‘పడగ’ల స్తబ్ధతా, ‘విండ్’ చలనమూ !


సాహిత్యంలో దృక్పథాలు రెలెవెన్స్-11

 వేయిపడగలలో ధర్మారావు ముఖంగా అతిమానుష, మానుష ప్రపంచాల మధ్య తారతమ్య వివేచన నవల పొడవునా జరుగుతూనే ఉండడం గురించి చెప్పుకున్నాం. అరుంధతినీ, కిరీటి భార్య శశిరేఖనూ కూడా అబ్బురపరచిన అతిమానుషజగత్తు అది. దేవదాసిని చూసినప్పుడు, “తానొక కల్పితజగత్తున, అమానుషప్రపంచమున  తిరుగాడుచున్నట్లు”; “ఈ సంవిధానమే చిత్రముగా నున్నట్టు” శశిరేఖకు అనిపిస్తుంది. అలాగే, కావ్యజగత్తే యథార్థమైన జగత్తు అనీ, అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావాలు కలిగిన మనమే కల్పిత జగత్తు అనీ ధర్మారావు అనుకోవడం గురించీ, దివ్యజగత్తు నుంచి భౌమజగత్తులోకి రావడంలో అతను ఎదుర్కొనే క్లేశం గురించి కూడా చెప్పుకున్నాం.

ఈ అతిమానుష, మానుష జగత్తులను; అవాస్తవిక, వాస్తవికజగత్తులుగా అనువదించుకుంటే ధర్మారావు పొందే క్లేశం వాస్తవికతను ఎదుర్కోవడంలోనే. శిల్పంలోనూ, కవిత్వంలోనూ కూడా వస్తుస్వరూపాన్ని “యథాప్రాప్తం”గా చిత్రించ కూడదని అతను అనుకుంటాడు. అతని ఆలోచనలు ఇంకా ఇలా ఉంటాయి:

లోకమునందలి వస్తువు బహుదోషభూయిష్ఠముగా నుండును. దాని నుండి దోషమును తీసివేసి దాని ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించవలయును. దోషమును పరిహరించుట రెండు విధములు. ఒకటి లోకమునందలి ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించుట, రెండవది, కొన్ని సమయములు, సంప్రదాయములు సృష్టించి తదనుగుణముగా శిల్పమును చిత్రించుట. మొదటిదాని కన్న రెండవది ఉత్కృష్టమైనది. పాశ్చాత్యశిల్పము మొదటి మార్గము ననుసరించును…వారి చిత్రము లన్నింటికి మాతృకలుండును…భారతదేశశిల్పి శిల్పము చక్షుర్విషయమున కన్న యెక్కువ మనోవిషయమగుచున్నది. పాశ్చాత్యశిల్పమునందు మనము చూచు బొమ్మ గొప్ప సౌందర్యము కలిగియుండును. అది మన నేత్రానందకరము. భారతశిల్పము నందలి చిత్రము పూర్తిగా మనోవిషయము…ఎన్ని చూచినను భారతశిల్పము యొక్క యుత్కృష్టత అవివాదాంశము.

రవివర్మచిత్రాల గురించి ఇలా అంటాడు:

రవివర్మ శిల్పము పాశ్చాత్యమార్గము ననుసరించును. అందులో కూడా చాలా తక్కువరకముది…ఇట్టి చిత్రములు వ్యాప్తి పొందుట చేత లోకమున జనులకు పూర్వ సంప్రదాయములయు, పూర్వ మహాపురుషుల స్త్రీల యథార్థతత్త్వము యొక్కయు జ్ఞానము లేక చెడిపోవుచున్నారు. పైగా వీనియందు సౌందర్యజ్ఞానము కలుగుటలేదు. మనస్సును స్పృశించుటలేదు సరికదా, నేత్రము యొక్క నైశిత్యమును కూడ తాకుట లేదు…ఇప్పటి యీ గ్రామఫోన్ల ప్లేట్ల సంగీతము వలెనే యిట్టి బొమ్మలును మనదేశమునందలి జ్ఞానమునకు వేరుపుర్వు లగుచున్నవి.

వాస్తవికతను నిరాకరించి, అవాస్తవికతను నిర్మించాలని చెప్పడమే ఇది. దీనిని శిల్పానికీ, సాహిత్యానికే కాక సంఘానికీ  ఆపాదిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించగలం. యథాప్రాప్తంగా కాకుండా దోషాన్ని పరిహరించి ఉత్కృష్టాన్నే స్వీకరించడమంటే, వాస్తవిక ప్రపంచంలోని వైరుధ్యాలను మరుగుపుచ్చి సాహిత్యానికి, సాహిత్యకారుడికీ ఉపదేశక స్థానాన్ని కల్పించడమే. అదలా ఉంచితే పాశ్చాత్యంలో కానీ, మన దగ్గర కానీ సాహిత్యం వాస్తవిక జీవన ప్రతిబింబం కావడం వెనుక చాలా చరిత్రే ఉంది. అందులోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు.

గాన్ విత్ ద విండ్ కు వస్తే, వాస్తవికత గురించి యాష్లీ ఊహలు కూడా అచ్చం ధర్మారావు ఊహల్లానే ఉంటాయి. అతను కూడా వాస్తవికతను ఎదుర్కోడంలో క్లేశానీకీ, భయానికీ లోనవుతాడు. “దేనికి భయపడుతున్నా”వని స్కార్లెట్ అడిగినప్పుడు అతని సమాధానం ఇలా ఉంటుంది:

ఓహ్, నామరహితమైన అనేకవాటి గురించి. మాటల్లోకి మార్చితే అర్థరహితంగా ధ్వనించే వాటి గురించి. జీవితం హఠాత్తుగా మరీ వాస్తవికం అయిపోవడం, జీవితం గురించిన అల్ప వాస్తవాలతో కూడా మరీ వ్యక్తిగత సంబంధం కలగడం గురించి.  ఇక్కడ బురదలో నిలబడి కట్టెలు కొట్టవలసివచ్చినందుకు నేను బాధపడడంలేదు. ఇది దేనిని సంకేతిస్తోందో దానిని తలచుకుని బాధపడుతున్నాను. నేను అమితంగా ప్రేమించిన పాతజీవితంలోని సౌందర్యాన్ని కోల్పోయినందుకు కుంగిపోతున్నాను. యుద్ధానికి ముందు జీవితం ఎంతో అందంగా ఉండేది. గ్రీకుకళలోలా అందులో ఒక ఆకర్షణ, పరిపూర్ణత, సమగ్రత, సౌష్టవం ఉండేవి. అందరికీ అలా అనిపించకపోవచ్చు. ఆ తేడా కూడా ఇప్పుడే అర్థమవుతోంది. నాకు మాత్రం ట్వెల్వ్ ఓక్స్ లో జీవించడంలోనే నిజమైన అందం ఉంది. నేనా జీవితానికి చెందినవాణ్ణి. అందులో భాగాన్ని. ఇప్పుడు అదంతా గతించిపోయింది, ఈ కొత్త జీవితంలో నేను ఇమడను. అందుకే భయపడుతున్నాను. పాత జీవితంలో ఛాయామాత్రంగా లేని ప్రతిదానికీ; మరీ వాస్తవికంగా, మరీ జీవశక్తితో కనిపించే మనుషులకు, పరిస్థితులకు దూరంగా ఉండేవాణ్ణి. నా జీవితంలోకి అలాంటి మనుషులు, పరిస్థితుల చొరబడితే కోపం వచ్చేది. అందుకే నిన్ను కూడా దూరంగా ఉంచాను. కారణం, నీలోనూ జీవశక్తి పొంగి పొర్లుతూ మరీ వాస్తవికంగా కనిపిస్తావు. నీడలనూ, స్వాప్నికతనూ ప్రేమించే పిరికివాణ్ణి నేను… యుద్ధం వచ్చి పడకపోతే, ట్వెల్వ్ ఓక్స్ లోనే పాతుకుపోయి, జీవితంలో భాగం కాకుండానే దాని గమనాన్ని సాక్షిమాత్రంగా దర్శిస్తూ సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేసేవాణ్ణి.

విచిత్రం ఏమిటంటే, యాష్లీకి ట్వెల్వ్ ఓక్స్ ఎలాగో; ధర్మారావుకు సుబ్బన్నపేట అలాగ.  చదువుకోసమనో, మరొకందుకనో మధ్య మధ్య అతను వేరే ఊళ్ళకు వెళ్ళి వచ్చినా ప్రధానంగా సుబ్బన్నపేటకే అతుక్కుపోతాడు. అక్కడి జీవితమే తనకు ఇష్టమని ఒకటి రెండు సందర్భాలలో అంటాడు కూడా. అతని అతిమానుషజగత్తుకు చెందిన ప్రణాళికను అమలు చేయడానికి ఉద్దేశించిన కార్యక్షేత్రం కూడా సుబ్బన్నపేటే.

అయితే, ఇద్దరి జీవనపరిస్థితులు, అనుభవాలు, ఊహల మధ్య పెద్ద తేడా తెచ్చిపెట్టింది, యుద్ధం! ఇదో చిత్రమైన వాస్తవం. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ యుద్ధం మనిషి అనుభవంలో, ఆలోచనల్లో, తద్వారా జీవితంలో తీసుకు వచ్చే మార్పు బహుముఖంగా ఉంటుంది. అది శతాబ్దాల స్తబ్ధతను వదలగొట్టి మనిషిని క్రియాశీలిని చేస్తుంది. మనిషిలోని మానవత్వాన్నీ, రాక్షసత్వాన్నీ కూడా ఆవిష్కరిస్తూ అంతిమంగా మనిషితనానికి ఒక పెద్ద పరీక్షాఘట్టం అవుతుంది. అంతవరకు ఆకాశవిహారం చేయించే అందమైన కాల్పనిక ఊహలనుంచీ, స్వాప్నికతనుంచీ మనిషిని హఠాత్తుగా కఠోరవాస్తవాల భూమార్గం పట్టిస్తుంది.

యాష్లీ ఇంకా ఇలా అంటాడు:

యుద్ధం రాగానే, జీవితం తాలూకు వాస్తవికత నాలోకి చొచ్చుకువచ్చింది. నీకు గుర్తుండే ఉంటుంది, మొదటిసారి నేను యుద్ధంలోకి దిగింది బుల్ రన్ దగ్గర. నా బాల్యస్నేహితులు తునాతునకలవుతున్న దృశ్యాన్ని అప్పుడు చూశాను. మృత్యుముఖంలో ఉన్న గుర్రాలు పెట్టే సకిలింపులు విన్నాను. నేను జరిపిన కాల్పులలో  అవతలిపక్క మనుషులు రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోతున్నప్పుడు కలిగే హృదయవిదారకమైన, దారుణమైన అనుభూతిని చవిచూశాను.  అయితే నావరకు యుద్ధం తాలూకు దారుణాలు ఇవి కావు; నేను జనాల మధ్య జీవించవలసి రావడం!

నేను అంతవరకు జనానికి దూరంగా నాదైన గూడులో ఉండిపోయాను. నా మిత్రులు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్న అతి కొద్దిమంది. కానీ, కొందరు స్వాప్నికులతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నానన్నఎరుకను యుద్ధం  కలిగించింది. నా భార్యాపిల్లలను పోషించుకోవాలంటే, నాతో ఎలాంటి సాదృశ్యం లేని మనుషుల ప్రపంచంలో నేను జీవించక తప్పదన్న సంగతి ఇప్పుడు నాకు తెలిసివచ్చింది. నువ్వు వేరు, జీవితంతో ముఖాముఖి తలపడుతూ దానిని నీ ఇష్టానుసారం వంచడానికి పూనుకున్నావు. కానీ ఈ ప్రపంచంలో నేను ఎక్కడ ఇమడగలను? అందుకే భయపడుతున్నాను…నాదైన చిన్న ఆంతరిక ప్రపంచం అంతరించిపోయింది. నా ఆలోచనలతో ఎలాంటి సారూప్యతా లేనివారు, భిన్నమైన కార్యాచరణతో నాకు హాటెన్ టోట్లలా విజాతీయుల్లా తోచేవారు దానిని దురాక్రమించుకున్నారు. బురద కాళ్లతో నా ప్రపంచాన్ని తొక్కేశారు. నేనిప్పుడు తలదాచుకుందుకు చోటేదీ మిగల్లేదు.

ఇలాంటి యాష్లీ మాటల్లో ధర్మారావు ఊహల ప్రతిఫలనానికి మరిన్ని ఉదాహరణలు ఇచ్చుకోనవసరం లేదు. ఇద్దరూ మార్పుతో రాజీపడలేని, మార్పును జీర్ణించుకోలేనివారే.  అంతటి యుద్ధం కూడా ఇలాంటి యాష్లీ స్వభావంలో మార్పు తేలేదు. అయితే, ఇద్దరి మధ్యా ఒక తేడా. తనకు ఎంత రుచించనిదైనా యాష్లీని యుద్ధం వాస్తవికతలోకి ప్రవేశపెట్టింది. వాస్తవికత గురించే కాక, తన గురించి కూడా కొత్త పాఠాలు నేర్పి, కొత్త ఎరుక కలిగించింది.  మారిన ప్రపంచంలో తనకు చోటు లేదనుకున్నా, అందులో ఇమిడి కాలు కూడదీసుకోడానికి శతవిధాల పోరాడుతున్న స్కార్లెట్ లాంటి వ్యక్తులపట్ల యుద్ధం అతనిలో ప్రశంసను, సానుభూతిని రేకెత్తించింది. దృష్టి వైశాల్యాన్ని పెంచింది. తనను ప్రేమిస్తున్నానని చెప్పమని స్కార్లెట్ అడిగినప్పుడు, “అవును, నీ సాహసాన్ని, దృఢసంకల్పాన్ని, నీలోని జ్వాలనూ, నిర్దాక్షిణ్యతను ప్రేమిస్తున్నా”నని యాష్లీ అంటాడు. “ప్రేమించడానికి, పోరాడడానికీ  నాకేమీ మిగల్లే”దని స్కార్లెట్ అన్నప్పుడు;  తారాకు పూర్వవైభవం తెచ్చి పెట్టే పని ఒకటి మిగిలిందని సంకేతిస్తూ, కిందికి వంగి ఎర్రటి మట్టి తీసి ఆమె చేతిలో పెడతాడు.

లోకజ్ఞానాన్ని మించి, యాష్లీలో యుద్ధం కలిగించినది స్వస్వరూపజ్ఞానం. మారిన పరిస్థితులలో నీడలను, స్వాప్నికతను అంటిపెట్టుకుని ఉండడం పిరికితనం అనుకుంటాడు.  కొత్త ప్రపంచంలో తను ఇమడలేకపోవచ్చు కానీ, అందులో చోటుకోసం పెనుగులాడుతున్న వ్యక్తులపై ఇప్పుడతనికి నిరసన, తృణీకారభావం, నిషేధబుద్ధి లేవు. లోకాన్ని అదేపనిగా ఆడిపోసుకోవడంలేదు. గత, వర్తమాన జీవితాలను శ్రేష్టతా, సామాన్యతల తాసులో తూచి శ్రేష్టజీవితం కోసం కలలు కనడం లేదు. ఆత్మోత్కర్షలేదు. యుద్ధానికి ముందు అలాంటివి ఏమాత్రమైనా ఉన్నా, యుద్ధం తర్వాత  అంతరించిపోయాయి.

ధర్మారావులో మాత్రం ఇవన్నీ ఉన్నాయి. కారణం, అతని వెనుక యుద్ధం లేదు, యుద్ధం కలిగించే అనుభవమూ, స్వస్వరూప జ్ఞానమూ, దృష్టి వైశాల్యమూ, మార్పులతో రాజీపడే, సర్దుకునే వ్యక్తులపట్ల సానుభూతీ లేవు. యాష్లీకి ఉన్నట్టు పెద్ద కుదుపుతోపాటు అనూహ్యమైన చలనశీలతను తెచ్చే యుద్ధ నేపథ్యంలేని స్థితిలో ధర్మారావుకు నిలబడి ఉన్న లౌకిక ప్రపంచం, సాపేక్షంగా స్తబ్ధ ప్రపంచం. ఎక్కువ కాలవ్యవధిలో చాప కింద నీరులా వ్యాపించే మార్పులతో  ధర్మారావు ఊహలోని గతవైభవ జీవితాన్ని లోపలినుంచి శిథిలం చేస్తున్న ప్రపంచం. ఈ మార్పుల దీర్ఘ కాలవ్యవధి, ధర్మారావు ఊహాశాలితను భూమార్గం పట్టించేబదులు మరింతగా అతిమానుష, కాల్పనిక జగత్తువైపు నడిపించి, లౌకికంగా అతన్ని నిష్క్రియుడిగా, నిస్సహాయుడిగా, నిర్వేదిగా మిగిల్చింది. గతవైభవోద్ధరణకు ఉద్దేశించిన అతని కార్యాచరణ ప్రణాళికా అతిమానుషమే, కాల్పనికమే. అది, ఇంద్రియ మనోనిగ్రహాల ద్వారా భక్తి జ్ఞానాలను పొందడం! సుబ్బన్నపేటలోని దేవాలయవ్యవస్థ అందుకు కార్యక్షేత్రం. గిరిక, గణాచారి, హరప్ప, అరుంధతి లాంటివారు కార్యకర్తలు.

యుద్ధానుభవం లేదా సాంస్కృతిక పునరుజ్జీవనానుభవం ఉండడం, లేకపోవడం అనేది పాశ్చాత్య, భారతీయ సామాజిక, సాంస్కృతిక, సాహిత్యక, తాత్వికతల తారతమ్య పరిశీలనకు ఒక ముఖ్య కొలమానం. ఆ స్పృహ వేయిపడగల రచయితలోనే కాదు, ఆ భావజాలానికి చెందిన చాలామందిలో లేదు. దాని ఫలితం బహురూపాలలో కనిపిస్తుంది. అన్నింటిలోనూ ఉభయుల మధ్య ఉన్న తేడాలు స్థిరమైనవనీ, స్వాభావికమైనవనీ, మౌలికమైనవనే నిర్ధారణ వాటిలో ఒకటి. వేయిపడగల రచయిత ధర్మారావు ముఖంగా వ్యక్తీకరించిన అనేక నిర్ధారణలు అలాగే ఉంటాయి. ఒకచోట ఇలా అంటాడు:

పాశ్చాత్యలోకము తన సంఘము ప్రతినిమేష పరివర్తనములచేత గగ్గోలు పడుచున్నది. అనియత భావములు జలపాతమువలె నిలిచి ప్రవహించలేక, యూర్థ్వ తిర్య గధో ముహుస్తాడనములచేత ఘూర్ణిళ్లిపోవుచున్నది. సిద్ధాంతమేదో తెలియదు. ఆదర్శమేదో తెలియదు. ఒక నిలుకడకు రాని, వచ్చుటకు వీలు లేకుండ తనే చేసుకొనిన పరిస్థితుల నుండి బహుళసమస్యలు పెంచుకుని, తత్సమస్యాపరిష్కారము కొరకు వేవిధముల వాఙ్మయమును వినియోగించుచున్నది. అది యంతయు సారస్వతమేనా?

పాశ్చాత్యలోకం పైన చెప్పిన విధంగా ఉండడానికి కీ ఎక్కుడుందన్న పరిశీలన వేయిపడగల రచయితలో లేదు. సాంస్కృతిక పునరుజ్జీవనం రూపంలో పెద్ద కదలిక వచ్చిన సమాజం అది. ఆ తర్వాత రెండు ప్రపంచయుద్ధాలను చూసింది(వేయిపడగల రచనా కాలానికి మొదటి ప్రపంచయుద్ధమే జరిగింది). ఆ విధంగా రకరకాల పరివర్తనలకు పాశ్చాత్యలోకం ప్రపంచప్రయోగశాల అయింది. మంచీ-చెడూ కలగలసిన పరివర్తనలు అవి. ఈ పరిణామాన్ని స్తబ్ధతా-చలనాల దృష్టికోణం నుంచి చూసినప్పుడు వేటి ప్రాధాన్యం వాటికుంది. కానీ వేయిపడగల రచయిత స్తబ్ధతను, నిలకడను గొప్ప గుణంగా చూపిస్తున్నాడు. స్తబ్ధతను ప్రేమించే దృక్పథం కాలాన్నీ, చరిత్రనూ, సారస్వతాన్నే కాక, సమస్తాన్ని స్టాణువుగానే చూస్తుంది. “మహార్థవంతమైనది నశించిపోవుటయు, అల్పప్రయోజనము లైనవి విజృంభించుటయు యీ నాటి సృష్టిపరిణామములోని యొక భాగము…ఒక నిమేషమాత్రమున్న మార్పు నిమేషజీవితులకు దీర్ఘముగానే కనిపించును. అనంతమైన కాలమున దీర్ఘ హ్రస్వత లెక్కడ?” అని ఒకచోట ధర్మారావు అంటాడు. ఈ నాటి సృష్టిపరిణామమే ఇలా ఉందనీ, ఒకప్పటి సృష్టి పరిణామం ఇలా లేదనే ఒక అతార్కిక ఊహను మొదటివాక్యం వెల్లడిస్తే, రెండో వాక్యం అనంతమైన కాలంలో మార్పు నిమేషమాత్రమే నంటూ మార్పు లేకుండా ఉండడమే కాలానికి గల అసలు స్వభావమని ధ్వనింపజేస్తోంది.

దేవీ దేవతలు, మతవిశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన అనేకాంశాలలో పాశ్చాత్య, భారతీయ సమాజాల మధ్య ఉన్న తేడాలు స్వాభావికమైనవీ, మౌలికమైనవీ కావనీ; క్రీస్తు పూర్వ ప్రపంచంలో పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతా ఈ విషయాలలో దాదాపు ఒకేవిధమైన అనుభవాన్ని పంచుకుందనీ సారంగలోనే వెలువడిన నా పురాగమన వ్యాసాలలో సోదాహరణంగా చూపించాను.

అదలా ఉంచితే, వేయిపడగలను, గాన్ విత్ ద విండ్ ను పక్క పక్కన పెట్టి పరిశీలించినప్పుడు; వేయిపడగలకు గాన్ విత్ ద విండ్ ఒక సమాధానమనీ, యుద్ధానుభవం ద్వారా, వేయిపడగల ఇతివృత్తానికి లేని ఒక సంపూర్ణతను, సమగ్రతను అది పొందగలిగిందనీ, వేయిపడగల రచయిత ధర్మారావును నాయకుణ్ణి చేసి పట్టం కడితే; గాన్ విత్ ద విండ్ రచయిత్రి ధర్మారావు ప్రతిబింబమైన యాష్లీ నిరాకరించి మార్పుకు పట్టం కట్టడమే లక్ష్యంగా తన నవలను నడిపించిందనే భావన కలుగుతుంది.

(ఈ భాగాన్నిఇక్కడితో సశేషం చేసి సారంగను చూడబోతే ఇక సెలవు’, ‘ఇదే సారంగ చివరి సంచిక అంటూ సంపాదకవర్గం చేసిన పిడుగుపాటులాంటి ప్రకటన. సారంగ లాంటి పత్రిక ఆగడం సాహిత్యవిజ్ఞానప్రేమికులందరికీ  బాధాకరపరిణామం. ఇది తాత్కాలికం కావాలనే అందరిలా నేనూ కోరుకుంటున్నాను. నా పురాగమన వ్యాసాలు, ఈ వ్యాసాలతోపాటు వివిధ ఇతర వ్యాసాలను కూడా ప్రచురించిన అఫ్సర్, కల్పనగార్లకు కృతజ్ఞతలు.

ఈ పరిణామం కారణంగా ఈ వ్యాసపరంపర ఇక్కడ అర్థాంతరంగా ఆగిపోక తప్పడంలేదు. మరోచోట పునః ప్రారంభమవు తుందేమో నన్నది ప్రస్తుతానికి ఆశాభావం. -కల్లూరి భాస్కరం)

 

 

 

 

యాష్ లీలో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు

సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-10

 

‘వేయిపడగలు’, ‘గాన్ విత్ ద విండ్’-రెండూ వెయ్యి పేజీలు దాటిన బృహన్నవలలు.  తీరా వాటి మధ్య పోలికలు, తేడాలలోకి తొంగి చూడబోతే అదీ అంత భారీగానూ మారేలా కనిపించింది. కనుక వీలైనంతవరకు సంక్షేపించక తప్పదు.

రెండు రచనలూ చిత్రించినది ఒకానొక వ్యవస్థాపతనాన్నే, అయినా మళ్ళీ రెండు వ్యవస్థల మధ్యా తేడా ఉంది. స్థూలంగా చెబితే, వేయిపడగల వ్యవస్థ కాలికంగా ఎక్కువ నిడివీ, లోతు, ఘనీభావస్థితీ కలిగినదైతే; గాన్ విత్ ద విండ్ చిత్రించిన వ్యవస్థకు అంత కాలికమైన నిడివీ, లోతూ లేవు. మధ్యయుగాలనాటి వేయ్యేళ్ళ అంధచరిత్రనుంచి యూరప్ బయటపడి, పునరుజ్జీవన రూపంలో తెచ్చుకున్న అసాధారణ క్రియాశీలత అమెరికాలోకి ప్రసరించిన పరిణామంలో భాగమే గాన్ విత్ ద విండ్ లోని కులీన సమాజం. యూరప్ లో జరిగినట్టు, వేయిపడగల వర్ణ సమాజపు, లేదా ఆ వర్ణసమాజం గురించిన ఊహల తాలూకు పునాదులను కదిలించి పెద్ద ఎత్తున క్రియాశీలం చేయగల, పునరుజ్జీవనంతో పోల్చగల పరిణామం భారతదేశంలో ఆధునికకాలంవరకూ లేదు. లేకపోగా ఆ స్తబ్ధతను, ఘనీభవ స్థితిని, క్రియాశీల, పోరాటరాహిత్యాలను తాత్వికీకరించి ఘనంగా కీర్తించడం ఉంది. వేయిపడగల రచయిత ఒకచోట ఇలా అంటాడు:

ఆమె(జమీందారు రంగారావు పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని) యొక స్వతంత్రదేశమున పుట్టినది. అచ్చటి మరియాదలకు అలవాటులకు పరదేశములవారు వచ్చి భిన్నముగా నడచినచో ఆమె మనస్సు చాలా బాధపడి యుండును. కాని తన యీ భిన్నప్రవర్తన యిచ్చటి దేశప్రజలకు బాధ కలిగించునని యామెకు యూహయే కలుగలేదు. కలుగవలసిన అవసరము లేదు.

ఈ దేశప్రజలు వచ్చిన కష్టములు దైవికములని వాని నోర్పుతో సహింతురు. తమ కిష్టము లేమి సూచించరు. ఒక విషయమున, ఒక కార్యాచరణమున, తమ యిష్టము లేమిని ప్రతిఘటించి తెలుపుట, శశిని పుట్టిన దేశమున ప్రధాన ధర్మము. తత్ప్రకృతులకు ప్రతిఘటించకపోవుట అంగీకారము క్రిందనే లెక్క!

మొదటి వాక్యాలలో అశక్తతనుంచి పుట్టే ఆక్రోశమూ, నిష్టురత్వమూ వ్యక్తమవుతుంటే; రెండో వాక్యాలు అశక్తతను తాత్వికీకరిస్తూ ప్రతిఘటనలేమిని గుణంగా, ఘనంగా చూపిస్తున్నాయి. ఇది అశక్తతను, అది కలిగించే న్యూనతను ఆధిక్యంగా చిత్రించుకునే ప్రయత్నం.

ఈ అశక్తతకుగల పర్యవసానాలలో ఒకటి రాజీపడడం. మరోచోట మంగమ్మ అనే పాత్రతో వేయిపడగల రచయిత ఇలా అనిపిస్తాడు:

సంఘములో కాని, మతములో కాని, మరొకదానిలో కానీ మీ రెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము.

సంఘంలోకానీ, మతంలో కానీ మీరు ఎన్ని మార్పులైనా తేవచ్చు ననడంలో స్పష్టంగా వ్యక్తమవుతున్నది, మార్పులతో రాజీపడడమే. అయితే, ఆ మార్పులు ‘ఇంద్రియ, మనోనిగ్రహాలు; తద్వారా భక్తి, జ్ఞానాలు’ కలిగించేవిగా ఉండాలని షరతు పెడుతున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ‘నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు సకల సంపదలూ సాధించుకు రావా’లని పాతాళభైరవి సినిమాలో నిరుపేద అయిన తోటరాముడికి రాజు షరతు పెడతాడు. తోటరాముడు నేపాళ మాంత్రికుని జయించి పాతాళభైరవిని మెప్పించి సంపదలతో తిరిగి వచ్చాడంటే అది సినిమా! నిజ జీవితం సినిమా కాదు. భక్తి, జ్ఞానాల సంగతి దేవుడెరుగు; ఇంద్రియ, మనోనిగ్రహాలనే మెట్లు ఎక్కడమే రచయిత చెప్పినంత తేలిక కాదు. అమాయకత్వమనాలో మరేమనాలో తెలియదు కానీ; లౌకిక ప్రాతిపదికపై నడిచే సంఘానికి రచయిత అలౌకికమైన, ఆధ్యాత్మికమైన సిలబస్ విధిస్తున్నాడు!

విధించడమే కాదు, వేయిపడగల రచయిత గిరిక, ధర్మారావు, హరప్పల ద్వారా భక్తి, జ్ఞాన, కర్మమార్గాలనే సిలబస్ ను అమలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వ్యవస్థా పతనాన్ని ఆపలేకపోయింది. చివరికి అరుంధతి రూపంలో పతివ్రతాధర్మం ఒకటి మిగిలిందని ధ్వనించి సంతృప్తి ప్రకటిస్తాడు.

లౌకికంగా క్రియాశీల, పోరాటశీలతలు లోపించిన మహాస్తబ్ధతలో మన ఊహల్ని అస్పష్ట, అవ్యక్త, అధ్యాత్మిక సీమల్లోకి నడిపించి శాంతిని, సమాధానాన్ని వెతుక్కోవడమే ఇది. అలాగని లౌకికజీవితాన్నీ, వాస్తవికతనూ అంత తేలిగ్గా ఎగరగొట్టడమూ సాధ్యం కాదు. దాంతో లౌక-అలౌకికతల మధ్య అంతులేని సంఘర్షణ, సంక్లిష్టత, వైరుధ్యాలు! నిస్సహాయతను నిర్లిప్తతగా ఎంత ఉన్నతీకరించుకున్నా వ్యవస్థాపతనంపట్ల తప్పని దుఃఖం!

రచయిత ఆదర్శీకరించిన చాతుర్వర్ణ్యవ్యవస్థ ఆయన ఊహలో ఉన్నట్టు అచ్చంగా అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉందా అంటే, ఉండగల అవకాశమూ లేదు.  పునాదులను కదిలించి ఉపరితలంలో కీలకమైన మార్పును తేగల ఒక మహత్ పరిణామమేదీ లేకపోవడం; ఫలితంగా సుదీర్ఘకాలం వెంబడి కరడుగట్టిన భావజాలమూ, సమాజంపై దాని వక్రప్రతిఫలనమూ, ఆ రెంటి మధ్యా వైరుధ్యాలూ అలా ఉండగానే చాపకింద నీరులా పాకుతూ వచ్చిన మార్పులు; అవి ఎలాంటివో తెలుసుకుని స్పందించేలోగానే అవి జీవితంలో భాగం కావడం! వాటిపై ఏం చేయాలో తోచని నిస్సహాయత! ఇదీ వేయిపడగలు రూపు కట్టిన భారతీయసాంప్రదాయిక సమాజపతనం.

గాన్ విత్ ద విండ్ చిత్రించినది ఇందుకు భిన్నం. అందులోని కులీన సమాజం వేయిపడగల సమాజంలా తీసుకుని తీసుకుని మరణోన్ముఖమవుతున్న సమాజం కాదు. క్రియాశీలంగా మారి చావో రేవో తేల్చుకోవాలనుకుంటుంది. సాయుధ పోరాటానికి దిగుతుంది. ఓడిపోతే పోవచ్చు కానీ అందులో నాన్పుడు లేదు. వేయిపడగలకు రంగస్థలమైన సుబ్బన్నపేటలో ఆధునికమైన మార్పులు సాపేక్షంగా ఎక్కువ కాలవ్యవధిలో సంభవిస్తే; గాన్ విత్ ద విండ్ కు రంగస్థలమైన జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో అంతర్యుద్ధ పర్యవసానంగా నాలుగైదేళ్ళ వ్యవధిలో దాదాపు హఠాత్తుగా సంభవిస్తాయి. యుద్ధానికి ముందు పదివేల జనాభాతో ఒక పెద్ద గ్రామంలా ఉన్న అట్లాంటా యుద్ధకాలంలో ఎలా పెరిగిందో, యుద్ధానంతరం నగర స్థాయిని ఎలా అందుకుందో; ఆ క్రమంలో అది భౌతికంగానూ ఆత్మికంగానూ కూడా ఎలా మారిపోయిందో రచయిత్రి అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రేష్టత్వం నిండిన సాంప్రదాయిక జీవనం నుంచి జారిపోయి సామాన్యత అనే ప్రవాహంలో అది గుర్తుపట్టలేనంతగా కలసిపోతుంది.  ఒక యుద్ధం తెచ్చిపట్టే భౌతిక, మానసిక పరివర్తనకు అంతర్యుద్ధకాలపు అట్లాంటా ఒక గొప్ప నమూనా. సుబ్బన్నపేటలో వచ్చిన మార్పుల చిత్రణ కూడా  ఇంచుమించు ఇలాగే ఉంటుంది కానీ; అది కల్పిత గ్రామమైతే అట్లాంటా వాస్తవికం.

కథాకల్పన, పాత్రచిత్రణ సహా రచనా సంబంధమైన వివిధాంశాలలో ఇద్దరు రచయితలమధ్య మౌలికమైన తేడాలూ ఉన్నాయి. ఆ తేడాలు మళ్ళీ ఇద్దరి దృక్పథాలలో ఉన్న తేడాను వ్యక్తీకరిస్తాయి. వేయిపడగలులో ధర్మారావు ప్రధానపాత్ర. రచయిత భావజాలం ప్రధానంగా అతని ముఖంగానే వ్యక్తమైంది. కథాకాలానికి ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి గతించాడు కనుక అతన్ని పక్కన పెడితే, ధర్మారావు తర్వాత చెప్పుకోదగిన పాత్రలుగా గిరిక, గణాచారి, అరుంధతి, రంగారావు, హరప్ప, పసరిక, కుమారస్వామి, మంగమ్మలు కనిపిస్తారు. అయితే వీరందరూ ధర్మారావు ప్రభావంలో మొదటి నుంచీ ఉన్నవారు, లేదా తర్వాత వచ్చిన వారే(ఉదాహరణకు రంగారావు, మంగమ్మ) తప్ప విరుద్ధభావజాలానికి చెందినవారు కాదు. రాధాపతి, చక్రవర్తి, వామనరావు తదితరులు విరుద్ధభావజాలంగలవారైనా ధర్మారావుతో తులతూగేవారు కాదు. అంటే ఏమిటన్నమాట! వేయిపడగల రచయిత ప్రణాళిక ఏకపక్షం. ఆయన భావజాలానికి తగిన ప్రతివిమర్శ కానీ, దానితో సమానప్రతిపత్తిగల పోటీ భావజాలం కానీ లేవు. సుదర్శనంగారు అన్నట్టు వేయిపడగలను ఆత్మాశ్రయకావ్యమనుకుంటే అది అలా ఉండడానికి ఒక సమర్ధింపు అవుతుంది.

ఇందుకు భిన్నంగా గాన్ విత్ ద విండ్ రచయిత్రి దృష్టి వస్త్వాశ్రయంగా ఉంటుంది. అందులో ప్రధానపాత్ర ఎవరన్న పరిశీలన చేయబోతే ఒకరు కాదు, నలుగురు పైకి తేలతారు: స్కార్లెట్ ఒహారా, రెట్ బట్లర్, మెలనీ, యాష్ లీ! రచయిత్రి స్కార్లెట్ ముఖంగా కథ చెబుతున్నట్టు కనిపించే మాట నిజమే. స్కార్లెట్ ప్రధానపాత్రే. అంతమాత్రాన రెట్ బట్లర్ తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు. అలాగే మెలనీ, అలాగే యాష్ లీ…

ఇలా నాలుగు పాత్రలకూ ప్రాధాన్యం లభించడానికి కారణమేమిటి? రచయిత్రి ఈ నలుగురి ముఖంగా నాలుగు దృక్పథా(లేదా ఒకే దృక్పథంలోని భిన్నచ్చాయ)లకు దాదాపు సమస్థాయిని కల్పించడమే. ఈవిధంగా వేయిపడగల లోని ఏకపక్షతకు భిన్నంగా రచయిత్రి బహుళపక్షతకు చోటిచ్చింది. మరోలా చెప్పాలంటే, కాన్ఫడరేట్ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధం చేసిన  అమెరికా దక్షిణ రాష్ట్రాలు ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహించాయో ఆ భావజాలాన్ని రచయిత్రి నిరాకరించనూలేదు, స్వీకరించనూలేదు. ఆ భావజాలానికి కాల్పనిక స్థాయిలో యాష్ లీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కాకపోతే స్కార్లెట్, రెట్ బట్లర్ ల రూపంలో రచయిత్రి దానికి ప్రతిపక్షాన్ని సృష్టించింది. అలాగే, పాతను పూర్తిగా నెత్తిన పెట్టుకోవడం, కొత్తను పూర్తిగా తృణీకరించడం చేయలేదు. మెలనీ రూపంలో రెంటి మధ్యా మానవీయత అనే అతుకు పెట్టి ఒక గొప్ప సమన్వయాన్ని సృష్టించింది.

గాన్ విత్ ద విండ్ కు పరిమితమై చూసినప్పుడు ప్రాధాన్యక్రమంలో యాష్ లీ ది నాలుగవ స్థానమే. బహుశా నవల చదివిన పాఠకులందరికీ అదే అభిప్రాయం కలుగుతుంది. కానీ వేయిపడగలతో పోల్చి చూసేటప్పుడు అతను  ప్రథమస్థానంలోకి వస్తాడు. అతనిలో అడుగడుగునా ధర్మారావు పోలికలు కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ధర్మారావులానే అతను కూడా భావుకుడు. స్వాప్నికుడు. సాహిత్యప్రేమికుడు. సాంప్రదాయికత మీద గాఢమైన అనురక్తి ఉన్నవాడు. అవ్యక్తంలోని సౌందర్యాన్ని ఆరాధించేవాడు. అయితే ఒక తేడా; ధర్మారావుకు భిన్నంగా అతను పతనమవుతున్న వ్యవస్థ పక్షాన ఆయుధం పట్టి యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధ ప్రయోజకత్వం మీద నమ్మకంతో కాదు. అయినా ఎందుకు యుద్ధం చేశాడంటే ‘స్వధర్మా’న్ని పాటించడానికి తప్ప మరో సమాధానం కనిపించదు. సాటి యువకులే కాక, తండ్రులు, తాతలు కూడా యుద్ధంలోకి దిగినప్పుడు అతను దిగకపోవడం ఊహకు అందని విషయం. యుద్ధసందర్భంలో యాష్ లీ మహాభారతంలోని అర్జునుని గుర్తుచేస్తాడు. యుద్ధానంతర పరిస్థితులగురించి అర్జునుడు వ్యక్తం చేసిన భయాలే యాష్ లీ లోనూ వ్యక్తమవుతాయి. అయినా సరే అర్జునుడు స్వధర్మానుసారం యుద్ధం చేసినట్టే యాష్ లీ కూడా చేస్తాడు. భార్య మెలనీకి రాసిన ఒక ఉత్తరంలో యుద్ధం గురించిన అతని ఊహలు ఇలా ఉంటాయి:

పడుకుని నక్షత్రాలవైపు చూస్తూ అనుకుంటాను, “దేనికోసం నువ్వు యుద్ధం చేస్తున్నా”వని. మన రాష్ట్ర హక్కుల కోసం, కాటన్ కోసం, డార్కీల కోసం, మనం ద్వేషించే ఆ యాంకీ(అప్పట్లో అమెరికాలోని ఉత్తరాదివారిని సూచించే నిందార్థకం)ల కోసం. కానీ నా పోరాటానికి ఇవేవీ కారణాలు కావు. నేను ట్వెల్వ్ ఓక్స్ (అతని నివాసం)ను మాత్రమే చూస్తున్నాను. తెల్లని స్తంభాలపై ఏటవాలుగా పడే వెన్నెలను, వెన్నెల్లో వికసించే చంపకాలలో వ్యక్తమయ్యే అలౌకికతను, ఎర్రని ఎండ కాసే మధ్యాహ్నం వేళ కూడా పక్క వసారాలో చల్లని నీడ పరుస్తూ ఎగబాకే గులాబీలను గుర్తుచేసుకుంటూ ఉంటాను. అమ్మ ఆ వసారాలో కూర్చుని కుట్టుపని చేసుకుంటున్న నా చిన్నప్పటి దృశ్యం కళ్ళకు కడుతూ ఉంటుంది. సంజె వేళ అలసిపోయి పొలాలనుంచి భోజనానికి ఇళ్లకు వెడుతూ డార్కీలు పాడుకునే పాటలు, బావిలోకి బొక్కెన దింపి నీళ్ళు చేదుకుంటున్న ధ్వనులూ వినబడుతూ ఉంటాయి. పత్తి పొలాల మీదుగా నదికి దారితీసే బాట తాలూకు పొడవాటి దృశ్యం, మసకచీకటిలో దిగువ భూములనుంచి పైకి లేచే పొగమంచు…వీటి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. మృత్యువు, కష్టాలు, కీర్తిప్రతిష్టల మీద నాకు ప్రేమ లేదు. ఎవరిపట్లా  ద్వేషమూ లేదు. బహుశా ఇంటినీ, దేశాన్నీ ఇలా ప్రేమించడాన్నే దేశభక్తి అంటారు కాబోలు. కానీ, ఇది అంతకన్నా లోతైనది.  పైన చెప్పినవన్నీ నేను దేనికోసం నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టానో, నేను ఏ జీవితాన్ని ప్రేమిస్తున్నానో దానికి ప్రతీకలు మాత్రమే. పాత రోజులకోసం, నేను గాఢంగా ప్రేమించిన పాత జీవితం కోసం పోరాడుతున్నాను. అయితే అవి శాశ్వతంగా అంతరించాయనిపిస్తోంది. ఎందుకంటే, గెలిచినా, ఓడినా మనం ఆ జీవితాన్ని కోల్పోతాం.

ఈ యుద్ధాన్ని, తద్వారా మనం స్వప్నించే కాటన్ సామ్రాజ్యాన్ని గెలిచినా మనం పరాజితులమే అవుతాం. కారణం, మనం విభిన్న వ్యక్తులుగా మారిపోతాం. వెనకటి ప్రశాంత జీవనసరళులు నిష్క్రమిస్తాయి. ప్రపంచం కాటన్ కోసం దేవిరిస్తూ మన గుమ్మంలో పడిగాపులు పడుతుంది. అప్పుడు, కాటన్ ధర మనం ఎంత చెబితే అంత. ఎవరి డబ్బు కక్కుర్తిని, సంపద పోగేసేకునే ప్రవృత్తిని, వ్యాపార ధోరణిని ఏవగించుకుంటున్నామో; ఆ యాంకీలలానే మనం కూడా మారిపోతాం.

ప్రమాదాలకూ, పట్టుబడడానికీ, గాయాలకూ, చివరికి మృత్యువుకు కూడా నేను భయపడడంలేదు. వెనకటి కాలానికి మళ్ళీ ఎప్పటికీ వెళ్లలేమనే భయపడుతున్నాను. నేను పాతకాలం వాణ్ణి. ఒకరి నొకరు ఊచకోత కోసుకునే ఈ ఉన్మత్త వర్తమానానికి చెందను. ఎంత ప్రయత్నించినా ఏ భవిష్యత్తులోనూ ఎక్కడా ఇమడలేనని అనిపిస్తోంది. నాలో ప్రవహించే రక్తమే నీలోనూ ఉంది కనుక నువ్వూ అంతే. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు; కానీ గత మంత అందంగా, తృప్తికరంగా మాత్రం ఉండదు.

పాతకాలం గురించిన యాష్ లీ ఊహల్లో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. రుక్మిణమ్మారావుతో అతను అన్న మాటలే చూడండి: “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది….నేను, మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనును ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!”

ఇంకా ఆశ్చర్యకరంగా, వేయిపడగల రచయితలానే యాష్ లీ కూడా వ్యక్తావ్యక్తంగా ఉండడంలోనే సొగసు ఉందనుకుంటాడు. అతనొకచోట స్కార్లెట్ తో అంటాడు: యుద్ధంలోకి అడుగుపెట్టేవరకూ, జీవితం తెర మీద ఆడించే నీడల్లా తప్ప వాస్తవికంగా ఎప్పుడూ కనిపించలేదు. అదే నాకు ఇష్టంగా ఉండేది. ఆయా వస్తువుల బాహ్యరేఖలు మరీ ప్రస్ఫుటంగా ఉండడం నాకు నచ్చదు. అవి ఒకింత అవిస్పష్టంగా, మసక మసకగా ఉండాలి”

వేయిపడగల రచయిత అంటాడు: “అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనపడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.

యాష్ లీ యుద్ధం నుంచి తారా(స్కార్లెట్ పుట్టిల్లు)కు వచ్చిన తర్వాత ఒకరోజున అతనికీ, స్కార్లెట్ కు జరిగిన సుదీర్ఘ సంభాషణ అతనిలోని ధర్మారావు పోలికలను మరింతగా ఆవిష్కరిస్తుంది. వాటిని స్పృశించే ముందు, ఇద్దరి సారూప్యతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే;

గాన్ విత్ ద విండ్ ను పూర్తిగా యాష్ లీ ముఖంగా చెప్పి ఉంటే, (కొన్ని తప్పనిసరి తేడాలతో) అది మరో ‘వేయిపడగలు’ అయ్యేది!

      (సశేషం)

విశ్వనాథ నుంచి మిచెల్ దాకా…

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-9

*

దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషలు వగైరాలలో భిన్నత్వం ఉంటుంది, నిజమే. కానీ ఏకత్వమూ ఉంటుంది. ఎంచి చూస్తే ఏకత్వమే ఎక్కువ ఉంటుందేమో కూడా.  కొందరు కేవలం భిన్నత్వాన్నే చూడడం, కొందరు ఏకత్వాన్ని కూడా చూడగలగడం వారి దృష్టి భేదాన్ని మాత్రమే సూచిస్తుంది. సగం నిండిన గ్లాసు ఉదాహరణతో చెప్పుకుంటే, కొందరికి నిండిన అర్థభాగం కనిపిస్తే, మరికొందరికి ఖాళీగా ఉన్న అర్థభాగం కనిపిస్తుంది.  వేయిపడగల రచయిత ఫ్రాక్ పశ్చిమ సాహిత్యాలలోనూ సంస్కృతీ, ఆచార వ్యవహారాలలోనూ, మనుషుల ప్రవర్తనలోనూ అంతటా భిన్నత్వమే చూస్తాడు. అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అన్న తారతమ్య దృష్టిని ప్రదర్శిస్తాడు.  అది ఒక్కోసారి హాస్యాస్పదంగా కూడా పరిణమిస్తుంది. ఉదాహరణకు, ఒక విషాద ఘటనను ప్రస్తావించి దానిపై పాశ్చాత్యులైతే “బ్యూటిఫుల్ బ్యూటిఫుల్” అని స్పందిస్తారని ఒకచోట ఎద్దేవా చేస్తాడు. అది జాతులు, వారి మనః ప్రవృత్తులు, భాషలు, వ్యక్తీకరణల మధ్య తేడాగా సూత్రీకరిస్తాడు.

నిజానికి ఒక విషాదఘటనపై పాశ్చాత్యులందరి స్పందనా ఆ మాటలోనే వ్యక్తమవుతుందని చెప్పడం శ్రుతిమించిన సాధారణీకరణే. అదీగాక ఒక సృజనాత్మక వ్యక్తీకరణపై, అందులోని వస్తువుతో సంబంధం లేకుండా అలాంటి స్పందన, మన దగ్గర సహా సార్వత్రికంగా కనిపిస్తుంది. ఒకవిధంగా వేయిపడగల రచయిత చేసిన సాధారణీకరణ రససిద్ధాంతానికే వ్యతిరిక్తం. శోక, బీభత్స, వీరరసాదులు వస్తువుగా ఉన్న కావ్య, నాటక, చలనచిత్రాలను మనం పనిగట్టుకుని చదివి, దర్శించి అనుభవిస్తున్నామంటే కారణం, వాటి వెనుక ఉన్న సృజనాత్మక ప్రతిభా వ్యుత్పత్తులు కలిగించే ముగ్ధత్వమే. ఆ ముగ్ధత్వాన్ని ఎవరైనా సరే రచయిత ఎద్దేవా చేసిన మాటలో కాకపోతే, తత్తుల్యమైన మాటల్లోనే వ్యక్తీకరిస్తారు.

భిన్నత్వాన్ని మాత్రమే చూసే దృష్టి మహాకవులను, పండితులను కూడా ఇలాంటి అతార్కిక, అసంబద్ధ నిర్ధారణలవైపు నడిపిస్తుంది. కేవలం భిన్నత్వాన్ని, అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అనే తారతమ్య వివేచననే కొలమానాలుగా తీసుకున్నప్పుడు ఆయా దేశాలు, భాషల వారు ఎవరి సాహిత్యాన్ని వాళ్ళు ఆనందించవలసిందే తప్ప ఇంకొకరివి ఆనందించే అవకాశం ఉండదు. కానీ అలా జరగడం లేదు. పాశ్చాత్య సాహిత్యం వైపు మనం ఆకర్షితులైనట్టే ప్రాచ్య సాహిత్యం వైపు వారూ ఆకర్షితులు కావడం సార్వజనిక వాస్తవం.  భిన్నత్వాన్ని కేవలం ‘వారు వేరు, మేము వేరు’ అని విడగొట్టడానికి కాక, పరస్పరపూరకానికి అవకాశమిచ్చే జాగాగా అర్థం చేసుకున్నప్పుడు దృష్టి మారుతుంది. అప్పుడు దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాల వెనుక ఏకత్వాన్ని దర్శించే వీలు కలుగుతుంది. ప్రత్యేకించి సాహిత్యం ప్రతిఫలించే మానవ అనుభవం నిండా ఏకత్వమే ఉంటుంది.

చరిత్రలోకి వెళ్ళి చూస్తే, భిన్నత్వం మనుషుల్ని విడగొట్టి ఘర్షణకూ, యుద్ధాలకూ దారి తీయించిన అనుభవాలు ఉన్నట్టే;  ప్రపంచంలోని భిన్న భిన్న సమాజాలు, వ్యక్తులు మానవ అనుభవంలోని ఏకత్వాన్ని దర్శిస్తూ; భిన్నత్వాన్ని పరస్పర పూరకమైన ఒక అవకాశంగా చూస్తూ ఒకరికొకరు దగ్గరై పరస్పరం వికాసం చెందిన అనుభవాలూ ఉన్నాయి. విశ్వనాథ వంటి గొప్ప సృజనశీలి, సాహిత్యమర్మజ్ఞుని దృక్పథాన్ని భిన్నత్వం విశ్వరూపంలో కమ్మేసి ఆయన చేత అతార్కికమైన, సంకుచితమైన నిర్ధారణలు చేయించిందంటే కారణం; నాటి చారిత్రక, సామాజిక నేపథ్యం. వలసపాలనలో ఆత్మన్యూనతలో మగ్గుతున్న జాతి ఆ న్యూనతా భావననే ఆధిక్యంగా మలచుకోడానికి ప్రయత్నించింది. ఎంతైనా ఇదొక తాత్కాలిక భావోద్రేకమే తప్ప స్థిరసత్యం కాలేదు. గురజాడ మీదుగా ప్రారంభమయిన ఆత్మవిమర్శ విశ్వనాథ దగ్గరికి వచ్చేసరికి ఆత్మోత్కర్షగా ఎందుకు పరిణమించిందో తెలుసుకోవాలంటే ఆ ఇద్దరి మధ్యకాలంలోని పరిణామాలలోకి తొంగి చూడవలసి ఉంటుంది.

దానిని అలా ఉంచితే…

‘వేయిపడగల’ గురించి రాస్తూ అందులోని ధర్మారావు పాత్రను విశ్లేషిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన రచనలు రెండు: మొదటిది, త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’. రెండోది, మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’.

‘అసమర్థుని జీవయాత్ర’లో వ్యక్తమైన గోపీచంద్ తాత్విక సంఘర్షణను ఆర్. ఎస్. సుదర్శనం ‘సాహిత్యంలో దృక్పథాలు’లో తనదైన కోణంలో విశ్లేషించారు కానీ అందులోని సీతారామారావుకు, ‘వేయిపడగలు’ లోని ధర్మారావుకు ఉన్న పోలికలను, తేడాలను ఎందుకో ప్రస్తావించలేదు. ఈ ఇద్దరి మీదా తండ్రి ప్రభావం ఉంది. అయితే, వల్లమాలిన అహం, ఆభిజాత్యం నిండిన తండ్రి ప్రభావం నుంచి బయటపడి; సరళత, సామాన్యత నిండిన తల్లివైపు పయనించలేకపోయిన సీతారామారావు, జీవితాన్ని ప్రశ్నల ముళ్లడొంకగా మార్చుకుని చివరికి ఉన్మత్తావస్థకు చేరుకుంటాడు. ఆ దశలో రామయ్యతాత అతనికి జీవితం గురించి బోధిస్తాడు కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందనుకున్న సీతారామారావు ఆత్మహత్య చేసుకుంటాడు.

లౌకికంగా చూసినప్పుడు ధర్మారావు కూడా సీతారామారావులానే నిష్క్రియుడే. సీతారామారావులా భిన్న రూపంలో శ్రేష్టతా-సామాన్యతల వివేచనలో గడిపినవాడే. మళ్ళీ భిన్నరూపంలోనే అతనిలోనూ సీతారామారావులో ఉన్నట్టు ఆత్మోత్కర్ష, లోకవిమర్శ, లోకనింద ఉన్నాయి.  తేడా అల్లా, సీతారామారావు శ్రేష్టత్వం నుంచి సామాన్యతవైపు పయనించడానికి కనీసం విఫలయత్నమైనా చేశాడు కానీ; ధర్మారావు శ్రేష్టత్వపు ఊహల్లోనే ఆగిపోయాడు.  చివరివరకూ అసామాన్యుడైన తండ్రి ప్రభావంలోనే ఉండిపోయాడు. అలాగే బాహ్యజగత్తుకు, ఆంతరిక జగత్తుకు మధ్య సామరస్యాన్ని కల్పించుకోడంలో సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర సంఘర్షణ ధర్మారావులో లేదు. ఇద్దరి మధ్యా ఇంకో ముఖ్యమైన తేడా, జీవితం గురించి బోధించడానికి సీతారామారావుకు ఒక రామయ్యతాత ఉన్నాడు. కానీ ధర్మారావు విషయానికి వస్తే, రామయ్యతాత, సీతారామారావులు అతనిలోనే ఉన్నారు. తనే లోకానికి గురువు కనుక ఇంకొకరికి బోధకు అతను చెవి యొగ్గే ప్రశ్నే లేదు.

మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు కానీ; అసలు ధర్మారావుకు సమాధానంగానే గోపీచంద్ సీతారామారావును సృష్టించాడా అన్న సందేహం కలుగుతుంది. ఈ కోణంలో ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారా అన్నది కుతూహలజనకమైన మరో అకడమిక్ ప్రశ్న.

విచిత్రం అనిపించవచ్చు కానీ,  ‘వేయిపడగలు’తో పోల్చి చూడాలన్న గాఢమైన కుతూహలం కలిగించే మరో నవల ‘గాన్ విత్ ద విండ్’. రెంటి మధ్యా తేడాలు ఎలాగూ ఉంటాయి. వాటితోపాటు కొట్టొచ్చినట్టు కనిపించి ఆశ్చర్యం గొలిపే పోలికలూ ఉన్నాయి. ముందుగా తేడాల విషయానికి వస్తే, అతి పెద్ద తేడా ఆ ఇద్దరు నవలాకర్తల మధ్యే ఉంది. విశ్వనాథ(1895-1976) కన్నా మార్గరెట్ మిచెల్(1900-1949)వయసులోనూ, ఆయుఃప్రమాణంలోనే కాదు; సాహిత్యసృష్టిలోనూ, బహుముఖీన పాండిత్యంలోనూ కూడా చిన్నదే. ఆమె కౌమార వయసులో రెండు నవలలు రాసినా పరిమాణంలోనే కాక, ప్రసిద్ధిలోనూ చెప్పుకోవలసిన నవల గాన్ విత్ ద విండ్ ఒక్కటే.  ‘అట్లాంటా జర్నల్’లో జర్నలిస్టుగా పనిచేసిన మిచెల్ 1926 లో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, చీలమండకు తగిలిన గాయంతో ఇంటికే పరిమితమై అమెరికా అంతర్యుద్ధ(1861-1865) నేపథ్యంతో నవల రాయడం ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేసింది. గాన్ విత్ ద విండ్ నేషనల్ బుక్ అవార్డు, పులిట్జర్ అవార్డు పొందడంతోపాటు చలనచిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. మిచెల్ తన 49 వ ఏట, 1949 ఆగస్టు 11న అట్లాంటాలో భర్తతో కలసి ‘ఏ కాంటర్బరీ టేల్’ సినిమాకు వెళ్ళి వస్తూ రోడ్డు దాటుతున్నప్పుడు కారు ఢీకొనడంతో చనిపోయింది.

అబ్రహాం లింకన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగిన అమెరికా అంతర్యుద్ధానికి మూల కారణం బానిసత్వ సమస్య. యూనియన్ ప్రభుత్వం బానిసత్వాన్ని రద్దు చేయడానికి సంకల్పించింది. బానిసల శ్రమ మీద పత్తి వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేసి భారీ ఎత్తున కాటన్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏడు దక్షిణాది రాష్ట్రాలు(ఆ తర్వాత మరో నాలుగు రాష్ట్రాలు కలసి పదకొండు అయ్యాయి) బానిసత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘కాన్ఫెడరేట్’ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధానికి దిగాయి. 1861నుంచి దాదాపు అయిదేళ్లపాటు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 6 లక్షల 20 వేల నుంచి 7లక్షల 50 వేల మంది వరకు చనిపోయినట్టు అంచనా. రెండు ప్రపంచయుద్ధాలలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ.  దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మౌలిక నిర్మాణాలు అన్నీ దాదాపు ఈ యుద్ధంలో ధ్వంసమయ్యాయి. చివరికి యూనియన్ సేనలే గెలుపొందాయి. యుద్ధానంతర పునర్నిర్మాణ చర్యలూ వెంటనే మొదలయ్యాయి. అంతర్యుద్ధంతో మిచెల్ కు ఉన్న ఆత్మీయ సంబంధం, అందులో ఆమె తాత పాల్గొనడం. ఆ యుద్ధం గురించిన కథనాలను ఆ కాలానికి చెందిన అమ్మమ్మలు, నాయనమ్మల ద్వారా ఆమె చిన్నప్పటినుంచీ వింటూ వచ్చింది. వాటికి తనదైన కాల్పనికతను, దృక్పథాన్ని, పాత్రచిత్రణ నైపుణ్యాన్నీ జోడిస్తూ వెయ్యి పేజీలను మించిన, గొప్ప ఐతిహాసిక స్థాయి గల నవలగా మలచింది.

బానిసత్వపు పునాదుల మీద లేచిన ఒక కులీన తరహా సమాజమూ, అందులోని యువతీ యువకుల కాల్పనిక మోహాలు, వ్యామోహాలు, ప్రణయావేశాలూ, విందు వినోదాలూ, విలాసాలూ, శౌర్యోత్సాహాలూ, డాంబికాలు, కట్టుబాట్లు, ఆచారాలు, ఆభిజాత్యాలు, వైభవోపేతమైన తమ జీవితం శాశ్వతమూ, స్థిరమూ అన్న భ్రమలతోసహా—అన్నీ తమ కళ్ళముందే- కేవలం నాలుగైదేళ్ళ స్వల్పవ్యవధిలో– కుప్ప కూలిపోవడాన్ని గాన్ విత్ ద విండ్ ఉద్వేగభరితంగా రూపుకట్టింది. ఆ పతనం వ్యక్తులలో కలిగించిన మానసిక, భౌతిక కల్లోలాన్ని; యుద్ధం వాళ్ళ జీవితాలలో తెచ్చిపెట్టిన అనూహ్యమైన మార్పులను అనితరసాధ్యమనిపించే రీతిలో ఆవిష్కరించింది. యుద్ధానికి ముందూ-తర్వాతా ఇతివృత్తంగా ప్రపంచ సాహిత్యంలో వచ్చిన ఎన్నదగిన రచనల్లో గాన్ విత్ ద విండ్ నిస్సందేహంగా ఒకటి. గాన్ విత్ ద విండ్ లాంటి యుద్ధరచన ప్రత్యేకించి భారతీయ సమాజానికి విలక్షణమైన, వినూత్నమైన ఎరుకను, అనుభవాన్నీ కలిగిస్తుంది. ఎందుకంటే, మహాభారతం తర్వాత ఒక యుద్ధం తాలూకు పూర్వాపర పరిణామాలను, పరిస్థితులను అతి పెద్ద కేన్వాస్ పై  ఐతిహాసిక ప్రమాణంలో చిత్రించిన రచన మరొకటి మనకు లేదు.

మహాభారతాన్ని కళ్ల ముందు నిలుపుకుంటూ; చరిత్ర, పురాచరిత్ర, మానవపరిణామచరిత్రలను కూడా తడుముతూ గాన్ విత్ ద విండ్ గురించి మాట్లాడుకోవడం నా వరకు ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించే వ్యాసంగం. కానీ  సందర్భం కాదు కనుక దానిని అలా ఉంచితే, వేయిపడగలు, గాన్ విత్ ద విండ్ దాదాపు ఏక కాలంలో వెలువడిన రచనలు. మిచెల్ తన నవలను 1926లో రాయడం ప్రారంభించగా 1936లో అది ప్రచురితమైంది. విశ్వనాథ వేయిపడగలను 1934లో 29 రోజులలో చెప్పారు. అంటే, అప్పటికి గాన్ విత్ ద విండ్ ప్రచురితం కాలేదు. వేయిపడగలు 1937-38లలో ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడిన తర్వాత 1939లో పుస్తకరూపంలో ప్రథమముద్రణ పొందింది.

రెండింటి మధ్యా ప్రధానమైన పోలిక— ఒకానొక కులీన, శ్రేష్ట, సాంప్రదాయిక సమాజం ఎలా పతనమైందో చిత్రించడం. మిచెల్ చిత్రించిన సమాజం, వేయిపడగలు చిత్రించిన వర్ణసమాజంతో పోలిక ఉన్నదే. వేయిపడగల వర్ణ సమాజంలో అట్టడుగున శ్రామికవర్ణం(గోపన్న) ఉన్నట్టే గాన్ విత్ ద విండ్ లో బానిసల రూపంలో శ్రామికవర్ణం ఉంది. బానిసలలో కూడా మళ్ళీ హెచ్చు తగ్గులు. పొలంలో పనిచేసే బానిసల కంటే గృహంలో పనిచేసే బానిసలు ఉన్నతస్థానంలో ఉంటారు. యజమాని-సేవక సంబంధాల చట్రంలోనే మళ్ళీ యజమానులకూ, గృహ బానిసలకు మధ్య ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. యజమానుల్లానే బానిసలు కూడా వ్యవస్థతో తాదాత్మ్యం చెందుతారు. వేయిపడగలలో చిత్రితమైన యజమాని-సేవక సంబంధాలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి. సాంప్రదాయిక సమాజాలుగా కట్టుబాట్లు, ఆచారాలు, స్త్రీ-పురుష వివక్ష మొదలైన అంశాలలో కూడా రెండింటి మధ్యా పోలికలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిచెల్ చిత్రించిన సమాజంలో  కొంతవరకు హైందవ సాంప్రదాయిక సమాజ ప్రతిబింబాన్ని చూడచ్చు. సామాజికంగా వస్తున్న మార్పులు విశిష్ట జీవితాన్ని, విశిష్ట వ్యక్తులను కబళించడాన్నే కాదు; అందరినీ అవి సామాన్యత అనే ప్రవాహంలో ఎలా ముంచి తేల్చుతున్నాయో కూడా రెండు రచనలూ చిత్రిస్తాయి. లోతైన సంస్కారం, అనుభూతి గాఢత లేని వారు ఆర్థికంగా, సామాజికంగా పైకి రావడాన్నీ; అవి ఉన్నవాళ్ళు అట్టడుగుకు జారిపోవడాన్ని రెండు రచనలూ రూపుగడతాయి. అలాగే, వేయిపడగలు దళితోద్ధరణ గురించి, దళితులు స్వతంత్రించడం గురించి చెబితే; గాన్ విత్ ద విండ్ బానిసల ఉద్ధరణ గురించి, వారు స్వతంత్రించడం గురించి చెబుతుంది.

ఈ పోలికల మధ్యే కీలకమైన తేడాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాచ్య, పాశ్చాత్య జీవన తాత్వికతలకు చెందినవనుకుంటే, కొన్ని ఇరు రచయితల దృక్పథ భేదానికి చెందినవి. గాన్ విత్ విండ్ కు వేయిపడగలకు ఉన్నంత బరువైన భావజాలవారసత్వం కానీ, అందుకు సంబంధించిన ఘర్షణ కానీ లేవు.  వేయిపడగలలో లౌకిక-అలౌకిక జగత్తులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. గాన్ విత్ ద విండ్ లో అలాంటిది లేదు. అది కేవలం పాత నీటిని కొట్టేసి కొత్త నీరు చేరుతున్న లౌకికమైన ఒకే ప్రవాహంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే, గాన్ విత్ ద విండ్ కు ఉన్న అంతర్యుద్ధ నేపథ్యం వేయిపడగలకు లేదు. అందులో ఉన్నది భావజాల ఘర్షణే తప్ప భౌతిక ఘర్షణ కాదు.

ఈ ఇద్దరు రచయితల దృక్పథ భేదాన్ని తరచి చూస్తే తేలే ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాహిత్య సృష్టిలోనూ, ధిషణలోనూ విశ్వనాథ భుజాల వరకూ కూడా రాలేని మిచెల్ ఆయన కన్నా ఎక్కువ పరిణతిని చాటుకుందా అనిపిస్తుంది.

దాని గురించి తర్వాత…

*

 

ఆ నిర్లిప్తత భయావహం

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-8

 

sudrarsanamలౌకికం-అలౌకికం; సామాన్యత-అసామాన్యత అనే ద్వంద్వాల మధ్యనే ‘వేయిపడగలు’ నవల మొత్తం సాగుతూ ఉంటుంది. అయితే, అవి వేటి కవిగా ఉండిపోవడం తప్ప;  వాటి మధ్య ఒక లంకె ఉంటుందనే స్ఫురణను రచన కలిగించదు. అలౌకిక ప్రపంచంలో అర్థవంతంగా అనిపించే పాత్రలు లౌకిక ప్రపంచానికి వచ్చేసరికి తేలిపోతాయి. ఉదాహరణకు అలౌకికతనుంచి చూస్తే రామేశ్వరశాస్త్రి అసామాన్యుడు. “మా తండ్రి నేమనుకొంటివి? ఆయన లోకసామాన్యుడు కాదు. ఆయన గొప్పతనము దౌర్భాగ్యులకు యెట్లు తెలియును?” అని అరుంధతితో ధర్మారావు అంటాడు. లోకసామాన్యుడు కాని వ్యక్తి గొప్పతనం లోకంలోని అసంఖ్యాకులైన దౌర్భాగ్యులకు తెలియనప్పుడు ఆ గొప్పతనం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

లౌకిక జీవనానికి వస్తే, రామేశ్వరశాస్త్రి మొదట్లో సంపన్నుడు. జమీందారు తర్వాత అంతటివాడు. కానీ చేతికి ఎముక అన్నది లేకుండా దానధర్మాలు చేశాడు. బంధువులనూ, పేదలనూ, రైతులనూ, వర్తకులనూ కూడా ఆదుకున్నాడు. చివరికి చితికిపోయి శేషజీవితంలో దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొన్నాడు. బంధువులే కాక, అతని సాయంతో వృద్ధిలోకి వచ్చిన రైతులు, వర్తకులూ కూడా మొహం చాటేశారు. తను వివాహమాడిన మిగతా మూడు వర్ణాల స్త్రీలకు; భోగస్త్రీకి ముందే ఆస్తి పంచి ఇచ్చిన రామేశ్వరశాస్త్రి కొడుకు ధర్మారావుకు మాత్రం పేదరికన్నే మిగిల్చిపోయాడు.

‘వేయిపడగల’ రచయిత వాస్తవానికి రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా సామాజిక పరిణామ చరిత్రను చెబుతున్నాడు.  బ్రిటిష్ కాలంలో లేదా ఆధునికత అడుగుపెడుతున్న దశలో బ్రాహ్మణ్యం అగ్రహారాలనూ, ఇతర ఆస్తులనూ కోల్పోయి ఆర్థికంగా అణగారిపోతూవచ్చింది. అగ్రహారం భూములు  రైతుకులాల పరమయ్యాయి. దానికితోడు, తెలుగు ప్రాంతాలలోని గోదావరీ, కృష్ణా మండలాలలో నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల  వ్యవసాయం అభివృద్ధి చెంది చూస్తుండగానే రైతుకులాలవారు ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉచ్చదశను అందుకోవడం మొదలైంది. రెండు మూడు తరాల వ్యవధిలోనే సంభవించిన ఈ పరివర్తనకు తెలుగు ప్రాంతాలలోని బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో సాక్షిగా నిలిచాయి. తాత తరంలో బ్రాహ్మణభూస్వామి కింద పాలెకాపులుగా ఉన్న రైతుకులాలవారు మనవడి కాలానికి వచ్చేసరికి రాజకీయంగా ఉన్నతపదవులు అందుకోవడం, బ్రాహ్మణ యువకులు ఉద్యోగాలకోసం వారిని ఆశ్రయించడం ఈ పరివర్తన క్రమాన్ని ఆశ్చర్యస్ఫోరకంగా  మన కళ్ళముందు నిలుపుతాయి.

ఆర్థికక్రమశిక్షణ, కుటుంబ భవిష్యత్తుపట్ల బాధ్యతా రాహిత్యాలతో బ్రాహ్మణులు ఆర్థికపతనాన్ని కొని తెచ్చుకున్నారన్న విమర్శ బ్రాహ్మణ్యంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పతన చరిత్రలోని ఒక పార్స్వాన్నే హాస్యబీభత్సవంతంగా ‘కన్యాశుల్కం’ చిత్రించింది. ‘వేయిపడగల’లోని రామేశ్వరశాస్త్రి ఉదంతాన్ని చదువుతున్నప్పుడు ఆయన మరీ ముందు వెనకలు చూడకుండా దానాలు, సాయాలు చేసి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టాడన్న భావన పాఠకులకు కలుగుతుంది. కానీ రచయిత వైపునుంచి ఆ అభిప్రాయం కానీ, విమర్శ కానీ ఉండవు. ఉండకపోగా రామేశ్వరశాస్త్రి ఆర్థికక్షీణతను కార్యకారణ సంబంధానికి అతీతమైన ఓ దైవఘటనగా, ఓడలు బండ్లు సామెతలా నిర్లిప్తంగా తీసుకోవలసిన పరిణామంగా చెబుతున్నట్టు ఉంటుంది. అదీగాక  రామేశ్వరశాస్త్రి అసామాన్యవ్యక్తి కనుక అతని లౌకిక ప్రవర్తనను సైతం లౌకిక కొలమానాలతో చూడకూడదన్న ధ్వనీ వ్యక్తమవుతూ ఉంటుంది.  అతను ఏం చేసినా ఒప్పే, ఏం చేయకపోయినా ఒప్పే. ప్రశ్నలకు, విమర్శలకు, కలిమిలేములతో సహా అన్నిటికీ అతను అతీతుడు. అసలు అతని, అతని కుటుంబపోషణ బాధ్యత అతనిది కాదు; రాజుదీ, లేదా సమాజానిదీ. విచిత్రమేమిటంటే, రచయిత రామేశ్వరశాస్త్రిని లౌకికానికి అందనంత పై మెట్టున నిలుపుతూనే; అతని వల్ల సహాయాలు పొందిన బంధువులు, బ్రాహ్మణేతరుల కృతఘ్నతను ఎత్తిపొడవకుండానూ ఉండడు.

ధర్మారావు లౌకిక జీవన చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. తేడా అల్లా, దాన ధర్మాలు చేయడానికి అతనికి తండ్రి ఏమీ మిగల్చలేదు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగానికి అర్హత అయితే సంపాదించాడు కానీ, మొదట్లో ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడు. ఇల్లు గడవడానికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటాడు. మధ్యలో జాతీయకళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తాడు కానీ అందులో ఇమడలేక విడిచిపెట్టేస్తాడు. కళ్ళముందు భార్య అనారోగ్యంతో చిక్కిశల్యమవుతున్నా మందు ఇప్పించలేని లేమిలో మగ్గిపోతాడు తప్ప ఉద్యోగం కోసం ప్రయత్నించకపోవడం పాఠకులకు విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. చివరికి జమీందారు రంగారావు కొడుకు హరప్పకు గురువుగా నియమితుడైన తర్వాత సంభారాలు కోట నుంచే వస్తుంటాయి. దాంతో తిండి సమస్య పరిష్కారమవుతుంది కానీ, చేతిలో డబ్బు ఆడని పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా రచయిత చెప్పదలచుకున్నది, ధర్మారావు కుటుంబ పోషణ చూసుకోవలసినది రాజు, లేదా సమాజమనే. అంటే, మారిన కాలంలో కూడా రచయిత వర్ణవ్యవస్థ తాలూకు బ్లూ ప్రింటును అమలు చేయడానికి ప్రయత్నించాడు.

viswanatha

రచయిత కల్పించే ఊహ ప్రకారం రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల డబ్బు సంబంధం కూడా ఓ తాత్విక ప్రశ్నలా ఉంటుంది.  డబ్బుతో వారికి అవసరం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎంత డబ్బు అవసరమైనా వారు దాని వెంట పడరు, అదే తమ వద్దకు రావాలి! డబ్బు దగ్గర కూడా రచయిత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర భేదం తీసుకొస్తాడు. ధర్మారావు మిత్రుడు కిరీటి తన మేనమామకు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు:

నీవు నెలకు మూడువందలు తెచ్చుచున్నావు కనుక నీవే వివేకవంతుడవు కావు. ధనము సంపాదించుట వివేకము కాదు. ఏదో మనము బ్రాహ్మణేతరులము కనుక నెమ్మదిగా అందులోనుండి యందులోనికి మ్యాజిస్ట్రేటును, తహసీల్దారును, ఇంగ్లీష్ హెడ్ క్లార్కును, హుజూరు శిరస్తాదారును, డిప్యూటీ కలెక్టరునైనది. కానీ ప్రత్యేకముగా మనము రాజ్యాంగవేత్తలమా? మహాకవులమా? మహాశిల్పులమా? మతకర్తలమా? ఏమని?

సామాన్యార్థంలో చెప్పుకుంటే భౌతిక సంపద కన్నా జ్ఞానసంపద గొప్పదీ, సమాజం పోషించదగినదే. కానీ, పై వాక్యాలు  జ్ఞానసంపద ఉన్నవారికీ, ‘అలాంటి జ్ఞానసంపద’ లేని వారికీ మధ్య తారతమ్యాన్ని ఎంచి; జ్ఞానసంపద ఉన్నవారినీ, వారి జ్ఞానాన్నీ కూడా  ఎత్తు పీట మీద కూర్చోబెడుతున్నాయి. అసలు ఏది జ్ఞానమన్న మౌలిక చర్చ ఒకటి ఉండనే ఉంది. నిర్దిష్ట వర్గానికి చెందిన నిర్దిష్ట జ్ఞానమే జ్ఞానం కాదు. జ్ఞానం బహుముఖాలుగా ఉంటుంది. ఆ చర్చలోకి వెడితే కిరీటి నోట పలికించిన పై అభిప్రాయం అసమగ్రంగా తేలిపోతుంది. ఎంత గొప్ప జ్ఞానమైనా సామాన్యీకరణ చెంది ప్రజల పరం అయినప్పుడే దానికి విలువా, సార్థకతా.  కానప్పుడు అది అలంకారప్రాయంగా మారి షో కేస్ కు పరిమితమవుతుంది.

ధర్మారావుతో పోలిస్తే, అతని భావజాలంతో ప్రభావితుడై, దాని పక్షాన పోరాడిన కుమారస్వామి విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటుకుంటాడు. కులం చెడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను ధర్మారావులానే ఉద్యోగంలో ఇమడలేక రెండు ఉద్యోగాలను వదిలేస్తాడు. ధర్మారావులా అతనికి కోటనుంచి సంభారాలు వచ్చే పరిస్థితిలేదు. అయినా సరే, దుర్భర దారిద్ర్యాన్నైనా అనుభవిస్తాను తప్ప, ఆత్మగౌరవం చంపుకుని ఉద్యోగం చేయనని అతను నిర్ణయించుకుంటాడు. ఆవిధమైన పోరాటశీలం కానీ, త్యాగం కానీ ధర్మారావులో లేవు. చివరికి మంగమ్మ తన ఆస్తిని కుమారస్వామికి రాయడంతో అతను ఆర్థికసమస్యలనుంచి బయటపడడం వేరే విషయం.

లౌకికంగా చూసినప్పుడు; ఊళ్ళో ఇళ్ళు అంటుకుని, తన ఇంటిని కూడా మంటలు చుట్టు ముట్టే ప్రమాదఘట్టంలోనూ  ధర్మారావు ప్రవర్తన విపరీతమనిపించి విస్మయం కలిగిస్తుంది. అతనిని ఒకవైపు నిర్లిప్తుడిగా, నిష్క్రియుడిగానే కాక; ఇంకోవైపు అసామాన్యుడిగా, అధికుడిగా చూపడానికి ఇక్కడా రచయిత తాపత్రయపడతాడు. బ్రాహ్మణుల ఇళ్లకు దగ్గరలో, వేణుగోపాలస్వామి గుడి వెనక  మత్స్యమాంసాలను అమ్మే మార్కెట్ అవతరించడం ద్వారా ధర్మానికి జరిగిన హాని ఈ అగ్నిప్రమాదానికి కారణంగా చూపుతాడు. ఊళ్ళో జనం మంటలు ఆర్పడానికి రంగంలోకి దిగినా ధర్మారావు మాత్రం కుటుంబంతో బయటకు వచ్చి నిలబడిపోతాడు. ఇతరుల ఇళ్లను ఆర్పడానికి సాయపడడు సరికదా; తన ఇంటిని కాపాడుకోడానికి కూడా ప్రయత్నించడు. తల్లి సామాన్లు బయటికి తీసుకురాబోతే వారిస్తాడు. అప్పుడతని మాటలు ఇలా ఉంటాయి:

ధర్మము, అగ్ని, తస్కరుడు, రాజు; వీరు నలువు రన్నదమ్ములు. ధర్ము డందరిలో పెద్దవాడు. అతని కవమానము చేసినచో తక్కిన మువ్వురకును కోపము వచ్చును. అగ్ని తగులబెట్టును. తస్కరుడు దొంగిలించును. రాజు రాబడి పన్నని, అదనపు పన్నని లక్షవిధములుగా ధనము హరించును. మనము ధర్మావమానము చేసినచో  కానిమ్ము. పాతికవేల ఇల్లే పోయినప్పుడు వంద, రెండు వందల రూకల సామాను రక్షించునా?

దీనికి కొస మెరుపు ఏమిటంటే, “అతని యింటి మీద నెక్కి యెవరును నీరు పోయలేదు” అన్న రచయిత ఫిర్యాదు. అంటే, ధర్మారావు ఇంటి మంటలను ఆర్పే బాధ్యత కూడా సమాజానిదే కానీ అతనిది కాదన్నమాట. లౌకిక వ్యవహారాలలో ధర్మారావులో చిత్రించిన ఈ నిర్లిప్తత, నిష్క్రియత భయం గొలుపుతాయి. ఇలాంటి జడీభూతస్థితికి తాత్వికార్థమిచ్చి ఆకాశానికి ఎత్తిన జడభరతుడిలాంటి ఉదంతాలు మన పురాణ ఇతిహాసాలలో కనిపిస్తాయి.  ధర్మారావు పాత్ర చిత్రణలో రచయిత ఊహల్ని అలాంటి నమూనాలు ప్రభావితం చేసి ఉంటే ఆశ్చర్యంలేదు. అయితే ఈ నిర్లిప్తతకు, నిష్క్రియతకు ఎంత గొప్ప తాత్విక అర్థాన్ని ఆపాదించినా, వాటికి సంస్కృతీ సంప్రదాయాల విచ్ఛిత్తీ, పారతంత్ర్యం వంటి లౌకిక పర్యవసానాలు ఉండకుండా ఎలా ఉంటాయి? ఆ పర్యవసానాలపైనే కదా ధర్మారావు ముఖంగా, ఇతర పాత్రల ముఖంగా రచయిత నవల పొడవునా చేసిన విమర్శ?!

ధర్మారావు భావజాలంతో ఏకీభవించేవారి వైపునుంచి చూసినా, స్వరాజ్యోద్యమం అలాంటి లౌకిక పర్యవసానాలనుంచి దేశాన్ని బయటపడేయడానికి ఉద్దేశించిన ఒక కీలక సందర్భమే. కానీ ధర్మారావు మాత్రం ఆ ఉద్యమంలో పాల్గొనడు. పాల్గొనకపోగా స్వరాజ్యోద్యమం గురించి అతని అభిప్రాయం ఇలా ఉంటుంది:

నాకు చూచిన కొలది, దేశమందరు నుద్యమములో చేరినచో స్వరాజ్యము రేపే వచ్చును. కానీ యెవరికి వారు స్వార్థపరాయణులై యున్నారు. అట్టి సమయములో మరియు నిబ్బందులలో నున్నవారు తమ జీవితమార్గమును చెడగొట్టుకుని సంకటపడినందువల్ల నాకు లాభము కనిపించలేదు.

దేశంలో అందరూ ఉద్యమంలో చేరితే రేపే స్వరాజ్యం వస్తుందంటాడు. కానీ ఎవరికి వారు స్వార్థం చూసుకుంటున్నారంటాడు. వారిలో తనూ చేరతాడన్న స్పృహ మాత్రం అతనిలో ఉండదు. ఇంకోవైపు, మరీ ఇబ్బందులలో ఉన్నవారు తమ జీవితమార్గాలను చెడగొట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభమూ లేదంటాడు. అంటే, మిత్రుడు రాఘవరావులా తను స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణం, అతని కంటే తను ఎక్కువ ఇబ్బందులలో ఉండడమే నని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ సంజాయిషీ అతనిలోని భద్రలోగ్ మనస్తత్వాన్ని బయటపెట్టి భీరువుగా చూపిస్తుంది తప్ప అతనిపై గౌరవాన్ని కలిగించదు. తాము పడే ఇబ్బందులు ఎక్కువా తక్కువా అన్నది చూసుకుని ఎవరూ స్వరాజ్యోద్యమంలో చేరలేదు. ఉద్యమంలో చేరి జీవనోపాధులను చెడగొట్టుకోవడమే కాదు, ఆస్తులను కోల్పోయినవారు కూడా ఎందరో ఉన్న సంగతి మనకు తెలుసు.

అదలా ఉంచితే, గాంధీ నాయకత్వంలోని స్వరాజ్యోద్యమంలో ధర్మారావు చేరకపోవడానికి భావజాల పరమైన విభేదాలు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు, దళితుల దేవాలయప్రవేశానికి ధర్మారావు వ్యతిరేకి. ఆ వ్యతిరేకతను రచయిత ఒకచోట ఇలా చిత్రిస్తాడు:

గణాచారి ధర్మారావులు కలసి దారి వెంట పోవుచుండిరి. ఒక పంచముడు ఎదురుగా వచ్చుచుండెను. గణాచారి తొలగి పోబోయినది. అతడు మరియు సమీపమునకు రాబోయెను. ధర్మారా వతనితో, ‘ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే యుండదు. అప్పుడు మనమందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు. మూలమైన బీజాక్షరపీఠమున శక్తి యప్పటికి సమూలముగా నశించును. నేను నీ వాడను పద’ యనెను. అతనికి తెలియలేదు. ధర్మారావు వంక వెర్రిమొర్రిగా చూచుచు నతడు దూరదూరముగా పోయెను.

ధర్మారావు మాటల్లోని వెక్కిరింత, వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. గాంధీతో భావజాల విభేదాలే ధర్మారావు స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణమని రచయిత సూచించి ఉంటే అది ధర్మారావుకు కొంత గౌరవప్రదంగా ఉండేది. అటువంటి స్పష్టత రచయితకు ఉండకపోవడానికీ అవకాశముంది. గాంధీ నాయకత్వంలో కాకపోయినా తనతో భావసారూప్యమున్న వ్యక్తులతోనో, సంస్థతోనో కలసి ధర్మారావు స్వరాజ్యానికి ప్రయత్నించి ఉండవచ్చు. అదీ చేయలేదు.

అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. అతని నిర్లిప్తత, నిష్క్రియత లౌకిక విషయాలలోనే. అలౌకిక విషయాలలో అతను క్రియాశీలిగా, నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నవాడిలా కనిపిస్తాడు. అది, దేవాలయం కేంద్రంగా సాంప్రదాయికతను లేదా వర్ణవ్యవస్థను పరిరక్షించడం. అలౌకిక జీవులుగా తోచే గణాచారి, గిరిక, పసరికలకు అతను అక్షరాలా అంగరక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఆ ఘట్టాలలో అతను ఎంత క్రియాశీలంగా ఉంటాడంటే, మరో ధర్మారావు అనిపిస్తాడు. ఈ సందర్భాలలో రచన కూడా అనూహ్య వేగాన్ని, సంవిధానాన్ని పుంజుకుని పాఠకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా పసరికను ఒక ఆంగ్లేయుడు అపహరించి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ధర్మారావు దానిని అడ్డుకుని పసరికను విడిపించిన తీరు మరింత ఆకట్టుకుంటుంది.

అదలా ఉంచితే, వ్యవస్థా పరిరక్షణలో భాగంగా యువరాజు హరప్పకు గురువుగా మారి అతన్ని కర్మయోగం వైపు నడిపించినట్టు, దేవదాసి అయిన గిరికను భక్తిమార్గంలో పరిణతను చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంటుంది.  అయితే ఆ గురుత్వం చుట్టూ నిగూఢత అనే తెర వేలాడుతూ ఉంటుంది. చెల్లెలైన గిరిక చేత సాధన చేయించడంలో అది మరింతగా వ్యక్తమవుతుంది. గిరిక పూర్తిగా అతిమానుష లోకంలోనే జీవిస్తూ ఉంటుంది. ధర్మారావు లౌకిక జగత్తు నుంచి, మధ్య మధ్య గిరికకు చెందిన అలౌకిక జగత్తులోకి పయనిస్తూ ఉంటాడు. పాఠకుల్ని ఆకట్టుకునే అంశాలలో ఈ అన్నా-చెల్లెళ్ల అనుబంధ చిత్రణ ఒకటి.

లౌకికంగా చూసినప్పుడు సామాన్య పాఠకులలో గిరిక పాత్ర కూడా ఎన్నో ప్రశ్నల్ని రేపుతుంది. ఆ భక్తి ఏమిటో, అంత చిన్న పిల్ల దేవుణ్ణే(వేణుగోపాలస్వామి) పతిగా వరించి లౌకిక పరిసరాలు పట్టకుండా అతని స్మరణలోనే గడపడమేమిటో అనిపిస్తుంది. నాస్తికుల సంగతి అలా ఉంచి భక్తులకు సైతం విడ్డూరం గొలిపేలా ఆమె భక్తితత్పరత ఉంటుంది. శారీరకంగా ఆమెలో ప్రకృతిసహజమైన ఎదుగుదల, సౌందర్యం, లావణ్యం ఉంటాయి. కానీ మానసికంగా ప్రకృతి సహజమైన కోరికలకు అతీతంగా ఉంటుంది. వేణుగోపాలస్వామితోనే ఆమె శృంగారానుభవం. ఈ చిత్రణ చివరికి ప్రకృతికి, దైవానికి మధ్య వైరుధ్యంగా పరిణమిస్తుంది. గిరిక ఉదంతాన్ని విడిగా చిత్రిస్తే భక్తికి ఆమె ఒక పరాకాష్టగా కనిపించి భక్తులను అలరించి ఉండేదేమో కానీ; సామాజికవస్తువుతో కూడిన నవలలో భాగం చేయడం వల్ల సార్వత్రిక సమాజం ఈ పాత్రతో ఎలా అనుసంధానమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పసరిక పాత్రతో పోల్చి చూసినప్పుడు ఈ తేడా అర్థమవుతుంది. పర్యావరణానికి ప్రతీకగా సృష్టించినది కనుక పసిరికతో సార్వత్రిక సమాజం తేలికగా అనుసంధానం కాగలుగుతుంది. భక్తి అనేది పర్యావరణం వంటి సార్వత్రిక అంశం కాదు కనుక గిరికతో అలాంటిది సాధ్యం కాదు. మళ్ళీ లౌకికంగా చెప్పుకుంటే గిరిక పాత్ర ద్వారా రచయిత దేవదాసీ వ్యవస్థను అసలు అర్థంలో నిరూపించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అయితే గిరిక దేవదాసీ వ్యవస్థకు అచ్చమైన ప్రతినిధి అవుతుందా, ఏ కాలంలోనైనా దేవదాసీలు ప్రకృతి సహజమైన స్పందనలకు దూరంగా గిరికలా పూర్తిగా దేవుడికే అంకితమై ఆయనే లోకంగా జీవించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎవరివరకో ఎందుకు, గిరిక తల్లి రత్నగిరి కూడా అలా లేదు. ఆమె రామేశ్వరశాస్త్రికి భోగస్త్రీ అయింది.

  (సశేషం)

 

 

 

 

జ్ఞానానికి అడ్డుగోడ

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-7

 

sudrarsanamధర్మారావు ఊహాప్రపంచంలో అప్రత్యక్షానికి, అతీతజ్ఞానానికి, అవ్యక్తానికే ప్రముఖస్థానం. నేత్రాల కన్నా మనసుకు, మనసుకన్నా ఆత్మకే ప్రాధాన్యం. అతని సిద్ధాంతాలు, సూత్రీకరణలు అన్నీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే, ఎంతసేపూ ప్రత్యక్షం నుంచీ, వాస్తవికత నుంచీ దూర దూరంగా పయనించడమే.

ఒక చోట మడికి, పరిశుభ్రతకు మధ్య తేడాను ఇలా చెప్పుకొస్తాడు:

“పరిశుభ్రముగా నుండవలయును గాని, మడిలో ఏమున్నదనును. పరిశుభ్రముగా నుండుటలో మాత్రమేమున్నది?…ఏనాది వారు, కొందరు నీచజాతివారు అసహ్యమైన దేహములతో గుడ్డలతో తినుట లేదా? వారనాగరకులు, బుద్ధిమాలినవారు, నేను నాగరకుడను, నాకు పరిశుభ్రముగా నుండవలయు ననును. పరిశుభ్రముగా నుండుట నాగరకత యైనచో భోజనము చేయువేళ మడిబట్ట యని, దానితో నింకెవరిని తాకనని నియముగా నుండుట మరియు నాగరకత యేమో! మురికి యుండుట లేకపోవుటలలోని తారతమ్యము ప్రత్యక్షము; శుభ్రమైన వస్త్రమునకు, మడిబట్టకును గల తారతమ్య మప్రత్యక్షము. నీవు దేవుడున్నాడందువేని అది అప్రత్యక్ష విషయము. అప్రత్యక్షమై బుద్ధిమంతునిచేత నూహింపబడునదియే మతము. అదియే దివ్యము. అది నీ సామాన్యజ్ఞానమును దాటి యుండును. సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము.”

ఇంకోచోట రచయిత ఇలా అంటాడు:

“అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనబడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.”

ఈ మాటలు సాహిత్య సందర్భానికి వర్తించేటట్టు ఉన్నా, రచయిత తాత్వికతకూ సమానంగా వర్తిస్తాయి.

ఏనాది వారు, అలాంటి ‘నీచజాతివారు’ ‘అసహ్యమైన దేహాలతో గుడ్డల’తో తినడానికి కారణమైన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి ధర్మారావుకు అక్కర్లేదు. ఆ పరిస్థితులు మారితే వారూ పరిశుభ్రతకు మళ్ళవచ్చునన్న ఊహ అతనికి లేదు. ఆ ఊహ కలగడానికి అతనిలో పరిణామస్పృహే లేదు. ఆ స్పృహ ఉండడం అతని సిద్ధాంతాలకు భంగకరం కూడా. కనుక అతని దృష్టిలో తను విశ్వసించే చాతుర్వర్ణ్యవ్యవస్థలానే, నీచజాతులన్నవి కూడా ఒక స్థిరసత్యం. అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవలసిందే. ఎందుకంటే, కొన్ని ‘నీచజాతులు’ ఉండడంలోనే వర్ణవ్యవస్థ ఉనికి కూడా ఉంటుంది. అవి పరస్పర ఆధారితాలు.  ఈ ‘నీచజాతు’ల విషయాన్ని పట్టించుకోని ధర్మారావు, పరిశుభ్రత గురించి వాదించే ‘నాగరకుల’తో పోటీపడి, మడిబట్ట కట్టుకోవడం అంతకంటే నాగరకం అంటాడు. ఆపైన శుభ్రతకు, మడికి తారతమ్యం అప్రత్యక్షం, అంటే కంటికి కనిపించదంటాడు. మడితోపాటు అప్రత్యక్షాలైన దేవుణ్ణీ, మతాన్నీ కూడా తీసుకొచ్చి అవి దివ్యాలంటాడు. మతం కేవలం బుద్ధిమంతుని ఊహకు మాత్రమే అందుతుందని, సామాన్యజ్ఞానాన్ని దాటి ఉంటుందనీ అంటాడు. ఇలాంటి సద్విషయాలను ఆచరించకపోతే నీకే నష్టమని బెదిరిస్తాడు.

లోకం ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానాన్ని అనుసరించి నడుస్తుంది. అలాగని అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం లేదనీ అనాల్సిన అవసరం లేదు. అది వ్యక్తుల స్థాయిలో అనుభూతమయ్యే జ్ఞానం కావచ్చు. కానీ సాముదాయిక స్థాయిలో ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానానికే ప్రాధాన్యం.  ఈ జ్ఞానరంగాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, ఉపయోగకరంగా మలచుకుంటూ ఉన్నప్పుడే  ప్రపంచం అందరికీ సమానంగా వాసయోగ్యం అవుతుంది. ఎంత అసామాన్యజ్ఞానాన్నైనా సామాన్యీకరించి అధికసంఖ్యాకులకు అందుబాటులోకి తేకపోతే దానివల్ల లోకానికి ఉపయోగం ఉండదు.  ఒక పోలిక చెప్పుకుంటే, ఒకప్పుడు మహర్షులు దివ్యదృష్టితో ఎక్కడ ఏం జరుగుతోందో దర్శించేవారంటారు. అది నిజమో, కాదో మనకు తెలియదు. ఒకవేళ నిజమే అనుకున్నా ఆ దివ్యదృష్టి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం. అదే శాస్త్రవిజ్ఞానానికి వస్తే, టెలివిజన్ రూపంలో అలా చూడగల అవకాశాన్ని అది సాముదాయికం చేసింది. ఇలా అప్రత్యక్ష అతీతజ్ఞానాన్ని సామాన్యీకరించి సాముదాయకం చేయాలన్న దృష్టి ధర్మారావులో కనిపించదు. శాస్త్రవిజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య విరోధాన్ని ఊహించుకుని శాస్త్రవిజ్ఞానం కన్నా ఆధ్యాత్మికమే గొప్పదని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ఒకచోట ఇలా అంటాడు:

“సర్వశాస్త్రములు ఆదిహేతువును కాదు, తద్వికారములను గూర్చియే యుపన్యసించును. ఈ యీ పదార్థములయందీ ధర్మమున్నదని యుపన్యసించును గాని యా ధర్మమేల యున్నదో శాస్త్రము చెప్పలేదు. ఆకాశమునం దా నైల్య మేల కనిపించుచున్నది? వాయువో, జ్యోతిస్సో యేదో యొకానొక తరంగసమితి ప్రసరించుటవలన ఈ నీలవర్ణ మేర్పడుచున్నది. దానిని శాస్త్రజ్ఞులైన సి.వి. రామన్ గారు కనిపెట్టిరి. దానికే ‘రామన్ గారి సిద్ధాంతమ’ని పేరు వచ్చినది. ఆ రీతిగా అట్టి తరంగప్రసారమువలన ఆ నీలవర్ణ మేల ఏర్పడవలయు నన్న ప్రశ్న కా మహానుభావు డేమి చెప్పును? అట్టి తరంగ ప్రసరణ మా నైర్మల్యమునకు హేతువనునది ధర్మము. ఆ శాస్త్రజ్ఞుడా ధర్మమును చూచెను. ఆయన చూడక ముందా ధర్మమున్నది. ఆ ధర్మము నిత్యమైనది. తన్నిత్యతా జ్ఞానముండుట కాస్తిక్యమని పేరు. చంద్రుడు, నక్షత్రములు, ఆకాశము; యీ సర్వము తద్ధర్మోపన్యాసమునే చేయుచున్నవి.

…ఆ ధర్మము శాస్త్రజ్ఞులు చెప్పిననే కానీ యితరులు విశ్వసించరట! ఆ శాస్త్రజ్ఞులనైనను, అందరు శాస్త్రజ్ఞులు ఒప్పుకొనవలయునట! వారును పదార్థవిజ్ఞానశాస్త్రవిషయోపన్యాసము లొప్పుకొందురట. ఆధ్యాత్మికవిజ్ఞానశాస్త్ర విషయములందు సందేహమేనట! భౌతికమునకు ఆధ్యాత్మికమునకు నడుమ నున్న మహాసముద్ర మెవ డుల్లంఘించగలడు?”

ఇలా అన్న ధర్మారావు,  మిగతా వానరవీరులెవరూ చేయలేని సముద్రోల్లంఘనను ఆంజనేయుడు ఒక్కడే చేయడాన్ని ఉదహరిస్తాడు. ఆంజనేయుడి సముద్రోల్లంఘనను మిగతావారు విశ్వసించారు కనుక సరిపోయింది కానీ, విశ్వసించకపోతే అతని బతుకేమయ్యేదంటాడు. ప్రతిదీ అందరి అనుభవంలోకి రావలసిందే నంటే, ఐన్ స్టీన్, రామన్, బోసు మొదలైనవారు చెప్పినవన్నీ అందరి అనుభవంలోకి వస్తున్నాయా, అయినా విశ్వసించడం లేదా అని ప్రశ్నిస్తాడు. “ఇది ధర్మమని చెప్పినచో విశ్వసించవలయును…ఒకడు తర్కముచే చూచిన దొకడు విశ్వాసముచేత చూచును”: ఇదీ అంతిమంగా అతని నిర్ధారణ.

visanaa

దీనినిబట్టి ఏమర్థమవుతోంది? శాస్త్రవిజ్ఞానంతో సహా అన్ని రకాల జ్ఞానాలకూ ఆఖరి మెట్టు ఆధ్యాత్మికజ్ఞానం. అది ఎలాంటి జ్ఞానమంటే, అప్రత్యక్షం, అవ్యక్తం, అతీతం! అది ఏ కొందరికో మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రాని అసంఖ్యాకులు ఏం చేయాలంటే, తమకు అనుభవంలోకి వచ్చిందని చెప్పిన ఆ కొద్దిమందినీ నమ్మాలి! ఏ కొందరి అనుభవంలోకో వచ్చే ఆధ్యాత్మికజ్ఞానాన్ని అన్ని జ్ఞానాలకూ ఆఖరి మెట్టుగా నిలబెట్టి, ఆపైన తర్కాన్ని, ప్రశ్నల్ని నిషేధించి విశ్వాసాన్ని స్థాపించడమంటే ఏమిటి? జ్ఞానాన్వేషణకు హద్దులు గీయడమే! నువ్వెంతైనా జ్ఞానాన్వేషణ చేయి, అది అంతిమంగా విశ్వాసం దగ్గర ఆగిపోవాలి!

జ్ఞానంలోనూ ధర్మారావులో విభజన దృష్టే. శాస్త్రజ్ఞానమే అయినా, ఆధ్యాత్మికజ్ఞానమైనా జ్ఞానం అనేది ఒకదానితో ఒకటి ముడిపడిన సరళరేఖలాంటిదే. కానీ ధర్మారావు శాస్త్ర, ఆధ్యాత్మికజ్ఞానాలను పరస్పర సమాంతరాలుగా ఊహించుకుంటాడు. రెండింటి మధ్యా పోటీ పెడతాడు. ధర్మారావు చెప్పే ఆధ్యాత్మికజ్ఞానాన్ని కూడా శాస్త్రవిజ్ఞానం పరీక్షకు పెడుతుంది తప్ప మొండిగా నిరాకరించదు. దేనినైనా మొండిగా నిరాకరించేది శాస్త్రవిజ్ఞానమే కాదు. కాకపోతే, ఏ జ్ఞానమైనా నిరూపణకు అందాలని చెబుతుంది. ఇందుకు భిన్నంగా  ఆధ్యాత్మికజ్ఞానం విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది.  ఎప్పుడైతే విశ్వాసం అనే అడ్డుగోడను కట్టేశారో, ఆ తర్వాత ఇక జ్ఞాన విస్తరణా ఉండదు, వికాసమూ ఉండదు. ధర్మారావు ఊహల పర్యవసానం అలా ఉంటుంది.

శాస్త్రవిజ్ఞానం నిరూపణ మీద ఆధారపడుతుందన్న అవగాహన ధర్మారావులో లేదు. అందులోకి కూడా విశ్వాసాన్ని తీసుకొచ్చి, ‘శాస్త్రజ్ఞులు చెబితే కానీ నమ్మరట’ అని ఎత్తిపొడుస్తాడు. వాస్తవం ఏమిటంటే, ఐన్ స్టీన్, బోస్, రామన్ లాంటి శాస్త్రజ్ఞులు చెప్పారు కనుకే ఎవరూ గుడ్డిగా నమ్మడం లేదు. వారి సిద్ధాంతాలు, సూత్రాలు తాము అర్థం చేసుకోగలిగిన, నమ్మగలిగిన భౌతికప్రమాణాలకు అనుగుణంగా ఉండి, నిరూపణకు అందుతున్న మేరకు నమ్ముతారు. అధ్యయనమూ, ప్రయోగమూ, నిరూపణా అనేవి శాస్త్రవిజ్ఞానరంగంలో నిరంతరం సాగుతూనే ఉంటాయి.

మనుషులను విశిష్టులుగా, సామాన్యులుగా విభజించే ప్రయత్నంలో రచయిత పశుపక్ష్యాదులను కూడా విభజిస్తాడు. అనసూయ(చిన్న అరుంధతి తల్లి, ధర్మారావు అత్త), ధర్మారావుల మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అన:…యాథార్థ్య మతీతజ్ఞాన విషయము గాని యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెలు మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మా: ధర్మము కూడ నట్టిదే. అదియు మనసునకే తెలియును. మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యులీయరు.

ఎక్కువమంది చెప్పలేని, మనసుకు మాత్రమే తెలిసే యాథార్థ్యం అనే అతీత జ్ఞానంతో కానీ, ఏనుగుల గొప్పతనంతో కానీ అసంఖ్యాకులకు పనేమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. సమస్య ఏమిటంటే, రచయిత నొక్కి చెప్పే అప్రత్యక్ష, అతీత జ్ఞానం కేవలం జ్ఞానస్థాయిలోనే ఉండిపోదు. బౌద్ధికజీవితంపైనే కాక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయజీవితంపై వాటి ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. లౌకికమైన అన్ని రంగాలలోనూ విశిష్టత, సామాన్యత అనే తారతమ్యాలు ఏర్పడతాయి. విశిష్టత, సామాన్యతా సూత్రాన్ని రాజకీయ పరిపాలనారంగాలకు అన్వయిస్తే అది వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల అనుశాసనం మాత్రమే చెల్లుబాటు అయ్యే రాచరికం అవుతుంది. అధికసంఖ్యాకుల ఆమోదం మీద సాగే ప్రజాస్వామ్యం దానికి పూర్తి భిన్నం.

రాచరికవ్యవస్థతో సంపూర్ణ తాదాత్మ్యాన్ని చాటుకున్న వేయిపడగల రచయిత, అధికసంఖ్యాకుల ఆమోదానుసారం నడిచే ప్రజాస్వామ్యాన్ని తృణీకరించిన సందర్భాలు అనేకచోట్ల కనిపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమంటే వైవిధ్యాన్ని నిరాకరించడమే. ఆయన కసలు ప్రజాస్వామ్యపు మౌలిక స్వభావమే అర్థం కాలేదు. “రాజును నా వంటి వాడే యని వీతిలో నిలుచుండి యనుము. ఏమగును? ఉరికి జానెడు బెత్తుడులో నుందువు” అని ధర్మారావు ఒకచోట అంటాడు.  ప్రజాస్వామ్యంలో ప్రధానిని, ముఖ్యమంత్రిని, మంత్రులను నిస్సంకోచంగా విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలే ప్రభువులు. మంత్రులు వారి ప్రతినిధులు, సేవకులు మాత్రమే. రాచరికంలో ప్రభునింద తప్పైతే ప్రజాస్వామ్యంలో ప్రజానింద తప్పవుతుంది. రచయిత ప్రాపంచిక దృక్పథం ప్రకారం సామాన్యులు, అసామాన్యుడి ముందు తమ అల్పత్వాన్ని అంగీకరించి అతని ఆధిపత్యానికి తలవంచాలి. అతడు ఏం చెబితే అది నమ్మాలి. ఈ నమ్మడం అనేది కేవలం అలౌకిక విషయాలకు మాత్రమే కాక, అన్ని లౌకిక విషయాలకూ వర్తిస్తుంది. సామాజికంగానే కాక సృష్టి సహజంగా కూడా మనుషుల సామర్ధ్యాలలో, ఆలోచనాసరళిలో, జీవన విధానాలలో, ఆహారపు అలవాట్లలో, విశ్వాస, అవిశ్వాసాలలో వైవిధ్యం ఉంటుంది. కానీ విశిష్టత- సామాన్యత అన్న విభజన సూత్రం ఆ వైవిధ్యాన్ని గుర్తించదు. తనదైన మూసలోకి అందరూ రావలసిందే నని శాసిస్తుంది. రానివాళ్లపై హింసను ప్రయోగిస్తుంది. గోరక్షణ పేరుతో గుజరాత్ లోని ఉనాలో దళితుల వీపులపై లాఠీల స్వైరవిహారం ఒకానొక ఉదాహరణ. విశ్వాసి కానివాడికి, ప్రశ్నించేవాడికి ఈ స్కీములో చోటు ఉండదు. అవిశ్వాసి నోరు ఎత్తడానికి వీలులేదు. నోరెత్తితే అతని జీవితం నరకమవుతుంది. భౌతికంగానే గల్లంతు అవుతుంది. అలనాటి చార్వాకుడి నుంచి, ఇటీవలి కల్బుర్గి, ధభోల్కర్ ల వరకు ఇందుకు అనేక ఉదాహరణలు.

ప్రజాస్వామ్యం రాచరికానికి పూర్తిగా తలకిందుల రూపం. ఇందులో అధికసంఖ్యాకుల మాటకే చెల్లుబాటు. అధికసంఖ్యాకులు ఆమోదించిన రాజ్యాంగం ప్రకారమే ఇందులో పరిపాలన సాగాలి తప్ప కొందరు రుద్దే విశ్వాసం ప్రకారం, కొందరి మనసులో ఉన్న ఊహల ప్రకారం; అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం ప్రకారం పరిపాలన సాగదు. జ్ఞానాన్ని అందరికీ అందనంత ఎత్తుకి తీసుకువెళ్లడం విశిష్టుల పాలనలో పద్ధతి. జ్ఞానాన్ని జనానికి అందే ఎత్తుకి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో అనుసరించవలసిన పద్ధతి. ప్రజాస్వామ్యం ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనూ ప్రశ్నించదు. సాముదాయిక ప్రయోజనాలనే ఉమ్మడి ప్రాతిపదికపై అది పనిచేస్తుంది. సామాజిక సామరస్యానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించనంతవరకు అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛనూ అడ్డుకోదు.

అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రజాజీవితంలోకి తీసుకొచ్చినప్పుడు జరిగే నష్టం బహుముఖంగా ఉంటుంది. అది పరిపాలనారంగంలో పారదర్శకతను హరిస్తుంది. భావోద్వేగ అంశాలను నినాదాల రూపంలో ముందుకు తెస్తుంది. పాలకుల చుట్టూ కాంతి వలయాన్ని సృష్టించి వారిని దైవసమానులుగానే కాదు,  దైవాలుగా, మెసయ్యాలుగా మారుస్తుంది.  రకరకాల వైరుధ్యాలపై తెర కప్పి జనంలో అయోమయాన్ని సృష్టిస్తుంది. జనం నమ్మకాలను, బలహీనతలను, భావోద్వేగాలను అధికారానికి నిచ్చెనమెట్లుగా వాడుకుంటుంది.  ఆ ప్రయత్నంలో జనాన్ని బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హింసకు పాల్పడుతుంది.

పైన ఉదహరించిన  “సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము”  అన్న ధర్మారావు మాటలో ఉన్నది బెదిరింపు, బ్లాక్ మెయిలే. అప్రత్యక్ష, అతీత జ్ఞానాల పేరుతో విశ్వాసాన్నిజనం మీద రుద్దడంలోనే మాయలూ, మోసాలూ అడుగుపెడతాయి. ‘వేయిపడగ’ల కంటే చాలా ముందే వెలువడిన గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో సారాయి దుకాణం వెనక తోటలో బైరాగి, మునసబు సోమినాయుడు, సాతాని మనవాళ్ళయ్య, జంగం వీరేశ, దుకాణదారు రాందాసు, హెడ్ కానిస్టేబుల మధ్య జరిగే సంభాషణ ఇందుకు చక్కని నమూనా:

మునసబు: గురూ! బంగారం సేస్తారు గదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందు కడుగుతారు?

బైరాగి: మేం చేశే స్వర్ణం మేవే వాడుక చేస్తే తల పగిలిపోతుంది.

హెడ్: అవి వేరే రహస్యాలు. వూరుకొండి మావా! గురోజీ! హరిద్వారంలో చలి లావు గాబోలు?

బైరాగి: నరులక్కద్దు. మాబోటి సిద్ధులకు చలీ, వేడీ, సుఖం, దుఃఖం యెక్కడివి?

హెడ్: ఆహా! అదృష్టవంటే సిద్ధుల్దే అదృష్టం.

మునసబు: గురూ, హరిద్దోరం నుంచి యెప్పుడు బైలెళ్ళారు?

బైరాగి: రెండు రోజులయింది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమార్గాన పోతూవుండగా మీ వూరి అమ్మవారు వనం దగ్గర గమనం నిలిచిపోయింది. యేమి చెప్మా అని యోగదృష్టిని చూసేసరికి అమ్మవారి విగ్రహము కింద ఆరునిలువుల లోతున మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికి దిగి, అమ్మవారిని శేవించుకొని ప్రచ్ఛన్నంగా పోదావనుకుంటే యీ భక్తుడు మమ్మల్ని పోల్చి నిలిపేశాడు.

దుకాణదారు: చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను గురూ!…

మునసబు: సుక్కేసేవోళ్లని మా బాగా పోలుస్తావు! మా వూరమ్మోరు జగజ్జనని! మా చల్లని తల్లి.

ధర్మారావు చెప్పే అప్రత్యక్షాన్ని ప్రత్యక్షీకరిస్తే ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయి. తన నీడను చూసి తనే భయపడినట్టుగా, అప్రత్యక్షజ్ఞానాన్ని సృష్టించినవాడే దానిని నమ్మవలసీ, భయపడవలసీవస్తుంది. ‘కన్యాశుల్కం’ నుంచే ఇంకో సన్నివేశం. బ్రహ్మరాక్షసిని సీసాలో బంధించానంటూ పూజారి గవరయ్య, అతని తోడుదొంగ అసిరిగాడు లుబ్ధావధాన్లుతో ఒక ఆట ఆడుకుంటారు:

లుబ్ధావధాన్లు: బాబ్బాబు! సీసా నా యింట్లో పెట్టకు. మీ యింట్లో పెట్టించండి.

గవరయ్య: మా పిల్లలు తేనె సీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలు వచ్చి మళ్ళీ మీ యింట్లోనే వుంటాయి.

లుబ్ధా: అయితే సీసా భూస్థాపితం చెయ్యండి.

గవ: భూస్థాపితం మజాకా అనుకున్నారా యేవిటీ? భూస్తాపితం చెయ్యడానికి ఎంత తంతుంది! పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి.

లుభ్దా: నా యిల్లు గుల్ల చెయ్యాలి.

(సశేషం)

అతని ఊహా వైపరీత్యం!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-6

 

sudrarsanamనిజానికి ‘వేయిపడగలు’ లోని ధర్మారావు ఒక మనస్తత్వ సంబంధమైన కేసు. నవలలో చిత్రితమైన మేరకు అతను జీవితం పొడవునా చేసినది ఒకటే… వాస్తవిక జగత్తు అనే చతురస్రంలో కాల్పనిక జగత్తు అనే వలయాన్ని ఇరికించే ప్రయత్నం. అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. అయినా విసుగూ, విరామం లేకుండా ధర్మారావు చేసింది అదే. ఆ వైఫల్యమే అతనిలో నిస్పృహ, నిర్వేదం, నిస్సహాయత, నిష్క్రియతా పెంచి; స్వరాజ్యోద్యమంలో పాల్గొన్న అతని మిత్రుడు రాఘవరావుతో పోల్చినా అతనినొక నిరుపయోగిగా మార్చింది. అలాంటి ధర్మారావును యోగిగా, విరాగిగా, నిర్లిప్తుడిగా చూపించబోవడం రచయిత విశ్వసించే తాత్వికతలోని ఒక వైచిత్రి.

ధర్మారావుకు చెందిన కాల్పనిక జగత్తు ఒక విశిష్టమైన జగత్తు. అందులో అందరూ విశిష్టులే ఉంటారు. వారిది ఎంతో విశిష్ట సంప్రదాయం. వారిలో గాఢమైన, లోతైన రసజ్ఞత, అనుభూతి సాంద్రతా ఉంటాయి. వారు మనసును నియమించుకుని, నిగ్రహించుకోగల స్థితిలో ఉంటారు. వారిలో అతీతమైన, అలౌకికమైన జ్ఞానం వెల్లివిరుస్తూ ఉంటుంది. వాస్తవిక జగత్తు అందుకు భిన్నం. అందులో అంతా సామాన్యులు, నేలబారు మనుషులు;  లోతైన రసజ్ఞత, అనుభూతి గాఢత  లేనివారు, లౌకికమైన సుఖాలకోసం, సంపదకోసం పాకులాడేవారు ఉంటారు. గొప్ప జ్ఞానిగా, వివేకిగా  రచయిత చిత్రించిన ధర్మారావులోని భ్రమాజనిత విశ్వాసం ఎలాంటి దంటే; ఒకప్పుడు ఈ దేశంలో అందరూ విశిష్టులు, ఉన్నతులే  అయిన  వ్యవస్థ నిజంగా ఉండేది!

ధర్మారావు ఊహల్లోనూ, అతను మిగతా పాత్రలతో జరిపే సంభాషణల్లోనూ ఈ విశిష్టతా-సామాన్యతల మధ్య వివేచన నవల అంతటా జరుగుతూనే ఉంటుంది. పింగళి సూరన కావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నం చదివి రసస్ఫూర్తిని పొందిన ధర్మారావు, అందులోని “(కొన్ని) భాగములు నేటి కసభ్యములుగా నగుచున్నవి. గాఢమైన శీలము చచ్చినకొలది ప్రాణములు ప్రతి సంగతిలో లోతులు వాంఛించవు. పైపై మెరుగులతో తృప్తి చెందును. అదియే నాగరికత యని విర్రవీగును” అనుకుంటాడు. మిత్రుడు రాఘవరావుతో కలసి రెడ్డి రాజుల రాజధాని అయిన కొండవీడుకు వెళ్ళి అక్కడి శిథిలాల మధ్య తిరుగుతున్నప్పుడు, “ఆ రెడ్లు, వారి పరాక్రమము, వారి ఔదార్యము, వారు పోషించిన కవులు” వారి హృదయాలను ఆనందభరితం చేస్తాయి. “అది యొక పుణ్యసమయము. మన మపుడైన బ్రతికి యున్నాము కాదు” అని ధర్మారావు అనుకుంటాడు. ఇంకోచోట, “రసమునందు పర్యవసించుట యెవనికి? రసజ్ఞుడైన వానికి. ప్రతివిషయము నెవడు హృదయము దాక తెచ్చుకొనగలుగునో వాడు రసజ్ఞుడు. ప్రతివాడు నట్లు చేయలేడు…భగవంతుడెంతయైన లోతైన విషయము. ఆ లోతు మహాపరిపక్వ దశయందున్న దేవదాసి మనస్సునకే తెలియుచున్నది” అనుకుంటాడు.

రాణి రుక్మిణమ్మారావుతో మాట్లాడుతూ, “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది. రంగాజమ్మగారిని చూడుడు! ఆమె పూర్వపు భావోన్మాదము, పాతివ్రత్యము, వర్ణస్వచ్ఛతకు చిహ్నమైన మూర్తి. అవి యన్నియు యామెతో నంతరించినవి. కృష్ణమనాయుడుగారు పూర్వరాజచిహ్నము. ఆయనతో అది పోయినది. దేవదాసితో దేవదాసీత్వమే నశించిపోవును. మీతో మహారాజ్ఞీత్వమే నశించును…నేను మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనునూ ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!” అంటాడు.

రాచరికవ్యవస్థతోనూ, గతంతోనూ ధర్మారావు తాదాత్మ్యం ఎంతటి దంటే, “కోటకు కోట యాకృతి పోయి యొక పెద్ద ధనవంతుని యింటి యాకారము పడినది” అనుకుని బాధపడతాడు.

ఇంతకీ ధర్మారావుకు అంత ఆదర్శవంతంగా కనిపించిన సుబ్బన్నపేటలోని రాచరిక వ్యవస్థ ఎలాంటి పునాదుల మీద లేచింది? అది మరో ఆశ్చర్యం. రచయిత ఏ మాత్రం దాపరికం లేకుండా దానిని బయటపెడతాడు.  అయిదారు జతల ఎడ్లను కిరాయికి తిప్పుకుంటూ  జీవించే వీరన్ననాయడు అనే సాధారణ సంసారి, టిప్పు సుల్తాన్ పై యుద్ధానికి వెడుతున్న ఇంగ్లీష్ వారికి తన ఎడ్లనిచ్చి సాయపడతాడు. వారు శ్రీరంగపట్నాన్ని దోచుకుంటారు. అప్పుడు వీరన్ననాయడు తనవంతు దోపిడీకి అవకాశమిమ్మని అడుగుతాడు. వారు కోటలోని ఒక కొట్టును చూపించి దానిని దోచుకొమంటారు. అతని అదృష్టం కొద్దీ దానినిండా నవరసులు ఉంటాయి. వాటిని అతను రహస్యంగా ఎడ్లకు ఎత్తుకుని ఇంటికి తోలుకుంటాడు.

veyi

ఆ దోచుకున్న ధనబలంతోనే అతను సుబ్బన్నపేటకు రాజవుతాడు. స్థానికంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు అతనికి తోడవుతాడు. ఫలానా చోట కోట కట్టుకోమని అతనే చెబుతాడు. బ్రాహ్మణునికి కావలసింది ఆ ఊళ్ళో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టించడం. కోట నిర్మాణం, గుడి నిర్మాణం ఒకేసారి మొదలవుతాయి. వారిద్దరి అన్యోన్యత అలా ప్రారంభమై నానాటికీ బలపడుతుంది. విశేషమేమిటంటే,  వీరన్ననాయడు ఏ కులంవాడో రచయిత మొదట్లో ఎక్కడా చెప్పడు. కానీ రాజు కాగానే ‘క్షత్రియు’డైపోతాడు. మన దేశంలో వివిధ రాచవంశాల పుట్టుక గురించి ఇక్కడ విశ్వనాథ వాస్తవాన్నే బయటపెడుతున్నారు. ఈ దేశంలోనే ఉన్న ఇతర రాజ్యాలను దోచుకునో; లేదా దేశీయుడా, విదేశీయుడా అన్న తేడా కూడా చూడకుండా దోపిడీ శక్తులకు సాయపడో గడించిన సంపద పునాదుల మీద లేచినవవి. దోచుకున్న వ్యక్తి ఏ కులానికైనా చెంది ఉండవచ్చు; కానీ అధికారబలం, ధనబలం లభించగానే  బ్రాహ్మణ్యం అతనికి క్షత్రియత్వం కల్పిస్తుంది. ఇది ఉభయతారకమైన ఏర్పాటు. దోచుకున్న సొమ్ము అయితేనేం, అందులో కొంత దేవాలయానిర్మాణం వంటి దైవకార్యాలకు వినియోగిస్తే అది పవిత్రమైపోతుంది. ఈ రోజున కూడా తిరుపతి హుండీలో నల్లడబ్బు ఏ ప్రమాణంలో చేరడం లేదు?

ధర్మారావు ఊహాజగత్తులో అత్యంత విశిష్టంగా, ఆదర్శవంతంగా రూపుదిద్దుకున్న సుబ్బన్నపేట జమీందారి యథార్థరూపం ఇదీ. తన ఊహాశాలితను కాస్త నేలమీదికి మళ్లించి జమీందారీ మూలాలను తడిమి ఉంటే, అది దోపిడీ సొమ్ము మీద లేచిన వైభవోపేత నిర్మాణం అన్న సంగతి ధర్మారావుకు తెలిసేది. కానీ వాస్తవికత అనే నేల విడిచి ఊర్ధ్వయానం  సాగించడమే తప్ప కిందికి ప్రసరించే తత్వం అతని ఊహాశాలితకు లేదు. ఆ ఊర్ధ్వయానంలో పై పైకి వెళ్ళిపోయి కింద వాస్తవిక ప్రపంచం అనేది ఒకటుందన్న సంగతిని కూడా అతను ఒక్కోసారి మరచిపోతాడు. కావ్య రసాస్వాదన విషయానికే వస్తే, అతను తరచు రసప్రపంచంలో తప్ప మనుష్యలోకంలోనే ఉండడు. కావ్యజగత్తు గురించిన అతను చేసిన కింది  ఊహలు, వ్యవస్థ గురించిన అతని  కాల్పనిక ఊహలకూ యథాతథంగా వర్తిస్తాయి:

“ఓహో! కావ్యజగత్తు కల్పితజగత్తనుకొంటిని. కావ్యజగత్తే యథార్థమైన జగత్తు. అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావములు కలిగిన మనమే కల్పిత జగత్తు. యథార్థమైన మనోభావములు, నిర్మలమైన హృదయము, మహానాగరకత పొందిన బుద్ధీంద్రియములు కలిగినచో, తన దృష్టి, తన రక్తము కల్మషరహితమై, ధర్మగుణభూయిష్ఠములైనచో శీలము నందంత గాఢత్వముండును. అంత యేకాగ్రత యుండును…వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది.”

రాచరికవ్యవస్థ గురించిన అతని ఊహలు ఇంకా ఎంత హాస్యాస్పదంగా వ్యక్తమవుతాయంటే; అవి నవ్వునీ, బాధనీ కూడా కలిగిస్తాయి. అతనొకసారి ఇలా అనుకుంటాడు:

“మా తండ్రి నన్నేమో మహావైదికుని చేయవలెననుకొనెను. అన్న రామచంద్రరాజును గొప్ప విలుకానిని చేసి, అతనికి బ్రహ్మోపదేశము చేసి అధర్వవేదము పునరుద్ధరించి బ్రహ్మాస్త్రము మొదలైనవి కల్పితములు కావు, యథార్థములని రుజువు చేయించి, జగత్తు మరల క్షత్రియులచే నేలించవలయు ననుకొన్నాడు.”

ఈ నవల రచించే కాలానికి ఎంతో ముందే యుద్ధతంత్రంలోకి ఆధునిక మారణాయుధాలు ప్రవేశించాయి. మరో ఒకటిన్నర దశాబ్దాల కాలంలో అణ్వాయుధాలు కూడా ప్రయోగంలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారావు విలువిద్య గురించి, అధర్వవేదాన్ని పునరుద్ధరించి బ్రహ్మాస్త్రం మొదలైనవి కల్పితాలు కావని నిరూపించడం గురించి, జగత్తును(ఒక్క భారతదేశాన్నే కాదు) క్షత్రియులచే ఏలించడం గురించి కలలు కనడం అతని మానసికవైపరీత్యాన్నే సూచిస్తుంది. అతని ఊహలు పరిణామశీలాన్ని గుర్తించకపోవడమే కాదు; కాలాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నాయి. క్షత్రియుడి పాలనను జగత్తు మొత్తానికి విస్తరింపజేస్తున్నాయి.

అతని ఊహలు, మధ్య మధ్య రచయిత చేసిన నిర్ధారణలు హాస్యాస్పదాలే కాదు; తర్కానికీ, హేతుబద్ధతకూ, శాస్త్ర నిరూపణకూ, చరిత్రకూ నిలవనట్టు ఉంటాయి. ఒకచోట రచయిత ఇలా అంటాడు: “ఏదో బలహీనపు గాలి మన దేశము మీదికి విసిరెను. ఆజానుబాహులై, విశాలవక్షులై, యేనుగు తొండము పూని విరువగల జాతికి; గుజ్జులై బక్కపలచనై, తెల్లవారి లేచినంతనే యేదియో యాహారము లేకపోయినచో తపతపలాడిపోవు జనులు పుట్టిరి.” మనదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ఒకప్పుడు అందరూ ఆజానుబాహులు, విశాలవక్షులు ఉండి; ఇంకొకప్పుడు అందరూ గుజ్జులు, బక్కపలచని వారు ఉండడం జరుగుతుందా? శరీరాకృతులు కానీ, ఆరోగ్యఅనారోగ్యాలు కానీ, ఆయుర్దాయంకానీ ఆయా కాలాలలో పుష్టికరమైన ఆహారలభ్యత, వైద్యసేవలు, ఆర్థిక సమానత లేదా అసమానత  మొదలైన భౌతిక, శాస్త్రీయ కారణాలపై ఆధారపడి ఉంటాయి తప్ప నిత్యసత్యాలుగా ఉండవు.

రక్తం, వర్ణం మొదలైన ప్రాతిపదికలపై జాతులను, మనుషులను విడగొట్టి చేసే ఊహలు కూడా అంతే అతార్కికంగా, అశాస్త్రీయంగా ఉంటాయి. ఆయా భాషల్లోని ఆయా వైచిత్రుల సమగ్రత తెలియడం, అవి అర్థమవడం ఆ దేశాల్లో పుట్టి ఆ భాషలు చిన్నప్పటినుంచి మాట్లాడితే కానీ సాధ్యం కాదని ధర్మారావు అనుకుంటాడు. “ఒక జాతి గుణములు, మతాభిప్రాయములు, తజ్జాతి రక్తము నెట్లుండునో, ఆ జాతి మాట్లాడు భాషలోని సమగ్రమైన రసాభావాదులర్థము చేసికొనుట కూడ శరీరములోని తద్రక్తము వలననే సంభవించు నని”  ఊహించుకుంటాడు. “వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది” అనుకుంటాడు. “ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు…ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికి నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును…క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే…అందర మొక్కటి యను సిద్ధాతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది…అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి” అంటాడు. “ఆత్మలో భేదము లేదు. జీవునిలో భేదమున్నది…జలమే తాను తన యున్న భిన్నప్రదేశమును బట్టి భిన్నత్వము తెచ్చుకున్నది. తదుపాధిగత గుణదోష సంక్రాంతిచేత జీవుడు భిన్నుడగుచున్నాడు” అని తీర్మానిస్తాడు.

పోనీ వాదానికి రక్తభేదం, వర్ణభేదం ఉన్నాయని ఒప్పుకున్నా; అవి సంకరం కాకుండా ఎప్పుడైనా ఉన్నాయా? ప్రపంచచరిత్రలోకి వెడితే వర్ణసంకరం, జాతి సంకరం కాని కాలమే కనిపించదు. నాగరికత సోకని ఏవో మారుమూల ఆదివాసుల ప్రాంతాలలో తప్ప; నాగరికత పరిధిలోకి వచ్చిన ప్రపంచ జాతులు, మనుషుల మధ్య సాంకర్యం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. వర్ణసాంకర్యం గురించి మహాభారతంలోని అర్జునుడే గగ్గోలు పెట్టిన ఉదాహరణ ఉండగా, ‘వేయిపడగలు’ రచయిత ఏ వర్ణస్వచ్ఛత గురించి మాట్లాడుతున్నట్టు?

ఇంకోచోట, “కులవిద్యయే  కూడు బెట్టును. ఇప్పుడు కులవిద్యలు చెడిపోయి, సంపాదించుటకు చదువు కొనవలసివచ్చుచున్నది” అంటాడు. ఇక్కడ కులవిద్య అనే మాటను వృత్తి విద్యగా తీసుకుంటే బ్రిటిష్ పాలనలో వృత్తులు క్షీణించి వాటిని ఆశ్రయించుకున్న జనం అల్లాడవలసివచ్చిన మాట నిజమే. వారికి తగిన ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందని మేరకు పై అభిప్రాయంలో కొంత నిజం ఉన్నమాట వాస్తవం. అయితే, కులవిద్య అన్నప్పుడు ఏ విద్య ఏ కులానిది; ఎక్కడ హద్దులు గీయగలం అనే ప్రశ్న వస్తుంది. బ్రాహ్మణులు మంత్రులుగా, సేనానులుగా లేరా? యుద్ధాలు చేయలేదా? అలాంటప్పుడు వారి కులవిద్య ఏదని చెబుతాం? అలాగే, వర్ణవ్యవస్థ ప్రకారం రాజ్యాధికారం క్షత్రియుడిది అనుకుంటే, రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ క్షత్రియులేనా? రాజులుగా ఉన్నవాళ్ళు అందరూ పుట్టు క్షత్రియులు కారనీ, వారికి క్షత్రియత్వం కల్పించారనీ, అందుకు హిరణ్యగర్భ క్రతువు వంటి అనేక ప్రక్రియలను అనుసరించారనీ తెలిపే ఉదాహరణలు అనేకం కనిపించడం లేదా? కులవిద్యనే అంటిపెట్టుకుని ఉంటే, ఒక వ్యవసాయదారుడు, ఒక కమ్మరి, కుమ్మరి, రజకుడు అధికారి, మంత్రి కాగలరా?

ఎలాంటివాడు ధర్మారావు? ఒకవైపు ఒక సంప్రదాయం చచ్చిపోతోందంటాడు. ఏదో బలహీనపు గాలి దేశం మీదికి విసిరిందంటాడు. ఒక మహా ప్రచండవాయువు వీస్తూండగా ఒరిగిపోయే వృక్షాలను నిందించి ఏం లాభమంటాడు. ఎవరిలోనూ ఉత్తమగుణాలు లేవంటాడు. మహార్థవంతమైనవన్నీ నశించిపోతున్నాయనీ, అల్పప్రయోజనములైనవన్నీ విజృంభిస్తున్నాయంటాడు. ఇంకోవైపు, ఇంతటి విపత్కరస్థితిలో కూడా కులవిభజన, వర్ణవిభజన, జాతి విభజన అంటూ ఎక్కడికక్కడ మనుషుల్ని చీల్చి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఉమ్మడిగా ఎదుర్కొంటున్న పతనం నుంచి బయటపడడానికి ఐక్యంగా ఏం చేయాలన్న ఆలోచనే అతనిలో కనిపించదు. అతని ఉద్దేశంలో వర్ణవ్యవస్థ మళ్ళీ అవతరించి, జగత్తును అంతటినీ ఏలే అధికారం తిరిగి క్షత్రియుడికి కట్టబెడితే చాలు, అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయి.

అతనిలోని విభజిత దృష్టికి అంతే కనిపించదు. మనుషుల్నే కాదు మతాలను విభజిస్తాడు, సాహిత్యాన్ని విభజిస్తాడు, శిల్పాన్ని విభజిస్తాడు, చిత్రకళను విభజిస్తాడు. ఈ విభజనలో కొన్ని చోట్ల ఎక్కడైనా, ఏ కొంచమైనా వాస్తవం ఒకింత తళుక్కు మంటే అనవచ్చు. కానీ అతనిలో విరాట్ రూపంలో వ్యక్తమయ్యే స్వ, పర చింతన దానిని పూర్తిగా కప్పివేస్తుంది. అన్ని నదులూ సముద్రంలో కలసినట్టు ధర్మారావు ఊహలన్నీ ఆత్మోత్కర్షలో కలుస్తాయి. ఎందులోనైనా సరే మనమే గొప్ప. “మన దేశమునందు పుట్టిన దేనికి మాపులేదు. ఖద్దరు గుడ్డకు మాపేమిటి? అది యెప్పుడును పవిత్రమే. ఎప్పుడును నిర్మలమే” వంటి నిర్ధారణలు సర్వత్రా కనిపిస్తాయి. మళ్ళీ ‘మన దేశీయులు’ అన్నప్పుడూ అక్కడ మరో విభజన:

“మన దేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వము నని యర్థము. ఈ భూఖండము నందు పుట్టినంతలో నొరిగినది లేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మన దేశస్థుడు.”

(సశేషం)

 

 

 

ధర్మారావులో ఒక ‘అపరిచితుడు’

 

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-5

 

sudrarsanamదుఃఖించే మనిషిని చూడండి. అప్పుడతని, లేదా ఆమె ముఖకవళికలను చూడండి. దుఃఖం కళ్ళను తడిపి, ఆ తర్వాత, సృష్ట్యాదినుంచీ తన లోపల గడ్డ కట్టిన  ఒక పెద్ద మంచుఖండం వేదనా విలయాగ్నికి కరిగి ఒక మహా ప్రవాహంలా మారి కళ్ళు అనే రెండు ఇరుకు బిలాలనుంచి ఒక్కుమ్మడి ముందుకు దూకడానికి ప్రయత్నిస్తోందా అన్నట్టు ఉంటుంది!

ఎప్పుడైనా, ఎవరిదైనా సరే దుఃఖం హఠాత్తుగా మనల్ని ఒక అలౌకిక జగత్తులోకి తీసుకుపోయి అస్తిత్వం తాలూకు అనాది ఆర్తారావాన్ని శబ్దంగానూ, నిశ్శబ్దంగానూ కూడా ధ్వనిస్తుంది.

ప్రతి దుఃఖం వెనుకా గొప్ప కారణం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి దుఃఖమూ అర్థవంతం కావాల్సిన అవసరమూ లేదు. అమ్మతో అయిదేరాళ్ళ కుర్రాడు జనసమ్మర్దంలోకి వెళ్లినప్పుడు, అంతవరకూ పక్కనే ఉన్న అమ్మ, అంతలో కనిపించకపోతే భయవిహ్వలతతో బావురు మన్నప్పుడు కూడా ఆ దుఃఖంలో అస్తిత్వపు అనాది ఆర్తారావమే తళుక్కుమంటుంది.  కొత్తగా అత్తింటికి వెళ్ళే నవవధువు తల్లిదండ్రులను విడిచి వెళ్ళేటప్పుడు పడే దుఃఖం కూడా అలాంటిదే. బిడ్డ పోయినప్పుడు తల్లి, తల్లి పోయినప్పుడు బిడ్డ పడే దుఃఖం వీటికన్నా సహస్రాంశాలు పెద్దవిగా, అర్థవంతమైనవిగా మనకు అనిపించవచ్చు.  కానీ దుఃఖితుడిలో అలాంటి తేడాలు ఏవీ ఉండవు. ఆ క్షణంలో తన దుఃఖమే తీవ్రం. అందుకు దారి తీయించినదే గొప్ప కారణం.

దుఃఖానికి ఇంకొక విలక్షణ స్వభావం కూడా ఉంది. దుఃఖితుడు, అతని లోపాలోపాలు, దుఃఖకారణాలు, అందుకు సంబంధించిన తర్కవితర్కాలు సహా అన్నింటి నుంచి అది వేరుపడి స్వతంత్రను స్థాపించుకుంటుంది. అప్పుడా అశ్రుధార ఏ మాలిన్యాలూ అంటని స్వచ్ఛజలం. తన ‘పరమపావన వంశాన్ని’ వెలగా చెల్లించి కొనుక్కున్న ‘కడజాతి’ ఇల్లాలు మరణించినప్పటి నిగమశర్మ దుఃఖం కూడా అంతటి స్వచ్ఛమే.

ఒక కోణం నుంచి చూస్తే గొప్ప అనుభూతి గాఢత నిండిన కవిత్వమూ, గొప్ప దుఃఖమూ విమర్శకు అతీతాలు. ‘వేయిపడగలు’ పేరుతో వేయి పుటల మీదుగా ప్రవహించినది, విశ్వనాథవారి అలాంటి మహాదుఃఖం. మహాకవితాత్మక దుఃఖం. అది గతించిన, గతించిపోతున్న ఒకానొక వ్యవస్థను గురించిన దుఃఖం. బహుశా అప్పటికి ఎంతోకాలంగా హృదయంలో సుడులు తిరుగుతున్న ఆ దుఃఖం ఒకానొక క్షణంలో కట్టలు తెంచుకుని ఇరవై తొమ్మిది రోజులపాటు ఏకబిగిని ప్రవహించి అక్షరరూపం ధరించి మహా శోకప్రవాహం అయింది. ఆ ప్రవాహపు ఉరవడిలో మనం ఉక్కిరిబిక్కిరవుతాం, అప్రతిభులమైపోతాం, మనకు తెలియని ఒకానొక అపూర్వ జగత్తులో …అనేకానేక సందేహాలు, విచికిత్సల మధ్య దిక్కు తోచని స్థితిలో కొట్టుకుపోతాం.

రచనాంతంలో, ‘ఏమి మిగిలింది?’ అని ప్రశ్నించుకున్న ధర్మారావుతో, ‘నేను మిగిలాను’ అని చిన్న అరుంధతి అంటుంది. ‘అవును. నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి. నా యదృష్టము. నీవు మిగిలితివి’ అని ధర్మారావు అంటాడు. కానీ, పుస్తకాన్ని మూసేసి,  ఇంతకీ రచన ఏం చెప్పిందని సవిమర్శకదృష్టితో ప్రశ్నించుకునే పాఠకునికి ధర్మారావుకి లభించిన సంతృప్తి లభిస్తుందా అంటే సమాధానం దొరకదు.

ఒక కారణం, రచన పరిణామశీలాన్నే నిరాకరించడం. రచయిత చిత్రించినది, కాంక్షించినది ఎటువంటి మార్పులకూ, కొత్తదనానికి చోటివ్వని…కాలంలో ఘనీభవించిపోయిన ఒక వ్యవస్థను! రచన చివరిలో ఇలా అంటాడు:

“ఆహా! ఏమి కాలము!  ఏమి మార్పు! ఎన్నెన్ని ప్రాతవి నశించిపోయినవి? ఎన్నెన్ని క్రొత్తవి తలచూపినవి! లోకమంతయు నూత్నత్వము శక్తి యనుకొనుచున్నది. నూత్నత్వము నూత్నత్వమే కానీ శక్తి యెట్లగును? కొత్తలో గాడిదపిల్ల కూడ కోమలముగానే యుండును. ఆహా! ఎంత నశించిపోయినది? నశించిపోయినదానిని చూచినచో కడుపు తరుగుకొని పోవుచున్నది. ఈ నశించిన దంతయు వ్యర్థమై తేజోరహితమైనదైనచో దుఃఖము లేదు. నా జాతి యింత దైవోపహతమైన దేలకో? ఈ జాతి చేసిన పాపమున కంతులేదు కాబోలు!”

నిత్య పరిణామానికి సాక్షులుగా ఉండి, దానిని సహజంగా తీసుకుని, పాత, కొత్తల మధ్య ఒక సమన్వయానికి నిరంతర సాధన చేసే జనాలముందు పై వాక్యాలు ముందుకీ, వెనక్కీ కూడా  వెళ్లలేని ఒక అడ్డుగోడను రెండు వైపులా నిర్మిస్తాయి. అయోమయాన్ని కల్పిస్తాయి. విశ్వనాథవారు లక్షించిన వ్యవస్థే కానీ, మరొక వ్యవస్థే కానీ ముందు వెనకల ఎలాంటి పరిణామసూత్రమూ  లేకుండా స్వయంభువుగా అవతరించి అలా ఉండిపోయిందా అని ప్రశ్నించుకున్నప్పుడు రచనలో సంతృప్తి కరమైన సమాధానం దొరకదు.

రచయిత లక్ష్యం స్పష్టమే. చాతుర్వర్ణ్యవ్యవస్థను అత్యంత వైభవోపేతంగా, ఆదర్శప్రాయంగా చిత్రించడం. నాలుగు వర్ణాల వారూ ఎవరి ఎవరి వృత్తి ధర్మాల పరిధిలో వారు ఉంటూనే దేవాలయం, దైవభక్తి కేంద్రంగా పరస్పర ప్రేమాభిమానాలతో హృదయైక్యతతో ఉండడం. ఇందులో పంచములకు స్థానం లేదు. అయితే, ఈ వ్యవస్థకు కాల్పనికప్రపంచంలో ఉన్నంత ఉనికి వాస్తవిక ప్రపంచంలో కనిపించదు. అందుకు తగినట్టే ఇందులోని పాత్రలు రామేశ్వరశాస్త్రి, ధర్మారావు, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని, హరప్ప, గిరిక, గణాచారి, పసిరిక, రంగాజమ్మ, రత్నగిరి మొదలైన పాత్రలు కాల్పనిక ప్రపంచజీవులుగా, అతి మానుషులుగా కనిపిస్తారు. పెళ్లై అత్తింటికి వచ్చిన ధర్మారావు భార్య పెద్ద అరుంధతిని కూడా ఆశ్చర్యచకితం చేసిన అతిమానుష స్వభావం వారిది.  ధర్మారావు మిత్రులు కిరీటి, సూర్యపతి, కుమారస్వామి, రాఘవరావు తదితరులు, మంగమ్మ  వాస్తవిక ప్రపంచానికి చెందిఉంటూనే ధర్మారావుకు చెందిన అతిమానుష కాల్పనిక జగత్తుపట్ల సానుకూలతను, ఆరాధనాభావాన్ని చాటుకుంటూ ఉంటారు. రాధాపతి, చక్రవర్తి, పత్రికాసంపాదకుడు వామనరావు తదితరులు  ఆ భావజాలానికి ప్రతివాదులు. కుమారస్వామి అయితే ధర్మారావుకు విస్తరిత రూపమే. ధర్మారావులోని భావతీవ్రతే అతనిలోనూ ఉన్నా, ధర్మారావు ఉగ్రతను శాంతం కప్పి ఉంచితే కుమారస్వామి ఉగ్రత నేరుగా వ్యక్తమవుతుంది. కుమారస్వామి అని పేరుపెట్టడంలో దేవతల సేనాని అయిన కుమారస్వామిని రచయిత దృష్టిలో ఉంచుకున్నట్టు అనిపిస్తుంది. చివరిలో చిన్న అరుంధతిని పెళ్లాడిన ఘట్టంలో ధర్మారావుకి శివునితో సామ్యం కనిపిస్తుంది.

viswanatha

రామేశ్వరశాస్త్రి, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని తదితర పాత్రలను అలా ఉంచితే; నవలలో దాదాపు చివరివరకు జీవించిన గిరిక, గణాచారి, పసిరికలు పూర్తిగా అతిమానుషప్రపంచంలోనే ఉండిపోతారు. ధర్మారావు ఒక్కడే అతిమానుష, వాస్తవిక ప్రపంచాలకు మధ్య లంకెగా ఉంటూ, వాటి మధ్య పరిభ్రమిస్తూ, రెండింటి తారతమ్యాలను అడుగడుగునా వివేచించుకుంటూ  గడుపుతాడు. అతని స్థితిని రచయితే ఇలా చెబుతాడు:

“ధర్మారావునకు రెండు జగత్తులు. ఒక జగత్తులో మూకీభావము. మరొక జగత్తులో అనియత వాగ్వ్యాపారము. ఒక జగత్తు దివ్యము, ఒక జగత్తు భౌమము. భౌమములో అతి భౌమము. ఒకటి పునీతము, ఒకటి ఇంద్రియ పరాభూతము. దివ్యమునుండి భౌమమునకు వచ్చుట ఎంత కష్టమో, దీనినుండి దానికి పోవుటయు అంతే కష్టముగా నున్నది. సెలవులు వచ్చినచో గణాచారి, దేవదాసి, పసిరిక, అరుంధతి! సెలవులు లేనిచో కిరీటి, శివరావు, కళాశాల”.

దివ్యజగత్తులో గడిపే ధర్మారావుకు భౌమ(భూసంబంధమైన)జగత్తులో గడిపే ధర్మారావుకు మధ్య ఎంతో వ్యత్యాసం. భౌమ జగత్తులో గడిపే ధర్మారావు పాఠకులు హృదయాలపై గాఢంగా ముద్రపడతాడు. ఈ జగత్తులో అతను నిరహంకారి, నిగర్వి, గొప్ప మానవీయత కలిగినవాడు, వ్యక్తిత్వమూ, శీలమూ, స్వాభిమానమూ, స్నేహశీలమూ ఉన్నవాడు. వాటితోపాటు కొన్ని లౌకికమైన బలహీనతలూ ఉన్నవాడు. అతని స్నేహశీలాన్ని, మానవీయతను, కృతజ్ఞతను వెల్లడించే హృద్యమైన ఘట్టాలు నవలలో అనేకం ఉన్నాయి. మిత్రుడు రాఘవరావు భార్య మశూచితో చనిపోయినప్పుడు, అంతిమ సంస్కారానికి ఎవరూ సాయపడనప్పుడు; ధర్మారావు, అతని మరో మిత్రుడు సూర్యపతి స్వయంగా శవాన్ని శ్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టిన ఘట్టం వాటిలో ఒకటి. అలాంటిదే జేబుదొంగ అయిన ఆసిరి అనే కుర్రవాడిని ఆదరించిన ఘట్టం. నాయర్ అనే ఒక దుకాణదారు తన అవసరానికి రెండు రూపాయలు ఇచ్చి ఆదుకున్నప్పుడు, తన చేతిలో డబ్బు పడీపడగానే అతని బాకీ తీర్చడానికే ధర్మారావు  తొలి ప్రాధాన్యం ఇస్తాడు. తీరా అతని దుకాణానికి వెడితే, అతను తీర్థయాత్రలకు వెళ్ళినట్టు తెలిసి ఎంతో నిరాశ చెందుతాడు. ఇది అతనిలో కృతజ్ఞతాబుద్ధిని చూపుతుంది.  అతను అనుభవించిన పేదరికం మన మనసుల్ని మెలిపెడుతుంది.

లౌకికంగా అతను కూడా అందరూ ఎదుర్కొనే సాంసారిక సమస్యలు ఎదుర్కొంటాడు, డబ్బు కోసం ఇబ్బంది పడతాడు. ఇంగ్లీషు చదువుతాడు. ఉద్యోగం కోసం ఆరాటపడతాడు. ఒక యవ్వనవంతుడిలో ఉండే సహజమైన వాంఛలు అతనికీ ఉంటాయి. మళ్ళీ తను కూడా అందరిలానే ప్రవర్తిస్తున్నానే అన్న స్ఫురణా ఉంటుంది. తన కార్యానికి తానే వందరూపాయలు పుట్టించుకుని అత్తవారింటికి వెడతాడు. వెళ్ళే ముందు దేవాలయానికి వెళ్ళి శివపార్వతులను చూసి, శివుడికే సంసార జంజాటం తప్పనప్పుడు తనెంత అనుకుంటాడు. ‘ధర్మారావు సగము విరాగి, అతనిలో వైరాగ్యమెంతయో లాలసత యంత’ అని రచయిత అంటాడు. అయితే శోభనం గదిలో పడక మీద భార్య సరసన ఉండి కూడా అతను దైవచింతనలోకి జారుకోవడం కొంత విపరీతంగా అనిపిస్తుంది. అది రక్తికే కానీ, భక్తికి సందర్భం కాదు. అతనిదా వయసూ కాదు. నవలలో విశేషంగా ఆకట్టుకునే వాటిలో ఒకటి, దాంపత్య శృంగార చిత్రణ. దానిని విశ్వనాథ అంత అందంగా, హృదయదఘ్నంగా చిత్రించినవారు మరొకరు లేరేమో ననిపిస్తుంది.

ఇదే ధర్మారావులో కొన్ని ఇతర లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది విశ్వనాథ వాస్తవికతను అనుసరించిన ఫలితం కావచ్చు. ఎవరితోనైనా వాదించేటప్పుడు ధర్మారావు ఆవేశపడతాడు. అదే సమయంలో తాను ఆవేశపడుతున్నానన్న స్పృహ అతనిలో ఉంటుంది. అలాగే, సారంగధర నాటకానికి వెళ్లినప్పుడు ఒకవైపు నాటకం జరుగుతుండగానే తనూ, కుమారస్వామి అందులోని పాత్రధారులపై, వారి ఆహార్య, అభినయాలపై వ్యాఖ్యలు చేస్తారు. అది పక్కవారికి ఇబ్బందికరమన్న చిన్న విషయం ధర్మారావుకు స్ఫురించదు. ఒక ప్రేక్షకుడు దానిని ప్రశ్నించినప్పుడు కోపం పట్టలేకపోయిన ధర్మారావు తెలిసిన ఒక రౌడీని అతనిపైకి పురిగొల్పుతాడు.

ఇక ధర్మారావు, అతని భావజాలం… అదొక విచిత్ర సంబంధం. ధర్మారావు వ్యక్తిగత లౌకిక ప్రవర్తనలో  వక్రత, సంకుచితత్వం, అమానవీయత, అహంకారం  లేవు. కానీ అతను త్రికరణశుద్ధిగా విశ్వసించే భావజాలంలో అవి ఉన్నాయి.  భావనాత్మకంగా, లేదా సిద్ధాంతపరంగా చెప్పుకుంటే  ఆ భావజాలంలోనూ వక్రత, సంకుచితత్వం, అమానవీయత లేవు. కానీ ఆ భావజాలపు లౌకికప్రతిఫలనంలో ఉన్నాయి. వ్యక్తిగా ధర్మారావులో ఆధిక్యభావన, కింది కులాలపట్ల వివక్ష, ఇతర జాతులపట్ల తృణీకారభావం లేవు. కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ వ్యక్తమవుతాయి. అవి కూడా వాస్తవానికి ఆ భావజాల నిర్మాణంలో ఉన్నాయి. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం ద్వారా దృశ్యమానమవుతున్నాయని సుదర్శనంగారు అన్నారు కానీ వాస్తవానికి వాటిలోని వక్రత, సంకుచితత్వమే ధర్మారావులో దృశ్యమానమవుతున్నాయని భావించడం న్యాయం. మనకిప్పుడు బాగా తెలిసిన ఒక పోలికతో చెప్పాలంటే, ధర్మారావు, అతని భావజలాల సంబంధం ‘అపరిచితుడు’ సినిమాలో హీరో తరహాలో ఉంటుంది.

ఆ భావజాలానికి కాల్పనిక జగత్తులో ఉన్న ఉనికి లౌకిక జగత్తులో లేకపోవడం ఈ వైరుధ్యానికి కారణం. అందులో ప్రాధాన్యం వహించే చాతుర్వర్ణ్యవ్యవస్థ అందరినీ ఇముడ్చుకోగలిగినంత వైశాల్యం కలది కాదు. పంచములకు, మతేతరులకు, విజాతీయులకే కాదు సరికదా; దేవాలయం కేంద్రంగా ఉన్న ఆ వ్యవస్థలో, చాతుర్వర్ణ్య వ్యవస్థలోనే ఉన్న నాస్తికులకు కానీ, ఆ వ్యవస్థను ప్రశ్నించేవారికి గానీ స్థానం ఉండదు. ఆవిధంగా అది ఇరుకుగానే కాక, నిరంకుశంగా కూడా మారుతుంది. దేవాలయాన్ని, దేవుడినీ, మతాన్ని వ్యక్తిగతం చేసి; భిన్న ప్రాతిపదికపై అందరినీ కలిపే ఏర్పాటుకు అందులో అవకాశం లేదు. ఆ వ్యవస్థలోని మూసుకుపోయిన లక్షణమే ధర్మారావు ఆలోచనల్లోనూ మాటల్లోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. అతని దృష్టిలో తన దేశానికి, మతానికి, సంప్రదాయానికీ, సాహిత్యానికి, శాస్త్రాలకూ చెందినవన్నీ గొప్పవే; అందులో చెడు ఉండడానికి అవకాశమే లేదు. ఇతరుల మతాలలో, సంప్రదాయాలలో, సాహిత్యంలో అతనికి అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఈ రకమైన అతని తారతమ్య వివేచనలో అక్కడక్కడ అర్థవంతమైన, లోతైన భావాలు కనిపించినప్పటికీ ఆ వివేచన  చాలాచోట్ల అశాస్త్రీయంగానూ, హాస్యాస్పదంగానూ పరిణమిస్తుంది. అతను వర్ణభేదం, జాతిభేదం రక్తంలోనే ఉన్నాయని అంటాడు. ఇతర జాతులలోని చెడును విమర్శించేటప్పుడు అలాంటిదే స్వజాతిలోనూ ఉన్న విషయాన్ని విస్మరించి ఆ చెడును ఆ ఇతర జాతి మొత్తానికే ఆపాదిస్తాడు. ఉదాహరణకు, బ్రాహ్మణ యువతి అయిన మంగమ్మ కూడా డబ్బు మీద ఆశతో రామేశ్వరం అనే బ్రాహ్మణేతరునితో సంబంధం పెట్టుకుంటుంది. అలాగే డబ్బుకోసం జమీందారు రంగారావును పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని చర్య మాత్రం ఆ జాతి స్వభావంగా  కనిపిస్తుంది. లౌకికంగా హృదయవైశాల్యం ఉన్నవాడిగా  కనిపించే ధర్మారావు భావజాలం దగ్గరికి వచ్చేసరికి కరడుగట్టి కనిపిస్తాడు.  జాతిమతవర్ణభేదాలను ఎత్తి చూపుతూ మనుషుల్ని ఎక్కడిక్కడ చీల్చి తనను ఆధిక్యస్థానంలో నిలుపుకుంటాడు. ఇందులో పరవిమర్శే తప్ప ఆత్మవిమర్శ తక్కువగా ఉంటుంది.

veyi

ఆధునికమైనవీ, నేడు ప్రగతిశీలకంగా భావించే వాటిని అన్నిటినీ ధర్మారావు మూలమట్టంగా వ్యతిరేకిస్తాడు. అతని దృష్టిలో బాల్యవివాహాలే మంచివి. పంచములు దేవాలయంలోకి రాకూడదు. విద్యుద్దీపాలకన్నా ఆముదం దీపాలే శ్రేష్టం. పర్యావరణం గురించి, ప్రకృతిపట్ల ఆనుకూల్యత గురించి అతని ముఖంగా, లేదా ఇతర పాత్రల ముఖంగా  రచయిత చెప్పే అనేక విషయాలు అర్థవంతంగా ఆలోచనీయాలుగా  కనిపిస్తాయి. అయితే పరిణామగతిలో కొంత మంచితో పాటు చెడూ కొత్తగా వచ్చి చేరుతూ ఉంటుందనీ, ఆ చెడును తొలగించే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉండాలన్న స్పృహకు బదులు; అసలు పరిణామశీలాన్నే వ్యతిరేకించి గతంలోనే ఘనీభవించాలన్న ఒక అసహజమైన, సృష్టి వ్యతిరేకమైన ధోరణి వ్యక్తమవుతూ ఉంటుంది.

ధర్మారావులో ప్రశ్నను, విమర్శను కూడా నిషేధించే వైఖరి కనిపిస్తుంది. భార్య అరుంధతి తన మామగారు రామేశ్వరశాస్త్రి నాలుగువర్ణాల వారినీ పెళ్లి చేసుకోడంగురించి, ఆయనకు రత్నగిరి అనే భోగం స్త్రీవల్ల కలిగిన దేవదాసి గిరిక గురించి ఎత్తినప్పుడు అతనికి కోపం వస్తుంది. ఆ ప్రస్తావననే అతడు నిషేధిస్తాడు. ప్రశ్నకన్నా విశ్వాసమే అతని ఆలోచనాసరళికి కేంద్రబిందువు అవుతుంది.

అసలు ధర్మారావుకు ఆదర్శప్రాయమైన ఆ వ్యవస్థ అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉనికిలో ఉందా అని ప్రశ్నించుకుంటే దానికీ సమాధానం దొరకదు. ఆ వ్యవస్థకు తనలానే మొత్తం బ్రాహ్మణ్యమంతా ప్రాతినిధ్యం వహిస్తోందా అంటే, మంగమ్మ భర్త, ఉపాధ్యాయుడు అయిన జోశ్యులు తన వ్యక్తిత్వాన్ని చంపుకుని తాలూకా బోర్డు అధ్యక్షుడైన రామేశ్వరం ప్రాపు కోసం ఎందుకు పాకులాడతాడు? తన భార్యను అతను లొంగదీసుకునే పరిస్థితిని ఎందుకు కల్పిస్తాడు? మంగమ్మ డబ్బు మీద ఆశతో ఎందుకు కాలుజారుతుంది? ధర్మారావు అత్తగారివైపు వారు కూతురిపట్ల అంత నిర్దయగా, ధర్మవిరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు? రామేశ్వరశాస్త్రి మంచి స్థితిలో ఉన్నప్పుడు అతని వల్ల లాభపడిన బంధువులు అతను చితికిపోగానే ఎందుకు మొహం చాటేశారు?

కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తనొక్కడే తప్ప, సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు. మరి బ్రాహ్మణ్యం ఇలా ఎందుకు దిగజారింది అంటే అందుకు కారణం పరాయి పాలన, పాశ్చాత్యపు పోకడలని ధర్మారావు చెప్పగల సమాధానం. అసలు అంత గొప్ప వ్యవస్థ పరాయి పాలనకు, పాశ్చాత్యపు పోకడలకు ఎందుకు అవకాశమిచ్చింది; ముందే తను దిగజారడం వల్ల అలా జరిగిందా, లేక అది జరిగినందువల్ల తను దిగజారిందా? ఏది ముందు, ఏది వెనక? అన్న ప్రశ్నలకూ సమాధానం దొరకదు.

(సశేషం)

 

 

 

 

ధర్మారావు గెలిచాడు!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-4

 

sudrarsanam‘వేయిపడగలు’పై సుదర్శనంగారి విశ్లేషణ తీరును రెండు ఉపమానాలతో చెప్పుకోవచ్చు. రెండూ పరస్పర విరుద్ధమైనవి.

మొదటగా, ఇంగ్లీషు చదువుల శిక్షణ నుంచి లభించిన  సునిశితమైన తర్కమూ, హేతుత్వమూ అనే సూది మొనను దానికి తాకించి చూశారు. దాంతో అది గాలిబుడగలా పేలి పోయింది. అయితే, అలా పేలిపోతే ఎలా?  ధర్మారావు అనే పాత్రను సనాతన ధర్మాన్ని దర్శించిన జ్ఞానిగానూ, వ్యవస్థాధర్మానికి సాధికార వ్యాఖ్యాతగానూ, అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గంగానూ రచయిత చెబుతున్నాడే! కనుక రచయిత ధర్మారావు గురించి చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్య నున్న వైరుధ్యంలో మన అవగాహనకు అందనిది ఏదైనా ఉందేమో!

తీరా అదేమిటో చూద్దామనుకునేసరికి నవల గుండ్రాయిగా మారి సూదిమొనే వంగిపోయింది.

ఈ పరిస్థితిలో, తనకు సైతం సానుకూల దృక్పథం ఉన్న హైందవ ధర్మమూ, తాత్వికతా అనేవి నవలలో ధర్మారావు మనస్తత్వంలోని వక్రత నుంచీ, సంకుచితత్వం నుంచీ వ్యక్తమవుతున్నాయి కనుక అవే నిజమైన హిందూ ధర్మమూ, తాత్వికతా  కావన్న నిర్ధారణకు రావడమే మార్గం.  రచయిత చిత్రించదలచుకున్నది నిజమైన హిందూధర్మ, తాత్వికతలు కాక;; వాటికి ఆలంబనంగా తనను తాను భావించుకునే ధర్మారావు అనే, వక్రత, సంకుచితత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆత్మకథను! ఆపైన, అసలు రచయిత చిత్రించదలచుకున్నది హైందవ వ్యవస్థను, తాత్వికతను కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని!

హైందవ ధర్మమూ, తాత్వికతా, ధర్మారావులోని వైరుధ్యాలు…ఈ గంద్రగోళాన్ని అంతటినీ పక్కన పెట్టేసి, కేవలం సాహిత్య కోణం నుంచి ఒక రచనగా ‘వేయిపడగ’లను అంచనా వేయడం అంతకన్నా సురక్షితమైన మార్గం. ఆ విధంగా చూసినప్పుడు అందులో గొప్ప పఠనీయత ఉంది. అద్భుతమైన పాత్రపోషణ ఉంది, తెలుగుదనం ఉంది. ఆధునికత తెలుగువారి జీవితంలో తీసుకొచ్చిన అనేకానేక పరిణామాలను ఒక చిన్నసైజు విజ్ఞాన సర్వస్వం స్థాయిలో చిత్రించడం ఉంది. అది, కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం!

ఈవిధంగా సుదర్శనంగారి వేయిపడగల పరిశీలన అందులోని హైందవ ధర్మ, తాత్వికతల పరిశీలనతో ప్రారంభించి అది సంతృప్తి కలిగించకపోవడంతో, దానిని తెలుగుదేశమూ, తెలుగుదనాలకు కుదించి ఒక ఉత్తమ సాహిత్య సృష్టిగా నిలబెట్టడంతో ముగుస్తుంది.

ధర్మారావు గురించి రచయిత చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్యనున్న వైరుధ్యం ఎలాంటిదన్నది పరిశీలించకపోవడం –విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే భావజాలానికి బాహ్య మిత్రుడిగా ఆయనకు గల పరిమితి.

***

అసలు ఆ వైరుధ్యంలోనే హిందూ ధర్మ, తాత్వికతలు ఉన్నాయని ఎందుకు అనుకోకూడదు? ధర్మారావు, అతని తండ్రి రామేశ్వరశాస్త్రే ఆ  హైందవ ధర్మానికి, తాత్వికతకు అసలు సిసలు ప్రతినిధులు ఎందుకు కాకూడదు? వాటికి భిన్నమైన, నిజమైన హైందవధర్మమూ, తాత్వికతా వేరే ఉంటాయని ఎందుకు అనుకోవాలి?

ఎందుకంటే, వాటిలో తనూ ఒక వదులైన భాగమే అయినా, వాస్తవంగా వాటి జన్మస్థానంతోనూ, అక్కడి జీవితాలతోనూ, వారి తలపులతోనూ  గాఢమైన పరిచయం లేని బాహ్యుడు కనుక!

దూరం నుంచి చూసినప్పుడు అదొక గొప్ప రొమాంటిక్ అడ్మిరేషన్ కలిగిస్తుంది. అందులో భాగమై చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. అందుకే దాని తలుపులు చాలావరకు మూసి ఉంటాయి. తెరచుకున్నప్పుడు కూడా బయటినుంచి చూసినప్పుడు కలిగే రొమాంటిక్ అడ్మిరేషన్ ను నిలబెట్టే మేరకే ఓరగా తెరచుకుంటాయి.

విశ్వనాథ దృష్టిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల గురించి తను చెప్పినదానికీ, వారి నడవడికీ మధ్య ఎలాంటి వైరుధ్యం ఉండడానికి వీలులేదు. అంత పెద్ద లోపాన్ని ఆయనకు ఎలా ఆపాదిస్తాం? కనుక ఆ వైరుధ్యం బయటినుంచి చూసినప్పుడు కలిగే భ్రాంతి. అంతర్గతంగా చూసినప్పుడు అందులో వైరుధ్యం ఉండడానికి అవకాశం లేదు. అది రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల దృష్టిలో కూడా వైరుధ్యం ఎప్పుడవుతుంది? వారు కూడా దానిని, గుర్తించి అంగీకరించినప్పుడు. వారు గుర్తించే అవకాశం లేదు కనుక అది వైరుధ్యం కానే కాదు. ఆపైన అది  వైరుధ్యమా, కాదా అన్నది నిర్ధారించవలసిన అధికారం కూడా వారిదే కనుక; ఇంకొకరు అలాంటి ఆరోపణ చేయడం చెల్లదు.

కనుక రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా హైందవ వ్యవస్థా, తాత్వికతలను చిత్రించడంలో విశ్వనాథ నిజాయితీని పాటించారు. వారు అలా తప్ప ఇంకోలా ఉండే అవకాశమే లేదు. ఒక వ్యక్తి జీవన సరళే అతని తాత్వికతను అభివృద్ధి చేస్తుందని అనుకుంటే, రామేశ్వర శాస్త్రి, ధర్మారావుల జీవితమే వారి తాత్వికత. వారే హైందవ ధర్మ, తాత్వికతలకు నిర్ణేతలు, భాష్యకారులు, హక్కుదారులు కనుక వారి జీవితమే హైందవధర్మ, తాత్వికతలకు ప్రతిబింబం.

విశ్వనాథ అజాగ్రత్త ఉంటే ఎక్కడ ఉంటుందంటే, హైందవధర్మ, తాత్వికతలను చిత్రించడానికి ఆధునిక ప్రక్రియ అయిన నవలను స్వీకరించడంలో. ఆపైన దానిని ఇంగ్లీషు చదువుల శిక్షణనుంచి సంక్రమించే తార్కికతా, హేతుత్వాల ఉపకరణాలతో చూసినప్పుడు అది ఎలా పరిణమిస్తుందన్న సంగతిని విస్మరించడంలో. ఆధునిక నవలా ప్రక్రియలో వ్యక్తుల జీవిత చిత్రణ విధిగా వాస్తవికతను అనుసరిస్తుంది. అలాగే, హైందవ వ్యవస్థా, తాత్వికతలను వస్తువుగా తీసుకున్నప్పటికీ  రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల జీవితచిత్రణలో ఆయన వాస్తవికతను అనుసరించారు. తీరా చూస్తే ఆ వాస్తవికత ఆయనకు తెలియకుండానే వస్తువుకీ, పాత్రలకూ మధ్య వైరుధ్యాన్ని ఎత్తిచూపి రెండింటి పట్లా అపోహలకు దారితీయించింది.

సుదర్శనంగారే దీనిని గుర్తించి మిల్టన్ పారడైజ్ లాస్ట్ తో పోలిక తెచ్చారు. ఆయన ఇలా అంటారు:

“మిల్టన్ తన పారడైజ్ లాస్ట్ (Paradise Lost)లో సృష్టించిన సైతాన్ (Satan)పాత్ర కవి ఉద్దేశానికి భిన్నంగా, అంటే వీరోచితంగా, ఆకర్షణీయంగా రూపొందడం వల్ల, “He was of the Devil’s party without knowing it” అనే విమర్శ వచ్చింది. కొంతవరకు ఈ విమర్శ విశ్వనాథ ఈ మూడు నవలలకూ(ఏకవీర, వేయిపడగలు, చెలియలికట్ట)వర్తిస్తుంది.”

హైందవ ధర్మ, తాత్వికతలు ఎంత విశిష్టమైనవి, లోతైనవి అన్నది వేరే పరిశీలన. రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా  వాటి ప్రతిఫలనం ఎలా ఉందన్నదే ఇక్కడ విచారణ.

viswanatha

విషాదం ఏమిటంటే, రామేశ్వరశాస్త్రి, ధర్మారావులు తమ ప్రతిబింబం ఎలా ఉందో చూసుకోడానికి ఎదురుగా వేరే అద్దం ఏదీ లేదు. తామే అద్దం. తాము ఎలా ఉన్నారో చెప్పడానికి, లేదా ప్రశ్నించడానికి వేరొకరికి తాహతు లేదు, అధికారం లేదు, జ్ఞానం లేదు. తాము ఉన్నదే జ్ఞానకాంతులు విరజిమ్మే లోగిలిలో. గడప దాటితే అవతల అంతా అజ్ఞానాంధకారం. అంతిమ పర్యవసానం…తులనాత్మకంగా చూడడానికి అవతల మరొకటి లేని స్థితిలో, ఉన్నా చూడదలచుకోని స్థితిలో, తమ విశ్వాసాలను, కోరికలను, లౌల్యాలను, తమ జీవన సరళిని, అందులో ఇతరులకు వైరుధ్యాలుగా కనిపించేవాటితో సహా అన్నిటినీ ధర్మబద్ధం చేసి, తాత్వికీకరించి చివరికి తాము సైతం అవే నిజమనుకునే భ్రమలో గూడులో రెక్కలు ముడుచుకుని ఉండిపోవడం!

తాత్విక స్థాయిలో బ్రహ్మం ఎలా అనిర్వచనీయమో, ఎలా కంటికి కనిపించదో, ఎలా ద్వంద్వాలకు, ప్రశ్నలకు, సందేహాలకు అతీతమో జీవనస్థాయిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల నడవడి కూడా అంతే. రామేశ్వరశాస్త్రి యోగి, వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి. కానీ పైకి భోగిలా, రసికుడిలా కనిపిస్తాడు. ఆయన నాలుగువర్ణాల స్త్రీలనూ పెళ్లి చేసుకున్నాడు. ఒక భోగాంగనను చేరదీశాడు. నాలుగువర్ణాల వారినీ పెళ్లిచేసుకునే అర్హత ఆయనకు తప్ప ఇంకొకరికి లేదు. ఎందుకులేదని ప్రశ్నించడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఆయనకు ఒక్కడికే ఆ అర్హత కల్పించింది. మళ్ళీ ఆ ధర్మశాస్త్రానికి కర్త ఆయనే.

ధర్మారావూ అంతే. అయితే, అతని దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆధునికత విజృంభిస్తోంది. ఇంగ్లీషు చదువులు రాటుదేలుతున్నాయి. తాము ముడుచుకుని ఉన్న భ్రమల గూడుమీదే దెబ్బలు పడుతున్నాయి. అంతవరకు తమకు ఆశ్రయమూ, అధికారమూ ఇచ్చిన  జమీందారీ వ్యవస్థా, దానితోపాటే తమ ఆశ్రయమూ, అధికారమూ కుప్ప కూలుతున్నాయి. ధర్మారావు తమ జ్ఞాన కాంతుల లోగిలి నాలుగు గోడల మధ్య నుంచి అప్పుడప్పుడు ఆజ్ఞానాంధకారపు బాహ్య పరిసరాలలోకి రావలసి వస్తోంది. ఇంగ్లీషు చదవవలసివస్తోంది. కానీ భౌతికంగా అతను బాహ్య పరిసరాలలోకి వస్తున్నా అతని ఆత్మ మాత్రం తన భ్రమల గూడును విడిచి రావడంలేదు. దాని మీద దెబ్బలు పడుతున్న కొద్దీ అతను మరింతగా అందులో ముడుచుకుంటున్నాడు. బాహ్య పరిసరాలు ఎంత మారుతున్నా, వాటికి అనుగుణంగా తానూ ఎంతో కొంత  మారుతున్నా అతని ఆత్మలో మార్పు లేదు. అది ఎప్పటిలానే తన భ్రమల గూడును పట్టుకుని వేలాడుతూనే ఉంది. శిథిలమవుతున్న  ఆ గూడును తలచుకునే అతనిలో నిస్పృహా, నిర్వేదం. అదే వేయిపడగలు.

మారిన పరిస్థితిలో, బహుశా తండ్రి రామేశ్వరశాస్త్రికి అదనంగా, ధర్మారావు జీవితంలో అస్తిత్వం తాలూకు అభద్రత ప్రవేశించింది.  ఆ అభద్రత రెండు రకాలు. మొదటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అభద్రత. ఇంగ్లీషు చదువుకుని ఉద్యోగం వైపు మళ్లి ఆ అభద్రతను జయించవచ్చు. ధర్మారావు కాకపోయినా ధర్మారావు వారసులు అదే చేయబోతున్నారు. రెండవది, తమ సాంస్కృతిక, మత, తాత్విక, ధార్మిక, రాజకీయ ఆధిపత్యానికి కలుగుతున్న అభద్రత.

ధర్మారావు వైపునుంచి చెప్పుకుంటే  ఈ రెండు రకాల అభద్రతలకు అంతస్సంబంధం ఉంది. సమాజంలో తను అల్పసంఖ్యాకవర్గం. శ్రమ చేయలేడు. బలిష్టుడు కాదు. ఈ బలహీనతలనే బలంగా మార్చుకోవడం, అవి కల్పించే అభద్రతనుంచే భద్రతను నిర్మించుకోవడం –ఇదీ అతని తాత ముత్తాతలనుంచీ జరుగుతూ వచ్చింది. ఈ ప్రయత్నంలోంచే అతని మతం, తాత్వికత, ధర్మశాస్త్రం, సాహిత్యం, సమస్త వాఙ్మయం పుట్టాయి.  ఇప్పుడు వీటన్నిటితో కూడిన వ్యవస్థకే అభద్రత వాటిల్లింది. ఇందుకు ధర్మారావుకు కనిపించిన పరిష్కారమేమిటంటే, ఆ అభద్రతను ఎదుర్కోవడానికి, అలాంటి అభద్రత నుంచే పెంపొందించిన వ్యవస్థలోనే తిరిగి భద్రత వెతుక్కోవడం!

ఒక కోణం నుంచి చూస్తే ధర్మారావు పాత్ర జాలిగొలుపుతుంది. అతనిలో తాను సర్వాధికుడినన్న భావన. అది అతనిలో అధికారాన్ని, అహాన్ని మాత్రమే కాదు; తన ఊహలను, అభిప్రాయాలను సమానఫాయీలో ఇంకొకరితో పంచుకోలేని ఒంటరితనాన్నీ అతనిపై విధిస్తుంది. అతను వ్యాఖ్యానించని విషయం ఉండదు. కానీ అవతల ఉన్నది ఎవరు? అతని వ్యాఖ్యలపై  ప్రతిస్పందించడానికి అతనితో సమానమైన జ్ఞానమూ, స్థాయీ లేని మూగ శ్రోతలు. వక్తా, శ్రోతా కూడా తనే. తన గొంతు ప్రతిధ్వని తనకే వినిపిస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి తన దగ్గరకే వచ్చినట్టుగా తన అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ మళ్ళీ తన దగ్గరకే వస్తాయి.

veyi

అతని మాట, ప్రజాస్వామికమైన డైలాగ్ కు అవకాశం లేని, ఒక మోనోలాగ్. అక్కడ ప్రైవేట్, పబ్లిక్ అన్న తేడా  చెరిగిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేని స్థితిలో అతని ప్రైవేట్(వైయక్తిక)ఊహాప్రపంచమే పబ్లిక్ గా మారిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేనప్పుడు అక్కడ తర్కం, హేతుత్వం ఉండవు. పైగా అవి అక్కర్లేదన్న అహం ఉంటుంది. చరిత్ర ఉండదు. అది అక్కర్లేదన్న అహం ఉంటుంది. సాలె పురుగు తనలోంచే దారాన్ని సృష్టించుకుని, దానితో గూడు కట్టుకుని అందులో ఎలా ఉండిపోతుందో; తన ఊహల దారాలతో తనే అల్లుకున్న గూడులో తను ఉండిపోవడం…ఇదీ అతని బౌద్ధిక జీవితం.

తనే లోకానికి గురువు. కనుక వేరెవరికీ, ఎప్పటికీ శిష్యుడు కాలేని పరిస్థితి అతనిది. దాంతో అతనికి కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఋష్యశృంగుడు ఉన్నచోట అనావృష్టి ఉండదు. అలాగే, తన ఉనికే లోకకళ్యాణం కోసం!

తీరా  సుదర్శనంగారు తర్కమూ, హేతుత్వమూ అనే తూనిక రాళ్ళతో వేయిపడగలను తూచబోయేసరికి అది తేలిపోయింది. అందులో బరువైన సరకు బదులు డొల్ల కనిపించింది. అయితే ఆ డొల్లను పట్టుకుని ఉన్న మనిషి నిజం. తన భ్రమల గూడుపై పడుతున్న దెబ్బలకు అతను పడుతున్న కలవరం, అస్తిత్వ భయం, అవి కలిగించే హృదయభారం నిజం. అవి నవలలో ప్రతిభావంతంగా వ్యక్తమయ్యాయి.

***

ముందే చెప్పినట్టు, ధర్మారావును తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తిగానూ, వేయిపడగలను ఆధునికత  తెలుగునాట తెచ్చిన  మార్పుల చిత్రణగానూ కుదించడం ధర్మారావు బౌద్ధిక జీవితానికి ‘బాహ్యు’నిగా సుదర్శనంగారికి గల పరిమితి. నిజానికి ధర్మారావు భారతదేశమంత వైశాల్యం కలిగిన పాత్ర. అతని సంఘర్షణ మూలాలు భారతీయ సమాజం తాలూకు అతి పురాతనపు లోతుల్లో ఉన్నాయి. భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ స్థితిగతులకు అతను శాసనకర్త. ఇంత వైవిధ్యవంతమైన దేశాన్ని తన దృష్టికోణం అనే మూసలో ఇరికించడానికే అతని నిరంతర ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అతనికి విజయాలూ ఉన్నాయి, అపజయాలూ ఉన్నాయి. అతని పెనుగులాట ఎంత వైయక్తికమో, అంత వ్యవస్థాగతం. చరిత్ర పొడవునా జరుగుతున్నఅతని పెనుగులాటా, అందులో అతని గెలుపు, ఓటముల చరిత్రే ప్రధానస్రవంతికి చెందిన భారతీయ వాఙ్మయం.  పాశ్చాత్య నాగరికతా ప్రభావమూ, అవైదిక ధోరణుల విశృంఖలత్వమూ నేపథ్యంగా వేయిపడగలులో చిత్రితమైనది– అతని అనేకానేక పెనుగులాటలలో ఒకటి మాత్రమే.

వేయిపడగలు అతని ఒకానొక తాత్కాలికమైన  ఓటమిని చెబుతుంది. అది అతనికి కలిగించిన నిర్వేదాన్ని, నిస్పృహను చెబుతుంది. అయితే తన చరిత్రలో అనేకసార్లు జరిగినట్టుగా , అంతులేని నిరీక్షణ తర్వాత అతను మళ్ళీ గెలిచాడు. ఇప్పుడు కనుక ధర్మారావు చరిత్రను తిరగరాస్తే, అది ఒక విజేత చరిత్ర అవుతుంది. ఇప్పుడతనిలో నిస్పృహా, నిర్వేదం లేవు. వాటి స్థానంలో అతని ముఖం నిండా విజయదరహాసం!

(సశేషం)

 

 

 

వేయి ప్రశ్నల ‘పడగలు’

 ‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-3

 

sudrarsanamవిశ్వనాథ భావజాలానికి ఆర్.ఎస్ సుదర్శనం ‘బాహ్యమిత్రు’డే కాక’, ఇంగ్లీషు చదువుతో భారతీయేతర గవాక్షం నుంచి దానిని చూసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన వ్యక్తి అన్న సంగతిని మరోసారి గుర్తుచేసుకుని ‘వేయిపడగల’కు వద్దాం.

వేయిపడగలు ఆయనకు పెద్ద పజిల్ గా మారింది. అనేక ప్రశ్నలు, సందేహాలతో పాటు చికాకునూ కలిగించింది. ‘ఏకవీర’లో కనిపించిన తాత్విక పటిమ కానీ, స్పష్టత కానీ ఆయనకు అందులో కనిపించలేదు.

‘నేతి నేతి’ అనే పద్ధతిలో ఆయన పరిశీలన ఇలా సాగుతుంది:

“వాఙ్మయమనగా నేమి?” అని ప్రశ్నించి చివరగా, “కావ్యాత్మయే కాక, కావ్యశరీరము, కావ్యస్వరూపము కూడా నీ జాతి సిద్ధాంతముల మీద నాధారపడియుండును…” అన్న విశ్వనాథ వారి వివరణను తీసుకుని, కావ్య శరీరము, కావ్యాత్మ వేయిపడగలులో ఎలా అనుసంధింపబడ్డాయో సుదర్శనం పరిశీలించారు. ముందుగా కావ్యాత్మను తీసుకుంటే, నవలలోని పాము- అంటే కథాస్థలమైన సుబ్బన్నపేటలో జమీందారు కట్టించిన ఆలయంలో,  బ్రాహ్మణుడు ప్రతిష్టించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు హిందూ వ్యవస్థాధర్మానికి ప్రతీక.  దానికి అతీతమైన, మౌలికమైన సనాతన ధర్మానికి అక్కడే ప్రతిష్టితమైన శివలింగం, లేదా నాగేశ్వరస్వామి ప్రతీక. కథా ప్రారంభంలో రచయిత ఈ ఇద్దరు దేవుళ్ళకు(అంటే వ్యవస్థాధర్మానికీ, సనాతన ధర్మానికీ)భేదం పాటిస్తాడు. కానీ ఆ వెంటనే మొదలుపెట్టి, రచన అంతటా రెంటికీ మధ్య అభేదాన్ని పాటించాడు. ఈ విధంగా, ఏకవీరలో ఉన్న తాత్విక స్పష్టత వేయిపడగలులో ముందే లోపించింది.

పోనీ వ్యవస్థాధర్మంతో అభేదం పొందిన ఆ సనాతనధర్మ నిరూపణే కావ్యాత్మ అవుతుందా? ఆ నిరూపణ ఇందులో చిత్రితమైన పాత్రల ద్వారా జరగాలి. ఇందులోని ముఖ్యపాత్ర ధర్మారావు. అతను ధర్మానికి ప్రతినిధి అని రచయిత ఉద్దేశం. అయితే, ధర్మారావు ఏ ధర్మానికి ప్రతినిధి; వ్యక్తి ధర్మానికా, వ్యవస్థాధర్మానికా, సనాతనధర్మానికా అని ప్రశ్నించుకుంటే  సంతృప్తికరమైన సమాధానం దొరకదు.  రచయితేమో, అతను సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని, వ్యవస్థాధర్మానికి సాధికారవ్యాఖ్యాత, లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అంటాడు. అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గమనీ; భక్తి, కర్మమార్గాలను అనుసరించేవారికి కూడా అతను గురువనీ అంటాడు.

కానీ అతని నడవడి చూద్దామా అంటే ఇవేమీ కనిపించవు. అతను ఏకవీరలా సాధకుడు కాడు. అతనిలో సందేహాలూ, సంఘర్షణలూ లేవు. అయినా అతన్ని సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని అని రచయిత ఎలా (పూర్వజన్మ సుకృతం వల్ల కాబోలని సుదర్శనంగారి వ్యంగ్యం)అన్నారో? ఇక లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అయ్యే నిర్లిప్తత అతని మనస్తత్వంలోనూ లేదు, దానిని సాధించే పరిస్థితులు అతని జీవితంలోనూ లేవు. ఆపైన అతనిలో ఎంతసేపూ లోకవిమర్శ తప్ప ఆత్మవిమర్శ లేదు. స్వోత్కర్ష మాత్రం కావలసినంత. జ్ఞానమార్గంలో అతను పొందిన పరిణామ మేమిటో రచయిత ఎక్కడా చెప్పలేదు. పైగా అతనిలో హిందూ వ్యవస్థా ధర్మానికి తనే వ్యాఖ్యాతా, సొంతదారు ననే విపరీత అహంకారం.

ధర్మారావు కర్మయోగి, జ్ఞానయోగి అయితే, కొత్త కొత్త పద్ధతుల మీద; జీవిత విధానాల మీద అంత ద్వేషభావం దేనికి? అది జిజ్ఞాసువు లక్షణం కాదు. అతనిలో సమన్వయ దృష్టిలేదు. అతనికి కొత్త ఒక రోత పాత ఒక నీతి. మారుతున్న పరిస్థితులలో కూడా హిందూధర్మం సృజనాత్మక శక్తే నని నిరూపణ చేసే ఉద్దేశమే నవలకు ఉన్నట్లైతే ధర్మారావు సృష్టి మరొక విధంగా ఉండేదన్న సుదర్శనం, ఇక్కడ కూడా ‘మాలపల్లి’తో పోలిక తెస్తారు. ధర్మారావుకు భిన్నంగా ‘మాలపల్లి’ నవలలోని సంగదాసు, రామదాసులు పాత కొత్తల సంగమస్థానంగా, మేలు కలయికగా కనిపిస్తారు.

కనుక కావ్యాత్మ సనాతనధర్మ నిరూపణ కాదు. సనాతన, వ్యవస్థా, వ్యక్తి ధర్మాల మధ్య స్పష్టమైన తేడాను పాటిస్తూ వీటి మధ్య సంబంధాన్ని నిరూపించే తాత్వికదృష్టిని వస్తు విన్యాసంలో రచయిత పాటించలేదు.

పోనీ  వ్యవస్థాధర్మనిరూపణ కావ్యాత్మ అవుతుందా? రచయిత చెప్పినట్టు వ్యవస్థ నాలుగు స్తంభాల ధర్మమంటపం. స్వామి(భగవంతుడు), రాజు, బ్రాహ్మణుడు, గణాచారి(కాలం)…ఈ నలుగురూ నాలుగు స్తంభాలు. స్వామి, ప్రభువు, ధర్మారావు(ధర్మం)ల మధ్య అభేద తాదాత్మ్యం.  ధర్మాచరణ రాజు కర్తవ్యం, ధర్మప్రచారం బ్రాహ్మణుని కర్తవ్యం. పసరిక పైరుపచ్చకు ప్రతీక, దేవదాసి శృంగారయుతమైన భక్తిమార్గం, హరప్ప వైదిక కర్మానుష్ఠానం, గోపన్న సేవావృత్తి. ఇదీ వ్యవస్థకు చెందిన అవయవ విభాగం. ఈ వ్యవస్థకు కేంద్రంలో ధర్మారావు. ఈ ధర్మారావు ఎటువంటి వ్యక్తో పైన కొంత చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు తర్వాత చెప్పుకుందాం.

జమీందారు, అంటే రాజువైపునుంచి, ధర్మాచరణలో జరిగిన ఒక లోపంతో నవల ప్రారంభమవుతుంది. ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి మాసికాన్ని జమీందారు నిర్లక్ష్యం చేస్తాడు. ధర్మారావు రుణగ్రస్తుడైనట్టు సేవకుడు గోపన్న వెళ్ళి చెప్పిన తర్వాతే తండ్రి మాసికానికి ధర్మారావుకు జమీందారు డబ్బు ఇస్తాడు. ముందే తెలుసుకోకపోవడం జమీందారు ధర్మాచరణలో జరిగిన లోపం. అందుకే అతనిని కలలో వేయిపడగల పాము కాటువేసి శిక్షిస్తుంది.  ఇక్కడ ధర్మాచరణ సమ్యక్ స్వరూపం మనకు ఏం తెలిసినట్లు అని సుదర్శనంగారి  ప్రశ్న.

రచయిత చిత్రీకరణ ప్రకారం, “రామేశ్వరశాస్త్రి వర్ణాశ్రమధర్మముల ముద్దకట్టిన మూర్తి, భారతదేశము యొక్క ఆత్మ, త్రయీధర్మవిద్య కొక వ్యాఖ్యానము.” మరోవైపు, రామేశ్వరశాస్త్రి అందగాడు, రసికుడు, దేశము నాలుగుమూలలా తిరిగివచ్చినవాడు. ఆయన వితరణ బుద్ధి హద్దులేనిది. జమీందారు తర్వాత జమీందారు. నాలుగువర్ణాల ఆడబడుచుల్నీ పెండ్లాడి ఒక భోగాంగనను చేరదీసినవాడు.  ఇలాంటి వాడు భోగి కానీ యోగి ఎలా అవుతాడని సుదర్శనంగారి ఆక్షేపణ. “వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి” గా రచయిత  చిత్రించిన రామేశ్వరశాస్త్రి గృహస్థుగానే మరణించాడే, మరి ఆయన పాటించిన ఇతర ఆశ్రమధర్మాలు ఏమిటన్నది ఆయన లేవనెత్తిన మరో ప్రశ్న. అలాగే రామేశ్వరశాస్త్రి చేసుకున్న వర్ణాంతరవివాహాలపైనా అనేక ప్రశ్నలు. అవి వర్ణధర్మాన్ని సమర్థిస్తున్నాయా అంటే, సమర్ధించడంలేదు. అవి నేటి వర్ణవిభేదాలకు పరిష్కారం సూచిస్తున్నాయా అంటే ఆ పరిష్కారం ఎంతమందికి నచ్చుతుంది? దాని యథార్థ స్వరూపం ఏమిటి? ఇలా వ్యవస్థా నిరూపణ ‘ఆదర్శం’ నుంచి ‘యాథార్థ్యం’లోకి దిగివస్తుందంటారు సుదర్శనం.

veyi

ధర్మారావు ‘బ్రాహ్మణత్వం’ అన్న ఆదర్శానికి ఎటువంటి సమర్థన అన్నది ఆయన సంధించిన మరో ప్రశ్న. బ్రాహ్మణత్వం అంటే కేవలం ‘ధర్మప్రచార’మేనా? ఈ విధంగా తర్కిస్తే నవలలో వ్యవస్థా ధర్మ నిరూపణం అసంతృప్తినే కలిగిస్తుంది. ఆకృతి(Form)కి తగిన పుష్టి(Substance) జరగలేదని అనిపిస్తుంది. అంతిమంగా చెప్పాలంటే,  నవలలో రచయిత సమర్థించబూనుకున్న వ్యవస్థకు అసలు ఉనికే లేదు– ఇదీ సుదర్శనంగారి నిర్ధారణ.

మొత్తానికి ఆయనకు ఇదొక  పెద్ద చిక్కుముడి. విశ్వనాథవారి మాటలను పట్టుకుని ఇందులో కావ్యాత్మ సనాతన ధర్మమా, లేక హిందూవ్యవస్థా ధర్మమా అన్నది వెతకబోతే ఆ దారి ఇలా మూసుకుపోయింది. “ఏతావాతా తేలే దేమిటంటే: హిందూ వ్యవస్థ యొక్క ఆదర్శాన్నీ, దాని పటుత్వాన్నీ నిరూపించే ఉద్దేశమే ‘వేయిపడగల’ కావ్యాత్మ అనటానికి, పాత్రచిత్రణమూ, కథాగమనమూ, దాని స్ఫూర్తీ  అందుకు భిన్నంగా ఉన్నా” యన్న నిర్ధారణకు వచ్చారు.

మరి ఇప్పుడేం చేయాలి? దారి మార్చుకోవాలి!

రామేశ్వరశాస్త్రి ‘వర్ణాశ్రమ ధర్మాలు ముద్దకట్టిన మూర్తి’ కాకపోతేనేం, అతనొక ఉత్తముడైన మానవుడే. ఆయన కానీ, ధర్మారావు కానీ ఆనాటి బ్రాహ్మణవర్గానికి ఏవిధంగానూ ప్రతినిధులు కాకపోతేనేం, తమలోని మానవత్వానికీ(సుదర్శనంగారు ఈ మాటను మానుషత్వం అనే అర్థంలో వాడినట్టుంది), దాని విశిష్టతకూ ప్రతినిధులు. అలాగే, అందులోని మిగిలిన పాత్రలు కూడా. “వారిలో ప్రకాశితమవుతున్నది వ్యక్తిగతమైన విశిష్టతే! ఇటువంటి వ్యక్తుల ద్వారా సమకాలీన సమాజంలోని వర్ణవిభేదాలను, వర్గీకరణను సమంజసమని సమర్థించడం ఎట్లా? నవలలో ధర్మారావు ద్వారా జరిగే వ్యాఖ్యానానికి, సమర్థనకూ ఈ దోషం సర్వత్రా ఉంది. అందువల్ల నవలలో వాచ్యముగా జరిగినంత మేర వ్యవస్థ నిరూపణము యాథార్థ్యం దృష్ట్యా జరగలేదనే చెప్పాలి” అని సుదర్శనంగారి తీర్మానం.

ఇలా ‘వేయిపడగలు’ కావ్యాత్మ సనాతన ధర్మ నిరూపణమా, లేక వ్యవస్థా ధర్మ నిరూపణమా అన్న విచికిత్స నుంచి బయటపడిన సుదర్శనంగారు, చివరికి అది ‘ధర్మారావు జీవిత చరిత్ర’ అని తేల్చారు. అది అతని మనస్థితికీ, ఆ మనస్థితికి కారణాలైన సాంఘికపరిస్థితులకూ దర్పణం అన్నారు. కనుక నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే! సనాతనధర్మమో, హిందూ వ్యవస్థా ధర్మమో కావ్యాత్మ అనుకోవడం వల్ల వాటి నిరూపణ అసంతృప్తిని కలిగించి విమర్శలను రేకెత్తిస్తోంది కానీ, ఇలా దృష్టి మార్చుకుని, నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే అనుకుని చూసినప్పుడు చిక్కుముడి విడిపోతుంది…. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ఇందులో గౌణమే తప్ప ప్రధానం కావు. అవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వం ద్వారా మనకు దృశ్యమానమవుతున్నాయి. ఆ మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం వాటిలోనూ దృశ్యమానమవుతున్నాయి…

ఇలా అనుకున్న సుదర్శనంగారు, ఇక్కడ చేసింది ఒకవిధమైన శస్త్రచికిత్స. తల్లి ప్రాణాన్ని కాపాడలేకపోయినా కనీసం బిడ్డనైనా కాపాడే ప్రయత్నం లాంటిది. విశ్వనాథ లక్షించిన వ్యవస్థాధర్మ నిరూపణ లేదా స్వీయ భావజాలం అనే ‘తల్లి’ నుంచి, ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేసి వాటిని స్వతంత్ర జీవంతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తల్లిని పక్కన పెట్టేశారు. అప్పుడిక ఆ పాత్రలలో ఎలాంటి వైరుధ్యాలు, వైపరీత్యాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతమైనవే తప్ప వ్యవస్థకు సంబంధించినవి కావు. ఇలా పాత్రల ముఖంగా చూసినప్పుడు విశ్వనాథ ఆదర్శం సార్వత్రిక హిందూ వ్యవస్థాధర్మాన్ని చిత్రించడం కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని చిత్రించడం!

ఇలా సుదర్శనంగారి ప్రకారం, నవలలో సుబ్బన్నపేటే తెలుగుదేశం. సుబ్బన్నపేట అంటే ధర్మారావు. ఇది కావ్యశరీరం. ధర్మారావు పాత్ర సమర్థించినది క్రమంగా అదృశ్యమవుతున్న గ్రామీణమైన తెలుగుదనాన్ని. ఆంగ్లభాషా, పాశ్చాత్య నాగరికతా సోకని తెలుగుదనం నిలబడలేదనే అతని ఆవేదన. అందులో లోటుపాట్లు అతనికి కనిపించవు. అదంతా హిందూధర్మ స్వరూపమే నని అతను భ్రమపడతాడు. దాని సమర్థనకోసం తను అహంభావం పెంచుకున్నా ఫరవాలేదనుకుంటాడు. తరచు భావం కంటే అహంభావమే అతనిలో ముందుకు వస్తుంది. రైలు మార్గాలు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాక్టరీలు, డబ్బు చలామణి, శారదా చట్టం, వితంతు వివాహాలు, హరిజనుల ఆలయప్రవేశం సహా అన్నిటినీ వ్యాఖ్యానిస్తాడు. అన్నిటినీ వ్యతిరేకిస్తాడు. ఇంగ్లీషు చదువుకుంటాడు, కానీ ఇంగ్లీషును ద్వేషిస్తాడు. తండ్రి మాసికానికి జమీందారు దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు, “నేను యాచించలేదు…ఆయనయే ఇచ్చెను” అని, భంగపడిన ఆహాన్ని సమర్థించుకుంటాడు. “అతనిలో స్వాభిమానము మెండు, దానికి బాధాకరమైన సత్యాన్ని దర్శించే చొరవ, సాహసం అతనిలో లేవు. ఆ పరిస్థితిలో సత్యరూపాన్ని భిన్నంగా తనకు అనుకూలంగా దర్శించే ప్రయత్నం చేస్తాడు. అందువల్లనే అతని ప్రవర్తన కూడా సమయానుకూలంగా ఉంటుంది” అని సుదర్శనంగారి వ్యాఖ్య.

ధర్మారావు అబద్ధం ఆడడానికి కూడా వెనుకాడడు. తను చదువుతున్న కళాశాలలో క్రైస్తవ విద్యార్థులు హిందూ మతాన్ని అవమానించినప్పుడు హిందూ విద్యార్థులు చేసిన సమ్మెలో అతను పాల్గొనడు. “ఎదిరించి నీ వేమైన చేయగలవా?”అని ఉపదేశిస్తాడు. ఇక్కడ సుదర్శనంగారి వ్యాఖ్య ఇలా ఉంటుంది: “ఇక్కడ ధర్మరక్షణ కంటే ఆత్మరక్షణ ప్రధానమైనది! ధర్మారావునకు హిందూ ధర్మముతో తాదాత్మ్యము, అది తనకు ఉపయోగపడునంతవరకే. దానికి తాను ఉపయోగపడవలసి వచ్చినప్పుడు వాగ్వాదము, వ్యాఖ్యానము కావలసినంత! ఇక్కడ అసలు విషయం, జమీ లేకపోయినా ధర్మారావు జమీందారు బిడ్డ. కష్టములను ఎదుర్కోవడం కంటే వాటిని తప్పించుకోవడమే అతని స్వభావం.”

ధర్మారావు కవి, భావుకుడు కూడా. తను కష్టపడి సాధించగలిగినదేమీ అతనికి మిగిలినట్లే తోచదు: ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలలో ధర్మారావు ఇటు అర్థం కోసం కానీ, అటు మోక్షం కోసం కానీ ప్రయత్నం చెయ్యడు. తనే ధర్మావతారం. పెళ్లి చిన్నతనంలోనే జరగడంవల్ల కామానికి ఇబ్బంది లేదు. ఇక సాధించవలసిందేమిటి? లోకానికి గురువు కావడం! ధర్మారావు గురుత్వం వహించని, సలహా ఇవ్వని అతనితో సంబంధం లేని పాత్రలేదు. ఏ విధంగానైనా అతనికి సమవుజ్జీయో, అధికుడో అయ్యే పాత్ర కనిపిస్తే అతనికి నవలలో చరిత్రే లేదు. వాదంలో ధర్మారావు ముందు ఓడిపోనివారు లేరు. తన గొప్పదనాన్ని గుర్తించని వారి మీద రౌడీలను పురిగొల్పడానికి వెనుదీయడు. ఇక అతని పనేమిటన్నది చూస్తే, స్వామికి ఉత్సవాలు జరిపించడం తప్ప ఏమీ చేయడు. ధనవంతురాలు, ‘పతిత’ అయిన మంగమ్మతో అతనికి ‘రహస్య’ సంబంధం. భార్య అనారోగ్యంతో ఉన్నా, మంగమ్మ ఇంటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడు.

సుదర్శనంగారి ప్రకారం, తులనాత్మకంగా చూస్తే, ధర్మారావుతో పోల్చగల పాత్ర రవీంద్రుని గోరా. కానీ ఇద్దరి వ్యక్తిత్వాలలో ఎంతో తేడా. ధర్మారావులానే హైందవవాది అయిన గోరా, చివరికి ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య ‘ అన్నట్టుగా, “నేనీరోజున భారతీయుడిని. హిందువు, ముస్లిము, క్రైస్తవుడు…ఎవరైనా కానీ, నాలో ఇప్పుడు ఎలాంటి మతఘర్షణా లేదు. ఈ రోజున భారతదేశంలోని అన్ని కులాలూ నా కులమే” అనుకునే స్థితిని చేరుకుంటాడు. కానీ ధర్మారావుకు సర్వధర్మాలూ తనే నన్న భావము. అతను అసలు పయనించనే లేదు, గమ్య స్థానం చేరుకోవడమెక్కడ? ఈ భేదమే రవీంద్రుని విశ్వకవిని చేస్తే, ఆయన కంటే ప్రతిభావంతుడైన విశ్వనాథను తెలుగు కవిసమ్రాట్ గానే నిలిపిందని సుదర్శనంగారి వ్యాఖ్య. “‘నౌకాభంగము’ నుంచి ‘గోరా’వరకు రవీంద్రుడు ఎన్ని మెట్లు పైకి ఎక్కెనో, ‘ఏకవీర’నుంచి ‘వేయిపడగల’వరకు విశ్వనాథ అన్ని మెట్లు క్రిందికి దిగెను” అన్నది ఆ వెంటనే ఆయన చేసిన మరో కీలకమైన వ్యాఖ్య.

ఇలా ధర్మారావులోని లక్షణాలను సుదర్శనంగారు ఎత్తి చూపుతూనే, అతను ఆదర్శప్రాయుడు కాకపోతేనేం, “రాగద్వేషాలూ, రక్తమాంసాలూ, కష్టసుఖాలూ కలిగిన మనిషి. అచ్చమైన తెలుగువాడు. వ్యవస్థా ధర్మానికి, యోగమార్గానికి ప్రతినిధిగా తృప్తి కలిగించకపోయినా తెలుగుదనం ముద్దకట్టిన మూర్తి ధర్మారావు” అంటారు. ఆయన దృష్టిలో, (‘ఏకవీర’కు ఉన్నట్టు)’వేయిపడగలు’కు ఒక తాత్విక దృక్పథం ఆలంబనంగా లేకపోవచ్చు, కానీ అది కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం. తెలుగుదేశంలో శిథిలమై అదృశ్యమవుతున్న పూర్వ నాగరికత చివరి మెరుగుల్ని చూచిన విశ్వనాథ హృదయం సంక్షోభించి వెలువడిన సుదీర్ఘ నిశ్వాసమే వేయిపడగలు. అది ఒక వైయక్తిక హృదయోద్వేగం. అంతేకాదు, సుదర్శనంగారి దృష్టిలో వేయిపడగలు, డి. హెచ్ లారెన్స్ నవల The Rainbow తో పోల్చదగింది కూడా.

***

ఈవిధంగా సుదర్శనంగారు వ్యవస్థాధర్మ నిరూపణం అనే ‘తల్లి’ నుంచి ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేయడమే కాదు; రచనను  వైయక్తిక హృదయోద్వేగాన్ని చాటే గొప్ప సాహిత్యప్రతిపత్తి కలిగిన ఆత్మాశ్రయకావ్యస్థాయికి ఎత్తి సహృదయతను నిరూపించుకున్నారు. నవలలో ప్రకటితమైనది ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వాల మూసలోంచి వ్యక్తమవుతున్న  హైందవవ్యవస్థా ధర్మమే తప్ప అదే అసలు హైందవధర్మం కాదన్న భావనను ధ్వనింపజేశారు. అంటే, ఇందులో ప్రకటితమైన హైందవ ధర్మ, తాత్వికతలకు భిన్నమైన హైందవ ధర్మమూ, తాత్వికతా వేరే ఉన్నాయని ఆయన భావించారన్నమాట.

అలా భావించడంలో సుదర్శనంగారి ‘బాహ్యతా’, ‘మిత్రతా’ కూడా వ్యక్తమవుతున్నాయా?!

(సశేషం)

విశ్వనాథ దిగిన మెట్లు!

viswa1

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్:2

ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్యప్రపంచంలో విశ్వనాథ సత్యనారాయణ ఒక కోణంలో విరాణ్మూర్తే. ఆ విషయంలో ఎవరికి మాత్రం సందేహం ఉంటుంది? అయితే, ఆయన దృక్పథం మాటేమిటి?

ఒక కవిగా, పండితుడిగా, సాంప్రదాయిక సాహిత్యవేత్తగా, నవలాకర్తగా, కథారచయితగా, విమర్శకుడిగా విశ్వనాథ సాహిత్యపరామర్శా, విశ్లేషణా విస్తృతంగా జరిగి ఉండవచ్చు. బహుశా ఎనభై దశకం నుంచీ మారుతూ వచ్చిన ఆర్థికసామాజిక రాజకీయ పరిస్థితుల కారణంగా విశ్వనాథను సరికొత్త స్ఫూర్తిదాయక శక్తిగా దర్శించి ఆరాధించడం ప్రారంభించిన మధ్యతరగతిలోని ఒక నూతన విద్యాధిక తరం ఇప్పటికీ ఆ పని చేస్తూ ఉండవచ్చు. కానీ ఆయన దృక్పథాన్ని నిర్మమ దృష్టితో పరిశీలించి చర్చించడం ఎక్కడైనా జరిగిందా, జరుగుతోందా?

sudrarsanamఆర్.ఎస్. సుదర్శనంగారు తన ‘సాహిత్యంలో దృక్పథాలు’ లో విశ్వనాథ గురించి రాసిన భాగాలు చదువుతున్న కొద్దీ; అప్పుడు కానీ ఇప్పుడు కానీ విశ్వనాథ దృక్పథం గురించి వచ్చిన రచనలు ఏమేమి ఉన్నాయన్న ఆసక్తిదాయక ప్రశ్న నన్ను వెంటాడుతూనే వచ్చింది. సుదర్శనంగారి విశ్లేషణపై అప్పటివారు ఎలా స్పందించారు, దానిపై ఎలాంటి సమీక్షలు వచ్చాయి, ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి; అన్నిటికంటే ముఖ్యంగా ‘సాహిత్యంలో దృక్పథాలు’ వెలువడిన కాలానికి విశ్వనాథ జీవించే ఉన్నారు కనుక తనపై విశ్లేషణకు ఆయన ఎలా స్పందించారన్నవి, అంతే కుతూహలం రేపిన మరికొన్ని ప్రశ్నలు.

కొంత అకడమిక్ స్వభావం కలిగిన ఈ ప్రశ్నల్ని వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తాను.

‘సాహిత్యంలో దృక్పథాలు’లో ప్రప్రథమంగా ఆకట్టుకున్నది, విశ్వనాథ గురించి రాయడంలో సుదర్శనం ప్రదర్శించిన అద్భుతమైన వస్తుగతదృష్టి.  నా ఉద్దేశంలో సాహిత్యవిమర్శలో అది ఒక మంచి నమూనా. ఆయన కొన్ని చోట్ల విశ్వనాథను ఆకాశానికి ఎత్తారు. కొన్ని చోట్ల అంత ఎత్తునుంచీ కిందికి జార్చారు. ఆక్షేపణలూ చేశారు, అభినందనలూ వర్షించారు. ఒకచోట విశ్వకవి రవీంద్రునికన్నా విశ్వనాథ ప్రతిభావంతుడని అంటూనే, ఆ వెంటనే,  ఒక తత్వదర్శిగా రవీంద్రుడు ఎన్ని మెట్లు ఎక్కాడో విశ్వనాథ అన్ని మెట్లు కిందికి దిగారంటారు.

నవలాకర్తగా విశ్వనాథపై ప్రశంసాత్మక దృష్టినుంచి చేసిన సుదర్శనంగారి మదింపు ఇలా ఉంటుంది:

‘ఏకవీర’ గురించి:  విశ్వనాథలోని ఆధ్యాత్మికమైన లోచూపు ఇతర కాల్పనిక రచయితల భావనకు లేని తత్వ పరిపూర్ణతను ఇచ్చింది.  పూర్తిగా రొమాంటిక్ సంప్రదాయంలో పుట్టిన ‘ఏకవీర’ ఆ సంప్రదాయాన్ని అధిగమించి కావ్యగౌరవం పొందింది. ఈ నవల చివరి మూడు అధ్యాయాలూ ఉత్తమ కవిత్వం, ఔచిత్యం, మనస్తత్వ చిత్రణం, శాస్త్రపరిజ్ఞానం, తత్వదృష్టి, ధ్వని పరిపుష్టంగా ఉన్న రచన. ఈ స్థాయిలో వచనకవిత్వం, అసలు ఇంతకంటే కవిత్వం విశ్వనాథ రాయలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఏకవీర’తో పోల్చదగిన నవల రవీంద్రుని ‘నౌకాభంగము’. అందులో భావనాత్మకమైన ప్రేమ కన్నా, హిందూ వివాహవ్యవస్థ శక్తిమంతమని నిరూపించే ప్రయత్నం చేశాడు రచయిత. కానీ ఆ ప్రయత్నం అస్తవ్యస్తంగా పరిణమించింది. ‘ఏకవీర’కు ఉన్న తాత్వికమైన పటిమ రవీంద్రుని నవలకు లేదు. ఏకవీర కావ్యమైన నవల.

మనస్సులో అవ్యక్తమైన భాగం (Unconscious)ఒకటి ఉందనీ, దానికీ, వ్యక్తమైన భాగా(Conscious)నికీ సంఘర్షణ ఉంటుందనీ గుర్తించి పాత్రపోషణ చేసిన మొదటి తెలుగు నవలా రచయిత విశ్వనాథ. ‘ఏకవీర’లో వివాహవ్యవస్థనూ, వైయక్తికమైన వలపునూ -రెంటినీ ఆయన సమర్థించలేదు. వాటికి అతీతమైన సమన్వయాన్ని సూచించారు. అదే హైందవ సంప్రదాయమూలసూత్రం. అప్పట్లో వంగ సాహిత్యంలో వ్యవస్థాధర్మాన్ని సమర్థించే బంకిం చంద్ర మార్గం కన్నా, వైయక్తికమైన ధర్మాన్ని కాల్పనిక వాదంలో భాగంగా సమర్థించే రవీంద్ర ప్రభావితులైన రాయప్రోలు, కృష్ణశాస్త్రి, వెంకట పార్వతీశ్వర కవుల కన్నా విశ్వనాథ తొక్కిన మార్గం ప్రత్యేకమైనదే కాదు, ఉత్కృష్టమైనది.

‘వేయిపడగలు’ గురించి:  ‘వేయిపడగలు’ నవల చదవడం ఒక అపూర్వమైన అనుభవం, మరపురానిది. అందులో ఎంత సంతృప్తి ఉన్నదో అంత అసంతృప్తి కూడా ఉన్నది. ‘వేయిపడగలు’ గొప్పదనం అది ఏకపాత్ర చిత్రణం కావడం. ఆ చిత్రణం వేయి పుటల దాకా విస్తరించినా, వేయి పుటలూ తప్పక చదివిస్తాయి. పాశ్చాత్యనాగరికతా ప్రభావం ముప్పై ఏళ్లలో ఏ విధంగా తెలుగువారి జీవనవిధానంలో ఒడిదుడుకులకు. అవకతవకలకు హేతువైందో విపులంగా విమర్శనా దృష్టితో వర్ణింపబడడం కావ్యాన్ని అపురూపమైనదిగా చేస్తున్నది. అలా చూస్తే ‘వేయిపడగలు’ ఒక చిన్న సైజు ‘విజ్ఞాన సర్వస్వం’ అనిపిస్తుంది. ధర్మారావుతో పాటు విశ్వనాథ సృష్టించిన పాత్రలు చాలావరకు సజీవమైనవి. ‘వేయిపడగలు’,  కాల్పనికోద్యమ కాలంలో వెలువడిన ఆత్మాశ్రయ కవిత్వ(Subjective Poetry) శాఖలో ఒక అపురూపమైన కావ్యం. దాని వైశిష్ట్యం, అది వేయి పుటల నవలగా రూపొందడమే. నవలకు కవిత్వగుణ మబ్బడం 20 వ శతాబ్ది సాహిత్యములో ఒక మహత్పరిణామం. తెలుగు సాహిత్యములో స్వతంత్రంగా ఈ పరిణామం తెచ్చిన ఖ్యాతి విశ్వనాథది.

మొత్తంగా ఆయన నవలల గురించి:  విశ్వనాథ నవలను కావ్యంగా, తత్వవిచారంగా రూపొందించారు. అది ఆయన సాహిత్యానికి కూర్చిన నవ్యత. విశ్వసాహితిలో తెలుగు నవలకు స్థానం ఏర్పరచిన నవ్యత.

***

విశ్వనాథ పాండిత్యం, అవగాహనల లోతును, కల్పనాశక్తిని, పాత్రచిత్రణను. ఇంకా ఇతరేతర అనేక గుణాలను ప్రతిబింబించే కొన్ని ఘట్టాలనో, భావ శకలాలనో  ఆయన రచనలనుంచిఎత్తి చూపి ఆయన ప్రతిభా వ్యుత్పత్తులకు ముగ్ధులవడం వేరు. ఒక రచనను మొత్తంగా చూసి అందులో ఆయన ప్రదర్శించిన వస్తు నిర్వహణ నైపుణ్యాన్ని, స్పష్టతను, ముఖ్యంగా ఆ రచన వెనుక ఉన్న ఆయన దృక్పథాన్నీ విశ్లేషించి అంచనా వేయడం వేరు. సుదర్శనంగారు చేపట్టినది రెండో పద్ధతి.

విశ్వనాథ దృక్పథ పార్శ్వానికి వస్తే, అది ఆయనకు చాలా అసంతృప్తినే కాదు, ఆవేశాన్ని, ఆవేదనను కూడా  కలిగించింది. అక్కడక్కడ ఆక్షేపణ, వ్యంగ్యం రంగరించి మరీ విమర్శ చేయడానికి ఆయన వెనుకాడలేదు. అదే సమయంలో ‘ఏకవీర’ నుంచి ‘తెరచిరాజు’ వరకు వివిధ నవలలో విశ్వనాథ దృక్పథం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో, దాని వెనుక ఎలాంటి అంతస్సూత్రత ఉందో; ఆ క్రమంలో విశ్వనాథ ఎలాంటి ద్వైధీ భావానికీ, ఘర్షణకూ, కలవరానికీ లోనయ్యారో, చివరికి ఎక్కడ ఆగిపోయారో సుదర్శనం విశ్లేషించిన తీరు అత్యద్భుతం. అది చదువుతున్నప్పుడు 20 వ శతాబ్ది తెలుగుసాహిత్యంలో ధీర గంభీర ఆజానుబాహువుగా కనిపించే అంతటి విశ్వనాథ , పసివాడుగా మారి బేల చూపులు చూస్తున్న దృశ్యం పొడగడుతుంది.  బాహ్యంగా ముద్రపడిన ఇమేజికి, ఆంతరిక ఇమేజికి ఉన్న ఈ తేడా; ఒక రాజకీయ నాయకుని, లేదా మత నాయకుని లేదా మరొకరి ఇమేజి నిర్మాణంతో ఏమైనా సామ్యాన్ని సూచిస్తోందా?!

viswa1

ఏకవీర

ప్రస్తుతానికి దానినలా ఉంచితే, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో, అంతకు ఒకింత ముందు సాంప్రదాయిక ప్రభావాలనుంచి నవ్యతకు మళ్లిన అనుభవం ఎక్కువమంది కవి, రచయితలలో కనిపిస్తే; నవ్యతనుంచి సంప్రదాయం వైపు,అంటే వెనక్కి మళ్లి, అందులోనే కరడుగట్టిన అరుదైన సాహితీవేత్తగా విశ్వనాథ కనిపిస్తారు. మొదట్లో ఆయన కూడా తన సమకాలికులైన రాయప్రోలు, కృష్ణశాస్త్రి వగైరాలలానే కాల్పనికవాదంతో ప్రభావితులయ్యారు. ఆ కొత్త కళ్ళద్దాలతో జగత్తును నూతనంగా దర్శించి, పులకించి, భాష్యం చెప్పే వైశాల్యం వైపు ప్రవహించే ప్రయత్నం చేశారు. ‘ఏకవీర’లో అది ఎలా ప్రతిఫలించిందో సుదర్శనం విశ్లేషించారు. కాల్పనికోద్యమ ప్రభావంలో పుట్టిన ‘ఏకవీర’ కథలో, నిర్మాణంలో ఆ ఉద్యమ సంప్రదాయాన్ని పూర్తిగా అనుసరిస్తూనే; ఏకవీర పాత్రపోషణ, కథ ముగింపు విశ్వనాథ ప్రత్యేకదృక్పథాన్ని సూచిస్తాయని ఆయన అంటారు. నవలలో కుట్టాన్-మీనాక్షి; వీరభూపతి-ఏకవీర ప్రేమికులు. కానీ పెళ్లి అనే వ్యవస్థాధర్మం దగ్గరికి వచ్చేసరికి జంటలు తారుమారు అయ్యాయి. దానితో రెండు జంటలలోనూ సంఘర్షణ ఏర్పడింది. ఆ సంఘర్షణ తిరిగిన మలుపు ఈ నవలలో ఇతివృత్తం. పెళ్ళికి, ప్రేమకు మధ్య జరిగిన ఆ ఘర్షణలో ఏకవీర ద్వంద్వాతీతమైన తాత్వికస్థితిని చేరుకుని, లోకాన్నీ లోకధర్మాన్ని విడిచి వైగై నదిలో మునిగిపోయింది. వీరభూపతి సన్యాసి అవుతాడు.  వీరికి భిన్నంగా కుట్టాన్, మీనాక్షి పెళ్లి అనే వ్యవస్థాధర్మంతో రాజీపడే ప్రయత్నం చేస్తారు.

ఏకవీర, వీరభూపతిలలో ధర్మానికీ, ప్రేమకూ జరిగిన సంఘర్షణను, అది తిరిగిన మలుపును ప్రత్యేకంగా చిత్రించడమే విశ్వనాథ నిరూపించదలచుకున్న తాత్విక విషయమని సుదర్శనం అంటారు. కాల్పనికోద్యమ ప్రభావంలో ఉన్న ఈ దశలో విశ్వనాథ వైయక్తిమైన వలపును కాదనలేదు; అయితే వివాహవ్యవస్థా ధర్మాన్నీ కాదనలేదు. రెండింటికీ అతీతమైన ఒక సమన్వయాన్ని దర్శించారు. ఇందులో ఆయన నిరూపించదలచుకున్నది కేవల హైందవవ్యవస్థ కాదు; దానికి మూలతత్వమేదైతే ఉందో అది. అదే సనాతనధర్మం. వ్యక్తి ధర్మానికీ, వ్యవస్థా ధర్మానికీ జరిగే ఘర్షణలో రెంటి వైపూ మొగ్గక, రెంటినీ అధిగమించే సమన్వయాన్ని సాధించే ద్వంద్వాతీతమైన తత్వమే సనాతన ధర్మం. అది సామూహికం కాక, వ్యక్తిగతం. క్రమంగా విస్తృతమూ, వైవిధ్యవంతమూ అయిన అయిన హైందవ సంప్రదాయస్వరూపం ఇదే నని సుదర్శనం అంటారు. నాటి వంగ సాహిత్యంలో వ్యవస్థాధర్మాన్ని సమర్థించిన బంకిమ్ చంద్ర మార్గం కన్నా, కాల్పనికవాదంలో భాగంగా వైయక్తిక ధర్మాన్ని సమర్థించిన రవీంద్రుని మార్గం కన్నా, విశ్వనాథ ఏకవీరలో ప్రదర్శించిన సమన్వయ పూరితమైన సనాతనధర్మ మార్గం ఉత్కృష్టమైనదని ఆయన నిర్ధారణ.

viswa2

అయితే అదే సమయంలో ఈ ‘ఏకవీర’లోనే తన మతావేశంపై, తత్వాన్ని వదలి దాని ప్రతీకలపై విశ్వనాథలో ఉన్న చాపల్యాన్ని సూచించే చిత్రణలూ ఉన్నాయని సుదర్శనం ఎత్తి చూపించారు. ఆ చాపల్యం, లేదా వ్యామోహమే క్రమంగా ఆయనలో పెరిగి పెద్దదై అనంతర రచనల్ని ఆక్రమించుకుందనీ, ద్వంద్వాతీతమైన సనాతనధర్మాన్ని వదిలి ద్వంద్వంలో ఒకటైన వ్యవస్థాధర్మాన్ని సమర్థిస్తూ వచ్చారనీ, వ్యవస్థాధర్మమే సనాతన ధర్మం అనే అపోహను కల్పించే ప్రయత్నం చేశారని సుదర్శనం విశ్లేషణ. అంటే, కాల్పనికోద్యమ ప్రభావంతో కొత్త చూపును తెచ్చుకోబోయిన విశ్వనాథే, వ్యవస్థ పట్ల రొమాంటిక్ వ్యామోహంలో పడిపోయి పాత చూపుకు తిరోగమించారని సారాంశం. ఆయన దృక్పథ పతనానికి ఇదే ప్రారంభం.

వేయిపడగలు

‘వేయిపడగలు’ నవలలో వ్యక్తమైనది ఇదే!

కారణం, వ్యవస్థకు పట్టిన క్షీణదశ అంటారు సుదర్శనం. దాంతో వ్యవస్థను సమర్థించడం, కాపాడడమే ఆయనకు ముఖ్యంగా తోచిందనీ; హేతువాదం, భౌతికవాదం, పురాణాల నిరసన మొదలైనవి కలిగించిన ఆవేశంతో విశ్వనాథ సాహిత్యరంగాన్ని సమరరంగంగా దర్శించారని ఆయన అంటారు. పాశ్చాత్య ప్రభావాలు, ఇంగ్లీష్ చదువులే కాక,  గాంధీజీ స్వాతంత్ర్య సమరంలోకి దళితులను, ముస్లింలను ప్రవేశపెట్టడం మొదలైన, సుదర్శనం చెప్పని ఇతరేతర పరిణామాలను కూడా వీటికి జోడించుకోవాల్సి ఉంటుంది.

ఈ సందర్భంలోనే సుదర్శనం ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. వ్యవస్థ కాలం వెంబడి మారే సాధనం మాత్రమేననీ, అంతకంటే అది ప్రాతినిధ్యం వహించే తత్వం ముఖ్యమనీ; దానిని కొత్తగా, కొత్త సమన్వయంతో పునర్మించాలనీ విశ్వనాథకు తోచలేదని ఆయన అంటారు. అయితే, ఆ వెంటనే, “అలా ఆలోచించే అవకాశం అప్పట్లో ఆయనకు లే”దని సుదర్శనంగారే అనడం ఏమరుపాటో లేక ఉద్దేశపూర్వకమో తెలియదు. బహుశా, తాత్విక స్థాయిలోనే కావచ్చు కానీ, విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే హైందవసంప్రదాయం పట్ల ఒక అడ్మిరేషన్ కలిగిన ‘బాహ్యమిత్రు’డిగా ఆయనకు ఇలా సందేహలాభా(benefit of doubt)న్ని ఆపాదించి ఉండవచ్చు. ఎందుకంటే, విశ్వనాథకు సమకాలికుడైన ఉన్నవ లక్ష్మీనారాయణగారి ‘మాలపల్లి’ నవల గురించి ‘సాహిత్యంలో దృక్పథాలు’లో సుదర్శనంగారే చర్చిస్తూ ఆ నవలకూ, వేయిపడగలకూ ఉన్న తేడాను నిర్వచనప్రాయంగా ఆవిష్కరించారు.

‘మాలపల్లి’ ఆనాటి సామాజిక చైతన్యానికి ప్రతిబింబం కావడమొక్కటే కాదు, ఆ చైతన్యానికి నూతన దృక్పథాన్ని, పరిణామమార్గాన్ని నిర్దేశించిందని ఆయన అంటారు. ఆయన ప్రకారం, ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రెండు విభిన్న మార్గాలను అనుసరించడం సాధ్యం. మొదటిది,  వర్ణాశ్రమ వ్యవస్థ శిథిలమైందనీ, వైదికధర్మం అడుగంటిందనీ, పరాయి మతస్థుల, విదేశీయుల పాలనలో భారతీయ సంస్కృతి, భాషలు, హైందవధర్మం, జీవనం సంకరమైపోయాయనీ, ఇక మిగిలిందేముందనీ అనుకుంటూ నిస్పృహ, నిర్వేదం ప్రకటించడం. ఇది ‘వేయిపడగలు’ లో ప్రతిభావంతంగా వ్యక్తమైంది. రెండవది,  పై వైఖరి సంపూర్ణ సత్యం కాదని చెబుతూ, మౌలికమైన హైందవధర్మమూ, సంస్కృతీ సజీవంగానే ఉన్నాయనీ, నెలవులు మార్చుకుని కాలగతిలో నివురు గప్పిన నిప్పులా ఉంటూనే ఉన్నాయనీ భావించడం. ఇది ‘మాలపల్లి’లో కనిపిస్తుంది. యధార్థం ఒకటే అయినా ఈ రెండు రచనల ప్రతిపాదనలు వేరు వేరుగా ఎందుకు ఉన్నాయంటే, హైందవధర్మమూ, సంస్కృతీ అగ్రవర్ణాలవారిలో, ధనికులలో పూర్వస్థితినుంచి శైథిల్యాన్ని పొందినా సామాన్యప్రజల్లో, పంచముల్లో, నిరుపేదల్లో సజీవంగా ఉండడం ఒక కారణం.  ‘వేయిపడగలు’ అగ్రవర్ణాలవారినీ, జమీందారులనీ ఆలంబనం చేసుకోగా, ‘మాలపల్లి’ పంచములను, శ్రామికులను ఆలంబనం చేసుకుంది. విశ్వనాథ వర్ణవ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యం సనాతనధర్మానికి ఇవ్వలేదు. ఉన్నవవారు సనాతనధర్మానికీ, మోక్షసాధనకూ ఇచ్చిన ప్రాధాన్యం వర్ణవ్యవస్థకు, వైదికకర్మానుష్ఠానానికీ ఇవ్వలేదు. ఇలా పోల్చి చూసినప్పుడు హైందవధర్మనిరూపణలో ఒకరిది ‘వెనుక చూపు’, ఇంకొకరిది ‘ముందుచూపు’ అని సుదర్శనం అంటారు.

ఇలా ‘వేయిపడగలు’ను, ‘మాలపల్లి’ని పోల్చి చూసినప్పుడు ఇంకా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సుదర్శనంగారు ‘వెనుకచూపు’గా పేర్కొన్న ‘వేయిపడగలు’కు లభించిన ప్రాచుర్యం, ‘ముందుచూపు’గా పేర్కొన్న ‘మాలపల్లి’కి ఎందుకు లభించలేదు; ‘వేయిపడగలు’ చర్చలోకి వచ్చినంతగా ‘మాలపల్లి’ ఎందుకు రాలేదు,  వర్ణాశ్రమ ప్రాధాన్యాన్ని కాక, సమన్వయాత్మకమైన సనాతన ధర్మాన్ని ప్రతిపాదించిన ఆ నవల అనంతరకాలానికి ఒక గొప్ప స్ఫూర్తీ, నమూనా ఎందుకు కాలేదు—అన్నవి ఈ ప్రశ్నలలో కొన్ని. ఇంకొకటి ఏమిటంటే, ‘మాలపల్లి’కి ఉన్నది స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం, గాంధీ తాత్వికత. ఉన్నవవారు స్వయంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. సుదర్శనంగారు గుర్తించి ప్రస్తావించనిది ఏమిటంటే, ‘వేయిపడగలు’ వెనుక ‘మాలపల్లి’కి ఉన్నట్టు బలమైన స్వాతంత్రోద్యమ నేపథ్యం లేకపోవడం. ‘వేయిపడగలు’,  ఆయనే అన్నట్టు, వ్యవస్థా శైథిల్యం పట్ల ఒక వ్యక్తి చెందిన నిర్వేదం, నిస్పృహ. ఉన్నవలా విశ్వనాథ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాదు.

స్వాతంత్ర్యోద్యమ ప్రభావాలనుంచి ‘వేయిపడగ’లూ, దాని రచయిత దూరంగా ఉండడం చారిత్రక దృష్టినుంచి మనకు ఏం చెబుతుంది? దళితులను, ముస్లిం లను, కార్మిక, కర్షకులను స్వాతంత్ర్యోద్యమంలోకి తీసుకొచ్చి ఉద్యమ పరిధిని అనేకరెట్లు విస్తృతపరచిన గాంధీ;  దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగివచ్చాక తన శేషజీవితం పొడవునా బ్రిటిష్ తో పోరాటానికి సమాంతరంగా, అంతకంటే ఎక్కువగా పోరాడినది ఛాందసవాదహైందవశక్తులతో. చివరికి ఆ శక్తుల చేతిలోనే ఆయన మరణించాడు కూడా. ఈ ఛాందసవాద హైందవ శక్తులు కూడా గాంధీ నాయకత్వంలోని నాటి స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉన్నాయి. ఆ శక్తుల అండదండలతో, భావజాలంతో ప్రాణం పోసుకుని  నేడు హిందుత్వ శక్తులు అనిపించుకుంటున్నవి కూడా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటానికి దూరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ‘వేయిపడగలు’ వెనుక స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం లేకపోవడం ఆ రచనను, రచయితను ఎవరి మధ్య నిలబెడుతోంది? ‘మాలపల్లి’కి భిన్నంగా ‘వేయిపడగలు’ విశేష ప్రాచుర్యాన్ని, అడ్మిరేషన్ ను పొందుతూ ఉండడమే కాదు; ఎనభై దశకం చివరినుంచీ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆర్థికంగా బలోపేతమవుతున్న మధ్యతరగతిలోని ఒక విద్యాధిక యువతరం ఇప్పుడు విశ్వనాథను, ఆయన భావజాలాన్ని నూతనంగా కనుగొంటూ ఆయనను ఒక స్ఫూర్తిదాయక ఐకాన్ గా తిరిగి ప్రతిష్టించే ప్రయత్నం వరకూ దాదాపు ఒక వందేళ్ల కాలగమనాన్ని కళ్ళముందు నిలుపుకుని చూస్తే అందులో సరళరేఖా సదృశమైన ఒక కచ్చితమైన క్రమం కనిపిస్తుంది. ఆ సరళరేఖకు ఆ చివర గాంధీ భావజాలం ఉంటే; ఈ చివర ఉన్నది ఛాందస హైందవాద భావజాలం, అది సాధించిన పునరాధిక్యత. రాజకీయంగా చెప్పాలంటే, గాంధీ భారతంపై సావర్కర్ భారతం సాధించిన పునర్విజయం.

‘మాలపల్లి’ దళితులకూ స్ఫూర్తిదాయకం కాలేదు, నమూనా కాలేదు. కారణం స్పష్టమే. అందులో ఉన్నది ఒక బ్రాహ్మణ రచయిత చిత్రించిన గాంధీ మార్కు హైందవ తాత్వికత. గాంధీకి ఆనాడు అంబేడ్కర్ ప్రతిద్వంద్వి అయిన పరిస్థితిలో దళితులు గాంధీ మార్గాన్ని కాక అంబేడ్కర్ మార్గంవైపే మొగ్గు చూపారు. మొత్తానికి, సనాతన ధర్మాన్ని చిత్రించారని సుదర్శనంగారు చెప్పిన ‘మాలపల్లి’ రచయిత దళితులకు సరే, అగ్రవర్ణాలకూ పనికిరాకుండా పోయాడు.

ఇంతకీ ‘వేయిపడగలు’లో విశ్వనాథ ఘనంగా చెప్పదలచుకున్న వ్యవస్థా స్వరూపం ఎలాంటిది? సుదర్శనంగారి మాటల్లో చెప్పాలంటే, ఆయన ‘దృక్పథ శైథిల్యం’ ఇంకా ఎలాంటి మలుపులు తిరిగింది?

దాని గురించి తర్వాత….

*

 

పాషాణ పాకం – మైనపు ముద్ద!

viswanatha

ఒక పాతకాలపు మండువా ఇల్లు లాంటి ఇల్లు. చుట్టూ ప్రహరీ. ఎత్తైన ద్వారబంధం. లోపల విశాలమైన ఒక పూజగది. అందులో ఒక పెద్ద జ్ఞానభాండాగారం. ఆ పరిసరాల్లో ఆకురాలినా వినిపించేటంత నిశ్శబ్దం. ఆ గదిలో వెలుతురూ చీకటీ కానీ ఒక మిశ్రమస్థితి.

ఆ జ్ఞానభాండాగారం ముందు ఒక వృద్ధుడు ముకుళిత హస్తాలతో, అరమోడ్పు కనులతో కూర్చుని ఉన్నాడు. అంతర్ముఖుడై ఉన్నాడు. ఆయన ముఖమండలాన్ని అనంతమైన శాంతి ఆవరించి ఉంది. మధ్య మధ్య తల ఎత్తి భాండాగారంవైపు చూస్తున్నాడు. నిశ్చయాత్మకంగా తల పంకిస్తున్నాడు. ఆ క్షణంలో ఆయనలోని ఆలోచనలకు అక్షరరూపమిస్తే అది ఇలా ఉంటుంది.

మానవుడు పుట్టినప్పటినుంచీ ప్రోది చేసుకుంటూ వచ్చిన జ్ఞానమేదైతే ఉందో ఆ యావత్తు ప్రపంచవిజ్ఞానానికీ ఇది అంతిమం. దీనికి ముందు ఏమీ లేదు. దీని తర్వాత ఇంకేమీ ఉండదు. ఇందులోంచి జ్ఞానాన్ని తోడి ప్రపంచానికి, అది కూడా అవతలివాడి యోగ్యతను బట్టి,  అందించవలసినదే కానీ, ఇందులోకి తీసుకొచ్చి కలపవలసిన ప్రపంచవిజ్ఞానం ఏమీ లేదు.

జ్ఞానానికి ఇది అంతిమ సరిహద్దు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడిక తానుగా కొత్తగా జ్ఞానాన్వేషణ చేయవలసిన అవసరం నుంచి ఆయన విముక్తి పొందాడు. అయితే జన్మ ఎత్తాము కదా, దీనినేమి చేయాలి? ఈ జ్ఞానపు సరిహద్దును శత్రువులు ఆక్రమించకుండా కాపలా కాయడమే దానితో చేయవలసినది. అనగా తానొక యోధునిగా మారడం!

ఆ వీథి లోంచి ఆ ఇంటి మీదుగా రోజూ ఒకాయన వెడుతూ ఉండేవాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయన అడుగులు కాసేపు ఆగేవి. ఆ ఇంటిమీద ఆయనకు ఒక అంతులేని కుతూహలం. ఆ లోపల ఉన్నవారు ఎవరో ఆయనకు తెలుసు, కానీ తెలియదు. ఇదో విచిత్రమైన ప్రహేళిక. తెలియడమంటే ఏమిటి, సన్నిహితంగా గాఢంగా తెలియడం. కానీ ఈయనకు ఆ అవకాశం లేదు. ఆ వృద్ధుడి సామాజిక నేపథ్యం, ఈయన సామాజిక నేపథ్యం ఒకటి కావు. కనుక కొన్ని వందలు వేల సంవత్సరాలుగా ఆ జ్ఞానభాండాగారాన్ని నింపుతూ వృద్ధి చేస్తూ వస్తున్న ఆ ఇంటిలోపలివారి ఆచారవ్యవహారాలు, వారి ఆలోచనాసరళి, వారి భాషకు చెందిన నుడికారం, అందులో ఉట్టిపడే ధిషణ, అధికారం-మొత్తంగా ఆ జ్ఞానభాండాగార వృద్ధి వెనుక గల వారి తాత్విక, మానసిక స్థితిగతులు ఈయనకు సన్నిహితంగా తెలియవు. ఆ ఇంటాయనదీ, ఈయనదీ రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకరికొకరు పరిచితులే, కానీ అపరిచితులు. ఒకరు ఆ జ్ఞానభాండాగారపు లోపలి మనిషి, ఇంకొకరు వెలుపలి మనిషి.

కానీ ఈయనకు ఆ ఇంటిమీద వల్లమాలిన కుతూహలం. ఎప్పుడైనా సింహద్వారం తెరచి ఉన్నప్పుడు లోపల కొంత ఆ ఇంటి ఆకారం కనిపించేది, అంతే. అది కనిపించడం కాదు. మరీ అరుదుగా సాహసించి సింహద్వారం దాటి లోపలికి వెళ్ళేవాడు. కానీ అడుగులు జ్ఞాన భాండాగారమున్న గది ఇవతల ఆగిపోయేవి. ఇంకా అరుదుగా ఆయన అదృష్టం కొద్దీ ఆ భాండాగారపు తలుపులు  ఓరగా తెరచుకుని ఉండేవి. అప్పుడా సందులోనుంచి భాండాగారం వైపు తొంగి చూసినప్పుడు దానిలోని జ్ఞానశకలాల మెరుపులేవో తన బుద్ధిని తాకినట్లు అనుభూతి చెందేవాడు. ఆ మెరుపులు అప్పటికే ఈయన బుద్ధిలో నిక్షిప్తమైన జ్ఞానఫలకంపై ప్రసరించి కొత్త కాంతులను ఈనుతున్నట్టు అనిపించేది.

ఎందుకంటే, ఈయన తన బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్నది కొత్త జ్ఞానం. ఆ వృద్ధుడి భాండాగారం నుంచి తోడుకున్నది కాక ఇంగ్లీషు చదువువల్ల కలిగినది. వృద్ధుని భాషలో చెప్పాలంటే అది కాలమహిమ! వృద్ధుడి వెనక వందలు వేల సంవత్సరాల చదువు ఉండగా ఈయనది ఇప్పుడిప్పుడే మొదలైన చదువు. పైగా అది ఇంగ్లీషు చదువు. ఈయనకు ఆ విధంగా ఇంగ్లీషు గవాక్షం నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం కలిగింది. ఆపైన తన జ్ఞానభాండాగారం యావత్తు జ్ఞానానికీ అంతిమం అనుకుంటున్న వృద్ధుడిది ఆగిపోయిన చదువైతే, ఈయనది  సాగుతున్న చదువు. వృద్ధుడిది కడుపు నిండింది అనుకునే చదువైతే, ఈయనది అప్పుడే హైబర్నేషన్ నుంచి బయట పడినట్టుగా ప్రపంచాన్నే మింగేసేటంతగా ఆవురావురు మంటున్న చదువు.

sudrarsanam

ఈయన తన కొత్త చదువుల దారిలో ఏవో కొన్ని జ్ఞానపు గీటురాళ్లను సేకరించుకున్నాడు. ఆ వృద్ధుని జ్ఞాన భాండాగారం నుంచి తనను తాకిన శకలాలను వాటిమీద పరీక్షించి విలువ కట్టాలని ఈయన తాపత్రయం. ఆవిధంగా రెండింటి మధ్యా ఏమైనా సమన్వయం సాధ్యమవుతుందేమో నని కూడా ఆయన తపన. కానీ విచిత్రం, ఆ జ్ఞానభాండాగారానికి తను అపరిచితుడు, ఔట్ సైడర్! కాకపోతే ఆ భాండాగారంపై ఈయనకు ఒకవిధమైన ఆరాధనాభావం ఉంది. కనుక దానికి ఆయన ‘బాహ్యమిత్రుడు’. మారిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులలో ఆ వృద్ధునికీ, ఈయనకూ కుదిరిన ఒకానొక ఐక్యత కూడా అందుకు కారణం కావచ్చు.  అంతకు చాలా ముందునుంచే ఉండి, ఇవే పరిస్థితులలో ఈయన కళ్ళముందే బలమైన గొంతును, నిర్దిష్టతను, అస్తిత్వాన్ని తెచ్చుకుంటున్న ఇంకొక సామాజికవర్గం ఉంది. ఈ వర్గానికి ఆ జ్ఞానభాండాగారం వైపు తలుపు సందులో నుంచి చూసే అవకాశం కూడా లేదు. కనుక ఈ వర్గాన్ని ‘బాహ్యశత్రువు’ అనవచ్చు.  ‘బాహ్యత’ అనేది ఉభయులకూ సమానం.

వృద్ధుని విశ్వనాథ సత్యనారాయణ అనుకుంటే, ఈ రెండో వ్యక్తి ఆర్. ఎస్. సుదర్శనం.

***

‘సాహిత్యంలో దృక్పథాలు’ ఆర్. ఎస్ .సుదర్శనంగారి ప్రసిద్ధ సాహిత్య విమర్శాగ్రంథం. మొదటిసారి 1968లో ప్రచురితమైంది. అందులోని వ్యాసాలను ఎప్పుడో చదివాననే గుర్తు. కానీ అది చదువు కాదు. విశ్వనాథవారి ఫక్కీలోనే చెప్పాలంటే, చదివితిని, చదవనైతిని. అసలు చదువనగా నేమి? ఒక పుస్తకములోని విషయమును సంపూర్ణముగా ఆకళించుకొనగల అధికారముతో చదివినదే చదువు. కేవలము చక్షురక్షర సంయోగమాత్రముగా చదువునది చదువు కాదు.

చదవడం గురించి నాకూ ఒక అభిప్రాయం ఉంది. మనం ఒకే రచనను వివిధ జీవితదశల మీదుగా చదువుతాం. ఆ వివిధ జీవిత దశలమీదుగా సునిశితమవుతున్న మన అవగాహనను, ప్రపంచజ్ఞానాన్ని ఆ రచనకు అదనంగా జోడిస్తూ చదువుతాం. ఆ చదువు వెనకటి జీవితదశలోని చదువును రద్దు చేస్తుంది. అంటే మళ్ళీ ఆ రచనను మనం కొత్తగా చదువుతాం. ఆ విధంగా ఆ రచన కాలం వెంబడి ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని తెచ్చుకుంటూ పాఠకుడికి ఎప్పటికప్పుడు కొత్తగా చదివిన అనుభూతినిస్తుంది.

ఇప్పుడు ‘సాహిత్యంలో దృక్పథాలు’ చదవడం నాకు నిజంగా అలాంటి ఒక విశిష్టానుభవం. అటు విశ్వనాథ సత్యనారాయణ గారిని, ఇటు సుదర్శనంగారిని కూడా కొత్తగా ఒకింత ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడా రచన ఇచ్చింది. అయితే ఇది సబ్జెక్టివ్ గా అంటున్న మాట సుమండీ. విభేదించే హక్కు పాఠకులకు ఎప్పుడూ ఉంటుంది.

అందులోనూ నాకు ముఖ్యంగా అనిపించినది, ఈ పుస్తకానికి అది వెలువడిన రోజుల్లో కన్నా ఇప్పుడు ఎక్కువ రెలెవెన్స్ ఉందన్నది. ఆ రెలెవెన్స్ ఉండడమే దాని గురించి నేను రాయడానికి ప్రధానమైన ప్రేరణ. ఆ రాయడంలో నేను సాహిత్యంలో దృక్పథాలు గురించి మాత్రమే రాయడం లేదు. విశ్వనాథ సత్యనారాయణ, ఆర్ ఎస్ సుదర్శనం అనే ఇద్దరు వ్యక్తులను గురించి రాస్తున్నాను. వారి భావాల మధ్య ఉన్న సంఘర్షణ గురించి, ఆ సంఘర్షణ వేళ్ళు వారి వారి సామాజిక, వైజ్ఞానిక వైవిధ్యాలలో ఉండడం గురించి రాస్తున్నాను. వారిని, వారి సామాజిక నేపథ్యాలను  కూడా దాటి,  దేశమంతటా ఇంకా కింది సామాజికవర్గాలవరకూ వ్యాపించి  ఈ దేశపు గతాన్ని, వర్తమానాన్ని కమ్ముకున్న ఆ వైవిధ్యమూ, ఆ భావసంఘర్షణా తాలూకు భవిష్యస్థితి గురించి, అది నేటి మన అనేకానేక భ్రమలను చెదరగొట్టే అవకాశం గురించి రాయడానికి ఈ ప్రయత్నం.

సుదర్శనంగారు సాహిత్యంలో దృక్పథాలు రాసిన కాలానికి ఉన్న దేశీయస్థితిగతులు వేరు. అప్పడు కాంగ్రెస్, అది చెప్పుకునే సెక్యులరిజం(లేదా ఇప్పుడు కొందరు ప్రబలంగా చిత్రిస్తున్న సూడో-సెక్యులరిజం) పెద్దగా పోటీ లేని అధికారాన్ని చలాయిస్తున్నాయి. దేశవిభజన తర్వాత దేశంలోని ముస్లిం మైనారిటీలు, ఇతర మతపరమైన మైనారిటీలు సెక్యులరిజం(లేదా సూడో-సెక్యులరిజం) గొడుగు కింద  కనీసం సూత్రరీత్యానైనా ఒక తటస్థ సామాజిక స్థితిలో ఉంటున్నారు.  ఇంకోపక్క వామపక్ష, వామపక్ష తీవ్రవాద ప్రభావం ప్రత్యేకించి యువత మీదా గాఢంగా ఉంది. నూతన రాజ్యాంగం ఇచ్చిన అవకాశంతో దళితులు, తరుజన, గిరిజనులు కొత్త అస్తిత్వాన్ని, గొంతును, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటున్నారు.

ఈ కాలమంతటా సాంప్రదాయికశక్తులుగా భావిస్తూ వచ్చిన శక్తులు సద్దు మణిగి ఉన్నాయి. వాటిమీద తిరోగాములన్న ముద్ర బలంగా ఉంది. పాశ్చాత్య విజ్ఞానపు వెలుగులో సాంప్రదాయిక విద్యా విజ్ఞానాలను సరికొత్తగా అర్థం చేసుకుని నూతన సమన్వయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఆరోజున పురోగామిగా ముద్ర పొందింది. ఆవిధంగా సుదర్శనం సాహిత్యంలో దృక్పథాలు రాసే కాలానికి పురోగామి చింతకులు అనుకుంటే, విశ్వనాథ తిరోగామి భావజాలానికి ప్రతినిథి. అయితే 1968 నుంచి 2016 కు వచ్చేసరికి నాడు ‘తిరోగామి’, ‘పురోగామి’ అనుకున్న శక్తుల బలాబలాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇప్పుడు విశ్వనాథ భావజాలం అధికారాన్ని పుంజుకుంటూ విశ్వరూపాన్ని ధరిస్తుంటే సుదర్శనం ప్రాతినిధ్యం వహించిన భావజాలం దానికి దారి ఇస్తూ వెనకడుగు వేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా భావజాలాల ఆధిక్యత తలకిందులైన పరిస్థితే సాహిత్యంలో దృక్పథాలకు సరికొత్త రెలెవెన్స్ ను స్థాపిస్తూ నూతనంగా చదవలసిన అవసరం కల్పిస్తోంది.

నేను పైన అన్న ‘బాహ్య మిత్రుడు’, ‘బాహ్య శత్రువు’ అనే మాటలు ఇక్కడ కీలకంగా గమనించవలసినవి. ఇప్పుడు ఒకవిధమైన జాతీయతావాదాన్ని, దేశభక్తిని దేశంలో స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇక్కడ దేశీయసమాజస్థితి ఎలా ఉంది? ‘బాహ్య మిత్రుడు’ ఇంకా ‘అంతర్మిత్రుడు’ కాలేదు. ‘బాహ్య శత్రువు’కీ, ‘అంతర్వ్యక్తు’లకూ మధ్య సయోధ్య, సమన్వయం, ఇరువురినీ కలిపే ఒక ఉమ్మడి అవగాహన ఏర్పడలేదు. బలాబలాలు తలకిందులు కావచ్చు తప్ప, సాంప్రదాయికంగా వస్తున్న భావ, భౌతిక సంఘర్షణ యథాతథంగా కొనసాగుతూనే ఉంది. కానీ అన్ని రకాల వైరుధ్యాలను, వైవిధ్యాలను తన కంఠబలంతో అధికార బలంతో ఎగరగొట్టి తన అస్తిత్వాన్ని అంతటా వ్యాపింపజేయడంలో  వందలు వేల సంవత్సరాల అనుభవం ఉన్న సాంప్రదాయిక భావజాలానికి ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని అమలు చేయగల అవకాశం దాదాపు నూరేళ్ళ విరామం తర్వాత మళ్ళీ వచ్చింది. తన బ్రాండు జాతీయతావాదాన్ని, దేశభక్తిని విధించి శాసించడం అందులో భాగమే.

కానీ విచిత్రమేమిటంటే ఆ జాతీయతావాదాన్ని, దేశభక్తిని పైనుంచి కృత్రిమంగా రుద్దే ఆ ప్రయత్నంలోనే దాని నిరంతర వైఫల్యమూ స్పష్టంగా లిఖించి ఉండడం. ఈ దేశానికి అదొక హాస్యాస్పద, విషాదకర అనుభవం.

నేను ఈమధ్యనే ఒక చోట రాశాను, భారత దేశమంతటా ఈనాటికీ ఉన్నది ప్రైవేట్ సంభాషణా, ప్రైవేట్ జీవితాలే తప్ప పబ్లిక్ సంభాషణా, పబ్లిక్ జీవితమూ లేదు. భారతదేశపు గొంతు ఇప్పటికీ ప్రైవేట్ గానే వినిపిస్తుంది. అన్ని కులాలు, మతాలు, వర్గాలు తమ నాలుగు గోడల మధ్య నిరంతరం ప్రైవేట్ గానే సంభాషిస్తూ ఉంటాయి. వీటి మధ్య ఒక ఉమ్మడి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. రాజ్యాంగం అవతరణ అలాంటి పబ్లిక్ భాషను అభివృద్ధి చేసేందుకు ఒక ప్రాతిపదిక. కానీ ఇన్నేళ్లలోనూ రాజ్యాంగం పొందుపరిచిన ఆ పబ్లిక్ భాష పూర్తిగా ప్రజల పరం కాలేదు. అసలు రాజ్యాంగం ఉనికే జనం ఊహల్లో ఇంకలేదు. రాజ్యాంగం ముందునాటి వివాదాల అంతు తేల్చుకునే ప్రయత్నంలోనే ఇప్పటికీ ఉన్నాం. ఇప్పుడు సాంప్రదాయిక శక్తుల పునరాధిక్యస్థితి ఆ అంతు తేల్చుకునే ప్రక్రియను పూర్తి స్థాయి యుద్ధం వైపు మళ్లించింది.

మళ్ళీ ‘బాహ్యమిత్రు’డి దగ్గరికి వద్దాం. పైన చెప్పిన ఆ మండువా ఇంటి లాంటి ఇల్లూ, అందులోని జ్ఞాన భాండాగారం ముందు కూర్చుని ఉన్న విశ్వనాథ వంటి ఒక వృద్ధుడూ, ఆ ఇంటి మీదుగా వెళ్ళే ఆర్ ఎస్ సుదర్శనం వంటి వ్యక్తీ, ఆ ఇంటి మీద ఆయన కుతూహలం, అందులోని జ్ఞాన భాండాగారం పట్ల ఆయనలోని ఒకవిధమైన అడ్మిరేషన్…కేవలం ఒక ప్రతీకాత్మక దృశ్యకల్పన కావు. సాహిత్యంలో దృక్పథాల వంటి సుదర్శనంగారి రచనల ద్వారానే కాక, వ్యక్తిగా కూడా ఆయనతో ఉన్న కొద్దిపాటి పరిచయంతో నేను ఆయన గురించి చేసిన కల్పన ఇది.

సుదర్శనంగారు ఎనభై దశకం ప్రారంభంలో, అంతకు కొన్నేళ్ళ ముందు రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ గానూ, ఆ తర్వాత ఉన్నత విద్యా జాయింట్ డైరక్టర్ గానూ ఉన్న రోజుల్లో కొన్నిసార్లు ఆయన ఇంటికి వెళ్ళి సాహిత్యం గురించే కాక, ఇతర విషయాల గురించి కూడా ఆయన చెప్పేవి వినే అవకాశం నాకు కలిగింది. ఇప్పటికీ ఒక సంభాషణ నాకు గుర్తుండిపోయింది.

ఓసారి మా సంభాషణ శంకరాచార్యులు స్థాపించిన మఠాలవైపు, కంచి పరమాచార్య వైపు మళ్ళింది. పరమాచార్య గురించి మాట్లాడుతున్న ఆ సమయంలో ఆయన కళ్ళలో కనిపించిన ఒక మెరుపు నాకు ఇప్పటికీ గుర్తు. ఆయన గురించి నాకు దగ్గరగా తెలిసిన కొన్ని విషయాలు ఉత్సాహంగా చెబుతుంటే ఆయన ఆసక్తిగా విన్నారు. నేను మాట్లాడ్డం ఆపిన తర్వాత ఒకసారి ఆయన భారంగా నిట్టూర్చి, “మీరు చెబుతున్నవి బాగానే ఉన్నాయి. కానీ బ్రాహ్మణేతరులు పరమాచార్యకు దగ్గరగా వెళ్లచ్చా? వారితో శాస్త్ర, ఆధ్యాత్మిక విషయాలు చర్చించవచ్చా? బ్రాహ్మణ పండితులతో సమానంగా వారికి ఆ అవకాశం ఇస్తారా?” అన్నారు. అలా అంటున్నప్పుడు వారి గొంతులోనూ, ముఖంలోనూ ఒకింత బాధా, నిరాశా తొంగి చూశాయి.

“అదేమీ లేదు, నాకు తెలిసినంతవరకూ వారి దగ్గర బ్రాహ్మణ, బ్రాహ్మణేతర తేడాలు ఏవీ ఉండవు. ఎవరైనా వారిని చూడచ్చు, మాట్లాడచ్చు” అన్నారు.

అప్పుడు ఆయన నన్నో అజ్ఞానిగానో, అమాయకుడిగానో చూసినట్టు చూసి, చిరునవ్వు నవ్వారు. “నేను అంటున్నది వారిని దర్శనం చేసుకోవడం గురించి, మాట్లాడడం గురించి కాదు. ఆ మఠానికి ఒక సంప్రదాయం ఉంది, వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో బ్రాహ్మణులదే ముఖ్యపాత్ర. బ్రాహ్మణేతరులకు వాళ్ళతో సమానస్థాయిలో వ్యవహరించే అవకాశం లేదు” అన్నారు. ఆ మఠంలో వ్యవస్థకు, ఆచరణకు మొదటి ప్రాధాన్యమనీ, తత్వానికి తర్వాతి ప్రాధాన్యమనీ అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఇంగ్లీష్ విద్య చదువుకున్నవారు హిందూ తాత్వికతకు ప్రాధాన్యమిస్తూ దానిని ప్రపంచానికి పరిచయం చేశారనీ, తనదీ అలాగే తత్వానికి ప్రాధాన్యమిచ్చే దృష్టి అని ధ్వనింపజేశారు.

తాను సాంప్రదాయిక జ్ఞాన భాండాగారానికి ‘మిత్రుడి’ నే అయినా దానికి ‘బాహ్యుడి’ నన్న అసంతృప్తి, వెలితి ఆయన మాటల్లో కనిపించింది. ఆ జ్ఞానభాండాగారం నుంచి తనకు దొరికిన, అనుమతించిన కొన్ని శకలాలను ఆయన ఏరుకున్నారు. వాటిని ఇంగ్లీష్ విద్య తనకు అందించిన ఆధునిక విజ్ఞానం, అవగాహన వెలుగులో పరీక్షించుకుంటూ రెంటి మధ్యా ఏవైనా సమన్వయం సాధ్యమవుతుందేమోనని చూశారు. ఆయన  సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరుల మార్గంవైపు సహజంగానే మొగ్గారు. పాశ్చాత్య తత్వ వేత్తల గురించిన అవగాహనా  హిందూ తాత్వికతను కొత్తగా అర్థం చేసుకునే వెసులుబాటు ఆయనకు ఇచ్చింది.

అయితే ఆయన సాంప్రదాయిక జ్ఞానభాండాగారానికి బాహ్యుడన్న వాస్తవం మరచిపోకూడదు. ఆయన ఆ భాండాగారం నుంచి ఎంతో కొంత స్వీకరించి ఉండచ్చు, అయినా అది ఆయనకు కరతలామలకం అయినట్టు కాదు. ఎందుకంటే ఆ భాండాగారాన్ని అభివృద్ధి చేసిన ఆ ఇంటివాతావరణంతో, అందులోని వ్యక్తులతో, వారి జీవన సరళితో,  వారి ప్రైవేట్ ఆలోచనలతో, భాషతో, అందులోని ధిషణతో ఆయనకు ఆత్మీయ పరిచయం లేదు. కనుక ఎలాంటి జీవన శైలి, ఎలాంటి ఆలోచనా రీతి ఆ జ్ఞానానికి ఆకృతి నిచ్చాయో ఆయనకు సన్నిహితంగా తెలిసే అవకాశం లేదు. దానిపట్ల, దాని తాత్వికత పట్ల దూరం నుంచి చూసినప్పుడు కలిగిన ఒకవిధమైన రొమాంటిక్ అడ్మిరేషన్ ఆయనది. అది ఆయన అవగాహనకు హద్దు. కారణం ఆయనకు మౌలికంగా ఆ జ్ఞానానికి ‘బాహ్యుడు’. ఆయనలోనే కాదు, అలాంటి ‘బాహ్యులు’ అనేకమందిలో అలాంటి రొమాంటిక్ అడ్మిరేషనే ఉంది. దూరం నుంచి చూసినప్పుడు కలిగే ఆ అడ్మిరేషన్ తోనే ఇప్పటికీ దాని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివ్యక్తుల పల్లకీలను మోసే బోయీలుగానే వారు ఉన్నారు.

‘బాహ్యుడు’ కావడం అనేది సుదర్శనంగారికి వ్యక్తిగతంగా ఒక కొరత, లేదా బలహీనత అయితే; మరో వైపునుంచి అదే ఆయన పరిశీలనకు బలం కలిగించింది.  ఆ జ్ఞానభాండాగారం వద్ద కూర్చుని ఉన్న ఆ వృద్ధుని ఆలోచనాసరళిని బయటినుంచి చూసి అర్థం చేసుకునే అవకాశం ఆయనకు కలిగింది. ఆ చూడడానికి ఆ జ్ఞాన భాండాగారపు లోపలి ఉపకరణాలు కాక(అవి ఎలాగూ ఆయనకు అందుబాటులో లేవు) తాను ఇంగ్లీష్ విద్యతో సంపాదించుకున్న కొత్త ఉపకరణాలు, తర్కం, హేతువు వగైరాలు ఆయనకు సాయపడ్డాయి. అవి ఆ వృద్ధుడి ఆలోచనా స్వరూపాన్ని దాని వైరుధ్యాలతో సహా అత్యద్భుతంగా బయటపెట్టాయి. “పాషాణ పాక ప్రభువు”గా ముద్రపడిన ఆయనను మైనపు ముద్దలా మనముందు నిలబెట్టాయి.

సాహిత్యంలో దృక్పథాలు చదువుతుంటే, విశ్వనాథ గురించి మనం కల్పించుకునే ఆ ధిషణాహంకార దోర్బల బ్రాహ్మీమయమూర్తి కాస్తా మంచుబొమ్మలా కరిగిపోతున్న భావన కలుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ దేశపు క్షితిజాన్ని ఆక్రమించుకున్న ఆయన భావజాలంలోని వైరుధ్యాలతో సహా దాని యథార్థ ఆకృతిని మన కళ్ళముందు నిలపడం ద్వారా సాహిత్యంలో దృక్పథాలు ఈ క్షణాన తన రెలెవెన్స్ ను ఆశ్చర్యకరంగా స్థాపించుకుంటోంది.

(ముగింపు తర్వాత)

 

 

 

అంగా దంగా త్సంభవసి

 

 

 

– కల్లూరి భాస్కరం

~

రాత్రి పదవుతోంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, మొహం కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్నాను. ఇంటికొచ్చేసరికి రోజూ ఆ వేళ అవుతుంది.

అంతలో వీధి తలుపు తోసుకుని ఏదో సినిమాపాట కూనిరాగం తీస్తూ మా రెండోవాడు హడావుడిగా లోపలికి రాబోయి నన్ను చూసి తగ్గాడు. నా మీద ఓ ముసినవ్వు పారేశాడు. నేను ఏమైనా అంటానేమోనని ముందుగానే నా మీద జల్లే మత్తుమందు ఆ ముసినవ్వు. తలుపు వెనకనుంచి మూడు తలకాయలు తొంగి చూసి, నేను కనబడగానే వాడితో ఏదో గుసగుసగా అనేసి మాయమయ్యాయి. వాడు తలుపు వేసేసి ఓసారి లోపలికి వెళ్ళి వచ్చి,

“నాన్నా! రేపు ఆఫీసునుంచి త్వరగా వచ్చెయ్యి. సెకండ్ షో సినిమా కెళ్దాం” అన్నాడు. ఆ మాటకు నా గుండెల్లో రాయి పడింది. నోట్లోకి ముద్ద దిగడం కష్టమైంది.

వాడు ముందురోజే ఓసారి అన్నాడు, “నాన్నా, రజనీకాంత్ సినిమా… చాలా బాగుంది. రేపు సెకండ్ షో కి వెళ్దాం” అని. వెళ్లినప్పుడు కదా, ఈలోపల వాడే మరచిపోతాడులే అనుకుని, “సరేరా” అన్నాను. కానీ వాడు మరచిపోలేదు. ఇప్పుడు మరింత కచ్చితంగా అన్నాడు. దాంతో నేనో బలిపశువులా సెకండ్ షో సినిమాకు వెడుతున్నట్టూ, థియేటర్ లో ఆ చీకటి నరకంలో కూర్చుని, బంగారం లాంటి నిద్రను బలిపెట్టి మూడు గంటల చిత్రహింసను భరిస్తున్నట్టూ ఊహించుకుంటూ ఉండిపోయాను. ఇప్పటినుంచే నా మొహంలో దైన్యం తాండవించింది.

“అమ్మా, నువ్వు కూడా రావాలి” అన్నాడు తల్లితో, శాసిస్తున్నట్టుగా.

నాకు మజ్జిగ వడ్డిస్తున్న మా ఆవిడ, “నాకు సినిమా వద్దూ, ఏమీ వద్దు. నేను రాను” అని అంతే కచ్చితంగా చెప్పేసింది. దాంతో వాడు మరింత ఫోర్సుతో, “నాన్నా, నువ్వు మాత్రం రావలసిందే” నని ఉత్తర్వు జారీ చేసేసి  లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకుని వచ్చాడు.

నేనోసారి మా ఆవిణ్ణి చూశాను. అసూయ కలిగింది. ప్రశాంతంగా తన పని చేసుకుపోతోంది.  వాడు అడిగాడు,  రానని చెప్పేసింది…అంతే, ఆ విషయం ఇక తన బుర్రను తొలిచే అవకాశమే లేదు. బ్రహ్మరుద్రాదులు కూడా తనను సినిమాకు తీసుకెళ్లలేరని తనకు ఎంత తెలిసో మాకూ అంతే తెలుసని తనకు తెలుసు. కానీ నాకు ఆ లగ్జరీ లేదు. నా మీద మావాడిది ఉడుముపట్టు. కనీసం నిద్రనైనా కాపాడుకుందామనుకుని, “ఆదివారం ఫస్ట్ షో కు వెడదాం లేరా” అన్నాను.

“లేదు, టిక్కెట్లు దొరకవు” అన్నాడు.

ఆ తర్వాత కాస్త ఆగి, నామీద మరో ముసినవ్వు పారేస్తూ, “ మా ఫ్రెండ్ కార్లో తీసుకెడతాను. సెకండ్ షో అయితే రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు” అన్నాడు.

“కొంపదీసి నువ్వే డ్రైవ్ చేస్తావా?” అన్నాను సందేహంగా.

“అవును, ఈ మూడురోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నాను. నువ్వు, అన్నయ్య, నేనూ, మా ఫ్రెండూ…రేపు ఎనిమిదికల్లా ఆఫీసునుంచి వచ్చేయి” అన్నాడు భోజనానికి కూర్చుంటూ. నా గుండెల్లో రెండో రాయి పడింది…సినిమాకు వెళ్ళడం, అందులోనూ వాడు డ్రైవ్ చేస్తుంటే కారులో వెళ్ళడం!!

మొత్తానికి పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు. తలవంచడం తప్ప నేను చేయగలిగింది కనిపించలేదు.

***

Kadha-Saranga-2-300x268

చిన్నప్పటినుంచీ వాడు నన్ను ఆదేశించడమే. అప్పుడు మా తండ్రీ-కొడుకుల పాత్రలు తారుమారైపోతాయి.  వాడి నోట ఆదేశం వచ్చిందంటే నాకు పెద్ద టెన్షన్. కాళ్ళూ చేతులూ ఆడవు. భోజనం దగ్గర ముద్ద దిగదు. వాడి మాట నెగ్గేవరకూ నేను ఓ పెద్ద గాలివానలో చిక్కుకుపోయినట్టు అనిపిస్తుంది. సరే నన్నతర్వాత కూడా బయటికి వాన వెలిసినట్టుంటుంది కానీ,  నా లోపల మాత్రం అస్థిమితం రేగుతూనే ఉంటుంది.

చిన్నప్పుడు లూనా మీద ఎక్కించుకుని వాణ్ణి ఎక్కడికో తీసుకెళ్లాను. వెళ్ళేటప్పుడు బుద్ధిగానే ఉన్నాడు. వచ్చేటప్పుడు, మెయిను రోడ్డు మీంచి ఇంటికెళ్లే రోడ్డు ఎక్కిన తర్వాత, తను డ్రైవ్ చేస్తానన్నాడు. నేను వద్దన్నాను, బతిమాలాను, బెదిరించాను. వాడు ససేమిరా అన్నాడు. నేను ధైర్యం చేయలేక మొండికేశాను. “అయితే, నేను నీతో రాను” అని దిగిపోయాడు. రోడ్డు మీద పెద్ద సీను. నడుచుకుంటూ వాడు… వాడి వెనక లూనా నడిపించుకుంటూ నేను…

వాడు ఎనిమిదో తరగతిలోకి వచ్చాడు. ఓ ఆదివారం రోజున అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నాం. ఉన్నట్టుండి వాడు, “నాన్నా, ట్యూషన్ కు వెళ్లడానికి నాకు సైకిలు కావాలి” అన్నాడు. అలా సన్నగా చినుకు మొదలైందనీ, కాసేపట్లో అది గాలివాన అవుతుందని నాకు తెలియదు. “సరేరా, కొంటానులే” అన్నాను యధాలాపంగా.  “ఎప్పుడు కొంటావు?” అన్నాడు. “ఓ వారం రోజులు ఆగు” అన్నాను. అంతలో పెద్దాడు అందుకుని “నాకు కూడా సైకిలు కొనిపెట్టలేదు” అంటూ సన్నగా అంటించాడు. “లేదు, ఇవాళే కొనాలి” అన్నాడు చిన్నాడు. అన్నం తినడం ఆపేశాడు. చినుకు జడివానగా మారుతున్న సూచన కనిపించింది. “ఇవాళ ఆదివారం రా. షాపులుండవు” అన్నాను. “మరెప్పుడు కొంటావు?” అన్నాడు. “రేపో, ఎల్లుండో చూద్దాంలే” అన్నాను. “లేదు. ఇవాళే కోనాలి. ఆబిడ్స్ లో ఆదివారం కూడా షాపులుంటాయి” అన్నాడు. “నీకేమైనా పిచ్చా, వెర్రా, ఆదివారం షాపులుండవురా” అన్నాను. “లేదు, ఉంటాయి” అన్నాడు. నేను కేకలేశాను, తిట్టాను, బతిమాలాను. వాడు వినలేదు. జడివాన గాలివానగా మారిపోయింది. భోజనాల దగ్గర కబుర్ల మూడు కాస్తా పోయి కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిపోయింది. ఎవరి కంచంలోనూ పదార్థాలు కదలడం లేదు.

“సరే, సాయంత్రం ఆబిడ్స్ వెడదాంలే” అన్నాను. ఆ క్షణానికి వాన వెలిసింది.

సాయంత్రం నేనూ, పెద్దాడూ, వాడూ కలసి ఆబిడ్స్ వెళ్ళాం. ఒక్క షాపు కూడా లేదు. “చూశావా, చెబితే విన్నావా?” అన్నాను. “సరే, రేపు కొనాల్సిందే” అన్నాడు. ఆ రేపు తప్పించుకోలేనిదని నాకు తెలుసు.

తీరా సైకిల్ కొన్నాక నెలరోజులు కూడా తొక్కాడో లేదో, ఓ రోజు ట్యూషన్ కు వెళ్ళి సైకిల్ రోడ్డు మీద పెట్టి తాళం వేయడం మరచిపోయాడు. తిరిగి వచ్చేటప్పటికి సైకిల్ లేదు. రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇదీ కబురు. నేను వాడివైపు చూశాను. వాడు మాట్లాడకుండా ఓ ముసినవ్వు పారేసి మొహం పక్కకు తిప్పేసుకున్నాడు.  సైకిల్ పోయిన రోజున వాడంతట వాడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఓ పది రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. అందులో ఓ చిన్న లాకప్ ఉంది. అందులో ఉన్న ఓ నేరస్తుడికి వీడి మీద జాలేసింది. “ఎందుకా పిలగాణ్ణి అన్నిసార్లు తిప్పుతారు? మీ దగ్గరున్న ఓ సైకిల్ ఇస్తే పోలా?”అన్నాడు పోలీస్ పెద్దతో. ఎంత నేరస్తుడి సలహా అయితేనేం, అవును కదా అని పోలీస్ పెద్దకు అనిపించినట్టుంది. ఓ కానిస్టేబుల్ ను కేకేసి, సైకిలేదైనా ఉందేమో చూడమన్నాడు. అతను చూసొచ్చి, ఓ పాతసైకిలుందని చెప్పాడు. “అబ్బాయి, ఆ సైకిలు తీసుకుపో, నీ సైకిలు దొరగ్గానే ఫోన్ చేస్తాను. నెంబర్ ఇవ్వు” అన్నాడు. మా వాడు సరే నని ఆ సైకిల్ తీసుకొని ఇంటికొచ్చాడు. కానీ దాని మీద ట్యూషన్ కు వెళ్ళడం వాడికి నామోషి అనిపించింది. దానినో మూల పారేసి నడిచే వెళ్ళొస్తున్నాడు. పాపం, ఎంతో పట్టుబట్టి కొనిపించుకున్నాడు, వాడి ఉబలాటం తీరకుండానే కొత్త సైకిల్ పోయిందనుకుని జాలిపడ్డాను. “ఇంకో సైకిల్ కొంటాలేరా” అన్నాను. వద్దన్నాడు.

వాడు ఏదైనా కొనమంటే కొనకపోవడం ఎంత కష్టమో, వద్దంటే కొనడం కూడా అంతే కష్టం.

ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మిషిన్, కెమెరా, కంప్యూటర్, చివరికి వాక్యూమ్ క్లీనర్ తో సహా ప్రతిదీ వాడు ఇలాగే పట్టుబట్టి, పెద్ద టెన్షన్ సృష్టించి కొనిపించినవే. చిన్నాడితో కలసి వీటికి ప్లాను చేయడంలో, వాడికి పురెక్కించి నా మీద ప్రయోగించడంలో  పెద్దాడి తెరచాటు పాత్ర ఉంటుందని నాకు తెలుసు. ఇద్దరికీ నాలుగేళ్ల ఎడముంది. పెద్దాడికి నా దగ్గర కాస్త బెరుకు. బహుశా పెద్దాళ్ళు అందరూ అంతేనేమో!

ఖరీదైన వస్తువు కొనాల్సిన ప్రతిసారీ పర్సు బరువు తూచుకుని ముందు వెనకలవడం మామూలే. కానీ ఆ వస్తువు ఇంటికి వచ్చాక వాళ్ళ కళ్ళల్లోని ఉత్సుకత మెరుపులు చూస్తున్నప్పుడు, ఆ మెరుపుల అమూల్యత  ముందు ఆ వస్తువు వెల ఎంతో అల్పమనిపించేది.

***

రోజూ రాత్రి పదిలోపల ఇంటికొచ్చి, కాసేపు టీవీ చూసి, ఆ తర్వాత ఏదో పుస్తకం చదువుకుంటూ నిద్రకు ఉపక్రమించడం అప్పటికి కొన్నేళ్లుగా నాకైన అలవాటు. ఈరోజు ఆ అలవాటు తప్పుతున్నందుకు దిగులేసింది. చిన్నాడు ఆదేశించినట్టు ఉసూరుమంటూ ఎనిమిదికే ఇంటికొచ్చాను. పెద్దాడు ఇంట్లో ఉన్నాడు,   చిన్నాడు కనిపించలేదు.  ప్రోగ్రామ్ మారిందేమో నన్న చిన్నపాటి ఆశ తళుక్కుమంది. అంతలో ఎప్పటిలా హడావుడిగా చిన్నాడు తలుపు తోసుకొచ్చి, నన్ను చూసి తృప్తిగా ఓ ముసినవ్వు పారేసి, “మా ఫ్రెండ్ బయలుదేరాడు. ఈలోపల భోజనం చేసేసి రెడీ అవుదా” మని, వాళ్ళ అమ్మను తొందరపెట్టాడు.

యాంత్రికంగా భోజనం ముగించి, కాసేపట్లో ఎదుర్కొబోయే రెండు శిక్షల గురించి తలపోస్తూ కూర్చున్నాను. సెకండ్ షో సినిమాకు వెళ్ళి నిద్ర కాచుకోవడం ఒక శిక్ష. అసలు సినిమాకు వెళ్ళడం అంతకంటే పెద్ద శిక్ష. సినిమాకు వెళ్ళడాన్ని శిక్షగా నేను ఊహించుకోవడం నాకే ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించింది. నేను అప్పటికి ఓ పదిహేనేళ్ళ క్రితంవరకూ విపరీతంగా సినిమాలు చూసేవాణ్ణి. అందులోనూ విజయవాడలో పెరిగానేమో, చిన్నప్పటినుంచీ సినిమా పిచ్చి ఎక్కువుండేది. విజయవాడ నా దృష్టిలో సినిమా పిచ్చోళ్ళ నగరం. ఆమాటకొస్తే, సినిమా వచ్చాక ప్రపంచమంతటా అనేక తరాలు సినిమాలు, సినిమాల ఊహల మధ్య పెరుగుతూ వచ్చారనీ; సినిమా నిత్యావసరాలలో ఒకటిగా, జీవితంలో ఒక భాగంగా మారిపోయిందనీ అనిపిస్తుంది. ప్రేయసీప్రియులు చాలా అరుదుగా దొరికే ఏకాంతపు చీకటిలో గుసగుసలు పంచుకునే తన్మయ క్షణాలు, కొత్త జంట తమ మధ్య సరికొత్త సాన్నిహిత్యాన్ని అల్లుకునే అపురూప ఘడియలు, పుట్టినరోజు పండుగ, పరీక్షఫలితాలు వచ్చిన ఆనందం, ఉద్యోగంలో తొలి జీతం అందుకున్న సందర్భం… ఇలా ఎన్నింటినో తెర మీది సినిమా మన జ్ఞాపకాల యవనిక మీద మధురంగా ముద్రిస్తుంది.

దుర్గాకళామందిరం, అలంకార్, వినోదా, లక్ష్మీ టాకీస్, విజయా టాకీస్, జైహింద్, ఈశ్వర్ మహల్…ఇలా విజయవాడలోని థియేటర్ల పేర్లతో పెనవేసుకుపోయిన నా సినీ బాల్యస్మృతులు ఇప్పటికీ నాలో ఏదో తెలియని తీపిని నింపుతాయి. సినిమా నాలో ఎంత మోహం పుట్టించేదంటే, ఇంట్లో తెలియకుండా ఒకే రోజు రెండు సినిమాలు చూసిన సందర్భాలూ, మరునాడు పరీక్ష ఉన్నాసరే, కోరికను చంపుకోలేక సినిమాకు వెళ్ళిన సందర్భాలూ ఉన్నాయి. నచ్చిన ఒకే సినిమాను పాతిక, ముప్పై సార్లు చూడడమూ ఉంది. అంతేకాదు, నచ్చిన సినిమాకు మిత్రులతో కలసివెళ్లి చూడడం, ఆ సినిమా గురించి చర్చించుకోవడం మరింత రంజుగా ఉండేది.

కానీ  నాకూ, సినిమాకూ ఉన్న ముడి ఎప్పుడో, ఎక్కడో తెగింది. క్రమంగా సినీ వైరాగ్యం ఏర్పడింది. బహుశా బాల్యకౌమారాలు గడిచి, యవ్వనయానంలో ముందుకు వెడుతున్నకొద్దీ నా సినిమా అభిరుచి మరింత నైశిత్యాన్ని తెచ్చుకుంటూ ఉండడం, దాంతో నన్ను తృప్తిపరిచే సినిమాల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం, నేను మరీ ‘చూజీ’గా మారుతుండడం ఒక కారణం కావచ్చు. ఏమో, నాతోపాటు సినిమా ఎదగలేదేమో! సమయాభావం ఇంకో కారణం. ఎదిగిన సినిమాను గాలించి పట్టుకోడానికి కొంత అదనపు సమయం కేటాయించాలి. కానీ నా ఉద్యోగ స్వభావరీత్యా, థియేటర్ కి వెళ్ళి సినిమా చూసే సమయం కాదు సరికదా, మంచి సినిమాను వెతికి పట్టుకునే అదనపు సమయం కూడా దొరకదు. ఒక్క సెలవు రోజున తప్ప బయట సాయంత్రాలు గడిపే అవకాశం ఉండదు. చాలా అపురూపంగా దొరికే సెలవు రోజును ఇంటిదగ్గర విశ్రాంతిగా గడపాలనిపిస్తుంది. ఈ మధ్యలో మిత్రులతో సినిమాకు వెళ్ళి, సినిమా నచ్చక మధ్యలోనే వచ్చేసి వాళ్ళకు కోపం తెప్పించిన సంఘటనలూ ఉన్నాయి.

మా ఆవిడకు అసలు సినిమా ఆసక్తే లేకపోవడం నా సినిమావైరాగ్యానికి కలిసొచ్చిన ఒక సుగుణం.

సినిమాలు చూడడమే మానేశానని కాదు. టీవీ వచ్చాక మనం వద్దనుకున్నా సినిమాలు కంటబడుతూనే ఉంటాయి. నచ్చకపోతే రిమోట్ ప్రయోగించి పీక నోక్కే అదనపు సౌలభ్యం ఉంది. నచ్చితే చివరివరకూ చూడడమూ ఉంది. అయితే థియేటర్ కు వెళ్ళి సినిమా చూసే అలవాటు పూర్తిగా పోయింది. అందులోనూ ఒంటరిగా వెళ్ళి చూసే అలవాటు ఇంకా ముందే పోయింది. మొత్తానికి నాకూ,సినిమాకూ మధ్య దూరం చాలా పెరిగిపోయింది. అందుకు నేనే కారణం తప్ప సినిమా కాదు.

***

ఫ్రెండు కారు తెచ్చాడు. నేనూ, పెద్దాడూ వెనక సీట్లో, ఫ్రెండు ముందు సీట్లో కూర్చున్నాం. చిన్నాడు కారు స్టార్ట్ చేస్తూ ఒకసారి నావైపు చూసి ఓ ముసినవ్వు పారేసి, “నాన్నా, కంఫర్ట్ గా కూర్చో” అన్నాడు. లోపల బితుకు బితుకు మంటూనే ఉంది. అయినా వాడు ప్రమాదం చేయడన్న ధీమా కూడా ఏమూలో ఉంది.

థియేటర్ కి చేరుకున్నాం. నన్నోచోట నిలబెట్టి ముగ్గురూ టిక్కెట్లు తేవడానికి వెళ్లారు.

ఎన్నేళ్లయిందో థియేటర్ కి వెళ్ళి! నేను దిక్కులు చూస్తూ నిలబడ్డాను. నేనేదో అపరిచితప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తోంది. వర్షించే దీపకాంతుల మధ్య ఆ పరిసరాలు కొత్తగానూ, అయినా అందంగానూ కనిపించాయి. ఉత్సాహపు తుళ్ళింతలతో చిరునవ్వులు పోటీ పడుతుంటే ఎవరెవరో జంటలు కళ్ల ముందు మెరుపుతీగల్లా కదలి వెడుతున్నారు.

పిల్లలు టిక్కెట్లు తెచ్చారు.

సినిమా  మొదలైపోయిందేమో, టిక్కెట్లు దొరకుతాయో, దొరకవో అన్న భయంతో పరుగుపరుగున థియేటర్ కు వెళ్ళడం, అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర వెలుగుతున్న దీపాన్ని, ఆ దీపం కింద మనిషిని చూసి పెద్ద రిలీఫ్ పొందడం, టిక్కెట్లు తీసుకోవడం, వాటిని గేటుకీపరుకు ఇచ్చి, అతను చింపి ఇచ్చిన టిక్కెట్ ముక్కలు తీసుకోవడం, లోపలికెళ్లి చీకట్లో సీటు కోసం తడుముకోవడం, సీట్లో కూర్చోడం…ఇవన్నీ సినీ సమ్మోహనం కలిగించే పారవశ్యాన్ని క్రమగతిలో అంచులు తాకించే ఘట్టాలుగానే నా స్మృతులలో ఉండిపోయాయి. పిల్లల వెనక థియేటర్ లోకి వెడుతుంటే ఆ స్మృతులు ఒక్కొక్కటే నా మనోఫలకంపై తళుక్కుమంటూ నన్ను వెనకటి రోజుల్లోకి తీసుకెళ్ళడం ప్రారంభించాయి. అలా చుక్క చుక్కలుగా మనసులోకి జారడం మొదలైన నా బాల్య కౌమారయవ్వనకాలపు సినీ దర్శనోల్లాసం, టార్చిలైటు వెలుగులో సీట్లు వెతుక్కుని వెళ్ళి కూర్చునే సమయానికి మడుగులు కట్టసాగింది. ఆ ఉల్లాసం ఉరవడిస్తున్నకొద్దీ నాలోని సినీవైరాగ్యం ఎటో కొట్టుకుపోసాగింది. నేను తిరిగి నా బాల్యకౌమారయవ్వన సినీఅనుభూతిని పునర్జీవించడం ప్రారంభించాను. నా కళ్ళనిండా అప్పటి ఉత్సుకత మెరుపులు కమ్ముకుంటున్నాయి.

నాకు అంతా ఆశ్చర్యంగానూ, వింతగానూ ఉంది.

నాకు ఒక పక్క చిన్నాడు, ఇంకో పక్క పెద్దాడు. నా కళ్ళల్లోని ఆ మెరుపులే వాళ్ళ కళ్ళల్లో కూడా కదలాడుతున్నట్టు ఆ చీకట్లో సైతం పోల్చుకున్నాను. నా మెరుపుల అసలు రహస్యం అర్థమైనట్టు తోచింది. వాళ్ళ కళ్ళలోంచే అవి నా కళ్ళల్లోకి ప్రవహిస్తున్నాయి. కాంతిహీనమవుతున్న నా కళ్ళకు ఆ కళ్ళు తమ మెరుపుల్ని ఎరువిస్తున్నాయి. ఇప్పుడు మూడు జతల కళ్ళతో సినిమా చూస్తున్నాను. నేనే ముగ్గురిగా విభజితమైపోయాను. వాళ్ళిద్దరూ తమ కళ్ల  మెరుపుల్నే కాదు, తమ యవ్వనోత్సాహాన్ని నాలోకి ప్రవహింపజేస్తున్నారు. తమ యవ్వనాన్నే నాకు ఎరువిస్తున్నారు. అటూ ఇటూ కూర్చున్న ఆ ఇద్దరూ నా శిథిలయవ్వనాన్ని లేవదీసి నిలబెట్టే ఊతకర్ర లనిపించారు.

ఆ వెంటనే ఈ ఊహ సరికాదేమో ననిపించింది. నిజానికి నాకు రెండువైపులా ఉన్న నా కంటి మెరుపుల్నే నా కళ్ళల్లోకి తోడుకుంటున్నాను. నాకు రెండువైపులా ఉన్న నా యవ్వనాన్నే నాలోకి ప్రవహింపచేసుకుంటున్నాను. నాలోంచి ఉద్భవిల్లిన నా యవ్వనమే నాకు అటూ ఇటూ రెండు ఊతకర్రలుగా మారి నా శిథిలయవ్వనాన్ని నిలబెడుతోంది.

యయాతి కథ గుర్తొచ్చింది. యయాతి తన వార్ధక్యాన్ని మీలో ఎవరైనా తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఎరువివ్వండని కొడుకుల్ని అడుగుతాడు. చిన్నకొడుకు పూరుడు ముందుకొచ్చి తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతని వార్ధక్యాన్ని తను తీసుకుంటాడు. వార్ధక్యాన్ని తీసుకోవడం అలా ఉంచితే, పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఎరువివ్వడంలోని అసలు రహస్యం ఇప్పుడు బోధపడినట్టు అనిపిస్తోంది. తండ్రి కొడుకు రూపంలో తన బాల్య, కౌమార, యవ్వనాలను పునర్జీవిస్తాడు. తండ్రే కొడుకవుతాడు. శకుంతల దుష్యంతునితో అంటుంది…”అంగా దంగాత్సంభవసి” అని వేదవచనం. భార్య గర్భంలో ప్రవేశించి భర్తే కొడుకుగా పుడతాడు. తండ్రికీ కొడుకికీ తేడా లేదు.

సినిమా అయిపోయింది. నా కొడుకుల రూపంలోని యవ్వనంతో కలసి బయటికి ఉత్సాహంగా అడుగులు వేశాను.  నాలో వెనకటి నిర్వేదం, నిరాసక్తి లేవు. కారు స్టార్ట్ చేస్తూ చిన్నాడు వెనక్కి తిరిగి యధాప్రకారం నామీద ఓ ముసినవ్వు పారేసి, “ఎలా ఉంది నాన్నా?” అని అడిగాడు. “చాలా బాగుందిరా” అన్నాను మనసునిండా, తృప్తిగా.

మళ్ళీ సినిమా కెళ్లాలన్న వాంఛ నాలో రహస్యంగా రగిలింది!

***

ఇప్పుడు మంచి సినిమాల సమాచారం కోసం నా చూపులు ఆబగా గాలించడం ప్రారంభించాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బాగున్నాయని టాక్ వచ్చిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల వాల్ పోస్టర్లు ఊరిస్తున్నాయి. థియేటర్లు తమవైపు గుంజుతున్నాయి. కానీ ప్రతిసారీ సినిమా కెళ్లాలన్న రుచికరమైన ఊహ ఊహగానే అణిగిపోతోంది. కారణం…పిల్లలు దగ్గర లేరు. నాలోంచే ఉద్భవించి, నాకు అటూ ఇటూ ఉండి సినిమాకు నడిపించిన ఆ రెండు ఆ కౌమార,యవ్వనోత్సాహపు శక్తి కేంద్రాలు ఇప్పుడు నా పక్కన లేవు. ఒకప్పటి నా కళ్లలోని ఔత్సుక్యపు మెరుపుల్ని తమ కళ్ళల్లోకి ఒడిసిపట్టి వాటితో నా కళ్ళను రీచార్జి చేసిన ఆ రెండు జతల కళ్ళు ఇప్పుడు  చదువులు, ఉద్యోగాలు, కెరీర్ వేటలో దూర తీరాలకు సాగాయి. మోహకత్వం, అద్భుతత్వం, ఉత్సుకత నిండిన అందమైన ప్రపంచంలోంచి;  భయభీతులు, బేలతనం నింపే కఠోర వాస్తవాల జీవన పోరాటక్షేత్రంలోకి అడుగుపెట్టి నలుగుళ్లు పడుతున్నాయి.

ఎప్పుడైనా  ఇంటికొచ్చి నాలుగురోజులు గడిపినా ఏదో చికాకు, ఏదో టెన్షన్, ఏదో తొందర…ప్రపంచాన్ని ఒక ఆశ్చర్యంగా, నిత్యనూతనంగా దర్శించే ఆ చూపుల్లోని కుతూహలపు తళకులు మసగబారుతున్నాయి. వాళ్ళ జీవనప్రాధాన్యాలలో సినిమా క్రమంగా అట్టడుగుకు జారిపోతున్నట్టుంది. ఆ నోట సినీ కూనిరాగాలు అంతగా వినిపించడం లేదు. వాళ్ళు క్రమంగా నాలానే సినిమాకు దూరమవుతున్నారు.

నేనే అవుతున్నారు!

నాలో కొత్తగా జ్వలించిన సినీ సందర్శనేచ్ఛ నిశ్శబ్దంగా నాలోనే అణగారిపోసాగింది.

జీవన పోరాటపు అలసట ఒక అలవాటుగా మారి అందులోనే స్థిమితాన్ని వెతుక్కునే యాంత్రికతకు మళ్లిన తర్వాత, ఎప్పుడో ఏ దశలోనో నాలానే వాళ్ళు కూడా తమ పిల్లల బుజాల మీద చేతులు వేసి సినిమాకు వెడతారు. వాళ్ళల్లోంచి తమ బాల్యకౌమారయవ్వనోత్సాహాన్నీ, ఔత్సుక్యపు మెరుపుల్నీ తోడుకుంటూ సినిమా చూస్తారు. అంతసేపూ వాళ్ళు తమ బాల్యకౌమార యవ్వనాలను పునర్జీవిస్తారు.

ఆ తర్వాత వాళ్లలానే వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లల పిల్లలూ…

సృష్టి తెర మీద జీవిత చలనచిత్రం నిర్విరామంగా ఆడుతూనే ఉంటుంది.

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అతని మరణం…

 

స్లీమన్ కథ-35

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు అన్నా, నొప్పి తిరగబెట్టింది. ఇంతకుముందు కన్నా దుర్భరంగా మారింది. చెవిలోని అస్థి కవచం దెబ్బతిన్నట్టు, మంట లోపలిచెవిలోకి వ్యాపించినట్టు అర్థమైంది. వైద్యులు వారిస్తున్నా వినకుండా ఆసుపత్రినుంచి వెళ్లిపోవాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. చెవుల్లోంచి తీసిన ఎముకలను రెండు చిన్న పెట్టెలలో ఉంచి అతని చేతికి ఇచ్చారు. అతను  లైప్జిగ్ (Leipzig) 1 వెళ్ళి తన ప్రచురణకర్తలను కలసుకున్నాడు. అక్కడినుంచి బెర్లిన్ వెళ్ళి విర్కోను కలిశాడు. వినుకలిశక్తి పూర్తిగా పోయింది. అయినా విర్కోకు ఉల్లాసంగా ఉన్నట్టు కనిపించాడు. కెనారీ సందర్శనకు తోడు వస్తానన్న అతని వాగ్దానాన్ని గుర్తుచేసి రైల్లో పారిస్ వెళ్ళాడు.

డిసెంబర్ 15న పారిస్ చేరుకున్నాడు. ఆ శీతాకాలంలో అతిశీతల దినం అదే. సోఫియా రాసిన ఆరు ఉత్తరాలు అతనికోసం ఎదురుచేస్తున్నాయి. అవి చదువుతుంటే, తన గురించి ఆందోళన చెందుతూ ఆమె తన పక్కనే ఉన్నట్టు  అనుభూతి చెందాడు. క్రిస్టమస్ నాటికి గానీ తను తిరిగి ఎథెన్స్ కు వెళ్ళలేననుకున్నాడు. ఈ మధ్యలో తను నేపుల్స్ 2 మ్యూజియంను సందర్శించేందుకు వ్యవధి ఉంటుంది. తను పాంపే 3లో తవ్వి తీసిన పురావస్తుసంపదను అందులో ప్రదర్శిస్తున్నారు. చెవిపోటు తిరగబెట్టడానికి తను చేసిన పొరపాటే కారణమనీ, రైల్లో వెళ్ళేటప్పుడు అరేబియన్ నైట్స్ అరబ్బీ మూలాన్ని చదవడంలో మునిగిపోయి చెవులలో దూది పెట్టుకోవడం మరచిపోయాననీ భార్యకు రాశాడు. విర్కోకు చివరి ఉత్తరం రాస్తూ, పల్లాస్ ఎథెనా (Pallas Athene-గ్రీకు ఉచ్చారణ: పలావా ఫినా) 4 చిరకాలం వర్ధిల్లుగాక! ఇప్పుడు కనీసం కుడిచెవితోనైనా వినగలుగుతున్నాను. ఎడమ చెవి కూడా బాగుపడుతుందని అనుకుంటున్నాను” అన్నాడు.

తనను జీవితాంతం కాపాడుతూ వచ్చిన పల్లాస్ ఎథెనా, ఇతర గ్రీకు దేవతలు ఇప్పుడు ఒలింపస్ 5 మబ్బుల మాటున ఉండిపోయారు. తను కనుగొన్న నిక్షేపాలను కడసారి చూసేందుకు మాత్రం అనుమతించారు, అది కూడా లిప్తకాలమే! ఓ శీతాకాలపు మధ్యాహ్నాన విపరీతమైన జ్వరంతోనూ, నిస్త్రాణతోనూ బాధపడుతూ పక్కన వైద్యుని ఉంచుకుని నేపుల్స్ మ్యూజియంను సందర్శించాడు.

అక్కడికి చేరే సమయానికే తుదిఘడియలకు చేరువలో ఉన్నాడు. చెవిపోటుతో గిలగిలలాడుతున్నాడు. పారిస్ నుంచి రెండు రోజుల ప్రయాణం అతని ఓపికను పూర్తిగా హరించింది. పోటు క్షణక్షణానికి దుస్సహమవుతున్న స్థితిలో వెంటవెంటనే ఇద్దరు వైద్యులను సంప్రదించాడు. ఇంకో వైపు అతని ఎథెన్స్ ప్రయాణానికి ఓడ సిద్ధంగా ఉంది. కానీ అతను సముద్రప్రయాణం చేసే స్థితిలో లేడు. క్రిస్టమస్ సంబరాలను కొద్ది రోజులు వాయిదా వేయమని సోఫియాకు తంతి పంపించి, మూడో వైద్యుని సంప్రదించడానికి వెళ్ళాడు. అతన్ని గుర్తుపట్టిన ఆ వైద్యుడు పురావస్తుశాస్త్రంపై ఎంతో ఆసక్తిని చూపిస్తూ, ఓసారి పాంపే వెళ్ళి వస్తే ఎలా ఉంటుందని సూచించాడు.

ఓ పెద్ద కోటును చుట్టబెట్టుకున్న స్లీమన్, ఓ బండిలో కూర్చుని వెసూవియస్(Vesuvius)6 కొండ నీడనే, ఓ  అఖాతాన్ని చుట్టుకున్న దారిలో సుదీర్ఘప్రయాణం చేసి పాంపేను సందర్శించాడు. వసారా ఇళ్ళు, పురాతన రోమన్ శకటాల కింద నలిగిన రహదారులు, రెండువేల ఏళ్ల క్రితం మద్యవిక్రేతలు నిలబడిన తబెర్నా(tabernae-మద్యవిక్రయ కుటీరాలు)లు-అతను ఎలా ఊహించుకున్నాడో అలాగే ఉన్నాయి. ఆ తర్వాత హోటల్ గదికి తిరిగొచ్చాడు. తను త్వరలోనే ఎథెన్స్ చేరుకుంటాననీ, అక్కడికొచ్చాక ఈ చెవినొప్పి సంగతి చూస్తాననీ చెబుతూ మరికొన్ని తంతులు పంపించాడు.

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

క్రిస్టమస్ రోజున, పోస్టాఫీస్ కు వెడుతూ కాబోలు, ప్యాజ్జా డెల్లా శాంటా క్లరీటాను దాటుతున్నాడు. అంతలో  రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. అయినా కళ్ళు తెరచుకుని స్పృహలోనే ఉన్నాడు. జనం చుట్టూ మూగి ఎవరు, ఏమిటని ప్రశ్నించారు. తల ఊపడం తప్ప మాట్లాడలేకపోయాడు. మాట పడి పోయిందని అర్థమైంది.

పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు  విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.

స్లీమన్ ను అతని హోటల్ గదికి తీసుకెళ్లారు. అప్పటికీ అతను పూర్తి స్పృహలోనే ఉన్నాడు. ఒక్క మాట పోవడం తప్ప మిగిలిన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి. వైద్యుడు అతని చెవిని తెరచి చూశాడు. అప్పటికే రుగ్మత మెదడుకు వ్యాపించినట్టు అర్థమైంది. ఈ దశలో చేయగలిగింది ఏమీ లేదని తోచింది. ఆ రాత్రి గడిచింది. మరునాడు అతని శరీరంలో కుడిభాగం చచ్చుబడిపోయింది. కపాలానికి రంధ్రం చేసి లోపల పరీక్షిస్తే మంచిదన్న సలహా వినిపించింది. ఎనిమిదిమంది నిపుణులను పిలిపించారు. వాళ్ళు ఇంకో గదిలో సమావేశమై ఏం చేయాలో చర్చించుకుంటూ ఉండగానే, చివరివరకు స్పృహలోనే ఉన్న స్లీమన్ తన పడక మీద నిశ్శబ్దంగా కన్నుమూశాడు.

***

ఎథెన్స్, బెర్లిన్ లకు తంతి వెళ్లింది. దార్ఫెల్త్, సోఫియా అన్న వెంటనే బయలుదేరి వచ్చారు. మృతదేహాన్ని ఎథెన్స్ కు తీసుకెళ్లారు. పదో రోజున, 1891 జనవరి 4న శవపేటికను, ఆకాశపు కప్పు కింద ఇరవైనలుగురు పాలరాతి దేవీదేవుళ్ళు కొలువుతీరిన అతని భవంతిలోని విశాలమైన హాలులో ఉంచారు. కింగ్ జార్జి, యువరాజు కాన్ స్టాన్ టైన్ స్వయంగా వచ్చి శవపేటిక వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ప్రపంచం నలుమూలల నుంచీ సానుభూతి సందేశాలు వెల్లువెత్తాయి.

తన సమాధి స్థలాన్ని అతను ముందే ఎంచుకున్నాడు. ఇలిసస్ కు దక్షిణంగా ఉన్న ఒక శ్మశానంలో, తను ఎంతగానో ప్రేమించిన గ్రీకుల మధ్య, ఒక వీరుడికి తగిన గోపురం కింద అతని మృతదేహాన్ని సమాధి చేశారు.  అక్కడినుంచి ఎథెన్స్ పురాతనదుర్గమూ, శరోనిక్ 7 నీలిజలాలు, సుదూర ఆర్గోలిస్ పర్వతాలు– స్థిమిత పడని అతని ఆత్మకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ పర్వతాలకు అవతలే మైసీనియా, టిర్యిన్స్ రాజుల సమాధులు ఉన్నాయి. జీవితం చాలించిన తర్వాత కూడా తన ఆరాధ్య వీరులకు, దేవతలకు దగ్గరగానే ఉన్నాడు. శిఖరాగ్రాన ఉన్న శిథిల పార్థినోన్ (Parthenon) 8 నుంచి తెలి చూపుల తల్లి ఎథెనా అతన్ని చల్లగా చూస్తూనే ఉంటుంది.

మరణానంతరం అతనికి కొత్త జీవితం ప్రారంభమైంది. భూమిని మంత్రించి బంగారాన్ని వెలికి తీసిన ఈ వ్యక్తి తన జీవితకాలంలోనే ఒక చరిత్రగా మారిపోయాడు. మరణాంతరం అంతకంటే పెద్ద చరిత్రగా పరిణమించాడు. అతని దురాగ్రహాన్ని, తలబిరుసును, ఇబ్బందికరమైన అతని విపరీత ధోరణులను జనం మరచిపోయారు. హోమర్ పట్ల అతని అచంచల విశ్వాసాన్నీ,  భూమిలో సమాధైన రహస్యాల వెల్లడిలో అతని మడమ తిప్పని సంకల్పబలాన్నీ గుర్తుపెట్టుకున్నారు. అతని అవగుణాలే సుగుణాలుగా మారిపోయాయి. విచక్షణ ఎరగని అతని అహంభావాన్ని సహజమైన ఆత్మగౌరవమన్నారు. అతని అతిశయోక్తులూ, డాబుసరి మాటలూ,  గొప్ప చారిత్రకసంపదను బయటపెట్టాలన్న అతని తహతహ నుంచి పుట్టినవనీ; వాటిని క్షమించచ్చనీ అనుకున్నారు.  తనను ఒక మంచి బ్యాంక్ గుమస్తాగా మలచిన అలవాట్లే అతనికి జీవితాంతం ఉండిపోయాయన్న సంగతిని జనం మరచిపోయారు. మేథ్యూ ఆర్నాల్డ్(Matthew Arnold)9 అంటాడు: హోమర్ మహావేగంతో దూకే జలపాతం, నిష్కపటి, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు, గొప్ప ఉదాత్తత నిండినవాడు 10;  స్లీమన్ ది పూర్తి విరుద్ధ స్వభావం, నిదానంగా, గడుసుగా వ్యవహరించేవాడు, సంక్లిష్టస్వభావి, జిత్తులమారి, డాంబికుడు, కోపిష్టి. సహజమైన ఉదాత్తత మచ్చుకైనా లేనివాడు.

museum

స్లీమన్ మ్యూజియం

అయినాసరే,  ట్రాయ్ బురుజులమీద నిలబడి తన శత్రువులతో  అసామాన్య విజిగీషతో పోరాడిన వీరుడిగా; మొక్కవోని సంకల్పశక్తి ఉన్నవాడిగా చరిత్ర అతన్ని అభివర్ణించింది. తన విశ్వసనీయతను పెంచుకోడానికి తగినంత సత్యసంధతను పాటించినవాడిగా చిత్రించింది.  వాస్తవంగా హోమర్ కాలానికి చెందిన వస్తువులను వేటినీ అతను వెలికితీయకపోయినా, అతని శవపేటిక శిరోభాగం వద్ద హోమర్ శిలాప్రతిమను ఉంచడం ఎంతైనా సముచితంగా కనిపించింది.

చివరికి, పురావస్తురంగంలోకి దారులు తెరచి చూపించిన గొప్ప వేగుచుక్కలలో ఒకడిగా, తొలితరం పురావస్తు నిపుణులలో ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు. నిజానికి అతను శాస్త్రీయ పురావస్తు పరిజ్ఞానానికి వ్యతిరేకి. పూర్తిగా కాల్పనికభావన నిండినవాడు. యథేచ్ఛగా కిటికీలు తెరిచేసి రకరకాల గాలులు లోపలికి ప్రసరించడానికి అవకాశమిచ్చినవాడు. కేవలం విశ్వాసమూ, స్వాప్నికతే ఈ రంగంలో అతన్ని ముందుకు నడిపించాయి. తను బాల్యం నుంచీ ఆరాధిస్తూ వచ్చిన హోమర్ వీరుల స్వభావాన్నే ఈ రంగంలోనూ అతను పుణికిపుచ్చుకున్నాడు.

స్లీమన్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, ఎనభయ్యొక్కేళ్ళ గ్లాడ్ స్టన్ వణికే చేతితో స్వయంగా సంతాపసందేశం రాసి సోఫియాకు పంపించాడు. స్లీమన్ లోని విలక్షణ మేధాశక్తి తనను ఎంత గాఢంగా ప్రభావితం చేసిందో అందులో రాశాడు. స్లీమన్ విజయస్వభావాన్ని ఒకే ఒక్క పేరాలో ఇలా వర్ణించాడు:

అతనిలోని ఉత్సాహశక్తి;  పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది. తన పరిశోధనల తొలి దశలలో అతను తీవ్రవిమర్శనూ ఉపేక్షనూ రెండింటినీ ఎదుర్కొన్నాడు. కానీ మంచుపొగనుంచి సూర్యుడు బయటపడినట్టుగా అతని పరిశోధనల శక్తీ, విలువా స్పష్టమౌవుతున్న కొద్దీ వ్యతిరేకులు తోక ముడిచారు.  అతని బాల్యమూ, యవ్వనకాలమూ, అతని అనంతరజీవితం కంటే ఏమంత తక్కువ ప్రాముఖ్యం ఉన్నవి కావు. నిజానికి ఆ మూడు దశలనూ ఎవరూ విడదీయలేరు. ఎందుకంటే, తొలినుంచి తుదివరకూ ఒక లక్ష్యశుద్ధి, ఒక ప్రయోజనదృష్టి ఒకేలా అతని జీవితాన్ని ముందుకు నడిపించాయి. అతన్ని ప్రముఖుడిగా నిలబెట్టడానికి అతనిలోని ఉత్సాహశక్తి, ఔదార్యాలలో ఏ ఒక్కటైనా సరిపోతాయి. ఇక ఆ రెండూ కలిసినప్పుడు అదొక అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు.

“అతనిలోని ఉత్సాహశక్తి; పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది…” అన్న గ్లాడ్ స్టన్ వాక్యంతో స్లీమన్ విభేదించి ఉండేవాడు. పురాతన వీరులకు తను రక్తమాంసాలు కల్పించాననీ, సమాధులనుంచి వారిని పునరుత్థానం చెందించాననీ చెప్పి ఉండేవాడు. భూమిలో కప్పడిన పురానగరాలపై ఒక మాంత్రికుడిలా అతను మంత్రదండం తిప్పి, వాటిని సజీవం చేశాడు. ఈ పురాతన జీవుల గురించి మనకిప్పుడు తెలుస్తోందంటే, అతను తన శక్తియుక్తులన్నీ గుప్పించి వారి అవశేషాలను వెలికి తీశాడు కనుకనే. ఒకప్పుడు గొప్ప వైశాల్యమూ, అద్భుతత్వమూ, నిగూఢతా మూర్తీభవించిన మహావీరులు ఈ భూమిమీద నడయాడారు. ఇప్పటికీ వారిలో ఆ వైశాల్యమూ, అద్భుతత్వమూ అలాగే ఉన్నాయి కానీ; వెనకటంత నిగూఢులు కారు. అఖిలెస్, నక్కజిత్తుల ఒడీసీయస్, శిరస్త్రాణంపై నర్తించే తురాయితో హెక్టర్—వీళ్ళందరి మధ్యా స్లీమన్ నిరంతరం జీవించాడు, వీరిపట్ల అతను నమ్మకాన్ని కోల్పోయిన క్షణమంటూ లేదు.

***

ఒక్కోసారి స్లీమన్ ఆలోచనా సరళి ఎలా ఉండేదంటే,  హోమర్ చిత్రించిన వీరులు మాత్రమే నిజం, మిగతా యావత్ప్రపంచం అబద్ధమన్న భావన అతనిలో జీర్ణించుకుందా అనిపించేది. తన జీవితంలో చివరి అయిదేళ్లూ అతను ప్రాచీన గ్రీకుభాషలోనే మాట్లాడాడు, రాశాడు. హోమర్ మంత్రదండం స్పర్శించని ప్రతిదానిపైనా అతను నిరాసక్తుడయ్యాడు. “ఒక్క హోమర్ మాత్రమే నాలో ఆసక్తిని నింపుతున్నాడు. మిగతా అన్నిటిపట్లా నాలో నిరాసక్తత నానాటికీ పెరుగుతోంది” అని ఒక మిత్రుడితో అన్నాడు. పురాతనపు మట్టిపిడకల(tablets)మీద లిఖించిన ధర్మశాస్త్రాలకు ఉన్నంత శక్తిమంతతతో హోమర్ అతనితో సంభాషించాడు. అంతేకాదు, హోమర్ అతనికి ఒక దిగ్దర్శి, ఒక శిలాశాసనం, ఒక జీవనవిధానం, ఈ భూగోళపు ఒకానొక చరిత్ర. రేపటి మానవజీవనసరళిని ప్రస్ఫుటించే ఒక భవిష్యవాణి. స్లీమన్ ఉన్మాది కాడు, కానీ ఉన్మాదానికి దగ్గరగా ఉంటాడు.  ఉజ్వలమైన, అత్యద్భుతమైన విశుద్ధనాగరికత ఒకప్పుడు ఈ భూమిమీద వర్ధిల్లిందన్న విశ్వాసాన్ని విరాడ్రూపానికి పెంచిన ఉన్మాదం అతనిది. అతని దృష్టిలో, ఉన్మాది కావడానికి సైతం సిద్ధమై అడుగుపెట్టదగిన మహత్తర నాగరికత అది.

స్లీమన్ తో పాటు అలాంటి ఉన్మత్తతను పంచుకున్నవారు మరెందరో!  ఆంగ్లకవి కీట్స్ ఒక గ్రీకు కలశాన్ని చూడగానే, తనను ఏదో అద్భుతమైన ఉజ్వలత కమ్మేసిన అపురూప క్షణాలను అనుభూతి చెందాడు. పురాకాలపు బలులు, ఇతర తంతులు తన కళ్లముందు జరుగుతున్నట్టు భావించుకున్నాడు. భూమి మీద ఏనాడో అదృశ్యమైన ఆ నాగరికతకు జర్మన్ రచయిత గథా(Goethe)11, జర్మన్ కవి షిలర్(Schiller)12  విధేయత ప్రకటించుకున్నారు. గ్రీకు దేవతలను తలచుకుని మత్తెక్కి మైమరచిన మరో జర్మన్ కవి  ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(Friedrich Holderlin)13, ఇప్పటికీ వారి ఆలయాలు ఉన్నట్టూ, వాటిలో ఇప్పటికీ వారి కొలుపులు జరుగుతున్నట్టూ, ఈ ఆలయాలలో తనొక పూజారి నైనట్టూ ఊహించుకున్నాడు. ఊహల్లో తప్ప ఎన్నడూ చూసి ఎరగని గ్రీకు దీవుల్లో తనొక సంచారి ననుకున్నాడు. అతని భావనలో క్రీస్తే సర్వోన్నత దైవం, గ్రీకు వీరులు క్రీస్తు పుత్రులు. క్రీస్తు, గ్రీకు దేవతల పట్ల అతనిలో ఒకేవిధమైన భక్తితత్పరత.  ప్రాచీన గ్రీకు సంగీతయుక్తంగా కవిత్వం విరచిస్తూనే అతను క్రైస్తవకవులలో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందాడు.  క్రీస్తు ఆరాధన, గ్రీసు విధేయత జమిలిగా అతన్ని ఎంత వివశుణ్ణి చేశాయంటే, చివరికి అతనొక ఉన్మాది అయ్యాడు.

స్లీమన్ విషయానికి వస్తే, అతను చర్చి వాతావరణంలో పెరిగినా, తన క్రైస్తవ వారసత్వాన్ని నిరాకరించాడు. ఏనాడూ చర్చికి వెళ్లలేదు. బైబిల్ ను కల్పితరచనగా భావించాడు. కొత్త నిబంధన(New Testament) చూసి విస్తుపోయాడు. హోమర్ లో కనిపించని అనేక గ్రీకు పదాలు అందులో కనిపించాయి. సోఫియా తల్లి మరణించినప్పుడు, శ్మశానవాటికకు వెళ్ళిన అతను, అక్కడ క్రైస్తవ పూజారుల చేస్తున్న ప్రార్థనలు విని, “ఇదంతా అర్థరహితం. పునరుత్థానం అంటూ ఏదీ లేదు- ఉన్నదల్లా ఒక్క అమరత్వం మాత్రమే!” నని గొణుక్కున్నాడు. హోమర్ అనంతరకాలానికి చెందిన యూరోపియన్ సంప్రదాయం మొత్తాన్నిఅతను తృణీకరించాడు. మోజెస్ సినాయి ఏడారులను దాటాడు; క్రీస్తు పరమపదించాడు; రోమన్ సామ్రాజ్యం ఉత్థాన పతనాలను చూసింది. ఆ తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్క రేకే కాండం నుంచి జారిపోయింది; అతని దృష్టిలో ఇవన్నీ కేవలం అర్థరహితాలు–

చివరివరకూ నిలిచి వెలిగేది ఒకే ఒక జ్వాల… ఆ జ్వాల పేరు, హోమర్!!!

***

స్లీమన్ తర్వాత…

  • స్లీమన్ ప్రారంభించిన పని, అతని మరణం తర్వాత కూడా విజయవంతంగా కొనసాగింది. యూరప్ కు చెందిన ఎందరో పురావస్తునిపుణులు గ్రీస్, మధ్యప్రాచ్యం మొదలైన చోట్ల తవ్వకాలు జరిపించి పురాకాలానికి చెందిన ఎన్నో విశేషాలను బయటపెట్టారు.
  • ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించడానికి దార్ఫెల్త్ కు సోఫియా ఆర్థికసాయం చేసింది. ఆ తర్వాత జర్మన్ చక్రవర్తి నుంచి కూడా ఆర్థికసాయం అందింది. హోమర్ చిత్రించిన ట్రాయ్ ను గుర్తించడంలో స్లీమన్ పొరబడినట్టు దార్ఫెల్త్ కు అర్థమైంది. అతని తవ్వకాలలోనే హోమర్ ట్రాయ్ బయటపడింది.
  • సర్ ఆర్థర్ ఎవాన్స్ 1900-05 మధ్య క్రీటులో తవ్వకాలు జరిపించి క్రీ.పూ. ఆరవ సహస్రాబ్దికి చెందిన నాగరికతను వెలికితీశాడు. క్రీటుకు చెందిన మూడు లిపులను బయటపెట్టాడు.
  • అమెరికాకు చెందిన కార్ల్ బ్లెగన్ 14అనే పురావస్తునిపుణుడు 1932-38 మధ్యకాలంలో హిస్సాలిక్ లో తవ్వకాలు జరిపించి స్లీమన్, దార్ఫెల్త్ ల పొరపాట్లను సరిదిద్దాడు. మైసీనియాలో క్రీటు లిపిలో ఉన్న మట్టిపిడకలను కనుగొన్నాడు. అయితే ఆ లిపిని ఛేదించలేకపోయాడు. ఇంతలో రెండో ప్రపంచయుద్ధం రావడంతో పురావస్తు తవ్వకాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
  • 1952లో క్రీటు లిపితో ఉన్న మరికొన్ని మట్టిపిడకలు బయటపడ్డాయి. మైకేల్ వెంట్రిస్(Michael Ventris) 15అనే ఆంగ్లేయభాషాశాస్త్రవేత్త, జాన్ చాద్విక్(John Chadwick) 16, ఆలిస్ కాబర్(Alice Kober) 17 అనే మరో ఇద్దరు భాషావేత్తలతో కలసి ఎట్టకేలకు విజయవంతంగా క్రీటు లిపిని ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. వెంట్రిస్, చాద్విక్ లు Documents in Mycenaean Greek అనే తమ రచనను స్లీమన్ కు అంకితమిచ్చారు.

(అయిపోయింది)

అథోజ్ఞాపికలు

  1. లైప్జిగ్: జర్మనీలోని ఒక నగరం.
  2. నేపుల్స్: ఇటలీలో రోమ్, మిలాన్ తర్వాత పెద్ద నగరం.
  3. పాంపే: ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న పురావస్తు ప్రాధాన్యం కలిగిన ప్రాచీన నగరం.
  4. పల్లాస్ ఎథెనా: విజ్ఞానాన్ని, ధైర్యసాహసాలను, స్ఫూర్తిని, న్యాయ, ధర్మాలను, నాగరికతను, గణిత శాస్త్రాన్ని, యుద్ధవ్యూహాన్ని, లలితకళలను, చేతివృత్తులను సంకేతించే గ్రీకు దేవత. మన సరస్వతీదేవితో పోల్చదగిన దేవత అన్నమాట.
  5. ఒలింపస్: గ్రీకు దేవతలు నివసించే పర్వతం. రాక్షసులపై దేవతలు విజయం సాధించిన తావు.
  6. వెసూవియస్(Vesuvius): ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న ఒక అగ్నిపర్వతం.
  7. శరోనిక్: గ్రీస్ లో ఉన్న ద్వీపసముదాయాన్ని చుట్టి ఉన్న జలసంధి. ఈ పేరే ఈ ద్వీపసముదాయానికి కూడా వచ్చింది.
  8. పార్థినోన్ (Parthenon): గ్రీస్ లో ఎథెన్స్ లో ఉన్న పురాతన దుర్గంపై ఉన్న ఎథెనా ఆలయం.
  9. మేథ్యూ ఆర్నాల్డ్(1822-1888): ప్రముఖ ఇంగ్లీష్ కవి, విమర్శకుడు.
  10. విచిత్రంగా వాల్మీకి గురించి రాంభట్ల కృష్ణమూర్తిగారు కూడా ఇలాగే అంటారు: “వాల్మీకి నిజాన్ని దాచడు. అబద్ధం చెప్పడు”(జనకథ). వ్యాసుడికీ ఇదే వర్తిస్తుందనుకుంటాను.
  11. జొహాన్ వాల్ఫ్ గంగ్ గథా(1749-1832): జర్మన్ రచయిత, రాజనీతిజ్ఞుడు.
  12. జొహాన్ క్రిస్తోఫ్ ఫ్రీడ్రిచ్ వాన్ షిలర్(1759-1805): జర్మన్ కవి, తత్వవేత్త, చరిత్రకారుడు.
  13. జొహాన్ క్రిస్టియన్ ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(1770-1843): ప్రముఖ జర్మన్ గేయకవి.
  14. కార్ల్ విలియం బ్లెగన్ (1887-1971): అమెరికాకు చెందిన పురావస్తునిపుణుడు.
  15. మైకేల్ జార్జి ఫ్రాన్సిస్ వెంట్రిస్(1922-1956): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
  16. జాన్ చాద్విక్ (1920-1998): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
  17. ఆలిస్ ఎలిజబెత్ కాబర్(1906-1950): అమెరికాకు చెందిన భాషానిపుణురాలు.

 

 

 

 

 

 

“ప్రియా సోఫియా…ఇంక సెలవా!”

 

స్లీమన్ కథ-34

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

కైరోలోని బ్రిటిష్ సైనికాధికారులు తన రాకపై ప్రత్యేకమైన ఆసక్తి చూపకపోవడం స్లీమన్ ను బాధించింది. బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న ఈజిప్షియన్లపై అతనిలో సానుభూతి అంకురించింది. ఆస్వాన్ 1 చేరగానే, తన రాక గురించి స్థానిక అధికారులకు తెలియజేయమని కార్యదర్శిని ఒడ్డుకు పంపించాడు. తిరిగొచ్చిన కార్యదర్శి, అధికారులు మీ పేరెప్పుడూ వినలేదన్నారనీ, మీకు స్వాగతం చెప్పే ఉద్దేశంలో లేరనీ చెప్పాడు. తన పేరు ప్రతిష్టలు ఆస్వాన్ లోని ఈజిప్షియన్ కార్యాలయాలవరకూ పాకలేదని తెలిసి స్లీమన్ దిగ్భ్రాంతి చెందాడు. కోపంతో గింజుకున్నాడు. అధికారులు వచ్చి తనకు స్వాగతం చెబితే తప్ప ఒడ్డు ఎక్కేదిలేదని భీష్మించాడు.

ఆ శీతాకాలంలో ఆస్వాన్ పర్యాటకులతో కిక్కిరిసి ఉంది. వాళ్ళలో చాలామంది ఔత్శాహిక పురావస్తునిపుణులున్నారు. వాళ్లలోనూ కొందరు మంచి అంకితభావం ఉన్న యువకులు. అలాంటి వారిలో ఈ.ఏ. వ్యాలిస్ బాడ్జ్ 2 ఒకడు.  అప్పటికతను అంతగా ప్రసిద్ధుడు కాదు. బ్రిటిష్ మ్యూజియం తరపున మొదటిసారి ఈజిప్టులో పని చేయడానికి వచ్చాడు. కుఫిక్ లిపి 3 రాతలతో ఉన్న తొలినాటి మహమ్మదీయుల గోపుర సమాధులను గుర్తించడం అతనికి అప్పగించిన బాధ్యత. ఎందుకంటే, హిజిరా 4 సమీపకాలం నుంచీ ఆస్వాన్ యాత్రాస్థలిగా ఉంటూ వచ్చింది.

వ్యాలిస్ బాడ్జ్ పనిపట్ల మంచి శ్రద్ద, ఆసక్తి ఉన్నవాడే కాక, సరళస్వభావి. స్లీమన్ చిన్నబుచ్చుకున్న సంగతి అతనికి తెలిసింది. వెంటనే ఇద్దరు మిత్రులను వెంటబెట్టుకుని స్లీమన్ ఉన్న దహబియా వద్దకు ఒక బోటులో వెళ్ళాడు. బట్లర్ వాళ్ళకు ఎదురేగి పడవ వెనుక భాగంలో ఉన్న ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్ళాడు. అతను తెచ్చి ఇచ్చిన కాఫీ తాగి సిగరెట్లు వెలిగించిన తర్వాత అసలు విషయానికి వస్తూ, కొత్తగా తవ్వితీసిన మహమ్మదీయ సమాధుల పరిశీలనకు మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చామని స్లీమన్ తో చెప్పారు. ఆ మాట వినగానే స్లీమన్ బిర్ర బిగుసుకున్నాడు. తనకు అలాంటి ఆసక్తేమీ లేనట్టు తన కవళికలతోనే సూచించాడు. “మీరు వచ్చి అడిగినందుకు సంతోషం. నా పురావస్తు పరిజ్ఞానం అంతా ఉపయోగించి ఆ సమాధులగురించి మీకు క్షుణ్ణంగా బోధించి ఉండేవాణ్ణే కానీ, ఇప్పుడు నాకంత తీరిక లేదు. వాడీ హల్ఫా వెడుతున్నాను” అన్నాడు.

ఆ తర్వాత కాసేపు నిశ్శబ్దం. స్లీమన్ ఇంకో మాట మాట్లాకుండా, ‘ఇక మీరు దయచేయచ్చు’ అని సూచిస్తున్నట్టుగా, అంతవరకూ తను చదువుతూ ఉన్న ఇలియడ్ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ ముగ్గురూ విస్తుపోయారు. “ఇక మమ్మల్ని సెలవు తీసుకోమంటారా” అని వారిలో ఒకడైన మేజర్ ప్లంకెట్ ఎంతో మృదువుగా, మర్యాదగా అడిగాడు. స్లీమన్ తల ఊపాడు. తిరిగి వెడుతూ వారు ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు. ఒకవైపు, ఒక ప్రపంచప్రసిద్ధ పురావస్తునిపుణుని కలసుకున్నామన్న సంతృప్తి, ఇంకోవైపు ఆయన ప్రవర్తన కలిగించిన మనస్తాపం!

schliemann and sophia

ఒకవిధంగా అతని ప్రవర్తన అసాధారణమే. తన శేషజీవితాన్ని బాధాగ్రస్తం చేస్తూవచ్చిన తలనొప్పి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. మరోసారి ఇలాగే అతను నైలు నదిలో ప్రయాణించాడు. అప్పుడు రుడాల్ఫ్ విర్కో అతని వెంట ఉన్నాడు. తలనొప్పి, చెవినొప్పి కొంత ఉపశమించిన ఆ దశలో స్లీమన్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాడు. కార్నక్ 5 స్తంభాల మధ్య తిరుగుతూ, అక్కడి అంతుచిక్కని గజిబిజి దారులపై యువ పురావస్తునిపుణుడు ఫ్లిండర్స్ పేట్రీ 6 రూపొందించిన రేఖాపటాలను పరిశీలిస్తూ నాలుగు గంటలపాటు గడిపాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి ఉన్న ప్రదేశం అది. ఆ భవంతిలో మూడు వేల గదులు, బ్రహ్మాండమైన 12 దేవీడీలు ఉండేవి. గదుల్లో సగం భూగర్భంలో ఉన్నాయి. గజిబిజి దారులతో ఉన్న ఆ సువిశాల ప్రదేశంలో ఫ్లిండర్స్ ఎంతో ఓపికగా జరిపించిన తవ్వకాలు స్లీమన్ ను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ తర్వాత స్లీమన్, విర్కోలను కలసుకున్న ఫ్లిండర్స్ , పిడివాది అంటూనే వాస్తవాలను అంగీకరించే నిజాయతీ స్లీమన్ లో ఉందని కితాబు ఇచ్చాడు.

స్లీమన్ 1888లో సితేరా దీవిలో కొద్దిపాటి తవ్వకాలు జరిపి అఫ్రోడైట్ ఆలయాన్ని వెలికితీశాడు. హిస్సాలిక్, మైసీనియాలలో తను కనుగొన్న వాటితో మాత్రమే పోల్చదగిన ఓ బ్రహ్మాండమైన నిర్మాణాన్ని తను బయటపెట్టానంటూ లండన్ టైమ్స్ కు పొడవైన తంతి పంపించాడు. అదే ఏడాది పీలోస్ లోనూ, స్ఫేక్టీరియా 7దీవిలోనూ తవ్వకాలు జరిపాడు. క్రీ.పూ. 425లో స్పార్టాన్లు కనిపెట్టి ఉపయోగించుకున్నట్టు తూసడడీస్ రాసిన దుర్గాలను స్పేక్టీరియాలో వెలికితీశాడు. ఇవి ముఖ్యమైన పరిశోధనలే కానీ; హిస్సాలిక్, మైసీనియాలకు సాటి వచ్చేవి మాత్రం కావు.

నోసస్ అదే పనిగా అతన్ని గుంజి లాగుతూనే ఉంది. “నోసస్ (క్రీటు రాజధాని) రాజులు నివసించిన ప్రాసాదాలను బయటపెట్టడడమన్న ఒకే ఒక మహత్కార్యంతో ఈ జీవితాన్ని చాలిద్దామని ఉంది” అని 1889 జనవరి 1న రాసుకున్నాడు. అదే ఏడాది వసంతంలో అక్కడి భూమి కొనుగోలుకు మరో ప్రయత్నం చేద్దామనుకున్నాడు. దార్ఫెల్త్ ను వెంటబెట్టుకుని వెళ్ళి మళ్ళీ బేరసారాలు మొదలుపెట్టాడు. భూమి యజమాని అక్కడున్న 2500 ఆలివ్ చెట్ల ధరను కూడా కలుపుకుని లక్ష ఫ్రాంకులు అడిగాడు. స్లీమన్ 40వేల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. చివరికి 50వేల ఫ్రాంకులకు బేరం కుదిరింది. తీరా ఆలివ్ చెట్లను లెక్కబెడితే 888 మాత్రమే ఉన్నాయి. దాంతో మండిపడిన స్లీమన్ ఇలాంటి అబద్ధాలకోరుతో తను లావాదేవీలు జరిపేదిలేదని మొండికేసాడు.

వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేయడానికి దార్ఫెల్త్ కు మనస్కరించలేదు. ఆ భూమి గురించి మరింత కూపీ తీశాడు. తమకు అమ్మజూపిన వ్యక్తి కింద మూడో వంతు భూమి మాత్రమే ఉందనీ, మిగతా భూమి మరొకరి యాజమాన్యంలో ఉందనీ తేలింది. ఆ కొత్త వ్యక్తితో సునాయాసంగా బేరం కుదిరి ఒప్పందం సిద్ధమైంది. అక్కడి తవ్వకాలలో లభించే నిధినిక్షేపాలలో మూడో వంతు స్థలయజమానులకు స్లీమన్ ఇవ్వజూపాడు. కానీ ఈసారి సంతకం చేయడానికి మొదటి స్థలయజమాని తిరస్కరించాడు. ఇది తెగే వ్యవహారం కాదని స్లీమన్ నిర్ణయానికి వచ్చి దార్ఫెల్త్ తో కలసి తిరుగుముఖం పట్టాడు. అతని క్రీటు గురించిన కల పూర్తిగా కరిగిపోయింది.

ఆ సంవత్సరంలోనే అతను ట్రాయ్ లో ట్రోజన్ పురావస్తు సంపద మీద మొదటి అంతర్జాతీయ సమ్మేళనం ఏర్పాటు చేసి దేశ దేశాల పండితులనూ ఆహ్వానించాడు. వారితోపాటు ట్రాయ్ శిథిలాల వెంట తిరుగుతూ తను కనుగొన్న విశేషాలను వారికి చూపించాడు. తన అనుభవాలను కథలు కథలుగా వారికి వినిపించాడు. ఇప్పటికీ అతనిలోని తొలినాటి ఉత్తేజం అలాగే ఉంది. మరుసటేడు అక్కడే రెండవ అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాడు. పండితులను ఉద్దేశించి ఎంతో హుందాగా ప్రసంగాలు చేశాడు. విచిత్రంగా అతని మాటల్లో కొంత మార్పు వచ్చింది. వెనకటిలా సాటి పండితుల అల్పవిద్వత్తునో, మరుగుజ్జుపోకడలనో ఎత్తిచూపి తీసిపారేసే ధోరణి తగ్గింది. ఆ రోజుల్లోనే రుడాల్ఫ్ విర్కోను వెంటబెట్టుకుని మరోసారి ఈదా పర్వతం మీదికి విహారయాత్రకు బయలుదేరాడు. సాయంత్రానికి ఆ పర్వత పాదాల దగ్గర ఉన్న ఒక గ్రామానికి చేరేసరికి అతనికి దుర్భరమైన చెవిపోటు వచ్చి వినుకలిశక్తి పోయింది. విర్కో చెవిని పరీక్షించి లోపల బాగా వాచి ఉన్నట్టు గమనించాడు. వెంటనే ట్రాయ్ కి వెళ్ళడం మంచిదన్నాడు. ఇద్దరూ ఈదా పర్వతం ఎక్కకుండానే వెనక్కి వెళ్ళిపోయారు.

Atlantis-1882

Atlantis-1882

సమ్మేళనం ముగిసిన తర్వాత మళ్ళీ విర్కోతో కలసి గుర్రాల మీద ఈదా పర్వతయాత్రకు వెళ్లాడు. కొండ ఎక్కిన తర్వాత జియస్ కూర్చున్నదిగా చెప్పిన సింహాసనం మీద కూర్చుని, ఆ ఎత్తునుంచి కింది మైదానాన్ని చూస్తూ కాసేపు గడిపాడు. ఆ తర్వాత శిఖరానికి చేరుకుంటుండగా తుపాను విరుచుకుపడింది. చూస్తుండగానే అది పెను తుపానుగా మారిపోయింది. పెద్ద పెద్ద ఉరుములతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. అద్భుతమైన మెరుపులతో నలుదిక్కులూ వెలిగిపోయాయి. ఇద్దరూ రాతి గుట్టల కింద తల దాచుకున్నారు. అయినా వర్షంలో నిలువునా తడిసిపోయారు. కాసేపటికి తుపాను వెలిసింది. వర్షపు నీటితో శుభ్రపడిన కాంతిలో స్లీమన్ మరోసారి కింది ట్రాయ్ మైదానాన్ని, అదే చివరిసారా అన్నట్టుగా తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు. నిజంగా అదే చివరిసారి అయింది.

సమ్మేళనం ముగిసినా పని కొనసాగింది. పనుల సారథ్యాన్ని దార్ఫెల్త్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. శిథిలాల చెత్తను తొలగించే ముందు, పట్టుబట్టి ప్రతి వివరాన్నీ సునిశితంగా పరిశీలించాడు. ఫోటో తీయించాడు. చీటీలు అతికించాడు. సమయం వృథా అవుతోందని స్లీమన్ పోరు పెడుతున్నా వినిపించుకోలేదు. అతని శ్రమ వృథా పోలేదు. కొత్తగా కొన్ని అపురూపమైన మైసీనియా కుండ పెంకులు వెలుగు చూశాయి. మరికొన్ని కోటగోడలు బయటపడ్డాయి. చివరికి ఒక పెద్ద భవంతి బయటపడింది. దాంతో స్లీమన్ లో కొత్త ఆశలు చిగురించాయి. హోమర్ చిత్రించిన ట్రాయ్ తాలూకు మొత్తం ప్రణాళిక అంతా తన జీవితకాలంలోనే బయటపడుతున్నట్టు ఊహించుకుని ఉత్సాహం చెందాడు. అంతలో వేడి గాలులు మైదానాన్ని ఊపేయడం ప్రారంభించాయి. పనివాళ్లు కొందరు జ్వరపడ్డారు. తవ్వకాలను మరుసటేడుకు వాయిదా వేస్తూ జులై చివరిలో తిరిగి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు.

పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. స్లీమన్ రాతబల్ల మీద ఆ ఏడాది పని తాలూకు వివరణ పత్రాల దొంతర పేరుకుపోతోంది. ఎప్పటిలా సోఫియా సాహచర్యం అతనికి ఉపశమనం కలిగిస్తూ పనిభారాన్ని తేలిక చేస్తూనే ఉంది.  మరోవైపు, ఎప్పటిలా అస్థిమితంగానూ, ఏవేవో కలలు కంటూనూ గడుపుతూనే ఉన్నాడు. అయితే, తను మరోసారి ట్రాయ్ ను సందర్శించే అవకాశం లేదన్న సంగతి అప్పటి కతనికి తెలియదు. అట్లాంటిస్ 8 దీవులను సందర్శించాలనీ, మెక్సికోకు వెళ్ళి రావాలనీ అనుకుంటున్నట్టు విర్కోకు రాశాడు. ఈ ప్రదేశాలలో ఎక్కడో ఒడీసియస్ యాత్రకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయని అతని ఊహ. కెనారీ దీవుల్లోనే తను అట్లాంటిస్ ను కనుక్కోగలనని తలపోసాడు. ఈ దీవులు నిత్యవసంతశోభతో అలరారుతూ ఉంటాయన్న హోమర్ అభివర్ణనే అతని ఊహకు మూలం. అయితే, ఈ లోపల ఇటీవలి ట్రాయ్ తవ్వకాలపై  పుస్తకాన్ని పూర్తి చేయాలనీ, మరో అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాలనీ, వచ్చే వసంతాన్నీ, వేసవినీ పూర్తిగా ట్రాయ్ లోనే గడపాలనీ అనుకున్నాడు.

చెవిపోటు ఇప్పుడు అంతగా బాధించడంలేదు. వాపు కూడా తగ్గింది. బహుశా శస్త్రచికిత్స అవసరం కాకపోవచ్చు. దానిని వీలైనంత కాలం వాయిదా వేస్తే మంచిదని విర్కో సలహా ఇచ్చాడు. స్లీమన్ ఆ సలహాను పాటించాడు. సోఫియా వియెన్నా సందర్శనకు వెళ్లింది. ఆమె తోడులేని గృహజీవితం అతనిలో ఎప్పుడూ శూన్యాన్ని నింపుతూనే ఉంటుంది. ఇంట్లో దెయ్యం పట్టినట్టు తిరిగేవాడు. తాము ఇద్దరూ కలసి ఎథెన్స్ లో ఎప్పుడూ పెళ్లిరోజు జరుపుకోని సంగతి అతనికి సెప్టెంబర్ చివరిలో గుర్తొచ్చింది. ఆమెకు ప్రాచీన గ్రీకులో ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు:

మన పెళ్లిరోజును తలచుకుని ఎంతో గర్విస్తున్నాను. వచ్చే ఏడాది మనిద్దరం కలసి పెళ్లిరోజు జరుపుకునేలా చూడమని దేవతలను ప్రార్థిస్తున్నాను. నీ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాను. మనిద్దరం కలసి ఇరవయ్యొక్క ఏళ్లపాటు సుఖసంతోషాలతో జీవించాం. ఇన్నేళ్ల కాలాన్నీ ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే విధి మన జీవితాల్లో తీపినీ, చేదునూ సమానంగా నింపిందనిపిస్తుంది. మన పెళ్లిని పరిపూర్ణంగా ఎప్పుడూ పండుగ చేసుకోలేనేమో కూడా. ఎందుకంటే, నువ్వు నా ప్రియాతిప్రియమైన అర్థాంగివి మాత్రమే కాదు; నాకు నెచ్చెలివి. కష్టాలలో దారి చూపించిన సారథివి. నా చేతిలో చేయి వేసి నడిచిన విశ్వసనీయ సహచరివి. ఒక అద్వితీయ మాతృమూర్తివిగా కూడా. నీ సుగుణ సంపదను తలచుకుని నిరంతరం మురిసిపోతూనే ఉంటాను. జియస్ కరుణిస్తే మరుజన్మలో కూడా నిన్నే పెళ్లి చేసుకుంటాను.

ఇవే రోజుల్లో చెవిపోటుకు శస్త్రచికిత్స తప్పని పరిస్థితి వచ్చింది. విర్కో సిఫార్సు మీద హాలీ 9 లోని ఒక క్లినిక్ కు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. కబురు అందుకున్న సోఫియా భర్త ప్రయాణం ఏర్పాట్లు చూసి సాగనంపడానికి వెంటనే ఎథెన్స్ కు వచ్చింది. బయలుదేరేముందు తన స్వభావవిరుద్ధంగా స్లీమన్ గంభీరంగానూ, నిర్లిప్తంగానూ ఉండిపోయాడు. బ్యాంక్ డైరక్టర్లతో తన వీలునామా గురించి మాట్లాడాడు. తన దుస్తులు మడత పెట్టి ట్రంకులో పెట్టుకుంటున్నప్పుడు, “ఈ దుస్తులు ఎవరు వేసుకుంటారో?!” అన్న మాటలు అతని నోట అప్రయత్నంగా వెలువడ్డాయి. సోఫియా తను కూడా వస్తానంది. “ఆరువారాల్లో వచ్చేస్తాను, పిల్లల్ని చూసుకుంటూ ఉండు” అని స్లీమన్ అన్నాడు. రైల్వే స్టేషన్ కు బయలుదేరేముందు, చివరిక్షణంలో భర్త రిస్టువాచీ ఛైను పట్టుకుని ఆపి ముఖంలోకి చూసింది. అదే చివరిచూపా అన్న స్ఫురణ ఆమె చూపుల్లో కదలాడింది.

నవంబర్ లో అతను హాలీ చేరుకున్నాడు. చలికాలం. క్లినిక్ కిటికీలకు అవతల మంచు కురుస్తోంది. వైద్యులు అతని రెండు చెవులనూ పరీక్షించారు. రెండింటికీ శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. మరునాడు శస్త్రచికిత్స జరిపారు. ఆ సమయంలో తెల్లని నూనెబట్ట పరచిన ఒక బల్ల మీద పడుకోబెట్టారు. “అంతకుముందు ఒక శవపరీక్ష జరపడానికి ఉపయోగించిన బల్లలానే అది కనిపించింది” అని ఆ తర్వాత స్లీమన్ ఒక మిత్రుడితో అన్నాడు. శస్త్రచికిత్సకు ఒకటిమ్ముప్పావు గంట పట్టింది.

వైద్యుల ప్రకారం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. కానీ స్లీమన్ కు అలా అనిపించలేదు. దానికితోడు ఆసుపత్రిలో గడపడం దుర్భరంగా తోచింది. సందర్శకులను అనుమతించలేదు. తలకు పెద్ద కట్టు కట్టారు. ఆ పరిస్థితిలో కూడా చుట్టూ పుస్తకాలు పేర్చుకుని, ఉత్తరాలు రాస్తూ గడిపాడు. దార్ఫెల్త్ కూ ఉత్తరం రాస్తూ, తను చేసిన తప్పులన్నింటినీ క్షమించమనీ, తమ ఇద్దరి మధ్యా ఛాయామాత్రంగానైనా ఎప్పుడైనా మనస్పర్థ కలిగిందని భావిస్తే, దానిని నిర్మొహమాటంగా వెల్లడించమనీ కోరాడు. భార్యనుంచి అందుకున్న ఉత్తరానికి జవాబు రాస్తూ, “మహిళలందరిలోనూ మణిపూసవు నువ్వు, నీ ఉత్తరాన్ని చెమ్మగిల్లిన కళ్ళతో చదువుకున్నాను” అన్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ఆస్వాన్: ఈజిప్టులో నైలు నది ఒడ్డున ఉన్న ఒక నగరం. ఆస్వాన్ డ్యామ్ సుప్రసిద్ధం.
  2. ఈ. ఏ. వ్యాలిస్ బాడ్జ్(1857-1934): ఈజిప్టు పురాచరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు, భాషాశాస్త్రవేత్త. ప్రాచీన మధ్యప్రాచ్యం పై అనేక గ్రంథాలు రచించాడు.
  3. కుఫిక్ లిపి: వివిధ అరబ్బీ లిపులకు చెందిన ప్రాచీన రాతలిపి. ఇరాక్ లోని కుఫా అనే చోట క్రీ.శ. 7వ శతాబ్ది చివరిలో అభివృద్ధి చెందింది.
  4. హిజిరా: మహమ్మద్ ప్రవక్త క్రీ.శ. 622లో మక్కా నుంచి మదీనాకు వెళ్ళిన సందర్భాన్ని సంకేతించే ముస్లిం శకం.
  5. కార్నక్: ఈజిప్టులోని తీబ్స్ నగరంలో భాగంగా ఉన్న విశాలమైన ప్రాచీన, మధ్యయుగ ఆలయ సముదాయం. వీటిలో అనేకం శిథిల ఆలయాలు.
  6. ఫ్లిండర్స్ పేట్రీ (1853-1942): ఈజిప్టు విషయాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు. పురావస్తుశాస్త్రానికీ, ప్రాచీన కళాఖండాల పరిరక్షణకూ సంబంధించిన శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేసిన ప్రముఖులలో ఒకడు.
  7. స్ఫేక్టీరియా: గ్రీస్ లోని పెలొపనీస్ ద్వీపకల్పంలో పీలోస్ అఖాతం వద్ద ఉన్న ఒక చిన్న దీవి. క్రీ.పూ. 431-404 మధ్య పెలొపనీసస్ యుద్ధంగా ప్రసిద్ధమైన యుద్ధం ఇక్కడే జరిగింది.
  8. అట్లాంటిస్-కెనారీ దీవులు: అతి పురాతనకాలంలో, ఒక అంచనా ప్రకారం 9వేల సంవత్సరాల క్రితం, అట్లాంటిక్ సముద్రంలో ఉండేదిగా భావిస్తూ వచ్చిన ఒక దీవి/దీవులు ఇవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో(క్రీ.పూ. 428-348) తన ‘తీమేయస్’ (Timaeus), ‘క్రీషియస్’ (Critias) అనే డైలాగులలో అట్లాంటిస్ గురించి రాశాడు. పెద్ద ఉత్పాతం ఏదో సంభవించి ఈ భూఖండం సముద్రంలో లోతుగా మునిగిపోయిందనీ, ఇందులోని పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలు మాత్రమే నీటిపై కనిపిస్తాయనీ రాశాడు. ఆయన నిజమైన ఆధారాలతోనే రాశాడా, లేక ఊహించాడా అన్నది తెలియదు. కాకపోతే, అప్పటినుంచీ అట్లాంటిస్ అనే భూఖండం నిజంగానే ఉండేదని నమ్ముతూ వచ్చినవాళ్ళు నేటి కెనారీ(Canary) దీవులు, అజోర్స్(Azores)దీవులు, కేప్ వర్ద్(Verde),మదీరా(Madeira)లు భాగంగా ఉన్న మైక్రోనేసియా యే ఆ మునిగిపోయిన ప్రాచీన భూఖండం తాలూకు అవశేషమని భావిస్తారు.

గ్రీకు పురాణాల ప్రకారం చూస్తే, ప్రముఖ గ్రీకువీరుడు హెరాక్లీస్ చేపట్టిన 12 సాధనలలో ఒకటి, ప్రపంచం అంతం వరకూ వెళ్ళి సంధ్యా దేవతలలో ఒకరైన హెస్పరడీస్ కాపలా కాస్తున్న తోటలోని బంగారు యాపిల్ పండ్లను తీసుకురావడం! హెస్పరీస్, అట్లాస్ ల కుమార్తే హెస్పరడీస్. గ్రీకు, రోమన్ పురాణాలు ఒక రాక్షసునిగా పేర్కొన్న అట్లాస్ పేరే అట్లాంటిక్ సముద్రానికీ, మొరోకోలోని అట్లాస్ పర్వతశ్రేణికీ వచ్చింది. హెరాక్లీస్ స్తంభాల(Pillars of Heracules) ఉనికిని చెబుతున్న నేటి జిబ్రాల్టర్ జలసంధిని కూడా దాటి సంధ్యాదేవతలు నివసించే స్వర్గధామానికి హెరాక్లీస్ వెళ్లాడనీ;  ఆ స్వర్గధామమే నేటి కెనారీ దీవులనీ, పౌరాణిక వర్ణనకు అవే సరిపోతున్నాయనీ భావించారు.

హోమర్ కూడా ఈ దీవులను ఎలిజియం(Elysium)దీవుల పేరిట గుర్తించాడు. పుణ్యకార్యాలు చేస్తూ, ధర్మబద్ధంగా జీవించినవారు చనిపోయి ఈ దీవులకు వెడతారని రాశాడు. అయితే అతి ప్రాచీన నావికులైన ఫినీషియన్లు కానీ, గ్రీకులు కానీ ఈ దీవులకు వెళ్ళినట్టు ఆధారాలు లేవు. అయితే ఉత్తర ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరాన్ని సందర్శించిన తొలి ఫినీషియన్లు, వారి వారసులైన పురాతన కార్తేజ్ నగరవాసులు కెనారీ దీవులను కనీసం చూసి ఉండడానికి ఎంతైనా అవకాశముంది. క్రీ.పూ. 12వ శతాబ్దిలో ఫినీషియన్లు కెనారీ దీవులకు వెళ్ళి వచ్చారని కొందరు చరిత్రకారులు భావించారు. క్రీ.పూ. 470లో కార్తేజ్ కు చెందిన నావికుడు హన్నో ఈ దీవులను సందర్శించాడంటారు. క్రీ.పూ. 146లో జరిగిన మూడవ ప్యూనిక్ యుద్ధంలో కార్తేజ్ ను జయించిన రోమన్లు పురాణ ప్రసిద్ధమైన ఈ దీవులపై పెద్ద ఆసక్తి చూపించలేదు. ఉత్తర ఆఫ్రికాలోని ప్రాచీన లిబియా రాకుమారుడు, మంచి విద్యావేత్త అయిన జుబా-2 క్రీ.పూ. 40లో కెనారీ దీవులకు ఒక పరిశోధక బృందాన్ని పంపించాడు. ఆ వివరాలను ప్లినీ ద ఎల్డర్ (క్రీ.శ. 23-79) నమోదు చేశాడు. టోలెమీ(క్రీ.శ. 150) భౌగోళిక ఊహారేఖలను ఆధారం చేసుకుని ఈ దీవుల ఉనికిని తగుమేరకు కచ్చితంగా గుర్తించి వాటిని ప్రపంచపు అంతిమ సరిహద్దు అన్నాడు. (పైన ఇచ్చిన రేఖాపటాన్ని చూడగలరు)

Read more: http://www.lonelyplanet.com/canary-islands/history#ixzz49dtzEVAE

ఖండాల చలన సిద్ధాంతం (continental drift) ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసినదే. ఆ కోణంలో చూసినప్పుడు అట్లాంటిస్ ఉనికి గురించి ప్లేటో క్రీస్తు పూర్వకాలంలోనే ఊహించడం విశేషంగానే కనిపిస్తుంది. మన విషయానికి వస్తే, రామాయణంలో సీతాన్వేషణకు వానరవీరులను అన్ని దిక్కులకూ  పంపుతూ సుగ్రీవుడు అనేక ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలు, ప్రాంతాల గురించి చెబుతాడు. వాటిని నేటి భౌగోళిక పరిజ్ఞానంతో ఎంతవరకు గుర్తించగలమో చెప్పలేం. హోమర్ ఆధారంగా అట్లాంటిస్ ను గుర్తించాలని స్లీమన్ అనుకున్నట్టే, రామాయణం, పురాణాలు వగైరాలలో పేర్కొన్న భౌగోళిక ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నించిన పండితులు మన దగ్గరా ఉన్నారు. మహాభారతంలోనూ ఇటువంటి అజ్ఞాత భౌగోళిక వివరాలు కనిపిస్తాయి. సముద్రంలో మునిగిపోయినట్టు పౌరాణికంగా విశ్వసించే  శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని యు. ఆర్. రావు అనే పురావస్తునిపుణుని సారథ్యంలో గుర్తించినట్టు చెప్పడం ఇటీవలి చరిత్ర.

కొలంబస్ కనిపెట్టడానికి చాలాముందే 11, 12 శతాబ్దులలోనే గ్రీస్ లాండ్ కు చెందిన నావికులు అమెరికాను కనిపెట్టారనీ, అంతకంటే అతి ప్రాచీనకాలంలోనే భూగోళపు అమరికను బట్టి అమెరికా ఖండాన్ని ఊహించగలిగారనీ ఆ మధ్య ఒక పుస్తకంలో చదివాను.

  1. హాలీ: జర్మనీలోని ఒక నగరం.

 

అతని లానే మరొకడు…!    

 

స్లీమన్ కథ-33

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

స్లీమన్, దార్ఫెల్త్ ఇద్దరూ నాప్లియోలో మకాం పెట్టారు. సూర్యోదయానికి ముందే లేచి స్లీమన్ సముద్రస్నానానానికి వెళ్లడం, పదినిమిషాలసేపు ఈత కొట్టడం మామూలే. ఆ తర్వాత ఇద్దరూ కలసి అక్కడికి పాతిక నిమిషాల దూరంలో ఉన్న టిర్యిన్స్ కు గుర్రం మీద వెళ్ళేవారు. ఉదయం ఎనిమిదికి తొలి విరామం. అక్కడి బ్రహ్మాండమైన రాతి వసారాల నీడలో పనివాళ్లు అల్పాహారం తీసుకునేవారు. సూర్యాస్తమయంవరకూ పని జరిగేది. ఆ తర్వాత ఇద్దరూ నాప్లియోకు తిరిగివెళ్ళేవారు.

జూన్ వరకూ తవ్వకాలు కొనసాగాయి.  హోమర్ వర్ణించిన ప్రాసాదం తాలూకు మొత్తం ప్రణాళిక అంతా వేసవి తొలి రోజుల్లోనే బయటపడింది. ఆ భారీ దుర్గం ఒక సున్నపురాతి కొండ మీద నిలబడి ఉంది. కింద చిత్తడి మైదానం. పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన పైకప్పుతో వసారాలు అనేక తరాలుగా గొర్రెల దొడ్లుగా ఉపయోగపడుతూ వచ్చాయి. గొర్రెల రాపిడికి కొన్ని చోట్ల రాళ్ళు నునుపుతేలాయి. ఈ రాతి కట్టడాలను దర్శించిన పసన్నియస్, ఎన్ని కంచరగాడిదలతో లాగించినా వీటిలో చిన్న రాయిని కూడా కదిలించలేరని రాశాడు. మైసీనియాలో లానే ఇక్కడా పసన్నియస్ రాతలను స్లీమన్ పరమప్రమాణంగా తీసుకున్నప్పటికీ, ఆయన రాతకు భిన్నంగా అనేక చిన్న చిన్న రాళ్ళను పనివాళ్ళ చేత సునాయాసంగా తీయించగలిగాడు.

మరుసటి వేసవిలో టిర్యిన్స్ ను మరోసారి సందర్శించాడు. ఒక బాలుడు తామ్రవర్ణంలో ఉన్న ఒక ఎద్దు మీదికి గెంతుతున్నట్టు ఉన్న ఒక చక్కని కుడ్యచిత్రం, రేఖాగణితనమూనాలో ఉన్న మరో చిత్రం తాలూకు అవశేషాలు, అసంఖ్యాకమైన నీలిరాతి బొంగరం ఆకృతులు, లావా కత్తులు, బాణపు మొనలు కనిపించాయి. అరంగుళం వెడల్పు మాత్రం ఉన్న ఒక బంగారు గొడ్డలి తప్ప మరెంలాంటి బంగారు వస్తువులూ దొరకలేదు.

టిర్యిన్స్ పేరుతో అతను రాసిన పుస్తకం 1886లో ప్రచురితమైంది. ట్రాయ్ పై అతను రాసిన చివరి పుస్తకంలానే ఇది కూడా నిరాశగొలిపింది. తన రాతను తవ్వకాలలో లభించిన వస్తువుల వర్ణనతో సరిపెట్టి, బయటపడిన భారీ కట్టడాల గురించిన చర్చను దార్ఫెల్త్ కు విడిచిపెట్టాడు. ఇక్కడ దొరికిన అనేక మృణ్మయ కలశాలు, ట్రాయ్, మైసీనియాలలో దొరికిన వాటికంటే అభివృద్ధి చెందిన శైలిని సూచిస్తున్నాయి. మెలి తిరిగిన కొమ్ములతో ఉన్న ఒక భారీ  వృషభచిత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసింది. ఇటువంటి వృషభచిత్రాలే ఆ తర్వాత నోసస్ తవ్వకాలలోనూ బయటపడ్డాయి. టిర్యిన్స్ వృషభాన్ని కూడా క్రీటు కళాకారుడే చిత్రించి ఉండడానికీ అవకాశం ఉంది. అయితే, స్లీమన్ కాలానికి గ్రీసు ప్రధానభూభాగంపై క్రీటు సంస్కృతి ప్రభావాన్ని ఎవరూ గమనించలేదు. మైసీనియా, టిర్యిన్స్ గిరిదుర్గాలను ఫినీషియన్లు1 నిర్మించి ఉంటారని స్లీమన్ భావిస్తూ వచ్చాడు. సుదూర పురాచరిత్రకాలంలో గ్రీసు, ఏజియన్ దీవుల్లోకి, అయోనియన్ సముద్రంలోకి ఫినీషియన్లు పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చారనీ;  క్రీ.పూ. 1100 ప్రాంతంలో డోరియన్ 2 ఆక్రమణదారులు తరిమికొట్టేవరకూ ఈ ప్రాంతాలలో వారి ఆధిపత్యం కొనసాగిందనీ పురాచరిత్రనిపుణులు భావించారు.

220px-Charles_George_Gordon_by_Freres

గోర్డాన్

స్లీమన్ గట్టిగా విశ్వసిస్తూ వచ్చిన సిద్ధాంతాలలో వీరయుగం అంతరించిందన్నది ఒకటి. పురాతన గ్రీసు వీరులలోనే వీరత్వం అసాధారణస్థాయిలో నిండి ఉండేదనీ, ఆ తర్వాత అంత ప్రగాఢంగా మరెక్కడా, మరెప్పుడూ అది పరిమళించలేదనీ అతను నమ్మేవాడు. ట్రాయ్, మైసీనియాలు మహితాత్ములు నడయాడిన భూములనీ, అనంతరకాలంలో  ప్రపంచం అల్పజీవులు, అంగుష్టమాత్రుల పాలబడిందని అనుకునేవాడు.3 అయితే అతని దృష్టిలో ఈ కాలంలోనూ కొన్ని మినహాయింపులు లేకపోలేదు. 1881 మార్చిలో నిహిలిస్టుల 4 చేతిలో హతుడైన జార్ చక్రవర్తి అలెగ్జాండర్ –II ను 5 వెనకటి ప్రామాణిక వీరుల తెగకు చెందినవాడిగా భావించేవాడు. అంతకంటే ఉజ్వలోదాహరణగా జనరల్ గోర్డన్ 6 ను స్మరించుకునేవాడు. సూడాన్ లో అతను గడించిన అదృష్టాలను స్లీమన్ ఎంతో ఆసక్తితో గమనిస్తూవచ్చాడు.

స్లీమన్, గోర్డన్ ల మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ మొండి ధైర్యమూ, తమపట్ల తమకు అచంచల విశ్వాసమూ ఉన్నవారే. భూమిలో నిక్షిప్తమైన వస్తువుల పట్ల, విచిత్రంగా ఇద్దరిలోనూ ఒకేవిధమైన ఆసక్తి. హోమర్, పసన్నియస్ లపట్ల తిరుగులేని నమ్మకం ఉన్న స్లీమన్ భూమిలో కప్పడిన ట్రాయ్, మైసీనియా, టిర్యిన్స్ నగరాలను వెలికితీశాడు.  బైబిల్ లోని ఉత్తేజిత వచనాలను ప్రగాఢంగా విశ్వసిస్తూ పవిత్రభూమి(Holy Land) అంతటా సంచరించిన గోర్దన్;  తను గల్గత(Golgota), గిబియన్(Gibeon), గార్డెన్ ఆఫ్ ఈడెన్ ల వాస్తవిక ఉనికిని కనుగొన్నానని నమ్మాడు. ఇద్దరూ తమవైన ఏకాంతదుర్గంలో,  తమను నేరుగా ప్రభావితం చేసిన రచనలను మాత్రమే చదువుతూ గడిపినవారే. ఇద్దరూ ఒకేలా సమకాలీన నాగరికతతో ఇబ్బంది పడుతూ; తమను పురాతనజీవులుగా, తిరిగిరాని గతానికి చెందినవారిగా భావించుకుంటూ తమ తమ స్వాప్నికప్రపంచాలలో జీవించినవారే. భవిష్యత్తు గురించిన ప్రశ్న తలెత్తినప్పుడల్లా గోర్డన్ బైబిల్ అందుకుని ఏదో ఒక పుటను తెరిచి చూసేవాడు. అందులో భవిష్యచిత్రం అతని కళ్ళకు స్పష్టంగా కనిపించేది. సరిగ్గా అలాంటి సందర్భాలలో  స్లీమన్ కూడా హోమర్ ను తెరచి చూసేవాడు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు వాళ్ళిద్దరూ.

స్లీమన్ దృష్టిలో గోర్డన్ తన కాలపు నిజమైన వీరుడు. ఇంకా చెప్పాలంటే, తన కాలపు హెక్టర్. సూడాన్ రాజధాని ఖార్టూమ్ లో గోర్డన్ విడిసి ఉన్నప్పుడు మాదీ(Mahdi) 7గా తనను ప్రకటించుకున్న మహమ్మద్ అహ్మద్ అబ్ద్ అల్లాహ్ (1884-1885) సేనలు అతన్ని ముట్టడించాయి. గోర్డన్ బలగానికి ఆహారం, ఇతర నిత్యావసరాలు అందకుండా చూశాయి. మరోవైపు తుపాకీ మందు తరిగిపోతుంది. తామున్న భవంతి కిటికీలకు ఇసుకబస్తాలతో రక్షణ కల్పించమని గోర్డన్ కు సహచరులు విజ్ఞప్తి చేశారు. గోర్డన్ తిరస్కరించాడు. అందుకుబదులు ఒక కిటికీ వద్ద ఇరవైనాలుగు కొవ్వొత్తులు వెలిగించిన ఒక లాంతరును ఉంచమని ఆదేశించాడు. అప్పుడు అతను అన్నాడు: ”భగవంతుడు భయాన్ని ఒక్కొక్కరికే పంచుతూ వెళ్ళాడు. నా వంతు వచ్చింది. తీరాచూస్తే, నాకు పంచడానికి భయం కాస్త కూడా మిగలలేదు. కనుక గోర్డన్ దేనికీ భయపడడని వెళ్ళి ఖార్టూమ్ ప్రజలకు చెప్పండి.”

మహమ్మద్ అహ్మద్

మహమ్మద్ అహ్మద్

1885 ఫిబ్రవరి 3న మాదీ, అతని సహచరులు గోర్డన్ ఉన్న భవంతిని సమీపించారు. సూర్యోదయానికల్లా అతని సేనలు నగరం మొత్తాన్ని కమ్మేసాయి. గోర్డన్ కరవాలం చేతబూని భవంతి మెట్ల దగ్గర శత్రువుల రాకకు నిరీక్షిస్తూ నిలబడ్డాడు. శత్రువుపై విరుచుకుపడి అద్భుతంగా పోరాడాడు. చివరికి ఆ మెట్ల దగ్గరే, పీనుగుల కుప్ప మధ్య ప్రాణాలు వదిలాడు. అతని తల నరికి ఒక వస్త్రంలో చుట్టి మాదీకి కానుకగా ఇచ్చారు. దానిని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీయమని మాదీ ఆదేశించాడు. ఆ రక్తపంకిలమైన శిరసు చుట్టూ కొన్ని రోజులపాటు రాబందులు తిరిగాయి.

తను ఎథెన్స్ లో ఉంటూనే మధ్యధరాసముద్రానికి ఆవల, ఖార్టూమ్ లో జరుగుతున్న పరిణామాలను స్లీమన్ ఆందోళనతో గమనిస్తూ వచ్చాడు. గోర్డన్ మరణం అతన్ని తీవ్రంగా కుంగదీసింది. జీవించి ఉన్నవారిలో తను అమితంగా అభిమానించి ఆరాధించినది గోర్డన్ నే. అప్పటి ప్రధానమంత్రి గ్లాడ్ స్టన్ చేసిన ఒక అనూహ్యమైన పొరపాటే గోర్డన్ విషాదమరణానికి దారి తీయించిందని రాణి విక్టోరియా సహా యావత్ బ్రిటిష్ ప్రజలూ నమ్మారు. గోర్డన్ కు అండగా సకాలంలో అదనపు బలగాలను పంపడంలో గ్లాడ్ స్టన్ విఫలమయ్యాడని ఆరోపణ.  స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాలో ఉంచాడు.

నోసస్ స్థల యజమానితో బేరం కుదరక ఎథెన్స్ కు తిరిగివచ్చినా క్రీటు తవ్వకాలపై దీర్ఘకాలికప్రణాళికను రచించుకుంటూ, మధ్యలో తిరిగి ట్రాయ్ దారి పడితే ఎలా ఉంటుందని అనుకుంటూ, ఇంకోసారి ఇథకా వెడితే మంచిదా అని భావిస్తూ గడిపాడు. ఇవేవీ కాక, ఓసారి పారిస్ వెళ్ళి తన ఇళ్ల పరిస్థితిని చూసొస్తే బాగుంటుందా అని కూడా అనుకున్నాడు. కానీ ఇవేవీ చేయకుండానే రోజులు దొర్లించాడు. వృద్ధాప్యం, అలసిపోయిన భావన  కమ్ముకుంటున్న కొద్దీ అతను తనలోకి తాను అదృశ్యమైపోతూ వచ్చాడు. రోజంతా, అర్థరాత్రివరకూ హోమర్ పఠనమే. అదొక మత్తుమందుగా మారింది. అదొక్కటే అతన్ని బుద్ధిమాంద్యంలోకి నెట్టకుండా మానసికస్వస్థత కల్పిస్తూవచ్చింది. ఇప్పుడూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు కానీ, దస్తూరీలో వణకు కనిపిస్తోంది. రాను రాను అతని రాతల్లో అఖియన్లను శాపనార్థాలు పెట్టే  ట్రోజన్ వీరుల గొంతు ధ్వనిస్తోంది. కాకపోతే, హోమర్ వీరుల నోట ప్రవహించిన ఆ అద్భుత శాపనార్థాలు ఒక పిరికి ప్రొఫెసర్ ను తలపించే ఈ వ్యక్తి నోట వినిపించడమే ఆసక్తికరం.

అయితే, వృద్ధాప్యం మీదపడుతున్నా స్లీమన్ లో వెరపు మచ్చుకైనా లేదు. తన మహత్తర పరిశోధనలకు ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వకపోయినా, లేదా అరకొరగా గుర్తించినా ఇప్పటికీ ఆగ్రహాన్ని కుమ్మరిస్తూనే ఉన్నాడు. కెప్టెన్ బాటిషర్(Bottischer) అనే అతను హిస్సాలిక్ పై ఒక వ్యాసం రాస్తూ, అది ఒక పెద్ద దహనవాటిక అనీ, బహుశా పర్షియన్లకు చెందిందనీ అన్నాడు. దానిని హాస్యాస్పద సిద్ధాంతంగా పేర్కొని తుత్తునియలు చేయడానికి స్లీమన్ రీముల కొద్దీ కాగితాలు వెచ్చించాడు. చిన్నపాటి విమర్శకు కూడా గాయపడిన సింహంలా గర్జించే అలవాటు అతనికి ఇప్పటికీ పోలేదు. స్లీమన్ ఏదో అంకితం ఇవ్వజూపినప్పుడు మెక్లెమ్బర్గ్ పాలకుడు(Grand Duke) అందుకు స్పందించకపోవడంతో అతను తీవ్రనిరసన రంగరిస్తూ ఒక తంతి పంపించాడు. మంచి పేలుడుమందు దట్టించినట్టు ఉండే తంతులు పంపించడం అతనికి ముందునుంచీ అలవాటే. దాంతో స్లీమన్ గౌరవార్థం మెక్లెంబర్గ్ పాలకుడు ఒక స్వర్ణపతకాన్ని జారీచేసి అతనితో సంధి చేసుకున్నాడు.

మధ్యలో కొన్ని మాసాలపాటు స్లీమన్ పురావస్తుపరిశోధనలను పక్కన పెట్టేసి తిరిగి వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు. తన ఆస్తులు, పెట్టుబడులు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోడానికి ప్రపంచపర్యటన ప్రారంభించాడు. క్యూబాలో తనకు భారీ ఎస్టేట్లు ఉండడంతో హవానా సందర్శించాడు. అలాగే, మాడ్రిడ్, బెర్లిన్ లలో ఉన్న తన ఆస్తుల్ని చూసుకోడానికి ఆ దేశాలకు వెళ్ళాడు. పనిలోపనిగా వెళ్ళిన ప్రతిచోటా  ట్రాయ్ పై తన సిద్ధాంతాలను బలపరచుకుంటూ ఉపన్యాసాలు చేశాడు. తనకున్న ధనబలంతో అనుకున్నదే తడవుగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాడు.

శారీరకంగా అతనిలో మార్పు వస్తోంది. చెవిపోటు రాను రాను దుర్భరంగా మారుతోంది. ఒక్కోసారి పెదవులు బాధతో మెలితిరుగుతున్నాయి. మాట నట్టుతోంది. ఆహారనియమాలను మరింత కచ్చితంగా పాటించవలసివస్తోంది. చీకటితోనే నిద్రలేవడం, సముద్రస్నానం చేయడం, మూడు గుడ్లు, ఒక కప్పు టీ తో ఉదయపు అల్పాహారం, ఆ తర్వాత వార్తాపత్రికలు, స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికలు చదవడం,  ఉత్తరాలు రాయడం; హోమర్ తోపాటు సోఫొక్లీస్ లేదా యురిపిడీస్ ల నుంచి మూడేసి వందల పంక్తులు వల్లించడం(ప్లేటోను చాలా అరుదుగా చదివేవాడు, అరిస్టాటిల్ ను అసలు చదివేవాడు కాదు), ఆతర్వాత మధ్యాహ్నభోజనం, కాసేపు నడక, సాయంత్రంవరకూ పూర్తిగా అధ్యయనం, సాధారణంగా సాయంత్రాలు సందర్శకులతో గడపడం, రాత్రి పదిగంటలకు పడక. ఇదీ అతని నిత్యకృత్యం. రాత్రిళ్ళు తరచు నిద్రపట్టేదికాదు. దాంతో రాత్రంతా చదువుతూనే గడిపేవాడు.

వృద్ధుడవుతున్న కొద్దీ నిద్రలో వచ్చే కలలను పట్టించుకునే చాదస్తం పెరిగింది. వాటిని జాగ్రత్తగా విశ్లేషించేవాడు. సోఫియాకు కలలో కాకులు, చిక్కుడు కాండం, విదేశీ సందర్శకులు కనిపించినట్టు తెలిస్తే విపరీతంగా ఆందోళన చెందేవాడు. 8 పురాతన దేవతల ఆధికారిక వాణిని, స్వప్నవిశేషాలను హోమర్ పదే పదే ఉగ్గడించాడు. స్లీమన్ పై వాటి ప్రభావం ఉంది. వయసు మీరుతున్న ఈ దశలో అతను క్రమంగా బాహ్యప్రపంచం నుంచి ఆంతరికప్రపంచంలోకి జారుకుంటూవచ్చాడు.

శరీరం దుర్బలమవుతోంది. చెవిపోటు నానాటికీ తీవ్రమవుతోంది. యూరప్ శీతగాలులు దుస్సహం అవుతున్నాయి. దాంతో మిగిలిన శీతాకాలాలు దక్షిణాదిన గడపడానికి నిర్ణయించుకున్నాడు. ఈజిప్టు అతన్ని ఆకర్షించింది. మూడు తరాలుగా ఈజిప్టులో తవ్వకాలు జరుపుతున్న ఫ్రెంచి, ఇంగ్లీష్ పురావస్తుశాస్త్రజ్ఞుల నివేదికలను అప్పటికే అతను విస్తారంగా చదివి ఉన్నాడు. అయితే, తనకున్న బుద్ధికుశలత వాళ్ళకు లేదనీ, వాళ్ళ పురావస్తుశాస్త్రపరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే ననీ, తనలా వాళ్ళెవరూ స్వర్ణనిక్షేపాలు కనిపెట్టలేదనీ అనుకున్నాడు.  తనే ఈజిప్టులో కొద్దిపాటి తవ్వకాలను చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు.

 గ్లాడ్ స్టన్

గ్లాడ్ స్టన్

1886 ముగింపునకు వస్తోంది. ఒక్క సహాయకునీ; గ్రీకు, అరబ్బీ పుస్తకాల దొంతరనూ వెంటబెట్టుకుని మూడు మాసాలపాటు నైలు నదిలో తీరుబడిగా ప్రయాణిస్తూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆ కాలానికి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలతో, అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఒక చక్కని దహబియా 9 ను1500 పౌండ్లకు అద్దెకు తీసుకున్నాడు. తీబన్(Theban) 10 శిథిలాలు, టోలెమీ ఆలయాల మీదుగా వెడుతున్నప్పుడు పడవను ఆపించి తీరగ్రామంలోకి వెళ్ళి సంతలో తిరిగేవాడు. గ్రామస్తులతో అరబ్బీలో ముచ్చటించడం అతనికి సంతోషం కలిగించేది. వాళ్ళ ఒంటి మీద ఉన్న పుళ్ళకు చిన్న చిన్న చిట్కా వైద్యాలు సూచించేవాడు. ఒక ఈజిప్టు బాలిక భుజానికి పక్షవాతంతోనూ, వాపుతోనూ బాధపడుతుండడం చూసి; రోజూ రెండుసార్లు నైలు నదిలో స్నానం చేయమనీ, అవిసె గింజలను, కొన్ని రకాల మూలికలను ముద్ద చేసి వేడి వేడిగా భుజానికి పిండికట్టు వేసుకోమని సూచించాడు. ఫలితం ఏమైందో తెలియదు. నల్లని దేహాకాంతితో, శిల్పించినట్టు ఉండే ముఖాలతో కనిపించే న్యూబియన్ల 11 ను ఎంతో ఇష్టపడేవాడు. తనకు ఇంతవరకు తారసపడిన జనాలలో వీరొక్కరే వీరజాతిగా కనిపిస్తున్నారనుకున్నాడు.

వాడీ హల్ఫా(Wadi Halfa)12 వరకూ ప్రయాణించాలన్నది అతని సంకల్పం. మధ్యలో క్లియోపాట్రా గురించిన ఆలోచనలు చేశాడు. నైలు నది లోతును, మేఘాల కూర్పును అధ్యయనం చేశాడు. బాగా ఎత్తున ఏర్పడిన మేఘాలను బట్టి మరుసటి రోజు వాతావరణాన్ని అంచనా వేసేవాడు. ప్రయాణాల్లో ప్రతిసారీ చేస్తున్నట్టే, రోజువారీ ఉష్ణోగ్రతలను నమోదు చేశాడు. అక్కడక్కడ కనిపించిన శాసనాల నకలు రాసుకున్నాడు. పడవ కప్పు మీద అస్థిమితంగా పచార్లు చేసేవాడు కానీ అతనిలో ఒక విచిత్రమైన నెమ్మది ఏర్పడింది. హోమర్ ను చదువుతున్నప్పుడు మాత్రం ఎందులోనూ పొందనంత ఆనందం అతనిలో పురివిప్పి నర్తించేది.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ఫినీషియన్లు: ఋగ్వేదంలో పేర్కొన్న ‘పణు’లే ఫినీషియన్లు అని కోశాంబీ అంటారు. ఫినీషియన్లు సముద్రయానంలో నిపుణులైన ప్రాచీనకాలపు వర్తకులు. వీరికి సంబంధించిన మరికొన్ని విశేషాలను నేను ‘పురా’గమనం శీర్షిక కింద రాసిన ఈ వ్యాసాలలో చూడవచ్చు. 1. దేవతల కుక్క(18-09-2014) 2. ప్రపంచచరిత్రలో మనం(24-09-20140 3. పర్షియన్ రాముడు-గ్రీకు హనుమంతుడు (02-10-2014) 4. చరిత్రలో ఒక అద్భుతం (13-11-2014)
  2. డోరియన్లు: నాలుగు పురాతన గ్రీకు తెగలలో ఒకరు. మిగిలిన మూడూ: అయోలియన్లు, అఖియన్లు, అయోనియన్లు.
  3. విచిత్రంగా మహాభారతం కూడా గొప్ప వీరులైన క్షత్రియజాతి అంతరించిపోవడం గురించీ, ‘అల్ప’జీవులు ప్రాబల్యంలోకి రావడం గురించీ చెబుతుంది. ఒకానొక కాలంలో ప్రపంచంలో పలుచోట్ల జరిగిన పరిణామాల సాదృశ్యాన్ని పరిశీలించిన పురాచరిత్రకారులు, వాటిని ‘వీరయుగం’ కింద వర్గీకరించారు. నేను గమనించినంతవరకు మహాభారతాన్ని ఈ వీరయుగ కోణం నుంచి ఎవరూ పరిశీలించినట్టులేదు. నా ‘పురా’గమన వ్యాసాలు కొన్నింటిలో ఈ కోణాన్ని కొంతవరకు స్పృశించాను.
  4. నిహిలిస్టులు: నిహిలిజాన్ని బోధించేవారు నిహిలిస్టులు. అన్ని రకాల విలువలను, నైతికతను వీరు వ్యతిరేకిస్తారు. Nihil అనే లాటిన్ మాటనుంచి nihilism పుట్టింది. ఫ్రెడరిక్ హెన్రీ జాకొబీ(1743-1819)అనే జర్మన్ తాత్వికుడు ఈ మాటను కల్పించాడు. జోసెఫ్ వాన్ గారెస్ (1776-1848) అనే జర్మన్ పాత్రికేయుడు ఈ మాటను మొదటిసారి రాజకీయార్థంలో వాడాడు. రష్యన్ రచయిత తుర్గేనివ్  (1818-1883) తన ‘ఫాదర్స్ అండ్ చిల్రన్’ అనే నవలలో nigilizm అనే రష్యన్ రూపాన్ని వాడి ఆ మాటను తనే రూపొందించానన్నాడు. 1860-1917 మధ్యకాలంలో రష్యాలో సాగిన విప్లవ అరాచకత్వాన్ని ఈ మాటతో సంకేతించారు. Online Etymology Dictionary, © 2010 Douglas Harper
  5. అలెగ్జాండర్ –II(1818-1881): రష్యా చక్రవర్తి(జార్). 1855లో పట్టాభిషిక్తుడయ్యాడు. పోలండ్ కు రాజుగానూ, ఫిన్ లాండ్ కు గ్రాండ్ డ్యూక్ గానూ కూడా ఉన్నాడు. 1881లో నిహిలిస్టుల చేతిలో హతుడయ్యాడు.

 

  1. చార్లెస్ జార్జి గోర్డన్(1833-1885): బ్రిటిష్ సైనికాధికారి. చైనా, సూడాన్ లలో విధులు నిర్వహించాడు.
  2. మాదీ(Mahdi): ఇస్లాం పరిరక్షణకు, స్థాపనకు కత్తి పట్టి ఉద్యమించిన వీరుని సూచించే పేరు. చరిత్రలో పలువురు తమను ‘మాదీ’గా ప్రకటించుకున్నారు.
  3. స్వప్నాలవల్ల మంచి గానీ, చెడుగానీ జరుగుతుందన్న విశ్వాసం మనలోనూ ఉంది. రామాయణంలో ‘త్రిజటా స్వప్నం’ లాంటి ఉదాహరణలు ఉన్నాయి.
  4. దహబియా: నైలు నదిలో తిరిగే పడవలను ఈ పేరుతో పిలుస్తారు.
  5. తీబన్(Theban): ఈజిప్టులోని పురాతన నగరం తీబ్స్(Thebes) కు చెందిన పౌరుడు తీబన్.
  6. న్యూబియన్లు: ఈజిప్టుకు దక్షిణంగానూ, నేటి సూడాన్ ఉత్తరప్రాంతంలోనూ ఉన్న న్యుబియా అనే ప్రాంతానికి చెందినవారు.
  7. వాడీ హల్ఫా(Wadi Halfa): సూడాన్ ఉత్తరప్రాంతంలో ఉన్న ఒక నగరం.

  

 

 

 

 

 

 

 

 

 

కీర్తి శిఖరాగ్రంపై స్లీమన్

 

స్లీమన్ కథ-32

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ట్రాయ్ నిక్షేపాలను జర్మనీకి అప్పగించడానికి స్లీమన్ ఆమోదం తెలిపిన తర్వాత, విర్కో వెంటనే రంగంలోకి దిగాడు. సంబంధితులు అందరితో మాట్లాడాడు. చివరగా జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ తో మాట్లాడినప్పుడు ఆయన ఎంతో ఉత్సాహం చూపించాడు. ఆ నిక్షేపాలను బెర్లిన్ లో శాశ్వత ప్రదర్శనకు ఉంచడంకోసం ఏమైనా చేయడానికి సంసిద్ధత చూపిన బిస్మార్క్, ఇంతకీ స్లీమన్ ఎటువంటి గౌరవసత్కారాలను ఆశిస్తున్నారని అడిగాడు. అత్యున్నత వర్గాలనుంచి గుర్తింపును మాత్రమే స్లీమన్ కోరుకుంటున్నారని అప్పటికి సమాధానం చెప్పిన విర్కో, ఆ తర్వాత స్లీమన్ ను సంప్రదించాడు.  కైజర్(జర్మన్ చక్రవర్తి)నుంచి ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని; సైనిక, పౌర ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారా(Pour le merite)న్ని, బెర్లిన్ గౌరవపౌరసత్వాన్ని, ప్రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యత్వాన్ని తను కోరుకుంటున్నాననీ; నిక్షేపాలను ఉంచే ప్రదర్శనశాలకు శాశ్వతంగా తన పేరు పెట్టాలనీ చెప్పిన స్లీమన్; బిరుదు కూడా ఇస్తే సంతోషమే కానీ దానికోసం పట్టుబట్టబోనని అన్నాడు. ఒక్క Pour le merite మినహా మిగిలినవన్నీ నెరవేరేలా విర్కో ఒంటిచేత్తో కృషిచేశాడు. సోఫియాకు మాత్రం ఈ ఏర్పాటు నచ్చలేదు. ట్రాయ్ నిక్షేపాలు గ్రీస్ కు చెందాలని ఆమె ఆశిస్తోంది. కానీ అప్పటికే నిర్ణయం తీసేసుకున్న భర్తకు ఎదురుచెప్పలేకపోయింది. కైజర్ స్వహస్తాలతో రాసిన ప్రశంసాపత్రంలో తన పేరు కూడా చేర్చడం చూసి సంతృప్తి చెందింది.

అంతవరకూ లండన్ లో ప్రదర్శనకు ఉంచిన నిక్షేపాలను ఎట్టకేలకు 1880 డిసెంబర్ లో బెర్లిన్ కు తరలించారు. ఆరునెలల తర్వాత, 1881 జులై 7న, ఆ నిక్షేపాలను జర్మనీకి లాంఛనంగా అప్పగించి స్లీమన్ బెర్లిన్ లో రాజసత్కారాన్ని అందుకున్నాడు. వోల్కకుండా మ్యూజియంలోని ఒక విభాగంలో వాటిని ఉంచి ద్వారబంధం పైన స్లీమన్ పేరును స్వర్ణాక్షరాలతో లిఖించారు. అప్పటికి యువరాజుగా ఉండి, ఆ తర్వాత కైజర్ పదవిని అధిష్ఠించిన విల్హెమ్-II  స్వయంగా సోఫియాను విందుకు తోడ్కొనివెళ్ళాడు. అప్పటికామె వయసు 28 ఏళ్ళు, స్లీమన్ మరో ఆరునెలలకు 60వ ఏట అడుగుపెట్టబోతున్నాడు.

ఆ రోజున స్లీమన్ ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరింది. చక్రవర్తి, మహారాజ్ఞి, యువరాజులు, యువరాణులు, మొత్తం రాజాస్థానం అతన్ని ఘనంగా ప్రస్తుతించింది. వీటన్నటికన్నా బెర్లిన్ గౌరవపౌరసత్వాన్నే అత్యున్నత సత్కారంగా స్లీమన్ భావించాడు. అంతవరకూ అలాంటి గౌరవం ఇద్దరికే లభించింది: ఒకరు బిస్మార్క్, ఇంకొకరు ఫీల్డ్ మార్షల్ కౌంట్ హెల్మత్ వాన్ మోత్కా. జర్మనీ పునరుజ్జీవనానికి వీరిద్దరూ బాధ్యులు. ఒక అనామక చర్చిలో కిటికీకి అతుక్కుపోయి బాహ్య పౌరాణిక ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో చూసి పరవశించిన  బాలుడు, ఇప్పుడు ఆ పౌరాణిక ప్రపంచం సజీవం కావడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అత్యంత పురాతన రాజులనే కాదు, నేటి సజీవులైన రాజులను కూడా తన వద్దకు రప్పించుకున్నాడు. ఒకసారి తన జీవితాన్ని వెనుదిరిగి చూసుకుంటూ, తను చేసిన వీరోచిత కార్యాలను, ఇతర సాఫల్యాలను తలచుకుని అతను అమితమైన సంతృప్తిని చెందాడు.

ట్రాయ్ నిక్షేపాలు రెండో ప్రపంచయుద్ధం చివరివరకూ బెర్లిన్ లోనే ఉన్నాయి. యుద్ధం మొదలైన తర్వాత బెర్లిన్ జంతుప్రదర్శనశాలలో లోతుగా తవ్విన ఒక రహస్య కందకంలో వాటిని భద్రపరిచారు. 1945 వసంతంలో అవి రష్యన్ సేనల కంటబడ్డాయి. వాటిని వారు రష్యాకు తరలించారు.1

ట్రాయ్ అతన్ని వెంటాడుతూనే ఉంది. తను చనిపోయేలోగా ట్రోజన్ రాజుల సమాధులను బయటపెట్టాలనుకున్నాడు. ట్రాయ్ కి చెందిన అన్ని నగరాల సవివర రేఖాపటాలను తయారుచేసుకున్నాడు. 1882 మార్చి 1న హిస్సాలిక్ దిబ్బ మీద తొమ్మిదో సారి తవ్వకాలు ప్రారంభించాడు. మొదటిసారి తవ్వకాలకూ, ఇప్పటికీ మధ్య పద్నాలుగేళ్ల కాలం దొర్లినా అతనిలో వెనకటి ఉత్సాహం అలాగే ఉంది. తలనొప్పి, చెవినొప్పి తగ్గాయి. అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఏమిటంటే, అప్పట్లో చాలావరకూ ప్రాథమిక పరికరాల మీద ఆధారపడ్డాడు. ఆహారపదార్థాలు, ఇతర నిత్యావసరాల సరఫరా తగినంత ఉండేదికాదు. కానీ ఈసారి అతనికి మహారాజపోషణ లభించింది. లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారాన్ని కానుకగా పంపించింది. వాటిలో చికాగో గొడ్డుమాంసం, నిలవ పండ్లు, ఇంగ్లీష్ చీజు, ఎద్దు నాలుక మొదలైనవి ఉన్నాయి. ఒకవిధమైన తృణధాన్యంతో చేసిన 240 సీసాల బీరు(pale ale) కూడా పంపించింది. అన్ని సీసాలనూ అయిదుమాసాలలో స్లీమన్ ఒక్కడే ఖాళీ చేసేశాడు. “నేను ముప్పై ఏళ్లుగా మలబద్ధకంతో బాధపడుతున్నాను. ఈ బీరు (pale ale) నాకు ఎంతో ఉపశమనం ఇచ్చింది. ఈ సమస్యకు ఇంతకు మించిన దివ్యౌషధం లేదు” అని ప్రకటించాడు.

ఈసారి యువపురావస్తు శాస్త్రవేత్త, సమర్థుడు విల్హెమ్ దార్ఫెల్త్ సహాయకుడిగా ఉన్నాడు. టర్కీ ప్రభుత్వం నుంచి తలనొప్పులు మాత్రం తప్పలేదు. విద్యామంత్రిత్వశాఖకు చెందిన బేదర్ ఎదీన్ ఎఫెన్డీని పర్యవేక్షకుడిగా పంపింది. షరా మామూలుగా అతని ఆంక్షలు, అభ్యంతరాలు స్లీమన్ సహనాన్ని పరీక్షిస్తూనే వచ్చాయి. అతని నిత్యకృత్యాలకు వస్తే, మొదటిసారికీ, ఇప్పటికీ వాటిలో కూడా ఎలాంటి మార్పూ లేదు.  సూర్యోదయానికి ముందే లేచి గుర్రం మీద సముద్రస్నానానికి హేల్స్ ఫాంట్ కు వెళ్ళేవాడు. ముగ్గురు సాయుధ అంగరక్షకులు అతని వెంట ఉండేవారు. ఎండనుంచి రక్షణకోసం, బాగా పాతబడిన అదే శిరస్త్రాణాన్ని, పెద్ద పెద్ద కళ్ళద్దాలను, భారీ కోటును ధరించి ఇప్పటికీ రోజుకు 150 మందితో పని చేయిస్తున్నాడు. కోటు జేబులోంచి ఎర్రటి సిల్కు రుమాలు వేలాడుతూ ఉండేది.  ఇప్పటికీ నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే ఆ గ్రీకుజాతీయుడే వేతనాల చెల్లింపుతో సహా అతని పనులన్నీ చక్కబెడుతున్నాడు. అతనే స్టోర్ కీపర్ గా కూడా ఉంటూ పనివాళ్ళకు రొట్టె, పొగాకు, బ్రాందీ వగైరాలను అధికధరలకు అమ్మి బాగా సొమ్ము చేసుకునేవాడు.

జూన్ వచ్చేసరికి మిడతల దండు దాడి చేయడం ప్రారంభించింది. దానికితోడు ఎదీన్ ఎఫెన్డీ నసా పెరిగిపోయింది. సహనం పూర్తిగా నశించిన స్లీమన్ టర్కీ ప్రభుత్వంనుంచి తనకు రక్షణ కల్పించవలసిందని కోరుతూ బిస్మార్క్ కు అత్యవసర తంతి పంపించాడు. కానీ ఆవైపునుంచి ఉలుకూపలుకూ లేదు. తవ్వకాలను చూద్దామంటే, ఏవో చిన్నచిన్న కంచు, రాగి సామగ్రి తప్ప విశేషంగా చెప్పదగినవేవీ బయటపడలేదు. దాంతో తవ్వకాలు ఆపేయాలని జులై చివరిలో స్లీమన్ నిర్ణయం తీసుకున్నాడు.

మరుసటి సంవత్సరం Troja అనే పేరుతో ట్రాయ్ తవ్వకాలమీద తన మూడో పుస్తకం తీసుకొచ్చాడు. అతని పుస్తకాలన్నిటిలో అదే పేలవం. పెద్దగా కలసిరాని 1881-82 తవ్వకాల వివరాలు తప్ప అందులో ఏమీలేదు. కాకపోతే అప్పటివరకూ జరిపిన  ట్రాయ్ తవ్వకాల సమాచారం మొత్తాన్నిఅందులో పొందుపరిచాడు. మరికొన్ని పురాతన ప్రదేశాలలో కూడా తవ్వకాలు జరిపించాలన్న ఆలోచన అప్పటికి చాలా కాలంగా చేస్తూనే వచ్చాడు. తను నౌకా ప్రమాదాన్ని ఎదుర్కొన్న తేరా(Thera)2, సముద్రపు నురగనుంచి అఫ్రోడైట్ పైకి వచ్చినట్టు చెప్పే సితేరా(Cythera)3, తూసడడీస్(Thucydides)4 వర్ణించిన గొప్ప యుద్ధస్థలి అయిన పెలపనీసస్(Peloponnesus)కు పశ్చిమతీరంలోని పీలోస్(Pylos) వాటిలో ఉన్నాయి.

the-peloponnesian-war-syracuse-naval-battle

ఒక అదృష్టక్షణంలో అతని దృష్టి క్రీటు(Crete)ద్వీపం వైపు కూడా మళ్ళింది. అది అప్పటికింకా టర్కీ ఆధిపత్యంలోనే ఉంది. 1878లో, మినోస్5 కలొకైరినోస్  అనే పౌరాణికనామం కలిగిన కాండియా6 వర్తకుడు, కెఫలా త్సెలంపే అనే కొండ మీద కొద్దిపాటి తవ్వకాలు జరిపించాడు. ఆ కొండ ఉన్న చోటే క్రీటు పురాతన రాజధాని నోసస్ ఉండేదని చెబుతారు. అయితే, అప్పటికి పురావస్తుశాస్త్రజ్ఞుల దృష్టి గ్రీసు ప్రధానభూభాగం మీద ఉన్నంతగా  క్రీటుమీదలేదు. మినోస్ కలొకైరినోస్ జరిపిన తవ్వకాల వివరాలు తెలుసుకున్న స్లీమన్, అక్కడ గొప్ప పురావస్తుసంపద బయటపడవచ్చన్న నిర్ణయానికి వచ్చాడు. దార్ఫెల్త్ కూడా ఆ అభిప్రాయాన్ని బలపరిచాడు. ఇద్దరూ కలసి 1886లో నోసస్ ను సందర్శించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ దిబ్బ ఒక టర్కు యాజమాన్యంలో ఉంది. అతని అంగీకారం తీసుకునే షరతు మీద తవ్వకాలు జరపడానికి ఆ దీవి గవర్నర్ నుంచి ఫర్మానా సంపాదించిన స్లీమన్, బేరసారాలు మొదలుపెట్టాడు. అది సుదీర్ఘంగా సాగింది. ఆ యజమాని కూడా వ్యాపారపు మెళకువలలో స్లీమన్ కు సాటివచ్చేవాడే. 5వేల పౌండ్లకు కొంచెమైనా తగ్గేదిలేదని అతను కరాఖండిగా చెప్పాడు. అది చాలా ఎక్కువ అనుకున్న స్లీమన్ మండిపడ్డాడు. ఏదోవిధంగా దారికి వస్తాడులే అనుకున్న స్లీమన్ ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కానీ అది సానుకూలం కాలేదు.

ఆ తర్వాత చాలా ఏళ్ళకు నోసస్ వద్ద తవ్వకాలు జరిపి ఆర్ధర్ ఎవాన్స్7 ఎన్నో గొప్ప విశేషాలను బయటపెట్టాడు. స్లీమన్ అప్పుడే కనుక ఆ పని చేసి ఉంటే ఎవాన్స్ కు దక్కిన ప్రతిష్ట అతనికే దక్కి ఉండేది.

తనకు ఆసక్తి గొలిపే పురాతనప్రదేశాలు అనేకం ఉండడంతో అతను మొదటిసారి తన జీవితచరమాంకంలో  సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. చివరికి, తనకు కూతవేటు దూరంలో, ఎథెన్స్ కు దగ్గరలో ఉన్న మారథాన్ 8లో తవ్వకాలు జరపడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉన్న ఒక చిన్నపాటి దిబ్బ పురాతనప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. గ్రీకులకు, పర్షియన్లకు(క్రీ.పూ. 499-449) జరిగిన యుద్ధాలలో మరణించిన 192 మంది ఎథెన్స్ సైనికులను అక్కడ పూడ్చిపెట్టారని సాంప్రదాయిక విశ్వాసం. పసన్నియస్ రాతలు కూడా అందుకు సాక్ష్యామిస్తున్నాయి. 1884 ఫిబ్రవరిలో తవ్వకాలకు అనుమతి సంపాదించుకున్నాడు.  ఆ దిబ్బకు అడ్డంగా ఒక కందకం తవ్వించాడు. అయితే, ఆ తవ్వకాలు కొన్ని రోజుల్లోనే ముగిశాయి. ఎథెన్స్ సైనికుల అవశేషాలేవీ కనిపించలేదు. బల్లేలూ, కత్తులూ, శిరస్త్రాణాలూ, వక్షస్త్రాణాలవంటి యుద్ధసామగ్రి అయినా కనిపిస్తుందని అతను ఆశపడ్డాడు. కానీ అదీ నెరవేరలేదు. పర్షియన్లు గ్రీకు గడ్డ మీద అడుగుపెట్టడానికి ముందే ఆ దిబ్బ మీద జనం నివసించేవారనడానికి సాక్ష్యంగా కొన్ని కుండపెంకులు మాత్రం దొరికాయి.

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

ఇక టిర్యిన్స్ (Tiryns) మిగిలింది. ఆర్గోస్ మైదానంలో ఉన్న గొప్ప దుర్గం అది. మొదటిసారి గ్రీసు వెళ్లినప్పుడు స్లీమన్ దానిని సందర్శించాడు.  మైసీనియా తవ్వకాలకు ముందు ఇక్కడ కొద్దిపాటి తవ్వకాలు జరిపించి ఆపేశాడు. మైసీనియా కన్నా టిర్యిన్స్ పురాతనం. గ్రీకు పురాణాల ప్రకారం, హెర్క్యులెస్ అక్కడే జన్మించాడు. కనకవర్షం రూపంలో జియస్ ఈ నగరాన్ని సందర్శించాడు. దానై ద్వారా ఒక కూతురును కని ఆమెనొక బురుజులో బంధించాడు. ఆమె ద్వారా అతనికి పెర్సియస్ అనే కొడుకు పుట్టాడు. ఆర్గోస్ కు చెందిన ఈ వీరుడే మెడూసా తల నరికాడు. ప్రాచీన గ్రీకులు కూడా టిర్యిన్స్ ను భయభక్తులతో చూశారు. “మనకు టిర్యిన్స్ ఉండగా అంతదూరం వెళ్ళి పిరమిడ్ల(ఈజిప్టు)ను సందర్శించే శ్రమ దేనికి?” అని పసన్నియస్ రాశాడు.

స్లీమన్ 1884 మార్చి 14న నాప్లియో చేరుకున్నాడు. విల్హెమ్ దార్ఫెల్త్ అతని వెంట ఉన్నాడు. ఈసారి ఎక్కువ పనిభారాన్ని అతనే మోశాడు. ఇప్పుడు కూడా లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారపదార్థాలను, ఇతర నిత్యావసర సామగ్రిని కానుకగా పంపింది. స్లీమన్ 70 మందిని పనిలోకి తీసుకున్నాడు. 40 ఇంగ్లీష్ తోపుడు బళ్ళను, 20 భారీ గునపాలను, 25 భారీ గొడ్డళ్లను, 50 చిన్నపాటి గొడ్డళ్లను బరిలోకి దింపాడు.  ఈసారి, ఇంతకు ముందెప్పుడూ  లేనంత శాస్త్రీయప్రణాళికతో అతను తవ్వకాలకు సిద్ధమయ్యాడు. అతనూ, దార్ఫెల్త్ బాధ్యతలను పంచుకున్నారు. ఎక్కడ గోడలను కూల్చాలో, ఎక్కడ తవ్వకాలు జరపాలో సూచించడం స్లీమన్ బాధ్యత. పనులను పర్యవేక్షించడం; ఇంజనీర్ ను, రేఖాపటాల నిపుణుని, ప్రధాన కాంట్రాక్టర్ ను సంప్రదించడం దార్ఫెల్త్ బాధ్యత. అంటే,  స్లీమన్ పురావస్తువులకు, నిక్షేపాలకు బాధ్యత వహిస్తే; దార్ఫెల్త్ పురాతన కట్టడాలకు బాధ్యత వహించాడన్నమాట.

                                                      (సశేషం)

 

 

***

అథోజ్ఞాపికలు

  • In fact, the treasure had been secretly removed to theSoviet Union by the Red Army. During the Cold War, the government of the Soviet Union denied any knowledge of the fate of Priam’s Treasure. However, in September 1993 the treasure turned up at the Pushkin Museum in Moscow.[4][5] The return of items taken from museums has been arranged in a treaty with Germany[6] but, as of January 2010, is being blocked by museum directors in Russia.[6] They are keeping the looted art, they say, as compensation for the destruction of Russian cities and looting of Russian museums by Nazi Germany in World War II. A 1998 Russian law, the Federal Law on Cultural Valuables Displaced to the USSR as a Result of the Second World War and Located on the Territory of the Russian Federation, legalizes the looting in Germany as compensation and prevents Russian authorities from proceeding to restitutions.         (వికీపీడియా సమాచారం)
  • తేరా: గ్రీకు పురాతన నగరం. ఏజియన్ సముద్రంలో శాంటొరీన్ అనే దీవిలో ఉంది.
  • సీతేరా: గ్రీసులోని ఒక దీవి. గ్రీకు దేవత అఫ్రోడైట్ సముద్రపు నురగ నుంచి అవతరించిందని గ్రీకు పురాణాలు చెప్పడం ఆసక్తికరం. అఫ్రోడైట్ సుఖసంతోషాలను ప్రసాదించే సౌభాగ్యదేవత. మన పురాణాల ప్రకారం సిరిసంపదలను ఇచ్చే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలో ఉద్భవిస్తుంది.
  • తూసడడీస్(క్రీ.పూ. 460-395): గ్రీకు చరిత్రకారుడు, సైన్యాధికారి. క్రీ.పూ. 5వ శతాబ్దంలో స్పార్టా, ఎథెన్స్ ల మధ్య జరిగిన పెలపనీసస్ యుద్ధసమాచారాన్ని గ్రంథస్థం చేశాడు.
  • మినోస్: పురాతన క్రీటును పాలించిన తొలిరాజు ఇతనేనని గ్రీకు పురాణాలు చెబుతాయి. తూసడడీస్ ప్రకారం, ఇతను ట్రోజన్ యుద్ధానికి మూడు తరాల వెనకటివాడు. ఏజియన్ సముద్రంపై ఆధిపత్యం నెరిపిన మినోస్ నౌకానిర్మాణం ఎరిగినవాడనీ, నౌకాయానం చేశాడనీ, క్రీటు రాజ్యాంగాన్నీ, ధర్మశాస్త్రాన్నీ నిర్దేశించాడనీ అంటారు. విశేషమేమిటంటే మినోస్ కు, మన పురాణాలలోని మనువుకు నామసామ్యమే కాక, నౌకానిర్మాణం, ధర్మశాస్త్రనిర్దేశం వగైరాలలో కూడా పోలికలు ఉన్నాయి. రాంభట్ల కృష్ణమూర్తిగారి పుస్తకాలలో మినోస్-మనువుల పోలికల గురించి మరికొన్ని వివరాలు చూడవచ్చు.
  • కాండియా: క్రీ.శ. 1205-1212 మధ్యకాలంలో క్రీటు ద్వీపం ఇటలీ ఏలుబడిలో ఉన్నప్పుడు దాని అధికారనామం.
  • ఆర్థర్ ఎవాన్స్(1851-1941): ప్రముఖ బ్రిటిష్ పురావస్తునిపుణుడు. కంచుయుగానికి చెందిన ఏజియన్ నాగరికతను బాగా అధ్యయనం చేసినవాడు.
  • మారథాన్: ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువదూరం పరుగు పోటీకి ఈ మాట పర్యాయపదంగా మారిన సంగతి తెలిసినదే. దాని పూర్వచరిత్రను నా ‘పురా’గమన వ్యాసాలలో ‘పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు’ అనే వ్యాసం(అక్టోబర్ 2, 2014)లో ఇచ్చాను. చూడగలరు.

 

 

ఇలియడ్ చెప్పిందీ ‘కలికాలం’ గురించే!

 

స్లీమన్ కథ-31

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అనేక గొప్ప ఇతిహాసాలలానే ఇలియడ్ కూడా ఒక దుష్టకాలంలో, వీరోచితంగా ఎదుర్కొన్న ఒకానొక ఓటమి గురించి చెబుతుంది. ఉత్తములు నాశనమవుతారు, చెడు వర్ధిల్లుతుంది.1 అయితే దేవతల తీర్పు వ్యక్తులు చేసిన మంచి పనులపైనో, చెడ్డ పనులపైనో ఆధారపడి ఉండదు. మనిషి భవితవ్యంతో వారికి నిమిత్తం లేదు. అంతిమంగా దేవతలు మనిషిలోని పచ్చి తెగింపునకే ప్రాధాన్యం ఇస్తారు. తమను కూడా ధిక్కరించి ప్రమాదభూయిష్ఠమార్గంలో మనిషి ఎంత ధైర్యంగా, ఎంత హుందాగా అడుగువేశాడన్నదే చూస్తారు. ఆ ధైర్యమూ, ధిక్కారమే మనిషిలోని ఉన్నతోన్నత సుగుణం. మనిషిని దేవుడితో సమానం చేసేది అదే. అదే సమయంలో, అతనిలోని మార్దవం అతన్ని మానవీకరిస్తుంది.

అపార ధైర్యసాహసాలు, మానవీయత అనే ఈ రెండుప్రపంచాల మధ్య హోమర్ అనాయాసంగా సంచరించాడు.     అప్పటికింకా మనిషి అమాయకతనూ, నరాలలో స్వచ్ఛంగా జ్వలించే అగ్నినీ నింపుకున్నప్పటి ప్రపంచాన్ని తన కృతుల్లో ప్రతిఫలించాడు. అపరాధభావనతోనూ, నిరంతరాయమైన విషాద పునరావృతితోనూ భయభీతుడు కావడం నాటి మనిషికి తెలియదు.  నాలుగు దిక్కుల నడవలో సహజమైన ఇంద్రియస్పందనలతో  సరళజీవితం గడిపిన ఫ్రాక్చరిత్ర కాలపు జీవి అతను. ముదిమి పైబడిన దశలో, తనకు రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన ఘటనలను హోమర్ చిత్రించాడు. పారంపరికంగా అందుతూ వచ్చిన కథలకు తన యవ్వనస్మృతులను మేళవిస్తూ; ఆయా పాత్రలను ఉన్నదానికంటే ఎక్కువ ఉజ్వలంగానూ, ఆకర్షకంగానూ అతను చిత్రించి ఉండవచ్చు.

అయితే, అతనిలో ఒక వృద్ధుడిలోని సహజమైన శాంతీ, స్వచ్ఛతా ద్యోతకమవుతాయి. గతించిన యవ్వనకాలపు జవసత్వాలపై  ఒక వృద్ధుడికి ఉండే మమకారం ఉట్టిపడుతుంది. తన ఒడిస్సే చివరి అధ్యాయంలో చిత్రించిన మారణకాండలాంటిది అతనికి స్వయంగా తెలుసు. ఆ కృతిలో, ఒడీసియెస్ అర్థాంగి పెనలోపి పునస్వయంవరానికి వచ్చిన రాజులను నరికి పోగులు పెడతారు. పనికత్తెలను ఉరితీస్తారు. తన రోజుల్లో ఒక యువసామంతరాజును చంపి, రక్తం ఓడుతున్న మృతదేహాన్ని ఒక రథానికి కట్టి శిథిల నగర ప్రాకారాల చుట్టూ ఈడ్చుకు వెళ్ళిన ఘటన అతనికి తెలుసు. తను రాజుల గుడారంలో కూర్చుని ఉండగా, యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకోవడం తెలుసు.  ఊరూరా తిరుగుతూ తంత్రీవాద్యాన్ని మోగిస్తూ, ఇలాంటి అనేక అనుభవాల మేళవింపుతో కథలు చెప్పుకుంటూ వెళ్లాడాయన. ఆ తర్వాత ఆయన శిష్యులు ఈ కథలను గానం చేశారు. అనంతరకాలంలో ఇవి గ్రంథస్థమయ్యాయి.2

ఎన్నో తరాలు గడిచిపోయాయి; అయినా ఈ కథలు పెద్దగా మారింది లేదు. కథన దాహార్తి తీరని ఆ గొంతు మూగవోయింది లేదు. ఆ గొంతు ఎంత శక్తిమంతమూ, ఎంత అనర్గళమూ అంటే; ఒకానొక నాగరికత మొత్తానికి అది ఆకృతినిచ్చి, రంగులద్ది తనతో మోసుకెళ్లింది. ఆ తర్వాత అలాంటిది మరెప్పుడూ జరగలేదు. హోమర్ చిత్రించిన ఆ నాగరికత సుసంపన్నమైనది, సుసుందరమైనది, ఇంద్రియస్పందనలను ఎంతో ఉదాత్తంగా వ్యక్తీకరించినది. ఇంకా అది ఎలాంటిదంటే, ఒక స్వాప్నిక అంశను ధరించినదిగా దానిని జనం విశ్వసిస్తూ వచ్చారు. అయితే, స్లీమన్ దానిని మెలకువలో స్వప్నంగా నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. 3

***

ఇన్నేళ్లలోనూ అతనిలో పెద్ద మార్పేమీ లేదు, అదే మంకుతనం, అవే అలవాట్లు. తన జీవితం పొడవునా పుంఖాను పుంఖంగా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు, గ్రంథరచన చేస్తూనే ఉన్నాడు. తనెంత సంపన్నుడు, ప్రసిద్ధుడు అయినా తన రాతకోతలకోసం సహాయకుని నియమించుకోలేదు. ఆ అవసరం అతనికి కనిపించలేదు.  మధ్య మధ్య ఒక భాషలోంచి ఇంకో భాషలోకి దూకుతూ తన ఉత్తరాలు తనే రాసుకునేవాడు,

అతని సంపద పెరుగుతూనే వచ్చింది. స్టాక్ మార్కెట్ మీదా; పారిస్, బెర్లిన్, ఎథెన్స్ లలోని తన నివాసాల పైనా ఎప్పుడూ ఒక చూపు ఉంచేవాడు. తను కిరాయికి ఇచ్చిన ఇళ్ళలో ఏ ఒక్కటైనా ఖాళీగా ఉంటే, అందుకు రెండు నిద్రలేని రాత్రుళ్ళను మూల్యంగా చెల్లించేవాణ్ణని చెప్పుకున్నాడు. అలాగని మనిషిలో అసలే మార్పు లేదనీ చెప్పలేం. ఇంతకుముందు దుస్తులపై పెద్ద శ్రద్ధపెట్టేవాడు కాదు, ఇప్పుడు దుస్తులపైనా, టోపీల పైనా  కాస్త అభిరుచిని చూపిస్తున్నాడు.  కోటు జేబులోంచి ఒక ఎర్రటి సిల్కు జేబురుమాలు వేలాడదీసే అలవాటు ఒకటి అతనికి కొత్తగా వచ్చింది. నలుగురిలో ఉన్నప్పుడు సాధారణంగా నిశ్శబ్దం పాటించేవాడు, చాలా అరుదుగా నోరువిప్పేవాడు. తన తవ్వకాలపై చర్చలు అతనికి ఇష్టముండేవి కావు. అడుగు బడుగు జనాలపై ఆదరణ చూపించేవాడు. ఏదో సాధించాలన్న తపన ఇప్పటికీ అతనిలో అలాగే ఉంది. స్వర్ణనిక్షేపాల దాహమూ తగ్గలేదు.

125446-004-0C269211

ఎప్పుడూ ఏదో తొందరలో ఉన్నట్టూ, అస్థిమితంగానూ గడిపేవాడు. గడచిపోయే కాలం పట్ల విపరీతమైన స్పృహతో ఉండేవాడు. ఒక్క క్షణం వృథా అయినా సహించేవాడు కాదు. రోజులో ఇన్నిగంటల చొప్పున ప్రతి పనికీ కేటాయించుకునేవాడు. వేసవిలో ఉదయం మూడు గంటలకే లేచి భార్యతో కలసి గుర్రం మీద సముద్రస్నానానికి వెళ్ళేవాడు. ఉప్పునీటిలో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయనీ, సముద్రస్నానం అన్ని రకాల రోగాలనూ నయం చేస్తుందనీ నమ్మాడు. వయసు మీదపడిన కొద్దీ మరింత నియమబద్ధమైన జీవితం వైపు మొగ్గుతూ వచ్చాడు. తన అరవై నాలుగవ ఏట, పెదవిపై ఏర్పడిన కణితిని మత్తుమందు తీసుకోకుండా కోయించుకున్నాడు. అంతకు కొన్ని మాసాల ముందు గుర్రం మీంచి పడి, కళ్ళద్దాల తునకలు చెక్కిళ్లలో గుచ్చుకున్నప్పుడు కూడా వాటంతట అవే బయటికి వచ్చేవరకూ ఓపికతో ఎదురుచూశాడు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు.

అయితే, శరీరానికి ఎంతో మంచిదని తను నమ్ముతూ వచ్చిన సముద్రస్నానమే నెమ్మదిగా అతని ఆరోగ్యాన్ని హరించడం ప్రారంభించింది. 1877లో, తన మైసీనియా (Mycenae) గ్రంథానికి గ్లాడ్ స్టన్ ప్రసిద్ధమైన ముందుమాట రాస్తున్న తరుణంలో మొదటిసారి స్లీమన్ వినుకలి సమస్యకూ, అస్వస్థతకూ లోనయ్యాడు. సముద్రజలం చెవుల్లోకి ప్రవేశించి విపరీతమైన చెవిపోటుకూ, తలనొప్పికి దారితీయించింది.  తన జీవితంలోని చివరి పదమూడేళ్లూ ఈ రెండు సమస్యలతో అతను బాధపడుతూనే ఉన్నాడు.

తనకు అత్యంత ప్రతిష్ఠను కట్టబెట్టిన ట్రాయ్ ఇప్పటికీ అతని బుద్ధికి పని చెబుతూనే ఉంది. హిస్సాలిక్ లో తను జరిపిన తవ్వకాల పూర్తి వివరాలను పొందుపరుస్తూ, ఆత్మకథాంశాలను జోడిస్తూ, అనంతర పరిశోధనల వెలుగులో కొన్ని వెనకటి సూత్రీకరణలను సవరించుకుంటూ 1879లో ఇలియోస్ (Ilios) అనే పుస్తకాన్ని తీసుకొచ్చాడు.

ఆ తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరేనా? ఆ చిన్న దిబ్బను హోమర్ చిత్రించిన సువిశాల నగరంగా ఊహించుకోగలమా? ఆ దిబ్బే ట్రాయ్ అయుంటే అందులో అయిదువేలమంది జనమూ, అయిదు వందలమంది సైన్యమూ మించి ఉండగల అవకాశం లేదని అంచనావేశాడు. అప్పుడు హోమర్ వర్ణించిన అరవై నాలుగు గదుల విశాల ప్రాసాదాలు ఎక్కడున్నట్టు? పైగా ట్రాయ్ గిరిదుర్గం మైసీనియా గిరిదుర్గం కన్నా కూడా చిన్నది.

హిస్సాలిక్ గురించి ఆలోచించినకొద్దీ అతన్ని సందేహాలు అలముకుంటూనే ఉన్నాయి. బహుశా ట్రాయ్ హోమర్ ఊహాజనితం కావచ్చుననుకున్న క్షణాలూ ఉన్నాయి. హిస్సాలిక్ దిబ్బే హోమర్ చిత్రించిన ట్రాయ్ అన్న సంగతిని నిస్సందేహంగా నిరూపించే ఏ పురాతన లిఖిత ఆధారమో, లేదా మరో స్వర్ణకోశాగారమో కనిపిస్తుందన్న ఆశతో అతను తన జీవితాంతమూ ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగిస్తూనే వచ్చాడు. ఇంతవరకు ట్రాయ్ గురించిన అతని పరిజ్ఞానం హిస్సాలిక్, బునర్ బషీ, స్కామందరస్ లోయ, దాని దగ్గర ఉన్న చిన్న చిన్న ఊళ్ళకు పరిమితమైంది. ఈసారి వాటిని దాటి వెళ్ళి పరిశీలిస్తే తన సమస్యకు పరిష్కారం దొరకచ్చేమో ననుకుని 1881 మే నెలలో గుర్రం మీద ట్రాయ్ అంతటా సుదీర్ఘపర్యటన చేశాడు. అందువల్ల అతను ఆశించిన ఫలితం దక్కలేదు కానీ, ఈదా(Mount Ida)పర్వతాన్ని ఎక్కగలిగాడు. హోమర్ ప్రకారం ఆ పర్వతం మీద దేవతలు నివసిస్తారు.4 అక్కడినుంచి ట్రాయ్ లో జరిగే యుద్ధాలను వీక్షిస్తారు. అక్కడ అడవి మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే, ట్రాయ్ అంతటా సర్వసామాన్యంగా కనిపించే ఒక్క కోకిల తప్ప ఆ పర్వతం మీద మరే జీవీ కనిపించలేదు. ఒక కొన మీద ఒక అజ్ఞాత పశువుల కాపరికి చెందిన ఒకే ఒక సమాధి కనిపించింది. ఇంకో కొన మీద ఒక పాలరాతి పలక కనిపించింది. అది దేవతల రాజు అయిన జియస్ సింహాసన అవశేషం కాబోలని స్లీమన్ అనుకున్నాడు. ఆ కొండ మీదనుంచి చూస్తే హిస్సాలిక్ దిబ్బ కోటు బొత్తమంత చిన్నదిగా కనిపించింది. అంతదూరం నుంచి కింద  సైన్యాల కదలికలను జియస్ ఎలా చూడగలిగాడోనని స్లీమన్ అనుకున్నాడు.

అదే సంవత్సరంలో హిస్సాలిక్ మీద చిన్నపాటి తవ్వకాలు జరిపించాడు కానీ అవి నిరుపయోగమయ్యాయి. అవే రోజుల్లో మరో ముఖ్యసమస్య అతని బుర్రను తొలుస్తూవచ్చింది. అది, ట్రాయ్ నిక్షేపాలను ఎక్కడ ఉంచాలన్నది. గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు అతని ఆలోచనల్లో నానుతూ వచ్చాయి. ఒక దశలో స్వర్ణహారాలను రష్యాకు విక్రయించాలని కూడా అనుకున్నాడు. నిక్షేపాలను హెర్మిటేజ్ మ్యూజియంకు అప్పగించే పక్షంలో మంచి ప్రతిఫలం లభించేలా చూస్తానని వాగ్దానం చేసిన ఒక రష్యన్ ఏజెంటుతో కొన్ని వారాలపాటు ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. అయితే, నిక్షేపాలను అమ్మాలన్న బలమైన కోరిక స్లీమన్ కు లేదు. అవి ఎంతటి ధనంతోనూ తూచలేని అమూల్యాలన్న సంగతి అతనికి తెలుసు. సిస్టైన్ చాపెల్ కు 5 ఎంత ధర కట్టగలరు? ఆయా ఘటనలు జరిగేవరకూ ఓపికగా ఎదురుచూస్తూనే, నిరంతర సందిగ్ధాల మధ్య నలగడం అతని స్వభావంలోనే ఉంది. తన పరిశోధనలను ఎన్నడూ గుర్తించి హర్షించని జర్మనీకి ట్రాయ్ నిక్షేపాలను అప్పగించే ప్రశ్నలేనేలేదని, 1878 చివరిలో ఒక బెర్లిన్ వర్తకుడికి కరాఖండిగా లేఖ రాశాడు. అయితే, ఆరునెలలు తిరిగేలోపల తను నిక్షేపాలను జర్మనీకే అప్పగించబోతున్న సంగతి అతనికి తెలియదు. అందుకు ఒక నల్లని ముళ్లచెట్టు తాలూకు పూల కొమ్మ కారణం. అదెలాగంటే…

స్లీమన్ జీవితకాలం మొత్తంలో తనకు స్నేహితులంటూ చెప్పదగిన వారు ఇద్దరే.  ఒకరు, యువపురావస్తు శాస్త్రవేత్త విల్హెమ్ దార్ఫెల్త్. ఒలింపియాలో స్లీమన్ చేపట్టిన తవ్వకాలకు సహకరించడానికి ప్రష్యన్ ప్రభుత్వం అతన్ని పంపించింది. ఇంకొకరు, ప్రసిద్ధ వైద్యుడు రుడాల్ఫ్ విర్కో. విచిత్రం ఏమిటంటే, స్లీమన్,అతనూ స్వభావంలో ఉత్తర, దక్షిణాలు. విర్కో నెమ్మదస్తుడు, పద్ధతిగా తూచినట్టు వ్యవహరించేవాడు, ఉపాయశీలి, తర్కబద్ధంగా మాట్లాడేవాడు, ధనదాహం, కీర్తిదాహం బొత్తిగా లేనివాడు.  తన శక్తియుక్తులను ఏక కాలంలో వంద వేర్వేరు పనులకు మళ్ళిస్తూనే నిదానంగానూ, పద్ధతిగానూ వ్యవహరించగల అతి కొద్దిమందిలో ఒకడు. స్లీమన్ అతన్ని చూసి ఒకవిధంగా అసూయ చెందేవాడు, అతని స్నేహాన్ని కోరుకునేవాడు, వైద్యసంబంధమైన ప్రశ్నలను అదేపనిగా గుప్పించేవాడు. చివరికి, సత్కారాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, పసిపిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అతన్నే అడిగేవాడు.

heinrich-schliemann-1822-1890-german-traveler-and-archeologist-schliemann-addressing-a-scientific-group-in-london-england-wood-engraving-from-an-english-newspaper-of-1877-granger

1879 వసంతంలో, హిస్సాలిక్ తవ్వకాలలో కొద్ది విరామం దొరికినప్పుడు, స్కామందరస్ లోయ వెంబడి విహారయాత్రకు వెడదామని స్లీమన్ అతనితో అన్నాడు. స్లీమన్ వెంట వెళ్ళే అవకాశం దొరికినందుకు విర్కో సంతోషించాడు. ఇద్దరూ ఈదా పర్వతపాదాల దగ్గరికి చేరుకున్నారు. స్లీమన్ తన స్వభావానికి భిన్నంగా, ఏవో ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి విషయమని విర్కో అడిగాడు. “రకరకాల విషయాలుంటాయి, ఏదని చెప్పను?” అని స్లీమన్ అన్నాడు.

కాసేపటి తర్వాత, ఇద్దరూ ఒక నల్ల ముళ్లచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, విర్కో అదే ప్రశ్న మరోసారి అడిగాడు. “తను మరణించిన తర్వాత ట్రాయ్ నిక్షేపాల పరిస్థితి ఏమిటన్న ఆలోచన నన్ను తొలుస్తోం”దని స్లీమన్ జవాబు చెప్పాడు. హఠాత్తుగా విర్కో పూలు చిగురుస్తున్న ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచి స్లీమన్ కు ఇచ్చి, “ఇదిగో అంకెర్షాగెన్ 6 పూలచెండు” అన్నాడు.

తను ఆ మాట ఎందుకు అన్నాడో అతనికే తెలియదు. అప్రయత్నంగా వచ్చిన మాట అది. అది చెవినబడగానే స్లీమన్ ముఖకవళికలు మారిపోవడం విర్కో గమనించాడు. అతని మీంచి ఓ పెద్ద బరువు దిగిపోయిన ఛాయలు వాటిలో కనిపించాయి. ఆ కొమ్మను అందుకున్న స్లీమన్, “అవును, అంకెర్షాగెన్ పూల చెండే” అన్నాడు. అంతకు మించి మాటలేవీ జరగకుండానే నిర్ణయం జరిగిపోయింది. ఆ సంగతి ఇద్దరికీ తెలుసు.

కొన్ని గంటల తర్వాత విహారయాత్రనుంచి తిరిగి వస్తున్నప్పుడు విర్కో యథాలాపంగా అన్నాడు, “ ఆ నిక్షేపాలు జర్మనీకి చేరవలసిందే. వాటినక్కడ భద్రంగా చూస్తారు. మీకు సముచిత సత్కారం లభిస్తుంది. అంతా సాఫీగా జరిగిపోతుంది. మీరు సరే నంటే యువరాజు బిస్మార్క్ తో మాట్లాడతాను”.

స్లీమన్ తల ఊపాడు. ఏడేళ్లుగా తనను వేధిస్తున్న ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఆ వసంత దినాన ఆ పూల కొమ్మను చూడగానే చిన్నప్పుడు అంకెర్షాగెన్ తోటలో తను చూసిన పెద్ద పెద్ద పూల రాశులు అతని స్మృతిపథంలో మెదిలాయి. అంతే, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ‘దుష్టకాలం’ అన్న భావన మన పురాణ ఇతిహాసాలలోనూ ఉంది. ఉదాహరణకు, కలియుగం, లేదా కలికాలం. మహాభారతంలో ఈ కలియుగం ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. ఉత్తములు నశిస్తారు, చెడు వర్ధిల్లుతుందన్న భావనా అందులో అడుగడుగునా వ్యక్తమవుతుంది. పాండురాజు మరణించిన తర్వాత వ్యాసుడు సత్యవతికి చేసిన బోధలో “గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్” అనే వాక్యం సుప్రసిద్ధం.
  2. మహాభారతం విషయంలోనూ ఇదే జరిగింది. హోమర్ తర్వాత ఆయన కృతులను శిష్యులు గానం చేస్తూ ప్రచారం చేసినట్టే, వ్యాసుని శిష్యులు మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ప్రచారం చేశారు. పండిత నిర్ధారణ ప్రకారం, వ్యాసుడు చెప్పిన మహాభారత కథ ఎనిమిది వేల శ్లోకాలే. ఆ తర్వాత ఆయన శిష్యులు రెండు అంచెలలో దానిని లక్ష శ్లోకాలకు పెంచారు. విచిత్రమేమిటంటే, ఇలాంటి విస్తరణ క్రమమే ఇలియడ్ కూ ఉంది. తంత్రీవాద్యం, గానం పోలిక రామాయణానికి మరింత దగ్గరగా వర్తిస్తుంది. రామాయణం “తంత్రీలయ సమన్వితం”. దానిని వాల్మీకి శిష్యులు కుశలవులు గానం చేశారు.
  3. ఈ అభివర్ణన THE GOLD OF TROY రచించిన Robert Payne ది.
  4. గ్రీకు దేవతలు ఈదా పర్వతం మీద నివసించినట్టే, మన పురాణాల ప్రకారం మన దేవతలు మేరు పర్వతం మీద నివసిస్తారు.
  5. సిస్టైన్ చాపెల్: వాటికన్ సిటీలోని పోప్ అధికారనివాసం.
  6. అంకెర్షాగెన్: జర్మనీలోని ఒక గ్రామం. స్లీమన్ తన బాల్యాన్ని ఈ గ్రామంలోనే గడిపాడు.

 

 

అమ్మ ఆరాధనలో కమ్మగా జీవించిన ట్రోజన్లు

 

స్లీమన్ కథ-30

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఈజిప్టు పూజారుల ద్వారా హెరోడొటస్ తెలుసుకున్న సమాచారం ప్రకారం, ట్రోజన్ యుద్ధం పూర్తిగా అర్థరహితం. ఎందుకంటే,  ట్రాయ్ పై గ్రీకులు దాడి చేసిన సమయంలో హెలెన్ కానీ, ఆమెను ఎత్తుకువెళ్లిన పారిస్ కానీ అసలు ట్రాయ్ లోనే లేరు. పారిస్ ఆమెను తీసుకుని ఈజిప్టు రాజధాని మెంఫిస్ కు పారిపోయాడు. వారిద్దరినీ నిర్బంధంలోకి తీసుకోమని ఫారో(ఈజిప్టు చక్రవర్తి)ఆదేశించాడు. పారిస్ ను విచారిస్తూ, నీ పక్కనున్న ఈ యువతికీ నీకూ ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. పారిస్ ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో అతన్ని దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత హెలెన్ భర్త మెనెలాస్ మెంఫిస్ కు వచ్చి, హెలెన్ ను తన భార్యగా నిరూపించుకుని ఆమెతో కలసి గ్రీస్ కు తిరిగివెళ్ళాడు.

హెరోడొటస్ ఇలా అంటాడు:

ట్రాయ్ లో ఏం జరిగిందో చెప్పే గ్రీకుల కథనం నమ్మదగినదేనా అని పూజారులను అడిగాను. దానికి సమాధానంగా,  మెనెలాస్ స్వయంగా చెప్పినదంటూ వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం, హెలెన్ ను ఎత్తుకువెళ్లినట్టు తెలిసిన గ్రీకులు, మెనెలాస్ కు మద్దతుగా పెద్ద సైన్యాన్ని పంపించారు. అది ట్రోజన్ గడ్డమీద అడుగుపెట్టి కుదురుకున్న తర్వాత రాచనగరుకు కొందరు దూతలను పంపించారు. వారిలో మెనెలాస్ కూడా ఒకడు. ట్రోజన్ల స్వాగతం అందుకున్న ఆ బృందం, హెలెన్ ను, పారిస్ అపహరించిన సొత్తును, తగిన పరిహారంతో సహా అప్పగించవలసిందిగా కోరింది.* హెలెన్ తమ వద్ద లేదనీ, ఆ సొత్తు కూడా తమ స్వాధీనంలో లేదనీ, హెలెన్ తప్పించుకుని ఈజిప్టుకు వెళ్ళగా అక్కడి రాజు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నాడనీ ట్రోజన్లు వారికి చెప్పారు. తమ అధీనంలో లేనివాటిని కోరుతూ తమను శిక్షించబోవడం అన్యాయమని వారు వాదించారు.

సత్యప్రమాణంగా ఇదీ జరిగింది అంటూ ట్రోజన్లు మొదటినుంచీ ఈ కథనానికే కట్టుబడి ఉంటూ వచ్చారు.  గ్రీకులు మాత్రం దీనిని కట్టుకథగా తోసిపుచ్చారు. నగరాన్ని ముట్టడించి అది కుప్పకూలేవరకూ పోరాటం సాగించారు. అయినా హెలెన్ జాడ వాళ్ళకు కనిపించలేదు. ఓడిపోయిన దశలో కూడా ట్రోజన్లు తమ మొదటి కథనాన్నే నొక్కి చెప్పారు. వాళ్ళ మాటల్లో నిజముందని గ్రీకులు ఎట్టకేలకు తెలుసుకున్నారు. మెనెలాస్ ను ఈజిప్టు చక్రవర్తి వద్దకు పంపించారు. మెనెలాస్ నదీమార్గంలో మెంఫిస్ కు చేరుకుని అసలు కథను వినిపించిన తర్వాత ఈజిప్టు అతన్ని ఆదరించి ఇతర సొత్తుతో సహా హెలెన్ ను అప్పగించింది.

అయితే, ఈజిప్టు అంత ఆదరించినా మెనెలాస్ ఆ దేశంపట్ల కృతఘ్నతను చాటుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ప్రతికూల పవనాలు వీస్తుండడంతో కొన్ని వారాలపాటు అతను ఈజిప్టులోనే ఆగిపోవాల్సి వచ్చింది. పవనాలను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ఇద్దరు ఈజిప్టు బాలులను పట్టుకుని దేవతలకు బలి ఇచ్చాడు. ఈ దారుణం గురించి తెలిసిన ఈజిప్టువాసులు పగద్వేషాలలో రగిలిపోతూ అతన్ని వెంటాడారు. మెనెలాస్ ఎలాగో తప్పించుకుని లిబియాకు పారిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఈజిప్టుకు తెలియదు.

ట్రోజన్ యుద్ధం గురించిన హెరోడొటస్ కథనం ఇలా సాగుతుంది. అయితే దీనిని బొత్తిగా నిరాధారమని అనలేం. విచిత్రంగా హోమర్ పద్యాలలోనే ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఫినీషియా లోని సైదున్(Sidon)కు పారిస్, ఈజిప్టుకు మెనెలాస్ ప్రయాణం చేసినట్టు అవి చెబుతున్నాయి. హోమర్ పై తనకు ఎంత ఆరాధనాభావం ఉన్నా; కేవలం హెలెన్ ను పారిస్ సొంతం చేసుకోవడం కోసం మొత్తం ట్రాయ్ నీ, ట్రోజన్లనూ బలిపెట్టేంత ఉన్మాదిగా రాజు ప్రియామ్ ను హెరోడొటస్ భావించలేకపోయాడు. “ఒకవేళ ప్రియామ్ స్వయంగా హెలెన్ ను వివాహమాడి ఉన్నా, అది ఇంతటి విధ్వంసానికి దారితీస్తున్నప్పుడు కూడా ఆమెను అప్పగించకుండా ఉంటాడంటే నేను నమ్మలేను” అని అతను రాశాడు. మొత్తానికి వాస్తవంగా ఏం జరిగిందో హెరోడొటస్ తో సహా ఎవరికీ తెలియదు. ఒకటి మాత్రం నిశ్చయం: ఊహించడానికి కూడా వీలులేనంత అర్థరహిత యుద్ధం అది. అదే సమయంలో, మిగతా యుద్ధాలను మించిన అర్థరహితం మాత్రం కాదు.**

ట్రోజన్ యుద్ధానికి దారి తీయించిన కారణాలు మనకు స్పష్టంగా తెలియకపోయినా, అందులో పాల్గొన్న వీరుల గురించి మాత్రం బాగా తెలుసు. ట్రోజన్ సమాధులేవీ బయటపడలేదు. మైసీనియాలో బయటపడిన సమాధుల విషయానికి వస్తే, అవి యుద్ధానికి ముందు కాలానికి చెందినవి. కానీ, నాటి సైనికుల గురించి మనకు బాగా తెలుస్తోంది. హోమర్ చిత్రణలు, తవ్వకాలలో బయటపడిన సాక్ష్యాలు ఒకేవిధంగా వారిని మనకు పరిచయం చేస్తున్నాయి. మైసీనియా తవ్వకాలలో స్లీమన్ గుర్తించిన కొందరు అజ్ఞాత రాజులు జీవించిన కాలానికీ, ట్రోజన్ యుద్ధం జరిగిన కాలానికీ మధ్య పెద్దగా మార్పు ఏమీ సంభవించలేదు. సైనికుల ఆహార్యం, ఆయుధాలు, యుద్ధం సాగించే తీరు, ప్రజలు ధరించే దుస్తులు, అలంకరణ, సాంఘిక ఆచారాలు, వ్యవసాయవిధానాలు, ఆహారపు అలవాట్లు, దేవతల కొలుపులు-అన్నీ ఇంచుమించు ఒకలాంటివే.

వారి జుట్టు బుజాల వరకూ వేళ్లాడుతూ ఉండేది. బంగారు, వెండి సూత్రాలతో దానిని ముడేసుకునేవారు. వేసవిలో మగవారు చేతులున్న చొక్కాలను మోకాళ్ళ వరకూ ధరించేవారు. శీతాకాలంలో చేతులు లేని పెద్ద పెద్ద అంగరఖాల్లాంటివి ధరించి మెడ దగ్గర ముడేసుకునేవారు. అవి పడకమీద పరిచిన దుప్పట్లలా కూడా పనికొచ్చేవి. నడుములకు అలంకృత పట్టీలను(వడ్డాణాల లాంటివి), కర్ణాభరణాలను, మెడలో గొలుసులను, స్వర్ణహారకిరీటాలను, జడకట్టులను ధరించేవారు. అరచేతులకు తొడుగులు వేసుకునేవారు. వారికి ఉన్ని వాడకం తెలుసు. పూజారిణులు, సంపన్న మహిళలు మంచి కుట్టుపని చేసిన రంగురంగుల అంచులున్న కటివస్త్రాన్ని ధరించేవారు. ఒక్కోసారి కటివస్త్రం, అమ్మవారి స్వర్ణముద్రపై ఉన్న చిత్రంలో స్త్రీలు ధరించిన విధంగా విభజితమై ఉండేది. సైనికులు పంది దంతాలతో చేసిన శిరస్త్రాణాన్ని ధరించేవారు. మైసీనియాలో దొరికిన వంపుతిరిగిన పంది దంతాలు అచ్చం హోమర్ వర్ణించినట్టే ఉన్నాయి.

కుర్చీలు, బల్లలు ఉపయోగించేవారు. కానీ కంచాలలో భోజనం చేసేవారు కాదు. బల్ల మీదే పదార్థాలను పరచుకుని తినేవారు. ఆ తర్వాత బల్లను శుద్ధి చేసేవారు. మేక మాంసం, పంది మాంసం, చాలా అరుదుగా గొడ్డు మాంసం తినేవారు. వీటితోపాటు పెరట్లో కోళ్ళ పెంపకం ఉండేది. ఇళ్ళల్లో బాతులు తిరుగుతూ ఉండేవి. జింకలను, అడవి పందులను, అడవి మేకలను, కుందేళ్ళను, తోడేళ్లను వేటాడేవారు. చేపలు తినేవారు, నత్తగుల్లలను మరింత మక్కువతో తినేవారు. గోధుమ, బార్లీ, సజ్జలు, చిక్కుడు, బటానీ, కాయధాన్యాలను పండించేవారు. ద్రాక్షను, ఆలివ్ చెట్లను సాగుచేసేవారు. మద్యంలో తేనె కలుపుకుని సేవించేవారు.  తోటల్లో బేరి, అత్తి, యాపిల్, దానిమ్మ వగైరా పండ్లను పండించి ఇష్టంగా తినేవారు. పిల్లలు మాంసం, మజ్జ, వెన్న తినేవారు. పాల వాడకం తెలియదు. చీజ్ ను పేదలకు కూడా అందుబాటులో ఉండే పదార్థంగా భావించేవారు. పిల్లులు ఉండేవి కావు. క్రీ.పూ. 6వశతాబ్దిలోనే పిల్లి గ్రీస్ లో అడుగుపెట్టింది. వేటకుక్కలు, కాపలాకుక్కలు ఉండేవి.

తాము దైవసమానుడుగా భావించే రాజు చుట్టూ అల్లుకున్న నిరాడంబర, ఆదిమ సామాజికవ్యవస్థ వారిది. దాదాపు పరిశ్రమలంటూ ఏవీ లేవు. నాణేల వాడకం తెలియదు. ప్రతి తెగా విపరీతమైన స్వాభిమానంతో ఉండేది. ఇతర తెగలపట్ల అదే స్థాయిలో శత్రుత్వం వహించేది. అయితే, ఒక్కోసారి ఇతర తెగలతో మైత్రిని కల్పించుకుని శాంతి, సామరస్యాలతో జీవించడమూ వారికి తెలుసు.*** సర్ వాల్టర్ లీఫ్**** మాటల్లో చెప్పాలంటే, “అప్పటి వారి వ్యవస్థలు, మనుషుల గుంపులను బానిసలుగా మార్చుకుని చెప్పు చేతల్లో ఉంచుకోగలిగినంత బలమైనవి కావు”. ఇప్పటి జనసమూహాలతో పోల్చవలసివస్తే, వారు నేటి ఇండొనేసియాలోని బలిద్వీపవాసులకు దగ్గరగా ఉంటారు. ఈ ద్వీపవాసులు కూడా చండశాసనులైన రాజుల ఏలుబడిలో దేవతలు, రుతువుల పట్ల సామరస్యంతో నిరంతర శ్రమజీవనం గడుపుతూ ఉంటారు.

ట్రోజన్లు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు. వారి ఆరాధనలో ఆనందం వెల్లివిరుస్తూ ఉండేది. వారికి ఉపవాసాలు, పాపపరిహారాలు, ప్రాయశ్చిత్తాలు తెలియవు. వారిలో అపరాధభావన లేదు. అనాదికాలంలో ఒకానొక తోటలోని నిషిద్ధ ఫలాన్ని తిన్న నేరానికి తమకు ఏదో వినాశనం దాపురించబోతోందన్న భావన వారికి తెలియదు. వారిలో యవ్వనోత్సాహం, తాజాదనం తొణికిసలాడుతూ ఉండేవి. సూర్యకాంతి నిండిన ఒక ప్రాకృతిక ప్రపంచంలో వారు జీవించేవారు. అప్పటికింకా వారి దేహతంత్రులు పాలు గారుతూ సరికొత్తగా ఉండేవి. వారి చుట్టూ దివ్యత్వం తాండవిస్తూ ఉండేది. ***** దేవతలకు సొంతంగా ఒక హోదా, వారిలో తమవైన ఒక తారతమ్యక్రమం ఉండడం నాటి జనానికి పెద్ద విశేషంగా  కనిపించేది కాదు; వెండి విల్లు ధరించిన అపోలో “దేవతలందరిలోనూ బలవత్తరుడు”, అయితే, జియస్ కూడా అంతే బలవత్తరుడు. వారి దృష్టిలో దేవతలందరూ దాదాపు మర్త్యులే; అలాగే మనుషులందరూ దాదాపు దివ్యులే. మానవ జీవితపు అత్యున్నత సాఫల్యం దేవతల ప్రపంచంలోకి అడుగుపెట్టగలగడమే. మర్త్యుడైన దియోమెదెస్****** కూడా దేవత అఫ్రోడైట్ ను గాయపరచగలడు. దేవతలు సైతం విపణివీథిలో సంచరిస్తారు. మనుషుల్లానే వారు కూడా ప్రాకృతిక శక్తులముందు తలవంచుతారు. “మృత్యువు పాలించే చీకటి సామ్రాజ్యా”న్ని తలచుకుని వణకిపోతారు.

ట్రోజన్లు కాంతిని ప్రేమించేవారు, చీకటికి భయపడేవారు. దివ్యత్వం వారికి దాదాపు చేతికి అందేటంత దూరంలో ఉండేది. గాలిలో, స్పర్శలో, రాత్రిళ్ళు వేసుకునే చలిమంటలో, కంచు తళతళలలో, ప్రకాశించే ఆలివ్ చెట్లలో, మనుషుల ముఖాల్లో వారికి దివ్యత్వం గోచరించేది. జంటగొడ్డలి, చక్రాకార స్వస్తిక, అమ్మవారికి చెందిన చిన్న చిన్న మట్టిబొమ్మలు, చిత్రమైన బొంగరం ఆకృతులు వారికి దివ్యత్వ చిహ్నాలు. సాధారణంగా నీలిరంగు రాళ్ళతో మలచిన ఈ బొంగరం ఆకృతులు స్త్రీగర్భానికి, అంతుబట్టని సృష్టి ప్రారంభానికి ప్రతీకలు. ప్రతి చిన్న ప్రవాహాన్నీ అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs)ఉంటారు. *******ప్రతి ఉరుములోనూ వారికి ఒక అదృశ్యదేవత వాణి వినిపిస్తుంది. నదులు, సముద్రపు నురగ, పర్వతాలు, చెట్లు సహా అన్నింటిలోనూ దివ్యత్వం నిండి ఉంటుంది. అయితే అంత దివ్యత్వమూ మృత్యువు ముందు ఓడిపోతుంది. దేవతలు కూడా మృత్యువుకు తలవంచుతారు.  మనుషులు మృత్యువును తలచుకుని అంతులేనంతగా భయపడతారు. మృత్యువు, ప్రపంచపు ముఖాన లిఖించిన ఒక వక్రరేఖ. హోమర్ మృత్యుభయాన్ని చిత్రించినంత గాఢంగా, ప్రస్ఫుటంగా మరి దేనినీ చిత్రించలేదు.  ట్రోజన్ల ప్రత్యేక లక్షణమా అన్నట్టుగా దానిని వర్ణించాడు. అయితే ఆ మృత్యుభయాన్ని అంటిపెట్టుకుని ఒకవిధమైన గర్వమూ ఉంటుంది. భయపడుతూ, ద్వేషిస్తూనే మృత్యువును మెరిసే కళ్ళతో వారు పరిహసించనూగలరు.

హోమర్ ప్రకారం, ట్రోజన్లు, అఖియన్లు మృతులను దహనం చేసేవారు. బలిద్వీపవాసుల్లా చితిమంట చుట్టూ నృత్యం చేసేవారు. తన ఆప్తమిత్రుడు పెట్రోక్లస్ చనిపోయినప్పుడు చితిమీద అతని మృతదేహంతోపాటు గొర్రెలను, ఎద్దులను, గుర్రాలను, శునకాలనే కాక; పన్నెండుగురు ట్రోజన్ యువకులను కూడా ఉంచి అఖిలెస్ దహనం చేయించాడు. అయితే, ఇది ప్రాణమిత్రుడి గౌరవార్థం జరిగిన అరుదైన తంతే తప్ప తరచు జరిగేదిగా భావించలేము.  దేవుడు అపోలో జోక్యం చేసుకుని నివారించేవరకూ  పన్నెండు రోజులపాటు హెక్టర్ మృతదేహాన్ని అఖిలెస్ నానారకాలుగా అపవిత్రపరచడం కూడా ఇలాంటి అరుదైన సందర్భమే. మనకు అందుబాటులో ఉన్న ఇతర అనేక సాక్ష్యాల ప్రకారం, హోమర్ చిత్రించిన గ్రీకులు మృతులపట్ల అత్యంత భక్తిగౌరవాలను చాటుకునేవారు.********

హోమర్ చిత్రించిన చితిమంటలకూ, మైసీనియాలో బయటపడిన సమాధుల తీరుకూ ఎలాంటి పోలికా లేకపోవడాన్ని పండితులు ఎత్తిచూపారు. ట్రోజన్ యుద్ధానికి చాలా ముందునాటి నాగరికతకు చెందిన అంత్యక్రియల ఆచారాలకు అవి అద్దంపడుతున్నాయని వారు వాదించారు. స్వర్ణారాశులతో నిండిన ఆ సమాధులు ట్రోజన్ యుద్ధానికి ముందునాటివనడంలో సందేహం లేదు. అయితే, బంగారం దానికదే ఒక మంట లాంటిది. దహనం తర్వాత మాత్రమే మృతుల ఆత్మలను పితృదేవతల లోకంలోకి అనుమతిస్తారని హోమర్ నొక్కి చెప్పాడు. దానికి అనుగుణంగా బంగారపు ముసుగులనే ఒకవిధమైన చితిమంటకు చిహ్నంగా భావించడంలో తప్పులేదు. బంగారు ముసుగులతో మృతదేహాలను పాతిపెట్టడాన్ని దహనానికి ప్రత్యామ్నాయంగా గ్రీకులు భావించి ఉంటారు.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*యుద్ధానికి ముందు శత్రువు వద్దకు దూతను పంపడం, ఆ దూతను గౌరవంగా చూడడం అనే పద్ధతీ, సంప్రదాయమూ రామాయణ, మహాభారతాలలో కూడా కనిపిస్తాయి.

**క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన హెరోడొటస్ కూడా యుద్ధాలను ఇలా లాభ, నష్టాలు; హేతు, నిర్హేతుకల కోణంనుంచి చూడడం; ట్రోజన్ యుద్ధాన్ని అర్థరహితంగా భావించడం ఆశ్చర్యం గొలుపుతుంది. గణవ్యవస్థలోనూ, దానికి అతి సమీపంలోని ఇతిహాసకాలంలోనూ శత్రువు పట్ల పగప్రతీకారాలను తీర్చుకోవడం కంటే, అందుకు యుద్ధాలకు దిగడం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఏ లాభ, నష్టాల మీమాంసా, ఎలాంటి హేతు, నిర్హేతుకల పరిశీలనా అక్కడ పనిచేయదు. యుద్ధం చేయడం, ప్రాణత్యాగం చేయడం దానికదే ఒక ఉన్నతమైన విలువ. క్షత్రియుడిగా పుట్టినవాడికి యుద్ధం చేయడం, యుద్ధంలో చావడం ఎంతటి పుణ్యకార్యాలో మహాభారతం అడుగడుగునా చెబుతుంది. అర్జునుడు కానీ, ఇలియడ్ లోని హెక్టర్ కానీ యుద్ధానంతర విధ్వంసాన్ని తలచుకుని విషాదానికి లోనవడం మినహాయింపులు మాత్రమే. ఒకవైపు విషాదానికి లోనవుతూనే, మరోవైపు యుద్ధమూ, అది కలిగించే సర్వనాశనమూ అనివార్యాలన్న స్పృహా వారిలో ఉంది. వారు ఒకవిధంగా యుద్ధ అనుకూల-వ్యతిరేకతల సంధి దశను ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***అంతవరకూ ఒంటరిగా జీవించిన తెగలు, భిన్నమైన తెగలు తారసపడినప్పుడు వాటిపట్ల శత్రువైఖరి కనబరచేవి. యుద్ధాలకు దిగేవి. ఈ విధంగా చూసినప్పుడు యుద్ధమనస్తత్వానికి మూలాలు గణవ్యవస్థలో ఉన్నట్టు అర్థమవుతుంది. భిన్న తెగలతో మైత్రిని, సామరస్యాన్ని పెంచుకోడానికి గణవ్యవస్థలో సహజంగానే కొంత వ్యవధి పట్టి ఉంటుంది. గణవ్యవస్థ అంతరించిందని అనుకునే నేటి కాలంలోనూ ఆ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పలేం.

****సర్ వాల్టర్ లీఫ్(1852-1927): ఇంగ్లండ్ కు చెందిన ఒక బ్యాంకర్. వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ కు చాలా ఏళ్లపాటు డైరక్టర్ గా ఉన్నాడు. గ్రీకు ఇతిహాసాలలో పండితుడు, ఇలియడ్ ప్రామాణిక ముద్రణను తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

*****క్రైస్తవం, ఇస్లాంల ముందుకాలానికి చెందిన ట్రోజన్ల ఆరాధనావిధానాలలో, దేవీ, దేవుళ్ళలో, మతవిశ్వాసాలలో నేటి మన హైందవ లక్షణాలు కనిపిస్తాయి. మనకు ఇప్పుడు సైతం ఉన్నట్టే, వారిలోనూ అమ్మవారి ఆరాధన ఉండేది. దీని గురించి నా వెనకటి ‘పురా’గమన వ్యాసాలలో విస్తారంగా ప్రస్తావించాను. ఆసక్తిగలవారు చూడగలరు.

****** దియోమెదెస్: ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న ఒక గ్రీకువీరుడు.

*******మన పురాణ ఇతిహాసాలలోనూ  నదులను అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs) ఉండడం తెలిసినదే.

********మహాభారతంలో తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుని శిరస్సును భీముడు కాలితో తన్నినప్పుడు. అది సహించని ధర్మరాజు భీముని మందలిస్తాడు. రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత కూడా  తమ్ముడు విభీషణుడు అతనిని తూలనాడినప్పుడు. “మరణాంతాని వైరాని” అంటూ రాముడు అతన్ని మందలించి రావణుడి మృతదేహానికి అంత్యక్రియలు జరపమని కోరతాడు.

 

 

 

 

 

ట్రోజన్ యుద్ధంలోనూ ఒక ‘అర్జున విషాదయోగం’

 

స్లీమన్ కథ-29

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

యుద్ధ సందర్భంలో భార్యతో మాట్లాడుతూ హెక్టర్ అంటాడు:

ఆ రోజు వస్తుంది,  నా అంతరాత్మ చెబుతోంది,

మన పవిత్రనగరం ట్రాయ్ ధూళిధూసరితమైపోతుంది,

ట్రాయ్, ధైర్యశాలి అయిన రాజు, అతని రాచపరివారం, అంతా సర్వనాశనమైపోతారు.

ట్రోజన్ల దుఃఖం నన్ను అంతగా కదిలించడంలేదు సుమా-

దుఃఖం అనివార్యం- హెక్యూబా* దుఃఖం, నా తండ్రి దుఃఖం,

శత్రు పాదాల దగ్గర రక్తధూళిలో పడిఉన్న ఎందరో ఉత్తముల దుఃఖం- అనివార్యం.

నా మృత్యువును నేను తలపోస్తున్నాను, నా చావు నీకు కలిగించబోయే శోకం నన్ను చిత్రవధచేస్తోంది:

కంచు కవచం ధరించిన శత్రువు నిన్ను బానిసత్వంలోకి ఈడ్చుకు వెడుతుంటే నువ్వు పెట్టే ఆర్తారావం నా గుండెల్ని పిండుతోంది.

ఆర్గోస్ లోని ఎవరి మగ్గం దగ్గరో వాళ్ళు నీ చేత పని చేయిస్తారు

లేదా ఎక్కడో ఏ మారుమూల ఊరికో వెళ్ళి కడవతో నీళ్ళు మోస్తావు,

ఏం చేసినా నీ ఇష్టానికి విరుద్ధంగానే, నువ్వు బందీవి.

దుఃఖిస్తున్న నీతో వాళ్ళు అంటారు:

“ తమ నగరం కోసం పోరాడుతున్న రోజుల్లో ట్రాయ్ ఆశ్వికసేనకు నాయకత్వం వహించిన ఘన సేనాని హెక్టర్  ఇల్లాలా! ఇటు చూడు”

ఆ మాటలకు, నిన్ను దాస్యం నుంచి విముక్తం చేసే నాలాంటి వాడు ఎవరూ లేనందుకు,

నీ దుఖం మరింత పొంగి పొర్లుతుంది.

నీ దుర్భరశోకం, నిన్ను బానిసగా మార్చిన వైనం నా చెవిన పడకముందే

నాకు చావు రావాలి, భూమి నా మీద విరుచుకుపడి నన్ను పాతాళానికి తొక్కేయాలి.

దేదీప్యమానుడైన ఆ వీరుడు అలా మాట్లాడుతూ కొడుకువైపు చేతులు చాచాడు,

తండ్రి దేహంపై లోహపు మెరుపులూ, శిరస్త్రాణంపై గుర్రపువెంట్రుకల తురాయీ చూసి భయపడిన బాలుడు-

చక్కని మొలనూలు ధరించిన దాది వైపు ఏడుస్తూ పరుగెత్తాడు.

తల్లిదండ్రుల ముఖాల్లో నవ్వులు విరబూసాయి,

ఉజ్వలుడైన  హెక్టర్ ధగద్ధగాయమానమైన శిరస్త్రాణాన్నితీసి నేల మీద ఉంచి తన గారాల పట్టిని చేతుల్లోకి తీసుకుని లాలించాడు.

తను సృష్టించిన పాత్రపై ప్రేమ పెల్లుబికితే తప్ప ఇలాంటి సన్నివేశాలను ఇంత దుస్సహ గాఢతతో, ఇంత ఆర్ద్రంగా ఎవరూ రాయలేరు. ఇలియడ్  మొత్తాన్ని హెక్టర్ పక్షాన చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఇతిహాసం పొడవునా అతను మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కోసారి ధిక్కారపూర్వకంగా గర్జిస్తూ, ఇంకోసారి కోపంతో వణకుతూ, మరోసారి ప్రసన్నతనూ, నిగ్రహాన్నీ పలికిస్తూ అతని గొంతు ఇతిహాసమంతటా బిగ్గరగా  వినిపిస్తూ ఉంటుంది. “ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విధ్వంసం మన మీద వచ్చిపడింది. దానిపై తిరగబడుతూ, గడచిపోయే ప్రతి ఒక్క క్షణం నుంచీ మనకు దక్కే అల్ప సంతోషాన్ని జుర్రుకుందాం” అంటాడతను. విచిత్రంగా ఈ మాటలు ఆధునికతకు సమాధానాలుగా ధ్వనిస్తాయి. హోమర్ ను చదువుతున్నకొద్దీ మనం ఆధునిక ప్రపంచంతో ముఖాముఖీ తలపడుతున్నామన్న ఒక విచిత్ర స్ఫురణ నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది.

మానవ అంతఃకరణలోని అరాచకరాక్షసుని హింసాత్మక స్వైరవిహారానికి అఖిలెస్ ప్రాతినిధ్యం వహిస్తాడు. అతను కేవలం చంపడం కోసమే చంపుతాడు. అందులోనే వెర్రి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. అతని దృష్టిలో విధ్వంసం ఒక  ఉత్తమోత్తమ పుణ్యకార్యం . అతనిది రాతిగుండె అనో; పగ, ప్రతీకారం మూర్తీభవించినవాడనో అనడం, అతని భయానకప్రవృత్తిని తక్కువ చేసి చూపడమే. అతని సంహారకాండకు ఒక లక్ష్యం ఉండదు. ఒక వేటగాడిలా వెంటాడి వెంటాడి మరీ చంపుతాడు. అందులో పిల్లలు, వృద్ధులు అన్న విచక్షణ లేదు.  అపరాధభావన లేదు. ప్రపంచాన్ని అమితంగా ద్వేషిస్తాడు. దానిని నిర్ధూమధామం చేయడంలో తను పొందే తృప్తి కన్నా అతనికి మరేవీ ఎక్కువ కావు. శత్రుగృహంలో ఉన్న హెలెన్ ను విడిపించడం కోసం అతను  యుద్ధంలో పాల్గొనలేదు; చంపడంలో ఉండే సంతోషాన్ని పిండుకోవడం కోసం, ట్రాయ్ మొత్తాన్ని బూడిదకుప్పగా మార్చడం కోసం పాల్గొన్నాడు.

achilles_dragging_hector_s_body_in_front_of_troy__by_jacktzekov-d82vnjg

అందరికంటే ఎక్కువగా  హెక్టర్ మన ఆలోచనలకు దగ్గరగా ఉంటాడు. అతనిలో ఎలాంటి భ్రమలూ లేవు. అతని చేతిలో ఎలాంటి మంత్రదండమూ లేదు. నేటి మన కాలపు ఛాయలు అతనిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. శకునాలను ధిక్కరిస్తాడు. విధిని తప్పించుకోడానికి మానవసాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాడు, అదే సమయంలో, అది తప్పించుకోలేనిదనీ అతనికి తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా హుందాగా, గౌరవప్రదంగా నడచుకుంటాడు; అయితే గౌరవమర్యాదలు యుద్ధాలను గెలవలేవనీ అతనికి తెలుసు. హోమర్ చెప్పినట్టుగా అతని ముఖంలో నిశీథి తాండవిస్తూ ఉంటుంది. మరోవైపు, అతను ఎంతటి వీరుడంటే, “కోటగుమ్మంలోంచి రివ్వున యుద్ధానికి దూసుకువెడుతుంటే దేవతలు కూడా అతన్ని పట్టుకోలేరు”. చివరికి, తన కవచాన్ని కోల్పోయిన స్థితిలో, కంఠంలో దిగబడిన ఒక కత్తిపోటుతో అతని జీవితం అంతమవుతుంది. అప్పటికీ కసి తీరని శత్రువు అతని మృతదేహాన్ని దుమ్ములోంచి ఈడ్చుకువెళ్ళాడు.  దేవతలు తనను త్యజించి శత్రుపక్షం వహించడమే అతని పతన,పరాభవాలకు కారణం. విచిత్రం ఏమిటంటే, తన జీవితం ఇలాగే ముగుస్తుందని అతనికి ముందునుంచీ తెలుసు. **

ప్రతి కాలంలోనూ జనం హోమర్ ను చదువుకున్నారు. కానీ నేటి కాలంలో చదువుతున్నంత విస్తృతంగా, శ్రద్ధగా ఎప్పుడూ చదవలేదు. అందుకు తగిన కారణమే ఉంది. హోమర్ ప్రకృతికి అద్దం పట్టాడు. అతను వర్ణించిన ప్రపంచం సరిగ్గా నేటి ప్రపంచమే. ట్రాయ్ దగ్ధమైన తర్వాత ఈ మూడువేల సంవత్సరాలలో ప్రపంచం పెద్దగా మారింది లేదు. నాటి ఆ మంట ఇంకా రగులుతూనే ఉంది. అందులో చిక్కుకున్నవారు బయటపడడానికి పంటిబిగువు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతిచోటా విధ్వంసగ్రస్తుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. మనందరం ట్రోజన్లమే.*** అంధుడైన హోమర్ పురాతన ద్వీపాల వెంబడి సంచరిస్తూ నేటి మన దురవస్థను విస్తారమైన కాంతిమంతతతో వర్ణించాడు. అలాగని అతను ప్రవక్త ఏమీ కాదు; మానవావస్థను అతనంత నగ్నంగా, ఘనంగా వర్ణించినవారు లేరు.

పాశ్చాత్య నాగరికత మూలాలు వెతికే ప్రయత్నంలో స్లీమన్ ట్రాయ్ అన్వేషణకు వెళ్ళాడు. అతనూ ఆధునికత ఆవహించినవాడే. అశాంతి, అభద్రత, నీడల మధ్య సంచారం సహా విక్టోరియన్ల జాడ్యాలన్నీ అతనికీ ఉన్నాయి. అదే సమయంలో, ఈ సంకీర్ణ ఆధునిక నాగరికత గుప్పించే ప్రలోభాలనుంచి తప్పించుకోవాలన్న దృఢనిశ్చయమూ అతనిలో అసాధారణస్థాయిలో ఉంది. తనవైన మూలాల నుంచి తను దూరమయ్యాడన్న ఎరుక అతనికుంది. అందుకే తన మూలాలను అన్వేషించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతిపురాతన గతంలోకి… ఎలాంటి దారి గుర్తులూ లేని ప్రదేశాలకు సైతం వెళ్లాలనుకున్నాడు. ****

విచిత్రం ఏమిటంటే, ఆధారాలను పట్టించుకోకుండా సిద్ధాంతాలను అల్లే పండితులపట్ల ఆధునికులలో ఉండే తిరస్కారభావం స్లీమన్ లోనూ ఉంది.  అందుకే, హోమర్ కల్పితవ్యక్తి కాడనీ, ఇప్పటికీ జనం జ్ఞాపకాలలో వెచ్చగా ఉన్న యుద్ధాల గురించి రాసిన ఒకనాటి సజీవవ్యక్తి అనీ తిరుగులేని ఆధారాలతో నిరూపించాలనుకున్నాడు. ఆ సంకల్పాన్ని హద్దులు దాటిస్తూ, తను అగమెమ్నన్ ముఖాన్ని గుర్తుపట్టానని అతను అన్నప్పుడూ; ‘హెలెన్ స్వర్ణహారకిరీటాన్ని’ భార్య నుదుట అలంకరించినప్పుడూ అందరూ వెక్కిరింపుగా నవ్వారు. అయితే, అతని భావన నిజమైనా కాకపోయినా కనీసం అది అసాధ్యమని మాత్రం ఎవరూ అనలేరు.

హోమర్ లో అంతవరకూ పాఠకుల దృష్టిని పెద్దగా ఆకర్షించని ఛాయామాత్ర ఉల్లేఖలు కొన్నింటికి రక్తమాంసాలను కల్పించి, ముందులేని ప్రాధాన్యతను వాటికి సంతరించడం స్లీమన్ చేసిన గొప్ప దోహదాలలో ఒకటి. తను జరిపిన తవ్వకాలలో అతనికి గట్టి లిఖిత ఆధారాలు ఏవీ కనిపించకపోయినా; అతను బయటపెట్టినవాటిలో అనేకం హోమర్ చిత్రణలకు అనుగుణంగా ఉండి, అతని పద్యాలను అప్పుడే తవ్వి తీసి అపనమ్మక ప్రపంచం ముందు పెట్టాడా అన్న భావన కలిగిస్తాయి. ఏమైతేనేం, తను పాశ్చాత్యనాగరికత మూలస్థానాన్ని కనిపెట్టాడు, అంతే! ఇంతకు మించి చెప్పుకోవడం అనవసరం.

అసలు ట్రాయ్ లో ఏం జరిగింది, యుద్ధం ఎందుకు చేయవలసివచ్చిందన్నది ఈ రోజుకీ మనకు తెలియదు. హోమర్ నిజంగా ట్రాయ్ ను సందర్శించాడా అన్నది కూడా తెలియదు. కానీ ట్రాయ్ పతనగాథ ఏమాత్రం సందేహించడానికి వీలులేనంత ప్రామాణిక వివరాలతో, పటిష్టమైన చట్రంతో మన ముందుకు వచ్చింది.*****  హోమర్ ఒక కవిగా తన అభిరుచికి అనుగుణంగా వీరులను తీర్చిదిద్దాడు. కొందరిని ఉన్నతీకరించాడు, కొందరిని వక్రీకరించాడు. తన సానుభూతులన్నిటినీ హెక్టర్ లో గాఢంగా రంగరించాడు. హెలెన్ ను పారిస్ ఎత్తుకువెళ్లడం వల్లనే ట్రోజన్ యుద్ధం జరిగిందని అతను నమ్మాడు. అయితే, ఆర్థిక కారణాలతో కాకుండా అర్థరహిత కారణాలతో కూడా తరచు యుద్ధాలు జరిగాయన్న సంగతిని విస్మరించిన ఆధునిక పండితులు మాత్రం, దర్దనెల్లెస్ పై ఆధిపత్యం కోసమే ట్రోజన్ యుద్ధం జరిగిందని భావించారు.

ఇక, ట్రోజన్ యుద్ధం గురించి గ్రీకు పురాతన చరిత్రకారుడు హెరోడొటస్ (క్రీ.పూ. 484-425)కథనం మరోవిధంగా ఉంది.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*హెక్యూబా: రాజు ప్రియామ్ భార్య.

**హెక్టర్ లో విచిత్రంగా మహాభారతంలోని అర్జునుడి పోలికలు, కర్ణుడి పోలికలూ కూడా కనిపిస్తాయి. అతను మనం తేలిగ్గా పోల్చుకోగలిగిన మానవమాత్రుడిలానే వ్యవహరిస్తాడు. విధికి ఎదురు తిరగలేని మానవనిస్సహాయతను అంగీకరిస్తూనే, మానవప్రయత్నంతో ధైర్యంగా దానిని ఎదుర్కోడానికి సిద్ధమవుతాడు. మనిషిలోని దుఃఖం, వేదన, ఆనందం, ఆశ, నిరాశ మొదలైన అన్ని రకాల అవస్థలను ప్రతిబింబిస్తాడు. మహాభారతంలోని అర్జునుడు కూడా ఈ మానవస్వభావానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ‘నరుడు’ అన్న అతని మరో పేరే దీనిని సూచిస్తూ ఉండచ్చు. హెక్టర్ లానే అర్జునుడు కూడా యుద్ధఘట్టంలో సందేహాలు, సందిగ్ధాల మధ్య నలుగుతాడు. విషాదానికి లోనవుతాడు. హెక్టర్ లానే యుద్ధానంతర విధ్వంసాన్ని పదే పదే ఎత్తి చూపుతాడు.

ఇంకోవైపు, హెక్టర్ అంతమైన తీరు కర్ణుని గుర్తుచేస్తుంది. అతను కవచాన్ని కోల్పోవడం, ఆ స్థితిలో కంఠంలో శత్రువు కత్తి దిగబడడం కర్ణుని అంతిమక్షణాలకు కొంచెం దగ్గరగా ఉన్నాయి.  దేవతలు హెక్టర్ కు ప్రతికూలంగా మారి శత్రుపక్షం వహించి అతని చావుకు కారణమైనట్టే, దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను హరించి అతని చావుకి ఒక కారణమయ్యాడు.

***ఇక్కడ కూడా మహాభారతంతో ఇలియడ్ కు పోలిక కుదురుతున్నట్టుంది. పాశ్చాత్యులందరూ ట్రోజన్లు అయితే, మనం భారతీయులం కురుక్షేత్రయుద్ధ వారసులం. ట్రోజన్ యుద్ధం పాశ్చాత్య సమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిందనుకుంటే, కురుక్షేత్రయుద్ధం భారతీయసమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పింది. నా విస్తృత అధ్యయనంలో ఈ చర్చ ఒక భాగం కాబోతోంది.

****మనకులానే పాశ్చాత్యులకు కూడా ఆధునికత ఒక సమస్య కావడం ఇక్కడ ఆసక్తికరం.

*****ఇక్కడా మహాభారతంతో పోలిక కుదురుతోంది. మహాభారతయుద్ధం నిజంగా జరిగిందో లేదో మనకీ తెలియదు. కానీ యుద్ధ చిత్రణ మాత్రం నిజంగా జరిగిందన్న భావన కలిగిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గ్రీకుల ‘మహాభారతం’ ఇలియడ్

 

స్లీమన్ కథ-28

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

స్లీమన్ తన జీవితకాలంలోని చివరి పదేళ్లూ మరెక్కడైనా స్వర్ణనిక్షేపాలు బయటపడతాయా అని గాలిస్తూనే గడిపాడు. కానీ అతని ఆశ ఫలించలేదు. తనలో ఒక బాలుడిలో ఉండే కుతూహలం, ఒక యువకుడిలో ఉండే ఉత్సాహం ఇప్పటికీ ఉన్నా శరీరాన్ని వృద్ధాప్యం ఆవహించింది. ఎక్కడో ఒకచోట తను స్థిరంగా కుదురుకోవాలనిపించింది. ఎథెన్స్ తనకెంతో ఇష్టాన్నీ, మనశ్శాంతినీ కలిగించడంతో ఆ నగరం నడిమధ్యలో తన స్థాయికి తగినట్టు ఒక నివాసాన్ని నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ట్రాయ్, మైసీనియాలలో తను కనుగొన్న రాజప్రాసాదాల నమూనాలో తన సౌధానికి తనే రూపకల్పన చేసుకున్నాడు. దానికి Iliou Melathron (‘ట్రాయ్ ప్రాసాదం’) అని పేరుపెట్టాడు. అది లైకాబిటిస్ కొండ పాదాల దగ్గర రాజుగారి గుర్రపుశాలకు ఎగువన ఉంది. అదొక భారీ నిర్మాణం. రంగురాళ్ల నేలతో, పాలరాతి మెట్లతో లోపల చలి చలిగా ఉంటుంది.  ట్రాయ్ లో తను కనుగొన్న స్వర్ణపాత్రలు, కలశాల నమూనాలు వాటి మీద చిత్రితమై ఉన్నాయి. గోడల మీద ప్రాచీనతను ప్రతిబింబించే ప్రకృతి దృశ్యాలు, హోమర్ నుంచి తగిన ఉటంకింపులతో గ్రీకు వీరుల చిత్రాలు ఉన్నాయి.

కింది అంతస్థులలో తను కనుగొన్న నిక్షేపాలను ప్రదర్శించాడు. పై అంతస్థును తన అధ్యయనానికి కేటాయించుకున్నాడు. “క్షేత్రగణితాన్ని అధ్యయనం చేయనివారు బయటే ఉండండి” అనే హెచ్చరికను తలుపుకు అతికించాడు. గదినిండా పుస్తకాలు. తను సేకరించిన అతి విలువైన సామగ్రిని కూడా అందులోనే ఉంచాడు. గోడల మీద, తను ఎంతగానో అభిమానించే న్యూయార్క్, ఇండియానాపోలిస్ తాలూకు దృశ్యాలను అలంకరించాడు. మందంగా తోలు తాపడం చేసిన ఓ పెద్ద కుర్చీలో కూర్చుని రోజంతా ప్రాచీన గ్రీకు గ్రంథాలను చదువుతూ గడిపేవాడు. పక్కనే ఒక చిన్న కుర్చీ ఉండేది. దానిమీద, రోజూ ఉదయమే పారిస్, లండన్, బెర్లిన్ ల నుంచి వచ్చే స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాల దొంతర ఉండేది. టెలిగ్రాఫ్ ఫారాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి. ఇప్పటికీ అతను వ్యాపారప్రముఖుడే. దాదాపు ప్రపంచమంతా విస్తరించిన తన ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణకు రోజూ కొన్ని గంటలు కేటాయించుకునేవాడు.

తన నివాసంలో అతను హోమర్ వర్ణించిన రాజుల్లానే ఒక నియంతలా వ్యవహరించేవాడు. తన మాట శిలాశాసనం. తనకు పంపే వర్తమానాలను అన్నింటినీ ప్రాచీన గ్రీకు భాషలో పంపి తీరవలసిందే. ఇంట్లో భోజనాల దగ్గర, ఇతర నిత్యకృత్యాలలో గ్రీకు మాట్లాడవలసిందే. తన పనివాళ్లు అందరికీ గ్రీకు పేర్లు పెట్టాడు. ఒక పనివాడి పేరు, బెల్లర్ ఫాన్. ఇంకొకతని పేరు, టెలమాన్. కూతురు అంద్రోమకీ ఆయా పేరు, దనాయి.  కొడుకు అగమెమ్నన్ నర్సు పేరు పోలిక్సీనా. ముసలి తోటమాలి పేరు కల్ఫాస్. భవిష్యత్తును చెప్పగలిగిన కల్ఫాస్ శాపవాక్యాలతోనే ఇలియడ్ మొదలవుతుంది. ప్రాచీన గ్రీకులు ఇళ్ళలో ఎక్కువ గృహోపకరణాలను పేర్చేవారు కాదు కనుక, తను కూడా వారినే అనుసరించాడు. ఓ మూల కొన్నిపాటి కుర్చీలతో, సోఫాలతో గదులన్నీ బోసిపోయినట్టు ఉండేవి.  అలాగే, ఇంట్లో ఎక్కడా తెరలు ఉండకూడదు.  అతని ఉద్దేశంలో, అఖిలెస్ తెరలు వేలాడదీసిన నివాసంలో ఉన్నాడన్నది అసలు ఊహించడానికే వీలులేని విషయం. తన భారీ భవంతిని పురాతన గ్రీకు రాజప్రాసాదాల నమూనాలో నిర్మించడానికి, పాంపే(పురాతన రోమన్ నగరం) శిథిలాలు అతన్ని ప్రత్యేకించి ఆకట్టుకోవడం కూడా ఒక కారణం. పాంపే భవంతులలోని నాట్యశాలల తరహాలోనే తన నివాసంలో నాట్యశాలను నిర్మించాడు. దాని గోడల మీద నీలం, తెలుపు రంగుల్లో పిల్లల నగ్నచిత్రాలను ప్రదర్శించాడు. వాటిలో తన పరిచయస్తులు, ప్రయాణాలలో తనకు తారసపడిన వ్యక్తుల కవళికలు ఉండేలా చూశాడు. వాటి మధ్యలో కళ్ళద్దాలు ధరించిన తన చిత్రాన్ని ఉంచాడు.

జీవితం పొద్దువాలుతున్న దశలో తనకు రక్షగానూ, తనలో ఉత్సాహం నింపడానికా అన్నట్టూ భవనం పై కప్పు నేల మీద జియస్, అఫ్రొడైట్, అపోలో, ఎథెనా సహా ఇరవైనాలుగు మంది దేవీ దేవుళ్ళ పాలరాతి విగ్రహాలను ఉంచాడు.

***

pura1

స్లీమన్ తన జీవితంలో చివరి ముప్పై నాలుగేళ్లూ ఇలియడ్ ను ఎంతో తమకంతో పఠిస్తూనే వచ్చాడు. అదే అతని బైబిల్. రోజులో ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని తిరగేసేవాడు. దాదాపు అతని ఆలోచనల కన్నిటికీ అదే ఊటబావి.  అందులో, ఏ భాగం గొప్పదీ, ఏది నీకు ఎక్కువ ఇష్టం అన్న ప్రశ్నకు అతని దగ్గర అవకాశమే లేదు. అది ఆమూలాగ్రమూ గొప్పదే,  ప్రీతి కలిగించేదే. అందుబాటులో ఉన్న ఇలియడ్ ప్రతి ఒక్క ముద్రణా అతని లైబ్రరీలో ఉండేది. వాటిలో అనేకం మందమైన మొరాకో తోలుతో బైండ్ చేసినవి. అవిగాక,  చవకగా లభించే పేపర్ బౌండ్ చాజ్నిట్స్ [Tauchnitz- జర్మనీకి చెందిన బెర్న్ హార్డ్ చాజ్నిట్స్ అనే అతను నెలకొల్పిన సంస్థ 1842-1950ల మధ్యకాలంలో పేపర్ బౌండ్ చవక ముద్రణలను వ్యాప్తిలోకి తెచ్చింది. అవి చాజ్నిట్స్ ముద్రణలుగా ప్రసిద్ధి చెందాయి]ముద్రణలను ప్రయాణాలలో వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. వాటి పుటలను తన వ్యాఖ్యానంతో నింపేసేవాడు.

ఇలియడ్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ఓసారి ఒక మిత్రుడు ఉత్తరం రాశాడు. అందులో కష్టమేమీ లేదనీ, అది కాస్టలియన్[గ్రీస్ లో డెల్ఫీ సమీపంలోని] ఊటజలాలంత తేటగా ఉంటుందనీ, ఒక ఆధునిక నవలలా దానిని చదువుకోవచ్చనీ స్లీమన్ జవాబిచ్చాడు. అతని దృష్టిలో ఇలియడ్, ఒడిస్సే లు రెండూ దివ్యశాసనాలు. భగవదాశీస్సులతో రూపొందినవి. మానవమాత్రుడికి సాధ్యం కాని ఉదాత్తతా, సొగసూ వాటిలో ఉట్టిపడుతుంటాయి. ఈ గ్రంథాలను ఎవరైనాసరే కూర్చుని శ్రద్ధగా పఠిస్తే తన జన్మ సార్ధకమైందన్న భావనా, ఒక అలౌకికానందమూ అతన్ని ముప్పిరిగొంటాయి. మనిషి తాలూకు అంతటి విషాదాన్నీ అవి ప్రతిఫలిస్తాయి. అవి, ఒక పరిపూర్ణ కవి చెప్పిన పరిపూర్ణ కథలు. ఇంతకు మించి చెప్పడం అనవసరం.

ఇలియడ్ లో అన్నిటి కన్నా ఫలానా భాగం గొప్పదని చెప్పడం కష్టమనీ, అన్నీ సమానంగా రంజకమైనవే నని స్లీమన్ పదే పదే నొక్కి చెప్పినా; ఒక సందర్భంలో మాత్రం తన ఈ నిర్ధారణను తనే ఉల్లంఘించాడు.  అన్నిటిలోనూ  ప్రత్యేకించి మరింత అద్భుతమైనదిగా ఒక ఘట్టాన్ని ఎత్తిచూపాడు. అది, హెలెన్ ఒక వస్త్రంపై అల్లిక పని చేస్తూ స్కియన్ గేటు వైపు నడిచి వెడుతున్న ఘట్టం. ఆమె నేస్తున్న అలంకరణవస్త్రంపై ట్రోజన్లు, అఖియన్లు ఒకరి పీక ఒకరు పట్టుకున్న చిత్రాలు ఉన్నాయి.  ఆ సమయంలో, చెట్టు కొమ్మల మీద ఆనందంగా కిచకిచలాడే పక్షుల్లా  రాజు ప్రియామ్, నగర పెద్దలూ  సమీపంలోని ఒక బురుజు మీద సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారు.

యుద్ధం ఆగిపోయిందన్న వార్త వస్తుంది. దానికి బదులు హెలెన్ భర్త మెనెలాస్, ఆమెను అపహరించుకుని వచ్చిన పారిస్ ద్వంద్వయుద్ధం చేయాలని తీర్మానించారు. హెలెన్ భవితవ్యాన్ని ఆ యుద్ధం నిర్ణయించబోతోంది. హెలెన్ శ్వేతవస్త్రం ధరించి, చెలికత్తెలు వెంటరాగా ప్రియామ్ ఉన్న బురుజును సమీపిస్తుంది. ఆమె రాకను గమనించిన పెద్దలు అప్రయత్నంగా గొంతులు తగ్గించి, ఆమె అద్భుత సౌందర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకోవైపు, సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం అంతం కాబోతోందన్న సంతోషం వాళ్ళలో వెల్లివిరుస్తోంది. ప్రియామ్ ఆమెను తన దగ్గరకు పిలిచి శత్రుసేనలోని ఒక వ్యక్తిని చూపించి, “అందరికంటే ఆజానుబాహువుగా, ధీరోదాత్తుడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?” అని అడుగుతాడు.

pura3

“అతను అగమెమ్నన్, నా భర్తకు అన్నగారు” అని హెలెన్ చెబుతుంది. ఆ తర్వాత, తన కవచాన్ని నేల మీదికి జారవిడిచిన ఇంకో వ్యక్తిని చూపించి, తగుమాత్రం ఎత్తుగా, లోతైన ఛాతీతో ఉన్న అతను ఎవరని అడుగుతాడు. “అతను ఒడీసియస్” అని చెబుతుంది. ఈసారి, ఎత్తుగా, అందంగా ఉన్న ఇంకో వ్యక్తిని చూపించి, ఎవరని అడుగుతాడు. “అతను ఎజాక్స్” అని చెబుతుంది. క్రీటు రాజు ఇడోమెనెస్ ను కూడా ఆమె గుర్తుపడుతుంది. అగమెమ్నన్ సేనానులందరిలో అతనే పెద్దవాడు.  ఇంతలో ఇద్దరి కోసం ఆమె కళ్ళు ఆత్రుతతో గాలించాయి. వారు, కాస్టరస్, పోలీడూసెస్ లు. వాళ్ళిద్దరూ ఆమె సోదరులు. ఒకతను మంచి అశ్వశిక్షకుడు, ఇంకొకతను ప్రసిద్ధ మల్లయోధుడు. వాళ్ళు కనిపించకపోయేసరికి కీడును శంకించి, పట్టలేని దుఃఖంతో ఆమె మూగవోయింది. హోమర్ అంటాడు:

ఫలవంతమైన భూమి ఇప్పటికే వారిని తన ఒడిలోకి తీసుకుంది

దూరంగా, తాము ఎంతో ప్రేమించే లాసిడిమోనియా*కు వారు చేరుకున్నారు

దుఃఖం నగ్నంగా నర్తించే ఇలాంటి ఘట్టాలు హోమర్ లో ఏడెనిమిది కనిపిస్తాయి. దుఃఖం-మనిషి ఎదుర్కొనే దుఃఖం- ఇదే ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. అఖిలెస్ ఆగ్రహోదగ్రతా, ఎందరో ఉత్తముల చావుకు కారణమైన అతని విలయ తాండవం-ఇవే తన ప్రధానవస్తువులని హోమర్ ఇతిహాస ప్రారంభంలోనే చెబుతాడు. అఖిలెస్ రూపంలో మృత్యుశక్తి పట్టపగ్గాలు లేకుండా విస్ఫోటించింది. తన దారికి అడ్డువచ్చిన ప్రతిదానినీ ధ్వంసం చేస్తూ, ప్రతి ఒకరితో ఘర్షణపడుతూ; శత్రువీరుడైన హెక్టర్ ను చంపి అతని మృతదేహాన్ని గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేసేవరకూ ఎత్తిన కత్తి దించని అఖిలెస్ విజృంభణను ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోతాం. ఎట్టకేలకు మృతదేహాన్ని రాజు ప్రియామ్ కు అతను అప్పగించినప్పుడు, ఆ యువవీరుడైన హెక్టర్ రూపురేఖల్లో  మానవీయంగా, లేదా దైవత్వంగా చెప్పదగినదేదీ మిగలదు. అతను, నలిపి చంపేసిన ఒక పురుగు!

అఖిలెస్సే ఇందులో నాయకుడు. అయితే, అతను మృత్యువును ప్రేమించిన నాయకుడు. ఇందుకు భిన్నంగా ఈ కథను వినే శ్రోతలందరూ జీవితాన్ని ప్రేమించేవారు. ఇంత అందమైన భూమిని సృష్టించి కూడా, దానిని ఇంతటి విషాదంతో నింపిన దేవతల విధ్వంసశక్తికి వారు నివ్వెరపోతారు. మెరిసే కవచాలు, ధైర్యం ఉట్టిపడే చూపులు, వంగే మానవదేహాలు, స్వర్ణహారాల ధగధగలు-అన్నీ చివరికి ఇన్ని కన్నీళ్లుగా మిగిలిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే, యువవీరుల విషాదాంతాన్ని పురస్కరించుకుని భగవంతుని ఉద్దేశించి చేసే సుదీర్ఘ ప్రార్థన, ఇలియడ్.**

ఇలియడ్ లో అడుగడుగునా  బాధాగ్రస్తుల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇంతటి ధ్వంసకాండకు గ్రీకులు ఎందుకు పూనుకున్నారు? అందులో వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని పొందారు?  హెక్టర్ మృతదేహాన్ని ట్రాయ్ ప్రాకారాల వెంట ఈడ్చుకువెడతారనీ, అఖిలెస్ విజయం సాధిస్తాడనీ, తళుక్కు మనే శ్వేతవస్త్రాలతో ప్రేతదేవతలా హెలెన్ కథ అంతటా ఆవరించి ఉంటుందనీ ప్రారంభంనుంచీ మనకు తెలుస్తూనే ఉంటుంది. గొప్ప సౌందర్యారాశిగా, అందరానిదిగా తోచే హెలెన్, తన అందానికి తనే భయభ్రాంతమవుతూ జీవించే ఒక భూతాన్ని తలపిస్తుంది. ఈ భూతం కోసమే వీరులంతా కలసి ఈ మహాయుద్ధం సాగించారు; ఈ భూతం కోసమే సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారు. పురుషులు చావవలసిందే; స్త్రీలు దుఃఖించవలసిందే; రక్తం చిందవలసిందే; చివరికి అంతా నిష్ఫలం. ఒక భయానకమైన, నిర్హేతుకమైన విధి ఆద్యంతం పరచుకున్నట్టు ఉంటుంది.***

జీవితం నిరర్థకం, అర్థరహితమన్న ఎరుక హోమర్ లో ధ్వనిస్తూ ఉంటుంది. అతనికి యుద్ధాల గురించి తెలుసు.  మృతులు, క్షతగాత్రుల దేహాలు నేలకొరిగిన దృశ్యం ఎలా ఉంటుందో తెలుసు. సంప్రదాయం అతన్ని అంధుడిగా చెబుతుంది. అందుకే కాబోలు, ప్రతిదానిలో ఉజ్వలతను పదే పదే ఎత్తి చూపుతాడు. అతన్ని ఏజియన్ దీవులకు చెందిన ఒక ద్వీపవాసిగా కూడా సంప్రదాయం చెబుతుంది.**** బహుశా అందుకే గ్రీకులు, ట్రోజన్ల ఉభయుల పట్లా అతనిలో ఒక విచిత్రమైన నిర్మమత్వమూ; అర్థరహితమైన యుద్ధంలో చిక్కుకున్న వ్యక్తుల పట్ల మమత్వమూ కనిపిస్తాయి.

ఇలియడ్ లో ముగ్గురు వ్యక్తులు విశిష్టంగా కనిపిస్తారు: అల్లకల్లోలం సాగించే అఖిలెస్, జిత్తులమారి ఒడీసియస్, విధివంచితుడు హెక్టర్! ఒడిస్సే చివరి అధ్యాయాలలో ఒడీసియస్, అఖిలెస్ లక్షణాలను అన్నిటినీ పుణికి పుచ్చుకుంటాడు. ఇలియడ్ లో హెక్టర్ ఆంతరంగిక నాయకుడు అయితే, అఖిలెస్ బహిరంగ నాయకుడు. ఆర్ద్రతా, ఆత్మీయతా నిండిన దాదాపు అన్ని ఘట్టాలూ హెక్టర్ కు సంబంధించి ఉంటాయి. ఇంచుమించు అతను హేమ్లెట్ లాంటివాడు. సాలెగూడులో ఇరుక్కున్న అతను దాని నుంచి బయటపడే ప్రయత్నంలో ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడతాడు. అందమైన కలలు పేర్చుకుంటాడు, అంతలోనే వాటిని కుప్పకూల్చుతాడు. తన నాశనానికి తనే అసహనంతో ఎదురుచూసేవాడిలా కనిపిస్తాడు. ఒక్కోసారి బాల్యస్మృతులలోకి జారిపోతాడు.  జీవితం గాలిబుడగ లాంటిదన్న భావనకూ, బాధ్యతాస్పృహకూ మధ్య నలుగుతూ ఉంటాడు.

(సశేషం)

******

అథోజ్ఞాపికలు

*లాసిడిమోనియా: గ్రీసు పురాతన నగరాలలో ఒకటైన స్పార్టాకు మరో పేరు.

** మహాభారతానికి, ఇలియడ్ కు పోలికలు అడుగడుగునా కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ఇది ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన ఆసక్తికరమైన అంశం.

***ఈ వివరణ కూడా మహాభారతాన్ని, అందులోని స్త్రీపర్వాన్ని గుర్తుచేస్తుంది. అలాగే, రామాయణాన్ని కూడా.  ట్రోజన్ యుద్ధం హెలెన్ కోసం జరిగితే, ఒక కోణం లోంచి చూసినప్పుడు మహాభారతయుద్ధానికి కేంద్రబిందువు ద్రౌపది. రామ, రావణయుద్ధానికి కేంద్రబిందువు సీత.

****మహాభారతకర్త వ్యాసుడు కూడా ద్వీపంలోనే జన్మించాడు. అందుకే ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు(కృష్ణ=నల్లనివాడు, ద్వైపాయనుడు=ద్వీపంలో జన్మించినవాడు) అనే పేరు వచ్చింది.  హోమర్ కు, ఆయనకు మరికొన్ని పోలికలు ఉన్నాయి.

 

 

 

పురాతన మైసీనియాలో అమ్మవారి స్వర్ణముద్ర!

 

స్లీమన్ కథ-27

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)-కల్లూరి భాస్కరం

~

 

మైసీనియాలో స్లీమన్ చేపట్టిన పని పూర్తయింది. నవంబర్ చివరిలో గ్రీస్ రాజుకు ఒక తంతి పంపించాడు. తవ్వకాలలో తను కనుగొన్న స్వర్ణసంపదతోపాటు, ఇతర విశేషాలను అందులో వివరించాడు. ఒక్క స్వర్ణ సంపదతోనే పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయచ్చనీ, అది ప్రపంచంలోనే ఒక అద్భుత మ్యూజియం అవుతుందనీ, దానిని దర్శించడానికి కొన్ని శతాబ్దాలపాటు విదేశీ పర్యాటకులు గ్రీస్ కు బారులు కడతారనీ అన్నాడు. తను కేవలం శాస్త్రవిజ్ఞానం మీద మక్కువతోనే పని చేశాననీ, ఈ స్వర్ణసంపదపై ఎలాంటి హక్కునూ ప్రకటించబోననీ నొక్కి చెప్పాడు. ఆ ముల్లెను ఎంతో భద్రంగా గ్రీస్ కు అప్పజెబుతున్నాననీ,  భగవంతుడి దయవల్ల అది జాతీయ సంపదకు అపారమైన మూలనిధి కావాలని ఆకాంక్షిస్తున్నాననీ అన్నాడు.

తీరా రాజుగారి కార్యదర్శినుంచి వచ్చిన జవాబు చూసి నీరుగారిపోయాడు. అది చాలా క్లుప్తంగా ఉంది. అతను జరిపిన ముఖ్యమైన పరిశోధనలకు, అందులో చూపించిన ఉత్సాహానికీ, శాస్త్రవిజ్ఞానం పట్ల మక్కువకు రాజు అభినందనలు తెలిపాడు. భవిష్యత్తులో జరపబోయే తవ్వకాలు కూడా ఇలాంటి విజయాన్నే చేకూర్చగలవన్న ఆశాభావాన్ని ప్రకటించాడు.

స్లీమన్ తను తవ్వకాలు జరిపిన చోటునుంచి మొదటిసారి వట్టి చేతులతో తిరిగి వెడుతున్నాడు. మైసీనియాలో అతను కనుగొన్నవన్నీ గ్రీకు ప్రభుత్వం ఆస్తిగా మారబోతున్నాయి. తవ్వకాలు జరిగినంత కాలం తనకు పక్కలో బల్లెంలా ఉంటూవచ్చిన స్టెమటేక్స్ తనకంటే ముందే పరిశోధనాంశాలను బహిర్గతం చేయడం ప్రారంభించాడు. దాంతో ఆగ్రహించిన స్లీమన్, అతన్ని నిరోధించాలనీ, పరిశోధనాంశాలను వెల్లడించే హక్కు తనకే ఉంది తప్ప ప్రభుత్వానికి కాదనీ స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి తంతి పంపించాడు.

ఆవిధంగా ప్రభుత్వంతో అతనికి మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈమధ్యలో నాప్లియో పట్టణ పాలకవ్యవస్థ జోక్యం చేసుకుని అక్కడ దొరికిన నిక్షేపాలను అక్కడే భద్రపరచాలని డిమాండ్ చేసింది. అది పట్టణానికి చెందిన ఆస్తి అనీ, దానివల్ల పట్టణానికి మేలు జరుగుతుందనీ నొక్కి చెప్పింది. ఇది తెలిసి స్లీమన్ రగిలిపోయాడు. ఇంకోవైపు, తన పరిశోధనాంశాలపై ప్రసిద్ధ పురావస్తు సొసైటీలు అన్నింటికీ తంతి పంపుతూ;  తవ్వకాలు జరిపిన ప్రదేశంలో  భారీ సంఖ్యలో తీసిన ఛాయాచిత్రాల కూర్పుపై ఆలోచన చేస్తూ, నోట్సు, డైరీలు రాసుకుంటూ గడిపాడు. యథావిధిగా జర్మన్లు అతని నిర్ధారణలను ఎద్దేవా చేస్తూ కొట్టి పారేశారు. ఫ్రాన్స్ ఆసక్తి చూపించలేదు. ఒక్క ఇంగ్లండ్ మాత్రమే అతని ఉత్సాహంలో పాలుపంచుకుంది.

శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడిపాడు. తన రికార్డులకోసం ఆగొరా పూర్తి రేఖాచిత్రం గీసి తెమ్మని మైసీనియాలో తన దగ్గర పనిచేసిన యువ ఇంజనీర్ వసీలియోస్ డ్రొసినోస్ ను పంపించాడు. ఆగొరాకు దక్షిణంగా పాక్షికంగా తవ్వకాలు జరిగిన చోట అతనికి పైపైన చెక్కిన రాళ్ళు కనిపించాయి. అవి సమాధి మందిరంలో కనిపించిన రాళ్లలా ఉన్నాయి. అదే రోజున మైసీనియాకు వచ్చిన స్టెమటేక్స్ తో వాటి గురించి చర్చించాడు. ఒక పనివాణ్ణి రప్పించి అక్కడ తవ్వించారు. ఒక స్వర్ణపాత్ర బయటపడింది. ఆ తర్వాత మరో అయిదు బంగారు పాత్రలు బయటపడ్డాయి. వాటిలో నాలుగింటికి కుక్క తల ఆకారంలో సున్నితంగా మలచిన కాడలు ఉన్నాయి. ఒకటి ఏ అలంకారమూ లేకుండా సాదాగా ఉంది. ఆపైన బంగారు తీగనుంచి మలచిన ఎన్నో ఉంగరాలు, రెండు స్వర్ణముద్రలు బయటపడ్డాయి. వాటిలో ఒకదాని మీద కొన్ని జంతువుల తలలు, మొక్కజొన్న కంకులు చిత్రితమై ఉన్నాయి. రెండోది మాత్రం కళాఖండమని చెప్పవచ్చు.

అది అమ్మ(Mother Goddess)వారికి చెందిన స్వర్ణముద్ర. మొదటి సమాధిలో దొరికిన బంగారు ముసుగులానే ఇది కూడా మైసీనియా ప్రజల ప్రగాఢ మతవిశ్వాసానికి అద్దంపడుతోంది. దాని మీద  అమ్మవారికి  నైవేద్యం ఇస్తున్నట్టు సూచించే చిత్రం ఉంది. అది కూడా అతి నిరాడంబరంగా ఉంది. దేవాలయం, పీఠం, తెరలు, తంతులు మొదలైనవి లేవు. అమ్మవారు ఒక పవిత్రవృక్షం కింద కూర్చుని ఉంది. తలపై పువ్వులు తురుముకుంది. ఆమె చేతిలో కూడా పువ్వులు ఉన్నాయి. కులీనతను చాటే ఇద్దరు యువతులనుంచి పువ్వులు స్వీకరిస్తోంది. బహుశా వాళ్ళు పూజారిణులు కావచ్చు. అమ్మవారి ఎదురుగా నిలబడిన ఒక పరిచారిక ఆ ఇద్దరినీ అమ్మవారికి చూపుతోంది. ఇంకొక పరిచారిక చిన్న రాతిగుట్టను ఎక్కి పవిత్రవృక్షఫలాన్ని తెంపుతోంది. అది అమ్మవారికి నివేదన చేయడానికి కావచ్చు. ముడతలు, ముడతలుగా ఉండి, మంచి అల్లికపని చేసిన జోడులంగాలను అందరూ ధరించారు. వీరుల యుగానికి చెందిన మైసీనియా సంస్కృతిలో అలాంటి జోడు లంగాలనే ధరించేవారు. అమ్మవారిలానే అందరూ నగ్నవక్షాలతోనూ, తలపై పువ్వులు, ఇతర అలంకారాలతోనూ ఉన్నారు.

పూజారిణులకు, అమ్మవారికి మధ్యలో రెండు జంట గొడ్డళ్ళు ఉన్నాయి. వాటిలో ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ఈ జంట గొడ్డళ్ళు బహుశా లౌకిక, పారలౌకిక శక్తులను రెంటినీ సూచిస్తూ ఉండచ్చు. పూజారిణులకు పైన; శిరస్త్రాణామూ, చేతిలో ఖడ్గమూ ధరించిన ఒక యువతి గాలిలో తేలుతున్నట్టు ఉంది. ఆమెను ఎనిమిది(8)అంకె ఆకారంలో ఉన్న ఒక డాలు కప్పి ఉంది. మనకు తెలిసినంతవరకు ఒక సాయుధ దేవతను చిత్రిస్తున్న తొలిచిత్రం ఇదే. ఈమెకు ఒక పక్కన ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యుడు, చంద్రవంక చిత్రాలు ఉన్నాయి. అవి మధ్యాహ్నాన్నీ, రాత్రినీ కూడా సూచిస్తున్నాయి.

ఈ చిత్రంలోని వ్యక్తులందరిలో ప్రశాంతత, పవిత్రత ఉట్టిపడుతున్నాయి. అప్పటి జనం, జీవితంపట్ల ధీమాతో ఎంతో ప్రశాంతజీవనం సాగిస్తున్న సంగతిని ఈ స్వర్ణముద్రలోని ప్రతి వివరం సూచిస్తోంది. ఈ ముద్ర ఎంత చిన్నదంటే, ఒక అంగుళం వెడల్పును మించిలేదు. కళాకారుడు అంత చిన్న ముద్రలోనే శతాబ్దాలుగా సంతరించుకున్న మతవిజ్ఞానాన్ని అంతటినీ అద్భుతంగా రంగరించాడు. స్వర్గశక్తి కాంతి రూపంలో వలయాలు వలయాలుగా కిందికి ప్రవహిస్తోంది. పవిత్రమైన తోపులో కూర్చుని ఉన్న అమ్మవారి నుంచి అదే శక్తి పొంగిపొరలుతోంది. పూజారిణులలో వినయవిధేయతలకు బదులు,  ఒక హక్కుగా తాము అమ్మవారి దగ్గర ఉన్నామన్న భావన కనిపిస్తోంది.  అమ్మకు నివేదన చేయడంలో ప్రేమాభిమానాలు తొంగిచూస్తున్నాయి. ఈజిప్టు చిత్రాలలో దేవతలకు నివేదన చేసేటప్పుడు భక్తులలో కనిపించే దాస్యభావన వీరిలో కనిపించడంలేదు. వీరిలో ఒక మానవీయమైన ఆత్మగౌరవం, హుందాతనం వ్యక్తమవుతున్నాయి. సూర్య, చంద్ర కాంతులలో స్నానమాడుతూ స్వేచ్ఛగా సంచరించేవారిలా కనిపిస్తున్నారు.

ఈ స్వర్ణముద్ర సంకేతించే పూర్తి అర్థమేమిటో తెలియదు. చిత్రానికి ఒక పక్కన ఆరు విచిత్రమైన వస్తువులు కనిపిస్తున్నాయి. అవి బంగారు ముసుగులో, కపాలాలో, శిరస్త్రాణాలో, పవిత్రపుష్పాలో లేక మరొకటో తెలియదు. ఆ పవిత్రవృక్షం దేనిని సూచిస్తోందో కూడా చెప్పలేం. స్టెమటేక్స్ నుంచి అతి కష్టం మీద ఈ స్వర్ణముద్ర ఫోటో ను సంపాదించి పరిశీలించిన స్లీమన్, అందులోని చెట్టు ఫలాలు అనాసలో లేదా మధ్య అమెరికాలో తను చూసిన పనస తరహా పండ్లో కావచ్చు ననుకున్నాడు.  అందులోని స్త్రీలు శిరస్త్రాణం లాంటిది ధరించారనుకున్నాడు. వాళ్ళలో కనిపించే పురుషలక్షణాలు అతనికి విస్తుగొలిపాయి. వాళ్ళ లంగాలకు ఉన్న పట్టీలు చంద్రవంక ఆకారంలో ఉన్నాయనుకున్న స్లీమన్, అలాంటి చంద్రవంక రూపాలే స్వర్ణముద్ర అంతటా ఉన్నాయని అనుకున్నాడు. సూర్య, చంద్రుల కింద అలలు అలలుగా ఉన్న గీతలు సముద్రాన్ని సంకేతిస్తున్నాయని ఊహించాడు. అవి స్వర్గకాంతి వలయాలనూ, లేదా పాలపుంతనూ కూడా సూచిస్తూ ఉండచ్చు.

అఖిలెస్ కోసం ఈఫెస్టస్ (లోహపు పని చేసే గ్రీకు దేవుడు) అయిదు వలయాలు కలిగిన ఓ పెద్ద డాలును ఎలా తయారు చేశాడో ఇలియడ్ లో హోమర్ వర్ణించాడు.  మొదటి వలయం భూమి, ఆకాశం, సముద్రం, అలుపనేది ఎరగని సూర్యుడు, పూర్ణచంద్రుడు, నక్షత్రమండలాలను సూచిస్తుంది. స్లీమన్ మొదటిసారి అమ్మవారి స్వర్ణముద్రను చూసినప్పుడు ఉత్తేజితుడయ్యాడు. “అఖిలెస్ డాలుకు ఈఫెస్టస్ ఎలాంటి మహిమలు కల్పించాడో వర్ణించిన హోమర్, బహుశా ఈ స్వర్ణముద్రను చూసి ఉంటా”డని తన పక్కనే ఉన్న సోఫియాతో అన్నాడు. అంతటి విశిష్టమైన స్వర్ణముద్ర మొదట తన కంట పడనందుకు ఎంతో విచారించాడు. అయితే, తను కనుక ఇంజనీర్ ను పంపి ఉండకపోతే అది ఎప్పటికీ బయటపడేదే కాదనుకుని ఊరడిల్లాడు.

మైసీనియాలో తను కనుగొన్న విశేషాలకు పుస్తకరూపమిస్తూ ఎనిమిది వారాలు గడిపాడు. వెంటనే దానిని ఫ్రెంచ్, ఇంగ్లీష్ లలోకి అనువదించడం ప్రారంభించాడు. ఆ తర్వాత, తన పుస్తకానికి పరిచయవ్యాసం రాయవలసిందిగా బ్రిటిష్ రాజకీయ కురువృద్ధుడు, గొప్ప హోమర్ అధ్యయనవేత్త అయిన  గ్లాడ్ స్టన్ ను కోరాడు. తన ప్రశంసకు అపార్థాలు కల్పించవచ్చునని భయపడి గ్లాడ్ స్టన్ అందుకు వెనకాడాడు. వేసవిలో లండన్ సందర్శించిన స్లీమన్ తనతో ట్రాయ్ నిక్షేపాలను తీసుకువెళ్లి, సౌత్ కెన్సింగ్టన్ మ్యూజియంలో వాటిని ప్రదర్శింపజేశాడు. గ్లాడ్ స్టన్ కు అవి నిజంగానే ట్రాయ్ నిక్షేపాలన్న నమ్మకం చిక్కకపోయినా, స్లీమన్ పాండిత్యానికి ముగ్ధుడై చివరికి నలభై పుటల పరిచయవ్యాసం రాసి ఇచ్చాడు.

అమ్మవారి స్వర్ణముద్ర ప్రత్యేకించి గ్లాడ్ స్టన్ ను ఆకట్టుకుంది. తొలి సమాధిలో కనిపించిన కళేబరం అగమెమ్నన్ దే కావచ్చని స్లీమన్ లానే ఆయనా అనుకున్నాడు. రూపురేఖలు పదిలంగా ఉన్నాయి కనుక, దానిని భద్రపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనీ, మృతుడు ఒక విశిష్ట వ్యక్తి అయినప్పుడే అలా జరుగుతుందనీ భావించాడు. అగమెమ్నన్ వెంట ఎప్పుడూ ఇద్దరు పురోహితులు ఉండి హెచ్చరికుల పాత్ర నిర్వహిస్తూ ఉంటారని ఇలియడ్  చెబుతోంది కనుక, సమాధిలో ఈ కళేబరం పక్కనే కనిపించిన రెండు కళేబరాలూ నిస్సందేహంగా వాళ్ళవే అయుంటాయని గ్లాడ్ స్టన్ అనుకున్నాడు.

లండన్ లో తను పొందిన గౌరవాదరాలకు స్లీమన్ పొంగిపోయాడు. గ్లాడ్ స్టన్ తో కలసి విందుభోజనం చేశాడు. ఎథెన్స్ లో అస్వస్థతతో ఉన్న సోఫియాకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె పక్కన లేకుండా అతను ఎక్కువ రోజులు గడపలేడు. ఎట్టకేలకు, రాయల్ ఆర్కియలాజికల్ సొసైటీ సభ్యులు ఆమెను ప్రసంగానికి ఆహ్వానించడంతో వెంటనే లండన్ వచ్చి భర్త పక్కనే వేదికను అలంకరించింది. ఇరవై అయిదు రోజుల పాటు, సమాధులలోని పురాతన మైసీనియా రాజులు, రాణుల కళేబరాల మధ్య మోకాళ్ళ మీద కూర్చుని వాటిని కప్పిన మట్టి పొరలను తను ఎంత జాగ్రత్తగా తొలగించిందో సరళమైన ఇంగ్లీష్ లో వివరించింది. కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ప్రశంసాసూచకంగా స్లీమన్ చిరునవ్వు చిందించాడు. ఆమె ప్రసంగ పాఠాన్ని తనే రాసి ఇచ్చాడు. ఒక్క తప్పు కూడా  లేకుండా లేకుండా రాసింది రాసినట్టు ఆమె అప్పగించినందుకు సంతోషించాడు. అంతకు మించిన సంతోషం అతన్ని త్వరలోనే ముంచెత్తబోతోంది. అప్పుడామె గర్భవతి. కొడుకు పుట్టబోతున్నాడు. పేరు కూడా స్లీమన్ ముందే నిర్ణయించేశాడు: అగమెమ్నన్!

పద్దెనిమిది మాసాలపాటు ప్రశంసల జల్లులో పులకరిస్తూ గడిపిన తర్వాత, 1878 వేసవిలో తిరిగి తవ్వకాలను చేపట్టాడు. ఈసారి ఇథకాలోని ఒడీసియస్ ప్రాసాదాన్ని కనుక్కోగలననుకున్నాడు. మౌంట్ అయోటిస్ పైన జూలైలో రెండు వారాలపాటు తవ్వకాలు జరిపించాడు. 190 ఇళ్ల శిథిలాలు తప్ప విలువైన వేవీ కనిపించలేదు. దాంతో తవ్వకాలు విరమించాడు.

మరోసారి ట్రాయ్ వైపు గాలి మళ్ళింది.  అక్కడ తవ్వకాలను కొనసాగించడానికి  టర్కీ ప్రభుత్వం నుంచి ఫర్మానా పొందడంలో ఈసారి గ్లాడ్ స్టన్ సాయంతోపాటు, కాన్ స్టాంట్ నోపిల్ లో బ్రిటిష్ రాయబారిగా ఉన్న ఆస్టెన్ లేయర్డ్ సాయం కూడా లభించింది. అసీరియన్ల నగరం నినవే(Nineveh)ను కనుగొన్న పురావస్తు నిపుణుడిగా లేయర్డ్ ప్రసిద్ధుడు. టర్కీ ప్రభుత్వం ఫర్మానా ఇస్తూనే ముందు జాగ్రత్తగా తవ్వకాల పర్యవేక్షణకు ఒక స్పెషల్ కమిషనర్ ను, పదిమంది పోలీసులను నియమించింది.

హిస్సాలిక్ కు వెళ్ళడం స్లీమన్ కు ఇది ఆరోసారి. సెప్టెంబర్ లో పని ప్రారంభించాడు. రెండు మాసాలవరకూ విలువైనవేవీ దొరకలేదు. 1878 అక్టోబర్ 21న, బ్రిటిష్ యుద్ధనౌకకు చెందిన కొందరు అధికారుల సమక్షంలో ప్రియామ్ ప్రాసాదం తాలూకు ఈశాన్య ప్రదేశాన్ని కనుగొన్నాడు. తనకు మొదటి ట్రోజన్ నిక్షేపాలు దొరికిన ప్రదేశానికి ఇది ఆట్టే దూరంలో లేదు. ఇక్కడ 20 బంగారు కర్ణాభరణాలు, పెద్ద సంఖ్యలో బంగారు ఉంగరాలు, బంగారు-వెండి మిశ్రమంతో చేసిన రెండు పెద్ద కంకణాలు, 11 వెండి చెవిపోగులు, 158 వెండి ఉంగరాలు, లెక్కలేనన్ని బంగారు పూసలు బయటపడ్డాయి. మరికొన్ని రోజుల తర్వాత కొన్ని బంగారపు కడ్డీలు, బంగారు గుళ్ళు, ఒక స్వర్ణకంకణం, ఒక వెండి బాకు కనిపించాయి. నవంబర్ 26న తవ్వకాలు నిలిపివేశారు. ఈసారి మూడో వంతు నిక్షేపాలను మాత్రమే తన వద్ద ఉంచుకోడానికి స్లీమన్ ను అనుమతించారు. మిగిలివాటిని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియం కు పంపించారు.

అంతవరకూ అతన్ని వరిస్తూ వచ్చిన అదృష్టం తదుపరి వసంతంలో ఆఖరి అంకానికి చేరబోతోంది. ఫిబ్రవరిలో ట్రాయ్ కు చేరుకుని ఎమిలీ బర్నాఫ్, రుడాల్ఫ్ ఫిర్కోల సాయంతో ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించాడు. నగర ప్రాకారాన్ని తవ్వి తీసి, హోమర్ ట్రాయ్ కు చెందిన పూర్తి రేఖాపటాన్ని తయారు చేయాలన్నది అతని ఆలోచన. ఏప్రిల్ లో కొన్ని బంగారు చక్రాలు, గొలుసులు, చెవిపోగులు, కంకణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అతనికి ఎలాంటి నిక్షేపాలూ కనిపించలేదు. ఒకప్పుడు అపార స్వర్ణసంపదతో అలరారే మూడు పట్టణాలు ఉండేవని హోమర్ చెప్పాడు. అవి: ట్రాయ్, మైసీనియా; బియోషా (Boeotia)లోని ఒకప్పటి గొప్ప నగరమైన అర్కమెనోస్. హోమర్ ను పరమప్రమాణంగా భావించే స్లీమన్, మరుసటి సంవత్సరం  అర్కమెనోస్ లో తవ్వకాలకు పూనుకున్నాడు. కానీ అతను ఆశించినట్టు స్వర్ణనిక్షేపాలు బయటపడలేదు.

అతని అదృష్టాధ్యాయం అంతటితో ముగిసింది!

(సశేషం)

 

 

 అగమెమ్నన్ ముఖం తొడుగు దొరికింది!

MaskOfAgamemnon

స్లీమన్ కథ-26

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఈసారి స్లీమన్ కు అన్నింటికన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగించినవి, అసంఖ్యాకంగా ఉన్నబంగారు బిళ్ళలు. ఈ ఒక్క సమాధిగదిలోనే అవి ఏడువందలకు పైగా లెక్కకొచ్చాయి.  ఆకులు, సీతాకోకచిలుకలు, ఆక్టోపస్ లు, నక్షత్రాలు, పొద్దుతిరుగుడు పువ్వులు…ఇలా అవి వివిధ ఆకృతులలో ఉన్నాయి. కొన్ని పూర్తిగా రేఖాగణితనమూనాలలో ఉన్నాయి. ఇవి యోధుల చేతిలోని డాలును సూచించే సంక్షిప్త రూపాలని స్లీమన్ అనుకున్నాడు. కానీ మరణానంతర జీవితంలో వెంట ఉండే  సామగ్రిని సూచించే ప్రతీకలు కావచ్చు.

స్వర్ణముద్రలతోపాటు పెద్ద సంఖ్యలో స్వర్ణఫలకాలు ఉన్నాయి. వీటిలో అంగుళం మించి వెడల్పు ఉన్న ఫలకాలు చాలా తక్కువ. పర్షియాలో జరిపిన తవ్వకాలలో దొరికిన సైరస్, గ్జెరెక్సెస్ ల కాలం నాటి సంక్షిప్త స్వర్ణ ఫలకాలకు ఇవి భిన్నంగా ఉన్నాయి.  కళాకారుడు బంగారు రేకులను తీసుకుని సింహాలు, రాబందులు, చేపలు, జింకలు, గద్దలు, హంసలుగా మలిచాడు. వాటిలో జీవం ఉట్టిపడుతోంది. ఇవి బహుశా మృతుల దుస్తులకు కుట్టిన అలంకారాలు అయుంటాయి.

మూడో సమాధిలో మూడు అస్థిపంజరాలు కనిపించాయి. ఎముకలు, దంతాల పరిమాణాన్ని బట్టి అవి స్త్రీలకు చెందినవని స్లీమన్ అనుకున్నాడు. కానీ కవచాలు ధరించిన రాజు, ఇద్దరు రాకుమారులకు చెందినవి కావచ్చు. ఎముకల మధ్య ఒక బాకు, బంగారు తాపడంతో వెండితో చేసిన రెండు రాజదండాలు ఉన్నాయి.

మూడో సమాధి తెరచుకోవడంతో, మిగిలిన ఆగొరా మొత్తంలో తవ్వకాలకు స్లీమన్ సిద్ధమయ్యాడు. ఎక్కడనుంచి ప్రారంభించాలో మొదట అర్థం కాలేదు. అంతలో, ఆగొరాలోని మిగిలిన చోట్లకు భిన్నంగా మూడో సమాధికి పశ్చిమదిశలో మట్టి నల్లగా ఉన్నసంగతిని అతను గమనించాడు. అక్కడ 15 అడుగుల లోతున తవ్వించాడు. కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. మరో 9 అడుగుల  లోతున తవ్వేసరికి నాలుగు అడుగుల ఎత్తైన ఒక గుండ్రని వేదిక లాంటిది కనిపించింది. అది నూతి వరలా తెరచుకుని ఉంది.  మృతవీరులను సమాధి చేసి, వారి గౌరవార్థం దానిని నిర్మించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. బహుశా  మృతవీరులను ఉద్దేశించి అందులోకి కానుకలు జారవిడిచి ఉంటారని కూడా ఊహించాడు. సుమేరియాకు చెందిన రాచసమాధుల దగ్గర కూడా ఇలాగే మట్టి గొట్టాలు లేదా బిలాల లాంటివి కనిపించాయి. వాటిలోంచి మృతులకు బలులు, కానుకలు అర్పించేవారు. అయితే, స్లీమన్ కాలానికి అక్కడ తవ్వకాలు జరగలేదు. కనుక స్లీమన్ సొంత ఊహ మీదే ఆధారపడ్డాడు. ఆ ఊహే నిజమన్న నిర్ధారణకు ఆ తర్వాతి నిపుణులు కూడా వచ్చారు.

ఆ గుండ్రని నిర్మాణం అడుగున మరో మూడు అడుగులు తవ్వించాడు. స్వర్ణనిక్షేపాలతో నిండిన మరో సమాధి కనిపించింది. బంగారమూ, నగలూ కప్పిన మరో అయిదు కళేబరాలు కనిపించాయి. వాటిలో మూడు బంగారు ముసుగులు(ముఖాచ్ఛాదనలు) ధరించి ఉన్నాయి.  నాలుగవ కళేబరం శిరసు దగ్గర వంగిన మరో బంగారు ముసుగు కనిపించింది. అది సింహశిరస్సు ఆకారంలో ఉంది. అది శిరస్త్రాణం కావచ్చని స్లీమన్ అనుకున్నాడు.

ఈ నాలుగు ముసుగుల్లోనూ ఒకటి, మనిషి కవళికలను గుర్తించలేనంతగా శిథిలమైంది. కొన్ని నిమిషాలపాటు దానిని తదేకంగా చూస్తూ;  ఎత్తైన నుదురు, పొడవాటి గ్రీకు నాసిక, పలచని పెదవులతో చిన్న నోరు ఉన్న ఒక యువకుడి ముఖాన్ని అందులో పోల్చుకోడానికి  స్లీమన్ ప్రయత్నించాడు. ఈ ముసుగుకు స్పష్టమైన రూపురేఖలు లేకపోయినా, రెండు ముసుగులు మాత్రం ఆ నాలుగవ సమాధి వైభవానికి అద్దం పడుతున్నాయి. వాటిలోంచి ఓ అధికారమూ, ఆధిపత్యంతో పాటు దారుణమైన అందం తొంగి చూస్తోంది. వాటిపై మృత్యుచ్చాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. భయానకమైన కవళికలే తప్ప ప్రశాంతత కనిపించడం లేదు. ఈజిప్టు ఫారోల శవపేటికలపై ఉన్న ముసుగులకు ఇవి భిన్నంగా ఉన్నాయి. దారువుపై చిత్రించిన ఈజిప్టు ఫారోల ముసుగులలో పవిత్రత, ప్రశాంతత ఉట్టిపడుతూ ఉంటాయి. మైసీనియా ముసుగుల సరళి వెనుక మరేదో ప్రయోజనాన్ని ఉద్దేశించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. కళాకారుడు వాటిని ఆ వ్యక్తులు జీవించి ఉన్నప్పటి ముఖాలుగా తయారు చేయలేదు. వాటిపై మృత్యుచ్చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వేర్వేరు వ్యక్తులకు చెందిన  చిత్తరువులు కావచ్చునని కూడా స్లీమన్ అనుకున్నాడు. మృత్యుచ్చాయలు కనిపిస్తున్నా; నిస్సందేహంగా ప్రతి మూసుగూ వేర్వేరు వ్యక్తుల ముఖాన్నే సూచిస్తోందనీ, అలా కాని పక్షంలో అన్ని ముసుగులూ ఒకే మూసలో ఉండేవనీ రాసుకున్నాడు.

అవి వేర్వేరు వ్యక్తుల చిత్తరువులనే అనుకున్నప్పటికీ, జీవించి ఉన్నప్పుడు వారిని గుర్తుపట్టడానికి వీలైన దాదాపు అన్ని కవళికలూ చెరిగిపోయేంతగా కళాకారుడు వాటిని సరళీకరించి దాదాపు అమూర్తస్థాయికి కుదించాడు. ఒక ముసుగుపై కళ్ళు గోళాల్లానూ, ముఖంలోంచి పొడుచుకు వచ్చేలానూ ఉండి మృత్యువు రూపుగట్టే శూన్యతను సంకేతిస్తున్నాయి. ఇంకో ముసుగుపై నుదురు ఎత్తుగా ఉంది.  పెదవులు బిగుసుకుని అతుక్కునిపోయినట్టు ఉండి మరణబాధను సూచిస్తున్నాయి. పెరూలో కనిపించిన అచ్చం ఇలాంటి బంగారు ముఖాచ్ఛాదనల్లానే ఇవి కూడా చనిపోయిన ఆయా వ్యక్తుల చిత్తరవులను మించి, మృత్యుచిత్రాలులా కనిపిస్తున్నాయి.  వాటిలో ఒక అభౌతికమైన అందం ప్రకాశిస్తోంది. మరణించిన కొన్ని గంటల తర్వాత రాజులు, రాకుమారుల ముఖాలు ఎలా ఉన్నాయో అలాగే మలచడానికి కళాకారుడు ప్రయత్నించాడు తప్ప; ఎక్కువ వివరాలు చూపాలని అనుకోలేదు. అన్ని ముఖాలూ దాదాపు దేవతాముఖాలను తలపిస్తున్నాయి. మరణించిన పాలకులలో దివ్యాంశను సూచిస్తూ, తాము జీవించి ఉండగా చలాయించిన దివ్యాధికారాన్నే; మరణించిన తర్వాత కూడా వెంట నిలుపుకున్నారని చెప్పడం కళాకారుడి ఉద్దేశంలా కనిపిస్తుంది.

ఈ ముసుగులు వీక్షకులను భయసంభ్రమాలకు గురిచేస్తాయి. పాశ్చాత్య చరిత్ర పొడవునా చిత్రకారులు అనేకులు మృత్యువు రూపురేఖలు పట్టుకుని చిత్రించడానికి  ప్రయత్నించారు. కానీ ఈ అజ్ఞాత మైసీనియా చిత్రకారులంతగా సఫలులైనవాళ్లు చాలా అరుదు. మన నాగరికత తొలి నాళ్లకు చెందిన ఈ ముసుగు చిత్రాలు  మృత్యువును ఎంతో నిర్భయంగానూ, శక్తిమంతంగానూ, సరళంగానూ చిత్రించిన తీరు అసాధారణమనిపిస్తుంది.

అయితే, ఈ ముసుగుల వాస్తవిక ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలియదు. హోమర్ కానీ, మరో గ్రీకు పండితుడు కానీ ఇలాంటి మృత్యు ముఖాచ్ఛాదనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వాటిని మృతుల ముఖాలకు చుట్టి, వాటి సూత్రాలను చెవులకు చేసిన రంధ్రాలలో దూర్చి కట్టారు. దురదృష్టవశాత్తూ, ఆ అయిదుగురు మృతుల కపాలాలూ, భద్రపరచడానికి వీలులేనంతగా శిథిలమయ్యాయి. అవి బయటపడినప్పుడు వాస్తవంగా ఏ భంగిమలో ఉన్నాయో తెలియదు. బంగారు ముసుగులూ; కళేబరాల దగ్గర చెల్లా చెదరుగా పడున్న స్వర్ణాభరణాలూ మన కళ్ళముందు కనిపిస్తున్నాయి కానీ; ఆ రాతి సమాధుల్లో మృతదేహాలను ఎలా ఉంచేవారో, ఎలాంటి తంతు జరిపేవారో- ఆ మొత్తం సన్నివేశాన్ని ఇప్పుడు ఊహించుకోగలిగినంతగా మనకు ప్రాచీన గ్రీసు గురించిన పరిజ్ఞానం లేదు.

చదునుగానూ, విరిగీ ఉన్న సింహపు శిరస్సును మొదటిసారి చూసినప్పుడు శిరస్త్రాణం కాబోలని స్లీమన్ అనుకున్నాడు.  అందులో ఉండాల్సిన చిన్న చిన్న ముక్కలు మాయమయ్యాయనిపించింది. దానిని మరోసారి చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించాడు.  అందులో సింహపు కళ్ళను, చెవులను, ముట్టెను పోల్చుకుంటూ, అది కచ్చితంగా ముఖం మీద ధరించే ముసుగు అయుంటుందనుకున్నాడు. అయితే, అనంతరకాలంలో, ముట్టె నుదుటిమీద ఆనేలా రాజులు సింహశిరస్సును శిరస్త్రాణాలుగా ధరించడం కనిపిస్తుంది.  అలెగ్జాండర్ నాణేల మీద అలాంటి శిరస్త్రాణమే ఉంటుంది. కనుక స్లీమన్ మొదట అనుకున్నదే నిజం కావచ్చు.

నాలుగవ సమాధిలో కనిపించిన స్వర్ణసంపద స్లీమన్ ను సైతం విచలితుణ్ణి చేసింది. బంగారు ముసుగులు అందులో స్వల్పభాగం మాత్రమే. రెండు కళేబరాల మీద స్వర్ణ వక్షస్త్రాణాలు(breast plates)ఉన్నాయి. ఇంకో కళేబరం మీద చంచలించే ఆకులున్న కిరీటం ఉంది. పదకొండు గుండ్రని భారీ స్వర్ణపాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకదాని చేతులపై రెండు పావురాలు ఎంతో సున్నితంగా చెక్కి ఉన్నాయి. ఆ పాత్ర అచ్చంగా ఇలియడ్ లో వర్ణించిన నెస్తార్ కు చెందిన మద్యపాత్రలా ఉంది [నెస్తార్: మైసీనియాలోని ఒక పట్టణమైన పీలోస్ ను పాలించిన రాజనీతిజ్ఞుడైన రాజు. ఇలియడ్ ప్రకారం, ట్రోజన్ యుద్ధంలో గ్రీకుల పక్షాన పోరాడాడు. మహాభారతంలోని భీష్ముడిలా మూడు తరాలను చూసిన వీరుడు, మంచి సలహాదారు] “బంగారు సూచికలు (పిన్నులు) పొదిగి, రెండు పావురాలతో అలంకృతమైన” పాత్రగా దానిని ఇలియడ్ వర్ణించింది. ఆపైన బంగారు వడ్డాణాలు, జడకట్లు(రిబ్బన్లు), మోకాలి దగ్గర కట్టుకునే ఒక బంగారు పట్టీ, ఒక బంగారు కవచం, బంగారు పతకాలు, పిన్నులు; ఒక అంగుళం కంటే చిన్నవిగా ఉన్న రెండు తలల బంగారు గొడ్డళ్ళు, బంగారు రేకులు ఆచ్ఛాదించిన 12 భారీ బొత్తాలు, నాణేలను తలపిస్తున్న 400 కు పైగా స్వర్ణముద్రలు,  150 బంగారు బిళ్ళలు, ఒక బంగారు చేప, కత్తి పిడులుగా  మలచి ఉపయోగించినట్టు అనిపిస్తున్న 10 బంగారు రేకులు, రాగి కాగులు, కంచుతో చేసిన మొనదేలిన కత్తులు, బంగారు కొమ్ములతో ఉన్న ఒక వెండి గోవు శిరస్సు కనిపించాయి. ఈ సమాధిలో కనిపించిన అనేక వస్తువుల్లానే గోశిరస్సు కూడా పవిత్రతను చాటే తెగ(tribe)చిహ్నం అయుంటుంది. కళ్ళకు మిరుమిట్లు గొలిపే ఈ స్వర్ణరాశి మధ్యనే ఆశ్చర్యకరంగా లెక్కలేనన్ని ఆల్చిప్పలు కనిపించాయి. వీటిలో కొన్నింటిని అసలు తెరవనేలేదు.

తను ట్రాయ్ లో కనుగొన్న నిక్షేపాల కన్నా ఎక్కువ నిక్షేపాలు ఈ ఒక్క నాలుగవ సమాధిలోనే స్లీమన్ కు కనిపించాయి. ఈసారి దానికి నేరుగా ఉత్తరం వైపున తవ్వకాలు ప్రారంభించాడు. క్రమంగా అయిదవదీ, చివరిదీ అయిన సమాధి బయటపడింది. అందులో దోపిడీ జరిగిన ఆనవాళ్ళు కనిపించాయి. ఒక్క కళేబరం మాత్రమే ఉంది. అది కూడా పూర్తిగా శిథిలమై పొడి పొడిగా రాలిపోయేలా ఉంది. పక్కనే ఒక స్వర్ణకిరీటం, ఒక బంగారు పానపాత్ర, ఒక ఆకుపచ్చని కలశం, స్వల్ప సంఖ్యలో మట్టి బొమ్మల శకలాలు కనిపించాయి.

ఇంతకుముందు మొదటి సమాధి దగ్గర తవ్వకాలు ప్రారంభించినప్పుడు అది బురదతో నిండిపోవడం వల్ల పని ఆగిపోయింది. కొన్ని వారాలపాటు బాగా ఎండ కాయడంతో ఆ బురద ఎండిపోయి తిరిగి అక్కడ పని ప్రారంభించే అవకాశం కలిగింది. మొదట్లో అది ఖాళీగా ఉన్నట్టు అతనికి అనిపించింది. కానీ మరింత లోతుగా తవ్వేసరికి మూడు కళేబరాలు కనిపించాయి. వాటి పక్కనే కొద్దిపాటి నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో రెండు బంగారు ముసుగులున్నాయి.  ఒకదాని కపాలానికి ఇప్పటికీ కొంచెం చర్మం అతుక్కుని ఉంది. పైన పడిన శిథిలాల బరువువల్ల ఆ కళేబరం అణిగి సాపుగా మారిపోయింది. ముక్కు లేదు. అయినా ముఖంలో గుర్తించగలిగిన కవళికలు కనిపిస్తున్నాయి. స్లీమన్ దానిని చూస్తూనే ఉత్తేజం పట్టలేకపోయాడు. ఆ ముఖంలో అతనికి అగమెమ్నన్ పోలికలు కనిపించాయి!

అది గుండ్రంగా ఉండి, ముప్పై అయిదేళ్ళ పురుషుడి ముఖంలా కనిపించింది. అన్ని దంతాలూ పటిష్టంగా ఉన్నాయి. ఒక పెద్ద స్వర్ణ వక్షస్త్రాణాన్ని ధరించి ఉన్నాడు. అతని నుదుటి మీదా, వక్షస్థలం మీదా, తొడల మీదా బంగారు ఆకులు పరచి ఉన్నాయి. అతని ముఖానికి పక్కనే పడున్న బంగారు ముసుగు సాపుగా అయిపోయింది. స్లీమన్ దానిని చేతుల్లోకి తీసుకుని పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఎథెన్స్ లోని మంత్రికి తంతి పంపించాడు. ఈ చివరి సమాధిలో కనుగొన్న మూడు కళేబరాలలో ఒకదాని ముఖంలో తను ఎంతో కాలంగా ఊహించుకుంటున్న అగమెమ్నన్ పోలికలు కనిపిస్తున్నాయనీ, ఆ ముఖ కవళికలను భద్రపరచడానికి చిత్రకారుని పంపవలసిందిగా నాప్లియోకు తంతి పంపాననీ అందులో తెలియజేశాడు.

ఆ పురాతన వీరుని కళేబరాన్నీ, దాదాపు భద్రస్థితిలో ఉన్న అతని ముఖాన్నీ చూడడానికి ఆర్గోస్ మైదాన ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దాని బొమ్మ గీయడానికి నాప్లియోనుంచి ఒక చిత్రకారుని రప్పించారు. శాస్త్రీయపద్ధతుల్లో భద్రపరిచే లోపల అది ఎక్కడ పొడి పొడి అయిపోతుందో నని భయపడుతూ  స్లీమన్ రెండురోజులపాటు ఆ పనులను పర్యవేక్షించాడు. ఆర్గోస్ నుంచి ఒక నిపుణుడు వచ్చి దాని మీద ఒక ద్రావణాన్ని పోసాడు. దాంతో అది గట్టిపడిన వెంటనే దానిని విజయవంతంగా ఎథెన్స్ కు తరలించారు.

నాలుగవ సమాధిలో దొరికిన విస్తారమైన స్వర్ణరాశులతో పోల్చితే,  దోపిడీ ఆనవాళ్ళు కనిపిస్తున్న మొదటి సమాధిలో దొరికినవి నామమాత్రమే కానీ; వాటిలో కూడా స్వర్ణపాత్రలు, స్వర్ణ వక్షస్త్రాణాలు, 12 బంగారు పలకలు ఉన్నాయి. ఆ పలకల్లో కొన్నింటిపై జింకలను సింహాలు వేటాడుతున్న చిత్రాలు ఉన్నాయి. ఆపైన బంగారు పిడులు ఉన్న 80 కంచు ఖడ్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా పదునుగా ఉన్నాయి. ఇంకా, ఒక కరవాలం తాలూకు బంగారు కుచ్చు, ఒక వీరుడి కళేబరం మీద పొడవాటి బంగారు పట్టీలు ఉన్నాయి. అన్నింటిలోనూ విశేషంగా చెప్పదగినది ఇక్కడ దొరికిన బంగారు ముసుగు. అది మిగిలిన ముసుగులన్నిటికన్నా చాలా అందంగా ఉంది.

మైసీనియాలో స్లీమన్ కనుగొన్నవాటిలో ఈ ముసుగే చివరిది. మిగిలిన వాటిలో లేని ఒక పరిపూర్ణత దీనిలో ఉంది. మిగిలినవి మృత్యువును శక్తిమంతంగా సూచిస్తున్నాయి కానీ, వాటిలో మర్త్యత్వం ఉంది. కానీ ఈ ముసుగులో శక్తిమంతతే కాక; ఒక పవిత్రత, నైర్మల్యం, ఉదాత్తత ఉట్టిపడుతున్నాయి. ఇతర ముసుగులు ఆయా వీరుల అంతిమక్షణాలలోని మృత్యుచ్ఛాయలను సూచిస్తూ ఉంటే, ఈ ముసుగు వాటికి భిన్నంగా ఒక వీరుడు దేవుడిగా మారిన క్షణాలను సూచిస్తోంది. అందులో మర్త్యత్వపు ఆనవాళ్ళు కాకుండా, కేవలం ప్రసన్నత తొంగి చూస్తోంది. విశాలమైన నేత్రాలు మూసుకుని ఉన్నాయి. కనురెప్పలు స్పష్టంగా గుర్తించబడి ఉన్నాయి. పలచని పెదవులు ఒక మార్మికమైన చిరునవ్వును వెలార్చుతూ మూసుకుని ఉన్నాయి. గెడ్డం ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కనుబొమలు దట్టంగా చెక్కి ఉన్నాయి. మొత్తంగా ఆ కనుబొమలు, మీసాలు, పెదవులపై ఆ చిరునవ్వు ముఖానికి ఒక విచిత్రమైన లోతును సంతరిస్తున్నాయి. క్రీస్ట్ ఆఫ్ డఫ్నె[అలబామా, అమెరికాలో ఉన్న ప్రసిద్ధ కేథలిక్ చర్చి], చేఫాలు[ఇటలీలో, సిసిలీ ఉత్తరతీరంలో, పలేమో రాష్ట్రంలో ఉన్న నగరం], పలేమో [ఇటలీ దీవి అయిన సిసిలీ రాజధాని. 12వ శతాబ్దికి చెందిన ఇక్కడి కెథెడ్రల్ ప్రసిద్ధమైనది. ఇక్కడ రాచ సమాధులు ఉన్నాయి]వంటి అద్భుతనిర్మాణాలతో పోల్చదగిన ఆ ముఖం, ప్రాచీన చిత్రకళ సాధించిన ఉన్నతికి అద్దంపడుతోంది.

ట్రాయ్ లో దొరికిన స్వర్ణహారకిరీటాలు, మైసీనియాలో దొరికిన స్వర్ణకిరీటాలు, విస్తారమైన మిగతా స్వర్ణరాశులు అప్పటి జనం ఇంకా మోటుగానూ, అనాగరికదశలోనూ ఉన్నట్టు సూచిస్తున్నాయి. సైనికులను చిత్రించిన కలశం నాటి యోధులు యుద్ధానికి ఎలా వెళ్ళేవారో చెబుతోంది. సమాధులలో దొరికిన బంగారు నగలు ఉత్సవ సందర్భాలలో వాళ్ళు ఎలా అలంకరించుకునేవారో వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్క ముఖాచ్ఛాదన మాత్రం దేవతలపట్ల వారు ఎంత ప్రగాఢమైన భక్తిగౌరవాలను చాటేవారో సూచిస్తోంది.

మైసీనియాలో స్లీమన్ తవ్వకాలు ముగిశాయి.

(సశేషం)

 

 

 

 

 

ఇది ఆర్ట్ ఆఫ్ డయింగ్!

 

 

-కల్లూరి భాస్కరం

~

 

కల్లూరి భాస్కరం

భారతదేశంలో ఈరోజున జరుగుతున్నది అక్షరాలా యుద్ధం…భావజాలాల మధ్య యుద్ధం. అందులో నాకైతే ఎలాంటి సందేహం లేదు. భావజాలఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడది  యుద్ధ రూపం ధరించి, నానాటికీ తీవ్రమవుతోంది. యుద్ధంలోని ఒక పక్షం వారికి అదనంగా అధికారబలం ఉంది కనుక అది క్రమంగా భౌతికయుద్ధంగా కూడా మారుతోంది. అది దాని సహజపరిణామం. దేశద్రోహి మొదలైన ముద్రలు వేయడం…అరెస్టులు చేయడం…దాడులు చేయడం…న్యాయస్థానాలు సైతం భౌతికయుద్ధ క్షేత్రాలు కావడం…ఇదీ దాని క్రమం.

ఇప్పుడు జరిగే ఏ పరిణామాన్ని చర్చించడానికి పూనుకున్నా ఇది యుద్ధం అన్న స్పృహతోనే పూనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు జరిగే ఏ పరిణామం గురించిన చర్చకైనా ‘యుద్ధం’ అన్నదే విశాల శీర్షిక. ‘రోహిత్ ఆత్మహత్య ఒక సరికొత్త/పాత సందర్భం’(సారంగ/జనవరి 23, 2016)అన్న నా వ్యాసాన్ని జరుగుతున్నది యుద్ధం అన్న ఉద్ఘాటనతోనే ముగించాను. ఇప్పుడు ఏది రాసినా దానికి కొనసాగింపే.

యుద్ధం అన్నప్పుడు సాధారణ నీతి నియమాలు, తర్క వితర్కాలు, హేతు నిర్హేతుకలు పక్కకు తప్పుకుంటాయి. యుద్ధం తనదైన నీతి నియమాలను, తర్కవితర్కాలను, హేతు నిర్హేతుకలను అనుసరిస్తుంది. యుద్ధమనే అసాధారణమైన ఒత్తిడిలో అందులో పాల్గొనే అన్ని పక్షాలలోనూ అదే జరుగుతుంది. ఏ మహాయుద్ధాన్ని తీసుకున్నా ఇందుకు సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనకు బాగా తెలిసిన మహాభారతయుద్ధాన్నే తీసుకుంటే ఎంతో సత్యసంధుడు, ధర్మాత్ముడు అనుకునే ధర్మరాజు కూడా అబద్ధమాడతాడు. విరథుడు, నిరాయుధుడు అయిన సాటివీరుని అర్జునుడివంటి మహావీరుడు కూడా చంపుతాడు. అస్త్రసన్యాసం చేసిన గురువు శిరస్సును శిష్యుడే తెగనరకుతాడు.

యుద్ధమనే ఒత్తిడిలో శత్రువును చంపడమే కాదు, ఒక్కొక్కసారి ఆత్మహత్యలూ జరుగుతూ ఉంటాయి.

అయిదేళ్ళ కోసారి ‘ప్రజాస్వామికంగా’ మనదేశంలో జరిగే ఎన్నికల యుద్ధాలలో మనకు ఇలాంటి యుద్ధ పరిస్థితితో అనుభవం ఉంది. కాకపోతే ఈ యుద్ధపరిస్థితిని ఇప్పుడు అయిదేళ్లపాటూ చూడబోతున్నాం.

యుద్ధ సమయంలో నీతిబద్ధమైన, హేతుబద్ధమైన చర్చకు గల జాగా నానాటికీ తరిగిపోతూ ఉంటుంది. అక్షరక్షేత్రం కూడా సంకుల సమరవేదికగా మారి వాక్యం అర్థాన్ని, అన్వయాన్ని కోల్పోతూ రచన రణగొణ ధ్వనిగా పరిణమిస్తుంది. అక్షరక్షేత్రాన్ని కూడా బండ బలం, కండబలం ఉన్న శక్తులు ఆక్రమించుకుంటాయి. అర్థవంతంగా మాట్లాడాలని కోరుకునే శక్తులు క్రమంగా అస్త్రసన్యాసం చేయవలసివస్తుంది.

నేడు దేశం క్రమంగా ఇలాంటి సన్నివేశం వైపే సాగుతోంది. అర్థవంతమైన, హేతుబద్ధమైన చర్చకు జాగాను ఎంతవరకు కాపాడుకోగలమన్నది ఇప్పుడు మనముందు వేలాడుతున్న ప్రశ్న. అంతే కాదు, సవాలు.

***

అన్నీ ఆశ్చర్యాలే జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన వాదాలే వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానంలోనే, న్యాయమూర్తుల కళ్ళముందే నిందితుడి మీద న్యాయవాదులే దాడి చేసి కొట్టడం ఇటీవలి కాలంలో ఎప్పుడైనా చూసామా? ఒకసారి కాదు రెండుసార్లు! టీవీ తెరమీదికి వచ్చి ఇదే పని మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం చూసామా? ఒకసారి కాదు; పదే పదే! ఇష్రత్ జెహాన్ అనే అమ్మాయి నిజంగా టెర్రరిస్టే అనుకుందాం. యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్లను తారుమారు చేయడం ఘోరమనే అనుకుందాం. అందులోని న్యాయబద్ధతపై చర్చ జరగవలసిందే. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిందే. కానీ అది జరుగుతున్నట్టుగా, అందులోని ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ కోణం చర్చలోకి రావలసినంతగా రావడంలేదు. దాని గురించి ప్రశ్నిస్తే, మీ హయాంలో ఎన్ని చోట్ల ఎన్ కౌంటర్లు జరగలేదు, వాటి గురించి మాట్లాడరేమని ప్రభుత్వంలోని వాళ్ళూ ప్రభుత్వపక్షంవాళ్ళూ ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలను యుద్ధక్షేత్రాలుగా మార్చడం; ఇతర ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ లను అడ్డు పెట్టుకుని ఇంకో ఎక్ ష్ట్రా జుడీషియల్ కిల్లింగ్ ను సమర్థించుకోవడం! ప్రభుత్వ, ప్రభుత్వపక్షాలే స్వయంగా ఆ పని చేయడం! అది చట్టానికీ, రాజ్యాంగానికి పాతర.

***

యుద్ధం అన్నప్పుడు దాని ప్రభావం సమాజం తాలూకు అన్ని అంగాలమీదా పడుతుంది. నీతి న్యాయం ధర్మమే కాదు; సమాజం, సాహిత్యం, మతం, సంస్కృతిసహా అన్నీ వక్రీకరణ చెంది వికృతికి లోనవుతాయి. తరతరాల అనుభవాల మీదా, అవగాహన మీదా, విశ్వాసాల మీదా గొడ్డలి పోట్లు పడతాయి.

యుద్ధం అన్నప్పుడు ‘మహావీరులు’ స్వయంభువులుగా హఠాత్తుగా విశ్వరూపంలో పుట్టుకొచ్చి యుద్ధ వేదికను ఆక్రమించుకుంటారు. గత కొన్ని రోజులలో అలా పుట్టుకొచ్చిన ఒక వ్యక్తి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్!

నేటి దేశవ్యాప్త యుద్ధ ప్రకంపనలకు ఎపి సెంటర్ అయిన ఢిల్లీలో, యమునా తీరంలో కొన్ని వేల ఎకరాల స్థలంలో ఎత్తైన వేదిక మీద, ఈ దేశ ప్రధాని తన పక్కనే నిలబడి ఉండగా, రొమ్ము విరుచుకుని తనను ప్రపంచస్థాయి వ్యక్తిగా ప్రకటించుకుంటూ వసుధైవకుటుంబకం అనే సూక్తిని వినిపిస్తుంటే చూసి అవాక్కయ్యాను. నా దేశంలో నేనే అపరిచితుడినైపోయినట్లు, నా తరతరాల అస్తిత్వాన్ని రూపు మాపే ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టు అనిపించింది. నిన్నటివరకు అనేకమంది అమాంబాపతు సాధు, సన్యాసులలో ఒకరని అనుకుంటున్న ఒక ఆధునిక సన్యాసి కాస్తా; నా ఇష్టాయిష్టాలతో పనిలేకుండా నా ప్రమేయంలేకుండా  ఒక్కసారిగా ఢిల్లీని ఆక్రమించుకుని యావద్దేశ ఆధ్యాత్మిక పురుషుడిగా ఆవిర్భవించినట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆయన పక్కనే నిలబడి ఉన్న ప్రధాని స్వయంగా ఆయనను ఆధ్యాత్మిక చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారనిపించింది. ఇంతవరకు మార్జిన్స్ లో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా కేంద్రస్థానానికి వచ్చి ఆక్రమించుకున్నట్టు అనిపించింది.

శ్రీ శ్రీ రవిశంకర్ మీదా, ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీదా నాకు ఇంతవరకు ప్రత్యేకమైన వ్యతిరేకతను ప్రకటించుకోవాల్సిన అవసరం కనిపించలేదు. ఈ దేశంలో అనేక రకాలకు, అనేక పంథాలకు, అనేక శ్రేణులకు చెందిన ఆధ్యాత్మిక లేదా ఆధ్యాత్మిక ఆభాస కలిగిన వ్యక్తులున్నారు. ఎవరికి వారికి అనుచరులు ఉన్నారు. అనేక రంగాలలోలానే ఈ రంగంలో కూడా ఈ వైవిధ్యం ముందునుంచీ ఉన్నదే. సొంత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈ వైవిధ్యాన్ని ప్రజాస్వామికంగా అర్థం చేసుకుంటున్నాం. శాంతిభద్రతలకు, ప్రజల విజ్ఞాన వివేకాలకు భంగం కలిగే వైపరీత్యాలు సంభవిస్తుంటే ఎత్తి చూపి ఖండిస్తున్నాం. అయితే, ఒకటి మాత్రం ఇంతవరకూ లేదు. వివిధ పంథాలలో ఎవరికి వారు మార్జిన్స్ లోనే ఉన్నారు తప్ప ఒక్కరే వచ్చి కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోలేదు. ఎంతో వివాదాస్పదమైన, ప్రభుత్వ, సైనిక అండదండలున్న విశాల వేదికపై, ప్రధాని సాక్షిగా, వివిధ దేశాలకు చెందిన లక్షలాది జనం సమక్షంలో రవిశంకర్ అనే వ్యక్తి కేంద్రస్థానంలోకి వచ్చినట్టు మొదటిసారి కనిపించారు. సారం సంగతి ఎలా ఉన్నా సాంకేతికంగా చూసినప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది.

అదే నన్ను నా దేశంలో అపరిచితునిగా మార్చి దారుణంగా కుంగదీసిన పరిణామం.

అనేక కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్న ఈ వైవిధ్యవంతమైన సమాజంలో సహజంగానే నేను కూడా ఒక కులానికి, మతానికి, సంస్కృతికి చెందినవాడిని. నాలానే ఇంకా కోట్లాదిమంది. నాకు ఈ దేశానికి సంబంధించిన వేల సంవత్సరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విశ్వాస, జీవన సరళికి చెందిన వారసత్వం ఉంది. స్ఫూర్తిదాయకులైన ఆధ్యాత్మికపురుషుల వారసత్వం ఉంది. నాకు అవసరమనిపిస్తే ఆ వారసత్వాన్ని నేను ఉపయోగించుకుంటాను. ముఖ్యంగా జీవించే కళను నేను ఇప్పుడు కొత్తగా ఎవరి నుంచీ నేర్చుకోవలసిన అవసరంలేదు. నా వారసత్వంలోనే, నా కుటుంబంలోనే అందుకు సంబంధించిన మెళకువలు అందుతాయి. ఇంకా కావాలంటే నాకు భగవద్గీత ఉంది. రామాయణభారతభాగవతాలు ఉన్నాయి.

నేనంటే నేను ఒక్కడినే కాదు. నా సామాజిక నేపథ్యంలాంటి నేపథ్యం ఉన్న అనేకమంది. అలాగే నాకు భిన్నమైన సామాజిక నేపథ్యం ఉన్నవారికీ నాకు ఉన్నట్టే తమవైన వారసత్వాలు, స్ఫూర్తిదాయకాలు ఉన్నాయి. ఈ స్థితిలో నాకే కాదు; తమవైన వారసత్వ సంపద ఉన్న నాలాంటి చాలామందికి రవిశంకర్ అనే వ్యక్తితో కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో కానీ ఎలాంటి సంబంధమూ, అవసరమూ ఉండదు. ఆయన కానీ, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఉమ్మడిగా ఈ దేశంలోని అందరికీ అవసరమైనవీ, స్ఫూర్తినింపేవీ కానవసరంలేదు. మరి ఆయనతో, ఆయన చెప్పేవాటితో ఎవరు కనెక్టు అవుతారనే ప్రశ్న వస్తుంది. ఆధునికవిద్యవల్ల, ఆధునికతవల్లా సాంప్రదాయిక వారసత్వానికి దూరమైనవారికి ఆయనా, ఆయన చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆకర్షించవచ్చు. అలాగే విదేశీయులకు ఆకర్షించవచ్చు. దానిని వ్యతిరేకించాల్సిన అవసరమూ లేదు. ఎవరి అభిరుచి వారిది.

ఒకవేళ రవిశంకర్ ను కూడా ఈ దేశపు ఆధ్యాత్మికవారసత్వానికి ప్రతినిధిగానూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను ఆ వారసత్వ సారంగానూ ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ వ్యక్తి గానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ మహారాజ పోషణలో కేంద్రస్థానాన్ని ఆక్రమించుకోవడమే ఇక్కడ సమస్య.  వైవిధ్యవంతమైన ఈ దేశపు స్వభావమూ, అస్తిత్వమూ అందుకు అవకాశమివ్వవు. అలా చేయడం ఈ దేశపు మౌలికతనే చెరచడం.

****

ఆశ్చర్యాలకు అంతేలేదు.

యమునా తీరంలో రవిశంకర్ వేదికను ముస్తాబు చేయడానికి సైన్యాన్ని బరిలోకి దింపడమే చూడండి. వివిధ ప్రభుత్వవిభాగాలు నిధులు సమకూర్చడమే చూడండి. పర్యావరణ సంబంధమైన అభ్యంతరాలు తలెత్తడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రవిశంకర్ కు 5కోట్ల జరిమానా విధించడం, తను జైలుకైనా వెడతాడు కానీ జరిమానా కట్టనని ఆయన ప్రకటించి ఒక తిరుగుబాటువీరుడిగా క్షణాలలో తన మూర్తిమత్వాన్ని పెంచుకోవడం, గ్రీన్ ట్రిబ్యునల్ తోకముడిచి ఆయన కార్యక్రమం నిరాఘాటంగా జరగడానికి అవకాశమివ్వడం… వరసగా చూడండి. ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. యమునా తీరంలో గత కొద్దిరోజులలో తలెత్తినవి పర్యావరణవిధ్వంసం తాలూకు భయాలే  కాదు; నియమ నిబంధనలు, విలువలు, ఔచిత్యాలకు చెందిన విధ్వంసాన్ని చూశాం;  ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఒక వ్యక్తిముందు దాసోహమనడం చూశాం; వివాద నేపథ్యంలో ఈ దేశప్రథమపౌరుడైన  రాష్ట్రపతి ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా, ప్రధాని హాజరవడం అనే వింతను చూశాం.

రవిశంకర్ అనే వ్యక్తికి చెందిన కార్యక్రమంలో సైన్యాన్ని వినియోగించడాన్ని సమర్థించుకున్న తీరు ఇంకా దారుణం. కుంభమేళాలతో, ప్రకృతి వైపరీత్యాలతో, ఆసియన్ గేమ్స్ నిర్వహణతో పోలిక తెచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు జాతీయవిపత్తులు. ఆసియన్ గేమ్స్ నిర్వహణ జాతీయ కార్యక్రమం. కుంభమేళాలు సాంప్రదాయికంగా వందల సంవత్సరాలుగా జరుగుతున్న సామూహిక కార్యక్రమాలు. రవిశంకర్ అనే వ్యక్తి కన్నా సహస్రాంశాల చరిత్ర ఉన్న ఘటనలు అవి. రవిశంకర్ కార్యక్రమం ఎంత పెద్దదైనా కుంభమేళాతో పోల్చదగినది కాదు. అలా పోల్చడం అన్నివిధాలా బరితెగించడం. ఈ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడం. ఇంకా అవాచ్యం, ప్రధాని నరేంద్ర మోడీ రవిశంకర్ కార్యక్రమాన్ని సాంస్కృతిక కుంభమేళా అనడం. రవిశంకర్ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం హిందుత్వ వతిరేక ప్రతిపక్షాల కుట్రగా చిత్రించే ప్రయత్నంలో విచక్షణా వివేకాలను అజ్ఞానం పూర్తిగా హరించివేసిన ఫలితం ఇది. చివరికి ఆర్.ఎస్.ఎస్. వంటి హిందుత్వ పక్షాలు కూడా ఆధ్యాత్మిక చక్రవర్తిగా రవిశంకర్ పట్టాభిషేకాన్ని హర్షించి ఉంటాయని భావించలేం. కానీ రాజకీయప్రతిపక్షానికి గురిపెట్టే తహతహలో అవి కూడా మౌనం వహించి ఈ అజ్ఞాన వికట తాండవానికి నిశ్శబ్ద తాళం అందించాయి.

యుద్ధం కలిగించే ఒత్తిడిలో శత్రుహననాలే కాదు, ఆత్మహత్యలు కూడా ఉంటాయన్నది అందుకే. శ్రీ శ్రీ రవిశంకర్ అనే అత్యాధునిక సన్యాసి జరిపిన ఢిల్లీ ముట్టడికి, హిందుత్వ మౌన అంగీకారాన్ని తెలిపి ఆత్మహననానికి పాల్పడింది.

****

ఆర్ట్ ఆఫ్ లివింగ్ పట్ల ఇన్నేళ్లలోనూ నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దేశపు అన్ని రకాల వైవిధ్యాలను, మత సాంస్కృతిక బహుళత్వాన్ని, ప్రభుత్వం తాలూకు నియమ నిబంధనలను, చివరకు ప్రభుత్వ అస్తిత్వాన్నీ, పర్యావరణస్పృహతో సహా అన్నింటినీ మృత్యుముఖంలోకి నడిపించగల ఆర్ట్ ఆఫ్ డయింగ్ గానే అది ఇప్పుడు రూపుగడుతోంది.

-భాస్కరం కల్లూరి

 

 

 

 

 

షరా మామూలుగా తవ్వకాలు, తగవులాటలూ…

 

స్లీమన్ కథ-24

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తీరా మైసీనియాలో తవ్వకాలు ప్రారంభించ బోయేసరికి ఎక్కడినుంచి, ఎలా మొదలెట్టాలో స్లీమన్ కు వెంటనే తోచలేదు. ఆ ప్రాంతానికి చెందిన ఏవో స్థలపురాణాలు, విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో స్పష్టత ఉన్నవి తక్కువ. పైగా కొన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. అక్కడి వీరుల సమాధుల గురించిన ప్రామాణిక వివరణ పసన్నియస్ రాతల్లో లభిస్తోంది:

మైసీనియా శిథిలాల్లో ‘పెర్షా’ అనే ఒక జలయంత్రమూ; ఏట్రియస్ కు, అతని కొడుకులకు చెందిన భూగర్భ భవనాలూ ఉన్నాయి. వీటిలో నిధినిక్షేపాలను పాతిపెట్టారు.ఏట్రియస్ సమాధితోపాటు; ట్రాయ్ యుద్ధం నుంచి తిరిగొచ్చి, ఏగిస్త్వస్ ఇచ్చిన విందులో పాల్గొని, ఆ తర్వాత అతని చేతిలో హతులైన వాళ్ళ సమాధులూ ఉన్నాయి. అలాగే, అగమెమ్నన్, అతని రథసారథి ఎవ్రిమిడాన్, ఎలెక్త్రాల సమాధులూ; కవలపిల్లలైన తేలమస్, పెలోపస్ ల సమాధులూ ఉన్నాయి. కసండ్రా(ట్రాయ్ రాకుమారి, గొప్ప సౌందర్యవతి, ఒక కథనం ప్రకారం అగమెమ్నన్ ఉంపుడుగత్తె)కు పుట్టిన ఈ కవలలను పసితనంలోనే, తల్లిదండ్రులతోపాటు ఏగిస్త్వస్ హతమార్చాడని చెబుతారు. అగమెమ్నన్, తదితరుల సమాధులకు దగ్గరలో సమాధి చేయడానికి తగరన్న ఉద్దేశంతో క్లైటమెనెస్ట్రా, ఏగిస్త్వస్ లను ప్రాకారానికి ఒకింత అవతల సమాధి చేశారు.

మైసీనియాకు సంబంధించిన గ్రంథాలను, నాటకాలతో సహా, స్లీమన్ అధ్యయనం చేశాడు. వాటిని దాదాపు కంఠస్థం చేశాడు. వాటిలోని వర్ణనలను మననం చేసుకుంటూ వచ్చాడు. హోమర్ రచనలతో సమానంగా వాటిని కూడా ప్రామాణికంగా భావించి గౌరవించాడు. ట్రాయ్ పతనమైన 1300 ఏళ్ల తర్వాత పసన్నియస్ దాని గురించిన సమాచారాన్ని గ్రంథస్థం చేశాడు. కేవలం స్థలపురాణాలనే ఉన్నవున్నట్టు నమోదు చేశాడు. తను చిన్నప్పుడు హెన్నింగ్ వాన్ హోస్టీన్ కు చెందిన స్థానికగాథను నమ్మినట్టే స్లీమన్ వీటినీ నమ్మాడు. నిధినిక్షేపాలను పాతిపెట్టడం గురించిన కథలను మరింత నమ్మాడు.

పసన్నియస్ ఇచ్చిన సమాచారం గురించి ఆలోచిస్తున్నకొద్దీ తనకు ముందటి వ్యాఖ్యాతలు తప్పులో కాలేశారన్న అభిప్రాయం అతనిలో బలపడింది. వారి ప్రకారం, క్లైటమెనెస్ట్రా సమాధి నగరప్రాకారాలకు అవతల ఉంది. ఏట్రియస్, అగమెమ్నన్, అతనితోపాటు హతులైన వాళ్ళ సమాధులు ప్రాకారాలకు లోపల ఉన్నాయి. అయితే, పసన్నియస్ కాలానికే నగరప్రాకారాలు కుప్పకూలి కేవలం శిథిలాలు మిగిలాయి. అగమెమ్నన్ సమాధి నగరప్రాకారాల లోపల కాకుండా, గిరిదుర్గ ప్రాకారాల లోపల ఉందని చెప్పడం పసన్నియస్ ఉద్దేశమని స్లీమన్ భావించాడు. దాంతో, ట్రాయ్ లో సింహద్వారం దగ్గర నిక్షేపాలు లభించినట్టే, ఇక్కడా లభిస్తాయన్న నిర్ధారణకు వచ్చి సింహద్వారం దగ్గరే 1876 ఆగస్టులో తవ్వకాలు ప్రారంభించాడు. అరవైముగ్గురిని పనిలోకి తీసుకున్నాడు. ట్రాయ్ అనుభవంతో ముందే జాగ్రత్తపడిన ప్రభుత్వం, అతని కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచడానికి గ్రీకు పురావస్తు సంఘానికి చెందిన ముగ్గురు అధికారులను నియమించింది.

తనపై ఎవరు నిఘా పెట్టినా స్లీమన్ కు నచ్చదు. అందులోనూ అధికారులైతే కోపం నసాళానికి అంటుతుంది. సింహద్వారం అవతల రహదారిని మూసేస్తూ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. వాటిని తొలగించడానికి పనివాళ్ళను పురమాయించాడు. అధికారులు అభ్యంతరం చెప్పారు. నా ప్రణాళికకు అడ్డుతగులుతున్నారంటూ స్లీమన్ వాళ్లపై మండిపడ్డాడు. ఎప్పటిలా అధికారుల కళ్ళు కప్పడం కోసం పనివాళ్లను బృందాలుగా విడదీసి తలో చోటా పనిచేయించడం ప్రారంభించాడు. ఎండ విడుపులేకుండా దహిస్తోంది. దానికితోడు ఆ ప్రాంతమంతటా ధూళిమేఘాలు దట్టంగా కమ్మేశాయి. ఆ వాతావరణంతో పోటీపడి స్లీమన్ లో కోపతాపాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సందర్భాలలో అతనితో వాదనకు దిగడానికి ధైర్యం చాలని అధికారులు సోఫియాను కలసి ఫిర్యాదు చేయడం, ఆమె వీలైనంతవరకు వాళ్ళను శాంతింపచేయడానికి ప్రయత్నించడం, అది ఒక్కోసారి విఫలమవడం రివాజుగా మారింది.

పని వేగం పుంజుకుంటున్న కొద్దీ ఎక్కువమందిని పనిలోకి తీసుకున్నాడు. మరిన్ని గోడలను నేలమట్టం చేసేలా కనిపించాడు. ఈసారి అధికారులు మరింత గట్టిగా అభ్యంతరం చెప్పారు, గ్రీకు పురావస్తు సంఘం ముఖ్యప్రతినిధి స్టెమటేక్స్ ప్రభుత్వానికి ఇలా రాశాడు:

పురాతన కుడ్యాలను కూల్చడానికి గ్రీకు, రోమన్ తాలూకు పురావస్తువులనన్నింటినీ పగబట్టినట్టు ధ్వంసం చేసేస్తున్నాడు. గ్రీకు, రోమన్ కలశాలు కంటబడితే చీదరించుకుంటున్నాడు. వాటి తాలూకు ముక్కలను పారేస్తున్నాడు. నన్నో ఆటవికుడిగా చూస్తున్నాడు. నా విధినిర్వహణ మీకు సంతృప్తికరంగా లేకపోతే, దయచేసి నన్ను వెనక్కి పిలిపించండి. ఎందుకంటే, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇక్కడ ఉంటున్నాను. రాత్రి తొమ్మిది వరకూ రోజంతా అతనితో కలసి తవ్వకాల దగ్గర గడుపుతున్నాను. ఆ తర్వాత, అర్థరాత్రి రెండువరకూ అతనితో కూర్చుని బయటపడిన పురావస్తువులను నమోదు చేస్తున్నాను. తను అధ్యయనానికి అవసరమంటే, కొన్ని వస్తువులను ఇంటికి పట్టుకెళ్లడానికీ అనుమతిస్తున్నాను.

దానిపై ప్రభుత్వం స్టెమటేక్స్ కు మరోసారి కచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం, ఏ గోడనూ కూల్చడానికి వీల్లేదు. తవ్వకాలు ఒకే సమయంలో అనేకచోట్ల జరగకూడదు. ఒక్కచోట మాత్రమే జరగాలి. పర్యవేక్షణకు వీలైన మేరకు పనివాళ్ళ సంఖ్యను పరిమితం చేయాలి. చివరగా, ఈ ఉత్తర్వుల ఉల్లంఘనే జరిగితే అందుకు స్టెమటేక్స్ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

నాఫ్లియో ముఖ్యాధికారిని వెంటబెట్టుకుని స్టెమటేక్స్ జంకుతూనే వెళ్లి స్లీమన్ ను కలిశాడు. వీలైనంత మృదువుగా, మర్యాదగా పై ఉత్తర్వుల గురించి చెప్పాడు. అయినాసరే, స్లీమన్ భగ్గుమన్నాడు. స్టెమటేక్స్ ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించమని నాఫ్లియో ముఖ్యాధికారితో అన్నాడు. ఇలాంటి వాళ్ళతో తను క్షణం కూడా పనిచేయలేయనన్నాడు. మీరు చట్టాలకూ, ఒప్పందాలకూ లోబడి పనిచేయాలని స్టెమటేక్స్ అన్నాడు. ఇది ఒప్పందాలను ముందుపెట్టుకుని చేసే పనికాదని స్లీమన్ విరుచుకుపడ్డాడు…

ఈ అధికారులు వట్టి మూర్ఖులు, వీళ్ళకు ఏమీతెలియదు, పుండు సలిపినట్టు తనను సలుపుతున్నారు. భూగర్భంలో లోతుగా సమాధైన ఒక పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లను బయటపెట్టడానికి తను ప్రయత్నిస్తున్నాడు. ఎంత పవిత్రమైన విధిని తను తలకెత్తుకున్నాడో వీళ్ళకు అర్థం కాదు. ఆధునిక శాస్త్రవిజ్ఞానం అందించిన అన్ని పద్ధతులనూ వినియోగించి ఈ  పురాతన నాగరికతా చిహ్నాలను పరిరక్షించడానికి సైతం తను సిద్ధంగా ఉన్నాడు. తను ఏం చేయాలన్నా తగినంత స్వేచ్ఛ ఉండాలి. ఈ అధికారులనే వాళ్ళు తన జోలికి రాకూడదు!…ఇదీ ఎప్పటిలానే స్లీమన్ వాదం.

స్లీమన్ నిప్పులు చెరుగుతుంటే, సోఫియా తెరవెనుక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నాఫ్లియో ముఖ్యాధికారి ఎథెన్స్ నుంచి తనకు అందిన ఉత్తర్వును చదివి వినిపించాడు. ఒక పక్క, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతాయుతుడైన అధికారి! ఇంకోపక్క, కేవలం గతానికి మాత్రమే జవాబుదారీగా వ్యవహరించవలసిన పురావస్తునిపుణుడు! వాతావరణం చాలా వేడెక్కిపోయింది. కోపంతో స్లీమన్ ముఖం ఎర్రబడిపోయింది. పనివాళ్లు పని ఆపేశారు.

నాఫ్లియో ముఖ్యాధికారి ఉత్తర్వులను చదివి వినిపించడం పూర్తయింది. అధికారుల ఉనికినే పట్టించుకోనట్టుగా స్లీమన్ వెంటనే పనివాళ్లవైపు తిరిగి, మీ పని మీరు కానివ్వండని హూంకరించాడు. అతని కళ్ళల్లోని ఎరుపును చూసి పనివాళ్లు భయపడ్డారు. అయిష్టంగానే మందకొడిగా పని మొదలు పెట్టారు. అదే రోజు సాయంత్రం సంబంధిత మంత్రిత్వశాఖకు స్లీమన్ మరో సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. తపాలాశాఖ మీద నమ్మకం లేక మరునాడు ఆ ఉత్తరం ఇచ్చి సోఫియాను ఎథెన్స్ కు పంపించాడు. సోఫియా ఆ ఉత్తరాన్ని స్వయంగా మంత్రికి ఇవ్వడమే కాదు, అప్పటికప్పుడు ఆయన చేత జవాబు రాయించి తీసుకురావాలి.

తవ్వకాలు కొనసాగాయి. స్లీమన్, స్టెమటేక్స్ ఒకరి పీకలు ఒకరు పట్టుకునే ఉన్నారు. ఆ కలహాల కాపురంలో మధ్య మధ్య రాజీలు, పరస్పర అభిమాన ప్రకటనలూ ఉన్నాయి. బెదిరింపులు, అనునయ వాక్యాలతో పై వాళ్ళకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే, తను అనుకున్న పద్ధతిలో పని చేసుకుంటూ పోయే కళలో స్లీమన్ ఇప్పటికే ఆరితేరాడు. మంత్రికి రాసిన ఉత్తరంలో గ్రీసు పట్ల తన అచంచలమైన ప్రేమను, పురావస్తు తవ్వకాల పట్ల నిబద్ధతను మరోసారి నొక్కి చెప్పాడు. నాఫ్లియో ముఖ్యాధికారికి పంపిన ఉత్తర్వులను ఏదో క్షణికావేశంతో పంపినవిగా తను భావిస్తున్నానన్నాడు. తననింత అవమానకరంగా చూస్తున్న దేశంలో తవ్వకాలు జరపాలన్న కోరిక కూడా నాలో చచ్చిపోతోందన్నాడు.

గ్రీకు, టర్కీ ప్రభుత్వాల దగ్గర ఇలాంటి ఉత్తరాలతో పెద్ద పెద్ద దస్త్రాలు తయారయ్యాయి. అతని ఎత్తుగడలను అవి ఇప్పటికే ఆకళించుకున్నాయి. కనుక పై ఉత్తరంలో రాసింది బూటకపు బెదిరింపని గ్రీసు ప్రభుత్వానికి తెలుసు. తవ్వకాలు విరమించి పోతానంటే ఆపకూడదని అనుకుంది. అయితే, గ్రీస్ ను విడిచిపెట్టి వెళ్ళే ఉద్దేశం సోఫియాకు లేదు. ఆమె కూడా నటనలో ఆరితేరినదే. భర్త పక్కన పెట్టని కోటలా నిలబడింది. ప్రతిపక్షులను చిత్తు చేయడంలో తన మెళకువలను అన్నిటినీ ప్రయోగించింది. స్లీమన్ వ్యూహాలను పక్కాగా అమలుచేయడంలో ఆమె పూర్తి భాగస్వామి  అనీ, అతని కన్నా కూడా అసలు కుట్రదారు ఆమే ననీ స్టెమటేక్స్ కు త్వరలోనే అర్థమైపోయింది. పెద్దమనిషి తరహా కలిగిన అతడు కూడా ఆంతరంగిక సంభాషణాల్లో ఆమెను “రాక్షసి’గా తిట్టిపోయడం ప్రారంభించాడు.

9f5321c5acc5ed373c5ef569c44a9f3b

తవ్వకాలు ఆపేసి అమెరికా వెళ్లిపోతానని స్లీమన్, రాజీనామా చేసి తప్పుకుంటానని స్టెమటేక్స్ అలా బెదిరిస్తూనే ఉండడం; వివాదం విషమించినప్పుడల్లా సోఫియా రంగప్రవేశం చేసి ఇరుపక్షాలనూ శాంతింపచేయడం ఒక తంతుగా మారిపోయింది. ఇతరుల ఘనతను గుర్తించే అలవాటు బొత్తిగా లేని స్లీమన్, సోఫియా చాకచక్యానికి మాత్రం ముగ్ధుడైపోయేవాడు. తను నక్కజిత్తుల ఒడీసియస్ అయితే, ఆమె పెనెలోపి అనుకునేవాడు.

తవ్వకాలలో చెప్పుకోదగినవేవీ బయటపడడం లేదు. ట్రాయ్ లో దొరికినట్టుగా  రోమన్, బైజాంటైన్ నాణేలు కూడా ఇక్కడ దొరకకపోవడం స్లీమన్ కు వింతగా అనిపించింది. శిథిలాల అడుగున, రేఖాగణిత నమూనా చిత్రణలు కలిగిన పురాతన కలశాలు; విచిత్రంగా, బొర్డో మద్య పాత్రలను తలపించే గుండ్రని మృణ్మయపాత్రలు దొరికాయి.  ఆపైన ట్రాయ్ లో లానే ఎరుపురంగు పులిమిన చిన్న చిన్న అమ్మవారి మట్టిబొమ్మలు, కత్తులు, బొత్తాలు, జంతువుల మట్టిబొమ్మలు, మోత్యా తవ్వకాల్లో దొరికిన లాంటి బాణపు మొనలు, చక్కని నీలిరాతితో చెక్కిన వందలాది బొంగరం ఆకృతులు, దువ్వెనలు, సూదులు, స్ఫటికపు ముక్కలు, తిరగళ్ళు, గొడ్డళ్ళు: మైసీనియా వాద్యపరికరాలలో భాగంగా స్లీమన్ భావించిన ఎముక ముక్కలు కనిపించాయి. చూడబోతే, ట్రాయ్ లో తనకు ఎదురైన అనుభవమే పునరావృత్తమవుతోందా అని అతనికి అనిపించింది. అక్కడిలానే అసంఖ్యాకమైన బొంగరం తరహా బొమ్మలు, లింగాకృతులు, అమ్మవారి మట్టిబొమ్మలు! అంతకు మించి విశేషమైనవేవీ లేవు.

ఎట్టకేలకు, నాలుగు లేదా అయిదో వారంలో సింహద్వారా(Lion Gate)నికి దక్షిణంగా జరుపుతున్న తవ్వకాలలో రెండు ఇసుకరాతి సమాధి రాళ్ళు బయటపడ్డాయి.  ఒక్కొక్కటి నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాయి. వాటిపై ఆదిమకాలపు దారుచిత్రాల శైలిని పోలిన బొమ్మలు ఉన్నాయి. వాటిలో ఒక దానిలో ఒక వేటగాడు రథంమీద ప్రయాణిస్తూ జింకను వేటాడుతూ ఉంటాడు. రథం పక్కనే ఒక వేటకుక్క పరుగెడుతూ ఉంటుంది. ఇంకో బొమ్మలో ఒక నగ్నసైనికుడు ఒక పెద్ద కత్తి పుచ్చుకుని రథం మీద వెడుతుంటాడు. ఈ బొమ్మల శైలికి, సింహద్వారంపై ఉన్న బొమ్మల శైలికి పోలిక ఉన్నట్టు స్లీమన్ గమనించాడు. గుర్రాల తోకలు, కుక్క తోక మామూలుకు భిన్నంగా చాలా లావుగానూ, పొడవుగానూ ఉన్నాయి. రథాలను మాత్రం రేఖామాత్రంగా చెక్కారు. ఈ రథాలు అచ్చంగా ట్రోజన్ యుద్ధాలలో ఉపయోగించిన రథాలలానే ఉన్నాయని స్లీమన్ నిర్ధారించాడు.

ఆ తదుపరి రోజుల్లో జరిపిన తవ్వకాల్లో కూడా సమాధి రాళ్ళ శకలాలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బంగారు బొత్తం కనిపించింది. అలా సమాధి రాళ్ళ దగ్గరే బంగారు బొత్తం కనిపించేసరికి సమీపంలోనే నిక్షేపాల వాసన ఏదో స్లీమన్ కు ఘాటుగా సోకింది.

ఆ సమాధిరాళ్ళు సింహద్వారానికి అవతల ఉన్న ఒక వలయాకార ప్రదేశంలో కనిపించడంతో అక్కడే తవ్వకాలు కొనసాగించాడు. అక్కడ బయటపడుతున్నవి మొదట అతనికి చిక్కుముడిగా కనిపించాయి. ఆ వలయాకారప్రదేశంలో చుట్టూ బల్లల రూపంలో రాతి పలకలను అమర్చారు. అధికారిక శాసనాలను చదివి వినిపించడానికి చాటింపు వేసి ప్రభువర్గాన్ని పిలిపించే బహిరంగ సమావేశస్థలిగా అది కనిపించింది. బహుశా అదొక నృత్యస్థలి, కవిసమ్మేళనస్థలీ కూడా కావచ్చు. అక్కడే గొప్ప గొప్ప వక్తల ప్రసంగాలు, బహుమతి ప్రదానాలూ జరుగుతూ ఉండివేమో. ఆయా సందర్భాలలో రాచరికానికి చెందిన పవిత్ర చిహ్నాలను అక్కడే ప్రజల సందర్శనకు ఉంచేవారేమో….

పవిత్రప్రదేశాలుగా పరిగణించే ఇటువంటి తావులు సాధారణంగా మృతవీరుల స్మారకనిర్మాణాలతో ముడిపడి ఉంటాయి. అక్కడి రాతి పలకల అడుగున రాజుల సమాధులు ఉండడమూ కద్దు. ఇలాంటి ప్రదేశాలను ‘ఆగొరా’(agora) అని పిలుస్తారు. ఇవి పవిత్రమైన తావులే అయినా విపణి ప్రదేశాలుగా కూడా వాడుకలో ఉండేవి. యురిపిడిస్ తన ‘ఎలెక్త్రా’ అనే రచనలో, బంగారు ఉన్ని కలిగిన గొర్రెపిల్లను దర్శించడానికి మైసీనియా ప్రజలను ఆగొరాకు ఆహ్వానించడం గురించి రాస్తాడు. బంగారు గొర్రెపిల్ల మైసీనియా రాచరికచిహ్నం. వీరుల సమాధులు ఆగొరా లోపలే ఉన్నాయని పసన్నియస్ రాశాడు. తెరా దీవిలోని ఆగొరాలో వీరులను సమాధి చేశారని పింధరోస్(ప్రాచీన గ్రీకు గేయకవి)రాశాడు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మైసీనియా వీరుల సమాధులు ఈ వలయాకారపు ఆగొరా లోనే ఉండి ఉంటాయని స్లీమన్ నిర్ణయానికి వచ్చాడు.

అయినా వెంటనే ఈ ప్రదేశంలో మరిన్ని తవ్వకాలు జరిపించకుండా, దానికి దక్షిణంగా కిటికీలు లేని ఏడు గదులతో ఉన్న ఒక రాతి కట్టడాన్ని రాజప్రాసాదంగా ఊహించుకుని మొదట అక్కడ తవ్వకాలు ప్రారంభించాడు. కానీ నిరాశే ఎదురైంది. ఎప్పటిలానే నీలిరంగు రాతితో మలచిన బొంగరం ఆకృతులు, గొడ్డళ్ళు, చిత్రిత మృణ్మయ కలశాల తాలూకు ముక్కలు కనిపించాయి. 12 అంగుళాల ఎత్తున్న ఒక కలశం మాత్రమే ఉన్నంతలో విలువైనదిగా కనిపించింది. దాని మీద యుద్ధానికి వెడుతున్న సైనికుల చిత్రం ఉంది. వారిని ముదురు ఎరుపు రంగులో చిత్రించారు. విశేషమేమిటంటే, ట్రాయ్ యుద్ధానికి ముందునాటి సైనికులను, వారి ఆయుధాలను ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. వీటిలో మంచి జీవకళ ఉట్టిపడుతూ, ఆధునిక సరళిని తలపిస్తూ ఉండడం మరింత ఆసక్తికరం. అతి పురాతన గతానికి చెందిన ఈ సైనికులు సజీవంగా మన ముందుకొచ్చి నిలబడినట్టు ఉంటారు. అంతేకాదు, ఈ సైనికులు ధరించిన దుస్తుల లాంటివే హోమర్ చిత్రించిన వీరులు ధరించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు.

(సశేషం)

 

 

 

అక్రమ సంబంధాల విషాదస్థలి మైసీనియా

 

స్లీమన్ కథ-23

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మైసీనియాలో ఆ అయిదురోజుల తవ్వకాల్లో విలువైనవేవీ బయటపడకపోయినా, తప్పకుండా బయటపడతాయన్న నమ్మకంతో స్లీమన్ ఉన్నాడు. ఈ తవ్వకాల వివాదం సద్దుమణిగేదాకా రెండు మాసాలు ఓపికపట్టి ఆ తర్వాత గ్రీకు ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన దాఖలు చేసుకున్నాడు. మైసీనియాలో సొంత ఖర్చు మీద తవ్వకాలు జరుపుతాననీ, వాటిలో బయటపడే వాటినన్నిటినీ ప్రభుత్వానికి అప్పజెబుతాననీ, వాటి గురించి వెల్లడించే హక్కు మాత్రమే తనకు ఉంటుందనీ అందులో ప్రతిపాదించాడు. తనను ఇంతకుముందు దొంగగా, గ్రీసుకు శత్రువుగా చిత్రించిన మంత్రే దానిని ఆమోదిస్తూ సంతకం చేశాడు.

1874 ఏప్రిల్ 21 నుంచీ తవ్వకాలు ప్రారంభించాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ట్రాయ్ నిక్షేపాలలో సగం తమకు అప్పజెప్పాలని కోరుతూ టర్కీ ప్రభుత్వం అతనిపై దావా వేసినట్టు సమాచారం వచ్చింది. కింది కోర్టులోనూ, పై కోర్టులోనూ దావా ఏడాదిపాటు సాగి అతని సహనాన్ని పరీక్షించింది.  అతను ఎథెన్స్ లోనే ఉండిపోవలసివచ్చింది. కోర్టు ఉత్తర్వుతో పోలీసులు వచ్చి అతని ఇంటిని సోదా చేశారు. నిక్షేపాలు కనిపించలేదు. వాటిని ఎక్కడ దాచాడో చెప్పడానికి స్లీమన్ నిరాకరించాడు. ప్రాసిక్యూషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరికదా, ఎలాంటి పరిష్కారానికీ ఒప్పుకోలేదు.  పట్టుదలకుపోయి ప్రభుత్వంతో తుదికంటా పోరాడడానికే నిశ్చయించుకున్నాడు. అదే సమయంలో, తమ మధ్య ఎలాంటి వివాదం లేనట్టుగా, ట్రాయ్ లో తవ్వకాలను కొనసాగించే హక్కును కోరుతూ అదే ప్రభుత్వానికి అర్జీ మీద అర్జీ పెట్టుకుంటూవచ్చాడు.

ఆ ఏడాదంతా అతను పోలీసులతో, గ్రీకు ప్రభుత్వంతో, తన విమర్శకులతో; చివరికి సొంత న్యాయవాదులతో కూడా గొడవ పడుతూనే గడిపాడు. తన ఖర్చుతో ఒలింపియాలో తవ్వకాలు జరపడానికి ముందుకొచ్చినా; గ్రీకు ప్రభుత్వం అందుకు ప్రష్యన్ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంపై అతను మండిపడుతూ  ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గ్రీసు రాజు జార్జికి కూడా రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో,  ఉత్తరాల వల్ల పని జరగదనీ, గ్రీకు ప్రభుత్వాన్నీ, ప్రజలనీ మెప్పించే పని ఏదైనా చేసి తనవైపు తిప్పుకోవాలనీ అనుకున్నాడు.

అతని దృష్టి అక్కడి గిరిదుర్గం మీద ఉన్న మధ్యయుగాలనాటి వెనీషియన్(ఇటలీలోని వెనిస్ కు చెందినవారు కట్టించిన) బురుజు మీద పడింది. ఆ బురుజు ఆ పరిసరాల అందాన్ని దెబ్బతీస్తోంది. దానిని తొలగిస్తే బాగుంటుందని అందరూ అనుకోవడమే కానీ, ఆ పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. 80 అడుగుల ఎత్తున పాలరాయి పలకలతో నిర్మించిన ఆ బురుజులో గుడ్లగూబలు గూళ్ళు పెడుతున్నాయి. దానిని తొలగించడానికి 465 పౌండ్లు ఖర్చవుతాయని స్లీమన్ అంచనా వేసి, ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచాడు. ప్రభుత్వం అంగీకరించింది. అతను వెంటనే రంగంలోకి దిగి ఆ బురుజును తొలగించే పనిని విజయవంతంగా పూర్తిచేశాడు.

కోర్టులకు వేసవి సెలవులు కావడంతో అతనికి తీరిక చిక్కి ఓసారి ఉత్తర గ్రీస్ లో మెరపు పర్యటన జరిపి అర్కోమెనోస్ (గ్రీస్ లో పురావస్తు ప్రాధాన్యం కలిగిన ఒక ప్రదేశం) ను సందర్శించాడు. చారిత్రకంగా అదెంతో ప్రాముఖ్యం కలిగిన ప్రదేశమన్న నిర్ధారణకు వచ్చి, అక్కడ తవ్వకాలను చేపడితే తను ఆర్థిక సాయం చేస్తానని గ్రీకు పురావస్తు సంఘానికి రాశాడు. ఆరేళ్ళ తర్వాత  తనే అక్కడ కొన్ని తవ్వకాలు జరిపించాడు.

టర్కీ ప్రభుత్వం వేసిన దావా ఎట్టకేలకు పరిష్కారానికి వచ్చింది. స్లీమన్ ఎంతో తెలివిగా పావులు కదిపాడు. గ్రీకు న్యాయమూర్తులు టర్కీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ; పరిహారంగా 50 వేల ఫ్రాంకులు చెల్లించవలసిందిగా స్లీమన్ ను ఆదేశించారు. తను చేజిక్కించుకున్న ప్రియామ్ నిక్షేపాల విలువను 10 లక్షల ఫ్రాంకులుగా అంచనా వేసిన స్లీమన్, ఓడినా గెలుపు తనదే ననుకున్నాడు. ఆ 50 వేల ఫ్రాంకుల పరిహారానికి అయిదురెట్ల మొత్తాన్ని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు స్నేహపూర్వకంగా బహూకరించి; దాంతోపాటు ఏడు భారీ కలశాలను, నాలుగు సంచుల నిండా రాతి పురావస్తువులను పంపించాడు.

అప్పటికే అతని కీర్తి పైపైకి ఎగబాకుతోంది. దానిని ఆనందించే తీరిక ఇప్పుడు ఒకింత చిక్కింది. బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ప్రశంసాపూర్వకమైన లేఖ రాశాడు. ఇంగ్లండ్ లో అతనికి అతి ప్రముఖ అభిమానిగా మారిపోయాడు. 1875లో సోఫియాను, కూతురు యండ్రోమకిని వెంటబెట్టుకుని ఇంగ్లండ్ కు బయలుదేరాడు. దారిలో పారిస్ లో ఆగి, జియోగ్రాఫికల్ సొసైటీలో ప్రసంగించాడు. అలవాటుగా అతిశయోక్తులు, ఆత్మస్తుతీ రంగరిస్తూ అతను చేసిన ప్రసంగానికి శ్రోతల్లో స్పందన లేదు. ఎవరూ అతన్ని అభినందించడానికి ముందుకు రాలేదు. ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లోని అతని నివాసం దగ్గర సందర్శకులు బారులు తీరలేదు.

లండన్ లో మాత్రం అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. గ్లాడ్ స్టన్ పొగడ్తలతో ముంచెత్తాడు. జూలై నెలంతా ప్రముఖులతో విందు వినోదాలలో గడిపాడు. సోఫియాను, కూతురినిని బ్రైటన్ లోనే ఉంచేశాడు. వారానికి ఒకటి రెండుసార్లైనా వెళ్ళి వాళ్ళను చూడడానికి వీలులేనంతగా తను లండన్ లో బిజీ అయిపోయానని చెప్పుకున్నాడు. ఫ్రెంచి జియోగ్రాఫికల్ సొసైటీ కార్యదర్శి గోచే కు లండన్ నుంచి ఉలా ఉత్తరం రాశాడు:

నేనిక్కడ ప్రసంగిస్తున్న పండిత సభలు శ్రోతలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ నా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నేను మాట్లాడిన ప్రతిదీ పత్రికలు ప్రచురిస్తున్నాయి. రాజాస్థానాలనుంచి నాకు పిలుపులు అందుతున్నాయి. రాకుమారులు, రాకుమార్తెలు నన్ను ఆహ్వానించి నేను చెప్పేవి ఎంతో ఆసక్తిగా వింటున్నారు. హోమర్ ట్రాయ్ ని కనుగొన్న ఈ వ్యక్తి ఆటోగ్రాఫ్ తీసుకోడానికి అందరూ ఎగబడుతున్నారు. నన్ను స్వాగతసత్కారాలతో ముంచెత్తుతూ ఎంతో ఆదరిస్తున్న ఈ ముచ్చటైన లండన్ సమాజాన్ని విడిచిపెట్టి, నన్నో దేశద్రోహి అన్నట్టుగా చూసిన పారిస్ కు త్వరలోనే వస్తాను.

The Nine-Year Siege of Troy, after which King Agamemnon returns to his wife, Clytemnestra

అతను పారిస్ లో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. హాలెండ్ రాణి అతన్ని ది హేగ్ కు ఆహ్వానించింది. అక్కడ అతని గౌరవార్ధం జరిగిన విందు సమావేశానికి రాజ్యంలోని ప్రముఖులందరూ విచ్చేశారు. రాణి ప్రత్యేకంగా తనను సందర్శించే అవకాశమిచ్చి అతనితో ముచ్చటించింది. ఆమెతో కలసి లైడన్ మ్యూజియంలోని ఈజిప్టుకు చెందిన పురావస్తువులను చూస్తూ గంటల తరబడి గడిపాడు. రెండు కారణాలవల్ల స్లీమన్ కు ఆమె అమితంగా నచ్చింది. ఆమెకు పురాతత్వ శాస్త్రంపై మంచి ఆసక్తి ఉంది. ఆపైన ఏడు భాషల్ని అనర్గళంగా మాట్లాడుతుంది. లూవే మ్యూజియం కన్సర్వేటర్ రావెసొన్ కు ఇలా ఉత్తరం రాశాడు:

ఘనత వహించిన రాణి నన్ను తరచు అల్పాహారానికీ, మధ్యాహ్న, రాత్రి విందులకూ ఆహ్వానిస్తోంది. ఆమె బాగా చదువుకున్నది. అసాధారణమైన జ్ఞాపకశక్తి. ఆసియా మైనర్, గ్రీకు ద్వీపకల్పం, ఇటలీలో స్వయంగా కొన్ని తవ్వకాలను చేపట్టడానికి ఆమెను ఒప్పించగలనేమో ననిపిస్తోంది. నేను మాత్రం అందులోకి దిగకుండా సలహాదారు పాత్రకే పరిమితమవాలనుకుంటున్నాను.

అక్కడినుంచి అతను కోపెన్ హేగన్ వెళ్ళాడు. వారంరోజులపాటు అక్కడి మ్యూజియం లను సందర్శిస్తూ గడిపాడు. వాటిలో ప్రదర్శించిన కొన్ని శిలాయుగపు ఆయుధాలకూ, ట్రాయ్ లో కనుగొన్నవాటికీ మధ్య ఆసక్తికరమైన పోలికలు గమనించాడు. ఆ తర్వాత రోష్టాక్ వెళ్ళి తన ట్రాయ్ తవ్వకాలపై మరో ప్రసంగం చేశాడు. తిరుగు ప్రయాణంలో ఇటలీ అతన్ని ఆహ్వానించింది. తను నేపుల్స్ లోనే శేషజీవితాన్ని గడపదలచుకున్నానని అక్కడ ప్రకటించాడు. అల్బ లాంగో(ఇటలీలోని ఒక పురాతన ప్రదేశం)లో కొన్ని వారాలు గడిపాడు. అక్కడ ఇటీవలే కొన్ని అంత్యక్రియల కలశాలు బయటపడ్డాయి. మరిన్ని విశేషాలు వెల్లడవుతాయని అతనికి అనిపించలేదు. సీసీలీ పశ్చిమతీర సమీప ద్వీపమైన మోత్యాలో ఒకప్పుడు కార్తజీనియన్ (నేటి ట్యునీసియా రాజధాని ట్యూనిస్ శివార్లలో కార్తేజ్ అనే పురాతన నగరం ఉండేది. ఆ నగరానికి చెందినవారు కార్తజీనియన్లు) జనావాసం ఉండేది. అక్కడ చెప్పుకోదగిన పురాసంపద బయటపడే అవకాశముందని అనుకున్నాడు కానీ, తీరా చూశాక అలాంటి సూచనలేవీ కనిపించలేదు. ఇటలీలోని సెగ్వెంటే అనే పురాతన ప్రదేశంలో జరిపిన ప్రాథమిక తవ్వకాల్లో కూడా గొప్పవేవీ దొరకలేదు. అక్టోబర్ చివరినాటికి ఎటు అడుగువేయాలో తోచని స్థితిలో పడ్డాడు. ఉన్నపళంగా ట్రాయ్ వెళ్ళి తను చేయగలిగిందేమీ లేదు; గ్రీస్ కు తిరిగివెళ్ళడమంటే, అక్కడి ప్రభుత్వంతో ఎడతెగని ఘర్షణతో తలమునకలవడమే.

ఎంతైనా తనకు పేరు ప్రతిష్టలు తెచ్చింది ట్రాయే. డిసెంబర్ ప్రారంభంలో హఠాత్తుగా నేపుల్స్ విడిచిపెట్టి కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్లిపోయాడు. విద్యామంత్రి సఫ్వెట్ పాషాను కలసి కొత్త ఫర్మానా ఇప్పించమని కోరాడు. ఈసారి తవ్వకాల్లో బయటపడేవాటిని అన్నింటినీ నమ్మకంగా ఇంపీరియల్ మ్యూజియంకు అప్పగిస్తానంటే, ఫర్మానా ఇప్పించడానికి ప్రయత్నిస్తానని సఫ్వెట్ పాషా మాట ఇచ్చాడు.

1876 ఏప్రిల్ లో అతనికి ఫర్మానా అందింది. కానీ ఈలోపల, మైసీనియాలోని రాచ సమాధుల దగ్గర తవ్వకాలు జరపాలన్న ఆలోచనే అతని బుర్రను పూర్తిగా ఆక్రమించుకుంది. మైసీనియా గురించిన అధ్యయనంలో మునిగితేలుతున్న కొద్దీ అది సూదంటురాయిలా అతన్ని మరీ మరీ గుంజి లాగడం ప్రారంభించింది. తను ఎలాగూ ఒలింపియాలో తవ్వకాలు జరపలేడు, హిస్సాలిక్ లో దాదాపు తను ఆశించినవన్నీ కనుగొన్నాడు, ఇక మిగిలింది మైసీనియాయే. పౌరాణిక విశ్వాసం ప్రకారం దనాయ్, జియస్ ల కొడుకు పెర్సియస్ మైసీనియా రాజ్యాన్ని స్థాపించాడు. దనాయ్ కు అతను కనకవర్షం కురుస్తుండగా కనిపించాడు. మరోసారి తనకు స్వర్ణనిక్షేపాలు కనిపించడమంటూ జరిగితే అక్కడే నని స్లీమన్ నిశ్చయానికి వచ్చాడు.

***

స్లీమన్ రోజుల్లో మైసీనియా వెళ్ళే పర్యాటకు లెవరికైనా ఆర్గోస్ మైదానం దుబ్బులతోనూ, ధూళితోనూ నిండి పసుపు, తెలుపు రంగుల్లో కనిపించేది. 2,500 అడుగుల ఎత్తు ఉన్న రెండు పర్వతాల మధ్యనున్న బాటను కాపలా కాస్తున్నదా అన్నట్టుగా అక్కడ ఒకప్పుడు ఒక పెద్ద కోటనగరం ఉండేది. అక్కడిప్పుడు రాళ్ళగుట్ట తప్ప మరేమీ కనిపించదు. ఆ బృహత్ పర్వతాలు ఇప్పటికీ భయం గొలుపుతూ, వాటి పాదాల దగ్గర ఉన్న గుట్టల్లోంచి తోడేళ్ళ అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కానీ; ఇటీవలి కాలంలో ఆ పరిసరాల్లో వచ్చిన మార్పూ కనిపిస్తుంది. ఇప్పుడా మైదానంలో మంచి వ్యవసాయం సాగుతోంది. చక్కని రోడ్లు పడ్డాయి. పొగాకు, పత్తి పొలాలమధ్య తోటల పెంపకం సాగుతోంది. పర్వతపాదాల దగ్గర బార్లీ పండిస్తున్నారు. అయినాసరే, ఆకూ అలమూ లేని ఆ నీలిరంగు బోసి పర్వతాల నేపథ్యంతో; అక్కడి అన్ని దారులపై ఆధిపత్యం చెలాయిస్తోందా అన్నట్టుగా మైసీనియా ఈరోజుకీ గుబులు రేపుతూనే ఉంటుంది.

ఆర్గోస్ మైదానం అంతటిపై పెత్తనం చేయడానికి అనువైన చోట మైసీనియా ఉంది. అక్కడికి దక్షిణంగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాఫ్లియో దగ్గర పెట్టని కోటలా అఖాతం ఉంది. చరిత్రపూర్వకాలం నుంచీ ఈ ప్రాంతంలో జనాలు నివసించినట్టు ఆధారాలున్నాయి. క్రీ.పూ. 1700లో,  ప్రబలుడైన ఒక రాజు అప్పటికే ఇక్కడ ఉన్న కంచుయుగ ప్రారంభ కాలానికి చెందిన నగరం చుట్టూ బ్రహ్మాండమైన ప్రాకారాలను, కొత్తగా ఒక ప్రాసాదాన్ని నిర్మించాడు. అతని పేరేమిటో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు. నగరంలోకి వెళ్లడానికి చప్టా చేసిన రహదారి, దానికి రెండుపక్కలా బురుజులూ ఉన్నాయి. ఈ బురుజుల లోతట్టున ఇప్పటికీ ఒక పెద్ద సింహద్వారం(Lion Gate)ఉంది.

mycenae-lion-gate-00ఒకప్పుడు దానిని రెండు చెక్క తలుపులతో మూసి ఉంచేవారు. ఆ తలుపుల మీద ఓ పెద్ద దూలం, దాని మీద ఒకదాని కొకటి అభిముఖంగా ఉన్న రెండు సివంగుల బొమ్మలూ ఉన్నాయి. ఆ సింహద్వారంలోంచి లోపలికి వెడితే, 16 అడుగుల మందం కలిగిన ప్రాకారాలకు అవతల ఒక వలయాకారపు చప్పరం(terrace) కనిపిస్తుంది. స్లీమన్ రోజుల్లో ఈ చప్పరం రాళ్ళగుట్టలతోనూ, ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్తతోనూ నిండి ఉండేది. దీనికి అవతల రాజప్రాసాదాలు, ఇళ్ల తాలూకు శిథిలాలు ఉన్నాయి. వాటిని నాచు, కలుపు కప్పేశాయి. కొండ వాలుల్లోనూ, చుట్టుపక్కల ఉన్న లోయలోనూ దిగువ నగరం తాలూకు శిథిలాలు ఉన్నాయి. ఓ అడవిలా భయం గొలిప ఈ కొండ పరిసరాల్లోకి ఎప్పుడైనా దొంగలు తప్పిస్తే ఇంకెవరూ వెళ్లరు. ఇన్ని శతాబ్దాలలో ఇక్కడ పెద్దగా వచ్చిన మార్పేమీలేదు.  క్రీ.శ. రెండవ శతాబ్దికి చెందిన గ్రీకు పర్యాటకుడు, భౌగోళికవేత్త పసన్నియాస్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడూ దాదాపు ఇప్పుడున్నట్టే ఉంది.

ఒకప్పుడు ఇక్కడ విశాలమైన వీధులతో, రథమార్గాలతో, తళతళా మెరిసిపోయే బాటలతో ఒక పెద్ద సుసంపన్న నగరం ఉండేది. ఈ ప్రాంతాన్ని బలవత్తరుడైన ఒక రాజు పాలించేవాడు. ఇక్కడి సింహద్వారంలోంచి భారీ సైన్యాలు రాకపోకలు సాగిస్తూ ఉండేవి.  రాజు అధీనంలో పెద్ద పెద్ద స్వర్ణ కోశాగారాలు ఉండేవి.  మైసీనియాను స్వర్ణనగరంగా హోమర్, సొఫొక్లీస్ లు ఇద్దరూ అభివర్ణించారు. ఈ నగరరాజ్యాన్ని పెర్సియస్ స్థాపించాడనీ, ఈ ప్రదేశంలో తన కత్తి ఉంచుకునే ఒర తాలూకు పై తొడుగు(mykes)ను పోగొట్టుకోవడం వల్లనో, ఇక్కడ కనిపించిన పుట్టగొడుగు(mykes)ల వల్లనో మైసీనియా అని పేరుపెట్టాడనీ పసన్నియాస్ రాశాడు. ఆర్గోలిస్ మైదానం ఎడ్లకు ప్రసిద్ధి కనుక అవి వేసే రంకె(mykithmos)లను సూచించేలా ఆ పేరు వచ్చి ఉండచ్చని స్లీమన్ అనుకున్నాడు.

పెర్సియస్, అతని వారసుల పాలన ప్రశాంతంగా సాగిపోయింది. కానీ ఆ తర్వాత ఏట్రియస్ నెలకొల్పిన రాజవంశం విషాదగ్రస్తంగా మిగిలిపోయింది. తన భార్యను సోదరుడు థయస్టీస్ లోబరచుకున్నాడని తెలిసిన ఏట్రియస్ అతని కొడుకులిద్దరినీ చంపి వారి మాంసంతో థయస్టీస్ కు విందు ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన థయస్టీస్ తిన్నది వాంతి చేసుకుని, భోజనం బల్లను ఎత్తిపడేసి, ఏట్రియస్ వంశం సర్వనాశనమైపోతుందని శాపనార్థాలు పెడుతూ అక్కడినినుంచి పరుగెత్తాడు. ఆ తర్వాత ఏట్రియస్ పై ఎలా పగ తీర్చుకోవాలో చెప్పమని దేవదూతను కోరాడు. నీ కూతురు పెలోపియా ద్వారా నీకు కలిగే కొడుకు మాత్రమే ఏట్రియస్ పై పగ తీర్చుకోగలడని దేవదూత పలికింది. ఓ రోజు రాత్రి థయస్టీస్ బలి ఇస్తుండగా ఒక అమ్మాయి అతనిని సమీపించింది. తన కూతురని తెలియక థయస్టీస్ ఆ అమ్మాయిని లోబరచుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టాడు. అతను ఏగిస్త్వస్ అనే పేరుతో పెరిగిపెద్దవాడై ఏట్రియస్ ను హతమార్చాడు. ఆ తర్వాత థయస్టీస్ కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. అతని తర్వాత ఏట్రియస్ కొడుకు అగమెమ్నన్ రాజయ్యాడు.

థయస్టీస్ శాపం ఆ తర్వాత కూడా ప్రభావం చూపించింది. అగమెమ్నన్ ట్రాయ్ లో యుద్ధం చేస్తున్న సమయంలో అతని భార్య క్లైటెమెనెస్ట్రాతో ఏగిస్త్వస్ సంబంధం పెట్టుకున్నాడు. యుద్ధం నుంచి తిరిగి రాగానే అగమెమ్నన్ ను అంతమొందించాలని ఇద్దరూ పన్నాగం పన్నారు. ట్రాయ్ నుంచి యుద్ధఖైదీలతో ఓడలు తిరిగి వస్తున్న సంగతిని గమనించి తమకు చెప్పమని ఒక కావలివాడిని సముద్రతీరానికి పంపించారు. ఏమాత్రం అనుమానం కలగని అగమెమ్నన్, సేనలు వెంటరాగా రథం మీద మైదానం దాటి కోటకు చేరుకున్నాడు. అక్కడ తనకు ఏర్పాటు చేసిన  విందుకు వెళ్ళాడు. ఆ విందులోనో, లేదా సమీపంలోని స్నానశాలలోనో ఏగిస్త్వస్, క్లైటెమెనెస్ట్రా లు అతన్ని హత్యచేశారు. దానికి ప్రతీకారంగా ఆ తర్వాత అగమెమ్నన్ సంతానమైన ఒరెస్టీస్, ఎలెక్త్రాలు క్లైటెమెనెస్ట్రాను, ఏగిస్త్వస్ ను హతమార్చారు. ఒరెస్టస్ రాజయ్యాడు.

అగమెమ్నన్ హత్యను హోమర్, ఎస్క్యులస్(క్రీ.పూ. 525, గ్రీకు విషాదాంత నాటకకర్త), సొఫొక్లీస్, యురిపిడీస్(క్రీ.పూ. 480, గ్రీకు విషాదాంత నాటక కర్త)లు ముగ్గురూ విశేషంగా కథనం చేశారు. ట్రాయ్ పతనాన్నీ, ఏట్రియస్ కుటుంబంలో పుట్టిన ముసలాన్నీ వీరయుగపు విషాదాంత ఘటనలుగా గ్రీకులు భావిస్తారు. వాటిమీదే తమ భావజగత్తును నిర్మించుకుంటూ, స్ఫూర్తిని పుంజుకుంటూ వచ్చారు. ట్రాయ్, మైసీనియాలు రెండింటినీ మహావీరుల స్మృతులు వెంటాడే పవిత్రస్థలాలుగా వారు భావిస్తారు.

ట్రాయ్ విషయంలోలానే, మైసీనియా విషయంలో కూడా తనదైన సరళ తర్కాన్ని అనుసరించి ముందుకెళ్లాలని స్లీమన్ అనుకున్నాడు. ట్రాయ్ లో నగరానికి దారితీసే ప్రధానద్వారం దగ్గర తను స్వర్ణనిక్షేపాలను కనిపెట్టాడు. మైసీనియాలో కూడా ప్రధానద్వారం దగ్గరే నిక్షేపాలను కనిపెట్టగలననుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

ట్రాయ్ నగలతో సోఫియాకు అలంకారం

 

స్లీమన్ కథ-22

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పనివాళ్లు అందరూ వెళ్ళిపోయారు. సోఫియా తిరిగివచ్చింది. స్లీమన్ ఒక జేబుకత్తితో నిక్షేపాలను తవ్వి తీయడం  ప్రారంభించాడు. మట్టి, రాతిముక్కలు, పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన రక్షణకుడ్యం కుప్పకూలేలా ఉంది. కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఓ పెద్ద ఖజానా  అతని భయాలన్నింటినీ హరించేసింది. మళ్ళీ సోఫియావైపు తిరిగి, “త్వరగా వెళ్ళు, నీ పెద్ద శాలువ తీసుకురా” అన్నాడు.

మరోసారి సోఫియా చెక్క నిచ్చెన మీంచి పైకి ఎక్కి, ఇంటికి వెళ్లింది. భారీగా కుట్టుపని చేసిన ఓ పెద్ద ఎరుపురంగు శాలువతో తిరిగివచ్చింది. సాధారణంగా శ్రాద్ధదినాలలో గ్రీకు మహిళలు అలాంటి శాలువలు కప్పుకుంటారు. తవ్వి తీసిన నిక్షేపాలను ఆ శాలువలో మూటగట్టి ఇద్దరూ ఇంటికి మోసుకెళ్లారు.

తలుపు గడియ పెట్టేసి ఓ చెక్క టేబులు మీద ఆ నిక్షేపాలను పరిచారు. చిన్నచిన్న వస్తువులను పెద్దవాటిలో సర్దేశారు. పురావస్తుప్రదర్శనశాలల్లో అద్దాలలోంచి కనిపించే ఇలాంటి నగా నట్రా లేత పసుపురంగులో ఉండి, తాజాగా మెరిసిపోతున్నట్టు ఉంటాయి. ఒక విచిత్రమైన నిర్జీవత వాటిలో ఉంటుంది. కానీ భూమిలోంచి తవ్వి తీసినప్పుడు అవి అద్భుతమైన ఎరుపురంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ నిక్షేపాలలో ఒక రాగి డాలు, ఒక రాగి కళాయి, ఒక వెండి తొడుగు, ఒక రాగి తొడుగు, ఒక బంగారు సీసా, రెండు బంగారు కప్పులు, వెండి బంగారు మిశ్రమంతో చేసిన ఒక చిన్న నగల పాత్ర ఉన్నాయి. ఇంకా, ఒక వెండి కొమ్ము జారీ, మూడు పెద్ద వెండి కలశాలు, రెండువైపులా పదునున్న ఏడు రాగి బాకులు, ఆరు వెండి కత్తులు, పదమూడు రాగి బల్లెపు పిడులు ఉన్నాయి. ఒక పెద్ద వెండి కలశం అడుగున రెండు బంగారు శిరోభూషణాలు, నాలుగు బంగారు జూకాలలాంటివి, 56 బంగారు చెవిపోగులు, 8,750 బంగారు ఉంగరాలు, బొత్తాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అతి చిన్నవి.

అన్నింటిలోనూ శిరోభూషణాలు ఎక్కువ ఆశ్చర్యం గొలిపాయి. వాటిలో ఒకదానికి తొంభై గొలుసులున్నాయి. వాటిపై ఆకులు, పువ్వుల చెక్కుడులు ఉన్నాయి. రెండువైపులా సన్నని బంగారు దారాలలాంటివి వేలాడుతున్నాయి. పర్షియన్, రోమన్ శిరోభూషణాలు కేవలం తలకు చుట్టుకునే పట్టీలలా మాత్రమే ఉంటాయి. వాటికి భిన్నంగా ట్రోజన్ శిరోభూషణాలు అసంఖ్యాకమైన బంగారు వలయాకార నిర్మాణాలతో నుదుటి మొత్తాన్ని కప్పేలా ఉంటాయి. అలాంటివి ఇంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ మరెక్కడా కనిపించలేదు.

Priam-treasure

స్లీమన్ సంభ్రమం పట్టలేకపోతున్నాడు. కంపిస్తున్న చేతుల్లోకి ఆ శిరోభూషణాలను తీసుకుని వెలుతురులోకి వెళ్ళి పరీక్షగా చూశాడు.  ఆ తర్వాత వాటిని సోఫియా నుదుట అలంకరించాడు. అవి ట్రోజన్ రాణికి చెందిన శిరోభూషణాలని అతను జీవితాంతం నమ్మినట్టు కనిపిస్తుంది కానీ, నిజానికి అవి రాజు ధరించిన శిరోభూషణాలు కావడానికే అవకాశ మెక్కువ. ఆమె ఒకవిధమైన ఆటవికపు వైభవంతో వెలిగిపోయేలా మెడలో నగలు దిగేశాడు. వేళ్ళకు ఉంగరాలు తొడిగాడు. మెక్లంబర్గ్ కు చెందిన ఒక అనామక చర్చి ఉద్యోగి కొడుకు ఎట్టకేలకు రాజులు నడయాడిన చోట, ఒక మహారాణిలా మెరిసిపోయే మహిళ ముందు నిలబడి ఉన్నాడు.

తను కచ్చితంగా రాజు ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను కనుగొన్నాననుకున్నాడు. ట్రాయ్ తగలబడుతున్నప్పుడు వాటిని రహస్యంగా ఒక గోడలో భద్రపరిచారనీ, చివరి క్షణాలలో హడావుడిగా వాటిని ఒక చెక్కపెట్టెలో పెట్టి ఉంటారనీ, ఆ తొందరలో తాళం చెవిని అలాగే వదిలేసి ఉంటారనీ అనుకున్నాడు. కానీ అతను తాళం చెవి అనుకున్నది నిజానికి ఒక రాగి ఉలి. ఆ నిక్షేపాలను ఒక పెట్టెలో పెట్టారనడానికి కూడా ఆధారాలు కనిపించలేదు.

వాటి తయారీ విషయానికే వస్తే, బంగారు పాత్రలపై చక్కని పనితనం కనిపిస్తోంది. అయితే, తలపాగా లాంటి కిరీటా(tiara)లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నా వాటిపై పనితనం ప్రాథమికంగా ఉంది. తీగ చుట్లతోనూ, తాపడం చేసిన బంగారు రేకులతోనూ వాటిని తయారుచేశారు. ఉంగరాల మీద ఎలాంటి చెక్కడాలూ లేవు.  ఎంతో అందంగా మలచిన ఒక బంగారు కొమ్ము పాత్రను మాత్రం పనితనంలో తలమానికమని చెప్పచ్చు. అయితే కత్తులు, బాణపు మొనలు, చిత్రమైన మృణ్మయమూర్తుల మధ్య అలాంటి పాత్ర ఎందుకుందో అర్థం కాలేదు. గోడల్లో భద్రపరచిన వాటిలో వెండి, బంగారాలే కాదు; ముతక పనితనం కనిపించే దంతపు వస్తువులు, ఒకమాదిరి మేలిరకపు రాళ్ళతో మలచిన  సుత్తి గొడ్డళ్ళు, మర్మస్థానంపై స్వస్తిక చిహ్నం కలిగిన ఒక స్త్రీ తాలూకు చిన్న సీసపు బొమ్మ ఉన్నాయి. వీటన్నిటినీ పక్క పక్కన చూసినప్పుడు, మూర్తి ఆరాధనా, ఆటవికతలతో ఉత్తమ కళాభిరుచి చెట్టపట్టాలు వేసుకుందా అనిపిస్తుంది. ఇంతకీ ఇది హోమర్ చిత్రించిన ట్రాయేనా, లేక అంతకంటే వెనకటి కాలానికి, మరింత ఆటవిక కాలానికి చెందినదా అన్న అనుమానం తలెత్తుతుంది.

స్లీమన్ మాత్రం, తను ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను తవ్వితీశాననే నిర్ధారణకు వచ్చాడు.

అతను ఎంత ప్రయత్నించినా రహస్యం పూర్తిగా దాగలేదు. ట్రాయ్ అంతటా వదంతులు వ్యాపించాయి. అమీన్ ఎఫెన్డీ ఇంటికొచ్చి, తనకు తెలియకుండా ఏదో దాచారంటూ విరుచుకుపడ్డాడు. ఇల్లు సోదా చేస్తానన్నాడు. పెట్టెలు, దుస్తుల బీరువాలతో సహా అన్నీ తెరవమని సుల్తాన్ పేరు మీద ఆదేశించాడు. స్లీమన్ కూడా ఆగ్రహంతో ఊగిపోతూ అతన్ని గెంటివేశాడు. ఆరోజు రాత్రో, ఆ మరునాటి రాత్రో తింబ్రియాలోని కల్వర్ట్ ఇంటికి నిక్షేపాలను తరలించి; ఆ తర్వాత కొన్ని రోజులకు దేశం దాటించాడు.

మరికొన్ని రోజులపాటు రక్షణకుడ్యం అడుగున గాలించాడు. ఇంకేమీ దొరకలేదు. జూన్ 17న తవ్వకాలను అకస్మాత్తుగా ఆపేశాడు. పనివాళ్ళకు వేతనం చెల్లించి పంపేశాడు. ఒక్కసారిగా నిర్జనంగా మారిపోయిన ఆ దిబ్బ మీదికి ఒక పూజారి వచ్చి మతపరమైన తంతు నిర్వహించాడు. ఎక్కడబడితే అక్కడ కందకాలతో, నడవలతో పద్మవ్యూహంలా మారిన ఆ ప్రదేశం యుద్ధరంగాన్ని తలపించింది. తను ఎథెన్స్ కు వెళ్లిపోతున్నాననీ, ట్రాయ్ గడ్డ మీద మళ్ళీ అడుగుపెట్టననీ స్లీమన్ ప్రకటించి తను సేకరించిన కొన్ని వస్తువులను తీసుకుని నిశ్శబ్దంగా అక్కడినుంచి తప్పుకున్నాడు. మిగతా వస్తువులను ముందే పంపేశాడు. జూన్ 19 కల్లా ఎథెన్స్ లో ఉన్నాడు. అదే రోజున, తను వెలికితీసిన వాటి గురించి గర్వంగా చెప్పుకుంటూ వరసపెట్టి మిత్రులకు, బంధువులకు ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు.

ఉత్సాహం, ఉత్తేజం అతన్ని ఊపేస్తున్నాయి. “నేటి కాలంలోనే మహత్తరమైన, యావత్ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అద్భుతాన్ని” తను కనుగొన్నాడు! ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకునే ఈ పెద్దమనిషి, అలా చెప్పుకోవడం సహేతుకమేనని మొదటిసారి నిరూపించుకున్నాడు. ఆశకూ, హేతుబద్ధతకూ, అన్ని రకాల ఆధారాలకూ ఎదురీది తను ట్రాయ్ ని కనుగొన్నాడు. తన చేతుల్లో మెరిసిపోతున్న స్వర్ణ శిరోభూషణాలే అందుకు సాక్ష్యం! కాదనే ధైర్యం ఎవరి కుంటుంది?!

ఇంకోవైపు నిక్షేపాలు అతనికి మోయలేని బరువూ అయ్యాయి. సోఫియా బంధువులను కూడా ఈ గూడుపుఠాణీలోకి లాగాడు. గ్రీస్ అంతటా పశువుల కొట్టాల్లోకీ, గాదెల్లోకీ, పెరళ్ళ లోకీ గడ్డి చుట్టబెట్టిన విచిత్రమైన వస్తువులు రహస్యంగా చేరుకున్నాయి. ఒక వెదురు బుట్ట ఎలూసిస్ లో ఉంటున్న ఒక బంధువు ఇంటికి చేరింది. నిక్షేపాలను తలో చోటికీ తరలించేముందు ప్రతి వస్తువు గురించిన వివరాలను, తూకంతో సహా స్లీమన్ పూస గుచ్చినట్టు రాసుకున్నాడు. వాటిపై గ్రీకు, టర్కిష్ ప్రభుత్వాల కన్ను పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.

తను ఎథెన్స్ లోనే ఉండిపోయాడు. సోఫియా కూతురిని తీసుకుని కొన్ని రోజులు విశ్రాంతిగా గడపడానికి ఇటలీలోని అగ్నిపర్వతద్వీపమైన ఈశ్చియాకు వెళ్లింది. కొన్ని వారాల తర్వాత ఒక నమ్మకస్తుడైన పనివాడిని పంపించి నిక్షేపాలను  ఎక్కడెక్కడ దాచాడో నోటి మాటగా ఆమెకు చెప్పించాడు.

ఇప్పుడిక మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాల గురించి గట్టిగా ఆలోచించడం ప్రారంభించాడు. సొంత ఖర్చుతో తవ్వకాలు జరపడానికి అనుమతించమని ఇంతకు ముందు అడిగినప్పుడు గ్రీకు ప్రభుత్వం తిరస్కరించింది. తను కనుగొన్న నిక్షేపాలను ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదనతో మరోసారి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. టర్కీ ప్రభుత్వంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని ఈసారి కూడా గ్రీకు ప్రభుత్వం నిరాకరించింది.

ఆగస్టులో టర్కీ ప్రభుత్వం నుంచి స్లీమన్ కు తలనొప్పి రానే వచ్చింది. అతను నిక్షేపాలను కనుగొని, వాటిని రహస్యంగా తరలించిన సంగతి ప్రాథమిక దర్యాప్తు ద్వారా ప్రభుత్వం పసిగట్టింది. Augsburger Allegemeine Zeitung ప్రచురించిన స్లీమన్ నివేదికలు కూడా దానిని ధ్రువీకరిస్తున్నట్టు గమనించింది. తవ్వకాల దగ్గర తన ప్రతినిధిగా నియమించిన అమీన్ ఎఫెన్డీ తన విధిని సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణతో ప్రభుత్వం అతనిపై చర్య తీసుకోబోతున్నట్టు స్లీమన్ కు తెలిసింది. అటోమన్ సామ్రాజ్యంలో తప్పు చేసిన అధికారికి విధించే శిక్ష ఒక్కోసారి మరణశిక్ష కూడా కావచ్చు. స్లీమన్ నైతిక సందిగ్ధంలో పడ్డాడు. తను కనుగొన్న నిక్షేపాలను టర్కీ ప్రభుత్వానికి అప్పగించే ప్రశ్న ఎలాగూ లేదు. టర్కీ వెళ్ళి అమీన్ ఎఫెన్డీ తరపున జోక్యం చేసుకునే ప్రశ్న అంతకంటే లేదు. కాకపోతే, ఎఫెన్డీ పూర్తిగా నిర్దోషి అని స్పష్టం చేస్తూ, “మానవత్వమూ, పవిత్ర న్యాయమూ” పేరిట ఉత్తరం రాసే అవకాశం తనకు ఉంది. అదే చేశాడు:

అక్కడ జరుగుతున్న ప్రతి పని పైనా అతను నిఘా పెట్టడం అసాధ్యం. ప్రతిరోజూ ఏకకాలంలో అయిదు చోట్ల తవ్వకాలు జరుగుతూ వచ్చాయి. తనే అయిదు రూపాలు ధరించి అయిదు చోట్లా కాపలా కాయగల మనిషి ఇంతవరకూ పుట్టలేదు.

అమీన్ ఎఫెన్డీ ఆ దిబ్బ మీద ఇంకో పక్క ఉన్నప్పుడు నేను నిక్షేపాలను కనుగొన్నాను. పనివాళ్ళ ద్వారా ఆ సంగతి తెలిసినప్పుడు పాపం అత నెంత డీలాపడిపోయాడో; కోపంతో రగిలిపోతూ నా ఇంటికి వచ్చి పెట్టెలూ, బీరువాలూ తెరచి చూపించమని సుల్తాన్ పేరు మీద ఎలా ఆదేశించాడో మీరు చూసి ఉంటే అతని మీద జాలిపడేవారు.

నా తవ్వకాల మీద అతనిలా రెప్పవాల్చకుండా నిఘా పెట్టినవారు ఇంకెవరూ లేరు. అయితే, పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించే వ్యక్తి తప్పనిసరిగా ఓ పురావస్తునిపుణుడు అయుండాలి. అమీన్ ఎఫెన్డీ తప్పల్లా పురావస్తునిపుణుడు కాకపోవడమే…

ఆపైన, తను సమర్ధించుకోలేని తప్పు చేసి కూడా టర్కీ ప్రభుత్వంతో అడ్డదిడ్డం వాదనలోకి దిగాడు. మీరు నాక్చిన ఫర్మానాను రద్దు చేశారు కనుక, నేను ఏం చేసినా అడిగే హక్కు మీకు లేదన్నాడు. మీరు నాతో రాసుకున్న ఒప్పందాన్ని ఎప్పుడైతే ఉల్లంఘించారో, అప్పుడే దానికి కట్టుబడి ఉండాల్సిన నైతికబాధ్యతనుంచి నేను బయటపడ్డా నన్నాడు. నిక్షేపాలలో కొంతైనా లాంఛనంగా కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు పంపవలసిందిగా ప్రభుత్వం లోపాయికారీగా అడిగింది. రవ్వంత కూడా పంపేది లేదని తెగేసి చెప్పిన స్లీమన్; ట్రాయ్ లో మరో మూడు మాసాలపాటు తవ్వకాలకు అనుమతిస్తే, ఆ తవ్వకాల్లో దొరికే ప్రతి ఒక్క వస్తువునీ మ్యూజియంకు ఇస్తానని అదే ఉత్తరంలో బేరం పెట్టాడు.

ఇక్కడ గ్రీకు ప్రభుత్వం వైఖరి కూడా అతనికి చికాకు తెప్పిస్తోంది. ఇటలీ వెళ్లిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన బుర్రను తొలవడం ప్రారంభించింది. పురావస్తునిపుణుల దృష్ట్యా పాలెమో, నేపుల్స్ లు తవ్వకాలకు ఎంతో యోగ్యమైన  ప్రదేశాలు. దాంతో ఇటలీలోని మ్యూజియం అధికారులను గిల్లడం మొదలుపెట్టాడు. ఈ ప్రదేశాలలో తను స్వేచ్ఛగా తవ్వకాలు జరపడానికి అనుమతిస్తే, వాటిలో బయటపడే వస్తువులను ఉంచడానికి సొంత ఖర్చుతో మ్యూజియం నిర్మించి ఇస్తానని ఆశపెట్టాడు.

ఈలోపల అతని పేరు మారుమోగడం ప్రారంభించింది. ట్రాయ్ లో అతను కనుగొన్న విశేషాల గురించి విని బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ముగ్ధుడయ్యాడు. ప్రముఖ ప్రాచ్య పండితుడు మాక్స్ ముల్లర్ వాటిపై ఒక వ్యాసం రాశాడు. జర్మనీలో అతని అనుకూల, వ్యతిరేకుల శిబిరాలు అప్పటికే ఏర్పడి యుద్ధం ప్రారంభించాయి. శిశిరం నుంచి శీతాకాలం ప్రారంభంవరకూ స్లీమన్ తన ట్రోజన్ నివేదికలకు పుస్తకరూపమిస్తూ గడిపాడు. మధ్య మధ్య ఫొటోల చేర్పుతో, Troianische Altertumer  అనే పేరుతో పూర్తి చేసిన ఆ పుస్తకాన్నీ, తనే చేసిన దాని ఫ్రెంచి అనువాదాన్నీ ప్రచురణకర్తకు పంపించాడు.

పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ అస్తిమతంలోకి జారిపోయాడు. గ్రీకు ప్రభుత్వం ఒలింపియాలో తవ్వకాలు జరిపే హక్కును ప్రష్యన్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలిసి కోపంతో కుతకుతలాడాడు. మైసీనియా వెళ్ళి ప్రాథమిక పరిశీలన జరపాలని నిర్ణయించుకున్నాడు. ట్రాయ్ తరహా విజయాలను తను మరోసారి మూటగట్టుకునే అవకాశం అక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదనుకున్నాడు.

Sophia_schliemann_treasure

సోఫియాను వెంటబెట్టుకుని, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా మైసీనియాకు వెళ్లిపోయాడు. అప్పటికప్పుడు పనివాళ్లను నియమించుకున్నాడు. అయిదురోజులపాటు గిరిదుర్గం దగ్గర ముప్పైకి పైగా చిన్న చిన్న కందకాలను తవ్వించాడు. పెద్ద ప్రాముఖ్యం లేని కొన్ని కుండపెంకులు మాత్రం బయటపడ్డాయి. మైసీనియాలోని కోటగోడ లోపల వీరయుగం తాలూకు సమాధులు బయటపడగలవని తాను నమ్ముతున్నట్టు Ithaka, der Peloponnes und Troja అనే తన పుస్తకంలో చాలాకాలం క్రితమే రాసుకున్నాడు. ఆ నమ్మకం మరింత బలపడడమే ఈ అయిదురోజుల్లో అతను సాధించిన ముఖ్యమైన ఫలితం. కారణం చెప్పలేకపోయినా, ట్రాయ్ లో బంగారు నిక్షేపాలు ఉంటాయని ముందే ఊహించినట్టే; మైసీనియాలోని ప్రసిద్ధ సింహద్వారం (Lion Gate) దగ్గరలో, దానికి ఒకింత దూరంలో కచ్చితంగా రెండు గోపురం ఆకారంలోని శవాగారాలు(mortuary dome chambers) ఉంటాయని అతను ఊహించాడు. సింహద్వారానికి కొంచెం అవతల తవ్వితే తయస్టీస్, అగమెమ్నన్ తదితర మైసీనియా రాజుల సమాధులు బయటపడచ్చన్నాడు. ఇప్పటికే తను ఒడీసియస్ చితాభస్మాన్ని, ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. మైసీనియా రాజుల సమాధులను కూడా బయటపెడితే అది తనకు మరో కీర్తి కిరీటాన్ని అలంకరిస్తుందని అనుకున్నాడు.

అయితే దురదృష్టవశాత్తూ మైసీనియాలో తవ్వకాలను చేపట్టడానికి అతనికి అనుమతి లేదు. అక్కడ అతను రహస్యంగా తవ్వకాలు జరిపిస్తున్న వార్త గ్రీకు ప్రభుత్వం చెవిన పడనే పడింది. తక్షణమే వాటిని ఆపవలసిందిగా  ఆర్గోలిస్ (గ్రీస్ లోని ఒక ప్రాంతీయ పరిపాలనా విభాగం)ముఖ్యాధికారికి తంతి ఆదేశాలు పంపింది. ఆ తర్వాత, స్లీమన్ అంతవరకూ తవ్వితీసిన వాటిని జప్తు చేయవలసిందనీ, అతని పెట్టే బేడా సోదా చేయవలసిందనీ వెంట వెంటనే మరో రెండు టెలిగ్రాములు పంపింది.

ఈ పనులను నాఫ్లియోలోని పోలీస్ ఉన్నతాధికారికి అప్పగించారు. అతను స్లీమన్ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అతనితో కలసి ప్రశాంతంగా కాఫీ సేవిస్తూ సంగతేమిటని అడిగాడు. స్లీమన్ ఓ బుట్టెడు కుండ పెంకులు చూపించాడు. పురాతన నగరాల్లో అలాంటి కుండపెంకులు ప్రతి సందులోనూ, గొందులోనూ దొరుకుతాయనీ, విలువైనవేవీ తనకు కనిపించలేదనీ, కనుక అక్కడితో దానిని వదిలేశాననీ ఆ పోలీస్ అధికారి పైవాళ్ళకు రాశాడు.

ఎథెన్స్ కు తిరిగి వచ్చిన స్లీమన్, తనపై ప్రభుత్వం కత్తులు నూరుతున్న సంగతి గమనించాడు. ట్రాయ్ లో నిక్షేపాలను కనుగొన్నప్పటినుంచీ అతను అతిపెద్ద అనుమానితుల జాబితాలో చేరిపోయాడు. పోలీస్ అధికారి, ఆర్గోలిస్ ముఖ్యాధికారి, మైసీనియా మేయర్ చేతకాని దద్దమ్మలని గ్రీకు విద్యామంత్రి తిట్టిపోశాడు. “గ్రీసుకు ఎలాంటి రక్షణా లేదనీ; ఎవడైనాసరే చట్టాలను ఇష్టానుసారం కాలరాస్తూ ఈ నేలలోకి చొరబడి ఏమైనా చేయచ్చనీ తమ చర్యల ద్వారా నిరూపించా”రని దుయ్యబట్టాడు.

  (సశేషం)

 

 

రోహిత్ ఆత్మహత్య: ఒక సరికొత్త/పాత సందర్భం

 

 

-భాస్కరం కల్లూరి

~

 

హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అంతఃకరణను కలచి వేసే ఒక భావోద్వేగ సందర్భం. అదే సమయంలో లోతుగా తరచి చూసి అర్థం చేసుకోవలసిన ఒక సరికొత్త/పాత సందర్భం కూడా. ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య వార్త జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడం చూసి ఒకింత ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల వార్తలు మరీ ముఖ్యమూ, సంచలనాత్మకమూ అయితే తప్ప జాతీయ మీడియాలో ప్రముఖంగా రావు. ఆ పైన రోహిత్ ఆత్మహత్యపై దాదాపు అన్ని జాతీయవార్తా చానెళ్లూ చర్చ జరపడం ఆశ్చర్యాన్ని పెంచింది. ఆ చర్చ వరసగా కొన్ని రోజులపాటు జరగడం ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది. దాంతోపాటు ఆలోచనలనూ రేకెత్తించింది.

దేశ వ్యాప్తంగా జరుగుతున్నట్టే, నిన్నటి అవిభక్త, నేటి విభక్త తెలుగు ప్రాంతాలలోనూ ఆత్మహత్యలు, దళితులపై హింస ఎంతోకాలంగా జరుగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ ఉద్యమసమయంలో జరిగిన ఆత్మాహుతులు తెలిసినవే. దళిత హింసకు వస్తే; కారంచేడు, చుండూరు, పదిరికుప్పం; మహారాష్ట్రలో ఖైర్లాంజీ లాంటి ఘటనలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. స్థూలంగా చెప్పుకుంటే, ఆ క్రమంలో రోహిత్ ఆత్మహత్య, పునరావృతమైన ఒక పాత సందర్భమే అవుతుంది.  అయితే, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో చర్చనీయం అయినంతగా పైవేవీ కాలేదు. అప్పటికి మీడియా వ్యాప్తి ఇంత లేకపోవడం ఒక కారణం అనుకున్నా; ఇప్పటికీ జాతీయ మీడియా వింధ్య అవతలి ప్రాంతాలపై, ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలపై పెడుతున్నంత ఫోకస్; వింధ్య ఇవతలి ప్రాంతాలపై పెట్టడం లేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే రోహిత్ ఆత్మహత్యపై దాని స్పందన విలక్షణంగానే కనిపిస్తుంది. ఆవిధంగా అదొక సరికొత్త సందర్భం. వెరసి అదొక సరికొత్త/పాత సందర్భం.

ఇలా రోహిత్ ఆత్మహత్యను కొత్త సందర్భంలోకి తీసుకొచ్చినది సాక్షాత్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని భావసారూప్య వర్గాలే. అందుకు కారణం, అవి అనుసరించే ఒక నిర్దిష్ట భావజాలం. కానీ విచిత్రమేమిటంటే, రోహిత్ ఆత్మహత్య పాత సందర్భానికి కొనసాగింపు మాత్రమే తప్ప కొత్త సందర్భం ఎంతమాత్రం కాదని అవి నొక్కి చెబుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో దళితుల ఆత్మహత్యలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి. ఒక దళిత విద్యార్థి ఆత్మహత్యను జాతీయస్థాయికి పెంచి మీడియా రభస చేయడం వెనుక మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జరుగుతున్న మతపరమైన ఘటనలు, అసహనం పెరిగిపోవడం గురించిన ఆరోపణల విషయంలోనూ బీజేపీ, దాని మిత్రవర్గాలూ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చాయి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వదలుకోదన్న కోణంలో చూస్తే ఇది నిజం కావచ్చు కూడా.  అయితే, బీజేపీ, దాని మిత్రవర్గాలు ప్రస్తుతం తామున్న ఒక విలక్షణ పరిస్థితిలో; జరుగుతున్నవన్నీ పాతసందర్భానికి కొనసాగింపులే తప్ప కొత్తవి కావని చెప్పడానికి కూడా దీనిని తెలివిగా వాడుకుంటున్నాయి.

అయితే, వాటి అసలు లక్ష్యం దేశాన్ని పాత సందర్భం నుంచి తప్పించి కొత్త సందర్భంలోకి తీసుకెళ్ళడం! ఎందుకంటే, వాటికి తమవైన నిర్దిష్ట భావజాలమూ, ఆచరణా ఉన్నాయి. ఆ భావజాల అవసరాల రీత్యా కుల(దళిత)-మత(ముస్లిం)పరమైన అస్తిత్వాలకు కొత్త నిర్వచనం ఇచ్చి, కొత్తసందర్భంలోకి తీసుకురావడమనే ఒక ముఖ్యమైన అజెండా వాటికి ఉంది.  దీనిని వారు కూడా కాదనరు. అధికారంలో ఉండడం ఆ అజెండా అమలుకు మంచి వెసులుబాటు. తమ భావజాల అజెండాను అమలు చేయలేనప్పుడు అధికారంలో ఉండడమే అర్థరహితం అవుతుంది. అయితే, విచిత్రంగా అవి చేస్తున్నదేమిటంటే;  దేశాన్నికొత్త సందర్భంలోకి తీసుకురావడమనే తమ అసలు లక్ష్యాన్ని తమే కప్పి పుచ్చుకుంటూ;  తమ అజెండా అమలును పాత సందర్భానికి పొడిగింపుగానే అవి చెబుతున్నాయి. చాలా విషయాలలో అవి చేసే వాదనలో ఇదే వైరుధ్యం కనిపిస్తుంది. ఆయా కుల, మత అంశాలను కొత్త సందర్భంలోకి తీసుకు రావడంలో తమకు దేశవ్యాప్తంగా ఏర్పడే ప్రతికూలవాతావరణంలో ఒకవైపు ఆత్మరక్షణలోకి జారిపోతూనే; ఇంకోవైపు కిందపడినా పై చేయి మాదే నని చెప్పుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే, మరో ఎన్నికల తరుణంలో మళ్ళీ అదే అజెండాను పైకి తీస్తున్నాయి. అలాగే, అధికారపక్షంగా ఒకవైపు రాజ్యాంగ పరిధిలో పని చేయవలసి రావడం, ఇంకోవైపు కొత్త సందర్భంలోకి దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ రాజ్యాంగ పరిధిని లేదా స్ఫూర్తిని తనే దాటడం అనే జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. ఇప్పుడున్న ఎన్నికల రాజకీయాల చట్రంలో అవి దళిత, ముస్లిం ఓటర్లను పూర్తిగా దూరం చేసుకోలేవు కనుక; ఒకవైపు కుల, మత పరమైన ఆ గుర్తింపులను దృష్టిలో ఉంచుకుంటూ తమ బ్రాండ్ ‘సంతుష్టీకరణ’ విధానాలను అనుసరించక తప్పదు. మరోవైపు, అలాంటి గుర్తింపులకు అతీతంగా ఒక ఏకశిలా జాతీయతను నిర్మించడమనే తమ భావజాల లక్ష్యం వైపు అడుగులు వేయకతప్పదు.

ఈవిధంగా వాటిది అనేక వైరుధ్యాలు నిండిన దాగుడుమూతలాట. మోదీ అధికారంలోకి వచ్చిన గత ఇరవై మాసాలుగా ఈ దాగుడుమూతల ఆట వివిధ రూపాలలో సాగుతూనే ఉంది. ఒక ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం పాత సందర్భానికి కొనసాగింపుగా కనబడడానికి ప్రయత్నిస్తుంది. కానీ పార్టీ, దాని భావజాలవర్గాలు దేశాన్ని కొత్తసందర్భంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రభుత్వం పైకి నిశ్శబ్ద ప్రేక్షకరూపంలోనూ; అది సరిపోనప్పుడు లోపాయికారీగా ఇతరేతర రూపాలలోనూ ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల నేపథ్యం వాస్తవానికి గత ఇరవై మాసాలుగా సాగుతున్న ఈ దాగుడుమూతల ఆటకు కొనసాగింపే.

రోహిత్ అంబేడ్కర్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు. ఆ యూనివర్సిటీలో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) సహా మరికొన్ని విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. భావజాల విభేదాలు ఉన్న విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం, అవి ఒక్కోసారి హింసాత్మకం కావడం దాదాపు అన్నీ యూనివర్శిటీలలో మామూలే. వాటి పరిష్కారాలు, శిక్షలు యూనివర్సిటీ నాలుగు గోడల మధ్యా; ఇంకా అవసరమైతే శాంతి భద్రతల పరిధిలో జరిగిపోతూ ఉంటాయి. అలా చూసినప్పుడు ఇది పాత సందర్భం. కానీ బీజేపీతో భావజాల మైత్రి కలిగిన ఏబీవీపీ దానిని కొత్త సందర్భంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. విద్యార్థిరంగంలో దళిత/దళితేతర కులాల గుర్తింపులకు అతీతంగా హిందూత్వ ప్రాతిపదికపై అన్ని కులాలను కూడగట్టడం; హిందూ యేతర మతాలను కట్టడి చేయడం దాని లక్ష్యం. పాత సందర్భానికి అదనంగా ఇప్పుడు ఏబీవీపీకి ప్రభుత్వం అనే కొత్త అండ ఉంది. దానిని వాడుకోడానికి ప్రయత్నించింది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగానే ఉంది. దాని ఫలితమే ఏబీవీపీకి అనుకూలంగా  కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, మానవవనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీల జోక్యం. యూనివర్సిటీ పాలక వ్యవస్థ తన ప్రత్యేక ప్రతిపత్తిని పక్కన పెట్టి ఆ జోక్యానికి దారి ఇచ్చింది. రోహిత్ ఆత్మహత్యతో ఇవన్నీ బయటపడేటప్పటికి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఎప్పటిలా, ఇది పాత సందర్భానికి కొనసాగింపే తప్ప, కొత్తగా జరిగింది ఏమీలేదని తనను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. అది విఫల యత్నంగానే పరిణమించింది. ఇలా ఆత్మరక్షణలో పడిపోవడం-ఏదో విధంగా సమర్ధించుకోవడం గత ఇరవై మాసాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక స్క్రీన్ ప్లే.  ఎన్నిసార్లైనా దీనిని పునరావృతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప మడమ తిప్పే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే, దాని అంతిమలక్ష్యం తన భావజాలాన్ని జనంలోకి తీసుకువెళ్లి, దేశాన్ని తను కోరుకునే కొత్త సందర్భంలోకి తీసుకువెళ్లడం.  లోక్ సభలో తిరుగులేని మెజారిటీ, మోదీ లాంటి వ్యక్తి నాయకత్వమూ అందుబాటులో ఉన్న ఈ తరుణంలో ఈ పని  చేయలేకపోతే ఇంకెప్పుడూ చేయలేమని అది భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈవిధంగా దానిది విజయమో, వీరస్వర్గమో తేల్చుకోవలసిన పరిస్థితి.

ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని రాజ్యాంగ నియమనిబంధనలు, ఔచిత్యాల వంటి రకరకాల హద్దులను దాటిస్తే తప్ప పనిజరగదు. ప్రభుత్వమూ, పార్టీ, దాని భావసారూప్య వర్గాలూ పూర్తి స్పృహతో, ఏకీభావంతో ఈ హద్దుల ఉల్లంఘనకు సిద్ధమయ్యాయి. ఎంతోకాలంగా సాగుతున్న ఆత్మహత్యలు, దళిత హింసకు భిన్నంగా, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశం చేసింది ఇదే. నిజానికి కులవివక్షకు, దళిత హింసకు కాంగ్రెస్ తో సహా దాదాపు ప్రధానస్రవంతి పార్టీలు ఏవీ అతీతం కావు. వ్యవస్థాపరంగా చెబితే కులదాష్టీకాన్ని అణువణువునా జీర్ణించుకున్న భూస్వామ్యంతో స్వాతంత్ర్యం తర్వాత కూడా అన్ని ప్రధానపక్షాలూ మమేకమై దానిని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే, సూత్రరీత్యానైనా కులమత వివక్షలేని లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రక్రియకు గత ఆరుదశాబ్దాలుగా మనం అలవాటు పడ్డాం. భూస్వామ్య శక్తులు పూర్తి బలంతో తెరముందుకు రాకుండా ఈ ప్రక్రియ, మళ్ళీ సూత్రరీత్యానైనా వీలైనంతవరకు నిరోధిస్తూ వచ్చింది. ఇంతవరకు అధికారంలో ఉన్న సోకాల్డ్ లౌకిక పక్షాలు రాజకీయంగానూ, లోపాయికారీగానూ కులమత ఆధిపత్యశక్తులతో అంటకాగుతూనే, ప్రభుత్వస్థాయిలో తగుమేరకు తటస్థ పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. కోర్టులు, చట్టాలు, విద్యాసంస్థలు, ఇతర బహిరంగ వ్యవస్థలు పోషించవలసింది అటువంటి తటస్థపాత్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇన్నేళ్లలో కుల, మత హింస చెలరేగినప్పుడల్లా ప్రభుత్వాన్ని కాక, తెరవెనుక శక్తులను దోషులుగా నిలబెట్టడం జరుగుతూవచ్చింది. ఆయా ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలు భిన్న, భిన్న; పరస్పర శత్రుత్వపూరిత భావజాలాల అభివ్యక్తికి స్వేచ్ఛ నిస్తూనే వాటిని రాజ్యాంగం, చట్టాల పరిధి దాటకుండానూ; శాంతి భద్రతల పరిధిలోనూ నియంత్రిస్తూ యధాశక్తి తటస్థ భూమిక పోషిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ ఈ తటస్థత అనే పలచని పొరను కూడా తొలగిస్తున్నాయి. రోహిత్ ఉదంతంలో జరిగింది అదే. ఫలితంగా, ముక్కూ, మొహం లేని వ్యవస్థ స్థానంలో;  రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన, స్పష్టమైన రూపురేఖలు కలిగిన ఒక ప్రభుత్వం ఇందులో దోషిగా నిలబడింది.  రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయికి ఎక్కవలసిన తీవ్ర పరిణామం అయినది అందుకే.  అయినాసరే, ఎంత అప్రతిష్ట పడినా, ఎన్నికల ఓటమి రూపంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు ఆత్మరక్షణలో పడవలసివచ్చినా ఈ తటస్థత అనే పొరను ఎన్నిసార్లైనా ఉత్తరించడానికి బీజేపీ, దాని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ కంకణం కట్టుకున్నాయి. ఎలాగైనా సరే తమ భావజాలాన్ని నెగ్గించుకుని, దేశాన్ని ఎప్పటికైనా పూర్తిగా కొత్త సందర్భంలోకి తీసుకువెళ్ళే కృతనిశ్చయంతో ఉన్నాయి. తటస్థ ప్రదేశంలోకి ప్రభుత్వం చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఉదాహరణలు ఈ ఇరవై మాసాలలో ఇంకా చాలా కనిపిస్తాయి. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగం కల్పించిన తటస్థభూమిక ఎప్పుడైతే బలహీనపడిపోతుందో అప్పుడిక ఈ దేశంలో ఎంతో చరిత్ర కలిగిన రకరకాల శత్రు పక్షాలూ, భావజాలాలూ బలాబలాలు తేల్చుకోడానికి పూర్తి శక్తియుక్తులతో, అత్యంత నగ్నంగా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టడం సహజ పరిణామం. వివిధ భావజాలాలను హద్దుల్లో ఉంచుతూ నియంత్రణ పాత్రను పోషించే ‘రిఫరీ’ అదృశ్యమైనప్పుడు అప్పుడిక NO HOLDS BARRED!

ఇప్పుడు అదే జరుగుతోంది. చూస్తున్నది, చూడబోతున్నది కచ్చితంగా వందలు, వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఒక సంకుల సమరం. అక్షరాలా భిన్న భావజాలాల మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. పాత/కొత్త సందర్భాల మధ్య అమీ తుమీ తేల్చుకోడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న, ఇంకా ముమ్మరం కాబోతున్న పెనుగులాట. ఈ క్షణాన ఢిల్లీలో జరుతున్నది దేశగమనాన్ని గత ఆరుదశాబ్దాల అనుభవానికి భిన్నమైన మలుపు తిప్పగల ఒక అతి పెద్ద రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోగం! ఇది ఎలా పరిణమిస్తుందన్నది కాలానికి విడిచిపెట్టవలసిన ప్రశ్న.

*

 

 

 

 

ఆరు బుట్టల్లో, బస్తాలో బంగారం తరలించాడు

 

స్లీమన్ కథ-21

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తవ్వకాలను కొనసాగించాడు. మరికొన్ని లింగాకృతులు, చక్కని పాలరాయి నుంచి చెక్కిన ఓ పక్షి గుడ్డు తప్ప ఇంకేవీ దొరకలేదు. నాలుగు నెలలుగా వర్షాలు లేవు. రోజుల తరబడీ హిస్సాలిక్ దిబ్బను ధూళి మేఘాలు కప్పేశాయి. అలాంటిది, హఠాత్తుగా కుంభవృష్టి. దిబ్బ అంతా బురద బురద అయిపోయింది. తవ్వకాలను నిలిపేశాడు. భార్యతో కలసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. మనిషి అస్వస్థంగా ఉన్నాడు. భార్యా, ముగ్గురు మేస్త్రీలూ, అంగరక్షకుడూ కూడా జ్వరంతో ఉన్నారు.

ఎథెన్స్ లో తిరిగి ఆరోగ్యం పుంజుకున్నాడు. ప్రియామ్ ప్రాసాదం తాలూకు ప్రణాళికను తెప్పించుకుని పరిశీలించిన బర్నూఫ్, అందులో కొన్ని లోపాలున్నాయనీ, ఫొటోగ్రాఫర్ సాయంతో మెరుగైన ప్రణాళికను తయారుచేయమనీ సూచించాడు. దాంతో నెల రోజుల తర్వాత ఫొటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని స్లీమన్ ట్రయాడ్ కు వెళ్ళాడు.

తీరా వెళ్ళాక, హిస్సాలిక్ దగ్గర నియమించిన కాపలాదారు పెద్ద పెద్ద రాళ్ళను చడీ చప్పుడు కాకుండా అమ్మేస్తున్న సంగతి బయటపడింది. సిప్లాక్ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి కొన్ని రాళ్ళు వాడుకున్నారు. ఎహ్నీ షెహర్ అనే ఒక క్రైస్తవ గ్రామంలో గంటగోపురం నిర్మించడానికి మరికొన్ని వాడుకున్నారు. స్లీమన్ ఆగ్రహం పట్టలేకపోయాడు. అప్పటికప్పుడు ఆ కాపలాదారును తొలగించి అతని స్థానంలో ఒక సాయుధ కాపలాదారుని నియమించాడు. ఫొటోగ్రాఫులతో, కొత్త ప్రణాళికలతో ఎథెన్స్ కు తిరిగివెళ్ళాడు.

మరోవైపు ట్రాయ్ తవ్వకాల్లో అద్భుతాలేవీ బయటపడకపోవడం అతన్ని కుంగదీస్తూనే ఉంది. ఇంతవరకూ తవ్వకాలు జరపని ప్రదేశాల మీదికి అతని దృష్టి మళ్ళింది. సొంత ఖర్చు మీద మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాలకు అనుమతించవలసిందిగా గ్రీకు ప్రభుత్వానికి రాశాడు. వాటిలో బయటపడే విలువైన సామగ్రిని తన జీవితాంతం దగ్గర ఉంచుకుంటాననీ, తన తదనంతరం అవి గ్రీకు జాతీయసంపద అవుతాయనీ షరతు పెట్టాడు. తన పేరుతో ఒక పురావస్తు ప్రదర్శనశాలను నిర్మించే ఒప్పందం మీద 2 లక్షల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. కానీ ప్రభుత్వం అతని అభ్యర్థనలను తిరస్కరించింది. దాంతో తను శాశ్వతంగా ఎథెన్స్ ను విడిచిపెట్టి పారిస్ వెళ్లిపోతానని బెదిరించడం ప్రారంభించాడు.

3bf230edf319b9b3d4b1cb5b56972adc

కానీ ట్రాయ్ అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడ అంతవరకూ కనుగొన్న వాటిలో ఎక్కువ భాగాన్ని బయటికి తరలించేశాడన్న ఆరోపణతో టర్కీ ప్రభుత్వం తన కిచ్చిన ఫర్మానాను రద్దు చేసినట్టు అతనికి తెలిసింది. తన తరపున జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉన్నతస్థానాలలో ఉన్న పరిచితులకు ఎప్పటిలా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఊదరగొట్టాడు. ఫలితంగా తవ్వకాల కొనసాగింపునకు అనధికారిక అనుమతి వచ్చింది. వెంటనే హిస్సాలిక్ కు తిరిగి వచ్చాడు. మార్చి 1నుంచీ పని ప్రారంభిస్తానని మిత్రులతో అన్నాడు కానీ, జనవరి 31 నాటికే పనిలోకి దిగిపోయాడు. ఉత్తరం నుంచి మంచుగాలులు వీస్తున్నాయి. గాలివానలు, చర్చి పండుగల బెడదకు అదనంగా ఊహించని మరో శత్రువు అతనికి ఎదురయ్యాడు. స్మిర్నాకు చెందిన ఒక వర్తకుడు లికొరిస్(liquorice) అనే ఒకరకం వేళ్ళను[మన దగ్గర ‘అతిమధురం’ అని పిలిచే ఈ వేళ్ళు దక్షిణ యూరప్ లోనూ, మన దేశంలోనూ, ఆసియాలోని మరికొన్ని ప్రాంతాలలోనూ దొరుకుతాయి] తవ్వితీయడం కోసం రోజుకు 12 నుంచి 23 పియాస్టర్ల కూలికి 150మంది గ్రామస్తులను పనిలోకి తీసుకున్నాడు. అది స్లీమన్ చెల్లించే కూలి కన్నా ఎక్కువ. నిశ్శబ్దంగా పళ్ళు నూరడం తప్ప అతను చేయగలిగిందేమీ లేకపోయింది. 1873, మార్చి 15న ఇలా రాసుకున్నాడు:

రాత్రిళ్ళు అతిశీతలంగా ఉంటున్నాయి. పొద్దుటిపూట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోతోంది. కానీ పగలు మాత్రం ఎండ దహించేస్తోంది. తరచు ఉష్ణోగ్రత 72 సెంటీగ్రేడ్లకు చేరుతోంది. చెట్ల ఆకులు మాడిపోతున్నాయి. ట్రాయ్ మైదానాన్ని వసంత కుసుమాలు కప్పేస్తున్నాయి. గత పదిహేనురోజులుగా చుట్టుపక్కల ఆవల్లోంచి లక్షలాది కప్పల బెకబెకలు చెవులు చిల్లులు పొడుస్తున్నాయి. గత ఎనిమిదిరోజుల్లో గూడకొంగలు తిరిగొచ్చాయి. నేను తవ్వకాలు జరిపిన చోట గోడల రంధ్రాలలో లెక్కలేనన్ని గుడ్లగూబలు గూడు కట్టుకుని, ఈ అడవి బతుకును మరింత నరకం చేస్తున్నాయి. ఏదో మార్మికతతోపాటు భయంగొలిపే వాటి అరుపులు రాత్రిళ్ళు మరీ దుర్భరంగా ఉంటున్నాయి.

స్లీమన్ ఆ దిబ్బమీద రెండడుగుల మందంగల గోడలతో ఒక చిన్న రాతి ఇల్లు, ఒక చెక్క ఇల్లు కట్టించాడు. రాతి ఇంటిని ఓ మేస్త్రీకి ఇచ్చి చెక్క ఇంట్లో తను ఉంటున్నాడు. గోడ పగుళ్ళలోంచి గాలి చొరబడుతోంది. మార్చి చివరిలో ఓ రోజు అర్థరాత్రి మూడు గంటలకు అతనికి హఠాత్తుగా మెలకువచ్చింది. గదంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఒక గోడ అప్పటికే తగలబడుతోంది. ఆ పడకగదిలో ఒక మూల, చెక్క పలకల మీద రాతితో ఏర్పాటు చేసిన నిప్పుగూడు ఉంది. రవ్వ పడి చెక్క అంటుకున్నట్టుంది. ఉధృతంగా వీస్తున్న ఉత్తరపు గాలి దానికి తోడైంది. గట్టిగా కేకలు వేస్తూ సోఫియాను నిద్రలేపి బయటికి పంపించేశాడు. స్నానాలగదిలోంచి నీళ్ళు తెచ్చి తగలబడుతున్న గోడ మీద కుమ్మరించాడు. ఈ కలకలానికి మేలుకున్న మేస్త్రీ వచ్చి తట్టలతో మట్టి ఎత్తిపోస్తూ మంటలు ఆర్పడానికి సాయపడ్డాడు.

ఇదంతా పావు గంటలో జరిగిపోయింది. కానీ, తనకు మెలకువ రావడంలో కేవలం కొన్ని క్షణాలు ఆలస్యమైతే తన పుస్తకాలు, కాగితాలు, తను భద్రపరిచిన పురావస్తువులు ఏమైపోయేవో; మరీ ముఖ్యంగా సోఫియా ఏమైపోయేదో నన్న ఊహ కొన్ని రోజులపాటు అతన్ని వెంటాడి వణికించింది.

మరోసారి విసుగూ, అలసటా అతని మీద దాడి చేస్తున్నాయి. ఉత్తరపు గాలి అదేపనిగా వేధిస్తూనే ఉంది. చర్చి శ్రాద్ధదినాలు దినదిన గండంగా మారి సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాయి. డబ్బు మంచినీళ్లలా ఖర్చైపోతోంది. ఇప్పటికీ రోజుకి 160 మందిని పనిలోకి దింపుతున్నాడు. నల్లని కుండలు, రాగితో చేసిన ఒక బల్లెపు పిడీ, మరికొన్ని బొంగరం ఆకారంలోని బొమ్మలు తప్ప విశేషంగా చెప్పుకోదగినవేవీ ఇప్పటికీ బయటపడడం లేదు. బయటపడినవి కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయాయి.

ఏప్రిల్ లో ఉత్తరపు గాలి ఉపశమించింది. మైదానమంతటా పసుపురంగు పువ్వులు పరచుకున్నాయి. ఇప్పుడు పనివాళ్లు మబ్బు విడిచిన ఆకాశం కింద ఆరుబయటే నిద్రపోగలుగుతున్నారు. స్లీమన్ ను కూడా తెలియని ప్రశాంతి ఆవహించింది. ఏదో అద్భుతాన్ని కనుక్కోబోతున్నాడన్న ఓ విచిత్రమైన స్ఫురణ అతనికి కలగడం ప్రారంభించింది. ఏప్రిల్ 16న, చప్టా చేసిన ఒక వీధీ, మనిషి ఎత్తున ఉన్న తొమ్మిది అతిపెద్ద మట్టి కూజాలూ బయటపడ్డాయి. అలాంటి కూజాలు అంతవరకూ ఎక్కడా వెలుగు చూడలేదు. అనంతర కాలంలో క్రీటు ద్వీపంలోని నోసస్ లో జరిగిన తవ్వకాల్లో మాత్రమే అలాంటివి బయటపడ్డాయి. స్లీమన్ లో ఉత్సాహం ఉరకలేసింది. ఆ తర్వాత, ఒకదాని కొకటి 20 అడుగుల ఎడమున్న రెండు ద్వారాలను కనుగొన్నాడు. వాటికి వెంటనే  ‘స్కెయిన్ గేట్’ అని పేరుపెట్టాడు. వాటి వెనక కనిపించిన ఓ పెద్ద భవనాన్నే ప్రియామ్ ప్రాసాదం అన్నాడు. అక్కడే మరికొన్ని కలశాలు, గుడ్లగూబ తలలూ కనిపించాయి.

స్లీమన్ సంతృప్తి చెందాడు. తన ఇన్నేళ్ల శ్రమా ఫలించబోతోందనీ, తను ఆశించిన వాటిని కనుక్కోబోతున్నాడనే నమ్మకం చిక్కింది. అంతవరకూ తను కనుక్కొన్నవాటిని వెల్లడి చేయబోతున్నట్టు ప్రకటించాడు. వాటిలో 200 చిత్రిత ఫలకాలు, 3500 చెక్కడాలు ఉన్నాయి. హిస్సాలిక్ లాంటి ఒక చిన్న దిబ్బ హోమర్ చిత్రించిన ట్రాయ్ అయ్యే అవకాశం లేదని జనం అనుకుంటారు, నిజమే. కానీ ఆ విశాలమైన ద్వారమూ, ప్రాసాదపు గోడలూ, సహజసిద్ధమైన రాళ్ళు పేర్చి నిర్మించిన దుర్గమూ, అసంఖ్యాకమైన నల్లమట్టి కుండల తాలూకు పెంకులూ, భారీ కూజాల్లాంటి పాత్రలూ,  వేల సంఖ్యలో ఉన్న కళాకృతులూ తను ట్రాయ్ ని కనుగొన్న సంగతిని రుజువు చేస్తున్నాయని స్లీమన్ భావించాడు.

అంతలో అతని ఉత్సాహంపై నీళ్ళు చల్లే వార్త…సోఫియా తండ్రి అవసానదశలో ఉన్నాడు. ఆమె వెంటనే బయలుదేరి ఎథెన్స్ కు వెళ్లింది. కానీ ఆమె వెళ్ళేటప్పటికే తండ్రి కన్ను మూశాడు. ఆ దిబ్బ మీద  ఇంట్లో స్లీమన్ ఒంటరిగా కూర్చుని భార్యకు ఓదార్పు లేఖ రాశాడు. అంత మార్దవం నిండిన లేఖ అతని మొత్తం లేఖలలోనే ఇంకొకటి లేదు:

అద్భుతవ్యక్తి అయిన మీ నాన్న దగ్గరికి మనందరం నేడో రేపో చేరేవాళ్ళమేనన్న సంగతిని గుర్తుచేసుకుని నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి. మన ప్రియమైన కూతురికి తల్లి అవసరం ఎంతో ఉంటుందనీ, తల్లితోనే తన జీవితానందం అల్లుకుని ఉంటుందనీ అర్థం చేసుకుని నువ్వు ఓదార్పు పొందాలి. మన కన్నీళ్లు మీ నాన్నను తిరిగి తీసుకురాలేవనీ; ఎంతో ఉత్తముడూ, సాహసీ  అయిన మీ నాన్న ఈ జన్మ సంబంధమైన విచారాలకూ, తాపత్రయాలకూ దూరంగా; పరిశుద్ధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడనీ; దుఃఖవిచారాలతో మగ్గుతూ ఈ భూమ్మీద మిగిలిపోయిన మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడనీ గ్రహించి నువ్వు ఓదార్పు పొందాలి. అయినా నువ్వు దుఃఖాన్ని జయించలేకపోతే, అందుబాటులో ఉన్న మొదటి ఆవిరిబోటు అందుకుని నా దగ్గరికి వచ్చెయ్యి. నీ దుఃఖ నివారణకు నేను చేయగలిగినవన్నీ చేస్తాను. నువ్వు లేకుండా ఇక్కడ ఎలాంటి తవ్వకాలూ జరగవు. త్వరలోనే రమ్మని ఆనందబాష్పాలతో వేడుకుంటున్నాను.

కొన్ని రోజుల తర్వాత సోఫియా బయలుదేరి వచ్చేసింది. తన అవసరం ఎక్కడో ఆమెకు బాగా తెలుసు. తను లేనిదే అతను ఒంటరి అయిపోతాడు. అతని జీవితవిజయాలన్నిటికీ ఆమె పతాకచిహ్నం.

వేసవి అడుగుపెడుతోంది. పసుపు రంగు పువ్వులు మాడిపోతున్నాయి. త్వరలోనే మైదానమంతా దగ్ధభూమి కాబోతోంది. జూన్ మధ్యనాటికి తవ్వకాలు ఆపేయబోతున్నాననీ; భార్యనూ, కూతురినీ మధ్య యూరప్ లోని ఏదైనా విశ్రాంతి స్థలానికి తీసుకువెళ్లదలచుకున్నాననీ- మే 30న కొడుకు సెర్గీకి స్లీమన్ ఉత్తరం రాశాడు. గత నాలుగు నెలల పనీ తన కెంతో సంతృప్తి నిచ్చిందన్నాడు. తను ట్రాయ్ ప్రాకారాలను, ప్రియామ్ ప్రాసాదం ఉనికినీ కనిపెట్టాడు. 250,000 మీటర్ల మేరకు మట్టి తవ్వాడు. ఒక మ్యూజియం మొత్తానికి సరిపడినన్ని పురావస్తువులను సేకరించాడు…

అదే రోజున ఫ్రాంక్ కల్వర్ట్ కు కూడా ఉత్తరం రాశాడు. హిస్సాలిక్ కు కొన్ని గంటల ప్రయాణదూరంలో, బునర్ బషీకి దగ్గరలో, తింబ్రియా అనే చోట కల్వర్ట్ కు ఒక ఎస్టేట్ ఉంది. అతనికి స్లీమన్ రాసిన ఉత్తరం, కొడుక్కి రాసిన ఉత్తరానికి  పూర్తి భిన్నమైన శైలిలో సాగింది. అందులో ఒకవిధమైన భయమూ, వణకూ తొంగిచూస్తున్నాయి.  నాటకీయంగా ఉండి; తన ప్రగాఢమైన ఆశలతో, కలలతో సన్నిహితంగా పెనవేసుకున్న ఇలాంటి లేఖ అతని జీవితం మొత్తంలో ఇదే:

నామీద గట్టి నిఘా పెట్టారని మీకు తెలపడానికి విచారిస్తున్నాను. కారణం తెలియదు కానీ, ఆ టర్కిష్ కాపలాదారు నామీద అదేపనిగా మండిపడుతున్నాడు. రేపు అతను నా ఇంటిని సోదా చేయబోతున్నాడు. కనుక, సొతంత్రం తీసుకుని ఆరు బుట్టలూ, ఒక బస్తా మీ దగ్గర భద్రపరచడానికి పంపుతున్నాను. దయతో వాటిని మీ ఇంట్లో ఉంచి తాళం వేయవలసిందిగానూ, వాటిమీద టర్కుల చేయి ఏవిధంగానూ పడకుండా చూడవలసిందిగానూ వేడుకుంటున్నాను.

ఆ ఆరు బుట్టలలోనూ, బస్తాలోనూ ఉన్నవి ట్రాయ్ తవ్వకాలలో బయటపడిన స్వర్ణ నిక్షేపాలు!

Troy-jewellery-Istanbul-Archaeoloy-Museum-8051

ఈ నిక్షేపాలు కచ్చితంగా ఏ తేదీన బయటపడ్డాయో తన ప్రచురిత రచనల్లో స్లీమన్ ఎక్కడా వెల్లడించలేదు. స్థలమూ, సమయమూ మాత్రం తెలుస్తున్నాయి. ఉదయం 7 గంటలకు, ప్రియామ్ ప్రాసాదానికి దగ్గరలోని ఒక చుట్టుగోడ(circular wall)కు అడుగున, బాగా లోతైన చోట అవి దొరికాయి. కల్వర్ట్ కు ఉత్తరం రాసిన మే 30నో, లేదా అప్పటికి కొన్ని రోజుల ముందో స్లీమన్ కు అవి కనిపించి ఉంటాయి. తను నిక్షేపాలను కనుగొన్నాననీ, అయితే సమయం లేక వాటిని ఇంకా పరిశీలించడం, లెక్కించడం చేయలేదనీ మే 31న అతను మొదటిసారి తన నివేదికలో రాశాడు. అంటే, ఈ మాటలు రాయడానికి ముందే ఆ నిక్షేపాలను కల్వర్ట్ ఇంటికి తరలించి ఉంటాడు.

వేర్వేరు సమయాలలో రాసిన మూడు వేర్వేరు కథనాలను బట్టి, మే నెలలో విపరీతంగా ఎండ కాసే ఒకరోజున అతను ఈ నిక్షేపాలను కనిపెట్టాడని అర్థమవుతోంది. ఆరోజున మైదాన మంతటినీ తళతళలాడే పసుపురంగు ధూళి పొగలా కమ్మేసింది. అంతకు ఎనిమిదిరోజుల ముందు అతనికి ఒక భారీ వెండి కలశం కనిపించింది. దానిలోపల ఓ చిన్న వెండి చెంబు ఉంది. దానికి దగ్గరలోనే ఒక రాగి శిరస్త్రాణం ఉంది. అది ఛిద్రమైనా, లింగాకారంలోని దాని కొమ్ములు మాత్రం భద్రంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కచ్చితంగా మరికొన్ని నిక్షేపాలు కనబడతాయన్న అంచనాతో తవ్వకాలు కొనసాగించాడు.

పనివాళ్లను గుంపులు గుంపులుగా విడదీసి వేర్వేరు చోట్ల తవ్వకాలు జరపడానికి పంపించేశాడు. వాళ్ళు కందకాల్లోనూ, నడవల్లోనూ పనిచేసుకుంటూ ఉంటే, నిక్షేపాలను గుట్టు చప్పుడు కాకుండా దిబ్బ మీది తన ఇంటికి తరలించవచ్చని అతని ఆలోచన. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ ఆ సమీపంలో లేకుండా జాగ్రత్తపడాలనుకున్నాడు.

స్లీమన్, అతని భార్య, కొద్దిమంది పనివాళ్లు స్కేయిన్ గేటుకి దగ్గరలోని చుట్టుగోడ పొడవునా తవ్వకాలు జరుపుకుంటూ వెళ్లారు. 28 అడుగుల లోతున, విశేషమైన పనితనం కలిగిన ఒక రాగి పేటిక లాంటిది అతనికి కనిపించింది. పైన పేరుకుపోయిన దుమ్మును, ధూళిని పక్కకు తప్పిస్తూ చూసి, అది మూడడుగుల పొడవూ, 18 అంగుళాల ఎత్తూ ఉంటుందని అంచనా వేశాడు. ఆ పేటిక పైన శిరస్త్రాణం ఆకారంలోని రెండు వస్తువులు, ఒక భారీ దీపపు కుందె లాంటిది ఉన్నాయి. ఆ పేటిక బద్దలై ఉంది. అందులోంచి కొన్ని వెండి పాత్రలు తొంగి చూస్తున్నాయి. దానికి చుట్టుపక్కల నాలుగైదు అడుగుల మందాన ఎరుపు, గోధుమ రంగుల్లో ఉన్న దగ్ధశిథిలాలు ఉన్నాయి. అవి రాయంత కఠినంగా ఉన్నాయి. వాటికిపైన అయిదడుగుల వెడల్పు, ఇరవై అడుగుల ఎత్తు ఉన్న భారీ రక్షణకుడ్యాలు ఉన్నాయి.

ఎట్టకేలకు నిక్షేపాలను కనిపెట్టాననుకున్నాడు. టర్కుల చూపు పడకుండా వాటిని రక్షించడ మెలా అన్నది తక్షణ సమస్య. పనివాళ్లలో ఎవరూ పసిగట్టలేదు. సోఫియా అతని పక్కనే ఉంది. ఆమెవైపు తిరిగి, “నువ్వు వెంటనే వెళ్ళి ‘పైడోస్’ అని కేకపెట్టు” అని చెప్పాడు. పైడోస్ అనే ఆ గ్రీకు మాటకు సెలవుదినం అని అర్థం.

సోఫియా అప్పటికింకా నిక్షేపాలను గమనించలేదు. దాంతో ఆశ్చర్యపోయింది. “అదేమిటి, ఇంత హఠాత్తుగా?” అని అడిగింది. “అవును. ఇవాళ నా పుట్టినరోజనీ, ఇప్పుడే ఆ సంగతి గుర్తొచ్చిందనీ చెప్పు. పని చేయకపోయినా ఈరోజుకు పూర్తి వేతనం ఇస్తామని చెప్పు. అంతా ఊళ్ళకు వెళ్లిపోతారు. ఆ ఓవర్సీర్ ఇక్కడికి రాకుండా చూడు. త్వరగా వెళ్ళు. పైడోస్ అని కేకపెట్టు” అని స్లీమన్ ఆమెను తొందరపెట్టాడు.

 

సోఫియా చెక్క నిచ్చెన ఎక్కి, పైకి వెళ్ళి అతను చెప్పినట్టే చేసింది. సెలవుదినాలను ప్రకటించడం ప్రతిసారీ సోఫియా వంతు. వెంటనే పనివాళ్లు తవ్వకాలు ఆపేసి వెళ్లిపోవడం ప్రారంభించారు. అనుకోని విధంగా వేతనంతో సెలవు దొరికినందుకు సంతోషించినా, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా హఠాత్తుగా సెలవు ప్రకటించలేదు కనుక కొంత అయోమయానికి గురయ్యారు. ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ మరింత విస్తుపోయాడు. తనకు ముందుగా చెప్పకుండా ఇంత ఆకస్మికంగా ఎప్పుడూ సెలవు ప్రకటించలేదు.

(సశేషం)

 

 

 

 

 

 

 

నిధుల వేటలో…ఆశనిరాశల ఊగిసలాటలో…

 

స్లీమన్ కథ-20

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

నిజానికి ఈ విడత తవ్వకాలలో బయటపడినవన్నీ అతనికి చిక్కుముడులుగానే కనిపిస్తున్నాయి. గుడ్లగూబ ఎథెనా పవిత్రచిహ్నమనీ, ఎథేనియన్ నాణేలపై అది ఉంటుందనీ అతనికి తెలుసు. కానీ, ఇక్కడ కనిపించిన గుడ్లగూబ చిహ్నాలు  మరీ చరిత్రపూర్వకాలానికి చెందినవిలా ఉన్నాయి. తను రాతి యుగపు అవశేషాలను వెలికితీశాడా అనుకున్నాడు. నిరుత్సాహం చెందాడు. అభిప్రాయం కోరుతూ ఫ్రాంక్ కల్వర్ట్ సోదరుడు జేమ్స్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. అతను జవాబు రాస్తూ, అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదనీ, క్రీ.పూ. 6,7 శతాబ్దుల వరకూ గ్రీకులు చిత్రిత మృణ్మయ పాత్ర(painted pottery)లను తయారుచేసుకోలేదనీ, మీకు కనిపించిన మూర్తుల్లాంటివి ఇంతకుముందు తవ్వకాల్లో కూడా బయటపడ్డాయనీ అన్నాడు. మరీ ఆటవికకాలానికి చెందిన ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నాననుకుని నిరుత్సాహపడనవసరంలేదనీ, ముందుకు సాగమనీ ధైర్యం చెప్పాడు.

స్లీమన్ తవ్వకాలు కొనసాగించాడు. లింగాకృతులు, బొంగరం రూపంలోని మట్టి బొమ్మలు ఇంకా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఈ బొంగరం ఆకారంలోని బొమ్మలు విచిత్రంగా ట్రాయ్ మైదాన ప్రాంతంలోని శ్మశానం దిబ్బల్ని పోలి ఉన్నాయి. లావా కత్తులు(లావా వేగంగా ప్రవహిస్తూ, మంచి పదును కలిగిన నల్లని గాజు రూపంలో గడ్డకడుతుంది. దానిని కత్తిగా ఉపయోగించేవారు)కూడా కనిపించాయి. అవి ఎంత పదునుగా ఉన్నాయంటే, బహుశా వాటిని రేజర్లుగా వాడేవారేమోనని స్లీమన్ అనుకున్నాడు. ఆపైన కాల్చిన మట్టితో(terracotta) చేసిన చిన్న చిన్న పడవ బొమ్మలు కనిపించాయి. అవి భారతదేశంలో కనిపించే పడవల్లా ఉన్నాయి. ఈ వస్తువులన్నీ భారత్ నుంచి వ్యాపించి ఉండచ్చని అనుకున్నాడు. ఇక్కడ కనిపించిన లింగాకృతులను బట్టి ఈ ప్రదేశానికి వేదకాలపు భారతదేశంతో ఏదో సుదూరసంబంధం ఉండి ఉంటుందని భావించాడు. అయితే, ఈజిప్టుకు చెందినదా అనిపించే వెలిసిపోయిన శాసనలిపీ కనిపించింది. అక్కడక్కడ మట్టి పలకలపై చెక్కిన స్వస్తిక చిహ్నాలు బయటపడ్డాయి. బొంగరం ఆకారంలోని మట్టి బొమ్మల్లానే ఇవి కూడా అతనికి విస్తుగొలిపాయి.

నవంబర్ 16న, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన గోడల్లో ఒకదానినీ, ఒక పెద్ద ద్వారబంధాన్నీ తవ్వితీయడానికి పురమాయించాడు.  ఆరోజు మూడు గంటల సేపు అరవై అయిదుగురు పనివాళ్లు చెమటోడ్చినా అవి లొంగలేదు. మరునాడు కూడా ఆ పని కొనసాగింది. నవంబర్ 18 సెలవు దినం. ఆరోజు పని చేయబోమని సిబ్బంది చెప్పేశారు. దాంతో స్లీమన్ తవ్వకాల నివేదిక రాసుకుంటూ గడిపాడు. ఈ నివేదికల ప్రతులను ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులకు పంపడం అతనికి పరిపాటి.  లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు, లావా కత్తులు, స్వస్తికచిహ్నాలు, శాసనపు రాతలూ అతనికి ఎంత కొరకరాని కొయ్య లయ్యాయంటే; తనే సర్వజ్ఞుడనుకునే ఆ మనిషి కాస్తా, వాటి గురించి తెలియచెప్పి పుణ్యం కట్టుకోండంటూ తనదైన శైలిలో పండితులకు విజ్ఞప్తి చేశాడు. తను ఈ శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడుపుతాననీ, అక్కడి తన చిరుమానాకు రాయవలసిందనీ కోరాడు.

ఉత్తరం నుంచి వీచే తీవ్రమైన చలి గాలులు ట్రాయ్ మైదానాన్ని ఊపేస్తున్నాయి. అయినాసరే, పెద్ద చలికోటు, నెత్తిన హెల్మెట్ తో టంచన్ గా పనిలోకి దిగిపోయి సిబ్బందిని పరుగులెత్తించే స్లీమన్, సాధ్యమైన చివరి క్షణం వరకూ తవ్వకాలను జరిపించాల్సిందే ననుకున్నాడు. కానీ, నవంబర్ 24నుంచీ రెండు రోజులపాటు పెద్ద తుపాను విరుచుకుపడడంతో తప్పనిసరై తవ్వకాలను ఆపేసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. ఆ నిర్బంధ విరామంలో కొంత కాలాన్ని స్వస్తికాలపై తను రాసుకున్న సమాచారానికి వ్యాసరూపమిస్తూ గడిపాడు. నాజీ స్వస్తికాలలా కాకుండా అసలైన స్వస్తికాలు కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. ప్రపంచంలో అవి కనిపించని చోటు అంటూ లేదు. పురాతన చైనా చెక్కడాలపై, మిలాన్(ఇటలీ)లోని సెయింట్ యాంబ్రోస్ వేదికపై, నార్ఫిక్(ఇంగ్లండ్)లో కనిపించిన కెల్టిక్ అంత్యక్రియల కలశాలపై, రామాయణంలో వర్ణించిన ఓడల ముందు భాగంపై స్వస్తికచిహ్నాలు ఉన్నాయి. ఒక పుస్తకం రాయడానికా అన్నట్టుగా స్వస్తికాలపై అతను విస్తారమైన సమాచారాన్ని సేకరించిపెట్టుకున్నాడు.

విరామ కాలంలో ఎక్కువ సమయాన్ని తన పరిశోధన వ్యాసాలకు మెరుగులు దిద్దుకోవడం లోనే గడిపాడు. అవి అయిదు విడతలుగా అస్పెర్గర్స్ ఆల్గమైనా సైటూంగ్ లో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ‘ట్రోజనీష్ ఆల్టట్యూమర్’(Trojan Antiquities) పేరుతో పుస్తకరూపం ధరించాయి. స్లీమన్ ప్రారంభ వ్యాసాలపై ప్రముఖ గ్రీకు అధ్యయనవేత్త ఎర్నెస్ట్ కర్టియస్ స్పందిస్తూ, బునర్ బషీయే ట్రాయ్ తప్ప స్లీమన్ భావించినట్టు హిస్సాలిక్ కాదని నొక్కి చెప్పాడు. దాంతో స్లీమన్ అతనిపై మండిపడ్డాడు. ట్రాయ్ రాజప్రాసాదాలు హిస్సాలిక్ లో కాక, ఇంకెక్కడో ఉంటాయని భావించేవాడు వట్టి మూర్ఖుడనీ, కాకపోతే లోయ మీదుగా ట్రాయ్ నగరం బునర్ బషీ వరకూ విస్తరించి ఉండచ్చనీ అన్నాడు.

లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు గడ్డు ప్రశ్నలుగా మారినా, తను పురాతన ట్రాయ్ నగరాన్ని కనుగొన్నానని అతను ఇప్పటికీ దృఢంగా నమ్ముతున్నాడు. ట్రాయ్ నగరం కేవలం ఊహల్లో తప్ప ఉనికిలో లేదని ఎర్నెస్ట్ రెనాన్, మాక్స్ ముల్లర్, లాంగ్ పెరియా లాంటి మహాపండితులు సైతం కొట్టిపారేసినా, స్లీమన్ మాత్రం అది నిజంగా ఉందని నిర్ధారణకు వచ్చాడు. 1872 మార్చిలో తన నాలుగో విడత తవ్వకాలకు ఎథెన్స్ నుంచి బయలుదేరి వెడుతూ, “హోమర్ పై నాది చెక్కు చెదరని విశ్వాసం. ప్రియామ్ ప్రాసాదాన్నీ, పురాతన ట్రాయ్ దుర్గాన్నీ కనుక నేను వెలుగులోకి తీసుకురాగలిగితే ప్రపంచవ్యాప్తంగా అదో పెద్ద సంచలనం అవుతుంది. ఆ కాలపు చారిత్రక, పవిత్ర అవశేషాలను దర్శించడానికి వందలు, వేల సంఖ్యలో హోమర్ అభిమానులు తరలివస్తారు” అని రాసుకున్నాడు.

bhaskar3

స్వస్తిక చిహ్నం కలిగిన ఒక దేవత

ఎంతో ఆత్మవిశ్వాసంతో నాలుగో విడత తవ్వకాలకు సిద్ధమయ్యాడు. లండన్ లోని అతని మాతృసంస్థ బ్రదర్స్ ష్రోడర్స్ కంపెనీ అరవై తోపుడుబళ్ళను, నాణ్యమైన ఇంగ్లీష్ పారలను, తేలికరకపు గొడ్డళ్లను కానుకగా పంపింది. మార్చి చివరిలో భార్యతో సహా దర్దనెల్లెస్ చేరుకుని ఏప్రిల్ 5న తవ్వకాలను పునః ప్రారంభించాడు.

పనివాళ్లతో సమస్యలు మామూలే. దానికితోడు వరసపెట్టి గాలివానలు, గ్రీకు పండుగ దినాలు. తొలి పదిహేనురోజుల్లో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పని జరిగింది. కొన్ని రోజులు వందమందిని, మరి కొన్ని రోజులు 126 మందిని పనిలోకి తీసుకున్నాడు. సగటున రోజుకు 20 మంది పనివాళ్ళ చొప్పున 300 ఫ్రాంకులు చెల్లించానని లెక్క వేసుకున్నాడు. మూడు వారాల తర్వాత ఒక రోజున పనివాళ్ళు పొగ తాగుతుండడం చూసి స్లీమన్ కేకలేశాడు. దాంతో వాళ్ళలో కొంతమంది ఎదురు తిరిగి పని మానుకుంటామని బెదిరించారు. పని చేసుకుంటున్న మిగిలిన వాళ్ళ మీద రాళ్ళు విసిరారు.

స్లీమన్ వెంటనే చర్యకు దిగాడు. దాదాపు అందరినీ పనిలోంచి తీసేశాడు. ఆరోజు రాత్రంతా నిద్రపోకుండా కొత్త పనివాళ్ళను వెతికాడు. మరునాడు విజయవంతంగా 120 మంది కొత్తవాళ్లను రంగంలోకి దింపాడు. పని చురుగ్గా సాగడం లేదని అదనంగా ఇంకో గంట పని చేయించాలనుకున్నాడు. ఉదయం ఓ గంట ముందుకు జరిపి, అయిదు నుంచే పని చేయించడం ప్రారంభించాడు. అయినాసరే, మధ్యలో గ్రీకు ఈస్టర్ పండుగ రావడంతో ఆరు రోజులపాటు తవ్వకాలు ఆగిపోయాయి. ఎలాగైనా తవ్వకాలు కొనసాగేలా చూడడానికి పనివాళ్ళకు అదనపు కూలీని ఎరేశాడు, బతిమాలాడు, బెదిరించాడు, సోమరిపోతులంటూ తిట్టిపోశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇంకోవైపు, తవ్వకాలలో చెప్పుకోదగినవీ బయటపడడం లేదు. ఎలకను పట్టడానికి కొండను తవ్వుతున్నానా అనుకుంటూ తీవ్రనైరాశ్యంలోకి జారిపోయిన క్షణాలూ ఉంటున్నాయి.

మే నెలలో మరికొన్ని శ్రాద్ధదినాలు వచ్చాయి. ఎక్కువ వేతనం ఇస్తానని ఆశపెట్టి తవ్వకాలు కొనసాగేలా చూడడానికి యధావిధిగా ప్రయత్నించాడు. చర్చి పెద్దలు మా తోలు తీస్తారంటూ పనివాళ్ళు తిరస్కరించారు. సెలవు దినాల్లో తరచు పనివాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాడు. వాళ్ళల్లో, లేదా కుటుంబసభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే మందులు సూచించేవాడు. అప్పట్లో సాధారణంగా గ్రీకు పూజారులే వైద్యం కూడా చేసేవారు. రోగి ఒంటి మీద గాటు పెట్టి, లోపల మెత్తని దూది పెట్టి మండించిన ఓ చిన్న కప్పును దాని మీద బోర్లించి అందులోకి రక్తం తీసుకునేవారు. ఆ నాటువైద్యం చూసి స్లీమన్ భయభ్రాంతుడైపోయాడు. అలా పసిపిల్లలనుంచి కూడా రక్తం తీయడం మరింత బెంబేలెత్తించింది. అందువల్ల పిల్లల్లో మాటి మాటికీ రక్తస్రావం అవుతుండడం గమనించి, వాళ్ళ పెదవుల చుట్టూ ఉండే లోతైన ముడతలే అందుకు కారణమని తీర్మానించాడు. రోగి ఒక్క రక్తపు చుక్క కూడా చిందించనవసరం లేకుండా తను నయం చేస్తూవచ్చాననీ, దాదాపు అన్ని రోగాలకూ విరుగుడుగా ఉప్పునీటినీ, సముద్రస్నానాన్నీ సూచించి అద్భుతాఫలితాలు సాధించానని అతను చెప్పుకున్నాడు.

ఓ రోజున ఒంటినిండా పుళ్ళు పడిన ఓ అమ్మాయిని అతని దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె ఎడమ కన్ను పూర్తిగా పుండు పడిపోయింది. విపరీతంగా దగ్గుతూ ఒక్క అడుగు కూడా వెయ్యలేని స్థితిలో ఉంది. ఒక డోసు ఆముదం తాగించమనీ, సముద్ర స్నానాలతోపాటు ఛాతీ విశాలం కావడానికి కొన్ని అభ్యాసాలు చేయించమనీ చెప్పాడు. రెండు వారాల తర్వాత ఆ అమ్మాయి తన ఊరి నుంచి మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్న హిస్సాలిక్ కు అవలీలగా నడచివచ్చి స్లీమన్ పాదాల మీద పడి, అతని బూట్లను ముద్దుపెట్టుకుంది. మొదటి సముద్రస్నానానికే తనలో తిరిగి ఆకలి పుట్టిందని చెప్పింది. ఎడమ కన్ను బాగుపడుతుందన్న ఆశ లేకపోయినా ఒంటి మీద పుళ్ళు చాలావరకూ మానిపోయాయి. ఈ అమ్మాయి ఉదంతాన్ని ప్రతిసారీ అతను గర్వంగా చెప్పుకునేవాడు.

వేసవి వచ్చింది. ఆకాశం ఉష్ణం కక్కుతోంది. ఆవల్లోని కప్పల బెకబెకలతో రాత్రిళ్ళు దద్దరిల్లుతున్నాయి. సన్నగా, గోధుమ రంగులో ఉండే చిన్న చిన్న రక్తపింజరలు తిరిగే కాలమది. అవి చాలా ప్రమాదకరమైనవి. తవ్వకాలు జరిగేచోట శిథిల్లాల్లోంచి కూడా వస్తున్నాయి. గ్రామస్తులు పాము విషానికి ముందస్తు విరుగుడుగా ఒక రకం మూలికతో కషాయం తాగుతారని తెలిసి స్లీమన్ కూడా దానిని చేయించుకుని తాగాడు.

ఆ దిబ్బ మీద లోతైన కందకాలు తవ్విస్తున్నప్పుడు పెద్ద పెద్ద గోడలు కుప్పకూలి పనివాళ్లు ఆ శిథిలాల కింద కప్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నడూ, ఏ ఒక్కరూ పెద్దగా గాయపడకపోవడం చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యేవాడు. అదో అద్భుతంలా అనిపించేది. ఒక కోతి చెట్టెక్కినంత అవలీలగా ఆ దిబ్బ ఎక్కేవాడు. రోజంతా పనివాళ్లతో కలసి ఒళ్ళు అరగదీసుకునేవాడు. రాత్రిళ్ళు నిద్ర కాచుకుంటూ నోట్సు రాసుకునేవాడు.

అయితే, పురావస్తు తవ్వకాలకు సంబంధించి అతనికి శాస్త్రీయపరిజ్ఞానం లేదు. నిజానికి అప్పటి కింకా ఆ శాస్త్రం శైశవదశలోనే ఉంది. ఎథెన్స్ లోని ఫ్రెంచ్ స్కూల్ డైరక్టర్ గా ఉన్న ఎమీల్ బర్నూఫ్ చాలా విషయాల్లో అతని అజాగ్రత్తను ఎత్తి చూపుతూ గట్టిగా మందలించాడు. లింగాకృతులు, బొంగరం ఆకృతులు, కుండ పెనుకులు వగైరాలను కేవలం తవ్వి తీస్తే సరిపోదనీ; అవి ఎలా ఉన్నాయో, ఏ పరిస్థితిలో ఉన్నాయో, ఏ ప్రదేశంలో బయటపడ్డాయో-తేదీ, సమయంతో సహా అన్ని వివరాలూ పూసగుచ్చినట్టు డే బుక్కులో నమోదు చేయాలనీ హెచ్చరించాడు. అలా చేయనప్పుడు మీరు ఎలాంటి అద్భుతాలను వెలికితీసినా వాటి గురించి ఎప్పటికీ ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేరనీ పాఠం చెప్పాడు. అప్పటినుంచీ స్లీమన్ వివరాల నమోదుపై మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, ప్రతి వస్తువుకూ కాగితంపట్టీ అతికిస్తూ వచ్చాడు. పురావస్తు తవ్వకాలలో ఒక పద్ధతి ప్రకారం కచ్చితమైన సమాచారాన్ని పొందుపరచడం ఎంత ముఖ్యమో క్రమంగా అతనికి అనుభవపూర్వకంగా అర్థమైంది.

అయినాసరే, ఇప్పటికీ తవ్వకాల్లో గొప్ప మెరుపులేవీ బయటపడడం లేదు. పెద్ద పెద్ద ప్రాకారాలు, అక్కడక్కడ పొడవైన అంకిత పాఠాలు లిఖించిన పాలరాయి పలకలు వెలుగు చూశాయి. అయితే అవి అనంతరకాలాలకు చెందినవి. ఆపైన కొన్ని భారీ కూజాల లాంటివీ, నల్లని మృణ్మయపాత్రలూ దొరికాయి. రాజు ప్రియామ్, రాకుమారుడు హెక్టర్, అఖిలెస్ లకు చెందినవేవీ కనిపించలేదు.

bhaskar2

ట్రాయ్ తవ్వకాల్లో దొరికిన స్వస్తిక చిహ్నం

అంతలో హఠాత్తుగా జూన్ 18, 1872న  రాతిమీద మలచిన ఒక చిత్రం బయటపడింది. అపోలో అనే దేవుడు నాలుగు సూర్యుని గుర్రాలపై స్వారీ చేస్తున్న చిత్రం అది. చిన్నదైనా అందులో చక్కని పనితనం ఉట్టిపడుతోంది. ఆ గుర్రాలను పైపైన చెక్కినప్పటికీ వాటిలో జవాసత్వాలే కాక, గొప్ప శిల్ప నైపుణ్యం తొంగి చూస్తోంది. అపోలో, బంగారు వన్నెలీనే తన శిరోజాలపై పది దీర్ఘ కిరణాలు, పది హ్రస్వ కిరణాలతో మలచిన కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఆ చిత్రం ట్రాయ్ కాలానికి తర్వాతిది, బహుశా టోలెమీల కాలానికి చెందినది. అయినాసరే, స్లీమన్ దానిని చూసి ముగ్ధుడయ్యాడు.  ఫ్రాంక్ కల్వర్ట్ కు చెందిన భాగంలో కనుగొన్నాడు కనుక అతని సాయంతో దానిని తక్షణమే బయటికి తరలించాడు. ఆ చిత్రం చాలా ఏళ్లపాటు ఎథెన్స్ లోని అతని ఇంటి తోటను అలంకరించింది.

ఒక పక్క వేసవి ముదురుతున్నా, హోమర్ చిత్రించిన ట్రాయ్ ఆనవాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఉండి ఉండి నైరాశ్యం అతన్ని కుంగదీస్తోంది. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఆ దిబ్బ ఉత్తరం వాలున ఓ పెద్ద చప్పరా(terrace)న్ని, ఓ రాతిగోపురాన్ని వెలికితీయించాడు. అయినాసరే, రోజు రోజుకీ అతనిలో సందేహాలు పెరిగిపోతున్నాయి. కాన్ స్టాంట్ నోపిల్ లోని బ్రిటిష్ కాన్సూల్ మరో 20 తోపుడు బళ్ళను,10 లాగుడు బళ్ళను, 6 గుర్రపు బళ్ళను; పెద్ద సంఖ్యలో రకరకాల తవ్వుడు సామగ్రిని పంపించడంతో పనైతే సునాయాసంగా జరిగిపోతోంది కానీ, స్లీమన్ లో మాత్రం ఆశ అడుగంటిపోతోంది.

ఆ వేసవిలో మొదటిసారి అతనిలో అలసటా, అనారోగ్యం తొంగిచూశాయి. వెనకటి ఉత్సాహం మందగించింది. టర్కీ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానాను మంచి వనరులున్న ఏ పురావస్తు సంస్థకో, విదేశీ ప్రభుత్వానికో అప్పగించి చేతులు దులుపుకుందామా అనుకున్న క్షణాలున్నాయి. తన డబ్బంతా వృథా అవుతోందన్న చింత పట్టుకుంది. ఆపైన రోజుల తరబడి గాలిదుమారం రేగుతోంది. పనివాళ్ళకు ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి. జులై రాగానే దుర్వాసనతో కూడిన చీడ వ్యాపించడం ప్రారంభించింది. కుళ్ళిపోయిన లక్షలాది కప్పల కళేబరాలనుంచి అది వ్యాపిస్తోందని స్లీమన్ అనుకున్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద అతను కట్టించిన ఇంటి దూలాలమీంచి పాములు కింద పడుతున్నాయి. వాటికితోడు తేళ్ళ భయం,

ఒక్కోసారి ఒంటరితనం నుంచి బయటపడడానికి పొరుగునే ఉన్న ఓ గ్రామానికి వెళ్ళేవాడు. అక్కడ ఒక గ్రీకు దుకాణదారు పరిచయమయ్యాడు. అతని పేరు కొస్తాదినోస్ కొలబాస్. పుట్టుకతోనే వికలాంగుడు. ఇటాలియన్, ఫ్రెంచి భాషలు తెలుసు. ఇలియడ్ ను పేజీలకు పేజీలు అప్పజెప్పేవాడు. అతనితో పండితగోష్ఠిని స్లీమన్ ఆనందించేవాడు. విసిరేసినట్టు ఉన్న ఆ మారుమూల ప్రాంతంలో అతనికి ఒకింత ఉల్లాసం కలిగించింది అదొక్కటే.

ఆగస్టు 4…అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక ఆ వేసవిలో తవ్వకాలు ఆపేద్దామనుకుంటున్నాడు. అంతలో అతను ఎదురుచూస్తున్న నిధి మొదటసారి కంటబడింది. ఆనందపు అంబర మెక్కించేంత గొప్ప నిధిగా అతనికి తొలిచూపులో కనిపించలేదు. మూడు బంగారు చెవిపోగులు, ఒక బంగారు బొత్తం…! దగ్గరలోనే ఒక అస్థిపంజరం. అది ఒక యవతిదనీ; ఎముకల రంగును బట్టి, ట్రాయ్ తగలబడినప్పుడు మంటల్లో చిక్కుకుని మరణించి ఉంటుందనీ స్లీమన్ అంచనాకు వచ్చాడు.

(సశేషం)

 

 

ట్రాయ్ తవ్వకాలలో ‘శివలింగా’లు, యోని చిహ్నాలు

 

స్లీమన్ కథ-19

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అన్ని వైపులనుంచీ దాడికి సిద్ధమైన స్లీమన్, మొదటగా టర్కీలో అమెరికా రాయబారిగా ఉన్న వేన్ మేక్విగ్ కు ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. దానికి 4వేల పియాస్టర్లను జతపరిచాడు. తను హిస్సాలిక్ వెళ్లడానికీ, అక్కడి దిబ్బను కొనుగోలు చేయడానికీ విద్యామంత్రి సఫ్వెట్ పాషా ఒకవైపున అనుమతిస్తూనే, ఇంకోవైపు 3వేల పియాస్టర్లకు తనే దానిని కొనేసి మోసగించాడనీ; ఆ దిబ్బ తనకే చెందాలనీ, కనుక  మీ జోక్యాన్ని కోరుతూ దాని మూల్యం 3వేల పియాస్టర్లతో పాటు, మీ ఖర్చుల నిమిత్తం మరో వెయ్యి పియాస్టర్లు పంపుతున్నాననీ అందులో రాశాడు. ఇది వ్యాపార లావాదేవీ కాదనీ, చరిత్రకు సంబంధించిన ఒక అతి పెద్ద చిక్కుముడిని విప్పడానికి జరిపే ప్రయత్నమనీ, ఇందులో మనం వేసే ప్రతి అడుగూ మొత్తం నాగరిక ప్రపంచపు ప్రశంసలను అందుకుంటుందనీ అన్నాడు. ఆపైన కాన్ స్టాంట్ నోపిల్ లోని అధికారులకు మరెన్నో లేఖలు గుప్పించాడు. వాటిలో బెదిరింపులు, వేడికోళ్ళు, శాపనార్ధాలతో సహా అన్ని రకాల బాణీలనూ రంగరించాడు.

అయితే, ఈ లోపున అత్యవసరంగా పట్టించుకోవలసిన ఇతర పరిణామాలు తోసుకొచ్చాయి. ఆ చలికాలంలో పారిస్ నగరం ప్రష్యన్ సేనల భారీ ఫిరంగి పేలుళ్లతో దద్దరిల్లింది. తన ఆస్తుల భద్రతను తలచుకుని స్లీమన్ భయపడిపోయాడు. 6 ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లో ఉన్న తన అపార్ట్ మెంట్ పై అతనికి విపరీతమైన మక్కువ. అతని పుస్తకాలూ; తూర్పు దేశాలనుంచీ, ఇథకా, తేరా లనుంచీ అతను సేకరించిన చిన్నపాటి పురావస్తు సంపదా అందులోనే ఉన్నాయి. ఒడీసీయెస్ చితాభస్మం ఉన్న కలశం కూడా వాటిలో ఉంది.

దాంతో హుటాహుటిన పారిస్ కు బయలుదేరాడు. ఎథెన్స్ లోని ప్రష్యన్ రాయబారినుంచి పరిచయలేఖ తీసుకుని మ్యూనిక్ వెళ్ళాడు. అక్కడ మరిన్ని పరిచయలేఖలు తీసుకుని స్ట్రాస్ బర్గ్ వెళ్ళి గవర్నర్ జనరల్ కౌంట్ బిస్మార్క్ బొలెన్ ను కలసుకున్నాడు. అక్కడినుంచి వెర్సై వెళ్ళి బిస్మార్క్ చేతులమీదుగా పారిస్ వెళ్ళేందుకు అనుమతిపత్రం తీసుకోడానికి ప్రయత్నించాడు. కానీ, శాంతి నెలకొనేదాకా పారిస్ లోకి ఎవరూ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ బిస్మార్క్ తోపాటు అధ్యక్షుడు జూల్స్ ఫవ్రా కూడా అతని అభ్యర్ధనను తిరస్కరించాడు.

తన దారికి అడ్డువచ్చే సాధారణ చట్టాలనే కాదు, సైనిక శాసనాలను కూడా స్వేచ్ఛకు ఆటంకాలుగా భావించి మండిపడే స్వభావం అతనిది. అయిదు ఫ్రాంకులు చెల్లించి, క్లైన్ అనే పేరుతో ఒక నకిలీ పాస్ పోర్ట్ సంపాదించాడు. అతనికి యాభై ఏళ్ళు ఉన్నా దానిమీద ఫోటో మాత్రం ఓ ముప్పై ఏళ్ల యువకుడిది. తప్పనిసరిగా అతను జర్మనీ మీదుగా వెళ్ళాల్సిందే కనుక, అనుమానంతో మూడుసార్లు అతన్ని నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నించారు. యుక్తితో తప్పించుకుని బయటపడ్డాననీ, లేకపోతే గోడకు అభిముఖంగా నిలబెట్టి కాల్చి చంపేసేవారని ఆ తర్వాత రాసుకున్నాడు. జర్మన్లకు బిరుదులు, పదవుల పిచ్చి ఎక్కువ కనుక, ప్రతి లెఫ్టినెంటునూ జనరల్ గానూ, ప్రతి సైనికుణ్ణీ కల్నల్ గానూ సంబోధించడంతో వాళ్ళు ఉబ్బిపోయి వదిలేశారు.

పారిస్ పూర్తిగా ధ్వంసమైనట్టు ఎథెన్స్ లో అతనికి అందిన సమాచారం. తీరా చూస్తే అలాంటిదేమీలేదు. పాంథియన్, సెయింట్ సుల్పీస్ చర్చి, సర్బాన్ సహా  పరిచితమైన భవంతులన్నీ అలాగే ఉన్నాయి. అతని అపార్ట్ మెంటూ, దాని పక్కనే ఉన్న అతని మరో ఇల్లూ, ఎలా విడిచి వెళ్లాడో అలాగే ఉన్నాయి. లైబ్రరీలోకి అడుగుపెట్టినప్పుడు తన చెక్కిళ్ళ వెంట ఆనందబాష్పాలు రాలాయని, చనిపోయాడనుకున్న పిల్లవాడు బతికి కళ్ళు తెరిస్తే ఎలాంటి అనుభూతికి లోనవుతామో అలాంటి అనుభూతికి లోనయ్యాననీ అతను చెప్పుకున్నాడు. విచిత్రంగా అతని పొరుగిల్లు మాత్రం దెబ్బతింది. దానిని చూడగానే, మేమెల్ లో అన్ని గిడ్డంగులూ అగ్నికి ఆహుతై తన గిడ్డంగి మాత్రం భద్రంగా ఉన్న సంగతి గుర్తొచ్చింది. మరోసారి ఏ అదృశ్యశక్తో, ఏ దైవిక ప్రయోజనం కోసమో తనను విధ్వంసం నుంచి కాపాడిందనుకున్నాడు. వసంతం అడుగుపెట్టడంతో చెట్లన్నీ పూల దుప్పటీ కప్పుకున్నట్టు ఉన్నాయి. కమ్యూన్ కింద  కూడా పారిస్ ఎప్పటిలానే సొగసులీనింది.

“పారిస్ లో పెద్దగా మార్పేమీ లేదు. వీథుల్లో జనసందోహం వెనకటిలానే ఉంది. అయితే గుర్రపు బండ్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎన్నోగుర్రాలను చంపి తినేయడమే కారణం. రాత్రిళ్ళు మాత్రం పారిస్ అంతటా ఏదో విషాదం పరచుకున్నట్టు ఉంటోంది. వీథుల్లో ఒకే ఒక చమురు దీపం వెలుగుతోంది. గ్యాస్ లైట్లు లేకపోవడంతో థియేటర్లు పగలు మాత్రమే నడుస్తున్నాయి. సర్బాన్ మినహా మ్యూజియంలు, లైబ్రరీలు అన్నీ మూతబడ్డాయి. కాలేజ్ ఆఫ్ ఫ్రాన్స్ ను రేపే తెరవబోతున్నారన్న వార్త ఆనందం నింపింది. పారిస్ లో చెట్లన్నీ కూల్చేశారన్నారు. కానీ అన్ని చెట్లూ అలాగే ఉన్నాయి” అని, ఊటెంబర్గ్ లో ఉండే ఒక వర్తకమిత్రుడు గాట్షాక్ కు రాసిన ఉత్తరంలో అన్నాడు.

పారిస్ పూర్తిగా కమ్యూనార్డ్ ల అధీనంలోకి వెళ్ళిన తర్వాత కూడా స్లీమన్ అక్కడే ఉండిపోయాడు. రాచరికం కింద ఉన్న జర్మనీపై కంటే ఫ్రాన్స్ పైనే అతనికి ఎక్కువ నమ్మకం కుదిరింది. యుద్ధగమనాన్ని దూరం నుంచి చూస్తూ తన అధ్యయనంలో ప్రశాంతంగా గడిపాడు. ఈ మధ్యలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాస్తూ, తనూ, సఫ్వెట్ పాషా, అమెరికా రాయబారీ కలసి మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండచ్చనిపిస్తోందన్నాడు. ఇంతకుముందు హిస్సాలిక్ దగ్గర నిక్షేపాలు బయటపడిన సంగతి అతనికి గుర్తుంది. ఆ ప్రదేశం తను తవ్వించిన మొదటి కందకానికి ఎంతో దూరంలో లేదు. ఆంటియోకస్ ది గ్రేట్ కాలానికి చెందిన 12వందల భారీ రజత పతకాలు అక్కడ బయటపడ్డాయి. మంత్రి తన ప్రయత్నాలకు మోకాలు అడ్డడానికి అదీ ఒక కారణం కావచ్చు ననుకున్నాడు. అదే నిజమైతే అక్కడి నిధినిక్షేపాల మీద తనకు ఎలాంటి ఆసక్తీ లేనట్టు కనిపించడమే మార్గమని అతనికి తోచింది. అక్కడ వెండి, బంగారు నిక్షేపాలను కనుగొనడమే జరిగితే, ఒక్క నాణేన్ని కూడా విడిచిపెట్టకుండా మంత్రికి ఇవ్వడానికి తను సిద్ధమేననీ, తవ్వకాలు జరిపేచోట మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు కాపలాదారులను నియమించుకోవచ్చనీ, అయితే ఒక విషయంలో మాత్రం తను ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడేది లేదనీ అన్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద తనకు పూర్తి యాజమాన్య హక్కు లభించాల్సిందే! అంతవరకూ తను తిరిగి తవ్వకాలను చేపెట్టే ప్రశ్న లేదు. కేవలం ట్రాయ్ ఉనికిని నిరూపించడం తప్ప తనకు ఇందులో మరెలాంటి స్వార్థమూ లేదు. పైగా, ఈ లక్ష్యసాధనకోసం జీవితాన్నే కాదు, అపారమైన ధనాన్నీ ధారపోయడానికి తను సిద్ధమయ్యాడు. ఇంకా కావాలంటే, అక్కడ లభించే వెండి, బంగారాలకు రెట్టింపు విలువను ప్రభుత్వానికి ముట్టజెప్పడానికీ తను తయారుగా ఉన్నాడు. కాకపోతే, ప్రభుత్వ స్థలంలో తవ్వకాలు జరిపి రేపు జీవితాంతం దాని పర్యవసానాలను ఎదుర్కొనే ఓపిక మాత్రం తనకు లేదు. కనుక ఆ దిబ్బ సొంతం అయితేనే తిరిగి తవ్వకాలు ప్రారంభిస్తాడు.

అయితే, ఇదంతా పైకి వినిపించిన వాదమే తప్ప నిజం కాదు. తవ్వకాలలో లభించబోయే నిధినిక్షేపాలను తను చేజిక్కించుకుని తీరాలని అతను అప్పటికే నిర్ణయించుకున్నాడు. ఆ టర్కులిద్దరూ తనను వంచించబోయారు కనుక, ఒక ఆరితేరిన వర్తకుడిగా వారి ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని తను వంచించదలచుకున్నాడు. ఆ రోజుల్లో తరచు తన అభిమాన పాత్ర అయిన ఒడీసియెస్ ను గుర్తుచేసుకునే వాడు. దేశదిమ్మరి అయిన ఒడీసీయెస్ వంచనలోనూ సిద్ధహస్తుడే. అతని ప్రభావం స్లీమన్ పై బాల్యంలోనే పడింది. ఆపైన  సోఫియా ఇప్పుడు గర్భవతి. కొడుకే పుడతాడన్న నమ్మకంతో ఒడీసియెస్ పేరు పెట్టాలని అప్పటికే అతను నిర్ణయించుకున్నాడు.

ఎలాంటి జంకూ కొంకూ లేకుండా మరోసారి నకిలీ పాస్ పోర్ట్ తో జర్మనీ మీదుగా ప్రయాణించి మే నెలలో ఎథెన్స్ కు చేరుకున్నాడు. సోఫియా ప్రసవించింది. ఆడపిల్ల. ఆ పిల్లకు ట్రాయ్ వీరుడు హెక్టర్ భార్య యండ్రోమకి పేరు పెట్టేశాడు.

జూన్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్ళి సఫ్వెట్ పాషాను కలిశాడు. అమెరికా రాయబారి వేన్ మేక్విగ్, రాయబార కార్యాలయం కార్యదర్శి జాన్ బ్రౌన్ ల సహకారంతో అక్షరరూపమిచ్చిన కొత్త ప్రతిపాదనను అతని ముందు ఉంచాడు. దాని ప్రకారం, హిస్సాలిక్ దిబ్బపై యాజమాన్య హక్కుకు తను పట్టుబట్టడు. అక్కడి తవ్వకాలలో గొప్ప నిధినిక్షేపాలు దొరుకుతాయని తను భావించడం లేదు. ఒకవేళ దొరకడమే జరిగితే, ఉభయులం(తనూ, టర్కిష్ ప్రభుత్వమూ) దానిని సమానంగా పంచుకోవాలి. తన భాగాన్ని దేశం నుంచి తరలించడానికి అనుమతించాలి. తవ్వకాలకు అయ్యే ఖర్చంతా తనే భరిస్తాడు. ప్రభుత్వమే ఆ దిబ్బను కొనేసి ఆ టర్కుల తలనొప్పి వదిలించింది కనుక దానిపై తను హక్కును కోరబోడు. అయితే, ఆ మారుమూల ప్రాంతంలో, ఒక విదేశీయుడిగా తనకూ, అక్కడ వెలుగు చూసే చారిత్రక సంపదకూ ప్రభుత్వం రక్షణ కల్పించాలి.

1871, ఆగస్టు 2న అతను లండన్ లో ఉండగా, కాన్ స్టాంట్ నోపిల్ లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఒక సీల్డు పెట్టె అందింది. అందులో టర్కిష్ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానా ఉంది. తక్షణమే తవ్వకాలను ప్రారంభించే తహతహలో ఉన్న స్లీమన్ అప్పటికప్పుడు ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. సెప్టెంబర్ చివరిలో తను తవ్వకాలను చేపట్టాలనుకుంటున్నాననీ, అక్టోబర్ లో దర్దనెల్లెస్ వాతావరణం ఎలా ఉంటుందో, అప్పటికి జ్వరాలు వగైరా తగ్గుముఖం పడతాయో లేదో తన ఎథెన్స్ చిరునామాకు ఉత్తరం రాయవలసిందనీ కోరాడు.

సెప్టెంబర్ 27న భార్యతో కలసి దర్దనెల్లెస్ చేరుకున్నాడు. తీరా వెళ్ళాక ఫర్మానా పాఠంపై సందేహాలు తలెత్తాయి. అది హిస్సాలిక్ దిబ్బ గురించే ప్రస్తావిస్తోందా అన్నది స్పష్టం కాలేదు. ఆపైన దర్దనెల్లెస్ గవర్నర్ అక్మెడ్ పాషాకు ఎలాంటి ఉత్తర్వూ రాలేదు. తవ్వకాలప్పుడు “ పురాతన, చరిత్రప్రసిద్ధమైన ఆ నగరం తాలూకు ప్రాకారాలకు ఎలాంటి హానీ జరగకూడదు” అని ఆ ఫర్మానా ఆదేశిస్తోంది. పొరపాటున ఏ గోడో దెబ్బతింటే పర్యవసానాలు ఎలా ఉంటాయో అతనికి అర్థం కాలేదు.

సందేహాలతో సతమతమవుతూనే  సిప్లాక్ గ్రామంలో తన ముఖ్యకార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేస్త్రీని, పనివాళ్లను నియమించుకున్నాడు. తోపుడు బళ్ళు, తట్టలు, పారలు, గొడ్డళ్ళు సహా సామగ్రి అంతా సిద్ధంగా ఉంది.  ఆ దిబ్బ మీద దాడికి దిగడానికి ముందు, అధికారుల మందకొడితనం అనే చివరి అడ్డంకిని దాటడం ఒక్కటే మిగిలింది. ఫర్మానాపై సందేహానివృత్తిని కోరుతూ జాన్ బ్రౌన్ కు అత్యవసర సందేశం పంపించాడు. స్పందన లేకపోవడంతో మూడు రోజుల తర్వాత మళ్ళీ పంపాడు. టర్కిష్ ప్రభుత్వం కల్పించిన పూర్తి రక్షణలో ఎట్టకేలకు అక్టోబర్ 11 వ తేదీన పని ప్రారంభించాడు.

ప్రభుత్వం జియోర్జోస్ సర్కిస్ అనే అధికారిని తన కాపలాదారుగా నియమించింది.  పుట్టుకతో అతను ఆర్మేనియన్. ఇంతకుముందు దర్దనెల్లెస్ లోని చాన్సెరీ ఆఫ్ జస్టిస్ లో సెకండ్ సెక్రెటరీగా పనిచేశాడు. స్లీమన్ కు నీడలా వెన్నంటి ఉంటూ, ప్రభుత్వం కళ్ళు కప్పి అక్కడినుంచి ఎలాంటి నిధినిక్షేపాలనూ తరలించకుండా నిరంతరం కాపలా కాయడం అతని పని. స్లీమన్ మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వానికి అతను “కళ్ళూ-చెవులూ”.

స్లీమన్ ఫ్రాన్స్ నుంచి ఎనిమిది తోపుడు బళ్ళు తెప్పించుకున్నాడు. కనుక మొదటి రోజున ఎనిమిదిమందిని పనిలోకి దింపాడు. తవ్వకాలు చురుగ్గా సాగడంతో మరునాడు ముప్పై అయిదుగురినీ, ఆ మరునాడు డెబ్బై నలుగురినీ పనిలోకి తీసుకున్నాడు. ఒక్కొక్కరికీ 9 పియాస్టర్లు చెల్లించాడు. వేతనాల చెల్లింపు నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే స్ఫురద్రూపి అయిన ఓ గ్రీకు చేతిమీదుగా జరిగేది. స్లీమన్ తన వివాహమైన వెంటనే అతన్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. రెంకోయ్ గ్రామానికి చెందిన జానకిస్ కు స్థానిక మాండలికాలు అన్నీ తెలుసు. స్లీమన్ కు అంగరక్షకుడు, వంటమనిషి, డబ్బు లావాదేవీలు జరిపేవాడూ…అన్నీ అతనే. తన దగ్గర పనిచేసే ప్రతి ఒకరినీ గ్రీకు పురాణాలలోని ఏదో ఒక పేరుతో పిలవడం స్లీమన్ కు అలవాటు. కానీ తనకెంతో నమ్మకస్తుడైన జానకిస్ ను మాత్రం అసలు పేరుతోనే పిలిచేవాడు. స్లీమన్ ఎక్కడున్నా అతని దరిదాపుల్లో జానకిస్ విధిగా ఉండాల్సిందే. స్థానిక అధికారికి ఎవరికైనా చేతులు తడపాల్సి వస్తే, స్లీమన్ దానిని జానకిస్ కు వదిలేసేవాడు. ముడుపుల చెల్లింపు కోసం, ఇతర ఖర్చుల కోసం జానకిస్ తన బెల్టు కింద బంగారు నాణేలను ఎప్పుడూ ఉంచుకునేవాడు.

వర్షాలు మొదలయ్యాయి, అయినా తవ్వకాలు కొనసాగాయి. ఎప్పటిలా స్లీమన్ తొందరలో ఉన్నాడు. ఆరు వారాల్లో ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీయాలని అనుకున్నాడు. వర్షంలో కూడా పనివాళ్లు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరువరకు పని చేశారు. మధ్యలో ఉదయం తొమ్మిదింటికి అరగంటసేపు అల్పాహార విరామం. మధ్యాహ్నం గంటన్నరసేపు భోజన విరామం. అప్పుడు తప్ప మరెప్పుడూ పొగ తాగడానికి వీల్లేదు. ధూమపానం మనిషి శక్తిని తగ్గిస్తుందనీ, ఏకాగ్రతను దెబ్బతీస్తుందనీ స్లీమన్ సిద్ధాంతం. పని జరుగుతున్నంత సేపూ అతను చండశాసనుడు. పని వాళ్ళ పీకల మీద ఉన్నట్టు ఉండేవాడు. వర్షాలను, మధ్య మధ్య పనికి ఆటంకమయ్యే గ్రీకు శ్రాద్ధదినాలనూ తిట్టిపోసేవాడు. దానికితోడు నెలలో మూడుసార్లు తుపానులు సంభవించి, తవ్వకాలను నిలిపివేయవలసివచ్చింది. ఆ విరామకాలంలో తవ్వకాల గురించిన నివేదికలు రాసుకునేవాడు.

రాయడానికి కూడా పెద్దగా ఏమీ కనిపించలేదు. కొన్ని నాణేలూ, కాలిన ఎముకలు, భారీ కుడ్యాలు, హోమర్ కంటే కూడా చాలా వెనకటి కాలానికి చెందిన విచిత్రమైన లింగాకృతులు బయటపడ్డాయి. ఇవి చక్కగా మెరుగుపెట్టిన నల్లరాతి లింగాకృతులు. వీటిలో కొన్నిటిపై తెల్లని చారలున్నాయి. అక్టోబర్ 30న జరిపిన తవ్వకాలలో ఇవే కాక, ఆకుపచ్చని రాయితో చేసిన బల్లెం పిడులు, అగ్నిపర్వతాలను తలపించే చిత్రమైన ఆకృతులు, పంది కోరలు, దంతాలు వందల సంఖ్యలో వెలికివచ్చాయి. ఆ తర్వాత కూడా రోజు రోజుకీ ఇలాంటివే బయటపడడం ప్రారంభించాయి. ఇంకా లోపలికి వెడుతున్న కొద్దీ గుడ్లగూబను పోలిన చిన్న చిన్న మృణ్మయమూర్తులు, గుడ్లగూబ తలను చెక్కిన రాతిపలకలు తగిలాయి. వాటిని చూడగానే ‘గుడ్లగూబ  ముఖం’ కలిగిన ఎథెనా గురించి హోమర్ చెప్పడం స్లీమన్ కు గుర్తొచ్చింది. గుడ్లగూబ పల్లాస్ ఎథెనాకు చెందిన ఓ పవిత్రచిహ్నం. కన్య అయిన ఎథెనా, ఎథెన్స్ కు రక్షణ దేవత. ఈ దేవత కళ్ళు గుడ్లగూబ కళ్లలా ప్రకాశవంతంగానూ, చీకట్లో కూడా చూడగలిగేలానూ ఉంటాయని ‘గుడ్లగూబ ముఖం కలిగిన ఎథెనా’ అన్న హోమర్ మాటకు పండితులు అర్థం చెప్పారు.

పదడుగుల లోతున, చిన్నపాటి బొంగరం ఆకారంలో ఉన్న మృణ్మయమూర్తులు కనిపించడం, వాటిలో కొన్నింటికి రెండు రంధ్రాలు ఉండడం చూసి స్లీమన్ మరింత విస్తుపోయాడు. భారతదేశంలోని దేవాలయాలలో తను చూసిన నల్లరాతి భారీ శివలింగాలు అతనికి చటుక్కున గుర్తొచ్చాయి. ఈ తవ్వకాలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపించిన లింగాకృతులు పురుషసూత్రానికి చెందినవైతే; రంధ్రాలు చేసిన బొంగరం ఆకృతులు స్త్రీసూత్రానికి చెంది ఉంటాయనుకున్నాడు. ఇంతకీ ప్రియామ్ ప్రాసాదంలో ఇలాంటివి ఎందుకున్నాయో అతనికి అర్థం కాలేదు.

(సశేషం)