ఒక్కడు కాదు  –  ఇద్దరు!

 

 

(మహా రచయిత, డాక్టర్ కేశవరెడ్డి చనిపోయి ఫిబ్రవరి 13 కి  సంవత్సరం కావస్తున్న తరుణంలో   కేశవరెడ్డి గారి మిత్రులు హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడ, హైదరబాద్ లో ఆ రోజు  సాయంత్రం సమావేశమవుతున్నారు. ఈ సంధర్భంగా కేశవరెడ్డి లోని అన్ని కోణాలు తెల్సిన ఆయన ఆప్త మిత్రులు, అంబటి సురేంద్ర రాజు (అసుర)ని  ‘ఛాయ’ సంస్థ తరుఫున కృష్ణ మోహన్ బాబు పలకరించారు.  ఆ మాటల ముచ్చట్లు ఇవి.)

 

కేశవరెడ్డి గారి చాలా పుస్తకాలకి వెనుక మాటల్లో మీరు ఉన్నారు.  అసలు కేశవరెడ్డి గారికి, మీకు పరిచయం ఎలా జరిగింది? ఇన్ని సార్లు వెనుక మాటలు రాయడం ఎలా సాధ్యమయ్యింది?

కేశవ రెడ్డి  గారిని 1979 నుంచి నేనెరుగుదును.  ఎమ్మే ఫిలాసఫీ  చదువుతున్న రోజులలో నా రూమ్ మేట్ అతిధి గా ఆయన మా గదికి ఆ రాత్రి ఉండడానికి వచ్చారు.  అప్పటికి ఆయన, ‘ఇంక్రెడిబుల్ గాడెస్’ అచ్చయ్యింది.  చలం గారు, కృష్ణ శాస్త్రి, కుటుంబ రావు లాంటి పెద్దలు బతికున్న రోజులు.  ఆ రాత్రి తెల్లారే దాకా నాకు, కేశవరెడ్డి గార్కి మధ్య మాటల యుద్ధమే జరిగింది.  తక్షణ కారణం త్రిపుర నేని మధుసూధన రావు ‘ముందు మాట’ అంటూ రాసిన చెత్త చెదారం. కేశవరెడ్డి గార్కి ఆయన అంటే మహా ప్రీతి, భక్తి.  అందుకనే అడిగి మరీ రాయించుకున్నారు.  ఆనాడు నా బాధేంటంటే ముందు మాట రాసిన పెద్ద మనిషికి ‘అర్జున రెడ్డి’ పాత్ర అర్ధం కాకపోవటం.  ఆ పాత్ర అర్ధం కాకపోతే, కేశవ రెడ్డీ అర్ధం కాడు.  ఆ సహ అనుభూతి (empathy) లేనివాడు ముందు మాట రాయడమేంటి? అదే అడిగా కేశవరెడ్డి ని.  ఆ ముందు మాటలో నవల గురించి ఒక్క మాట కూడా లేకపోవటమే కాదు, అదే అదనుగా తన సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని వాంతి చేసుకున్నాడు.  నా మాటలు కేశవరెడ్డి గార్కి రుచించ లేదు.   ఆయన కోపంతో విశ్వ రూపం చూపించాడు.  ఆ రోజు మధుసూధన రావు, మార్క్సిజం, సిధ్ద్ధాంతమ్, ఆచరణ అన్ని అంశాలు మా మధ్య చోటు చేసుకున్నాయి.  తర్వాతి కాలంలో కేశవరెడ్డి గారితో మంచి స్నేహం ఏర్పడింది.  నాకు ఆయన రచనలంటే చాలా ఇష్టం.  అందుకే ఆ ముందు మాట మీద అంత ఘర్షణ జరిగింది.  ఆ సంఘటన తర్వాత ఎంత కలవాలనుకున్నా, 1996 దాకా ఆయన్ను మళ్ళీ కలవటం జరగ లేదు.  కారణం ఆయన హైదరబాదు రాడు, నా పాత్రికేయ వృత్తి పని ఒత్తిడి వల్ల నేను డిచ్ పల్లి వెళ్ళటం కుదరలేదు.  ఈ మధ్యలో ‘శ్మశానం దున్నేరు, అతను అడవిని జయించాడు, రాముడుండాడు-రాజ్యముండాది, సిటీ బ్యూటీఫుల్’ నవలలొచ్చాయి.  కాండ్రేగుల నాగేశ్వర్రావు గారు పాత పుస్తకాలను మళ్ళీ వేస్తూ, కొత్త పుస్తకాలు, ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ లకి పరిచయాలు  రాయమన్నారు.  నా ఈ పరిచయాలు  చూశాక, తన నవల లన్నింటికి రాయమని కేశవరెడ్డి గారు కోరినా, కారణాంతాల వల్ల వీలు పడలేదు.  అలా కేశవరెడ్డి గారు నాకు మరింత దగ్గరయ్యారు.   మనల్ని విడిచి పోయే దాకా ఆయన నాతో మాట్లాడని రోజు లేదు.

మరైతే సంజీవ్ దేవ్ గారి ముందు మాట సరైనదేనా?

మధుసూధన రావుది ఎంత అసంబద్ధమో , ఇది కూడా అంతే అసంబద్ధం.   విషయం ఏం లేదు.

ఒక్క ‘సిటీ బ్యూటీఫుల్’ తప్ప మిగిలిన నవలలన్నిటి కథా కాలం 1900 – 45 మధ్యలో ఉంటుంది.  అది కూడా సూచనప్రాయంగా మాత్రమే తెలుస్తుంది.  దీనికేదైనా బలమైన కారణముందా? లేకపోతే ఆ తర్వాతి కాలంలో ఈ వాతావరణం అంతగా లేదనుకున్నారా?

వాతావరణం లేదని కాదు, వీటి మూలాలు ఆ కాలం లో ప్రస్ఫుటంగా ఉన్నాయని ఆయన ఉద్దేశ్యం.  1950 కి ముందు క్లాసికల్ ఫ్యూడలిజమ్ బలంగా ఉంది.  అదొక vantage పాయంట్ గా తీసుకుంటే వర్తమానాన్ని స్పష్టంగా చూసి అర్ధం చేసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే మీరు ఇంకో విషయం గమనిస్తే, ఆయన రాసిన ఏ కథ అయినా తను పుట్టి, పెరిగిన చిత్తూరు జిల్లా ఎల్లలు దాటవు.  మిగతా చోట్ల అలాంటివి లేవని కాదు.  తను స్వయంగా చూసిన వాస్తవిక పరిస్థుల చిత్రణ అది.

asura

 ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, మునెమ్మ’ లలో అంటే, చివరి నవలల్లోనే మీరనే పొయిటిక్ జస్టిస్ ఉంటుంది.  అంతకు ముందు లేని ఈ ప్రక్రియ వీటిలోనే ఎందుకు ఉంది? దీనికి  ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

వాస్తవికతకి, చారిత్రకంగా ఒక సామాజిక సంక్షోభ సందర్భాన్ని పొదివి పట్టుకొని, పరిశీలించి, పరిష్కరించే శక్తి యింకా సాధించలేదు. ఈ పరిస్థితులలో రచయిత మానవేతర శక్తులతో న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో, కాల్పనీకతను జోడించి, పరిష్కారాన్ని సూత్రప్రాయంగా చెప్తాడు.  ఇంతా చేసి యిది పరిష్కారం కాదు, ప్రతి చర్యే.  ‘మూగవాని పిల్లనగ్రోవి’ నాటికి కేశవరెడ్డి గారి ఆలోచనల్లో మౌలికమైన మార్పు వచ్చింది.  అదే ఆయన రచనల్లో ప్రతిబింబించింది.  తొలి అయిదు  నవలలు రాసిన కేశవరెడ్డి, అమెరికన్ నవలా సాహిత్యంతో ప్రభావితమైతే,  ఆ తర్వాత వచ్చిన మూడు  నవలల్లో లాటిన్ అమెరికన్ సాహిత్య ప్రభావం స్పష్టంగా  చూడ చ్చు.  దీనితో కంటెంటు, ఫాము  అన్నీ  మారాయి.  ఈ పొయటిక్ జస్టిస్ కి కారణం అదే.   మరో విషయం గమనిస్తే 1986 నుంచి 1996 దాకా ఆయన రచనలు మనం చూడలేదు.  ఈ మధ్య కాలంలో ఆయన చేసిన లాటిన్ అమెరికన్ సాహిత్య సేవని ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ ల్లో మనం చూస్తాం.   అలాగే 1997 నుంచి 2007 దాకా మౌనం.  ఆ తర్వాత వచ్చిన ‘మునెమ్మ’ మళ్లీ లాటిన్ అమెరికన్ ప్రభావంతో వచ్చింది.

ఆయన రచనల్లో  ‘సిటీ బ్యూటీఫుల్’ ఒక విభిన్నవైన నవల.  అదెలా కుదిరింది?

ఆ నవల పూర్తిగా ఆయన ఆత్మ కథే.  పాండిచ్చేరిలో ఆయన వైద్య విద్యార్ధిగా గడిపిన కాలాన్ని, అనుభవాన్ని విమర్శనాత్మకంగా చిత్రిస్తే వచ్చిందే ఆ నవల.  ఇదో విధంగా పీడకల లాంటి గతాన్ని రాసి వదిలించుకోవడమే.  ఉన్నత విద్యా విధానాన్ని, ముఖ్యంగా వైద్య విద్యా విధానం మీద ఉన్న అసహ్యాన్ని ఈ నవలలో ఎత్తి చూపాడు.  ఈ విధానం తెలివైన విద్యార్ధి కోసం కాదు.  మొక్కుబడిగా, వివేచన లేకుండా చదివేవాళ్ళ కోసం మాత్రమే.  ఇది ఈ రోజు సమస్త విద్యా వ్యవస్థ లకి వర్తిస్తుంది.

కేశవరెడ్డి గారిని అంత దగ్గరగా చూశారు కదా;  ఆయన గురించి మీకున్న బలమైన అభిప్రాయమేంటి? 

రచయితగానే కాకుండా మనిషిగా కూడా ఆయన ఉన్నతుడు, సర్వ స్వతంత్రుడు.  పుట్టుకతో వచ్చిన ప్రివిలేజ్ లన్నీ వదిలి పెట్టి, మధ్య తరగతి జీవితాన్ని తోసిపారేశాడు.  తమ సామాజిక వర్గపు విద్యాధిక యువతుల్ని కాదని అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాడు.  తను డాక్టర్, ఆమె నర్స్.  డాక్టర్ గా కూడా ఆయన మధ్య తరగతికి దూరంగా ఉండి, సమాజం తిరస్కరించిన నిరుపేద కుష్టు రోగులకి బంధువుగా నిల్చి ఆచరణ లో జీసస్ అయ్యాడు.  సాహిత్య సంఘాల్ని, ముఠాలని విసర్జించాడు.  వేసిన పుస్తకాల మీద హైదరాబాద్ బుక్ ట్రస్ట్  అధిపతి, గీతా రామస్వామి చిల్లర పైసలని విదిల్చినా  పల్లెత్తు మాటనలేదు.   కేశవ రెడ్డి ఒక గొప్ప డాక్టర్.  అణగారిన జీవితాల్లో వెలుగు నింపిన దార్శనికుడు.  రచయితగా ఆయన ఒకే ఒక్కడు.  అందుకే నే నంటాను ఆయన ఒక్కడు కాదు – ఇద్దరు.

***

 

ఒక బాటసారి: కొన్ని మాటలూ…

 

 

– కృష్ణ మోహన్ బాబు

~

 

(ఛాయ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 5:30కు హైదరాబాద్, దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో రాజిరెడ్డి రచనల మీద కాకుమాని శ్రీనివాసరావు ‘ఒక బాటసారి బైరాగి పదాలు’ పేరిట ప్రసంగించనున్న సందర్భంగా…)

 

mohanbabu“అక్కడ చెట్లు, మనుషులు వేర్వేరుగా లేరు. మట్టి, మనిషి వేర్వేరుగా లేరు.  ఒక సంస్కృతిగా, జీవన విధానంగా వాళ్ళు కొబ్బరిచెట్లతో మమేకమయ్యారు.  బతుకులో భాగంగా, బతుక్కి ఆలంబనగా కొబ్బరి చెట్లు కనిపించాయి”. 

కోనసీమలో మొదటిసారిగా ఓ పెళ్ళి కోసం అడుగు పెట్టినపుడు, మనుషుల్లా పరుచుకున్న చెట్లు, చెట్లై నిలబడ్డ మనుషుల్ని చూసి, జర్నలిస్ట్, రచయిత, పూడూరి రాజిరెడ్డికి కలిగిన భావన ఇది.  మామూలు, అతి మామూలు విషయాల్ని మెత్తని పదాలతో, గడుసు వాక్యాలతో రంగు రంగుల చిత్రాలుగా మలచగలిగిన నేర్పు రాజిరెడ్డిది. అలాంటి అందమయిన భావ చిత్రాల పొందికే ‘పలక – పెన్సిల్. ఇది రాజిరెడ్డి రెండో పుస్తకం.

బాల్యం నుంచి కౌమారం మీదుగా యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడి గొంతులో, ఆలోచనల్లో వచ్చే మార్పులే బలపం – పెన్సిల్ – పెన్నుగా మారి ఈ పుస్తకంలో మన ముందుకొస్తాయి.  రచయిత జ్ఞాపకాలు, అనుభవాలు చదివితే తమ జీవితంలో కూడా యించుమించు అలాంటి అనుభవాలే ఉన్న స్పృహ పాఠకులకు కలుగుతుంది.  అందుకే రచయిత వాక్యాలు పాఠకుల ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని మోసుకుంటూ వెళ్తాయి.

మొదటి అనుభవాలు రేకులు విప్పినా, ‘అంమ’ అంటూ ముద్దు ముద్దుగా తొలి పలుకు గుర్తు చేసుకున్నా, ఊరి ముచ్చట్లు పెట్టి సందడి చేసినా, సిన్మాల గురించి పిల్ల ఆలోచనల్ని నెమరేసినా, మనం కూడా అమాయకంగా జారి పోయిన క్షణాల్ని తడిమి తడిమి చూసుకుంటాం. ఆనందం లాంటి విచారంలో ములిగిపోతాం.  అంగీ విప్పి హీరోయిజానికి ప్రయత్నించటం, ఆడపిల్లతో కలంస్నేహం గురించి ఆరాటపడటం, వెలుగూ వెన్నెలా అంటూ ఆమెనే కలవరించటం, కౌమారపు పీల గొంతులో మొహమాట్లాడటం, పెదాలు విప్పని నవ్వులో జర జరా జారిపోయే జ్ఞాపకాలే.

‘జీవిత రైలు కొత్త ప్లాట్ ఫామ్ మీదకు రాబోతున్నది!’, ‘డైరీలో ఏం రాయాలి?’,  ‘భోగి మంటల్లో ఏం వేద్దాం?’,  ‘మనుషుల మ్యూజియం’ –  అంటూ గంభీరమైన గొంతుతో పలకరించినపుడు, అప్పుడప్పుడే స్థిరపడుతున్న ఆలోచనలతో కొంచెం తలెత్తుకుని చిరు పొగరుతో మాట్లాడిన కాలం మన ముందుంటుంది.  ‘ప్రేమ’, ‘మనసు కేరాఫ్’,  ‘క్షణికం’,  ‘మాయ’ – చదువుతున్నప్పుడు  అప్పుడే గీసుకున్న లేత గడ్డం తాలూకు సన్నని మంటలా, చేతివేళ్ళ కంటుకున్న సిరా మరకల్లా మన జ్ఞాపకాలు మనల్ని  ఒరుసుకుంటూ వెళ్ళటం చూడొచ్చు.  ఏ రచనైనా ఏదో రూపంలో మనల్ని తనలోకి లాక్కోవడం— అదో ఎక్స్పీరియన్స్.

కొన్ని కొన్ని సందర్భాలలో రచయిత తిరుగులేని స్టేట్మెంట్స్ మన ముందుంచుతాడు.  వాటి నుంచి మనం తప్పించుకోలేము.  ఎలా డీల్ చేయాలో తెలియక తికమక పడతాం.  ‘అల్లరి వీళ్ళ కవల పిల్ల’, అంటూ పిల్లల కోసం రాసిన రచనలో రచయిత ఏమంటున్నాడో చూడండి:

“యుధ్ధాలకు కారణం వాళ్ళు కాదు.  కరువుకు కారణం వాళ్ళు కాదు.  అవినీతికి, ఆర్ధిక మాంధ్యానికి వాళ్ళకు సంబంధం లేదు.  కులం, మతం, పేదరికం అనే శబ్దాలు విన్నప్పుడు వాళ్లెప్పుడూ చప్పట్లు కొట్టలేదు.  గ్లోబల్ వార్మింగ్ కు వాళ్ళే కారణం అని ఎక్కడా ఋజువు కాలేదు.  ఆకలి చావులు, శరణార్థి శిబిరాలు, బాంబు దాడులు… ఇవేవీ వాళ్ళు ఉపయోగించే పదబంధాలు కావు.  అయినా వీటన్నిటినీ వాళ్ళు ఎదుర్కోవాలి.  ఇన్ని సమస్యలు వాళ్ళ ముందుంచి, వాళ్ళకు మేమేం తక్కువ చేశామంటాం.  వాళ్ళు స్వేచ్ఛగా విహరించాలంటాం.  వాళ్ళు సదా సంతోషంగా ఉండాలంటాం.  ఎలా?  పిల్లలే గనక ఈ ప్రశ్న అడిగితే పెద్దల దగ్గర సమాధానం ఏమైనా ఉంటుందా?.”

ఇది చదివాక అనేక విషాద చిత్రాలు మన ముందు మెదుల్తాయి.  ఏమీ చేయలేక పోతున్నామనే నిస్సహాత ఆవరిస్తుంది.  తెలియని గిల్ట్ ఏదో మనల్ని బోనులో నిలబెడ్తుంది.  ఇలా తను చెప్పదల్చుకున్న విషయం పట్ల, మన ఆలోచనల్ని లాక్కెళ్ళగలగడం రచయిత సాధించిన విజయం.

రాజిరెడ్డి రచనలన్నీట్లో సాధారణంగా ఉండే ఒక మార్మిక గొంతు ఈ పుస్తకంలోనూ స్పష్టంగా కన్పిస్తుంది.  చాలా రచనలు ఓ బలమైన తాత్విక అంశంతో ముగియడం వల్ల ఆ రచన తాలూకు ఫీలింగ్స్ చాలా సేపటి వరకు మనల్ని వదలకుండా వెంటాడతాయి.  మచ్చుకు కొన్ని చూడండి:

“జీవితాన్ని పొడిగించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం… వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలు పోగేసుకోవడమే.

“ఏ మార్మిక చిక్కుముడులు విప్పడానికి జీవితం యిలాంటి చిక్కు అలవాట్లను కల్పిస్తుందో!

“ఇల్లు మారినప్పుడు ఎలాగైతే పాత సామానులను వదిలేయక మోసుకెళ్తూ ఉంటామో, అలాగే భావాలను మోసుకెళ్తూ ఉంటాము.

“రోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం తగలబడి పోతూ ఉంటుంది.  బహుశా, అందువల్లేనేమో రాత్రి మరింత నిర్మలంగా కనబడుతుంది.

“నువ్వున్నావన్న ఒకే ఒక్క కారణంగా ఈ ప్రపంచాన్ని క్షమించేశాను.

“బతుకు ప్రవాహం స్థూలంగా అందరిదీ ఒకటే. సూక్ష్మంగా దేనికదే ప్రత్యేకం.”

 

ఇలాంటివి అనేకం, అనేకానేకం.

 

కొన్ని కొన్ని చోట్ల రచయిత ఏ అరమరికలు లేకుండా తన సర్వ గుణాలను మన ముందుంచుతాడు. ‘నేనేమిటి?’ అంటూ మొదలు పెట్టి ఒక్కొక్క పొర విప్పుతుంటే ఆ పదాల్లో మన ప్రతిబింబం కూడా కనబడి ఉలిక్కి పడతాం. పుస్తకం చదవటం పూర్తయ్యేసరికి మనం మండుటెండలో వేడి వేడి నీళ్ల స్నానం చేసి, ఏ.సి.లోకి వచ్చి సేద తీరుతున్న చిత్రమైన అనుభూతి పొందుతాం.

మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు చుట్టుముట్టినప్పుడు, ఏమిటో ఈ జీవితం అని నిర్లిప్తత ఆవరించినప్పుడు ఈ పుస్తకం చదవండి.  అప్పుడు, ఇప్పుడుగా ఎగిరి పోయిన ఆనందపు క్షణాలు పక్షులై మీ గుండె గోడల మీద వాల్తాయి.  మిమ్మల్ని మీరు సంబాళించుకునేలా చేస్తాయి. గ్యారంటీ.

 

 

*

 

 

నైనతార – ఒక రెబెల్ తార

-కృష్ణ మోహన్ బాబు

~

mohanbabuసునామీలు, భూకంపాలూ వచ్చేటప్పుడు ప్రకృతిలో కొన్ని జీవులు వాటిని ముందుగానే పసిగడతాయి.  అలాగే మానవ సమాజం లో సామాజిక వుపద్రవాలు రాబోయే  ముందు బుద్ధిజీవులకు ముందుగానే తెలుస్తుంది, వాళ్ళు సమాజాన్ని అప్రమత్తం చేస్తారు.   88 యేళ్ళ నైనతార సెహగల్ తనకి 1986 లో వచ్చిన సాహిత్య అకాడెమీ అవార్డ్ ను తిరిగి ఇచ్చి వేయటం దేశంలో  తలెత్తుతున్న ఫాసిస్ట్ శక్తులను గుర్తించటం లో భాగంగా చేసిన హెచ్చరిక.

ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందుగానే చెప్పటం ఆవిడకి కొత్త కాదు.  1967-75 లో  ఇందిరాగాంధీ గురుంచి కూడా యిలాగే హెచ్చరించింది.  అందరూ ఇందిరని భుజాలకెత్తి మోస్తున్నపుడు యిది ప్రజాస్వామ్య పోకడ  కాదని, వ్యక్తి పూజ అని నెహ్రూ ఏర్పరచిన విలువల విధ్వంసం అని నైనతార తడువుకోకుండా, మొహమాటం  లేకుండా ఎంత గట్టిగా చెప్పాలో అంత గట్టిగా చెప్పింది.  ఇలా చెప్పడానికి ఆవిడ కున్న అర్హతని, సాధికారతని మనం తెల్సుకోవాలంటే ఆవిడ గురించి  తెల్సుకోవలసిందే.

నైనతార సెహగల్ భారత దేశం లో సుపరిచితమైన నెహ్రూ కుటుంబానికి చెందిన మనిషి.  నెహ్రూ – గాంధీ కాదు, నెహ్రూ కుటుంబం మాత్రమే.  ఈ విషయం ఆవిడ చాలా గట్టిగా నొక్కి చెపుతుంది.  మోతీలాల్  నెహ్రూ కూతురు, జవహర్ లాల్ చెల్లెలు అయిన విజయ లక్ష్మీపండిట్, రంజిత్ సీతారామ పండిత్ ల  రెండవ కూతురు, నైనతార.  10 మే 1927 జన్మదినం.  నెహ్రూ భావాలన్న, ఆలోచనలన్న, ప్రజాస్వామ్య విలువలన్న నైనతారకు విపరీతమైన గౌరవం.  ఆవిడ నమ్మిన విలువలు, సిద్ధాంతాలు అన్నిటికి ఈ రోజుకు కూడా నెహ్రూ భావజాలమే ఆధారం.  తల్లిదండ్రులు జైళ్ళ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఇందిరతో కల్సి ఆనంద భవన్ లోనే  వుండేది.  ఇద్దరూ కల్సి బోర్డింగ్ స్కూల్ కు వెళ్ళేవాళ్ళు.  వయసులో ఇందిర పెద్దదైనా యిద్దరి మధ్య చాలా మంచి స్నేహం వుండేది.  ‘ఇంది’ అని పిలిచే అంత చనువు.

జీవితం చాలా చిత్రమైనది.  1967 ప్రాంతం లో ఇందిర కాంగ్రెస్ పార్టీని తన గుప్పెట్లో తీసుకునే ప్రయత్నాలలో వుంది.  అదే సమ యంలో గౌతమ్ సెహగల్ తో విడాకులు తర్వాత తప్పని పరిస్థుతులలో బతుకు తెరువు కోసం నైనతార ఢిల్లీ వచ్చి స్థిరపడింది.  ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ పత్రిక లో రాజకీయ వ్యాఖ్యాతగా వ్యాసాలు రాయటం మొదలు  పెట్టింది.  దేశంలోనే మొదటి మహిళా రాజకీయ వ్యాఖ్యాత అయింది.  అదే ఆవిడ జీవితంలో వచ్చిన పెద్ద మలుపు.  ఆర్ధిక అవసరాలు ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి మరింత విస్తృతంగా రాసేలా చేశాయి.  సండే స్టాండర్డ్ కి ఆవిడ 14 యేళ్ళు ఏకధాటిగా కాలమ్ రాసింది.  ఇది కాక ఎమర్జెన్సీ ముందు అజిత్ భట్టాచార్జీ నిర్వహణ లో, జయ ప్రకాష్ నారాయణ్ ప్రచురించిన పత్రిక ‘ఎవ్విరి మెన్స్ వీక్లీ’ కి రచనలు చేసింది.  వీటితో పాటు ‘ది న్యూ రిపబ్లిక్’, ‘అట్లాంటిక్ మన్త్ లీ’, ‘లండన్ టైమ్స్’, ‘ది ఫార్ ఈస్ట్రన్ ఎకనామిక్ రివ్యూ’ లాంటి పేరొందిన పత్రికలకి కూడా విస్తృతంగా రాసింది. రాజకీయాల పట్ల ఆవిడకున్న అనురక్తితో పాటు, రాజకీయ రాజధానిగా ఢిల్లీ నైనతారకి సంఘటనలను దగ్గిర నుంచి చూసి, లోతైన విశ్లేషణ చేసే అవకాశాన్ని కల్పించింది.  ఇందిర నెహ్రూ విధానాలను వదిలేసి, వ్యక్తి స్వామ్యానికి ప్రతీకగా మారటం ఆవిడ గుర్తించింది. ఇదే విషయాన్ని ఆవిడ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది.  ఆ వ్యతిరేకత ఎంత వరకూ వెళ్ళిందంటే ఇందిరాగాంధీతో ఆవిడ సంబంధాలు మొహం మొహం చూసుకోలేనంతగా దిగజారి పోయాయి.  నైనతార తో పాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్, ఫ్రాంక్ మొరేస్, సండే  స్టాండర్డ్ ఎడిటర్, నందన్ కాగల్ గొంతు కలిపారు.    1969 నాటికి ఈ మాటల దాడి నైనతారకి ‘జర్నలిస్ట్’ గుర్తింపుకు కూడా అనర్హమైన దానిగా చేశాయి.  అదే సమయంలో ఇందిర పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ బలమైన శక్తిగా ఎదగటం మొదలు పెట్టింది.  బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు లాంటి పాపులిస్ట్ విధానాలను ప్రకటించింది.  అయితే నైనతార వీటన్నిటినీ వ్యతిరేకిస్తూనే వచ్చింది.  గ్రామీణ పరపతి వ్యవస్థని పటిష్టం చేయకుండా కొద్ది మంది పారిశ్రామిక వేత్తలకి రుణాలు యివ్వటం ఏవిధంగా సమంజసం అని ప్రశ్నించింది.  కాంగ్రెస్ పార్టీలోని ఒక

బలమైన వర్గం మిగతా వారి పట్ల ఎప్పుడూ లేనంత దురుసు ద న్నాన్ని ప్రదర్శించి ప్రజాస్వామ్య విలువలని కాల రాసింది అని తీర్మానించింది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవటం, దాన్ని నిలబెట్టుకోవటానికి తప్పుడు దార్లు ఎంచుకోవటం ఇందిర చేస్తున్న పొరపాట్లు అంది.  ఒకప్పటి విలువలకు కాంగ్రెస్ తిలోదకాలు యిచ్చి, బేరసారాలలో కూరుకు పోయిందని రాసింది.  మరో పక్క  మతపరమైన తీవ్రవాద భావాలున్న జనసంఘ్(బి జె పి పూర్వ రూపం) ‘హిందీ – హిందూ –హిందూస్తాన్’ అనే ప్రమాద కరమైన నినాదాలను  ఎత్తు కుంటోందని కూడా గుర్తు చేసింది. పార్టీ లో విమర్శకు తావు లేదు.  ఓ పద్ధతిలో పెరిగిన వ్యక్తి పూజ ఏ విధమైన జవాబుదారీతనం లేకుండా చేసిందని భావించింది.  సొంత నియమ నిబంధనలను గౌరవించని పార్టీ, దేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవించగలుగుతుందీ? అని ప్రశ్నించింది.  అదే సంవత్సరం డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ చీలి పోవటం ఆవిణ్ణి చాలా నిరాశపరచింది. బంగ్లాదేశ్ యుద్ధంతో ఇందిర విజయ పరంపరలు, అప్రతిహతం గా సాగడం, ఇందిర ఎవరికి అందనంత ఎత్తు ఎదగటం జరిగాయి.

బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిర విజయాన్ని గుర్తిస్తూ, విదేశీ వ్యవహారాలలో ఇందిర చూపుతున్న పరిపక్వతను మెచ్చు కుంటూనే, పెరుగుతున్న ధనిక, పేద అంతరాన్ని, నక్సలిజం పట్ల యువతలో పెరుగుతున్న అదరణని గుర్తుచేసింది.    1974 లో బీహార్ లో నిప్పు రవ్వలా మొదలైన విధ్యార్థుల ఉధ్యమం జయ ప్రకాష్ నారాయణ్ (J.P.) ఆధ్వర్యంలో ఇందిరను చుట్టుముట్టినపుడు నైనతార జె.పి. తో కల్సి పని చేసింది.  1975 లో దేశంలో ఎమెర్జెన్సీ విధించినపుడు నైనతారని అరెస్టైతే చేయలేదు గాని నోరెత్తకుండా చేయగలిగారు.   తర్వాత తర్వాత మంచికో చెడుకో రాజకీయాలలో జేరి, దశాబ్దం పాటు అనేక ఆటుపోట్లను ఎదురుకొంది. 1982 లో ఇటలీ అంబాసిడర్ గా ఖరారైన నియామకాన్ని ఇందిర పదవి లోనికి రాగానే రద్దు చేసింది.

ఇందిర తో తన సంబంధాలు దెబ్బ తినటం నైనతార ని చాలా భావోద్వేగాలకి గురి చేసింది.  ఒక దశలో ఈ వ్యాసాంగాన్ని ఆపేద్దామనుకొంది.  అయితే ఏ విలువలకైతే నెహ్రూ కట్టుబడ్డాడో ఆ విలువల్ని సొంత కూతురే కాల రాయటం నైనతార జీర్ణించుకో లేకపోయింది.  అందుకే ఇందిర చేసే ప్రతీ పని ఆవిడకి తప్పు గా తోచేది.  తర్వాత రోజుల్లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తనకి ఆ రోజుల్లో పరిపక్వత లేకపోవడం వల్ల కొన్ని విషయాలను తప్పుగా అవగాహన చేసుకున్నాను అని ఒప్పుకుంది.  అందువల్ల వ్యక్తిగతం గా తను చాలా నష్ట పోయాను అని కూడా బాధ పడింది.

నైనతార 9 నవలలు రాసింది.  8 నాన్ ఫిక్షనల్ రచనలు చేసింది.  చిన్న కథల పుస్తకాలు వేసింది.  రాజకీయ, సాహిత్య వ్యాసాలు అనేకం రాసింది.  ఆవిడ రా సిన పుస్తకం ‘’ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ అండ్ స్టయిల్” 1977 లో ప్రచురించారు.  ఆ తర్వాత దీనిలోనే మరింత చేర్పులు చేసి “ఇందిరాగాంధి – హెర్ రోడ్ టు పవర్” గా మళ్ళీ వేశారు.  తన ప్రతి నవలలోను రాజకీయ వాతావరణాన్ని, నేపధ్యాన్ని ప్రతిబింబించిన ఏకైక ఇంగ్లీష్ రచయిత.  ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆంగ్లో ఇండియన్ రచయిత కూడా ఆవిడే.    సహచరుడు, మంగత్ రాయ్, నైనతార మధ్యన నడచిన ఉత్తరాల్ని 1994 లో “రిలేషన్ షిప్” పేరుతో పుస్తకం గా వేశారు.  అది చాలా సంచలనం రేపింది.     నైనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని రితు మీనన్ రాసిన పుస్తకం, “ఔట్ ఆఫ్ లైన్ : ఎ లిటరరీ అండ్ పొలిటికల్ బైయోగ్రఫీ ఆఫ్ నైనతార సెహగల్” గత యేడాది విడుదలైంది.  1980 ల మధ్య లో నైనతార చాలా కాలం ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబెర్టీస్’ (PUCL) కి జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసింది.  సిక్కుల వూచకోత మీద సమగ్ర నివేదిక ఇవ్వటం లో ప్రముఖ పాత్ర వహించింది.  ఆవిడ రాసిన కొత్త  కథల సంపుటి త్వరలో మన ముందుకు రాబోతోంది. ఎవరెలాంటి వ్యాఖ్యలు చేసిన, నైనతార చేసిన పని సమాజంలో ఒక అలజడిని సృష్టిస్తోంది.  మేధావి వర్గంలో ప్రకంపనలను సృష్టిస్తోంది.  నైనతార ఒక రెబెల్ తార.

*

 

అరె!!  భలే కథలే!!!

Ghanada_Sahasalu

-కృష్ణ మోహన్ బాబు

~

mohanbabu“లేదు నేను యెప్పుడూ బరువులు ఎత్తలేదు.  కాని ఒకసారి మాత్రం ఒక రాయిని లేపాను.”

ఒక్కసారిగా మేమంతా నిటారుగా ఆయిపోయాం.  “ఒక రాయిని లేపారా! అది ఎంత పెద్దది ఘనదా?”

“ఎంత పెద్దగా వుంటుందది! అది చాలా చిన్న గులాకరాయి, బహుశా అరవై గ్రాములు వుంటుందేమో _ _ _ _ _ దాని కారణంగానే మికియు దీవి ముక్కలుగా పేలిపోయింది.”

“ఒక దీవి మొత్తం ముక్కలుగా పేలిపోయిందా!  దానికి కారణం నువ్వు ఒక పలకరాయి లేపటమా?”  మా నోటినుంచి అప్రయత్నంగా ప్రశ్న దూసుకు వచ్చింది.”

……

“అవును. ఈ వానపాములే లేకపోతే  ప్రపంచం ఎడారిగా మారి వుండేదని మీకు తెలుసా? ఎకరంలో మూడవ వంతులో  రెండు లక్షల వాన పాములుంటాయని మీకు తెలుసా?  ఈ వానపాములు 12 నుంచి 15 అడుగుల లోతు వరకు సొరంగాలు చేస్తూ కింద మట్టిని పైకి తెస్తాయి.  కాబట్టే నేల సారవంతంగా వుంటుందని మీకు తెలుసా?  ప్రపంచంలో కెల్లా బలశాలి కంటే అవి బలమైనవని తెలుసా?  తన బరువు కంటే 60 రెట్లు బరువుండే రాయిని వాన పాము తేలికగా కదిలించ గలదని మీకు తెలుసా ……”

“అదే కాదు అవే లేకపోయి నట్లయితే ఆధునిక కాలంలో అద్భుతాన్ని, ఒక గొప్ప ఆవిష్కరణను కోల్పోయి వుండేవాళ్ళం .  అవే లేకపోతే  ఈ కాలపు గొప్ప శాస్త్రజ్ఞుడికి తన అద్భుత ప్రయోగాన్ని పూర్తి చేసే అవకాశాన్ని నేను కల్పించలేక పోయేవాడిని .”

అబ్బో, అబ్బో ఇలాంటి సాహసాలు, ‘ఘనదా’ చాలా చేసేడు.  ఘనదా అసలు పేరు ఘనశ్యామ్ దాస్.  బక్క పలచగా, సన్నగా వుండే ‘ఘనదా’

వయస్సు 35 నుంచి 55 మధ్యలో ఎంతైనా వుండచ్చు.  గత 200 సంవత్సరాల్లో ఈ భూగోళంలో ఇతను వెళ్ళని ప్రదేశం లేదు.  పాలు పంచుకోని ఘటన లేదు.  జేబులో డబ్బుల్లేక ఓ ఇరుకు సందులో వుండే కుర్రాళ్ళతో కలసి వుంటాడు. ఆ కుర్రాళ్ళు ఇతని సాహస గాథలు నోరు వెళ్ళ బెట్టుకు వింటూ వుంటారు.  కొత్త, కొత్త కథల కోసం వాళ్ళు అతన్ని రెచ్చగొడుతూ వుంటారు.  ప్రేమేంద్ర మిత్ర రాసిన “అడ్వంచర్స్ ఆఫ్ ఘనదా”కి తెలుగు రూపం “ఘనదా సాహసాలు.”   నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నెహ్రూ బాల పుస్తకాలయం సిరీస్ కింద దీన్ని తీసుకొచ్చారు.  సుబీర్ రాయ్ బొమ్మలతో, కె. సురేష్ తెలుగుతో ఈ పుస్తకం మన ముందు కొచ్చింది.

బెంగాలీ సాహిత్య వృక్షానికి అనేక కొమ్మలు, ప్రతి కొమ్మా రంగురంగుల పూలతో, మత్తెక్కించే వాసనల్ని పంచుతుంది.  అలాంటి ఓ బలమైన కొమ్మే ప్రేమేంద్ర .  సినిమాలతో సహా అన్ని ప్రక్రియల్ని అవపోసన పట్టాడు.  ఇతను జీవించిన కాలంలో (1904 – 1988) అనేక మంది సాహితీ శిఖరాలు వున్నా ప్రేమేంద్ర తన కంటూ ఒక శైలి, ఒక గొంతు, ఒక ఐడెంటిటీ తయారు చేసుకొన్నాడు.  ప్రేమేంద్ర సృష్టించిన “ఘనదా” పాత్ర

సమకాలీన బెంగాలీ సాహిత్యం లో వచ్చిన  డిటెక్టివ్ పాత్రల  కన్నా విభిన్న మైనదే కాకుండా మనం వూహించలేని వాతావరణంలో సైంటిఫిక్ టెంపర్ మెంటుతో, చక్కటి లాజిక్ తో నడుస్తుంది.  “ఘనదా సాహసాలు”  మొత్తం 13 కథలు.  ఒక్కో కథా ఒక్కో రకంగా వుంటుంది. ఎక్కడా ఒక్క స్త్రీ పాత్ర వాసన కూడా లేని సాహసాలు యివన్నీ.  చదవాల్సిందే.  చెప్పి లాభం లేదు.

ఈ పుస్తకంలో కథ లేవీ ఇండియాలో కాదు కదా, మన లాంటి మానవమాత్రులకు తెల్సిన ప్రదేశాల్లో జరగవు.  ఇక్కడ ఘనదా వూహకి, జాగ్రఫీ పరిజ్ఞానానికి  మనం జోహార్లు చెప్పాలి.  ఎందుకంటే తను చెప్పే సాహసాని కనుకూలమైన, దీటైన స్థలం వుండాలి.  వుదాహరణకి ‘ దోమ’ కథ సఖలం దీవి లో జరుగుతుంది.  అది జపాన్ కి దక్షిణాన వుంది.  అది వుత్తరం నుంచి దక్షిణానికి ఓ రంపంలా వుంటుంది.  దక్షిణ భాగం జపానుకి చెందితే, వుత్తర భాగం రష్యాకి చెందుతుంది.  ఆరు నెలలు కుండపోత వర్షాలైతే, ఆరు నెలలు చలికి గడ్డకట్టుకుని వుండే భయంకర దీవి.  తీవ్ర మంచు తుఫానులు అక్కడ సాధారణం. ఇంకో కథ న్యూ హెబ్రైడ్స్ అనే చిన్న దీవుల సమూహం లో జరుగుతుంది.  న్యూజిలాండ్ కి వుత్తరాన, ఆస్ట్రేలియాకి ఆగ్నేయ దిశలో వున్నాయి.  ఆకాశం నుంచి చూస్తే ‘Y’ ఆకారంలో పరచిన చిన్న రాళ్ళ మాదిరి కనపడతాయి.  ‘Y’ లో మూడు గీతలు కలిసే చోట వాటి రాజధాని, ఎఫేట్ వుంది.  రాజధాని ఒకటే కాని పాలకులు యిద్దరు.  ఇంగ్లీష్, ఫ్రెంచ్ కలసి దీన్ని పాలించేవి.  మరో కథ దక్షిణ అమెరికా కి వాయవ్యమూలన ఈక్విడార్ కి పశ్చిమంగా 600 మైళ్ళ దూరంలో వున్న గలపాగోస్, నార్ బరో దీవుల్లో జరుగుతుంది.  గలపాగోస్ లో ఆల్బెమార్ల లేదా ఇసాబెలా అన్నిటికంటే పెద్ద ద్వీపం.  ఇది ‘J’ ఆకారంలో వుంటుంది.  దీని కొస మీద ఓ చుక్క మాదిరి ద్వీపమే నార్ బరో లేదా ఫెర్నాండినా.  ఇక్కడ మొదలైన కథ మరెక్కడో తేలుతుంది.  ఇలా ఒక కథలో వున్న ప్రదేశం యింకో దాంట్లో వుండదు.  ఆ ప్రదేశాలు మన వూహకి కూడా అందవు.  అందుకే ఈ కథలు చాలా ఆశక్తిని కలిగిస్తాయి.

ఈ కథల్లో అభూత కల్పనలుండవు.  చక్కటి శాస్త్రీయ విశ్లేషణతో, చిన్న పాటి సైన్స్ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వుంటాయి.  సైన్స్ అవగాహన లేని వాళ్ళ కు కూడా అర్ధమయ్యేలా వుంటాయి.  ఒక కథ లో ఓ యూదు తీవ్రవాది, వాళ్ళ జాతిని హింసించిన జాతుల్ని రూపుమాపడం  కోసం సిస్టోసర్కా గ్రెగీరియా అనే ఓ మిడత జాతి పురుగుని వాటి ఎదుగుదలకి అనువైన ఓ మారు మూల ఆఫ్రికా అడవుల్లో పెంచుతాడు.  అవి వేల మైళ్ళు ప్రయాణం చేసి పచ్చగా కనిపించే దేన్నైనా సర్వ నాశనం చేయగలవు.  ఘనదా వాటి మధ్య ఓ వైరస్ వున్న మిడతని ప్రవేశ పెడతాడు.  ప్రపంచాన్ని కాపాడతాడు.  ఈ వింతని చదివి ఆనందించ వలసిందే.  ఇది మీకు ఆశక్తి కలిగించడానికి ఇచ్చిన చిన్న వుదాహరణ మాత్రమే. పదమూడు కథల్లో ఓ దాన్ని మించిన వింత మరొకటి వుంటుంది.

ఈ పుస్తకం అప్పుడప్పుడే పరిణితి చెందుతున్న పిల్లల్ని వుద్దేశించింది.  అయితే, యిలాంటి పుస్తకాల్ని ప్రచురించే  నేషనల్ బుక్ ట్రష్ట్ గాని, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు గాని   ఎగ్జిబిషన్ లో  కేటలాగులు పంచి పెట్టడం తప్పితే,  ఈ పుస్తకాల గురించిన చర్చ గాని, మారు మూల గ్రామాలకి వీటిని తీసుకెళ్ళే ప్రయత్నమే  చేయటం లేదు.  చదవ వలసిన వాళ్ళకి పుస్తకాలు చేరనప్పుడు వాటి ప్రయోజనం ఎలా నెరవేరుతుంది.  సిటీల్లో నెట్ లు , e బుక్స్ లాంటివి  అందుబాటులో వుంటాయి.  మరి గ్రామాల సంగతి ఏంటి?  సరే యివన్నీ పక్కన పెడితే  ఈ పుస్తకం ముఖ్యంగా మనకి ఓ విషయాన్ని రుజువు చేస్తోంది.  పిల్లల కథ లంటే ఒంటి కన్ను రాకాసి, నేపాల మాంత్రికుడు, భూతాలు, అభూత కల్పనలు కానక్కర లేదు.  బుద్ధిని, తర్కాన్ని పెంచే యిలాంటి రచనలు కావాలి.  అవి  శాస్త్రీయం గా ఆలోచించేందుకు వుపయోగపడతాయి.  పిల్లలు సరే, హేతు బద్ధతిని కోల్పోతున్న యిప్పటి యువకులు కూడా యిలాంటివి చదివితే సమాజానికి ఎంతో కొంత మంచిది.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ముస్లిం జీవితంపై నవల రాయాలని వుంది: ఖదీర్

 

 

కృష్ణ మోహన్ బాబు 

 

సెప్టెంబర్  6 , ఆదివారం సాయంత్రం జరిగిన’ ఛాయా’ సంస్థ నాలుగో సమావేశం విశేషాలు ఇవీ. 

“పరిచయం అక్కరలేని కథకుడు, ప్రతీ వారం మెట్రో కథలతో మనకి కనిపిస్తున్న కథకుడు, ప్రత్యక్షంగా తన కథని మనకి వినిపించడానికి వచ్చిన కథకుడు, మహమ్మద్ ఖదీర్ బాబుని తన కథ వినిపించాడానికి వేదిక మీదికి పిలుస్తున్నాం”

అన్న అనిల్ బత్తుల పిలిపుతో ఖదీర్ మైక్ అందుకున్నాడు.

“ గత 20 యేళ్లలో నేను యెప్పుడూ వేదికల మీద మాట్లాడలేదు. ఈ సంస్థ సభ్యులు మిత్రులు, సన్నిహితులు కావడంతో, పరోక్షంగా నేనూ ఈ సంస్థలో భాగమేగా అనుకోవడం చేత ‘పెన్సిల్ బాక్స్’ అనే నా కొత్త కథని వినిపిద్దామనుకొన్నా.  వూహించని కారణాల వల్ల ఆ కథ మెరుగులు దిద్దడం పూర్తి కాలేదు.  అందుకనే కథకుడుగా నా ప్రయాణాన్ని మీకు చెప్పదలుచుకున్నాను.  ‘పెన్సిల్ బాక్స్’ కథ యెప్పుడు పూర్తి అయితే అప్పుడు “ఛాయా” కే ఇస్తాను.  వాళ్ళు దాన్ని యెలాగైనా వాడుకోవచ్చు” అంటూ ఖదీర్ తన కథ చెప్పడం మొదలు  పెట్టాడు.

“నా చిన్నప్పుడు యెప్పుడూ నేను యేదో కోల్పోయినట్లుండే వాడిని.  మా నాన్న ఎలెక్ట్రీషియన్. 7 వ తరగతి దాకా చదువుకున్నాడు.  యెంతో ఒద్దికైన పనిమంతుడు.  నాన్నకి కోపం చాలా యెక్కువ.  అందుకే అమ్మ యెప్పుడూ యేదో తెలియని కంగారులో  వుండేది.  నాకు ఇంట్లో వుండాలనిపించేది కాదు.  మా చుట్టుపక్కల వున్న వైశ్యుల  ఇళ్ళకి వెళ్ళి, “చందమామ” లో  కథలు చదువుతూ వుండేవాడిని.  నాకూ అలా కథలు రాయాలనిపించేది.  10 వ తరగతిలో  వుండగా ఆంజనేయ నాయుడుగారు అనే మాస్టారు వీరపల్లె వీణా వాణి పేరుతో రచనలు చేస్తూవుండేవారు.  రాయాలంటే కలం పేరు వుండాలని చెప్పి, నాకు ‘అగ్ని మిత్ర’ అనే మారు పేరు తగిలించారు.  ఆ పేరు మీద రాసిన ఒక కథ పత్రికలో  అచ్చు అయి 150 రూపాయల పారితోషికం కూడా కలం పేరు మీదే వచ్చింది.

ఆ తర్వాత యెన్ని కథలు పంపినా తిరుగుటపాలో వచ్చేవి .  కథలు పంపడానికి స్టాంపులకి కూడా డబ్బు లేకపోతే, వాళ్ళనీ వీళ్ళనీ మెప్పించి తీసుకొనేవాడిని.  పత్రికలలో పనిచేస్తేనే కథలు పడతాయని గట్టిగా నమ్మి, డిగ్రీ అయిన వెంటనే ‘ఈనాడు’ లో  జేరా.  అలాయినా ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో ఒక్క కథైనా అచ్చుకాలే.  అది వదిలేసి ‘ఆంధ్ర జ్యోతి’ తిరుపతి యెడిషన్ లో  జేరా.  నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, జి. ఆర్. మహర్షి, మేర్లపాక మురళి, యిలా సీనియర్ రచయితలు అందరూ అక్కడ వుండేవారు.  ‘పుష్ప గుచ్ఛం’ పేరుతో ఒక కథ అచ్చైనది కాని, అంతకు మించి బండి ముందుకు వెళ్లలేదు.  ఏదో సాహిత్య వ్యాసంలో నా పేరు కూడా వుందని సీనియర్లు ఏడిపించారు కూడా.  కానీ ఏదో రోజు నా రచనల మీద చర్చ వుంటుందని ఆ రోజు గట్టిగా అనుకున్నాను.  నేను హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చా.  అప్పుడే నాన్న పోయాడు.  నాన్న కష్టపడి కూడా బెట్టిన 25,000/- అమ్మ పక్షవాతం కోసం ఖర్చై పోయింది.  అయిన అమ్మకి పూర్తిగా నయం కాలేదు.  పిల్లలు ఇంకా చేతికంది రాలేదు, రాబోయే  రోజులెలాగో అనే బెంగ తో, దిగులు తో పోయాడు.

khadeer bookనాన్న చావు నా మీద చాలా ప్రభావం చూపించింది.  నేను చెప్పవలసిందేమిటో, రాయవలసినదేమిటో  స్పష్టంగా తెల్సింది.  నే పెరుగుతూ చూసిన పేద ముస్లిం కుటుంబాల గురించే చెప్పాలని తీర్మానించుకున్నాను.  అప్పుడు రాసిన కథలే ‘దావతు, జమీను.’  ఆ సమయంలోనే  నామిని ‘ఆంధ్ర జ్యోతి’ హైదరాబాద్ కు వచ్చాడు.   ‘దర్గా మిట్ట ‘ కథలు రాస్తావా అని అడిగాడు.  రాస్తాను అని చెప్పా.  ఏమి రాస్తావు అని ఆయన అడగలేదు, ఎలా రాస్తానూ అని నే చెప్పలేదు.  నా మీద నమ్మకంతో ప్రకటన యిచ్చేశాడు.  వారం వారం రాయాలి.  రాశాను. ఆ తర్వాత తిరిగి చూసుకున్నది లేదు.  హైదరాబాద్ లో ‘ అనంతు’ లాంటి మిత్రుల నుంచి చాలా నేర్చుకున్నాను.

కథా వస్తువు విషయం లో  కూడా నా లో చాలా మార్పులు వచ్చాయి.  నేను దగ్గర నుంచి చూస్తున్న ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు, సిటీ బతుకులు నా ‘బియాండ్ కాఫి, మెట్రో కథలకి’ ఆలంబన అయ్యాయి.  ఇన్నేళ్లు పత్రికలలో పనిచేసిన అనుభవం నా రచనలకి బ్రీవిటీ నిచ్చింది.  అందుకనే ‘మెట్రో కథలలో’ పాత్రలకి పేర్లు వుండవు.  అతడు, ఆమె అని కూడా వుండవు.  అయినా పాఠకులు కనెక్ట్ అవుతున్నారు.  ‘సెల్ఫీ, షి’ లాంటి కథలు ఎలాంటి చర్చను రేకెత్తిస్తున్నాయో మీకు తెల్సు. కథ రాయడానికి క్రాఫ్ట్ చాలా అవసరం.  వుదాహరణకి’ ఆవిడ పిల్లలకి బ్రెడ్ మీద జామ్ రాసింది’ అనటం కన్నా’ న్యూటెల్లా రాసింది’ అంటే పాఠకుడు వెంటనే కనెక్ట్ అవుతాడు.  అదే క్రాఫ్ట్.   అయితే ‘దర్గా మిట్ట’ కథలు మళ్ళీ ఇప్పుడు రాయమంటే రాయలేను. నాన్నకి హిందీ పాటలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం.  వాటి గురించి మాకు ఎప్పుడూ చెప్తూవుండేవాడు.  ఆ బాగ్రౌండ్ నుంచి వచ్చినవే ‘మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాస్సిక్స్ .’  నాకు ఒక నవల రాయాలని వుంది ముస్లిం జీవితాలను గురించి.  రాస్తాను” అంటూ ముగించాడు.

ఆ తర్వాత ఖదీర్ తనకు బాగా నచ్చిన కథ, ‘ వహీద్,’ మరో చిన్న కథ చదివి, కొందరు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి,  తన కథ ముగించాడు.

*

ఓ అపురూపమైన కానుక: హౌస్ సర్జన్                         

 

కృష్ణ మోహన్  బాబు

mohanbabu“ మెడిసిన్ ఓ మహా సముద్రం.  లోతు తెలియని, అవతలి ఒడ్డు తెలియని ఒక మహా సముద్రం.  దాని లోతు పాతులు తెలుసుకోకుండా బయట నిలబడి చూస్తే, అందులో ఈదటం చాలా తేలికనిపిస్తుంది.  లోనికి దిగామా ?  ఆ ఆరాటానికి అవధుల్లేవు.  విజ్ఞానం మీద తృష్ణే గాని, తృప్తి అనేది లేదు.

మెడిసిన్ ! మెడిసిన్ !! మెడిసిన్ !!!  అవే నా కలలు.  అదే నా ఆశా జ్యోతి.  అదే నా జీవిత పరమావధి. “

డా. ఎస్. మధుకర రావు, అప్పుడే చదువు పూర్తి చేసుకుని, హౌస్ సర్జన్సీ లో చేరిన కుర్రాడు.  సామాన్య కుటుంబం, తండ్రి లేకపోతే తల్లే వున్న ఆస్తి అమ్మి డాక్టరు చదివించింది.  ఓ చిరునవ్వుతో చుట్టు పక్కల అందర్నీ ఆకట్టు కోగలిగిన ఈ కుర్రాడి హౌస్ సర్జన్సీ అనుభవాలే డా. కొమ్మూరి వేణుగోపాల రావు గారు రాసిన “హౌస్ సర్జన్.”  ఇదొక మెడికల్ డైరీ .

ఆర్దర్ హైలీ అనే బ్రిటిష్ కెనడియన్ రచయిత 1965 ప్రాంతాల్లో “హోటల్ “  లాంటి ఇన్వెష్టిగేషన్ రచనలు చేస్తున్న సమయంలో వచ్చిన పుస్తకం ఇది.  ఈ తరహా రచన తెలుగులో ఇదే మొదటిది.  ఈ నవల అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడింది .  అప్పట్లో చాలా మందిలో ఈ పుస్తకం డాక్టర్ కావటానికి ప్రేరణ అయిందని చెప్తారు.  ఇంకో విషయం యేమిటంటే, హైలీ రాసినా, ఆ తర్వాత తెలుగు లో మరి కొంత మంది రచయితలు రాసినా, ఇన్వెష్టిగేషన్ రచనల కోసం ఒక వస్తువుకి సంబంధించిన కథలు ఎత్తుకోవటం, దానిలో అనేక మలుపులు తిప్పుతూ తాము చెప్పదలుచుకున్న సవివరణలని అందులో యిమిడ్చారే గాని ఏ విధమైన వంకర, టింకరాలూ లేకుండా, వైద్యం లోని ప్రతి విభాగాన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ, దాని మీద ఏ మాత్రం ఆశక్తి తగ్గకుండా, ఎత్తిన పుస్తకాన్ని దించకుండా చదివించే నవల ఇది.  చాలా మంది వేణుగోపాల రావుగారి మొదటి నవల “ పెంకుటిల్లు” గొప్ప రచన అని మెచ్చుకుంటారు.  అయితే అలాంటి నవలల్ని, అతని సమకాలీకులు ఆ తర్వాత కూడా చాలా మంది  రాశారు.  కాని,
“హౌస్ సర్జన్” లాంటి నవల ఎవరూ ఇప్పటికీ రాయలేదు.

నవలలోకి తీసుకెళ్ళటం కొంచెం కష్టమైన పని.  ఎందుకంటే, కథ అంటూ ఏమీ లేదు.  మెడికల్ హౌస్ సర్జన్సీ చేసేప్పుడు మెడికల్ వార్డులు, పీడియాట్రిక్స్ , ఇ.ఎన్.టి , చెస్టు డిపార్టుమెంట్లలో పోస్టింగ్సు వుంటాయి.  సర్జికల్ హౌస్ సర్జన్సీ టైములో అన్ని సర్జికల్ వార్డులు, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీలలో పోస్టింగ్సు వుంటాయి.  ఇవి కాక గైనిక్, కాజువాల్టీలలో పోస్టింగ్సు వేరే వుంటాయి.  డా. మధు హౌస్ సర్జన్సీ ప్రయాణం మెడికల్ వార్డు, ఔట్ పేషంట్లతో ప్రారంభమై , తర్వాత సర్జికల్ పోస్టింగ్ , ఆ తర్వాత గై నిక్ , ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ నుంచి స్పెషల్ పోస్టింగ్ లోకి వచ్చి, కాజువాల్టీ, దాన్నుంచి రేడియాలజీ లతో హౌస్ సర్జన్సీ పూర్తి చేసి, టైఫాయిడ్ తో సిక్ అయి, స్టూడెంట్ సిక్ రూములో రోగిగా చేరి, ఆ అనుభవం కూడా కూడగట్టుకొని, పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు.  ఒక్కొక్క విభాగంలో చూసిన రోగాలు, వాటి ట్రీట్ మెంట్, రోగులు, వాళ్ళ మనస్తత్వాలు, ఎమర్జన్సీలు, అసిస్టెంట్లు, డాక్టర్లు, నర్సులు, చీఫ్ లు అలా ప్రతీ అంశాన్ని తడుముకుంటూ నడుస్తుంది ఈ యాత్ర.

2213_front_cover

ఓ మంచి డాక్టరుకి సహనం, సమయస్ఫూర్తి, ధైర్యం, అంతకుమించి మానవత్వం చాలా అవసరం.  మెడిసిన్ మీద శ్రధ్ధా శక్తులున్న ఎవరికైనా హౌస్ సర్జన్సీ పీరియడ్ మహత్తర దశ అని నమ్మిన డా. మధు తనకెదురైన ఎన్నో అనుభవాల్ని మనతో పంచు కుంటాడు.  సెలైన్ ఎక్కించడానికి వెయిన్ దొరక్కపోతే మొదటిసారి ‘ఓపెన్ మెథడ్ ‘ లో చర్మం కోసి రక్తనాళం బయటికి తీసి ఎక్కించటంతో డాక్టరుగా సాహసం మొదలవుతుంది.  మరో రోజు డిఫ్తీరియాతో వచ్చి ఊపిరాడక విల విల లాడుతున్న ఓ మూడేళ్ళ కుర్రాడికి, వైద్యం చేయవలసి వస్తుంది.  ఆన్టీ  డిఫ్తీరిక్ సీరం ఇచ్చి ఇ.ఎన్.టి. సర్జనుకి కబురు పెడ్తాడు.  గంట లోపల ట్రెకియాటమీ చేయక పోతే పిల్లాడు బతకడు.  ఇ.ఎన్.టి. డాక్టరు డ్యూటీ అయిపోయి ఏదో సినిమాకి వెళ్తాడు.  ఏం చేయాలి?  విద్యార్థి గా వుండగా ఒకటి, రెండు సార్లు చూసిన జ్ఞాపకంతో తప్పని పరిస్థితులలో ఆపరేషన్ కి సిధ్ధ పడ్తాడు డా. మధు.  చెయ్యక పోతే పిల్లాడు బతకడు.  సరిగా  చెయ్యక పోయినా బతకడు.  ప్రాణం కాపాడటం కోసం సాహసం చేసి నెగ్గుతాడు.  డా. మధు ఎదుర్కొన్న యిలాంటి ఎన్నో అనుభవాలని రచయిత మనల్ని దగ్గరకు తీసుకెళ్ళి, చూపించి విడమరచి మరీ చెప్తాడు.  అదీ ఇన్వెష్టుగేషన్ రైటింగ్ అంటే. మనల్ని కూడా యిందులో లోతుగా మునిగి పోయేలా చేయటం రచయిత సాధించిన విజయం.

ఓ రోజు అంబిలికల్ హెర్నియాతో ఓ రోగి వస్తాడు.  ఆలస్యం చేసి పీకల మీదకు తెచ్చుకుంటాడు.  రోగికి చావు బతుకుల సమస్య.  ఆపరేషన్ చేయడానికి మంచి కేస్ దొరికిందని డా. మధు సంతోషిస్తూ, “ఒక రకంగా వైద్య వృత్తి అతిక్రూరమైనది.  హార్టు కేసు చూసిన ఫిజీషియన్, ‘ఆహా వినండి, వినండి మర్మర్  ఎంత బ్యూటీఫుల్ గా వినిపిస్తోందో ‘ అంటాడు.  ఈ వృత్తిలో ఎంత దారుణం  దాగి వుంది” అని స్వగతంగా అనుకుంటాడు.  ఇది వైద్య వృత్తిలోని మరో కోణం.

డా. మధు తో పాటు వచ్చే పోయే పాత్రలు, చీఫ్, డా. రంగనాధం, డా. కామేశ్వరి, హాస్పిటల్ సూపరింటెండెంట్, డా.దయానంద రాజు, మెడికల్ అసిస్టెంట్స్, డా.నాయుడు, డా. రామదాసు మొదలైన వాళ్ళంతా ఒకటి, రెండు పేరాల పరిచయమే అయినా పుస్తకం మూశాక మనల్ని వదలరు.  తోటి డా.మృదుల ప్రేమ, నర్సు నళినీ ఆరాథన ఈ మెడికల్ డైరీ కి కాస్త తడిని కలిగించి ఈ రచనని నవలగా మారుస్తాయి.  డాక్టరుకి  నర్సుకీ వుండే చిత్రమైన రిలేషన్, పరిధులు దాటే కొంతమంది నర్సులు, వాళ్ళతో తిరిగే డాక్టర్లు, రకరకాల మనస్తత్వాల రోగులు, హాస్పటల్ని నడిపే నియమ నిబంధనలు, ఇవన్నీ మరో ప్రపంచం.  ఈ ప్రపంచంలోని ప్రతి మూలకీ తీసుకెళ్తుందీ రచన.

ఇవన్నీ పాత జ్ఞాపకాలు.  హాస్పిటల్ అంటే ప్రభుత్వాసుపత్రి మాత్రమే అనుకొనే రోజులు.  ఇప్పుడు అన్నీ మారి పోయాయి.  వైద్యం కార్పొరేట్ పరం అయింది.  వేల ల్లో , లక్షల్లో ఖర్చు.  వుచితం వూహకందని విషయం.   ఫ్యామిలీ డాక్టర్లు మాయమయి, అవయవానికో డాక్టరు వచ్చాడు.  కనీసం రక్త పరీక్ష లేకుండా ఫ్లూ జ్వరానికి కూడా మందు రాయలేని కాలం.  మున్నాభాయిలు ‘వ్యాపమ్’ లో డిగ్రీలు కొనుకుంటున్నది నిజం.  వైద్యం లోను అనేక మారులు వచ్చాయి.  కొత్త కొత్త రోగాలు వచ్చాయి.  వాటికి కొత్త కొత్త మందులూ వచ్చాయి.  అవయవాలు తీసి అమర్చటం అవలీల గా జరుగుతోంది.  చెడు ఎక్కువగా కనబుడుతున్నా, మంచి కూడా చాలా వుంది.  ఎందుకంటే మనుషుల్లో భావోద్వేగాల్ని ఎవరూ తీసేయ లేరు.  ఆపరేషన్ ఫెయిలు అయితే ఆందోళన పడే డాక్టర్లు ఎప్పటికీ వుంటారు.  అందుకే ఈ నాటి విషయాలతో ఎవరైనా మళ్ళీ యిలాంటి రచనకు ప్రయత్నించ గలిగితే అది కొమ్మూరి వేణుగోపాల రావుగారి కిచ్చే అధ్భు తమైన నివాళి అవుతుంది.

*