ఒక లాలన…ఒక దీవెన!

bhaskarabhatla

 

సినిమా పాట క్వాలిటీ పడిపోయిందని కంప్లయింట్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు! అయినా ఎప్పటికప్పుడు అవసరమైనన్ని మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. ‘పాత పాటలు వింటే ఎంత హాయిగా ఉంటుందో, ఆ సాహిత్యం, ఆ సంగీతం.. అబ్బా ఆ రోజులే వేరు!’ అని నేటి తరం పాటల్ని ఆడిపోసుకునేవాళ్ళు, 1950 నుండి 1970 వరకు ఎన్ని పాటలు వచ్చాయో, వాటిల్లో ఎన్ని పాటలు ప్రాచూర్యంపొందాయో, ఎన్ని పాటలు అసలు వినలేమో పోల్చుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఈ రోజుల్లోకూడా పాటల విషయంలో మంచీ చెడుల నిష్పత్తి ఇంచుమించు ఈకాలంలో లాగే ఉందని.

పాట వస్తువు మారింది, భాషమారింది, సంగీతం మారింది, గాయకుల మారారు, సంస్కృతి మారింది, సినిమాలో కథలు మారాయి, ఇక పాట ఒక్కటీ మారకుండా ఉంటుందా? మన తాతలకి నచ్చిన పాటలు వాళ్ళ నాన్నలకీ, మన నాన్నలకి నచ్చినవి తాతలకీ, మనకి నచ్చినవి మన నాన్నలకీ నచ్చవు! అదంతే.

సంవత్సరానికి సుమారు అరవై సినిమాలూ, నాలుగైదు వందల పాటలూ వస్తున్నాయి మనకి. వాటిల్లో ఒక పది సినిమాలు మెచ్చుకోతగ్గవిగానూ, నలభైపాటలు ఆస్వాదించదగినవిగానూ మిగుల్తున్నాయి.

సినిమా సమిష్టి కృషే అయినప్పటికీ, అందర్నీ సమిష్టిగా ఒక ధ్యేయంవైపుకి తీసుకెళ్ళేవాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్ అభిరుచినీ, సమర్ధతనీబట్టే ఎండ్ ప్రాడక్ట్ ఉంటుంది.

సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ చేసినా, పాటలు కవి రాసినా, గాయకులు పాడినా ఆ డైరెక్టర్ వీళ్ళ దగ్గర తనకి కావలసింది రాబట్టే చాతుర్యాన్నిబట్టే పాటలు ఉంటాయి.

మొన్న విడుదలైన “జ్యో అచ్యుతానంద” సినిమాలో పాటలు ఒకసారి వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంత మంచి పాటలు చేయించుకున్న డైరెక్టర్ శ్రీనివాస్ కి అభినందనలు.

jyotachyutananda

సంగీతం : శ్రీకళ్యాణ్రమణ

గేయ రచయిత : భాస్కరభట్ల రవికుమార్

 

) ఆకుపచ్చని చందమామలా

గాయకులు : కార్తిక్, రమ్య బెహర 

 

ఒక అమ్మాయీ అబ్బాయి పాడుకునే డ్యూయట్ ఇది. ఆ కొత్త స్నేహంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సన్నివేశానికి తేలికైన తెలుగు పదాలతో హాయిగా సాగిపోతుంది పాట!

సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా? మనచుట్టే ఉంటుందిగా చూస్తే ఇలా – యువకుల యుగళగీతమే అయినప్పటికీ పల్లవిలోనే ఒక తాత్విక భావన “ప్రశాంతతని ఎక్కడో బయట వెతక్కు, అది నీలోనే ఉంటుంది” అన్న రేంజ్ లో మెరుస్తోంది ఈ లైన్.

కూడబెట్టుకున్న డబ్బులూ, ఆస్తులకంటే ఆనందంగా జీవించిన క్షణాలే నిధులు అని చరణంలో మరొక తత్వభావం విసిరాడు కవి – తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం!

మనసులో నింపుకోవలసింది చెత్తకాదు, హాయినిచ్చే జ్ఞాపకాలు అని మరో చమక్కు – తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం

అప్పుడు ప్రతిఋతువూ వసంతంలా కనిపిస్తుంది, మన చిరునవ్వుల్లో చల్లని మంచు ముత్యాలు కురుస్తాయి అని సాగుతున్నారు! – వసారాలు దాటొచ్చాయి వసంతాలు వేళ; తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా

లోలోపల ఆనందం వెలిగిపోతుంటే వెళ్ళేదారులన్నీ వెలుతురు మయమేనట – “ప్రతీదారి మిణుగుర్లా మెరుస్తోంది వేళ

రెండో చరణంలో —

ఆ అమ్మాయీ అబ్బాయీ ఒకరికొకరు అండగా ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనీ కోరుతున్నారు. ఒకరి కలల్ని మరొకరికి చెప్పుకోవడం ఎందుకు? నిద్రపోయేప్పుడు డైరెక్ట్ గా ఒకరి కలల్లో మరొకరు ప్రవేశించుకు పంచుకుందాం అంటున్నారు. ఎంత అందమైన ఊహ! ఎంత చక్కని కల్పన!

వారి చుట్టు వీచేగాలి ఆనందపు మత్తులో ముంచేస్తుందిట. మరి ఏం సుగంధాలు జల్లిందో మరి అని ఆశ్చర్యంగా ప్రశ్నించుకుంటున్నారు. మరి, వారి తీయని స్నేహ సుగంధాన్ని జల్లుకుందేమో!

*

 

) సువర్ణా సువర్ణా

గాయకుడు : సింహ

 

ఇది అమ్మాయిని టీజ్ చేస్తూ అబ్బాయి పాడే పాటలా ఉంది. అయినా సాహిత్యం ఎంత డీసెంట్ గా, కవితాత్మకంకా ఉందంటే  ఆ పాట అయిపోయే సమయానికి అమ్మాయి ముచ్చటపడి అబ్బాయితో ప్రేమలో పడిపోతుందన్నట్టు ఉంది.

అమ్మాయిని అల్లరిపెట్టిన తీరు, ఆమె ప్రవర్తనని వర్ణించిన విధానం, వాడిన విశేషణాలూ బాగున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాటల్ని తెలుగు పదాలతో రాయడం బాగుంది.

ఆల్చిప్పల్లాంటి కళ్ళనీ, జాంకాయలాంటి దోర ఈడనీ అంటూనే, ఆ అమ్మాయి చిటపటని ముద్దుగా “చక్కెర కలిపిన పటాసు” అంటూ మెచ్చుకుంటున్నాడు. నవ్వితే ముత్యాలు రాలినట్టు అన్న పాత ఉపమానాన్ని పక్కకి తోసి “తిప్పొదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వేయ్” అని బ్రతిమలాడటం కొత్తగా ఉంది.

ఎంతసేపు గోదావరీ, కృష్ణ, వంశధార, గౌతమీ, తుంగ, భద్ర నదులేనా? అమ్మాయిల్ని పోల్చడానికి, పొగడటానికి తెలుగునాట ఉన్న ఇతర చిన్న నదులు పనికిరావా ఏంటి? ఈ కవులెందుకు రాయరు అనిపించేది. ఈ పాటలో నాగావళి నదిని మొదటిసారిగా సినిమాపాటకెక్కించాడు కవి!

నాగావళి హొయలున్నవే మెలికల్లో” – సో క్యూట్!

నాగావళి కి ప్రాసగా నెక్స్‌ట్ లైన్ లో “బంగారి” అనడం బాగుంది. పాత సినిమా పాటని గుర్తుచేస్తుంది!

కొందరికి PDA (పభ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్టన్) నచ్చినట్టు, మరికొందరికి PDB (public display of బెట్టు ) నచ్చుతుందేమో :-)

ఏయ్ అనార్కలీ, అరసున్నా నడుముల్లో” అని నడుముకి తెలుగులో అరుదైపోతున్న అక్షరాన్ని ఉపమానంగా వాడటం గొప్పే!

దీపావళి వచ్చింది మే నెల్లో – పాట మొత్తానికి ఇదొకటే ఇంగ్లీషు పదం! అయినా ఆ దీపావళి చమత్కారంకోసం మెచ్చుకోవచ్చు.

నడిరాతిరి తెల్లారి పోతున్నా పొలమారి” – ప్రేమలో పడిన అబ్బాయి అవస్త కళ్ళముందు కనబడుతుంది.

 

*

) ఒక లాలన ఒక దీవెన (మేల్ వర్షన్)

గాయకుడు :  శంకర్ మహాదేవన్

 

బ్రేకప్ తర్వాత ప్రేయసి జ్ఞాపకాలను నెమరు వేసుకునే సన్నివేశానికో లేదు విడిపోయిన ప్రియురాలిని మళ్ళీ కలుకున్న సన్నివేశానికో రాయబడిన పాటలా ఉంది.  కర్ణాటక సంగీతం బాణీ పాట. కళ్యాణిరాగమని ఎవరో అన్నారు. శంకర్ మహాదేవన్ ఇదివరకే ఇలాంటొక మెలోడీ పాట విశ్వరూపంలో పాడాడు. అప్పట్నుండి ఎదురు చూస్తున్నా శంకర్ మహదేవన్ నోట మళ్ళీ ఎవరైనా అలా పాడించరా అని.

కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో

పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒకప్పుడు ఇద్దరం చెప్పుకున్న ఊసులు,  ఇద్దరినీ పెనవేసిన ఆ ప్రేమలు ఏమైపోయాయి? ఎందుకింత మౌనం మనమధ్య? పరాయి వ్యక్తిని కలిసినట్టు? అని గాఢమైన బాధని పలుకుతున్నాయి ఈ లైన్స్!

ఇంతకాలం దాచుకున్న ప్రేమని, హాయిని కాలమేమీ దోచుకోదు ఇమ్మని!

పెదవంచుమీద నవ్వుని పూయించుకోడం నీ పని నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమని?

 

అందనంత దూరమేలే నింగికి నేలకీ

వాన జల్లే రాయబారం వాటికి

మనసుంటే మార్గమే ఉండదా?

ప్రతి మనిషి నీకే చెందడా?

అసాధ్యం అంటూ ఏదీలేదు అని ఆశావాదం చాటుతుంది!

 

బంధమే ఆనందమే

నువ్వు మోసుకెళ్ళే సంపద!

 

ఈ ఆల్బం లో సెకండ్ బెస్ట్ ఈ పాట!

 

*

) ఇదేమి తాకిడి ఇదేమి గారడి (టైటిల్ సాంగ్)

గాయకులు : స్మిత, శ్రీకల్యాణ్రమణ

 

ఈ పాట ప్రేమ డ్యూయట్! పాట ట్యూన్ ఒకటి రెండు చోట్ల ఇదివరకొచ్చిన కొన్ని పాత తెలుగు పాటల్ని గుర్తు చేయక మానదు (అష్టాచమ్మ సినిమాలో హల్లో అంటూ ఇల్లా రాకే… పాట & సరిగమలు సినిమాలో “సరిగమలాపవయ్యా…” పాట)

చెవులకి హాయిగొలిపే తెలుగు పదాలతో రాయబడిన సాహిత్యం. అంతకంటే ఎక్కువేం చెప్తాం? విని ఆనందించడమే!

*

 

) ఒక లాలన ఒక దీవెన

గాయకురాలు : హరిణి రావ్

 

ఈ ఆల్బం లో నాకు బాగా నచ్చిన పాట ఇదే. గాయని గళంలో ఫ్రెష్నెస్! బాంబే జయశ్రీ గొంతులో సుబ్రహ్మణ్య భారతి పాటలా హాయిగా ఉంది వినడానికి.

పల్లవి మేల్ వర్షన్ కీ ఫీమేల్ వర్షన్ కీ ఒకటే. చరణం మాత్రం వేరు వేరుగా ఉంది. ఏ చరణంలో గొప్పతనం దానిదే.

తన మనసులో ఉన్నది చెప్పలేక, దాచలేక తికమకలో కొట్టుకుంటున్న ప్రియుడిని విన్నవించుకునే పాట ఇది! నీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పేయ్. నా చేయి పట్టుకోవాలని తహతహలాడే నీ చేయిని కట్టిపెట్టుకోకు అని లాలిస్తుంది ఆమె మాటలతో!

 

అంతులేని ఇష్టమంతా గంగలా పొంగనీ,

ఆనకట్టే వేసుకోకు అందనీ

కలపాలనుంటే చేతినీ,

ఎగరాలనుంటే మనసునీ

దాచేయకు, ఆపేయకు

అటువైపు సాగే అడుగుని

 

Nasal voice ఈ పాటకి మరింత ఎమోషన్ ని పెంచింది.

 

———————-

రికార్డింగప్పుడు కవి దగ్గరే ఉండి పాటలు పాడించుకున్నట్టున్నాడు. ఎక్కడా ఉచ్ఛారణ దోషం అనిపించలేదు. వాద్యాలు కూడా సాహిత్యాన్ని ఎక్కడా డామినేట్ చెయ్యలేదు.

ప్రేమికులు తమ ప్రేమలేఖల్లోనూ ప్రేమహైలైటర్స్ గానూ, టీన్ ఏజ్ పిల్లలు నోట్‌బుక్స్ అట్టల మీదా, నెటిజన్ లు తమ ఫేస్‌బుక్ గోడల మీదా ఈ సినిమాలో పాటల లైన్స్ ని రాసుకుంటారు అని కచ్చితంగా చెప్పొచ్చు.

 

*  *  *

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి…

 

అవినేని భాస్కర్

 

Avineni Bhaskarప్రతిభావంతులైన గొప్పవాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం. వొక్కోసారి  వారిపై  భక్తి భావమూ  పెంచుకొంటాం. ఆరాధిస్తాం. అభిమానిస్తాం. మనకే  తెలియకుండా  కొన్ని విషయాల్లో వారిని అనుకరిస్తాం. వాళ్ళ మాటల్నీ, చేతల్నీ ప్రమాణికంగా తీసుకుని మన జీవితంలోని కొన్ని సమయాలకి అన్వయించుకుంటాం. వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. వాళ్ళకి  సంభందించిన  ప్రతిదీ మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక్కోసారి  “ఈ గొప్ప మనిషి వివిధ సందర్భాల్లో ఎలా ఉంటాడు? నిద్రపోయి లేచినప్పుడు కూడా ఇంతే ఠీవితో ఉంటాడా? ఇరవైనాలుగు  గంటలూ ఈ వేషధారణలోనే ఉంటాడా?” అని ఊహల్లోకి జారిపోతాం. అలానే “ఈ పెద్ద మనిషి చిన్నతనంలో ఎలా ఉండేవాడూ ? అందరి పిల్లల్లాగే అల్లరి చేస్తుండేవాడా?” ఇలా మన మనసుకు తోచినట్టు పరిపరి విధాలుగా ఆలోచనల్లోకి వెళ్ళి అవి ఊహకి  అందక తిరిగొచ్చేస్తాం.

తెలివితేటలలోనూ, బల చాతుర్యాలలోనూ, మాయలలోనూ కీర్తికథలకు నాయకుడైన శ్రీకృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు అతని సతీమణులు. వాళ్ళకి  ”మనం ఆరాధించే ఈ కృష్ణుడు ఒక్క  రోజులోనే  ఇంత పెద్దవాడైపోయాడా? పుట్టటమే నాలుగు చేతులతోనే పుట్టాడా? అప్పుడే శంఖుచక్రాలు ధరించి వున్నాడా?” అనే  సందేహం వచ్చింది.   వారికి కలిగిన ఆ సందేహాన్ని కీర్తనగా రాశాడు అన్నమయ్య. వాస్తవానికి  ఈ ఆశ్చర్యం అన్నమయ్యదే.

ఈ కీర్తనని గోపికలో లేదా  శ్రీ కృష్ణుని సతీమణులో పాడుతున్నట్టు మనం  అనుకోవచ్చు.

 

AUDIO Link 1 :: గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ స్వరపరిచి పాడినది

AUDIO Link 2 :: ఎస్.జానకి గళం

AUDIO Link 3 

 

పల్లవి

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమిఁ

గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు

 

చరణం 1

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు

యెట్టు ధరియించెనే యీ కృష్ణుఁడు

అట్టె కిరీటము నాభరణాలు ధరించి

యెట్టె నెదుట నున్నాఁడు యీ కృష్ణుఁడు

 

చరణం 2

వచ్చి బ్రహ్మయు రుద్రుఁడు వాకిట నుతించఁగాను

యిచ్చగించి వినుచున్నాఁడీ కృష్ణుఁడు

ముచ్చటాడి దేవకితోడ ముంచి వసుదేవునితో

హెచ్చినమహిమలతో యీ కృష్ణుఁడు

 

చరణం 3

కొద దీర మరి నందగోపునకు యశోదకు

ఇదిగో తా బిడ్డఁడాయనీ కృష్ణుఁడు

అదన శ్రీవేంకటేషుఁడై యలమేల్మంగఁగూడి

యెదుటనే నిలుచున్నాఁడీ కృష్ణుఁడు

 

మూలం : తి.తి.దే వారు ముద్రించిన తాళ్ళపాక సాహిత్యం సంపుటం : 14 కీర్తన : 453

 

తాత్పర్యం (Explanation) :

సతులారా, గమనించండి ఈ రోజు శ్రావణ బహుళాష్టమి. నేడే ఆయన జన్మదినం. ఎన్నెన్నో కథల్లో నాయకుడైన ఈ కృష్ణుడు జన్మించినది ఇలాంటొక రోజున అర్థరాత్రిపూటే!

ఈ మోహనమూర్తికి పుట్టినప్పుడే నాలుగు చేతులు, చేత శంఖుచక్రాలు ఉండేవా?  అలా సాధ్యమా? కిరీటమూ, ఆభరణాలూ తొడుక్కున్న పసికందు చూడటానికి ఎలా ఉండేవాడో! ఈ కృష్ణుడేనా నాడు బాలుడిగా ఉన్నది? అని ఆశ్చర్యపోతున్నారు.

భవుడు, బ్రాహ్మాది దేవతలందరూ ఈయన వాకిట చేరి నిత్యం నుతించుతుంటే విని ఆస్వాదించే ఈ కృష్ణుడేనా నాడు చెరసాలలో పసిబాలుడిగా దేవకితో ముచ్చట్లాడింది? వసుదేవుడు ఆశ్చర్యపోయినది ఈ బాలుడి మహిమలుగనేనా?

సంతానం కొరత తీరుస్తూ యశోద-నందగోపుల ఇంట జన్మించిన పసిపాపడుగా చేరినాడు ఈ కృష్ణుడు. అలమేలుమంగను చేపట్టి వేంగటగిరిపైన దేవుడిగా వెలసినవాడుకూడా ఈ కృష్ణుడే!

 

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

బహుళాష్టమి = పౌర్ణమి తరువత వచ్చే ఎనిమిదవ తిథి

చతుర్భుజాలు = నాలుగు భుజములు/చేతులు
ఎట్ట = ఎలా

నుతించు = స్తోత్రముచేయు

ముంచి = అతిశయించి, ఆశ్చర్యమునొంది

హెచ్చిన = అత్యధికమైన,  మితిమీరిన

కొదదీర = కొరతతీరేట్టు

అదన = ఇప్పుడిలా (ఈ అదన పదాన్ని అన్నమయ్య కీర్తనలో తరచుగా చివరి చరణంలో వాడారు. ముఖ్యంగా శ్రీవేంకటేశుడన్న పదానికి ముందుగా)

 

* * *

వెంగలిమణులు నీ వేలిగోర బోలునా?

 

అవినేని  భాస్కర్ 

Avineni Bhaskarప్రపంచంలో మొట్టమొదటి కవిత స్త్రీ ప్రేమను పొందడానికో, లేదు స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికో పుట్టుంటుంది!

స్త్రీలు అలంకార ప్రియులు. ఎంత అందంగా ఉన్నా ఆభరణాలతో అలంకరించుకుంటారు. తమ అందాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు గమనించాలనీ, పొగడాలనీ అనుకుంటారు.

మామూలుగా మనం “అమ్మాయి అందంగా ఉంది” అని చెప్పడానికి “అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది” అనంటాం. మన భారతీయ సంస్కృతిలో మహాలక్ష్మి ముఖ్యమైన దేవతే కాదు, అందానికి మారుపేరుకూడా. అటువంటి మహాలక్ష్మికైనా ఇంకా అందంగా కనిపించాలనే తపన పడుతుంది. ఆభరణాలతో అలంకరించుకుంటుంది. ఇది గమనించిన ఆమె చెలికత్తెలు “సహజంగా అందగత్తెవు! ఎందుకు నీకు ఈ పై మెరుగులు?” అని ప్రశ్నిస్తూ ఆమె అందాలను పొగుడుతున్నారు.

ఈ సందర్భానికి అన్నమయ్య రాసిన కీర్తనిది.

AUDIO : గందము పూసేవేలే కమ్మని మేన
పాడినవారు : సుశీల, వాణిజయరాం
స్వరపరచినవారు : గుంతి నాగేశ్వర నాయుడు

 

పల్లవి

గందము పూసేవేలే కమ్మని మేన యీ –

గందము నీ మేనితావికంటె నెక్కుడా

 

చరణం 1

అద్దము చూచేవేలే అప్పటప్పటికిని

అద్దము నీ మోముకంటే నపురూపమా

ఒద్దిక తామరవిరివొత్తేవు కన్నుల నీ –

గద్దరి కన్నులకంటె కమలము ఘనమా

 

చరణం 2

బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా

బంగారు  నీ దనుకాంతి ప్రతివచ్చీనా

ఉంగరాలేఁటికినే వొడొకపువేళ్ళ

వెంగలిమణులు నీ వేలిగోరఁ బోలునా

 

చరణం 3

సవర మేఁటికినే జడియు నీ నెరులకు

సవరము నీ కొప్పుసరి వచ్చీనా

యివలఁ జవులు నీకునేలే వెంకటపతి –

సవరని కెమ్మోవి చవికంటేనా

 

మూలం : తి.తి.దే వారు ముద్రించిన తాళ్ళపాక సాహిత్యం సంపుటం : 5 కీర్తన : 2

annamayya

 

తాత్పర్యం (Explanation) :

ఓ పడతీ, ఒంటికి చందనం పూసుకుంటున్నావెందుకు? నీ మేనిలో సగజంగా ఉన్న సుగంధంకంటే ఈ గందపు వాసన ఏం గొప్పదనీ?

అద్దంలో ఏముందని పదేపదే చూసుకుంటున్నావు? అద్దంకంటే అపురూపమైనది నీ ముఖం. కళ్ళకి తామర పువ్వులొత్తుకుంటున్నావు. నేర్పెరిగిన నీ కన్నులతో పోలిస్తే తామరపువ్వులు ఏ కొసకీ సరిపోవు. అలాంటి వాటిని అద్దుకుంటే నీ కళ్ళల్లోని చల్లదనం తామరపువ్వులకి వెళ్తుందిగానీ? తామపువ్వులొత్తుకోవడం వల్ల కళ్ళకేం చల్లదనం వస్తుంది?

ఒంటిపైన బంగారు నగలను తొడుక్కుంటున్నావు. నిగనిగలాడే నీ ఒంటి కాంతికంటే ఈ నగల నిగనిగ దేనికి పనికొస్తుందనీ? సన్నగా, పొడవుగా, నాజూగ్గా ఉన్న నీ వేళ్ళకి ఉంగరాలవి అవసరమా? వేళ్ళ చివర్లో తెల్లగా మెరిసే నీ గోళ్ళకి సాటిరావు ఆ లేహపు ఉంగరాలు.

జుట్టు పలుచగా, పొట్టిగా ఉంటే సవరం కావాలేమోగానీ, పొడవుగా, ఒత్తుగా మెరిసే నీ జుట్టుకి సవరమెందుకు? అలికుంతలివి! సవరం చుట్టుకుంటే సహజమైన నీ కొప్పకి సరితూగుతుందా?వేంకటపతి ప్రేయసివి. అతని ఎర్రటి పెదవుల రుచి ఎరిగినదానివి! ఆ కెమ్మోవి రుచి ముందు ఇహలోకంలో ఏవీ రుచించవు.

 

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

గందము = చందనం (గంధము), సువాసన

ఏల, ఏలే = ఎందుకు, ఎందుకే

కమ్మని = తీయని పరిమళం

మేని = ఒళ్ళు

తావి = సువాసన

ఎక్కుడా = గొప్పదా, మేలైనదా

 

ఒద్దిక = పోలిక

గద్దరి = గడుసరి స్త్రీ, నేర్పరి

గద్దరికన్నులు = నేర్పెరిగిన కన్నులు

 

పడతి = స్త్రీ

మెయి = ఒళ్ళు, తనువు

ప్రతివచ్చీనా = సరితూగేనా

ఒడికపువేళ్ళు = సన్నగా పొడవుగా ఉండే నాజూకైన వేళ్ళు

వెంగలిమణులు = లోహములతో తయారు చేయబడిన నగలు

బోలునా = పోలిక ఉంటుందా?

 

జడియు = ఎక్కువయిన (పొడవైన అని అన్వయించుకోవచ్చు), ప్రసిద్ధమైన

నెరులు = కురులు, జుట్టు

ఈవల = ఇహలోకము, మామూలు, ఇక్కడ

చవులు = రుచులు

సవరని = అందమైన, చక్కని

కెమ్మోవి = ఎర్రని పెదవులు

చవి = రుచి, అనుభవం

 

విశ్లేషణ (Analysis) :

గందము అన్న పదం చదవగానే ఇదేదో అచ్చుతప్పేమో అనుకోనవసరం లేదు. గందము సరియే! సులువైన భాషలో, జానపద శైలీలో ఉన్న అన్నమయ్య కీర్తనల్లో సంస్కృత పదాలను అక్షరాలలో ఇలా ఒత్తులు తీసేసి వాడటబడటం తరచుగా కానవచ్చు. అలాగే ఆయన, కీర్తనలకు మేలైన నుడి అని దేన్నీ ఎన్నుకోలేదు. తాను తెలుసుకున్న పరతత్వాన్నీ, జీవితసారాన్నీ సమాజంలో అన్ని వర్గాల వారికీ అందించాలన్న రీతిలో కీర్తనలు రాశాడు. ప్రపంచంలోని ప్రతిదీ పరబ్రహ్మ రూపంగానే భావించాడు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది లేదన్నమయ్య దృష్టిలో.

అందుకే తాను చెప్పాలనుకున్న భావాన్ని పలు రకాల భాషల్లో చెప్పాడు. కొన్ని కీర్తనలు పూర్తిగా పామరుల భాషలోనే ఉంటాయి. కొన్నేమో అచ్చతెలుగు పదాలు. కొన్నేమో గ్రాంధికమైన తెలుగు. కొన్నేమో పూర్తి సంస్కృతం. మరికొన్నిట్లోనేమో అన్నిట్నీ కలిపి రాయడం. అన్నమయ్య కీర్తనల్ని ఏ కోణంలో చూసినా ఆయన సర్వసమతా దృష్టి అగుపిస్తుంది. భాషా పండితులు ఆయన కీర్తనల్లో ఎన్నోచోట్ల దుష్టసమాసాలు ఉన్నట్టూ, వ్యాకరణ దోషాలున్నట్టు చెప్తారు. అంటే ఆయన భాష చేతగాక, వ్యాకరణం తెలియక కాదు. చంధోబద్ధమైనవీ రాశాడు. కీర్తనల్లో ఆయన చెప్పాలనుకున్న భావానికి ప్రాధాన్యమిచ్చాడు.

యేల(ఎందుకు), యాడ(ఎక్కడ), ఏంది(ఏమిటి) వంటి పదాలు నేడు చిన్నచూపుకి లోనయ్యాయి! నిజానికి అవి ఎంత అందమైన తెలుగుపదాలో!

అత్తర్, సెంట్లు రాసుకోవడం, బ్యూటీ సలూన్ లలో చేసే ఫేస్‌ప్యాక్, బాడీప్యాక్ లు, కళ్ళకింద డార్క్ సర్కిల్స్ కి కీరకాయల ట్రీట్మెంట్ వంటివి ఆ రోజుల్లో కూడా ఉండేవని అన్నమయ్య కీర్తనలద్వారా తెలుసుకోవచ్చు. కళ్ళకి నేడు కీరకాయ ముక్కలు, నాడు తామర పువ్వులు! అంతే. ఇవి ఎప్పుడూ ఉన్నవే కాబోలు.

*

 

వద్దు వద్దు కోపము

 

అవినేని భాస్కర్ 

 

Avineni Bhaskarఅన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

 

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.

annamayya

AUDIO : వద్దు వద్దు కోపము (ఇక్కడ వినండి)

పల్లవి
వద్దు వద్దు కోపము వదినె నింతే నీకు
సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నునుచరణం 1
మారుకొన్న దానఁగాను మాటాడినదానఁగాను
యేరా నాతోనేల యెగ్గు పట్టేవు
గీరితి నింతే గోరకెలని పరాకు రాఁగా
కూరిమి నిట్టే వేఁడుకొనేను నిన్నుచరణం 2
గుంపించినదానఁ గాను గొణఁగిన దానఁగాను
తెంపున నేరా నన్ను దీకొనేవు
చెంపల చెమట జార చేఁతఁదుడిచితి నింతే
అంపలేను ఆయమంటి ఆదరించే నిన్నును

చరణం 3
పాసివున్నదానఁ గాను పదరినదానఁగాను
వేసరక నన్నునేల వెడ్డువెట్టేవు
ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
మోసలేదు నీకునాకు మొక్కుమెచ్చే నిన్నును

 

తాత్పర్యం (Explanation) :
అన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.


కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

సుద్దులు = మాటలు
సొలసితి = విసిగిపోతిని

 

మారుకొను = అడ్డగించు, ఎదిరించు, ఆపివేయు
ఎగ్గుపట్టు = తప్పుగా భావించు
గీరితిని = మూర్చపోతిని, సొమ్మసిల్లితిని
గోరకెలన = దరిదాపుల్లో, దగ్గర, సమీపాన
పరాకు = ఉదాసీనత, indifference

 

గుంపించు = అతిక్రమించు
గొణగు = సణుగుడు/సనుగుడు, మారుపలుకు
తెంపున = విసురుగా, rudeness
దీకొను = ఎదిరించు
అంపలేను = పంపలేను
ఆయమంటి = మనసులోచేరి
ఆదరించు = పోషించు, సాకు

పాసి = ఎడబాసి, దూరంగా, విడిచిపెట్టి
పదరు = ఆత్రపడు
వేసరక = నొచ్చుకోక
వెడ్డువెట్టేవు = వంచించేవు
మోసలేదు = కపటంలేదు
మొక్కుమెచ్చు = ప్రార్ధించి మెచ్చుకొను

 

రావే కోడల రట్టడి కోడల…

Avineni Bhaskar

   అవినేని భాస్కర్ 

మనిషి జీవితంలోని అన్ని సన్నివేశాలకీ సంకీర్తనలు రాశాడు అన్నమయ్య. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ పరమాత్మ అవతారాన్నే చూశాడు. మేమేనా ఆ సంసారంలో కొట్టుమిట్టాడాల్సినది? మీరూ రండి అని దేవుళ్ళని చేయిపట్టి లౌకిక జీవితంలోకి లాక్కొచ్చి మానవ జీవితంలోని కష్టనష్టాలను దేవుళ్ళకి ఆపాదించాడు. అలా చెయ్యడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, “మనకే కాదు దేవుళ్ళకైనా సంసార జీవితం సులువుగా సాగట్లేదు” అని చెప్పి విరక్తి కలగనియ్యకుండ ధైర్యాన్ని కలిగించడమే.

అన్నమయ్య ఎన్నో యుగళగీతాలు (డ్యూయట్లు) రాశాడు. కొన్ని బావా-మరదళ్ళు పాడుకునేవి, కొన్ని నాయికా-నాయకులు పాడుకునేవి, కొన్ని గొల్లెత-గొల్లడు పాడుకునేవి, కొన్ని నాయిక-దూతికలు పాడుకునేవి. ఈ కీర్తన అత్తా-కోడలు పడుకునే డ్యూయట్.
అత్తా-కోడళ్ళ గొడవలు నేటి మెగా సీరియల్ల బిజినెస్ కోసం పుట్టినవి కావు. ఆదిలక్ష్మి అత్తయిన రోజునుండే ఉందని సాటి చెప్పడానికే ఈ కీర్తన రాశాడేమో. బ్రహ్మదేవుడు మహావిష్ణువు బొడ్డులోనుండి పుట్టాడు. కావున బ్రహ్మ మహాలక్ష్మి-విష్ణువుల కొడుకు. బ్రహ్మ భార్య సరస్వతి, మహాలక్ష్మికి కోడలు. మహాలక్ష్మి సిరి(డబ్బు)కి ప్రతిరూపం. సరస్వతి చదువులతల్లి, కళలకు ప్రతిరూపం.
ఈ భాషేంటి ఇలా ఉంది? సరస్వతీ, మహాలక్ష్మీ ఇలా దెప్పుకుంటారా అని ప్రశ్నించేవారికి – అన్నమయ్య సరస్వతినీ, మహాలక్ష్మినీ ఒక సామాన్య కుటుంబంలోని ఆడవాళ్ళుగా చిత్రీకరించాడు. అంటే దేవుళ్ళను సామాన్య ప్రజలకు దగ్గర చేయడం అన్నమయ్య ఉద్దేశం. దేవుళ్ళంటే ఎక్కడో సామాన్యులకందనంత ఎత్తులో ఉంటారన్న భ్రమని పోగొట్టి పామరులకు దగ్గర చేసేరీతిలో పలు జానపద కీర్తనలు రచించాడు. ఈ కీర్తన కూడా అలాంటొక జానపద శైలిలో రాయబడినదే. కావున భాష, భావం ప్రజల జీవితాల్లోనుండే తీసుకున్నాడు.
ఎంతటి వాళ్లైనా అత్తాకోడళ్ళుగా ఉన్నప్పుడు చిన్నచిన్న కోపతాపాలు, పోటీలు తప్పవనడానికి ఈ కీర్తన నిదర్శనం. పైకి ఎంత సఖ్యతగా కనిపించే అత్తా-కోడళ్ళకైనా లోలోపల పోటీ, భయం ఉంటుంది. కొడుకుని తననుండి దూరం చేసేస్తుందేమో అన్న భయంతో అత్త, మొగుడు అమ్మచాడు అబ్బాయిలాగే (momma’s boy లా)  ఉంటే నన్ను ప్రేమించడేమో అన్న అనుమానంతో కోడలు మెలుగుతుంటారు. ఎవరిఅభద్రత(insecurities) వాళ్ళవి! ఎవరికి వారు ఆధిపత్యం(domination)  ప్రదర్శిస్తారు. నేను నీ మొగుడికి తల్లిని అని అత్త హెచ్చులుపోతే, నీ కొడుక్కి పెళ్ళాన్ని అని కోడలు గర్వం ప్రదర్శిస్తూ ఉంటుంది.
annamayya
ఆ అత్తాకోడళ్ళకి గొడవలొస్తే ఎలా దెప్పుకుంటారో వినండి.
|| అత్త: సుశీల || కోడలు: వాణి జయరాం || స్వరకల్పన : గుంటి నాగేశ్వర నాయుడు||
పల్లవి
రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులు నీతోఁజాలును
 
చరణాలు
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా 
 
ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా
 
బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని –
నడ్డగించుకొంటివత్తయ్యా
 
మూలం : తాళ్ళపాక సాహిత్యం వాల్యూం 5, పుట : 286
తాత్పర్యం ( Explanation ) :
రావే పరువుమాలిన కోడలా అని అత్తయ్య చురకేస్తే, పోవే అత్తయ్యా! నీతో సఖ్యత నాకొద్దు అని కోడలంటుంది. [ కోడలు ఎవరీ కంటా, నోటా పడకుండ గుట్టుగా ఉంటే ఆ ఇంటికి గౌరవం! అదేం విపరీతమో అందరు నీ గురించే పలవరిస్తున్నారు. ఇంటిపరువు రచ్చకెక్కింది అని కోడలు సరస్వతిని దెప్పుతుంది అత్త మహాలక్ష్మి. ఆరాధన భావానికీ, అడ్డగోలు మాటలకీ తేడా తెలియని నీతో నాకేంటి మాటలు పోవే అత్తయ్యా అని మహాలక్ష్మిని తిప్పికొడుతుంది కోడలు ]
పండితులు, కవుల రూపంలో రాజుల ముందర సంకోచించకుండ ప్రసంగాలూ, ప్రదర్శనలూ చేస్తూ ఉంటావు ఏం మనిషివి నువ్వు అని అత్త అడిగితే… అవును మరి! నన్ననే ముందు నీ కథేంటో చూసుకో అత్తయ్యా! అంకెలరూపంలో ధనవంతుల ఇళ్ళలో తిరుగుతావుగా? బురదలో పుట్టిన తామర పువ్వులాంటి ముఖమూ నువ్వూ అని కోడలు ఎదురు ప్రశ్నేస్తుంది. [కవులు పండితులకి ప్రభలిచ్చేది సరస్వతి. వారు ఎప్పుడూ రాజులదగ్గరా, కలిగినవారిదగ్గరా చేరి తమ పాండిత్యాన్ని గర్వంగా, ఠీవిగా ప్రదర్శిస్తు ఉంటారు. సిరికి దేవత మహాలక్ష్మి. డబ్బు అందరిదగ్గరా చేరదు. కొందరు దొడ్డవారిళ్ళల్లో అంకెలతో కొలవబడుతూ ఉంటుంది. ఇక్కడ “పంకజముఖి” అని సంభోదించడంలో చమత్కారమైన తిట్టు దాగుంది. పంకజం బురదలో పుడుతుంది కదా?]

ఇక్కడా అక్కడ అని సిగ్గుశరములేకుండ నలుగురైదుమంది మగవాళ్ళ సాంగత్యంలో ఉంటావు అని అత్త దెప్పితే, వాడకు పదిమంది దగ్గర చేరి వాళ్ళ మధ్యనే ఉంటావు నువ్వేం తక్కువా? అంటోంది కోడలు. [ ఏగురు అంటే ఐదుగురు అని అర్థం. వాడకు నలుగురు, ఐదుగురు పండితులు ఉంటారు. సరస్వతి వాళ్ళనే కటాక్షించి ఆదుకుంటుంది అని భావం. సిరి అయినా అంతే అందరిదగ్గరా చేరదు. ఏ కొందరిచెంతో మాత్రమే ఉంటుంది].

ఏం చూసుకుని నీకంత టెక్కు? మా ఆయన బొడ్డున పుట్టిన పిల్లాడు బ్రహ్మకి ఒక పిల్లని తెచ్చి పెళ్ళి చేసిపెడదాం అని ఏమీలేని నిన్ను పోనీలే అని కోడలిగా తెచ్చుకున్నాను అని మహాలక్ష్మి సరస్వతిని చిన్నబుచ్చింది. నన్నంత మాటంటావా? నువ్వేమో పెద్ద గొప్పా? కొండపైన మహరాజులా ఆనందంగా జీవిస్తున్న అమాయక చక్రవర్తిని మాయచేసి నీ వలలో వేసుకున్నావు అని కోడలు అత్తని నిలదీస్తుంది.
కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :
రట్టడి = అపకీర్తి, పరువుమాలిన
పొందులు = సఖ్యత, స్నేహము
రంకెలువేయుచు = ప్రగల్భాలు పలుకుతు, హెచ్చులుపోతూ, గర్జనలు చేస్తూ
కొంకుకొసరు = సంకోచము, సిగ్గుశరము
పంకజముఖి = (బురదలోపుట్టిన) తామర పువ్వులాంటి ముఖము
దొడ్డవారిండ్ల = కలవారిళ్ళలో, ధనికులైనవారి ఇళ్ళలో

అంకెల = అంకెల రూపంలో

ఈడాడ = ఇక్కడా అక్కడా, ఇటు అటు
ఏగురు = ఐదుగురు, అయిదుమంది,
మొగలతో = మగవారితో
ఆడాడ = అక్కడక్కడ
బొడ్డున = నాభిలో, బొడ్డులో
పూప = శిశువు, పిల్లవాడు (ఇక్కడ బ్రహ్మ అని అర్థం)
గొడ్డేరు = గుత్తకు, వేలం
గుడ్డము = కొండ, క్షేత్రము

అడ్డగించు = బలవంతంగా సొంతంచేసుకోవడం

కొమ్మ సింగారములివి కొలది వెట్టగ రావు

అవినేని భాస్కర్

Avineni Bhaskarప్రకృతినీ, స్త్రీ సౌందర్యాన్నీ ఎందరు కవులు, ఎంత వర్ణించినా ఇంకా మిగిలిపోయే ఉంటుంది! స్త్రీ నఖశిఖ పర్యంత సౌందర్య సిరి. ఫెమింజం పులుముకున్న స్త్రీలను మినహాయిస్తే సహజంగా స్త్రీలు సౌందర్య వర్ణనని, ఆరాధననీ ఇష్టపడుతారు. అందమైన స్త్రీలను పురుషులేకాక స్త్రీలుకూడా అభినందిస్తారు, మెచ్చుకుంటారు.

“కొమ్మ సింగారములివి” అన్న ఈ కీర్తనలో అన్నమయ్య తనని ఒక చెలికత్తెగా ఊహించుకుని అలమేలుమంగ అందాలను సాటి చెలికత్తెలకు వివరించి ఆశ్చర్యానికి లోనౌతున్నాడు! దూరం, బరువు లాంటివాటిని కొలవడానికి కొలబద్దలుంటాయి. మరి సౌందర్యాన్ని కలవడానికేముంది? చూసి ఆశ్చర్యపోవడం, కవితల్లో వర్ణించదం. ఇవి తప్ప ఇంకేం చేస్తాడు కవి? ప్రకృతితో పోల్చి, ప్రకృతికంటే గొప్ప అందాలు అలమేలుమంగది అని చెలులకు చెప్తున్నాడు.

AUDIO Link : KOMMA SINGARAMULIVI

 

 

[ స్వరము, గళము : గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ ]
పల్లవి
కొమ్మ సింగారము లివి కొలఁది వెట్టఁగ రావు
పమ్మిన యీ సొబగులు భావించరే చెలులు
 
చరణాలు
చెలియ పెద్దతురుము చీఁకట్లు గాయఁగాను
యెలమి మోముకళలు యెండ గాయఁగా
బలిసి రాతిరియుఁ బగలు వెనకముందై
కలయ కొక్కట మించీఁ గంటిరటే చెలులు
 
పొందుగ నీకె చన్నులు పొడవులై పెరుగఁగా
నందమై నెన్నడుము బయలై వుండఁగా
ఇందునే కొండలు మిన్నుఁ గిందుమీఁదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు
 
శ్రీవేంకటేశువీఁపునఁ జేతు లీకెవి గప్పఁగా
యీవల నీతనిచేతు లీకెఁ గప్పఁగా
ఆవలఁ కొమ్మలుఁ దీగె ననలుఁ గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ
 
 

తాత్పర్యం (Explanation) :

ఈ అమ్మాయి అందాలు ఇన్ని అన్ని అని లెక్కబెట్టలేము, ఇంత అంత అని వర్ణించలేము. కనులను మురిపింపజేసే అపురూమైన ఈమె చక్కని సొగసులను ఎంచి చూడండి చెలులారా!

ఆమెకు  పొడవైన, ఒత్తనైన నల్లటి కురులున్నాయి. దువ్వి కొప్పు చుట్టింది. ఆమె జుట్టు నల్లగా నిగనిగలాడటంవలన రాతిరైపోయిందేమోనన్నట్టు చిక్కటి చీకట్లు కాస్తుంది. (విభుని రాకవలన) ఆనందంతో వికశిస్తున్న ఆమె మొఖం మెరిసిపోతుంది. ఆ ముఖ కాంతి ఎండకాస్తున్నట్లుగా ఉంది. ఎండా-చీకటీ ఒకే సమయంలో ఉండటం అన్నది అసాధ్యం! అలా ఉంటే అది అతిశయం! అంతటి అతిశయం ఇప్పుడీ అందగత్తె ముందూ, వెనుకలుగా ఒకేచోట, ఒకే సమయంలో ఉన్నాయి చూడండి చెలులారా!

ఈమె కుచగిరులు రెండూ సమానంగా, సమృద్ధిగా పెరిగినట్టు ఉన్నాయి. అందమైన నడుమేమో చన్నగా చిక్కిపోయి ఆకశంలాగా(బయలులా) ఉండీలేనట్టు ఉంది. మామూలుగా కొండలు కింద, ఆకాశం పైన ఉంటాయి. ఇక్కడేమో కొండలవంటి ఆమె కుచగిరులు పైనా, ఏమీ లేని శూన్యంవంటి నడుము కిందా ఉన్నాయి. ఎక్కడా కానని ఈ వింతని చూశారా చెలులారా!

ఇంతటి ఒయ్యారాలుగల సొగసులాడి అలమేలుమంగ శ్రీవేంకటపతిని కౌగిలించగా, తన చేతులను ఆయన వీపును పెనవేసింది. ఆయన చేతులు ఈమె వీపును అల్లుకున్నాయి. మామూలుగా తీగెలు కొమ్మలను చుట్టుకుని పెనవేసుకుంటాయి. అయితే అలమేలుమంగా, వేంకటేశుల కలయికని చూస్తుంటే కొమ్మా, తీగా రెండూ అల్లుకుని ఒకదాన్నొకటి పెనవేసుకుని పరిపూర్ణం చెందినట్టు కనిపిస్తుంది తిలకించండి చెలులూ!

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :
కొమ్మ = అమ్మాయి,
సింగారములు = అందాలు
కొలది = కొలమానం
పమ్మిన = ప్రదర్శించబడుతున్న (ఈ సందర్భానికి సరిపోయే అర్థమిది),  ఆశ్చర్యం కలిగించే, అతిశయింపజేసే

తురుము = కొప్పు
కాయగాను = కాస్తు ఉంటే
యెలమి = వికశించుతున్న
మోముకళలు = ముఖములోని కళలు
బలిసి = ముదిరిన, దట్టమైన

పొందుగ = పొందికగా
ఈకె = ఈమె
చన్నులు = కుచములు, రొమ్ములు
పొడవు = పెద్ద
నెన్నడుము = చిక్కిన నడుము
బయలై = ఏమీలేనట్టు, శూన్యమై
ఇందు = కలిసి
కొండలు = పర్వతాలు
మిన్ను = ఆకాశము
ఒక్కచో = ఒకేచోట
చెంది = కలిగి

ఈవల/ఆవల = ఇవతల/అవతల వైపు
కొమ్మలు = కొమ్మలు
చేవదేరీని = పరిపూర్ణతచెందినది ( బలపడినది )

Image Courtesy : Sukanya Ramanathan
*

కడు చక్కనిది చిలికిన చల్ల!

 అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకంటికి కనిపించిన ప్రతి దృశ్యమూ, చుట్టూ జరిగే వివిధ ఘటనలు, పచ్చిక బయళ్ళు, కొండలు, రాళ్ళు-రప్పలు, చెట్లు-పుట్టలు, ప్రాణులు, కనుమలు, గొడవలు, మనస్తాపాలు, దౌర్జన్యాలు, వేలాకోలాలు ఏవీ కీర్తనకి అనర్హం కాదన్నట్టు శ్రీవేంకటేశునికి అన్వయం చేసి పాడిన ఘనత అన్నమయ్యది.

విజ్ఞానులూ పండితులేకారు, పామరులూ చోరులూ అల్పులూ కూడా శ్రీవేంకటపతిరూపులే అన్న సర్వసమతా దృష్టి అన్నమయ్యది. కలవారింటి స్త్రీలేకారు, వారికి సేవలు చేసే దాదులనూ దాసీమణులనుకూడా అలమేలుమంగ రూపాలుగానే భావించి కీర్తనలు రాశాడు. ఒళ్ళు అలసిపోయేట్టు కష్టజీవనం చేసుకునే స్త్రీలనే కాదు, ఒళ్ళమ్ముకునే వేశ్యలుకూడా వేంకటపతి భక్తులేనని వారినీ తన కీర్తనల్లోకి ఎక్కించాడు.

అన్నమయ్యకున్న సామాజిక స్పృహ ఈ కీర్తనలో కనవచ్చు. ఇందులోని నాయిక(లు) మజ్జిగమ్ముకునే గొల్లభామ(లు). ఎంత సమయం అయినా సరే తీసుకెళ్ళిన మజ్జిగంతా అమ్మితేగానీ ఇంటికి తిరిగిరాలేదు. అమ్మి నాలుగురాళ్ళు తెచ్చుకుంటేగానీ జీవనం గడవదు మరి ఆ పేదరాలుకి. ఆమెను చూసి జాలిపడుతున్నాడు అన్నమయ్య. ఆమె అమ్ముతున్న మజ్జిగ గొప్పతనమేంటో ప్రకటిస్తూ జనాలచేత కొనిపించే ప్రయత్నం చేస్తున్నాడు కవి!

ఆమె పేదరాలే అయినప్పటికీ సౌందర్యంలో, సొగసులో మాత్రం చాలా ధనికురాలే. ఆమె అందాలను వర్ణిస్తూ, మజ్జిగను అమ్మించే యుక్తిని చూస్తుంటే నేటి advertising techniques అన్నిటికీ తాత అన్నమయ్య అనాలనిపిస్తుంది.

కొన్ని కీర్తనల్లో పైనపైన కనిపించే భావమొకటుంటుంది, అంతరార్థం మరోటి ఉంటుంది. ఈ కీర్తనలో మరో అంతరార్థం ఉంది. అదేమిటో చివర్లో చూద్దాం.

గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరచి పాడిన ఈ కీర్తనని ఇక్కడ విన ఆస్వాదించండి.

AUDIO LINK : మూల మూలన అమ్ముడు చల్ల / mUlamUlana ammuDu challa

 

పల్లవి
మూలమూల నమ్ముడుఁజల్ల ఇది
రేలుఁ బగలుఁ గొనరే చల్ల

చరణాలు
పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ –
జక్కనిది చిలికిన చల్ల
అక్కునఁ జెమటగార నమ్మీని యిది
యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల

వడచల్లు మేని జవ్వని వొకతి కడు-
జడియుచుఁ జిలికిన చల్ల
తడఁబడు కమ్మనితావులది మీ –
రెడయకిపుడు గొనరే చల్ల

అంకులకరముల వొయ్యారొకతి కడు –
జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది
యింకానమ్మీఁ గొనరే చల్ల

కీర్తన మూలం : తితిదే అన్నమాచార్య సంకీర్తనల సంపుటం 5, పుట 231, రేకు 70, కీర్తన 229

తాత్పర్యం  :
వాడవాడకూ మూల మూలకూ, రాత్రనక పగలనక ఎత్తుకెళ్ళి అమ్మబడే మజ్జిగ ఇది, మీరందరు కొనుక్కుని తాగండి.

నిండైన చన్నులతో పసివయసులోనున్న అందమైన యువతి చిలికినది ఈ మజ్జిగని. ఎండలో వీధి వీధీ తిరుగడంవల్ల ఆ గొల్లభామ గుండెలపైన చెమటలు కారిపోతున్నాయి. ఈ మజ్జిగ వెనక ఇంత శ్రమ ఉంది. ఆలస్యం చేస్తే ఇలాంటి మజ్జిగ దొరకదు, త్వరపడి ఇప్పుడే కొనుక్కోండి.

తాపాన్ని వెదజల్లే అందమైన దేహంగల అందగత్తె ఒయ్యారంగా కదులుతు చిలికినది ఈ మజ్జిగని. దారిన వెళ్ళేవారిని తడబాటుకు లోనుచేసే కమ్మని సువాసనగల మజ్జిగ ఇది. దాటెళ్ళిపోకుండా కొనుక్కోండి.

చిగురుటాకులవంటి చేతులున్న వొయ్యారి భామ ఎంతో భయభక్తులతో చిలికినది ఈ మజ్జిగని. వేంకటగిరిపైనున్న స్వామిని పతిగా పొంది అతన్ని వేడుకలలో తేలించే యువతి ఇంకా అమ్ముతూ ఉంది. కాబట్టి జనులారా నమ్మి కొనుక్కోండి. (యింకానమ్మీ కొనరే చల్ల — ఇందులో నమ్మీ అన్నది శ్లేషగా తీసుకోవచ్చేమో)

నా విశ్లేషణ  :

మండేవేసవిలో దేహాన్ని చల్లార్చి ఎండకు ఉపశమనం కలిగించేందుకు ఈ రోజుల్లో పలు రకాల కూల్‌డ్రింకులు, వాటినమ్మే అంగళ్ళు అడుగడుగునా ఉన్నాయి. ఎవరి ప్రాడక్ట్ ను వారు అమ్ముకునేందుకు పోటీలు పడి వైవిద్యమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇన్ని artificial drinks లేవు. పానీయాలను నిలవుంఛే, చల్లబరిచే టెక్నాలజీలు లేదు. ప్రకృతి సిద్ధమైన మజ్జిగ, కొబ్బరి నీళ్ళవంటివి మాత్రమే ఉండేవి. నేటి పానీయాలను ధనవంతులు తయారు చేస్తున్నారు. ఆ రోజుల్లో మామూలు మధ్యతరగతి వాళ్ళు మజ్జిగ చిలికి అమ్మేవారు. వారికి అదే జీవనాధారం. కష్టజీవులు. వారు పడే శ్రమ, మజ్జిగమ్మే తీరు అన్నమయ్యలో కలిగించిన ప్రభావంతో ఎన్నెన్నో “చల్ల”టి కీర్తనలో రాయించింది. గొల్లభామలు, రేపల్లె, పాలు, పెరుగు, నవనీతం, మజ్జిగ, శ్రీకృష్ణుడు – ఇంకేం కావాలి యే వైష్ణవకవికైనా?

“పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకతి, కడు చక్కనిది చిలికిన చల్ల” అమ్మే చోట చిలికిన వనిత చన్నుల చక్కదనం గురించి ప్రస్తావన తీసుకురావడం, అమ్ముతున్న స్త్రీని వర్ణించడం ఇవన్నీ వినియోగదారులను ఊరించే వ్యాపారయుక్తులు. నేడు మగవాళ్ళ షేవింగు క్రీముల ప్రకటనల్లో ఆడవాళ్ళని చూపిస్తున్నట్టయితే కాదు.

వడచల్లు మేని జవ్వని అని అన్నమయ్య అనడంలోని ప్రత్యేక భావం ఏంటి? మజ్జిగ ఎవరు చిలికితేనేం? చల్లగానే ఉంటుందిగా? ఈ గొల్లెత అమ్మే మజ్జిగ ఇంకాస్త ఎక్కువ చల్లగా ఉంటుంది అని నొక్కి చెప్పే ఉద్దేశంతోనే “వడచల్లు మేని జవ్వని” అని చిలికిన యువతిని వర్ణించాడు. వడచల్లు మేని అన్నప్రయోగానికి ‘తాపమును చిమ్మే దేహం’ అనీ, ‘చల్లని దేహం’ అనీ రెండు అర్థాలున్నాయి. పాఠకులు మీ భావుకతకి తగినట్టు అన్వయించుకోండి.

“నువ్వమ్మే మజ్జిగ వేడిన తగ్గించుతుంది, నీ అందమేమో తాపాగ్నిని రగిలిస్తుంది” అని మజ్జిగమ్మే గొల్లభామతో సరసమాడాడు “కాళమేఘం” అనే ఒక ప్రాచీన అరవ కవి.

తడబడు కమ్మనితావులది – అటువైపుగా వెళ్ళేవారిని కమ్మని సువాసన ద్వారా ఆపిమరీ ఆకర్షిస్తుందిట. ఆ సువాసన మజ్జిగదైనా కావచ్చు, పరిమళ కస్తూరిని మేన రాసుకునే ఆ గొల్లెతదైనా కావచ్చు అన్నది కవిచమత్కారం!

“జడియుచుఁ జిలికిన”, “జంకెనలఁ జిలికిన” – ఈ రెండు ప్రయోగాల్లోనూ భయపడుతూ, తికమకపడుతూ చిలికింది ఆ యువతి అని రాశాడు. ఎందుకు అలా రాశాడు? ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది. పెరుగులో నీళ్ళు పోసి వెన్నకోసం కవ్వంతో చిలికితే మజ్జిగ మిగులుతుంది. నీళ్ళు పోసినకొద్ది మజ్జిగ మొత్తం(quantity) పెరుగుతుంది, అయితే పలచనైపోతుంది! నీళ్ళు తక్కువపోస్తే కుండ నిండదు. అందుకే ఆ వొయ్యారిభామ తికమకగా భయపడుతూ మజ్జిగ చిలుకుతుంది అని అన్నాడేమో అన్నమయ్య!

దైవకటాక్షం అనబడే మజ్జిగ రేయనక పగలనక, వాడవాడలా, మూలమూలలా వ్యాపించి ఉంది. శ్రీవేంకటేశ్వరుణ్ణి భక్తితో కొలిచి, మనస్పూర్తిగా నమ్మి మానవ జన్మ అనే మండుటెండనుండి ఉపశమనం పొందండి అని వైష్ణవులు ఈ కీర్తనని అన్వయించి తాత్విక అర్థం చెప్పవచ్చు. నేను మాత్రం అన్నమయ్య సామాజిక దృక్పథాన్నీ, కవి హృదయాన్ని చూస్తున్నాను ఈ కీర్తనలో!

కొన్నిపదాలకు అర్థాలు (Context based Meanings)

చల్ల = మజ్జిగ
రేలు = రాత్రి
పిక్కటిల్లు = పిగులు, ఉబుకు, పొంగు
చన్నులు = రొమ్ములు
గుబ్బెత = దిట్టమైన చన్నులున్న యువతి
అక్కున = రొమ్ములమీద, గుండెపైన
వడచల్లు మేను = తాపము చల్లేటి దేహం, చల్లని దేహం
జవ్వని = అందగత్తె
జడియు = కదులు, చలించు, భయపడు
కమ్మనితావు = కమ్మని సువాసన
నేడయక = వెళ్ళిపోకుండ, దూరమవ్వకుండ
అంకులకరములు = చిగురుపోలిన మెత్తని చేతులు, పల్లవపాణులు
జంకెన = భయపడుతు, తికమకపడుతు

*

పలచని చెమటల బాహుమూలముల…

అవినేని భాస్కర్

 

Avineni Bhaskarజానపద శైలిలో, పామరుల వాడుక భాషలో, అచ్చ తెలుగులో అన్నమయ్య పలు కీర్తనలు రాశాడు. దంపుడు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జాజర పాటలు, వసంతాలాటల పాటలు (పసుపు నీళ్ళు చల్లుకునే పండుగ – హోలీ వంటిది), వెన్నెల్లో నృత్యం చేసుకుంటూ పాడే పాటలు, పెళ్ళి పాటలు, జలక్రీడా పాటలు ఇలా ఎన్నెన్నో జానపదాలు రచించాడు.

వెన్నెల్లో యువతీ యువకులు కోలాటం చేస్తూ పాడుకునే జానపదంగా “నెయ్యములు అల్లో నేరేళ్ళో” పాటని భావించవచ్చు. 

శ్రీవేంకటేశ్వరుడు-అలమేలుమంగలే యువతీ యువకులై నృత్యం చేస్తూ పాడుతున్నట్టు అన్వయించుకోవచ్చు. లేదా కోలాటం ఆడుతున్నవాళ్ళు పద్మావతి-పెరుమాళ్ళ సంగమాన్ని కీర్తిస్తున్నట్టూ అన్వయించుకోవచ్చు.
 
విరహంతో వేచి విభుణ్ణి చేరుకుంది తరుణి. ఆ దివ్య దంపతుల ప్రియసంగమమే ఈ కీర్తనలో పొందుపరిచిన భావం. ప్రణయ మూర్తులైన పద్మావతీ శ్రీవేంకటేశుల కలయికలో మనసులను మురిపించే ప్రేమ విలాసములు, తనువుల తపనలను తీర్చే శృంగార కేళీలు ఉన్నాయి. 
 
 
పల్లవి
నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో
 
చరణాలు
పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో
 
తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో
 
గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు(లే)
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుప గుగ్గిళ్ళో


తాత్పర్యం (Meaning):
అలమేలుమంగా-శ్రీనివాసుల పొందిక అల్లో నేరేడుపళ్ళలా తీయనిదా? “అబ్బా ఎంత అన్యోన్యమైన జంట!” అని ఉవ్వుళ్ళు ఊరించేటువంటిదా?
 
విరహంతో వేచియున్న ఆమె మేను చెమరించింది. అమె చంకలనుండి పలుచని చెమటలు కారిపోతున్నాయి. చెమటల ఊటలనిండిన ఆమె బాహుమూలములు కొలనులవలే అందంగా ఉన్నాయి. పైటంచులో ముత్యాలు పొదిగిన చీర కట్టుకుని ఉంది ఆమె. ఆ చీరచెంగుని తీసి విసనకర్రలా పట్టుకుని విసురుకుంది. చెంగులోని ముత్యాలు తళతళ మెరుస్తున్నాయి. విసిరిన జోరుకి చెమట చుక్కలు చిరుజల్లుల్లా రాలుతున్నాయి.
 
స్వామి వచ్చాడన్న తన్మయత్వంలో ఆమె కన్నులనుండి బాష్పాలు ఫళఫళమని రాలాయి. అప్పుడామె చిలిపి అలకలలు నటిస్తూ, పెదవుల్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంది. మర్రిపళ్ళలా ఎర్రగా ఉన్న ఆమె పెదవులు కవ్విస్తున్నాయి. అధరామృతం పంచే ఆ పెదవులు అతనిని గుటకలు వేయిస్తున్నాయి.
 
నానావిధ పరిమళములతో సింగారములొలికే శ్రీవేంకటేశుడి కౌగిలిలో కలిసిపోయింది ఆ శ్రీమహాలక్ష్మి. తాళలేని విరహాన్ని ఆ విభుని కలయిక చల్లారుస్తుంది. ఆ జంటయొక్క మోహం ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంటే… ఆ తాపవేళలో మోహానికి అధిపతియైన మన్మథుడు తన చెరకు విల్లునుండి వారి మీదకి పువ్వుల బాణాలు సంధించాడా లేక ఇనపగుగ్గిళ్ళు విసిరాడా అని సందేహం కలుగుతోంది. ఇనుపగుగ్గిళ్ళు విసిరాడా అన్న సందేహం ఎందుకు కలిగిందంటారా?  వారి నఖములూ, దంతములూ ఇరువురిమేనా చేస్తున్న గాయాలటువంటివి మరి?
 
విశ్లేషణ :
నెయ్యములల్లో నేరేళ్ళో = నెయ్యములు + అల్లో నేరేళ్ళు అని పదాలను అర్థం చేసుకోవాలి.
వెన్నెల రాత్రులెంత ఆహ్లాదకరమో అంత ఆహ్లాదకరం ఈ “అల్లోనేరేళ్ళో” అన్న నుడి. అంతకంటే ఆనందం పద్మావతీ-శ్రీనివాసులు ప్రణయం.
 
చమటలూరిన చంకలు అందంగా ఉన్నాయని వర్ణించడం ఏంటి అనిపించవచ్చు! మామూలుగా చెమట ఇంపైనది కాకపోయినా కోరికలవశమై మన్మథకేళికి సిద్ధమైనవేళ చంకల్లో కారే చెమటల్లో ఆకర్షించే పరిమళముంటుందట. అలసినప్పుడు ఒంటిపై కారే చెమటకీ, కామవశమైనప్పుడు చెమర్చే చమటకీ తేడాలుంటాయని నేటి పరిశోధనలు కూడా చెప్తున్నాయి. అన్నమయ్య కీర్తనల్లో పలుచోట్ల చంకల గురించి, చెమట గురించి వర్ణించబడియుంది. అన్నమయ్యే కాదు, మరి కొందరు కవులుకూడా చంకల చెమట గురించి అందంగా వర్ణించిన సందర్భాలున్నాయి. చంకల పరిమళాన్నిబట్టే హస్తిణి, చిత్తిణి, శంకిణి, పద్మిణి అని స్త్రీనలను గుర్తించేవారట. అన్నమయ్యే మరొక కీర్తనలో “కప్పులు తేరేటి కస్తూరి చంకల కొప్పెర గుబ్బల గొల్లెత” అని రాశాడు.
 
ఆమె విసనకర్రతో విసురుకుంది అని రాస్తే కవిత్వం ఎక్కడుంటుంది? పైట చెంగుతో విసురుకున్నట్టు రాయడంలోనే కవిహృదయం ఉంది. ఆ రోజుల్లో కూడా మగువలు “వర్క్ చీరలు” కట్టేవారు అన్నది మనం గమనించాలి.
 
ప్రణయంలో భావావేశాలు, మనోవికారాలూ, అలుకలూ, చిరుకోపాలూ, నవ్వులూ సహజం కదా? విరహంతో వేచి విసిగిపోయి ఉన్న నాయిక నాయకుని రాకతో వెంటనే ఆనందంలోకి జారిపోదు కదా? కోపం చూపుతుంది, నిందిస్తుంది, ఏడుస్తుంది, అలుగుతుంది. అతను ఆమె అలుక తీరిస్తేగానీ మనసు సహజ స్థితికి చేరుకోదు కదా?
 
శ్రీవేంకటేశుడు అలంకార ప్రియుడు. “గరగరికల వేంకటపతి” అట! వారి రతిలోని తీవ్రతని “మన్మథుడి పువ్వుల బాణాలు వారిని ఇనుప గుగ్గిళ్ళులా తాకాయి” అని సమర్థిస్తున్నాడు అన్నమయ్య.
 
ఈ కీర్తనని ఒకానొక సినిమాలో వాడుకున్నారు. బాలు పాడారు. స్వరపరచిన తీరువల్ల విన్నవారికి మరొక అర్థం స్ఫురించవచ్చు. కాబట్టి పైన ఇచ్చిన ఆడియోలు వినమని మనవి.
 
కొన్ని పదాలకు అర్థాలు (Meaning) :
నెయ్యము = స్నేహము, ప్రియము
అల్లోనేరేళ్ళో = ఆడపిల్లలు వెన్నెల రాత్రుల్లో ఆడుకునే ఒక ఆట, స్త్రీలుపాడే పాట (జానపదం)
ఒయ్యన = తిన్నగ, మెల్లగ, Gently, Softly
ఉవ్విళ్ళూ = తపనలు, తహతహలు, eagerness
 
పలచని చెమట = లేత చెమట, సన్నని చెమట
బాహుమూలములు = చంకలు, కక్షములు
చెలమలు = గుంటలు, pit, కొలనులు, పల్లము
చెలువము = అందము, సౌందర్యము
థళథళ = తళతళ
ముత్యపు = ముత్యాల
చెఱగు = చెంగు, చీర కొంగు, పైట
సురటి = విసనకఱ్ఱ
దులుపేటి = దులుపుతున్న
నీళ్ళా తుంపిళ్ళో = తుంపరలు, వాన చినుకులు
 
తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళు = అదురుతున్న కళ్ళనుండి రాలేటి కన్నీరు
(తొరిగేటి = రాలేటి)
చిటిపొటి యలుకలు = చిన్న చిన్న గొడవలు, చిలిపితగాదా, అల్పమైన , silly fights
చిరునగవే = చిరునవ్వులే
వటఫలంబు = మర్రిపండు
వన్నెల = సొభగు
మోవి = పెదవి
గుటక = ఒక్కసారి మింగగల
గుక్కిళ్ళు = గుటక మింగు శబ్ధము
 
గరగరికల = సింగారమైన, అలంకారములుగల, చక్కదనాలుగల
బచ్చనలు = కలయికలు, కూటములు, ఒదిగిపోవడము
మరునివింటి = మన్మథుడి చెరకు విల్లు
కమ్మని = కమ్మనైన
అంప విరులు = పువ్వుల బాణాలు / బాణాల పువ్వులు(!?)
గురి = లక్ష్యం
తాకు = తాకేటి
గుగ్గిళ్ళు = ఉడకబెట్టిన శనగలు

ఒకటిపై ఒకటి నీ ఉపాయాలు…

 అవినేని భాస్కర్ 

Avineni Bhaskarవెంకన్నకి మంగమ్మంటే వల్లమాలిన ప్రేమ, మోహం. ఆమెతో మాట్లాడటానికి, తీయ తీయగా ఆమె చెప్పే కబుర్లు వినడానికీ, ఏకాంతంగా ఆమెతో సమయం గడపడానికి, అతిమెత్తని ఆమె మేను తాకడానికీ, సరసాలాడటానికీ అతనెన్నెన్ని ఉపాయలు చేస్తాడో! “మహానుభావా, నీ ఎత్తుగడలన్నీ ఎందుకో నాకు బాగా తెలుసు” అని ప్రేమగా విసుక్కుంటుంది మంగమ్మ.

 
శ్రీవారి ఉపాయాలేవిటో శ్రీదేవి మాటల్లోనే పాటగా రాశాడు అన్నమయ్య!

పల్లవి
ఒకటిపై నొకటి నీవుపాయాలు
వెకలి నీ విద్యలెల్ల వెల్లవిరి గావా

చరణం 1
సందడి నాచేయి* ముట్టి సరసాలాడేకొరకే
పందెమాడవచ్చేవు పలుమారును
మందలించి నాచేత మాటలాడించవలసి
అందపుఁగత లడిగే వది నే నెఱఁగనా

చరణం 2
యేరా నాకుచగిరు లిటు ముట్టేయందుకుఁగా
హారములు చిక్కుదీసే వది మేలురా
గోరికొన దాఁకించేకొరకుఁగా చెక్కుముట్టి
యీరీతి వేఁడుకొనే విన్నియుఁ దెలిసెరా

చరణం 3
యీకడ నన్నుఁగూడే ఇందుకుఁగా నింతసేసి
యేకతమాడేనంటా నెనసితివి
పైకొని శ్రీవేంకటేశ బడివాయకుండా న-
న్నాకుమడిచిమ్మనేవు అవురా నీవు
 
               * మూలంలో “చేఇ” అని ఉంది.

తాత్పర్యం (Meaning) :

స్వామీ! నా పొందుకోసం నువ్వు పడే తపన, చేసే ప్రతిచర్య నాకు తెలుసు. వెకిలిగా నువ్వు వేసే ఎత్తుగడలకి భావాలేంటో నాకిట్టే తెలిసిపోతాయి.

దగ్గరచేరి పదేపదే నా చేతులు పట్టుకుని ఒట్లు పెట్టేది? నాతో సరసాలాడటానికే అని నాకు తెలుసు. నా మాటలు వినడం నీకు ఆనందం. నా చేత కబుర్లు చెప్పించుకోవడం, నన్ను అజ్ఞాపించి కథలు చెప్పించుకోవడం నా గొంతులో పలికే మాటలు వినడానికేనని నాకు తెలియదా?

నా మెడలో ఉన్న హారాలు, గొలుసులు సరిగ్గానే ఉన్నాయి. అయినా నువ్వు నా దగ్గరకొచ్చి హారాలు సవరించేది నా చన్నులను తాకాలన్న ఆశతోనే అని నాకు తెలుసు. మాటిమాటికీ నా ముఖాన్ని నీ చేతుల్లోకి తీసుకుని బతిమలాడేది మునివేళ్ళతో నా బుగ్గలు గిల్లుకోవడానికే అని నాకు తెలియదా?

నన్ను కలుసుకోవాలని ఏవో వింతలు, వుపాయాలు చేసి ఇలా దగ్గరయ్యావని నాకు తెలుసు. శ్రీవేంకటేశా,  తాంబూలం చిలకలు చుట్టివ్వమని అడిగేది నన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వకుండా ఇంకాస్త సమయం నీ పక్కనే ఉంచుకోడానికే అని నాకు తెలియదా?
కొన్ని పదాలకు అర్థాలు :
ఉపాయాలు = Tricks, ఎత్తుగడలు, పన్నుగడలు, పొందులు
వెకలి = వెకిలి, పిచ్చి, అవివేకం
వెల్లవిరి = వెల్లడి, తెలిసిపోవడం, ప్రకటిమైపోవడం
సందడి = చుట్టుముట్టి, సమీపించి
పందెమాడు = ఒట్టుపెట్టు, ప్రతిజ్ఞచేయు
మందలించి = ఆజ్ఞాపించి
కుచగిరులు = చన్నులు
చెక్కు = చెంపలు, బుగ్గలు
ఏకతమాడు = పన్నాగంపన్నుట, ఉపాయం ఆలోచించుట
ఎనసితివి = దగ్గరచేరితివి, పొందుగూడితివవి
పైకొని = అక్కునచేరి
బడివాయక = వదిలిపెట్టకుండ

ఒకపరి కొకపరి కొయ్యారమై..

అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకొన్ని అనుభూతులు అనుభవించినకొద్ది ఆనందాన్నిస్తాయి. భార్య అలమేలుమంగని గుండెలపై పెట్టుకుని తిరుమల కొండపై నెలకొని ఉన్న వెంకన్న దర్శనం అలాంటిదే! మధురానుభూతిని కలిగించే దృశ్యం ఆ సౌందర్య మూర్తుల పొందు. ఎన్ని సార్లు చూసినా తనివి తీరనిది వారి ఒద్దిక. ప్రతిసారీ కొత్తగానూ, కిందటిసారికంటే దివ్యానుభవంగానూ అనిపిస్తుంది. వారి కీర్తినే జీవితకాలం పాడిన కవి అన్నమయ్యకి కొడుకుగా జన్మించిన పెదతిరుమలయ్యకి ఆ దర్శనం కొత్తకాదు. తేజోవంతమైన జేగదేకపతి-జలజముఖి అందాన్ని తన కీర్తనలో పెదతిరుమలయ్య ఎలా వర్ణిస్తున్నాడో వినండి.
అయ్యవారికెన్ని అలంకరణలు చేసినా అందాన్ని ఇచ్చేది మాత్రం ఆమెవల్లేనట! అదే ఈ కీర్తనలో దాగున్న భావం.

పల్లవి :

ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున గళలెల్లా మొలచినట్లుండె


చరణం ౧
జగదేకపతిమేన జల్లిన కర్పూరధూళి

జిగిగొని నలువంక జిందగాను

మొగి జంద్రముఖి నురమున నిలిపెగనక

పొగరువెన్నెల దీగబోసినట్లుండె


చరణం ౨
పొరి మెఱుగు జెక్కుల బూసిన తట్టుపుణుగు

కరగి యిరుదెసల గారగాను

కరిగమన విభుడు గనుక మోహమదము

తొరిగి సామజసిరి దొలికినట్లుండె


చరణం ౩
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను

తఱచయిన సొమ్ములు ధరియించగా

మెఱుగుబోణి యలమేలుమంగయు దాను

మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె

 


తాత్పర్యం

కళలన్నీ ముఖములో మొలకలెత్తినట్లు నిత్యం కొత్తకొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం! (కారణమేమిటో చరణాల్లో వివరిస్తున్నారు పెదతిరుమలయ్య!)

అలంకరణకోసం దేవుడి ఒంటిపైన చల్లిన కర్పూరధూళీ కింద రాలుతుందట. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతు నలువైపులా రాలుతు ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావడం ఏంటా అంటారా? కారణం ఉంది. అమ్మవారు చంద్రముఖికదా? ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారుకదా? రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరువెన్నెలలు కురిసినట్టు కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనట!

భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుండి కారుతుందట. రెండుపక్కలా కారుతువున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. (మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంటిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువవ్వడంవల్ల కంటికీ చెవికీ మధ్యభాగంలో నీరు ఊరి స్రవిస్తుంది). మదపుటేనుగుతో పోల్చడం ఏంటి? అమ్మవారిని కరిగమన అని అంటాం కదా? అంటే ఏనుగువంటి ఒయ్యారమైన నడకగలది అని అర్థం. కాబట్టి స్వామివారిని కరిగమన విభుడు అన్నాడు కవి. దేవుడికి దేవిపైనున్న మోహాన్ని మదపుటేనుగు చంపలపైన ఒలికిపోతున్న ద్రవంతో పోల్చాడు కవి.

శ్రీవేంకటేశుడు బోలేడన్ని నగలు ఒంటిపైన ధరించుకుని, మెరిసిపోయే సొగుసుగల పద్మాసనితో(అలర్‌ మేల్‌ మంగై) కలిసి దర్శనమిచ్చే ఆ దృశ్యం ఎలా ఉందీ? మెఱుపు, మేఘము కలిసి మెఱినంత కాంతివంతంగా ఉందిట! (కారు మబ్బాయన రంగు, తళతళలాడే మెఱుపేమో ఆవిడ రంగు!)


ప్రతిపదార్థం :

ఒకపరి = ఒకసారి
ఒయ్యాం = అందం, సౌందర్యం

మేన = ఒంటిమీద
జల్లిన = చల్లిన
జిగికొని = వెలుగుతు, కాంతివంతమై
ఉరమున = గుండెలపైన, వక్షస్థలమున
పొగరు వెన్నెల = పూర్ణకాంతితో వెలుగుతున్న వెన్నెల, తట్టమైన వెన్నెల
దిగబోసినట్లు = కిందకి జారినట్టు, కురిసినట్టు

పొరిమెఱుగు =అత్యంతమెఱుగు
జెక్కుల/చెక్కుల = చెక్కిళ్ళు, బుగ్గలు
తట్టుపుణుగు = పునుగు (అలంకరణ పూసే వాసన ద్రవ్యం)
కరిగమన = ఏనుగులాంటి నడకగల
విభుడు = స్వామి, నాయకుడు

మదము = మదమెక్కిన ఏనుగుకళ్ళలో కారే నీరు
తొరిగి = కారు, స్రవించు
సామజసిరి = ఏనుగు
దొలికినట్లు = కారుతున్నట్టు

తఱచయిన = బోలెడన్ని
మెఱుగుబోణి = మెరిసేసొగసుగల యువతి

వేటూరి కిలికించితాలు!

Veturi-Best-useful-song-pic-1(జనవరి 29: వేటూరి పుట్టిన రోజు )

సినిమాల్లో, నాటకాల్లో దృశ్యరూపంలోనో, సంభాషణల్లోనో చెప్పలేని గాఢమైన భావాలను పాటల రూపంలో చెప్పేవారు. కాబట్టి పాటలో కథ సందర్భమూ, పాత్రలూ, కథ పోకడని బట్టి సాహిత్యం రాసిచ్చేవారు. కాలక్రమేణా కథల్లో సారం తగ్గిపోయి పాటలయొక్క అవసరంలేకపోయినా పూర్వం ఉన్న ఆచారాన్ని ఉల్లంఘించే సాహసం చెయ్యలేక కొనసాగించారు. పాటలకోసం ఐదారు సందర్భాలు సృష్టించడం మొదలైంది. సహజమైన సన్నివేశాలకు రాసేరోజుల్లో కవికి కథే ప్రేరణనిచ్చేది. కథలోని బలాన్ని బట్టి సన్నివేశానికి అమరేలా కవి తన ప్రతిభను చూపిస్తూ సాహిత్యం అందించేవాడు. కవి రాసిన సాహిత్యానికి సంగీత దర్శకులు బాణీకట్టేవారు.

సృష్టించిన సన్నివేశాలు కవినెలా ప్రేరేపిస్తాయి? మెల్లమెల్లగా సంగీత దర్శకుల ఆధిక్యత మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ లు ట్యూన్ లు (బాణీలు) ఇచ్చేవారు కవులు దానికి తగినట్టు పదాలు కూర్చేవారు. ఛందోబద్దంగా పద్యాలల్లే ప్రతిభ ఉన్నా సంగీత దర్శకులిచ్చే గజిబిజి ట్యూన్స్-లో పదాల్ని అమర్చడం అందరికీ సాధ్యంకాలేదు. చతురత ఉన్న కొందరు కవులు తమ సొంత ప్రతిభనూ, చెయ్యదలచిన ప్రయోగాలనూ, చమత్కారాల్నూ ఆ ట్యూన్-లో ఇమిడ్చేవాళ్ళు. బలమైన కథలున్న రోజుల్లో సినిమాలకి పాటలు రాసిన కొందరు భాషా ప్రవీణులు కథలు నీరసపడిపోయే రోజులకల్లా నీరుగారిపోయి పాటలు రాయడం మానుకున్నారు.

వేటూరి సుందరరామమూర్తి సినిమాల్లోకి ప్రవేశించినది ఆ సంధి కాలంలో. సరైన సన్నివేశం వస్తే ఒకపక్క సారవంతంగా రాసిస్తూనే మరో పక్క అర్థంపర్థంలేని సన్నివేశాలకు తన చమత్కారాన్నీ, భాషా ప్రావీణ్యాన్ని పాటల్లో నింపుతూ సినిమా పాటల్ని కొత్త మార్గంలోకి నడిపాడు. ఆ కాలంలో ఈ మార్పు ఒక్క తెలుగు సినిమా పాటలకే కాదు, మిగిలిన భాషల సినీ సాహిత్యానికీ వర్తించింది.

ఎలాంటి ట్యూన్ ఇచ్చినా ఆశువుగా, అతివేగంగా, కొత్తగా, చమత్కారంగా, చిలిపిగా రాయగలిగినందువలనేమో వేటూరికి 1970లలో ఇబ్బడిముబ్బడిగా అవకాశాలొచ్చాయి. వేటూరి ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు!

అట్లాంటి రోజుల్లో, లోతైన కవిత్వాన్నీ, భాషా ప్రతిభనీ ప్రదర్శించే అవకాశం కల్గిన ఓ అరుదైన సన్నివేశం ఇది. ఆదిత్యా 369 సినిమాలోని ఆ సందర్భం ఏమంటే, “హీరో, హీరోయిన్ లు టైమ్ మెషిన్ ఎక్కి వెనక్కి ప్రయాణిస్తారు. వాళ్ళు కృష్ణదేవరాయలు పరిపాలించిన పదహారో శతాబ్దానికి చేరుకుంటారు. విజయనగర సామ్రాజ్యపు ఆస్థాన నర్తకి నాయకుడి మీద మనసుపడుతుంది. వశపరుచుకుని మోజు తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని చూసిన హీరోయిన్ అపార్థం చేసుకుని ఉడికిపోతుంది. నర్తకిని వదిలించుకుని జరిగింది చెప్పి హీరోయిన్ కోపాన్ని తీర్చాలి”. ఈ సన్నివేశానికి పాట రాయడంలో రచయితకు ఏం సవాలు ఉంటుంది అనుకోవచ్చు! కథ నడుస్తున్నది పదహారవ శతాబ్దం.

ఇచ్చిన ట్యూన్ కి ఆ నాటి భాషలోనూ నేటి భాషలోనూ పాట రాయాలి. ఒక పల్లవి, రెండు చరణాలు. పల్లవి మూడుసార్లొస్తుంది. మొదటిసారి ఆస్థాన నర్తకి పాడుతుంది, రెండోసారి హీరో పాడుతాడు, మూడోసారి హీరోయిన్ ఒకలైను, హీరో ఒకలైను పాడుతారు. ఒకే పల్లవి లింగభేదంలేకుండ, ముగ్గురికీ సరిపోవాలి. భావపరంగానూ, భాషాపరంగానూ పల్లవికి న్యాయం చెయ్యాలి. మొదటి చరణం పదహారవ శతాబ్దానికి తగినట్టుగానూ, రెండో చరణం ఇరవయ్యో శతాబ్దానికి చెందిన నాయకుడి భాషలోనూ ఉండాలి.

పల్లవి
నెర జాణవులే వరవీణవులే కిలికించితాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

చరణం 1
మోమటు దాచి, మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి వంపులలో హంపికళా ఊగే ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమిరా

చరణం 2
చీకటి కోపం చెలిమికి లాభం, కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం, ఈ చలిలో!
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి, పగవానికి ఒక న్యాయమింక సాగునా

కొన్నిపదాలకు అర్థాలు :
జాణ = నేర్పెరిగిన వ్యక్తి, నేర్పరి
వరవీణ = వరములు పొందిన వీణ
కిలికించితం = తెప్పరిల్లిన స్థితి; ఎదురుచూడనివేళ ప్రియుడు కౌగిలించుకుంటే ప్రియురాలు నిశ్చేష్టురాలయ్యే స్థితి
మృదుపాణి – మృదువైనచేతులుగల వ్యక్తి
సన్న = (కను) సైగలు; జాడ; సంజ్ఞ; సిగ్నల్ – (అన్నమయ్య కీర్తనల్లో విరివిగా వాడబడిన మాట ఇది)
మోవి = పెదవి
తుంగ – హంపీనగరంలో ప్రవహించే నది – మరో అర్థం : ఒకరకమైన (దుంప) గడ్డి
విరిపానుపు – పువ్వుల పడక/మంచం

జాణ అంటేనే నేర్పరి, “నెర” అని విశ్లేషణం కూడా జతచేసి చెప్తున్నాడంటే “అన్నిటా నేర్పరి” – జాణతనం తొణికిసలాడే వ్యక్తి అని. చాలా మందికి కలిగే అనుమానం “జాణ” అని మగవారిని అంటారా అని? జాణ రెండులింగాలకూ సరిపడే పదం కాబట్టి ఈ పదాన్ని చక్కగా వాడుకున్నాడు వేటూరి! పూర్వం “నరవరా కురువరా” పాటలో ఇలాంటొక సన్నివేశంలో సుముద్రాల గారు కూడా “జాణ” అన్న పదం వాడారు.

పాటలోని భావం (క్లుప్తంగా):
శృంగార చేష్టలు చేసి, వరవీణపలికే స్వరాలులాంటి తీయని మాటలు చెప్పి పులకింపజేసే నేర్పరివి. మెత్తటి చేతులుగలవాడివి / (దానవి). కన్నుల్లో సరసపు వెన్నెల కాస్తుందా అనిపించేలాంటి చూపులు, కనుసైగలలో గుసగుస సందేశాల తెమ్మెరలు! — ఈ భావం కవ్వించే నర్తకి పాడినా సరిపోతుంది, అలిగిన ప్రేయసీ, ప్రియులు పాడుకున్నా సరిపోతుంది.
నర్తకి కవ్విస్తూ పాడే చరణంలో రెండు లైన్లలో హీరో తనని ఎందుకాకర్షించాడో చెప్తుంది. తర్వాత తన అందం గురించి, తన స్థితి గురించీ చెప్తుంది. నాటి కళాసంపదకి నిలయమైన హంపికళంతా తన సొగసుల్లోనే ఉందనీ, వారి రాజ్యంలో సాగే తుంగా నది పొంగులే తన పయ్యెదలో పొంగులనీ పాడుతుంది! (ఎండు బీడునేలపైన ఒక వర్షం పడగానే మరసటి రోజుకల్లా తుంగ దుంపలు మట్టిని చీల్చుకుని పైకి మొలకెత్తుతాయి, అవి గోపురాల్లా కనిపిస్తుంటాయి). ఆడది కోరి వస్తుంటే చిరాకుపడి వెళ్ళడం మర్యాదకాదు. కనీసం ఈ పూలపానుపైనా సవరించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళరాదా అని గారాలు పోతోంది. గమనిస్తే, ఇక్కడ వేటూరి వాడిన ఉపమానాలు రెండూ (హంపి కళ, తుంగ నది) విజయనగర సామ్రాజ్యానికి చెందినవే. చక్కగా సాహిత్యంలో ఒదిగేవే!.
ఇక రెండో చరణంలో అలిగిన తన ప్రేయసిని ముద్దుచేసుకుంటున్నాడు హీరో. “ఏంటి ప్రియా అలిగావా? నీకు తెలియదేమో చీకట్లో అలిగిన ప్రేయసిని బతిమాలుతూ, ప్రాధేయపడుతూ ఉంటే వలపు ఇంకాస్త రసవత్తరం అవుతుంది. వెన్నెల సొగసూ, చలి రాత్రీ కలిసి తాపాన్ని పెంచేస్తూ వయసుకు మరికాస్త ఉద్వేగాన్నిస్తుంది. ఉడుక్కోవడం ఆపి నా మన్మథ సామ్రాజ్యపు రతీదేవిలా, నా వలపు కోవెలలో హారతిలా నవ్వమని అడుగుతున్నాడు. కోపాన్ని పగవాళ్ళతో ప్రదర్శించాలిగానీ పరువంలో ఉన్న చెలికాడితో కాదు” అని అంటున్నాడు.
ఈ పదాలన్నీ ఎక్కడికక్కడ ఎంత చక్కగా నప్పాయో గమనిస్తే, వేటూరి తనకు తాను ఒక ముద్ర ఎలా ఏర్పరచుకున్నాడో తెలిసిపోతుంది.

-అవినేని భాస్కర్ 

Avineni Bhaskar

నన్ను మాట్లాడనివ్వు!

నన్ను మాట్లాడనివ్వు
స్పష్టంగా, తీర్మానంగా-

నీకు నచ్చదుకాబట్టీ
నీ అనుమతిలేదు కాబట్టీ
నా అవసరాలను రోజూ
అగ్గికి ఆహుతివ్వాలా?

నీలాగే
నేనూ జీవితమం గురించి
వేయి కలల్ని మోసుకొచ్చాను
అనుదినమూ నా కలల్ని చంపేసేలా
వేయి మేకులు కొట్టేస్తున్నావు!

నీ అనుమానాలకల్లా
నేను బాధ్యురాల్ని కాను
విచారణలు, నేర నివేదికలు,
నా మీద నువ్వు ప్రవేశ పెట్టే
అవిశ్వాస తీర్మానం –
వీటన్నిట్నీ చర్చించేందుకు
పడకగది నీ పార్లమెంటు కాదు.

నన్ను మాట్లాడనివ్వు!

మిక్కుటమైన బాధల్ని
బొమ్మగీసి చూపించలేను
నా అయిష్టాన్ని
నీకు విశదపరచటానికి
యుద్ధం సాగించలేను!

– అనార్ , తెగించు (ఊడఱు) అన్న స్త్రీ సాహితీ సంకలనంలోనుండి

Anar02

శ్రీలంకకి చెందిన ప్రముఖ తమిళ కవయిత్రి  ఇస్సాత్ రిహాణా అజీమ్ గారు “అనార్‌” అనే కలంపేరుతో రాస్తారు. ఈమె కవితల్లో శృంగారం, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ భావాలే ఎక్కువగా కనబడతాయి. ఈమె కవితా సంపుటాలు శ్రీలంకలోనూ, భారత దేశంలోనూ పలు సాహితీ పురస్కారాలు అందుకున్నాయి.

ఊడరు –  ఈ స్త్రీ సాహితీ సంకలనంలో పదమూడు వ్యాసాలు, ఐదు కథలు, ఇరవైనాలుగు కవితలు ఉన్నాయి.  రంజి (స్విస్), దేవా(జెర్మని), నిరుపా(జెర్మని), విజి(ఫ్రాన్స్) – వీరి సమిష్ఠి కృషితో 2002 లో ప్రచురించబడినది ఈ సంకలనం.

 

~ అవినేని భాస్కర్

Avineni Bhaskar