అప్పుడు మరణం …

Painting: Akbar

Painting: Akbar

-భాను కిరణ్ కేశరాజు 
జీవించడం
నేను నా అనుభూతులూ, నా స్పందనలూ, నా అనుభవాలూ
ఆరాటాలు , పోరాటాలూ, ప్రేమలూ, ద్వేషాలూ, సుఖాలూ, దుఖాలూ సమస్త జ్ఞాపకాలూ !
ఇదేగా జీవితం…జీవించడం-
మరణం
మనకు తెలిసినవన్నీ పూర్తిగా ముగిసిపోవడం
శాశ్వతమని మనం తలపోసే వాటికి దూరంగా
రెప్పపాటులో  ఎక్కడికో తెలియని లోకాల్లోకి పయనం-
చేతనలో…..అచేతనలో
మరణమన్న  భయాన్ని ముక్కలు  చేస్తే
లోలోన….
అచేతన జారీ చేస్తున్న ఆజ్ఞలను
పక్కకి నెట్టేసి
బ్రతుకు భయం..చావు భయం
ఈ ఆరాటాలూ, పోరాటాలూ, సంఘర్షణలూ
అన్నీ మాయమయ్యి
అన్నీ శాశ్వతంగా కొనసాగాలనే ఆలోచన ఆపి వేసిన మనస్సు
ఖాళీ కుండలా
జీవించటం, మరణించటం ఒక్కటయినా  ఆ అనుభూతి
అద్బుతమయిన ఆ క్షణం
అజేయమయినది నా ఉనికి లోకి వచ్చిన ఆ క్షణం
అప్పుడు మరణం
ఒక అద్బుతమయిన ఘడియ !
ప్రాణంతో ఉండటమంత  శక్తివంతమయినది!!

*

తెలుగు సాహిత్యం వేరు, తెలంగాణా సాహిత్యం వేరు!

ashok1సమకాలీన తెలుగు కథాలోకంలో ఇప్పుడు బాగా పరిచితమయిన పేరు పెద్దింటి అశోక్ కుమార్. కథ రాసినా, నవల రాసినా అశోక్ ముద్ర వొకటి ఉంటుందని ఇప్పటి పాఠకులు అతి తేలికగా గుర్తు పట్టగల శైలిని సాధించిన రచయిత అశోక్. తెలంగాణ మాండలికం వాడుతూనే తెలంగాణా కథని సరిహద్దులు దాటించిన రచయిత. ఇతర ప్రాంతాలలో కూడా తన కథలకు అభిమానుల్ని సంపాదించుకున్న వచనశిల్పి అశోక్ తో భానుకిరణ్ కేశరాజు కొన్ని సంభాషణలు:
Qజాతీయ కథా సదస్సు కు ఎంపికయిన సందర్బంగా అభినందనలు. దీనికి మీ స్పందన?
 నా “జిగిరి “నవల పంజాబ్ లోకి అనువాదమయింది.దీనికి చాల స్పందన వచ్చింది. పంజాబ్ అనువాద సాహిత్యం లో అది ఒక గొప్ప నవలగా నిలిచి పోయింది.పరోక్షంగా పంజాబ్ సాహిత్య కారులతో పరిచయమయ్యింది. వాళ్ళు ప్రతియేటా జాతీయ  స్తాయిలో కథకుల  సదస్సు నిర్వహిస్తారు.గత సంవత్సరం కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు వీలుకానందున వెళ్ళలేక పోయినాను. తెలంగాణా సాహిత్యం అన్నా, తెలంగాణా ఉద్యమం అన్నా వాళ్ళు బాగా ఇష్టపడతారు. జిగిరి నవల తో తెలంగాణా నవల మొట్టమొదటి సారిగా పంజాబ్ సాహిత్యం లోకి వెళ్ళింది. దీనికి వచ్చిన స్పందనతో తెలంగాణా సాహిత్యం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో అని ఆ కథ సదస్సు లో ఒక తెలంగాణా రచయిత తో మాట్లాడిద్దాం  అనే పట్టుదలతో నన్ను ఆహ్వానించారు.తెలుగు సాహిత్యం నుంచి ఒకటి, రెండు కథలు అనువాదమయినాయి కాని విస్తృతంగా వెళ్ళలేదు. నవల మాత్రం ఇదే మొదలుగా అనువాదమయింది.ఇంకా చెప్పాలంటే తెలంగాణా నుండి కథ గాని నవలగాని ఇదే మొదటిది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు కథలు అంటే  సీమాంద్ర కథలనే అనుకున్నారు. సీమాంధ్ర కథల్లో బలముండదు. తెలంగాణా కథల్లో జీవితం ఉంటుంది  భాష ప్రాంతం ప్రజలు వేరయినా జీవితాల్లో ఉండే సంక్షోబం  ఒకటే అని నా జిగిరి నవల నిరూపించింది. వాళ్ళ సాహిత్యం లో స్పృశించని , వాళ్ళ ఊహకు కూడా రాని అంశం ఈ కథాంశం. దీనితో నన్ను ఆహ్వానించడం  జరిగింది.
Qతెలంగాణా ఉద్యమ సాహిత్యం. తెలంగాణా ప్రజా జీవితం సంస్కృతి మీద వచ్చిన సాహిత్యం, తెలుగు సాహిత్యం దీనిపై మీ వివరణ?
నా కథ సంకలనాల మీద చర్చ వచ్చినప్పుడు ఇవి తెలుగు కథలకు భిన్నంగా ఉన్నాయి అని వాళ్ళ స్పందన చూసి  తెలుగు వేరు, తెలంగాణా సాహిత్యం వేరు, ఇక్కడి జీవితం వేరు, ఇక్కడి సంస్కృతి వేరు ,భాష వేరు, ఉమ్మడి రాష్ట్రంలో వివక్షత చేత తెలంగాణా జీవితాలు బయటికి రాలేదు,అని వివరించాను. ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణా లో సాహిత్యమే లేదు తెలంగాణా సాహిత్యం  అంటే పోరాట సాహిత్యమే , తెలంగాణా కథ అంటే ఉద్యమ కథే అని ప్రచారం కూడా జరిగింది. తెలుగు వేరు తెలంగాణా వేరు, తెలంగాణా లో ఒక ప్రత్యెక జీవితం ఉంది తెలంగాణా సంస్కృతీ ఉంది  అని కేంద్ర సాహిత్య అకాడమీ సభల్లో కూడా చెప్పడం జరిగింది.తెలంగాణా సాహిత్యం అనేది ఉర్దూ మరియి నిజాం పాలనతో ప్రభావితమయింది.తెలుగు సాహిత్యం మీద  ఆంగ్ల మరియి బెంగాలి తదితర భాషల సాహిత్య ప్రభావం ఉంది. తెలంగాణా సాహిత్యం ఉర్దూ సాహిత్యం తో ప్రభావితంయ్యింది. కాబట్టి ఇక్కడ కథ, కవిత్వం నిలకడ గా ఉంది , భూమి మీద  ఉంది. వాస్తవ జీవితాల్ని ప్రతిబింబించింది. ఆంద్ర ప్రాంతం లో  శిల్పం శైలి మీద ఆధారపడి  కథలుగా నిలిచినాయి. కాని తెలంగాణా లో వస్తువు ప్రధానంగా కథలు నిలిచినయి.ఇదే విషయం వేరే రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది.ఇక్కడి భాష,జీవితం ,  అలవాట్లు, సంస్కృతి వేరు.కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రత్యక ప్రాంతం గా గుర్తించాలి, ప్రత్ర్యేక రాష్ట్రంగా గుర్తించాలి .ఇక్కడి భాషా సాహిత్యాలకు ప్రత్యెక హోదా కల్పించాలి.
Qతెలంగాణా మాండలికం లో రాసిన మీ రచనలు వేరే భాష లోకి అనువాదమయినప్పుడు మూలం లోని తెలంగాణా  ప్రాంత జీవితం ,భాష, పలుకుబడి.,యాస లోని ఆ సొగసు  కనపడదు కదా? మూలం లోని సహజత్వం అనువాదం లో ఆస్వాదించగలమా?
నిజమే మీరన్నట్లు మూల భాషలో ని తడి , ఉత్కంటత అనువాదం లో కనపడదు.అనువాదకుడు భాషా పండితుడు అయి  ఉండి తెలంగాణా భాష మీద  పట్టు ఉన్నవాడయితే  అనువాదానికి న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు నేను రాసిన “తెగారం” అనే కథ శివ సత్తుల జీవితం మీద రాసింది ఆంగ్లం లోకి అనువాదమయింది.  వాళ్ళు  వాడే పదాలు ఆంగ్లం లోకి అనువాదం చేయలేక పొయ్యారు. అదే విదంగా “మాయిముంత” కథను హిందీ లోకి అనువాదం చేసి, అనువాదం లో మూలం లో ఉన్న తడి రాలేదు ,ఈ కథకు అన్యాయం చేయలేమని ఆ కాగితాలని చిమ్పేశారు..ఆంగ్లం లోకి కూడా ఆ depth ఆ tone అనువాదం లో చూపించలేక పోతున్నాం ఈ కథకు అన్యాయం చెయ్యలేం ,అనువాదం చెయ్యలేం అని అన్నారు. జిగిరి ని ఆంగ్లం లో తెలుగు లో చదివిన మిత్రులు  ఈ ఆంగ్లానువాదం ఎందుకు పనికిరాదు అన్నారు.చిత్రమేంటంటే హిందీ అనువాదం లో కూడా తెలుగులో ఉన్న తడి లేదు కానీ హిందీ నుంచి ఆ తర్వాత పదకొండు భాషల్లోకి అనువాదమయింది.రెండు భాషల మీద పట్టు ఉన్నట్లయితే అనువాదానికి న్యాయం జరుగుతుంది.
పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

Qబాల్యం, విద్యాబ్యాసం :
నేను 8 వ తరగతి వరకే చదువుకున్న  తర్వాత బంజేసిన. మిగతా చదువంతా ప్రైవేట్ గానే కొన సాగింది. మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. 80 లో పెద్ద కరువొచ్చింది. మా బాపు అప్పుడు గల్ఫ్ పోయిండు.ఇక్కడ అప్పులు ఎట్లా తెర్పాలో తెలియక గల్ఫ్ పోయిండు. నా చదువు బంజేసి వ్యవసాయం ఎడ్లు జూసు కొనుడు మొదలుపెట్టిన.ఓ సంవత్సరం దాక మా బాపు జాడ తెల్వదు ఎం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నడో తెలియదు.  అప్పుడు మేం పడ్డ ఆ సంఘర్షణ  తర్వాత వలస కథలుగా రాయడం జరిగింది. పదో తరగతి ప్రైవేట్ గానే రాసి పాస్ అయిన. మా బాపు మళ్ళీ రెండో సారి గల్ఫ్ పోయిండు, కాని ఈ సారి ఓ స్తిరమయిన  కంపెనీ లో జేరి మంచిగానే ఉండే. అప్పుడు నన్ను చదివించాలని అనుకోని చదువుకొమ్మని ఉత్తరం రాసిండు. దగ్గర కాలేజ్ లేదు మనమేం చదువుతంలె అని ఊరుకున్న. 82 ల గంబీరావు పేట లో కొత్త కాలేజ్ పడితే దాంట్ల చేరిన. చేరిన రోజు పొతే మళ్ళీ ఎక్సామ్ రాసిన రోజే పోయిన.ఎందుకంటీ చిన్నపటినుంచి నాకు నాటకాల మీద ఇష్టం ఉండేది. మా ఇంట్లోనే ఈ నాటకాల రిహాల్సల్స్ జరుగుతుండేవి. ఈ నేపథ్యం లో నుంచి తర్వాత మా ఊరి బాగోతం అనే కథలు రాసిన.
Q మీరు రచయిత గా ఎదగడానికి ప్రేరేపించిన అంశాల గురించి చెప్పండి
మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు  అప్పటికప్పుడు పాటలు రాసుడు, పద్యాలు రాసుడు, ఉన్నయి మంచిగా లేక పొతే కొత్త పదాలు రాసుడు ఇలా నాలో క్రియేటివిటీ అప్పటినుంచే మొదలయ్యింది.ఏదన్న పాట సరిగ్గా కుదరక పొతే దాన్ని మార్చి మళ్ళీ రాసేది. అదే విదంగా సిద్ధిపేట లో డిగ్రీ అయ్యేదాకా కొనసాగింది. నాటకాల కొరకు తిరిగే వాళ్ళం. నాకు రావణాసురిడి వేషం వెయ్యాలనే కోరిక ఉండేది. నా పర్సనాలిటీ ఏమో దానికి సరిపోదు. అది ఎప్పటికీ కోరిక గానే మిగిలిపోయింది. ఆ తర్వాత 90 నుండి 96 వరకు ఊరికి దూరంగా ఉన్న. 96 తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఊరికి పోయిన.  ఊరికి పోయిన తర్వాత ఊళ్ళో వచ్చిన మార్పులు నాకు స్పష్టంగా కనిపించినయి.అంతకు ముందు ఊరు మంచిగా  ఉండే. రెండు చెరువులు ఉండె. వాగు ఉంటుండే , ఊరినిండా పశువులు ఉంటుండే.ఇవన్నే ఒక్కటి లేకుండా పోయినాయి. విద్వంసం బాగా జరిగింది. ఊళ్ళ ఉన్నోళ్ళందరూ గల్ఫ్ కి పొయినారు.ఇంటికో ఏజెంట్ అయ్యిండు, ఏజెంట్ల మోసాలు, గల్ఫ్ లో ఉండె వాళ్ళ బాదలు, ఇక్కడ ఉండె వాళ్ళ కుటుంబాల , స్త్రీల, పిల్లల బాధలు నన్ను కదిలించినాయి , వాకిళ్ళు అన్నీ    మొరం దేలినాయి, ఇండ్లకు తాళాలు పడ్డాయి కుల వృత్తులు పోయినాయి  కుమ్మరోడు, కమ్మరోడు లేదు అందరు పోయిండ్రు.ఇవన్నీ చూసి బాగా కదిలిపోయిన , ఎట్లుడే ఊరు ఎట్లయి పోయింది  అనే ఆలోచన మనసులో మెదిలి తట్టుకోలేక వెంటనే కథలు రాయడం మొదలుపెట్టిన . అప్పటికి నేను సాహిత్యం ఏమీ చదువుకోలేదు. ఎ కథా సాహిత్యం చదువుకోకుండానే రాయడం మొదలుపెట్టిన. సాహిత్యం చదువుతే రాసేవాన్ని కాదేమో.నేను కథలు రాసే నాటికి కేవలం వ్యాపార సాహిత్యం మాత్రమె ఉండేది. అట్లా ఏమీ చదువకుండానే మొదటి కథ రాసిన.అప్పుడు చదవక పోవడమనేది మైనస్ అనుకున్న కానీ అదే నాకు ప్లస్ అయ్యింది.ఆ సాహిత్యం చదివితే ఇన్ని కథలు రాసే వాణ్ని కాదేమో. ,
Q మీ మొట్టమొదటి రచన, ఆ రచనా నేపథ్యం  ఆ తదుపరి మీ రచనా జీవితానికి ప్రేరణ గురించి చెప్పండి?
నా మొట్ట  మొదటి కథ ఆశ నిరాశ  ఆశ అని 99 లో రాసిన. అది ఒక రైతు జీవితం  పంట వేయడం అది ఎండి పోవడం, మళ్ళీ వేయడం అది మళ్ళీ ఎండి పోవడం . రైతుకు భూమి కి ఉన్న సంబంధం మామూలు సంబంధం కాదు. మున్గనీ , చావనీ చావనన్న చస్తాడు కానీ భూమిని వదిలి పెట్టడు.పంట పండినప్పుడు ఆశ ఉంటది, ఎందినప్పుడు నిరాశ ఉంటది. ఆ ఆశ నిరాశ ఆశ ల మధ్య కొట్టు మిట్టడుతాడు  తప్ప భూమిని వదిలిపెట్టుకోడు.అటువంటి రైతు కథ ని ” ఆశ నిరాశ ఆశ” అని 99 లో రాసిన. ఆ తర్వాత చుట్టూ చూస్తె గల్ఫ్ బాదితులు చాల మంది కన్పించిన్రు. గల్ఫ్ వాళ్ళ బాగుపడ్డ జీవితాలు  ఉన్నాయి , కొంత మంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మా కుటుంబం ఒకటి.ఆ బాధల  నేపథ్యం లోనుంచి సమగ్రంగా వలస కథలని 12 కథలు వివిధ కోణాల్లో నుంచి అంటే భార్య కోణంలో నుంచి, భర్త కోణం లోనుంచి, ఏజెంట్ కోణం లోనుంచి, ఇలా విస్త్త్రుతంగా రాసిన.
గల్ఫ్ వలస  జీవితం మీద 2001 లో ఎడారి మంటలు అనే నవల కూడా రాసిన. పోయిన తర్వాత ఏమి జరుగుతది , వచ్చిన తర్వాత ఏమి జరుగుతది , వలస ఎట్లా చిచ్చు పెదతది  అని రాసిన .తర్వాత , రాస్తూ పోతున్న కొద్ది అవగాహన ఏర్పడి, సమాంతరంగా సాహిత్యం చదువుకోడం జరిగింది.మన విస్తృతి పెరిగింది. ప్రపంచీకరణ జరిగి కుల వృత్తులు ఎట్లా పోయినయి, వ్యవసాయం లో వచ్చిన సంక్షోబాలు, తర్వాత మానవ జీవితాల్లో  ఉన్న సంక్లిష్టత, ఇవన్నీ కథలుగా రాయడం జరిగింది.ఆ క్రమలో అయిదు నవలలు కూడా రాయడం జరిగింది.వీనిలో మూడు చతుర లో రెండు ఆటా పోటీలలో రావడం జరిగింది. నేను ఎంచుకున్న మార్గం ఏమిటంటే పోటీ లకు పంపడం. బహుమతుల కొరకు కాదు, పోటీ లలో సెలెక్ట్ అయిన కథలు కాని నవలలు కాని ఎక్కువ మంది చదివే అవకాశము ఉంటుంది అని పోటీలకుపంపెవాన్ని. పల్లె జీవితాలని వలస జీవితాలని దగ్గర్నించి గమనించడం అవి కథలుగా మలచడం నేను చేసిన పని. విద్వంసం  చూసి తట్టుకున్నవాడు క్షేమంగా నిలబడతాడు, తట్టుకోలేని వాడు పిచ్చి వాడు అన్న అయితాడు, లేదా రచయిత అన్న యితడు , నేను ఆ విద్వంసం  చూసి తట్టుకోలేక రచయతగా మారిన కథలుగా రాస్తూ నా బరువు దించుకుంటున్న .
అశోక్ తో  భాను కిరణ్

అశోక్ తో భాను కిరణ్

Qమీ రచనలన్నీ తెలంగాణా మాండలికం , తెలంగాణా పల్లెల నేపథ్యంలో సాగుతాయి దీనికి ప్రత్యెక కారణాలు ఏమయినా ఉన్నాయా?
ప్రాంతీయ సాహిత్యం లో రావి శాస్త్రి నుంచి మొదలు పెట్టి  కారా నుంచి , ఇలా నెరుడాదాక , గూగీ దాక ఎవడి భాషలో వాడు ఎ ప్రాంత జీవితాన్ని  ఆ  భాషలో బలంగా చెప్పినప్పుడు మాత్రమె దానికి ఒక స్తానికత వస్తుంది.ఈ రోజు తెలంగాణా జీవితాన్ని తెలంగాణా లో  కాకుండా మామూలు తెలుగు లో చెపితే పేలవంగా ఉంటది.అంత depth రాదు.  పాత్రలు ఇక్కడివి, జీవితం ఇక్కడిది అయినప్పుడు భాష ఇక్కడిది కాకపొతే  అక్కడిదయితే పాయసం లో ఉండల్లా ఉంటాయి .ప్రాంతీయ ముద్ర లేని ఎ సాహిత్యం కూడా గొప్ప సాహిత్యం కాదు. గూగీ కూడా నేను నా భాష లోనే రాసుకుంట మీకు కావాలంటే ఇంగ్లీషు లోకి అనువాదం చేసుకోండి అన్నాడు.ఎందుకంటే మన భాషలో మనల్ని express చెయ్యొచ్చు. మాయిముంత కథను ఆ భాషలో రాయకుండా ఎ భాషలో రాసిన కానీ అంత అందం రాదు. నా ఉద్దేశం లో జీవితం, వస్తువు ఎంత ప్రధానమో దానికి భాష కూడా అంతే ప్రధానం.భాష అనేది కథల్లో , జీవితంలో ఒక బాగం.
Qఈ నాటి రచయితలు తమ రచనల్ని మాండలికం లో చేయాలన్న అత్యుత్చాహాన్ని కనబరుస్తూ పాఠకుడికి  దూరమవుతున్నారని అంపశయ్య  నవీన్ గారు అన్నారు, తెలంగాణా మాండలికం లో రచనలు చేస్తున్న మీరు దీని గురించి ఏమంటారు?
 నవీన్ గారు అన్న దాన్లో వాస్తవం లేదు. మీకు భాష రానంత మాత్రాన, భాష మీద ప్రేమ లేనంత మాత్రాన రచయితలూ అందరు అట్లా రాయాలనుకోవడం తప్పు. ఒక సాహిత్య కారుడికి , ఒక పాఠకుడికి  భాష అనేది ఎంతమాత్రం అవరోధం కాదు.  రావిశాస్త్రి కథలని, కారా యజ్ఞాన్ని , అల్లం రాజయ్య  కథలని ఈరోజు ఆంద్ర ప్రదేశ్ అంతట చదివారు. కథలో బలముంటే , తడి ఉంటె, depth ఉంటె దాన్ని ఏదీ ఆపలేదు.గూగ్గీ సాహిత్యాన్ని ఏది ఆపగలిగింది, ఒకానొక తెగ భాషలో రాస్తే ఈరోజు ప్రపంచమంతా ఆ సాహిత్యాన్ని చదువుతుంది.గురుజాడ కన్యాశుల్కలో విజయ నగరం  మాండలికం లేదా, రావిశాస్త్రి, కార రచనల్లో శ్రీకాకుళం మాండలికం లేదా. వాటిని  మనం ప్రక్కన పెట్టలేదు కదా. రచయితలకు  భాషా సంకెళ్ళు వేయొద్దు. కథ అనేది భాద ని కలగ జేస్తది , తన్లాటని కలగ జేస్తది, ఆలోచిమ్పజేస్తది , కాబట్టి కథ మీద ప్రేమ ఉన్న వారికి భాష ఒక అవరోధం కాదు. రచయితలూ ఆత్మ గౌరవంతో రాసుకుంటున్నారు అనుకోవాలి  తప్ప పాఠకులకి  దూరమవుతున్నారని అనుకోకూడదు.
Qకథ , నవల మీకు నచ్చింది ఏ ప్రక్రియ?
 రెండూ నాకు నచ్చిన ప్రక్రియలే. ఎందుకంటీ నేను ఎంచుకున్న వస్తువు విస్తృతి ని బట్టి అది కథ గా రాయాలా, నవలగా రాయాలా అనేది నిర్ణయించుకుంట. కథలో స్కోప్ తక్కువుంటుంది, నవలలో స్కోప్ ఎక్కువుంటుంది. కథ అనేది అంగూర పండ్లు తిన్నట్టు, నవల అనేది నారికేళ పాకం.కథ రాయడానికున్న వెసులుబాటు అంటే సమయం, నిడివి , చిన్న సబ్జెక్ట్ ని బట్టి కథలు ఎక్కువగా వస్తున్నాయి. నేను కూడా ఎక్కువగా కథల వైపు మొగ్గు చూపించడం జరిగింది. రెండూ నాకు సమానమే. ఒక మంచి సబ్జెక్ట్  ఉంటె తప్పకుంట నవల రాస్తాను. ఉదాహరణకు జిగిరి మొదట ఒక కథగా రాసుకున్న, కాని అది కథలో ఇమడలేదు, అది నవల అంత విస్తృతి కలది కాబట్టి  నవల గా రాసిన.
ashok2
Q2006 ఆటా నవలల పోటీలో ప్రథమ బహుమతి సాదించి అనేక భాషల్లోకి అనువాదమయిన  జిగిరి నవలా నేపథ్యం గురించి చెప్పండి?
జిగిరి నేపద్యం అది విచిత్రంగా జరిగింది. నేను బండలింగాపూర్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు మా బడిలో ఒక పెద్ద విశాలమయిన  స్తలం  ఉండేది. దాన్ని అందరూ వాడుకునే వాళ్ళు. ఊళ్లకు ఎవ్వరు వలస వచ్చినా , కళ్లాల  కి కూలీలు, కోతులోల్లు, పిట్టలోల్లు వచ్చినా, సాధనాసూర్లు అందరూ అక్కడికి రావాల్సిందే. కోతులోల్లు వస్తే నేను “రెండు కోతులు” అని ఒక కథ, సాదత్ కాండ్లు వస్తే వాళ్ళ మీద “ఘోస” అనే కథ రాసిన.ఓ సారి గుడ్దేలుగులాయన వచ్చిండు. ఎవ్వరు వచ్చిన ఓ 15 రోజులు ఉంది పోయేవాళ్ళు. ఈయన రెండే రోజులు ఉండి  పోయిండు. ఎలా  పోతాడని నాకు అనుమానం వచ్చింది కాని రెండు రోజుల తర్వాత అతను  మళ్ళీ కాన పడ్డప్పుడు  గుడ్డేలుగు లేకుండా ఒక్కడే కన్పించిండు. అడుగుదామనుకుంటే బయపడి పోయిండు, నాకు అనుమానం వచ్చి సబ్జెక్ట్ ని వెతుక్కుంటూ, వెతుక్కుంటూ పోయే క్రమంలో నాకు వన్య ప్రాణి సంరక్షణ, గుడ్డేలుగు కనపడితే పోలీసులు పట్టుకుంటారని, వాటిని జు లో వదిలిపెట్టాలని కొన్ని అంశాలు తెల్సినాయి. నిజామాబాద్ జిల్లా దగ్గర అంబారీపేట్ వద్ద గుడ్డేలుగుల కుటుంబాలు ఉన్నాయంటే అక్కడికి పోయిన, అప్పుడు నాకు ఈ వాస్తవాలు , వాళ్ళ కుటుంబాల్లో ఎంత సంక్షోబం ఉంటది అని అనేక విషయాలు తెల్సినాయి. గుడ్డేలుగు ఒక క్రూర మృగం, దాన్ని మనిషి తీసుక వచ్చి సాదుకుంటాడు. అప్పుడు దానికి మనిషి లక్షణాలు నేర్చుకుంటది.కాని మనిషనే వాడు గుడ్డేలుగు తో సావాసం చేసి వీడు పశువులా ప్రవర్తించి దాన్ని వదిలి పెట్టుకోవటానికి సిద్దపడ్డాడు. మనిషి మృగం గా మారితే , మృగం మనిషిగా మారటం ఈ నవలా నేపథ్యం. దీన్ని నవలగా పంపితే ఒకటి రెండు పత్రికలూ దీన్ని తిరస్కరించినాయి. అప్పుడు ఆట నవలల పోటీ కి పంపితే వాళ్ళు ప్రదమ బహుమతి పొందిన నవలగా ఎంపిక జేయడం జరిగింది. ఆట కబురు అనే పుస్తకం లో ప్రచురితమయిన ఈ నవలను చూసి జె.ఎల్.రెడ్డి గారు చూసి హిందీ లోకి అనువాదం చేసారు.ఆ తర్వాత ఈ నవల 11 భాషల్లోకి అనువాదం జరిగింది.
Q మీరు రాసిన జిగిరి నవల పై బడుగు జీవుల బాధలని చిత్రించిందనే అబద్దపు ముద్ర వేయబడిన నవల అని విమర్శ వచ్చింది దీనికి మీరేమంటారు?

 

 ఒక నవల రాసిన తర్వాత అది మనది కాదు. జిగిరి మీద చాల విమర్శలు వచ్చాయి. మంచి నవల అని కొందరు, కాదని కొందరు అన్నారు. అడివి నుంచి దాన్ని తీసుక వచ్చినపుడు దాన్ని బ్రతుకు దెరువు కు తీసుకు వచ్చినా కాని తర్వాత దాంతో ఉన్న అటాచ్మెంట్ ని కాదనలేం కదా.కానీ తరాల మధ్య అంతరం మారింది. కొడుకు చూసే కోణం వేరు, తండ్రి చూసే కోణం వేరు.కొడుకు దాన్ని ఒక వ్యాపార వస్తువు గానే చూసిండు. తండ్రి అలా కాదు. అది వీళ్ళ జీవితాన్ని , జీవితంలో సంక్షోభాన్ని ప్రతిబింబించింది కాబట్టి అది బడుగు జీవుల నవల అయ్యింది. కాని దాన్ని బడుగు జీవుల నవల అని ఎవ్వరు అన్నారో నాకు తెలీదు. నెగెటివ్ గా వచ్చిన వ్యాసం ఇది ఒక్కటే, నేను దాన్ని స్పోర్టివ్ గా తీసుకున్న.
Q“మాయి ముంత” కథ ఓ బర్రె గురించి అయినా ఆ కథలో స్త్రీ హృదయం , పశువు ను కూడా ఒక బిడ్డలా చూసిన ఒక తల్లి పడే ఆరాటం వేదన ఎంతో హృద్యంగా చిత్రించారు. ఈ కథా నేపద్యం వివరిస్తారా?
మాయి ముంత, ఏడిండ్ల పిల్లి కూన , అనగనగా ఓ కోడి పెట్ట, ఈ మూడు కథలు మాత్రుత్వంలో మూడు కోణాలను చిత్రించిన కథలు. బర్రె బాద వేరు, పిల్లి బాద వేరు, కోడి బాధ వేరు. కోడి పిల్లలకి 50 రోజులు అన్నీ  నేర్పి వదిలి పెడతడి. పిల్లి తన పిల్లల్ని ఏడు ఇళ్లు  తిప్పుతది, ఎక్కడయితే సెక్కురిటీ ఉండదో వెంబడే పిల్లల్ని వేరే ఇంట్లోకి మారుస్తుంది. ఇట్లా ఏడు ఇండ్లు మారుస్తుంది. అది ఏడు ఇండ్లలో ఎంత వేదన అనుభవిస్తది అనేది కథాశం .మాయి ముంత ఒక బర్రె పడే ప్రసవ వేదన. నేను ప్రత్యక్షంగా   ఒక బర్రెకి పురుడు పోసిన, బర్రె కాని, పిల్లి కాని, ఏది కాని ఒక స్త్రీ పడే వేదన ఎంత ఉంటుంది అన్నది కథాంశాలు , ప్రక్రుతి ఎంత విచిత్రమయింది. ప్రసవం కాగానే బిడ్డ పట్ల బర్రె ప్రవర్తన దానికి ఎవ్వరు చెప్పిన్రు. చాల విచిత్రమయిన విషయం . మాతృత్వం మధురం అంటాం కాని అందులో ఒక స్త్రీ పడే హింస ఎంత ఉన్నది అని ఆలోచించాల్సిన విషయం. దీనికి గర్భం చేసిన దున్నపోతు ఎక్కడ పండు కుంటదో కాని ఇక్కడ ఈ బర్రె పడే వేదన హింసే మాయి ముంత కథ. మీకు జాతీయ సాహిత్యం లో ఇటువంటి కథ ఎక్కడా రాలేదు.
Q మిమ్మల్ని ప్రభావితం చేసిన రచనలు , రచయితల గురించి చెబుతారా?
 మీకు ముందే తెలియజేసినట్లు నేను ఈ రచనలో చదవలేదు. నన్ను ప్రభావితం చేసిన అంశం మా ఊరే. ఊరు, ఊరి జీవితం, స్మక్షోభాలు సంక్లిష్టతలు నన్ను ప్రభావితం జేసాయి తర్వాత కూడా నేను ఎవ్వరి ప్రభావాలకూ లోను కాలేదు.రచయితా  గా చాలా దూరం వచ్చిన తర్వాత నే నేను మిగతా సాహిత్యం చలం ,సాహిత్యం చదవడం జరిగింది. ఇష్టం వేరు ప్రభావితం కావడం వేరు.
Qమీ రచనల్లో మీకు ఇష్టమయిన రచయితలు  ఎవ్వరు  ?
 అల్లం రాజయ్య , తుమ్మేటి రఘోత్తం  రెడ్డి, చలం సాహిత్యం, కారా రావి శాస్త్రి సాహిత్యం నాకు ఇష్టమయినవి.
Qరచయితగా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

మార్పులకి అనుగుణంగా నన్ను నేను అప్డేట్ చేసుకొని ఈ సంక్షోబాన్ని, సంక్లిష్టత ను తెలంగాణా భాషలో కథలుగా రాయడం.

ఇంటర్వ్యూ : భానుకిరణ్ కేశరాజు