ఇప్పుడు యాది అన్న మాట వింటేనే సదాశివ!

2 (2)
(సదాశివ గారి పుట్టినరోజు మే 11 )
ఆదిలాబాదు  పేరు  తలువంగనె  సదాశివ  సారు యాదికి వస్తుండె  ఇదివరకు .
ఇప్పుడు యాది  అని  ఎక్కడ్నన్న విన్నా  చదివినా  సదాశివ పేరు, యాది సదాశివ  అనే పదబంధం  గుర్తుకు వస్తయి.
మా ఆదిలాబాదు  జిల్లాలనేమొ  సారు దగ్గర  చదువు నేర్చుకున్న  శిష్యులు ,చుట్టాలు పక్కాలు  చాలమంది  ఉన్నరు గని  అందులో  సారు సాహిత్యపు లోతులు తెలిసినోళ్లు  మాత్రం చాల తక్కువమందనే చెప్పాలి.  సదాశివ  సారు తన జీవిత కాలం లో  చాల ఎక్కువ కాలం  ఆదిలాబాదు జిల్లాలో గాని  ఆదిలాబాదు పట్టణంలో గాని  గడిపిండు.చదువుకునే రోజుల్లొ  కొంతకాలం  వరంగల్,హైదరాబాదులో  ఉన్నరు.ఉద్యొగం  ఆదిలాబాదు జిల్లాలనే దొరికింది. కొన్నిరోజులు  ఉపాధ్యాయునిగా ,ఆ తరువాత  పాఠశాలల  తనిఖీ  అధికారిగా ,ఆతరువాత ఉపాధ్యాయ శిక్షణా  కేంద్రంలో  బోధకునిగా  పనిజేసిన్రు. పదవీ  విరమణకు ముందు  పదోన్నతి  పై  భద్రాచలం  జూనియరు  కళాశాల  ప్రిన్సిపాలుగా  పనిచేసి  అక్కడనే  పదవీ విరమణ  పొంది  ఆదిలాబాదు  పట్టణంల  స్థిరపడ్డరు.
ఇదంతజెప్పుడెందుకంటె సారు ఎక్కడికి గదలకుండనె ఎక్కడెక్కడివాళ్లకోబాగాఎరుకయిండు.
 ఎంతోమందిఅభిమానంసంపాయించుకున్నడు.ఆయన పుసకాలు జదివి  ఆయన  పరిచయం సంపాదించుకున్నవాళ్లు  కొంతమంది ,ఉద్యోగ రీత్యా  ఆదిలాబాదుకు వచ్చి  సారు గురించి తెలిసి ,సారును కలుసుకొని  అనుబంధాన్ని  పెంచుకున్నవాళ్లు  మరి కొంత మంది.సారూ ఊరికె చెప్పుతుండె  రాసే వాళ్లు  వాళ్ల పాఠకులను గూడా తయారుజేసుకోవాలె  అని.అది ఎట్లా అన్న  ప్రశ్నకు  సారు జీవితం నిడివంత  సమాధానం  చెప్పాలె.
సారు బుట్టిన  తెనుగుపల్లె  మా కాగజునగరుకు పది పన్నెండు కోసుల దూరముంటది.నేను  సారు చనిపోయింతరువాత  వారం రోజులకు  కొంతమంది  ఉపాధ్యాయులు  సారు  సంస్మరణ సభ ఏర్పాటు జేస్తే  వెళ్లిన.ఇప్పటికి అది చాల చిన్న పల్లెనే.అక్కడా,  కొత్తపేట (కాగజునగరు )పక్కనే ఉన్న  నవుగామలో సారు  బాల్యం గడిచిందట.తండ్రి  నాగయ్య పంతులు  బడిపంతులు. అప్పట్లో  అన్నీ  ఉరుదూ మాధ్యమం  బళ్లు .జిల్లాకు ఒకటో రెండో  ఉన్నత పాఠశాలలు. సారు ఉరుదూ  బాగా ఒంటబట్టిచ్చుకున్నడు .అట్లనే తెలుగులో మంచి  ప్రావీణ్యం  సంపాదించిండు.
 మొదట్లో  పద్య కవిత్వం  రాసిండు,ఆ  కాలంల  భారతి  పత్రికల  సారు రచనలు వస్తుండె.అట్ల సాహిత్యవ్యాసంగం దిన దినాభివృద్ధి చెందింది.వేలూరి శివరామశాస్త్రి ,కప్పగంతుల లక్ష్మణశాస్త్రి  వంటి ప్రముఖులతో  పరిచయాలు పెంచుకున్నరు  ఉత్తరాల ద్వారా.సురవరంప్రతాపరెడ్డి  సూచన తో  పద్య ప్రక్రియ పక్కకుబెట్టి  తనకున్న ఉరుదూ, ఫారసీ,అరబ్బీ,మరాఠీ  భాషల పట్టుతో  వచన రచన ,అనువాద ప్రక్రియలకు  ఉపక్రమించిన్రు.అనేక మంది తెలుగు కవులను  ఉర్దూ  వారికి పరిచయం చేసిన్రు.ఉర్దూ కవుల గురించి తెలుగువారికి పరిచయం చేసిన్రు.ఉర్దూ సాహిత్య చరిత్ర  తెలుగు వారికి  తెలియ జేసిన్రు.ఇదంత ఒక ఎత్తయితే హిందుస్తానీ  సంగీతం  ముచ్చట్లు  ఇంతవరకు ఎవ్వరు జెప్పని రీతిలొ  చెప్పిన్రు .
 ఎంత గొట్టు విషయమైనా  అరటి పండు వొలిచి పెట్టినట్లు  సుతారంగా చెప్పుడు  సారుకే  చాతనయితది.అదిగూడా  ముచ్చట్ల  మాదిరిగ  చెప్పుడు  సారు ప్రత్యేక శైలి. అది చాల మందిని ఆకర్శించింది .ఇంకో  గమ్మత్తయిన విషయం ఏందంటే  సారు దృష్టిల బడ్డ  ఏ  మంచి విషయమైనా  ప్రస్తావనలోకి రావడం.చిన్న వారిలోనైనా పెద్దవారిలో నైనా మానవతావిలువల్ని పసిగట్టి  పనిగట్టుకొని  వాటిని  పదిమందికి తెలియజేయడం  సారు అలవాటు .గురజాడ  మంచి అన్నది పెంచుమన్నా  అన్న మాటకు  సారూ ఎన్నుకున్న  మార్గం అది .
 నాకు సారుతో  ఉన్న  మూడు దశాబ్దాల  సాన్నిహిత్యంతో  అయన మార్గం  మంచి ఫలితాలను  సాధించిన విషయం నేను  ఎరుగుదును. సారుతో  ఒక సారి పరిచయం  ఏర్పడిందంటే  అది కొనసాగాల్సిందే. సంబంధాలన్నీ  నిత్య నూతనంగా ఉండాల్సిందే .పని ఒత్తిడి వల్లనో,మరేదైనా కారణాల వల్లనో  పొరపాటున ఎవరి సమాచారం కుంటు పడినా  సరే స్వయంగా ఫోను  చేయించి  తెలుసుకునే వారు .ఎప్పుడు కలిసినా ఏదో ఒక కొత్త విషయం చెప్పేవారు. ఆ విధంగా  మనసుకు దగ్గరగా  చేసుకునే వారు .వినయం  సారుకు ఇష్టమయిన  లక్షణం .అలాగే  ఏ చిన్న  ప్రతిభ  ఉన్నా ప్రోత్సాహం  కలిగించడం  సారు ప్రత్యేకత .
 దాదాపు  ఆరున్నర  దశాబ్దాల పాటు  పరిమిత  సాహితీ  వర్గానికి  మాత్రమే తెలిసిన  సదాశివ  యాది ధారావాహికతో,అంతకు ముందు మలయమారుతాలు తోనూ  తెలుగు  చదువరులను  తన వైపుకు తిప్పుకున్నారు .యూనివర్సిటీలు  ఒకదాని వెంబడి  ఒకటి ఆయన  ప్రతిభను  గుర్తించి  ప్రతిభా పురస్కారాలు,గౌరవ  డాక్టరేట్లు  ప్రదానం  చేసి  వాటి  విలువల్ని  పెంచుకున్నాయి. సహస్ర చంద్ర దర్శన దశలో  కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు  రావడం  సామల సదాశివ  సాహిత్య కృషికి సముచిత  గౌరవ ప్రదమైనదిగా,జీవన  సాఫల్యంగా  ఎంచవచ్చు. హిందుస్తానీ  సంగీతానికి సంబంధించిన  ముచ్చట్ల పుస్తకం  ‘స్వర లయలు ‘ కు  ఐ అరుదైన  పురస్కారం
లభించటంగొప్పవిశేషం.ముచ్చట్లకుసాహిత్యస్థాయి  కల్పించిన ఘనత  సదాశివ సారుదే.
ఎంతటిగహనమైన విషయాన్నైనా  అతిసరళంగాచెప్పగలగటం  ఆయనకు  వెన్నతో పెట్టిన విద్య .ఆయన  వచన రచన  విలక్షణమైనది.అంతర్లీనంగా  ఒక  సమ్మోహన  శక్తి ఉంటుంది  రచనల్లో. ముఖ్యంగా  ఆయన మాటలు ఒక సారి విన్న వాళ్లు  ఆయన రచనలు  చదివినప్పుడు  ఎదురుగా కూచొని  మాట్లాడుతున్న అనుభూతిని పొందుతారు .ఈ  సందర్భంగా  ఆయన తో  నా తొలి పరిచయ సందర్భం  విన్నవించుకుంటాను .
 కాగజునగరులో  సర్సిల్కు  మిల్లు  ఆద్వర్యంలో  నడిచె ఒక ఉన్నత పాఠశాల  రజితోత్సవ  సందర్భంగా  సావనీరు తీశారు .శ్రీమతి  అందులో ఉపాధ్యాయిని  కావడంతో  ఆ సంచిక  చదవటం ,తెలుగు విభాగంలోని  ఒక వ్యాసం  నన్ను బాగా  ఆకర్షించడం జరిగింది.వ్యాసం శీర్శిక ‘ముఝే  మెరే దోస్తోంసే బచావో  ‘ వ్యాసం చివర  సదాశివ  అని మాత్రమే  ఉన్నది .అప్పటికి  నాకు  నారాయణ గౌడుతో  ఇంకా పరిచయం ఏర్పడలేదు .మా శ్రీమతి  ద్వారా  ప్రయత్నిస్తే  ఆయనెవరో  ఆదిలాబాదులో  ఉంటారట,పాఠశాల  ప్రధానోపాధ్యాయిని శ్రీమతి మాలినీ చాందోర్కరు గారికి  తెలిసిన వ్యక్తి అని మాత్రం  తెలిసింది.ఆ ఒక్క  ఆర్టికిల్  చాలు  మచ్చుకి సదాశివ  రచన ఎంత ప్రభావ వంతమైందో  చెప్పడానికి.కాగజునగరులోనే  ఉండే  నారాయణ గౌడు  సారు ప్రియశిష్యుడు.వారిరువురి  మధ్య  ఉత్తర ప్రత్యుత్తరాలు  చాలా ఏళ్లపాటు  నడిచినై.
 కొన్ని రోజుల  తర్వాత  నారాయణ గౌడుతో  పరిచయం  అయింది .సారు ప్రస్తావన రావటం ,ఆయనద్వారా  అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ తరువాత సారును కలువడానికి  ఆదిలాబాదు వెళ్లాను.బస్సుదిగి  బస్సు స్టాండు బయటికి వచ్చాను .పక్కనే  పాన్ ఠేలా  దగ్గర  ఒకాయన గనిపించిన్రు.ఎందుకో ఆయినెను  జూడంగనే  ఆయిన్నే  సదాశివు సారు గావచ్చుననిపించింది.  దగ్గరికి బొయ్యి  నమస్కారం సార్ అన్న. ఏ వూరు బాబూ  అన్నడు.కాగజునగరు అనిచెప్పిన.ఇగ అట్లనే ముచట్లువెట్టుకుంటు ఇంటి దాక బోయినం.అప్పట్నుంచి  ఎప్పుడు ఆదిలాబాదు వెళ్లినా  సారును కలిసివచ్చేవాణ్ని. మొన్నమొన్నటిదాక సారువాళ్ల ఇల్లు పర్ణ కుటీరం లాగుంటుండె. వాలు కుర్చీలో  కూచోని గంటలకు గంటలు  ముచ్చట్లు  చెప్పుతుండె.మేం  తెలుగు సాహితీ సదస్సు  ఏర్పరచుకున్నం  కాగజునగర్ల.డాక్టరు  విజయ మోహన్ రావు  అధ్యక్షుడు ,నారాయణ గౌడు  కార్యదర్శి. మొదటి కార్యక్రమానికి  సారు వచ్చిన్రు. ఆ తరువాత  నామొదటి పుస్తకం  గోంతెత్తిన  కోయిల ఆవిష్కరణ  కోసం వచ్చిన్రు.దానికి ముందు మాట  కూడా రాసిన్రు.నా రెండో పుస్తకం మువ్వలు(హైకూలు )  సారూ ప్రోద్బలం తోటే వేసుకున్న. దానికి గుడ  సారు మురిపించే  మువ్వల సవ్వడి  అని  అభిప్రాయం  తెలిపిన్రు.గత  ముఫ్ఫై  సంవత్సరాల్లో  ఏడెనిమిది  సార్లయినా  వచ్చుంటరు కాగజునగరుకు.  వచ్చినప్పుడల్లా  రెండు మూడు రోజులుండి  చుట్టాల నందర్నీ కలిసి వెళ్లేవారు.సాయంత్రాలు  నారాయణ గౌడు ఇంట్లనో  భీమయ్య  సారూ ఇంట్లనో లేకపోతె  మా  ఇంట్లనో భేటీ.అర్ధ రాత్రి దాకా  ముచ్చట్లు.ముచ్చట్లతోపాటు  నాలుగు  మందు చుక్కలు.గోలేటి నుంచి చమన్ వస్తుండె.కాగజునగరు సాహితీ మిత్రులకు  సారు వచ్చిండంటె  పండుగ.
photo (2)
 వరంగల్లు  విశ్వేశ్వర  సంస్కృతాంధ్ర  కళాశాల  వాళ్లు  తెలంగాణా సాహిత్యం మీద వరుసగ మూడు సంవత్సరాలు  సంగోష్టి జరిపిన్రు.దానికి  ఆదిలాబాదు ప్రతినిధిగా  నన్ను పిలిచిన్రు.అప్పుడు సారు దగ్గరికి వెళ్లి  చాలా విషయాలు  తెలుసుకుని  పత్రసమర్పణ చేసిన.వాళ్లు  మూడు సంవత్సరాలు  మూడు  పుస్తకాలు  ప్రచురించిన్రు .ప్రాచీన,అర్వాచీన ,ఆధునిక సాహిత్యాల పేరిట.
నా వచన కవితా సంపుటి  పెన్ గంగ  ప్రాణ హిత  సారింట్లో సారు చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.మా అదృష్టం సారు యాదిలో  మాగురించి రాయడం. పోయిన  మే  11 న  న్యూజెర్సీ  నుంచి  జన్మదిన శుభా కాంక్షలు  తెలిపితే  నీదే మొదటి ఫోను  అన్న సారు ఈ 11 కు లేకుండపొయిన్రు.సారుతో పరిచయం  నా జీవితంలో  ఒక అతి ముఖ్యమైన సంఘటనగా  తలచుకొంటాను.ఎన్నో యాదులు  మిగిల్చిన  మా సదాశివ సారును  యాది దెచ్చుకుంటూ.