మాయా తివాచి

 

 

చిత్రం: ప్రవీణా కొల్లి

పదాలు:  విజయా కర్రా

~

 

సూరీడింకా చూడని ఆ ఉదయాన

తూగుటుయ్యాలలో సాగుతున్న పయనం చిన్న కుదుపుతో ఆగి

కళ్ళు తెరిచి చూస్తే …

రెక్కల మనిషేవరో రమ్మని

చెయి చాచి పిలిచి మాయమైనట్లనిపించింది

 

అబ్బురపడి

కాసింత పక్కకి ఒత్తిగిల్లి, మబ్బు కళ్ళని విప్పార్చి చూస్తే

దూరాన కనిపించే ఊరేదో నచ్చి –

వుండొస్తానని  మనసు ఎగిరెళ్ళి పోతే

చేను ఆహ్వానించిందట  –  గాలి గంధం పూసిందట

తెలిమంచు పన్నీరు జల్లి

కొమ్మల ఆకులు కుశలమడిగాయట

 

పచ్చని పంటచేల మధ్య పట్టుమని పది ఇళ్ళుట

ఊరి జనమంతా మనసుకి నచ్చిన వాళ్ళేనుట

బరువు బాధ్యత – కష్టం నష్టం లేనే లేవని

వాగు వంకా – చెట్టూ పిట్టా చెపితే

అవునవునని వాళ్ళ నవ్వు మొహాలు వంత పాడాయిట

 

ఆ ఊసుల దారాలన్నీ పోగేసుకుని

ఆశల తివాచిని అల్లి తెచ్చింది మనసు

మనసు మంత్రించి ఇచ్చిన మాయా తివాచి పైన

మబ్బుల్లో సాగింది

తిరిగి నా పయనం

**

ఒంటెద్దు బండి – ఓ పాతకాలపు జ్ఞాపకం

ఈ రోజుల్లో సర్ప్రయజ్ పార్టీలు చాల కామన్. బేబి షోవర్ లంటూ మరింక పుట్టిన రోజులకి మేమో ముప్పయి నుండి యాబై  వరకు ఓ హాల్లో చేరి… లైట్లన్నీ ఆర్పేసి …. ఉష్!  ఉష్!  అంటూ సైగలు చేసుకుంటూ – ఆ ఒక్క మనిషి లోపలికి రాగానే ‘సర్ప్రయజ్’ అంటూ గావుకేకలు వేసి నానా హడావిడి చేస్తాం.

కాని నా చిన్నతనంలో ఇలాంటివి చాలా సహజంగా జరిగేవి. ఒకే ఒక వ్యక్తి ఓ పెట్టో బుట్టో పట్టుకుని చెప్పాపెట్టకుండా ఇంటి ముందు ప్రత్యక్షమై ఇంటిల్లిపాదిని సర్ప్రయజ్ చేసేవారు. ఓ వేళ కార్డ్ ముక్క వ్రాసి పడేసిన అది వాళ్లోచ్చాకే చేరేది. అదిగో అలాగే అడుగు పెడుతుంది మక్కిపాలెం శేషమ్మ నిశాపతి గారి “ఒంటెద్దు బండి” కథలో. ఈ కథ నవ్య 2012 దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చింది.

“అమ్మమ్మొచ్చింది, అమ్మమ్మొచ్చింది” అంటూ మొహం చాటంత చేసుకుని ఎగురుకుంటూ వెళ్లి చెప్తాడు కథ చెబుతున్న అబ్బాయి. “ఏ అమ్మమ్మరా?” అంది అమ్మ. “మాకు అమ్మమ్మలు చాల మంది వుండేవారు” అంటాడా అబ్బాయి.

అదిగో అదే “మాకు అమ్మమ్మలు చాల మంది వుండేవారు” అన్న ఆ వాక్యం – సూదంటు రాయిలా ఆకర్షించి చిన్నతనం జ్ఞాపకాల తెనేతుట్టని కదిపి కుదిపేసింది. ఏ వరసన అమ్మమ్మలవుతారో మరింక ఏ వరసన పిన్నులే అవుతారో, తాతయ్యలే అవుతారో తెలియని ఎంతోమంది ఆత్మీయ బంధువులు అలా కళ్ళముందు ప్రత్యక్షమైపోయి, ఆప్యాయంగా వచ్చి పలకరిస్తే వచ్చే పులకరింపులా ఈ కథ నా మనసులో నిలిచిపోయింది.

ఆ తరువాత “అసలింటికి చుట్టం రావడమే మాకానందం, ఎవరొచ్చినా మేం అంటే పిల్లలం, ఒకేలా ఆనందించేవాళ్ళం” అంటాడా అబ్బాయి. మేము అంతే. అంతెందుకు ఊర్లో ఎవరింటికి ఎవరొచ్చినా… ఏ గాలి పటాలు ఎగరేసుకునే వాళ్ళకో, వీధిలో గోలీలు ఆడుకునే వాళ్ళకో… ఎవరికి ముందు కనిపిస్తే వాళ్ళు ‘ఫలానా వచ్చారో!’ అంటూ దండోరా వేస్తూ పరిగెడితే, వాళ్ళని ఫాలో అయిపోయి ఆ వచ్చిన అతిధిని వాళ్ళ ఇంటిదాకా సాగనంపేవాళ్ళం. ఆహ్వానించే ఆ ఇంటివాళ్ళ హావభావాలను చూడడం మాకు సరదా.

అసలు శేషమ్మమ్మ మాకు ఏ రకంగా బంధువో తెలియదంటాడు కథ చెబుతున్న ఆ కుర్రాడు. అలా బంధుత్వానికి వస్తే బహుదూరమయినా అనుబంధానికి వస్తే అతి చేరువయి నా జ్ఞాపకాల్లో నిలిచి పోయిన వ్యక్తి  మా పిలక తాతయ్య. తాతయ్యంటే మళ్లీ మా అమ్మ నాన్నో నాన్న నాన్నో కాదు. మా రాజమండ్రి బాబాయి అత్తగారు మావగార్లె ఉహ తెలిసాక మాకు తెలిసిన అమ్మమ్మా తాతగార్లు. మా పిన్ని వాళ్లకి ఒక్కతే కూతురవటంతో వాళ్ళు మా బాబయి ఇంట్లోనే వుండేవారు.

చిన్నప్పుడు వేసవి సెలవలకి మా వూర్లో రైలెక్కి హైద్రాబాద్ వెళ్లి – అక్కడ మా పిన్నీ వాళ్ళని సర్ప్రయజ్ చేసేసి – మళ్లీ ట్రైనెక్కి రాజమండ్రి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏ వరసలో మనవలవుతారో తెలియని మాలాంటి గ్యాంగ్ చాలా మందే వుండేవాళ్ళు. మా అందరికి అమ్మమ్మ కమ్మగా వండి  భోజనాలు పెడితే తాతయ్య నూనెలు రాసి జడలు వేయడం నుండి జోల పాడి నిద్రపుచ్చే వరకు అన్ని పనులు మహా ఉషారుగా చేసేవారు. పెట్టె నిండా స్వీట్లతో, మనసు నిండా  జ్ఞాపకాలతో… మరింక ఒంటి నిండా సెగ్గడ్డలతో మేము వెనక్కి  తిరిగి వచ్చేవాళ్ళం.

 

Page128

ఆ తరువాత చాల ఏళ్ల తరువాత నా పదహారో ఏట తాతగారిని కలిసినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని “తండ్రి లేని పిల్లవయిపోయావమ్మా!” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అప్పటికి మా నాన్నగారు పోయి ఆరు నెలలవుతోంది. ఆ తరువాత కూడా తన ఆల్లుడి అన్నగారయిన మా నాన్నని తలచుకుని తలుచుకొని అయన చిన్న పిల్లాడిలా ఏడ్చారు.

ఇలా ఈ కథలో ప్రతి వాక్యం నన్ను చెయ్యి పట్టుకుని గతంలోకి లాక్కుపోతుంటే (ఈ కథ పరమార్థం అదేనా అనుకుంటే) నా ఈ సమీక్ష ఓ నవలంత అయ్యేలా వుందని నా కిప్పుడే అర్థమయింది (ఇంక ఇది నా మొదటి  సమీక్ష అని మీకేప్పుడో అర్థమయే వుంటుంది). అందుకే సంక్షిప్త సమీక్షకి ప్రయత్నిస్తూ కథలోకి తొంగి చూస్తే.

నిశాపతిగారి శేషమ్మమ్మ ఓ సజీవమైన పాత్ర. ఆనాటి జీవితాలనుండి నడచి వచ్చిన పాత్ర. ఒంటెద్దు బండిలాంటి జీవితం సాగిస్తూ అందరూ తనవాళ్ళే అనుకుంటూ ఆప్యాయతలకోసం ఆరాటపడే అలాంటి వ్యక్తులు ఆ రోజుల్లో చాలా మందికి చిరపరిచితులు. అలాగే ఎప్పుడూ తెరిచివుండే వీధి వాకిల్లతో వాళ్ళని మనస్పూర్తిగా ఆహ్వానించే కుటుంబాలు కూడా.

 

ఆ తరువాత అతి చిన్న చిన్న సంఘటనలతో రచయిత శేషమ్మమ్మని పరిచయం చేస్తూ – ఒకొక్క కోణంలో ఆవిడని ఆవిష్కరిస్తూ మనకి ఎంతో దగ్గర చేస్తారు. ఆవిడ వచ్చీ రాగానే చేతిలో వున్న మూట పడమటింట్లో జాగ్రత్తగా దాచిపెడుతుంది (ఏముందో మరి ఆ మూటలో).  ఇక మనిషి వర్ణన కొస్తే ఆ కాలంలో ఆమె స్థితిని గతిని కళ్ళ ముందు నిలపెట్టేస్తూ అయ్యబాబోయ్ అనిపించేస్తుంది. అదెలాగంటే… నములుతున్న వక్కలు నోటికోసల్లోంచి బైటకి వచ్చి చాల అసహ్యంగా కనిపించేది. ముక్కుపొడి పీల్చేది. బోడితల మీద పంచకి నశ్యం మరకలు. చూపు ఆనక గుచ్చి గుచ్చి చూసేది లాంటి వర్ణనలతో.

డబ్బు విషయంలో ఆమె అమాయకత్వం ఓ పక్కన తెగ నవ్వించేస్తే మరో పక్కన “నా తరువాత అదంతా నీకేగదుటే” అంటూ ఎవరికి వాళ్లకి భరోసా ఇచ్చేస్తూ అమ్మో మహా గడుసుదే అనిపిస్తుంది.

శేషమ్మమ్మ ‘మడి మడి యనియెదవు మనసా!’ అంటూ తత్త్వం పాడితే కాయ టక్కున పగుల కొట్టి వక్క చేతిలో పెట్టినట్లే. కాని ఆ తత్వాలు అందరూ వినడం కూడా ఆవిడకి ఇష్టం లేదుట. ఇక ఆవిడ ఊర్మిళాదేవి నిద్ర లాంటి పాటందుకుంటే ఆవిడ గొంతు మంచు కొండల్లో మందాకినిలా వంపులు తిరుగుతూ ప్రవహించేదిట. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మరచి ఆ రసమయ జగత్తులో అమ్మా , పిన్ని, బామ్మా… అంతా తమని తాము కోల్పోయేవాళ్లుట.

 

రక్త సంబంధమో మరో దగ్గరి అనుబంధమో లేని చోట ఏ చిన్న లోటోచ్చిన అది భూతద్దంలో కనిపిస్తుంది. అలాగే ఓ చిన్న అపార్ధం చోటు చేసుకుని సహజంగానే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఒకటై శేషమ్మమ్మ తప్పుపట్టినప్పుడు ఆవిడని సమర్ధించే కుర్రాడి ఆలోచన రీతి చాలా న్యాయంగా వుంటుంది. దాన్ని ఆవిడ తీసుకున్న తీరు ఆ కుటుంబం పట్ల ముఖ్యంగా ఆ పిల్లల పట్ల ఆవిడ కనబరిచే అప్యాయత శేషమ్మమ్మగారి పట్ల మనకో ప్రత్యేక అభిమాన్నాన్ని ఏర్పరుస్తుంది.

 

ఇక కథలో చెప్పినట్లు – బంధాలూ, అనుబంధాలు లేకపోతే సమాజం లేదు. వరసలు కలిపి మాట్లాడుకోవటానికి మంచి మనసే కావాలి. ఆప్యాయత అనుబంధాలని వెతుక్కుంటూ ఊళ్లు తిరిగే  శేషమ్మమ్మ, అందరు నావాళ్ళే అనుకునే మా రాజమండ్రి తాతగారు లాంటి వ్యక్తులు కాలంతో పాటు మరుగయి పోయిన తీపి జ్ఞాపకాలు.

 

మంచి  కొసమెరుపుతో ముగిసే ఈ కథలో నేనింకా పరిచయం చేయని… చేయలేని కోణాలేన్నో. చదివాక మరుపురాని జ్ఞాపకామై మిగిలిపోయే ఓ చక్కని కథ నిశాపతిగారి “ఒంటెద్దు బండి”.

 

http://www.navyaweekly.com/2012/dipawali/page130.asp

 

– విజయ కర్రా

VK1