గజ్జెల పొంగు 

 

-బ‌త్తుల ప్ర‌సాద్
~

prasadమానాయన దానంమామ పెద్ద శింత శెట్టు కింద కూకోని ఉండిరి… మా నాయన నుల‌క పేనుతా ఉంటే దానం మామ మాత్రం బీడీ ముట్టిచ్చుకోని దాని పొగ పెరుకుతా ఉండాడు. బీడి పొగను గుండె కాడికి పీకి దాన్ని అప్పుడింత ఇప్పుడింత బయటకు ఇడుచ్చా మా నాయన్ను చూసి మామా నువ్వు నుక బో పేనుతావు లేబ్బా అన్నాడు.దానికి మా నాయన ఊరుకోకుండా ఏదో శెతురు మాట వేసినాడు.

అప్పుటికే బీడి పొగ గుండెల్లోకి లాగి ఉన్నె దానం మామకు పొరపోయింది. దాంతో నవ్వడం దగ్గడం తిరుక్కున్నెడు కాసేపటికి దగ్గి దగ్గి ఊపిరి పీల్చుకోని  నీ యెక్క నీ నోట్లో నోరు పెట్టగుడ్దు మామ ….అని ఆరిపోయిన బీడీని మల్లీ ఎలిగిచ్చి ఓ రెండు దమ్ములు కొట్టి నేల‌ మీద ఎంగిలి ఊసి ఆ ఎంగిట్లో బీడీని ఆర్పినాడు.మా నాయన మాత్రం ముసి ముసి నవ్వు నవ్వుకుంటా అదే పని శేచ్చాన్నాడు.

దానం మామ మా నాయనతో  ‘కాదు మామా దీనెక్క కూరాకు తినక శానా దినాు కాలా’ అన్నాడు దానికి మా నాయన అవునోయి ఈ మధ్యన ఎవురు గాని పల్లెల్లో కోయక పోయిరి నాగ్గూడా నాలిక పీకుతాంది అన్నాడు..

ఇట్ట మాట్లాడుకుంటా ఉండగానే ఆ దావన పక్క పల్లె వాళ్ళు  ఒక జీవాన్ని తోలు కోని పోతాంటే .. దానం మామ మా నాయనతో ‘ మామా ఆ జీవం దానికే ఉన్నెట్టు ఉందే’ అన్నాడు. దానికి మా నాయన ‘అవును దాన్ని సూచ్చాంటే అట్టనే ఉంది’ అన్నాడు.. దాంతో దానం మామ ‘ఓబ్బి ఆగండ్రి’ అని వాల్ల‌ను  అనేర్కల్లా వాళ్ళు  ఆగినారు.

దానం మామ నాలుగు అంగల్లో ఆడికి చేరుకోని వారితో యవ్వారం మొదు పెట్టి నాడు. ఇంత లోపల‌ మా నాయన నుల‌క పేనడం పక్కన పెట్టి తుండు గుడ్డ ఇదిలిచ్చు కుంటా వాళ్ళ కాడికి పోయినాడు. మా నాయన పోయార్కనే దానం మామ వాల్ల‌తో  అసలు విషయం కనుక్కోని .. మాకు అమ్మి పోండి అని అడుగుతాంటే .. మేము మారు బేరం చేసే వాల్లం  కాదు .. మేము కూడా కోసుకోని తినడానికే తీసక పోతాండాము అన్నారు. మా నాయన్ను ఆ మనుషు గుర్తు పట్టి నారు .. ఏమయ్యా బాగుండావా అన్నారు.. సరే మా నాయన కూడా వాళ్ళ‌తో  మాటు కలిపినాడు.. ఇంగ అందరూ అసు విషయానికి వచ్చినారు.. జీవాన్ని ఇయ్యడానికి వాళ్ళు  ఒప్పుకున్నారు గాని లెక్క కాడనే   మధ్యన వంద రూపాయలు  వారా  వచ్చింది. అట్టిట్ట చేసి బేరం యాభై రూపాయల‌ వారాతో కుదుర్చుకున్నారు.

దాంతో జీవాన్ని తీసకచ్చి మా ఇంటి పక్కన ఉండే  గురువు (పాస్టరయ్య) ఇంటి ఎనకా ఆడోళ్ళు  కక్కసుకు పొయ్యే దారిలో ఉండే యాపమాను ఏరుకు కట్టేసినారు.

మా నాయన బకెటలో కడుగు నీళ్ళు  తీసకచ్చి పోసినాడు …దానం మామ యాడిదో ఇంత వరిగడ్డి తీసకచ్చి వేసినాడు. అది ఎప్పుడు తిన్నెదో ఏమో గాని శానా ఆత్రంగా గడ్డి తిని కడుగు నీళ్ళు  తాగింది.

మా నాయన దానం మామ ఇద్దరూ జీవం ఎనకాల‌ పక్క నిబడుకోని దాని ఎనక కాల‌ తిట్టు చూసి దాని కూరాకు ఎన్ని పడ్లు  పడతాదో లెక్క చెయ్యడం తిరుక్కుండిరి. ఆ జీవం కొన్న రేటును బట్టి అది ఎంత కూరాకు పడతదో దాన్ని బట్టి కుప్ప ఎంత రేటుకు అమ్మాలి అనేది .. ఒక రేటు పెట్టుకుంటారు. మా నాయన దానం మామ ఇద్దరూ కాసేపు అట్టిట్ట మాట్లాడు కోని ఒక రేటు అనుకుండిరి. ఇది ఎట్ట లేదన్నా కూడా యాభై పడుల‌కు పైగా అరవై పడుకు లోపల‌ పడ్తది అనుకుండిరి.

రేపు ఎవరికి ఎన్ని కువ్వలు  కావాలో అడగడానికి పట్టీ కడదాము అనుకునిరి.. పోయిన తూరి ఇట్టనే కూరాకు కోసినప్పుడు  మల్లిచ్చలే అని రెండు కువ్వలు  తీసక పొయి ఆ లెక్క కోసం శానా సార్లు తిప్పిన ఫలానా మనిషిని తప్ప అందరినీ అడుగుదామనుకునిరి.

ఆ రోజు శనివారం తెల్లార్తే ఆదివారం… మల్లారోజు పండగ సందడి …జీవం వచ్చిందాన శనివారం నుండే తిరుక్కున్నెది. కక్కసుకు పొయ్యే ఆడ్లోళ్ళు ఆ దోవన పోతా ఆడ కట్టేసి ఉన్న జీవాన్ని చూసి ఓహో రేపు తెల్లారే సరికల్లా శియ్యలు ఇండ్లకు వచ్చాయన్న మాట అనుకుంటా పోయిరి.

కాలేజీలు  సదువుకుంటా సెల‌వుకు ఇండ్లకు వచ్చిన ఎడ్మాస్టర్‌ కూతురు. గురువు కూతురు ఇద్దరూ ఆ జీవం కాడ నిబడి దాన్ని చూసి ‘అయ్యోదీన్ని కోస్తారా ’ అని ఒక్కరవ్వ ఎచ్చల‌ తనం చూపిస్తా ఉంటే …ఈ మాటలు ఇన్నె మా సంతోష శిన్నమ్మ ..‘ఏమ్మామీరు తినరా’ అని అడిగింది.. ఆ శిన్నమ్మ వాళ్ళ ఇండ్లల్లో పని శేచ్చాది కాబట్టి వీళ్ళు తినేది తినంది ఆమెకు తెలుసు.. ‘ ఆ తింటాములే’ అనిరి.. మరి తినేప్పుడు దాన్ని జూసి అట్ట అనుగుడ్దు ..దేవుడు కొన్నింటిని మన జాతి వాల్ల‌కు  తినడానికే పుట్టిచ్చినాడు…మన జాతి వాళ్ళు  తర తరాుగా వీటిని తినే బతుకుతుండాము అని వాళ్ళ‌కు  ఒక్కరవ్వ ఇవరంగా చెప్పే తలికల్లా వాల్ల‌కు  ఎచ్చులు  వదిలి పెట్టి కుచ్చల్లు  ఊపుకుంటా ఎల్లబారిరి.

అక్కడుండే మిషనరీ కాంపౌండు లో అందరూ ఒకే కులానికి చెందిన వారు ఉండటం.. ఎవరు ఎన్ని రకా కూరలు తిన్నా కూడా అందరూ ఈ కూరను మాత్రం  ఇష్టపడి తింటారు.అందుకే దీన్ని ‘కులం కూరాకు’ అని కూడా అంటారు. అక్కడ ఉండే వారుకాకుండా ఊర్లో శానా మంది ఈ కులానికి చెందిన వారు ఉంటారు.

వాళ్ళ‌లో  దాదాపు అందరూ ఈ కూరాకు తినడానికి ఇష్ట పడే వారే.. ఈ కూర ఇంటికి పోతే ఆ ఇంట్లో పండగ సందడి ఉన్నెట్టే.అందరికీ బాగా ఇష్టమైన కూరాకు ఇది. ఊర్లో ఉండే వాల్ల‌కు  ఆ చర్చి లో సభ్యులే ప్రతి ఆదివారం చర్చికి వచ్చినపుడు అందరూ కలుసుకుంటుంటారు.

మామూలుగా ఈ కూరాకు పక్కనే ఉండే పల్లె నుండి అందరి ఇండ్లకు అప్పుడప్పుడు వస్తుంది. తెల్ల‌ వారు జామున గంప కెత్తుకోని తీసకచ్చి ఇచ్చిపోతారు. ఆ పల్లెలో వాళ్ళు  తీసుకురానప్పుడు .. ఎప్పుడన్నా ఇట్టా జీవాలు  కనపన్నెప్పుడు మా నాయన దానం మామ ఇద్దరు కలిసి ఇట్ట జీవాల‌ను చర్చి కాంపౌండు లో ఎవ్వురికీ తెలియకుండా కోపిస్తుంటారు. ఇది వాల్ల‌కు  యాపారం కాదుగాని శియ్యల‌ కూరాకు మీద వారికుండే మునాస..ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి రాక పోయినా గూడా ఇట్ట చెయ్యడం మానుకోరు.

ఆ రోజు ఆ కాంపౌండు లో ఉండే చర్చి పనులు చేసే మనిషి కాడికి పోయి ‘ఎట్టా నువ్వు రేపు చర్చి టైము గురించి చెప్పడానికి అందరి ఇండ్లకు పోతావు కదా అట్ట పోయినప్పుడు ఎవురికి ఎన్ని కుప్పలు  కూరాకు కావాల్నో పట్టీ రాయించుకోని రా’ అని పురమాయించినారు. అట్ట పట్టీ రాయించుకోని వచ్చినందుకు నీకు ఏదో ఒకటి ఇచ్చాం లే అనారక ఆ మనిషి సరే రాపిచ్చుకోని వచ్చాలే అని ఒప్పుకున్నాడు..ఎందుకంటే ఆ మనిషి కి కూడా ఈ కూరాకు అంటే బో మునాస కాబట్టి.

daliచీకటి పడినాక ఆ గుడిలో పని చేసే ఆయప్ప కూరాకు పట్టీ కట్టిచ్చుకోని వచ్చినాడు.. దానం మామ మా నాయన అది చూసుకోని కూరాకు పడేంత మంది అయినారులే .. ఇంగ ఎవురన్నా ఇప్పుడు వచ్చినా కూరాకు దొరకదు…కూరాకు అంతా మిగకుండా అమ్ముడు పోతాంది లే అని ఇద్దరూ కుశా పడిరి. ఆ కుశాలో ఇద్దరూ గూకోని మందు తాగి .. జీవానికి దగ్గర్లోనే మంచం వేసుకుని పండుకున్నారు.. ఇంగొక రవ్వ పొద్దు పొయ్యారక పక్క పల్లె నుండి జీవాన్ని కోయడానికి కత్తులు ..గొడ్డేళ్ళు  తీసుకోని రెండు మూడు గంపలు  ఉత్తుకోని నల‌గరు మనుసు వచ్చినారు..వాల్ల‌కు  కూడా జీవాన్ని కట్టేసిన శెట్టు కిందనే సాపలు  గోనే సంచులు పర్సుకోని పండుకునిరి.

తొలి కోడి కూచ్చానే అందరూ లేసిరి.. కొందరు పెట్రమాక్స్‌ లైటు ఎలిగిచ్చే కొందరు రాత్రి తగ్గించి పెట్టు కోనున్న లాంతరు ఒత్తును పెంచిరి.. ఎంత పెట్రమాక్స్‌ లైట్‌ అయినా ఆ మబ్బుకు ఎలుగు సరిపోవడం లేదు. ఒక్కరవ్వ మసక మసక గానే ఉంది. ఆ పాటికే అక్కడికి చేరుకున్న కొందరు ఒగిసి ఒగిసి పిల్లోళ్ళు కంపమండలు ..శిదుగు తీసుకోని వచ్చి మంట ఎలిగిచ్చినారు. శానా రోజులు  అయింది జీవాన్ని కోసి …అందుకే శానా ఆత్రంగా…ఎవరు శెప్పకుండానే  పనులు చేస్తా ఉండారు.

 

జీవాన్ని పడేసి పని మొదలు  పెట్టినారు.కూతకాయ తెంపి అన్నిండి వచ్చాన్న నెత్తరను బేసినితో పట్టి ఒక పెద్ద డబారాలో పోసినారు. ఆ జీవం తోలు  కొన్న మనిషి ఆ తోలు ఒలుచకోవడానికి తయారు అయినాడు.తోలు  తీసేప్పుడు శానా ఒడుపుగా తీయాలి .. పొరాపాటున ఎక్కడన్నా బొక్క పడితే అది దేనికీ పనికి రాదు.. ఆ తోలు అందరికీ తీయడానికి రాదు అది తెలిసిన పనోళ్ళు  ఉంటారు.. వాల్లేవచ్చి తీస్తారు. ఆ తోలును ఏదేదో చేసి అమ్ముకుంటారు.. తోలు  తీసే మనిషి తోుకు అంటుకున్న అవయవాలు  అన్నీ ఒకదాని తరువాత ఒకటి తీసి ఇచ్చాఉంటే .. దానికి పక్కనే కింద పరిసిన తడికె మీదికి  చేరేచ్చాండారు… ఇక్కడ ఇద్దరిద్దరు మనుషులు  కూచ్చోని కూరాకు… ఎంకలు  దేనికదే వేరు శేచ్చాండారు..ఇంగిద్దరు ఎంకలు  నరుకుతాండారు.. ఎవురి పనుల్లో వాళ్ళు ఉండారు. ఇట్ట శరాపురిగా పనులు  శేచ్చాంటే మా సంతోష శిన్నమ్మ వచ్చి ఇంత జల‌బర, కొంత కొవ్వు పెట్టిచ్చుకోని పోయినాది.

ఒక అరగంటకు తోలు  మొత్తం ఒలిసినాడు.. ఆ మనిషి .. తోలు ను ఎడ‌ల్పుగా  పర్సి దాని మీద కూరాకు కుప్పలు  ఎయ్యడం తిరుక్కుండిరి.. ముందు నరిడె..ఈరిగ.. దొమ్మ.. ఉల‌వకాయ.. శిగురెంకలు  .. బర్రెంకలు ..ముడ్సులు .. పొట్ట పేగులు  అన్నీ ఒకదాని ఎనక ఒకటి కుప్ప పేరుచ్చాండారు.కుప్పలు  ఏసేటాయప్ప అడిగినాడు ఎన్ని కుప్పువేయాల్నో …వాళ్ళు  చెప్పినదాన్ని బట్టి కుప్పకు కూరాకు సర్దుతాండారు.

తోలు  మీద ఆడాడ కొంత కూరాకు అతుక్కోని ఉంటే అది చూసి దానం మామ తోలు  తీసినాయనను అడిగినాడు ‘ఏమబ్బా ఆమోసు కూరంతా తోలుకు అట్టనే ఇడ్సి పెట్టినావే’  అని… దానికాయప్ప ‘ఆ మాత్రం ఇడ్సక పోతే తోలు  బొక్క పడిందనుకో దమ్డికి పనికి రాకుండా పోతాది’ అన్నాడు.

ఇట్ట శరా పురిగా ఎవురి పనులు వాళ్ళు  చేసుకుంటా ఉంటే సంతోష శిన్నమ్మ నెత్తర పొడి చేసుకోని వచ్చినాది..ఆమె వచ్చీ రాంగానే అందరూ నోర్లలో బొగ్గులు  వేసుకోని ఉదరా బదరా పండ్లు తోముకోని .. సంతోష శిన్నమ్మ కాడికి పోయి గొంతు కూకుండిరి.. ఆ శిన్నమ్మ అందరికీ మోడపాకుల్లో ఎవురికి ఎంత కావాంటే అంత పెద్ద కూరాగ్గంటె తో ఏసిచ్చే   అందరూ పాంకుండిరి.

ఈ లోపల‌ కూరాకు పట్టీ లో తమ పేర్లు రాపిచ్చిన వాళ్ళు ఒక్కరొక్కరే ఆడికి శేరుకుంటా ఉండారు.వాళ్ళలో చాలా మంది తొందరగా తీసుకోని ఎల్ల‌బారదామ‌ని  అని వచ్చినోల్లే ఏమబ్బా ఇంగా కాలేదా ..ఇంత లేటు అయితే ఎట్ట తెల్లారితే ఇంటికి ఎత్తక పోడం కుదరదు అని గొనుగుతాంటే ..‘ఆ…ఈడ మేము ఆడుకుంటా ఉండాము.. రాత్రి అంతా నిద్దర మేలు కోని పని  శేచ్చేనే ఈడికి అయింది .. ఇంత సేపు ఇంట్లో స‌ల్ల‌గా  పడుకుని వచ్చి ఇప్పుడు వల్లో పెడుదునా దల్లో పెడుదునా అని అంటే ఎట్ట .. కాసేపు ఆగు ఎత్తుకుని పోదువు గాని’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినారు. శియ్యలు కోసేవాళ్ళు  దాంతో ఏమీ మాట్లాడక పాయ ఆ ఆసామి…కొందరు మాంసం కుప్పల‌ మీద వాళ్ళు  ఎంట తెచ్చుకున్న బ్యాటరీ లైటువేసి కూర ఎట్టుంది కొవ్వు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా లేకుంటే సరిపోయేమైన ఉందా అని తొసుకుంటాండిరి.. కొందరు అయితే బాగుంది అని మెచ్చుకునిరి..

మంచోని బుద్ది మాంసం కాడ తెలుచ్చాది అన్నెట్టు ఎట్టాటి మనిషి గాని కూరాకు కాడికి వచ్చినాక వాళ్ళ  అసలు  బుద్ది బయట పడతది. మా ఊరికి పక్క ఊరిలో మత బోధకుడిగా పని చేసే ఒకాయప్ప వచ్చినాడు .. ఆ మనిషి ప్రసంగం చేసేప్పుడు  తెలుగు రాని వాడు తెలుగు  మాట్లాడితే ఎట్ట ఉంటదో అట్ట మాట్లాడుతుంటాడు…ఓ మ‌హా  ప్రభు కనికరము గ తండ్రి …మీరు ఈ బిడ్డను కాపాడండి నాయనా .. అని అదొక రకంగా మాట్లాడుతుంటాడు…. ఆ మనిషి ఆ రోజు వచ్చి తాను ఎప్పుడు ప్రసంగంలో మాట్లాడిన భాష మాట్లాడకుండా ..‘యాంది ఇట్ట కూరాకు అంతా జబర జబరగా ఉందే …కండలు  ఏంది ఇంత లూజుగా ఉండాయే..’ ఆయాలు అన్నీ ఏసినారా లేదా అని అంటాండాడు. అది ఇన్నె దానం మామ ..మేము దాన్ని తయారు చెయ్యలా కోసినాము… ఎట్టుంటే అట్ట తీసక పోవాల నచ్చకుంటే ఇడ్సిపెట్టి పోవాల‌..అయినా అందరికీ బాగా కనిపిచ్చిన కూరాకు నీకు ఒక్కడికే అట్ట కనిపిచ్చాంది ఎందుకు ప్రసంగాలు  శేచ్చాంటావు నీకు ఇదేం బుద్ది అనే సరికి ఆ మనిషి నోరు ఎత్తలేదు.

పట్టీలో రాసినట్టు వర్సగా పేర్లు పిలిచి వాళ్ళ‌కు  ముందు తోలు లో ఏసి పెట్టి ఉన్న కువ్వ ఎత్తి పడితో కండలు  కొల్స‌డం తిరుక్కుండిరి… శానా మటుకు అందరూ లెక్కిచ్చే తీసక పోతాండిరి .. కొందరు ఏ కువ్వ ఏచ్చే అదే  తీసకపోతాంటే… కొందరు అద్దో అద్దో  ఆ కువ్వ ఎయ్యమని కోరి ఏపిచ్చుకుంటాంటే ..ఇంగ కొందరు కువ్వలో ఏలు  పెట్టి అన్నీ ఆయాలు  ఉండాయా లేదా అని చూసుకోని తీసుకుంటా ఉండిరి.. ఆయాలు  అన్నీ మా హక్కు అన్నెట్టుగా ఉండాయా లేదా అని ఏరపంచుకుని చూసి మరీ తీసక పోతాండిరి.

పట్టీలో ఉన్నె అందరికీ కూరాకు ఇవ్వంగా మిగిలిన కూరాకు లో కింద వేసుకోవడానికి తడిక ఇచ్చిన వాళ్ళ‌కు  .. మాంసం కొలిచే పడి ఇచ్చిన వాళ్ళ‌కు ..ఎంకలు  కొట్టే గొడ్డేలు ను ఇచ్చిన వాళ్ళ‌కు  ..పట్టీ కట్టించుకోను వచ్చిన ఆయప్పకు తలా ఎవురి బాగం వాళ్ళ‌కు  ఇచ్చి మిగిలిన కూరాకు ఇంటికి తీసకపోయినారు మా దానం మామ మా నాయన…

అంతకు ముందు ఆయాు కోసే వాళ్ళ  కాడ నిల‌బడి ఒరే నీ పాసుగుల‌ నాకు అద్దో ఆ తోకమొట్టె అంటే ఇష్టం ఇద్దో ఈ శిగురు ఎంకంటే ఇష్టం .. అద్దొ ఆ ముద్ద ముడుసు అంటే ఇష్టం… అని ఒక పెద్ద డేక్ష నిండా కూర ఎత్తి పెడతా ఉంటే మా నాయన అది చూసి ఏంది దొరా అన్ని ఆయాలు  నీకు ఇష్టమని తీసుకుంటివి .. మేము నీ ఆయం తినాల్నా అనారక కాదు మామ అయి మనిద్దరికి అని అయి కూడా పంచినాడు ఇంటికి తీసకచ్చి మా దానం మామ.

ఆ రోజు ఆదివారం అయినా కూడా జనం గుడికి శానా ప‌ల్చ‌గా  వచ్చినారు. గురువు కూడా ఏదో గబాగబా ముగిజ్జాము అని ఉదరా బదరా ముగించినాడు.. ఎందుకంటే ఆయనకు కూడా ఈ కూరాకు మీద మునాస ఉంటది కాబట్టి .. అక్కడ కోసినందుకు గురువుకు సగం గుండెకాయ.. ఉల‌వకాయ.. నరిడె..ఇట్ట మెత్త మెత్తని కూరాకు అట్ట నోట్లో పెట్టుకుంటే కరిగి పోయే మంచి శిగురెంకలు అందు ఇచ్చారు.. పొద్దన్నే మొకం కడుక్కోని ఇన్ని కాపీ నీళ్ళు  తాగి వచ్చింటాడు .. ఇంటికి తొందరగా పోతే గోధుమ రొట్టె శియ్యల‌ కూరాకు తినచ్చు అని అనుకుని ఉంటాడేమో గాని ఇట్టాటప్పుడు శానా పెద్దగా గుడి నడపడు.

మా ఇంటి కాడ సూడాలా ఆదివారం పండగ అంతా ఆన్నే ఉంటది.. మా కుసిని లో మా దొడ్డాకిలి ని పీక్కచ్చి ఏసి దాని మీద కూరాకు పోసినారు.. మా యమ్మ మా నాయన దేనికదే ఏరపంచినారు.. తలా ఒక శెయ్యి ఏసి కత్తి పీటలు  తీసుకోని కండలు  వాలికలు  శేచ్చాంటే .. మా యమ్మ ఆ యా కూరాకు శెయ్యడానికి రెండు కండలు  ..కొన్ని శిగురు ఎంకలు  …ఆయాలు  ఒక కుండలో వేసి దాంట్లో ఒక శెంబు నీళ్ళు  పోసి దాంట్లో ఇంత పసుపు ఉప్పు కరెప్పాకు వేసి ఒక ఉల్లిగడ్డ కోసి వేసి పొయ్యిమీద పెట్టి కింద మంట ఎలిగిచ్చింది.

పక్క పొయిమీద పెంకు పెట్టి వట్టి మిరపకాయు..దనియాలు  ..జీల‌కర్ర ..గసగసాలు  వేసి ఏయించి పొయికాన్నే ఉన్నె రోట్లో దంచుతాంది .. ఇంగోపక్క తెల్ల‌బాయ‌లు  వ‌లుచ్చాఉంది.. రెండు పొయిల్లో మంట సరిగా ఉందా లేదా అని సూచ్చా ఉంది. ఇన్ని చేస్తాన్న మా యమ్మ … ఒక బంటు లాగా అనిపిస్తా ఉన్నెది.. పని జేచ్చా నోటికి పని చెప్పకుండా ఉంటదా అంటే అది లేదు .. అదట్ట చెయ్యండి ఇదిట్ట చెయ్యండి అని అందరికీ పురమాయిచ్చాఉంటాది. అట్ట మాట్లాడతానే శరా పురిగా మసాల‌ నూరి పెట్టింది.. మసాల‌ వాసన ఘమాయిచ్చాఉంది.

ఇంత లోపల‌ కూరాకు కుండలోనుండి గజ్జెల‌ పొంగు వచ్చింది. గజ్జెల‌ పొంగు అని దాన్ని ఎందుకు అంటారో మా యమ్మ నాకు చెప్పింది..కూరాకు ఇట్ట ఉడక పెట్టినప్పుడు వచ్చే తొలి పొంగులో చిన్న చిన్న బుడగలు  బుడగలు  వస్తాయి అవి గజ్జల‌ మాదిరి ఉంటాయి కాబట్టి దానికి గజ్జెల‌ పొంగు అని పేరు వచ్చింది ఈ పొంగు వచ్చిందంటే ..ఇంగ కూరాకు బెన్నా ఉడుకుతాది అని ..తొసు కోవచ్చు అని మా యమ్మ చెప్పింది.. దీనికి నువ్వు పెట్టినవా ఆ పేరు అని మా యమ్మను అడిగితే లేదు ..ఇది పూరో కాలం నుండి వచ్చాఉంది. మీ జేజి కూడా ఇదే మాట అంటాన్నెది అని చెప్పింది. గజ్జల‌ పొంగు వచ్చినప్పుడు వాసన ఘమా ఇస్తది.. ఆ వాసనకే సగం కడుపునిండి పోయినట్టు ఉంటాది. కానీ ఆకలి మాత్రం దంచి కొడతది.. ఈ మసాల‌ వాసన ఆ గజ్జెల‌ పొంగువాసన తో ఇండ్లంతా గుమాయిచ్చాంది.

శియ్యలు ముందేసుకుని వరికిల్లు  చేసి వల‌ కట్టమీద వాటిని యాలాడ తీసి మంచం పైకి లేపి ఆ మంచం కోళ్ళ‌మీద‌ ఈ వల‌ కట్టెను పేర్చి ..ఆ వరికిల్ల‌ను  కాకులు  ఎత్తక పోకుండా ఉండటానికి దాని మీద రెండు మూడు కంపమండలు  వేసి ఇంట్లో శిన్నోడిని అయినందుకు ఒక మంచం నిలువుగా పైకి ఎత్తి దానికి ఒక కట్టె ఊతం పెట్టి ఆ మంచం మీద దుప్పటి కప్పి కింద సాప పర్సి ఆ శియ్యల‌ కాడ నన్ను కాపలా పెట్టినారు.. నేను ఒక వల‌ కట్టె తీసుకోని కాకు రాకుండా అదిలిచ్చా కూకున్నాను.

వరిక్లిల్లు  కొయ్యడం అయిపొయ్యారక గజ్జెల‌ పొంగు రాడంతో మా నాయన గబగబా లేసి దొడ్లోకి పోయి నాుగు చెంబుల నీళ్ళు  పోసుకోని వచ్చి వేరే గుడ్డలు  ఏసు కోని …పొయ్యి కాడికి వచ్చి ‘ఏం గజ్జెల‌ పొంగు ఇంగా రాలేదా’ అని అడిగారక అప్పటి దాంక ఒక పక్క మసాల‌ నూరుకుంటా ఇంగో పక్క సంగటికి ఎసురు పెట్టి రెండు పొయ్యిల్లో కొరువులు ఎగదోసుకుంటా ఉన్నె మా యమ్మ మా నాయన అట్ట అడిగే తలికి ఇంత ఎత్తు ఎగిరింది   ‘పొద్దన్నుండి పనెంబడి పని శేచ్చాఉండాను నేను గమ్మునేమన్నా ఉండానా  కాసేపు ఆగలేవా పదురుతుండావే’ అని మా యమ్మ తిట్టడం  తిరుక్కున్నెది..మా యమ్మకు సందు దొరికితే చాలు  మా నాయన్నే కాకుండా వాళ్ళ‌ వంశాన్ని మొత్తం తిడ్తది …‘శియ్యల‌ కూరాకు కోసం భూములు అమ్ముకున్న జాతి’ నిన్నని ఏం లాభం లే శిన్న కొడుకు శిన్న కొడుకు అని మీ అమ్మ నిన్ను అట్ట తయారు చేసి నా ఎదాన తోసి పోయింది అని మా జేజి మీదికి లేసింది. అట్ట తిడతానే మా నాయనకు ఉప్పుతో ఉడికేసిన శియ్యలు  ఒక రెండు గంటెలు  ఏసింది.అట్ట తిడతానే మా నాయన వాళ్ళ‌మ్మ  ఇట్టనే మా నాయనకు ఏసిచ్చేది అనే విషయాన్ని కూడా మా యమ్మ  ఇవరిచ్చింది.

అది తిన్నెంక కాసేపటికి మా నాయన కాలు  కాలిన పిల్లి లాగా పొయి సుట్టే తిరుగుతాన్నెడు. మా యమ్మ సంగటి కుండకు పంగల‌ కట్ట ఆనిచ్చి దాని మీద కాలు  వేసి అది కదల‌కుండా తొక్కోని సంగటి గబ గబా గెలుకుతాంటే .. శియ్యల‌ కూరాకు లోనుండి వచ్చే వాసనకు గెలికిన రాగి సంగటి లో నుండి వచ్చే వాసనకు ఎవ్వరికైనా నోట్లో నీళ్ళు ఊరాల్సిందే …మా నాయన ఒక పక్క సాప పర్సుకోని పెద్ద చెంబుతో నీళ్ళు  పెట్టుకోని సాప మీద సక్కల బెల్లం వేసుకోని కూకోని ..ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా గుటుక్కున మింగుదామా అని ఎదురు సూచ్చాండాడు.. మా యమ్మ పొయ్యిమిందనుండి సంగటి కుండను దించి .. సంగటిలోనుండి తెడ్డు తీసి దాన్ని ఉదరా బదరా తుడిసి ఒక బేసిని లో ఒక్కరవ్వన్ని నీళ్ళు  సల్లి హస్తం గంటె తీసుకోని రెండు హస్తం గంటె నిండా సంగటి దీసి ఆ బేసినిలో వేసి ఒక చేత బేసిని పట్టుకుని మరో చేత్తో ఆ సంగటిని ముద్ద చేసి ఓ పెద్ద తెల్లెలో వేసింది. ఇంగొక కూర గిన్నె నిండా కూర వేసి రెండూ తీసకపోయి మా నాయన ముందు పెట్టి ‘కాసేపు ఉంటే కనేట్టు ఉండావు ఇంగ మింగు’ అని ఒక శెతురు మాట వేసి మల్లా పొయికాడికి పోయింది. మా నాయన కు తిరిగి మాట ఇయ్యడానికి మనసు ఒప్పినట్టులేదు పొగలు  కక్కుతాన్నె ఉడుకుడుకు రాగి సంగటి ఉన్నె తెల్లెను దగ్గరికి లాక్కోని సంగటికి ముందు ఇంత కూర ఏసుకోని .. చెంబు నీళ్ళ‌లో  చెయ్యి అద్దుకోని రాగి సంగటి మీద దాడి చేయడం తిరుక్కున్నాడు..

ఒక తుంట తుంచడం .దాన్ని కూరాకులో ఒక పక్క అద్దుకోవడం ఒక శియ్య తునక తీసుకోని నోట్లో పెట్టు కోవడం దాన్ని మింగుతానే కూరాకులో అద్దిన సంగటి నాలిక మీద రాపాడిచ్చి  గుటుక్కున మింగడం.. అట్ట మా నాయన సంగటి తునకలు  తుంచి కూరాకులో ముంచి గుటుక్కు గుటుక్కున మింగి అట్టనే తెల్లెను ఒనికిచ్చినాడు. మా నాయనకు సంగటి పెడతానే .. ఆయన తరువాత శియ్యల‌ కాడ కాపలా కాచ్చాన్నె నా కాడికి తీసుకోని వచ్చినాది మా యమ్మ పొగలు  కక్కుతాన్నె సంగటి… ఆ సంగటి ఎట్టుందంటే బడికి పోయే పిల్లోని కి తల‌ నిండా ఆందెం పూసి తకాయ దువ్వితే ఎట్టుంటదో అట్ట కనిపిచ్చినాది. అప్పుటి దాంకా ఈ వాసనతో ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా అని ఎదురు సూచ్చాన్నె నేను నీళ్ళ‌ చెంబులో చెయ్యి తడుపుకోని పొడ ఎండ మింద పడతాన్నా కూడా లెక్క చెయ్యకుండా సంగటి కూరాకు అట్టనే ఇదిలిచ్చి తెల్లెలోనే చెయ్యి కడిగి తెల్లె ఒక పక్కకు పెట్టి నిక్కరుకు శెయ్యి తుడుసుకున్నాను.

నా మాదిరే మా పక్కన ఉండే ఇండ్లలో వాళ్ళ‌/  కూడా వాల్ల వాల్ల  ఇండ్ల కాడ శియ్యల‌కు కాపలా ఉండే వాళ్ళ‌కు  కూడా ఇట్టనే బువ్వనో సంగటో తీసకచ్చి ఇచ్చినారు.. అందరం సంగటి శియ్యల‌ కూర నా మాదిరే తిని ఇంగ పాటలు  పద్యాలు  పాడ్డం తిరుక్కుఉండిరి .. అంతే కడుపు నిండితే నక్క ఊల‌ ఏసినట్లు మనిషి గూడా కడుపు నిండే దాకా ఒక రకంగా కడుపు నిండినాక ఒక రకంగా ఉంటారు..

మా నాయన సంగటి అనామొత్తు గబ గబా మింగి శివరాకర్న కూరాకులో ఇంగొక రవ్వ ఉప్పు పడింటే బాగుండు అన్నాడు..అందరు పిల్లోల్ల‌కు  సంగటి పెట్టి అందరు తిన్నాక మిగులు తగులు గిన్నెలో ఏసుకోని తింటాన్న మా యమ్మ మా నాయన మాటలు  విని ఈ కూత ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడే కూయాల్సింది. పెట్టింది పెట్టినట్టు అనా మొత్తు యారకతిని శెయ్యి కడుక్కునే తప్పుడా శెప్పేది.. అని మా యమ్మ మా వంశాన్ని తిట్టడం తిరుక్కుండార్క మా నాయన ఆకు వక్కా సున్నం కాయ తీసుకోని పొట్ట నిమురుకుంటా అరుగు మీదికి పొయినాడు.. ఈ లోపల‌ మా నాయన మాదిరే సంగటి శియ్యల‌ కూరాకు దుమ్ము లేపి వచ్చిన మా దానం మామ గూడా మా అరుగు మీదికి వచ్చినాడు …. మా నాయన శేతిలో ఉండే ఆకు జూసి నాలుగు ఆకులు  ఇయ్యిమామ ఆ బాసేలుకు ఆకు తెప్పియ్యమంటే అస్సలు  పకలేదు.. అని వాళ్ళ‌ బార్యను తిట్టడం తిరుక్కున్నాడు. మా నాయన పోనీలేవోయి నా కూతురు ను ఎందుకు తిడతావు నేను ఇచ్చాలే ఆకులు  అని కొన్ని ఆకులు  దానం మామ శేతికి ఇచ్చినాడు ఇద్దరు కలిసి తమల‌ పాకులు ఈనె తీసి సున్నం రాసుకుంటా ఆ రోజు కోసుకున్న శియ్యల‌ గురించి ఎన్ని కువ్వలు పడింది.. ఎంత బాగున్నెది శెప్పుకుని ఆకు వక్క నముకుంటా బీడిలు  ఎలిగిచ్చి బో సుకపడిరి .. అయన్నీ గ్నాపకాలుగా మిగిలి పోయినాయి మారిన కాలం లో గజ్జెల‌ పొంగు కుక్కర్ల కూత కింద పడి నలిగి పోయి కరిగి పోయింది. మా నాయ‌న జ్ఞాప‌కం మాదిరి.

*

జాపరయ్య ఒనుం

japarayya onum pic

నాకు అప్పుడు పదేండ్లుంటయ్ …మా సొంతూరు కలసపాడు లోని చర్చి కాంపౌండ్ లో ఉంటిమి…అప్పట్లో చర్చి కాంపౌండు లో పది ఇండ్లు ఉన్నెయి. స్కూలు హెడ్ మాస్టర్ కిష్టపర్ సార్ కుటుంబం …ఇంగా ఇద్దరు ముగ్గురు టీచర్ల ఇండ్లు …కుశిని పని చేసే వాళ్ళ ఇండ్లు ఒకటి ఉన్నెది. మాఇండ్లు  చర్చికి దగ్గరగా ఉన్నెది. అదే కాంపౌండులో మిషన్ హాస్పిటల్ లో పని చేసే డాక్టర్ పెద్దీటి దేవభూషణం సార్ వాళ్ళ ఇండ్లు …పాస్టర్ ఇండ్లు పక్క పక్కనే ఉన్నెయి. మా చర్చికాంపౌండు పక్కనే సగిలేరు పార్తది. ఇది పరమట పక్కఉంటది. తూర్పు పక్క పంట పొలాలు మాడి వనాలు ఉన్నెయి. కలసపాడు ఊరిలో నుండి చర్చికాంపౌండు కు వచ్చే దావలో ఎడం పక్క రెండు మాడి తోటలు వరసగా ఉన్నెయి. ఇంగో పక్క దాన్ని ఆనుకుని ఇంగోక మాడి ఒనుం ఉండేది. ఇది ఇప్పటికీ ఉంది. గాని ఆ రెండు వనాలు ఇప్పుడు లేవు.
మా శిన్నతనాన మాడికాయల సీజన్ వచ్చే పొద్దన లేచ్చానే మాడి తోటల కాడికి పోతాంటిమి..రాత్రిపూట రాలిన మామిడి కాయలు ఏరుకోవడానికి. మిషన్ కాంపౌండుకు ఆనుకుని ఉన్న ఒనుం పేరు జాపరయ్య ఒనుం. ఆ ఒనుంలో ఒకప్పుడు శీని శెట్లు…సపోటా శెట్లు ఇంగా ఏంటేంటియో ఉన్నెయంట.. నాక మతికి వచ్చారక మాత్రం టెంకాయ శెట్లు…మాడి శెట్లు  ఉన్నెయి. ఒక వరస మాడిశెట్లు ఎనిమిది ఉన్నెయి. వాటిని వేరే ఊర్లలో ఎట్ట పిలుచ్చరో తెలియదు గాని నాకు తెలిసి ఒక్కో చెట్టుకు ఒక్కో పేరు ఉంది.
మొగదాల ఉన్నె శెట్టు పేరు కొబ్బెర కాయ. ఆ శెట్టుపచ్చి కాయలు తింటే కొబ్బెర ఉన్నెట్టు ఉంటది అందుకని ఆ పేరు పెట్టింటరు అనుకుంటి.

 

దాని ఆనుకుని ఉన్నె శెట్టు పేరు దబ్బకాయ..దాని ఆనుకుని ఒక పెద్ద శెట్టు …ఉన్నెది. దాని పరవాత ఓ నాలుగైదు శెట్లు తరవాత ఒకపెద్ద మేడి శెట్టు ..దాని తరువాత వాటిలో ఒకటి పచ్చడి కాయ అని ఇంగో దానికి ఇంగోపేరు …అయితే ఆ గేరిలో శివరాకరి శెట్టు పేరు పసుపు గాయ శెట్టు.. ఆ శెట్టు కాయలు పసుపు వాసన వచ్చాంటయి..అది మాగితే మధురంగా ఉంటాన్నెది. అంద మధురం మళ్ళీ జీవితంలో ఏ మాడి పండులో గూడా సూడలేదు. దానికి ఒక్కరవ్వ దూరంగా అంటే మాడి ఒనుం మధ్యలో ఒక పక్క మహారాజులాగా బేనీసా శెట్టు ఉన్నెది. దాని ముందు ఒక పాడు పడ్డ దిగుడు బావి ఉండేది.దాంట్లో పెద్ద పెద్ద జర్రిపోతులు నీళ్ల పాములు, తాంబేళ్ళు ,, గోందురు కప్పలు ఉండేటివి. మిషను కాంపౌండును అనుకని ఉండే వరసలో రెండు మాడి శెట్లు ఉండేవి. ఒకటేమో పచ్చడి కాయ…కట్టవ నానుకుని ఒకపెద్ద శెట్టు ఉండేది. ఆ శెట్టు కాయలు మాగితే అందులో పీసు ఉండేది కాదు ఉత్త కండ ఉండేది. ఒనుమంతటికీ ఒక సపోటా శెట్టు ఉండేది. దానికి జాపరయ్య కాపలా ఉండేవాడు.
జాపరయ్య గురించి చెప్పాలంటే ఆ మనిషి ఆరుడుగులుంటాడు. తూకమైన మనిషి.

జాపరయ్య వాళ్ళన్న పోలీసు. ఆయన కర్నూలు లో ఉండేవాడు.

ఆయన  వాడిన పాత కాకి నిక్కర్లు జాపరయ్యకు పంపితే అవి ఏసుకునే వాడు. జాపరయ్యను నిక్కర్లో తప్ప సలవ గుడ్డల్లో ఎప్పుడూ సూడలేదు.

ఆ మిషన్ కాంపౌండులో చదివిన వాళ్ళకు వాళ్ళ టీచర్లు ఎంత గుర్తో జాపరయ్య కూడా అంతే… ఆడ చదివిన వాళ్ళందరూ దాదాపుగా జాపరయ్య మామిడి కాయల  దగ్గర కాతా పెట్టిన వాళ్లే . మాడి కాయలు మాగక ముందు బేనిశా,,, కొబ్బరి కాయలు రాలి పడినోటియి అమ్మేవాడు.. పండ్లయినంక వాటిని కూడా అమ్మేవాడు. అయితే ఆయన కాడ శానా  మంది అప్పు పెట్టేవాళ్ళు … వాళ్ల చదువు అయిపోయి పొయ్యేప్పుడు కొందరు అప్పు తీర్చి పొయ్యే వాళ్ళు. కొందరు ఇవ్వకుండా పోయే వాళ్ళు ..అట్ట పోయినోళ్ళు పదేండ్ల తరువాత తిరిగి వచ్చినా కూడా ఆయన వాళ్ళ పద్దు పుస్తకంలో రాసి పెట్టుకుని అడిగే వాడు. ఎప్పుటికి అప్పుడు పద్దు బుక్కు మార్చి బడి పిల్లోళ్ళతో రాయించుకునే వాడు.అట్ట కనపడినప్పుడు  కొందరు ఇచ్చే వాళ్లు కొందరు ఎగ్గొట్టే టోళ్లు . అయినా ఆయన అడిగినోళ్ళకు కాదనకుండా మాడికాయలు ఇచ్చేవాడు.
ఆయన తెల్లారతానే ఒనుం కాడికి వచ్చేవాడు. రాత్రి శీకటి పన్నెంక తిరిగి ఇంటికి పొయ్యేవాడు. ఉదయం వచ్చా వచ్చా సద్దిబువ్వ తెచ్చుకుని పైటాల కల్లా ఒనుం కాడనే తినేటోడు. మద్ధానం అయ్యార్కల్లా జాపరయ్య ఇంటికాడ నుండి ఓ బేసిన్ కు ఎర్రగుడ్డ కప్పి రాగి సంగటి వచ్చేది.మాడికాయల సీజన్ అయితే రోజూ మాడికాయ కారెమే వచ్చేది. లేకుంటే ఏదన్నా పప్పు…ఇంగేదన్నా కూర వచ్చేది. దాన్ని ఆయన ఒనుం లో ఏడబడితే ఆడ నేల మీదనే కూచ్చోని గబ  గబా తినేటోడు. ఆదోవన పల్లెలకు పొయ్యేటోళ్ళు ఎవురన్నా కాసేపుఆయన కాడ గొంతు కూకోని ఎవ్వారం జేసి పోయేటోల్లు.
ఎవురన్నా కోతి నాయళ్ళు చెట్ల మీద రాళ్ళు ఏచ్చే జాపరయ్య కు కోపం వచ్చేది.

Kadha-Saranga-2-300x268

వాళ్ళను కుత్తేగా… పప్పు చారు పడ్తది అని తిట్టేటోడు.. ఆరెండు మాటలు తురక యాసలో తెలుగులో తిట్టేవాడు…

అయి బో సోగ్గా ఉండేవి. కొందరు ఆయనకు కోపం తెప్పిచ్చి తిడతా ఉంటే తిట్టించుకున్న వాళ్ళతో సహా అందరూ నవ్వుకునే వాళ్ళు . అట్టాటి మనిషి జాపరయ్య.
ఆయన ఒనుం ఇడ్సి యాడికి పోయినట్టు నాకు గుర్తు లేదు. ఊర్లో వాళ్ళ కులమోళ్ళ పెండ్లిండ్లు జరిగినా పెద్దగా పోయేటోడు కాదు. ఏదైనా పెద్ద పండగ ఉంటేనే మజీద్ కు నమాజ్ కు పోయేటోడు. ఆయన అట్ట పోయినపుడు ఆయన భార్య బూమ్మ నెత్తికి గుడ్డ కట్టుకుని ఒనుంకు కాపలా ఉండేది. ఆమె ఒనుం కాడ కూకోని ఉంటే ఆ దావన పోయేటోళ్ళు అందరూ “ఏం బూమ్మా జాపరయ్య యాడికి పోయినాడు” అని అడిగే వాళ్ళు.
బంగళాలో ఏదైనా పండగా పబ్బం వచ్చే భూషణం సారు వాళ్ళు ఆయనకు ఇంట్లో ఒండిన బువ్వ కూరాకు పంపించే వాళ్లు ..జాపరయ్యకు ఏదైనా జరమొచ్చినా.. పుండు లేసినా భూషణమయ్య లెక్క తీసుకోకుండా మందులు ఇచ్చేవాడు. అట్ట ఆయనకే కాదు వారి కుటుంబానికి మొత్తానికి లెక్క తీసుకోకుండా చూసేవాడు. దాంతో జాపరయ్యకు భూషణమయ్య అంటే గౌరవం ఉండేది.భూషణమయ్య డైనిమా ఉన్నె హీరో సైకిల్ మీద ఆసుపత్రికి బయలు దేరి ఒనుంమీద పొయ్యేటప్పుడు జాపరయ్య కూచ్చున్నోడల్లా లేసి సలాం సార్ అనేవాడు. ఆయన అలేకుం సలాం జాపరపయ్యా అనుకుంటా పోయేటోడు.

ఆయనకు తన తోటలో కాసే మాడికాయలు, టెంకాయల ఇచ్చేవాడు. ఒకేల శెట్టుమీద మాడికాయ మాగిఉంటే అది కావాలంటే కోసిచ్చేటోడు. భూషణమయ్య పిల్లోల్లు ఒనుం లోకి పోతే ఏమనేవాడు కాదు. పురుగో పుట్టో ఉంటది బద్రంగా పోండి అని చెప్పేవాడు. మా లాంటి పిల్లనాయాల్లను పోనిచ్చే వాడు కాదు. అందుకని మాకు సందు దొరికినప్పుడల్లా దొంగతనంగా మాడికాయలు తెంచే వాళ్ళం.
మా మిషన్ కాంపౌండ్ లో మిషనరీలు కట్టిన పెద్ద బంగళా ఉండేది. కాంపౌండు నిండా చెట్లు ఉండేవి. ఎండా కాలం సెలవులు వచ్చే సాలు అక్కడ సంసారం ఉండే వాళ్ళ పిల్లోళ్ళమంతా రక రాకాల ఆటలు ఆడుకనే వాళ్ళం. మద్యానం దాకా సగిలేట్లో ఈత కొట్టి మద్యానం నుండి బంగళాలో డీండార్.. కోతికొమ్మచ్చి ఆటలు ఆడుకనే వాళ్ళం..మాకంటే పెద్దోళ్లు బంగళా వరండాలో కూకోని అచ్చన గాయలు …బారకట్టా ఆడుకునే వాళ్లు. అంతా ఒకటే జాతి అయనా అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ లేనోళ్ళుతేడాఉండనే ఉండేది. సాయంకాలం వనాల కాడికి పోయే వాళ్ళం భూషణమయ్య పిల్లోళ్ళు మాత్రం ఒనుం లోపలికి పోయేటోళ్ళు మేము ఒనుం కట్టవంబడి బయట తిరిగి కంపలో రాలి పడిన కాయలు ఏరకచ్చుకునే వాళ్ళం. అట్ట రాలిన కాయలు మాగేచ్చే బో కమ్మగా ఉండేయి.
ఒక రోజు మద్యాన్నం నుండే ఆకాశం ఎర్రబడతా ఉంది. ఉక్క పోత్సాంది..ఆకు కదలడం లేదు. సగిలేట్లో ఈత కొడతా ఉంటే ఎప్పుడూ సల్లగా ఉండే నీళ్ళు ఆ రోజు ఉడుగ్గా ఉండాయి. ఒక్కో సాటయితే జౌకుల మాదిరి ఉండాయి. నేను ఎప్పుడూ ఏటికి ఆనుకుని ఉండే తుమ్మ శెట్టు కిందికి పోయి నీళ్ళలో మునిగే వాడిని .. ఆ రోజు ఎందుకో ఆడికి పోడానికి భయమేసింది. ఆడికి అందరూ పోలేరు. నేను సోమయ్యగాడు ఒకరిద్దరు తప్ప ఎందుకటే ఆడ నీళ్ళలో కంప ఉంటది. అది యాడుంటదో ఆడికి ఎట్ట బోవాల్నో మాకు తెలుసు. సోమయ్య గాడు ఒక్కడే పోయినాడు గాని శానా శేపు ఉండలేక బయటికి వచ్చినాడు. ఆ రోజు ఏట్లోనుండి బెరీన ఎనిక్కి తిరుక్కుంటిమి.

రెండు మూడు రోజులయితే శనక్కాయ కట్టె పీకుతారనంగా కయ్యలకు నీళ్ళు కడతారు. అట్ట కట్టిన శేను ఒకటి గుడి ఆనుకుని ఉంటే ఆ శేలేకి కాపలా ఉండే వాళ్ళకు కనపడకుండా కంపలో కంత ఒకటి జేచ్చిమి. దాని గుండా పొయి పెరక్కజ్జామనుకుంటే…ఆ శేనుగలోళ్లు ఆన్నే ఉండారు. దాంతో ఉసూరుమంటా బంగళా లోకి వచ్చిమి. ఆడ అచ్చనగాయలు బారకట్టా ఆడే వాళ్ళ కాడ కూకోని వాళ్ళు ఆడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే సూచ్చాంటిమి.
ఎండ పలపలా కాచ్చాంది. ఒకటే ఉక్కపోత.. ఆట ఆడే వాళ్ళలో గడ్డమీద దేవరాజన్న తువ్వాలతో మెడమీద ఉన్నె శెమట తుడ్సుకుంటా..”అబ్బ ఏందిరా నాయనా ఇంత మిడ్సరంగా ఎండ కాచ్చాంది. ఊపిరి ఆడ్డంలేదు”అన్నాడు. బంగళానిండా శెట్లుఉన్నా గూడా ఆకు అల్లాడ్డంలేదు. ఉగ్గ దీసుకున్నెట్టు ఉండాయి. మేము పిల్ల నాయాళ్ళం కాబట్టి మాకు ఏమి అనిపియ్య లేదు. గేటు కాడుండే శింత శెట్టు కాడికి పోతిమి.ఆడాడ శింత బోట్లు ఉండాయి. ఈ శెట్టు కాపు లేటు అయినట్టు ఉంది శిగురు కాచ్చాన్నా ఆడాడా శింత బోట్లు ఉండాయి.

అవి కింద పడ్నాయేమో అని ఎతుకుతాంటిమి. ఇంతలో ఉన్నెట్టు ఉండి శింత శెట్టు మెల్లగా ఊగడం తిరుక్కున్నెది. ఆ ఊగడం కాసేపటికి ఎక్కువయినాది. ఆ ఊగడం ఎట్టుందంటే దెయ్యం పట్టినోళ్ళు ఊగినట్టు శింత శెట్టు ఊగడం దిరుక్కున్నెది. అట్ట గాలి లేచ్చాంటే భూషణమయ్య పిల్లోళ్ళు ఒనుంతట్టి పరిగెట్టిరి మంచి మాగిన కాయలు గాలికి పడతాయని…వాళ్ళు ఒనుం కాడికి శేరుకునారకల్లా గాలి ఇంగొక్కరవ్వ ఎక్కువయింది. మాన్లన్నీ ఎట్టుండయంటే ఎప్పుడన్నా మా నాయనకు కొపమొచ్చి మా యమ్మను కొడితే ఆ దెబ్బలకు మా యమ్మకు కోపమొచ్చి మా నాయన్ను ఏమి అనలేక కోపంతో ఎట్ట ఊగుతదో అట్ట ఊగుతాండయి.
నేను సోమయ్యగాడు శింతశెట్టు తొర్రలో ఒదుక్కోని కూకుంటిమి. ఇంతలో గోలీ కాయలంత సైజులో వడగండ్ల వాన పడ్డం దిరుక్కున్నెది. మేము శెట్టు తొర్రలో దాక్కున్న దాన మా మీద ఏమి పడ్డంలేదు.మేము తొర్రలో కూచ్చోని బితుకు బితుకు మంటా సూచ్చాంటిమి. శింతశెట్టు కొమ్మలు నేలకు తగిలేట్టు ఊగుతాండయి. ఇంతలో ఆకాశంలో మెరపులు మెరుచ్చాండయి రెండు పెద్ద బండరాళ్ళు రాసుకున్నెట్టు ఉరుము తాఉంది.

కాసేపటికి శిమ్మ శీకటి అయింది ఆకాశం కిందపడ్తదా అన్నెంత గా ఉంది పరిస్థితి. ఆకాశం నుండి ఓ మేఘంజారి కింద పడిందేమో అన్నెట్టు వాన అట్ట కురిసింది. శింత శెట్టు కింద నిండి వాన నీళ్ళు పోతాండయి. శెట్ల కింద ఉన్నె శింత శిదుగు కొట్టుకోని పోతాంది. గర గర మంటూ ఒక్కసారిగా భూమి మీద ఆకాశం ఊడి పడినట్టు పెద్ద శబ్దం జేచ్చా ఒక్క పిడుగు పడింది. అంత సేపటి వరకు ఇదల గొట్టిన వాన ఎవురో ఆపినట్టు ఆగి పోయింది. అట్ట ఆగుతానే నేను సోమయ్య గాడు శింత శెట్టు తొర్రలో నుండి బయటకు దూకితిమి..ఎండిన శింతాకు…యాపాకు…రెండూ తడిచ్చే వచ్చే వాసన వచ్చాంది. అప్పటి దాంకా పొగలు కక్కుతా ఉన్నె నేల మీద ఒక్క సారి వాన పడ్డంతో నేల లోపల బొక్కల్లో దాక్కోని ఉన్న సీమలు ..పురుగులు బయటకు వచ్చి నేల మీద పాకుతాండయి. నేలంతా తడి తడిగా ఉంది.
అప్పుడే నీళ్ళు పోసుకున్న దయ్యం మాదిరి ఉన్నె శెట్ల మీద ఆకుల మీద పడి నిలబడి పోయిన వాన శినుకులు ఒక్కొక్కటి నేల మీద పడతా ఉండాయి. నేను సోమయ్య తడిసి సన్నగా నీళ్ళు పారతా ఉన్నె నేల మీద మునిగాళ్ళ మీద నడుచ్చా జాపరయ్యా ఒనుం తట్టు దావబడ్తితిమి.

మేము ఉరుకుతా పోయ్యేప్పటికే ఆడ జనం గుమి కూడి ఉండారు . కొందరు ఆదలా బాదలా అట్టిట్ట పరిగెడ్తా ఉండారు. మాకు ఆడేం జరుగుతాందో…… ఎందుకు అందరూ అట్ట ఉరుకుతాండరో ఒక బంగిట అర్ధం కాక పాయ. ఎట్టయితే నేని గుమికూడినా జనం కాడికి పోతిమి? ఎవురు మాట్లాడం లేదు. మమ్మల్ని జూసి కుసిని పని జేసే మనిషి, ఇంటికి పాండి నాయాళ్ళారా ఎప్పుడూ శెట్లంబడే ఉంటారు. అని మమ్మల అదిలిచిన్నాడు.

ఏమైంది మామా అని అడిగితే మేడి శెట్టు ఇరిగింది. దానికింద భూషణమయ్య పెద్ద కొడుకు పడి సచ్చిపోయినాడు అని అన్నాడు. మాకు అర్ధం కాలేదు.
భూషణమయ్య పెద్ద కొడుకు పేరు దాస్ అయినప్పటికీ అందరూ శిట్టిబాబు అని పిలుచ్చాంటారు. మేము గూడా అట్టనే పిలుచ్చాంటిమి.

మా కంటే ఓ ఐదారేండ్లు పెద్దోడు అయినా కూడా బో తులవ. ఎప్పుడూ మాతో పాటు ఈతకు వచ్చాన్నడు. సగిలేట్లో ఈత కొడతా మునిగాట ఆడేవాళ్ళం ఆ ఆటలో ఎవురన్నా మునిగితే ఆ మనిషి గూడా వాళ్ళకంటే లోతులో మునిగి వళ్ళ కాళ్ళు పట్టి లాగి వాళ్ళకు కనపడకుండా పోయేవాడు.

లాగించకున్నోళ్ళు ఓ యమ్మా ఏదో దెయ్యం నీళ్ళలో నా కాళ్ళు పట్టుకోని గుంజినాది అని ఆయాస పడతా గడ్డకు చేరేవాళ్ళు శిట్టిబాబన్న మాత్రం ఏమి ఎరగనట్టు ఏమైందిరా అని అడిగే వాడు. .. కాసేపయినంక నేనే గుంజింది అని శెప్పి అందరినీ బాగా నవ్వించేవాడు. అంతే గాని ఎవురితో కొట్లాడంగా నేను సూడలేదు.
నేను ఇసయం ఇనంగానే ఉరుకుతా మా ఇంటికి పోయినాను. మా యమ్మ గాలివానకు శెదిరిపోయిన మా ఇంటి పైకప్పు బోదను సరిజేచ్చా ఉంది. నేను ఉరుకుతా పొయి గస పెడతా ఉంటే….. ఏంది నాయనా అన్నట్టు జూసింది మాయమ్మ. యమా….అంటూ ఆయాస పడతా… శిట్టిబాబన్న… జాపరయ్య తోటలో శెట్టిరిగి పడి సచ్చిపోయినాడు అని శెప్తి. అది ఇనడం… ఇనడం మా యమ్మ నా శెంపకేసి శెల్లుమని ఒక్కటి పీక్కింది. ఎంత కోతిపని చేసినా ఎప్పుడన్నా ఊరికే అట్ట గొట్టే మాయమ్మా తొట్టతొలిగ నాశెంప కేసి కోపంగా పీకింది.
నేను దెబ్బనుండి తెరుకుండార్కల్ల జాపరయ్య తోటకాన్నుండి జనం బాబు ఇంటిముందుండే గిలకరాయి నుండి శిట్టిబాబన్ను ఎత్తుకొని ఇంటికాడికి తీసకపోతాండరు. అదిజూసి మాయమ్మ పరుగులందించుకున్నెది.
నేను గూడా మాయమ్మ ఎంటంబడిపరిగెత్తి భూషణమయ్య భార్య ఏమైంది ఏమైంది అనుకుంటా ఎదురొచ్చె  ఇంతలో ఎవురో మంచమేసిరి ఇంగెవరో దప్పటి కప్పిరి. గబ గబా అందరూ అన్నీశేయ్యబట్టిరి ఆసుపత్రి కాన్నుండి ఇంటికి వచ్చిన భూషణమయ్య కొడుకు శవాన్ని జూసి గుండెల బాదికోని ఏడ్సినారు . అందరూ ఏడుచ్చాండారు మాయమ్మ గూడా ఏడుచ్చానే ఉంది.
మా ఊరోల్లే గాకూండా సుట్టుపక్కల పల్లెలోలు గూడా తిర్నాలకు వచ్చినట్టే  వచ్చిరి.
ఎట్ట జరిగిందబ్బా అని అందరూ మాట్లాడుకుంటాండిరి.
మామూలుగా అయితే ఎంతగాలి వచ్చినా మేడిశెట్టు పడదు. అట్టాటి శెట్టు అదీ గూడా శెట్ల మద్య శెట్టు ఎగిరి పన్నెది అంటా.. ఈ సావు మాములుదిగాదు.
ఈ మద్య భషణమయ్య వాళ్ళ శేనికాడ బాయి తవ్వంచినారంట… ఆ బాయి బలిగోరితే ఇయ్యలేదంట.. కనీసం మేకనో పోట్టేలినో ఇయ్యలేదంట అందుకని ఆయన పల్లొన్ని బలి తీసకున్నాది అని తేల్చిరి.
ఇంగా కొందరు ఇంగొక రకంగా చెప్పుకునిరి కాలం గిర్రునా తిరిగిపోయ కొన్నీ ఏండ్ల తరువాత నేను మా ఊరికి పోతి అక్కడ ఒనుం  లేదు.అయితే జాపరయ్యాకి గుర్తుగా ఓ టెంకాయ శెట్టు మసలిదై ఊగుతా కనిపిచ్చింది.
అదే ఈ కతను నడిపిచ్చింది.

-బత్తుల ప్రసాద్

prasad