యానాంలో ఒక వేమన…

memory

రోహిణి కార్తె.

ఎండ పేట్రేగి పోతుంది.

పెద్ద గోళెంలో బెల్లం తయారయేటపుడు ఉడుకుతూ పొంగుతున్నట్లు..అలల గతులు!
చెరకు రసం కోకోకోలా ఉత్తుత్తినే గొంతులు తడుపుతున్నాయి. క్షణ తర్వాత మామూలే. తలలు చురుక్కుమంటున్నాయి.
చెమటతో శరీరం తడిసి ముద్దవుతోంది. ఆహా …ఏమి ఎండరా బాబూ…మలమలా మాడ్చేస్తోంది.

అట్లాంటి సమయంలో తీరని దాహంతో ….అలమటిస్తున్న కవులేం చేస్తారు. ? సేద తీరే మార్గాలు వెతుక్కుంటారు. చల్లబడే దిక్కుల కోసం కలియ దిరుగుతారు. నీడల చుట్టూ అల్లుకుపోతారు. కవి సందర్భాలకోసం వెంపర్లాడతారు. ఊహాలోకంలో సేదతీరుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. అక్షర జ్ఞానులు….రాబోవు తరం దూతలు. ఇరవై ఏళ్లనాటి జ్ఞాపకాన్ని దృశ్యమానం చేయడం ఇది. వారంతా పదిమంది కవులు శివారెడ్డితో కలిపి. లుంగీ తలపాగాగా చుట్టి…బండి వాడిని పక్కన కూచోబెట్టుకుని. అదొక పసందైన ముచ్చట. కవుల బండి గోదావరి కేసి పరుగులు తీసింది.

మిట్టమధ్యాహ్నం….యానాం ఫెర్రీ రోడ్డు. సందడి లేదు. నిర్మానుష్యం. చిటపటలాడుతున్న ఎండ. వేళకాని వేళ. ఈ సమయంలో జలవిహారం కోరిక కడువిడ్డూరం. అల్లదివో గ్రీష్మ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పడవ సిద్ధం. వొక్కొక్కరూ ఎక్కారు. గోదావరి మధ్యగా ఇసుకమేటల లంక. చుట్టూ నీరు. గమ్మత్తైన అనుభవం కోసం ఎదురుచూపు. చండ్ర నిప్పులు చెరుగుతూ ఆకాశంలో వొంటరి సూర్యుడు. నీటి మేఘాల్ని చొచ్చుకుంటూ…పడవ కదిలింది. కవులేం చేస్తారు. ? సమయాసమయాలు లేకుండా పరవశంగా కవిత్వంలో మునిగిపోతారు. సుమధుర రాగాలాపన చేస్తారు. రసస్వాదనకు గంగవెర్రులెత్తుతారు. వీళ్లదే అదే బాపతు. వేడి నీళ్లతో ముఖాన కళ్లాపిచల్లినట్లు…ఆవిరి సెగలు ఎగజిమ్మినట్లు వేడిగాడ్పు…సూర్యకిరణాల ఏటవాలు తనం కోల్పోయి నిట్టనిలువుగా ప్రసరిస్తున్నాయి. వొళ్లంతా చెమటలు. రెప్పలు మూస్తూ తెరుస్తూ.. చెయ్యి అడ్డం పెట్టుకుని చూసే సన్నని చూపులు.
ఉక్కిరి బిక్కిరి అవుతూ కవులేం చేస్తారు. అసహనంగా గెంతులు వేస్తారు. ఆశువుగా నిరసన పాటలు కడతారు. ఉద్రేకంతో గొంతు చించుకుంటారు. కొత్త అనుభవం కోసం ఉర్రూతలూగుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. చరిత్ర గర్భాన రేపటి గుర్తు సంభాషణలు ముగింపు పలకకుండానే…లంక వచ్చేసింది. దిగారు. సరంజామా వొక చోటకు చేర్చారు. హాయిగా ఆనందించే వెన్నెల సమయమా ఇది…?
మబ్బు తెరలు అడ్డు రాకుండా సూర్యుడు చూస్తున్నాడు. ఇసుకనేల కూర్చోవడానికి గోనె సంచులు కింద పరిచారు.  ఆతృతగా గొంతులోకి జారుతున్న ద్రవం. దేహాన్ని చల్లబరిచే పని మొదలు పెట్టింది. కాసింత స్థిమిత పడ్డారు. ఉపశమనం. సరిగ్గా ఇప్పుడే…  సృజనకారులు తెరచిన పుస్తకాలవుతారు. నచ్చిన లేదా నచ్చని విషయాలు జంకు గొంకు లేని మాటలుగా నాభిలోంచి తన్నుకు వస్తాయి. ఎవరినైనా ఏమైనా అనగలధైర్యం సాహసాలు ఛాతీ కొట్టుకుంటూ వస్తాయి. ఇప్పటి పరిస్థితి వేరే. రసవత్తర సంఘటన పురులు పోసుకునే సంధి సమయం.

అధ్యయన శోభతో ఇంకించుకున్న కవిత్వ పోహళింపులని విప్పుకున్నారు. యువకవులు ఆస్వాదిస్తున్నారు. కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. కవిత్వ శిక్షణలో కొత్తదారి. అంత ఎండలోనూ శాలువా కప్పుకుకున్న శివారెడ్డి రైలు బండి పాట అందుకున్నారు. అందరూ చప్పట్లు. మద్దూరి నగేశ్ బాబు చిత్రమైన గొంతు జీరతో పల్లెవాటు పదాలతో పాడిన పాట మనసుల్ని మరింత చల్లబరిచింది. వాతావరణం నిశబ్దంగా మారిపోయింది. లయబద్దంగా ప్రశంసల జల్లులు. కలకలిగిన వారంతా గొంతు విప్పారు. ఎండ వేిడ చల్లని వెన్నెలయ్యింది.
గుంపులో కవికాని వాడు వొకడున్నాడు.

అతను లేకపోతే ఈ కథే లేదు.

అతను మౌనంగా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు.
గూడ పంచె..చిరిగిన బనీను. పెరిగిన గడ్డం. ముంజేతికి తెల్లబారిన కాశీ తాడు. తెల్లని దువ్వని చింపిరి జుట్టు. చేతులు కట్టుకుని మూలగా మాజేటి సుబ్రమణ్యం . వాడి చూపులతో గోదావరిని చూస్తున్నాడు. కవి గుంపులోకి ఎలా చొరబడ్డాడో తెలీదు. శీవారెడ్డి దృష్టి అతని మీద పడింది. అంతే. కందిరీగ తుట్టె రేగింది.
”ఏం  పెద్దాయన. గమ్మునుండిపోయావ్. నువ్వ పాడొచ్చు. మాట్లాడొచ్చు. అంతా మనవాళ్లే. మనుషులే”. శివారెడ్డి పలకరించారు. ఆయనకే చెల్లిన దోర నవ్వుతో.
”మనుషుల్లో పెద్ద మనుషులు బాబు మీరు. నానేం మాట్లాడగలను. బాబయ్యా. ? పొట్ట చింపితే కలికంలోకి కూడా అచ్చరాలు ఆనవు. చిత్తం బాబు.”
”మీకేమైనా పద్యాలొచ్చా..? విని వొంటబట్టించుకున్నయి ఏమన్నా ఉంటే చెప్పండి.” ఆతరంలో చదువుకోకపోయినా పద్యాలు రాని వారు ఎవరూ లేరు.
”వచ్చు గానండీ…తమ బోంట్లు వింటే కిసుక్కున నవ్వేస్తారు. ఏమన పద్యాలు , బ్రహ్మం గారి తత్వాలు బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఏదో కాలక్షేపం కోసం.”
”చెప్పు తాతా..?” అంటూ ముచ్చట పడ్డారు కుర్ర కవులు.
సుబ్రమణ్యం ఎత్తుకున్నాడు ముందుగా వేమన పద్యాలు.

” తేనె పంచదార తీయ మామిడిపండు
తిన్నగాని తీపి తెలియరాదు.
కన్న నింపు బుట్టు  కామిని అధరంబు
విశ్వదాభి రామ వినుర వేమ. ”
అంటూ పద్యాలు మొదలెట్టాడు.

చెవులు రిక్కించి విన్నారు. వొక్కో పద్యం విని అదిరిపోయారు. ”అద్భుతం…”అంటూ సంబరపడ్డారు. శివారెడ్డి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వారెవ్వా అంటున్నారు.
గోపి గారికి అందని పద్యాలులా ఉన్నాయి.” ఏదీ మళ్లీ చెప్పండి.” బీరు కేసుల అట్టపెట్టి…కాగితం చింపి దాని మీద రాయడానికి ఉపక్రమిస్తూ సీతారాం చిన్నపిల్లాడై జాగ్రత్తగా నాలుగైదు పద్యాలు రాసుకున్నాడు.
”మా వోడే మా బంధువే. ….. ”మెరుపు కళ్లతో శిఖామణి అన్నాడు.
”మీరు కాసిన్ని ఈ చుక్కలతో గొంతు తడుపుకుని మరికొన్ని పద్యాలు లాగిస్తే తరిస్తాం. ఇన్నాళ్లూ ఎక్కడ దాగి ఉన్నావయ్యా మహానుభావా…?”చేతులు జోడించి చిరునవ్వు  అందించాడు యాకూబ్.
”అబ్బాయిలూ….ఏమనుకోకండి. మనకిది ఎక్కదండీ. వొళ్లు తమాయించుకోలేదండి. కిక్కు సరిపోదండీ. సరిపోక పోత అదోరకం బాధండి.”సున్నితంగా తిరస్కరించాడు సుబ్రమణ్యం. ఎంత బతిమాలినా సీసా తాక లేదు.
సుబ్రమణ్యం కేసి సంబరంగా చూస్తున్నాడు అఫ్సర్. మౌనంగా మనసులో రేగుతున్న భావ శకలాల్ని పోగు చేసుకుంటూ  బహుశా యానాం ఏమన ఏమనే… కైత కట్టుకుంటున్నాడేమో.
”వీర బ్రహ్మంగారి తత్వాలు కూడా అందుకోండి. సుబ్రమణ్యం గారూ….”నిషా ముసుగులేకుండా ఎండ భరిస్తున్న ఏకైక వ్యక్తి దర్భశయనం అడిగాడు. సుబ్రమణ్యం ఇక బతిమాలించుకోలేదు.
” ఏ కులమబ్బీ… నీదే కులమబ్బీ….అని అడిగితే ఏమని చెప్పుదు లోకులకు. పలు గాకులకు.
చెప్పలేదంటనక పోయేరు. నరులారా గురుని చేరి మొక్కితే బతక నేర్చేరు.”

మంద్ర స్థాయిలో మొదలెట్టి ధారాళంగా పాటలు, తత్వాలు అందుకున్నాడు. మనిషి జీవితంలోని దశల్ని, పుట్టుకనుంచి మరణం దాకా చెప్పేవన్నీ ఆలపించాడు. కొన్ని తత్వాలు సుఖ దుఃఖాల అనివార్యతను తెలియ జేశాయి. కొన్నేమో జీవన తాత్వికతలను బోధిస్తూ..వైరాగ్య భావనలోకి తీసుకెళ్లాయి.
కవి మిత్రులు సంతృప్తి పడలేదు. సుబ్రమణ్యాన్ని వదలలేదు. బతిమాలి, బతిమాలి పాడించుకున్నారు.” మరిన్ని పాడండి. మీకొచ్చినవన్నీ వినిపించండి సుబ్రమణ్యం గారూ. ….. ” తనివి తీరనట్లుగా అడిగారు.
”నన్ను అండీ…గిండీ అంటూ మన్నన చేయకండి బాబూ. నాక్కోపం వస్తుంది. నేను అంటరానోన్ని. మీరు చదువుకున్న మారాజులు. వొరేయ్, గిరేయ్ అంటేనే బాగుంటుందండీ. అలవాటైన ప్రాణానికి. ”
”అలాంటి తేడాలు లేవు. అందరూ వొకటే…ఇక చదువంటారా. మేం పుస్తకాలు పట్టుకున్నాం.మీరు లోకాన్ని చదివారు. మీ జ్ఞానం తక్కువేమీ కాదు. మా దగ్గరలేని వేమన పద్యాలు…మీ నోటి నుంచి విన్నాము. మీకు మాకూ తేడా లేదు. మనమంతా వొకేలాంటి మనుష్యులం. ”వొంటి మీద శాలువా తీసి పక్కన పెట్టి అన్నారు శివారెడ్డి.
”సరే వొక మాట. మొత్తం ఈ గోదావరి మీద మత్స్యకారులొక్కరేనా బతికేది. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు వేరెవ్వరూ లేరా. ? ” గుంపులోంచి వేరెవరో అడిగారు. ఎవరడిగారు చెప్మా. ..!
” మా వాళ్లలోనూ ….రకరకాలుగా గోదావరి మీద బతుకుల్ని లాగించేవాళ్లున్నారు. పడవల్లోకి ధాన్యం బస్తాలు, కొబ్బరి కాయలు ఎగుమతి చేయడం, అర్థరాత్రి ఇసుక దేవుకుని పడవల్ని నింపడం సేత్తారండీ. ఇక చేపలంటారా…? పట్టుకునే వారు తక్కువే కానీ మా వూళ్లో ముత్యాలని వొక ఆడది ఉందండీ. దానిది మాకులమే. అది ఆడది కాదండీ బాబు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీపు వెనకాల పల్లె గంప మోచేతిమీద వల చుట్టుకుని …గంపెడు చేపల్ని ఇట్టే పట్టుకుంటుందండి. బతుకు తెరువు అలవాటు చేసుకోవాలిగానీ ఏ పనైనా ఎవరికైనా లొంగుతుంది. అంతే కదండీ.” సుబ్రమణ్యం బదులిచ్చాడు.
మద్దూరి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సుబ్రమణ్యం కోసి తీక్షణంగా చూస్తున్నాడు. ఆ చూపులు తగిలినట్లున్నాయి. సుబ్రమణ్యం అసహనంగా కదిలాడు. మద్దూరి మాత్రం ఇంకా అతను ఏం చెబుతాడో అని ఎదురుచూస్తూ దోసిలిలోకి ఇసుక తీసుకుని ఎగరేస్తున్నాడు. గవ్వల్ని దూరంగా విసిరేస్తున్నాడు.
సుబ్రమణ్యం ఆకాశం చేసి చూశాడు. చుట్టూ ఉన్న గోదావరిని చూశాడు. ఉస్సూరని నిట్టూర్చాడు. కాసేపు బీరు సేవనంలో మనిగిపోయారు. అక్కడి వారందరి మనసుల్లో సుబ్రమణ్యం….. సుబ్రమణ్యం.
” ఏమయ్యా సుబ్రమణ్యం. నిన్నీపళంగా ఇక్కడ వదిలేసి చక్కగా పడవెక్కి ఉడాయిస్తే….ఏం చేస్తావోయ్…”గమ్మత్తుగా శివారెడ్డి అడిగాడు.
”నాకేటి భయం. నాకేటి భయం. నీటిమీద నడుచుకుంటూ వచ్చేత్తా.”
” విన్నారా ..? అంతకంటే కవిత్వం ఏమిటి..? నిర్మలంగా మైదానంలా గోదావరి ఉందని చెప్పక చెపుతున్నాడు.  తలచుకుంటే మార్గం దొరుకుతుందని అంటున్నాడు.
శభాష్ సుబ్రమణ్యం. అన్నాడు శివారెడ్డి. కోపగించుకోకండీ మరండీ..మరండీ… నన్నేమైనా అనేయమంటారా..? నాకు తోచింది మాట్లాడేయమంటారా..? ” ముందుగా అనుమతి కోరాడు.
”శుభ్రంగా అనవయ్యా… ఈ వేళ నీకేం అడ్డు లేదు. ”
మాటలు కూడదీసుకోవడానికి అన్నట్టు కాసేపు ఆగాడు సుబ్రమణ్యం.” అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అందరూ అమ్మానాన్నల సంతోషంలోంచే..రెండుకాళ్ల మధ్య గుండానే కెవ్వుమని ఏడ్చుకుంటూ పుట్టాం గందా. ఇన్నాళ్లూ రాత్తుండారు. మా కట్టాలు కన్నీళ్లు మీకు ఆపడ్డాయా..అయ్యలారా. వొకే దారి గుండా వచ్చాం సరే. మరి మా ఆకు (విస్తరి) ఎందుకు ఎడం. (దూరం. ) అయింది బాబయ్యా..?” అన్నాడు.
కవుల జేబుల్లోని కలాలూ  దడదడలాడాయి. నిశ్చేష్టులయి తమ అనుభవాల్ని తవ్వుకుంటున్నారు. తాము అధ్యయనం చేసిన అంశాలు గుర్తుకొచ్చాయి.
కవులేం చేస్తారు..? కవులేం చేస్తారు.
దిక్కులు పిక్కటిల్లేట్టు గుండె బద్ధలై..వెలువడిన ప్రశ్నకు సమాధానం ఏది..?
ఈ ప్రశ్నను సజీవ సాహిత్యంగా మలచాలి.

*

మన్యం వోరి మేడ

రాత్రి యానాం చరిత్ర పేజీలు తిరగేస్తున్నప్పుడు నన్ను కొంత శూన్యం ఆవహించింది. కలత నిద్రలో ఎవరూ చెప్పని కథలు వెంటాడాయి. అవి నిజమో అబద్ధమో…ఇంకా ఊహల్లోకి పోతేనే గానీ తెలీదు. ఇక ఉండలేకపోయాను. కూలిపోయి నేలమట్టం కాబోతున్న ఆ మన్యం వోరి మేడను ఒకసారి చూడాలి. ఉదయాన్నే అక్కడకు చేరుకున్నాను. ఎదురుగా నిలబడి చూస్తున్నాను.

శిధిల భవనం. కథలు కథలుగా చెప్పుకునే ఒకనాటి కాంతిమయ ప్రదేశం. సరిగ్గా నూట ఇరవైఅయిదేళ్ల క్రితం నాటి కట్టడం. కూలుతున్న గుర్తుల్లోంచి ఆ నాటి వెలుగులు ఊహించడం కష్టం కాకపోవచ్చేమో. బయట ఇరు పక్కల చిట్లిన ఫిరంగి గొట్టాలు…కూలిన ప్రహారీ గోడ లోంచి గుట్టలుగా పోగుపడిన ఇటుకలు…నాచుకట్టిన ఇటుకల మధ్య నుంచి పొడుచుకొచ్చిన పిచ్చిమొక్కలు.                              గేటు తీసాను. గరుకు రాతి మీద కత్తులు సానబెట్టే శబ్దం. తడబడే అడుగులతో లోపలికి ప్రవేశించాను. పట్టపగలు…చుట్టూ మెలకువ సందడి. అయినా ఎందుకో భయం.చీకటి తరుముతున్న భావన.

విశాలమైన హాలు. దాటగానే మండువా. నగిషీలు చెక్కిన స్తంభాలు. పైకి చూస్తే`నలుచదరంగా ఆకాశం కనిపిస్తున్నది.మొదటి అంతస్తులో నలువైపులా ఆడవారు నుంచుని క్రింద జరిగే కార్యక్రమాల్ని చూడటానికి వీలుగా మూడడుగుల ఎత్తులో స్తంభాలు నిలబెట్టి కట్టిన పిట్టగోడ. తల వంచుకుని చుట్టూ చూసుకుంటూ తిన్నగా వెళ్లాను.ఎడమ వైపు మెట్లు, పైకి వెళ్లడానికి. కొంచెం దూరంగా బహుశా సేవకులకు కట్టించిన గదులు కాబోలు ఉన్నాయి. మొత్తం మీద భూగర్భంలో కూరుకుపోయి వందల సంవత్సరాల తర్వాత తవ్వకాల్లో బయలుపడ్డ పురాతన కట్టడంలా ఉంది.

ఇది ఉన్న చోటు యానాంలో మంచి కూడలి. ఏళ్ల తరబడి ఉన్నదున్నట్లుగా ఉంచేసారు.ఏ వాణిజ్య సముదాయంగానో మారిస్తే బోలెడంత ఆదాయం వచ్చేది. అయినా వారసులు ఒక స్మృతి చిహ్నంగా అట్టి పెట్టడం విశేషం.

ఉన్నట్టుండి  తల దిమ్ముగా ఉండి చెమటలు పట్టి కళ్లు తిరుగుతున్నట్లనిపించింది. నిలబడటానికి ఆసరా కోసం చేయి చాపాను. దొరక లేదు.దబ్బున నేల మీద పడ్డాను. అంతే తెలుసు.

కల లాంటి భ్రాంతి. ఏవో దృశ్యాలు…కళ్ల ముందు. చెవి దగ్గర గుస గుసలుగా మాటలు వినబడుతున్నాయి.మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. వాళ్లు ధరించిన దుస్తులు, భాష తేడాగా ఉన్నాయి. తెలుగే. ఉచ్ఛారణ వింతగా ఉంది. పాత ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నాను. కాసేపటికి వాతావరణానికి అలవాటు పడ్డాను. కాలం గుర్తులు ఆధారంగా గమనించిందేమిటంటే ఇది నేనెరిగిన లోకమే.కాకపోతే కొంచెం పురా వాసన. ఇంతోటి యానాం గడ్డ ఎన్నో అనుభవాల్ని గుదిగుచ్చుకుంది.ఉద్వేగాల నడుమ ఫ్రెంచి పరిపాలనా కాలం లోకి వెళ్లడం గమ్మత్తుగా ఉంది. సంగతేమిటో తెలుసుకోవాలని ఆతురతగా ఉంది.చిన్నప్పుడు మా ముత్తాత యానాం విశేషాలు సమయం వచ్చినప్పుడల్లా చెబుతుండేవాడు. నేనెంతో ఇష్టంగా వినేవాడిని.ఆయన ఎక్కువగా దిగజారుతున్న విలువలు గురించి చెప్పేవాడు.Kadha-Saranga-2-300x268

గతానికి వర్తమానానికి మధ్య కాలంలో వచ్చిన మార్పుల ప్రస్తావనే  ఉండేది.అందులో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విలువల పతనమే ఎక్కువగా ఉండేది. కథ చెప్పే తీరు  ప్రత్యక్షంగా వెండి తెర మీద చూస్తున్నట్లు అనుభూతి కలిగించేది.ఇంకా చెప్పాలంటే ముత్తాత తన సహజ శైలిలో వర్ణించి చెబుతుంటే మనం చదువుకుంటున్నట్లుండేది…సంఘటన జరిగే సమయంలో నేను అక్కడే ఉంటున్నట్లుండేది.ఇప్పుడూ నాకు అట్లాంటి

అనుభవమే కలుగుతూంది. ఆ అనుభవాన్ని మీకూ పంచడానికే  ఈ కథ.



 

మహలక్ష్మమ్మ గొప్ప పరోపకారి. మానవత్వం గుబాళించే మంచి మనిషి. ఆవిడకు సాధారణంగా కోపం రాదు.ఎవరైనా ఆపదల్లో ఉంటే ఆదుకోవడం ఆమె నైజం.అసత్యం ఒప్పుకోదు. ముసుగులో గుద్దులాట కుదరదు.నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. అందరూ అలాగే ఉండాలనుకుంటుంది. నమ్మించి మోసం చేస్తే మటుక్కి భరించలేదు. యానాం పెద్దొర సి.రెనండి కు ఆమె అంటే ఎంతో అభిమానం.అన్‌హోమ్‌కీసే టుజువో బ్యో పార్లే (కలకాలం చెప్పుకోదగ్గ మనిషి) అని పొగుడుతాడు కూడ. ఆవేళ మహలక్ష్మమ్మకు విపరీతమైన కోపం వచ్చింది.

అందరి మీద విరుచుకుపడిపోయింది. చెడామడా తిట్టి పోసింది. ఒక దశలో సంయమనం కోల్పోయి ఎప్పుడూ లేనిది దివాను సుబ్రహ్మణ్య శాస్త్రులును  సైతం ఏకవచనంలో సంబోధించింది. శాస్త్రులు మాట్లాడే సాహసం చేయలేదు.మౌనంగా ఉండిపోయాడు.

మహలక్ష్మమ్మకు నలభై నాలుగేళ్లు. పెళ్ళైన తొమ్మిదేళ్లకే భర్త కనకయ్య పోవడంతో ఆస్తుపాస్తుల మీద పెత్తనం ఆమె మీద పడిరది.వందలాది ఎకరాల పంట ఆదాయం, శిస్తు వసూళ్లు చూసుకోవడం తలకు మించిన పనే. పైగా ధర్మవడ్డీకి అప్పులివ్వడం ఆ కుటుంబానికి ముందు నుంచీ ఉన్న అలవాటు. పరిపాలకులైన ఫ్రెంచి వారికి కూడ అవసర సమయంలో అప్పు ఇచ్చేవారు. పాండిచేరీ నుండి సొమ్ము రావడం ఆలస్యమైతే మన్యం కుటుంబం వారి దగ్గర్నుంచే ఫ్రెంచి వారు తీసుకునేవారు. ఇంతకీ ఆరోజు మహలక్ష్మమ్మ అంత తీవ్రంగా స్పందించడానికి కారణాలేమిటి?

సుబ్రహ్మణ్య శాస్త్రులు ఒక మనిషిని అంచనా వేయడంలో పొరబాటు పడ్డాడు. దాని ఫలితమే ఇది.సత్యలింగం అనే వాడిని మహలక్ష్మమ్మకు పరిచయం చేసాడు. సత్యలింగం కల్లబొల్లి కబుర్లు ఏన్నో చేప్పాడు. ఏడ్చాడు.అవసరం చెప్పుకుని ప్రాధేయపడ్డాడు. ఊరికి కొత్తయినా నమ్మకానికి మొదటివాడినన్నాడు.

‘‘ అయ్యగారూ…మీరే కాపాడాలి. చిన్న వ్యాపారం.దెబ్బతిన్నాను. పారేసిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు.మీరు దయ తలిస్తే మీ పేరు చెప్పుకుని బతుకుతాను. యానాం వచ్చి ఆరు మాసాలైంది. అధిక సంతానం. నా ప్రారబ్దం కొలదీ ఇంకా ఇతర సమస్యలు చుట్టుముట్టాయి. మీరు కనికరించకపోతే ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు’’ అంటూ కాళ్ళ మీద పడ్డాడు సత్యలింగం.

‘‘ మీ కులం వాడిని. మీరు గాక నాకెవరు సాయపడతారు?’’ అని కూడ అన్నాడు. సుబ్రహ్మణ్య శాస్త్రులు  వత్తాసు పలికాడు. ఇంకేముంది? మహలక్ష్మమ్మ కరిగిపోయింది. ఎట్లాంటి హామీ లేకుండా వెయ్యి రూపాయిలు ఇచ్చేసింది.  వందేళ్ల క్రితం అదిపెద్ద మొత్తమే. వడ్డీ నామమాత్రం.వ్యాపారం సవ్యంగా చేసుకుని అన్నమాట ప్రకారం సొమ్ము తిరిగి చెల్లించమని చెప్పింది. మహదానందంగా చేతులు జోడిరచి నమస్కారాలు చేస్తూ వెళ్లిపోయాడు సత్యలింగం.

గడువు దాటింది. సత్యలింగం పత్తా లేడు. ఎన్ని కబుర్లు పంపినా మనిషి ఆచూకీ దొరకలేదు. కుటుంబం యానాం లోనే ఉంది. సత్యలింగం నెల రోజులుగా కనిపించడం లేదు.

ఆరా తీస్తే చాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోదావరి అవతల అమలాపురానికి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న తాటిపాక అతని ఊరు.అక్కడ దొరికిన చోటల్లా datlaఅప్పులు చేసేసి రుణదాతలకు ముఖం చూపించలేక యానాం  వచ్చేసాడు. ఫ్రెంచి వారి ఇలాకా కావడం చేత దివాళా ఎత్తినవాడికి యానాం ఒక రక్షణ వలయంగా పనికొచ్చేది.బ్రిటిష్‌రక్షకభటులు ఇక్కడకు వచ్చి విచారించరు. ఇరవయ్యో శతాబ్దం తొలిరోజుల్లో ఇలా చాలమంది వచ్చి తల దాచుకునేవారు. నైతికమో అనైతికమో ఉన్న కొద్దిపాటి చేను అమ్ముకోకుండా నిలుపుకునే ప్రయత్నంలో పలాయనం చిత్తగించడం ఒక మార్గంగా తలచేవారు. అప్పులు తీర్చే పని కాలానికి వదిలి యానాం చేరుకునేవారు.యానాం ప్రజలు తెలివైన వారు. అలా  వచ్చిన వ్యక్తుల పేర్లకు ముందు దివాళా అనే పదం చేర్చేసేవారు. దాంతో అతని గురించి మిగిలినవారు తెలుసుకుని జాగ్రత్తపడి ఆర్థిక వ్యవహారాల్లో దూరంగా ఉండేవారు. దివాళాగా పిలుస్తుంటే సిగ్గుపడి తలెత్తుకు తిరగడానికి జంకేవారు. అంచేత సిగ్గు అనేది రుణం ఎగబెట్టనివ్వని గుణంగా జమకట్టుకోవచ్చు. కొన్ని రోజులు గడిచాక ` వచ్చిందే దక్కుడు అనే పరిస్థితికి రుణదాత వచ్చేయడం జరిగేది. ఆ సమయం కనిపెట్టి కాళ్ళు, కడుపు పట్టుకుని తృణమో దుగ్గాణో ఇచ్చి బాకీ లేదనిపించుకునేవారు.

సత్యలింగం తెలివైనవాడు. తన గతం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.బంధువుల ఇంటికి చుట్టంచూపుగా వచ్చినట్లుగా యానాం చేరిపోయాడు.బతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చినవాడి గానే చెలామణీ అయిపోయాడు. అతని పేరు ముందు దివాళా చేరలేదు. అతని దురదృష్టం కొలదీ యానాంలో చేస్తున్న వ్వాపారం కూడ బెడిసికొట్టింది. అత్యాశాపరుడుగా అతను తీసుకున్న నిర్ణయాలే వ్యాపారం దెబ్బతినడానికి కారణం.ఆ సమయంలో కొంత సొమ్ము అవసరమై  మహలక్ష్మమ్మని ఆశ్రయించాడు. ఆవిడ దయతో ఇవ్వడం జరిగింది.

మహలక్ష్మమ్మ సుబ్రహ్మణ్య శాస్త్రులుకు వారం రోజులు గడువిచ్చింది సత్యలింగాన్ని వెతికి తీసుకురావడానికి.

ఆయన ఊరూ వాడా గాలించాడు.ఎట్టకేలకు అతని ప్రయత్నం ఫలించింది. యానాంకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న పక్క గ్రామం నీలపల్లిలో ఉన్నట్లు సమాచారం అందింది.మహలక్ష్మమ్మ ఎదుట హాజరుపరచి ఊపిరి పీల్చుకున్నాడు శాస్త్రులు. సత్యలింగం గెడ్డం పెరిగి ఉంది.బుగ్గలు లోతుకు పోయాయి. ముందరి పన్నులు ఊడిపోయాయి. కళ్లల్లో

జీవం లేదు. సర్వం కోల్పోయినవాడిలా ఉన్నాడు. భయపడుతూ చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు.

మహలక్ష్మమ్మ రాజసంగా వాలుకుర్చీలో కూర్చుంది. పరిచారిక విసనకర్ర విసురుతూంది. పక్కన చేతికందేంత

దూరంలో స్టూలు మీద యాపిల్‌ముక్కలతో వెండిపళ్లెం ఉంది. మూతబెట్టిన వెండి గ్లాసులో మంచినీళ్లున్నాయి.సత్యలింగం ముఖకవళికల్ని గమనించింది.

‘‘ మీరు సత్యలింగమేనా? మీ రూపురేఖలు చిత్రంగా మారిపోయాయి. ఆనవాలు పట్టలేకపోతున్నాను. ఇంతలోనే అంత మార్పా? మీరు మీరేనా?’’ మహలక్ష్మమ్మ ఒకింత ఆశ్చర్యంతో అడిగారు.

‘‘మనోవ్యథ తల్లీ….అంతకుమించిన రోగమేముంది? చేసిన పని ఏదీ కలిసి రావడం లేదు. మా తాటిపాక లోని భూమిని అయినకాడికి అమ్ముకుందామన్నా కొనేవాడు లేడు. శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. నా బాధ అన్యులకు తెలీదు. మా ఊరికి ముఖం చూపించలేకపోతున్నాను. దయాగుణం అపారంగా ఉన్న లక్ష్మీ స్వరూపులు…మిమ్మల్ని దర్శించుకోలేకపోతున్నాను. కాస్త గడువు ఇస్తే తమరి బాకీ పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. పిల్లలు గలవాడ్ని…మన్నించండి’’సత్యలింగం దీనంగా అన్నాడు.

afsar mannem vori

వినమ్రంగా తగ్గు స్వరంతో సత్యలింగం మాట్లాడిన తీరు ఎవరినైనా జాలిగొలిపేలా చేస్తుంది. మహలక్ష్మమ్మ ఎంత? ఆవిడ తొందరపడి ఔదార్యం కురిపిస్తుందేమోనని సుబ్రహ్మణ్య శాస్త్రులుకు అనుమానం కలిగింది.

‘‘ అతని మాటలు నమ్మకండి. అతని చరిత్ర మొత్తం కూఫీ లాగాను. ఇతను నమ్మదగ్గ వ్యక్తి కాడు.ఎప్పటికి ఏది మాట్లాడి తప్పించుకోవచ్చో బాగా తెలుసున్నవాడు. సత్యలింగం ఊరి వాళ్లే అతని అసలు రంగు విప్పారు. ఊళ్ళోని కొండ్ర అమ్ముకుని అప్పు తీర్చే ఉద్ధేశ్యం అతనికి ఎంతమాత్రం లేదు. చాలా అప్పులున్నాయి. బాకీలు ఎగ్గొట్టి యానాం వచ్చి పడిపోతే అవన్నీ పోతాయనుకుంటున్నాడు. ముఖ్యంగా అప్పు తీర్చే గుణం అతనికి లేదు. అతని స్వభావం విశ్వసించదగింది కాదు. దయ చేసి జాలి చూపించకండి’’ అంటూ సత్యలింగం గురించి తన బాధ్యతగా పూర్తి సమాచారం అందించాడు సుబ్రహ్మణ్య శాస్త్రులు.

సత్యలింగం వణుకుతున్నాడు. బెదురు చూపులతో బేలగా నిలబడ్డాడు.నిస్సత్తువగా కింద పడిపోతాడనిపించింది. అతని స్థితిని  మహలక్ష్మమ్మ గమనించింది. సత్యలింగాన్ని బల్ల మీద కూర్చోమంది. కూర్చున్నాడు. మంచినీళ్ళిమ్మని పురమాయించింది. తాగాడు. అతని కేసి  సుబ్రహ్మణ్య శాస్త్రులు గుర్రుగా చూసాడు.

‘‘ స్థిమితంగా ఉన్నారా? నా మాటలు వినగలుగుతున్నారా? మా పూర్వీకులు చెప్పిన ఒక విషయం మీకు చెప్పాలని ఉంది. వినే ఓపిక ఉందా? అని ప్రశ్నించింది మహలక్ష్మమ్మ వాలు కుర్చీలో వెనక్కి జారగిలపడి పైకి చూస్తూ. అక్కడున్న వారందరకూ ఇదంతా కొత్తగా ఉంది. ఆవిడ ఎప్పుడూ ఇంత సావకాశంగా సమయాన్ని వెచ్చించదు.

‘‘ ఎంత మాట? తప్పకుండా…చిత్తం చిత్తం…’’ అంటూ గొణుగుతున్నట్టుగా అన్నాడు సత్యలింగం.

మహలక్ష్మమ్మ తమ విలువైన కాలాన్ని సత్యలింగం లాంటి వాడికి నీతులు చెప్పడానికి ఉపయోగించడం ఎవరికీ ఇష్టం లేదు.  సుబ్రహ్మణ్య శాస్త్రులు అయితే మరీ ఎక్కువ అసహనంగా ఉన్నాడు. అవతల తోలుబొమ్మలాటల వాళ్ళు వచ్చి ఉన్నారు, తమ కొత్త కథ ఆడటానికి. తొలి కథ మహలక్ష్మమ్మ ముందు ప్రదర్శించి కానుకలు పొందడం వారికి అలవాటు. గ్రామీణ కళాకారులను ఆదరించడంలో మహలక్ష్మమ్మ తర్వాతే ఎవరైనా.

మహలక్ష్మమ్మ గోడ మీది తైలవర్ణ చిత్రం కేసి ఒకసారి చూసింది. అందమైన తలపాగాతో జమీందారీ దుస్తులతో హుందాగా ఉందది. నుదుటబొట్టు…మీసాలు…పులిగోరు పతకం…కోటు…బంగారు బొత్తాలు…సంపద ఉట్టిపడుతున్నది.

‘‘ ఇట్లాంటి సందర్బంలో పెద్దలు ద్వారా విన్న సంగతులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికి ఎనిమిది వందల ఏళ్ళ క్రితం అంటే పదమూడవ శతాబ్దంలో ఆనాటి సమాజంలో ఉన్న ఒక పద్ధతి గురించి చెబుతాను. యాదృచ్ఛికంగా నా బుర్రలోకి వచ్చింది. కాలానుగుణంగా విలువల్లో మార్పులు రావడం సహజం. మనం ఎరుగని కాలంలో మనుష్యుల ప్రవర్తన నియబద్ధంగా నిజాయితీగా ఉండేదని చెబుతుంటారు. సంఘం కట్టుబాట్లు అందుకు దోహదపడేది.ఆ రోజుల్లో ఒక వ్యక్తి తన అవసరాల నిమిత్తం అప్పు తీసుకున్నాడనుకుందాం. అప్పు అంటే రూకలే కానక్కర్లేదు.వస్తురూపం కూడా కావచ్చు. తీసుకున్న వ్యక్తి ఎన్నాళ్ళకూ సరిపెట్టడం లేదనుకుందాం. రుణదాత ఓపికతో ఎదురుచూసినంత కాలం ఎదురుచూసేవాడంట. ఎన్నాళ్ళని భరిస్తాడు? మంచి ముహూర్తం చూసుకునేవాడు. అందరూ కిక్కిరిసి మసిలే సరైన కూడలిలో ఉండగా అప్పు తీసుకున్నవాడిని దొరకపుచ్చుకుని కంది కర్రతో అతని చుట్టూ గిరి గీసి చేతులు జోడించి  నమస్కారం చేస్తూ బాకీ చెల్లించి గానీ కదలడానికి వీల్లేదని కోరేవాడట. రుణగ్రహీత అదేదో కంచె కట్టినట్లుగా  నిట్రాడలా చలనం లేకుండా నిలబడిపోయేవాడట. కాళ్ళు కట్టేసినట్లు విలవిలలాడేవాడట. ఫలానా రోజుకల్లా మొత్తం బాకీ సీదా చేస్తానని ఒట్టు పెట్టి బతిమాలుకునేవాడట. అతని మాటల మీద నమ్మకం కలిగి తనకు ఆమోదయోగ్యం అనిపించి సమ్మతిస్తే  బరి నుంచి విడుదల చేసేవాడట రుణదాత.ఒకవేళ రుణం తీసుకున్నవాడు తెగించి గీత దాటితే సంఘంలో నీతిబాహ్యుడుగా ముద్రపడి అప్రదిష్ట  పాలయ్యేవాడట. గత కాలపు ఈ కట్టుబాటు ఎలా ఉంది, సత్యలింగం గారూ…మరి మీరేమో అప్పులు ఎగ్గొట్టడానికి ఊళ్ళు దాటి వచ్చినవారు. ఎక్కడున్నా అప్పు వదులుతుందా? ఆ సొమ్మును సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు మరింత సంపాదించుకుంటారు కదా. పాడు బుద్ధి పుట్టి  తప్పుడు ఆలోచనలు చేస్తే జీవితంలో  ముందుకెళ్లలేం. అది గ్రహించండి’’ అని చెప్పి వెండిగ్లాసు అందుకుని మంచినీళ్లు తాగింది మహలక్ష్మమ్మ.

అందర్నీ ఒకసారి తేరిపారి చూసింది.మురుగేశన్‌ఏదో చెప్పబోతున్నవాడిలా లేచాడు.అతను కూడ ఆవిడ దగ్గర పనిచేసే ఉద్యోగే. పాండిచేరీ నుంచి వచ్చాడు.అయిదేళ్ళుగా యానాంలో ఉంటున్నాడు.తెలుగు చక్కగా మాట్లాడతాడు. తమిళ యాస కనిపించదు.మురుగేశన్‌అంటే మహలక్ష్మమ్మకు ప్రత్యేక అభిమానం. ఆవిడకు తమిళం నేర్పుతున్నాడు.చాల నమ్మకమైనవాడు. అతని నిజాయితీ అనేకసార్లు రుజువైంది.తనది కాని దాన్ని చిల్లుగవ్వ కూడ ముట్టడు.

‘‘ ఏదో చెప్పాలనుకుంటున్నావు,మురుగేశన్‌…చెప్పు’’ అని అతని కేసి తిరిగింది.

‘‘ నడువలో వందదికు మన్నిక్కణమ్‌(మధ్యలో కలుగజేసుకుంటున్నందుకు మన్నించండి.) నిజాయితీ…సంఘం కట్టుబాట్లు…వింటుంటే పురాతన తమిళ గ్రామాల ఆచారాలు గుర్తుకి వస్తున్నాయి,అమ్మా…ఏనాటి సంగతులో ఇవి. ఒక గ్రామంలో ఎవరైనా వ్యక్తి ఆర్థికంగా చితికిపోతే మొత్తం గ్రామమంతా చింతించేది. నివారణగా ఆ మనిషిని ఆదుకోడానికి చూసేది. ఎట్లా అంటే ఒకరోజు అతని ఇంటికి కూడకట్టుకుని భోజనానికి వెళ్ళేవారు. భోజనం చేసిన వారంతా తినేసిన విస్తరి కింద కొంత సొమ్ము ఉంచేవారు. ఆ సొమ్ము రుణవిముక్తుడయ్యేందుకు సరిపోయేది. అదీ ఆనాటి సమాజం గొప్పతనం. బాకీ చెల్లించే తలంపు ఉంటే కష్టమైనా దారి దొరక్కపోదు. ఏది ఏమైనా తీసుకున్న సొమ్ము తల తాకట్టు పెట్టైనా జమ చేయడం ధర్మం…’’ మురుగేశన్‌అన్నాడు సత్యలింగం కేసి చూస్తూ.

‘‘ ఏమంటారు, సత్యలింగం…వింటున్నారా? ఒకే మాట చెప్పండి. పదే పదే వాయిదాలు వద్దు. పోనీ డబ్బులు ఇవ్వలేనంటే…అదయినా చెప్పండి. పెట్టుబడి పెట్టడం…సాయంగా ఇవ్వడం…మా ఆదాయం పెంచుకోడానికి కాదు. కష్టాల్లో ఉన్న వారికి సహాయపడటం మా వంశాచారం. అదే  తప్పయితే మా విధానం మార్చుకుంటాం…దాని వల్ల మీ లాంటి ఇతరులు నష్టపోతారంతే…’’ మహలక్ష్మమ్మ లేచి నిలబడిరది.

సత్యలింగం తల వంచుకున్నాడు. కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు. చేతులు జోడిరచాడు.

‘‘సరిగ్గా ఇదే రోజు శుక్రవారం మిమ్మల్ని కలుస్తాను.నా లాంటి వాళ్ళను మీరెప్పుడూ ఆదుకుంటూనే ఉండాలి. తోటి మనుష్యుల పట్ల మీ నమ్మకం సడలకుండా ఉండేలా నడుచుకుంటాను. సెలవు ఇప్పించండి’’ అన్నాడు సత్యలింగం.

*****

            పొరలు విడిపోయాయి. సన్నగా వెలుతురు. నూతి లోంచి వస్తున్నట్టు ‘దేవా’ అని పిలుపు. మెలకువ పిట్ట కన్ను తెరిచింది. వాస్తవం అనుభవం లోకి వచ్చింది. చుట్టూ చూసాను. ఎవరూ లేరు. ఇంత దాకా కళ్ళ ముందు దృశ్యమై కదలాడిన అద్భుతమైన పాత సినీమా లోని నలుపు తెలుపు సన్నివేశం ఏదీ? జమీందారీ జిలుగు సొగసులు ఎక్కడకు పోయాయి? ఇపుడు నేనెక్కడున్నాను? నాలోకి దూరి కథ చదివి పెట్టిందెవరు? చరిత్ర పుటల్ని విప్పిందెవరు? కాలం దారులంటా పయనింప చేసి విలువల ఊసుల్ని ఒలకబోసిందెవరు? అవే జాడలు…అవే నీడలు. కాకపోతే రంగు వెలిసిన శిథిలమైన ఆనవాళ్ళు. పెచ్చులూడిన పైకప్పు. మన్యం వోరి మేడ చుట్టూ అల్లుకున్న రహస్యోదంతాల కబుర్లు. చిక్కు వీడని ప్రశ్నల దొంతరలు.

వేద మంత్రాల ఘోషలతో దద్దరిల్లిన ప్రాంగణం….దాన ధర్మాల వితరణల గాథలు…పండిత పోషణల ఔదార్యం…సంస్కృతీ పరిరక్షణల గమనాలు.మరొక వైపు మేడ పెరటిలో జరిగిందనుకునే మానవ బలి ఉదంతమో ….తరతరాలు సంతాన లేమితో దత్తులే వారసులవుతున్న విచిత్ర వైనమో…ఊహల రెక్కలతో ఎంతైనా ఎగరగలం. పరిమితి లేదు. అంతు చిక్కని  గిరగిరా వలయాల్లా తిరుగుతున్న సందేహాలెన్నో….నమ్మేవెన్నో …నమ్మనివెన్నో.మన్యం వోరి మేడ ఎన్ని కథనాలైనా వినిపించగలదు…ఎన్ని సంఘటనలకైనా సాక్షిగా నిలబడగలదు.

భళ్లున శబ్దం. ఆలోచనలు తెగిపోయాయి.ఉలిక్కిపడ్డాను. గది గోడ పడిపోయింది. దుమ్ము రేగింది.శకలాలపై రెండు పిల్లులు…తీక్షణంగా చూస్తున్నాయి. గగుర్పాటు. భయం…వెన్ను లోంచి జలదరింపు…

నెమ్మదిగా లేచాను. గొంతు లోంచి పెడబొబ్బలు, అసంకల్పితంగా. క్షణంలో సగం వీధి గేటుకు చేరాను.

విష్ణాలయం వీధి తీర్థంలా సందడి సందడిగా ఉంది. ఉపద్రవమేదో సంభవించినట్టు గుండెలు బాదుకుంటూ పరుగులు పెడుతూ కొందరు…గుమిగూడి చర్చించుకుంటూ కొందరు…రహస్యంగా గుసగుసలు పోతూ కొందరు…ఏమైయిందేమయ్యింది? ఏయ్‌…బాబూ…ఏమిటి సంగతి? ఒగురుస్తూ ఒగురుస్తూ అసలు విషయం చెప్పాడు. గుండె గుభేలుమంది.మరో కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లే.యానాంలో దాని ప్రకంపనలు ఎట్లా ఉండబోతున్నాయో?

రెండువేల పదిహేనులో షరా మామూలే అయిన వ్యవహారం ఇది. పదే పదే మోసపోయే ధన క్రీడ. ఈజీ మనీ సంపాదనలో పాతదే మళ్ళీ మళ్ళీ కొత్తగా. ఊరంతా విస్తుపోయి ఇంటింటా మెరుపులా పాకిపోయిన వార్త. దిమ్మ తిరిగి మెదడు నరాలు కుచించుకుపోయిన వార్త. జనం సొమ్ముతో ఉడాయించిందట…గోపాల్‌నగర్‌చీటీల వెంకటలక్ష్మి. ఆమె ఒంటి మీది బంగారు జిలుగులు…వరసలు కలిపిన పలకరింపు లోని ఆత్మీయ జడులు…నెలనెలా తలుపుకొట్టి ఇచ్చిన నమ్మకాల వడ్డీ మొత్తాలు…చీటీలు పాడి కూడా ఆమె దగ్గరే మదుపు పెట్టిన భరోసాలు…ఏమయ్యాయి? అరచేతిలో కాసులు పోసి గుప్పెట మూసి తేలుకుట్టిన దొంగల్లా గమ్మునుండిపోయే అక్రమార్జనల సొమ్మైతే పర్వాలేదు.  పిల్ల పెళ్ళో పిల్లాడి చదువో…రూపాయిలు కూడబెట్టిన వారి వేదనలు…రెక్కలు ముక్కలు చేసుకుని చెమట ముంచిన రూపాయల వెతలు ఎవరికి చెప్పుకోవాలి?

అన్ని రోడ్లూ అన్ని నడకలూ గోపాల్‌నగర్‌వైపుకే. గగ్గోలుగా ఉంది. సిరికిం చెప్పడు అన్నట్టు…ఎలాగుంటే అలా…పరుగులు.ఒకరు మరొకరితో మాటలు లేవు. ఎవరి ఆదుర్దా వారిది.ఆలసించిన ఆశాభంగం…ఇపుడు కాకపోతే మరెప్పుడూ దక్కదు అన్నట్లు…రయ్య్‌మని వాహనాల  దూకుడు. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లో దూరి బీరువాలు తెరచి ఎవరికి దొరికింది వాళ్ళు దోచేయడానికి…వీళ్ళ వెర్రి గానీ అన్నీ సర్దుకుని పకడ్బందీ ప్రణాళికతో ఎగిరిపోతే…ఇక మిగిలేదేమిటి?

నాకూ కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. గుండె ఆగిపోబోయి నిదానించుకుంది. ఎందుకంటే…ఎందుకంటే…నేనూ అందులో ముక్కనే…నా బాధా ఎవరైనా పంచుకోవాల్సిందే…నేనూ ఆశోపహతుడ్నే. పెళ్ళాం పోరు పడలేక కొంత సొమ్ము నేనూ ఆ బూడిదలో పోశాను. అణుకువ…నెమ్మదితనం…కష్టసుఖాల్లో ఆదుకునే స్నేహశీలిలా వేషం వేసుకుని…ఎంత నమ్మకద్రోహం? యుగధర్మాన్ని కనిపెట్టలేకపోవడం…కాలం  చిందులు గమనించలేకపోవడం…ఇవ్వన్నీ ఎప్పటికీ నేర్వని పాఠాలు…ప్రలోభాల మాయలు… నిలువునా ముంచెత్తాయి.

ఆకాశం పిడుగులు పడుతున్న చప్పుడు.

వేయి టన్నుల ఇనుప గోళం గుద్దినట్లు…కట్టడం పెటీల్మని పేలి…గత కాలపు యశ: కలాపాలేవో పాతాళం లోకి జారినట్టు…పెద్ద శబ్దం.మన్యం వోరి మేడ నేలమట్టమయ్యింది. పాత కొత్త కాలాల వంతెన కూలిపోయింది.

నేనలాగే ఒక శూన్యాన్ని చూస్తున్నట్టు…

*

చిత్రం: వర్చస్వి 

 

 

టోపీ

datla

దాట్ల దేవదానం రాజు….ఒక సరిహద్దు ప్రాంతం నుంచి తెలుగు సాహిత్యంలో వినిపిస్తున్న కథా కవిత గొంతుక. మితంగా మాట్లాడితే మితంగా రాస్తారు దాట్ల. కాని, ఆయన గొంతుకలో ఒక నిక్కచ్చితనం వుంటుంది. సాదాసీదా బాధలుంటాయి. సామాన్యుడి గోడు వుంటుంది.

అటు కవిత్వంలోనూ, ఇటు కథల్లోనూ తనదయిన సరళ శైలిని వదులుకొని దాట్ల కథ ఈ వారం!

*

 దాట్ల దేవదానం రాజు కవిగా, కథకులుగా గుర్తింపు పొందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మార్చి 20, 1954లో జన్మించారు. మొదటి కథ ‘పేకాట భాగోతం’ 1987లో ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురితమైంది. ‘దాట్లదేవదానం రాజు కథలు’, ‘యానాం కథలు’ పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువడ్డాయి. రెండు దీర్ఘ కవితలు, ఆరు కవితా సంపుటాలు వేశారు. ‘యానాం చరిత్ర’ పేరుతో చరిత్రపుస్తకం వెలువరించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ఈయన రచనలు ఇతర భాషల్లోకి అనువాద మయ్యాయి. ప్రస్తుతం యానాంలో ఉంటున్నారు. టీచర్‌గా పనిచేసి  రిటైర్డ్‌ అయ్యారు. అనుభవంలోంచి పుట్టేది ‘మంచికథ’ అంటారు దాట్ల దేవదానం రాజు.- వేంపల్లె షరీఫ్‌

 

గాలిహోరుగా వీస్తూంది.

చెట్టుకొమ్మలు విరిగిపడేలాఉన్నాయి.

ఆకులు రాలిపడేలా కదులుతున్నాయి

రోడ్డు మీద దుమ్మూ…ధూళి…కొట్టుకుపోతున్నాయి.

గాలి కంటికి కనపడదు.అన్నింటా నేనున్నానంటుంది.

హాయిగా మలయమారుతంలా వీచాల్సింది…ఉధృతంగా…మహోగ్రంగా…సుడులు తిరుగుతూ..ఏమిటిలా?

పంచెకట్టు…తలపాగ…చెదరనిచిరునవ్వు అతని వేషం.తలపాగను చేతుల్లోకి తీసుకుని భుజం మీద వేసుకున్నాడు.అలసటగాఉంది.అయినా ఆతృతగాఉంది.చేయి అడ్డంపెట్టుకుని ఆకాశంకేసి చూస్తున్నాడు. ఆకాశంలో గిరికీలుకొడ్తూ పక్షి ఎగురుతూంది.అది…పక్షి…కాదు…కిరీటం…కాదు…టోపీ.అవును టోపీయే…

అంతెత్తున ఎగురుతూ….ఎగురుతూ…

ఆపసోపాలు పడుతూ అంత గాలిలోనూ చిరుచెమటలతో పంచెకట్టు.పంచెకట్టు తెలుగువాడి సొత్తు.

ఆ మనిషికి గొప్పగా నప్పింది.అంచులుబిగబెట్టి అద్భుత నేర్పరితనంగా కట్టినతీరు బావుంది.తెలుగుతనం ఉట్టిపడుతూంది.ఒక చేత్తో పంచె అంచు పట్టుకుని దించని తలతో టోపీ కోసం పరుగులు పెడుతుంటే జనం కాళ్ళకు అడ్డంపడుతున్నారు.దప్పికతీరుస్తున్నారు.అరటిఆకు పెట్టి దోసిలిలో అన్నం వడ్డిస్తున్నారు.

తమ తొడలు తలగడలు చేసి నిద్రకు పిలుస్తున్నారు.అతని దృష్టంతా టోపీ మీదే.టోపీని ఎలాగైనా కైవసం చేసుకోవాలి.ఏళ్ళపాటు నిరీక్షణ అంతమవ్వాలంటే టోపీ దొరకాలి.

జనాల్ని అడ్డు తొలగమని నచ్చచెబుతూ…ప్రార్థిస్తూ…ముందుకు…మునుముందుకు..టోపీకోసం… పరుగులాంటి నడకతో …పంచెకట్టు.పాదయాత్రకు ఎండలేదు.వాన లేదు.రాత్రి లేదు.పగలు లేదు.తిండి తిప్పలులేవు.పట్టుకోవాలి…పట్టుకోవాలి…టోపీని..చేజిక్కించుకోవాలి.ఒకటే యావ..ఒకే చూపు..తను ఎవర్నీ అనుసరించడు.తన దారి తనదే.తన కష్టం తనదే.ఫలం తనదే కావాలి.

ఆకాశంలో ఆగిఆగి గిరికీలు కొడుతూ ఎగురుతూంది టోపీ గాలి వాలు ఎటు పడితే అటుగా. మొండి వాడిలా ఉన్నాడు.పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు.ముళ్ళు….గతుకులు…ఎత్తుపల్లాలు…ఏరులు..నదీ నదాలు…దాటుకుంటూ జీవనసాఫల్యాన్ని అందిపుచ్చుకోవాలన్నట్టుగా పరుగెడుతున్నాడు.టోపీయే లక్ష్యం. టోపీయే గమ్యం.

ఎండ పేలిపోతూంది. సూర్యుడు రగిలిపోతున్నాడు.మధ్యాహ్నం తీవ్రత శరీరంమీద కనబడుతూంది.

పంచెకట్టు మనిషి ఆగాడు.ఆగాల్సివచ్చింది.తప్పదు.ప్రజానుగ్రహం ముఖ్యం. మెల్లకన్నుతో టోపీని గమనిస్తూనే ఆగాడు.టోపీ దూరంగా ఉన్నా దగ్గరగా రావడంకోసం ఆగాడు.అపుడపుడూ చేయి అడ్డం పెట్టుకుని టోపీ ఆనూపోనూ చూస్తూనే ఉన్నాడు.జనాలికి అతను దేనికోసం చూస్తున్నాడో తెలియడంలేదు.ఆ చూపు నేల మీద పారేసుకున్నదేదో ఆకాశంలో వెతుకుతున్నట్టుంది.

అక్కడో గుంపు.

రోడ్డుకిరువైపులా చేలు.అందరికన్నా ముందు ఒక బక్కచిక్కినవాడు నిలబడ్డాడు.

కళ్ళల్లో దైన్యం,ముఖంలో నైరాశ్యం మూర్తీభవించినట్లున్నాడు.ఆకలిఆవరించినట్లున్నాడు.చిరిగిన తలపాగ చుట్టుకున్నాడు.వెన్నెముక వంగి ఉంది.కళ్ళంనిండా ధాన్యం బస్తాలు.నిండుబస్తాల్ను దబ్బళంతో పురికొస తో కుట్టాడు.ప్రతి బస్తాకు వందరూపాయిల నోటు గుచ్చి ఉంది.

‘‘బాబూ,తండ్రీ… ఈ బస్తాల్ని తమరైనా తీసుకోండయ్యా.నేలతల్లి కరుణతో చెమట పోసి పండించా నయ్యా.ఒట్టినే వద్దు.బస్తా మీద అప్పు చేసి తెచ్చిన సొమ్ములుంచాను.అవిగో చూడండి.ఇందులో మోసం మీదకు నేనే ఎత్తుతానయ్యా.ఆరుగాలం పంట ఇది.మట్టిపాలు కావడం భరించలేను. ఇందులో మోసం లేదు.వీటిని తీసుకుని తమరైనా నా బరువు దించండి.కళ్ళంలో పెట్టుకుని కాపాడలేకపొతున్నాను .మీ భుజం మీదకు నేనే ఎత్తుతానయ్యా.ఆరుగాలం పంట ఇది.మట్టిపాలు కావడం భరించ లేను .” ’’రైతు పంచెకట్టు  పాదాలపై పడ్డాడు.రైతుకి గత్యంతరం లేదు.భూమితల్లి ఆగ్రహిస్తుంది గనుక పంటవిరామం చేయలేడు.తరతరాలు మట్టిని నమ్ముకున్నాడు…గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేడు.ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకూ అలవాటైన వ్యవసాయజూదం లో పాలుపంచుకోవడం తప్పదు.

పంచెకట్టు రైతును లేపాడు. అరచేతితో వెన్నెముకను ప్రేమగా నిమిరాడు.కౌగిలించుకుని ఊరడించాడు .

చెమట తడిసిన నుదుటను పెదాలతో ముద్దుపెట్టుకున్నాడు.

‘‘కంగారుపడకు.నేనున్నాను.టోపీ కోసమే ఇలా వచ్చాను.ఒక్కసారి టోపీ నా చేతికి చిక్కిందా?యజ్ఞం చేస్తా ను.యాగం చేస్తాను.రాయితీల్ను ఉచితం చేస్తాను.ఇక చూసుకోండి` మీ జీవితాలు బాగుపడిపోతాయి.తాతా,అమ్మా నాయనా,అక్కా…ఎవరూ దిగులు పడకండి.అదిగో అలా చూడండి’’అని ఆకాశం కేసి చూసాడు.

అందరూ తలలు పైకెత్తారు. వాళ్లకేమీ కనబడలేదు.ఏదో ఉండే ఉంటుంది.అతన్ని నమ్మాలనిపించింది.

మాటలో తెలుగుతనం..గొంతులో మార్దవం…చూపులో దగ్గరతనం…అందర్నీ ఆకట్టుకున్నాయి.చెట్టుకొమ్మల మధ్య నున్న లక్ష్యం అర్జునుడికొక్కడికే కనిపించినట్టు అతనెంతో ఇష్టంగా పైకి చూస్తున్నాడు.

సూర్యుడు నడినెత్తిన చుర్రుమనిపిస్తున్నాడు.నీడ పాదాల కింద దాక్కుంది.దూరంగా మసగ్గా…టోపీ…చిన్న చుక్కలా.తదేకంగా ఆకాశం వైపు చూస్తూ వడివడిగా అడుగులేస్తున్నాడు పంచెకట్టు.

అక్కడొక గుంపు. ఊగుతూంది.మత్తులో జోగుతూంది.ఒంటికాలిపై నిలబడి పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.వాళ్ళచేతులు వణుకుతున్నాయి.మాట తడబడుతున్నా పూర్తి స్పృహ లోనే ఉన్నారు.వాళ్ళందరి చేతుల్లో ప్లకార్డులు.‘ప్రపంచతాగుబోతుల్లారా,ఏకం కండి’ ‘మా త్యాగమే మీ ఖజానా’ ‘ప్రభుత్వాల్నినడిపేది మేమే. నడిపించేదీ మేమే.’‘మీరైనా మా గోడు పట్టించుకోండి.’

పంచెకట్టు చిరునవ్వు చిందించాడు.సవినయంగా చేతులు జోడించాడు .వాళ్ళెంతో ఆనందపడ్డారు. ఒకడు ముందుకు వచ్చి పడిపోబోయి ఎలాగో నిలదొక్కుకున్నాడు.ఒక చేయి పైకెత్తి వాడే మాట్లాడుతున్నాడు.

‘‘బాటిల్స్‌ ధర మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి.తాగి పారేస్తాం.గుర్తించుకోండి.మీ ఆదాయం మా త్యాగఫలం.మమ్మల్ని నమ్మండి,సారూ.కొంపాగోడూ …అవేమిటి?…పుస్తెలు …పుస్తెలు తాకట్టు పెట్టైనా సరే ప్రభుత్వాల్ని నిలబడతాం.’’చెప్పడం ఆపాడు.ఒకసారి వెనక్కి తిరిగి చూసాడు.

‘‘మీ కోరికలేమిటి,బాబూ.నాకు పనుంది.తొందరగా చెప్పండి.అవతల టోపీ కనుమరుగైతే కష్టం.చెప్పండి.’’

‘‘మా కోరికలు చిన్నవే.మంచి ఖలేజా ఉన్న మీరు అవలీలగా చేసేయగలరు.ప్రధానంగా మావి రెండే డిమాండ్లు.పావలా వడ్డీకి అప్పులిప్పించండి.రైతుల కంటే మాకివ్వడమే లాభదాయకం.రైతులకిస్తే గోడకు వెల్ల వేసినట్లే.

మాతో అలా కాదు.ఇలా ఇచ్చేరంటే అలా తాగేసి ఇచ్చేస్తాం.పైగా అప్పు అప్పుే.ఇకపోతే రెండోది. అమ్ముకోడానికి ఇళ్ళ పట్టాలిప్పించండి.ఆ డబ్బులు తాగితందనాలాడి మీ బొక్కసం నింపుతాం.అంతే,సారూ.శతకోటి నమస్కారాలు’

‘అలాగలాగలాగే’పంచెకట్టు ముందుకురికాడు.ఆకాశం లోకి చూసాడు.ఏదీ టోపీ?అదిగో అల్లదిగో నీలాకాశంలో నల్లటిబొట్టులా.అందుకోవాలి…అందుకోవాలి.తలకు  పెట్టుకోవాలి….కిరీటంలా.

సాయంకాలపు పలుచని ఎండ.అయినా చిరుచెమటలు.నడుస్తుంటే దూరం తగ్గడం లేదు.అంతలోనే మరో గుంపు. అరుస్తున్నారు. కొన్ని అరుపులు వెటకారంగా అనిపిస్తాయి.కాని కావు.అర్థం చేసుకోవాలంతే.

‘‘దయచేసి కరెంటురేట్లు పెంచండి.ఇబ్బడిముబ్బడిగా పెంచి మమ్మల్నికాపాడండి.స్విచ్‌ వేస్తే షాక్‌ కొట్టాల. బిల్‌ చూస్తే మూర్చపోవాల.రోజంతా కోత లేకుండా ఇవ్వాల.’’

‘‘ఇదేం చోద్యమయ్యా, ఎక్కడాలేని వింతకోరిక.నేను అభయహస్తం ఇస్తే మునిగిపోతారు,జాగ్రత్త.అవసరమైన వాటిని మాత్రమే అడగండి.’’అసహనంగా పంచెకట్టు విసుక్కున్నాడు.

‘‘కాదు బాబయ్యా,అంతా తెలిసే అడుగుతున్నాం.మీరు గనుక మా కోరిక మన్నిస్తే మా ఇళ్ళల్లోని ఫాన్‌ల్నీ బల్బుల్నీ చేలోని మోటర్లనీ చచ్చినా వేయం.ఇరవైనాలుగ్గంటల కరెంటనీ  ఊరికే సంబరపడతాం. మురిసిపోతాం ఏదో ఉందని తృప్తి.అంతే.’’

‘‘తస్సాదియ్యా,బలేవాళ్ళయ్యా మీరు.అర్థమైంది.సరే.అలాగే.’’ భుజాలమీద తట్టాడు. వాళ్ళ ముఖాలు బల్బుల్లా వెలిగాయి.పంచెకటు ్టచూపు ఆకాశం వైపుకి మళ్ళింది.

ఎన్నో అడ్డంకులు`భౌతికమైనవి,మానసికమైనవి.అధిగమించాలి.తప్పదు టోపీ దక్కాలంటే!

విన్నపాలు…విజ్ఞప్తులు…నడక సాగడం లేదు.వృత్తుల్ని వదిలేసిన వాళ్ళూ…ఆక్రమించినవాళ్ళూ…పరిశ్రమలు మూతపడి వీధుల పాలయినవాళ్ళూ…సూక్ష్మ ఆర్థికబంధనాల్లో చిక్కుకున్నవాళ్ళూ…భూముల్ని కోల్పోయిన వాళ్ళూ… కాళ్ళకడ్డం పడుతున్నారు.ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.ముందుకు కదలనీయడంలేదు.సమస్యల మూటలు విప్పి నేల మీద పరుస్తున్నారు.దైన్యాన్ని నింపుకున్న ముఖాలతో వెతల్నికక్కుతున్నారు.నలిగిన దేహాలతో బాధల్ని వెల్లడిరచు కుంటున్నారు.లక్షల సమస్యలు…వెనక్కి నెట్టుకుంటూ…టోపీ కోసం….అసలు టోపీ దొరుకుతుందా?

దొరికిన టోపీ ధగధగమని మెరిసే కిరీటం అవుతుందా?

ఇక దారి మళ్ళించాల్సిందే.పచ్చని పొలాలు దాటి కొత్తమార్గాలు వెతకాలి.ఆకాశం అంచున కొండ మీదుగా…

అదిగో …టోపీ.అలసట కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడుపంచెకట్టు.ధీరోదాత్తత సడలకుండా కొండ  ఎక్కుతున్నాడు.  పైపైకి…ఇంకా పైకి. టోపీని సాధించాలి.

అతిసమీపంలో టోపీ. చేతికందేంత ఎత్తులో టోపీ.దగ్గరగా …వచ్చేసింది.పట్టుకోవాలి.ఉద్వేగం…ఆనందం…

కృష్ణాష్టమి ఉట్టిలా…కిందకీ పైకీ…టోపీ.ఆటలా సాగుతున్నది.ఎట్టకేలకు అందుకున్నాడు.చిత్రం…టోపీ కిరీటంలా మెరుస్తుంది.తల మీద పెట్టుకోగానే రాజసం కళ వచ్చేసింది.సర్వాధికారాలు సంక్రమించి సైగ సైతం ఆదేశంగా మారిపోయేంత రాజసం.కళ్ళల్లో ఉజ్వలమైన మెరుపు..చూపులో అధికారదర్పం.సమస్త వ్యక్తిత్వంలోనూ ఒక్కసారిగా పెల్లుబికిన వింత మార్పు.

నడకలో…మాటలో…చేతుల కదలికలో…కంటిరెపరెపల్లో…హుందాతనం.

జీవితాశయపు తొలిమెట్టు అధిరోహించినట్టు గర్వదరహాసం.

కొండపైనుండి నెమ్మదిగా కిందికి దిగుతూ…టోపీ మాటిమాటికీ కుదురుగా ఉండేటట్టు సవరించుకుంటూ

…చిద్విలాసంగా నవ్వుతూ నేలకు చేరుకున్నాడు.అక్కడే పొదలమాటున కుందేలుగుట్ట దగ్గర దారుణం జరిగిపోయింది.కథ అడ్డం తిరిగింది.విధి వక్రగీత గీసింది.ఊహించలేని…దిద్దుకోలేని తప్పుగా చరిత్రకెక్కింది.

పంచెకట్టు రక్తపంకిలమయ్యింది .తల రెండుగా చిట్లింది.మెదడుగుజ్జు బయటకు వచ్చేసింది.

ఊపిరి నిలిచిపోయింది.కదలిక ఆగిపోయింది.ఆశాజ్యోతి ఆరిపోయింది.లిప్తలో జరిగిన  సంఘటనతో లోకం  విస్తుపోయింది.

ఉజ్వలంగా ఎదగాల్సిన వాడు…జనం గుండెల్లో దేవుడుగా కీర్తించబడాల్సినవాడు….

వీధి వీధినా విగ్రహమై నిలవాల్సిన వాడు…

బడుగు బలహీనులకు మెరుగైన విద్య,ఆరోగ్యం  అందించాల్సినవాడు….

అకాలంగా…అంతులేని విషాదాన్ని మిగిల్చి శవమై పోయాడు.

ఇక పరామర్శలు మొదలు.శవం రాజకీయాలకు ఆలంబన…దిక్సూచి.

గోతికాడ నక్కల్లా  ఇతరేతరపక్షాలు సందిగ్ధంలో పడ్డాయి.

శవరాజకీయాలకి శవందొరక్క గొల్లుమంటున్నాయి.

ఏనాటికైనా శవం దొరక్కపోతుందా అని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నాయి.ప్రస్తుతానికి బాటలంటా పసుపు నీళ్ళు జల్లుకుంటూ… ముహూర్తాలు పెట్టుకుని శాంతులు జరిపించుకుంటూ…ఎర్రగా ఉరిమి చూస్తూ కీచుగొంతు తో సణుక్కుంటూ…ఏడవలేక నవ్వుతున్నారు.

విచిత్రంగా జనంమాత్రం అవినీతిపదం వినిపించినప్పుడల్లా చెవులు మూసుకుంటున్నారు.ఎక్కడున్నాడు?

ఎక్కడున్నాడు? అవినీతిపరుడు కాని వాడెక్కడున్నాడు? ఏడి? ఏడి?

మొత్తం మీద రాజ్యం అల్లకల్లోలంగా ఉంది.ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా ఉంది.

వాతావరణం వేడిగా కూడా ఉంది.

టోపీ….అదే కిరీటం దేనికి లొంగాలి?

నీతి…నిజాయితీ…విలువలు….ప్స్‌….లాభం లేదు.

పోనీ అమ్ముడైపోతుందా?

చూద్దాం.