కారా కధల్లో మానవ సంబంధాల జీవధార

KaRa-Bangalore

కథాసాహితి ప్రచురించిన కథా -94 ఆవిష్కరణ సభావేదిక (బెంగుళూరు ) పై వాసిరెడ్డి నవీన్, కాళీపట్నం రామారావు, ఎన్.వేణుగోపాల్, పాపినేని శివసంకర్, ఓల్గా, కె.శివారెడ్డి ( ఈ ఫోటో ఆంధ్రప్రభ లో అచ్చయింది)

 భాష ఎంత పురాతనమయిందో కధా ప్రక్రియ కూడా అంత పురాతనమయినదయి ఉంటుందని చేకూరి రామారావు ఊహించారు. భాషలోనే కధన ప్రక్రియను సాధ్యం చేసే నిర్మాణాంశాలు ఉండటం ఇందుకు కారణమని ఆయన అన్నారు. (కధా యజ్ఞం, 1982, పే.1)

భాషకూ కధకూ ఉన్న ఉమ్మడి పునాదిని మానవ సంబంధాల వైపు నుంచి కూడా చెప్పవచ్చును. మానవ సమాజం మనుగడకు అత్యవసరమైనది సామాజిక ఉత్పత్తి క్రమం. దీని కోసం మనుషులు కలుసుకోవలసి వస్తుంది. ఉమ్మడి కార్యాచరణలో పాల్గొనవలసి వస్తుంది. ఈ అవసరం వల్ల మనుషుల మధ్య ఏర్పడే సంబంధాలను మౌలికంగా ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఈ ఉత్పత్తి సంబంధాలు సామాజిక పరిణామ క్రమంలో అనేక రకాల మానవ సంబంధాలుగా ప్రతిఫలనం పొందుతాయి. ఆధునిక సమాజంలో భౌతిక వస్తూత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేనట్టు కనబడే మనుషులు ఉండవచ్చు గాని వాళ్ళ మధ్య సంబంధాలకు కూడా సమాజంలోని ఉత్పత్తి సంబంధాలే మూలంగా ఉంటాయి.

ఇటువంటి వివిధ రకాల మానవ సంబంధాలకు భాష ఒక అవసరం, ప్రాతిపాదిక కూడా. ఈ మానవ సంబంధాలను, ఉత్పత్తి క్రమంలో సహజంగా ఏర్పడిన మానవ సంబంధాలను వర్గ సమాజంలోని అనేక అంశాలు వక్రీకరించాయి. వాటి చుట్టూ అనేక మాయలు అల్లాయి. అందువల్ల ఇవాళ మానవ సంబంధాలు సహజంగా, స్వచ్ఛంగా, మానవుల మధ్య సంబంధాలుగా లేవు. రక్తాల మధ్య, వంశాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, డబ్బు మధ్య, సరుకుల మధ్య సంబంధాలుగా మానవ సంబంధాలు కనబడుతున్నాయి.

ఇలా అనేక రూపాలలో, అనేక ఆచ్ఛాదనలతో వ్యక్తమవుతున్న మానవ సంబంధాలను మనుషులు తప్పనిసరిగా తమ చైతన్యంలో ప్రతిఫలిస్తుంటారు. అదే సృజనాత్మక రూపాలలోకి వస్తుంది. కధ ఈ పనినే అద్భుతంగా నిర్వహిస్తుంది. తద్వారా అది ఉనికిలో ఉన్న మానవ సంబంధాల నివేదికగా, విశ్లేషణగా, రానున్న మానవ సంబంధాల వైతాళికురాలుగా నిలుస్తుంది. ఈ అర్ధంలో కధన ప్రక్రియను మానవ సంబంధాల ప్రతిఫలనంగానూ , అవసరంగానూ గుర్తించవచ్చును.

ఐతే మానవ సంబంధాలే వికృతంగా ఉన్నప్పుడూ కధ చిత్రించ వలసిందేమిటి?ఇక్కడనే ప్రక్రియగా కధ నిర్వహించే పాత్ర కన్నా, వ్యాఖ్యాతగా కధకుడు నిర్వహించే పాత్ర ముఖ్యమయినదవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం పరిశీలనా శక్తి ఉన్న కధకుడయినా సమాజంలో ఉన్న కుళ్ళును గుర్తించగలడు, దాన్ని కధలో చిత్రించగలడు. ఇవాళ తెలుగులో వస్తున్న క్షుద్ర సాహిత్యం కూడా తెలుగు సమాజంలోని విలువల పతనానికి ఒకానొక చిత్రణే. ఇక్కడ కధకుడి సామాజిక బాధ్యత రంగం మీదికి వస్తుంది. కధకునిలో పరిశీలనాశక్తి తో పాటే సమాజానికి అర్ధమూ, లక్ష్యమూ తెలిసి ఉంటే ఈ విలువల పఠనం ఎందుకు ఉన్నదో చెప్పగలడు. దాన్నే చిత్రించినా దాని పట్ల అసహ్యం కలిగేలా, దాన్ని కూలదోసే ఆచరణకు పూనుకునేలా చిత్రించగలడు.

కధకుడి పాత్ర ఇంకా ప్రస్ఫుటంగా కనబడే అంశం మానవ సంబంధాల పరిశీలనలో సమగ్రత. ఏ కధకుడయినా మానవ సంబంధాలనే చిత్రించక తప్పదు. మామూలు కధకులయితే ఏదో ఒక కోణాన్ని మాత్రం అర్ధం చేసుకుని ఆ కోణాన్ని పూర్తిగానో, సగమో చిత్రిస్తారు. ఐతే కధా ప్రక్రియ కేవలం మానవ సంబంధాన్నీ ప్రతిబింబించేది మాత్రమే కాదు. అది మానవ సంబంధాలపై గాఢమైన ప్రభావం వేయగలదు కూడా.

ఈ అంశం గుర్తించాలంటే రచయిత సమాజ సారాంశాన్ని, మానవ సంబంధాల చరిత్రను అర్ధం చేసుకొని ఉండాలి. మానవ సంబంధాల గతాన్నీ, వర్తమానాన్నీ, అవగాహన చేసుకుని భవిష్యత్తును వాస్తవికంగా ఊహించగలగాలి. అంటే మానవ సంబంధాల ఏ ఒక్క కోణాన్నో కాక సమస్తాన్ని అవగాహన చేసుకుని చారిత్రక దృక్పధంతో సాన పెట్టుకోవాలి. సామాజిక పరిణామంలోని గతితర్కం మానవ సంబంధాల అభివృద్ధిలో ఎట్లా ప్రతిబింబిస్తుందో గుర్తించగలగాలి.

కాళీపట్నం రామారావు కధలన్నీ ఒకే వరుసలో చదివినప్పుడు మానవ సంబంధాల పట్ల ఆయనకు గల సమగ్ర దృష్టీ, అది పరిణమిస్తూ, పరిణితి చెందుతూ వచ్చిన క్రమమూ, ఆశ్చర్యాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తాయి. (మాష్టారిని స్వయంగా ఎరిగిన వాళ్ళు ఆయనకు అంత మార్క్సిజం తెలియదని చెప్పబోతారు గనుక ఒక వివరణ ఇవ్వాలి. సామాజిక జీవితాన్ని సమగ్రంగా, నిశితంగా పరిశీలించి కనిపెట్టిన సారమే మార్క్సిజం. మౌలికంగా మార్క్సిష్టు పరిజ్ఞానం ఉండిగానీ, కనీసం మార్క్సిష్టు పద్దతి ఉండి కానీ సమాజాన్ని నిశితంగా పరిశీలించ గలవాళ్ళు ఎంత సమగ్రత తో పరిశీలిస్తే అంత ఎక్కువగా సిద్ధాంతానికి దగ్గర కాగలరు. మాష్టారు తన కధల్ని “మార్క్సిస్టు వాసనలు పరోక్షంగా కూడా లేకుండా” రాశారని ఎవరయినా చెప్పబోయినా అది మాష్టారి పరిశీలనా శక్తికీ, మార్క్సిజపు వాస్తవికతకూ తిరుగు లేని నిదర్శనమే అవుతుంది. కానీ “జీవితానికి మార్క్సిజం అవసరం లేద”నే వాదనకు పునాది కాదు)

కారా కధలన్నీ కూడా మానవ సంబంధాల చిత్రణలే. కధా ప్రక్రియ కోసం ఒక్కొక్క కధలో ఒక్కొక్క సంబంధాన్నో, ఒక్కొక్క క్రమాన్నో చిత్రించవచ్చుగాని అక్కడ ఆయనకు ఆయా సంబంధాల గురించి, క్రమాల గురించి సమగ్రమైన అవగాహన ఉన్నదని స్పష్టంగా తెలిసిపోతుంది. అట్లాగే, చాలా సార్లు అమాయకంగా కనబడే ఆ చిత్రణ చాలా పటిష్టంగా పాఠకుణ్ణి ఒక ఉన్నత మానవ సంబంధం వేపు నడిపించే నిర్మాణాత్మక ప్రయత్నంగా ఉంటుంది.

ఇప్పుడు సంకలనంగా వచ్చిన ఆయన కధలు మొత్తం 25, ఈ కధలను వేరువేరు ప్రాతిపదికల మీద గతంలో విమర్శకులు మూడు భాగాలుగానో, రెండు భాగాలుగానో విభజించారు. కానీ ఈ కధలన్నీ మానవ సంబంధాల చిత్రణలనే ప్రాతిపదిక మీద చూసినప్పుడు వాటన్నిటిలోనూ ప్రవహించే అవిచ్ఛిన్న జీవధార కనబడుతుంది. ఐతే మానవ సంబంధాలకు సంబంధించిన ఉద్వేగాల కోణాల్ని చిత్రించడానికి తొలి కధలు పరిమితమైతే, మానవ సంబంధాల పునాదిని, కొంతవరకు ప్రత్యక్షంగా ఉత్పత్తి సంబంధాల్ని తర్వాతి కధలు చిత్రించాయి. బహుశా ఈ కారణం వల్లనే తొలి కధలు ఉన్నత వర్గాల వాతావరణంలో మాత్రమే సాగగా, తర్వాతి కధల వాతావరణం విస్తృతమయింది.

మానవ సంబంధాల వ్యక్తీకరణలో కారా మొట్ట మొదట ఎక్కువగా చిత్రించినది కుటుంబాలలో కొనసాగుతున్న అప్రజాస్వామికత, ముఖ్యంగా ఆయన తన దృష్టిని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద కేంద్రీకరించారు.

కుటుంబం అనే సామాజిక, ఆర్ధిక యూనిట్టు ఎట్లా ఉనికిలోకి వచ్చిందీ, దాని భవిష్యత్తు ఏమిటి అనే చర్చ అలా ఉంచి ఇవాళ కనబడుతున్న కుటుంబ రూపాల్ని పరిశీలించడమే కారా కధలు చేసిన పని. కుటుంబం ప్రధానంగా అంతరాల వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ఈ అంతరాలు కరుడు గట్టిపోయి ఉంటాయి. ప్రాధమిక యూనిట్ నుంచే అంతరాల వ్యవస్థ నెలకొనడం తనకు అవసరం గనుకు రాజ్యం ఈ అంతరాల వ్యవస్థను పెంచి పోషిస్తుంది. ఈ కఠినమైన అంతరాల వ్యవస్థలో ధిక్కారస్వరానికి అవకాశం లేదు. సాంప్రదాయంలో ఇమడని ఆలోచనకు, ఆచరణకు స్థానం లేదు. ఒక అంశం పరిష్కరించవలసి వచ్చినప్పుడు కూలంకషమైన పరిశీలన, చర్చ వేరువేరు అవకాశాల ప్రతిపాదనలు, సమగ్రమైన అవగాహనతో పరిష్కారం అనేది సరైన పద్ధతి. కానీ అంతరాల వ్యవస్థలో ఈ క్రమానికి బదులు కుటుంబ ‘యజమాని’ శాసనమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ పరిష్కారం మంచిదైనా, చెడుదైనా అసలు దాని క్రమం చాలా నిరంకుశమైనది.

ఈ అంతరాల వ్యవస్థ ఎంత నిరంకుశమైనదయినా, బాధాకరమయినదయినా వర్గసమాజం కొనసాగినంత కాలం అది కొనసాగుతుంది. భూస్వామ్యంలో బలమైన కుటుంబ వ్యవస్థతో అది కలగలిసి ఉంటుంది. ఒక తాతో, పెదనాన్నో, మామో కుటుంబానికంతటికీ శాసనకర్తగా ఉంటాడు. ఆయనే నిర్వాహకుడూ, తీర్పరీ కూడా. ఆధునిక రాజ్యాలు విడగొట్టిన మూడు అధికారాలు ఇంటికి సంబంధించి నంతవరకు ఆయన తన గుప్పిట్లోనే పెట్టుకుంటాడు. దుస్సహమైన ఈ స్థితి దుర్మార్గమైనది. ఈ స్థితి అనుభవించవలసి వచ్చిన వాళ్ళు తీవ్రమైన వేదనకు లోనవుతారు. ఈ స్థితిలో సమస్యలు పరిష్కారాలు అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా జరుగుతాయి. ఈ స్థితికి గల వేరువేరు ముఖాలను ‘పెంపకపు మమకారం’ ‘రాగమయి’ ‘అభిమానాలు’ ‘అశిక్ష- అవిద్య’ ‘తీర్పు’ ‘ఇల్లు’ కధల్లో కారా చిత్రించారు.

ఉమ్మడి కుటుంబంలో మమకారం కూడా ఎట్లా సూటిగాకాక వక్రరూపాల్లో ప్రకటితమవుతుందో ‘పెంపకపు మమకారం’ లో చిత్రణ పొందింది. అందువల్లనే చర్చ ద్వారా పరిష్కరించదగిన అతి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారిపోతుంది. ఐతే ఆ సమస్య జటిలం అవుతున్న కొద్దీ కుటుంబంలోని అప్రజాస్వామికత వల్ల పరిష్కారం అప్రజాస్వామికంగానే జరుగుతుంది. నిజానికి అప్పుడు పరిష్కారపు మంచి, చెడులుగాక అది అమలయిన తీరు గురించి ఆలోచించవలసి వస్తుంది. వచ్చిన సమస్యను చర్చ ద్వారా, వస్యంగా ప్రజాస్వామికంగా పరిష్కరించి ఉంటే ఆ స్థితిని అనుభవించిన వ్యక్తులందరి వేదనా సమసిపోయేది.

మధ్య తరగతిలో అంతరాల వ్యవస్థతో ఒక కుహనా ప్రతిష్ట కూడ కొనసాగుతుంది. సామాజిక స్థితికీ, ఈ కుహనా పటిష్ఠకూ ఉన్న విభేధంవల్ల ఆ కుటుంబమంతా తీవ్రమైన ఘర్షణలకు లోను కావలసి వస్తుంది. ఈ ఘర్షణలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోగల వాతావరణం లేనప్పుడు నిష్టూరాలు, నిందలూ, అకారణ కోపాలు, అనవసరమైన ఆదేశాలు రంగం మీదికి వస్తాయి. ఈ స్థితిని చిత్రించింది ‘రాగమయి’. గ్రామీణ వ్యవస్థలోని మంచితనం, పరోపకారత వంటి విలువలు ఉన్నప్పటికీ ఈ స్థితి ఇట్లా కొనసాగఊక తప్పదని ‘రాగమయి’ చూపుతుంది.

ఒక వైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూలి పోతూ, ప్రజాస్వామిక మానవ సమాజ యూనిట్ ఏర్పడని సంది దిశలో వచ్చే విలువల పతనాన్ని ‘అబిమానాలు’ పట్టుకుంటుంది. కొత్త, పాత విలువల మధ్య ఘర్షణ వల్ల, సమన్వయం కుదరక పోవడం వల్ల కుటుంబ వాతావరణంలో అనవసర వైరుధ్యాలే ఎంత ప్రధానంగా కనబడి, ఎంత వేదనకు కారణమవుతాయో ‘అభిమానాలు’ వివరిస్తుంది.

2013-06-16-158

‘అభిమానాలు’ నుండి ఇంకా ముందుకు వెళ్ళి కారా ‘అశిక్ష – ఆవిద్య’, ‘తీర్పు’, ‘ఇల్లు’ రాశారు. ఇవి మూడూ నిజానికి కాల వ్యవధిలో దూరపు కధలైనా ఒకే వరసలో ఉన్న కధలు.

ఉమ్మడి కుటుంబంలో సమస్యా పరిష్కారాలు జటిలంగా ఉండక తప్పదని వివరించాక, ‘అశిక్ష – ఆవిద్య’ కధ, కారా పరిశీలనా శక్తి అనివార్యమైన ములుపుకు చేరిందని చెబుతూ ముగుస్తుంది.

“లోకగతిలో ఇట్లాంటి సంఘటనలనీ ఒక పెద్ద లెక్కలోకి వచ్చే విషయాలు కాక పోయినా వ్యక్తులను వ్యష్టిగా తీసుకొని చూస్తే కొందరి జీవితాలకు ఎంతో అస్తవ్యస్థములుగా మార్చగలిగే ఇంతటి పెద్ద సంఘటనలు కొన్ని కొన్ని కుటుంబాలలో అప్పుడప్పుడూ జరుగుతుండటానికి అసలు మూల కారణాలు – వాటి కుదుళ్ళు – ఏమిటి? ఎక్కడ ఉన్నవి?

“ఈ రెండే అతడు ఎన్నడూ పరిశీలించని విషయాలు – లేక పరిశీలించాలనే స్ఫురణకు గురికాని విషయాలు!” అంటూ ‘అశిక్ష – ఆవిద్య’ ముగుస్తుంది. మనుషుల మధ్య సంబంధాలలో తీవ్రమైన మార్పులు కలిగిస్తున్న మూల కారణాలను- వాటి కుదుళ్ళను – కనిపెట్టాలనే స్ఫురణే లేకుండా చేసింది కుటుంబ వ్యవస్థ. ఆ మత్తు నుంచి తేరుకుని ఆ పరిశీలనకు పూనుకుంటే అద్భుతాలు జరుగుతాయి, సమాజ సారాంశం అవగాహనలోకి వస్తుంది. ఈ కధ తర్వాత తొమ్మిది సంవత్సరాలు పాటు కారా కధలు రాయటం మానేశారు. ఈ రెండు ప్రశ్నలకు ఆయన జవాబులు కనిపెట్టారని తర్వాతి కధలు రుజువు చేస్తాయి. ఐతే ఆయన అంతకుముందు కూడ నిశితమైన, సమగ్రమైన పరిశీలనతో కధలు రాశారు గనుక ధార తెగిపోలేదు. మరీ ముఖ్యంగా సరాసరిగా మూలాలలోకి వెళ్ళేముందు కుటుంబ సంబంధాలలోని మరో రెండు అంశాల్ని ఆయన వివరించవలసి ఉంది. అట్లా వచ్చినవే ‘తీర్పు’, ‘ఇల్లు’.

తీర్పు కధలో సుంద రామయ్య పిల్లల మధ్య వచ్చిన సమస్యను తనకు తోచిన రీతిలో ప్రజాస్వామికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కాని తీర్పు సాధ్యం కాదు. ఎందువల్లనంటే ప్రజాస్వామిక తీర్పు ఒకానొక వ్యక్తిగత, మానసిక చర్య కాదు. అది ఒక ప్రత్యేక సామాజిక, చారిత్రిక నేపధ్యంలో తప్ప కుదరదు. ఇంట్లో అసమానతల చట్రాన్ని యధాతధంగా ఉంచాక ప్రజాస్వామిక తీర్పు సాధ్యం కాదు. అందుకే చాల రకాల తీర్పులు ఏకకాలంలో న్యాయంగానూ, అన్యాయంగానూ కూడా కనబడతాయి. అంతే అంతరాల వ్యవస్థ ఉన్నంత కాలం న్యాయాన్యాయాల నిర్వచనాలు వేరువేరుగానే ఉంటాయి. ప్రజాస్వామిక తీర్పు ఎప్పుడు సాధ్యమవుతుందో గుర్తించకపోతే, ఎంత చిత్త శుద్ధితో చేసినా ఆ తీర్పు నిష్పలమే అవుతుంది.

మధ్య తరగతి కుటుంబాల గురించి, ఆ కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సంబంధాల గురించి పరిశీలనలో గుర్తించవలసిన అంశం భరోసా కోసం వెతుకులాట. కూలి పోతున్న కుటుంబ వ్యవస్థలో ఈ భరోసా కోసం వెతుకులాట ప్రస్ఫుటమవుతుంది. “నేను ఎప్పుడేది చేసినా వాడి మేలుకోరి ఏదీ చేయలేదు. వాడికి చెప్పే నీతులు వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాక నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెప్పేను. వాడికి చెప్పించిన చదువంతా నా కోసమే చెప్పించుకున్నాను …..” అని పావనరామయ్య బహిరంగంగా చెప్పిన విషయం, అనేక తరాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదే. ఐతే ఇప్పుడు, కుటుంబం కూలిపోతున్న దశలో భరోసా నిలిచేది పిల్లలా ఆస్తియా,(ఇల్లా) అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్ననే ‘ఇల్లు’ ప్రతిబింబించింది.

మానవ సంబంధాలు ఇన్ని వేల ఏళ్ళ తర్వాత కొని ఉదాత్తభావనల్ని ఏర్పరచుకున్నాయి. సమాజం వాటిని సాధించవలసిన ఆదర్శాలుగా, ఆహ్లాదకరమైన అంశాలుగా గుర్తిస్తోంది. న్యాయం, మానవతాస్పర్శ, ప్రేమ, స్నేహం, ఆనందం, శాంతి వంటి విలువలు ఇవి. అట్లాగే సమాజం ఈ విలులను నిలబెట్టే క్రమంలో హింసను అధికారాన్ని, భయాన్ని, కుట్రను, శతృత్వాన్ని తోసివేయదలచుకున్నది.

ఇవన్నీ మానవసంబంధాల వ్యక్తీకరణలే. ఇవి వర్గ సమాజంలో ఏ అర్ధాల్ని సంతరించుకుంటాయో, ఎవరెవరు వీటికి ఏ ఏ నిర్వచనాలు ఇచ్చి తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారో ‘వీరుడు – మహా వీరుడు’ నుంచి ‘కుట్ర’ వరకు కధలు వివరిస్తాయి.

ఈ కధలలో ప్రధానంగా చర్చించవసినవి ‘హింస’, ‘నో రూమ్’, ‘స్నేహం’ . మిగిలిన కధలన్నిటినీ కూడా అర్ధం చేసుకోవడానికి తగిన విశ్లేషణా సాధనాలను ఈ కధల నుంచి కనిపెట్టవచ్చును. అందుకే ఇక్కడ వీటిని మాత్రమే చర్చించడం జరుగుతున్నది. ఈ మూడు కధలకు కూడ శీర్షికలే వివరమైన ఆలోచనలను ప్రేరేపించగలవి.

‘హింస’ కధలో ముఖ్యమైన పాత్రలు రెండు – దారుణమైన జీవితానుభవాలు పొందిన పైడమ్మ, ఆ దారుణాలన్నీ ఒకే ఒక్క రోజు స్ఫురణకు వచ్చిన సంగి, పైడమ్మ చెల్లెలు. పైడమ్మ పెళ్ళయి కష్టాల కాపురానికి వెళ్ళింది. అత్తవారింట్లో కూలికి వెళ్ళి అక్కడ ఆ భ్రమలకో, ఏ బలవంతాలాకో లొంగిపోయింది. ఆమె “రంకు” ఒక్కటే బయట పడి చావు దెబ్బలు తింది. అక్కడ్నించి పారిపోయి ఒంటరి స్త్రీ అనుభవించే బాధలనీ అనుభవించి చివరికి విశాఖపట్నంలో సబ్బారపు సంజీవమ్మ కంపెనీకి చేరింది. ఒక్క రోజు కోసం తల్లిని చూడడానికొచ్చి అవహేళనలను ఎదుర్కొంది. తల్లి దగ్గర ఆశ్రయం దొరకదని తెలుసుకుంది. ఈ అవహేళనలూ, అవమాణాలూ మరింత సూటిగా సంగి చెవిన పడ్డాయి. కుటుంబాన్ని ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆనందమూ, ఆప్యాయతా లేకుండానే పైడమ్మ వెళ్ళి పోయింది. ఆ దుఃఖంలో చిట్టడివికి వెళ్ళిన సంగి నక్కలు పొట్టన పెట్టుకున్న మేకపిల్లను చూసింది. ఆ అమ్మాయికి నక్కల పని చెప్పాలన్నంత ఆవేశం రగిలింది.

ఇవాళ సమాజంలో భౌతిక హింసను మాత్రమే హింసగా గుర్తిస్తున్నాం. రక్తం కారడమే, గాయంకావడమే, నక్కలు మేకను చంపివేయడమే హింసగా గుర్తిస్తున్నాం. నిజానికి సంగి అనుభవించిన వేళాకోళంలోనే హింస ఉంది. జగ్గమ్మ, పైడమ్మ, సంగిల ఆశలు, వాళ్ళ మధ్య ఆప్యాయతలు బలవంతాన తుంచివేయడంలో హింస ఉంది. ప్రేమ చంపుకోవలసి రావడంలో హింస ఉంది. ఒక తల్లికీ తన బిడ్డను తన ఒడిలోకి తీసుకునే వీలు లేక పోవడంలో హింస ఉంది. కన్నీళ్ళలో హింస ఉంది. గుండె గాయంలో హింస ఉంది. పేదరికంలో హింస ఉంది. అసలు వర్గ సమాజం కొనసాగుతుండడమే ఒక హింస. వర్గ సమాజంలో ఒక అంతర్గత హింస. భౌతిక హింసను మించిన స్థాయిలో , విస్తృతిలో వేరు వేరు రూపాలలో జరుగుతూ ఉంటుంది. ఐతే వర్గ సమాజం ఉద్దేశ్యపూర్వకంగానే ఆ అన్ని హింసరూపాలకూ అందమైన, మోసగించే పేర్లు పెడుతుంది. ఆ పేర్లతో అవి ఎదురయినపుడు మన, వాటిని హింసగానూ గుర్తించలేం. వాటిని రద్దు చేయడానికి అవసరమైన ప్రతిస్పందననూ పొందలేం.

ఈ అంతర్గత హింసను ‘హింస’ కధ ప్రతిభావంతంగా చిత్రిస్తుంది. జీవితక్రమం మొత్తంలోనూ హింస వ్యాపించి ఉన్నదని ఈ కధ మన దృష్టికి తెస్తుంది. విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్న హింసకు మనుషులు మామూలు ప్రతిస్పందనలు ఎట్లా ఉంటున్నాయో కూడా కధ వివరిస్తుంది. దాసు, అతని బృందం చేసిన హింస సంగికి హింసగా కనబడలేదు. గనుక వాళ్ళతో ఆ అమ్మాయి మర్యాదగానే వ్యవహరించింది. “కంసాలోడిననడవెందుకూ…. మన బంగారం మంచిదైతే ఆడేం సెయ్యగలడూ…. “ అంటాడు చిన్నాయన తప్పు హింసకు గురయిన వాళ్ళదేనన్నట్లు. “యెనకా గోయ్యే, ముందూ గోయ్యే…. ఇది పరిక్కంప మీద పట్టుకోక అప్పా! తీసినా దక్కదు తియ్యకున్నా దక్కదు” అని నిస్సహాయతను ప్రకటిస్తుంది పెద్దమ్మ. అంతర్గత హింసకు మనం స్పందించే పద్దతులలో ఇవి కొన్ని. ఈ హింస వాళ్ళకు అర్ధం కాలేదు. ఎక్కడో ఒక చోట అది హింస అని అర్ధమయినా దాన్ని కూల్చే మార్ధమేమిటో తెలియదు. ఈ సంగతులేమీ స్పష్టంగా అర్ధాంకాని సంగికి మాత్రం తల్లి ఆశను కోసేసుకోవడానికి చాలా బాధపడుతోందని తెలిసింది. ఇట్లా నిరాయుధ హింస గురించి ఏ కొంచెమో అర్ధమైన సంగి చెలకలో దౌర్జన్యాన్ని, భౌతిక హింసనూ చూసింది. అక్కడ ఆమె వెంటనే నక్కల మీదికి కొడవలెత్తింది. సంగి ఆలోచనల్లోనూ, ఆచరణలోను ఇది గుణాత్మక మార్పు. కానీ చాలా మంది కధకులలోలాగా ఇక్కడ దానికి నాటకీయత లేదు. అది చాలా సహజంగా, అనివార్యంగా సంభవించింది.

ఈ గుణాత్మక మార్పే సమాజమంతా వచ్చే క్రమం మొదలయితే సమాజంలో మానవతా స్పర్శ, ప్రేమ, స్నేహం, స్వచ్చమైన ఆనందం నెలకొనే కృషి ప్రారంభమవుతుంది. అప్పటిదాకా వాటికి ఈ సమాజంలో “ నో రూమ్’.

దుర్మార్గం, అనుమానం, దారిద్ర్యం, నిండిన ఈ సమాజంలో మానవతా స్పర్శకు, ప్రేమకు, స్నేహానికి, స్వచ్చమైన ఆనందానికి స్థానం లేదని లాడ్జి గుమస్తా నుంచి, గాంధీ, నెహ్రూలను దేవుళ్ళుగా కొలిచే నూకరాజు వరకు ప్రతిఒక్కరూ మనకు తమ చేతలతో చూపుతారు. అంతంత మాత్రం శుభ్రమైన లాడ్జింగ్ లోనైనా అమ్మడుతో ఒక్క రాత్రి ఏకాంతంగా గడపాలని నూకరాజు కోరిక. నగర సంస్కృతి వాళ్ళకా అవకాశం లేదంటుంది. ఇదివరకెప్పుడో ఇటువంటి ఆనందం కోసమే తపించి నిరాశ చెందిన దేవుడు కొంతసేపయినాకా, ‘ఆ కుర్రదీ కుర్రోడూ ఏమైనారో’ అని ఆలోచిస్తాడు. తాను అప్పాయమ్మ కోరిక తీర్చలేకపోవడం గుర్తొచ్చి ఈ జంటకు సాయ పడదామనుకుంటాడు. ఎక్కడా గది దొరకక విసిగిపోయి ఉన్న నూక రాజుకి, అమ్మడికి ఎదురుపడి ఆప్యాయంగా పలకరించబోతాడు. ఆ పలకరింపునూ, ఆర్ధ్రతను అనుమానించిన నూకరాజు దేవుణ్ణి చితక తంతాడు.

దేవుడు – అప్పాయమ్మ, నూకరాజు –అమ్మడు కోరుకున్నది ఏకాంతం., ఇష్టాపూర్వకమయిన, స్వచ్చమైన ఆనందం. ఒక్క రోజాయినా మరే ఆలోచనా, మరే భయమూ, మరే ఆందోళనా లేకుండా అనుభవించగల ప్రేమ. వాటికి ఈ వ్యవస్థలో స్థానం లేదు. కోర్కె తీరకుండానే చనిపోయిన అప్పాయమ్మను తలచుకుని పేదతనమంత క్రూరమైంది లేదనుకుంటాడు. ఆ క్రౌర్యానికి గురైన జంటను ఆర్ధ్రంగా పలకరిద్దామనుకుంటాడు. స్నేహం చూపుదామనుకుంటాడు. కానీ ఈ వ్యవస్థ ఎటువంటిదంటే ఇక్కడ స్నేహానికీ స్థానం లేదు. స్నేహ హస్తాలు అనుమానించబడతాయి. ఆర్ధ్రమైన పలకరింతకూ, లాభ నష్టాల లెక్కలలోకి ఇమడని స్నేహానికీ ఇక్కడ గౌరవం లేదు. లోకంలో హింస ఎంత విస్తృతమయిందంటే, ఆప్యాయత ఎంత కరవై పోయిందంటే, గాంధీ భక్తుడైన నూకరాజు కూడా తన పట్ల ఆప్యాయత ప్రదర్శించే వాళ్ళు ఉండగలరని ఊహించలేదు. స్నేహానికి హింసతో జవాబు చెప్పకుండా ఉండలేడు.

మరి లోకంలో ఈ ఉదాత్తభావాలు కరవై పోయి ఉన్న స్థితిలో స్నేహామంతా లాభనష్టాల లెక్కలలోకి ఇమడవలసిందేనా? స్నేహామంటే ఏమిటి? అది ఇవాళ ఉన్న రూపం ఏమిటి? ఈ రూపం ఎందువల్ల వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబుల అన్వేషణలో పుట్టిన కధ ‘స్నేహం’.

కొడుకు ఉద్యోగ ప్రయత్నం కోసం, ఎన్నో ఏళ్ళ కింద తెగిపోయిన స్నేహాన్ని, మళ్ళీ గుర్తు చేసుకుంటూ గోపాలరావు దగ్గరికొస్తాడు శివరామయ్య. అప్పటికప్పుడు డబ్బు అవసరం గనుక శివరామయ్యతో స్నేహం నటిస్తాడు రాజారావు. ఉన్నత వర్గంలో కలిసిపోవాలనే తపనతో గోపాలరావుతో స్నేహం చేస్తుంటాడు రాజారావు. గోపాలారావు కూడా శివరామయ్య స్నేహాన్ని తన అవసరం తీరే మార్గంగా వాడుకుంటాడు. పైగా “ఈ లోకంలో ఒకరికొకరు ఏదో అవుతారన్నది ఒట్టి కల్ల…. మనిషి మనిషితో కలిసి తిరుగుతాడంటే … ఎందుకు కలిసి తిరుగుతాడంటే – అవసరం! ఆ అవసరాన్ని బట్టే అన్నితిరుగుళ్ళూ! ఇన్ని తిరుగుళ్ళూ… స్నేహామంటే ఇంతే. అది బాల్యస్నేహమవ్వచ్చు. పడుచు స్నేహమవ్వచ్చు – ఆ స్నేహం, ఈ స్నేహం… ఏ స్నేహమన్నా కానీ – ఏదయినా పేరు తేడాయేగాని సరుకొక్కటే ….” అని సిద్ధాంతం చెబుతాడు.

“మూడు రూపాయల కోసం మూడు పీకలు కోయగల మనుషులున్నారు ఈ లోకంలో. వాళ్ళకీ ఏవో ధీరీలు ఉండే ఉంటాయి. అలాంటప్పుడు మూడు వందల కోసం డాక్టరు ఓ ముండమోపి థియరీ తీసేడంటే వింత కాదనుకొంది మీనాక్షీదేవి.

లోకంలో స్నేహమే లేదంటే ఆమె భావనాలోకంలో బ్రతుక్కి అర్ధమే లేకుండా పోతుంది మరి!

“అవును అదీ ఓ థీరీయే” అంటూ ఈ కధ ముగుస్తుంది.

ఇక్కడ స్నేహాన్ని ఎవరెవరు ఎట్లా చూస్తున్నారు? వర్గ సమాజంలో స్నేహం ఏ ఏ రూపాలలో వ్యక్తమవుతుంది ? లోకంలో స్నేహమనేది ఉందా? ఉన్నదనుకుంటే మరి ఇవాళ అవసరం మాత్రమే పునాదిగా ఉన్నట్లు కనబడుతున్న స్నేహం సంగతేమిటి? లేదనుకుంటే మరి మనిషికీ మనిషికీ మధ్య సంబంధానికి ప్రాతిపదిక ఏమిటి? అవసరమే ప్రాతిపదిక అనేట్టయితే అవసరాలు తీరిపోయిన మనిషికి స్నేహాలు ఉండవా? మనుషుల అవసరాలు తీరిపోయే వర్గరహిత సమాజంలో స్నేహాలుండవా? – ఈ ప్రశ్నలన్నిటికీ వీలు కల్పించి, స్నేహం పట్ల భావనలు ఎంత గందరగోళంగా ఉన్నాయో ఈ కధ మన దృష్టికి తెస్తుంది.

ఈ గందరగోళాన్ని సృష్టించింది వర్గ సమాజమే. వర్గ వైరుధ్యాన్ని చైతన్యంతో గుర్తించి దాన్ని రద్దు చేసే పోరాట                       క్రమంలో ముందుకు సాగుతున్న కొద్దీ ఈ గందరగోళం తగ్గిపోతుంది. రచయిత ఉద్దేశ్యం ఈ గందరగోళాన్ని మాత్రమే ప్రదర్శించి, కొనసాగుతున్న తప్పుడు భావనలకు బలం కలిగించడం కాదు. స్నేహానికి ఇవాళ కనబడుతున్న అర్ధాల, అసందర్భాన్నీ ఆయన వివరిస్తారు. మీనాక్షీదేవికి స్నేహం అవసరం మీద మాత్రమే ఆధారపడనవసరం లేదన్న స్పృహ ఉంది. ఆమె భావనాలోకంలో స్నేహామంటే బతుక్కి అర్ధం. స్నేహాన్ని అవసరంతో సమానం చెయ్యడం ముండమోపి ధియారీగా భావించిన మీనాక్షీదేవి స్నేహాన్ని మరో కొసకు తీసుకుపోయి, వాస్తవాలతో సంబంధం లేకుండా ఊహాలోకపు ఉద్వేగంగా గుర్తిస్తుంది. దీంట్లో మొదటిది స్నేహం పట్ల మామూలు, యాంత్రిక అవగాహన కాగా, రెండోది కాల్పనిక, స్వీయమానసిక అవగాహన.

“మనిషిని మనిషిగానూ ప్రపంచంతో ఆతని సంబంధాన్ని మానవీయమైనదిగానూ భావించండి. అప్పుడు ప్రేమకు ప్రేమ ద్వారా మాత్రమే బదులు తీర్చుకోగలరు. నమ్మకానికి నమ్మకంద్వారా మాత్రమే జవాబివ్వగలరు… మనిషితోనూ, ప్రకృతి తోనూ మీకు గల ప్రతి ఒక్క సంబంధమూ మీ ఆశయ లక్ష్యానికీ, మీ వాస్తవ వ్యక్తిగజీవితానికీ సంబంధించిన విశిష్ట వ్యక్తీకరణగా ఉంటుంది.” అంటాడు మార్క్స్. (ఎకనమిక్ అండ్ ఫిలాసాఫికల్ మాన్యూ స్క్రిప్ట్స్ఆఫ్ 1844)

వర్గరహిత సమాజంలో మనుషుల మధ్య స్నేహం ఒక సహజత్వం, ఒక అనివార్యత, ఒక చారిత్రక, సామాజిక అవసరం. సంఘజీవులుగా మనుషుల్లో ఈ స్నేహాకాంక్ష ఎల్ల వేళలా ఉంటుంది. మానవుల సంఘ జీవితం ఎన్నెన్ని చీలికలకు దారి తీసిందో అన్నీ అడ్డుగోడలు ఈ స్నేహాకాంక్ష మీద పరుచుకున్నాయి. ఈ గోడలన్నీ పగులగొట్టి స్నేహ స్వరూపాన్ని గుర్తించడం, ఆచరించడం శ్రామికవర్గ దృక్పధానికి మాత్రమే సాధ్య పడుతుంది. కధా కాలంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ రాజారావు, శివరామయ్య, గోపాలరావు, మీనాక్షీ దేవి ఒకే తానులో ముక్కలు గనుకనే వాళ్ళకు స్నేహారూపం అర్ధం కావటం అసాధ్యం. అందువల్లనే వాళ్ళు స్నేహపు వికృత రూపాన్నే దర్శించగలరు. ప్రర్శింపగలరు. (స్నేహ స్వరూపాన్ని గుర్తించిన శ్రామిక వర్గ దృక్పధం గలవాళ్ళు కూడా సమగ్రంగా దాన్ని ఆచరించడం ప్రస్తుత సమాజంలో కష్ట సాధ్యం, అసాధ్యం కూడా.)

ఇక్కడి దాకా, 1969 ఏప్రిల్ లో రాసిన ‘స్నేహం’ దాకా ప్రధానంగా మానవసంబంధాలలోని అప్రజాస్వామికత గురించి రాస్తూ వచ్చిన కారా, ఆ తర్వాత రావలసిన ప్రజాస్వామికత గురించి, అంతకన్న ముఖ్యంగా ప్రజాస్వామికత సాధించే ఆలోచనల, ఆచరణల గురించి కధలు రాయటం మొదలు పెట్టారు. పైననే చెప్పినట్టు ఈ ప్రజాస్వామికతను సాధించే మార్గం శ్రామిక వర్గ దృక్పద్ధమే. ఆ దృక్పధాన్ని ఆయన 1951 నవంబర్ లో రాసిన “అప్రజ్ఞాతం” లో చిత్రించే ఉన్నారు. ఐతే తెలుగు సీమలో 1951 నవంబర్ నాటికి కధా నాయకుడు సుదర్శనానికి మాత్రమే గాక, కమ్యూనిష్టు పార్టీకే ఆ ధృక్పథపు మార్గం అప్రజ్ఞాతం కావడం మొదలయింది.

ఆ అప్రజ్ఞాతాన్ని జ్ఞాతం చేయాలనే ‘ఆర్తి’ 1969 తర్వాతనే మొదలయింది. ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, కుట్ర కధల్లో కారా సమాజంలోని అప్రజాస్వామికను చూపడంతో పాటే, ప్రజాస్వామికతను సాధించే వివిధ మార్గాల గురించి ఆలోచనను రేకెత్తించడానికి ప్రయత్నించారు.

మోచేతి కూడు తినదలుచుకోని పైడయ్య (ఆర్తి), తన ఊరిని కొత్తగా కనిపెట్టిన గురవడు (భయం), వర్గ సమాజ ఆవిర్భావం నుంచీ “తేలకుండా చిక్కుపడిపోయిన విషయాన్ని” “ఇహ కుదరదు, ఆ రోజు వెళ్ళిపోయింది, ఆ సంగతి గ్రహించాలి” అని యజమానికీ, ప్రభుత్వానికీ సీరియస్ గా హెచ్చరిక జేసిన విశ్వనాధం (శాంతి), “ అది రావాల. బూమ్మీద యీ వొనాశవంత సూసినప్పుడు నాకదే అనిపిస్తాది. పెళయం తప్ప ఈ బూమ్మీది మురికిని మరేది కడగలేదు. పోతే అన్నీ పోతాయి. మనుషులవూ పోతావు. పోయినా సరే.” అనే కన్నయ్య (చావు), కసురుకున్నా, విసుక్కున్నా, కుక్కల్నీ, పోలీసుల్నీ చూపి భయపెట్టినా కలవారినిబ్బంది పెట్టక వల్లకాదని గుర్తించి, ఇద్దరు ముగ్గురై, ముగ్గురు పదిమందిలో చేరీ రెండంతస్తుల భవనాల సింహద్వారాల వద్ద చేరి “కడ వరకూ” గేటు వదలని ఆడవాళ్ళు (జీవధార), “నువ్వాలాగా, మరీ అంతకంతల్లేని గదిలో కాపరవెట్టి, ఉన్న ఒక్క గుమ్మానికీ మంచం అడ్డేసేస్తే ఆ కాపరం సక్కబెట్ట దలచినోడికి రెండే రెండు దార్లు. నిశిరాత్రి నీ పీక పిసికీడం మొదటిది. లేదా గోడలు బద్దలు గొట్టేయాల. మూడో దారి లేదు” అన్న ‘కుట్ర’ వ్యాఖ్యాత మానవసంబంధాల దుస్థితినే వాఖ్యానిస్తున్నారు. అవి మంచి వైపు మారాలనే ఆర్తినీ, అందుకు తమకు తోచిన మార్గాలనూ ప్రకటిస్తున్నారు. కారా కధల మౌలికాంశం మానవ సంబంధాల విశ్లేషణే. వర్తమానం గురించిన ఈ విశ్లేషణ, వర్తమాన అవ్యవస్థను చిత్రించే మాట నిజమే కాని, దాని సందేశం నిరాశ కాదు. ఆ వ్యవస్థను కూల్చేయవలసిన అవసరం, భవిష్యత్తు పట్ల ఆశ. ఈ అర్ధంలో కారా నిశిత సామాజిక వ్యాఖ్యాత, సామాజిక మనస్తత్వవేత్త.

[ఈ పరిధిలోకి వచ్చినా ఇంకా విస్తృతంగా చర్చించవలసి ఉన్న మరికొన్ని కధల్ని స్థలా భావం దృష్ట్యా వదిలేయడం జరిగింది.]

ఎన్. వేణుగోపాల్

“Modata Arunatara January – March 1987 sanchikalo prachuritamaina ee vyaasam aa tarvaata N Venugopal vyaasa samputam Kathaasandarbham (2000) lo kooda achchayindi”

(  మొదట అరుణతార జనవరి -మార్చి 1987 సంచిక లో ప్రచురితమైన ఈ వ్యాసం ఆ తరువాత ఎన్. వేణుగోపాల్ వ్యాస సంపుటి కథాసందర్భం 2000) లో కూడా అచ్చయింది. )

ఎనిమిదో కధ

dasari1‘యజ్ఞం’ కధ రాసి ఏభై ఏళ్ళయింది. అచ్చు పడి నలభై ఎనిమిది. అచ్చు పడ్డప్పట్నించీ ఈ కధ మీద చర్చ జరుగుతూనే ఉంది. వందలాది పుటలు నిండాయి. ఇంకా నిండుతున్నాయి. అందులో కొన్ని పుస్తకరూపంలోనూ వచ్చాయి. వ్యాసాలే కాకుండా ‘యజ్ఞం తర్వాత ..” అంటూ కధలు వచ్చాయి. అడపాదడపా ఆయా వ్యాసాలు చదివాను. చర్చలు విన్నాను. ఆ కధ గురించి తాత్విక స్థాయిలో చేసిన విశ్లేషణాలూ కొన్ని చదివాను. కొన్నికొన్ని వ్యాసాలు ఆ కధ చెప్పని ‘గొప్ప తాత్విక విషయాలు’ కూడా ఎత్తిచూపాయి. ఆయా వ్యాసాలు కూడా చదివాను.

… యజ్ఞం గురించి రాయాలనుకొన్నపుడు ఆయా వ్యాసాలూ, ఆ పుస్తకం, ఓ సారి చదువుదామనిపించింది. కానీ నా స్పందనలు చెప్పడానికి అవి చదవడం అవరోధమవుతుందేమోననిపించింది. విరమించాను.

నిజానికి ఇది విమర్శా వ్యాసం కాదు. విశ్లేషణ కూడా గాదు. గత నలభై ఏళ్ళుగా ఎన్నెన్నో సార్లు ఆ కధను చదివి ఇష్టపడిన నేపధ్యంలో దానిని అందరికీ – ముఖ్యంగా ఈ తరం పాఠకులూ రచయితలకు – నా దృక్కోణంలోంచి పరిచయం చెయ్యాలనిపించింది. అప్పటి వారికి మరోసారి కధను గుర్తు చేస్తే బాగుంటుందనిపించింది.

……

శ్రీకాకుళానికి చేరువలో, సముద్రానికి దగ్గరలో ఉన్న ఊరు ‘సుందర’ పాలెం. తాటి తోపులు, కొబ్బరి చెట్లు, పచ్చని చేలు, నిండు చెరువులు – సుందరమైన ఊరే అది. హైస్కూలు, కరెంటాఫీసు, పోస్టాఫీసు, ఆసుపత్రి, పక్కారోడ్డు, ప్రపంచజ్ఞానం ఉన్న ఊరి వాళ్ళూ- వీటన్నిటితో ‘ఆ కోస్తా ప్రాంతంలో పలువురు అనాధల మధ్య సనాధలా వెలుగుతున్న’నాలుగు వందల ఇళ్ళున్న గ్రామమది. కధా కాలం 1963 నాటికి అన్ని ఇతర గ్రామాలూ అనాధలుగా ఉండి పోతే ఈ ఒక్కటీ సనాధగా ఎలా రూపొందిందీ? దేవుడేవన్నా దిగి వచ్చి మంత్రం వేశాడా?

దేవుడక్కర్లేదు. ఒఖ్ఖ మనిషి చాలు. ఆ మనిషి శ్రీరాములు నాయుడు. కొట్టొచ్చే రూపు, చెరుగని చిరునవ్వు, పట్నం చదువు, సమాజ సేవ కోసం మధ్యలో వదిలి పెట్టటం … ఎం.పీ, ఎమ్మెల్యే అవగలిగి ఉండీ గ్రామ శ్రేయస్సు కోసం ఆ పదవుల కోసం వెంటాడనితనం. అటు శ్రీరామ చెంద్రుని ‘న్యాయ నిరతి’నీ, ఇటు గాంధీ మహాత్ముని ‘నాయకత్వ శైలి’ నీ పుణికి పుచ్చుకున్న మనిషి శ్రీరాములు నాయుడు.

..దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలోనే ఊళ్ళోకి అడుగు పెట్టాడు నాయుడు. నిస్తేజంగా అనైక్యంగా ఉన్న ఊళ్ళో కదలిక తెచ్చాడు. ముందు అవమానాలకూ హేళనకు గురయ్యాడు. మెల్లిగా అందరి విశ్వాసం పొంద గలిగాడు. ముందుగా హైస్కూల్, ఆ తర్వాత చకచకా అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలు – పదిహేను సంవత్సరాలలో ఊరు సనాధగా ఎదిగింది. ప్రభుత్వ వర్గాల ముద్దు బిడ్డ అయింది. ఊరి తగవులు గుడి మంటపం దాటి వెళ్ళారాదన్న కట్టుబాటుకు ఏకతాటిన ఊరిని నిలిపిన ‘న్యాయకోవిదుడు’ శ్రీరాములు నాయుడు.

…..

ఇంతకూ ఈ యజ్ఞం కధ ఏమిటీ?

మామూలే. ఓ చిన్న అప్పుల తగవు. తీసుకోడం, తీర్చలేక పోవడం, తగాదా, అది ఏళ్ళ తరబడి నలగడం, పంచాయితీ, ఆ తగవు తీర్చే పని శ్రీరాములు నాయుడి మీద పడటం…

అప్పు పడ్డ అప్పల్రావుడు ఊరి మాలల్లో పెద్ద. బంధు బలగం ఉన్నవాడు. పంచాయితీ హరిజన మెంబరు. “మాటకు నిలబడే మనిషి” అన్న ఖ్యాతి ఉన్న వాడు. అప్పు ఇచ్చిన గోపన్న ఓ చితికిపోయిన షావుకారు. సాత్వికుడు. చిన్నకారు వ్యాపారిగా మొదలెట్టి, పంటల వ్యాపారిగా ఎదిగి, వ్యాపారంలో నష్టాలు సొంతవాళ్ళ దగా వల్ల చితికిన మనిషి.

బాకీ మొత్తం రెండు వేలు – వడ్డితో రెండువేల అయిదు వందలు. అసలు మూడేళ్ళ క్రితమే పంచాయితీకి ఎక్కవలసిన కేసు. శ్రీరాములునాయుడు మధ్యస్థంతో సరి పెట్టాడు. తనకున్న పొలమంతా అమ్మితేగానీ బాకీ తీరదు గాబట్టి మరో మూడేళ్ళు గడువు అడిగాడు అప్పల్రావుడు. ఇతర పెద్దల్నీ, గోపన్ననూ ఒప్పించి ఆ గడువు ఇప్పించాడు శ్రీరాములు నాయుడు. అది రేపటితో ముగుస్తుంది.

అంతిమ నిర్ణయం వెలువరించవలసిన సమయం వచ్చేసింది.

*****

గుడి మంటపంలో పంచాయితీ. ఊరు ఊరంతా పోగు పడింది.

“నేను చితికి పోయాను. మీరు ఎంత ఇప్పిస్తే అదే మహా ప్రసాదమనుకొంటాను”. అంటాడు గోపన్న . అప్పల్రావుడు ఉలకడు. పలకడు.. అందరి సహనాలు అడుగంటే వేళ నోరు విప్పుతాడు. “మాకున్నమడిసెక్క అమ్మించేసయినా అప్పు తీరుమానం సేయాలని సబవోరికి ఉన్నట్టుంది. అదే నాయవయితే సెప్పండి. నెత్తి నెట్టుకొంటాను.” అంటాడు. “అయితే ఇది అప్పుగాదంటావా? తీర్చమనడం న్యాయంగాదంటావా” అని పెద్దలు రెట్టిస్తే – “అవునో గాదో మీరే ఆలోసించి సెప్పాల” అంటాడు!!

శ్రీరాములు నాయుడు కాసేపు ఆలోచించి “పెద్ద మనసుతో “ “రావుడూ, తగవు తీరుస్తున్నాను. ఈ నాటి నుండి నువ్వు గోపన్నగారికి నయాపైసా బాకీ లేవు. గోపన్నగారూ – ఎల్లుండి రండి. చెల్లు బెడతాను” అంటాడు.

ఇంకేం … తగవు తీరినట్టేగదా… శ్రీరామచంద్రుడంత ఉదాత్తంగానూ, గాంధీ మహాత్ముడంత న్యాయంగానూ నాయుడుగారు తీర్పు చెప్పారు గదా. కధ సుఖాంతమే గదా.

.. మరి విషయం ఇంకా ముందుకు నడిచి ఒక హింసతోనూ హత్య తోనూ, ఒక కట్టుబాటు చెల్లా చెదరవడంతోనూ, ఒక వ్యవస్థ బీటలు వారడంతోనూ ఎందుకు ముగిసినట్టూ!!

……

అసలు కధ అప్పుడే మొదలయింది గాబట్టి.

కధను శ్రీరాములు నాయుడు భుజాల మీంచి దించి అప్పల్రావుడు నడిపించాడు గాబట్టి. చివరికి అది అప్పల్రావుడి కొడుకు చేతుల్లో కత్తిగా మారి ‘ఒక తల – ఒక చిన్న దేహం’ గా మిగిలింది గాబట్టి.

శ్రీరాములు నాయుడు తీర్పు వెనుక అలకా ఆగ్రహం ఉన్నాయని ఎత్తి చూపి అందుకు కారణం చెప్పమని నిలదీస్తాడు అప్పల్రావుడు. అంతే గాకుండా నువ్వు కవుకు దెబ్బలు కొడుతున్నావంటాడు. చాప కింద నీరులా ముంచే మనిషివంటాడు. నా వేలితో నా కన్నే పొడుస్తున్నావంటాడు. “నువ్వు చెప్పిన తీరుపు నాయవయినదేనా? అసలు నాది అప్పేనా?” అని నిలదీస్తాడు.

అప్పటిదాకా శ్రీరాములు నాయుడిని అంత మాటలు అన్నవారు లేరు!

అరుదైన ఉద్రేకానికి గురి అయిన శ్రీరాములు నాయుడు “ఇది అప్పే! అప్పే!!అప్పే!!” అని ముమ్మారు ప్రకటిస్తాడు. “అసలు ఇది అప్పుగాదని ఎవరైనా ఎలా అంటారో నాకు బోధ పడటం లేదు” అంటాడు.

అప్పల్రావుడి మడి సెక్క అమ్మి అప్పు తీర్చడానికి రంగం సిద్ధమవుతుంది.

“శ్రీరావులు బాబూ నిజం నీకూ తెలిసుండదు. ఇది నాయవైన అప్పుగాదని ఎందుకన్నానో ఆ కధంతా తవరికి సెప్పి అమ్మకం కాయితాల మీద ఏలి ముద్ర పెడతాను” అంటాడు అప్పల్రావుడు.

ఏభై ఏళ్ళ నాడు తను ఆరు ఎకరాలకూ సిన్న కొంపకూ వారసుడవడం, ఊళ్ళో అందరికీ అంతో ఇంతో సెక్క ముక్కా, సరిపడా తిండి గింజలూ కట్టుకోడానికి గోచి ముక్కా ఉండటం, వాళ్ళ పిచ్చి కుంచాల వర్తక ధర్మాలకు మోసపోయినా రైతులు షావుకార్లకు మదుపు పెట్టే స్థితిలో ఉండటం…

మెల్లిగా పొగాకూ వేరుశెనగలాంటి వ్యాపారప్పంటలు రావటం, మగ్గాలు మూత పెట్టిన సాలెవాళ్ళు పంటల వ్యాపారంలో దిగి షావుకార్లవడం, వాళ్ళు కింద నుంచి పైకి లేవగా రైతులు కిందకి దిగజారడం..

వ్యాపారప్పంటల్లో కలిసి వేలు పెట్టిన తానూ గోపన్న అయిదేళ్ళ పాటు కలసికట్టుగా పైకి లేవడం.. తర్వాత గోపన్న పైకీ తాను కిందకీ చేరడం, తొమ్మిది ఎకరాలయిన తన ఆరెకరాల పొలం చివరికి రెండుంచిల్లరకు తగ్గి పోవడం, మాలలూ గొల్లలేగాకుండా కొందరు కొందరు కాపులూ ఈ సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరవడం …

.. అప్పులమాయ తెలిసీ రైతులు చేజేతులా అందులో చిక్కుకోవడం, చివరికి అప్పునిచ్చిన షావుకార్లూ మునిగిపోవడం, ఊళ్ళో వర్తకుల్ని బయట వర్తకులూ, వాళ్ళను ఇంకా పెద్ద వర్తకులూ ముంచేయడం, ఇదంతా “నరుడు తెచ్చిన ముప్పా; నారాయుడు బెడుతున్న సిక్కా” అన్న మీమాంస.

ఇవన్నీ చెప్పాక పదిహేనేళ్ళనాడు శ్రీరాములు నాయుడు ఊళ్ళోకి అడుగు పెట్టినపుడు తామంతా సంబరపడటం, హైస్కూలూ రోడ్డూ లాంటివి పేదోళ్ళకు కొంత కాలం పనులు కల్పించినా కొత్త పనులు లేక చతికిల పడటం, రోడ్డు వల్ల బళ్ళ వాళ్ళూ , కరెంటు వల్ల ఏతాల వాళ్ళు , మిల్లుల వల్ల దంపుడు వాళ్ళూ జీవనోపాధి కోల్పోవడం, ఊరు బాగుకోసం విరాళాలూ, భూవులూ ఇచ్చిన కామందులు బాగు పడగా – శ్రమ దానం చేసిన బీదా బిక్కి మరింత చిక్కి పోవడం చెబుతాడు. శ్రీరాములు నాయుడు పుణ్యమా అని ఒకప్పుడు దివాల తీసిన షావుకార్ల బిడ్డలంతా ఇపుడు ఎలా పుంజుకొంటున్నారో చెబుతాడు. శ్రీరాములు నాయుడు మొదలెట్టిన యజ్ఞం అందర్నీ ఎలా పాపంలోకి దింపిందో చెబుతాడు. గతరాత్రి తన కొడుకు సీతారావుడు “బూవి అమ్మితే నిన్ను నరికి నన్ను నేను నరుక్కు సస్తాను” అనడం గురించి చెబుతాడు. ఇంటెల్లపాది రెయ్యింబవళ్ళు కష్టపడినా తమకు గంజి మెతుకులు దొరక్క పోగా రుణాల ఊబిలో దిగబడటమూ – అటు ఏవీ లేనోళ్ళు ఏడాది తిరిగే లోగా కావందులవడమూ చెప్పి “ఎవరి సొమ్ము ఎవరు పడేసుకోడం వల్ల గొప్పోళ్లయిపోతున్నారో, ఎవరికెందువల్ల కూడు బుట్టకుండా పోతుందో ఆ ఇవరం మీరే చెప్పండి” అని అడుగుతాడు.

..అడిగి, శ్రీరాములుకేసి చూసి, క్షణ కాలం ఆశపడతాడు. తనది అడియాస అని తేలగా వేలిముద్ర వేస్తాడు. సీతారావుడు పరుగు పరుగున పేటకేసి వెళతాడు. అక్కడేదో జరగబోతుందని శ్రీరాములు నాయుడు గ్రహిస్తాడు. చిరునవ్వు స్థానంలో చీకట్లు కమ్ము కొంటాయి. గజగజ గజగజ వణుకు. ఆ ధీరోదాత్తుడిలో ఈ మార్పుచూసి జనంలో భయం…

.. తిరిగొచ్చిన సీతారావుడి భుజాన ఉన్న గోనె సంచిలో ఓ తల – చిన్న దేహం.. సీతారావుడి కొడుకుది. నోరు విప్పిన సీతారావుడు జనం మెప్పు కోరే అప్పల్రావుడ్నీ, తనను ఏలే దొరలు మునసబు కరణాలని గ్రహించలేని ‘ఎర్రిపీరు’ శ్రీరాములునాయుడినీ ఎండగట్టి – మునసబుకో సవాలు విసురుతాడు: మంటపం తెరిచిన రోజున ఊళ్ళో తగాదా ఊర్లోనే తీరుమానం గావాలని నువ్వు అన్నావట … ఇపుడు చెప్పు అచ్చురిపోర్టు కోస్తావా, నా కూనీ మాఫ్ చేస్తావా…

ఈ ప్రశ్నకూ ఇలాంటి లక్షలాది ప్రశ్నలకూ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వ్యవస్థ సమాధానం చెప్పదు. చెప్పలేదు.

“ధర్మ పన్నాలెంతవరకూ? … అంతా నువ్ చెప్పినట్టు వినే వరకూ …. “ అన్నవ్యాఖ్యతో “యజ్ఞం” ముగుస్తుంది.

…..

సూటిగా సాగిన కధ. ఏ మాత్రమూ క్లిష్టత లేని భాష. ‘మన ఊర్లోనే జరిగినట్లు ఉందే’ అనిపించే సహజమైన కధా మండప వేదిక . రక్తమాంసాలున్న పాత్రలు.

.. వస్తువు? భగవంతుడికి కూడా ఒక పట్టాన అర్ధం కానంత అతి క్లిష్టమయినది!!

చదివేవాళ్ళను ఉద్దేశ్య పూర్వకంగా ‘తప్పుదారి’ పట్టించి, రామరాజ్యపు సౌరభాలను చవి చూపించి, మాహాత్ముడు కలలుగన్న మరో ప్రపంచపు పొలిమేరలకు చేర్చి, ఓ తాడూ బొంగరం లేని ఊరు ఒకే ఒక్క వ్యక్తి పూనికలో ఆదర్శ గ్రామంగా ఎలా ఎదగగలదో చూపించి .. నిరూపించి…

..ఊహల ఉయ్యాలల్లో ఒళ్ళు మరచిపోతున్న పాఠకులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి, వారి గుండెల మీద వేల సమ్మెట పోట్లు పెట్టి, రెండు తరాలు గడిచి పోయినా ఆ పోట్లు ఇంకా సలుపుతూ ఉండేలా చెయ్యడం ఎవరికన్నసాధ్యమా?

సాధ్యమేనని చెపుతుంది “యజ్ఞం”.

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి, పరిణామాల్ని పరిశీలించి, విపరీత లక్షణాలను గ్రహించి; ఆ గ్రహింపు ఏదో చైతన్యాన్ని మేలుకొలిపినపుడు, ఒక సంవేదనకు మూలమయిన ఒక ఆవేదనకు ప్రేరణ అయినపుడు, తన పరిశీలనకు సామాజిక ఆర్ధిక అవగాహన జోడించినపుడు, సమస్యల మూలాలను రాగద్వేష రహితంగా శోధించినపుడు, ఆయా పరిశీలనలనూ శోధనలనూ వాస్తవానికి దగ్గరగా నిజ జీవిత సంఘటనల సాయంతో అక్షర రూపంలో అరుదైన సృజనతో చిత్రించినపుడు ‘యజ్ఞం’ లాంటి కధలు పుడతాయి. సమాజపు చేతన మీద సమ్మెట పోట్లవుతాయి.

ఈ అప్రయత్న ప్రయత్నం ఆరు సారా కధల్లో కనిపిస్తుంది. ‘స్మైల్’ రాసిన ఖాళీ సీసాల్లో కనిపిస్తుంది. మరో రకంగా పద్మరాజుగారి ‘గాలివాన’, బుచ్చిబాబు ‘నన్ను గురించి కధ రాయావూ’ ల్లో కనిపిస్తుంది. కానీ ‘యజ్ఞం’కు ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

“ఒకప్పుడు తెలుగు కధ వ్యక్తుల అంతరంగ జీవనాన్ని కేంద్రంగా చేసుకొని సాగింది. ఇపుడు వ్యవస్థాగత జీవన చిత్రణ ముఖ్య పాత్ర వహిస్తోంది. వ్యక్తి – సమాజం – వ్యవస్థల మధ్య ఉన్న పరస్పర సంబంధాల చిత్రణ జరుగుతోంది. బహుశ యజ్ఞం కధ అందుకు నాంది పలికిందనుకొంటాను. అందుకే ఆ కధకు ఒక ఉనికి వచ్చింది. దోపిడీ నిజరూపాన్ని బలంగా సాహిత్యపు ఎజండాలోకి తీసుకు వచ్చిన కధ యజ్ఞం” అన్నారు కాళీపట్నం 1997 నాటి ఒక ఇంటర్వ్యూలో. నిజానికి తెలుగు కధా చరిత్రను యజ్ఞంకు ముందు, యజ్ఞం తరవాత అని వర్గీకరించుకోవచ్చు.

…..

ఏభై ఏళ్ళు దాటినా ఒక రచన ఇంకా ఎంతో రెలవెంట్ గా ఉందంటే అది సంతోషించ దగిన విషయమా – ఆందోళన పడవలసిన విషయమా?

కొడవటిగంటి గారితో నేను పరిపూర్ణంగా అంగీకరిస్తాను. అది ఆందోళనదాయకం.

కానీ ఏభై ఏమిటి వందల సంవత్సరాలు గడిచినా వేమనలు ఇంకా మనకు దిశానిర్దేశకులే! అంచేత ఆందోళన కాస్తంత పక్కన పెట్టి యజ్ఞం ఎత్తి చూపిన అనేకానేక విషయాలను పరిశీలించి, అధ్యయనం చేసి, చర్చించి మనం కాస్త ముందుకు వెళ్ళవలసిన అవసరమూ అవకాశమూ లేవూ?

పుష్కలంగా ఉన్నాయి.

ఏది అభివృద్ధి? ఏది సమాజ సౌభాగ్యం? ఏది సమర్ధ నాయకత్వం? ఏది గుడిబండలాంటి మన గతం? ఏది బహుజన హితం? ఏది న్యాయసమ్మతమైనా నైతికంగా దివాళాకోరుతనం? ఏయే ప్రమాదాలను మనం దాటుకొని వచ్చాం? ఏయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ఎవరు తమకే తెలియని మేకవన్నెపులులు? ఎవరు తమకే తెలియని అమాయక బలిపశువులు ….

ఇలాంటి ప్రశ్నలు – మనం సుందరపాలెంలో ఉన్నా, రాబోయే రాజధానిలో ఉన్నా – గ్రహించగల అడగగల శక్తి మనకు కావాలి. ఈ విషయంలో ఇప్పటికీ దిశానిర్దేశం చెయ్యగల దార్శనికత ఉన్న రచన యజ్ఞం. విరుచుకు పడబోతున్న ప్రపంచీకరణ గురించి 1964లోనే ‘యజ్ఞం’ ప్రమాద ఘంటికలు మోగించినా ఇంకా మనం ఆ విషయంలో ఏనుగును వర్ణించే నలుగురు అంధుల్లా లేమూ?! రావి శాస్త్రి నుంచి, కాళీ పట్నం నుంచీ మనం గ్రహించి చర్చించవలసిన విషయాలు ఎన్నో లేవూ?

……

ఈ సంధర్భంగా ‘యజ్ఞం’ కధ గురించి ఒకటి రెండు విషయాలు చెప్పుకోవాలి. కధలో వ్యవస్థ చేసే పన్నాగాలనూ, దుర్మార్గాలనూ అప్పల్రావుడితో ఎంతో స్పష్టంగా సూటిగా చెప్పిస్తారు రచయిత. ఆ తర్వాత సీతారావుడితో ఆ వ్యవస్థను తిరుగులేని విధంగా సవాలు చేయిస్తారు.

కొమ్ములుదిరిగిన ఆర్ధికవేత్తలకూ, సామాజిక సంవేదన ఉన్నఅభ్యుదయాన్ని మనసారా కాంక్షించే మేధావులకూ అంతుచిక్కని వ్యవస్థాగత పద్మవ్యూహ దుర్మార్గాలు కధలో అప్పల్రావుడూ, సీతారావుడూ అరటిపండు వలచి చేతిలో పెట్టినంత సులభంగా, సమర్ధంగా ఎలా విప్పి చెప్పగలిగారు?! నిజమే ఒక జీవితకాలం ఆలోచనాశీలతతో గడిపిన కొంతమందిలో సహజ పరిజ్ఞానం – నేటివ్ విజ్డమ్ – పుష్కలంగా ఉండే మాట నిజమే. కానీ ఆ పరిజ్ఞానం సునిశిత పరిశీలన వరకూ పనికొస్తుందే గానీ సూక్ష్మ అవగాహనకూ విషయ నిర్ధారణా సీమకూ చేరుకోలేదు. మరి అంత క్లిష్టమయిన వ్యవస్థాగత విషయాలు రాత్రికి రాత్రి అప్పల్రావుడు ఎలా గ్రహించగలిగాడూ?! (నా మట్టుకు నాకు నిజం నిన్న రేత్తిరి దాకా తెలియలేదు…) అతని ఆ అవగాహనకు దోహదం చేసిన సీతారావుడికి, చుట్టం ఎర్రయ్యకూ మాత్రం అంత విచక్షణ ఎలా సమకూరిందీ? ఈ వ్యాసం కోసం కధను పదే పదే చదివినపుడు ఈ సందేహం నాకు పదేపదే కలిగింది. మళ్ళీ నిదానంగా ఆలోచిస్తే ఈ కధాపరిధిలో, ఈ కధా నేపధ్యంలో విషయాన్ని అలా అప్పల్రావుడితో చెప్పించడం కన్నా మరో మార్గం లేదనీ నాకు అనిపించింది.

అలాగే కధ చిట్టచివర సీతారాముడు – దాదాపు హఠాత్తుగా – శ్రీరాములు నాయుడిని ‘ఏలేది’ కరణమూ, మునసుబూ అన్న సంగతి స్ఫుటంగా ఎత్తి చూపుతాడు. వాళ్ళను ప్రభుత్వానికీ, రాజ్యానికీ, వ్యవస్థకూ ప్రతీకలుగా తీసుకొని రచయిత ఆ మాట చెప్పించాడన్న మాట నిజమే కానీ.. కధలో వాళ్ళిద్దరూ ‘ఏలే’ ప్రక్రియను సూచనా మాత్రంగానైనా చిత్రించకుండా ఒక్కసారిగా ఆ మాట చెప్పించడం వెలితిగా అనిపిస్తుంది. ఆ కరణం మునసబుల పాత్రలు దాదాపు మౌన పాత్రలు… ఇంకొంచం శ్రద్ధగా వాళ్ళ పాత్రలనూ, ఆ నిర్ధారణనూ చిత్రించి ప్రతిపాదించి ఉండవలసింది.

సుందరపాలెం ‘ అభివృద్ధి’ చెందిన క్రమాన్ని కధలో చెప్పినపుడూ, ఆయా అభివృద్ధి కార్యక్రమాల విష పరిణామాలను ఎత్తి చూపినపుడూ – అసలు ఈ కధ యావత్తూ అభివృద్ధిని నిరసిస్తోందా- అన్న అనుమానం కలిగింది నాకు. ( రోడ్లు వచ్చి బళ్ళ వాళ్ళు, కరెంట్ వచ్చి ….) . నిజమే – సమాజంలో ఒక్కో మార్పు సంభవించినపుడు ఒక బృందం, ఒక్కోసారి ఒక తరం యావత్తు తమ జీవనోపాధినే గాకుండా జీవన విధానాన్ని సైతం (వే ఆఫ్ లైఫ్) కోల్పోయి ఒడ్డున పడ్డ చేపలవడం ఒక చారిత్రక వాస్తవమే. కానీ అలాగే రైళ్ళూ రోడ్లూ కార్లూ విమానాలు కరెంటూ రైసుమిల్లులూ – చారిత్రక అవసరాలు. సామాజిక వాస్తవాలు. ఆ మార్పుల వల్ల అనేక మంది నిరాధారులుగా మిగిలే ప్రమాదాన్ని ముందే గ్రహించి వాళ్ళ వాళ్ళ జీవితాలను వీలయినంత సరళంగా, బాధారహితంగా చేయగల ముందస్తు ప్రణాళికలను రూపొందించి అమలు పరచడం దార్శనికత ఉన్న ప్రభుత్వాలు చేయవలసిన పని. కానీ చాలా సార్లు ప్రభుత్వాలు ఈ పని చెయ్యవు. అంత మాత్రం చేత యావత్తు అభ్యుదయాన్నే శంకించడం నిరసించడం సమంజసమా?!

……

సీతారావుడు తన కొడుకును తెగ నరకడం విషయంలో ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. జరుగుతోంది. అందులోకి నేను వెళ్ళను. నాకు అంత శక్తి లేదు. కానీ ఒక్క మాట – ఆ సంఘటనను చిత్రించడంలో రచయిత ప్రాధమిక ఉద్దేశ్యం ఏమయినా అది వ్యవస్థ కాలరు దొరక బుచ్చుకొని నిలదీయడానికి బలంగా ఉపయోగపడింది. (రిపోర్టా – మాఫీనా?) జవాబు ఇవ్వలేని సవాలును సంధించడానికి గొప్పగా ఉపయోగపడింది. అదే ప్రశ్నను మనకు మనమూ వేసుకొని సమాధానం చెప్పవలసిన నిరంతర అవసరాన్ని కల్పించింది.

శ్రీరాములునాయుడూ, అప్పల్రాయుడూ, సీతారావుడూ, గోపన్న, మునసబు, కరణం, గుడిమంటపం, హైస్కూల్, రోడ్డు – ఇవి అసలు స్థలాలూ పాత్రలూ కావు, ప్రతీకలు – అన్నఆలోచన ఒకటి ఉంది. ఆయా ప్రతీకలను గుర్తించి వివరించి కధలోని తాత్వికతను, గోప్యతను విశదీకరించి యజ్ఞాన్ని ఇంకా ఉన్నతీకరించవచ్చు. నేను ఆ హనుమంతుడ్ని గజం బద్దతో కొలిచే పని పెట్టుకోను. నిజానికి మనం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదని నేను అనుకొంటాను. కధను ఉన్నది ఉన్నట్టుగా మన ఆలోచనల్లో, అనుభవాల్లో, సంస్కారంలో, విజ్ఞానంలో ఒక భాగం చేసుకోగలిగితే మనల్ని మనం ఎంతో ఉన్నతీకరించుకో గలుగుతాం!

……

చట్టం, న్యాయం, ధర్మం, నీతి అన్న అంశాల మూలాలలోకి వెళ్ళి ప్రశ్నించిన రచన ‘యజ్ఞం’. ఎంతో సంక్లిష్టమయిన వ్యవస్థ స్వరూపాన్ని సామాన్య పాఠకులకు కూడా అర్ధమయ్యేలా విప్పి చెప్పిన కధ ఇది. ఆ చెప్పటం కూడా ‘వేదిక’ మీది భాషణ ధోరణిలో గాకుండా ‘ మనకు తెలిసిన దానిని పది మందితో పంచుకోవడం’ అన్న ధోరణి లో సాగడం వల్ల విషయం పాఠకుల మేధస్సులకే గాకుండా మనస్సులకు సైతం సూటిగా చేరగల సౌలభ్యం సాధించింది ఈ కధ.

ప్రపంచంలో ఏడే ఏడు కధలున్నాయనీ, మిగిలిన ఏడు మిలియన్ల కధలూ – రామాయణ మహాభారతాలూ, ఇవియడ్ ఒడెస్సీలతో సహా – ఆ ఏడు కధల ప్రతిరూపాలేనని ఒక సర్వజన ఆమోదముద్ర ఉన్న సాహితీ భావన బాగా ప్రచారంలో ఉంది. అది నిజమే అయిన పక్షంలో ఆ ఏడింటికీ తప్పక జోడించవలసిన ఎనిమిదో కధ – యజ్ఞం.

                                                                                                        దాసరి అమరేంద్ర