నాకు మ‌న‌స్సు ఉంటుంది                   

Pablo_Picasso,_1910,_Girl_with_a_Mandolin_(Fanny_Tellier),_oil_on_canvas,_100.3_x_73.6_cm,_Museum_of_Modern_Art_New_York.

ఉద‌యం 9 అయ్యింది విశాఖ వ‌చ్చే పాటికి..స‌త్య అప్పటికే రిసీవ్ చెసుకోడానికి రెడీగా ఉన్నాడు.. హోట‌ల్  రూం తీసుకోని కాస్త ఫ్రెష్‌ అయి.. ఇద్దరం ఆఫీస్‌ దగ్గరకు వెళ్లాము.. మధ్యాహ్నం  లంచ్ కి విశాఖలో నేను అమితంగా ఇష్టపడే  అల‌కాపురికి వెళ్లి చెరొక బిరియానీ తిని బైక్ మీద బ‌య‌లు దేరాము..ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర సిగ‌రెట్స్ కోసం అగాము..ఎవరో బిచ్చగత్తె 29 నుంచి 35 సంవ‌త్పకాల మధ్య ఉంటాయేమో.. ఎముకల గూడులా ఉంది.. అడుక్కోవ‌డానికి వ‌చ్చింది..గ‌తంలో ఆమెను ఎక్కడో చూసినట్లు గుర్తు..కానీ ఎంత అలోచించినా ఎక్కడ చూశానో  గుర్తుకు రావ‌డం లేదు..స‌త్యా బాస్ ఇంట‌ర్యూకు వ‌చ్చిన వాళ్లను సాయంత్రం ఇంట‌ర్యూ చెయ్యాలీ అని గుర్తు చేసిన త‌రువాత గానీ అక్కడ నుంచి బ‌య‌లుదేర‌లేదు..ఇంట‌ర్వ్యూలు చేస్తున్నాం.. అయినా ఆ బిచ్చగత్తె మాత్రం కళ్లలోనే మెదులుతూ ఉంది..రాత్రి స‌త్యతో పాటుగా నా పీజీ క్లాస్ మెట్స్ మ‌రో ఇద్దరు, నేను వ‌చ్చాన‌ని క‌ల‌వ‌డానికి రూంకి వ‌చ్చారు..ఫార్మల్‌గా త‌లా రెండు పెగ్గులు తీసుకున్న త‌రువాత ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు..పాత మిత్రుల‌ను  క‌ల‌వ‌డంతో విశాఖ‌తో నా ప‌రిచ‌యం , పీజీ చ‌దువు అంతా కళ్లముందు క‌దిలింది..మిత్రులు వెళ్లిపోయాక  హోట‌ల్ బాయ్  రూంను శుభ్రం చేసి భోజ‌నం వ‌డ్డించాడు..భోజ‌నం త‌రువాత  ఫ్రెష్‌గా మ‌రో రెడ్‌విల్స్ వెలిగించ‌గానే అప్పుడు గుర్తుకు వ‌చ్చిన పొద్దున చూసిన బిచ్చగత్తె..నా జీవితంలో ఒక అద్భుత‌మైన పాఠం నేర్పిన వ్యక్తి..

 

పీజీ చదవడానికి తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చాను..పీజీ చదువు..ప్రఖ్యాత అంధ్రా యూనివర్సిటీలో నాకు ఇష్టమైన జ‌ర్నలిజం ప్రొఫెషనల్‌ కోర్సు..అప్పటి దాకా పేపర్ల లోనూ టీవీలలోనూ విశాఖ గురించి విన‌డం, చదవడం,  చూడటం తప్ప మ్యాప్‌లో విశాఖ నగరం ఇలా ఉంటుందా అని అనుకోవడం  తప్ప ఎప్పుడూ విశాఖ వ‌చ్చిందీ లేదూ చూసింది లేదు.. పీజీ చ‌దువుతో ప్రారంభమైన నా విశాఖ పరిచయం, క్రమ క్రమంగా అంతులేని మోజులా మారిపోయింది..ఎన్నిరోజులు బీచ్‌లో మిత్రుల‌తో భ‌విష్యత్‌ గురించి క‌ల‌లు క‌న్నాన్నో..ఎన్ని రాత్రులు స‌ముద్ర కెర‌టాల‌పై పాల నురుగులా ప‌డుతున్న వెన్నెల‌ను స్వాదించానో..వ‌ర్షంలో కెర‌టాల‌తో అడుకున్నానో..అమావాస్య నిశీ చీక‌టిలో అల‌కూ అల‌కూ మ‌ధ్య నిశ‌బ్దాన్ని వింటూ గ‌డిపానో ముఖ్యంగా బీచ్‌లో కూర్చోని హాప్రస్థానం చ‌దువుతుంటే శ్రీశ్రీ స్వయంగా మ‌హా ప్రస్థానన క‌విత‌ల్ని చ‌దివి వినిపిస్తున్నారు అనే భ్రాంతి క‌లిగేది నాకు.. పీజీ త‌రువాత ఉద్యోగం కోసం విశాఖ వీడి వెళ్లిన త‌రువాత కూడా ఎప్పుడైనా బోర్ అనిపిస్తే విశాఖ వ‌చ్చే వాడిని..ఆ త‌రువాత విశాఖ‌లో రెండు సార్లు ప‌నిచేసినా ట్రాన్స్‌ఫర్‌ వ‌ల్ల ఎప్పుటి క‌ప్పుడూ చుట్టపుచూపుగానే వ‌చ్చి వెళ్తూ ఉండేవాడిని..జీవితంలో స్థిరపడితే విశాఖలోనే స్థిరపడాలనేదీ నా భ‌ల‌మైన కోరిక‌.

 

మ‌న‌కు జీవితంలో తార‌స ప‌డే ప్రతి జీవీ మ‌న‌తో బ‌ల‌మైన రుణ‌బంధం క‌లిగి వుంటుందనీ ఏదో తత్త్వవేత్త పుస్తకంలో చ‌దివాను అలాంటి ప‌రిచ‌య‌మే నాకు వాసుతో క‌లిగింది..వాసు నాతో పాటు జర్నలిజం చ‌దివిన స‌హాద్యాయి..ఇద్దరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే కావ‌డంతో స్వతహాగా దగ్గరయ్యాము..దానికి తోడు ఇద్దరం పుస్తకాలు, సామాజిక ఆలోచ‌న‌లు చుకునే వాళ్లము… కొన్ని విష‌యాల‌పై ఇద్దరిలో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నా చాలా విషయాలలో మాత్రం ఒకే మాట ఒకే బాట‌గా ఉండే వాళ్లము ..ఒక ర‌కంగా నా ఆవేశ‌పు అగ్నికి వాడి లోచ‌న గాలీ తోడ‌య్యేదీ..పీజీ రోజుల‌లోనే ఇద్దరం చెరొక పత్రికలో ప‌నిచెసే వాళ్లం.. యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న అక్రమాలపై పోటీపడీ మరి వార్తలు రాసేవాళ్లం..మా వార్తలకు కొంత మంది డైలీ వైజ్ వ‌ర్కర్‌కు  యూనివ‌ర్సిటీ ప‌ర్మినెంట్ చేయడంతో మా సంతోషానికి అవ‌దులు లేవు..జ‌ర్నలిజం వ‌ల్ల ప్రజలకు మంచి జ‌రుగుతంద‌నీ ఎలాగైనా ఇద్దరం రిపోర్టింగ్‌ ఫీల్డ్‌లోనే ఉండాలని డిసైడ్‌ అయ్యాము..నాలుగు గోడ‌ల మ‌ద్య చ‌దివే చ‌దువులో కంటే నాలుగు రోడ్ల మ‌ద్య నేర్చుకునే ప్రాక్టిక‌ల్ చ‌దువే కావాల‌నుకున్నాం ఇద్దరం.. స‌మాజంలో మ‌న చుట్టూ నిత్యం జ‌రిగే వాటిపై స్టోరీ చెయ్యాల‌ని నిర్ణయం తీసుకొని..ఆ క్రమంలో జీవీఎంసీ ఎన్నిక‌ల‌లో డ‌బ్బు ప్రవాహం..యూనివ‌ర్సిటీలో కుల‌గ‌జ్జీ, ర్యాగింగ్ వంటి అనేక అంశాల‌పై స్టోరీలు రాసేవాళ్లం..ఇంకేదైనా డిఫ‌రెంట్‌గా చేద్దాం అనుకుంటుండ‌గా వాసు నైట్ స్వీప‌ర్స్ పై అద్భుత‌మైన ఐటెం రాశాడు..వాడి వార్త దెబ్బకు పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌నీస స‌దుపాయాలు అయినా మాస్కులు వంటి స‌దుపాయాలు క‌ల్పించింది యాజ‌మాన్యం..వాడికి పోటీగా ఏజ‌న్సీ విద్యా వ్యవస్థ మీద నేను ఐటెం రాశాను..ఇంకా ఎదైనా రాయాలి కాస్తా డిఫ‌రెంట్ గా స‌మాజం తీరుపై కొర‌కాసుతో కాల్చీ వాత పెట్టేదీ గా ఉండాలి ఆ స్టోరీ… అలాంటి దానికోసం వెతికే క్రమంలో పొట్టకూటికోసం ఒల్లంమ్ముకునే వేశ్యలపై  స్టోరీ చేద్దాం అనుకున్నాం.. కానీ ఎలా..వారు ఎక్కడ ఉంటారు..? కాంటాక్టు చేయడం ఎలా..? ఒక మిత్రుడు చెప్పాడు..రాత్రులు రైల్వే స్టేష‌న్ దగ్గరా, బ‌స్టాండ్ ద‌గ్గరా ఉంటార‌నీ..ఇక వాళ్లని క‌లిసి మాట్లాడాలి..అలాంటి వాళ్ల కోసం చాలా రోజులు విశాఖ బ‌స్టాండ్ లో గ‌డిపేవాళ్లం..

 

ద‌స‌రా సెల‌వ‌ల‌కూ అంద‌రూ మిత్రులు వెళ్లిపోయినా నేనూ వాసు ఇద్దరం యూనివ‌ర్సిటీలో ఉండిపోయాము..రాత్రి సెకండ్ షో జ‌గ‌దాంబలో చూసిన త‌రువాత  సిగ‌రెట్ల కోసం ఆర్టీసీ బ‌స్టాండ్‌కు వెళ్లాము..సెడ‌న్‌గా ఒక అమ్మాయి క్యాంటిన్‌లో టిఫిన్ చేస్తుంది..కాస్తా ర‌ఫ్‌గా సాధార‌ణ అమ్మాయిల‌తో పోల్చితే క‌నిపించే సున్నిత‌త్వం కనిపించడం లేదు..నిదానంగా వాసు గాడు మాట‌లు క‌లిపాడు..బుల్లేట్ లా దూసుకు వ‌చ్చింది ఆమె దగ్గర నుంచి ఇద్దరం ఉన్నారా రెండు వేలు ఇవ్వండీ అని.. అంత కాదు ఇంతిస్తాం అని కాదు నేను అడిగినంత ఇవ్వాలీ అని తనూ.. బేరం ఎంతకీ తెగడం లేదు.. ఈ లోగా అర‌గంట‌కు అంతివ్వాలా అన్నాడు వాసు..ఇష్టం ఉంటే రండీ లేక పోతే పోండీ..ప్రతి పోటుగాడూ బేరాలాడే వాడే అని ఎట‌కారంగా మాట్లాడీ వెళ్లడానికి అడుగు ముందుకు వేసింది త‌నూ..ఒక్క సారిగా నేను మగాడ్నీ అనే అహంతో రెచ్చిపోయిన నేనూ ఒల్లమ్ముకునే దానివి ఎందుకే నీకంత పొగ‌రూ అన్నా…తోక తొక్కిన తాచులా చుర్రున చూసిందీ క‌ళ్లల్లో నీరుతో ఒళ్లు కొవ్వెక్కీ ఒళ్లమ్ముకోవ‌డం లేదు బతకడానికి ఒళ్లమ్ముకుంటున్నాను..నాకు మ‌న‌స్సుంటుందీ..అంద‌రిలాగా ఉండాలనీ ఉందీ అంటూ వేగంగా వెళ్లి పోయింది..తొంద‌ర ప‌డ్డావురా బావా అన‌వ‌స‌రంగా ఆడ పిల్లను మాట అన్నావు అన్నాడు వాసు..నిజ‌మే నాకు అర్ధమవుతుంది చేసిన త‌ప్పు..కానీ స‌రిదిద్దుకోలేను..భారంగా బీచ్ కు య‌లుదేరాం..

 

ఆ సంఘ‌ట‌న త‌రువాత మ‌రో రెండు రోజులు ఆ అమ్మాయి కోసం వెతికాము కానీ ఫ‌లితం లేదు..ఆ అమ్మాయి గురించి .అలోచించ‌డం మానేసి  ఎగ్జామ్స్ హ‌డావుడిలో ప‌డ్డాము..చ‌దువు పూర్తయింది..వాసుకు నాకు వేరు వేరు ఛాన‌ల్స్ లో  ఉద్యోగాలు వ‌చ్చాయి..అయితే రెండు సంవత్సరాల‌కు విశాఖ ట్రాన్స్ ఫ‌ర్ అయింది..ఓ రోజు సాయంత్రం  6.30 స‌మ‌యంలో బస్టాండ్ ద‌గ్గరే క‌నిపించింది..ఎవరి కోసం అయినా ఎదురు చూస్తుందో తెలియ‌దూ..వెంట‌నే వెళ్లను..అదే రెక్ లేస్ ఎంత మంది ఉన్నారు అందీ .. ఒక్కడినే అన్నాను. రెండు వేలు అందీ..ప‌దా అని లాడ్డికి తీసుకు వెళ్లాను..త‌న డ‌బ్బులు దారిలోనే ఇచ్చేశాను..

భోజ‌నం చెశావా అన్నాను..లేదు అందీ..భోజ‌నం తిన్న త‌రువాత న‌న్ను గుర్తు ప‌ట్టావా అన్నాను..ఎంతో మందిని చూశాను నువ్వేల గుర్తుంటావు అని ఎదురు ప్రశ్న వేసింది….అదీ నిజ‌మే ప్రవహించే న‌దీ ఎన్ని మ‌జిలీల‌ల‌ను గుర్తు కు పెట్టుకుంటుంది అనిపించింది.. రెండు సంవ‌త్సరాల క్రితం జ‌రిగిన విష‌యం గుర్తు చేశాను..త‌న మోహం ఎర్రగా కందిపోయింది..కోపంతో ముక్కు పుటాలు అదురుతున్నాయి..వెళ్లిపోతాను నేను అంటూ లేచింది..కాదు కూర్చో నీతో మాట్లాడాలీ, అని బ‌ల‌వంతంగా కూర్చో బెట్టాను..చెప్పు ఏంటీ నీ స్టోరీ అన్నాను..విజ‌యన‌గ‌రం ద‌గ్గన ఊరు నాదీ..అమ్మానాన్నలు కూలీలు..టెన్త్ వ‌ర‌కూ చ‌దివాను..అమ్మానాన్న చనిపోయారు.. నా అశ‌లు కూలిపోయాయి..ప‌ని ఉంద‌నీ చెబితే ఇక్కడ‌కు వ‌చ్చాను..ఇక్కడ‌కు వ‌చ్చిన త‌రువాత ఈ ప‌ని అని తెలిసింది.. ఆక‌లికి త‌ట్టుకోలేక పోట్టకూటి కోసం ఈ ఫీల్డ్‌లోకి వ‌చ్చాను అందీ..మ‌రీ ఎక్కడ ఉంటావు అన్నాను..ఇక్కడే ఓ మ‌రో ముగ్గురు ఇదే వృత్తి చేసే వారితో ఉంటాను..అంద‌రిలోనూ చిన్నదాన్ని నేనూ..వాళ్లకు అంత బేరాలు ఉండ‌వూ..నాకు వ‌చ్చే డ‌బ్బుల‌తో వారి పిల్లల‌ను స్కూల్లో చ‌దివిస్తున్నాను అందీ..ఇలా ఎంత కాలం ఉంటావు ఏదైనా ఉద్యోగం చెసుకోవ‌చ్చు క‌ధా అంటే నువ్వు ఇప్పిస్తావా  ఉద్యోగం..ఈ ఫీల్డ్ వ‌దిలేసి ప‌నిచేసుకుంటాను అందీ..నేను సైలెంట్ అయ్యాను..చూశావా ఇన్ని అద‌ర్శాలు చెప్పిన నువ్వు కూడా  మౌనంగా మారావు.. చెప్పినంత ఈజీకాదు ఆచ‌రించ‌డం..నువ్వు ఆరోజు అన్న మాట అప్పడ‌ప్పుడు గుర్తుకు వ‌స్తుంటుంది..చాలా బాధగా అనిపిస్తుంది..ఒక్కటి గుర్తుంచుకో మ‌నిషిని మ‌నిషిగా చూడ‌నీ ఆద‌ర్శాలు పాటించ‌కూ..జీవితం అంద‌రికి అన్నీ ఇవ్వవూ..ఏదో పొందుతూ ఉంటాం ఇంకేదో కోల్పోతూ ఉంటాం..నువ్వనుకుంటావేమో ఒళ్లమ్ముకునే దానివి వేదాంతం మాట్లాడుతున్నావే అని, నేను ఎంతో మంది మ‌నుషుల‌ను చ‌దివాను..ఒక్కటి గుర్తుంచుకో..ఒళ్లమ్ముకునే వాళ్లకూ మ‌న‌సు ఉంటుందీ ..చేసే ప‌నుల‌ను బ‌ట్టీ మ‌నుషుల‌ను అంచనా ఎప్పుడూ వేయకు అనీ అంటూ లేచిందినేను బ‌య‌లుదేరుతాను..నీ డ‌బ్బు నాకు వ‌ద్దూ నేనూ ఏ ప‌నీ చేయలేదు ఇక్కడ అంటూ వెళ్లిపోబోయింది..స‌రే నీ ప‌నికోసం కాక‌పోయినా నీ ద‌గ్గర ఉన్న పిల్లల కోసం అయినా డ‌బ్బు తీసుకో అన్నాను..నీతో ఇప్పటి వ‌ర‌కూ మాట్లాడిన దానికి స‌గం చార్జీ  తీసుకుంటాను అని వెళ్లిపోయింది..వాసు గాడికి ఈ సంగతి చెప్పాను..

 

కాల‌గ‌ర్భంలో సంవ‌త్సరాలు గ‌డిచిపోయాయి..నాకు హైద్రాబాద్ ట్రాన్స్ ఫ‌ర్ అయింది..దాదాపు 8 సంవ‌త్సరాల త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ ట్రాన్స్‌ఫ‌ర్ పై విశాఖ‌కు వ‌చ్చాను..నాకు అద్భుత‌మైన జీవిత పాఠం నేర్పిన వ్యక్తి క‌లిస్తే ఇప్పుడైనా ఏదో ఒక‌టి చెయ్యాలీ అనిపించింది..ఇప్పుడు నాకంటూ ఒక హోదా ఉంది కాబ‌ట్టి ఆ ర‌క‌మైన ప్రయత్నం చేయాలని అనుకున్నాను .. ఉద‌యాన్నే అక్కడికి వెళ్దామ‌నుకున్నాను..కానీ వేరే ప‌నుల‌లో రెండు రోజులు గ‌డిచిపోయింది..మూడో రోజు ఎలా గైనా కల‌వాలనుకొని నిన్న స‌త్యకు నాకు త‌ను క‌నిపించిన ప్రాంతానికి వెళ్లాము..అక్కడ‌కు వెళ్లే పాటికి జీవీఎంసీ వాళ్లు అడావుడీ చేస్తున్నారు..స‌త్యాని ఏం జ‌రిగిందో క‌నుక్కో అని పురమాయించి సిగ‌రెట్ వెలిగించాను..అన్నా ఎవ్వరో బిచ్చగ‌త్తే చ‌నిపోయింది అని చెప్పాడు..నాకు ఎందుకో ఆ శ‌వాన్ని చూడాల‌ని అనిపించింది..స‌త్యా నేనూ ఇద్దరం వెళ్లాము..నా అనుమాన‌మే నిజం అయింది.. త‌నే..శవాన్ని ఎక్కడ‌కు తీసుకుళ్తారు అని అడిగానూ అనాధ శ‌వం క‌ధా సార్..ఎక్కడైనా పూడ్చి పెడతాం అని చెప్పారు మున్సిపాలిటీ వారు..స‌రే ఖ‌ర్చులు నేను బ‌రిస్తాను..సాంప్రదాయంగా ద‌హ‌నం చేయండి నేనూ వ‌స్తాను అని చెప్పాను..స‌త్యా కూడా నాతో శ్మశానానికి వ‌చ్చాడు..క‌పాల మోక్షం జ‌రిగిన త‌రువాత శ్మశానం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాము..

నేను నేర్చుకున్న అద్భుత పాఠం..నాకు పాఠం నేర్పిన గురువు రుణం ఆ విధంగా తీర్చుకున్నాను..కాని త‌ను అన్న మాట‌లు నాకు ఎప్పుడూ గుర్తు ఉంటుంది..అంద‌రినీ మ‌నుషులుగా చూడూ..అంద‌రికి మ‌న‌స్సు ఉంటుందీ అనీ….హెట్స్ ఆఫ్ హ‌ర్……..అమే కోసం..

 

………….ఆమే………………..

 

మెర్క్యూరి లైట్ల దగదగల క్రింద..

పిలుస్తున్న అస్పష్ట ఆకారం..

దగ్గరకు వెళ్లితే మత్తెక్కించే చౌకరకం సెంటు గుబాలింపు..

చుట్టూ పరకిస్తూనే రావాలా అంటూ ప్రశ్న..

కొంచెం లేటయిందో..

త్వరగా తేల్చుకో..

ఇంకో బేరం ఉందంటూ గదమాయింపులు..

…………………………………….

ఆ చూపులో కోరిక లేదు..

దోరికి పోతామన్న భయం లేదూ..

కొత్త అనుభవాలను ఓడిసి పట్టుకోవాలన్నా అత్రుత లేదు..

నన్ను నమ్ముకున్నోళ్ల కడుపు నింపాలన్న తపనే కనిపిస్తుంది..

ఆ చూపుల్లో..

ఆకలే కనిపిస్తుంది ఆ చూపుల్లో..

…………………………………………..

ప్రేమించిన వాడు మోసం చెసి కొందరూ..

మొగుడు వదిలేసిన వారు మరికొందరూ..

నా అనే వాడు పట్టించుకోక ఇలా ఎందరో..

అప్పులు తాళలేక..

బిడ్డలను పస్తులుంచలేక..

తన శరీరాన్నే వ్యాపార పాన్పుగా మారుస్తుందా పడతీ..

……………………………………………………

ఆమెను కదిలిస్తే ఎన్నో కధలు…

మరెన్నో వ్యధలు..

రాత్రంతా జడలో నలిగిన మల్లెపువ్వులా వాడిపోయింది అంధం..

తన శరీరాన్ని కాక మనస్సున్న మనిషిగా గుర్తించమని పోరాడుతుంది ఆమె

 

ఆయువు..

నడుస్తున్న కాలానికి బ్రతుకుతున్న జీవితానికి ఏర్పడిన కాళీని పూర్తిస్తుంది ఆమె..

శూన్యమైన మనస్సాక్షితో…….

కాలం రోగాల సర్పాలై ఆమె అయుష్షుని మింగేసింది..

కవ్వించే ఆ శరీరం ఇప్పుడు ఎముకల గూడైంది..

చీకటి పరదాలలో కూరుకుపోయిన..

హృదయాన్ని క్షమించి ఇంకా ఎంతకాలం వెలుగు నటించగలని ప్రశ్నిస్తుంది ఆమె..

నిజమే…

ఆమె కౌగిలి పాన్పు తప్ప మనస్సుకు అంటుకున్న గాయాల వాసన ఎవరికి..

ప‌డుతుంది చెప్పూ…

క్రొవ్వొత్తీ వెలుగే కాని ..

ఆరిపోయిన కొవ్వొత్తి పొగ రింగులుగా అనంత వాయువుల్లో కలిసే ఆయువు ఎవ్వరికి

కావాలి..

*

ప్రేమే జీవితం కాదు!

 

విజయ్ గజం 

 

vijays pictureనిద్రమత్తు ఇంకా వీడలేదు. బెడ్ మీద దొర్లుతుంటే నురగలు కక్కే కాఫీ తీసుకొచ్చింది నా అర్ధాంగి.అదే చెత్తో పేపర్ తీసుకొచ్చి మెయిన్ ఎడిషన్ తను తీసుకొని సిటీ ఎడిషన్ నా కు ఇచ్చింది. ఇద్దరం అలా కాఫీ తాగుతూ బీచ్ అందాలను చూస్తూ బాల్కనిలో కూర్చొని పేపర్ చదవడం, కబుర్లు చెప్పుకోవడం మా దినచర్యలో భాగం.

రోజూ లాగానే పేపర్ ఎదురుగా కూర్చున్న మాకు ఆ పేపర్ వార్తలను చూడగానే చిరాకు వేసింది. ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని గొంతు కోసి చంపిన వార్త కలవర పెట్టింది. ఆ వార్త చూడగానే మనసంతా అదోలా తయ్యారయింది. కాసేపు పాత పాటలు అయినా విందామని టీవీ పెట్టగానే అందులోనూ ప్రేమ పేరుతో చేసే వేధింపులు తాళలేక 15 సంవత్సరాల బాలిక కిరోసిన్ పోసుకుని అత్మహత్య చేసుకుందని బ్రేకింగ్స్ చూడగానే తాగుతున్న కాఫీ ఛేదుగా అనిపించింది.

ప్రేమను ఒప్పుకోకపోతే చంపేయ్యాలా ?, ప్రేమ బ్రతుకును, ప్రేమించిన వ్యక్తి సంతోషాన్ని కదా కోరాల్సింది. కాని ఇప్పుడు జరుగుతుంది ఏమిటీ? ప్రేమించక పోతే చంపేస్తారా? ఒక జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేస్తారా? ఇదే లోచనలతో ఆఫీసుకి బయలుదేరాను. డ్రైవింగ్ చేస్తున్నా అలోచనలు మాత్రం అవే, ఇదే సమయంలో నా ఆలోచనలను భగ్నం చేస్తూ  మోగింది నా  సెల్‌ఫోన్‌,  నెంబర్ మాత్రం బాగా తెలిసిన నెంబర్ లాగా ఉంది,

ఫోన్ లిఫ్ట్ చేసి  అవతల వ్యక్తి ఏం మాట్లాడేదీ వినకుండా డ్రైవింగ్‌లో ఉన్నా మళ్లీ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాను. మళ్లీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది.. బైక్‌ పక్కన ఆపి విసుగ్గా కాల్‌ లిఫ్‌ చేశాను, విశ్వం ఎలా ఉన్నావురా అనే మాట వినిపించడంతో  బాగా తెలిసిన వారు అని అనిపించి 10 నిమిషాల తరువాత ఫోన్ చేస్తానని చెప్పి మళ్లీ బైక్‌ స్టార్ట్ చేశాను. ఆఫీసు దగ్గరకు రాగానే నా మోబైల్‌కు వచ్చిన నెంబర్‌కు కాల్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. తరువాత వాళ్లే చేశారు, బాగా తెలిసిన గొంతు విశ్వం ఎలా ఉన్నావురా అనే పలకరింపు.  ఆ వాయిస్. దానిలోని మార్ధవం వెంటనే గుర్తుకు వచ్చింది కోదాడ అత్తయ్య.

నన్ను విశ్వం అని చనువుగా పిల్చే అతి కొద్ది మంది వ్యక్తులలో కోదాడ అత్తయ్య ఒకరు.  బాగున్నాను ఇంతకు మీరు ఎలా ఉన్నారమ్మా అన్నాను ముక్తసరిగా.ఏంటీ విశ్వం కొత్తగా గారూ గీరు అంటూ దూరం పెట్టేస్తున్నావు అని నిష్టూరమాడింది కోదాడ అత్తయ్య. మాట్లాడటం ఇష్టం లేక పనిలో ఉన్నాను త్వరగా చెప్పమ్మా అన్నాను అదే విసుగ్గా.ఏమనుకుందో ఏమిటో. కాంతికి పెళ్లీ కుదిరింది, మీ కుటుంబం తప్పకుండా రండీ చెప్పి ఫోన్ పెట్టేసింది.

కాంతి ఈ పేరు వినగానే బాగా ఇష్టమైన పుస్తకాన్ని మళ్లీ చదివిన అనుభవం.నా జీవితంలో కాంతులు నింపుతుంది అనుకున్న కాంతి ఓ హైఓల్టేజ్  మెరుపులా నా జీవితంలోకి వచ్చి ఎనర్జీ నింపి, అంతే వేగంగా దూరమైంది. కృష్ణా జిల్లాలోని ఓ చివర టౌను మాది. ఫస్ట్ నుంచి అన్నింటికీ పోరాడీ పోరాడీ చదువు సాగించాను. నాకిష్టమైన జర్నలిజంలో పీజీ చదవడానికి ఓ యుద్ధమే చేశాను.

అమ్మమ్మని ఎదిరించి మరీ పీజీలో నాకు నచ్చిన జర్నలిజం జాయిన్ అయ్యాను.దీంతో మూడు నెలలు అమ్మమ్మ మాటలు బంద్.విశాఖలో ఉండగా ఓ రోజు కోదాడ అత్తయ్య ఫోన్ ఎలా ఉన్నావు రా. ఒక్క సారి రా రాదూ చాన్నాళ్లు అయింది నిన్ను చూసి అని అందీ.కోదాడ అత్తయ్యకు నేనంటే మంచి అభిప్రాయం. జీవితంలో స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయనీ, చెప్పదలుచుకున్న విషయాన్ని మోహమాటానికి పోకుండా స్పష్టంగా చెబుతానని అంటూ ఉండేది.తన పిల్లలతో సమానంగా చూసేది నన్ను కూడా.వాళ్ల పిల్లలతో కలిసి నేను తెగ గోల చేసే వాడిని.వాళ్లకి తినిపించినట్లే నాకు కూడా అన్నం గోరు ముద్దలు తినిపించేది.

పీజీ చదవడానికి విశాఖ వచ్చిన తరువాత కోదాడ వెళ్లడమే మానేశాను. పైగా యదార్ధవాది లోక విరోధీ అన్నట్లు బంధువులతో నాకు ఎప్పుడు గొడవలే అవుతూ ఉండేవి. దీంతో సాధారణంగా బంధువుల ఎవరి ఇంటికి వెళ్లని నేనూ నన్ను అభిమానించే కోదాడ అత్తయ్య వాళ్లింటికి మాత్రం అప్పుడప్పుడూ వెళ్లేవాడిని. కోదాడ అత్తయ్య అమ్మాయే కాంతి. కొద్ది రోజులకు ఓ పేపర్ లో ఇంటర్వ్యూ కోసం  హైద్రాబాద్ వచ్చాను.అత్మాభిమానాన్ని చంపుకొని దేనిలోని ఇమడలేని వ్యక్తిత్వం కావడంతో ఫైనల్ ఇంటర్వ్యూలో నుంచి లేచి వచ్చేశాను.

ఎందుకో అత్తయ్యే ఫోన్ చేసింది.హైద్రాబాద్ వచ్చాను అంటే  సరే ఇంటికి రారా అంది. చాన్నాళ్లయిందిగా వెళ్దామని కోదాడ వెళ్లాను. ఎప్పుడూ నాతో మాట్లాడనీ మరదలు కాంతీ మాత్రం ఏదో స్పెషల్‌ ఇంట్రస్ట్ చూపిస్తుంది. తను డిగ్రీ సెకండియర్ అప్పుడు. అక్కడ రెండు రోజులున్న తరువాత తిరిగి విశాఖ వచ్చాను.  వైజాగ్‌లో ఓ పేపర్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం  ప్రయత్నిస్తున్నాను. కోదాడ నుంచి వచ్చిన వారం తరువాత ఉదయాన్నే కొత్త నెంబర్ నుంచి ఫోన్. పొద్దున్నే నిద్ర పాడు చేసేది అని విసుక్కుంటానే ఫోన్ ఎత్తాను. ఎలా ఉన్నావు అనీ.

నిద్ర పాడు చేశావు ఇంతకూ ఎవరమ్మా నువ్వు అంటే. కాంతీ అందీ, కన్ఫ్యూజన్‌లో ఉండగానే కోదాడ అత్తయ్య వాళ్ల అమ్మాయినీ అని క్లారిటీ ఇచ్చింది. సరే చెప్పు ఏంటీ విషయం అనే సరికీ సరదాగా కాల్ చేశాను  అంది.. ఎలా చదువుతున్నావు అంతా బాగున్నారు కదా.. నేను బాగానే చదువుతున్నాను నీ ఉద్యోగ దండయాత్రలు ఎంత వరకు వచ్చాయి అందీ. దండయాత్రలు సాగుతున్నాయి కానీ, గెలుపే రావడం లేదు అన్నాను.. నీ కంటే ముందు జీవితంలో నేనే స్థిరపడతాను చూడు అందీ. తను అలా అనే పాటికి నా అహం దెబ్బతిన్నట్లయింది.

మా మధ్య సరదాగా మొదలైన మాటలు వెంటనే సీరియస్ విషయం మీదకు మళ్లింది. సరే కాంతి నీ డిగ్రీ, పీజీ కంప్లీట్ అయ్యేపాటికి ఇంకా  మూడున్నర సంవత్సరాలు  పడుతుంది, ఆ టైంకి నా కింద కనీసం 10 మంది సబార్డినేటర్స్ ఉంటారు చూడు  అన్నాను. సరే పందెం అంది. నువ్వు గెలిస్తే నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను చూడూ అంది. సరే ఉద్యోగం వచ్చాకే కలుద్దాం అని  ఫోన్ పెట్టేశాను. నా క్లాస్‌మెట్స్ లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చేశాయి. నేను మాత్రమే కాళీగా ఉంటున్నాను.

నా శ్రేయోభిలాషులు కూడా చాలా మంది నువ్వు విశాఖ కంటే  హైద్రాబాద్ వెళితే అనేక ఆఫర్స్ ఉంటాయి, అక్కడ ప్రయత్నించూ అని సలహా ఇచ్చారు.గెలవాలన్న పంతం. పైగా పోటీ అమ్మాయితో. కాని హైద్రాబాద్ ఎలా వెళ్లాలి. అమ్మమ్మను డబ్బులు అడగలేను. ఎలాగా అని ఆలోచిస్తున్న నాకు గతంలో నేనే  పనిచేసిన పత్రిక వారు నా జీతం బకాయి ఇచ్చారు. మరొక మిత్రుడు మరో రెండు వేలు సర్ధారు. అమ్మమ్మ దీవెన తీసుకొని ఉద్యోగం వస్తేనే వస్తాను అని చెప్పి హైదరాబాద్ బయలు దేరాను.

హైద్రాబాద్ వస్తే కానీ అర్ధం కాలేదు ఉద్యోగం రావడం అంత తేలిక కాదని. ఎన్నోప్రయత్నాలు, మరెన్నో ఛీత్కారాలు. ఒకే సంస్థలో మూడు పోస్ట్‌ల కోసం అప్లై చేసి సాయంత్రం వరకూ ఆఫీసు ముందు పడిగాపులు. ఇవ్వన్ని ఒక ఎత్తయితే ఆకలి పోరాటం ఒక వైపు. డబ్బులు లేక కిలోమీటర్ల కొద్ది నడక. ఒక పార్సిల్ భోజనంను రెండు రోజులు తిన్న సందర్భాలు బోలెడు. మొత్తం మీద నెల రోజులలో దాదాపు 40 ఇంటర్వ్యూలు . అందరూ బాగా చేశామనే వారే కాని ఉద్యోగాలు ఇస్తామనే సంస్థలు కనిపించలేదు.

ఈ క్రమంలోనే  విశాఖ తిరిగి  వెళ్లిపోదామని అనుకున్నాను. అదే సమయానికి అత్తయ్య ఫోన్ ఒక్క సారి రా రాదూ అని. దిగులు పడకు నీలా కష్టపడే వాడికి ఉద్యోగం వస్తుంది అధైర్య పడకూ అనేది. మా మాస్టారు మాత్రం ఇన్ని రోజులు ఆగావు ఇంకొన్ని రోజులు ఆగరాదు నాకెందుకో నీకు ఉద్యోగం తప్పక వస్తుంది అనిపిస్తుంది అని ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో ఓ ప్రముఖ చానల్ నుంచి ఇంటర్వ్యూకు రమ్మని సందేశం వచ్చింది.ఈ ఇంటర్వ్యూ కూడా అన్ని సాధారణ ఇంటర్వ్యూ అనుకొనే బయలుదేరాను .

ఇంటర్వ్యూ పూర్తి చేసిన తరువాత ఆ సంస్థ వారు కూడా రెండు రోజులలో చెబుతాము అనే సరికి నిస్సత్తువ ఆవరించింది. బస్సు ఎక్కడానికి డబ్బులేక నడుస్తుంటే ఫోన్‌ మోగింది. మీకు ఉద్యోగం వచ్చింది. ఫలానా రోజు వచ్చి జాయిన్ అవ్వండీ అని చెప్పే పాటికి కలో నిజమో అర్ధం కాలేదు. వెంటనే అమ్మమ్మకు ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిందని చెప్పాను. సరే నాన్న ఇంటికి రారా అందీ.

 

ఇక విషయం కాంతికి చెప్పాలి. తొలి గెలుపు నాదే అని గర్వంగా చెప్పాలి. ఎలాగో ఇంటికి వెళ్లే దారిలోనే వాళ్ల ఊరుకూడా కావడంతో  అక్కడ దిగి ఆ తరువాత ఇంటికి వెళ్దాం అనుకున్నాను. నేను  వాళ్లింటికి వెళ్లే సమయానికి తను లేదు,  కాలేజీకి వెళ్లింది.సాయంత్రం తను వచ్చే దాకా వాళ్లింట్లో కూడా ఎవరికీ విషయం చెప్పలేదు.తను వచ్చిన తరువాత తనూ ఒక్కతే ఉన్న సమయంలో చెప్పాను ఉద్యోగం వచ్చిందని. తన సంతోషం  అంతా ఇంతా కాదు. ఇల్లంతా సెడన్‌గా పండగలా తయారు చేసింది.అక్కడ నుంచి ఇంటికి వెళ్లాను.

గతంలో నేను  ఇంటర్వ్యూలకు హాజరైన మరో రెండు చానల్స్ వారు కూడా మీరు సెలక్ట్ అయ్యారు అని ఫోన్ చేశారు. అమ్మమ్మ మాత్రం మొదట నీకు దేనిలో అవకాశం వచ్చిందో దాన్లోనే జాయిన్ అవ్వురా అంది. కొత్త ఉద్యోగం, ఫ్రెండ్స్‌తోనే హైదరాబాద్‌లో రూం. పగలంతా ఆఫీసు పని, రాత్రి అయితే గానా.భజానా.ప్రపంచంలోని అన్ని అంశాలపై నా మిత్రులతో చర్చలు సాగేవీ. కాని ఉద్యోగాన్ని మాత్రం ఏనాడు నిర్లక్ష్యం చెయ్యలేదు.నేర్చుకోవాలి అన్న తపన. కెరియర్‌లో గెలవాలి. ముఖ్యంగా కాంతితో పందెం ఎట్టి పరిస్థితులలోనూ గెలవాలి. పైగా ఇష్టపడ్డ ఉద్యోగం ఎంత కష్టంగా ఉన్నా చెయ్యాలని ప్రయత్నిస్తుండటంతో త్వరలోనే విశ్వనాధ్ బాగా పనిచేస్తాడూ అనే గుర్తింపు ఆఫీసులో వచ్చింది . ఇలా కాలం జరిగిపోతుంది అనుకునే సమయంలో ఓ రాత్రి 11.30 సమయంలో మంచి పార్టీ మూడ్‌లో ఉండగా కోదాడ అత్తయ్య నెంబరు నుంచి కాల్ వచ్చింది..

రాత్రి సమయంలో ఏదో ప్రెస్‌ అయి వచ్చి ఉంటుందిలే అని లైట్ తీసుకున్నాను. కాని పదే పదే ఫోన్ మోగుతుండటంతో  ఫోన్ లిఫ్ట్ చేశాను. నేనూ కాంతిని .ఏం చేస్తున్నావ్ అనే ప్రశ్న.  టైం ఎంత అయిందో చూశావా. ఈ టైంలో నువ్వు ఫోన్ చేయడం మంచిది కాదు. ఏదైన ఉంటే ఉదయం మాట్లాడదాం అన్నాను. నాకు నీతో మాట్లాడాలని ఉందీ అంది. ఇంతకీ  ఏం చేస్తున్నావు అనే ప్రశ్న. నేను పార్టీలో ఉన్నాను తరువాత చేస్తాను అన్నాను. ట్యూబ్ లైట్  ఆడపిల్ల అర్ధరాత్రి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని అంటుందంటే తరువాత కాల్ చేస్తానంటావేరా ఫూల్ అంది. అప్పుడు కాని అర్ధం కాలేదు తను నన్ను ఇష్టపడుతుందని.

అలా మొదలైన మాటల ప్రవాహం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతుంది. త్వరగా జీవితంలో స్థిరపడు బాబు అనే మాటే ఎప్పుడూ చెప్పేది. నేను నీకిచ్చే గిఫ్టే అదే అనేది. తనని గెలవాలి.తనని గెలిస్తే నా కెరియర్‌లో నేను అనుకున్న లక్ష్యాలను మరింత త్వరగా గెలుస్తాను. అలాగే నేను స్టార్ట్ చేద్దామనుకున్న ఎన్జీవో లాంటి విషయాలు గురించి ఎప్పుడూ మాట్లాడే వాళ్లము. తన కోసం..తనను దక్కించుకోవడం కోసం, మరింత కష్టపడటం ప్రారంభించాను.నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నా ఉద్యోగం అంటే నీకంటే ఎక్కువ ఇష్టం అని ఎప్పుడూ చెప్పేవాడిని.

ఇలాంటి సమయంలోనే కోలుకోని దెబ్బ తగిలింది. నాకు ఉన్న ఒకే ఒక్క తోడు మా అమ్మమ్మ సడెన్‌గా కాలంచేసింది. ఏం చేయలో అర్ధం కాలేదు.ఏం జరిగినా నేనున్నాను అనే ధైర్యం. నా మనవడు తప్పు చేయడూ అనే భరోసా రెండు లేకుండా పోయాయి. పసిగుడ్డు నుంచి నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా నా వ్యక్తిత్వాన్ని రూపొందించిన అమ్మమ్మ శాశ్వతంగా దూరమైంది. ఒక్కసారిగా ఒంటరిని అయ్యానే అనే ఫీలింగ్. అమ్మమ్మ చనిపోయినప్పుడు ఎందుకో నా కంటి నుంచి నీరు రాలేదు.

కానీ మూడు రోజుల తరువాత బయట నుంచి వచ్చి మామ్మ ఆకలవుతుంది అన్నం పెట్టూ అనే సందర్భంలో ఖాళీగా ఉన్న ఇల్లు. అమ్మమ్మ ఫొటో ముందు వెలుగుతున్న దీపం కనిపించింది. అమ్మమ్మ నాకు లేదు కదా అని బాగా ఏడ్చాను. అదే రోజు రాత్రి ఫోన్ చేసింది కాంతి. విశ్వం ఏం కాదు నేనున్నాను నీకు అధైర్యపడకూ అని అమ్మమ్మలా ఓదార్చింది. అప్పుడే అనుకున్నాను జీవితంలో తనను మాత్రం మిస్ కాకూడదని.

కానీ మనం అనుకున్నవి అన్ని జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. మా విషయం వాళ్లింట్లో తెలిసింది. విశ్వానికి ముందు వెనుకా ఎవ్వరూ లేరూ అలాంటి వాడికి మా  అమ్మాయిని ఎలా ఇస్తాం అని అన్నారట వాళ్లింట్లో వాళ్లు. తను కూడా ఆ సమయంలో తను అక్కడే ఉన్నా ఏమీ మాట్లాడలేదు. వారం పాటు నేను ఫోన్ చెయ్యలేదు తను చేసినా ఎత్తలేదు. డైరెర్ట్‌గా అడిగేసింది ఎందుకు నన్ను ఎవైడ్‌ చేస్తున్నావు. నేను అనాధను నాకు ఎవ్వరూ లేరు కదా, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అన్నాను సీరియస్ గా.. నేనుండగా నువ్వు అనాధవు ఎందుకు అవుతావు విశ్వం అప్పుడు పరిస్థితి వేరు అని సర్ధి చెప్పింది. మళ్లీ మా మాటల శికార్లు జోరందుకున్నాయి. మా విషయం అందరికి తెలుస్తుంది. వాళ్లింట్లో నేనంటే కోప్పడే వారి సంఖ్య పెరుగుతుంది. కాంతికి వాళ్ల నాన్నంటే చాలా ఇష్టం.నా విషయం తెలిసే సరికి ఆయన తనతో మాట్లాడటం మానేశాడు.

పైగా ఇంట్లో అందరూ తననో దోషిగా చూడటం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడటం లేదని వాళ్ల నాన్ననే అడిగింది కాంతి. నువ్వు పెద్ద దానివి అయిపోయావు  నీ స్నేహాలు అన్ని మాకు తెలుసూ అని. ఇదే సమయంలో తను నాతో మా ఇంటికి వచ్చింది..ఈ విషయం కూడా తెలియడంతో గొడవ బాగా ముదిరింది. కొంత మంది చెప్పుడు మాటలు చెప్పే వారు నా మీద మరి కొన్ని చెప్పడంతో దాదాపు రెండు నెలలు తనతో వాళ్ల నాన్న మాట్లాడలేదు. ఏం కాదు కాంతి అన్ని సర్ధుకుంటాయి అని నేను సర్థి చెప్పేవాడిని. కానీ వాళ్లింట్లో పరిస్థితి మరీ చేజారింది. కనీసం తను చెప్పేదీ వినకుండా చెయ్యి కూడా చేసుకొని, నేను కావాలా వాడు కావాలా తేల్చుకో అన్నారు వాల్లింట్లో వాళ్లు. ఈ గొడవ పెద్దది అయింది. తనపై నిఘా. వాళ్లింట్లో మాట్లాడే వాళ్లే లేకుండా పోయారు తనకు. ఆ ఒత్తిడి తనూ భరించ లేకుండా పోయింది.

నాకు ఫోన్ చేసి నా జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు అని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. నాకు రావాల్సిన ప్రమోషన్ క్యాన్సిల్ అయిందన్న కోపంలో నేనూ అంతే సీరియస్‌గా రెస్పాండ్ అయ్యాను. జీవితాలతో ఆడుకోవాల్సిన అగత్యం నాకు లేదు.  నీకు ఇష్టం ఉంటే మాట్లాడూ లేకపోతే మాట్లాడటం మానెయ్.  ప్రతి సారి ఏదో ఒకటి అనడం ఆ తరువాత సారీ చెప్పడం నీకు అలవాటు అయింది. నీ అంతట నువ్వు ఫోన్ చెసే దాకా ఫోన్ చెయ్యను అన్నాను. ఒక వైపు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నోటి నుంచి ఏ మాటలు వినకూడదని అనుకున్నానో అదే మాటలు  విన్నాను. ఏ కెరియర్‌లో అయితే గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నానో దానిలో ఎదురు దెబ్బ. మరింత కసి పెరిగింది. బంధువులు, బంధాలు వాటన్నింటిని వదిలేశాను. తన ఆలోచనలు దూరం చేసుకోవడానికి  దాదాపు 18 గంటలు ఆఫీసులో గడిపేవాడిని. ఇదే సమయంలో ఆఫీసులో మాత్రం మరీ పని రాక్షసుడిగా మారావు కాస్త అరోగ్యం గురించి పట్టించుకో అని ప్రేమ పూర్వక సలహాలు ఇచ్చేవారు నా అత్మీయులు. ఇలా సంవత్సరం గడిచింది.

తెలంగాణ  ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులలో నాకు ఉస్మానియా యూనివర్సిటీలో డ్యూటీ. రూంలో నుంచి డ్యూటీకి వెళ్లే ఎప్పుడు వస్తానో తెలీదు. రాత్రి బాగా లేటైన బడలిక ఉదయం 10.00 దాకా నిద్ర పొతూనే ఉన్నాను. నిద్రా భంగం చెస్తూ  కాంతీ కాల్ చేసింది. విషయం చెప్పు అన్నాను సీరియస్‌గా. నీకో గుడ్ న్యూస్ చెబుతాను అంది. అదే టైంకి మా చానల్ సీఈవో దగ్గర నుంచి కాల్ వస్తుంది .కాంతీ ఫోన్ కట్ చేశాను. సార్ డైరెక్ట్‌గా చెప్పారు. నీ సేవలను కంపెనీ యాజమాన్యం గుర్తించింది.  నిన్ను రాజమండ్రి ఇన్‌ఛార్జిగా ప్రమోషన్  ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లుగా చెప్పారు.  ఇమ్మిడియట్‌గా అక్కడ జాయిన్ అవ్వాలి అన్నది కూడా చెప్పారు.

కాంతి మళ్లీకాల్ చేసింది. ఏటా గుడ్ న్యూస్ అన్నాను. నాకు ఎంబీఏ సీటు హైదరాబాద్‌లో వచ్చింది అంది, ఇకపై నిన్ను విడవనూ అంది. నాకు నీ మీద రెండో గెలుపు వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పాను. తనే అడిగింది ఎక్కడకు ట్రాన్స్ ఫర్ అని రాజమండ్రి అని చెప్పాను. కావాలని నా నుంచి దూరంగా వెళ్తున్నావు కదా అంది, కాదు గెలవడానికి దూరంగా వెళ్తున్నాను అన్నాను. ఏమనుకుందో కాని ఫోన్ కట్ చేసింది తను. రాజమండ్రి వెళ్లడానికి ఆఫీసులో 3 రోజుల టైం ఇచ్చారు. ఈలోగా అత్తయ్యే ఫోన్ చేసింది. విశ్వం మావయ్యకు జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. పైగా నువ్వు సమాజ సేవా, ఎన్జీవో అంటూ ఉంటావు వాటినీ అన్ని వదిలేసీ, నువ్వు జాబ్ మార్చుకునే ప్రయత్నం చేస్తే ఎలా గైనా మావయ్యను ఒప్పిద్దాంరా అంది . ప్రాణంలా ప్రేమించే ఉద్యోగం. జీవితంలో గెలవాలనే  ప్రేరణ ఇచ్చిన అమ్మాయి. నా ఓటు మాత్రం నా కెరియర్‌కే వేశాను.

కోదాడ అత్తయ్యతో క్లియర్‌గా చెప్పాను ఎవ్వరి కోసం నా పద్ధతులు నేను మార్చుకోను, నా చిన్నప్పటి కలా జర్నలిస్ట్ అవ్వడం దానికోసం నేను ఎవ్వరినైనా ఒదులు కుంటాను అన్నాను. అత్తయ్య ఈ విషయం కాంతికి చెప్పిందంటా. తనూ ఇంకా సీరియన్ అయింది. నీ ఉద్యోగం చేసే విలువ నేను చెయ్యనా అందీ. గెలుస్తున్నాని విర్రవీగూ. అందరినీ వదిలేసి నేను గెలిచాను అని వెనక్కు తిరిగి చూసే సమయానికి నీ గెలుపు తప్ప నీ వాళ్లు ఎవ్వరూ నీ వెనుక ఉండరూ అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది.

 

ఇక రాజమండ్రి నా ప్రయాణం ప్రారంభమైంది. మార్గమధ్య ప్రయాణంలో ఫోన్ చేసింది. నేను కలుస్తాను నిన్ను అని. బస్టాండ్‌లో ఆగుతాను. వస్తే కలుస్తాను అన్నాను. గంట సేపు కోదాడ బస్టాండ్‌లో వెయిటింగ్,  తను రాలేదు. నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బస్సులో ఎక్కేశాను. దూరంగా వస్తూ కనిపించింది. నేను బస్సు దిగలేదు. చివరి అవకాశం తెంపుకున్నానో, తెగిందో తెలియదు కాని తన నుంచి దూరంగా బయలుదేరాను. ఆ తరువాత కాంతి ఫోన్ చేయలేదు. నేనూ ఫోన్ చేయడానికి ప్రయత్నించలేదు.

కాని మా కామన్  బంధువులు కాని, స్నేహితులు కాని మమ్మల్ని కలపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రదేశం. కొత్త బాధ్యతలు.  గెలవాలి. కొత్త ప్రదేశాలు చూడాలి. బైక్ తీసుకున్నాను. ప్రయాణాలు చెయ్యాలనే నా ఇష్టానికి..చెస్తున్న ఉద్యోగం సహకరించడంతో ఒకటే తిరుగుడూ. చెయ్యాలనే తపన రాజమండ్రిలో దూసుకెళ్లేలా చేసింది. ఓ రోజు సైట్ సీయింగ్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. చావు తప్పింది కాని ఒకటే దెబ్బలు. మా కామన్ ఫ్రెండ్ నాకు యాక్సిడెంట్ అయిన విషయం తనకు ఫోన్‌లో చెప్పింది. అదే కాల్‌లో నేను కాన్ఫరెన్స్‌లో ఉన్నాను. నిజంగా విశ్వంకు యాక్సిడెంట్ జరిగిందా లేక డ్రామా నా. నువ్వే  అతడితో మాట్లాడించడానికి కావాలని ఇలా చెబుతున్నావు కదా. నా జీవితంలో అతడితో మాట్లాడనూ అని అందీ. యాక్సిడెంట్ జరిగిన పెయిన్ కంటే తను అన్న మాటలు ఇంకా బాధనిపించాయి.

ఉన్న ఒక్కగానొక్క ఆశ పోయింది. నా జీవన ప్రయాణంలో నాకు దక్కిన అద్భుత సాంగత్యం కాంతి, తన మజిలీ వచ్చింది దిగిపోయింది. నా ప్రయాణం కొనసాగించాలి అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. మరో వైపు వాడిని అలా వదిలేస్తే మరింత అరాచకంగా మారతాడు. పెళ్లి చేసుకో అని మిత్రులు, బంధువుల వద్ద నుంచి విపరీతమైన ఒత్తిడి పెరిగింది.  తన దగ్గర నుంచి స్పందన ఎలాగో లేదు. నువ్వు ఎందుకు ఒంటరివి అవుతున్నావు అనే ప్రశ్నలే..  దీంతో  ఫ్రెండ్స్, బంధువులకు కూడా ఫోన్  చేయడం మానేశాను. ఇదే క్రమంగా గతంలో మానేసిన క్రికెట్ ఆడటం,  కవితలు రాయడం, పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను తిరగడం ఇలాంటి నా హాబీలను మరింత పదును పెట్టుకుంటున్నాను. ఏది ఆగినా కాలం ఆగదూ కదా. మరో సంవత్సరం గడిచింది.

 

నా ప్రాణమిత్రుడు లవ్ మ్యారేజీ చెయ్యాలి, మతాంతర వివాహం..అవతలి వాళ్లు మాకోసం గట్టిగానే వెతుకుతున్నారు, ఆ క్రమంలో తిరుపతి ప్రయాణం. నా మిత్రుడిని వాడి ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వెళ్లా, అప్పుడే మళ్లీ తన కాల్ . ఏం జరిగినా ఈ సారీ నిన్ను విడవనూ విశ్వం అందీ.మళ్లీ మాటల ప్రవాహం సాగుతుంది. సెడన్‌గా మా మేనత్త నీకో సంబంధం చూశాను నువ్వు రావాలి అంది.

అదే విషయం కాంతితో చెప్పాను. ఏం చెద్దాం..నేను నీ కోసం ఎంత కాలం అయిన వెయిట్ చెస్తాను అప్పటికైన నన్నే పెళ్లీ చెసుకుంటాను అనే గ్యారెంటీ ఇస్తావా. మీ నాన్నతో మన గురించి మాట్లాడతావా. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని తనకే  నిర్ణయం వదిలిపెట్టాను. వారం గడిచింది, రెండు వారాలు గడిచాయి తన దగ్గర నుంచి సమాధానం రావడం లేదు.

నేనే కాల్ చేశాను. నీతో మాట్లాడలేనూ విశ్వం. నన్ను వదిలేయ్ అని ఎస్ఎంఎస్. అలా కాదూ కనీసం నీ సమస్య చెప్పు అంటే. నిన్ను చేసుకుంటే ఇంట్లో చచ్చిపొతామంటున్నారు, మా నాన్నకు నువ్వు ఇష్టం లేదు, అయన్ను కాదని నేను ఏమీ చెయ్యలేను అంది. మన ఇద్దరం  కూర్చొని మీ నాన్నకు నచ్చజెబుదాం అసలు ప్రయత్నించకుండా ఓటమిని ఎలా ఒప్పుకుంటావు నువ్వు అన్నా. ఎంత సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా నేను మా నాన్నతో ఈ విషయం మాట్లాడలేనూ, మా నాన్న ఎవరిని చూపిస్తే వారితోనే నా పెళ్లి అని తేల్చింది. పోనీ నేను మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడనా అంటే వద్దూ అంది. నా ఆశల సౌధం కూలిపోయింది.

తొలిసారి నా ప్రమేయం లేకుండా నేను చేస్తున్న పోరాటంలో ఓడిపోయాను. నా బలం అనుకున్న వ్యక్తే నా ఓటమికి కారణం అయ్యింది. నా కమిట్‌మెంట్స్ నావి, తన అనుబంధాలు తనవి. సరే నీ ఇష్టం ఎక్కడికి వెళ్లాలో నీకు తెలిసినప్పుడు ఎలా వెళ్లాలో నేను ఎలా చెబుతాను. నీ జీవితానికి ఏదీ మంచిది అనుకుంటే అదే నిర్ణయం తీసుకో. ఎవ్వరికోసమో నీ నిర్ణయాలను మార్చుకోకు. నీ జీవితం నీది అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

తను లేని ఆలోచనలకు దూరంగా వెళ్లడానికి విశ్వప్రయత్నం చేశాను. ఇదే క్రమంలో విశాఖ ప్రమోషన్ మీద పంపారు ఆఫీసు వారు. అక్కడే పెళ్లయింది. నా పెళ్లికి కాంతి వాళ్ల కుటుంబ సభ్యులు అంతా వచ్చారు. ఆ తరువాత కాంతీతోనే కాదు వారి కుటుంబ సభ్యులతోనూ 4 సంవత్సరాలుగా పలకరింపులు లేవు. ఏదైనా ఫంక్షన్లలో కలిస్తే మొహమాటానికి పలకరించడం తప్ప మాట్లాడింది లేదు. బంధువులు కొందరు కనీసం వాళ్లతో మాట్లాడొచ్చు కదా అన్నా నేను వినలేదు.

 

మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లినప్పుడు నా  భార్యకు మీ కోదాడ పెద్దమ్మ ఫోన్ చేసింది. కాంతికి పెళ్లంటా అని చెప్పాను. అర్జంట్ పని ఉండి నేను వెళ్లిపోయాను. రాత్రి నా  అర్ధాంగి అడిగింది వెళ్తున్నారా  పెళ్లికి అని, మరో ఆలోచన లేకుండానే లేదు అన్నాను. అప్పుడు నా అర్ధాంగి అంది, మీకు ప్రేమ పేరుతో చంపేసే వాడికి పెద్ద తేడా ఏముంది చెప్పు అనీ. అదేమిటీ అలా అన్నావు అంటే అప్పుడు చెప్పడం ప్రారంభించింది.

వాడేవడో ప్రేమించడం లేదని చంపేశాడు. కాని నువ్వు నిన్ను ప్రేమించిన వారి అనుబంధాన్ని చంపేశావు. నువ్వే చాలా సందర్భాలలో చెప్పావు పెద్దమ్మ నిన్ను సొంత కొడుకులాగా చూసుకుంటుంది అంది. వాళ్లందరూ నిన్ను సొంత మనిషిగా చూసుకుంటారు, కానీ నువ్వు నీ పెళ్లి అయిన దగ్గర నుంచి వారితో సంబంధాలు కట్ చేసుకున్నావు. వాళ్ల ఫీలింగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్లను కావాలని దూరం పెట్టావు. నీ చెల్లి పెళ్లిలోనూ కనీసం ఏదో మొహమాటానికి మాట్లాడావు, కానీ ఇదివరకులాగా మాట్లాడలేదు. వాళ్ల అనుభందాన్ని ఇన్నాళ్లు చంపేశావు కదా అన్నది.

ఎప్పుడు సైలెంట్‌గా. నా అభిప్రాయాలకు ఏ మాత్రం ఎదురు చెప్పని నా భార్య, ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. మళ్లీ నా  ఉషానే అందీ, నువ్వో ఎన్జీవోను నడుపుతున్నావు, జర్నలిస్ట్‌గా మంచి చెప్పగలిగిన ఉద్యోగంలో ఉన్నావు. ఎన్నో ఆదర్శాలు పాటిస్తావు. కాని కోదాడ పెద్దమ్మ విషయంలో ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నావు. గతంలో నీ చుట్టూ అందరూ బంధువులు ఉండే వారు, వారందరినీ వదిలేసి విశాఖ వచ్చేశావు. కనీసం ఫోన్ కూడా చెయ్యడం లేదు. వాళ్లు ఎంత బాధపడతారు. నిన్నటి దాకా తమలో ఒకడిగా ఉన్న నీవు, కారణం లేకుండా  శిక్ష వేస్తున్నావు అందీ. కేవలం నా అభిప్రాయం చెప్పాను. నీకు అంతా తెలుసు నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పి దుప్పటి ముసిగేసింది. నాలో అంతర్మధనం ప్రారంభమైంది. నా పంతం కోసం ఇన్నాళ్లు నా అనుకున్న వాళ్లను చాలా బాధ పెట్టాను అనుకున్నాను. తనని మర్చిపోయాను అని చెప్పను కానీ నా జీవితంలో ఎదగాలనే కసిని రగిల్చింది మాత్రం తనే. గెలవానే స్ఫూర్తి నింపింది తనే.ఇప్పటికీ అదే చెబుతాను తను ఆ రోజు నాతో పందెం కట్టకుండా ఉంటే నేను ఎక్కడ ఉండే వాడినో.!

ప్రేమ మనం ప్రేమించిన వ్యక్తి బాగు కోరుకోవాలి కాని, మనల్ని ప్రేమించే వారు బాధపడటం కాదు కదా మనకు కావాల్సింది అనుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఉదయమే అర్జంట్ పని ఉందని వెళ్లిన నేను రాత్రి దాకా రాలేదు. రాగానే రెండు టికెట్లు తన చేతిలో పెట్టాను కోదాడ పెళ్లికి వెళ్లోచ్చేయ్ అన్నాను..అదోలా చూసి నువ్వు మారవు..సైకోవి అని వాళ్ల పుట్టిల్లు కూడా కోదాడే కావడంతో పెళ్లీ వంకతో వెల్లడానికి బట్టలు సర్ధుకుంది.

~

 

ఆ జలగండం గుండె కింద కాస్త తడి!

vijays picture[విజయ్ గజం ,ఆంధ్రా యూనివర్సిటీ లో జర్నలిజం పట్టా పుచ్చుకొని వృత్తి రీత్యా ప్రస్తుతం  TV 10 హైదరాబాదు బ్రాంచ్ లో వర్క్ చేస్తూ ఫేస్బుక్ ద్వారా అడపాదడపా తన ఉత్తేజభరితం అయిన కవితలతో సాహితీ రంగం కి ఇపుడిపుడే తన చమక్కులు  అందిస్తున్న  విజయ్   గారు మొదటి సారిగా తన పూర్తి హుదుద్ అనుభవాలని  కథన రూపంలో మనతో పంచుకుంటూ ఇలా .]

 

 

 

అప్పుడప్పుడు అనిపించేది వెన్నెల వెలుగులో డాబా మీద పడుకోవాలని. చిన్నతనం లో లాగా పిల్లలకు తాతలు, అమ్మమ్మలు కథలు చెపుతుంటే వినాలని. కానీ ఈ రాకెట్ వేగం ఆధునిక యుగం లో ఇదంతా అత్యాశ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైన నేటి రోజుల్లో ఆత్మీయతలు, అనురాగాలు కొనుక్కునే నేటి రోజులలో ఇదంతా అత్యాశే.

నిజం గా ఎంత సంతోషం కరెంట్ లేని ఆ రోజుల్లో సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రావడం తోనే పుస్తకాలు విసిరేసి దోస్తులతో ఆడుకోడానికి వెళ్ళిన రోజులు. తుంటరి పనులు చేసి దెబ్బలు తిన్న రోజులు.ఇదంతా ఒక పచ్చని జ్ఞాపకం. చాలా సార్లు అనిపిస్తుంది .నేటి తరం పిల్లలు ఏం మిస్ అవుతున్నారో కదా అని. చికెన్ కోసం కోళ్ళను తయారు చేసినట్లు గుమస్తా గిరి ఉద్యోగాల కోసం నేటి తరం పాకులాడుతున్నారు అని ,కానీ అలాంటి అవకాశమే వరుసగా పది రోజుల పాటు వస్తే వినడానికి అత్యాశే అయినా ఇది నిజం గా హుదూద్ తుఫాన్ పుణ్యమా అంటూ ఈ అవకాశం లభించింది.

ఇప్పటి జనరేషన్ రిపోర్టర్ ఉద్యోగం .క్షణం తీరిక ఉండదు ,దమ్మిడీ ఆదాయం ఉండని ఉద్యోగం. ఎప్పుడు ఏం జరుగుతుందో దేని నుంచి ఎలాంటి వార్త రాబట్టుకోవాలో అని గోతి కాడ నక్కలా వార్తల కోసం కాపుకాసే ఉద్యోగం నాది.అందరికీ పండుగలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటుంటే అత్యవసర ఉద్యోగాలు చేసే మాలాంటి వాళ్ళకు కుటుంబ సభ్యులందరితో చేసుకోడం ఎప్పుడో కలిగే అదృష్టం అనుకోవాలి.

సరే , విషయంలోకి వస్తే అక్టోబర్ నెల అనగానే తుఫానుల నెల అన్న పేరు ఎలాగో ఉంది దసరా దాటినా ఈసారి  అలాంటి వార్తలు ఇంత వరకు ఏదీ రాలేదు.గత సంవత్సరం ఈ సమయానికి హెలెన్ తుఫాన్ తీరం దాటింది.ఈ సంవత్సరం ఇంతవరకూ ఏదీ లేదు అని చూస్తున్న మాకు దిమ్మ తిరిగి పోయే వార్తను తుఫాను హెచ్చరికల కేంద్రం తెచ్చింది.హెలెన్ కంటే 20 రెట్లు పెద్దదైన తుఫాను బంగాళా ఖాతం లో ఏర్పడిందని సమాచారం. తీరం దాటే సమయం లో కనీ వినీ ఎరుగని ఉపద్రవం వస్తుందని అక్టోబర్ తొమ్మిదవ తేదీ అధికారులు పూర్తి స్థాయి  సమాచారం అందించారు. విశాఖ నగరం కేంద్రం గా ఈ తుఫాను కేంద్రం దాటుతుందని చెప్పారు. ఇంకేముంది చేతి నిండా పని.తుఫాను అనంతరం కూడా దాదాపు పది రోజుల పని ఉంటుందని ఊహించాను.నన్ను నేను నిరూపించుకునేందుకు వచ్చిన మరో అవకాశం.”పోరాడుతూ ఉండు. గెలుస్తామో , మరణిస్తామో కానీ నువ్వు వదిలిన జ్ఞాపకం వేలాది మందికి సంతృప్తినిస్తుంది” అన్న చే మాటలు నన్ను ముందుకు ఉరికేలా చేసాయి.

అక్టోబర్ 11 ఉదయం ఒక సాహితీ వేత్తను ఇంటర్వ్యు చేసేందుకు వెళ్ళే సమయానికి తుఫాను ప్రభావం కనిపిస్తుంది. గాలి వేగానికి నా పాత హీరో హోండా ముందుకు దూకనంటుంది.నా మనస్సాక్షికి తెలుస్తుంది ఏదో పెద్ద విపత్తు సంభవిస్తుందని. విశాఖ సిటీ లో కంటే విశాఖ రూరల్ లో ముఖ్యం గా గ్రామాలకు వెళితే బాగుంటుదని హెడ్ ఆఫీస్ కు చెప్పి ఇంటికి వెళ్ళి ఒక జత బట్టలు, ఒక రెండు పుస్తకాలు తీసుకుని మా కెమెరామెన్ తో కార్ లో బయలు దేరాను.విశాఖ నుండి 60 కిలోమీటర్ ల దూరం లో వస్తుంది పుడిమడక గ్రామం. పూర్తి మత్స్య కార గ్రామం.

విశాఖ నుండి నేను అక్కడికి వెళ్ళే సరికి సాయంత్రం 5 అయింది. ముందు పుడి మడక తీరం దగ్గరికి వెళ్ళాను.అప్పటికి చాలా ప్రశాంతం గా ఉంది గ్రామం. తుఫాను దృష్ట్యా ప్రభుత్వ అధికారులు మత్స్య కారులను పునరావాస కేంద్రాలకు రావాలని ఎంతో నచ్చచెపుతున్నారు.”నాను గంగ పుత్రుడుని ,గంగమ్మ తల్లి నాకేటి సేత్తది ,తుఫాను గురించి నువ్వు మాకు చెప్పొచ్చావేంటి వెళ్ళెళ్ళవోయి” అంటూ మత్స్య కారులను గ్రామం నుండి ఖాళీ  చేయిస్తున్న  అధికారులకు మాటలు వినిపించాయి.మేము అధికారులకు, మత్స్య కారులకు మధ్య లో దూరితే మా పనికి ఆటంకం అని మా పనిలో మునిగిపోయాము.విశాఖ జిల్లా అధికారులు 11 వ తేది సాయంత్రం 7 నుండి 12 వ తేదీ ఉదయం 9 వరకూ జాతీయ రహదారి పై ఎటువంటి వాహనాలు తిరగకూడదని హెచ్చరికలు  జారీ చేసారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను తుఫాను తీవ్రత గురించి మా హెడ్ ఆఫీస్ కు సమాచారం ఇచ్చి నాకు కొంత అదనపు ఎక్విప్మెంట్ కావాలని కోరాను. ఎందుకో వారు అంతగా పట్టించుకోలేదు.ఒక వైపు తుఫాను అన్ని ఆధునిక ఆయుధాలతో ఉన్న సైనికుడిలా యుద్దానికి వస్తుంటే నాకు మాత్రం ల్యాప్ ట్యాప్ తో పాటు ఎప్పుడు బ్యాలన్స్ అయిపోతుందో తెలియని డాంగిల్ ఇచ్చి పంపారు మా హెడ్ ఆఫీస్ వాళ్ళు.

రాత్రి 9 కల్లా చెయ్యాల్సిన పనులు చేసేసి మా అచ్యుతా పురం రిపోర్టర్ విజయ్,మా కెమెరామెన్ రాజశేఖర్, డ్రైవర్ రిలాక్స్ గా ఉన్నాం.హోటల్ రూంస్ ఖాళీ లేకపోతే ఒక చిన్న బ్యాచిలర్ రూం లో అడ్జస్ట్ అయ్యాము. రాత్రి 12 గంటల నుండి స్టార్ట్ అయ్యింది గాలి తీవ్రత. ఇన్ టైంలో హెడ్ ఆఫీస్ కు విజువల్స్ పంపాలన్న తపన. ఎలాగో పని కానిచ్చేసి రెస్ట్ తీసుకునే సమయం లో ఒకటే గాలి. అసలే రేకుల షెడ్డు కావడం తో డమ డమ సౌండ్.ఎలాగో ఉదయాన్నే లేచి మా స్థానిక రిపోర్టర్ విజయ్ కు ఫోన్ చేస్తే వాతావరణం చాలా ప్రశాంతం గా ఉందనీ..ఎందుకు అక్కడికి అనీ అన్నారు.కానీ నాకు తుఫాను ముందర ప్రశాంతత ఇదే అనిపిస్తుంది.పద వెళదాం అని పుడి మడక మా టీం అంతా బయలు దేరాం. ఇక చూడాలి సడెన్ గా గాలి, వర్షం.పుడిమడక తీరం లొనే గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనంత ఉధృతం గా కెరటాలు వస్తున్నాయి.

1413181594hudhud-toofan

మా కళ్ళ ముందే ఒక కెరటం లో మత్స్యకారుల  బోట్లన్నీ కొట్టుకుపోసాగాయి.ఓ కెరటం నన్ను తాకేలోగా మా అచ్యుతాపురం రిపోర్టర్ విజయ్ నన్ను లాగేసాడు.అక్కడి నుండి మళ్ళీ  అచ్యుతా పురం వచ్చేసాము. అధ్భుతమైన  విజువల్స్ తీసాడు మా కెమేరామెన్ రాజ శేఖర్.ఆ విజువల్స్ ను హైదరాబాద్ పంపగలిగితే మేము తుఫాన్ కవరేజీ లో టాప్.అదే సమయానికి సరిగ్గా మా ఇంటర్ నెట్ డాంగిల్ నేను పని చేయను…ఏం చేస్తారు తమరు అని ఎగతాళి చేసింది.ఏం చెయ్యాలి? ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలి..కొంతమంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి నా పని ద్వారా అన్న కసి తప్ప మరేం కనిపించడంలేదు నాకు.అప్పటికి సమయం ఉదయం 9. 60 కిలోమీటర్ లు. గట్టిగా అయితే విశాఖకు గంటలో వెళ్ళిపోతాము. ఇక నేనే గెల్చినట్లు.మా కార్ డ్రైవర్ బాబ్జీ ని పదండి విశాఖ కు వెళదాం అన్నాను.

కానీ గాలి ఎక్కువగా ఉందని మా రిపోర్టర్ విజయ్ వద్దన్నారు. “ధైర్యే సాహసే లక్ష్మీ” అనుకుని బయలు దేరబోయాను. మీకు పెళ్ళయిందా గుర్తుందా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నా అర్ధాంగి.నిజమే నాకు పెళ్ళయింది. ఈ వర్షం లో తని ఇంట్లో ఒక్కతే ఎలా ఉందో అసలే సముద్రం ఎదురు ఇళ్ళు.పక్కన ఎప్పుడు వచ్చే చిన్న పాప స్వాతి అయినా దగ్గర ఉందో లేదో అన్న సంశయం తో ఫోన్ చేసాను.అనుకున్నదే అయింది. ఫోన్ నాట్ రీచబుల్.

మా డ్రైవర్ ను సాధ్యమైనంత  త్వరగా వైజాగ్ తీసుకెళ్ళమని ఆర్డర్ వేసాను.ఆయనకు ఆర్డర్ వేసాను గానీ పరిస్థితి బాలేదు. అర్దం అవుతుంది. ఇంతలో “సైక్లోన్ కైలాసగిరి ని తాకింది. తూర్పు వైపుగా సాగుతుంది” అని నా సెల్ లో మెసేజ్.అంటే తుఫాన్ కి ఎదురు ప్రయాణం చేస్తున్నామన్న మాట.ఈ విషయం మా కెమేరామెన్ కు గాని, మా డ్రైవర్ కు గానీ చెప్పలేదు.అప్పటికి మేం పరవాడ దాటాము. గాలి తీవ్రత కు మా కారు ఊగడమే కాకుండా అనేక చెట్లు పడిపోతున్నాయి. మా డ్రైవర్ అంతరంగం తెలియలేదు గానీ, ఏం చేద్దాం అన్నట్టు చూసాడు. పోనియ్యగలరా అన్నాను. పోనిద్దాం సర్ అన్నాడు.

ఫాస్ట్ గా వెళ్ళమన్న నేను నిదానం గానే వెళ్ళండి మనం సేఫ్ గా ఉండాలి కదా అన్నాను.ఇంతలో రాజశేఖర్ గారు ఆయన పని ఆయన చేస్తారు గాని, మనం ఒక దగ్గర కార్ ఆపి మాక్ లైవ్ చేద్దాం అన్నారు. సరే అని తీరా దిగుతుంటే రాజశేఖర్ గారు గట్టిగా “మీరు దిగొద్దు. గాలికి ఎగిరిపోతారు” అన్నారు.గాలి తీవ్రత తగ్గిందాక ఉండి ఒక మాక్ లైవ్ చేసే బయలుదేరాం. మళ్ళీ ఇంకో సమస్య.స్టీల్ ప్లాంట్ మీదుగా వెళ్ళాలా?హైవే మీదుగా వెళ్ళాలా?అని. మా డ్రైవర్ ని నిర్ణయం తీసుకోమన్నాను.

వెంటనే లంకెల పాలెం మీదుగా హైవే చేరాము. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటి పోయింది.మొబైల్స్ పని చేయడం లేదు. ఈ జడివాన లో వెళ్ళగలమా అనే అనుమానం అందరికీ.కనీసం నాలుగు కల్లా ఆఫీస్ కు విజువల్స్  చేరితే మా చానల్ కవరేజీ లో టాప్.ఎలాగైనా వెళ్ళాలి అన్న మొండితనం తప్ప మరేదీ లేదు.అయితే హైవే పై గాలి వాన మరీ ఎక్కువ కాసాగింది.ఎంతలా అంటే సరక్ సరక్ మని గుండు సూదుల్లా చినుకులు గుచ్చుతుంటే మాకు మాట్లాడడం రావడం లేదు. మాక్ లైవ్ చేయడం రావడం లేదు.కానీ మళ్ళీ మాక్ లైవ్ చేసే బయలు దేరాము. దారిలో అడ్డం పడిన చెట్లను నేను, రాజశేఖర్ గారు తప్పిస్తూ ముందుకు సాగాము. ప్రతి సారి మాకు ఎలా వెళ్ళాలి అనేది సమస్య. ఈ సారి నిర్ణయం నేను తీసుకున్నాను.హెచ్.పి. సి.యల్ మీదుగా వెళ్ళండి అక్కడ చెట్లు ఉండవు అని చెప్పాను.నా వైపు అదోలా చూసిన మా బాబ్జీ కారును దూకించాడు. జాగ్రత్తగా విశాఖ చావుల మదం చేరాము.అక్కడ బ్రిడ్జ్ దగ్గర్ నీరు ఎక్కువ గా ఉంది. పోవడం వీలు కాదని చెప్పాడు డ్రైవర్. సమయం 12. ఎలాగైనా ఇంకో గంటలో చేరితే చాలు మా దగ్గర ఉన్న విజువల్స్ పంపేయవచ్చు.నడుచుకుంటూ వెళదామా అంటే దాదాపు రైల్వే స్టేషన్ నుండే 6 కిలో మీటర్లు వస్తుంది. ఆ అవకాశమే లేదు.

కెమెరా కూడా తడిచిపోతుంది. సరే ,కంచర పాలెం మీదుగా ఫ్లై ఓవర్ ఎక్కించండి అన్నాను. మా దురదృష్టం ఎంతలా వెంటాడింది అంటే అక్కడ హై టెన్షన్ విద్యుత్ వైర్లు పడి ఉన్నాయి. ఇక గాలికి ఒక్కసారిగా మా ఎదురుగా ఉన్న హైటెక్ బస్సు లేచి , తిరిగి మళ్ళీ యధాస్థానానికి వచ్చింది . ఇక మనుషులు ఒకరికొకరు గట్టిగా పట్టుకుంటున్నారు. బ్రిడ్జ్ కిందనుండి వెళ్దామని ప్రయత్నిస్తే అక్కడ రైల్వే గేట్ వేసి ఉంది.టైం చూస్తే 1 దాటింది. నాకు ఒక్కసారిగా ఓడిపొయానన్న నిస్సత్తువ ఆవరించింది.ఏం చెయ్యాలో అర్దం కావడం లేదు. ఇంత కష్టపడిందీ ఎందుకు అనిపిస్తుంది.నా పై విమర్శలు చేసిన వారికి సమాధానం చెప్పలేక పోతున్నానే అనిపించి ఒక రకమైన ఆవేదన,నిర్వేదం లో కూరుకుపోయాను.ఈ లోగా మళ్ళీ ఏదో తెగింపు.

మా డ్రైవర్ ను బ్రిడ్జ్ మీదుగా పోనివ్వమన్నాను.మీది ధైర్యమా, మొండితనమా అని మొహం మీదనే అనేసాడు.మా రాజశేఖర్ కూడా వెళ్ళాల్సిందే అనడం తో బయలు దేరాము.అప్పటిదాకా ఆఫీస్ కు రావాలన్న తొందరలో బయట జరిగిన ప్రకృతి నష్టాన్ని పట్టించుకోలేదు. పచ్చదనం తివాచీ పరిచినట్లు ఉండే వైజాగ్ ఇప్పుడు మోడు గా మారింది.ఎక్కడ చూసినా గాలికి ఒరిగిపోయిన ఇళ్ళు.  సర్వం పోయిన బాధలో కొందరుంటే దొరికింది దొరికినట్టు దోచుకుపోయే వాళ్ళు మరి కొందరు. ఎక్కడ చూసినా విరిగి పోయిన వాటర్ ట్యాంక్ లు,  రేకులు, చెట్లు. చివరకు తాటి చెట్ల పాలెం వద్ద ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము. గాలి వీయడం మానలేదు. గట్టిగా నడిస్తే 15 నిమిషాలు. మా కెమెరామెన్ రాజశేఖర్ ను దిగమన్నాను.

గొడుగు ఇచ్చి మీరు ఎలాగోలా ఆఫీస్ కు వెళ్ళి ఫీడ్ ఇవ్వండి అని పంపించాను. నేను మాత్రం నిదానం గా దారిలో తెరిచి ఉన్న ఒక షాప్ లో రెడ్ విల్స్ కొని , గుండె నిండా దమ్ము లాగి ఆఫీస్ కు బయలు దేరాను.అప్పటికి సమయం 2 అయింది.పని చేయని 3జి నన్ను వెక్కిరించింది. ఛీ “ దీనమ్మ బతుకు” ఇంత కష్టపడి వృథా అవుతుందా అనిపించింది. రాజశేఖర్ ఫీడ్ పంపాడు,కానీ నాలో ఓడిపోయాను అనే ఫీలింగ్. ఆఫీస్ ఎదురుగా చెట్లు చూస్తుండగానే ఒరిగిపోతున్నాయి. వాటర్ ట్యాంక్ లు వాటర్ తో సహా ఎగిరి పడుతున్నాయి.మా ఆఫీస్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అప్పుడు సడెన్ గా ఇల్లాలు గుర్తొచ్చింది.తను ఇంట్లో ఎలా ఉందో ? సాయంత్రం 6 గంటలకు చీకట్లు ముసురుకునే సమయానికి అదే భీభత్సం లో విజువల్స్ పంపేసాను.ఇక ఇంటికి చేరాలి. నన్ను నమ్ముకున్న ఆ జీవి ఇంటి దగ్గర ఎలా ఉందో? ఈ గాలి వాన లో వెళ్ళొద్దు అని ఆఫీస్ లో వారిస్తున్నా వినకుండా నడుస్తూనే బయలుదేరాను. సీతమ్మ ధార నుండి చిన వాల్తేర్ 6 కిలో మీటర్ ల దూరం. మామూలుగా అయితే అరగంట నడక.ఇప్పుడున్న పరిస్థితి లో నడుస్తూ వెళితేనే బెటర్ అని బండిని అక్కడే వదిలి బయలు దేరాను.

hudhud-toofan-poor-people

పాత ఈనాడు ఆఫీస్ దగ్గరకు వచ్చే సరికి పరిస్థితి మరీ అద్వాన్నం గా తయారయింది. ఎగిరి వస్తున్న రేకుల షీట్ లను తప్పించుకుని నడక సాగించాను.గాలి అడుగు పడనీయడం లేదు. ఒక షాప్ తెరిచి ఉంచితే క్యాండిల్స్ కావాలి అని 20 రూపాయలు ఇచ్చాను.ఇంకో 10 ఇవ్వమని రెండు మైనపు ప్రమిదలు చేతిలో పెట్టాడు షాప్ వాడు. దోపిడీ అప్పుడే మొదలైందా అనుకుంటూ ముందుకు సాగాను. అదృష్టం ఏంటంటే..సత్యం జంక్షన్ నుంచి మద్ది పాలెం జంక్షన్ వరకు రెండు వరుసలలో లారీ లు ఆగిపోయి ఉన్నాయి.వాటి మద్యలో ఉన్న గ్యాప్ లో చక చకా నడిచాను.రైన్ కోట్ పూర్తిగా తడిచిపోయింది.

సర్రున కోస్తున్న ఈదురుగాలి.నేను ఏ యూ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు ..త్రీ టౌన్ స్టేషన్ మీదుగా చిన వాల్తేర్ వెళ్ళాలి. ఏదైనా వెహికిల్ కనిపిస్తే లిఫ్ట్ అడుగుదామని ఆశ. నా పిచ్చి గాని ఈ గాలి వాన లో ఎవరు బయటికి వస్తారు? ఏ యూ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న చెట్లు కూలిపోయాయి.చిమ్మ చీకటి. మోకాలు లోతు నీళ్ళు. ఆ నీళ్ళళ్ళో చెట్ల కొమ్మలు, కేబుల్ వైర్లు, విద్యుత్ వైర్లు.ఇంజనీరింగ్ హాస్టల్ దగ్గరకు వచ్చే సరికి కాళ్ళళ్ళో పట్టు తప్పింది. కాసే పు ఎలాగైనా ఆగాలి. ఒక 20 అడుగుల దూరం లో ఒక పార్క్ చేసిన పాల వ్యాన్  కనిపించింది. అక్కడకు పరిగెత్తుకెళ్ళి ఒక అయిదు నిమిషాలు గాలి, వాన ను తప్పించుకున్నాను.

అప్పటికి 7 అయింది. త్రీ తౌన్ మీదుగా,సి.బి.ఐ మీదుగా చిన వాల్తేర్ కు నడుస్తున్నాను.చూస్తే నాపక్కనే ఒక 50 సంవత్సరాల వ్యక్తి నడుస్తున్నాడు. అతను జారిపోబోతే పట్టుకున్నాను. అతను శానిటరీ ఇంజనీర్ అట. వెహికిల్ , వాకీ టాకీ పాడయ్యాయని చెప్పాడు. ఇద్దరం ఒకరి చేయి ఒకరం  పట్టుకున్నాము. ఆ పెద్దాయన మనిషికి మనిషి తోడు అంటే ఇదేనేమో అన్నాడు.నేను వేగం గా నడుస్తూ కరెంట్ వైర్ తగిలి పడిపోబోయాను. ఆయన పట్టుకున్నారు. అప్పుడు అనిపించింది ఆయన చెప్పింది మానవత్వం అని. ఆయన ఇళ్ళు వచ్చింది. వెళ్ళారు. నేను నడుస్తూనే ఉన్నాను.

మా వీథి లో చెట్లు ఉండవు గానీ రేకుల ఇళ్ళు ఎక్కువ. ఎటు చూసినా విరిగిన రేకుల ముక్కలే కనిపించాయి.అలాగే ఇంటికి చేరి తలుపు కొట్టాను. నా అర్ధాంగి తలుపు తీసింది.ఆ కళ్ళల్లో నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళావన్న  బాధ, ఇంత గాలి వాన లో నడిచి వచ్చావన్న బాధ…ఒక్కసారే రెండు కన్నీటి చుక్కలై రాలాయి.ఇళ్ళంతా నీళ్ళతో నిండి పోయింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి.తను పరుపు ఎత్తేసి , ప్రమిద వెలుగులో కుర్చీలో కూర్చుని ఉంది.సరే..అసలు మధ్యాహ్నం నుండీ ఏమైనా తిన్నావా అంటే …ఏమీ తినలేదు అంది. నువ్వు నీళ్ళు ఎత్తు…నేను అన్నం సంగతి చూస్తాను అన్నాను.ఇక ఆ రాత్రి అలా గడిచిపోయింది.

ఇక తెల్లవారి అక్టోబర్ 13. హుదూద్ కష్టాలు మెల్ల మెల్ల గా ప్రారంభమయ్యాయి. పాలు లేవు ,పేపర్ లేదు. వాటికోసం రోడ్ మీదకు వెళితే పాల ప్యాకెట్ 100 రూపాయలు, పేపర్ 10 రూపాయలు అన్నారు. ఇవ్వాళ పేపర్ చదవకుంటే వచ్చిన నష్టమేమీ లేదు అనుకుని ఇంటికి వచ్చాను. ఇంట్లో నీళ్ళ కష్టాలు మొదలు.కరెంట్ లేదు. కుళాయిలు రావు. ఇంట్లో ఉన్న నీళ్ళతో స్నానం చేసి నేను, మా కొలీగ్ జార్జి ఇద్దరం ఆఫీస్ కు బయలు దేరాము. ఏయూ మీదుగా వెళదామా అన్నాడు జార్జి.మనం చదువుకున్న ఆ పచ్చదనం ఇప్పుడు మోడై పోయింది,చూడలేము అనుకుని వేరే రూట్ లో ఆఫీస్ కు వచ్చాము. అక్కడ పరిస్థితి అంతే . కేవలం ఇన్వర్టర్ మాత్రం పని చేస్తుంది.ఇక అప్పటికప్పుడు ఆఫీస్ లోని వ్యక్తులం కేవలం కెమెరా బ్యాటరీ లు మాత్రమే చార్జింగ్ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఏం చేద్దామన్నా ఫోన్లు లేవు. నెట్ లేదు.

అప్పటికే విద్యా సంస్థ లకు సెలవు ప్రకటించారు. ప్రజలు స్వచ్చందం గా  వారి వీథుల్లో ఉన్న చెట్లను,ఇతర వైర్లను తొలగిస్తున్నారు.ఇలాగే మరో రెండు రోజులు గడిచాయి. పరిస్థితి మరీ దిగజారింది. నిత్యావసర వస్తువులైన పాలు, నీళ్ళ కోసం తన్నుకుంటున్నారు. ముఖ్య మంత్రి ఇక్కడ తిష్ఠ వేయడం తో అధికారులు పరుగులు పెడుతున్నారు.మా నీటి కష్టాలు తీరే లా లేవు. పైగా నా భార్యా మణి తెగ నీళ్ళు పారబోస్తుంది. అప్పటిదాకా పట్టించుకోని బోర్లను రెండు బకెట్ల నీళ్ళ కోసం ఆశ్రయిస్తున్నారు.నేనూ ఆ లైన్ లో దూరి నీళ్ళు మోసే సరికి తల ప్రాణం తోక కొచ్చింది.ఇక మా ఆఫీస్ లో ఫీడ్ పంపించడం అవ్వడం లేదు. మీరేం చేస్తున్నారని హెడ్ ఆఫీస్ నుండి షంటింగ్.

ఇక ఇవన్నీ ఇలా ఉంటే కరెంట్ ఉన్నపుడు రాత్రి 10 అయితే తప్ప ఇళ్ళు చేరని నాలాంటి వాళ్ళు 7 గంటలకల్లా ఇళ్ళు చేరుతున్నాము. టీవీలు లేకపోవడం తో పిల్లలు ఆటలే ఆటలు. తాతలు, బామ్మలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకోని కథలు చెప్పడం చూసాను. నా మటుకు నేను నా అర్ధాంగి తో క్యాండిల్ లైట్ డిన్నర్. నీళ్ళ ట్యాంకర్ రాగానే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన యుద్దాలు మళ్ళీ కనిపించాయి. ఆ యుద్దాలు చేయలేని నాలాంటి వాళ్ళు దూరం నుండి నీళ్ళు మోసుకున్నాం.

దాదాపు తొమ్మిది రోజులు కరెంట్ లేదు. ఇక ఇదే పని.తల్లిదండ్రులు సాయంత్రం 7 కల్లా రావడం, పిల్లలతో గడపడం.ఉదయాన్నే నీళ్ళు మోయడం మంచి ఎక్సర్ సైజ్ . పిల్లలతో టైం స్పెండ్ చేయడంతో అనుభందం పెరిగింది. నాకైతే పక్కింటి వాళ్ళే తెలియదు. హుదూద్ పుణ్యమా అని అందరూ పరిచయ మయ్యారు. ఇక కబుర్లే కబుర్లు. తీయని ఊసులు చెప్పుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్లు. నా భార్య రోజూ కరెంట్ పోతే బాగుండు మీరు ఎప్పుడూ ఇలా తొందరగా వస్తారు అంటుంటే తుఫాను లో ప్రమోదం ఇదేనేమో అనిపించింది.

ఇక చూస్తుండగానే కరెంట్ వచ్చింది. డ్రింకింగ్ వాటర్ వచ్చాయి. హుదూద్ పుణ్యమా అని ఈ జనరేషన్ కు కథల విలువ తెలిసిందని నేను అంటే  కాసింత ఆత్మీయత అంటే ఏమిటో కూడా తెలిసినట్టుంది అని నా అర్ధాంగి అన్నది.

నిజమే కదా అనిపించింది నాక్కూడా.

 -విజయ్ గజం