శారద ఇప్పటికీ కావాలి!

కవిని ఆలూరి
 శారద తమిళుడు అయినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని ఉన్నతీకరించారు . నటరాజన్ “శారద ” అన్న కలం పేరుతో రచించటానికి కారణం రచనలు ప్రచురించక పోవటం వలన అని చెప్పుకునేవారు . అది సరికాదు . నటరాజన్ ‘గంధర్వుడు’,’ శక్తి’ లాంటి కలం పేర్లతో రచనలు చేసేవారు  . ఐతే ,ఆ పేర్లేవి ప్రసిద్ధి లోకి రాలేదు .సహజంగానే సౌందర్యోపాసి అయిన నటరాజన్ “శారద “అనే మూడక్షరాల స్త్రీ నామాన్ని ఎంతో ఇష్టంగా కలం పేరుగా పెట్టుకున్నారు. 
                                                      ఆనాటి మానవ సంబంధాలు చాలా దగ్గరగా ఉండేవి . ఆలూరి భుజంగరావు ,శారద లాంటి వాళ్ళ జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది. ముక్కామల మల్లిఖార్జున రావు గారు “శారద”ను కధలు రాయటానికి ప్రోత్సహించటము తో పాటుగా ఆర్ధిక సహకారాన్నీ చేసేవారు. ప్రకాశరావు ,అబ్బరాజు నాగభూషణం,నేతి పరమేశ్వర శర్మ లాంటి మిత్రులు “శారద”ను ఎంతో ప్రోత్సహించారు. గొన్నా బత్తుల వెంకటేశ్వర రావు లాంటి మిత్రులతో కలిసి అన్నదాన సమాజాలను నడిపిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తెనాలి వాతావరణమన్నా,అక్కడి మిత్రులన్నా శారద కు ప్రాణం .
                                             రోజుకు 12,13 గంటలు హోటల్లో చాకిరీ చేస్తూ సాహిత్య అధ్యయనం,రచనలు సాగించేవారు. శారద తాను చదువుతూ,రాస్తూ మిత్రుల చేత చదివించే వారు,రాయించే వారు.తెలుగు మాత్రుభాష కాక పోవటం వలన తెలుగు నేర్చుకోవటానికి ఎంతో శ్రమ పడ్డారు . తెలుగు సాహిత్యం లోని చలం ,కుటుంబరావులతో సహా ఆనాటి రచయితల ఉత్తమ  గ్రంధాలను  అధ్యయనం చేసేవారు.శారద 100 కధలను , 6 దాకా నవలలూ రాశారు. ఆనాటి హోటల్ వృత్తి అవగుణాలకు నిలయం గా ఉండేది. అత్యంత  కల్మషమైన వాతావరణంలో పని వాళ్ళు బతుకుతూ ఉండేవారు .అంతటి కల్మషంలో బతుకుతూ సాహిత్యాన్ని చదవాలన్న ఊహ, కధలు రాయాలన్న ఊహ తనకు కలగటమే కాకుండా అలాంటి ఊహలను తన మితృలకు కూడా కలిగించేవారు  శారద . తన మంచి అలవాట్లను మాత్రమే  స్నేహితులకు పంచేవారు. మితృలతో కలిసి అభ్యుదయ భావాలతో “ప్రజావాణి “అన్న రాత పత్రిక నొక దాన్ని నడిపారు.
sarada1
                                               ఆనాటి వాళ్ళ గొప్ప స్నేహానికి ఉదాహరణగా రెండు విషయాలను ఇక్కడ చెప్పుకుందాం! ఇంట్లో పస్తుల బాధ పడలేక తన మిత్రుడైన మల్లిఖార్జున రావు గారు కొత్తగా  కొనుక్కున్న ఇంగ్లీష్ పుస్తకాలను పాత పుస్తకాల వాళ్లకు అమ్మేశారు శారద .ఆ తర్వాత మల్లిఖార్జున రావు గారికి కనపడకుండా తిరుగుతూ ఉన్నారట శారద.ఒక రోజు మల్లిఖార్జున రావు గారు ఎదురుపడి “నువ్వు చేసిన పని నాకు తెలుసు. ఈ మాత్రానికే ఇంత బాధపడుతున్నావు?అవి అమ్మినందుకు నేనేమీ అనుకోను.నాలుగు రోజుల పాటు నీ కుటుంబం గడిచింది అంతే చాలు!మనం ఇప్పుడే వెళ్ళి వాటిని మళ్ళి కొని తెచ్చుకుందాము .”అని శారద తో అన్నారట .
అలాగే ఒకసారి స్థానం నరసింహారావు గారి అధ్యక్షత వహించిన సభలో తాను రాసిన ఒక వ్యాసాన్ని చదవమని భుజంగరావు గారికి ఇచ్చారట శారద . భుజంగరావు గారు కూడా చదువుతానని శారదకు ధైర్యాన్ని ఇచ్చారట. వ్యాసాన్ని చదవలేక మైకు పట్టుకుని వణుకుతున్న భుజంగరావు గారిని చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట . వాళ్ళను ఉద్దేశించి “నన్ను చూసి నవ్వనవసరం లేదు . ఇక్కడకు వచ్చి చదవటానికి నిలబడితే మీరూ ఇలాగే వణుకుతారు . “అతి కష్టం మీద అనేసి వేదిక నుండి దిగిపోయారుట. రత్నా టాకీసు దగ్గర టీ కొట్టు ముందు నుంచున్న శారద “నువ్వలా వణికి పోతూ ఉంటే చూడలేక ఇక్కడకు వచ్చి నిలబడ్డానురా “. అని అన్నారుట.
sarada
                                           పత్రికలలో ధారాళంగా శారద సాహిత్యం ప్రచురితమవుతున్న రోజులవి.  హోటలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు శారద కధ గురించి “రచయిత చాలా అద్భుతంగా రాశారని”చెప్పుకుంటుంటే విన్న శారద “ఆ కధ నేనే రాశానని “వాళ్ళతో అన్నారుట . వాళ్ళు శారదను ఎగాదిగా చూసి వెళ్ళి పోయారుట . ఈ విషయం మితృలకు చెప్తూ పక పకా నవ్వేవారట శారద . శారద అజాత శత్రువు . ఆయన జీవితంలో ఎవరినీ ద్వేషిస్తూ మాట్లాడిన సందర్భాలు లేవు.
                                       శారద కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు . ఆయన వితంతువును వివాహమాడాలనుకున్నారట. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకు వెళ్ళారట.ఈ విషయాన్ని వాళ్ళు అంతగా పరిగణన లోకి తీసుకోక పోయినా శారద మాత్రం తాను చెప్పినట్లుగానే మలయాళీ వితంతువును వివాహమాడారుట.అంతే కాకుండా  అభ్యుదయ రచయితల సంఘం 5వ మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు రచయితల పారితోషకానికి సంబంధించిన ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశ పెట్టారుట .కానీ  శారద దృష్టిలో డబ్బు తక్షణ అవసరాలకే పరిమితం .
                                     శారద తాను బాధలు పడుతూ , తన తోటి వారి బాధలను, గాధలను పరిశీలించేవారు . పత్రికలలో వచ్చే వార్తలను కూడా కధా వస్తువులుగా స్వీకరించేవారు . మట్టి మనుషుల మురికి జీవితాలను తెలుగులో అక్షర బద్దం చేసారు . శారద తుఫాను వేగంతో సాహిత్యంలోకి వచ్చి అంతే వేగంతో జీవితం నుండి నిష్క్రమించారు . ఆ కొద్ది కాలం లోనే అనంతం గా రాయాలన్న తృష్ణ ఆయనను క్రూరంగా వెంటాడింది .
                                ఒక ప్రవాహంలాగా శారద రచనలు ప్రచురిత మవుతున్న సమయంలో శారద కళాయి పెట్టుకుని బజ్జీలు ,గారెలు అమ్ముతుండే వారట . అంతేకాకుండా వేసవి కాలంలో బస్ స్టాండ్ లో ప్రయాణికులకు మజ్జిగ అమ్ముతుండేవారట .ఈ విషయాలను మాతో పంచుకుంటూ నాన్నగారు (ఆలూరి భుజంగరావు గారు) మాతో  “ఇంతటి ఉన్నత సాహిత్యాన్ని ఇచ్చిన వాడికి ఆంధ్ర దేశం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు నాయనా !”అని అనేవారు .
                              నాన్నగారు మరణించటానికి కొన్ని రోజుల  ముందు తన డైరీ లో-   “సాహిత్య బాటసారి -శారద” లో- ఇలా రాసుకున్నారు “శారద భౌతిక జీవిత బంధనాలను తెగదెంపులు చేసుకుని కేవలం అక్షర జీవిగా మాత్రమే మనకు మిగిలి పోయిన రోజు ఆగస్టు పదిహేడు.!
                                                                                                                                                             *
కవిని ఆలూరి

కవిని ఆలూరి