పితృ, దేవ హత్య అనివార్యం!

Art: Rafi Haque

Art: Rafi Haque

‘తండ్రీలేనీ, దేవుడు లేనీ అనాథ లోకం’ ఒక అన్‌ఫిలసాఫికల్‌ మెటాఫిజికల్‌ కాక్‌టేయిల్‌ ఎక్స్‌ప్రెషన్‌. గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించిన నేపథ్యం విస్మరించి రాణిశివశంకర శర్మ తండ్రీ, దేవుడీ అవసరాన్ని వక్కాణించటం ఆలోచించాలి.
సోక్రటీసు ఆస్తిక‌త్వాన్నీ, దేవుడు ఉనికినీ ప్ర‌శ్నించింది  మొదలు హెగెల్‌ వరకు ఫిలాసఫీలో దేవుడు, మతానిదే కేంద్రస్థానం. మెటాఫిజికల్‌ ఫిలాసఫీని భౌతికవాదం వైపు మార్క్స్‌ నడిపించడానికి కాంట్‌, హెగెల్ త‌త్వం ఉపయోగపడ్డది నిజమే. కానీ, గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించటానికి మాత్రం కాంట్‌, హెగెల్‌ తాత్విక అన్వేషణ కారణం కాదు. నీష్చేను ఆ మాట అనేలా మనుస్మృతి ప్రేరేపించింది. బ్రాహ్మణిజం చాకచాక్యంగా దేవుణ్ణి తప్పించి బ్రాహ్మణున్ని కేంద్ర స్థానంలో నిలిపింది. బ్రాహ్మణుడే దేవుడని మనుధర్మం ప్రకటించింది. మ‌మ దేవః, అహం బ్ర‌హ్మ‌స్మి అన్న‌ది అందుకే. అతడి సంక్షేమమే రాజ్య సంక్షేమ‌మం, అదే రాజ్యం యొక్క బాధ్యతనీ, అతడిని రక్షించటమే రాజధర్మమని మనుధర్మం ప్రకటించింది. ఈ ప్రపంచాధిపతి విప్రుడని అది చేసిన ప్రకటన నీష్చేని అబ్బురపర్చింది.
మనుస్మృతిలోని అధిమానవుడు (సూపర్‌ హూమన్‌ బీయింగ్‌) తనకు ఆదర్శమని అతడు భావించేలా ప్రేరణిచిందది. అందుకే దేవుడు మరణించాడనీ, ఇక ఈ లోకాన్ని అధిమానవుడైన ఆర్యుడే ఏలి రక్షిస్తాడని పారవశ్యంతో ఏడ్చే ఒక సంభ్రమాశ్చర్య దుఃఖస్థితికి అతడు చేరుకున్నాడు. ఇంచుమించు వివేకానందుడిదీ అదే మనోస్థితి. అతడి చేష్టలు, వ్యాఖ్య‌లు,  భ్రాంతిపూరిత ప్రకటనలూ ఆ అధిమానవుడిని తండ్రిగా అంగీకరించిన ఫలిత‌మే! కాబట్టే నీష్చే, వివేకానందుల‌ మధ్య వుండే డిస్కర్సివ్‌ సిమిలారిటీస్‌ను డా. అంబేద్కర్‌ వివరించాడు. నీష్చే తాత్వీకరించిన ఆ అధిమానువుడు ఆర్యుడు. నీష్చే ప్ర‌వ‌చించిన రేసిస్టు ఫిలాసఫీ హిట్లర్‌ (శర్మగారు చెప్పిన ‘తండ్రి’) నాజీయిజానికి, తద్వారా రెండు కోట్లమంది మానవ హననానికీ కారణమైంది.
నీష్చే ఈ లోకానికి అధిమానవున్ని తండ్రిగా ఇవ్వానుకొని దేవుడనే భావనకు ఫిలాసఫీలో ప్రాధాన్యత తగ్గించాడు. అయితే, మనువు చెప్పిన అధిమానవుడే ప్రపంచానికి తండ్రిగా, దేవుడు (భూసురుడు)గా  ఎంత విధ్వంసం సృష్టించాడో చరిత్ర సాక్ష్యం చెప్తూనే వుంది. తండ్రి తన పిల్ల‌ల‌ను తప్ప ఇతరుల పిల్ల‌ల‌ పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడన్న హామీ ఏమీ లేదు. హిట్లర్‌ అనే తండ్రి యూదుల‌ను శత్రువుగా భావించాడు కాబట్టే కాన్‌సెంట్రేషన్‌ క్యాంపుల్లో పెట్టి దారుణమైన జాతి హననానికి ఒడిగట్టాడు. ఒక చెడ్డ తండ్రి వల్ల‌ సంభవించిన క్రైం అగనెస్ట్‌ హుమానిటీని శిక్షించే పేరుతో రిలేటివ్‌లీ మంచి తండ్రి అయిన స్టాలిన్‌ పుట్టుకొచ్చాడు. ఈ సాపేక్ష సద్గుణ తండ్రి చేతిలో రష్యాలోని తన సొంతబిడ్డలు ఎంత హింసను అనుభవించారో తెలిసిందే. ఈ తండ్రి చేతిలోనే రోజా ల‌గ్జంబ‌ర్గ్ హ‌త‌మైంది. ఇందిరాగాంధీ నియంతృత్వంలోని క్రూరత్వాన్ని చవిచూసిన వాళ్లే ఆమేలోని దైవ‌త్వాన్ని ఎరుగుదురు. నియంతల‌ నిజాయితీ ఆధారంగా పితృ, పుత్ర సంబంధాల‌ను అంచనా వేయటం నయా మనువాదం.
మిషేల్‌ ఫుకో, డెరిడా, రార్టీ వంటి ఉత్తరాధునికవాదులు, ప్రాగ్మాటిస్టులు అన్ని రకాల‌ ఆధిపత్య కేంద్రాల‌ను తిరస్కరించారు. తండ్రి, కొడుకు అనే  ద్వైధీకృత సంబంధంలోని ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు డెరిడా. తండ్రికి లోబడి కొడుకు లేదా కూతురు వుండాల‌న్నది ఆధిపత్య సంబంధమే తప్ప సమానత్వాన్ని స్థాపించే ప్రజాస్వామిక సంబంధం కాదని ఆయన అభిప్రాయం. దీన్నే వాచకానికి వర్తింప చేసి ముందుమాటను వాచకం అప్రధానం చేయటమో లేదా ముందుమాటే తనను తాను ప్రధాన వాచకానికి లోబడి, కుదించుకుపోవటమో చేస్తుందని వివరిస్తాడు. అందుకే పితృహత్యకు డెరిడా పిలుపునిస్తాడు. తండ్రి పాత్ర పూర్తిగా ఆధిపత్యానికీ, పితృస్వామ్య ఆధిపత్యానికి నెల‌వని సైమన్‌ డిబోవా అభిప్రాయం.
కౌటుంబిక వ్యవస్థలో తండ్రి పోషించే బాధ్యతాయుతమైన పాత్రను వర్ణ, కుల‌ సమాజం గ్లోరిఫై చేస్తుందేమో గానీ, యూరపు సమాజాలు మాత్రం తిరస్కరిస్తాయి. వర్ణ, కుల‌ వ్యవస్థలోని ఆధిపత్యం వల్ల‌ అనేక ప్రయోజనాలు పొందుతున్న సవర్ణ పితృస్వామ్యవాదులు సమర్ధిస్తారేమో గానీ ఆధిపత్య వ్యవస్థను తిరస్కరిస్తున్న ప్రజాస్వామికవాదులు లేదా ఎగాలిటేరియన్‌, యాంటీ ఫాసిస్టు శక్తులు సుతారమూ అంగీకరించవు. ఎంతో పాతబడినదీ, తిరస్కరించబడినదీ, వ్యతిరేకించబడినదీ, అస్తిత్వవాదుల‌ చేతా, ప్రగతిశీవాదుల‌ చేతా, అంబేద్కర్‌వాదుల‌ చేతా ఖండించబడీ, తిరస్కరించబడిన పితృవాదం, దైవవాదాల‌ను తిరిగి బాధితుల‌ శిరస్సు మీద రుద్దడం అనంగీకారం. పితృ/దైవ కేంద్ర సిద్ధాంతమే గొప్పదనీ, అవసరమైనదనీ ఒప్పుకొంటే, శర్మ తర్కం వల్ల‌ ఉత్ఫన్నమయ్యే ఫలితాల‌ను భరించాలి. తండ్రి పాత్ర పోషించాడని చెప్పిన రాముడి చేతిలో ఈ దేశ మూల‌వాసుల‌ శిరస్సు ఖండితమై, జ్ఞానార్జనా క్షేత్రాల‌కు దూరంగా కుళ్లిన కళేబరాలై చితికిపోవాలి. రాముడి ధర్మం ప్రాసంగికత ఎంత అసందర్భమైనదైనా సరే,  ఆ రాముడి ధర్మాన్నే తండ్రిబాధ్యతగా, దైవకార్యంగా ఈ దేశ రాజ్యం యొక్క సారభూతతత్వం (ఆంటలాజికల్‌ ఫిలాసఫీ) గా స్థాపించాల‌ని హిందూ జాతీయవాదం తపిస్తున్నది.
నిజానికీ, తండ్రి లేదా ధర్మకర్త పాత్ర పోషించాల‌ని చెప్పిన గాంధీ హితవాదాన్ని డా. అంబేద్కర్‌ తిరస్కరించి, రాజ్యాన్ని రక్షకుడి స్థానంలో నిబెట్టడం వల్లే బాధిత సమూహాల‌కు ‘అనాథ’ స్థితినించి ‘పౌర’ హోదా దక్కింది.  రాజ్యాంగంలో నిర్వచించుకొన్నట్టుగా పౌరుల‌ను రాజ్యమే రక్షించుకోవాలి తప్ప ఏ దేవుడూ లేదా ఏ అధిమానవుడూ రక్షించరాదు. శిక్షించరాదు కూడా. కానీ, పితృస్థానంలో వున్న రాజ్యాంగాన్ని తోసిరాజని తండ్రి పేరుతో బ్రాహ్మణున్నీ, దేవుడి పేరుతో బ్రాహ్మణ్యాన్నీ రాజ్యంగా ప్రతిష్టాపించే కృషిని నెహ్రూ మొదలుకొని నరేంద్ర మోడీ వరకు కొనసాగిస్తూనే వున్నారు.
శర్మ వగస్తున్నట్టు ఈ దేశానికీ లేదా ఈ లోకానికీ తండ్రి, దేవుడు లేడని ఎవరైనా భ్రమిస్తే అది వాళ్ల జువైనలిజమే అవుతుంది. రాజ్యాంగ విరుద్ధంగా మ‌నువు ఆకృతినిచ్చిన తండ్రినీ, దేముడినీ ఈ స‌మాజంలో బ‌లంగా నిల‌బెడుతూనే వున్నారు. వాటిక‌న్ సిటీ దేవుడూ, అమెరికా తండ్రి క‌లిసి త‌యారు చేసిన హింస‌కు ప్ర‌తిహింస‌గా బ‌య‌ల్దేరిన తీవ్ర‌వాదం నెత్తుటి వాన‌ను కురిపిస్తూనే వున్న‌ది. దేవుడే లేని వెలివాడ‌ల్లోకి తండ్రి అయిన యేసును ప‌ర‌లోక ప్ర‌వేశానికి క‌చ్చిత‌మైన హామీ ఇస్తూ ప్ర‌వేశ‌పెట్టి చాలాకాల‌మైంది. ప‌ర‌లోకం త‌ప్ప ఇహ‌లోకం ప‌ట్ట‌ని ఒక ఉన్మ‌త్త స్థితికి తీసుకెళ్తున్న‌ది ప‌చ్చి నిజం. ఏది అస‌లైన ఇస్లామో చెప్ప‌లేనంత‌గా మారిపోయిన కాలంలో త‌బ్లిక్‌లాంటి జ‌మాతులు ముస్లిం స‌మాజాన్ని తిరోగ‌మింప చేస్తున్నదీ నిజ‌మే. తండ్రుల మ‌ధ్య‌, దేవుళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న స‌మ‌రంలో సామాన్యుడు బంధీగా మారుతున్నాడ‌ని ఒక‌వైపు వేద‌న‌ప‌డుతుంటే శ‌ర్మ మ‌ళ్లీ పాత‌పాటే పాడ‌టం ఏ సాంస్కృతిక చాణ‌క్య నీతి?
 మనది జాతి రాజ్యం కాదన్న నిజాన్ని మేధాల‌వుంతా ఎందుకు గుర్తించ నిరాకరిస్తున్నారో అర్థం కాదు. యూరపులోని జాతి రాజ్యాల‌ లాంటిది కాదు మన రాజ్యం. జాతి భావనే లేని సమాజం మనది. కులం తప్ప జాతికి పుట్టగతుల్లేని అవ్యవస్థ ఇది. జాతి అనే అమూర్త భావనను నిజం చేయలేమని గ్రహించిన రాజ్యాంగ నిర్మాత గణతంత్ర రాజ్యంగా నిర్ధారించాడు. గణతంత్ర విధానంలోనే వివిధ జాతుల‌, కులాల‌, తెగల‌, మత బృందాల‌, భాషా సమూహాల‌, లింగ సమాజాల‌కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ల‌భిస్తుంది. జాతి రాజ్యాల్లో ఇది అసంభవం. పాలిత జాతికి చెందని సమూహాల‌కు, బృందాల‌కు, గణాల‌కు, తెగల‌కు, జాతుల‌కు రాజ్యం కల్పించే హక్కులు, రక్షణలు, ప్రాతినిధ్యం తప్పనిసరిగా దక్కే అవకాశం లేదు. అవి జాతి రాజ్యం యొక్క దయాదాక్షిణ్యాల‌ మీద ఆధారపడి జీవించాలి. కానీ, మనది గణతంత్ర రాజ్యం కావటం వల్ల‌ అలాంటి నిరంకుశ జాతి దురహంకారానికి బాధితులుగా మిగల‌కపోగా, స్టేక్‌ హ్డోర్లు కాగలిగారు. శర్మ మన రాజ్యాన్ని జాతి రాజ్యాల‌ సరసన నిబెట్టి బోనెక్కించటం సమర్ధనీయం కాదు.
కౌటుంబికవాదం మరో కాల్ప‌నికవాదం. అది తండ్రినీ, పిల్ల‌ల వికాసాన్నీ, తండ్రి పడే కష్టాల‌నూ రొమాంటిసైజ్‌ చేస్తుంది. పిల్ల‌ల‌ ఎదుగుదల‌కు తండ్రి, తల్లి మధ్య సామరస్య సంబంధాలు దోహదం చేస్తాయనీ, పిల్ల‌ల‌ను పెంచే బాధ్యతను తండ్రి భుజామీద మోపి, తల్లిని వారిని సాకే యంత్రంగా మార్చేస్తుందనీ ఈ కాల్ప‌నిక‌వాదం గుర్తించనీదు. తండ్రిని ఒక కులానికీ, ఒక వర్గానికీ బంధీని చేసిన దేవుడు ఆ పిల్ల‌ల‌ శారీరక, మానసిక ప్రగతికి తండ్రి యొక్క ఆర్థిక స్థితినీ లేదా ఆర్థికబలాన్ని పొందే ప్రతిభా సామర్ధ్యాల‌ను హేతువుగా చూపి తప్పించుకుంటున్నాడు. ఈ కుల‌ సమాజంలోని న‌ల‌భై కోట్ల పీడితులు రోజుకు ఒక్క పూట తిండి మాత్రమే తింటున్నారంటే, ఎనభైశాతంకు పైగా బడీడు పిల్ల‌లు స్కూలు డ్రాపవుటవుతున్నారంటే, తల్లిదండ్రుల‌ అజ్ఞానం, పేదరికం, అసమర్ధత వ‌ల్ల‌ నిత్యం కౌటుంబిక హింసకు గురై బాల్యాన్ని పోగొట్టుకుంటున్నారంటే తండ్రి కేంద్ర వ్యవస్థే కారణం. కానీ, యూరపులోని అనేక దేశాలు గర్భస్థ శిశువు నుండి టీనేజీ వరకు పోషణ, విద్యాబుద్ధులు, బాల్యాన్ని అనుభవించే హక్కును గ్యారంటీ చేయటమే కాదు, మన కుల‌ సమాజం ఇచ్చిన పెత్తనపు హక్కు స్వభావంతో కన్నపిల్ల‌ల‌ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేసి ఖైదు చేసిన సంఘటనలున్నాయి. తండ్రి వున్నంత మాత్రానే బిడ్డకూ, త‌ల్లుల‌కూ స్వేచ్ఛ వుంటుందనుకోవటం పెద్ద దగా. నిజానికీ, స్వేచ్ఛకు తండ్రీ, దేవుడు పెద్ద అడ్డంకని ఎన్ని సామాజిక పరిణామ దశలు చూపించాయో మర్చిపోతే ఎట్లా?
శర్మ ఆర్థికవాదాన్ని నిరసించినంతనే తన వాదన‌ ఆమోదనీయమైనదని నిరూపించలేరు. స్వేచ్ఛా మార్కెట్ వ‌ల్ల‌ దళితుల‌ జీవితాల్లో పెద్ద మార్పులొస్తాయని ఎవరూ ఆశించలేదు. కానీ, కుల‌ సంబంధాల్లో స్వ‌ల్ప‌మైన మార్పులైనా వొస్తాయనీ, ముఖ్యంగా జైలుగదిగా మారిన గ్రామరాజ్యం విచ్ఛినమై, సుదీర్ఘకాలం కట్టుబానిసలుగా బంధితులైన దళితుల‌కు సాపేక్షమైన స్వేచ్ఛనిచ్చే సోషల్‌ మొబిలిటీ దొరుకుతుందని మాత్రమే ఆకాంక్షించారు. అన్ని దశల్లో అమలైన ఆర్థికఒప్పందాల వ‌ల్ల‌, వేగంగా విస్తరించిన టచ్‌స్క్రీన్‌ టెక్నోయిజం వల్లా, ఎక్ట్రో కమ్యూనికేషన్‌ ప్రగతివల్ల‌ బ్రాహ్మణ, వైశ్య మార్కెట్‌ లాభపడ్డది. కాస్టిస్ట్‌ మార్కెట్‌ స్వభావం, ప్రవర్తన పీడిత సమూహాల‌ను కనీసం వినియోగదారునిగా కూడా పరిగణించదనీ, అది అనేక మాయాజాల‌ పద్ధతుల‌తో జేబుదొంగకన్న హీనంగా ప్రవర్తిస్తుందన్న ఎరుక అంబేద్కరైట్‌ మేధావుల‌కు వుంది.
సవర్ణ సరుకుల‌ సంతను విస్తరింప చేయటానికీ, దేశ సహజ వనరుల‌ను సవర్ణ సంపన్నుల‌కు కట్టబెట్టడం ద్వారా ప్రపంచ కుబేరుల‌ను చేసి, ప్రపంచ మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవటం ద్వారా వైష్ణవ, వైదిక, సనాతన ధర్మపరంపరాగతమైన హిందూత్వ జాతీయవాదాన్ని ఆర్యజాతి ఐక్యత పేరుతో ప్రపంచమంతా వ్యవస్థాపితం చేయాల‌ని తపిస్తున్న సత్యం కనిపిస్తూనే వున్నది. సంఫ్‌పరివార్‌ సంస్థలు మొదలుకొని హరేక్రిష్ణ మిషన్‌, రామక్రిష్ణ మిషన్‌ వరకు ఎన్నో సంస్థలు ఆ దిశగా పనిచేస్తూనే వున్నాయి. ఆ ల‌క్ష్యం కోసమే పేద (హిందూపేదల‌) పితరగా ప్రకటించుకొన్న నరేంద్ర మోఢీ నిద్రాహారాలుమాని పనిచేస్తున్నాడు. ఆ ల‌క్ష్యం కోసమే ముస్లింల‌ను, దళితుల‌ను సామూహిక హనన కేంద్రాకు స్వ‌యంగా తరలిపోయి క్యూలో నిల‌బడే బలిమేకలుగా త‌యారు చేసే మానసిక ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు. ఆ సామూహిక హననక్రియకు అవసరమైన తలారుల‌ను శూద్ర, శూద్రఅగ్రకులాల‌ నుంచి తయారు చేసి శిక్షణిస్తున్నాడు.
ఇందుమూలంగా నిర్ధారించనైనది ఏమనగా, ఈ లోకాన్నీ, పీడిత సమూహాల‌ను సర్వనాశనం చేసిన, చేస్తున్న, భవిష్యత్తులో చేయబోయే తండ్రి ` అతడు ఎంతటి ఉదాత్తుడు, శీల‌వంతుడు, సద్గుణుడు, నిర్గుణుడు అయినప్పటికీ  తాత్వికంగా గానీ, కనీస ఇంగితజ్ఞానంతో గానీ అంగీకరించేది లేదని ప్రకటిస్తున్నాం. వేల‌ యేళ్లుగా ఈ ప్రపంచాన్నీ, ఈ దేశాన్నీ సర్వనాశనం చేసిన దేవుడు ఎంతటి దయామయుడైనా, ఎంతటి బల‌మైన దేహదారుఢ్యమూ, ఆయుధసంపత్తిని చేబూనివాడైననూ, ఎంతటి ధర్మనిరపేక్షమైనవాడైననూ, ఎంతటి కరుణామృత హృదయుడైననూ, అతడెంత నిర్గుణుడైనా, సద్గుణుడైనా, నిరాకారుడైనా, సాకారుడైనా సరే, తాత్వికంగాగానీ, సాధారణ బుద్ధితోగానీ, అసాధారణ బుద్ధిహీనతతో గానీ అంగీకరించేది లేదని ప్రకటించనైనది.
*