ఒక నిశ్శబ్ద సౌందర్యం : “రంగు వెలిసిన రాజుగారి మేడ”

rm umamaheswararaoమెహర్ ..! వాక్యం రహస్యం తెలిసినవాడా..ఎవరు నువ్వు? ఎక్కడున్నావ్ ఇంతకాలం? వాన ముంచెత్తిన ఒక పగలు, కుమ్మరి యువకుడు రాజుగారి మేడ చెక్క మెట్లెక్కి రాణికి నిద్రాభంగం కలుగకుండా ప్రేమను గెలుచుకున్నట్లుగా, తెలుగు కథలోకి నిశ్శబ్దంగా అడుగుపెట్టేశావ్! నీ ‘నిశ్శబ్దం వెనుక ఏవో ఘోరాలు’ ఇక్కడ ఊహించబడుతున్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా గుప్పెడు అక్షరాలు రాలుస్తూ ఉండవయ్యా అప్పుడప్పుడూ అయినా, నెర్రెలు బారిపోయి ఎదురు చూస్తున్నాం తండ్రీ , తడి గలిగిన నాలుగు అక్షరాల కోసం.

చిర చిరలాడే మంచి ఎండపూట వేపచెట్టు కిందకి చేరేవాళ్ళం పిలకాయలందరం. పిర్రల మీద చినిగిన నిక్కరూ, మోకాళ్ళ  మీద పొక్కు కట్టిన కురుపూ లేకుండా ఒక్కరూ ఉండేవాళ్ళు కారు. ‘చెంగన్నా, చెంగతాతా, చెంగమామా’అంటా చుట్టు ముట్టే వాళ్ళం. పైగుడ్డ ఒక్కటీ మొలకి చుట్టుకుని నేల మీద చతికిల కూర్చునేవాడు చెంగన్న. చెమట మెరుపుతో నిగనిగలాడే నల్లటి ఒళ్ళు. వీపంతా గుడ్లు గుడ్లుగా తేరిన చెమటకాయలు. కదుం కట్టిన నల్లటి మచ్చలు. చెక్క దువ్వెన మా చేతికిచ్చి కత మొదలు పెట్టే వాడు, ‘అనగనగా. ఒక ఊళ్ళో..’ అంటా. చిటుక్కు పటుక్కు మంటా చెక్క దువ్వెనతో కుక్కతా ఉంటే, చెమటకాయలు చిట్లి నీళ్ళు మా ముఖాల మీదకి చిందేవి. చెమటకాయ చిట్లిన ప్రతి సారీ సగించినట్టుగా అతడు మూలిగేవాడు. ఆ మూలుగు కూడా కతలో భాగం అయిపోయేది. వీపు మీది నల్లటి కదుముల్ని రెండు వేళ్ళ మధ్యా ఒత్తి .పట్టి పిండితే, ట్యూబులోంచి బయటొచ్చే టూత్ పేస్టులా మట్టి లాటి పదార్ధం పిస పిసా వచ్చేది. ‘ఈ మట్టేంది చెంగన్నా?’అని అడిగితే, ‘ లోపల మగ్గి పొయ్యి ఒక్కో కతా బయటకొస్తా ఉండాదిలే’అనేవాడు, నమ్మకంగా.

ఆ మట్టిని వేలికి తీసుకుని, నేలకో, రాయికో పూసేవాళ్ళం అపురూపంగా. పొద్దెక్కక ముందే మిట్టల మిందకి పొయ్యి, కలిగి కంప కొట్టి, పంగాల కర్రతో తొడుగు వీపుమీదకి ఎత్తుకుని, ఏటి గట్టున ఎల్లాయి పొయ్యి దగ్గర ఏసి, ఎండ నడి నెత్తి కొచ్చే వేళకి వేపచెట్టు కిందకి చేరుకునేవాడు మాకు కతలు చెప్పడానికి.

ఏం కతలనీ అవి! రాజుగారి కతలు, రాణిగారి కతలు, కుక్కలు నక్కలు తోడేళ్ళ కతలు. ఎండకో కత, ఎన్నెల్లో ఒక కత. ఎన్ని కతలనీ. చెంగన్న చెప్పే కతల్లో పాత్రలన్నీ మేమే. మా అమ్మలే రాణులు, మా నాయనలే యువరాజులు. చెంగన్న కత చెబుతా ఉంటే మైమరచిపోయి వినాల్సిందే, పిలకాయలయినా, పెద్దోళ్ళయినా.

ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి చాకలి చెంగన్న వంటి మొనగాడొకడు తగిలాడు.

పేరు మెహర్.

ఏం కథ చెప్పాడనీ! రంగు వెలిసిన రాజుగారి మేడ కథ. ఒళ్ళూ పయ్యీ మైమరపించిన కథ. ఒకే ఒక్క కథ, మెహర్ భక్తుడిగా మార్చేసిన మాయ కథ. పాల పిట్టలో అచ్చయిన ఈ కథ, ఎట్లా ఎగిరిపోయిందో గానీ, తుర్రున ఎగిరిపోయింది నాకు దొరక్కుండా. కుప్పిలి పద్మ దొరకపుచ్చుకుని పంపింది, తెల్ల పావురం కాలికి చుట్టి కట్టి. ఇన్ బాక్స్ విప్పి చూద్దును కదా తెల్ల పావురం రెక్కలమీద ఎండిన నెత్తుటి మరకలు. రంగు వెలిసిన రాజుగారి మేడ నుంచి వచ్చే పాత వాసన.

కథ మొదలు పెట్టిన కాసేపటికే, సితార సినిమాలో, ఇంతేసి కళ్ళేసుకుని మేడ మీది కిటికీలోంచి చూసే భానుప్రియ గుర్తొచ్చింది. ‘హబ్బ ..దించేసినట్టున్నాడు కదా మనోడు’,అనుకున్నాను. నిదానంగా, నిశ్శబ్దంగా. అమాయకంగా చిటికెన వేలు పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు ‘సితార’కి దూరంగా శ్రీపాదపట్నంలోకి. మెహర్ మాంత్రికుడు. మాయావి. మహా ప్రమాదకారి. నాగస్వరం ఊదే పాములోడిలా లాక్కుపోతాడు మనల్ని కథలోకి. ‘శ్రీపాదపట్నాన్ని పావురాళ్ళ పట్నమని కూడా అంటారు’అని మొదలు పెడతాడు. కథ పావురాళ్ళ గురించా, శ్రీపాదపట్నం గురించా అని తర్జన పడుతుండగానే ‘నిండా గోపీచందనపు పూతతో మెరుగుపోయిన బంగారపు దిమ్మెల్లా మెరిసిపోయే’రాజవంశీకుల రెండంతస్తుల మేడ ముందు నిలబెడతాడు మనల్ని.

ఆ మేడలో ఇప్పుడు సుబ్బరాజుగారు లేరు, ఆయన ప్రేతాత్మ మాత్రం తిరుగుతోంది, పై అంతస్తులో ఉండే మనుమరాలు రేణుకాదేవిని కాపు కాసుకుంటూ. ఆ భవంతి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టుకుని ఆమె ఎన్నడూ బయటకు రాలేదు. ఉత్సుకతతో ప్రవేశానికి ప్రయత్నించి భంగపడ్డ ఊరు, భయంతో మేడకి దూరంగా జరిగిపోయింది. కువ కువమని మూగే పావురాలతోనే రేణుకాదేవి స్నేహం. కబుర్లూ, కష్టాలూ, గొప్పలూ, చాడీలూ అన్నీ వాటితోనే. ‘మార్దవమైన, స్నేహితం తెలిసిన రాణి’కి ఒక తెలుపు రంగు పావురం అంటే బాగా మచ్చిక. వళ్ళో పెట్టుకుని ఆడుకునేది. అది బయటకు వెళ్తే బొమ్మలేసుకుంటూ గడిపేది.

‘ఒకనాడు ఆమె వళ్ళో ఒదిగి అర్ధనిమీలిత నేత్రాల్తో ఉన్న తెల్ల పావురం మీద రేణుకాదేవి భళ్ళున గుక్కెడు రక్తం కక్కింది’. తర్వాత రోజులు భారంగా నడిచాయి. రోజుకో బొమ్మ గీసి ఆ కాయితాన్ని చుట్టి, ఎండిన రక్తపు మరకలున్న తెల్లపావురం కాలికి కట్టి, కిటికీ ఊచల సందుల్లోంచి బయటకు ఎగరేసేది. ఏటినీ, ఎన్నో ఊళ్ళనీ, పొలాలనీ దాటుకుంటూ పోయి, ఒక చోట ఊరి చివర పొలాల మధ్య ఉన్న ఒక కుమ్మరి గుడెసె వాకిట్లో పాతిన కర్ర పైని చెక్క గూటి ముందు వాలేది తెల్లపావురం. రేణుకాదేవి పంపిన బొమ్మలు కుమ్మరి మొహాన పడేసి, గూటిలోని పెంటిపావురంతో సరాగాలాడేది.

ఆ కుమ్మరి ఎట్టాంటి వాడంటే, ‘ఎన్నేళ్ళ మట్టో సారె తిప్పుతున్న భుజాలతో, అడుసు తొక్కుతున్న కాళ్ళతో శరీరమైతే బిరుసెక్కింది గానీ, సారెపై మట్టి ముద్దని వేలి అంచుల నిపుణమైన కదలికలత్తో కుండగా మలిచేటప్పుడు కలిగే సీతాకోక రెక్కంత పల్చనైన పులకలురేపే ఆనందానికి స్పందించడంలో, మనసు మాత్రం స్నిగ్ధత్వాన్ని కోల్పోని’వాడు. అతనికి పనంటే ప్రాణం. రాత్రి,, ‘ఖాళీతనమేదో గుండెను బంకలా అంటుకుని ఆవరించినపుడు’, నులక మంచం మీద పడుకుని పావురం తెచ్చిన బొమ్మల గురించి ఆలోచించేవాడు. ‘బూడిదరంగు పావురాల్ని పూసిన రావిచెట్టూ, తెరచాపలు విడిచి వీధుల్లో తేల్తూ ప్రయాణిస్తూన్న మేడలూ, గిట్టలకు అంటిన పుప్పొడితో దేవగన్నేరు పూల చుట్టూ తుమ్మెద రెక్కల్తో చక్కర్లు కొడుతున్న బుల్లి గేదెలూ’..ఇవీ ఆ బొమ్మలు.

వీటితో ఆ కుమ్మరి ఖాళీతనం కొంత భర్తీ అయ్యేది. ఆ బొమ్మల్లో దిగులు, ఆహ్లాదం, తరుముకొస్తున్న తొందర. గీతల్లో ‘ మనసు శ్రద్ధ పెట్టి గీసినట్టు తెలిపే అపరిపక్వత’. కిటికీ ఊచల్లోంచి కన్పిస్తున్న జగన్నాథస్వామి రథం ఊరేగింపు బొమ్మను చూశాక, అవి ఎక్కడి నుంచీ వస్తున్నాయో అతనికి తెలిసపోయింది. ‘పావురం కామ ప్రకోపం వల్ల దారితప్పిన’ బొమ్మల్ని తిరిగి ఇద్దామని బయలు దేరాడు శ్రీపాదపట్నానికి. ఏనుగు తొండాల్తో కుమ్మరిస్తోంది వాన. మేడ ముందు ఎత్తు అరుగుల మెట్లెక్కి లోపలికి తొంగి చూసి పిలిచాడు. ఎవరూ పలకలేదు. చెక్క మెట్లు ఎక్కి వెళ్ళాడు. పై అంతస్తులో పందిరి మంచం మీద నిద్రిస్తున్న రేణుకాదేవి, నిద్ర మధ్యలో ఓ సారి కళ్ళు తెరిచి, ‘అతడు తన కలలో భాగమన్నట్లు, పలకరింపుగా నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకుంది.’నిద్ర లేచింతర్వాత కూడా ఏదీ కొత్తగా అనిపించలేదు. పరిచయపు మాటల్లో ఆ రాజకుమారికి ఆసక్తి కలిగిస్తున్నవేమిటో అతనికి తెలిసిపోయింది. అవి ఎట్లాంటి అల్పవిషయాలంటే, ‘బంతిపూల మొక్కల్ని కొరికేస్తున్న కుందేలుని అదిలించి వచ్చి చూస్తే, కుమ్మరి సారె మీద మట్టి ముద్దగా కూలిపోయిన కుండ అచ్చం కుందేటి తలకాయలా ఉన్న’సంగతీ, రాత్రిళ్లు గుడిసె దగ్గరకి వచ్చే తోడేలు కుండల్లో తల పెట్టి, ఊళ వేసి తన పాట సోకుకి తనే మురిసిపోయే’ వైనమూ వంటివన్నమాట. మాటలతో ఒకరికొకరు తెలిసిపోయారు.

‘క్షణాలు ఉద్విగ్నమై మనోహరమై బిగుస్తూ వదులవుతూ ప్రజ్వలించి సంచలిస్తున్నాయి. మనసు స్థలకాలాలకు అతీతమై చీకటి శూన్యంలో ఒకే వొక్కటై వెలుగుతోంది. నేల మీద చమురుదీపపు వెలుగువలయంలో ఇద్దరూ కూర్చున్నపుడు ఆమె తన బొమ్మల్ని చూపిస్తుంటే భజం మీంచి తొంగి చూస్తున్నపుడల్లా ఆమె చెంపలకి చెంప ఆనించకుండా వుండలేకపోయాడు’అతను. ‘అతని వేడి చెంపని ఆమె అనునయంగా స్వీకరించింది’.  ‘అతని ప్రహరణాల్ని ఉరుములూ ఆమె మణికూజితాల్ని పావురాళ్ళ కువకువలూ మింగేస్తూ’ కొన్ని రోజులు గడిచాయి.

అతనిలో దిగులు మొదలయింది. పురుషుడికుండే సహజమైన దిగులు అది. భవిష్యత్తుని పటంగట్టి పెట్టేసుకుందామనే అభద్రత. ఆమెకి ఈ క్షణాలు చాలు. అతను కదిలాడు. ఆమె ఆపలేదు. ‘అనుకున్నపుడల్లా మౌనంతో తన అంతరంగ ద్వారాల్ని మూసేసుకుని తనని వెలుపలే నిలబెట్టే ఆమె మంకుతనాన్ని’ అతను సహించలేకపోయాడు. దూషించాడు, ఆరోపించాడు, బెదిరించాడు.

అన్నీ కక్కేసి ఖాళీ అయిపోయాక వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ పురుషుడు. ఆమె స్త్రీ, కదిలి వచ్చి అతణ్ణి కౌగిలిలోకి తీసుకుంది. మృత్యువు తన ప్రాణాన్ని తీసుకుపోవడానికి రేపు రాత్రే వస్తుందనే నిజం అప్పుడు చెప్పిందామె, అతని పట్ల జాలితో. ‘మృత్యువు వచ్చినపుడు తన గుండెల్లో పొడవమంటూ ఒక దబ్బనం ఇచ్చింది అతనికి. అప్పుడు రూపం మారిపోయిన తనను మృత్యువు గుర్తు పట్టలేక వెను తిరిగి వెళ్ళిపోతుంది. మారిన రూపాన్ని మళ్ళీ పొడిస్తే పూర్వ రూపం వచ్చేస్తుంది.’ఆమె ఎప్పడూ, కిటికీ లోంచి ఏటికవతల క్షితిజరేఖనూ చూస్తూ గడిపేది. ఎండిన రక్తం మరకలున్న తెల్ల పావురం కాలికి బొమ్మలు కట్టి ఎగరేసిందీ, ఆ క్షితిజరేఖ దిక్కుకే. సరిగ్గా క్షితిజరేఖకు పైనగా ఏటి ఆవతల్నించి ఏదో నల్లగా ఎగురుకుంటూ రావడం అతను రెప్ప వాలని ఆ రాత్రి చూశాడు. కళ్లు మూసుకుని దబ్బనాన్ని పిడికిలి మధ్య బిగించి ఆమె గుండెల్లో గట్టిగా పొడిచాడు.

కళ్ళు తెరిచేసరికి పక్క మీంచి ఓ కప్ప క్రిందికి దూకి వెళ్ళి పోయింది. ‘కిటికీ ఊచల్లోంచి తొంగి చూస్తున్న తాటాకంత రెక్కలున్న గ్రద్ద , వీపు వెనుక దబ్బనాన్ని దాచుకున్న అతడిని అసహనంగా చూసి వికృతమైన అరుపు అరిచి వెనక్కి ఎగిరెళ్ళిపోయింది. ఇక కప్ప కోసం అతను గదంతా వెతికాడు. కనిపించలేదు. మెట్ల మీద కప్ప తడికాళ్ళ ముద్రలు కనిపించాయి. కప్పగా మారిన ఆమెకి తాను ప్రియుణ్ణన్న స్పృహ ఉండకపోతే! అనే ఆలోచనతో అతను వణికిపోయాడు. ఏటి ఒడ్డున బురదలోంచి  బెకబెకలు వినిపించాయి. ఒక్కటి కాదు, వందల కప్పల బెకబెకలు. బురదగుంటలో దబ్బనం పట్టుకుని కప్పలను వేటాడే అతను, ఆ ఊరి వారికి అలవాటైపోయాడు.  తెల్లపావురం, ‘తన రెక్కలపై రేణుకాదేవి రక్తపు మరకలు చెరిగిపోకుండా వుంటానికి వానలో తడవకుండా జాగ్రత్త పడేది’బతికినంత కాలం.

-ఈ కథ మెహర్ రాసిన తొలి కథ అనుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. స్త్రీ, పురుష కలయికలోని వైల్డ్ నెస్ ని వర్ణించిన తీరుకి దిగ్భ్రమ కలుగుతుంది. కథ చెప్పిన పద్ధతికి ముచ్చటేస్తుంది. మురిపం కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఎలుగెత్తి ఎందరికో చెప్పాలనిపిస్తుంది. శ్రీపాద మళ్ళీ పుట్టాడని నమ్మాలనిపిస్తుంది. మెహర్..మెహర్..మెహర్ అని వెయ్యిసార్లు పలవరించాలనిపిస్తుంది. ‘ఒరే..మెహర్’ అని ఆప్యాయంగా గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది.

మెహర్ ..! వాక్యం రహస్యం తెలిసినవాడా..ఎవరు నువ్వు? ఎక్కడున్నావ్ ఇంతకాలం? వాన ముంచెత్తిన ఒక పగలు, కుమ్మరి యువకుడు రాజుగారి మేడ చెక్క మెట్లెక్కి రాణికి నిద్రాభంగం కలుగకుండా ప్రేమను గెలుచుకున్నట్లుగా, తెలుగు కథలోకి నిశ్శబ్దంగా అడుగుపెట్టేశావ్! నీ ‘నిశ్శబ్దం వెనుక ఏవో ఘోరాలు’ ఇక్కడ ఊహించబడుతున్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా గుప్పెడు అక్షరాలు రాలుస్తూ ఉండవయ్యా అప్పుడప్పుడూ అయినా, నెర్రెలు బారిపోయి ఎదురు చూస్తున్నాం తండ్రీ , తడి గలిగిన నాలుగు అక్షరాల కోసం.

Meher (Bezwada Phanindra Kumar)(‘మెహర్ ఒక వర్తమాన సాహిత్యం’ అని నరేష్ నున్నా ఎగరేసిన జెండాకు చేయందిస్తూ.)

***