– చైతన్య పింగళి
~
రోహిత్ మీద రాసిన ఈ కథ కేవలం సింపతి ఉన్న కథ!
సాక్షి కథల పోటీలో వెంకట్సిద్ధారెడ్డి రాసిన ‘
’ కథ మొదటి బహుమతి గెలుచుకుంది. అందుకు అభినందనలు. ఈ కథని ఆదివారం ప్రత్యేక సంచిక కవర్పేజిగా కూడా వేశారు. అందుకు కూడా అభినందనలు.రోహిత్వేములకి సంబంధించిన కథ అవటం వల్లా, ఆదివారం ప్రత్యేక సంచిక కవర్పేజిగా ఈ కథ వేయటం వల్ల, చాలా మంది అగ్రకులస్థులతో పాటుగా ఒకరిద్దరు ఉద్యమకారులు కూడా దీన్ని గురించి ఫేస్బుక్లో పెట్టిన పోస్టుల వల్ల.. ఈ కథ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. కథని నడిపించిన తీరు, శైలికి చాలా ప్రశంసలే వచ్చాయి. ఒక యాక్టివిస్ట్గా, రచయితగానీ, వ్యాసకర్తగానీ.. ‘ఇంతకీ ఏం చెబుతున్నారు?’ అని చూస్తాను కాబట్టి–వాటి జోలికి నేను పోవటం లేదు. వ్యక్తిగా వెంకట్గారి మీద చేస్తున్న విమర్శ కాదు ఇది. ‘రోహిత్’ విషయాన్ని చాలా మంది అర్ధం చేసుకుంటున్న తీరు గురించి.. ఈ కథ నేపధ్యంలో మనం చర్చించాల్సిన అవసరం ఉంది.
రోహిత్వేముల కంటే ముందు, ఆ తర్వాత కూడా అగ్రకుల ఆధిపత్యం కిందా, పెత్తనం కిందా ఎందరో దళితులు¬ దిక్కు మొక్కు లేకుండా నలిగి నాశనమయ్యారు. అవుతున్నారు. చంపబడ్డారు. దళిత వాడలు ఊచకోత కోయబడ్డాయి. ఎందరో దళిత స్త్రీలు రేప్కి గురికాబడ్డారు. అదే సెంట్రల్ యూనివర్సిటీ లో చాలా మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. మాటల్లో చెప్పలేని పైశాచిక, వికృత హింసని ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటున్నారు.
ఇవి ఏవీ కూడా- అగ్రకులాలని రోహిత్వేముల ఆత్మ‘హత్య’ కదిలించినంతగా కదిలించలేదు. కారణం– ఆ ఉత్తరంలో ప్రతిఫలించిన అతని మేథస్సు, అంతకంటే ముఖ్య కారణం– రోహిత్తన చివరి లేఖలో ఎవరీనీ తన చావుకు బాధ్యుల్ని చేయకపోవటం. విసి అప్పారావుని కానీ, దత్తాత్రేయను కానీ, స్మృతి ఇరానీని కానీ, చివరికి సుశీల్కుమార్పేరును అయినా సరే.. అతని ఉత్తరంలో రాసి ఉంటే– రోహిత్కి సవర్ణుల నుండి ఏమాత్రం మద్దతు వచ్చేదో మనం ఊహించగలిగేదే.
ఈ కథలో కూడా సరిగ్గా ఇదే ప్రతిధ్వనించింది. ఇందులో నాయకుడు సినిమా హీరోలా డెనిమ్జీన్స్, రౌండ్నెక్టీ షర్టు వేసుకుని లైబ్రరిలోకి ఉత్సుకతతో వస్తుంటాడు. స్కాలర్షిప్డబ్బుని ఇల్లు గడపటానికి పంపిన రోహిత్ని రొమాంటిసైజ్ చేసి చూపించటంలో ఇబ్బంది ఉన్నా సరే, తప్పేం లేదు కాబట్టి ఏమీ అనలేం. కానీ కథ చివర్లో.. రోహిత్ చనిపోటానికి వెళ్తున్నప్పుడు.. భారతి అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. వారి మధ్య జరిగిన సంభాషణలో.. మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఆమె అడుగుతుంది.
మొదటిది– ‘బర్త్ సర్టిఫికెట్నుండి కులం తీసేస్తే..?’ అని. ‘దాని వల్ల ఉపయోగం లేదు, మనుషుల మనసుల్లో నుండి కులం పోవాలి’ అని అతను సమాధానం ఇస్తాడు.
సర్టిఫికెట్ల నుండి కులం తీసేయటం అనేది కథలోనే కాదు.. బయట ఉన్న చాలా మంది ‘మంచి’ సవర్ణులు కుల నిర్మూలన కోసం చెప్పే ఒక చిట్కా. ‘నీకు చొక్కా ఉంది, నాకు చొక్కా లేదు కాబట్టి, మనం ఇక చొక్కా గురించి మాట్లాడుకోవద్దు’ అన్నట్టు ఉంటుంది ఈ మాట.
సర్టిఫికెట్లలో కులం ఉండేదే, కుల నిర్మూలన దిశగా ఒక అడుగు అనే అవగాహన ఉండదు. ఈ కథలో భారతి కూడా అమాయకంగా అలాగే అడిగింది. ఆమె అలా అడగటం పట్ల నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ భారతి సోకాల్డ్ అగ్రకుల ‘భారతమాత’లా చిత్రీకరించారు కాబట్టి ఆమె అలా అడగటం సహజమే.
కానీ.. రోహిత్తో చెప్పించిన సమాధానం.. అసలు సమస్య. నీరు ఆవిరి అయినంత సహజంగా, మనుషుల మనసుల్లో నుండి పోయేదా కులం? దీన్ని అంగీకరిస్తే.. స్త్రీ రిజర్వేషన్లు, సమాన వేతనాలు, నియమిత పనిగంటలు.. అసలు ఒకటేంటి.. దేని గురించి ఎవరు ప్రశ్నించినా.. సరే, రోడ్డు మీదకొచ్చినా సరే.. ముందు మనుషులు మారాలి అని ఒక తాత్విక స్టేట్మెంట్ఇస్తే సరిపోతుంది. ఈ మనషులు మారాలి, మనసు తేటపడాలిలాంటి మాటలు.. వ్యక్తిని కార్యాచరణ నుండి దూరం చేసే మాటలు. హ్యూమన్డిగ్నిటి, గౌరవం లేకపోవటం.. అనే రెండు హార్డ్రియాలిటిస్కి.. ‘మనసుల్లో నుండి పోవాలి’ అనే ఒక అభౌతికమైన సమాధానం చెప్పటం న్యాయమా? పైగా ఈ మాట అనిపిస్తోంది.. ‘బర్త్ సర్టిఫికెట్నుండి కులం తీసేస్తే..?’ అనే భావజలం మీద సంవత్సరాలు పొరాడిన ఒక ఫైటర్అయిన రోహిత్తో! అదే అసలు సమస్య.
‘మనస్సు నుండి కులం పోవాలి’ అని సాధారణంగా ఎవరు అంటారు? కుల వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, ఆధిపత్యాలు, అవకాశాలు పొందుతున్న అగ్రకులస్థులు అంటారు. కారంచేడులో, చుండూరులో దళితుల్ని నరికేసిన విషయం గుర్తు చేస్తే.. ‘ఈ కులం అనేదే పోవాలండి’ అంటారు. అంతకుదాటి, కార్యాచరణలోకి కానీ, ఆ విషయాల మీద పోరాడుతున్న వారికి సంఫీుభావం తెలపటంలోకానీ.. ముందుండరు. ఎందుకు? సవర్ణులకి అంతవరకే కన్వీనియంట్కాబట్టి. చివరికి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న మనిషిని అడిగి చూడండి.. ‘మనుషుల మనసుల్లో నుండి కులం పోవాలి’ అని చక్కగా ఒప్పేసుకుంటాడు. కులం ఎలా పోవాలి? కులనిర్మూలనకి మనం చేయాల్సిన పని ఏంటి? కార్యాచరణ ఏంటి? లాంటి సీరియస్ప్రశ్నల జోలికి వెళ్తే.. ఆ మనిషి ‘గాయబ్’. అనుమానం ఉంటే.. ‘మంచి సవర్ణుల’ మీద టెస్ట్ చేసి చూడండి.
మనుషుల మనస్సులో నుండి కులం పోవాలి అని ఏ పాత్రతో అయినా, చెప్పిచ్చి ఉంటే.. అభ్యంతరం ఉండేది కాదు. కానీ.. ఈ మాట చెబుతోంది.. రోహిత్! కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన అవసరన్ని.. తెలిసి.. అంబేడ్కర్ పేరు మీద ఉన్న, ‘అంబేడ్కర్ యువజన సంఘం’ లో పని చేసిన రోహిత్ అంటాడు! వెలివేత అనే అబ్సోల్యూట్ రియాలిటికి గురి అయిన, ఒక కుర్రాడు అంటూన్నాడు! పైగా మామూలు కుర్రాడు కాదు.. కులనిర్మూలనా పోరాటానికి ఇప్పుడు ఒక చిహ్నంగా మారిన కుర్రాడు అంటున్నాడు!!
ఇక భారతి అడిగిన రెండో ప్రశ్న. ‘అంబేద్కర్తో ఎనిహిలేషన్ఆఫ్క్యాస్ట్స్పీచ్ని మళ్ళీ ఇప్పిస్తే.. అది విని అందరూ మారిపోతే..’ అని. అప్పుడు రోహిత్చెప్పే సమాధానం.. ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు అని. ఇది రోహిత్ సమాధానం!
కుల నిర్మూలన మీద అంబేద్కర్ఉపన్యాసాన్ని రద్దు చేసింది.. దానిలో ఉన్న కంటెంట్వల్ల. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల మూలాల్లోకి వెళ్ళి, కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించటం వల్ల. ముఖ్యంగా.. కులం పునాదుల మీద నిర్మాణం జరిగి, ఆ పునాదులు లేకపోతే రూపాన్ని కోల్పోయే హిందూ మతాన్ని వదిలేస్తాను అని అంబేద్కర్ తేల్చి చెప్పటం వల్ల. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు ఇప్పించే పరిస్థితి ఉందా అసలు. ‘దమ్ముందా?’ అని అడగటం నిజానికి సరైన ప్రశ్న. మన విద్యా పీఠాల్లో, సిలబస్నిర్దేశించే కమిటీల్లో.. ‘మంచి’ బ్రాహ్మణులు, ‘మంచి’ సవర్ణులు కాక, కుల వ్యతిరేకత ఉన్న మనుషులు ఉండి ఉంటే.. అంబేద్కర్కి మంచి నీళ్ళివ్వని జాలి కధ బదులు.. ‘కుల నిర్మూలన’ పాఠ్యాంశం అయి ఉండేది. ‘ఇది’ కథలోని భారతికి కూడా అవగాహన లేదు కాబట్టి.. పాపం సాదా సీదాగా, ఏం కుట్రకుతంత్రం లేకుండా.. ఈ ప్రశ్న అడిగింది అనుకోవచ్చు.
ఇక్కడ మళ్ళీ సమస్య.. రోహిత్ తో చెప్పించిన సమాధానం. ‘ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చుండేది కాదు’. హమ్మ్. రోహిత్ని దగ్గరగా కాదు, అతని ఫేస్బుక్పోస్టుని చూసిన వారు కూడా.. ఇటువంటి సమాధానం అతను చెప్పడని చాలా ఈజీగా చెప్పేయగలరు. గాంధీ ఒక్కరి వల్లే స్వతంత్రం రాలేదు అని పోట్లాడే వాళ్ళలాగా.. ‘అంబేద్కర్ఒక్కడి వల్లే, కులం మీద అవగాహన రాలేదు. కులం ఎప్పుడు పుట్టిందో, కుల నిర్మూలన పోరాటం కూడా అప్పటి నుండే పుట్టింది’ అనే ‘లిబరల్స్’ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను.
సమసమాజాన్ని సాధించటానికి శాస్త్రీయ పద్థతిలో ఒక దారిని చెప్పింది మార్క్స్ఒక్కరే. అలాగే అంబేద్కర్కూడా ఒక్కరే. మశూచి అనే రోగం వచ్చినప్పుడే, కాల్చి వాత పెట్టటం దాని మందు.. అనే విధానం కూడా రోగ నివారణ పద్ధతిగా ఉండేది. ఆ తర్వాత తర్వాతే దానికి వ్యాక్సిన్ని కనుగొన్నారు. కులం ఏర్పడినప్పటి నుండే, కుల నిర్మూలనా పద్ధతులు ఉన్నాయి అనేది కూడా.. ఈ నాటు వైద్యం లాంటిదే. కులాన్ని ఒక శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేసి, ఆ రోగానికి మందు కుదర్చటానికి ఏం చేయాలో చెప్పింది.. అంబేద్కర్ఒక్కరే. అంబేద్కర్ని దేవుడిని చేసి, అయన విమర్శకు అతీతుడు అని నేను అనటం లేదు. కుల అసమానతలు అనేవి ఎంత లోతుగా వేళ్ళూనాయో, సమాజానికి అవెంత అపాయమో.. శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది.. అంబేద్కర్ఒక్కరే అంటున్నాను. ఆయన ఆ పని చేయబట్టి, ‘బండి’ ఇక్కడి దాకా వచ్చింది అంటున్నాను. అంబేద్కర్పట్ల అయిష్టత ఉన్న సవర్ణులు, ఆయనకి ధీటుగా చాలా మందే ఉన్నారు అని గుచ్చి గుచ్చి చెబుతుంటారు. అది నిజమే కూడా. కానీ ఒక ఎలాబరేటడ్సమాధానంలో ఉండాల్సిన విషయాన్ని, కుదించి ఒక్క మాటలో ఆయన ఒక్కరి వల్లే కాదు అని తేల్చి చెప్పటం అభ్యంతరకరం. కథ బ్రివిటి కోసమయినంత మాత్రాన.. సిద్ధాంత విషయంలో అక్షరం తూలకూడదు.
ఇక భారతి అడిగే మూడో మాట.. వేదాలు , పురాణా ల మూలాల్లోకి వెళ్తాను అని. ‘కులనిర్మూలన’ అధ్యయనం చేసి ఉంటే, మూడో మాట వచ్చేదే కాదు. వేదాలు, పురాణాల విషయాల్ని అంబేద్కర్కూలంకషంగా ‘కులనిర్మూన’లో చర్చించాడు.
చివర్లో.. ఈ కథకి ఇది ముగింపు కాదు అని భారతి, చనిపోటానికి వెళ్తున్న రోహిత్తో అంటే.. ‘నాది కథ కాదు, జీవితం’ అంటాడు. డెభ్భైు, ఎనభై దశకాల్లో అన్యాయానికి గురి అయిన సినిమా హీరోయిన్డైలాగ్లా ఉంది ఈ మాట.
ఒక మనిషిని.. తింటానికి తిండి, ఉంటానికి చోటు లేకుండా చేసి.. అనాగరికంగా వెలివేసి.. ఊపిరి ఆడనీయకుండా చేసి.. రక్తం అంటకుండా చేసిన హత్య ఇది. ఆత్మహత్య రూపంలో జరిగిన ఇన్స్టిట్యూషనల్మర్డర్అని అంతర్జాతీయంగా అందరూ మొత్తుకుంటోంది.. ఇందుకే. క్రైమ్ని గుర్తించాలని. కానీ.. ఈ కథలో ఆ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అన్యాయాన్ని.. ఎస్టాబ్లిష్చేయకుండానే.. రోహిత్పేలవంగా, ఏ కులానికి నొప్పి కలిగించని డైలాగులు చెప్పి ‘వెళ్ళిపోయాడు’! కానీ.. వాస్తవంలో రోహిత్అలా లేడు. పోరాటం చేశాడు. ఖాళీ కడుపుతో ఆ యూనివర్సిటి నేల మీద పడుకుని.. ఆకాశం చూస్తూ.. ఆ దుర్మార్గాన్ని ఎదుర్కొన్నాడు. అగ్రకుల ఆధిపత్యాన్ని కాలరు పట్టుకుని గుంజి మరీ, అడిగాడు. చివరి అస్త్రంగా, తన శరీరాన్ని వాడాడు.
రోహిత్బతికి ఉండి.. ఈ పోరాటాన్ని చేసుంటే.. సవర్ణుల నుండి ఇంతటి మద్దతు వచ్చేది కాదు. ఈ కథలో కూడా మనసుల్లో నుండి కులం పోవాలి అని కాకుండా, కాస్త గట్టిగా.. కాస్తంత గట్టిగా.. ‘నువ్వు నా సమానత్వం గుర్తించటం లేదు కాబట్టి.. అనో.. నువ్వే నా హత్యకు బాధ్యుడివి అనో.. ’ ఇలాంటి ఫీలింగ్ఏమన్నా.. పాఠకునికి తగిలి ఉంటే.. ఈ కథని.. అచ్చొచ్చొ అని అంతమంది అగ్రకులం వాళ్ళు నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు.
కులం అనేది జలగలా ఎలా రక్తాన్ని పీలుస్తుందో తెలిస్తే చాదు.. చందమామ కథల్లో దెయ్యాల మాదిరి ఎన్ని మారు వేషాల్లో రాగలదో.. ఎంత సోఫిస్టికేటడ్లెవల్స్లో పని చేయగలదో.. గుర్తించగలగాలి. ఈ సమస్యని గుర్తించకపోటమే పెద్ద సమస్య. కులం మీద పోరాటం ఎంత కన్వీనియంట్గా ఉంటే సవర్ణులు అంత ఎక్కువ గుర్తిస్తారు. ఇష్టపడతారు. ఈ కథలో అదే జరిగింది. రోహిత్ మీద కథ వచ్చిన ఆనందం లో .. రోహిత్ నోట అగ్రకుల భావజాలన్ని చెప్పించటాన్ని.. నిర్లక్ష్యం చేయకుడదు. ఇది రోహిత్విషయంలో ఒక సింపతి కలిగిన కథ మాత్రమే. రోహిత్మీదా , అతను ఎదుర్కొన్న సవాళ్ళ మీద, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అంశాల మీదా.. ఎంపతి కాని, రెప్రజంటేషన్ కాని కలిగిన కథ కాదు. దళితులు, దళిత సాహిత్యము.. సింపతి కోరుకోటాన్ని దశాబ్దాల క్రితమె దాటారు. ఇప్పుడు సమానాత్వాన్ని గుర్తించమని అడగటం అనే పరిధిని కూడా దాటి సమానాత్వాన్ని అంగీకరించమని చెప్పే స్థాయికి వచ్చారని సాహిత్యకారులు అర్ధం చేసుకోవాలి.
– చైతన్య పింగళి
*
(చిత్రాలు: అన్వర్ – సాక్షి సౌజన్యంతో)
తాజా కామెంట్లు