బాలసుధాకర్ మౌళి: ఉత్తరాంధ్ర నుంచి ఒక కొత్త కవిత్వ కెరటం!

siva_reddy

I write in grief.
Do the Rivers overflow
No, Only my cheeks are moist.
I write in anger.
Do the volcanoes explode
No, Only My eyes grow red.

I write in love.
Birds roost on my shoulders.
Trees bend with flowers and fruits.
Warring Men hug each other
Language reveals its bottom
Like a crystal stream
&
Scream, from the Cross. ”

– K.Satchidanandan

నేటి కాలానికి ఒక్కడు దొరికాడు ; అమితమయిన జ్ఞాన దాహంతోతపించిపోయేవాడు ; మహా కవిత్వ ప్రేమికుడు ; కవిత్వాన్ని జీవనవిధానంచేసుకునే సూచనలు పుష్కలంగా ఉన్నవాడు ; ఏదో వ్యాసం చదివేటప్పుడు తారసపడిన ‘పుస్తకం పేరును’ బట్టి ; ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో, సంపాయించిచదివిందాకా నిద్రపోనివాడు ; తిలక్ అన్నట్టు కలల పట్టుకుచ్చులు ధరించితిరిగేవాడు – ఒక కవిత్వ తమకంతో, మోహంతో, తనివితీరని తనంతో నిత్యాన్వేషణలో ఉన్నవాడు – తేనె నిండుగా ఉండి, జవజవలాడుతున్న తేనెతుట్టెలాంటివాడు -‘వీడు కవిగదా, కనలిపోయే వాడి కళ్ళు చూడండి – సమస్త జ్ఞానాన్నిపుడిసిలిబట్టాలనే ఆరాటం కనబడుతుంది. నడుస్తున్న కవితలా కనపడేవాడు – వాడు బాలసుధాకర్ మౌళి అనే ఉత్తరాంధ్ర నెల్లిమర్ల కవి.

దుర్భిణి వేసి గాలిస్తూ వుంటా ; అరచేతిలో అంజన రాసుకునివెదుకుతూ వుంటా – ఒక స్వాప్నికుణ్ణి ; ఒక గొప్ప సృజనశీలిని ; గతవర్తమానభవిష్యత్తుల మధ్య వారధి నిర్మించే వాణ్ణి కనుగొంటానికి – వాడి కలల కన్నుల్లోకి తొంగిచూడటానికి – నేటి కాలానికి ఒక పోరాటశీలి ; పోరాటచైతన్యాన్నే కవిత్వంఅంతర్వాహిని చేసుకున్నవాడు – ఒక ప్రాంతపు భౌగోళిక, నైసర్గికప్రాణవీచికల్ని అందుకునేవాడు – కవిత్వం తర్వాతే వేరే ఏదయినా అనిఅనుకునేవాడు – బాలసుధాకర్ మౌళి అనే అతను సమస్త ఉత్తరాంధ్రాపోరాటశీలాన్ని, చైతన్యాన్ని తన రక్తంలో నింపుకుని కదలటానికి సిద్ధపడినవాడు ; కవిత్వం వినా ‘ఏమీ లేనట్టుండేవాడు’ ; కవిత్వాన్ని ఆవాహనచేసుకుని ‘శివాలూగిపోయేవాడు’ – గణాచారిలా శరీరం మొత్తాన్ని కవితలాసంచలింపచేయదల్చుకున్నవాడు – వస్తువు అన్వేషణతో పాటు – రూప అన్వేషణచేసేవాడు – కవిత్వ శర సంధానం చేయటానికి సిద్ధపడ్డవాడు – నిర్దిష్ట సమస్యలఆవశ్యకతని, ప్రాంతాల వేదనల్ని గమనంలో ఉంచుకుని మూలాల్ని మరవకుండాసమస్తాన్ని కౌగిలించుకుంటానికి సిద్ధపడినవాడు –

బహుశ రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ఒక పోరాటప్రాంతంగా మారబోతోంది.ఇక గొప్ప సృజన ఉత్తరాంధ్ర నుంచే జరగబోతుందనిపిస్తుంది. ఇక అన్నింటికిఉత్తరాంధ్ర కేంద్రమౌతుంది. ఉత్తరాంధ్రకి యుద్ధవిద్యలు కొత్తగాదు – నక్జల్ బరీ నేపధ్యం నుంచి వళ్ళు విరిచి లేచి నిలబడిన చరిత్ర దానిది. ఇక ఉత్తరాంధ్రకేంధ్రంగా సమస్త దోపిడీలు జరగబోతున్నాయి. ఆ ఛాయలుఇప్పుడే కనబడుతున్నాయి. గత చరిత్రని, పోరాట చరిత్రని వర్తమానం చేయటానికి ఒక తరంసిద్ధమయ్యింది. అరణ్యానికి, ఆరుబయలుకు ఒక అనుసంధానమేర్పడింది. అరణ్యంమైదానంలో ప్రతిఫలిస్తూ, ప్రతిధ్వనిస్తుంది.

ఆ ప్రతిఫలనాల్ని, ప్రతిధ్వనుల్ని అందుకునే ఒక తరంముందుకొచ్చింది. వాళ్ళలో చాలా స్పష్పంగా, చేవదేరిన కర్రలా కనబడేవాడుసుధాకర్ మౌళి. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బలిష్టంగానూ, పరిష్థంగానూ ఉన్నాడు. కవిత్వం కర్రసాము బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నవాడు –

ఉత్తరాంధ్రా నుంచి వచ్చిన తొలితరం, మలితరం సృజనశీలుల్ని పక్కనబెడితే కొత్తగా ముప్పై యేళ్ళు నిండీ, నిండక నలభైల్లో ప్రవేశించిన, ప్రవేశిస్తున్న ఒక తరం – గొప్ప ఆశను వాగ్దానం చేస్తుంది –

సిరికి స్వామినాయుడు, పాయల మురళీకృష్ణ, మొయిద శ్రీనివాసరావు, మానాపురం చంద్రశేఖర్, చింతా అప్పల్నాయుడు, రెడ్డి శంకర్రావు, మల్లిపురంజగదీష్, అరుణ్ బవేరా యిత్యాదులు. నేను గమనించని యింకా యితర promising poets ఉండవచ్చు. వీళ్ళందరికీ ఒక రకంగా కవిత్వంలో గురుతుల్యులు గంటేడగౌరునాయుడు, కథా రచయితలకి అప్పల్నాయుడు ; అంతకు ముందు తరం రచయితల్ని, కథకుల్ని ఈ తరం చాలా స్పష్టంగానే సొంతం చేసుకుంది. వాళ్ళిచ్చినవారసత్వాన్ని అంది పుచ్చుకుంది. వీళ్ళందరూ దగ్గర దగ్గర సమవయస్కులయినా- ఐదారేళ్ళు తేడా ఉన్నా -ఒక సందిగ్ధ సమర సందర్భంలో జీవిస్తున్నారు. గొప్ప ఆశనురేకెత్తిస్తున్నారు. ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి శైలి వారిదే – ఎవరిజీవన దృక్పధం, తాత్వికతా వారిదే. అయితే వీళ్ళందరిలో ఒక సమాన లక్షణం -సామాన్య గుణం – వర్తమానాన్ని, వర్తమానంలో జరుగుతున్న మార్పుల్ని, సంక్షోభాల్ని, సంక్లిష్టతల్ని సొంతం చేసుకుని – దాని గర్భం నుంచి పలకటం – ఉత్తరాంధ్ర సాహిత్యానికి ఒక్కొక్కళ్ళు, వారిదయిన ఒక అంశాన్ని -ప్రత్యేకతని అందించారు.

వీళ్ళందరూ ఒక సమస్యని, ఒక క్లిష్ట సందర్భాన్ని కథ చేయటమెలా, కవిత్వం చేయటమెలా – అనే ఒక అన్వేషణ కొనసాగిస్తున్నవాళ్ళు.. సమస్యలుజీవితాలవుతాయి. జీవితాలు, ప్రాంతమంతటా సమాజమంతటా పరుచుకుంటాయి. అది కథ గానీ, కవిత గానీ, ఒక suggestion ద్వారా కళ చేయటమెలానోతెలుసుకునే ప్రయత్నంలో ఆరాటంలో ఉన్నారు. యితరుల రచనల్నివిశ్లేషణాపూర్వకంగా, నేర్చుకునే దృష్టితో చదువుతున్నవాళ్ళు. సిరికి స్వామినాయుడిది ఒక పద్ధతి, పాయల మురళిది ఒక పద్ధతి -మొయిద శ్రీనివాసరావు, మానాపురంలది మరో పద్ధతి ; కొంచెం పెద్దవాడయినాఅరుణ్ బవేరాది మరో ప్రత్యేకమయిన పద్ధతి. వీళ్ళందరూ – ఎవరికి వారుగా – ఒక వర్తమానంలో జీవిస్తున్నా – ఒక వాతావరణంలో సమాజచలనాల్ని, సక్షోభాల్నిఅనుభవిస్తున్నా – కవిత్వం చేసేటప్పుడో ; కథ చేసేటప్పుడో – ఎవరికి వారుప్రత్యేకంగా వారిదయిన ప్రత్యేక వ్యక్తిత్వంతో – సాహిత్య వ్యక్తిత్వంతో దర్శనమిస్తారు. వీళ్ళ వెనుక – వీళ్ళని ప్రభావితం చేసే వ్యక్తులుండొచ్చు, సంస్థలుండొచ్చు – కానీ ఒక సమూహపు చేతనని అందుకునే విషయంలో వీరందరూ ఒకటే – ఉత్తరోత్తరా, తర్వాత కాలంలో ఎవరేమవుతారు, ఎవరు ఆగిపోతారు, ఎవరుప్రయాణం కొనసాగిస్తారు – అనేది వారి వారి అంకితభావం మీదా, సాహిత్య మగ్నతమీదా, అన్నింటినీ సమన్వయం చేసుకుని సాగిపోయే లక్ష్యం మీద ఆధారపడివుంటుంది. అయితే వీళ్ళందరిలో గొప్ప కవులుకాగల, కథకులు కాగల మూలదినుసులున్నాయి – కాంక్షలున్నాయి.

సమాజాన్ని – దాని చలనాల్తో, దానివైరుధ్యాలతో, దాని గతితర్కపు పురోగమనంతో – తమలోకి పీల్చుకునే శక్తి మీదఆధారపడి వుంటుంది వీరి ఎదుగుదల – వైరుధ్యాలమయమయిన జీవితాన్ని, సమాజాన్ని అర్థం చేసుకుంటూ, ఆత్మగతం చేసుకుంటూ – అధ్యయనం చేసుకుంటూ సృజన నిర్మాణంజరగాలి.
ఈ కొత్తతరం కవుల్లో, ఎవరి ప్రత్యేకత వారిదయినా, ఎవరిదయిన స్వరంవారిదయినా – బాలసుధాకర్ మౌళి గొంతు మరీ భిన్నమయింది. అతనికున్న మగ్నత, నిబద్ధతని బట్టి – ఒక తీవ్రతని, ఒక విసురును అతని భాష అందుకుంది. అతనికవిత్వమంతటా ‘అడవి’ ఒక Metaphor లా పరుచుకుని వుంటుంది. అదెంతగా అంటే అదేఅతని లోపలిస్వరం అన్నంతగా – అడవి బిడ్డల పోరాటాలు – అడవిని ఆక్రమించిదాని సంపదను, ఖనిజాల్ని దోచుకుపోయే పెట్టుబడిదారులు – వారికి భారతప్రభుత్వం వత్తాసు – అడవి ప్రశాంత జీవితం చిందరవందరగావటం – వాళ్ళ పోరాటాలు – యివన్నీ మైదాన ప్రాంతపు జీవితాన్ని తాకినయి –
అరణ్యం – దాని పోరాటాలు మైదానంలోకి చొచ్చుకొచ్చినయి – బహుసునిశితజీవి అయిన కవి ; అమోఘమయిన స్పందనాశీలం కలిగిన కవి ; విచలితుడయి -‘చర్య – ప్రతిచర్యల మధ్య’ జీవిస్తూ – కవిత్వ సృజన చేస్తున్నాడు.

Layout 1

” బాసగూడ
గాయపడ్డ ఆదివాసీ ఆత్మస్థైర్యం
అడవి గుండెలపై పగిలిన నెత్తుటి కడవ
రాజ్యం రాకాసి వేటకి
బలైన
పుట్టెడు పిల్లల తల్లి
నా దేశంలో ఏ గిరిజన గుమ్మాన్నడిగినా
చెబుతుంది –
వర్తమాన చరిత్ర ఎంత రక్తసిక్తవర్ణమో ”

‘మనిషి అరణ్యం’ అనే కవితలో –
” మనిషి లోపల అరణ్యం విస్తరిస్తుంటుంది
అరణ్య సౌందర్యాలూ విస్తరిస్తుంటాయి
ఈ నేల మీద వొకేవొక్క అరణ్య కళాత్మక సౌందర్యజీవి
మనిషి మాత్రమే
మనిషి అరణ్యం
అరణ్యం మనిషి
దేశమేదయినా సరే
మనిషి అరణ్యాన్ని ఆలంబనగా చేసుకున్నాడు
అరణ్యం ఒడిలో నుంచే ఆయుధంగా మొలకెత్తాడు
మనిషి గొప్ప తిరుగుబాటు యోధుడు
మనిషి యుద్ధానికి కేంద్రబిందువు మనిషే
మనిషి యుద్ధమూ మనిషిపైనే
అరణ్యం నుంచి దూరమయిన మనిషి ఓడిపోతాడు
అరణ్యాన్ని ధరించిన మనిషే గెలుస్తాడు ”

‘ ఎగరాల్సిన సమయం ‘ ఈ కవితా సంపుటికి శీర్షికయిన కవితలో –
” అరణ్యం
వొక అలజడిని
వొక యుద్ధాన్ని పరమధైర్యంగా ప్రేమిస్తుంటుంది
నువ్వొచ్చావని తెలియగానే
నిన్నూ ప్రేమించడం మొదలుపెడుతుంది
అరణ్యం
నీకొక గమ్యం
నీ ఊపిరి

నీక్కావలసింది
అరణ్యం కదా
వెళ్ళు
అరణ్యానికి నీ చేతులను ఇవ్వు
అరణ్యానికి నీ కళ్ళని ఇవ్వు
అరణ్యానికి
నీ అణువణువునూ సమర్పించు
నువ్వెళ్ళే నీ అరణ్యానికి దారి
నీ లోపలి నుంచే మొదలు ” –

‘అరణ్య స్వప్నం’ అనే ఒకపాటి దీర్ఘకవిత వుంది. ‘అరణ్యం’ మీద చిన్నకావ్యమది.

‘ ఒక వసంతకాలపు సాయంత్రాన
అడవి లోగిళ్ళలోనున్న చెట్టు
పురుడోసుకుంది
వొక ఎర్రని స్వప్నాన్ని కనింది ‘

.. అని మొదలై – ఏడు భాగాలుగా సాగి – అరణ్యపు యుద్ధాన్ని, నెత్తుటి మడుగుల్ని, త్యాగాల్ని ; ఎదురుకాల్పుల్ని వర్ణిస్తూ సాగి..

‘తూరుపు కనుమల శ్రామిక మెదళ్ళలో
స్వప్నం పువ్వై విచ్చుకుంది
సికాకుళమై
జగిత్యాలై
దండకారణ్యం గుండె తారై
అడవి అడవంతా
ఎర్రదళమై పరుచుకుంది ‘ –

.. చరిత్రనంతా చెప్పుకుంటూ..
‘ యుద్ధం మొదలయ్యింది
రక్తం, రక్తం
అడవంతా ఏరులై పారిన రక్తం
వీరుల త్యాగాల రక్తం
కెరటాలు కెరటాలుగా పోటెత్తుతున్న రక్తం ‘

‘ కొన్ని పక్షులు మాత్రం
చెట్టు స్వప్నాన్ని నిజం చేస్తూ
ఇప్పటికీ యుద్ధం కొనసాగిస్తూనే వున్నాయి ‘

ముక్తాయింపుగా –
‘ మైదానం
అడవివైపు చూడాల్సిన
సమయమాసన్నమయింది ‘

***

‘ బాసగూడ, సోంపేట, కోటిపాం, పరవాడ, లక్షింపేట ‘ లాంటి కవితలు ; ‘ తీహార్ మరకలు, గాజాకు నా రక్తలేఖ, నిర్బంధం నుంచి ఆ కళ్ళు, ఛావెజ్ కవితలురెండు ‘ లాంటి కవితలు – ఏం చెబుతాయి. బాలసుధాకర్ మౌళి ఒక రకంగా ఉద్యమకవి. పోరాటశీలాన్ని దట్టించే కవి. పోరాటాలు – ఏ దేశంలో జరిగినా తనూ కదిలివాటికి వత్తాసు పలికి ; స్ఫూర్తి పొంది – కవిత్వంగా మొలకెత్తుతాడు -యితడు ప్రజాపక్షవాది. ప్రజా పోరాటాలకు గొంతునమర్చేవాడు.
డెబ్భై ఐదు కవితలున్న ఈ కవితా సంపుటి చదివాక – గుండెల్నిండుగాకొత్త గాలి పీల్చుకున్నట్టు – ఒక ధైర్యపు వచనమేదో మనల్ని తాకుతున్నట్టు -ఒక జ్వాలగా మన ముందు ఒకడు నడచి వెడుతుంటే వాడి వెనక మనం నడుస్తున్నట్టు – ఎంత ఉద్వేగభరితమయిన కవిత – ఎంత మృదువైన కవిత్వం – ఎంత
స్వయంచాలిత కవిత్వం –

‘ కర్ఫ్యూ రాత్రిలో ‘ అనే కవితలో..

” పసిపిల్లలు నిద్రలోనూ ఉలిక్కిపడుతున్న
వ్యవస్థ నడుస్తున్నంత కాలం
నిజంగానే
ప్రతి ఒక్కరూ ఎవరికి వారు
వొక్కో ఉయ్యాల కట్టుకోవాలేమో ”

” కల్లోల దేశాన్ని
కవిత్వం చేస్తున్నప్పుడు
కవిత్వం పసిపిల్లలా వుండాలనుకోవడంలో
తప్పేముంది ;
పసిపిల్లలాంటి నిర్మలమయిన నిర్భయమయిన
పద్యాన్ని సృజించే వరకూ
రాత్రుళ్ళు యిలానే ” – మరో పద్యం ఇలా ముగుస్తుంది.

‘చంపావతి’ని చూసి దుఃఖంతో రాసిన ‘నదిపాట’ గానీ, ‘అలలచేతివేళ్ళతో’ పద్యం గానీ, ‘నగ్నపాదాల కన్నీళ్ళదే రంగు ?’, ‘గాయపడ్డప్రాంతం మీద’, ‘చీకటి రంగు’ లాంటి ఏ కవితని తీసుకున్నా – ముఖ్యంగా’దొప్ప’, ‘యిప్పటికీ’, ‘నువ్వింకా అక్కడే – ఆ దూరం నుంచే’ లాంటి కవితలుతీసుకున్నా బాలసుధాకర్ మౌళి – వస్తువును – కవిత్వం – చేసే నైపుణ్యం ఏమిటోఅర్థమౌతుంది. మహా మృదువుగానూ, వడుపుగానూ, లాఘవంగానూ, తీవ్రంగానూ – కవితని conceive చేయగలడు. ఎత్తుగడ నుంచి ముగింపు దాకా – కవిత నడిపే తీరు అతనిపనితనాన్ని, రూపశ్రద్ధనీ చూయిస్తుంది.

‘యిప్పటికీ’, ‘నువ్వింకా అక్కడే – ఆ దూరం నుంచే’ లాంటి కవితలపద్య నిర్వహణ ఆశ్చర్యం గొలుపుతుంది. ‘గూడు’, ‘దొప్ప’ లాంటి కవితలు కూడాయిదే రుజువుచేస్తాయి. Object ముడిసరుకు అందాం ; Content వస్తువందాం గావటానికి. తద్వారా అద్భుతమయిన కవిత గావటానికి – కవి Perception – ప్రాపంచిక దృక్పధమందామా – ప్రధాన పాత్ర వహిస్తుంది. పాఠకుడి మీద ఒక ముద్రవేసేది, అతని చూపు mould చేసేది యిదేననుకుంటా – ఆ perception – ఆపోరాటతత్వం – ఆ ఎడతెగని ఆకాంక్ష సుధాకర్ మౌళిలో పుష్కలంగా వున్నాయి.

కవిని రక్షించేది అతని బతుకు – అతను నిజంగా బతికుంటే అతనిలోనికవి బతుకుతాడు – చుట్టూ వున్న దుర్మార్గమయిన హింసోన్మాదమయినరాజకీయవ్యవస్థ మనిషిని హతమార్చటానికి పనికొస్తుంది. వీటన్నింటి మధ్య – సంకులసమరం మధ్య కవి కవిగా మనగలగాలి – తన్ను తనే బతికించుకోవాలి, నిలబెట్టుకోవాలి. పున:పున: సృజించుకోవాలి ; శోధించుకోవాలి – సమస్తాన్నిజీర్ణించుకుని ‘కవి ఫీనిక్స్’ లేవాలి.

*

ఇది బాలసుధాకర్ మౌళి – తొలి కవితా సంపుటి.

ఇందులోని కవితలన్నీమూడు నాలుగేళ్ళలో రాసినవే. చాలా తాజాగానూ, ఉద్వేగభరితంగానూ ఉన్నాయి.అయితే కొన్ని కవితలు కావాల్సిన దాని కంటే ఎక్కువవిస్తరించాయేమోనన్పించింది. కవితని దానంతట దాన్నే ముగియనివ్వాలి.యిలాంటివన్నీ అధ్యయనంలోనూ, సాధనలోనో అనుభవపూర్వకంగా తెలుస్తాయి.నేర్చుకోవటమనేది జీవితాంతం చేసేది. ఒక కవితకి ఒక కోణంగాక అనేకకోణాలుంటాయి. ఏ కోణం నుంచి ఎత్తుకుంటే మంచి కవితగా రూపుదిద్దుకుంటుందోగమనించాలి – తొందరపాటు పనికి రాదు.; మాగనివ్వండి ; మాగితే వస్తువుమధురఫలపు సువాసన వీస్తుంది.

ఇతర కవుల కవిత్వం నుంచి నేర్చుకోవాల్సిందిదే.
తన్ను తాను repeat చేసుకోగూడదు. Monotony రాకుండా చూసుకోవాలి.
యిదొక దీర్ఘకాలిక యుద్ధం.

యుద్ధరంగంలో వున్న బాలసుధాకర్ మౌళికి అభినందనలు –

-శివారెడ్డి

invite bala

యాకూబ్ ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ ఆవిష్కరణ

10347488_10152266211996466_130275867324807047_n

Yakoob Cover-Nadi final cover

బహుశా చాలా రోజుల్నించి, కొన్ని నెలల నుంచి నేను యాకూబ్ లోకంలోనే బతుకుతున్నా, ప్రతి కవికీ వాడిదయిన ప్రపంచం వుంది. అనుభవం వుంది. అందరి చుట్టూ అదే ప్రపంచం ఉంది, అనుభవం వుంది. అందరిచుట్టూ ప్రపంచం వున్నా. ఆ కవి అందుకున్న అనుభవం ప్రత్యేకమయింది. ఈ ప్రపంచాన్ని ఆ కవి ఎలా దర్శించాడు, ఘర్షించాడు, ఆనందించాడు, దు:ఖపడ్డాడు. తనదయిన అనుభవ ప్రపంచాన్ని ఎలా సృజించుకున్నాడు, బహుశా అతని ఆశలు ఆవేదనలు ఉద్వేగాలు సర్ధుబాటులు, సమన్వయాలు, తను కొత్తగా కనుగొన్న సత్యం తాలూకు వెలుగు-

ఏమి ప్రపంచమది, మనకందుబాటులో వున్న ప్రపంచాన్న అతనెలా అనువదించాడు, ఎప్పుడూ సుఖంగా వున్నట్టు, లేనట్టూ, రక్తాలోడుతున్నట్టు, అనంతమయిన పూదోటల్లో తిరుగుతున్నట్టు అడవికట్టంబడి నడుస్తున్నట్టు, అకస్మాత్తుగా వాగువెల్లువెత్తినట్టు, దరులు విరిగి పడుతున్నట్టు జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నట్టు- ఎప్పుడూ ఒక ఎదురుచూపు, ఒక ఆరాటం ఒక ఆప్యాయతకోసం అర్రులు చాచటం, ఒక చల్లని స్పర్శకోసం తపించటం, సుదీర్ఘమయిన రాత్రుల్ని కాయితాలుగా మలుచుకోవడం- బర్రెల్నో, గొర్రెల్నో కాయటం, ఏటి ఒడ్డున నడుస్తూ రేగ్గాయల్నో, మరే పిచ్చి కాయల్నో శబరి కొరికినట్లు కొరకటం, నెత్తురులోడే కాళ్ళతో నడవటం – దాహంతో తపించటం- అదంతా ఒక యాత్ర, యులెసిస్ యాత్ర, అదొక ప్రవాహం, ప్రవహించే జ్ఞాపకం. ‘‘ ఇరవై గంటల పొలంలో బంగారం పండించిన వైనాలు, ఏట పెట్టడాలు, ఎగసాయం చేయడాలు, మోటకట్టడాలు, మోపులెత్తడాలూ, కాసెపోసి పంచెకట్టడాలు, ఎలుగు కట్టడాలు, గిత్తఒట్టకొట్టడాలు, తాడుపేనడాలు, చిక్కంవేయడాలు, గుమ్మికట్టడాలు, ఇటుకబట్టీ కాల్చడాలు, మనుంపట్టడాలు, రుణం తీర్చుకోవడాలు, పందిరేయడాలు, పగ్గమేయడాలు- అబ్బా యిదంతా నా వారసత్వపు కథ ’’ (సరిహద్దురేఖ).

ప్రతి కవి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. ఒక పరిక్షకు సిద్ధమౌతాడు. కాలం పరీక్షకు పెడుతుంది. స్థలకాలాల్నుంచి అనుభవాన్ని స్వీకరిస్తూ స్థలకాలాలు దాటి ఎదగటం- ఒక పక్షికుండే స్వేచ్ఛా స్వభావమేదో కవిలో అణువణువునా జ్వలిస్తూ వుంటుంది. ఎన్నిరకాలుగా జీవితాన్ని ప్రపంచాన్ని చూడొచ్చు. ప్రతి అంశనీ, విషయాన్నీ పట్టి పట్టి చూడటం – లోతుల్లోకెళ్ళి మాట్లాడటం- బహుశ యిది ఎవరి కవిత్వానికయినా, ఒక అథెంటిసిటిని, ఒక ఒరిజినల్ టచ్ ని ఇస్తుందనుకుంటా! ‘ప్రవహించే జ్ఞాపకం ’ నుంచి సరిహద్దురేఖ దాటి సువిశాల జీవావరణంలోకి ఈ కవితా సంపుటి ‘ఎడతెగని ప్రయాణం’ తో ప్రవేశించాడు యాకూబ్. అంత submerge అయి ఒక సంయమనంతో అద్భుతమయిన రూపు తీసుకోవటం ఇందులో చూస్తాం. దీనికి బీజాలు ‘సరిహద్దురేఖ’ లోనే వున్నాయి. సంక్లిష్టమయిన, సమరశీలమయిన జీవితాన్నెన్నుకున్నాడు. జీవితమే నేర్పాలి – కవి నేర్చుకోవాలి. కన్ను చెవి బాగా పని చేయాలి. గతం స్మృతులుగానూ, జీవసారంగానూ, దృశ్యపరంపరగానూ కవిత్వమంతటా అల్లుకుంటుంది. సువాసనాభరితమయిన సువర్ణస్పర్శ ఏదో ఈ కవిత్వానికి వుంది. మనల్ని మనం మర్చిపోయి. కవి కనికట్టులో పడిపోతాం- కవి చెప్పేదే నిజమవుతుంది. కవి జీవితం, అనుభవం మన జీవిత మౌతుంది. మన అనుభవమవుతుంది. వస్తువిస్తృతి పెరుగుతుంది. జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాల్ని, అంచుల్ని అందుకుని అవలీలగా కవిత్వం చేయటం ప్రారంభిస్తాడు. ఒక పరిపక్వదశలోకి ప్రవేశించే సమయంలో పద్యాలు సజీవాలవుతాయి. అవే గమస్తాయి. మాట్లాడతాయి, మన చుట్టూ తిరుగుతాయి. మనలోనూ తిరుగుతాయి.

– యాకూబ్ “ఎడతెగని ప్రయాణం” కోసం శివారెడ్డి రాసిన ముందు మాట