. ఓ వ్యక్తి వ్యవస్థను  ఎదిరించి నిలబడటం లాంటిదే జ్ఞాపకం మరుపును నిలువరించటం కూడా అంటాడు జెకొస్లెవేకియన్ రచయిత మిలన్ కుందేరా.

ప్రపంచం మనిషి ఇచ్ఛతో సంబంధం లేకుండా, నిర్విరామంగా మారుతున్న సమయం ఇది. ఇలాంటి పరిస్థితులలో జ్ఞాపకానికి ఓ విప్లవాత్మకమైన బాధ్యత ఉంటుంది.

మౌళీ కవిత్వం రాయటం ద్వారా జ్ఞాపకాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుంటాడు. జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాల తాలుకు జ్ఞాపకం, తను పుట్టిపెరిగిన పల్లెటూరు, అక్కడ చుట్టూ మారుతున్న పరిస్థితుల తాలుకు జ్ఞాపకం రెంటినీ తన కవిత్వం ద్వారా ఒక చోటికి తెచ్చి shortcircuit చేస్తూ ఆ జ్ఞాపకంతో పాఠకున్ని shock కి గురిచేస్తాడు.

5

ఎప్పుడూ ఏకాంతాన్నీ, ఏకాంతంలోని రసాన్ని పెంచి పోషించే mainstream సాహిత్యం నుండి వేరుపడతాడు మౌళి.

మౌళి కవిత్వం ఏకంతాన్ని ప్రతిఘటిస్తుంది. పెట్టుబడీదారివ్యవస్థ ప్రజలందరినీ తమతమ ఏకాంతాలలో బంధించి individualisation అనే పేరుతో  సమాజాన్ని విడగొట్టి ఉద్యమాలను విచ్చిన్నం చేస్తున్న తరుణంలో మౌళీ కవిత్వం deindividualise అవ్వమని, గుంపులు గుంపులుగా రోడ్డుపైకొచ్చి ప్రశ్నల వర్షం కురిపించమని పిలుపునిస్తుంది.

మరి మౌళీకి ఏకాంతం లేదా?

ఉండకనేం!

ఏ కవికైనా తన అంతరాంతరాల్లో కూరుకుపోయిన భావోద్వేగాలు, భావాలు, తన జ్ఞానం, తన అస్తిత్వం అన్ని కలగలిసిన  ఏకాంతంలో నుండే కవిత పుట్టుకొస్తుంది. కానీ ఎప్పుడైతే సమాజంలోని చలనాలను, మార్పులను, దోపిడీని, అణచివేతనూ ప్రత్యక్షంగా ఎదుర్కుంటాడో అప్పుడు కవి ఏకాంతం కూడా political అవుతుంది.

సమాజంలోని మార్పులతో, అదృశ్య అణచివేతలతో ,  కుల వర్గ దోపిడీలతో ఎంతో మమేకమవ్వటం చేతనే మౌళీ ఏకాంతం కూడా ఓ political రూపం దాల్చింది అనుకుంటాను. తన ఏకాంతానికి కూడా proletariate అస్థిత్వం సంతరించింది. అందుకే మౌళీ ఏకాంతం ఆధిపత్య బూర్జువా భావజాలాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.

6

శివారెడ్డి గారు 1990 లో ‘అజేయం’ అనే కవితా సంకలనంలో ‘కవులేంజేస్తారు!’ అనే కవితలో ఇలా అంటారు-

“కవులేం జేస్తారు

ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

తెల్ల కాయితానికి అనంతశక్తినిస్తారు

కవులేం జేస్తారు

చేతుల్లో కింత మట్టి తీసుకొని శపిస్తారు

మణికట్టు దాకా నరికినా

మొండిచేతుల్తో గోడల మీద పద్యాలు రాస్తారు,

..

కవులేం జేస్తారు

చట్టాన్ని ధిక్కరిస్తారు,

ఎడారి మీద పద్యాలు రాస్తారు

ఎడారి క్రమక్రమంగా

సజీవ దేశంగా రూపొందుతుంది

కవులేం జేస్తారు

గోడలకు నోరిస్తారు

చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

ప్రజల చేతుల్లో

అనంతశక్తి సంపన్నమయిన పద్యాన్ని పెడతారు.”

తెలుగులో ఈ మధ్య రాస్తున్న మిగిలిన కవుల గురించి నాకు తెలియదు కాని- మౌళీ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కవే!

*

mouli1

జ్ఞాపకం మరచిపోయే దారి చెప్పవూ?!

1975 లో ఫ్రాన్స్ కి వలస వెళ్లిన సలా అల్ హందాని, తిరిగి తన ఇంటికి వెళ్ళటానికి ముప్పది సంవత్సరాలు పట్టింది. ఈ కాలంలో తన మాతృభూమి అయిన బాగ్ధాద్ ని తలుస్తూ ఎన్నో కవితలు రాస్తూ, ఆశగా ఎదురుచూసాడు.
 
తనుపుట్టిన తేది ఎవరికీ తెలియకపోయినా, స్టేట్ రెజిస్టర్స్ లో మాత్రం 1951 లో పుట్టాడు అని రాయబడి ఉన్నది. అత్యంత బీద కుటుంబంలో పుట్టిన హందాని స్కూల్ కి వెళ్ళవలసిన వయసులో తన తండ్రితో  కలసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెరిగాడు. తన పదహేడవ ఏట సైన్యంలో చేరి నాలుగు సంవత్సరాలు కఠిన శిక్ష  పొందిన హందాని, ఆ కాలంలో కమ్యునిస్టు స్వభావాలున్న కొంతమంది యువకులతో స్నేహం చేయటం ద్వారా, అప్పటి బాత్ జాతీయ పార్టీ కి ఎదురు తిరగగలిగాడు. అందుకుగాను హందాని ని ఖైదు చేసిన ప్రభుత్వం రెందు సంవత్సరాలకు పైగా ఆయన్ను చెరసాలల్లో బంధించింది. ఈ సమయంలో హందానీ పునర్జన్మ పొందాడు అనే చెప్పాలి. తనతోటి ఖైదీలు ఎక్కువగా రాజకీయ మేధావులు కావటం హందానికి కలిసొచ్చింది. ఇక్కడ హందాని రాయటం, చదవటం, చెస్ ఆడటం, రాజకీయంగా ఆలోచించటం నేర్చుకున్నాడు.
విడుదలైన హందానిపై పాలకుల నుండి బెదిరింపులు, దాడులు కొనసాగాయి. చేసేదిలేక ఊరికి బయట, వేశ్యలూ దొంగలు నివసించే ఓ వాడలో హందానీ తలదాచుకున్నాడు. ఈ సమయంలో బాగ్ధాద్ కఫె లకి వచ్చే ఎందరో కవులతో మేధావులతో హందానికి స్నేహం ఏర్పడింది.  ఒక సారి జరిగిన దాడిలో ప్రాణాపాయ స్థితిని తప్పించుకున్నాడు. దానితో మేధావులూ, కవులు అందరూ డబ్బులు వేసుకొని హందానిని ఒప్పించి, ఫ్రాన్స్ కి పంపించేసారు.
 ఫ్రాన్స్ లో ఒక మార్క్సిస్టు స్నేహితుడి సాయంతో థియేటర్ లో చేరిన హందాని ఆ తరువాత ఎన్నో సినిమాల్లో, సీరియల్లలో, నాటకాలలో నటుడిగా జీవితం కొనసాగించాడు.   వామపక్ష భావజాలం గల హందాని పై దాడులు అక్కడితో ఆగిపోలేదు. 2003, అమెరికా – ఇరాక్ యుద్దం జరుగుతున్న సమయంలో వీధిలో ఓ సభ కు హాజరయిన హందాని పై కొంతమంది యువకులు దాడి చేసారు. ఈ దారి తర్వాత హందాని మరొక్క సారి చావు నుండి బయటపడ్డాడు. 20 కి పైబడి కవిత్వ పుస్తకాలు, ఎన్నొ కథలూ రాసిన హందాని, ఇప్పటికీ ఫ్రాన్స్ నగరంలో జీవిస్తున్నాడు.

విన్యాసం  

 

నువ్వొక చెట్టు నుండో
అకస్మిక వాన నుండో
పేరుకుపోయిన మంచు నుండో
రాలేదు.
నువ్వొక రాత్రి లోంచో
బండరాయి లోంచో
ఇసుక లోంచో
పుట్టలేదు.
నువ్వు నా అజాగ్రత్త వల్లనో
చీలిన భూమి వల్లనో
బయటపడలేదు.
నువ్వు పిచుక నుండో
తాటి చెట్టు మొండంలోంచో
రాలేదు.
దిగంతాలనుండి వస్తున్న ఈ ప్రతిధ్వని నుండి
కాగితం పై కదలకుండా నిలుచున్నా గాలి నుండి
నా తలపై ఉన్న దారితప్పిన మేఘం నుండి
నువ్వు పుట్టావు.
పరాయి లోకాల ఇతిహాసానివైన నువ్వు
ఇసుక గడియారం నుండి
వర్షపు రంగు నుండి పుట్టావు.
ఇవన్నీ నావీ, నీవీ
ముత్తాతలవీ, ప్రాచీనులవీ
కావు
ఈ భూప్రపంచానికి సంబంధించినవి.
~~~~~~~~~~

ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై రోజులు

 

మునిగిపోతున్న వానికి చేయినిచ్చి రక్షించినట్టు,
ఒకొక్కటిగా ఋతువులు విడుదలవుతున్నట్టు,
ఇక్కడి పేర్లను నేను చెప్తాను.
నీకు నేను చెప్పేవుంటాను
ఒకటి ప్రారంభమవుతుందంటే
మరొకటి అంతమవుతున్నట్టు అని.
యవ్వనపు గంధాలను మోస్తూ
ఓ దుమ్ము పట్టిన గాలి అటువైపుగా వీచినప్పుడు,
నా అనిశ్చితిలోని నేను, ఆ ఉత్సవంతో
యాంత్రికంగా ఆ రోజులోకి కొట్టుకుపోతాను.
నీకు దగ్గరిగా నేను వచ్చి
వెలివేయబడిన వాళ్ళు  రాయలేని పద్యాలను
నీకు ఇవ్వాలని అనుకుంటాను.
బాగ్ధాద్ లో వేకువ నాలో కల్లోలాన్ని
సృష్టిస్తుంది.
తల్లీ,
పగలు రాకను ఎవరూ గుర్తించనవసరం లేదు
కొంచం నిశ్శబ్దం  ఉంటే చాలు.
వలస వెళ్ళిన  కొడుకు కుడా
తన జనని కొమ్మ పై కూర్చోటానికి
ఎవరి అనుమతీ అక్కరలేదు.
కాని ఇంక నేను సెలవు తీసుకోవాలి
పలాయనమైన వాడు ఆశ్రయం కోసం
వచ్చినట్టు వచ్చాను అంతే.
ఓ చిరునవ్వు కోసం
ఓ బ్రెడ్డు ముక్క కోసం
మంచం పై ఓ మూల కోసం
ఇంకిపోతున్న కనుచీకటి కోసం.
~~~~~

ప్రశంస

 

బాగ్ధాద్ నగరం కోసం-
ఓ బాగ్ధాద్ నగరమా! నేను నీ శరణుకై వచ్చాను- నీ సహనాన్ని పోగుచేసుకో, కన్నీళ్ళని కూడబెట్టుకో, నీ భయాన్ని పక్కన పెట్టి, బాధని పెకిలించి, నీ నవ్వుల్ని నా కొసం కొంచం దాచి ఉంచుకో. ఇదిగో, నీకు తెలుసు కద, ఇలా చిన్న పిల్లానిలా కలలు కనటంలో నేను ఘనుడను. అంతెరుగకుండా ఈ ప్రవాస జీవితం నా ఒకొక్క అడుగునూ తరుముతోంది. ఇంకెప్పుడు నేను నీకు సంపూర్ణ స్వేచ్ఛని అందించగలను?
కొన్ని కొన్ని సార్లు నువ్వు నీ సమాధిలో కూర్చొని ఉంటావ్. నోటినిండా మట్టితో, ఒంటరిగా. అప్పుడు నాకు అగుపించే నోస్టాల్జియా లో నువ్వు స్వర్గం గానూ భువి గాను కనిపిస్తావ్. ఏకాంతంగా నీ విధికి ఎదురుగా కూర్చొని నువ్వు, అంధకారంతో నీ తల నువ్వే గోక్కుంటుంటే, నేను మాత్రం నీ కోసం వెన్నెలను సైతం తిరస్కరించి ఉంటాను.
ఆయినా, నీ శరీరం పైకి చీమలను ఒదిలిన వాళ్ళ దృష్టిలో, నేను నీ పక్క నిల్చున్న ప్రశ్నార్థకమే కదా?
ఓ బాగ్ధాద్ నగరమా! ఆ గతించిన రోజులలో నువ్వు నా గృహానికి తరచూ వస్తుండేదానివి. నేనూ నీ పతనమైన ఇళ్ళనూ, ప్రేగులు లేని కార్లనూ, పగిలిన మొహాలనూ, చూడటానికి నీ వీధుల్లో తిరగాడే వాడని.
కాని యుద్దం జరుగుతున్న సమయంలో నీ మాంసాన్ని ఎప్పుడైతే నేను వీడినానో, అప్పుడే నిన్ను నేను కోల్పోయాను.
అలా గడిచిన రోజులన్నీ ఇప్పుడు, దిగంతాల వైపు చూసిన చూపు మాయమైనట్టు కనుమరుగవుతాయి. ఇలాంటి ఉత్సవమైన దుస్సహమైన స్థితిలో  నువ్వు గోడలకు ప్రశ్నలు వేస్తావు.
నా నుండి ఏ సందేశం నీకు లేక పోయినా, తల్లి లా భూమీ ఆకాశాల నడుమ నన్ను నువ్వు ఊయల ఊపిన రోజులను గుర్తుతెచ్చుకుంతావు. ఆ రోజుల్లో మనం ఎంతో ఆనందంగా నవ్వే వాళ్ళం.
కిటికీ దగ్గర నేను నిల్చున్నాను, ఈ సాయంత్రం సముద్ర వాసన కలిగి ఉంది. ఇప్పుడు అనిపిస్తోంది, అప్పట్లో మనం కలిసి కలగన్న దారి నుండి చాలా దూరం వచ్చేశాను. ఇప్పటికీ ఇరాక్ అక్కడే ఉంది.
సంధ్యా సమయం లేని ఆ దేశం, శ్రేయస్సు నెరుగని ఆ దేశం, ప్రేమికులకు వీధులు లేని ఆ దేశం. ఆ దేశం లో మనుషుల్నీ, పువ్వులని, నదులనీ, వెన్నెలనీ చావు వెంటాడుతుంది.
ఇరాక్ దేశమా, ఇప్పటికైనా విను, ఈ మాటలను నా గొంతుకనుండి విడిపించుకొని మట్లాడవలసి వస్తోంది. టైగ్రిస్ ఇంకా యూఫ్రటిస్ నదులు ఒకవేల నాతోపాటు ఓ రాత్రి గడపటానికి వచ్చినట్టు అయితే- నేను వాటికి నా శూన్యాన్ని మాత్రమే     ఇవ్వగలను.~~~
నిజం
ఎవరికీ తెలియదు
జ్ఞాపకం మరచిపోవటానికి
వెళ్ళాల్సిన  దారి.
(Transations into English: Sonia Alland)
-రోహిత్
rohit