రాతిరి కన్న ఇన కవనం!

 

-అంబటి సురేంద్రరాజు

~

 

 

We love life, not because we are used to living, but because we are used to loving

– Nietzsche

ఎవడడుగు పెడతాడెపుడెపుడోనని

ఎదురు చూస్తానెపుడూనూ 

–      ఒంగిన గగనం

 

సోమాలియాలో సోఫియా లారెన్‌’ జగ్గయ్యపేటలో శివలెంక రాజేశ్వరీదేవి. దూరాభారం ఎంత వున్నా ఇద్దరి మధ్య సామ్యం ఏదో వుంది. అందుకే ప్రపంచానికి నిప్పు పెడదామని అంటున్నారు యుగళంగా. అనంతాకాశాన్ని ముక్కుగా విడగొట్టడం ఇద్దరికీ ఇష్టంలేదు. అందుకే వాక్యం తెగడం లేదు. ‘వాక్యం తెగదుగాక తెగదు’  అంటున్నది వారి ముక్త కంఠం.

శివలెంక రాజేశ్వరీదేవి ఒంటరి. ఒంటరి కాదు. ఒకరు మనిషి, వేరొకరు కవి. ఒంటిగా మనిషి ఊయలూగడం ఎంత నిజమో, కవిగా లోకపు వాకిట ఇష్టులతో జతకట్టడం అంతే నిజం. రావు బాలసరస్వతీదేవి నుంచి సోఫియాలారెన్‌ దాకా, కృష్ణశాస్త్రి, ‘రజని’, మోహన్‌ప్రసాద్‌లనుంచి  శరత్‌, చలం, వడ్డెరచండీదాసు దాకా అందరూ చెలులే, చెలికాండ్రే.

రాజేశ్వరీదేవి అండర్‌గ్రౌండ్‌ కవి. కవిగానే కాదు మనిషిగా కూడా అండర్‌గ్రౌండ్‌ జీవితాన్ని ఎంచుకున్నందున అందుకు అడ్డుగా నిలిచే ఉద్యోగ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని తోసిరాజన్నారు. ఫ్రెంచి కవి, విమర్శకుడు మలార్మే లాగా »»The world exists in order to end up in a bookµµ అని నమ్మి తన ప్రపంచాన్ని పుస్తక రూపంలో మనకు కానుకగా ఇచ్చి సెలవంటూ వెళ్ళిపోయారు.

‘‘నా రాత్రి సుదీర్ఘమయినది’’ అంటూ తెలియని రాత్రిలోకి మనల్ని తీసుకువెళతారు. ఏ నమూనాలోనూ లేనందున రాత్రిని పగలు, పగటిని రాత్రిని చేసే శక్తి ఆమె సొత్తు. ‘‘ఉన్న కాస్త సమయం ప్రేమించడానికే చాలడం లేదు. ఇక ద్వేషానికి తావెక్కడ?’’ అనే సూఫీ కవయిత్రి రూబియా తలపుల్లో మెరుస్తుంది శివలెంక కవిత్వం చదువుతుంటే. ఒక్క రూబియానే కాదు మార్మిక కవులు మీరా, అక్కమహాదేవి గుర్తుకువస్తారు.

దోస్తవిస్కీ ‘నేరము శిక్ష’ నవలలో మన హృదయానికి చేరువై మనను అచ్చెరువొందించే సోనియాను మీరు శివలెంకలో చూడవచ్చు. రాస్కల్నికొవ్‌ను సన్మార్గంలో పెట్టే సోనియానే కాదు రాస్కల్నికొవ్‌ను కూడా మీరు ఆమెలో చూస్తారు. పరస్పర విరుద్ధ అస్తిత్వాలను కలిగివున్న భిన్న ధృవాలు ఒకే మనిషిలో అన్యోన్యంగా వుండటం అరుదుగా తప్ప జరగదు. రాజేశ్వరీదేవి ఇందుమూలాన్నే అరుదయిన కవిగా, మనిషిగా నిలుస్తారు. ‘తోవ ఎక్కడ సోనియా?’ అని కలవరించి పలవరించిన ‘నూతిలో గొంతుక’ బైరాగి కవిత్వ ప్రభావం ఆమెపై వుందంటే అది స్వాభావికమే.

“Despair has its own calms” అంటాడు డ్రాకులా, బ్రామ్‌ స్టోకర్‌ నవలో. అలాగే “It is necessary to work, if not from inclination, at least from despair.” అంటాడు ఫ్రెంచి మహాకవి బోదలేర్‌. రాజేశ్వరీదేవి కవిత్వం ఆమూలాగ్రం despair (నిరాశ) నుంచే జనించింది. కుటుంబ పోషణకుగాను వేతన కూలీగా ఇష్టంలేని పని చేయాల్సిన దురవస్థను సులువుగా తప్పించుకుని కవితా వ్యాసంగాన్ని ఇష్టమైన వ్యాపకంగా ఒక పనిగా పెట్టుకున్న ధీరజ శివలెంక. నిరాశ తాత్విక ప్రాతిపదికగా బోదలేర్‌ మార్గంలో పనిచేస్తూ కవిత్వం సృజిస్తూ ఆమె సాంత్వన పొందారు. నిరాశ ఒక ఆంతరిక  సాంస్కృతిక స్థితి. ఒక సంస్కారంగా దానికదే ప్రశాంతిని చేకూర్చే నిరాశ, కవితా సృష్టి ద్వారా ఆమెకు మరింత లోతైన శాంతిని, స్థిమితాన్ని ప్రసాదించింది.

«««

 

ఆజ్‌ సజన్‌ మొహె అంగ్‌ గాలో

జనమ్‌ సఫల్‌ హోజాయే

హృదయ్‌ కీ పీడా దేహ్ కి అగ్ని

సబ్‌ శీతల్‌ హోజాయే

 

గురుదత్‌ ప్యాసా(1957) సినిమా కోసం సాహిర్‌ లుధియాన్వీ రాసిన ఈ వైష్ణవ భజనగీతం రాజేశ్వరీదేవి వంటి స్త్రీతత్వ కవుల ఆర్తికి ఆరని మోహస్పర్శకి సంకేతంగా నిలుస్తుంది. భారతీయ శైవ వైష్ణవ సంప్రదాయాలలో ఇట్టి మోహార్తి ప్రకటనకు తార్కాణాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ‘‘కవిత్వం రాయవలసిన అగత్యం, రాయక తప్పని అశాంతి  స్త్రీలకు సైతం ఏర్పడటం విషాదం.’’ అని ఇస్మాయిల్‌  దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాఖ్యానించారు. స్త్రీవాద కవిత్వం తెలుగునాట విజృంభిస్తున్న సందర్భం అది. ఇతర సామాజిక, రాజకీయ సాహితీపరులకు మాదిరిగానే స్త్రీవాద కవులకు కూడా సిద్ధాంతరాద్ధాంతం ఎక్కువ. జీవన లాలస తక్కువ. ఫలితంగా అది రాశిలోనే తప్ప వాసిలో ఎదగలేదు. అనుభవాన్ని అనుభూతిగా సాంద్రతరం చేసుకునే సహనం, స్తిమితం కొరవడినందున వారిలో హెచ్చుమందికి నినాదాలను పుక్కిటపట్టక తప్పని స్థితి ఎదురైంది. రాజేశ్వరీదేవి ఇందుకు మినహాయింపు. ఇస్మాయిల్‌ వ్యాఖ్యకు సముచిత రీతిలో సంతృప్తికరమైన సమాధానం చెప్పగల సత్తా ఆమె కవిత్వానికి సమృద్ధిగా ఉంది. ఆమెకు ముందు రేవతీదేవి అటూ ఇటూగా జయప్రభ తర్వాత ఊర్మిళ వంటి కవులు వాదానికి అతీతంగా స్ర్తీలుగా(ఫెమినైన్‌) కవిత్వం రాశారు. వాదం ఛాయలు వారి కవిత్వంలో కూడా పొడచూపినా, స్వానుభవం నుంచి స్వబుద్ధితో రాయడం వలన అవి శుష్క ప్రేలాపనలు కాలేదు. క్షయం అంతకన్నా కాలేదు. కేవలవాద కవులు కనుమరుగై అప్పుడే సుమారు 15ఏళ్ళు గడచిపోయాయి.

స్త్రీలు కేవం ఉదాసీన కాల్పనిక కవిత్వానికే పరిమితమవుతారని, పురుషులైతేనే క్రియాశీల కాల్పనిక కవిత్వానికి పట్టం కడతారని ఒక అపప్రద తెలుగు కవితాలోకంలో బహుళ వ్యాప్తిలో ఉంది. గోర్కీ ఒక యువ రష్యన్‌ కవయిత్రి కవిత్వాన్ని చూసి చేసిన వ్యాఖ్యలను స్థల కాలాలకు అతీతంగా అన్వయించడం వలన ఈ వికారం షికార్లు చేస్తున్నది. రాజేశ్వరీదేవి కవిత్వంలో మనం ఉభయ (ఉదాసీన, క్రియాశీ) కాల్పనికతను చవిచూస్తాం. ఆత్మాశ్రయ కవిత్వం వస్తువును ఆశ్రయించడం అసాధ్యమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చేసిన సూత్రీకరణకు కాలదోషం పట్టిందని చెప్పడానికి ఈ కవిత్వం తిరుగులేని సాక్ష్యాధారం. (కేవల) వస్త్వాశ్రయ కవులకు ఆత్మను ఆశ్రయించడం సాధ్యపడదనే కఠోర వాస్తవాన్ని మరుగు పరచడానికి ఈ విధమైన పాక్షిక ఆవిష్కరణకు పాల్పడటం తెలుగు సాహిత్య పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య.

ఇంతటి ఉత్తమశ్రేణి కవితలు రాసి మనకందించిన రాజేశ్వరీదేవి కవిత్వం ఇంతకాలం పాఠకలోకానికి అందకపోవడం అన్యాయం. తెలుగు సాహితీ ప్రపంచానికి విలువలు లేవని, ‘మ్యూచువల్‌ అడ్మిరేషన్‌ సొసైటీ’గా మారి సొంత ముఠా సభ్యుల సంకలనాలను మార్కెట్‌లోకి వదలడానికి ‘సెలబ్రిటీ’ కవులు పరిమితమయ్యారని చెప్పడానికి ఎవరూ సంకోచించవలసిన అవసరం లేదు.

కాని, యేంలేదు!/ఎప్పటిమల్లే/వుత్త నిస్సారంగా/అవే రాత్రులు/వుదయాలు, అవే బాధలు, బలహీనాలు/

ఎప్పటిమల్లే/నిర్దయగా/మా కంఠాలపైనించి/కఱకు విధి/రథ చక్రాలు

– (నిరాశ-ఎచటికి పోతావీ రాత్రి`వజీర్‌ రహ్మాన్‌)

వజీర్‌ సుమారు ఏభైఏళ్ళ క్రితమే రాజేశ్వరీదేవి ఆత్మబంధువుగా ఆమె హృదయార్తిని ఆవిష్కరించారు. అందుకు నాడు ఆధిపత్య స్థానంలో వున్న తెలుగు విమర్శక మేధావులు ఆయనపై క్షీణ యుగ కవిగా ముద్ర వేశారు. రాజేశ్వరీదేవిపై కూడా అదే ముద్ర వేయడానికి వారి వారసులు వెనుకాడబోరు. కానీ కాలగతి వారిని బుట్టదాఖలా చేసింది.

మనసు మనసు పెనగి మనసు ఏకము చేసి మనసు మర్మము గన్న దెరుక -అని కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన ఎరుకను తన జీవితంలో, కవిత్వంలో అత్యంత అలవోకగా సాధించిన మర్మజ్ఞురాలు, పండితారాధ్య వంశజ, ఆరాధ్య తనయ శివలెంక రాజేశ్వరీదేవి.

సత్యం వద్దు స్వప్నమే కావాలి అన్నారు కవి. ‘సత్యం’ రుజా జరా మృత్యు అవస్థకు ఎలా దారితీస్తుందో సహజసిద్ధంగా ఎరిగిన అభిజ్ఞ కావడంవల్లే ఆమె స్వప్నావస్థను కోరుకున్నారు. ఆధునికతానంతర సౌందర్య శాస్త్రానికి మూలవిరాట్టు నీషేకి రాజేశ్వరీదేవితో ఏకాభిప్రాయం ఉంది. ఆయనా ఆ మాటే అన్నారు తనదైన రీతిలో We have art in order not to die of the truth. (సత్యం బారిన పడి చనిపోకుండా రక్షించేందుకే మనకు కళలున్నాయి.)

***

How free I am,

how wonderfully free

from kitchen drudgery 

free from the harsh grip of hunger

and from empty cooking pots

free too of that unscrupulous man

the weaver of sun shades

calm now and serene I am

all lust and greed purged

to the shade of spreading tree I go

and contemplate my happiness

– Therigatha

(2-3rd century BC)

 

«««

అంతరంగంలో ఆమె బుద్దిస్ట్‌ కావడం వల్లే మన మధ్యా బౌద్ధ సన్యాసివలె ఆమె జీవించారు.

«

peepal-leaves-2013

rajeswari1

శివలెంక రాజేశ్వరీదేవి చిరపరిచితమైన కవి. స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. జననం 1954 జనవరి 16. తల్లిదండ్రులు కీ.శే. వరలక్ష్మి, సుబ్రహ్మణ్యం. ఏడుగురు సంతానంలో ఆమె పెద్ద. ఏలూరులో బి.ఎస్‌.సి. చదివారు.  

బాల్యం నుంచీ సంగీత, సాహిత్యాలను ప్రాణాధికంగా ప్రేమించారు.  1970లో రచనావ్యాసంగం ఆరంభిం చారు. కడవరకు కొనసాగించారు. అద్భుతమైన కవితలు రాశారు. అరుదైన కవిగా ఆదరణ పొందారు. గత నలభై ఏళ్ళలో ఆమె రచనలు కొన్ని రేడియోలో ప్రసారం కాగా పత్రికల్లో అనేకం అచ్చయ్యాయి.

రాజేశ్వరీదేవి గుంపున ఎపుడూ లేరు. జీవితంతో ఏకాకిగానే తలపడ్డారు. చంద్రుడికి జతగా జాగరణ చేశారు. ఆ కత, కవరింతలే ఆమె కవిత్వం.

స్వప్నం మీంచి కోకిలవలె పాడుతో పాడుతో 2015 ఏప్రిల్‌ 25న నక్షత్ర లోకంలోకి ఎగిరిపోయారు.

 

నామాడి శ్రీధర్.

సంపాదకుడు

సత్యం వద్దు స్వప్నమే కావాలి

ప్రేమలేఖ ప్రచురణ