లోతు తక్కువ.. వైశాల్యం ఎక్కువ!

 

“మాళవిక” నవలా రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారితో వారి ప్రియ మిత్రులు, సాహితీవేత్త, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు ‘ఛాయ’ సంస్థ కోసం జరిపిన సంభాషణల రెండవ, చివరి భాగం.

 సాహిత్య దర్శనం అంటే ఏమిటి? సాహిత్యానుభవం రచయితలకు కొరవడినదని నేను అనుకుంటున్నాను.

జ: ‘దర్శనం’ అంటే శాస్త్ర పరి భాషలో ‘నిశితమైన చూపు’ అని అర్ధం.  ఒక తాత్విక ప్రతిపాదన గాని, కళా సాహిత్య ప్రతిపాదనగాని – స్వతంత్ర బుద్ధితో – ఏ రంగమ్ముందుకైనా తీసుకురావడం ‘దర్శనం’ ప్రాధమిక ధర్మం.  సాహిత్య విషయకమైన నిర్వచనాలూ, కొందరు విశిస్ట రచయితల గురించి సమర్ధులైన  విమర్శకులు చేసిన విశ్లేషణలు స్థూలంగా ‘సాహిత్య దర్శనం’ గా చెప్పుకోవచ్చు.  ప్రతి దర్శనం, చర్చకు అవకాశం ఇచ్చేదే – ఇక – సాహిత్యానుభవం సంగతి. ఇది కవిత్వ విషయంలో ఒక అంతరువులోనూ, వచన ప్రక్రియల విషయంలో మరొక అంతరువులోనూ ఉండే అవకాశం ఉంది.  కవిత్వ పాఠకుడుకి instant గా intuitive గా కవిత్వానుభవం కలిగే అవకాశం ఉంటుంది.   వచన ప్రక్రియల విషయంలో సమాజం, వ్యక్తుల స్వభావాలు, బాహ్య ఆంతరిక పరిస్థితులు, వంటి యితర విషయాల ప్రమేయం కూడా అవసరం అవుతాయి. సూటిగా చెప్పాలంటే కవిత్వానుభవం చాలా సబ్జెక్టివ్.  వచన ప్రక్రియ ఆస్వాదన అనండి, అర్ధం కావటం అనండి,  చాలా భాగం ఆబ్జెక్టివ్ – అదలా ఉంచండి – తెలుగు రచయితలకు సాహిత్యానుభవం లేక పోవడానికి ప్రధాన కారణం అధ్యయన లోపం.  రచయిత ఎప్పుడూ చదువుతూ ఉండాలి.  కేవలం జీవితాన్ని జల్లెడ పట్టేశాను అనుకుంటే చాలదు.  సాహిత్యం ఒక క్రాఫ్ట్.    చూడాలి.  చూసింది బలంగా చెప్పగలగాలి.  ఇది కేవలం అధ్యయనం వల్ల మాత్రమే సాధ్యం.

  1. మనకి లిటరరీ ఇంటిగ్రటి పలచబడిపోతున్నదని నా అభిప్రాయము. మీకెలా అనిపిస్తుంది?

జ: లిటరరీ ఇంటిగ్రటి అనేది వ్యక్తి  స్వభావాన్ని చెపుతుంది.  ప్రాణం పోయినా సరే, ఆ వ్యక్తి తన భావ ప్రకటనా స్వేచ్ఛ, అందు మూలంగా అబ్బిన స్వతంత్ర వ్యక్తిత్వం వదులు కోడు.  చలం, విశ్వనాథ, శ్రీపాద, కుటుంబ రావు, అజంతా, రా.వి.శాస్త్రి, త్రిపుర వంటి వాళ్ళు నాకు వెంటనే గుర్తుకొస్తున్నారు.   అది ప్రాధమిక  అవసరం.  ముసిలోణ్ణయి పోయానని మీరు అనుకోరని నాకు తెల్సు.  సుమారు పదేళ్ళుగా ఇది సరిగా లేదని – మీతో ఏకీభవిస్తున్నాను.

  1. మీ రచనల మీద మీకు సంతృప్తి ఉందా?

జ: నేను నా రచనలలో రకరకాల ప్రక్రియలు వాడ గలిగా ననుకుంటున్నాను.  అయితే నేను ఏ ఒక్క సిద్ధాంతానికో, మత  ధార్మిక అంశాలకో చెందిన వాణ్ని కాను.  నాకు జీవన లాలస ఎక్కువ.  గోదావరిలో పడవ నడుపుకునే వాళ్ళ మొదలు రకరకాల స్థాయి లో మనుషులు నాకు పరిచయం.  మన తెలుగు వాళ్ళ అహంకారాలు, భేషజాలు, టెక్కులు, వెటకారాలు, లౌఖ్యాలు, దొంగ ప్రేమలు, సదాచారాలు, వ్యభిచారాలు చాలా వరకు నా అనుభవాల ద్వారా సుపరిచితాలు.  నేచర్, ఋతువుల పరిణామం – తెల్సి జీవించటం చాలా ఇష్టం.  ఎరమరికలు లేకుండా ప్రపంచ సాహిత్యం చదవడం నాకు ఇష్టం.  దరిద్రం ఎరుగుదును గనుక డబ్బున్న వాడిగా ఉండడం ఇష్టం.  చాలా వరకు నా రచనలకు నా జీవితానుభవాలు, బలమైన ఇష్టానిష్టాలే  మూలం.  సాహిత్య వ్యాసంగంలో మొగమాటాలు, అబద్ధాలు, జీవన వక్రీకరణలు నాకు సమ్మతం కావు.  అపరిచిత విషయాల్ని ఊహించి వ్రాయలేదని చెప్పగలను.  ఈ మాత్రపు నిజాయితీ నా కున్నదని చెప్పగలను.  తృప్తికి అంతం ఎక్కడా?

  1. అసలు ఆధునిక కళ అనేదే సకృత్తుగా ఉన్నప్పుడు మనకి ‘ఆధునికోత్తర దశ ‘ ఏమిటని ఒక అభిప్రాయం ఉంది . మీరేమంటారు?

జ: అసలు ‘ఆధునికత’ అనే మాటే వివాద గ్రస్తం.  సమకాలీన మైనదంతా ఆధునిక కాజాలదు.  ఆధునికత అనే భావన వ్యక్తి నిష్ఠమా? గుంపు నిష్ఠమా? కళా సాహిత్య విషయాలలో ఆధునికత అనే భావన పూర్తిగా వ్యక్తి నిష్ఠమని నా నమ్మిక.  ‘ఆధునికోత్తర’ అనే పద బంధం గాని, దాని భావ విస్తృతి గాని నా కేమీ తెలియవు.  నేనెప్పుడూ దృష్టి పెట్టలేదు.

  1. ఆదివాసుల గాథలు, పంచతంత్రం, మిత్ర భేదం, మిత్ర లాభం వంటివి చదివితే రచయితలు బాగు పడతారనిపిస్తుంది నాకు. ఆ కథల నిర్మాణం, వాటిలో ప్రతీకలు అత్యంత ఆధునీకంగా ఉంటాయి కదా? దక్షిణ అమెరికన్ రచయితలు ఇదే చేశారు. అవునా?

జ: మీరు పేర్కొన్న జాపితాకి మరి రెండు కలుపుతాను.  బౌధ్ధ జాతక కథలు, హంస వింశతి.  ముఖ్యంగా హంస వింశతిలో ఎంత జీవితం, ఎన్ని స్వభావాలు, చెప్పాడో కదా!  మళ్ళీ అదే మాట!  మన రచయితలకు అధ్యయన గుణం లేదు.  వేతన శర్మ కథ, సృష్టిలో, పిపీలికం వంటి కథల్ని రా.వి.శాస్త్రి వ్రాసాడన్నా, ‘బకాసుర’ వంటి కథ, దిబ్బ కథలు వంటివి కుటుంబ రావు వ్రాసారన్నా, – వాళ్ళ కథన చాతురికి వాళ్ళ అధ్యయనం ఎంతగా ఉపయోగ పడిందో బోధ పడుతుంది.  స్థానాపతి రుక్మిణమ్మ ‘దెయ్యాలు’ అని కథా సంకలనం కూర్చింది.  పల్లెటూళ్లలో చెప్పుకునే కథలు.  ఎంత బావుంటాయో.  కథలో, కథలో కథ గా కథలు అల్లే పద్ధతిని భారతీయులకు నేర్పింది పైశాచి ప్రాకృతంలో ఉన్న బృహత్ కథే.  కాశీ మజిలీ కథలకు ఈ విధానమే ప్రేరణ.  ముళ్ళపూడి గారి ‘రాజకీయ బేతాళ పంచ వింశతి’ ఈ పద్ధతి పుత్రికే – ఒకటే కర్తవ్యమండీ, సాహిత్య ప్రేమికులు ఎల్లలు లేని అధ్యయన వేత్తలు కావాలి.

  1. మీరు కథలు బాగా రాస్తారు. విరివిగా కథలు రాయాలని అనిపిస్తోందా? కొంతమంది రచయితలు సృజనాత్మకమైన సంతృప్తి కోసం ఒక దానికంటే ఎక్కువ సాహిత్య ప్రక్రియల్నిఆశ్రయిస్తూ ఉంటారు. సరదా కోసం వారు.  ప్రతిభ వల్ల మీరు?

జ: నా కేరీర్ తొలి రోజుల్లో – అంటే 1962-1967 నడుమ – ఎక్కువగా కథలే వ్రాసాను.  వ్యాసాలు కూడా.  ఒక సారి నేను వ్రాసిన ‘తెరలు’ అనే కథ ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చింది.  మా నాన్నగారు దానిని చదివి (1964 లో) నన్ను వెటకారం చేశారు.  “రమణీమణుల్ని దింపకుండా కథ వ్రాయ రాదా? లేవా? “ అని.  ఆ మూడో నాల్గో కథలు వ్రాసానేమో!  – (1967) – ఆ తర్వాత పూర్తిగా మానేశాను.  ఎంతదాకా? –  2000 సంవత్సరం అనుకుంటాను.  “ఏమైందంటే…” అనే కథను ‘రచన’ సాయిగారు ప్రచురించే పర్యంతం.  అప్పుడు నుంచి మళ్ళీ – కొంచమే – కథలు వ్రాయడం ప్రారంభించాను.  కథా  రచనని  చా.సో. గారు ‘A lyric in prose’ అన్నారు.  నాకా ప్రక్రియ చాలా ఇష్టం.  ఇంకో సంగతి చెప్పనా?  నేను ఇంగ్లీష్ లో ఆస్కార్ వైల్డ్, గోర్కీ, కాఫ్కా, చెహోవ్, ఓ హెన్రీ, మపాసా వంటి రచయితల కథలు చదివి కవిత్వం వైపు మళ్లిన వాడిని.  నా ఊదేశ్యంలో రచయిత అయినవాడికి అన్ని ప్రక్రియలు కరతలామలకంగా ఉండాలి.  ఏ పరికరం అవసరమో గుర్తెరిగి ఆ వృత్తంతో అనుసంధించ గలగాలి.  ‘కలిపి కొట్టరా కావేటి రంగా ‘ అన్న సామెతగా సర్వం కవిత్వం పేరిట ఊరదొక్క కూడదు.  నేను చేసిన వృత్తుల కారణంగా వివిధ ప్రక్రియలలో రచనలు చేయవలసిన అవసరం నా కేర్పడింది.   నాకా ప్రక్రియలు లొంగడానికి కారకులు – గాయకులు, నర్తకులు, నాటక ప్రయోక్తలు – యక్ష గాన కళాకారులు – నేనెరిగిన మూడు తరాల రచయితలూను.  సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం నాకు చాలా ఇష్టమైన  అంశం.

  1. గత పాతిక సంవత్సరాలలో వచ్చిన కవిత్వం గురించి మీ అభిప్రాయం, కంప్లైంట్లు? పేర్లు, ధోరణులు అవసరం లేదు.

జ: గత పాతికేళ్ళంటే: సుమారు 1985 నుంచి అనుకుందాం. అంటే ఫెమినిస్ట్ లు, దళిత కవులు, ప్రముఖంగా రచనలు చేయడం నడుస్తున్న కాలం – నిష్కర్షగా చెప్పాలంటే:

_ most of the complaints were accusative.  భౌతికం, సామాజిక ప్రశ్నలు, ఫిర్యాదులు, సాధారణమయ్యాయి.

_ ఊహాశాలిత, లాలిత్యం, సున్నితత్వం స్థానే వెటకారం, ఎత్తిపొడుపు, తాత్త్వి కంగా బాకీ తీర్చుకునే ధోరణీ,  నాకు కంపించాయి.  లోతు తక్కువ.  వైశాల్యం ఎక్కువ, and frequently offensive.

  1. ఒక జీవత్ భాషగా తెలుగు ప్రమాదంలో పడిందనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు?

జ: ప్రమాదంలో పడిందంటే:  మన మధ్య తరగతి, ఉన్న తరగతి మహాను భావులే పడేశారు.  బహుశ ఏ యితర భాషల వాళ్ళకీ లేని భాషా దారిద్రయం మన వాళ్ళ నొసటనే పొడిచింది.  నేనెరిగినంతలో నలభై యేళ్ళ క్రితం ఈ విధ్వంసనాలు ఏ తెలుగు జాతి మహానుభావులు చేశారో వారే ఇవాళ పంచలు, కండువాలు ధరించి తెలుగు భాషోధ్ధారణ ప్రసంగాలు చేస్తున్నారు.  నాకు తెలియని, బోధపడని అంశం;  భాషా విషయం ఎవరికి వారు అనుసరించదగిన అంశం.  వీరంతా ఎదుటివారికి ఉపదేశిస్తారేమిటీ?  జరగాల్సిన చోట నిశ్శబ్దంగా, నిస్సంశయంగా, ధృఢంగా ఆచరణ జరగాలి.  అది లేదు.  జీవద్భాష అన్న తర్వాత అది అంతరిస్తుందనటం సరికాదు.  అంతా బూతులతో  సహా సుఖంగా తెలుగు భాష మాట్లాడుకుంటున్నారు.  భాషకేమీ ఢోకా లేదు.  Convent generation percentage చాలా స్వల్పం.  జరుగుతున్న హంగు, నాటకం అంతా నీడలను చూసి భయపడటమంతే!

  1. తెలుగు వాళ్ళకి అతి సున్నితమైన కవిత్వం, వచనం, ఇతర లలిత కళల పట్ల ఆసక్తి లేదేమో అనిపిస్తూ ఉంటుంది ప్రశ్న. ఏదైనా కొంచం ఎక్కువ మోతాదులో ఉండాలి. నిజమేనా?

జ: పూర్వం మనం కాలేజీలలో చదువుకునే రోజుల్లో ఇద్దరు ముగ్గురు లెక్చరర్లో – హై స్కూళ్ళలో తెలుగు పండితులో – కళాసాహిత్యాల పట్ల కొందరినైనా యువ విధ్యార్ధుల్ని ఇన్స్పైర్  చేసేవారుండేవారు.  నాటకాలు, పాటలు, ఆటలు, సందడి బాగా ఉండేది.  బోధకులు, విద్యార్ధులు కూడా ఇవాళ తీరిక లేని వాళ్ళు అవుతున్నారు.  తల్లిదండ్రులు కూడా పిల్లల అభిరుచుల మీద కంటే కెరీర్ మీదనే ఎక్కువ వత్తిడి పెంచుతున్నారు.  కవులూ, కళాకారుల ఆవశ్యం పెరగాలి.  నాకు పెరగగలరనే ఆశ ఉంది.

  1. నిజమైన intellectual రచయితలు తెలుగులో అతి తక్కువ మంది ఉన్నారని అభియోగం విన్నాను. అంటే అనేక విషయాల పట్ల ఆసక్తి, వాటి గురించి ఆలోచించడం, కనీసం ఇతర లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళన్న మాట. ఇది అంతరిస్తున్న జాతి అంటున్నారు.

జ: మళ్ళీ నాది పాత పాట:  అధ్యయనం, పరిశోధనా శక్తి లేక పోవటమే కారణం.   చరిత్ర, సామాజిక అంశాలు, కళలు, సాహిత్యం పట్ల గాఢమైన, ఏకీకృతమైన దీక్ష intellectual flair అనిపించుకుంటుంది.  ఒక జాతిగా అటువంటి వైవిధ్యం గల ‘యావ’ మన వాళ్ళలో లేకపోవడం మన దురదృష్టం.

  1. మంచి సినిమా, సంగీతం, నాటకం వంటి వాటి మీద తెలుగు వాళ్ళకి కక్ష వంటిది ఉందంటారా? మరి పొరుగు రాష్ట్రాలలో ఈ పరిస్థితి కనిపించదు గదా?

జ: దీనికి కారణాలు చాలా లోతైనవి.  ప్రాధమికంగా మన తెలుగు జాతికి కెరీర్, డబ్బు సంపాదన, ఏదో రకంగా జీవితంలో సక్సెస్ మీద ఉన్న యావ, కళలు, సాహిత్యం మీద లేవుగాక లేవు.  మతం, సాహిత్యం, రాజకీయాలు అన్నీ నాసిరకంగా పరిణమించినట్టే కళలు, సాహిత్యం కూడా నాసిరకంగా పరిణమించాయి.  సినిమా, సంగీతం పరిస్థితి అంతే.  ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దు.  మీడియోక్రిటీ అనేది మన జాతి జీవనంలో మెజారిటీ జనానికి లైఫ్ లైన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం.  తెలుగు తనపు నాసి తనాన్ని యేళ్ళ తరబడి వదుల్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.

  1. మీరెన్నో సంవత్సరాలు అధ్యయనం చేస్తూ వచ్చిన ఉపనిషత్తులకు వివరణ వంటిది రాశారు గదా, పూర్తి అయిందా?

జ: ఉపనిషత్తుల అనువాదం త్వరలో పుస్తకరూపంలో వస్తోంది.  అవి 11.  పూర్వ తాత్త్వికులు  ఆచార్య త్రయం వారి వ్యాఖ్యలు, వివాదాలలోకి వెళ్లకుండా – ఉపనిషత్తుల తాత్త్విక చింతన, ఆసక్తి గల చదువరులకు వ్యావహారిక సరళ వచనంలో అనువదించి ప్రతి సూక్తం చూపడం, కొద్దిగా అవసరమైన పరిభాషల్ని వివరించడం నా ప్రధమ సంకల్పం.   ఉభయ వేదాంత పండితులు, నా మిత్రులు, శ్రీమాన్ సముద్రాల రంగ రామానుజాచార్య ముందు మాటతో ముద్రణ జరుగుతోంది.

  1. మీ అనుభవాలు, జ్ఞాపకాలు ఎప్పుడు విడుదల చేస్తారు? పుస్తకం రాస్తున్నప్పుడు తాటస్త్యమ్ సాధ్య పడింది? అసాధారణ ప్రజాదరణ లభిస్తుందనుకుంటున్నాను.

జ: ‘నేను ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరిట ఆత్మకథ వ్రాయడానికి కారణం:  గత యాభై యేళ్లలో నేనెరిగిన సాహిత్య జీవితం రికార్డు చేయాలని.  మా పూర్వుల కథ కొంత, మా నాన్నగారి అనుభవాలు, ఆశా భంగాలు, రచనా వ్యాసంగ విశేషాలు కొంత, నా తరంలో నేను ప్రత్యక్షంగా పత్రికా రచయితగా, రేడియో కార్యక్రమ ప్రయోక్తగా, రచయితగా పొందిన అనుభవ పరంపర కొంత – కలిపి ఈ రచన చేస్తున్నాను.  1968 నుంచి 2016 వరకు నేను వ్రాసిపెట్టుకున్న డైరీలు, నేనెరిగిన మూడు తరాల రచయితలతో సన్నిహిత పరిచయాలు, ఈ రచనకు ప్రేరణ.  త్వరలో పూర్తి చేస్తాను.

  1. తెలుగు కథా రచయితలు ఫోరంని ఎక్కువ డిస్టర్బ్ చేయ లేదని అభియోగం ఉంది. మీరేమంటారు?

జ: నేనెరిగినంతలో – ఆచంట సాంఖ్యాయనశర్మ  గారి దగ్గర 1909 నాటి నుంచి ప్రారంభించి చూస్తే – ఒక కథాంశం, లేదా ఘటన నుంచి చెప్పిన కథలే ఎక్కువ.  కథా రచనలలో సాంప్రదాయితంగా నడిచే ఈ ఫ్రేం ని ఆధునిక కథా రచయితలలో  డిష్టర్బ్ చేసిన రచయితలు నలుగురు.  పద్మరాజు, బుచ్చిబాబు, రా.వి.శాస్త్రి, త్రిపుర.  వీరి కథలలో కేవలం కథనం మాత్రమేకాక, పైకి కనపడని తాత్త్విక ప్రశ్నలు, ప్రతి పాదనలు ఉంటాయి.  దాని ద్వారా కథకు గల విశేష శక్తి బహిర్గతమైనదనే  నా విశ్వాసం.

  1. బాల సాహిత్య రచయిత, మేధావి కాడనీ, వ్యాస రచన ఉత్తమ సాహిత్య స్థాయికి చెందదని ఒక అభిప్రాయం ఉంది. నాటకాన్ని సాహిత్యంగా అంగీకరించడం లేదు – ‘కన్యాశుల్కం’ తప్ప. వ్యాసం అంటే ఏదో ఇన్ఫర్మేటివ్ గా తప్ప దానిని సాహిత్య ప్రక్రియ గా మనం గౌరవించం  అనుకుంటాను. 

జ: మీరంతదాకా వెళ్లారు నయం.  అసలు పద్య కావ్యం వ్రాయని వాడు రచయిత ఏమిటీ? అనే ప్రబుద్ధులు మన జాతిలో ఉన్నారు.  సైజు, బరువే క్రైటీరియా.  బాల సాహిత్యం అనే ఊహే మన వాళ్ళకి అర్ధం అయిందనుకోను.  బాల గేయాలంటూ ప్రౌఢులు పాటలు వ్రాయడంతో సరిపెట్టారు.  పిల్లలకు అద్భుతాలు, fairy tales, బొమ్మలతో చెబితే చాలా ఇష్టం.  ఆ పని రష్యా రచయితలు, ఇంగ్లీష్ రచయితలు గొప్పగా చేశారు.  మళ్ళీ మళ్ళీ భారత కథలు, రామాయణ కథలు, పంచ తంత్రం, జాతక కథలు, చెప్పినవే చెప్పడమే తప్ప – లేదా ఉపదేశాలు కుక్కడం తప్ప, ఆహ్లాద కరమైన, కంటికింపైన, బాలల కథా సాహిత్యం తెలుగులో కొత్త ఆలోచనలతో, పాత్రల కల్పనతో జరగలేదనే నా అభిప్రాయం.

ఇక – వ్యాస రచనలో పరిశోధన, విశ్లేషణ, ప్రతిపాదన – ఈ త్రయి నెరవేర్చడానికి ఎంతో సహనం, సహృదయత, విస్తారమైన పఠనానుభవం కావాలి.  ఇంతా చేసి ఇదంతా పత్తి పని.  Thankless job అని మన వాళ్ళలో చాలా మందికి గల ధృఢభిప్రాయం.  ఉంటే పొగడ్త. లేకపోతే తెగడ్త.  శాస్త్రీయత ఎక్కడ ఉందీ? మన తెలుగులో సాహిత్య విమర్శ చాలా భాగం కవులకు, రచయితలకు ఉపాహారం.  Main course  కాలేదనుకుంటాను.

నాటక రచన విషయానికి వస్తే – తొలి రోజుల్లో పురాణం సూరి శాస్త్రిగారొక్కరు నాటక రచనల్ని, నటుల సమర్ధతని, నిష్కర్షగా అంచనా వేసిన వారిగా కనిపిస్తున్నారు.  అదీగాక, పరిషత్తు నాటకాల హవా తెలుగు నాటకాన్ని, ఒక మూస లోకి తోసేసిందని నాకు ఏర్పడిన ధృఢభిప్రాయం.  తెలుగులో చాలా మంది వచనం వ్రాయగల మంచి రచయితలు నాటకం వైపు రాలేదు.  చదువుకున్నా, ప్రదర్శన చూసినా, సరిసమానంగా మనకు ఆదరణ కలిగించ గల నాటకాలు – కన్యాశుల్కం తో సహా – చాలా తక్కువ.  నేను చాలా ప్రదర్శనలు చూసి –  41 తెలుగు నాటకాలు సమీక్షిస్తూ ‘అలనాటి నాటకాలు’ అనే పుస్తకం వ్రాసి – అనుభవంతో చెపుతున్నాను.

హాస్యాన్ని కూడా ప్రత్యేక సాహిత్యాంసంగా మన వాళ్ళు గుర్తించ లేదు.  ఆహ్లాదకరమైన హాస్య నాటకాలకు పరిషత్తుల్లో బహుమతులిచ్చిన దాఖలాలు నాకు కనపడలేదు.  ఎమెట్యూర్ ధియేటర్ లో కృషి చేసిన చాలా మంది ప్రయోక్తలు, రచయితలూ కూడా main stream సాహిత్యవేత్తలుగా కృషి చేసిన వారు కారు. నవలల్ని “సీరియల్ నవల” పేరిట ఒక ప్రక్రియగా చేసినట్టే నాటకాన్ని కూడా “పరిషత్తు నాటకం” పేరిట మూసలో పోశారని నా అభియోగం.  రచయిత ఒక ఉద్దేశ్యంతో నిర్వహించదలచిన నాటకాన్ని కొందరు ప్రముఖ నటులు తమ రంగస్థల అవసరాల కోసం మార్చేసి, కుదేలు పరచిన (సాహిత్య పరంగా) నాటకాలుగా పద్మరాజుగారి ‘రక్త కన్నీరు’, కాళ్ళ కూరి వారి ‘చింతామణి’ చెప్పుకుంటే చాలు.  సాహిత్య గౌరవం, తాహతు ఏమి మిగిల్చారు?

31. ఇన్నేళ్ళ సాహిత్య జీవితం, రచన, గొప్ప వాళ్ళతో స్నేహ పరిచయాలు – ఇప్పుడు మీకేవనిపిస్తోంది?

జ: విజయవాడ, విశాఖపట్నం, మద్రాసు, తెనాలి, బందరు, కాకినాడ, రాజమండ్రీలలో నేనెరిగిన సాహిత్య సభలు, ఎందరో సాహిత్య బంధువులు, ఆత్మీయ మిత్రులు, ఇప్పుడు గతించిపోయారు.  నేనెరిగిన ప్రముఖ రచయితలు నా కంటే వయస్సులో, అనుభవంలో, రచనా సామర్ధ్యంలో అధికులు.  వాళ్ళు ఏనాడూ రచయిత మిత్రులుగా వయస్సు అంతరాన్ని పాటించే వారు కారు.  సమాన స్కంధులుగానే స్నేహం నేర్పే వారు.  నా జీవితంలో విజయవాడ, మద్రాసు అలాంటి గొప్ప స్నేహాల్ని ఇచ్చాయి.  రేడియో, పత్రికలు ఎంత వైబ్రంట్ గానో ఉండేవి కదా! – ‘కహా గయే ఓ దిన్’, అని అనుకుంటూ ఉంటాను.  వారందరూ ఎక్కడికి వెళ్ళి పోయారు? అని జ్ఞాపకాలు బాధిస్తాయి.  వాళ్ళంతా వివిధ సంధర్భాలలో నాకు అర్ధ శతాబ్ధిగా వ్రాసిన సుమారు 200 ల ఉత్తరాలు భద్రంగా దాచాను.  వాళ్ళ దస్తూరీలోంచి వాళ్ళు  నన్ను పలకరిస్తూనే ఉంటారు. కొత్త మిత్రులు యిటీవల చాలా మంది కలిశారు.

The show goes on forever – అజంతా అంటూ ఉండేవారు: “మన వెనక నుంచి పలకరించి వెళ్ళి పోయినట్లుగానే మనం అలా పొగలాగ వెళ్లిపోవాలి” అని – నిజం కదా!

నన్ను గురించి నే ననుకునేది ఒకటే – నేను కోరుకున్న చదువు చదివాను.  ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.  మనసుకు నచ్చిన ఉద్యోగాలు చేశాను.  నిజాయితీగా నేను దగ్గరగా ఎరిగినవీ, నా అనుభవాలుగా ఎదురైన సుఖదుఖాలు, ఉద్రిక్తతలు, బెంగలూ, సంయోగవియోగాల గురించీ వ్రాశాను.

ఇంతకంటే ఏం కావాలీ?

 

కావ్య వ్యామోహం వచనానికి శాపం!

కాళిదాస మహా కవి ‘మాళవికాగ్నిమిత్రం’ ఆధారంగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నవల, ‘మాళవిక’ ఆవిష్కరణ సంద ర్భంగా వారి ఆప్త మిత్రులు, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు “ఛాయ” సంస్థ కోసం ప్రత్యేకంగా జరిపిన సంభాషణలని రెండు భాగాలుగా మీ కందిస్తున్నాం.

 

  1. మీరు విశ్వనాథ నుంచి ఈ నాటి వరకు అర్థ శతాబ్ది తెలుగు సాహిత్య పరిణామాన్ని చూశారు. కవిత్వంలో, వచనంలో ఈ కాలంలో మీరు అనుకునే మూడు ముఖ్యమైన మార్పులు ఏమిటి?

జ: వెంటనే గుర్తుకు వచ్చేవి :

ఒకటి : గ్రాంధిక భాషా  పధ్ధతి నుంచి రచయితలు క్రమంగా శక్తిమంత మైన వ్యావహారిక వచనం వైపు ప్రయాణించడం. ఇందుకు యిద్దరు వచన శైలీ నిర్మాతల్ని ఉదహరిస్తాను. ఒకరు – చలం. రెండోవారు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.

రెండు: కవిత్వంలో పద్య పాదాల సంఖ్య భావాన్ని బట్టి పెంచటం, తగ్గించటం.

మూడు: మహా కావ్య రచనా వ్యామోహం వెనకబట్టి – ఖండ కావ్య ప్రక్రియ, గేయ రచనా గౌరవం పెరగడం!

  1. భావకవులు అనేక మంది అనేక భాషా పండితులు. వారంతా స్వాతంత్రోద్యమంలో, హరిజనోధ్యమంతో పాటు బ్రహ్మ సామాజికులు కూడా అయి, తద్వారా సమకాలీన సామాజిక జీవితంతో, పరివర్తనతో సంబంధం ఉన్నవారు. వారి అధ్యయన విస్తృతి, సామాజిక ధృక్పధం వారి కవిత్వంలో కనిపించదంటే ఏమంటారు మీరు?

జ: నా ఉద్దేశ్యం – మీరు మొదటి తరం ఆధునిక రచయితలను గురించి ప్రస్తావించారు.  స్వాతంత్రోద్యమం, బ్రహ్మ సమాజ ఉద్యమం, మానవోద్యమం, కాల్పనికోద్యమం, సంస్కరణోద్యమం కూడా కల్పండి.  సాహిత్య పరులలో అప్పట్లో ఏ కొడాలి ఆంజనేయులు, శివశంకర శాస్త్రి వంటి బహు కొద్ది మంది నేరుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉండవచ్చు.  కానీ, అలనాటి తొలి తరం కవులు చాలా మందికి ఉద్యమ దృష్టి కంటే కాల్పనిక ఆవేశమే ప్రధానంగా ఉన్నట్లు తోస్తుంది.  ఆంధ్రోద్యమ కవిత్వం చెప్పినా, ప్రణయ కవిత్వం చెప్పినా, అలనాటి మహా నాయకుల్ని కీర్తిస్తూ రాసినా – దాదాపు అందరూ కవిత్వ “కల్పన”, స్మృతి పూర్వక చారిత్రక అభినందనల దగ్గరే ఆగిపోయారు.  కార్య కర్తల గా ఉద్యమాలలో కవిత్వం పేరిట గీతాలు, పద్యాలు రాసిన వారు కవులు కాలేక పోయారు.  కేవలం ఉద్యమ ఆవేశం వెళ్లబోసిన వారు అయ్యారు.  ఈ తేడాను మీరు విశ్వనాధ, రాయప్రోలు వంటి వారి ఉద్యమ కవిత్వాన్ని, గరిమెళ్ళ సత్యనారాయణ, గురజాడ రాఘవ శర్మ వంటి వారి కవిత్వాన్ని పోల్చి చూస్తే బాగా గ్రహించగలరు.  ఇది హృదయ ధర్మాలలో తేడా – వారి అధ్యయనం వేరు, కాల్పనిక సామర్ధ్యం వేరు.

3.మన ఆధ్యాత్మిక సాంప్రదాయం, రవీంద్రుడి మిస్టిసిసమ్ ప్రభావంతో భావకవులు తలమునకలయినారా? వారంతా శాంతినికేతనాన్ని తిరుపతిగా భావించారు కదా?

జ: మన ఆధ్యాత్మిక సాంప్రదాయమంటే : దాని మూలం ఉపనిషత్తులు.  బ్రహ్మ సామాజికులకు ప్రామాణికత వాటి మీదనే.  రవీంద్రుడు బ్రహ్మ సామాజికుడే కదా! అయితే నా కర్ధమైనంతలో రాయప్రోలు, అబ్బూరి,మల్లవరపు విశ్వేశ్వర రావు మాత్రమే నేరుగా శాంతినికేతనం నుంచి వచ్చిన వారు. వేంకట పార్వతీశ కవులు, కృష్ణ శాస్త్రి, చలం వంటి వాళ్ళు రవీంద్రుడి సాహిత్య మార్గాన్ని (అంటే కాల్పనిక వైభవాన్ని) మోహించిన వాళ్ళు.  అందువల్ల నేరుగా మన ఆధ్యాత్మిక సంప్రదాయం నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కారు.  రవీంద్రుడు సూఫీ సంప్రదాయం, కొంత బెంగాలీ స్థానికత నుంచి తెచ్చిన జానపద వాసన గల కాల్పనికత, దైవానికి సంబంధించిన ‘నైరూప్య ’ భావన, కలిపితొరిపిన టాగోరియన్ కాల్పనిక రీతి నుంచి ప్రేరణ పొందిన వారు మన భావ కవులు.

4. భావకవుల్ని ఉతికారేసిన ‘నేటి కాలపు కవిత్వం’ అనార్ద్ర విమర్శ!

జ: ‘నేటి కాలపు కవిత్వం’ అంటూ అక్కిరాజు ఉమాకాంతం గారు చేసిన విమర్శ మొత్తం ‘పూర్వ పక్ష సిద్ధాంత’ ప్రతిపాదన పధ్ధతిలో చేసిన కరుకైన పండిత విమర్శ.  ఆయన ప్రధానంగా ఆక్షేపించిన విషయాలు రెండు. ఒకటి : కవిత్వం పేరిట అస్పష్టత. రెండవది : పాండిత్య లోపం. ఇంకా చెప్పాలంటే అది కృష్ణ శాస్త్రి గారి కాల్పనిక ధోరణి మీద విమర్శ. నిజమే – అనార్ధ్ర విమర్సే.  ఆయన విమర్సే నిజమై ఉంటే, కాల్పనిక సౌకుమార్యాన్ని కొత్త పద బంధాలతో తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన కృష్ణ శాస్త్రి బతికి బట్ట కట్ట కూడదు. అలా జరగ లేదే! నానాటికీ ఆయన కాల్పనిక వైభవం కవిత్వాభిమానుల్ని సమ్మోహ పరిచింది.

5. విశ్వనాధ క్రియేటివిటీకి క్లాసికల్ పరిమితులున్నాయని పిస్తుంది. ‘కల్పవృక్షం’ అట్లా ఉంచి, ఆయన ఖండ కావ్యాలలో ఆ లక్షణాలున్నాయా? భావకవుల ‘ఆధునీకత’ ఆయన కవిత్వంలో ఉన్నదా? వస్తువు కాదు, అభివ్యక్తి విషయంలో?

జ: తప్పకుండా.  విశ్వనాధ వ్యక్తిత్వంలో కవిగా క్లాసిసిసమ్, కాల్పనికత రెండూ కలగలిసిపోయిన స్రోతస్సులు. భావ కవుల ఆధునీకత ఆయన “గిరి కుమారుని ప్రేమ గీతాల”లోనూ, “కిన్నెరసాని” గీతాలలోనూ ప్రముఖంగా కనిపిస్తుంది.  ఆయన లోని క్లాసిసిసమ్ వైభవం ‘శృంగార వీధి’ పద్య ఖండికలలోనూ, తెలుగు ఋతువుల పద్యాలలోనూ- కడకు రామాయణ కల్ప వృక్షం కొన్ని ఘట్టాలలోనూ అద్భుతంగా కనిపిస్తుంది.  మరీ తొలి నాటి కవితల సంపుటి “భ్రష్టయోగి” చూడండి.  కాల్పనిక కవిగా ఆయన మనస్సు ఎంత లలిత సుందరమో తప్పక తెలుస్తుంది.

6. విశ్వనాధ వాడుక భాష తుఫాన్నుంచి ఎట్లా తప్పించు కున్నాడు?

జ: విశ్వనాధ   వాడుక భాష తుఫాన్నుంచి తప్పించుకోలేదు.  ఆయన గ్రాంధికంగా రాసిన దంతా, గ్రాంధికపు ముసుగులో దాగిన ఆయన సొంత వ్యావహారికమే!  (బలమైన పానుగంటి వారి గ్రాంధికమూ ఇంతే) క్రియా పదాలు, పదాంతాలు గ్రాంధికపు తొడుగు తొడుక్కున్నా, భాష హృదయం మాత్రం వ్యావహారికపు కాకువు తోడిదే.  అందుకే జీవవంతంగా ఉంటుంది.  విశ్వనాధ, తెలుగు వచన రచయితలలో అరుదైన శైలీ నిర్మాత.

  1. శ్రీశ్రీ లౌక్యుడు. నారాయణబాబు అంత కాదు. లౌక్యం లేకపోవడం వలనా, లేదా నారాయణబాబుని కమ్యూనిష్ట్ల పల్లకీ ఎక్కించక పోవటం వలనా? ఎందువలన ఆయనకి గుర్తింపు లేదు? ఆయన కవిత్వంలో గొప్ప’ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ఉంది కదా.

: శ్రీశ్రీకీ  , నారాయణ బాబుకీ  పోలికబెట్టటం సరికాదు.  శ్రీశ్రీ లో ఉన్న రూప స్పష్టత, భావ స్పష్టత నారాయణ బాబులో లేవు.  క్లుప్తత గుణమే; కాదనం -. అయితే అది నారాయణ బాబులో అస్పష్టతకు కొంత వరకు హేతువైంది.  శ్రీశ్రీ లో ఉండే భాషా  నైశిత్యం సాటిలేనిది.  అంతటి స్థితి నారాయణ బాబుకి లేదు.  ‘రుధిర జ్యోతి’ సంపుటి చదవండి. భావ సైధిల్యం జాస్తి, ఆయన ఆవేశపరుడు. ఆ ఆవేశంలో ఏదో కన్ఫ్యూసన్ ఉంది.  నా వరకు చాలా తక్కువ కవితలు మనసును తాకాయి.  శ్రీశ్రీ కవిత్వ పాండిత్యం ఘాఢమైనది.  నారాయణ బాబుకి అంత లేదు.  కమ్యూనిష్ట్ లు శ్రీశ్రీ ని పల్లకీ ఎక్కించటానికి కారణం వాళ్ళ చారిత్రక అవసరం.  శ్రీశ్రీ లౌక్యం కాదు.

  1. భావ కవిత్వానికి పీహెచ్ డీలు, పొగడ్తలు, తిట్లు మినహా సరైన విమర్శ లేదనిపిస్తుంది.

జ: భావ కవిత్వం మీద సరైన విమర్శ లేక పోవడానికి కారణాలున్నాయి.  కృష్ణ శాస్త్రి ప్రణయ కవిత్వం పుణ్యమాని అటు సంప్రదాయ కవి పండితుల నుంచి, ఇటు ఆధునిక సామ్యవాద నైష్ఠికుల నుంచి మొట్టి కాయలు, తిట్లు, వెటకారాలు పుష్కలంగా దక్కాయి.  మీరు నన్ను తిట్టకపోతే  ఒక మాట చెపుతా.  మన తెలుగు వాళ్ళకి తొందరగా  ఎక్కువ భావుకత్వ ప్రధానమైన కవిత్వం అర్ధం కాదు.  తెలిసినా, తెలియక పోయినా ఆధ్యాత్మిక చాపల్యం ఎక్కువ.  వాస్తవికత పేరిట వార్తా కధనాలు తొందరగా మనసు కెక్కుతాయి.  అదీ బలహీనత.  కవిత్వ మూలాలూ, ప్రేరణల పట్ల హృదయ ధర్మ లోపం ఉంటే, విశ్లేషణ కి, విమర్శకి తావేదీ?  నేనెరిగినంతలో డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి  గారు ఎంచదగిన విమర్శ చేశారు.  చాలా తక్కువే అయినా, విశ్వనాధ, శ్రీశ్రీ చాలా మంచి వ్యాసాలు రాశారు.  ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అనే పుస్తకం రాసిన నిశిత విమర్శకులు, వెల్చేరు నారాయణ రావుగారు భావ కవిత్వం గురించి చేసిన విమర్శ నా ఉద్దేశ్యం పాక్షికమైనదనే.

  1. పూర్వపు తెలుగు కవులు తెలుగుని చంపి సంస్కృతాన్ని బతికించారా, లేదా తెలుగుని, కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారా?

జ: పూర్వ కవులు తెలుగుని చంపి, సంస్కృతాన్ని బతికించారని, తెలుగు కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారని, – ఆరోపించే రెండభిప్రాయాలూ తప్పే. ఆ రెండు భాషల స్వభావాలు, ఆయా సాహిత్య స్వభావాలూ తెలియని వాళ్ళనే మాట.

ఎందుకో చెపుతాను.  చారిత్రకంగా ఒక స్వభావంగా తెలుగు భాష మీద సంస్కృత ప్రభావం ఎక్కువ.  దక్షిణాది భాషలలో మళయాళం మీద కూడా ఎక్కువ.  అదలా ఉంచండి. వ్యాకరణం, ఛందస్సు, అలంకారం అనేవి సాహిత్య శాస్త్రం, సాధకుడికి ఉద్దేశించిన రచనా పరికరాలు మాత్రమే.  ప్రాచీన కవులలో  ప్రముఖులెవరూ వీటిని అర్ధ రహితంగా వాడ లేదు.  పద్య రచనలో గొప్ప శిల్ప నిర్మాణానికే వాడారు.  తెలుగు కవిత్వం తమాషా ఏమిటంటే నూరింట తొంభై మంది సంప్రదాయ కవులు వాళ్ళంతట వాళ్ళు ప్రేరణ కలిగి కావ్యాలు రాసిన వాళ్ళు కారు.  కృతి భర్తగారిని వెతుక్కుని, వారి ఇష్టం మేరకు, వారి అభిరుచులకు కిత కితలు పెట్టడానికి రాసినవే.  సభల్లో పండితుల మెప్పు కోసమో, తమ పాండిత్య ప్రగల్భాలు చాటడం ధ్యేయంగా రాసినావీ ఉన్నాయి.  వెయ్యేళ్ళ సంప్రదాయ పద్య కావ్యాలలో కసరత్తులతో ముగిసిపోయినవి  మనకు ప్రమాణాలు కానక్కరలేదు.  మీరు పేర్కొన్న రెండు ఫిర్యాదులూ నిజమైన  సంప్రదాయ సత్కవుల్ని బాధించవు.

  1. ఎకరాల కొద్దీ కావ్య విమర్శ, వ్యాఖ్యానాలు రాశారు కదా, త్యాగరాజ కీర్తనలకు ఆ స్థాయిలో విమర్శ, వ్యాఖ్యానం ఉన్నాయా?

జ: త్యాగరాజ స్వామి కీర్తనలను గురించి కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి వివరణాత్మక వ్యాఖ్య  చాలా ప్రసిద్ధం.  క్షేత్రయ్య పద సాహిత్యం గురించి విస్సా అప్పారావు గారి వివరణలూ, సారంగపాణి పద  వైశిష్ట్యం గురించి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు, అన్నమయ్య పద సాహిత్యం గురించి వేటూరి ఆనంద మూర్తి, ముట్నూరి సంగమేశం ప్రబృతులు ఎన్న దగిన విమర్శలు ప్రచురించారు.  ప్రముఖ సంగీత విద్వాంసులు త్యాగరాజ కీర్తన సర్వస్వం పేరిట ఎంచదగిన విశ్లేషణలు చేశారు.

  1. అవధాన కవులలో శిఖరాయమానులైన తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటి? ఎండు గడ్డిలాంటి అవధాన పద్యాలు కాక, వారి సారస్వత సేవల ప్రత్యేకత?

జ: అవధానాలనేవి సాహిత్య ప్రదర్శనలు.  శ్రోతలకు వినోదం, ఉత్కంఠ కలిగించటం ప్రధాన్నోద్దేశ్యం.  తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటంటే వారికి పూర్వం అరుదుగా మిగిలిన ప్రక్రియని వారు రాజుల దివాణాలలోకి, సభా ప్రాంగణాలలోకి తెచ్చి – అసాధారణమైన ధారణా శక్తి, పద్య రచనా ధార కలిగిన వారు కావడంచేత రకరకాల ప్రాపంచిక, నిత్య కృత్యాలు ఇతి వృత్తాలుగా ఆశువుగా పద్యాలు చెప్పి – వేల కొద్దీ శ్రోతల్ని ఆశ్చర్య చకితుల్ని చేశారు.  సాధారణంగా అవధాన పద్యాలలో చమత్కారాలు, ఛాలెంజ్ లే ఉంటాయి.  మెజారిటీ శ్రోతల్ని మెప్పించటమే ధ్యేయం.  తిరుపతి వేంకట కవులకు అవధానాల పరిమితులు బాగా తెల్సు.  వాటిని వాడుకుంటూ – మరో పక్క సమర్ధమైన కావ్య, నాటక రచనలూ చేశారు.  కావ్యాలలో బుద్ధ చరిత్ర ప్రశస్తం.  పాణి గ్రహీత, శ్రవణానందం, సరదా సరదా చిన్న కావ్యాలు.  ‘శతావధాన సారం’, ‘నానా రాజ సందర్శనం’ సంపుటాలలో వారి పద్య రచనా ధార, పాండిత్యం, ఝటితి స్పూర్తి పుష్కలంగా కనిపిస్తాయి.  చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి ‘కథలు – గాధలు’ వ్యాస సంపుటాలు ఒక విధంగా ఆంధ్ర దేశపు సంస్కృతి, సాహిత్య, సభ్యతలకు నిధులని నా యెరుక.

  1. వివాదాస్పదమైన వ్యక్తిగత జీవితం వల్లనా, ఆయన సాహిత్యం వల్లనా చలం ఎందుకు గొప్ప వాడయ్యాడంటారు?

జ: మొట్ట మొదట గ్రహించ వలసిన సత్యం: చలానికి సాహిత్యం, జీవితం వేర్వరు కాదు.  ఈ విషయం ఆయన వ్రాసుకున్న ఆత్మకథ (చలం) చదివితే తెలుస్తుంది.  చలం సామాజిక పరిశీలన, అధ్యయనం వంటి గంభీరమైన మాటలతో పుట్టిన రచయిత కాడు. ఇంట్యూటివ్ రైటర్. మైదానం, దైవమిచ్చిన భార్య, అరుణ, జీవితాదర్శం, బ్రాహ్మణీకం, వివాహం – అనే ఆరు నవలలు – మ్యూజింగ్సు, ప్రేమ లేఖలు, స్త్రీ, బిడ్డల శిక్షణ, ఆనందం, విషాదం – ఆరు వ్యాసాలంటారో, ఆత్మ ఘోషలంటారో ఆ పుస్తకాలు చలం ఆలోచనా సర్వస్వాలు.  ఆయన ఆలోచనా విధానమే ఆ కాలంలో ఆయన్ని విలక్షణ వ్యక్తిగా, రచయితగా నిలబెట్టింది.

  1. అసలు తెలుగు వాళ్ళకి సాహిత్యం, ఇతర లలిత కళల విషయంలో మీడియోక్రిటి అంటే ఎందుకంత ఇష్టం?

జ: మీడియోక్రిటి అంటే ఇష్టం కాదు;  అది స్వభావం.  చెరువు ఒడ్డున కూర్చుని, చిల్ల పెంకు ముక్కని నీటి మీదకు విసిరితే అది లోతుకి మునగకుండా, తేలుకుంటూ పరిగెడుతుంది.  మీడియోక్రిటి ఆ బాపతుది.  ప్రతీ జాతికి ఒక స్వభావం ఉంటుంది.  వల్గారిటీని హాస్యంగా భావించటం, పోర్నో తరహా స్త్రీపురుషుల కదలికల్ని శృంగారంగా భావించటం, సంగీతంలో శాస్త్రీయమైన మెలకువల్ని, మెలోడీని గ్రహించలేక పోవడం, చిత్ర లేఖనం, శిల్పం, నృత్యం వంటి కళల పట్ల బొత్తిగా దృష్టి లేక పోవడం, తెలియని విషయాల పట్ల తెల్సినట్లు మాట్లాడడం, నిత్యం పాక్టీసు చేసేస్తే ఏదైనా సాధించగలమనే అజ్ఞానపు టెక్కు, ప్రతీ విషయం మీద జడ్జిమెంట్ ఇచ్చే ఉత్సాహం – ఈ లక్షణాలు మీడియోకృటీ పునాదులు.  ఇదే తెలుగు వాళ్ళలో మెజారిటీ మనుషుల జీవ లక్షణం.

  1. ఆధునిక తెలుగు సాహిత్యానికి సరియైన విమర్శ లేదనిపిస్తోంది. వామ పక్ష విమర్శ చాలా పాక్షికమైంది. మీరు ఒప్పుకుంటారా?

జ: వెల్చేరు నారాయణ రావు గారి ఫిర్యాదు ఇదే.  ప్రాచీన సాహిత్యం విషయంలో సాంకేతికంగా విమర్శకు పనికి వచ్చే సాధనాల మీద ఆలంకారీకులు గొప్ప చర్చను లేపారు.  ఈ చర్చలు సుమారుగా శతాబ్దాల పాటు వివిధ మేధావులు సవిస్తారంగా నడిపారు.  అన్ని ప్రక్రియలతో సహా ఆధునిక సాహిత్యం అవతరించి గట్టిగా నూటయాభై యేళ్ళు కాలేదు.  ముఖ్యంగా వచన సాహిత్యం విషయంలో చాలా మంది తమ ఇష్టానిష్టాల ప్రాతిపదిక మీద మాట్లాడారు కాని, objective literary perspective కనపడదు.  మార్క్సిష్టు లకి (ప్రాచీన ఆలంకారీకులకు లాగే) కొన్ని కొలతలున్నాయి.  ఆ కొలతలకు ఆగక పోతే, తిరస్కరిస్తారు.   ప్రాచీన భారతీయాలంకారీకులూ ఇదే పని చేశారు.  శాస్త్రం, నియమాలు యేర్పరచి, క్రియేటివిటీకి గల విస్తారావకాశాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ వచ్చారు.  అది వ్యాకరణం కావచ్చు, ఛందస్సు కావచ్చు, అలంకారం కావచ్చు, తాత్విక ధృక్పధం కావచ్చు.  ప్రామాణికత్వం నిర్ణయించే వారికి గొప్ప హృదయ ధర్మం ఉండడం అరుదు.  సారాంశం : తెలుగులో ప్రామాణికమైన ఆధునిక విమర్శ చాలా విరళం అయిపోవడానికి కారణం గాఢమైన అధ్యయన లోపం.

  1. పూర్వపు తెలుగు కవులు వస్తువు కోసం సంస్కృత సాహిత్యాన్ని ఆశ్రయించారు – వారంతా గొప్ప సంస్కృత పండితులు. మరి సంస్కృతంలో ఉన్న వచన సాహిత్యం గాని, భాసుడి వంటి నాటక రచయితలు గాని వారికి ప్రేరణ కాలేదు. ప్రభంధాలు రచించినట్టుగా వచనం, నాటకం జోలికి పోలేదు.  కారణం ఏమయి ఉంటుంది?  అసలు సంస్కృత సాహిత్యం లోని సృజనాత్మక వైవిధ్యం ప్రభంధ కవుల్ని ఎందుకు ఆకర్షించ లేదు?

జ: దీని గురించి మా నాన్నగారు, హనుమఛ్ఛాస్త్రి గారు ఒక కారణం చెపుతూ ఉండేవారు.  ముఖ్యంగా నాటకాల విషయం: సంస్కృత నాటకాలలో కచ్చితంగా పాత్రోచిత భాషను పాటించారు.  నాటక కథలో వచ్చే వివిధ పాత్రలలో ఏ తరహా పాత్రకి సంస్కృతం వాడాలి? ప్రాకృతం వాడాలి? అనే నియమాలున్నాయి.  భరతుడు పదిహేడు రకాల ప్రాకృతాల్ని నిర్దేశించాడు.  తెలుగులో సంస్కృత నాటకాల అనువాదాల జోలికి పోతే పండిత కవులకి వ్యావహారిక భాష మింగుడు పడలేదు.  వాళ్ళకి ఆ విషయం ఇష్టం లేదు.  గ్రామ్యం అని లోకువ.   అందుకేంచేసారూ? నాటక కథని తీసుకుని పద్య కావ్యాలు రాయడానికే ఇష్ట పడ్డారు.  చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి , వడ్డాది సుబ్బారాయ కవి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వీరేశలింగం వంటి వాళ్ళు అనువాదాలు చేసినా, సొంతంగా రాసినా (పానుగంటి వారితో సహా) గ్రాంధికంలోనే చేశారు.  సంస్కృతంలో శ్లోకాల మాదిరే తెలుగు నాటకాలు, సంస్కృత నాటకాల పంపిణీ మీదనే నడిపించారు.  ఒక్క వేదం వేంకటరాయ శాస్త్రి గారు మాత్రం (గురజాడకు ముందు) తమ ప్రతాప రుద్రీయం నాటకంలో ప్రశస్తమైన పాత్రోచిత భాషగా – తొలిసారి – వ్యావహారిక భాష వాడారు.  వచన రచనలుగా సంస్కృతంలో ప్రసిద్ధమైన దశ కుమార చరిత్ర, విక్రమాంక దేవ చరిత్ర, హర్ష చరిత్ర, కాదంబరి, కృష్ణ చరిత్ర వంటి వాటిని అనువదించినప్పుడు సైతం సరళ గ్రాంధికాన్నే అనుసరించారు.  అన్నిటికంటే ముఖ్యం….ప్రాచీన కాలం నుంచీ కూడా సమకాలీన జన జీవితం సాహిత్య సృజనకు పనికి వస్తుందనే స్పృహే తెలుగు రచయితలకు లేదు.  సంస్కృత రచయితలు ఈ విషయంలో చాలా మెరుగు.  ప్రహసనాలు, భాణ సాహిత్యంలో నాటి సామాజిక విషయాల్ని దుమ్ము దులిపారు.  మన వాళ్ళు “కావ్య రచన ఘనమైందనే” వ్యామోహంలో ఇరుక్కుని ఉండి పోవడం వల్ల తెలుగులో శక్తి వంతమైన వచన సాహిత్యం వృద్ధి కాలేదు.

                                                                           …… to be continued

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అభ్యుదయ కవుల్లో భిన్న స్వరం!

alvidaa

-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

~

 

indraganti 1970ల దశాబ్దిని “కల్లోల దశాబ్ది” అనే వారు. అలనాటి మిత్రులు కౌముది గారు అప్పుడే పరిచయం.

కచ్చితంగా చెప్పాలంటే, పరిచయమైతే 1969 నుంచి- దాశరధి పాటలో పాదంలాగా – “మాట్లాడని మల్లె మొగ్గ  మాదిరిగా నడిచి వచ్చి”- పలకరించే ఆయన స్వరం నాకిప్పటికీ గుర్తు. ఆ కాలంలో తరుచూ ఆయన గేయ కవిత్వం వ్రాస్తుండే వారు. కవిత్వ ప్రసంగాల మధ్య ఆయన కమ్యూనిస్టు నిబద్ధత నాకు తెలిసేది కాదు. బుగ్గన పరిమళించే జరదా పాన్ వుండేది. ఉద్విగ్నంగా ఉపన్యాసాలిచ్చే స్వభావం కాదేమో అనిపించేది. ఆనాటికి నేనెరిగిన మల్లారెడ్డి అభ్యుదయ గీతాలకు వేరుగా కౌముది రచనలు నాకు తోచేవి.

అలాగే, అలనాటి ఇతర అభ్యుదయ రచనల్లో కనిపించే “మొనాటనీ”కి కౌముది దూరంగా కనిపించే వారు. ఆయన్ని సమకాలీన “చప్పుడు కవులు” చెడగొట్టకుండా ఉర్దూ కవులు ఆయన్ని రక్షించారనుకుంటాను. శబ్దం ఎంపికలో శ్రద్ధ, లాలిత్య విషయంలో ఔచిత్యం ఎరిగిన సాహిత్యవేట్టగా కౌముది గారంటే నాకు గౌరవం. వూరికే నోరు చేసుకోవడం కంటే కవిత్వాన్ని అనుభవించడంలో ఆయన చూపే శ్రద్ధ చాలా తక్కువ మందిలో చూశాను. ఆలోచనా శీలి అయిన కౌముది గారు తక్కువగా రచనలు చేశారంటే నేను ఆశ్చర్య పడను. ఆయన అంతర్ముఖీనత ఆయన ఇంటర్వ్యూల్లో స్పష్టంగానే కనిపిస్తుంది.

“రత్నం వెదకదు: వెదక బడుతుంది” అన్నాడు కాళిదాస కవి ఒక చోట. అలాగే, కవిత్వం కూడా వెల్లడి కాదు; వెల్లడింపబడుతుంది. దాని కోసం అన్వేషణ, అధ్యయనంలో వుందనే కిటుకు కౌముది గ్రహించడం వల్లనే బహుశా కవిత్వం పేరిటా, అభ్యుదయం పేరిటా వట్టి మాటలు ఉద్రేకాలను ఆయన వెలిగక్కలేదు.

లోకం తీరు, అందులో మనుషుల ప్రవర్తనల్లో ఎగుడు దిగుళ్ళూ, అందుకు కారణాలూ కౌముది వెల్లడిగా చూడగలిగారు. పైగా మాట్లాడ్డంలో నిదానం, స్పష్టత విశిష్టంగా ఎరిగిన వారు. ఆయన కవిత్వమంతా ఇవాళ వరసగా చదువుతూంటే, పాతగా పొగలాగా అనిపించదు. ఆ వాక్యాలకు, పదసంపుటికి పాతదనం లేదు. పునరుక్తి కాదు, కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది.

మరీ ముఖయ్మ్గా “ఏకాంత”, “ఒక వృక్షం”, “ఇంతకూ నేనెవర్ని?” అనే వచన పద్యాలూ, “కవినైతిని”, “వసంత గీతి” “విశ్వ శాంతి” “దీపావళి” “వికృత ప్రాకారాలు” – పద్యాలూ, “ఒక అనుభవం” రచన వంటివి కౌముది గారి కవిత్వాన్ని పాతబడనివ్వవు.

ఏకాంతం – కవితలో కౌముది అంటారు:

గుండెల మీద

ఘనీభవించిన దూరాలు

 

నిట్టూర్పుల నిప్పు కణికల మీద

ఉచ్చ్వాస నిశ్వాసాల పరిమళాల నివురు.

ఎక్కడో  ఎందుకో

మంచులా కురుస్తున్న చూపులు.

దిగంతాల దగ్గిర

అప్పుడే ముత్యాల పల్లకీ దిగిన సంధ్య

ఎర్ర దుమ్ము ఎగరేసుకుంటూ

సరుగుడు చెట్ల వెనక

నిష్క్రమించిన రథం

 

అప్పుడే

నిప్పుల నది ఈది ఈది

తీరం ఎక్కి

వగర్చుతూ ఒళ్ళు ఆరబెట్టుకుంటున్న ఒంటరి చుక్క.

 

మిణుగురు పురుగు రెక్కల మీద ఎగిరి వచ్చి

మెల్లగా వ్యాపించే

నీ

ఆలోచన.

*

తన కాలంలో మిగతా కవుల కంటే వేరుగా మాట్లాడగలిగితే – ఒక కవి తన గొంతులో మాట్లాడుతున్నాడని అర్థం.

కౌముది గారు అభ్యుదయ కవుల్లో సొంత గొంతున్న కవి.

నా మిత్రుని కవిత్వానికి నమస్కరిస్తున్నాను.

*

 

కౌముది కవిత్వ సంపుటి “అల్విదా” కోసం సంప్రదించండి: సాహితీ మిత్రులు, 28-10-26/1, అరండల్ పేట, విజయవాడ- 520 002. 

ఆయన వ్యక్తిత్వమే ఆయన బొమ్మ!

bapu-laughing

బాపుగారితో దాదాపు ముప్ఫై ఆరేళ్ళ స్నేహం. చిత్రకారుడిగా, దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగా ఆయనతో చాలా దగ్గిరగా మెలిగే అవకాశం నిజంగా అదృష్టమే. ఎందుకంటే, బాపు గారు చాలా private person. అంత తేలిక కాదు, ఆయన మిత్రబృందంలో చేరడం! పని మాత్రమే లోకంగా బతుకుతూ అతితక్కువగా బయట కనిపించే వ్యక్తి ఆయన. అలాగే, అతి తక్కువ మాట్లాడే తత్వం ఆయనది. అలాంటప్పుడు బాపు సన్నిహితులలో వొకడిగా చేరడం, ఆ స్నేహం దాదాపు నలభయ్యేళ్ళ పైబడి నిలబడడం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

1978- బాపుగారితో మొదటి సారి కలిసాను. అదీ ‘నవోదయ’ రామమోహన రావు గారూ, ఆంధ్రజ్యోతి నండూరి రామమోహన రావు గార్ల వల్ల- ముళ్ళపూడి రమణ గారికీ నండూరి వారికీ బంధుత్వం కూడా వుంది. అయితే, వాళ్ళ స్నేహాలకీ, మా ఇద్దరి స్నేహానికీ కొంత తేడా వుంది.

మొదటి నించీ నేనేదో మహాపండితుడినని – అది నిజమైనా కాకపోయినా సరే- ఒక అభిప్రాయమేదో ఆయనకీ వుండడం వల్ల మా ఇద్దరి మధ్య అపారమైన గౌరవ భావంతో కూడిన స్నేహం వుండేది. వ్యక్తిగా ఎంతవరకు సన్నిహితంగా వుండాలో అంత వరకూ వుండే వాళ్ళం. నేనేం రాసినా – అది వచనం కానీ, పాట కానీ- ఆయనకీ ఇష్టంగా వుండేది.

మొదటి సారి నాతో సినిమాకి రాయించింది ఆయనే. 1980లో ఆయన నా చేత మొదటి సారి సినిమా పాట రాయించారు, “కృష్ణావతారం” సినిమాకి- “చిన్ని చిన్ని నవ్వు, చిట్టి చిట్టి తామర పువ్వు,” అనే ఆ పాటని బాలు, శైలజ పాడారు.

అప్పటి నించీ నిన్న మొన్నటి “శ్రీరామరాజ్యం” దాకా బాపుగారి ప్రతి సినిమాతో నాకు ఏదో ఒక విధంగా అనుబంధం వుంది. నాకు బాగా గుర్తుండే జ్ఞాపకాలు బాపూ రమణల “మిస్టర్ పెళ్ళాం”తో ముడిపడి వున్నాయి.

చిత్రకళ అంటే ఎంత ప్రేమో ఆయనకీ చలనచిత్ర కళ అన్నా అంతే ప్రేమ! సినిమాలో దృశ్యాలూ, సన్నివేశాల విషయంలో ఆయన ఎంత ఆలోచన పెట్టే వారో గుర్తుకు తెచ్చుకుంటే, అది ఆయన వ్యకిత్వంలోని విశేషంగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనలో చాలా మందికి తెలియనిది ఏమిటంటే, ఆయన మొదట్లో గొప్ప ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రఫీ ప్రావీణ్యమే ఆయన్ని సినిమా వైపు తీసుకువచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆయన ప్రతి సినిమాలో ఆ ఫోటోగ్రఫీ కన్ను చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

అలాగే, ఆయన సినిమా సృజనాత్మకత ఆయనలోని చిత్రకారుడి తత్వాన్ని కూడా చెప్తుంది.

ఇక చిత్రరచనకి సంబంధించినంత వరకూ అంత స్వతంత్ర భావన వున్న తెలుగు చిత్రకారుడిని నా అనుభవంలో చూడలేదు. ఆంద్ర దేశంలో చిత్రకళ చరిత్రలో బాపుకి ముందూ బాపు తరవాత అన్న యుగవిభజన చేయాల్సి వుంటుంది. ఈ చరిత్రలో నూరింట ఎనభై వంతుల ఖ్యాతి బాపుగారికే దక్కుతుంది. ఎందుకంటే, అది ఆధునిక కథ కానివ్వండి, ప్రబంధ కథ కానివ్వండి. ఆ కథా హృదయాన్ని పట్టుకోవడంలో బాపు రేఖ అపూర్వం.

22fr_Bapu_panel_jp_1372569g

రచయిత ఏ కాలం వాడైనా సరే, ఆ రచయిత ఉద్దేశించిన భావాన్ని అందుకోవడమే కాకుండా దాని మీద వ్యాఖ్యానంలా వుంటుంది బాపు బొమ్మ. ఆ విధంగా రచన వుద్దేశాన్ని ఇనుమడింపచేసే శక్తి ఆయనకి వుంది. అందుకే, పత్రికల్లో కాని, పుస్తకాల కవర్ పేజీలుగా కాని బాపు బొమ్మ వుందంటే అది ఒక గౌరవంగా భావించే సాంప్రదాయం తెలుగు సంస్కృతిలో ఏర్పడింది. “అమరావతి కథల”కి బాపు వేసిన బొమ్మలు నాకు మహా ఇష్టం. ఆ కథలు వస్తున్నప్పుడు కథల కోసం ఎదురు చూపు ఒక ఎత్తు, బాపు బొమ్మ కోసం నిరీక్షణ ఇంకో ఎత్తు. ఆ ఎదురు చూపు చాలా ఇష్టంగా వుండేది నాకు.

కవిత్వంలో మనం సొంత గొంతు అంటూ వుంటామే, చిత్ర రచనలో అలాంటిది create చేసుకున్నారు బాపు. ఆయనదే అయిన సొంత రేఖ. బొమ్మ కింద సంతకం వేరే అక్కర్లేని సొంత రేఖ. దానికి కారణం- ఆయనకి రేఖల మీద అధికారం మాత్రమే కాదు, ఆయనలోని స్వతంత్రమైన భావుకత. అది ఆయన గీసిన బొమ్మలలోనే కాదు, రాసే అక్షరాల్లోనూ కనిపిస్తుంది. అది కూడా ఆయన వ్యక్తిత్వంలోంచి వచ్చిందే అనుకుంటాను. బాపు చిత్రకళా రీతి అనేదొకటి ఏర్పడడంలో ఆ రేఖల వ్యక్తిత్వంతో పాటు, ఆయనా సొంత స్వతంత్ర వ్యక్తిత్వమూ సమాన పాళ్ళలో వుంటాయని అనుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే, చిత్రకళకి బాపు జీవరేఖ వంటి వాడు. ఆయన ఇప్పుడు లేకపోయినా, ఆ జీవరేఖ జీవించే వుంటుంది.

Bapu20bomma20athiva

మళ్ళీ ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడాలని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే, నన్ను ఆయనతో బాగా కట్టిపడేసింది అదే కాబట్టి! చాలా కచ్చితంగా వుండే మనిషి. మనిషైన వాడు ఎక్కడున్నా మనిషిగానే వుండాలని నమ్మిన వాడు. ఎంత స్పష్టత వుండేదో ఆయనకి! చాలా మందిలో లోపలి జీవితానికీ, బయటి జీవితానికీ మధ్య confusion వుంటుంది. లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా వుండడం బాపు వల్ల కాదు. తన పని పట్ల అంత భక్తి భావం వున్న మనిషిని కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు. “బహుమతులూ పురస్కారాలూ కాదు, work మిగలాలి” అనే వారు. ఎక్కువగా బహిరంగ ప్రకటనలు చేయడం ఆయన మనస్తత్వానికి విరుద్ధం. ఒక అవార్డు సన్మాన సభలో చివరికి ఆయన్ని మాట్లాడమని అడిగారు. ఆయన కచ్చితంగా రెండు మాటలే మాట్లాడి, కూర్చున్నారు. ఒక మాట: ఈ సన్మానానికి కృతజ్ఞతలు. రెండో మాట: ఈ పురస్కారానికి కూడా కృతజ్ఞతలు. అంతే!

నలుగురిలోకీ దూసుకుంటే వచ్చే ధోరణి కూడా కాదు, మహా సిగ్గరి ఆయన! మామూలుగా స్నేహితుల మధ్య మాట్లాడేటప్పుడు కూడా ఆయన తక్కువే మాట్లాడే వారు. ఆయనకీ చాలా ఇష్టమైన విషయాలు: సాహిత్యం, కార్టూన్లు. ఈ రెండు విషయాల గురించే ఎక్కువ మాట్లాడే వారు. విస్తృతంగా చదివేవారు. ఆ చదివిన రచయితల గురించి మాట్లాడేవారు. కార్టూన్లు బాగా follow అయ్యేవారు. వాటి గురించి మాట్లాడే వారు. ఎంత మాట్లాడినా ఆయన వ్యక్తిగా చాలా private అని తెలిసిపోయేది.

చాలా ఆహ్లాదకరమైన జీవితం ఆయనది. మంచి స్నేహం ఆయనది. ఇప్పుడు ఆయన లేకపోయినా జీవరేఖలాంటి ఆయన చిత్రాలతో పాటు ఆ రెండూ మిగిలి వుంటాయి నాలో!

-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

indraganti

 

 

 

 

 

బాపు శ్రీరాముని చేరి యున్నారు!

మల్లాది వారన్నట్టు –“ఆయనకేం ఆయన సకల నిక్షేపరాయుడు”. బాపుగారు సర్వ సకల నిక్షేపరాయుడు. తెలుగువాళ్ళకింత బొమ్మపెట్టిన వాడు. బాపు చేతి బొమ్మ రుచి చూసిన తరవాత ఇంకే మహాబొమ్మా రుచించదని నిశ్శబ్దంగా వేలాది ఆయన బొమ్మలే కదా చెబుతాయి.

భావకవిత్వంలో కృష్ణ శాస్త్రి ఏం చేసేరో, ఆధునిక కవితకి శ్రీశ్రీ ఏం చేసేరో, ఆధునిక వచనానికి చెలం ఏం చేసేరో అది, దాన్ని మించిందీ బాపుగారు బొమ్మకి చేసేరు. మహనీయం, శాశ్వతం అనుకునే అరుదైన తెలుగు శిల్పాల్లాగే బాపు బొమ్మలు చిరాయువులు కదా!

బాపు గారికి ముందే కాదు, ఆ తరవాతా ఇప్పటి వరకూ ఎవరూ లేరు. దాదాపు శూన్యం గదా! రష్యా, సోవియట్ యూనియన్, అమెరికా, సరే- చైనా, జపాన్లలో illustrations వేసే వారు ఆధునికులు ఒకరికి మించి ఒకరున్నారు. పిల్లలకీ, పెద్దల పుస్తకాలకీ ఆ దేశాల్లో దిక్కులేని తనం లేదు. ఎటొచ్చీ, దురదృష్టవశాత్తూ తెలుగువారిలో బాపు తప్ప అలా బొమ్మలు వేసి గాని, బాపుని మించిన వారు గాని లేకపోవడం బాధాకరం. కళ్ళతో కన్నీరేం చెప్పుకోగలదు చెప్పండి.

1291730404_929e3ce233

మహాద్భుతాలు బాపు వలె వెళ్లిపోవాల్సిందేనా మరి?

తెలుగుజాతికి నిశ్శబ్ద విప్లవం, పటుతర ఘన సౌందర్యం ఇక మహాభినిష్క్రమణం చేసేయి- బాపు గారి రూపంతో.

మనం ఏం చేయగలం.. ఒక్క నమస్కరించడం తప్ప!

స్వామీ, శ్రీరామా, నీకు నిజముగా జయము కలిగెను. ఎట్లన, బాపు నిన్ను చేరియున్నారు గదా!?

-శివాజీ

sivaji

 

 

 

 

 

బాపు రమణీయం … 

పంటి బిగువున నవ్వు
కొంటె చూపులు రువ్వు 
అందమంటే నువ్వు  
ఓ బాపు బొమ్మా

తాను గీచిన బొమ్మ
చూడ నవ్వులు దొర్లు
తెరలు తెరలుగ పొర్లు
ఓ బాపు బొమ్మా
 
మాడ గట్టిన బొప్పి
మొగుడికెయ్యదు నొప్పి
మోటు సరసం తప్పి
ఓ బాపు బొమ్మా

ముత్యమంతయు పసుపు 
మొగుడు పెళ్ళాం వలపు
జడను విసిరిన మెరుపు 
ఓ బాపు బొమ్మా

రామ గాధను తరచి 
రంగు రంగుల మలచి 
మాదు కన్నుల విడచి 
ఓ బాపు బొమ్మా

రాముడన్నను తీపి
హనుమ చెంతను చూపి
మనసులన్నియు దోచి
ఓ బాపు బొమ్మా


బాపు గీచిన గీత
రమణ రాసిన రాత
కలిసెనెప్పుడు జత
ఓ బాపు బొమ్మా


బాపు రమణలు పేరు
వేరు వేరుగ లేరు
స్నేహమంటే మీరు
ఓ బాపు బొమ్మా


… … …


భార్యా భర్తల బంధం
స్నేహ వారధి అందం 
అనుక్షణ సామాజిక హితం 
బాపు రమణల గ్రంధం

సంపూర్ణ రామాయణం
బాపు రమణల విన్నాణం
కాంచ కన్నుల కమనీయం
ఇంటింట స్మరణీయం …

బాపు రమణీయం …
-ఎన్. ఎం రావు బండి.
~~

 బుడుగు

పాతతమిళ సినిమా పాట ఒకటుంది:

గాలి వీచినందుకు జెండా (కొమ్మ) కదిలిందా? జెండా (కొమ్మ) కదిలినందుకు గాలి వీచిందా?

అని.

అలాగే “బుడుగు, చిచ్చుల పిడుగు” లో ————

బాపు గీతలకి ముళ్ళపూడి వ్రాసాడా? లేక ముళ్ళపూడి వ్రాతలకి బాపు గీసాడా?

ఆప్పట్లో మన ఇంట్లోకి “ఆంధ్ర పత్రిక” రాగానే అయ్యేవి కలహాలు నేను ముందు చదవాలంటే నేను ముందని చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా!

తీరా చూస్తే ఆ కథలో ఓ పెద్దపొడిచేసిన యే హీరో లేడు, అందాలు చిందిస్తూ ఆపసోపాలు పడ్తున్న హీరొయినూ లేదు; అందరినీ ఇబ్బంది పెడ్తున్న విలన్ గాడూ అస్సలే లేడు -యువతకోసం;

పాతాళ లోకమూ, దెయ్యలూ, భూతాలూ, మాంత్రికుడూ వగైరా లేవు-పిల్లల కోసం;

రామాయణ-భాగవత, భారతాల కథలూ గాని ఏ వేదాంత సూక్తులూ లేవు- పెద్దవాళ్ళ కోసం;

థనం ఎటుల కూడ బెట్ట వలెను? ఏ రాజకీయుడు ఏమి(అ)రాచ కార్యాలు వెలగ బెట్టెను? అన్నవీ లేవు-నాన్న గార్ల కోసం;

అప్పడాలూ, అరిసెలూ, అల్లికలూ వీటి గురించి ప్రసక్తే లేదు-మన అమ్మల కోసం.

ఇక ఇవన్నీ లేకుండా ————–

మన మమూలు మధ్య తరగతి ఇళ్ళళ్ళోనూ మన చుట్టు ప్రక్కలే వుండే వాళ్ళనీ ఎంచి మనల్ని కడుపుబ్బ నవ్వించేలా చేసారు వారిరివురూ.

మన జీవితాలలో:

మనం పదమూడో ఎక్కం అనే రాక్షసుడిని చూడ లేదూ?

మన అమ్మా నాన్నలు “రాథా గోపాళం” లా అప్పుడపుడూ పిడివాదాల తో ముచ్చటగా కలసిమెలసి వుండడం చూళ్ళేదూ?

మన ఆగడాలని మరచి అక్కున చేర్చుకున్న మన “బామ్మ”లూ,

ఇక “బుడుగు బాబాయి” పోకిరీ(షోకిల్లా)గాళ్ళూ, ముసిముసి నవ్వుల “రెండు జెళ్ళ సీత”లూ,

అందరిళ్ళళ్ళో తల దూర్చే “లావు పాటి పక్కింటి పిన్ని గారు”లూ,

మన నాన్నల “విగ్గు లేని యముడి” లాటి బాస్సులూ,

అగుపడ్డప్పుడల్లా ‘ఓ అయిదో పదో సర్దవోయ్’ అని అందరినీ అప్పడిగే అప్పారావులూ,

చీమిడి ముక్కుతో ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకొని చిన్నగా సన్నగా నసలు పెట్టే సీగానపెసూనాంబలూ,

అందరికన్నా మరీ “బుడుగు” లా కాకపోయినా అల్లరితో తల్లి తండ్రులకి బెదుర్లు పుట్టించే చిన్నారులూ,

వీళ్ళందరూ మనకి పరిచయమే కానీ మనం ఎవ్వరమూ వ్రాయలేక పోయాం, గీయలేకపోయాం వాళ్ళలా!!

అదండీ వారివురీ కథా అండ్ కమామీషూ!!

శ్రీమతి కుమారి సామినేని