నిశ్శబ్దంపై యుద్ధం ఈ “ఆశాదీపం”!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

ఇది ప్రపంచ ఆరోగ్య అవగాహనలో నవకేతనం !
దేశ వైద్య చరిత్రలోనే అపూర్వం !
ఆరోగ్య రంగాల్లోనే ప్రథమం !
అంతేకాదు, తెలుగు సాహితీ ప్రస్థానంలోనే ఓ మహాప్రయోగం !!!
బహుశా భారతీయ సాహిత్య యాత్రలోనే నవ్య గమనం !!!

“ఆశాదీపం” కథల సంపుటి ముందుమాటలోని  సి. పార్ధసారధి గారన్న పై  మాటలు అక్షర సత్యం.  ప్రపంచ భూతం, మహమ్మారి అంటూ వణికిపోయే HIV/AIDS పై 59 మంది రచయిత్రుల అక్షర దీపాలు వెలిగించడం సామాన్య విషయం కాదు.  ఒకే సమస్యపై అంత మంది రచయిత్రులు ఏకకాలంలో  స్పందించడం,  కలం ఝుళిపించడం అద్వితీయ సంఘటన, అప్పుర్వ ఘట్టం.  ఆ సంఘటన పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం  APSACS.  Break the silence అన్న NACO స్పూర్తితో APSACS వారు ప్రపంచ సాహితీ చరిత్రలోనే గొప్ప ప్రయత్నానికి నాంది పలికారు.   సి. పార్ధసారధి, IAS గారి నేతృత్వంలో APSACS  తెలుగు రచయిత్రులందరికీ సాహితీ సమారోహణం పేరుతో అవగాహనా సదస్సు నిర్వహించింది.   ఈ సంకల్పం,  అంటే ఒక సామాజిక ప్రయోజనం కోసం సాహిత్యాన్ని సాధనంగా చేసుకోవడం,  సాహితీ ప్రపంచంలో విన్నూత్న ఒరవడికి శ్రీకారం చుట్టినట్లే .. రచయిత్రుల్ని, కవయిత్రుల్ని ఓ సామాజిక కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తూ వారి సామాజిక బాధ్యతని పెంచినట్లే కదా !

ఒక యజ్ఞంలా సాగిన ఈ పుస్తక ప్రస్థానంలో మొదట ఏర్పాటు చేసిన కార్యక్రమం సాహితీ  సమారోహాణం. సమాజ సుస్థితికి ఆధారం మహిళలు.  అందుకే ప్రత్యేకంగా రచయిత్రులు, కవయిత్రుల కోసం ఓ అవగాహన కార్యక్రమాన్ని  రూపొందించారు. అదే సాహితీసమారోహణం.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి పేరెన్నికగన్న రచయిత్రులని , కవయిత్రుల్ని ఆహ్వానించి, 26 అక్టోబర్, 2013న జూబ్లీ హాల్ లో హెచ్ఐ వి /ఎయిడ్స్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు.  ఆ సదస్సులో పొందిన అవగాహన ఆసరాతో కథలు, కవితలు ఆహ్వానించారు. వాటిని బాగా అనుభవం ఉన్న కథకులు, కవులు జల్లెడ పట్టి 59 కథలు , 70 కవితలు ఎంపిక చేశారు.  వాటిని రెండు పుస్తకాలుగా వేశారు. కథల పుస్తకం ‘ఆశాదీపం‘ గాను, కవితల పుస్తకం ‘చిగురంత ఆశ‘ గాను రూపుదిద్దుకున్నాయి.   ఎంపిక అయిన కథలలో నుండి ఉత్తమ కథలను, కవితలను ఎంపికచేశారు. ఉత్తమ కథలకు, కవితలకు పుస్తకావిష్కరణ సభలో బహుమతులు అందించారు.

ప్రస్తుతం మనమిక్కడ కథా సంకలనం ఆశాదీపం గురించి ముచ్చటించుకుందాం. మామిడి హరికృష్ణ కుంచెనుండి అర్ధవంతమైన చిత్రం ఆశాదీపం ముఖచిత్రంగా అలరించింది. ఈ కథా సంకలనంలో మొత్తం 59 కథలున్నాయని ముందే చెప్పుకున్నాం కదా.. . 59 మంది కథకులకు  ఇచ్చిన అంశం ఒకటే అయినా అన్నీ విభిన్నమైన కథలు. వైవిధ్యమైన కథలు.  ఒక్కో మస్తిష్కం నుండి ఒక్కోలా. ఒక్కొక్కరి ఆలోచనా తీరు ఒక్కో విధంగా.  ఒక్కొక్కరి రచనా  శైలి ఒక్కో రకంగా. వెరసి కథలన్నీ దేనికది భిన్నంగా.  ఆశ్చర్యంగా రెండు మూడు కథలు మినహా మిగతా కథలన్నీ మహిళల జీవితం చుట్టూనే.. వారి జీవన వ్యధలకి కారణమైన హెచ్ఐవి/ఎయిడ్స్ రావడానికి కారణాలు, సమస్యని ఎదుర్కొనే క్రమం, మానసిక బలాన్ని పెంచుకుంటూ, ప్రభుత్వం అందించే మందులు వాడుతూ అవగహనతో పాటు చైతన్యవంతం కావడం,  మార్గంలో ఎదురైన ముళ్ళను ఎరివేస్తూ తమలాంటి వారికి స్పూర్తినిస్తూ చైతన్య పరచడం ఈ కథలలో ప్రవహిస్తూ ఉంది.

20140602_183348

ఇక మనం కొన్ని కథల్లోకి తొంగి చూద్దాం.
గురజాడ శోభా పేరిందేవి రాసిన  ‘అంతం కాదిది ఆరంభం’  మూగ పిల్ల నీలపై జరిగిన అత్యాచారం , తత్ఫలితంగా గర్భంతో పాటు హెచ్ఐవి/ఎయిడ్స్ కి గురికావడం ఆమె మనసునీ, శరీరాన్ని  మొద్దుపరిస్తే,  ఆమె తల్లిని  భయాందోళనకు గురిచేసి పెద్ద కూతురికి పెళ్లి కావాలంటే ఈ పిల్లను వదలాల్సిందేనని, కూతురిని ఇంటికి రాకు చనిపోమ్మని చెప్పేలా చేస్తుంది. తనెందుకు చావాలని నీల హెచ్.ఐ.వి . కేంద్రానికి వెళ్లి  సైగలతో తన విషయం చెప్పుకొని మందులు తీసుకోవడంతో పాటు తనలాంటి వాళ్ళని బతికించే విధంగా కృషి చేస్తూ తన జీవితానికి ఒక అర్ధం కల్పించుకోవడంతో ముగుస్తుంది కథ.

‘వంద చేతుల తోడు ‘ కన్నెగంటి అనసూయ కలం నుండి జాలువారిన కథ ఇది.  బిసి వెల్ఫేర్ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న బాలిక నర్మదపై హాస్టల్ వార్డెన్ చేసిన ఆత్యాచారం, చేసిన మోసం వల్ల ఆమె గర్బవతి కావడం, హెచ్ఐవి సోకడం తాను మందులు వాడుతూ స్వచ్చంద సంస్థల సహకారంతో తనలాంటి వారికి చేయూతనిస్తూ హెచ్ఐవిపై అవగాహన కల్పిస్తూ, బతుకుపై ఆశతో,  ఆమె ఆత్మా విశ్వాసంతో ముందుకు సాగే కథ ఇది.

డా. త్రివేణి రాసిన కథ ‘పల్లవించిన పాట’ . పదవతరగతి వరకూ చదువులోనే కాకుండా ఇతర కార్యక్రమాలలోనూ ముందువరసలో ఉండే పల్లవికి పెళ్లి జరగడం, భర్తతో హైదరాబాదులో కాపురం పెట్టిన రెండేళ్లకే అతను హెచ్ఐవి ఎయిడ్స్ తో చనిపోవడం ఆ విషయం తెల్సి ఆమెకు ఆదరణ లభించకపోవడంతో ఆశ్రమంలో ఉంటుంది. మూడేళ్ళ తర్వాత ఆమె ఊళ్ళోకి వచ్చినప్పుడు  కుటుంబ సభ్యులలోను, గ్రామస్తులలోను ఆమెను ఊర్లోకి రానివ్వడానికి , తమతో కలుపుకోవడానికి భయపడిన వైనం ఆ గ్రామ అంగన్వాడి టీచర్ పద్మ వారి భయాల్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం హృద్యంగా చూపుతుంది ఈ కథ.

‘కాంతిరేఖ’ కథలో దుబాయ్ లో ఉండే వ్యక్తి పెళ్ళికి ముందే సెక్స్ అనుభవం కోసం మిత్రులసలహా మేరకు వెళ్ళడం, పెళ్ళైన కొద్దిరోజులకే హెచ్ఐవి బయటపడడం ఆ తర్వాత అతను చనిపోవడం , కోడలు కరుణకు అత్తింటివాళ్ళు వాళ్ళ ఆరళ్ళు, గర్భవతిగా ఉన్నా ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, డాక్టర్ దంపతుల చెంత చేరడం, అప్పటికే  కొడుకు హెచ్ఐవి/ఎయిడ్స్ తో మరణించడంతో వారు హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల కోసం హాస్పిటల్ నడపే  ఆ డాక్టర్ దంపతులు కరుణని ఆదరించి ధైర్యం చెప్పడం, కూతురిని కన్న  కరుణ ఆరోగ్యకరమైన జీవన విధానంతో తన జీవితాన్ని పొడిగించుకుంటూ కూతురిని పెద్ద చేయడమే కాక చివరికి అత్తామమలకు ఆమె ఆధారమవుతుంది. ఈ కథా రచయిత్రి నెల్లుట్ల రమాదేవి

‘భయం .. పెద్ద జబ్బు ‘ తాయమ్మ కరుణ రాసిన కథ. ఈ కథలోనూ భర్త ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ సోకిన భార్య విజయని దూరంగా పెట్టి అత్తింటివారు చూసే చిన్న చూపు తెలిసీ భర్త మౌనంగా బాధపడడం, తర్వాత విజయ నిలదీయడంతో తల్లికి విష్యం చెప్పిన భర్త సంతోష్.  షుగర్ , బి.పి ల్లాగే మందులతో జీవిత కాలం పోడిగించ వచ్చని వైద్యులు చెప్పిన విషయాలు చెప్పినా వినిపించుకోకుండా పిల్లలని తన దగ్గరకి రానివ్వని అత్త, దూరమవుతున్న పిల్లలు, చదువుకున్నతనే మానసికంగా నలిగిపోతుంటే .. మరింత అనారోగ్యానికి గురవుతుంటే మరి ఏమీ తెలియని వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచించిన విజయ తను న్యూనత నుండి బయటపడి హెచ్ఐవి/ఎయిడ్స్పై ఉన్న అపోహల్ని తొలగించాలనుకోవడంతో కథ ముగుస్తుంది.

హెచ్ఐవి ఎయిడ్స్ఉన్న వ్యక్తి విషయం దాచి పెట్టి పెళ్లి చేసుకుంటే అది చెల్లదని చెప్తుంది వారణాసి నాగలక్ష్మి కథ ‘శుభరాత్రి’. ఈ కథలో మనోజ్ఞ పెళ్లి అయ్యి వెంటనే విడాకులు తీసుకున్న విషయం చెల్లి ద్వారా తెలుసుకుంటాడు రాజీవ్ .  మనోజ్ఞ పట్ల ప్రత్యేక అభిమానం ఉన్న అతను ఆమె విడాకులకు కారణం హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తితో పెళ్లి కావడమేనని, ఆ విషయం పెళ్ళైన మూడో నాడే  అతని మిత్రుడి ద్వారా తెలుసుకుని ఆ బంధం నుండి విడివడిందని, ఆమెకి హెచ్ఐవి సోకలేదని తెలిసి ఆమెను మనసులోనే అభినందించడంతో కథ ముగుస్తుంది

బయటి ప్రపంచం ఎరుగని విలాసాలు, సౌఖ్యాలు, వస్తువులు, వారి ఆహారం ఎప్పుడో చూసిన పుట్టమ్మ అనే యువతి తమ ఊరు వచ్చే విదేశీ టూరిస్టులని చూసి విదేశీ మోజుతో ఉండేది. వారిలాగే ఇంగ్లిషు మాట్లాడుతూ తమ ఇంట్లో అద్దెకు ఉండే విదేశీ యువకుడితో స్నేహం చేసింది. అతను మరోసారి వచ్చినప్పుడు సన్నిహితమైంది.  మరుసటి ఏడాది వస్తే పెళ్లి చేసుకుందాం అని చెప్పి వెళ్ళే ముందు తన వస్తువులన్నీ ఆమె కిస్తూ ఒక పాకెట్ ఇచ్చి తను వెళ్ళాక చూడమంటాడు.  అతను వెళ్ళాక చూస్తే నీకు బహుమతిగా ఎయిడ్స్ ఇచ్చాను అనే లేఖ. తెలిసీ తెలియని వారితో శారీరక సంబంధాలు ఎంత అనర్ధమో చెప్పిన కథ మన్నెం సింధుమాధురి రాసిన ‘బహుమతి ‘.

ఓ యువకుడు  విలువలకు వలువలు ఒలుస్తున్న సమయంలో భార్య, తల్లి, అక్క, బాల్యమిత్రుడు, చిన్ననాడు చదువు నేర్పిన పంతులు తగిన విధంగా స్పందించక పోవడంతో ఆ  యువకుడు అప్పటివరకూ తెచ్చుకున్న పేరుని, జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అతని ప్రవర్తనకి తమ బాధ్యతారహిత్యమేనని బాధపడే కథ చంద్రలత రాసిన ‘ఆ ఆరుగురు ‘ ఆ ఆరో వాళ్ళెవరో కథ చదివి తెలుసుకోవాల్సిందే ..

భర్త ద్వారా సంక్రమించిన హెచ్ఐవి తో అతని కంటే ముందు భార్య చావు బతుకుల్లో ఉండడానికి కారణం జండర్ వివక్ష అని చెప్పే కథ దర్భలక్ష్మి సుహాసిని రాసిన కథ ‘గిరిజ’ .  భర్త విచ్చలవిడి తనం వల్ల హెచ్ఐవిసోకిన ఉద్యోగస్తురాలైన మహిళ తనను తాను కాపాడుకుంటూ తన పిల్లలిద్దరినీ పెంచి పెద్దచేస్తూ హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు మనోధైర్యం అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంచే తల్లి సేవలకు తామూ తోడవుతాం అనే పిల్లల కథ సమ్మెట ఉమాదేవి కధ ‘తిమిర సంహరణ సమయాన ..!’ .

రక్తమార్పిడి  వల్ల హెచ్ఐవి సోకినట్లు వచ్చిన కథలు కొండవీటి సత్యవతి గారి ‘పాలపుంత ‘ డా . సి. భవానిదేవి గారి ఈతరం దూతలు , గంటి సుజలామూర్తి గారి మార్గదర్శి . స్వాతి శ్రీపాద రాసిన ‘వెలిగించనా చిన్న దీపం ‘  ఇంజక్షన్సు ద్వారా హెచ్ఐవి వైరస్ సోకడం వాళ్ళ కుటుంబ అనాదరణకు గురై చావాలనుకున్న వ్యక్తీ ఆ తర్వాత ఓ సంస్థ లో తన లాంటి వాళ్లకి సేవలందించే కథ ‘గమ్యం ‘. దాదాపు ఇలాంటి కథే

ఉపాధివేటలో భార్యాబిడ్డల్ని వదిలి గల్ఫ్ బాట పట్టిన వ్యక్తీ అక్కడ అంటుకున్న హెచ్ఐవి భార్యకి అంటించడం .. ఆ బాధ వ్యధ చిత్రించిన కథ అడువాల సుజాత రాసిన ‘ఆలోచించండి’ .
కొత్త అనుభవం కోసం ఒకసారి చేసిన తప్పుకు కుంచించుకుపోతూ శిక్ష అనుభవిస్తున్నాననే కథ ‘నీకు .. నా మొదటి ప్రేమలేఖ’. ఎంతో భావుకంగా ఉన్న ఈ కథ ఝాన్సీ కెవి కుమారి రాశారు.
సినిమాలు, టివి సీరియళ్ళ మోజులో ఇల్లువదిలి ట్రాఫికర్లకు చిక్కి కొంతకాలానికి ఆ ఊబి నుండి బయటపడి హెచ్ఐవి బాదితులకు సహాయం చేస్తూ జీవించే యువతీ కథ అల్లూరి గౌరీ లక్ష్మి గారి ‘చిరుదీపాలు.  సమస్యకు మందేయడం కాదు ఆ సమస్యకు మూలం ఎక్కడుందో తెలుసుకొని సమూలంగా మానవతా విలువలతో చెప్పాలనే కథ గరిమెళ్ళ సుబ్బలక్ష్మి రాసిన ‘మీరే నేర్పాలి ‘ , ప్రేమపేరుతో మోసపోయి వొళ్ళు అమ్ముకునేవాళ్ళు తమకు తెలియకుండా తమ దరి చేరిన హెచ్ఐవి వంటి వ్యాదుల్ని ఇతరులకు అంటించాలానే కాసిని, ఆ తర్వాత మారిన వైనాన్ని చూపిన కథ డి. కామేశ్వరి రాసిన ‘మానవత్వం మరువకు. దా. ఆలూరి విజయలక్ష్మి రాసిన ‘కల్లోల కడలి’ కథ కన్నా బిడ్డలా ఆకలి తీర్చడం కోసం , ఆకలి గొన్న మగవాళ్ళ ఆకలి తీర్చే ఆ తల్లి హెచ్ఐవిబారిన పడడాన్ని చిత్రించింది.  అశ్రద్ద , చిన్న నిర్లక్ష్యం వాళ్ళ హెచ్ఐవికి గురి అవడం, మరికొన్ని బతుకులు ఇలా కాకుండా చూస్తాననే యువకుడి ఆత్మవిశ్వాసాన్ని మన ముందుంచిన అయినంపుడి శ్రీలక్ష్మికథ   ‘అమ్మ నవ్వింది ‘ . హెచ్ఐవి/ఎయిడ్స్ తో చనిపోయిన వారి పిల్లల్ని చేరదీసి అక్కున చేర్చుకున్న యువతీ నిశాంత సమాజం నుండి తాను వెలివేతకు గురయినా స్థైర్యంతో ముందుకు సాగిన కథ ‘నిశాంత పెళ్లి ‘ అనిశెట్టి రజిత రాశారు.   కలసి మెలసి ఉన్నా, ముట్టుకున్న హెచ్ఐవిమరొకరికి సక్రమించాడు అనిచేప్పే అమృతలత కథ ‘ఆత్మీయ స్పర్శ’.

హెచ్ఐవి బాధితులు వారిలో ఓ చిన్నారిని డాక్టరును చేసి ప్రతిఫలంగా హెచ్ఐవిపై అవగాహన సమాజంలో పెంచమని చెప్పే కథగంటి భానుమతి రాసిన  ‘ వాళ్ళు కోరిన కోరిక ‘
మిత్రురాలి కొడుకుకి హెచ్ఐవి సోకినట్లు తెలుసుకున్న ఓ తల్లి తన కొడుకుకి  హెచ్ఐవి పరీక్షలు చేయించి అతను పక్కదారులు పట్టకుండా అవగాహన పెంచే కథ గోలేటి లలితాశేఖర్ రాసిన ‘పెనేసియా’ హెచ్ఐవిపై అవగాహన పెంచే మరో కథ ఇంద్రగంటి జానకీబాల రాసిన ‘బ్రతుకు పోరాటం’,

పెళ్ళికి ముందే హెచ్ఐవిపరీక్షలు , ఎలీసా పరీక్షా చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని ప్రేమికులు చెప్పే కిరణ్ బాల కథ ‘అదిగో నవలోకం ‘ .   రెడ్ రిబ్బన్ క్లబ్స్ అవసరాన్ని గురించి రాసిన కథలు కె . ప్రవీణారెడ్డి రాసిన ‘ది రెడ్ రిబ్బన్ క్లబ్’ వి. శాంతి ప్రబోధ రాసిన ‘ఆ యువత ముందు తరం దూతలు’ .

డా అనంత లక్ష్మి  రాసిన చెల్లని నోటు, భావరాజు పద్మిని రాసిన పులిరాజు, జీవితం – గద్వాల కిరణ్ కుమారి, మీరే  నేర్పాలి – జిఎస్ సుజాత, జవాబు – కస్తూరి భారతి రామం,  కె.బి. లక్ష్మి ‘ఆకాశామల్లి’ , కె వాసవదత్త రమణ కథ ఎనిమిదొఅడుగు’ , నండూరి సుందరీ నాగమణి కథ ఆశాదీపం, నామాని సుజనా దేవి కథ ‘దొరికిన జవాబు ‘,  పోడూరి కృష్ణకుమారి కథ ‘ఓడిపోలేదోయ్ ‘ , పి.వి.శేషారత్నం కథ ‘అమ్మమనసు , పరిమలా సోమేశ్వర్ ‘ఒక్కసారి ‘ పొత్తూరి విజయలక్ష్మి కథ ‘అసాధ్యం కాదు సుసాధ్యమే ‘ పోల్కంపల్లి శాంతాదేవి కథ ‘నవ్వులు పూయించండి’, పాలంకి సత్య కథ వెలుగురేఖ’, పెండ్యాల గాయత్రి కథ ‘కథ మారింది’ , పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి కథ వేలివేయొద్దు’ , పుటల హేమలత కథ ‘కొత్తఆశ ‘, రాజీవ రాసిన హాయ్ ప్రేమ ‘ , ఆర్ . రమాదేవి కథ ‘తీరం చేరే కెరటం ‘ , శైలజా మిత్ర ‘ కర్తవ్యం’ ,   శ్రీలలిత ‘తమసోమా జ్యోతిర్గమయ ‘, సింగరాజు రమాదేవి ‘ఒక ప్రేమకథ ‘, తమిరిశ జానకి ‘ నీ జీవితం నీ చేతిలో ‘, తుర్లపాటి లక్ష్మి ‘ప్రతిమ’, తురగా ఉషారమణి ‘కెరటం ‘ డా. తెన్నేటి సుధాదేవి ‘నా తప్పులేదు’, టి . నళిని ‘బ్రతకాలి -బ్రతికించాలి ‘ డా . వాసా ప్రభావతి  ‘ఉషోదయం ‘ , డా . వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘పడవలు రేవు చేరాయి ‘ వంటి ఎన్నో కథలు వాటి గూర్చి చెప్పటం కాదు చదివి తీరాల్సిందే.

హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాప్తికి కారణాలు  అత్యాచారాలు, రక్తమార్పిడి, భర్త ద్వారా భార్యకి సంక్రమించడం, ట్రాఫికింగ్, వ్యభిచారం, నిర్లక్ష్యం , మానవతావిలువలు నశించడం, ప్రేమ పేరుతో మోసపోవడం… ఎన్ని కథలో .. ఎన్ని వ్యధలో .. భిన్న దృక్పథాల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో కుల, మత , ప్రాంత, లింగ బేధం లేకుండా అన్ని వర్గాల వారూ పడే బాధ.  ఒక్కో కథ ఒక్కో తీరులో తీసుకున్న సమస్య పై అవగాహన కలిగిస్తూ, మనో ధైర్యాన్ని , బతుకుపై విశ్వాసాన్ని ప్రోది చేస్తూ.. తమ లాంటి బ్రతుకు మరొకరికి రాకూడదని కోరుకుంటూ .. తమకు చేతనైన సహాయం అందిస్తూ .. సాగిన కథలే అన్నీ . కథా రచన శైలిలో వైవిధ్యంతో సాగిన కథలు ఇవి.  కథలో పటుత్వం కొన్నింటిలో తగ్గినప్పటికీ అన్ని కథలూ అవసరం అయినవే.   చైతన్యవంతం అయినవే. పరిమిత సమయంలో ఇంత మంచి కథలు ఆవిష్కరించిన కథకులందరికి అభినందనలు చెప్పాలిసిందే.

రచయితల్ని ఆయా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళి వారికి మరింత ప్రత్యక్షానుభావాన్ని కలుగ చేస్తే ఇంకా ఎంతో అవసరమైన అంశాలతో , వివరాలతో ఇంకా మాంచి కథలు వస్తాయని ఈ కథలు వాగ్దానం చేస్తున్నాయి అని జ్యూరీ మాటలో డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారన్నారు. నిజమే, నాలుగు గోడల మధ్య కూర్చొని ఊహించి రాసినదానికి కంటే, ప్రత్యక్షంగా చూసి లోతుగా అధ్యయనం చేసి రాసే సాహిత్యం మరింత  శక్తివంతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి అన్ని కథల్నీ చదివి ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు.  ఆ పని చేశారు కథా రచనలో అపార అనుభవం ఉన్న కథకులు విహారి, డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి,  తుమ్మేటి రఘోత్తమరెడ్డి వ్యవహరించారు.

తెలుగునేల నలుమూలలా ఉన్న రచయిత్రులందరినీ సమీకరించి, వారి రచనలు సేకరించి ఒక కార్యాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన సంపాదకులు అయినంపుడి శ్రీలక్ష్మి, మామిడిహరికృష్ణ, మమతారఘువీర్ ల కృషికి నిదర్శనం అద్భతంగా ఉన్న ఆశాదీపం.  అక్టోబరులో సాహితీ సమారోహణం గురించి చెప్పినప్పుడు ఊహించలేదు ఇంత చక్కటి పుస్తకం అందుకుంటామని. అందుకోసం సంపాదకులు పడిన శ్రమ, ఇబ్బందులు తక్కువేమీ కాదు.  అనుకోని అవాంతరాల వల్ల అనుకున్న సమయానికి డిసెంబరు ఒకటవ తేదీన పుస్తకం రాకపోయినప్పటికీ వారు పడిన  ప్రయాస అంతా తుడిచిపెట్టుకుపోయి ఉంటుంది.

హెచ్ ఐ వి/ఎయిడ్స్పై ప్రజలలో  అవగాహన పెంచడం  కోసం, చైతన్యవంతం చేయడం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అందులో ఈ పుస్తకం కోసం చేసింది సముద్రంలో నీటి బొట్టంతే.  కానీ, వచ్చే ఫలితం ఊహకందనంత.

-వల్లూరిపల్లి శాంతి ప్రబోధ