-ఓల్గా
~
(గత సంచికలు తరువాయి)
“మీరిద్దరూ కలిసి ఆ నిర్ణయానికొచ్చారా?
“ఊ-” అంది
నేను అబార్షన్ని వ్యతిరేకం కాదు. చెయ్యటం కష్టమూ కాదు, కానీ ఒక ఆలోచన వచ్చింది. నువ్వు కొడుకునో, కూతుర్నో కంటే మీ అమ్మా నాన్నల మనసు మారుతుందేమో – అట్లా జరిగిన కేసులు చాలా చూశాను. శారద స్వరాజ్యాన్ని పరిశీలనగా చూస్తూ చెప్పింది.
“ఒద్దు పెద్దమ్మా నేను పిల్లల్ని కనటం నా కోసం, నా ఇష్టంతో జరగాలి, మా అమ్మానాన్నల కోసం కాదు. అసలు నా కోసమో, నాకు పుట్టేవాళ్ళకోసమో కాదు మా అమ్మ కులాంతర వివాహాన్ని ఒప్పకోవాల్సింది. కుల విభజన తప్పనీ, మనుషులంతా సమానమనే నమ్మకం ఉండాలి మా అమ్మకు, ఆ నమ్మకం లేకుండా ఏదో కూతురనో, మనవడనో మమ్మల్ని దగ్గరకు తీస్తే అది మాకు ఏం గౌరవం? ముఖ్యంగా సుందర్రావుకి ఎంత అవమానం?”
శారదకు స్వరాజ్యం మనసు అర్థమైంది. ఆ పిల్ల మీద ప్రేమ, అన్నపూర్ణ మీద కోపం, జాలి వీటితో కాసేపు ఏం మాట్లాడకుండా కూచుంది. స్వరాజ్యాన్ని పరీక్ష చేసి
“నాలుగో నెల సగం పడినట్లుంది. అబార్షన్ అంత మంచిది కాదు. అజ్ఞానంగా ఉన్నందుకు కనాల్సిందే – తప్పదు. నాదీ తప్పేలే – నీ పెళ్ళి అవగానే ఒక క్లాసు తీసుకోవాల్సింది. ఇద్దరూ చదువుతున్నారు గదా అని నిర్లక్ష్యం చేశాను. ఏమంటావు?” “అనేందుకేముంది – నువ్వు చెప్పాక. ఈ ఒక్కర్ని కని చెంపలేసుకుని ఆపరేషన్ చేయించుకుంటా” అంది స్వరాజ్యం చీరె సరి చేసుకుంటూ,
“గుడ్” అని రక్త పరీక్ష చేయించుకోమని పంపింది. ఈ సంగతి అన్నపూర్ణకు చెబుదామని మనసు కొట్టుకుంటోంది. కానీ స్వరాజ్యం మాటలూ తీసివేయాల్సినవి కావు.
అన్నపూర్ణ విషయంలో తనకింత ధర్మసంకటం రావాలా? జాతీయ, అంతర్జాతీయ రాజకీయ బేధాలున్న స్నేహానికి అడ్డం రానిది వ్యక్తిగత విషయంలో ఇంత గొడవ అయింది – మాటలు లేక ముఖాలు చూసుకోలేని పరిస్థితి వచ్చిందేంటి – వ్యక్తిగతం అనుకుంటున్నాం గానీ ఇది పెద్ద సామాజిక విషయం. కులం అన్నిటికంటే ముఖ్యమైన
రాజకీయ విషయమేమో – స్వరాజ్యం మాటలు రాజకీయ పరిణితి ఉంటే తప్ప మాట్లాడలేనివి –
కాంపౌండర్ వచ్చి పేషెంట్లు చాలామంది ఉన్నారని చెప్పాక ఆ ఆలోచనలు పక్కన బెట్టి పనిలో పడింది.
స్వరాజ్యం నాలుగు రోజులుండి విశాఖపట్నం వెళ్ళింది. ఆ తర్వాత వారం లోపలే అన్నపూర్ణ అబ్బయ్య వచ్చారు. ఇద్దరూ పెద్ద జబ్బు చేసిన వాళ్ళలా ఉన్నారు.
శారదను చూడగానే అన్నపూర్ణ ఏడుపు మొదలెట్టింది. శారద ఆమెను సముదాయించి వివరం కనుకుంటే – అన్నపూర్ణ తన మూర్ఖత్వానికి పశ్చాత్తాప పడుతోంది – కూతురు దగ్గరకు వెళ్ళాలనుకుంటోంది. స్వరాజ్యం రానిస్తుందా – శారద సలహా కోసం వచ్చారు.
శారద మనసులోంచి పెద్ద భారం దిగింది.
“తప్పకుండా విశాఖ వెళ్ళండి. ఐతే సరాసరి వెళ్ళి స్వరాజ్యాన్ని కావలించుకోవాలనుకోకుండా ముందు ఎక్కడైనా దిగి — సుందర్రావుని కలిసి మీ మూర్ఖత్వానికి క్షమాపణ అడిగి అతను పెద్ద మనసుతో మిమ్మల్ని క్షమిస్తే అప్పడు అతని వెంట వెళ్ళండి, ఘర్షణ జరిగింది నీకూ నీ కూతురికీ గాని అందులో మీరు అవమానించింది సుందర్రావుని. అతని కుటుంబాన్ని వాళ్ళని కావలించుకునే సంస్కారమనూ, మరొకటనూ – అది మీకుందనుకుంటేనే వెళ్ళండి. అలా కాకుండా అయితే స్వరాజ్యం మిమ్మల్ని తన ఇంటికి రానివ్వదు”.
కూతుర్నివిడిచి ఉండలేక రాజీపడుతున్నారా? కులం గురించి మీ అభిప్రాయాలు మారాయా? తేల్చుకుని వెళ్ళాల్సిన అవసరం గురించి పదే పదే శారద చెప్పాక వాళ్ళిద్దరికీ అసలు సమస్య ఎక్కడుందో అర్థమైంది.
సుందర్రావుని క్షమాపణ అడుగుతామన్నారు. విశాఖపట్నం వెళ్ళారు. అన్నపూర్ణతో స్నేహం కొనసాగే పరిస్థితి వచ్చినందుకు శారదకు చాలా తెరిపిగా ఉంది. విశాఖపట్నంలో అంతా సవ్యంగా జరగాలని మనసారా కోరుకుంది. శారద కోరుకున్నట్లే జరిగింది. సుందర్రావు పెద్ద మనసుతో అన్నపూర్ణను అబ్బయ్యను ఇంటికి తీసికెళ్ళాడు.
స్వరాజ్యం శారదకు అర్జంట్ కాల్ బుక్ చేసి మరీ తెలుసుకుంది తన గర్భం విషయం తల్లికి తెలియదని – శారద చెప్పలేదని.
మొత్తానికి ఐదారు నెలల్లో అంతా సర్దుకుని మళ్ళీ శారదా అన్నపూర్ణలు మామూలయ్యారు.
ఆ వేసవి శలవులకు బంధువుల, స్నేహితుల పిల్లలందరినీ ఒక పదిరోజులు తన ఇంట్లో చేర్చి ఆటపాటలతో ఆనందంగా ఉంచాలనీ, ఆనందంతో పాటు వాళ్ల బుర్రల్లో తగుమాత్రం రాజకీయాలు నింపాలనీ అనుకుంది శారద. నటాషా బియస్సీ పూర్తి కావొస్తోంది. బంధువుల్లో, స్నేహితుల్లో నటాషాకు పదేళ్ళు అటూ పదేళ్ళు ఇటూ ఉన్న పిల్లలు పాతికమంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ రమ్మని కబురు చేసింది. కబురు వెళ్ళటం ఆలస్యం చాలామంది వచ్చారు. నటాషా కంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువమంది రాలేదు. వాళ్ళకు పెళ్ళిళ్ళయి పోయాయి. అత్తవారిళ్ళకో, పుట్టిళ్ళకో, పురుళ్ళకో పరిమితమై పోయారు.
వచ్చిన వాళ్ళందరి చేతా రకరకాల కార్యక్రమాలు చేయాలని శారద అన్నపూర్ణ, సరస్వతి ముందుగానే ఆలోచించారు. డాన్సులు, నాటకాలు, తమకు నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడటం, పాట కచ్చేరిలు, దగ్గర తోటలకు వెళ్ళీ వంటలు చేసుకుని తినటం, ఒకటి రెండు సినిమాలు చూడటం ఇలాంటి వాటితో పాటు శారద, అన్నపూర్ణ, సరస్వతి వాళ్ళకు చరిత్ర గురించి, సంస్కరణోద్యమం గురించీ, స్వాతంత్రోద్యమం గురించి, తెలంగాణా సాయుధ పోరాటం గురించి పాఠాలు చెప్పాలని కూడా అనుకున్నారు.
స్వరాజ్యం, సరస్వతి కూతుళ్ళు మనోరమ, విద్య రెండో తరం నాయకురాళ్ళుగా బాధ్యతలు తీసుకున్నారు. స్వరాజ్యం తన కూతురిని చంకనేసుకునే ఇల్లంతా గిరగిరా తిరుగుతోంది. ఇంతలో ఎవరో ఒకరు ఆ పిల్లలను ముద్దు చేస్తూ ఎత్తుకుంటారు. ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి మారుతూ బుల్లి అరుణ కూడా సంతోషంతో కేరింతలు కొడుతోంది.
ఒక్కోరోజూ గడుస్తున్న కొద్దీ అందరికీ దిగులు పదిరోజులయితే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి గదా అని,
పగలూ, సాయంత్రాలు కోలాహలంగా గడుస్తున్నాయి. రాత్రిళ్లు శారద, అన్నపూర్ణ, సరస్వతి రాజకీయ పాఠాలాగా తమ అనుభవాలు చెబుతున్నారు. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు.
“ఎంతైనా తరానికీ, తరానికీ మధ్య అంతరం ఉంటుందోయ్ – వాళ్ళ తెలివి,
చురుకు మనకు లేదోయ్” అని శారదే అనాల్సి వచ్చింది.
“అన్నపూర్ణా, నీ కూతురు స్వరాజ్యం ఉందే అది వజ్రమే” అంది సరస్వతి. అప్పడు అనిపించింది శారదకు నటాషా మిగిలిన వాళ్ళున్నంత చురుకుగా లేదని. మామూలుగా ఉండే చురుకుదనం ఏమైపోయింది? అనుకుని మర్నాడు నటాషా మీద ఓ కన్ను వేసి ఉంచింది. తేడా స్పష్టంగా తెలుస్తోంది. పరధ్యానంగా, అనాసక్తంగా ఉంటున్నదనిపించింది. అందరితో కలిసి ఆడుతూ పాడుతూనే ఏదో ఆలోచనలో పడిపోతోంది. ఎవరన్నా పిలిస్తే ఉలిక్కిపడుతోంది. అపుడపుడూ ముఖంలోకి దిగులు వచ్చి కూచుంటోంది. రెండు రోజులు గమనించాక శారదాంబ నటాషాను ఉదయాన్నే తన గదికి పిలిపించుకుంది, నిద్రకళ్ళతో వచ్చిన నటషా కళ్ళూ ముఖమూ తుడిచి, వేడి కాఫీ అందించింది.
“నటూ చెప్పమ్మా- ఏంటోగా ఉంటున్నావు. దిగులు పడుతున్నావు దేని గురించో – నాతో చెబితే ఆ దిగులు తగ్గదా?” అని అనునయంగా తల్లి అడుగుతుంటే నటాషా కళ్ళ నుండి బొటబొటా కన్నీళ్ళు కారాయి.
శారద కూతుర్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని “పిచ్చిపిల్లా, ఏడుస్తావెందుకు. ఎవరినన్నా ప్రేమిస్తున్నావా?”
తల్లి అడిగిన ప్రశ్నకు బావురుమంది నటాషా
ఆ ఏడుపుని ఆపి విషయం రాబట్టేసరికి శారదాంబకే అలుపు వచ్చింది. శారదాంబ సందేహించింది నిజమైంది. నటాషా ప్రేమలో పడింది. ఆ కుర్రాడు ఎమ్మెస్సీ
ఈ ఏడాదే పూర్తిచేశాడు. ఉద్యోగం దొరికేలా ఉంది. వెంటనే పెళ్ళి చేసుకుందా మంటున్నాడు.
“వాళ్ళింట్లో ఒప్పకుంటారు. మనదీ వాళ్ళదీ ఒకే కులం’ అని నటాషా చెప్తుంటే శారద పేలవంగా నవ్వింది. కులం ప్రసక్తి తన ఇంట్లోకి కూడా వచ్చేసింది.
“మరి నీ చదువు? బియస్సీ తర్వాత మెడిసిన్ చదవవా?”
“లేదమ్మా – నాకింక చదవాలని లేదు – పెళ్ళీ చేసుకుని సెటిల్ అవాలని ఉంది నటాషాకి ఇప్పుడు ఉత్సాహం వచ్చింది. బరువు దిగిపోయింది.
“సరే – నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి వెళ్ళి హాయిగా అందరితో సంతోషంగా ఉండు. నేను నాన్నతో చెప్పి వాళ్ళ వాళ్ళతో మాట్లాడమంటాను.”
నటాషా రెక్కలొచ్చిన పిట్టలా తుర్రుమని అక్కడ్నించి ఎగిరిపోయింది.
శారద వెంటనే మూర్తికి ఫోన్ చేసి శనాదివారాల్లో రమ్మంటూ విషయం కూడా చెప్పింది, మూర్తి ఆశ్చర్యపడి “దానికప్పుడే పెళ్ళేంటి” అంటే శారదకు కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.
ఆ సాయంత్రం అన్నపూర్ణతో ఆ సంగతి చెప్పి దిగులుపడుతూ కూచుంది శారద.
“నా జీవిత విధానం నా కూతురికి నచ్చలేదోయ్ – కారణం నేనేననుకుంటా. నటాషా చడువుకి ఇబ్బంది కలగకూడదని నాకు దూరం చేసుకున్నాను. నా విలువలు నేర్పలేకపోయాను. ఇప్పుడు చేయగలిగింది లేదు. నటాషా తన జీవితాన్ని తనే జీవించాలి. తన ఇష్టప్రకారం జీవించాలి. డాక్టర్ అవుతుందనుకున్నా – నా ప్రాక్టీస్ తీసుకుంటుందనుకున్నా నా రాజకీయాలను ముందుకు తీసుకుపోతుందనుకున్నా పోనీ – కూతుళ్ళూ కొడుకులే మనకు వారసులనుకోకూడదు. మన ఆశయాల వారసులు ఎక్కడో పుట్టి పెరుగుతుంటారు.
అన్నపూర్ణకు చెబుతున్న ఆ మాటలు శారద తనకు తానే చెప్పకున్నట్లు ఉన్నాయి.
మూర్తి రెండు రోజుల్లో వచ్చి నటాషా నడిగి వివరాలన్నీ కనుకోని విశాఖపట్నం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాడు.
“అంతా బాగానే ఉంది గానీ వాళ్ళు పెళ్ళి శాస్త్రోక్తంగా జరగాలంటున్నారు. కన్యాదానం చెయ్యాలట”,
శారద నవ్వేసి కన్యాదానం ప్రసక్తే లేదు” అంది.
“లేదు. వాళ్ళు చాలా పట్టుగా ఉన్నారు. మనం ఏదో మార్గం ఆలోచించాలి”.
“ఏం మార్గం ఉంటుంది. నువ్వూ నేనూ పీటల మీద కూచుని నటాషాని వాళ్ళకి కన్యాదానం చేద్దామా? నా వల్ల కాదు”.
“మనం చెయ్యాలని కాదు, మన బంధువులెవరైనా ఆ పని చెయ్యొచ్చు”, “మీ లాయర్ల తెలివి తేటలే వేరేం – చిరాకు పడింది శారద.
“అంతకంటే మరో మార్గం లేదు. ఇదో తతంగం. దానికంత ప్రాముఖ్యం అనవసరం. కుర్రాడు చాలా మంచివాడు. నటాషాకు అతనంటే ప్రాణం. వాళ్ళిద్దరి ప్రేమనూ ఈ తతంగం కోసం కాదంటామా? ఏదో ఒక ఉపాయం చూసి పెళ్ళి
376 & ఓల్లా
జరిపిస్తామా?” శారదకు నిరుత్సాహం, నీరసం కమ్ముకొచ్చాయి.
“సరే – నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆ రోజంతా మనసు మనసులో లేదు.
ఎంతమందికి తను దండలు మార్పించి, టీ పార్టీ ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిందో లెక్కలేదు. ఇప్పడు తన కూతురు పురోహితుడి మంత్రాలతో, మంగళసూత్ర ధారణతో కన్యాదానంతో శాస్తోక్తంగా పెళ్ళి చేసుకుంటానంటుంది. ఎక్కడ జరిగింది లోపం?
అన్నపూర్ణ కూతురి పెళ్ళి తను చేసింది.
తన కూతురి పెళ్ళి ఇంకెవరో చేస్తారు.
సమాజంలో సంక్లిష్టత్వం పెరుగుతోంది. సరైన దిశగా వెళ్ళటం లేదు – స్వీయ జీవితాన్ని సామాజిక సందర్భాలతో సరిచూసుకునే సామర్థ్యం ఉంది గనుక శారద
తప్పంతా తనమీద వేసుకుని బాధపడలేదు. కూతురి పెళ్ళీ జరిపించే బంధువులెవరా అని ఆలోచిస్తూ – ఇక ఆ పెళ్ళి పనులలో పడిపోయింది.
నటాషా వివాహం జరిగిపోయింది. బంధువులు స్నేహితులు సందడిగా ఇల్లంతా తిరుగుతుంటే తన ఇంట్లో తనే పరాయిదానిలా అనిపించింది శారదకు, పెళ్ళి తంతు జరుగుతుంటే శారద, అన్నపూర్ణ, సరస్వతి మండపానికి కాస్త దూరంగా కూర్చున్నారు. సరస్వతి “మీరిద్దరూ మీ కూతుళ్ళ పెళ్ళి మీరు చెయ్యలేకపొయ్యారు. ఎవరో చేస్తున్నారు. ఏంటిది – అర్ధం లేకుండాను’ అంది ఆలోచిస్తూ, అన్నపూర్ణ టక్కున “ఆధునిక స్త్రీలం గదా – అందుకు – ” అనేసరికి శారద పెద్దగా నవ్వేసింది. గలగలా నవ్వుతున్న శారద నవ్వులో అన్నపూర్ణా జతగలిపింది.
సరస్వతి “ఊరుకోండి అందరూ ఇటే చూస్తున్నారు” అంది తనూ నవ్వాపుకోలేక సతమతమవుతూ, ఒకవైపు మంత్రోచ్ఛారణల మధ్య మాంగల్యధారణ జరుగుతుంటే ఈ ముగ్గురు తల్లలూ నవ్వాపుకోలేక పగలబడి నవ్వుతున్నారు.
వీళ్ళకు దగ్గరగా ఉన్నవారంతా వింతగా చూస్తుంటే మరింత నవ్వొచ్చింది ముగ్గురికి,
****************
నటాషా పెళ్ళి జరిగాక రాజకీయ శూన్యత్వాన్ని భరించలేననిపించింది శారదకు. ప్రాక్టీసు ఎంత సమయాన్ని తీసుకున్నా డాక్టర్గా ఎంత సేవ చేసినా తృప్తి కలగటం లేదు. సరస్వతి, అన్నపూర్ణల స్నేహం ఎంత సేద తీర్చినా ఏదో అశాంతి మనసును
తొలిచేస్తోంది. ప్రజా రాజకీయాలు లేకుండా జీవించటం కష్టంగా ఉంది. డబ్బు సంపాదించింది. మంచి హాస్పిటల్, ఇల్లు, కళ్ళముందు ఆనందంగా తిరుగుతున్న కూతురు, స్నేహితులు, పేరు, ప్రతిష్టా – కానీ ఒక మూల శూన్యం, రైతు కూలీలతో, వెనుకబడిన వర్గాల వారితో కలిసి వారికోసం పని చేయాలనే తపన – ఆడవాళ్ళ అభివృద్ధి కోసం చేయవలసిన, తీసుకురావాల్సిన చట్టాల గురించి ఆలోచన – ఆరోగ్యపరమైన పాలసీల కోసం ఉద్యమించాలనే ఆతృత – ఇవన్నీ శారదాంబ మనసుని తొలిచేస్తున్నాయి. ప్రతి విషయం గురించి నోట్సు రాసుకుంటోంది. రావాల్సిన మార్పుల గురించి స్నేహితులతో మాట్లాడుతోంది.
****************
రోజులిలా గడుస్తుండగా శారద బంధువు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఉన్నత విద్యావంతుడు అయిన రావుగారు శారదను కాంగ్రెస్లో చేరమని గట్టిగా అభ్యర్థించటానికి వచ్చాడు.
ఆయన మాటలు విని శారద తేలిగ్గా తీసిపారేయలేదు. సూర్యం కూడా అక్కడే ఉన్నాడు.
తమ్ముడూ – నువ్వు అడగటంలో పొరపాటులేదు. కానీ కాంగ్రెస్కు సర్వస్వం ధారపోసి పనిచేసిన మా అన్నపూర్ణ, అబ్బయ్యలు స్థానిక రాజకీయ ధోరణుల గురించి నాకు చెప్తుంటారు. వాళ్ళే క్రమంగా దూరమవుతున్నారు. నేను కాంగ్రెస్లో చేరి ఏం చెయ్యాలి? నా స్వభావం నీకు తెలుసు, అవినీతి అక్రమాలు సహించను, ఎవరి అధికారానికి తలవంచను. రాజీపడను. నాకు రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కానీ నేను వాటిలో ఇమడలేను. దుర్గాబాయిని ఓడించిన పార్టీలో నా స్థానమేంటి? నేనేం చెయ్యగలుగుతాను?
రావు నిదానంగా ఆచితూచి మాట్లాడాడు.
“నువ్వన్నదంతా కరెక్టేనక్కా కానీ నేను నిన్ను కాంగ్రెస్లోకి రమ్మన్న కారణం వేరు. ఇప్పుడు పరిస్థితులు నీకు తెలుసు. రాజ్యాంగం రాసుకుని పదేళ్ళు కాలేదు. దేశ నిర్మాణమనే పెద్ద బాధ్యత అందరి మీదా ఉంది. అది సక్రమంగా జరగాలంటే కేంద్రంలో మేధావులు, నిజాయితీపరులూ శాయశక్తులా పని చెయ్యాలి. అన్ని రంగాల నుంచీ విద్యావేత్తలు, సోషలిస్టు భావాలు గలవారు, దేశ నిర్మాಣಂ మీద ఆసక్తి గలవారూ
వచ్చి పనిచేస్తే తప్ప అభివృద్ధి జరగదు. అందుకని నువ్వు కాంగ్రెస్ తరపున పోటీచేసి పార్లమెంట్ కి రావాలి. ఇది నా ఆశ మాత్రమే కాదు. నెహ్రూ గారి కోరిక కూడా, ఎన్నికలు దగ్గరకొచ్చాయి. నువ్వు నిర్ణయం తీసుకోవాలి?
“నేను ఎన్నికల్లో పోటీ చేయటమా? దుర్గాబాయి సంగతి తెలియదా?”
తెలుసక్కా – కానీ నాకు నమ్మకం ఉంది. బెజవాడ ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు. పార్లమెంటుకెళితే నీకోసం చాలా పనులున్నాయి. హిందూ కోడ్బిల్లు ఇంకా సంస్కరించబడాలి, హెల్త్ పాలసీలు రూపొందించాలి. స్త్రీ శిశు సంక్షేమ పథకాలు ఒక అవగాహనతో ఏర్పడాలి. వీటన్నిటికీ నీ మేధస్సు, నీ విజ్ఞానం, నీ చట్ట పరిజ్ఞానం సోషలిస్టు ఆలోచనా ధోరణీ అన్నీ దోహదం చేస్తాయి. అందుకే నీ గురించి అంతా తెలిసీ నేను ఈ మాట అడిగే సాహసం చెయ్యటానికి సిద్ధపడ్డాను. ఆలోచించు. ఎన్నికలలో గెలుపోటముల గురించి ఎవరూ చెప్పలేరు. కానీ నువ్వు పాలసీలు రూపొందించే కమిటీలలో పని చేయటానికి ఎమ్.పి. వే కానవసరం లేదు. కాంగ్రెస్ సభ్యురాలివైతే చాలు. సభ్యురాలివి కాకున్న ఫరవాలేదు. కానీ చాలా ఆటంకాలు, చికాకులు ఎదుర్కోవాలి. అసలు నువ్వు ఎం.పి. గా గెలుస్తావనే నమ్మకం నాకుంది. ఆలోచించు ప్రజలకు నీ మీద ఉన్న అభిమానం సామాన్యమైంది కాదు. అది నీకు తెలియదేమో కానీ అందరికీ తెలుసు. శారదను ఒప్పించేందుకు ఓపికగా మాట్లాడుతున్నాడు రావు.
“బెజవాడ కమ్యునిస్టుల కంచు కోట. నేను కమ్యునిస్టు పార్టీ నుంచి బైటికి వచ్చినదాన్ని – వాళ్ళ దృష్టిలో బహిష్కరించబడిన దాన్ని నేనెలా గెలుస్తాను.”
“గెలుస్తావు. మాకందరికీ నమ్మకం ఉంది. గెలవవు – నీకు ఎంపి అవటం ముఖ్యం కాదుగదా
శారదకు ఎటూ పాలుబోలేదు.
“నేను ఆలోచించి చెబుతాలే అని రావు గారిని పంపించింది. సూర్యంతో ఎప్పటికప్పుడు తన మనసులోని మాటలు చెపుతూనే ఉంది, రావుగారు వెళ్ళాక సూర్యం “రాజకీయ జీవితం లేకుండా నువ్వు శాంతిగా ఉండలేవు అక్కా ఎన్నికల్లో పోటీ చెయ్యి” అన్నాడు,
“ఎన్నికలంటే మాటలా? డబ్బూ ప్రచారం.
“అదంతా నేను చూసుకుంటాను గదా. ఆ విషయాలు నాకు ఒదిలెయ్” అన్నాడు. ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రావటం కష్టంగానే ఉంది. మూర్తితో మాట్లాడితే అతనూ ఏమీ చెప్పలేక పోయాడు.
‘నువ్వే ఆలోచించుకో – బెజవాడ నంతా ఎర్రదనంతో నింపిన ఇల్లు మూడు రంగులకు మారటం – చాలా ఐరనీ – ” అని నవ్వేశాడు.
నాకు రాజకీయ జీవితం లేకుండా బతకటం చాలా వెలితిగా ఉంది”
వెలితి గురించి నాతో చెప్తున్నావా? అది నీకంటే వందరెట్లు నేను అనుభ విస్తున్నాను”
“ఏదో ఒకటి చేయాలి మూర్తి నేను కాంగ్రెస్ పార్టీలో చేరతాను. ఎన్నికలలో పోటీ చేస్తాను. అది పొరపాటనిపిస్తే దిద్దుకుంటాను. ఏ పనీ చెయ్యనివాళ్ళు పొరపాట్లు చెయ్యకుండా పరిశుద్ధంగా ఉంటారు. నాకు ప్రవహించాలని ఉంది. నిలవనీరులా ఉండాలని లేదు. ప్రవాహంలో చెత్తాచెదారం ఒక్కోసారి చేరుతుంది. దానిని పక్కకు నెట్టి ప్రవహించకపోతే నిలవనీరు మురికినీరవుతుంది. పార్లమెంటుకి వెళ్తాను. ఏమైనా చెయ్యగలనేమో చూస్తాను.”
మూర్తితో మాట్లాడుతూనే ఒక నిర్ణయానికి వచ్చింది శారద,
నాలుగు రోజుల్లో శారదాంబ కాంగ్రెస్ పార్టీలో చేరిందనే వార్త బెజవాడలో సంచలనం సృష్టించింది.
“చూశావా? శారదాంబ ఎంతపని చేసిందో, శత్రుశిబిరంలోకి వెళ్ళి చేరింది” అన్నారు కొందరు.
“మనం ఆమెను శత్రువులా చూస్తే లేనిది ఆమె కాంగ్రెస్లో చేరితే వచ్చిందా తప్పు, మనం ఆమెను దూరం చేసుకున్నాం, వాళ్ళు తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఆమె తెలివి, మంచితనం అన్నిటినీ కాదనుకున్నాం, ఇప్పుడావిడ ఏం చేస్తే మనకెందుకు” అన్నారు కొందరు. ఎవరేమనుకున్నా ఆగని కాలం ఎన్నికలను తరుముకుంటూ వచ్చింది.
అన్నపూర్ణ, అబ్బయ్య బెజవాడ వచ్చారు. స్వరాజ్యం పదిరోజుల ముందు వస్తానని ఉత్తరం రాసింది గానీ ఆ ఉత్తరంలో ఏదో అసంతృప్తి ఉంది. “స్వరాజ్యానికి నే చేసిన పని నచ్చలేదనుకుంటానోయ్’ అంది శారద. “చిన్నపిల్ల – దానికేం తెలుసు అంది అన్నపూర్ణ
‘అది కమ్యూనిజం వైపు వెళ్తుంటే మీరు అటునుండి ఇటు వచ్చారు. స్వరాజ్యం కొంత గందరగోళపడి ఉంటుంది” అన్నాడు అబ్బయ్య
రామస్వామి గారు శారద ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిసి తన పనులన్నీ పక్కనబెట్టి ప్రచారం చెయ్యటానికి వచ్చారు.
“మన వాళ్ళందరికీ మీ మీద కోపం పెరుగుతుందండీ”, అంది శారద నవ్వుతూ
పెరగనివ్వవమ్మా- దానివల్ల ఎవరికి నష్టం? మంచి మనుషుల్ని దూరం చేసుకుని వారిమీద కోపం తెచ్చుకునే సంప్రదాయం మనవాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు. నువ్వు పార్లమెంటుకి వెళ్ళి ఏదో మంచిపని చేస్తావు. మా శారదాంబ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నేను ఊరికే ఇంట్లో కూచోనా? బెజవాడలో నాకూ అంతో ఇంతో పేరూ ప్రతిష్ణా ఉన్నాయి, నా మాటకూ విలువ ఉంది. అది నీకు ఉపయోగపడితే చాలని వచ్చేశాను” అన్నాడాయన.
బెజవాడలో ఎన్నికల వేడి వేసవి కాలాన్ని ముందే తెచ్చింది. సరస్వతి, అన్నపూర్ణల ఆధ్వర్యంలో మహిళా బృందాలు పని చేస్తున్నాయి, సూర్యం అందరినీ ఆర్గనైజు చేసి నడిపించే పనిలో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. శారదకు ప్రత్యర్థి కమ్యూనిస్టుపార్టీ నుంచి తమ్మిన పోతరాజు, అతనంటే శారదకు మొదటి నుంచీ ప్రత్యేకాభిమానం. అతనికీ శారదంటే గౌరవం. కానీ రాజకీయాలు ఇద్దరినీ ఎదురెదురుగా నిలబెట్టాయి. ఒకరోజు వారిద్దరూ ఎదురు పడ్డారు. మామూలుగా మాట్లాడుకుని ఒకరినొకరు అభినందించుకుని ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాలుగురోజులకు అబ్బయ్య, సూర్యం కొన్ని కరపత్రాలు పట్టుకొచ్చారు. అన్నపూర్ణకిచ్చారు, అవి చదివి అన్నపూర్ణ ముఖం పాలిపోయింది. పద్మ భీత్కారం చేస్తూ వాటిని నలిపేసింది.
“ఇవి శారద కంటపడకుండా చూడాలి. చాలా బాధపడుతుంది”. అంది అన్నపూర్ణ కంగారుగా “ఆవిడ బాధ పడుతుందో, నవ్వుకుంటుందో ఏం చేస్తుందో – ఈ కరపత్రాలు ఎలాగైనా ఆవిడ కంటపడతాయి. ఏ సభలోనో హఠాత్తుగా వీటి గురించి తెలిసే బదులు స్థిమితంగా వీటి గురించి తెలుసుకుని పబ్లిక్లో వీటి గురించి ఎట్లా రియాక్ట్ అవాలో ఆలోచించుకోవటం తెలివైన పని” అన్నాడు అబ్బయ్య
అతనే శారద దగ్గర కవి తీసుకెళ్ళి
“డాక్టర్ గారూ – ఇవి చూడండి. మీరొకసారి చూస్తే నేను చింపి అవతల పారేస్తాను” అని వాటిని అందించాడు.
శారద అవి తీసుకుని చూసింది.
కమ్యూనిస్టు పార్టీ ప్రచార కరపత్రాలవి. దానిలోని సమాచారం మాత్ర శారద “కాంట్రాక్టు పెళ్ళి” గురించిన పిచ్చిరాతలే – 1946 ఎన్నికలలో కాంగ్రెస్ శారదపై బురద జల్లుతూ వేసిన కరపత్రాలకేమీ తీసుపోకుండా ఉన్నాయి.
శారద వాటిని చదివి పెద్దగా నవ్వేసింది. దూరం నుంచి చూస్తున్న అన్నపూర్ణ పద్మ దగ్గరకొచ్చారు.
“ఇప్పటి వరకూ నాలో ఏమూలో కాస్త అశాంతి ఉండేది. అది కాస్తా పోయింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఒకటే ఆడవాళ్ళ విషయంలో, చాలా పెద్ద మార్పులు రావాలి. స్త్రీల సమానత్వాన్ని గౌరవించటం ఈ దేశంలో తేలిక కాదు. మనం చాలా పోరాడాలి దానికోసం. ఈ కరపత్రాలు నా విలువను తగ్గించలేవు ప్రజల్లో – ప్రజల్లో మార్పు వచ్చింది. రాజకీయ పార్టీలలోనే రావాలి.”
సరిగ్గా అప్పడే రామస్వామి గారు ఆ కరపత్రాలను పట్టుకుని వచ్చాడు. ఆయన ముఖం బాధ, కోపం కలిసి ఎర్రబడింది.
శారద ఆయన్ని కూచోబెట్టి ఆ కర పత్రాలను చేతిలో నుండి తీసి అవతల పడేసింది “నువ్వింత స్థిమితంగా ఎలా ఉన్నావమ్మా అన్నాడాయన కంటనీరొక్కటే తక్కువగా, వాళ్ళేదో కోతిపని చేశారని మనం కొండముచ్చులమవుదామా చెప్పండి అంది శారద నవ్వుతూ,
“ఇది కోతిపని – అల్లరి చిల్లర పని కాదమ్మా అమానుషమైనపని.” “మనుషులుగా ఉండటం చాలా కష్టమైన పని. గాలిబ్ అనే కవి ఎంత బాగా చెప్పాడనుకున్నారు – శారద మాటలు ఆయన చెవికెక్కటం లేదు.
“నీ మీద వాళ్ళకింత కోపం ఎందుకో నాకు తెలుసమ్మా నువ్వు మేధావివి, మేధావి అయిన మహిళను మగవాళ్ళు సహించలేరు. ఎట్లాగయినా ఆమెను అల్లరి పాలు చేసి, చిల్లర కింద తీసి పారేసి, విలువ లేకుండా చేస్తేగాని వాళ్ళ కంటే అందివచ్చేది ఏముందమ్మా, ఆ రోజు కాంగ్రెస్ వాళ్లు చేసిన పని ఇవ్వాళ వీళ్ళు చేశారు. అప్పడూ కొంతమంది నీ గురించి తక్కువగా మాట్లాడటం నాకు తెలుసు?
వాళ్ళను అప్పడు చివాటు పెట్టగలిగిన స్థితిలో ఉన్నాను. ఇప్పడు అసహ్యించుకుంటున్నాను. మనసులోదంతా కక్కేస్తే గాని ఆయన శాంతించేలా లేదు.
“ఒద్దు రామస్వామి గారూ – అసహ్యించుకోవద్దు. జాలి పడదాం. ఇన్నాళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో వాళ్ళు అతి చిన్న విషయాలు కూడా నేర్చుకోలేదే అని జాలి పడదాం, నవ్వగలిగితే మరీ మంచిది, ఇది చాలా అల్లరి చిల్లర విషయం, దీనిని మనసులోకి తీసుకుని బాధపడేంత ప్రాముఖ్యత ఇవ్వకండి.”
“ఇది నీ వ్యక్తిగత విషయం గాబట్టి దాన్నలా తీసిపారెయ్యకపోతే లాభం లేదనుకుంటున్నావు. మంచిదే. కానీ తోటి మనుషులుగా మేమెట్లా ఊరు కోవాలమ్మా ఊరుకుంటే మేం మనుషులమని పించుకుంటామా?
“ఇప్పడు మనకు ఊపిరాడని పనులున్నాయి. ఈ విషయంతో ఊపిరాడ కుండా చెయ్యాలనే, మనల్ని దెబ్బకొట్టాలనే వాళ్ళిలా చేశారు. మనం మరీ అంత బలహీనులం కాదని చెప్పటమే మంచిది, దీన్నింతటితో ఒదిలేద్దాం.
“అక్కయ్య చెప్పినట్లు చెయ్యండి రామస్వామి గారు, పదండి చాలా పనులున్నాయి. ఈ పిచ్చి మాటలకు సమయం లేదు మన దగ్గర అన్నాడు సూర్యం,
శారద ఆ కరపత్రాలను అవతల విసిరేసి ఎన్నికల ప్రచారానికి బయలుదేరటంతో అన్నపూర్ణ గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగింది. పద్మ కూడా కాస్త చల్లబడింది.
కానీ శారదను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసి, అది పార్టీకి మంచిదని బలవంతపెట్టి ఇవాళ ఆ పెళ్ళిని అడ్డంపెట్టి శారద మీద దుష్ర్పచారం చేస్తున్న కమ్యూనిస్టులపై అన్నపూర్ణకు వచ్చిన కోపానికి అంతులేదు, ఎన్నికలైనన్ని రోజులూ “కమ్యూనిస్టులలా ఎలా చేస్తారు?” అని సతాయిస్తూనే ఉంది.
“కమ్యూనిస్టులు పై నుంచి దిగొచ్చారా? వాళ్ళూ మనుషులే. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు.”
“కానీ మరీ ఇంత అన్యాయమా?”
“ఇంత అన్యాయం కమ్యూనిస్టులు చెయ్యగూడదని నీ కోరిక కదూ అన్నపూర్ణా మనందరికీ తెలిసో తెలియకో కమ్యూనిజం మీద ఆశ ఉంది. కమ్యూనిస్టులంటే ఇలా ఉండాలనే ఊహ ఉంది. వాళ్ళు ఆదర్శాలను పాటిస్తారనే నమ్మకం ఉంది.
కానీ విషయవేుమిటంటే కమ్యూనిజం సామాన్యమైన సంగతి కాదు. ఈ కమ్యూనిస్టులంతా భూస్వామ్య భావజాలం నుంచి వచ్చిన వారే. దానితోనే వారి యుద్ధం. కానీ అది వాళ్ళకే తెలియకుండా వాళ్ళను చుట్టేసుకుంటుంది. దాన్ని ఒదిలించుకోవటం తేలిక కాదు. వాళ్ళ నుంచి మరీ ఎక్కువ ఆశించలేం ఇప్పుడే – భవిష్యత్తు సంగతి తెలియదు” అబ్బయ్య ఎంత చెప్పినా అన్నపూర్ణ మనసులోంచి “మరీ ఇంత అన్యాయమా” అన్న ప్రశ్న పోలేదు.
రెండు పార్టీల ప్రచారాలు ఒకదానికొకటి తీసిపోకుండా జరుగుతున్నాయి. ఎన్నికల తేదీ వచ్చేసింది, వెళ్ళి పోయింది.
దుర్గాబాయి కొన్ని వందల ఓట్ల తేడాతో ఓడిపోతే శారదాంబ కొన్ని వందల ఓట్లు తేడాతో గెలిచింది.
కమ్యూనిస్టుల కంచుకోట పగలగొట్టామని, కాంగ్రెస్ సంబరపడింది. కాంగ్రెస్ సంబరానికి కమ్యూనిస్టు పార్టీ నిర్మాత అయిన తను కారణమవటంలోని విచిత్రాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నంలో అలిసిపోయింది శారద, పార్లమెంటు సభ్యురాలిగా వెళ్తున్న జెజవాడ మహిళగా ఎంతోమంది ఆమెను గౌరవించారు.
*******
ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్ళింది శారద, 30 వ దశాబ్దంలో కలిసి పని చేసిన భారత జాతీయ మహిళ సంఘం నాయకులు చాలా సంవత్సరాల తర్వాత శారదను చూసి సంతోషించారు.
విశాలాక్షి కుటుంబం అంతా వచ్చి శారదను అభినందించారు.
“నువ్వు కొంపదీసి మంత్రివై మా డిపార్ట్మెంట్ కొచ్చి పెత్తనం చేస్తావేంటి? అంది విశాలాక్షి నవ్వుతూ,
“ఆ ప్రమాదం లేదులేవోయ్ – పార్లమెంటులో అనుభవం లేకుండా ఒక్కసారే మంత్రినెలా అవుతాను? చూద్దాం – ఏం చేద్దామో -” నిష్కల్మషంగా అంది శారద,
బెజవాడ తిరిగి వచ్చిన శారదను పనులు ముంచెత్తాయి.
ప్రాక్టీసు, నియోజకవర్గ సభ్యులను తెలుసుకోవటం, వచ్చిన వాళ్ళతో మాట్లాడి పంపటం, తన ఆఫీసు నుంచి జరగాల్సిన పనులు జరిగేలా చూడటం – వీటన్నిటితో ఒక్క క్షణం తీరటం లేదు.
మూర్తి హైదరాబాదులో తన ప్రాక్టీసు పెంచుకునే పనిలో పడిపోయాడు.
పార్లమెంటులో హిందుకోడ్ బిల్లు పాస్ అయినా దాని గురించి చేయాల్సింది చాలా ఉంది. దుర్గాబాయి, శారద ఆ కమిటీలో ఉండి దానికి మెరుగులు దిద్దే పనిలో పడ్డారు.
ప్రజారోగ్యం గురించిన పాలసీలను సమీక్షించి వాటిని మరింత
ప్రజోపయోగకరంగా రూపొందించే కమిటీలో కూడా శారద మనసంతా పెట్టి పనిచేస్తోంది.
పని ఎంత చేసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండటం మొదట్లో శారదకు మింగుడు పడలేదు.
హిందూకోడ్ బిల్లు చట్టం చేయటానికి ఏర్పడ్డ కమిటీలో సనాతనవాదుల సంగతలా ఉంచి అంతో ఇంతో ఆధునికంగా ఆలోచిస్తారనుకున్నవారు కూడా ఎంతగా సంప్రదాయాలలో కూరుకుపోయూరో చూస్తుంటే శారదకు మతిపోయేది.
ఏ చిన్న సవరణ స్త్రీలకు మరింత వెసులుబాటు కల్పించేది ప్రతిపాదించినా అందరూ హాహాకారాలన్నా చేసేవారు. లేదా మౌనమన్నా పాటించేవారు.
బిల్లుని వివాహం, విడాకుల విషయాల్లో స్త్రీలకు, పురుషులకు స్వేచ్ఛనిచ్చేలా చేయటానికి శారద చేసిన ప్రతి ప్రతిపాదననూ తిరస్కరించారు.
ఆ చట్టం వల్ల స్త్రీలకు ఒనగూడే ప్రయోజనం అతి తక్కువని శారదకు అర్థమైంది. అది దుర్గాబాయితో తప్ప ఎవరితో చెప్పినా కనీసం సానుభూతి కూడా దొరకలేదు.
విశాలాక్షి ఒకరోజు శారదను తన ఇంట్లో భోజనానికి పిల్చింది. శారదకు వెళ్ళాలనిపించలేదు గానీ విశాలాక్షి ఒదల్లేదు.
విశాలాక్షి తన ఆడంబరాన్నీ అతిశయాన్నీ చూపించే తీరు శారదకు నచ్చదు. చిరాకు తెప్పిస్తుంది. ఐనా చిన్ననాటి స్నేహం ఒక రకంగా రక్త సంబంధం లాంటిదే – విశాలాక్షిని చివాట్లు పెట్టగలదు శారద. చివరకు వెళ్ళింది – భోజనాలయ్యాక శారద ఇక వెళ్తానంటే.
“ఉండు. నీతో మాట్లాడాలనే పిల్చానివాళ – నువ్వేంటి హిందూకోడ్ బిల్లు విషయంలో మరీ విచ్చలవిడిగా మాట్లాడుతున్నావట. సెక్రటేరియెట్ దాకా వచ్చాయా మాటలు. నువ్వు ఉన్నట్లే అందరూ ఉండాలంటే కుదురుతుందా? అందరినీ నీలా మూరమంటూవా?”
“నాలా ఒకరు కూడా మారరు విశాలా – అసలు నీ సమస్య ఏంటి చెప్పు? “నా సమస్యా? పెళ్ళీ మీద కనీస గౌరవం లేని నిన్ను ఆ కమిటీలో వెయ్యటం.
నువ్వందులో మీ చలంగారి సిద్ధాంతాలన్నీ చొప్పించాలని ప్రయత్నించటం” శారదకు విశాలను చూస్తే జాలనిపించింది. చిరాకు పిచ్చింది.
పెళ్ళి అతి పవిత్రం. జన్మజన్మల బంధం, స్వర్గంలో నిర్ణయింపబడతాయని నమ్మేవాళ్ళకు ఈ కమిటీలు ఎందుకు? స్వర్గాన్ని నమ్మకుని ఉండొచ్చుగా, పెళ్ళీ – స్త్రీ పురుషుల సంబంధం మానవ సమాజం ఏర్పడిన నాటి నుండీ మానవుల చేత ఎన్నో రకాలుగా మార్చబడింది. ఆ సంగతి నీకు తెలియకపోతే తెలుసుకో – మార్పులు – కొత్త మార్పులు వస్తాయి. రావాలి. అందరికీ అన్ని అవకాశాలూ అందుబాటులో ఉండాలి. విశాలా మార్పు అనేది లేకపోతే స్త్రీల గురించిన ఆలోచనలో, పెళ్ళి గురించిన ఆలోచనలో ఎన్నో మార్పులు రాకపోతే నువ్వివాళ ఇలా ఉండేదానివేనా ఆలోచించు. నీకు అనుకూలమైన మార్పుల్ని ఆహ్వానిస్తావు. అవి నీకు అర్థమవుతాయి – నీకు అనుభవంలోకి వస్తాయి, కానీ మిగిలిన స్త్రీల విషయంలో రావాల్సిన మార్పులు గురించి కనీసం తెలుసుకుందామనుకోవు. నువ్వు చాలా మారాలోయ్ – నువ్వు చాలా గట్టిదానివి – పట్టుదల గల దానివి. కావలసినవి సాధించుకున్నావు. కానీ అందరూ అలా ఉండరు. బలహీనులు, నీకున్న అవకాశాలు లేనివాళ్ళు ఉంటూరు, వాళ్ళ గురించి తెలుసుకో. తెలుసుకోకపోతే నీ తెలివి, నీ ఉద్యోగం అన్నీ వృధా – వృధా – వృధా. ” విశాలక్షి ముఖం చిన్నబోయింది,
“సరేలే – ఆ సంగతులు ఒదిలేద్దాం. మీ అమ్మాయి ఏం చేస్తోంది? అంది విశాలాక్షి
“నువ్వు పెద్ద తేనెతుట్టను కదిలించి – మళ్ళీ మెడకు గంధం రాస్తానంటే ఎట్లా విశాలా – మన అభిప్రాయాలు కలవవు. ఏం చేద్దాం? ఆ సంగతి గ్రహిద్దాం. నేను మాట్లాడే విషయాలు గురించి నువ్వు సీరియస్గా ఆలోచించు అప్పడు మనమింకా
మంచి స్నేహితులమవుతాం. నీ వల్ల దేశానికి కూడా మేలు జరుగుతుంది.” అంటూ లేచింది శారద.
ఇంటికి వెళ్ళే దారంతా విశాల తనకు చెప్పదల్చుకున్న విషయం మనసులో జోరీగలా రోద చేస్తూనే ఉంది.
సెక్రటేరియేట్లో తన గురించి గౌరవం లేదు. పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
386 • ఓల్లా
అందులో విశాల పాత్ర కూడా ఉండి ఉండొచ్చు.
దేశ రాజధాని ఢిల్లీ, విశాలమైన రోడ్లు, భవనాలు పార్లమెంటు దేశ భవిష్యత్తుని నిర్ణయించి శాసించగల కేంద్రం. కానీ ఇది ఒక కుగ్రామం. శాసనాలు మనుధర్మ శాస్త్ర జననాలు – మార్పు సహించని అధికారులు.
ప్రజాస్వామ్య అర్థం తెలియని వాతావరణం. చట్టాలలోనే కాదు – అవే కాస్త నయం, అవినీతి చాపకింద నీరులా పాకుతోంది. దీని నిలాగే సాగనిస్తే ఏదో ఒకనాటికి ఆ అవినీతి చెదలు పార్లమెంటుని తినేస్తుంది. కుప్పకూల్చేస్తుంది. దీనిని ఆపేదెట్టా
ఒక సారి నెహ్రూతో మాట్లాడి తన అసంతృప్తి అంతా చెబితే –
ఆయనకు తెలియదా? కానీ తనూ అంతా తెలుసుకున్నదని ఆయనకు చెప్పటం మంచిది. ఈ పార్లమెంటులో ఎన్నో చేయాలనుకుంది. కనీసపు పనులు కూడా జరగటం లేదు. అవినీతిని ఆపలేకపోవటం దుర్భరంగా ఉంది. దీనికంటే తన పరిధిలో తను డాక్టరుగా, చిన్న చిన్న సంస్కరణల కోసం పని చేసినా ప్రయోజనం ఎక్కువ ఉంటుందనిపిస్తుంది. ఇక్కడకు రాకముందు నెహ్రూ సోషలిస్టు విధానాల మీద చిన్నపాటి నమ్మకం ఉండేది. అది కూడా పోతోంది. అది ఆయనతో చెప్పటం నిజాయితీగా ఉంటుంది.
శారద పార్లమెంటు సభ్యురాలై నాలుగేళ్ళయింది. తన నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన పనులు కొన్ని చేయగలిగింది గానీ ఎంతో తేలికగా జరిగే ఆ పనులకు కూడా స్థానిక నాయకుల నుండి ఏవో అభ్యంతరాలు వచ్చేవి. వాళ్ళు కల్పించే ఆటంకాలను దాటటానికే ఎక్కువ సమయం, శక్తి ఖర్చవుతున్నాయి. మగవాళ్ళు అహంకారాలు, ఎంత డాక్టరయినా ఒక ఆడదాని మాట వినాల్సి రావటానికి వాళ్ళు పడే అవస్థలూ చూస్తుంటే శారదకు ఒకవైపు కోపం, మరోవైపు నిరుత్సాహం, తాను ప్రతి విషయాన్నీ చట్ట ప్రకారం రూల్సు అన్నీ వివరించి చెప్పి ఒప్పించ గలుగుతోంది. కానీ రాజకీయాలలో ఆసక్తి ఉండి, పెద్దగా విషయ పరిజ్ఞానం లేని ఆడవాళ్ళను వీళ్ళు బతకనిస్తారా? అసలు రాజకీయాలలోకే రానివ్వరు. నాయకులుగా ఎదగనివ్వరు. అధికారం అసలు ఇవ్వరు. తనకే ఇంత కష్టంగా ఉంటే మామూలు స్త్రీలకింకెంత కష్టం? హైదరాబాద్లో సదాలక్ష్మి అసెంబ్లీలో చేసే పోరాటాలు తెలుస్తున్నాయి. ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ నాయకురాలిగా ఎదుగుతున్న తీరు కూడా గమనిస్తోంది. నాయకులుగా ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో రావాలి. అట్లా వస్తే తప్ప మంచి మార్పులు రావనేది అర్థమవుతోంది. ఇంకొక్క సంవత్సరం
తర్వాత రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని శారదకు అనిపించలేదు. పార్లమెంటులో చేయగలిగింది ఎంత స్వల్పమో అర్ధమైంది. పాలసీలు చేయటంలో స్త్రీల పరంగా ఆలోచించే వాతావరణమే లేదు. ఎగతాళి, వ్యంగ్యం తప్ప స్త్రీల సమస్యలను అర్థం చేసుకునే వారే లేరక్కడ. నెహ్రూకి అర్థమయినా ఆయనొక్కడివల్లా ఏమీ జరగదనేది కూడా శారదకు ఈ నాలుగేళ్ళలో తెలిసి వచ్చింది. ఐనా ఒకసారి తన అసంతృప్తిని నెహ్రూతో పంచుకోవాలనిపించింది శారదకు. సమయం కోసం అడిగితే ఆయన కాదనకుండా ఇచ్చాడు,
“స్త్రీలకు రాజకీయాలలో ఇపుడున్న చోటు చాలదు. దానికోసం మీరేం చేయబోతున్నారు? ప్రభుత్వపరంగా పారిశ్రామిక అభివృద్ధికి జరగాల్సిన పనులు నత్తనడక నడుస్తున్నాయి ఎందుకు? మిశ్రమ ఆర్థిక విధానంలో ఇంతవరకూ చెప్పకోదగిన ప్రభుత్వరంగ సంస్థలు రావటం లేదు. ఏ శక్తులు దానికి అడ్డుపడుతున్నాయో మీకు తెలుసు. ఎందుకలా జరగనిస్తున్నారు? ఇలా ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతూ పోయింది శారద. నెహ్రూ సమాధానాలు ఇస్తూనే ఉన్నాడు ఒక రాజకీయవేత్తలా –
“అన్నీ జరుగుతాయి. సమయం పడుతుంది. స్వతంత్రం వచ్చిన పన్నెండేళ్ళలోనే అంతా మారిపోవటం జరగదు. ప్రభుత్వరంగ సంస్థలు ఇపుడిపుడే అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చాం కదా – నిధులు మెల్లిగా వెళ్తాయి. స్త్రీలకు రాజకీయాలలో చోటు తప్పకుండా దొరుకుతుంది”,
“మిస్టర్ నెహ్రూ – మీరు కాసేపు ప్రధానమంత్రినని మర్చిపొండి. ఒక మామూలు మనిషిగా మారండి. పార్లమెంటులో జరుగుతున్న రాజకీయ విధానం మీకు సంతృప్తి నిస్తోందా? పెరిగిపోతున్న అవినీతిని చూస్తుంటే మీకు నిద్ర పడుతోందా? దీనిని ఎవరైనా కంట్రోలు చేయగలరని మీరు నమ్ముతున్నారా? ఈ ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని అనుకుంటున్నారా?”
వెల్ – డాక్టర్. ప్రశ్నలడగటం తేలిక. అడిగారు. నన్ను మామూలు మనిషిగా సమాధానం ఇమ్మన్నారు. కానీ నేను ప్రధానమంత్రిని, ప్రధానమంత్రిగా నేను మీకు చెప్పదల్చుకున్నదేమిటంటే నేను నిస్సహాయుడిని. నిజంగా నిస్సహాయుడిని. నేను ఇంత నిస్సహాయత్వంలోనూ ఏదో చేస్తున్నాను. ఇంతకంటే చేయలేకపోతున్నాను. రాజకీయాల సంగతి మనం ఒకరికొకరం చెప్పకోనవసరం లేదు. వీటిని మార్చాలి. ఎలాగో తెలియదు. తోచినది చేసుకుంటూ పోవటం తప్ప మరో మార్గం లేదు.
ఒకోసారి నాకూ నిరాశ కమ్ముకొస్తుంది. కానీ దేశ నిర్మాణ బాధ్యతను ఒదులుకోలేను. వీటన్నిటిలోంచే మనం పైకి లేవాలి. ఇంతకంటే నేనేం చెప్పలేను.
“యస్. ప్రైమ్మినిష్టర్. మీరు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. పురుషులు. అందువల్ల మీకు ఎంత నిరాశలోనూ ఆశ కన్పించటం సహజం. ఒక స్త్రీగా, పార్లమెంటు సభ్యురాలిగా చెబుతున్నాను. నాకు స్త్రీల పరంగా ఏ ఆశా కనిపించటం లేదు, వెనుకబడిన వర్గాల పరంగా అసలే కనిపించటం లేదు, దుర్గాబాయి రాజకీయాలకు దూరంగా సంస్థలను నిర్మించుకుంటూ ఎందుకు పనిచేస్తోందో నాకిప్పడు బాగా అర్థమవుతోంది. అలాంటి వ్యక్తులకూ, సంస్థలకూ మీరు సహకరిస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. ఒకటి నేనూ ఒప్పకుంటాను. మీరు మరి కొద్దిమంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి. మీరు మీ నిస్సహాయత్వాన్నించి బయట పడాలి అని కోరుకుంటున్నాను – ”
నెహ్రూ గారికి నమస్కారం చేసి వచ్చేసింది శారద,
మళ్ళీ ఎన్నికలొచ్చాయి. శారద వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంది. స్త్రీలకు రాజకీయాలలో పాల్గొనే శిక్షణ అవసరం అనే అభిప్రాయం శారదలో బలపడింది. సంఖ్యలో కూడా స్త్రీలు శాసనసభల్లో, పార్లమెంటులో బలపడితే గాని వారి పరిస్థితి మెరుగు పడదు అన్న తన అభిప్రాయాన్ని అన్నపూర్ణతో, సరస్వతితో చర్చించింది. వారూ అంగీకరించారు.
ఇంతలో చైనా భారత్ల సరిహద్దు సమస్య, యుద్ధం వచ్చి పడ్డాయి. కమ్యూనిస్టులు చైనాను బలపరుస్తున్నారంటూ ప్రభుత్వం కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేయటం మొదలుపెట్టింది.
శారద ఆందోళన పడటం తప్ప ఏమీ చేయలేని తన పరిస్థితికి విచారపడుతూనే అవసరంలో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలకు తను చేయగలిగిన సాయం చేస్తూ వచ్చింది.
కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న విభేదాలను గురించి ఎవరో ఒకరు చెబుతూ ఉండేవారు.
ప్రజల సమస్యల పట్ల కాకుండా రష్యా, చైనా మార్గాలంటూ అంతంత విభేదాలు సృష్టించుకోవటం వల్ల పార్టీ చాలా నష్టపోతుందనిపించేది.
నాయకులందరి స్వభావాలూ శారదకు బాగా తెలుసు. అందువల్ల ఇదంతా ఎక్కడికి
దారి తీస్తుందోననే ఆందోళన కూడా ఆమె మనసులో పెరుగుతోంది. అన్నపూర్ణ శారద ఆందోళనను చాలా తేలిగ్గా తీసివేసేది.
“వాళ్ళు నిన్ను ఒద్దనుకున్నారు. నువ్వూ వాళ్ళను ఒదిలేశావు, ఇంకా ఆ పార్టీ గురించి ఇంత ఆందోళన పడతావెందుకు? అని విసుకునేది.
నేనేమిటి అనేది కాడు అన్నపూర్ణా – దేశ భవిష్యత్తు గురించి మనం నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. కమ్యూనిస్టు పార్టీ పొరపాటు చెయ్యొచ్చు. పని చేసే వాళ్ళే గదా పొరపాట్లు చేస్తారు. కానీ కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇవాళ కాకపోతే రేపు – మరొక రోజు ప్రజలు కమ్యూనిజంలోని మంచి గ్రహిస్తారు. కానీ పార్టీ బలహీనమైతే, గందరగోళపడితే చాలా నష్టం దేశానికి ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షమే కదా అసలైన ఆక్సిజన్. కమ్యూనిస్టులు బలమైన ప్రతిపక్షంగా ఉండాలి. హిందూకోడ్బిలు ఈ మాత్రంగా వచ్చిందంటే అది కమ్యూనిస్టుల వల్లే ప్రజా అనుకూల చట్టాలు వస్తున్నపుడు వాటిని మరింత అనుకూలంగా మార్చే పని ఎవరు చేస్తారు? ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గొంతులు ఎవరు విప్పుతారు? కమ్యూనిస్టులు తప్ప – వాళ్ళలో వాళ్ళు తగవులు పడుతూ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, ఉద్యమాలు నిర్మించకుండా పోతే ఎట్లా – నాకు చాలా ఆందోళనగా ఉంది. బి.పి. పెరిగిపోతోంది. ఇంకోవైపు నెహ్రూ గారి ఆరోగ్యం సున్నితంగా ఉంది. చైనా యుద్ధం ఆయనను కుంగదీస్తోంది”,
“అదంతా నిన్ను కుంగదీస్తోంది. శారదా – మరీ ఎక్కువ ఆలోచించకు –
“ఆలోచించకుండా ఎట్లా – అసలు సాధ్యమా, ఆలోచించటం కాదు సమస్య ఆలోచించి దానిని కార్యరూపంలో పెట్టలేకపోవటం – చాలా ఒంటరిగా అనిపిస్తోంది అన్నపూర్ణా –
శారద ఆవేదన అర్థం చేసుకోగలిగేది అన్నపూర్ణ, సరస్వతులే –
ఒకోసారి వాళ్ళూ నిరాశలో కూరుకుపోయేవారు.
“ఏంటో – స్వాతంత్రం రాకముందు ఎన్నికలలు కన్నాం. ఇపుడు కలలు కూడా లేకుండా పోయాయి” అనేది అన్నపూర్ణ
అపుడు శారద ఉత్సాహం తెచ్చుకునేది.
“నాకు బోలెడు కలలున్నాయి. ఆ కలల కోసమే ఈ జీవిత ప్రయాణం – ప్రయాణం చేస్తున్నంతసేపూ దిగులుపడటానికేమీ లేదోయ్. ఏం సాధించామంటే ఇంత దూరం
ప్రయాణించటమే –
“గమ్యం అంటూ లేకుండా – ?
“గమ్యం ఒకటుండి అక్కడికి చేరుకోవటంతో ప్రయాణం ఆగిపోతుందనుకుంటే పొరపాటోయ్ – గమ్యాలు అనంతాలు – ఒకటి చేరుకుంటే మరొకటి ఎదురు చూస్తుంటుంది మనకోసం, మనం నడుస్తూనే ఉండాలి. ఆగిపోకూడదు. ఆగిపోయామా – ఇంకేముంది – ” అనేది శారద,
దేశ విభజన చేసి సరిహద్దులలో, రెండు దేశాల ప్రజలలో ఒక ఆరని చిచ్చు రగిల్చి వెళ్ళిన బ్రిటీష్ వారి దుర్మార్గాన్ని అర్ధం చేసుకోగలం. కానీ చైనా, భారత్ సరిహద్దుల మధ్య యుద్ధాన్ని అర్ధం చేసుకోవటం ఎలాగో చాలామందికి అర్ధం కాలేదు. ఒక సోషలిస్టు దేశం దురాక్రమణ చెయ్యదనే వాదంతో కొందరు కమ్యూనిస్టులు ముందుకు వచ్చారు. మరికొందరు దానిని అంగీకరించలేకపోయారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించేవారు, ఏకీభవించే వారు దాదాపు రెండు గ్రూపులుగా విడిపోయాయి.
యుద్ధ ప్రపంచంలో దేశభక్తి ఉప్పొంగటం సహజం. కొందరిని దేశద్రోహులుగా ముద్ర వేసినపుడు దేశభక్తి మరింత నిరూపితమవుతుంది. అనేక మంది కమ్యూనిస్టులు దేశద్రోహులుగా, జైళ్ళ పాలయ్యారు.
స్వరాజ్యం భర్త అరెస్టు అయ్యాడు, స్వరాజ్యం ఉద్యోగం కూడా ప్రమాదంలో పడింది. కాలేజీలో శలవు పెట్టి పిల్లను తీసుకుని బెజవాడ వచ్చేసింది స్వరాజ్యం, ఈ యుద్ధం, ఈ అలజడి, ఈ అరెస్టులు స్వరాజ్యానికంతగా అర్థం కాలేదు. శారదాంబ స్వరాజ్యాన్ని ఓదార్చింది గానీ ఆమె మనసూ అలజడితో అశాంతితో నిండిపోయాయి.
సోవియట్ యూనియన్, చైనా రెండు సోషలిస్టు శిబిరాలుగా ఏర్పడి ప్రపంచ ప్రజలను మంచికో చెడ్డకో ప్రభావితం చేయబోతున్నాయని ఆమెకు అర్థం అయింది గానీ అది మింగుడు పడలేదు. అంధకారంలోని ప్రజలకు ఆశాదీపాలనుకున్నవి ఇలా మారిపోవటం ఏమిటన్న ప్రశ్నకు ప్రపంచ రాజకీయ అధ్యయన వేత్తలు ఏవో విశ్లేషణలు చేసి సమాధానాలు చెప్పవచ్చు. కానీ ప్రపంచాధిపత్యపు పోరు తో సామాన్య ప్రజలు ఏమవుతారో పట్టించుకునేవారు లేకపోవటం విషాదం. ఆ విషాదం శారదాంబ మనసునిండా ముసురులా పట్టేసింది. సోషలిస్టు శిబిరంలో ఆధిపత్యం కోసం పోరులో సోషలిస్టు, కమ్యూనిస్టు విలువలన్నిటినీ కోల్పోతే – ఈ ఆధిపత్యం దేని కోసం? ఇన్ని ఉద్యమాలు ఇన్ని యుద్ధాలు, ఇన్ని బలిదానాలు ఏ ప్రపంచం కోసం చేశారో
ప్రజలు – ఆ ప్రపంచం కేవలం ఒక కల అనే చేదు నిజం మింగడం ఎలా? ఆశ దేనిపైన పెట్టుకోవాలి? నిరాశ నుంచి ఎలా తప్పుకోవాలి. నిరాశలో మునిగిపోకుండా ఏ ఆధారాన్ని పట్టుకోవాలి? దీన్నంతా తట్టుకునే గుండె నిబ్బరం ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి?
శారదాంబ కమ్యూనిస్టు పార్టీలో లేకపోయినా జాతీయంగా, అంతర్జాతీయంగా వారి సిద్ధాంతాలలో, కార్యాచరణలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఉంది. స్టాలిన్ మరణించిన తర్వాత కృశ్చెవ్ అధికారంలోకి వచ్చి స్టాలిన్ పై చేసిన ఆరోపణలు, శాంతియుత పరివర్తన ద్వారా కొన్ని దేశాల్లో సోషలిజం రావచ్చంటూ సోవియట్ పార్టీ చేసిన తీర్మానం అన్నిటినీ శారద ఆసక్తితో గమనిస్తూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవించిన కష్టాలు, నష్టాలు మొత్తం దేశం తల్లకిందులై మళ్ళీ కుదురుకోటానికి ప్రజలు చేసిన చేయవలసి వచ్చిన త్యాగాలు వీటన్నిటి ప్రభావం కావొచ్చు సోవియట్ యూనియన్ ప్రపంచశాంతి మీద ప్రధానంగా కేంద్రీకరించి మాట్లాడుతూ, మిలటరీ పరంగా బలపడుతూ వస్తోంది. చైనా పార్టీ దీనినంగీకరించటానికి సిద్ధంగా లేదు. దేశాలకు స్వతంత్రం, జాతులకు విముక్తి కలగకుండా శాంతి ఎలా సాధ్యమని వాదిస్తున్నది. సామ్రాజ్యవాద దేశాలపై యుద్ధం తప్ప సామరస్యం ఎలా కుదురుతుందంటుంది? స్వరాజ్యానికి ఈ రాజకీయాలను వివరించే క్రమంలో శారదకు అసలు సమస్య ఆధిపత్యం అని తోచింది. ఆధిపత్యానికి ఎవరూ, కమ్యూనిస్టులతో సహా ఎవరూ మినహాయింపు కాదని లీలగా అనిపించే సరికి భయమెరుగని శారదకు ఏదో భయం ఆవహించింది. తాత్వికంగా ఈ ఆధిపత్య భావన గురించి భయం కలిగినపుడే, భౌతిక ప్రపంచంలో శారద ఏ రెండు విషయాల గురించీ భయపడుతుందో ఆ రెండూ జరిగిపోయాయి.
మే నెలలో నెహ్రూ మరణించాడు. జులై నెలలో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలటం ఖాయమైంది.
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అవలీలగా తట్టుకున్న శారద ఈ రెండు పరిణామాలనూ తట్టుకోలేకపోయింది.
ఆమె హృదయం మీద నేరుగా పనిచేశాయీ సంఘటనలు. ఈ చీలికలింతటితో ఆగవని కూడా ఆమెకు అర్థమవుతోంది.
భర్త జైలు పాలవటంతో స్వరాజ్యం పూర్తిగా నిరాశపడుతూ, డిప్రెషన్లోకి వెళుతుందేమో అన్న భయంతో అన్నపూర్ణ మనవరాలు అరుణజ్యోతిని తన దగ్గర
ఉంచుకుని స్వరాజ్యాన్ని శారద దగ్గరకు పంపింది. శారద ఆమెకు హాస్పిటల్లో చిన్నచిన్నపనులు అప్పగించేది. భర్తలు జైలు పాలై ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలను ఆదుకోటానికి తాను ఎవరికీ తెలియకుండా చేసే సహాయాలను ఇప్పుడు స్వరాజ్యం ద్వారా చేయిస్తోంది. ఇద్దరూ కలిసి పుస్తకాలు చదువుకునే సమయం ఎలాగూ ఉంది. ఏం చేసినా స్వరాజ్యం ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు.
శారదలో అప్పడే మొలకెత్తుతున్న ఆధిపత్యం అనే తాత్త్విక భావనను అందుకోవటం స్వరాజ్యానికి కష్టమే అవుతోంది.
“నిన్ను నువ్వు ఆధిపత్యాన్ని అమలు చేసే పరికరంగా వాడుకుంటావా? ఆధిపత్యం సృష్టించిన ఒక వ్యక్తిగానో శక్తిగానో పనిచేస్తావా? లేక దాని నుంచి స్వేచ్ఛ కోసం స్ట్రగుల్ అవుతూ, ఆ స్ట్రగుల్ జీవితమంతా చేస్తూ, నిరంతరం దానికోసమే జీవిస్తూ, ప్రతిక్షణం నిన్ను నువ్వు బతికించుకోటానికి, వికసింపచేసుకోటానికి చేసే ఆ పోరాటమే జీవిత గమ్యమనుకుంటావా?” శారద తనను తాను రాపిడి పెట్టుకుంటూ, మెదడుని మండించుకుంటూ మాట్లాడే మాటలు విని
పెద్దమ్మా – నాకేం అర్ధం కావటం లేదు. ఆధిపత్య పరికరాన్నా నేను? అదేంటి” అని అడిగేది నిస్సహాయంగా,
“నీకు వివరంగా చెప్పలేకపోతున్నా గానీ మానవులందరిలో ఈ ఆధిపత్యమనే క్రిమి చేరిపోయిందమ్మా – ఇన్ని వేల సంవత్సరాల మానవ పరిణామంలో, రాజ్య విస్తరణ కాంక్షలలో వర్ణ, వర్గ సంరక్షణ విధానాలలో, స్త్రీల అణచివేతలో ఈ ఆధిపత్యం కరడుగట్టి మానవులలో ప్రవేశించిందనిపిస్తోంది, ఇతరుల మీద ఒక ఆధిపత్యం నెరపకపోతే మనుషులు బతకలేరా?
ఆధిపత్యం సాగించాలంటే స్వేచ్ఛ కోరే మనుషులుండాలి కదా? స్వేచ్ఛను కోరకుండా బానిసలైన వాళ్ళ మీద అమలు చేసే ఆధిపత్యం మళ్ళీ తృప్తినివ్వదు. స్వేచ్ఛాకాంక్ష రగులుతుంది. ఆ కాంక్ష ఉధృతమై పోరాటాలూ, ఆ పోరాటాలలో మళ్ళీ ఆధిపత్య సంస్కృతి – దాని మీద తిరుగుబాటు – బైటి శత్రువు, లోపలి శత్రువు – కానీ బైటి శత్రువుని గుర్తించటం తేలిక, లోపలి శత్రువుని గుర్తించటం కష్టం – ”
శారద ఆలోచనల ధాటికి ఆమె గుండె తట్టుకోలేక పోతోంది.
స్వరాజ్యం తన నిరాశను మర్చిపోయి శారద శరీరంతో, మెదడుతో చేస్తున్న కఠోర పరిశ్రమను తగ్గించాలని చూసేది.
పెద్దమ్మా నువ్వు చాలా అశాంతి పడుతున్నావు. అది మంచిది కాదు నీ ఆరోగ్యానికి?
“నా అశాంతి వేరు. కానీ నీ అశాంతి నిన్ను తినేస్తోంది పెద్దమ్మా అంత ఆలోచించకు సినిమాకు వెళ్దామా ఇవాళ?”
“పలాయనం వైపు ప్రయాణం కాదు నాది” అంటూనే ఆలోచనల్లో మునిగిపోయేది. ఆమెను ఆ ఆలోచనల నుండి రక్షిస్తున్నది సామాన్య ప్రజలు, తమ సమస్యలు చెప్పుకోటానికి వచ్చే మామూలు స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగార్డులు, రకరకాల బాధల్లో ఉన్నవారు, వారి సమస్యలు ఎలాగైనా పరిష్కరించి వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడాలనే కాంక్ష ఆమె జీవన తత్త్వ కాంక్ష ఆ పనులలో ఈ ఆలోచనలకు కొంత అంతరాయం కలిగేది. రాత్రుళ్ళు మాత్రం పుస్తకాలు, చర్చలు, ఆవేశాలు, అశాంతులు,
అలసటలు.
సూర్యం కూడా అక్కను చూసి భయపడుతున్నాడు.
“మా నాన్నకూడా చరిత్రకు సంబంధించిన పరిశోధనలో మునిగి, ఆ ఆలోచనల తీవ్రతతోనే అనారోగ్యం పాలయ్యాడు. ఆయన గుండె బలహీనమయింది. మళ్ళీ ఇప్పడు అక్కను చూస్తుంటే భయంగా ఉంది, స్వరాజ్యం నువ్వు మీ అమ్మాయిని తీసుకురా – పిల్లలతో ఆటలతో కాలం గడిపితేనన్నా ఇవన్నీ కాస్త వెనకపడతాయేమో అనటంతో అరుణజ్యోతి భవిష్యత్ దీపంలా ఆ ఇల్లు వెలిగింది. శారద, స్వరాజ్యం మళ్ళీ నవ్వుతున్నారు. సూర్యం శారద ఇంట్లో ఉన్నంతసేపూ ఆమె కళ్ళముందు పిల్లలుండేలా చేస్తున్నాడు.
ఆ రోజు ఎవరో విద్యార్థి శారద కోసం వచ్చాడు. శారద ఆ పిల్లవాడు చెప్పేది ఓపికగా విన్నది. కాలేజీ ఫీజు కట్టటానికి ఆ కుర్రాడికి సమయానికి ఫీజు అందలేదు. డబ్బు సమకూర్చుకుని వెళ్ళేసరికి సీటు లేదన్నారు. సంవత్సరం వృధా అవుతుందనే వ్యధతో ఏడుస్తున్న ఆ కుర్రవాడికి ఎవరో డాక్టర్ శారదాంబ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ అబ్బాయిని తీసుకుని ప్రిన్సిపాల్తో మాట్లాడదామని వెళ్లింది శారద,
“డబ్బు అందటంలో ఒక్కరోజు ఆలస్యానికి ఒక సంవత్సరం వృధా కావటం
ఏమిటి – ఈ అబ్బాయిని కాలేజీలో చేర్చుకోండి” అని అడిగింది శారద, ప్రిన్సిపాల్ ససేమిరా వీలుకాదన్నాడు. ఆ అనటంలో అతను కనపరిచిన అహంభావం, అధికార దర్పం, అమానుషత్వం శారద హృదయాన్ని కలిచివేశాయి. బాధ, అవమానం, కోపంతో ఆమె బైటికి నడిచింది.
“మరో కాలేజీలో సీటు దొరకక పోదు. ప్రయత్నిద్దాం. రేపు రా” అని తను ఇంటికి వెళ్ళింది.
రూల్సు, వాటిని దాటకూడని కంట్రోళ్ళు, వాటి అమలుపై అధికారం, అది ఆధిపత్యంగా మారి మానవత్వాన్ని సంహరించటం – ఒక చిన్న ఘటన ఎంత తాత్త్విక భావననైనా రగిలించవచ్చు.
తప్పులు, నేరాలు, క్రమశిక్షణలు, శిక్షలు, ఆధిపత్యం ఆ కళాశాల అధికారి మాటల్లో శారదకు విశ్వరూపంలో కనిపించింది.
మనిషిపై మనిషి చేసే, అమలు చేయాలని చూసే ఆధిపత్యం కూడా యుద్ధమే. ఈ యుద్ధానికి ఆయుధాలు, సైన్యాలు, టాంకర్లు, బాంబులు, విమానాలూ ఆకర్లేదు. ఇది యుద్ధమని ఎవరికీ తెలియదు. ఎవరూ చర్చించరు యుద్ధపు తీరుల గురించి, యుద్ధ విన్యాసాల గురించి, యుద్ధ ఫలితాల గురించి, నిశ్శబ్దంగా, రహస్యంగా జరిగే యుద్ధం సమాజం లోలోపల దాగిన ఈ ఆధిపత్యం. ఐతే ఆ నిశ్శబ్దం అప్పుడప్పుడూ బద్దలై అనేక చోట్ల సంఘర్షణలు రేపుతుంది. సాంఘిక వ్యవస్థల్లో, ఆర్థిక అసమానతల్లో, జాతుల్లో, మతాల్లో రంగుల్లో రూపుల్లో భాషల్లో ప్రాంతాల్లో మన లోపలి లోతుల్లో ఆ సంఘర్షణ బద్దలై, ఆ రహస్య నిశ్శబ్ద యుద్ధం ఒకనాడు బహిరంగమవుతుంది. విస్ఫోటనం. విలయం, మనిషి మరింతగా చచ్చి, అమానవులు మరింత బలవంతులై, ఆధిపత్యం మళ్ళీ రహస్యమై – ” స్వరాజ్యం ఆ రోజు శారదను ఆపలేకపోయింది. ఎంతోసేపు ఆ విషయం మాట్లాడుతూనే ఉంది.
శారదాంబ ఆ రోజు భోజనం చేయలేకపోయింది. సూర్యం, నటాషా స్వరాజ్యంలు బలవంతంగా కూర్చోబెట్టారు. పద్మ పక్కనే కూచుని తినిపించింది. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకుని అందరూ తమ గదుల్లోకి వెళ్ళీ పడుకున్నారు. స్వరాజ్యం శారద దగ్గరకు వచ్చింది.
పెద్దమ్మా నువ్వివాళ చాలా అన్రెస్ట్గా ఉన్నావు” అంది పక్కన కూచుంటూ, నవ్వింది శారద,
“ఊ – నిజమే. ఆ ప్రిన్సిపాల్ వ్యవహారం ఎన్నో ఆలోచనలు రేపింది” “ఆధిపత్యం గురించేనా?”
“ఔను. నా ఆధిపత్యం గురించి కూడా – చాలా ఆలోచించాను. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది స్వరాజ్యం, ఈ మధ్య కాలంలో ఎన్నో సందేహాలు సమాజం గురించి, మార్పు గురించి, మన జీవిత ప్రయాణాల గురించీ – ఇప్పుడు నాకంతా స్పష్టంగా ఉంది – ఆధిపత్యాన్ని గుర్తించి పోరాడే ప్రతి క్షణము సజీవంగా మనతోనే ఉంటుంది. మనం పోరాడుతామా, బానిసత్వంలోకి జారిపోతామా అనేది మనం మనుషులుగా ఉన్నామా లేదా అనే దానికి గుర్తు. స్వరాజ్యం – ఆధిపత్యం ఒక్కచోట ఒక్కరూపంలో లేదమ్మా – అన్నిటినీ గుర్తించాలి మనం – మనతో సహా – ”
వెలుగుతున్న శారదాంబ కళ్ళు చూస్తుంటే స్వరాజ్యానికి ఆ తేజస్సు చూసి భయం వేసింది.
పెద్దమ్మా – నువ్వింక నిద్రపో – నాకూ నిద్రౌస్తోంది” అంటూ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళింది.
సూర్యంతో ఏదో చెప్పాలనిపించింది గానీ ఎందుకో ఒద్దనుకుని, పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది.
మర్నాడు ఉదయం నెమ్మదిగా స్నానం ముగించి “నిద్రలేని రాత్రి వల్ల వచ్చిందా ఇంత బలహీనత, ఈ నీరసం” అనుకుంటూ నాలుగడుగులు వేసిన శారదాంబ కుప్పకూలిపోయింది. సూర్యం, నటాషా పరిగెత్తుకు వచ్చి లేపుతుంటే సూర్యానికి అర్థమైంది అక్క ఇక లేదని, అతనికి సృహ తప్పింది. స్వరాజ్యానికి అంతా అయోమయంగా ఉంది. నటాషా, పద్మలకేమీ అర్ధం కాలేదు.
క్షణాల్లో బెజవాడంతా శారదాంబ ఇంటి ముందు ఉందా అన్నట్లయింది. అందరి కళ్ళూ కన్నీళ్ళతో మసకబారాయి. ఆధునిక స్త్రీనని గర్వించిన కళ్ళు ఆధునికతలోని ఆధిపత్యాన్ని అర్ధం చేసుకునే క్రమంలో మూతబడిపోయాయి.
(సమాప్తం)
తాజా కామెంట్లు