మానాయన దానంమామ పెద్ద శింత శెట్టు కింద కూకోని ఉండిరి… మా నాయన నులక పేనుతా ఉంటే దానం మామ మాత్రం బీడీ ముట్టిచ్చుకోని దాని పొగ పెరుకుతా ఉండాడు. బీడి పొగను గుండె కాడికి పీకి దాన్ని అప్పుడింత ఇప్పుడింత బయటకు ఇడుచ్చా మా నాయన్ను చూసి మామా నువ్వు నుక బో పేనుతావు లేబ్బా అన్నాడు.దానికి మా నాయన ఊరుకోకుండా ఏదో శెతురు మాట వేసినాడు.
అప్పుటికే బీడి పొగ గుండెల్లోకి లాగి ఉన్నె దానం మామకు పొరపోయింది. దాంతో నవ్వడం దగ్గడం తిరుక్కున్నెడు కాసేపటికి దగ్గి దగ్గి ఊపిరి పీల్చుకోని నీ యెక్క నీ నోట్లో నోరు పెట్టగుడ్దు మామ ….అని ఆరిపోయిన బీడీని మల్లీ ఎలిగిచ్చి ఓ రెండు దమ్ములు కొట్టి నేల మీద ఎంగిలి ఊసి ఆ ఎంగిట్లో బీడీని ఆర్పినాడు.మా నాయన మాత్రం ముసి ముసి నవ్వు నవ్వుకుంటా అదే పని శేచ్చాన్నాడు.
దానం మామ మా నాయనతో ‘కాదు మామా దీనెక్క కూరాకు తినక శానా దినాు కాలా’ అన్నాడు దానికి మా నాయన అవునోయి ఈ మధ్యన ఎవురు గాని పల్లెల్లో కోయక పోయిరి నాగ్గూడా నాలిక పీకుతాంది అన్నాడు..
ఇట్ట మాట్లాడుకుంటా ఉండగానే ఆ దావన పక్క పల్లె వాళ్ళు ఒక జీవాన్ని తోలు కోని పోతాంటే .. దానం మామ మా నాయనతో ‘ మామా ఆ జీవం దానికే ఉన్నెట్టు ఉందే’ అన్నాడు. దానికి మా నాయన ‘అవును దాన్ని సూచ్చాంటే అట్టనే ఉంది’ అన్నాడు.. దాంతో దానం మామ ‘ఓబ్బి ఆగండ్రి’ అని వాల్లను అనేర్కల్లా వాళ్ళు ఆగినారు.
దానం మామ నాలుగు అంగల్లో ఆడికి చేరుకోని వారితో యవ్వారం మొదు పెట్టి నాడు. ఇంత లోపల మా నాయన నులక పేనడం పక్కన పెట్టి తుండు గుడ్డ ఇదిలిచ్చు కుంటా వాళ్ళ కాడికి పోయినాడు. మా నాయన పోయార్కనే దానం మామ వాల్లతో అసలు విషయం కనుక్కోని .. మాకు అమ్మి పోండి అని అడుగుతాంటే .. మేము మారు బేరం చేసే వాల్లం కాదు .. మేము కూడా కోసుకోని తినడానికే తీసక పోతాండాము అన్నారు. మా నాయన్ను ఆ మనుషు గుర్తు పట్టి నారు .. ఏమయ్యా బాగుండావా అన్నారు.. సరే మా నాయన కూడా వాళ్ళతో మాటు కలిపినాడు.. ఇంగ అందరూ అసు విషయానికి వచ్చినారు.. జీవాన్ని ఇయ్యడానికి వాళ్ళు ఒప్పుకున్నారు గాని లెక్క కాడనే మధ్యన వంద రూపాయలు వారా వచ్చింది. అట్టిట్ట చేసి బేరం యాభై రూపాయల వారాతో కుదుర్చుకున్నారు.
దాంతో జీవాన్ని తీసకచ్చి మా ఇంటి పక్కన ఉండే గురువు (పాస్టరయ్య) ఇంటి ఎనకా ఆడోళ్ళు కక్కసుకు పొయ్యే దారిలో ఉండే యాపమాను ఏరుకు కట్టేసినారు.
మా నాయన బకెటలో కడుగు నీళ్ళు తీసకచ్చి పోసినాడు …దానం మామ యాడిదో ఇంత వరిగడ్డి తీసకచ్చి వేసినాడు. అది ఎప్పుడు తిన్నెదో ఏమో గాని శానా ఆత్రంగా గడ్డి తిని కడుగు నీళ్ళు తాగింది.
మా నాయన దానం మామ ఇద్దరూ జీవం ఎనకాల పక్క నిబడుకోని దాని ఎనక కాల తిట్టు చూసి దాని కూరాకు ఎన్ని పడ్లు పడతాదో లెక్క చెయ్యడం తిరుక్కుండిరి. ఆ జీవం కొన్న రేటును బట్టి అది ఎంత కూరాకు పడతదో దాన్ని బట్టి కుప్ప ఎంత రేటుకు అమ్మాలి అనేది .. ఒక రేటు పెట్టుకుంటారు. మా నాయన దానం మామ ఇద్దరూ కాసేపు అట్టిట్ట మాట్లాడు కోని ఒక రేటు అనుకుండిరి. ఇది ఎట్ట లేదన్నా కూడా యాభై పడులకు పైగా అరవై పడుకు లోపల పడ్తది అనుకుండిరి.
రేపు ఎవరికి ఎన్ని కువ్వలు కావాలో అడగడానికి పట్టీ కడదాము అనుకునిరి.. పోయిన తూరి ఇట్టనే కూరాకు కోసినప్పుడు మల్లిచ్చలే అని రెండు కువ్వలు తీసక పొయి ఆ లెక్క కోసం శానా సార్లు తిప్పిన ఫలానా మనిషిని తప్ప అందరినీ అడుగుదామనుకునిరి.
ఆ రోజు శనివారం తెల్లార్తే ఆదివారం… మల్లారోజు పండగ సందడి …జీవం వచ్చిందాన శనివారం నుండే తిరుక్కున్నెది. కక్కసుకు పొయ్యే ఆడ్లోళ్ళు ఆ దోవన పోతా ఆడ కట్టేసి ఉన్న జీవాన్ని చూసి ఓహో రేపు తెల్లారే సరికల్లా శియ్యలు ఇండ్లకు వచ్చాయన్న మాట అనుకుంటా పోయిరి.
కాలేజీలు సదువుకుంటా సెలవుకు ఇండ్లకు వచ్చిన ఎడ్మాస్టర్ కూతురు. గురువు కూతురు ఇద్దరూ ఆ జీవం కాడ నిబడి దాన్ని చూసి ‘అయ్యోదీన్ని కోస్తారా ’ అని ఒక్కరవ్వ ఎచ్చల తనం చూపిస్తా ఉంటే …ఈ మాటలు ఇన్నె మా సంతోష శిన్నమ్మ ..‘ఏమ్మామీరు తినరా’ అని అడిగింది.. ఆ శిన్నమ్మ వాళ్ళ ఇండ్లల్లో పని శేచ్చాది కాబట్టి వీళ్ళు తినేది తినంది ఆమెకు తెలుసు.. ‘ ఆ తింటాములే’ అనిరి.. మరి తినేప్పుడు దాన్ని జూసి అట్ట అనుగుడ్దు ..దేవుడు కొన్నింటిని మన జాతి వాల్లకు తినడానికే పుట్టిచ్చినాడు…మన జాతి వాళ్ళు తర తరాుగా వీటిని తినే బతుకుతుండాము అని వాళ్ళకు ఒక్కరవ్వ ఇవరంగా చెప్పే తలికల్లా వాల్లకు ఎచ్చులు వదిలి పెట్టి కుచ్చల్లు ఊపుకుంటా ఎల్లబారిరి.
అక్కడుండే మిషనరీ కాంపౌండు లో అందరూ ఒకే కులానికి చెందిన వారు ఉండటం.. ఎవరు ఎన్ని రకా కూరలు తిన్నా కూడా అందరూ ఈ కూరను మాత్రం ఇష్టపడి తింటారు.అందుకే దీన్ని ‘కులం కూరాకు’ అని కూడా అంటారు. అక్కడ ఉండే వారుకాకుండా ఊర్లో శానా మంది ఈ కులానికి చెందిన వారు ఉంటారు.
వాళ్ళలో దాదాపు అందరూ ఈ కూరాకు తినడానికి ఇష్ట పడే వారే.. ఈ కూర ఇంటికి పోతే ఆ ఇంట్లో పండగ సందడి ఉన్నెట్టే.అందరికీ బాగా ఇష్టమైన కూరాకు ఇది. ఊర్లో ఉండే వాల్లకు ఆ చర్చి లో సభ్యులే ప్రతి ఆదివారం చర్చికి వచ్చినపుడు అందరూ కలుసుకుంటుంటారు.
మామూలుగా ఈ కూరాకు పక్కనే ఉండే పల్లె నుండి అందరి ఇండ్లకు అప్పుడప్పుడు వస్తుంది. తెల్ల వారు జామున గంప కెత్తుకోని తీసకచ్చి ఇచ్చిపోతారు. ఆ పల్లెలో వాళ్ళు తీసుకురానప్పుడు .. ఎప్పుడన్నా ఇట్టా జీవాలు కనపన్నెప్పుడు మా నాయన దానం మామ ఇద్దరు కలిసి ఇట్ట జీవాలను చర్చి కాంపౌండు లో ఎవ్వురికీ తెలియకుండా కోపిస్తుంటారు. ఇది వాల్లకు యాపారం కాదుగాని శియ్యల కూరాకు మీద వారికుండే మునాస..ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి రాక పోయినా గూడా ఇట్ట చెయ్యడం మానుకోరు.
ఆ రోజు ఆ కాంపౌండు లో ఉండే చర్చి పనులు చేసే మనిషి కాడికి పోయి ‘ఎట్టా నువ్వు రేపు చర్చి టైము గురించి చెప్పడానికి అందరి ఇండ్లకు పోతావు కదా అట్ట పోయినప్పుడు ఎవురికి ఎన్ని కుప్పలు కూరాకు కావాల్నో పట్టీ రాయించుకోని రా’ అని పురమాయించినారు. అట్ట పట్టీ రాయించుకోని వచ్చినందుకు నీకు ఏదో ఒకటి ఇచ్చాం లే అనారక ఆ మనిషి సరే రాపిచ్చుకోని వచ్చాలే అని ఒప్పుకున్నాడు..ఎందుకంటే ఆ మనిషి కి కూడా ఈ కూరాకు అంటే బో మునాస కాబట్టి.
చీకటి పడినాక ఆ గుడిలో పని చేసే ఆయప్ప కూరాకు పట్టీ కట్టిచ్చుకోని వచ్చినాడు.. దానం మామ మా నాయన అది చూసుకోని కూరాకు పడేంత మంది అయినారులే .. ఇంగ ఎవురన్నా ఇప్పుడు వచ్చినా కూరాకు దొరకదు…కూరాకు అంతా మిగకుండా అమ్ముడు పోతాంది లే అని ఇద్దరూ కుశా పడిరి. ఆ కుశాలో ఇద్దరూ గూకోని మందు తాగి .. జీవానికి దగ్గర్లోనే మంచం వేసుకుని పండుకున్నారు.. ఇంగొక రవ్వ పొద్దు పొయ్యారక పక్క పల్లె నుండి జీవాన్ని కోయడానికి కత్తులు ..గొడ్డేళ్ళు తీసుకోని రెండు మూడు గంపలు ఉత్తుకోని నలగరు మనుసు వచ్చినారు..వాల్లకు కూడా జీవాన్ని కట్టేసిన శెట్టు కిందనే సాపలు గోనే సంచులు పర్సుకోని పండుకునిరి.
తొలి కోడి కూచ్చానే అందరూ లేసిరి.. కొందరు పెట్రమాక్స్ లైటు ఎలిగిచ్చే కొందరు రాత్రి తగ్గించి పెట్టు కోనున్న లాంతరు ఒత్తును పెంచిరి.. ఎంత పెట్రమాక్స్ లైట్ అయినా ఆ మబ్బుకు ఎలుగు సరిపోవడం లేదు. ఒక్కరవ్వ మసక మసక గానే ఉంది. ఆ పాటికే అక్కడికి చేరుకున్న కొందరు ఒగిసి ఒగిసి పిల్లోళ్ళు కంపమండలు ..శిదుగు తీసుకోని వచ్చి మంట ఎలిగిచ్చినారు. శానా రోజులు అయింది జీవాన్ని కోసి …అందుకే శానా ఆత్రంగా…ఎవరు శెప్పకుండానే పనులు చేస్తా ఉండారు.
జీవాన్ని పడేసి పని మొదలు పెట్టినారు.కూతకాయ తెంపి అన్నిండి వచ్చాన్న నెత్తరను బేసినితో పట్టి ఒక పెద్ద డబారాలో పోసినారు. ఆ జీవం తోలు కొన్న మనిషి ఆ తోలు ఒలుచకోవడానికి తయారు అయినాడు.తోలు తీసేప్పుడు శానా ఒడుపుగా తీయాలి .. పొరాపాటున ఎక్కడన్నా బొక్క పడితే అది దేనికీ పనికి రాదు.. ఆ తోలు అందరికీ తీయడానికి రాదు అది తెలిసిన పనోళ్ళు ఉంటారు.. వాల్లేవచ్చి తీస్తారు. ఆ తోలును ఏదేదో చేసి అమ్ముకుంటారు.. తోలు తీసే మనిషి తోుకు అంటుకున్న అవయవాలు అన్నీ ఒకదాని తరువాత ఒకటి తీసి ఇచ్చాఉంటే .. దానికి పక్కనే కింద పరిసిన తడికె మీదికి చేరేచ్చాండారు… ఇక్కడ ఇద్దరిద్దరు మనుషులు కూచ్చోని కూరాకు… ఎంకలు దేనికదే వేరు శేచ్చాండారు..ఇంగిద్దరు ఎంకలు నరుకుతాండారు.. ఎవురి పనుల్లో వాళ్ళు ఉండారు. ఇట్ట శరాపురిగా పనులు శేచ్చాంటే మా సంతోష శిన్నమ్మ వచ్చి ఇంత జలబర, కొంత కొవ్వు పెట్టిచ్చుకోని పోయినాది.
ఒక అరగంటకు తోలు మొత్తం ఒలిసినాడు.. ఆ మనిషి .. తోలు ను ఎడల్పుగా పర్సి దాని మీద కూరాకు కుప్పలు ఎయ్యడం తిరుక్కుండిరి.. ముందు నరిడె..ఈరిగ.. దొమ్మ.. ఉలవకాయ.. శిగురెంకలు .. బర్రెంకలు ..ముడ్సులు .. పొట్ట పేగులు అన్నీ ఒకదాని ఎనక ఒకటి కుప్ప పేరుచ్చాండారు.కుప్పలు ఏసేటాయప్ప అడిగినాడు ఎన్ని కుప్పువేయాల్నో …వాళ్ళు చెప్పినదాన్ని బట్టి కుప్పకు కూరాకు సర్దుతాండారు.
తోలు మీద ఆడాడ కొంత కూరాకు అతుక్కోని ఉంటే అది చూసి దానం మామ తోలు తీసినాయనను అడిగినాడు ‘ఏమబ్బా ఆమోసు కూరంతా తోలుకు అట్టనే ఇడ్సి పెట్టినావే’ అని… దానికాయప్ప ‘ఆ మాత్రం ఇడ్సక పోతే తోలు బొక్క పడిందనుకో దమ్డికి పనికి రాకుండా పోతాది’ అన్నాడు.
ఇట్ట శరా పురిగా ఎవురి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే సంతోష శిన్నమ్మ నెత్తర పొడి చేసుకోని వచ్చినాది..ఆమె వచ్చీ రాంగానే అందరూ నోర్లలో బొగ్గులు వేసుకోని ఉదరా బదరా పండ్లు తోముకోని .. సంతోష శిన్నమ్మ కాడికి పోయి గొంతు కూకుండిరి.. ఆ శిన్నమ్మ అందరికీ మోడపాకుల్లో ఎవురికి ఎంత కావాంటే అంత పెద్ద కూరాగ్గంటె తో ఏసిచ్చే అందరూ పాంకుండిరి.
ఈ లోపల కూరాకు పట్టీ లో తమ పేర్లు రాపిచ్చిన వాళ్ళు ఒక్కరొక్కరే ఆడికి శేరుకుంటా ఉండారు.వాళ్ళలో చాలా మంది తొందరగా తీసుకోని ఎల్లబారదామని అని వచ్చినోల్లే ఏమబ్బా ఇంగా కాలేదా ..ఇంత లేటు అయితే ఎట్ట తెల్లారితే ఇంటికి ఎత్తక పోడం కుదరదు అని గొనుగుతాంటే ..‘ఆ…ఈడ మేము ఆడుకుంటా ఉండాము.. రాత్రి అంతా నిద్దర మేలు కోని పని శేచ్చేనే ఈడికి అయింది .. ఇంత సేపు ఇంట్లో సల్లగా పడుకుని వచ్చి ఇప్పుడు వల్లో పెడుదునా దల్లో పెడుదునా అని అంటే ఎట్ట .. కాసేపు ఆగు ఎత్తుకుని పోదువు గాని’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినారు. శియ్యలు కోసేవాళ్ళు దాంతో ఏమీ మాట్లాడక పాయ ఆ ఆసామి…కొందరు మాంసం కుప్పల మీద వాళ్ళు ఎంట తెచ్చుకున్న బ్యాటరీ లైటువేసి కూర ఎట్టుంది కొవ్వు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా లేకుంటే సరిపోయేమైన ఉందా అని తొసుకుంటాండిరి.. కొందరు అయితే బాగుంది అని మెచ్చుకునిరి..
మంచోని బుద్ది మాంసం కాడ తెలుచ్చాది అన్నెట్టు ఎట్టాటి మనిషి గాని కూరాకు కాడికి వచ్చినాక వాళ్ళ అసలు బుద్ది బయట పడతది. మా ఊరికి పక్క ఊరిలో మత బోధకుడిగా పని చేసే ఒకాయప్ప వచ్చినాడు .. ఆ మనిషి ప్రసంగం చేసేప్పుడు తెలుగు రాని వాడు తెలుగు మాట్లాడితే ఎట్ట ఉంటదో అట్ట మాట్లాడుతుంటాడు…ఓ మహా ప్రభు కనికరము గ తండ్రి …మీరు ఈ బిడ్డను కాపాడండి నాయనా .. అని అదొక రకంగా మాట్లాడుతుంటాడు…. ఆ మనిషి ఆ రోజు వచ్చి తాను ఎప్పుడు ప్రసంగంలో మాట్లాడిన భాష మాట్లాడకుండా ..‘యాంది ఇట్ట కూరాకు అంతా జబర జబరగా ఉందే …కండలు ఏంది ఇంత లూజుగా ఉండాయే..’ ఆయాలు అన్నీ ఏసినారా లేదా అని అంటాండాడు. అది ఇన్నె దానం మామ ..మేము దాన్ని తయారు చెయ్యలా కోసినాము… ఎట్టుంటే అట్ట తీసక పోవాల నచ్చకుంటే ఇడ్సిపెట్టి పోవాల..అయినా అందరికీ బాగా కనిపిచ్చిన కూరాకు నీకు ఒక్కడికే అట్ట కనిపిచ్చాంది ఎందుకు ప్రసంగాలు శేచ్చాంటావు నీకు ఇదేం బుద్ది అనే సరికి ఆ మనిషి నోరు ఎత్తలేదు.
పట్టీలో రాసినట్టు వర్సగా పేర్లు పిలిచి వాళ్ళకు ముందు తోలు లో ఏసి పెట్టి ఉన్న కువ్వ ఎత్తి పడితో కండలు కొల్సడం తిరుక్కుండిరి… శానా మటుకు అందరూ లెక్కిచ్చే తీసక పోతాండిరి .. కొందరు ఏ కువ్వ ఏచ్చే అదే తీసకపోతాంటే… కొందరు అద్దో అద్దో ఆ కువ్వ ఎయ్యమని కోరి ఏపిచ్చుకుంటాంటే ..ఇంగ కొందరు కువ్వలో ఏలు పెట్టి అన్నీ ఆయాలు ఉండాయా లేదా అని చూసుకోని తీసుకుంటా ఉండిరి.. ఆయాలు అన్నీ మా హక్కు అన్నెట్టుగా ఉండాయా లేదా అని ఏరపంచుకుని చూసి మరీ తీసక పోతాండిరి.
పట్టీలో ఉన్నె అందరికీ కూరాకు ఇవ్వంగా మిగిలిన కూరాకు లో కింద వేసుకోవడానికి తడిక ఇచ్చిన వాళ్ళకు .. మాంసం కొలిచే పడి ఇచ్చిన వాళ్ళకు ..ఎంకలు కొట్టే గొడ్డేలు ను ఇచ్చిన వాళ్ళకు ..పట్టీ కట్టించుకోను వచ్చిన ఆయప్పకు తలా ఎవురి బాగం వాళ్ళకు ఇచ్చి మిగిలిన కూరాకు ఇంటికి తీసకపోయినారు మా దానం మామ మా నాయన…
అంతకు ముందు ఆయాు కోసే వాళ్ళ కాడ నిలబడి ఒరే నీ పాసుగుల నాకు అద్దో ఆ తోకమొట్టె అంటే ఇష్టం ఇద్దో ఈ శిగురు ఎంకంటే ఇష్టం .. అద్దొ ఆ ముద్ద ముడుసు అంటే ఇష్టం… అని ఒక పెద్ద డేక్ష నిండా కూర ఎత్తి పెడతా ఉంటే మా నాయన అది చూసి ఏంది దొరా అన్ని ఆయాలు నీకు ఇష్టమని తీసుకుంటివి .. మేము నీ ఆయం తినాల్నా అనారక కాదు మామ అయి మనిద్దరికి అని అయి కూడా పంచినాడు ఇంటికి తీసకచ్చి మా దానం మామ.
ఆ రోజు ఆదివారం అయినా కూడా జనం గుడికి శానా పల్చగా వచ్చినారు. గురువు కూడా ఏదో గబాగబా ముగిజ్జాము అని ఉదరా బదరా ముగించినాడు.. ఎందుకంటే ఆయనకు కూడా ఈ కూరాకు మీద మునాస ఉంటది కాబట్టి .. అక్కడ కోసినందుకు గురువుకు సగం గుండెకాయ.. ఉలవకాయ.. నరిడె..ఇట్ట మెత్త మెత్తని కూరాకు అట్ట నోట్లో పెట్టుకుంటే కరిగి పోయే మంచి శిగురెంకలు అందు ఇచ్చారు.. పొద్దన్నే మొకం కడుక్కోని ఇన్ని కాపీ నీళ్ళు తాగి వచ్చింటాడు .. ఇంటికి తొందరగా పోతే గోధుమ రొట్టె శియ్యల కూరాకు తినచ్చు అని అనుకుని ఉంటాడేమో గాని ఇట్టాటప్పుడు శానా పెద్దగా గుడి నడపడు.
మా ఇంటి కాడ సూడాలా ఆదివారం పండగ అంతా ఆన్నే ఉంటది.. మా కుసిని లో మా దొడ్డాకిలి ని పీక్కచ్చి ఏసి దాని మీద కూరాకు పోసినారు.. మా యమ్మ మా నాయన దేనికదే ఏరపంచినారు.. తలా ఒక శెయ్యి ఏసి కత్తి పీటలు తీసుకోని కండలు వాలికలు శేచ్చాంటే .. మా యమ్మ ఆ యా కూరాకు శెయ్యడానికి రెండు కండలు ..కొన్ని శిగురు ఎంకలు …ఆయాలు ఒక కుండలో వేసి దాంట్లో ఒక శెంబు నీళ్ళు పోసి దాంట్లో ఇంత పసుపు ఉప్పు కరెప్పాకు వేసి ఒక ఉల్లిగడ్డ కోసి వేసి పొయ్యిమీద పెట్టి కింద మంట ఎలిగిచ్చింది.
పక్క పొయిమీద పెంకు పెట్టి వట్టి మిరపకాయు..దనియాలు ..జీలకర్ర ..గసగసాలు వేసి ఏయించి పొయికాన్నే ఉన్నె రోట్లో దంచుతాంది .. ఇంగోపక్క తెల్లబాయలు వలుచ్చాఉంది.. రెండు పొయిల్లో మంట సరిగా ఉందా లేదా అని సూచ్చా ఉంది. ఇన్ని చేస్తాన్న మా యమ్మ … ఒక బంటు లాగా అనిపిస్తా ఉన్నెది.. పని జేచ్చా నోటికి పని చెప్పకుండా ఉంటదా అంటే అది లేదు .. అదట్ట చెయ్యండి ఇదిట్ట చెయ్యండి అని అందరికీ పురమాయిచ్చాఉంటాది. అట్ట మాట్లాడతానే శరా పురిగా మసాల నూరి పెట్టింది.. మసాల వాసన ఘమాయిచ్చాఉంది.
ఇంత లోపల కూరాకు కుండలోనుండి గజ్జెల పొంగు వచ్చింది. గజ్జెల పొంగు అని దాన్ని ఎందుకు అంటారో మా యమ్మ నాకు చెప్పింది..కూరాకు ఇట్ట ఉడక పెట్టినప్పుడు వచ్చే తొలి పొంగులో చిన్న చిన్న బుడగలు బుడగలు వస్తాయి అవి గజ్జల మాదిరి ఉంటాయి కాబట్టి దానికి గజ్జెల పొంగు అని పేరు వచ్చింది ఈ పొంగు వచ్చిందంటే ..ఇంగ కూరాకు బెన్నా ఉడుకుతాది అని ..తొసు కోవచ్చు అని మా యమ్మ చెప్పింది.. దీనికి నువ్వు పెట్టినవా ఆ పేరు అని మా యమ్మను అడిగితే లేదు ..ఇది పూరో కాలం నుండి వచ్చాఉంది. మీ జేజి కూడా ఇదే మాట అంటాన్నెది అని చెప్పింది. గజ్జల పొంగు వచ్చినప్పుడు వాసన ఘమా ఇస్తది.. ఆ వాసనకే సగం కడుపునిండి పోయినట్టు ఉంటాది. కానీ ఆకలి మాత్రం దంచి కొడతది.. ఈ మసాల వాసన ఆ గజ్జెల పొంగువాసన తో ఇండ్లంతా గుమాయిచ్చాంది.
శియ్యలు ముందేసుకుని వరికిల్లు చేసి వల కట్టమీద వాటిని యాలాడ తీసి మంచం పైకి లేపి ఆ మంచం కోళ్ళమీద ఈ వల కట్టెను పేర్చి ..ఆ వరికిల్లను కాకులు ఎత్తక పోకుండా ఉండటానికి దాని మీద రెండు మూడు కంపమండలు వేసి ఇంట్లో శిన్నోడిని అయినందుకు ఒక మంచం నిలువుగా పైకి ఎత్తి దానికి ఒక కట్టె ఊతం పెట్టి ఆ మంచం మీద దుప్పటి కప్పి కింద సాప పర్సి ఆ శియ్యల కాడ నన్ను కాపలా పెట్టినారు.. నేను ఒక వల కట్టె తీసుకోని కాకు రాకుండా అదిలిచ్చా కూకున్నాను.
వరిక్లిల్లు కొయ్యడం అయిపొయ్యారక గజ్జెల పొంగు రాడంతో మా నాయన గబగబా లేసి దొడ్లోకి పోయి నాుగు చెంబుల నీళ్ళు పోసుకోని వచ్చి వేరే గుడ్డలు ఏసు కోని …పొయ్యి కాడికి వచ్చి ‘ఏం గజ్జెల పొంగు ఇంగా రాలేదా’ అని అడిగారక అప్పటి దాంక ఒక పక్క మసాల నూరుకుంటా ఇంగో పక్క సంగటికి ఎసురు పెట్టి రెండు పొయ్యిల్లో కొరువులు ఎగదోసుకుంటా ఉన్నె మా యమ్మ మా నాయన అట్ట అడిగే తలికి ఇంత ఎత్తు ఎగిరింది ‘పొద్దన్నుండి పనెంబడి పని శేచ్చాఉండాను నేను గమ్మునేమన్నా ఉండానా కాసేపు ఆగలేవా పదురుతుండావే’ అని మా యమ్మ తిట్టడం తిరుక్కున్నెది..మా యమ్మకు సందు దొరికితే చాలు మా నాయన్నే కాకుండా వాళ్ళ వంశాన్ని మొత్తం తిడ్తది …‘శియ్యల కూరాకు కోసం భూములు అమ్ముకున్న జాతి’ నిన్నని ఏం లాభం లే శిన్న కొడుకు శిన్న కొడుకు అని మీ అమ్మ నిన్ను అట్ట తయారు చేసి నా ఎదాన తోసి పోయింది అని మా జేజి మీదికి లేసింది. అట్ట తిడతానే మా నాయనకు ఉప్పుతో ఉడికేసిన శియ్యలు ఒక రెండు గంటెలు ఏసింది.అట్ట తిడతానే మా నాయన వాళ్ళమ్మ ఇట్టనే మా నాయనకు ఏసిచ్చేది అనే విషయాన్ని కూడా మా యమ్మ ఇవరిచ్చింది.
అది తిన్నెంక కాసేపటికి మా నాయన కాలు కాలిన పిల్లి లాగా పొయి సుట్టే తిరుగుతాన్నెడు. మా యమ్మ సంగటి కుండకు పంగల కట్ట ఆనిచ్చి దాని మీద కాలు వేసి అది కదలకుండా తొక్కోని సంగటి గబ గబా గెలుకుతాంటే .. శియ్యల కూరాకు లోనుండి వచ్చే వాసనకు గెలికిన రాగి సంగటి లో నుండి వచ్చే వాసనకు ఎవ్వరికైనా నోట్లో నీళ్ళు ఊరాల్సిందే …మా నాయన ఒక పక్క సాప పర్సుకోని పెద్ద చెంబుతో నీళ్ళు పెట్టుకోని సాప మీద సక్కల బెల్లం వేసుకోని కూకోని ..ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా గుటుక్కున మింగుదామా అని ఎదురు సూచ్చాండాడు.. మా యమ్మ పొయ్యిమిందనుండి సంగటి కుండను దించి .. సంగటిలోనుండి తెడ్డు తీసి దాన్ని ఉదరా బదరా తుడిసి ఒక బేసిని లో ఒక్కరవ్వన్ని నీళ్ళు సల్లి హస్తం గంటె తీసుకోని రెండు హస్తం గంటె నిండా సంగటి దీసి ఆ బేసినిలో వేసి ఒక చేత బేసిని పట్టుకుని మరో చేత్తో ఆ సంగటిని ముద్ద చేసి ఓ పెద్ద తెల్లెలో వేసింది. ఇంగొక కూర గిన్నె నిండా కూర వేసి రెండూ తీసకపోయి మా నాయన ముందు పెట్టి ‘కాసేపు ఉంటే కనేట్టు ఉండావు ఇంగ మింగు’ అని ఒక శెతురు మాట వేసి మల్లా పొయికాడికి పోయింది. మా నాయన కు తిరిగి మాట ఇయ్యడానికి మనసు ఒప్పినట్టులేదు పొగలు కక్కుతాన్నె ఉడుకుడుకు రాగి సంగటి ఉన్నె తెల్లెను దగ్గరికి లాక్కోని సంగటికి ముందు ఇంత కూర ఏసుకోని .. చెంబు నీళ్ళలో చెయ్యి అద్దుకోని రాగి సంగటి మీద దాడి చేయడం తిరుక్కున్నాడు..
ఒక తుంట తుంచడం .దాన్ని కూరాకులో ఒక పక్క అద్దుకోవడం ఒక శియ్య తునక తీసుకోని నోట్లో పెట్టు కోవడం దాన్ని మింగుతానే కూరాకులో అద్దిన సంగటి నాలిక మీద రాపాడిచ్చి గుటుక్కున మింగడం.. అట్ట మా నాయన సంగటి తునకలు తుంచి కూరాకులో ముంచి గుటుక్కు గుటుక్కున మింగి అట్టనే తెల్లెను ఒనికిచ్చినాడు. మా నాయనకు సంగటి పెడతానే .. ఆయన తరువాత శియ్యల కాడ కాపలా కాచ్చాన్నె నా కాడికి తీసుకోని వచ్చినాది మా యమ్మ పొగలు కక్కుతాన్నె సంగటి… ఆ సంగటి ఎట్టుందంటే బడికి పోయే పిల్లోని కి తల నిండా ఆందెం పూసి తకాయ దువ్వితే ఎట్టుంటదో అట్ట కనిపిచ్చినాది. అప్పుటి దాంకా ఈ వాసనతో ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా అని ఎదురు సూచ్చాన్నె నేను నీళ్ళ చెంబులో చెయ్యి తడుపుకోని పొడ ఎండ మింద పడతాన్నా కూడా లెక్క చెయ్యకుండా సంగటి కూరాకు అట్టనే ఇదిలిచ్చి తెల్లెలోనే చెయ్యి కడిగి తెల్లె ఒక పక్కకు పెట్టి నిక్కరుకు శెయ్యి తుడుసుకున్నాను.
నా మాదిరే మా పక్కన ఉండే ఇండ్లలో వాళ్ళ/ కూడా వాల్ల వాల్ల ఇండ్ల కాడ శియ్యలకు కాపలా ఉండే వాళ్ళకు కూడా ఇట్టనే బువ్వనో సంగటో తీసకచ్చి ఇచ్చినారు.. అందరం సంగటి శియ్యల కూర నా మాదిరే తిని ఇంగ పాటలు పద్యాలు పాడ్డం తిరుక్కుఉండిరి .. అంతే కడుపు నిండితే నక్క ఊల ఏసినట్లు మనిషి గూడా కడుపు నిండే దాకా ఒక రకంగా కడుపు నిండినాక ఒక రకంగా ఉంటారు..
మా నాయన సంగటి అనామొత్తు గబ గబా మింగి శివరాకర్న కూరాకులో ఇంగొక రవ్వ ఉప్పు పడింటే బాగుండు అన్నాడు..అందరు పిల్లోల్లకు సంగటి పెట్టి అందరు తిన్నాక మిగులు తగులు గిన్నెలో ఏసుకోని తింటాన్న మా యమ్మ మా నాయన మాటలు విని ఈ కూత ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడే కూయాల్సింది. పెట్టింది పెట్టినట్టు అనా మొత్తు యారకతిని శెయ్యి కడుక్కునే తప్పుడా శెప్పేది.. అని మా యమ్మ మా వంశాన్ని తిట్టడం తిరుక్కుండార్క మా నాయన ఆకు వక్కా సున్నం కాయ తీసుకోని పొట్ట నిమురుకుంటా అరుగు మీదికి పొయినాడు.. ఈ లోపల మా నాయన మాదిరే సంగటి శియ్యల కూరాకు దుమ్ము లేపి వచ్చిన మా దానం మామ గూడా మా అరుగు మీదికి వచ్చినాడు …. మా నాయన శేతిలో ఉండే ఆకు జూసి నాలుగు ఆకులు ఇయ్యిమామ ఆ బాసేలుకు ఆకు తెప్పియ్యమంటే అస్సలు పకలేదు.. అని వాళ్ళ బార్యను తిట్టడం తిరుక్కున్నాడు. మా నాయన పోనీలేవోయి నా కూతురు ను ఎందుకు తిడతావు నేను ఇచ్చాలే ఆకులు అని కొన్ని ఆకులు దానం మామ శేతికి ఇచ్చినాడు ఇద్దరు కలిసి తమల పాకులు ఈనె తీసి సున్నం రాసుకుంటా ఆ రోజు కోసుకున్న శియ్యల గురించి ఎన్ని కువ్వలు పడింది.. ఎంత బాగున్నెది శెప్పుకుని ఆకు వక్క నముకుంటా బీడిలు ఎలిగిచ్చి బో సుకపడిరి .. అయన్నీ గ్నాపకాలుగా మిగిలి పోయినాయి మారిన కాలం లో గజ్జెల పొంగు కుక్కర్ల కూత కింద పడి నలిగి పోయి కరిగి పోయింది. మా నాయన జ్ఞాపకం మాదిరి.
*
తాజా కామెంట్లు