మిడిమిడి రాతల వల్లే విమర్శ దీపం కొడిగట్టింది!

        విమర్శకుడు అహంకారైతే విమర్శ ప్రేలాపనగా మారిపోయే ప్రమాదముంది. విమర్శకుడు వాచలుడైతే రచయితను చంపేసే అవకాశముంది. విమర్శకుడు కుతార్కికుడైతే రచయిత ఆలోచనను దుర్వ్యాఖ్యానం చేస్తాడు. విమర్సకుడు అపండితుదైతే (అజ్ఞానైతే) ఆవ్యాఖ్యానం అపరిపక్వంగా నిలిచిపోతుంది. విమర్శ వ్యాఖ్యానానికి రచనలోని అంతర్గత సాక్ష్యాలను ఉపయోగించుకోవాలి. మనం ఎత్తిచూపకపోతే దొరకక పోయేవి అనిపించె వాస్తవాలను పాఠకునికి అందించదం మత్రమే వ్యాఖ్యానం అంటారు టి.ఎస్. ఇలియట్. ఇది చాలా విలువైన అభిప్రాయం. దీనిని బట్టి విమర్శకుడు చెప్పేదంతా వ్యాఖ్యానం కిందకు రాదని తెలుస్తుంది. రచయితను ఆకాశానికెత్తే ప్రశంసలన్నీ వ్యాఖ్యానాలు కాదనిపిస్తుంది. రచనలోని అంతస్సారాన్ని గంభీరంగా వెలిబుచ్చే ప్రామాణికమైన అభిప్రాయం మాత్రమే విమర్శ అవుతుంది.

విమర్శకుడు రచయితను గురించి రచనను గురించి నేనెంత గొప్పవిషయం చెబుతున్నానో అన్నట్లుండకూడదు. రచయిత ఎంత గొప్ప రచన చేశాడో చూడండి  అని అంటున్నట్లుగా వుండాలి. సాహిత్య విమర్శలో మాటల దుబారు వల్ల ప్రయోజనం లేదు. పైపెచ్చు గాంభీర్యం కూడా చెడిపోయే అవకాశముంది.

“విమర్శకునికి ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఉత్తమ పాఠకుడిగా ఉండటం. విమర్శకుడు ఉత్తమ పాఠకుడే కాకుండా ఉత్తమ విద్వాంసుడిగా కూడా ఉండక తప్పదు” ( వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“రచయితకూ చదువు, నిరంతర చదువు – అవసరమే. కానీ విమర్శకునికి అవసరమైనంత చదువు రచయితకు అవసరం లేదు.” – ( వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“విమర్శకుడికి తాను ఏ సాహిత్యాన్ని గురించి విమర్శ రాయాలనుకుంటున్నాడో ఆ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన చెయ్యగల అవకాశం ఉన్న సామాజిక మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాల పరిజ్ఞానం ఉండాలి.” (వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“రచయిత కన్నా విమర్శకుడు రెండాకులెక్కువ చదివి ఉండాలంటారు.”- (కొడవటిగంటి కుటుంబరావు – సాహిత్య వ్యాసాలు)

అందుకే సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంపన్నుడు కావాలి. సాహిత్య విమర్శ జ్ఞాన ప్రధాన ప్రక్రియ. సాహిత్యంలో రచయితలు నిక్షేపించిన జ్ఞానాన్ని సమాజానికి విడదీసి, విశ్లేషించి అందించేది సాహిత్య విమర్శ. సాహిత్యంలోని జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటానికి విమర్శకుడు ఆ జ్ఞానానికి సంబంధించిన సర్వాంశాలు తెలుసుకోవాలి. సాహిత్య విమర్శ ఒక ఆహ్లాదకరమైన ఆట, మరోవైపు కఠిన పరీక్ష. సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంప్పనుడు అయితే విమర్శను ఆటగా మలచుకొంటాడు. అలా మలుచుకోలేని పక్షంలో అది విమర్శకులను ఆడుకుంటుంది. సాహిత్యానికి సమాజానికి మధ్య వారధి సాహిత్య విమర్శ. విమర్శకులు ఎంత జ్ఞాన సంప్పనులు అయితే వాళ్ళు నిర్మించే విమర్శ రూప వారధి అంత పటిష్టంగా ఉంటుంది. సాహిత్య విమర్శకునికి మూడు రకాల జ్ఞానం ఉండాలి.

  1. దృక్పధ జ్ఞానం
  2. శాస్త్ర జ్ఞానం
  3. కళా సాహిత్య జ్ఞానం

విమర్శకుడు తనదైన దృక్పధాన్ని కలిగి ఉంటూనే తన దృక్పథానికి విరుద్ధమైన దృక్పథాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. భౌతికవాదం దృక్పధం గల విమర్శకునికి భావవాద దృక్పధం స్వరూప స్వభావలు తెలియాలి. అలాగే భావవాదులకు కూడా.

1910 ప్రాంతాలనుంచి 1964 దాకా భారతదేశంలో శ్రీకాకుళ ప్రాంతంలో వచ్చిన ఆర్థిక రాజకీయ పరిణామాల చరిత్ర తెలిస్తే తప్ప కాళీపట్నం రామారావుగారు రాసిన ’యజ్ఞం’ కథ సమగ్రంగా అర్థంకాదు. అలాగే 1921-22 నాటి గుంటూరు ప్రాంత రాజకీయ సాంఘిక ఆర్థిక పరిణామల జ్ఞానంతో ’మాలపల్లి’ని, స్వతంత్రభారతంలో నాలుగు శతాబ్ధాల జీవితానుభవ జ్ఞానంతో “సొరాజ్జెం’ (అక్కినేని కుటుంబరావు) నవలను సమగ్రంగా అర్థం చెసుకోగలం. సామాజికశాస్త్రాలకు సాహిత్యానికి సంబంధం లేదనుకోవడం అసాహిత్యదృక్పధమే అవుతుంది. సామాజిక శాస్త్రాల జ్ఞానంతో వెలువడే సాహిత్య విమర్శ ఎంత సజీవంగా ఉంటుందో ’విభాతసంధ్యలు’ (సె.వి. సుబ్బారావు. సంపాదకత్వం) ’కథాయజ్ఞం’ (చేకూరి రామారావు సంపాదకత్వం) సాహిత్యంలో వస్తుశిల్పాలు (త్రిపురనేని మధుసూదనరావు,) వంటి గ్రంథాలు రుజువు చేశాయి. ఏ రచనను తీసుకొన్నా ఆ రచనలోని జీవితాన్ని పరిశీలించడం వర్తమాన సాహిత్యవిమర్శలో మొదటి భాగం. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.

వల్లంపాటి

వల్లంపాటి

“రచనను ఎవరి దృక్పధం నుంచి విలువకట్టాలి అన్న సమస్య కూడా చాలా కాలంగా వివాదస్పదంగానే ఉంది. రచనను రచయితనుంచి మాత్రమే వివరించి విశ్లేషించాలే కాని విలువ కట్టే బాధ్యతను విమర్శకుడు స్వికరింవకోడరు అనేవారు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రచయితలు వీరి అభిప్రాయం ప్రకారం రచయితకే కాని ఉత్తమ పాఠకుడైన విమర్శకుడికి దృక్పధం ఉండకూడదు. ఈ వాదంలో అర్థం లేదు. ఒక దృక్పధం కలిగి ఉండటానికి రచయితలకు ఎంత అర్హత ఉందో విమర్శాకుడికి కూడా అంతే అర్హత ఉంది. రచనను రచయిత దృక్పధం నుంచి అర్థం చెసుకొని తన సామాజిక ఆర్థిక దృక్పధం నుండి ఆ రచనను విలువ కట్టడం విమర్శకుడు నిర్వహించవలసిన భాధ్యతలలో ప్రధానమైనది.” (పేజి నెం. 26 వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

విమర్శకుడు రచయిత ప్రాపంచిక దృక్పధాన్ని తన దృక్పదంతో, రచయితను తన నిబద్ధతతో అర్థం చేసుకొని విశ్లేషిస్తాడన్నది వాస్తవం. చాలా మంది దృష్టిలో విమర్శకుడు రచయిత ఆలోచన ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చెసుకోవటం మాత్రంతోనే విమర్శకుని పని ముగిసిపోదు. అర్థం చేసుకొన్న దానిని విశ్లేషించాలి. దానిమీద తీర్పును ఇవ్వాలి. వర్తమాన విమర్శ వ్యాఖ్యానం స్థాయిని దాటి చాల కాలమే అయ్యింది. వ్యాఖ్యానం మాత్రమే కాక తీర్పును ఇవ్వటంలో విమర్శకుని ప్రాపంచిక దృక్పధం నిబద్ధతలే అతనికి సహయకారులౌతాయి.

సాహిత్య విమర్శకునికి ఉండవలసిన జ్ఞానంలో రెండోవది శాస్త్ర జ్ఞానం. శాస్త్రాలు రెండు రకాలు 1. వైజ్ఞానిక సామాజిక శాస్త్రాలు 2. కళాసాహిత్యశాస్త్రాలు. సాహిత్యవిమర్శకుడు ఏ శాస్త్రజ్ఞానమూ లేకుండా విమర్శ రాస్తే ఫలితం పెద్దగీతకు చిన్నగీత.

సాహిత్యంలోని జీవితాన్ని అర్థం చేసుకోవటానికి సాహిత్య విమర్శకుడికి సామాజిక శాస్త్రాల జ్ఞానం ఎంత అవసరమో రూప-శిల్ప విశేషాలను తెలుసుకోవటానికి కళా సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం అంతే అవసరం. మనకు మూడు రకాల కళా సాహిత్య శాస్త్రాలు ఉన్నాయి. 1. భారతీయ్య కళా సాహిత్యాలంకారశాస్త్రం 2. పాశ్చాత్య కళా సాహిత్యాలంకారశాస్త్రం

3. మార్కీయా కళా సాహిత్యాలంకారశాస్త్రం. మొదటి రెండు ఆయా భౌగోలిక విభిన్న కాల పరిధిలో పుట్టాయి. మూడవది ఆధునిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పరుచుకొన్న కళా సాహిత్యాలంకారశాస్త్రం. సాహిత్య విమర్శకులు వాళ్ళ దృక్పథాన్ని బట్టి చైతన్యాన్ని బట్టి అభిరుచిని బట్టి దేనిని స్వీకరించిన తక్కిన వాటిని గురించి కూడా తెలుసుకోవటం మంచిది. మూడింటిని అధ్యాయనం చేసి ఏదో ఒక శాస్త్రాన్ని అనుసరిస్తే కళా సాహిత్యాలను సాధ్యమైనంత సమగ్రంగా అవగాహన చేసుకోగలమో నిర్ణయించుకోవటం ఉత్తమం.

సాహిత్య విమర్శకులకు కావలసిన మూడో జ్ఞానం కళా సాహిత్య జ్ఞానం. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. 1. సృజన కళా సాహిత్య చరిత్ర జ్ఞానం. 2. కళా సాహిత్య విమర్శ చరిత్ర జ్ఞానం. ఒక కాలం నాటి రచన మీద విమర్శ చేస్తున్న విమర్శకుడు ఆ కాలానికి ముందు వెనకల కాలాల్లో వచ్చిన సాహిత్యాన్ని విమర్శ రాస్తున్న విమర్శకుడు సాధ్యమైనంత వరకు చదవాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞానం విమర్శకుని సాంస్కృతిక స్థాయిని పెంచటమే కాక సాహిత్య విమర్శ మహోన్నతంగా రూపోంది, రాణిస్తుంది. అలాగే ఒక ఉధ్యమ సాహిత్యం మీద విమర్శ రాస్తున్నపుడు తక్కిన ఉద్యమాల సాహిత్యాన్ని కూడా చదివి తీరాలి.

 

Kalipatnam_Ramarao

కాళీపట్నం రామారావు

’యజ్ఞం’ (కాళీపట్నం రామారావు) కథలో సర్పంచి శ్రీరాములు నాయుడు సుందరపాలెంలో చేసిన అభివృద్ధిని గురించి మాట్లాడుతూ పెట్టుబడికి రోడ్లు కావాలి, స్కూల్లు కావలి, కరెంట్ కావాలి. ఇది గ్రామం సరఫర చెయ్యలేదు. అందుకే రాజ్యం (State) పూనుకొని ఆ పాత్ర దరించాలి. ప్రైవేట్ పెట్టుబడి దారి విధానానికి రాజ్యం చేయూతనిస్తుంది. ఈ క్రమంలో శ్రీరాములు నాయుళ్ళు జవహర్ లాల్ నెహ్రులు అలంకార ప్రయంగా అదలం ఎక్కాలి. ఈ గ్రామం ఈ దేశం వాళ్ళవల్లే నడుస్తుందని, బాగుపడుతుందని నాయుడు నెహ్రు లాంటి వాళ్ళు అనుకోవచ్చు. కాని వాళ్ళు పెట్టుబడి చెతిలో కీలు బొమ్మలు. వాళ్ళు పెట్టుబడి దారులు వెయ్యమన్న వేషం వెయ్యాలి. అడమన్న నాటకం ఆడాలి. అని గరికపాటి నిరంజన్ రావు చేసిన మార్కిస్ట్ వ్యాఖ్యానం ఇది. దీని ద్వారా మనకి తెసిందేమిటంటే సాహిత్య విమర్శకుడు రచన మీద వ్యాఖ్యానం లేదా విమర్శ చేసేటప్పుడు అతని భావజాలం ప్రాధాన్యం వహిస్తుంది. మార్కిస్ట్ కాని విమర్శకుడు ఇదే అంశంమీద వ్యాఖ్యానం చేస్తే అది ఖచ్చితంగా దీనికి భిన్నంగా ఉంటుంది.

అలాగే ఒక కాలంలో ఒక భాషలో ఒక రచన మీద కాని రచయిత మీద కాని లేదా ఉధ్యమ సాహిత్యం మీద కాని విమర్శ రాసే విమర్శకుడు ఆ రచనల మీద ఇతరులు రాసిన విమర్శను అధ్యయనం చేయటం ఎంతైన అవసరం. ఒక భాష విమర్శకునికి తక్కిన ప్రపంచ భాష సాహిత్య విమర్శ చరిత్ర తెలిసుంటే జరిగే మేలు ఎక్కువ. మన ముందు కాలపు విమర్శకులు సాహిత్య విమర్శలో ఏ ఏ పోకడలు పోయారో తెలిసి ఉంటే, మనం వాళ్ళ కన్న భిన్నంగా, ఆధునికంగా, విమర్శ చేయడం ఎలాగో నిర్ణయించుకోవడానికి వీలుకలుగుతుంది. వాళ్ళ విమర్శ అగిన చోటు నుంచే మన విమర్శ మొదలు పెడితే విమర్శ బండి నిరాటంకంగా సాగుతుంది. మాక్సింగోర్కి రష్యన్ యువ రచయితలకు ఒక సలహా ఇచ్చాడు. నేటి కార్మికుడు ఒక వస్తువును తయారు చేసే ముందు, ఆ వస్తువును తన ముందు కాలపు కార్మికులు ఏలా తయారు చేశారో తెలుసుకొంటే వాళ్ళ కన్నా బాగా ఆ వస్తువును తయారు చెయ్యటానికి వీలైనట్లే, నేటి రచయితలు తమ ముందు కాలంలోని సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకుంటే వాళ్ళ కన్నా బాగా రాయడానికి వీలౌతుంది. ఈ సలహా సాహిత్య విమర్శకులకు కూడా వర్తిస్తుంది.

ఏ కాలంలోనైనా సమాజం తన మనుగడ కోసం ఒక స్పష్టమైన దృక్పథం కలిగి ఉంటుంది. వ్యక్తికైన సమిష్టికైన మనుగడ సాగించటానికి ఒక దృక్పథం అవసరం. ఈ దృక్పథమే మనిషిని, ప్రపంచాన్ని నడిపిస్తుంది. సమాజానికి ఒక నిర్థిష్టమైన ప్రాపంచక దృక్పథం ఉన్నట్లే సమాజ జీవితాన్ని సాహిత్యంగా మలిచే రచయితలకు కూడా తమదైన ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. తమ అవగాహనను శాస్త్రవేత్తలు సామాన్యులు కళాకారులు అభివ్యక్తం చేయటంలో బేధాలు ఉంటాయి. చూపులోనే(దృష్టి) బేధం ఉన్నపుడు చూచిన దానిని చెప్పటంలోను తేడాలు ఉంటాయి.

అధ్యయన లోపం సాహిత్య విమర్శ కృషించటానికి వెనుకడుగు వెయ్యటానికి అవకాశం ఇస్తుంది. సాహిత్య విమర్శ ఎదగలేదనే అభిప్రాయం కలగటానికి కూడా అవకాశం కలిపిస్తుంది. సమస్త సాహిత్య విమర్శ పరిజ్ఞానం నుండి తనదైన మార్గంలో విమర్శ రాస్తే దానికి విశ్వసనీయత అధికారికత కలుగుతుంది. సాహిత్య విమర్శకులలో అధ్యాయన లోపం- జ్ఞానలోపం సాహిత్య విమర్శ క్షీణతకు తద్వారా సమాజ క్షీణతకు దారీ తీస్తుంది. ఈ మూడు రకాలైన జ్ఞానం కలిగిన విమర్శకులు ఉత్తమ విమర్శకులు అవుతారు.

ఒక కథారచన చదివినతరువాత దానిలోని కథ పాత్రలు సంభాషణలు మొదలైన అనేక అంశాలను విశ్లేషించుకుంటాం. ఆరచనలో ఆ పాత్రల ప్రాధాన్యాన్ని ప్రమేయాన్ని వ్యాఖ్యానించుకుంటాం. ఆ రచనలోని కథా నిర్మాణాన్ని , కథాకథనాన్ని, పాత్ర చిత్రణను సభాషణల్ని ఇంకా అనేకాంశాలని ఇతర రచనలలోని అలాంటి అంశాలతో పోల్చి పరిశీలిస్తాం. అన్నీ అయినాక విమర్శకుడు, రచయిత ఈ రచన ద్వారా ఏమిసాధిస్తున్నాడు? అనేదాన్ని నిర్ణయించాలి. సాహిత్యవిమర్శకుడు తీర్పరి పాత్రను నిర్వహించవలసింది ఇక్కడే. ఏ నిర్ణయమూ చేయకుండా ముగించే విమర్శ వల్ల ఫలితముండదు. పాఠకుల్ని నడిదారిలో వదిలేసినట్లౌతుంది.

ఒక రచనలో అన్ని అంశాలు విమర్శకునికి నచ్చక పోవచ్చు. సాహితీలోకంలో చాలా ప్రసిద్ధుడైన రచయిత చేసిన బలహీనమైన రచన మీద విమర్శించి నిర్ణయం ప్రకటించడంలో అనేక పరిమితులు కూడా ఏర్పడవచ్చు. రచనలోని జీవితం మనంచూసిన జీవితంకన్నా భిన్నమైన జీవితానుభావాన్ని చిత్రించి వుండొచ్చు. ఇలాంటివన్నీ… విమర్శకుడు తాను చదివి లేదా విమర్శించే రచన మీద చివరి నిర్ణయాన్ని ప్రకటించడానికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే తాను గ్రహించిన సత్యాసత్య ప్రకటనకు తానుగడించిన అధ్యయన జ్ఞానం అవసరమవుతుంది.

తెలుగులో సాహిత్యవిమర్శ దీపం చిన్నది. తెలుగులో సాహిత్యవిమర్శ ఎదగలేదు. విమర్శకులు రచయితల అభిప్రాయాల్ని గౌరవించరు. విమర్శను భరించేస్థితిలో రచయితలు లేరు. తెలుగులో సాహిత్యవిమర్శ ఉన్నట్టా? లేనట్టా? తెలుగులో సాహిత్య విమర్శ ఉండీలేనట్టే! తెలుగులో సాహిత్యవిమర్శ లేనట్టే. –ఇలాంటి వ్యాఖ్యలు నిరంతరం వినిపిస్తూనే వున్నాయి. ఇందుకు కారణం ఎవరు ? అరకొర జ్ఞానంతో మిడిమిడి రాతలు రాసే విమర్శల పాత్ర . తెలుగుసాహిత్యవిమర్శలో శాస్త్రీయత లోపించడం. వ్యక్తిగత అభిరుచులు ప్రాధాన్యం వహించి, నిర్మాణాత్మకత లోపించడం.చరిత్రను గౌరవించలేని దౌర్భల్యం. మార్పుల్ని సహించలేని పిరికితనం, దుర్వ్యాఖ్యానాలతో చెలామణి కావాలనుకునే దురాశ వంటి రుగ్మతలు తెలుగు సాహిత్య విమర్శను అనారోగ్యంపాలు చేస్తున్నాయి. సాహిత్యవిమర్శ ఒక శాస్త్రంగా భావించకుండా, దానిని స్వీయాభిరుచుల ప్రకటన సాధనంగా భావించినంతకాలం తెలుగువిమర్శ గురించి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతుంటాయి.

.

-డా. కె. శ్రీదేవి

9441404080