ఎవర్ని ప్రశ్నించాలి?!

 

ప్రజలు అనేమాట నాకు చాలా ఇష్టమైన పదం ఎప్పటికీ.

స్వేచ్ఛ అనేమాట ఒకప్పుడు అంటే యవ్వనంలో నాకు చాలా ఇష్టంగా వుండేది. కానీ కాలం గడిచేకొద్దీ ఆపదం ప్రచారం కావడం వెనక వున్న విస్తృతి అర్ధం అయ్యేకొద్దీ, పరిణామాలు చూసేకొద్దీ ఆమాటపై మోజు తగ్గిపోసాగింది. సరే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు పరిణామాలకి వారే బాధ్యులుగనక ఆవిషయం పక్కన పెడితే; సాహిత్యకారులు, రచయితలు మానవ సమాజాన్ని వ్యక్తీకరించడంలో, విశ్లేషించడంలో తమకున్న స్వేచ్ఛని జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి అవసరం రాను రాను పెరిగిపోతున్న దశలో మనం ఉన్నామన్నది నా నిశ్చితమైన అభిప్రాయం.
లాజికల్ గా సరైనవి అనిపిస్తున్న విషయాలు అన్నీ సామాజికంగా సరైనవి అనడానికి లేదు.  ప్రతి అస్థిత్వ ఉద్యమమూ మనకి ఈవిషయాన్ని అనేక ప్రశ్నలతో, అనేక రుజువులతో బయటపెట్టాయి, నిరూపించాయి.  అయినాగానీ, సామాజిక పరిణామాలతో సంబంధం లేకుండా,  సామాజికాంశాలని లాజికల్ గా విశ్లేషించ బూనడం, వ్యాఖ్యానించడం కొందరు రచయితలు తరచూ  చేస్తుంటారు. వారు సమాజంలోని
అన్యాయాలకి, వ్యత్యాసాలకి, అపభ్రంశాలకీ  కారణాలను వ్యవస్థీకృతమైన చోట్ల కాకుండా అసంఘటితమైన, అమాయకమైన, అపరిపక్వమైన చోట్ల కారణాలను వెతుకుతుంటారు. అలాంటి వారు తమ వ్యాఖ్యానాలతో ప్రజలని తప్పుపట్టడం తరచూ చూస్తూ వుంటాం.  వారు అలా వ్యాఖ్యానించే స్వేచ్ఛని కాదనలేం గాని, అలాంటివారు విధిగా గ్రహించవలసిన విషయాలని తెలియ జెప్పడమే ఈ వ్యాసం యొక్క
సారాంశం.

*       *       *       *

ఇప్పటి సమాజం ఇలా వుండడానికి అంటే మనం తరచూ ఒక నిస్పృహతో భావిస్తున్నట్టు   కుళ్లిపోయినట్టు వుండటానికి ప్రభుత్వాలు, రాజకీయ
నాయకులే కారణమా? మనం (అంటే ప్రజలు) కారణం కాదా? అని తరచూ కొందరు ప్రశ్నించడాన్ని మనం చూస్తూవుంటాం.  కొందరినుండి వచ్చే ఇలాంటి ప్రశ్నలు లాజికల్ గా వినడానికి బాగుంటాయి గాని, అలాంటి ప్రశ్నలు సామాజిక బాధ్యతతో అడిగిన ప్రశ్నలు  ఎన్నటికీ కాలేవు.

ప్రజలు అనేపదం ఒక సమూహానికి పర్యాయంగా మనం వాడుతాము. ఆ సమూహంలో దొంగలు మొదలుకుని మేధావులు, సైంటిస్టులు, బాలురు, స్త్రీలు, వ్యాపారులు, ఉద్యోగులు, బిచ్చగాళ్ల వరకు… ఇలా అన్ని విభాగాలలోని వ్యక్తులందరినీ కలిపి ప్రజలు అని మనం పిలుచుకుంటాం.  ఈప్రజలని సాధారణంగా విడివిడిగా కొన్ని సాంప్రదాయ నియమాలతోబాటు వారి బుద్ది మరియు హృదయం నడిపిస్తు
ఉంటాయి.  ఇంకా వారి కుటుబ సభ్యులతో వున్న మానవ సంబంధాలు కూడా నడిపిస్తుంటాయి.  దైనందిన జీవితంలో వారి ప్రవర్తనలకి, ఎమోషన్లకి నియంత్రణ కలిగించే విషయాలు అనేకం వుంటాయి.  ఆర్ధిక స్థితి,  కులం, బంధుత్వాలు, సాంప్రదాయాలు వంటివి ఎన్నో విషయాలు  వారి ప్రవర్తనలని నిర్దేశిస్తుంటాయి. మీరు ఇలా ఇన్నిగంటలు ఈపని చెయ్యాలనే రూల్స్ ఏవీ ప్రజలపై వుండవు.

ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది దానిని  సక్రమంగా నడపడానికి అవసరమైన ట్రైనింగ్ తీసుకుని, ఆపని చేస్తున్నందుకు జీతం పొందే వారితో ప్రభుత్వం నిర్వహించబడుతుంది.  ప్రతి అధికారికీ, ప్రభుత్వోద్యోగికీ జిల్లా కలెక్టర్ తో సహా తామెలా పనిచెయ్యాలో ఒక మాన్యువల్ వుంటుంది. అలా చేసినందుకు ప్రభుత్వం వారికి జీతంతోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అందులో గృహవసతి, ఆరోగ్య సౌకర్యం, ప్రయాణ సౌకర్యం, పెన్షను, లోన్లు వంటివి ఎన్నో కల్పించి వారికి ఒక భద్ర జీవితాన్ని, వారి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునీ కల్పిస్తుంది ప్రభుత్వం.  వీరి పని ఏమంటే ప్రభుత్వం నిర్వహించే వ్యవస్థలు సక్రమంగా నడిచేలా బాధ్యతతో, నిజాయితీతో,  పైన చెప్పుకున్న ప్రజలకి ప్రజా సౌకర్యాలకీ మేలు కలిగించే పని చెయ్యడం.
ఇప్పుడు విషయానికి వద్దాం.  ఈ ప్రభుత్వోద్యోగులు ఒకసారి ఉద్యోగం వచ్చాక తమని 60 యేళ్లవరకు కదిలించే వాళ్లు లేరనే ధీమాతో ఉండడం జగమెరిగిన సత్యం. ఈ ధీమాతో ఒక నిర్లక్ష్యం, దానివెంట ఒక ఉదాశీనతా వచ్చి చేరుతాయి. వీటివెనక వున్న  కారణం  ఏమిటంటే వారివెనక ఉద్యోగ సంఘాలు, కోర్టులు వుండడమే! తిరిగి ఈఉద్యోగ సంఘాలు, కోర్టులు ప్రభుత్వం కనుసన్నలలో నడిచే వ్యవస్థలే.  ఉదాహరణకి ఒక ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఏనాడైనా తమబిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదవడానికి ఈపిల్లలే కారణం అని
ఆలోచించగలడా? అలా ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఈనాటి మూతబడవలసిన దుస్థితిలో వుంటాయా? ఇది ఒక్కటీచర్లపై  విమర్శ మాత్రమే కాదు. అన్ని ప్రభుత్వ వ్యస్థలలోని నిరాశాజనక స్థితికి ఉదాహరణ.  ఇలా కావడానికి వారే చెప్పే కారణం  ఉద్యోగుల ఉద్యోగం, వారి పిల్లల భవిష్యత్తు “ట్రాన్స్ఫర్స్” అనే పేరుతో రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం.

ఇకపోతే ప్రభుత్వాలని ఏలే పార్టీలు, రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకుందాం. రాజ్యాంగం ప్రకారం చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అనేవాళ్లని ప్రజలు తమ సంక్షేమం కోసం ఎన్నుకుని అసెంబ్లీ, పార్లమెంట్స్ కి ఎన్నిక చేసి పంపుతారు. కానీ కరెప్ట్ అయిన అధికార వ్యవస్థలన్నీ కూడబలుక్కుని లేదా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై ఎన్నికల భారతం ఒక తంతుగా మారిపోయింది. ఈక్రమంలో ఎన్నికలప్పుడు కార్పొరేట్ సెక్టార్ తమకి 5 యేళ్లపాటు అనుకూలంగా వుండటానికి సమకూర్చిన  నిథులతో డబ్బు, మద్యం పంపిణీ
చేసి, మీడియాని కొని, కోట్ల రూపాయల పబ్లిసిటీల ఖర్చుతో నాయకులు పుట్టుకొస్తున్న కాలం ఇది.  ఎన్నికల్లో గెలిచాక మళ్లీ ఈ నాయకులు కూడా
భారీగానే చట్టబద్దంగా జీతాలు తీసుకుంటారు. ఇక పోతే గెలిచాక మన ప్రభుత్వాలు, వాటి నాయకులు ఏమేం చేస్తున్నారనేది ఏరోజు ఏపేపర్ చూసినా ఏదోరకంగా క్లూ దొరికిపోతుంది.

ఇక్కడ మళ్లీ కొందరు  లాజికల్ గా, అమాయకంగా ఒక ప్రశ్న వేస్తారు. “ఎన్నికల్లో డబ్బు తీసుకోవడం తప్పుగదా? డబ్బు తీసుకుని వాళ్లకి ఓట్లేసి
వాళ్లని గెలిపించేది మనమే ( అంటే ప్రజలే) కదా?” అని. ఇదెలా వుంటుందంటే, బస్సులోనో బజారు సెంటర్లోనో ప్రతి రోజూ ఒకమ్మాయి ఒళ్లంతా కామంతో చూసేవాడు; “నువ్వు చూడకపోతే నేను చూసినట్టు నీకెలా తెలుసు?” అని వాదించినట్టు వుంటుంది.

rafi1

ఎన్నికల్లో రాజకీయ నాయకులు డబ్బు పంచకుండా ఉండడానికి భారత దేశంలోని సకల అధికార యంత్రాంగాము ఉండికూడా దేశంలో వందల  కోట్లకొద్దీ డబ్బు పట్టుబడుతూనే వుంది. పట్టుబడ్డదే ఇంతింత వుంటే పంచుతున్నదెంత? ఎన్నికలంటే ఇన్ని దశాబ్దాలుగా నడుపుతున్న వారికెంత నిర్లక్ష్యమో అర్ధం అవుతుందిగదా!  పోనీ, ఎన్నికల సమయంలో  పదిమంది నాయకులు గుంపులు
గుంపులుగాగా ఇంటికొచ్చి నవ్వుతూ నమస్కారం పెట్టిపోయి, ఆరాత్రికి వాళ్ల అనుయూయులతో మనిషికి ఇంతని లెక్కవేసి రెండువేలో మూడువేలో కుటుంబపెద్ద  చేతిలో పెడితే తిరస్కరించ గలిగే ధైర్యం సగటు మనిషికి ఉంటుందా? ఈ విషయాలన్నీ  ఆలోచించకుండా “డబ్బు తీసుకుని ఓట్లేయడం తప్పుకదా?” అని ప్రశ్నించడం వాస్తవం పట్ల అవగాహన లేకపోవడమే అవుతుంది. రేపు ఆనాయకుడు గెలిస్తే మనకి ఏదైనా  పనిబడితే పొయ్యి పలకరించాల కదా? ఇక పోతే రెండవ విషయం సగటు ప్రజలు ఆర్ధిక దారిద్ర్యం వల్ల కూడా 500/1000 కాగితానికి
ప్రలోభ పడతారు. ఆ రంగురంగుల కాగితం అప్పుడు తప్ప చూడలేని వాళ్లు కోట్ల మంది.  నిజానికి నాయకుల  డబ్బు పంపకం కార్యక్రమం  అంతా  ఆర్ధికావసరాలు చుట్టు ముడుతున్న స్లంస్ మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది.  ధనవంతుడు కట్టిన 33 అంకణాల్లో మూడో నాలుగో ఓట్లుంటే, అదే 33అంకణాల స్లం ఏరియాలో 30- 40 ఓట్లుంటాయి.

ఇప్పుడు ఈమూడు వర్గాల మధ్య వ్యత్యాసం గమనిస్తే…. ప్రజలేమీ నాయకులలాగా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల మాదిరి జీతం తీసుకోరు.
రెండుపూటలు తింటారో, ఒక పూట తింటారో, తాగతారో, తలకి పోసుకుంటారో, వీథుల్లో తన్నుకుంటారో గాని  ప్రభుత్వం నడవడానికి మాత్రం పన్నులు కడతారు. అంతకు మించి వ్యవస్థని, ప్రభుత్వాన్నీ నడిపించడంలో వారి పాత్ర శూన్యం. “అది చేస్తాం, ఇది చేస్తాం అని నమ్మించి గద్దెనెక్కిన వారినీ, జాబ్ మేన్యువల్ ప్రకారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారులనీ వదిలేసి ”  ప్రజలని తప్పు పట్టడం  సామాజిక క్రమం అంతటిపట్లా అవగాహన ఉన్నవారు చెయ్యలేరు.

ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికీ; వారికి విద్య, జ్ఞానం, వైద్యం, భృతి, ఇవ్వడానికే, మంచి పౌరులుగా ఆత్మాభిమానంతో బతకడానికీ, చైతన్యవంతంగా సమాజాన్ని బాగు చెయ్యడానికీ  (ఎన్నికల ముందు చెప్తారు) నాయకులు గెలిచి జీతం తీసుకుని పని చేస్తున్నారు.  అందుకనే నాయకులు మెరికల్లాంటి IAS అధికార్లని తమ పియ్యేలుగా నియమించుకుంటున్నారు.  కానీ నిజానికి చేస్తున్నదేమిటి? ఈదేశంలోని మానవ వనరులు, భౌగోళిక వనరులు చూపి లక్షల కోట్ల అప్పులు తెచ్చి, వాటిలో కమీషన్లు మింగి, అవి కట్టలేక అప్పిచ్చిన వాడు విధించిన షరతులతో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా తిరిగి పెరుక్కుంటున్నారు. మరి అలాంటప్పుడు  వీళ్ల అసమర్ధతకి, వీళ్ల
అవినీతి అక్రమాలకీ ప్రజలని ఎలా తప్పు పట్టగలం? ప్రజలు ఏం చేశారని తప్పు పట్టగలం?  అసలు నోరెలా వస్తుంది?  అందుకే పైన చెప్పిన మాటని మళ్లీ ఇక్కడ రాస్తాను.

రచయితలకి  సమాజం యొక్క వర్తమాన  పరిణామ క్రమాలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. మనకి రాయడానికి, ప్రశ్నించడానికీ అందిన స్వేచ్ఛని  మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకుని, వ్యాఖ్యానిద్దాం. మనకున్న ప్రశ్నించే స్వేచ్చని రచయితలుగా మనం దుర్వినియోగ పరచకుండా జాగ్రత్త పడదాం! ప్రశ్నించ వలసిన వారినే ప్రశ్నిద్దాం!

ఇప్పుడిక నా వ్యాసాన్ని ప్రముఖ రచయిత చెప్పిన ఆణి ముత్యాల్లాంటి రెండు మాటలతో ముగిస్తాను.

“రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” – రావిశాస్త్రి.

*       *       *       *

ఈ భరోసా…ఎంతవరకు?!

murugan

-దగ్గుమాటి పద్మాకర్

~

నేను నా వృత్తిరీత్యా ఇప్పటివరకు రకరకాల స్కూళ్లలో లక్షమంది పైగా విద్యార్థులతో వారి క్లాసుల్లో  10-15 నిముషాల సమయం గడుపుతూ ఉంటాను. వారంతా 2-7 తరగతుల మధ్య చదువుకునే పిల్లలు.  వారితో మాట్లాడే విషయాలు ముఖ్యంగా వాళ్లందరూ తమకి ఒక మెదడు ఉందని గుర్తించడం, అదే చాలావరకు తమని నడిపిస్తుందని పలు ఉదాహరణలతో గ్రహించేలా చెయ్యడం.  అలాగే ఆమెదడుని వారు తమ అదుపులో ఉంచుకోవాలని కూడా గ్రహించేలా చెయ్యడం, అందుకు కొన్ని ప్రాక్టికల్గా ఉదాహరణలు చూపించడం.  సందర్భాన్ని బట్టి వారెందుకు
చదువుకుంటున్నారో, అక్షరం విలువేమిటో కూడా వివరించడం చేస్తుంటాను.

ఈక్రమంలో ఒకసారి 4 వ తరగతి పిల్లలని క్లాసులో భాషకి, లిపికి తేడా చెప్పమన్నాను.  వారికి పెద్దగా అర్ధం కాలేదు.  సరే మాటకీ, అక్షరానికీ తేడ
తెలిస్తే చెప్పమన్నాను.  తెలిసిందేగదా, పిల్లలకి అవకాశం ఇవ్వంగాని ఇస్తే ఆలోచనలు మథిస్తారు!

ఒకమ్మాయి అంది, మూగవాళ్లు ఇతరులతో మాట్లాడాలంటే మాటలు రావుగాబట్టి అక్షరాల్లో రాసి చూపిస్తారు అనింది.  అందరితోపాటు నేనూ చప్పట్లు కొట్టాను.  నేను ఆతర్వాత చొరవ తీసుకుని భాషవల్ల  ఇంకో ముఖ్యమైన  ప్రయోజనం చెప్తానన్నాను.  “ఇప్పుడు ఇక్కడ అక్షరం వల్ల ప్రయోజనం గురించి  మనం మాట్లాడుకున్న విషయం మనం కొద్దిరోజులకి మర్చిపోతాం! ఇవన్నీ , ఇంకో వంద సంవత్సరాలకైనా ఇతరులు తెలుసుకోవాలంటే ఎలా? అక్షరమే గదా సాధనం” అన్నాను. ఈ అక్షరాల వల్లనే గదా మీరు టెక్స్టు పుస్తకాల ద్వారా ఎవరో ఎప్పుడో రాసిన
అనేక విషయాలు తెలుసుకో గలుగుతున్నారు అన్నాను.

2

సరే! ఇదంతా ఎందుకంటే కోర్టులు అక్షరం విలువని ఇన్నాళ్లకు గుర్తించాయి! జడ్జీలు వాయిదాలు, పాయింట్లు, తీర్పులు డిక్టేట్ చేస్తుంటే టైపిస్టులు అక్షరాలు సృష్టిస్తుంటారు గాబట్టి జడ్జీలనడిగితే అక్షరాలు సృష్టించే వాళ్లకంటే ఆలోచనలు సృష్టించే వాళ్లే గొప్పవాళ్లని తప్పకుండా
ఒప్పుకుంటారు.  ఇటీవల పెరుమాళ్ మురుగన్ కేసువిషయమై ఇచ్చిన తీర్పులో మద్రాసు హైకోర్టుకూడా ఒప్పుకుంది. కోర్టుల్లో ఇదొక గుణాత్మకమైన మార్పుగా గోచరిస్తుంది.  ఆలోచనలని ఔపోసనపట్టి అక్షరాలకు ఒక కళారూపాన్ని జతచేసి రచనలుచేసే వాళ్లని “మీరు రాయండి” అని; “ఒక కళారూపమైన సాహిత్యంలోని భావాలు నచ్చనివాళ్లు నచ్చకపోతే పుస్తకం మూసేసుకోవచ్చు” అనీ  కోర్టు ఒక రచయిత భుజం తట్టినట్టుగా మద్రాసు హైకోర్టు పెరుమాళ్ మురుగన్ కి భరోసా ఇవ్వడం నిజానికి హృదయాలు పులకించే విషయం.

కానీ ఏడాది కిందటి వరకూ “మిలార్డ్” అంటూ బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగించిన కోర్టులనుంచి మనం ఇలాంటి భరోసాలు నిరంతరం ఆశించడం అత్యాశే కావచ్చు.

3

అయితే కనీసం పెరుమాళ్ మురుగన్ కారణంగా అయినా కళా సాహిత్య రంగాలకు మద్రాసు హైకోర్టు ఈ రకంగా అయినా వెన్నుదన్నుగా నిలవడం వెనుక కారణాలు అన్వేషిస్తే నావరకు అనిపిస్తున్నదొకటే.  వెల్లువెత్తుతున్న వర్చువల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలాంటి కత్తిరింపులు, ఎవరి అనుమతులు అవసరం లేకుండా దూసుకెళుతున్న కాలంలో మనం వుండడమే ఇందుకు కారణం.  కళాకారులపై రాజ్యాంగ
వ్యవస్థలో భాగమైన పోలీసులు ఫ్యూడల్ భావాజాలానికి కొమ్ముకాస్తూ నియంత్రించినప్పుడు వారి చర్యలు ప్రపంచమంతా క్షణాలలో ప్రచారం, ప్రసారం జరిగిపోతున్నాయి. ఈ పరిణామం కారణంగా అభివృద్ది చెందిన దేశాలు భారతదేశాన్ని అభివృద్ది చెందుతున్న దేశంగా కాక ఇంకా వెనకబడ్డ దేశంగానే గుర్తించడం జరుగుతుంది.  అలాంటప్పుడు భారత దేశంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ కంట్రోల్లో లేదనే సంకేతాలు ప్రచారమవుతాయి.  బహుశా పెరుమాళ్ మురుగన్ కేసులో న్యాయ వ్యవస్థపై ఈరకమైన వత్తిడి కూడా పనిచేసి వుండే అవకాశం వుంది.

4

అయితే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇంకా మాట్లాడితే ఏరకమైన స్వేచ్ఛ గురించి అయినా ఇటీవలికాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవలసి వుంటుంది.

సమాజంలోని ప్రజలకు తగినంత మెచ్యూరిటీని, ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే సామాజిక వ్యవస్థలని చిదిమేసి బట్టీ విద్యా విధానంతో జ్ఞానాని
తెల్లకాగితంగా మిగిల్చి వ్యవస్థ అందించే స్వేచ్ఛ చివరికి ఏ పరిణామాలకి దారితీస్తుందో ఇటీవలి సంఘటన ఒక ఉదాహరణ. వయోజనుడైన ఒక పాతికేళ్ల ఐటీ ఉద్యోగి కార్పొరేట్ హాస్పిటల్ ప్రకటనలని నమ్మి ఎత్తు పెరగడానికి కనీసం ఇంట్లోకూడా చెప్పకుండా తన రెండుకాళ్లను తెగ్గొట్టించు కోవడం  వ్యక్తిగత స్వేచ్ఛయొక్క దుష్పరిణామమని చెప్పుకోవాలి.  అంటే ఈదశలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చివరికి వినియోగదారుడిగా మారే స్వేచ్ఛకి దారితీస్తుంది.

చెప్పుకోవాలంటే యువత ఎక్కువగా వున్న భారతదేశంలో రాబోయేకాలంలో ఇలాటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలెక్కువ. ఇప్పటికే మన సినిమాలలో చూపించి చూపిస్తున్నట్టు గుణగణాలతో సంబంధం లేకుండా ఆకర్షణే ఆధారంగా జరిగే ప్రేమపెళ్లిళ్లకి ఒకలెజిటమసీ వచ్చేసింది.  మన సినిమాలలో మొదట హీరో స్నేహితులు,  ఆతర్వాత కాలేజీ లెక్చరర్లు, ఆతర్వాత చివరికి తల్లిదండ్రులు అంతా హీరో ప్రేమని సఫలం చెయ్యడానికి ప్రయత్నించేవారే!   కారణాలేవైతేనేం 18 దాటిన వాళ్లకి మద్యం సేవించే స్వేచ్ఛ వచ్చేసింది.  మద్యం అమ్మకాలకి ప్రభుత్వమే టార్గెట్స్ పెట్టి  అమ్మిస్తూంది.  ఇండైరెక్టుగా మద్యం హాయిగా తాగొచ్చని సందేశాలు పంపుతూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చేత డ్రగ్స్ కి, గంజాయికీ వ్యతిరేక ప్రచారం చెయ్యిస్తుంది.  మీడియా అంతా పేజీలకింత అనేదశ దాటి టోకుగా కూడా అమ్ముడు పోతున్నాయి. ఈదశలో ఇప్పుడు రచయితలకి అందిన స్వేచ్ఛని కూడా మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి వుంది.

5

సమాజంలో స్వేచ్ఛకి మితిమీరిన ప్రాచుర్యం లభించాక ఆ పదానికి ఒక ఆచరణీయత, అనుసరణీయత ప్రజల్లో లభిస్తుంది.  ఇప్పుడున్న వాతావరణంలో స్వేచ్ఛని ఎక్కువగా పైపై వర్గాలే వినియోగించుకుంటాయి.  అంటే  కార్మికులు యూనియన్లు పెట్టుకునే హక్కుని నిరాకరిస్తూ యజమానుల సంఘం మాత్రం క్రియాశీలంగా పనిచేసినట్టు అన్నమాట.  ఇలాంటి సంఘటనలు భారత దేశంలో కోకొల్లలు.
ప్రభుత్వాలు తమపార్టీలకు నిధులందించే ఇండస్ట్రియలిస్టుల కొమ్ముకాయడం , ఎన్నికల హామీలు గాలికి  వదిలి నియంతృత్వ పోకడలు పోతున్నప్పుడు క్రమేపీ ప్రజా సమూహాల గొంతెత్తే హక్కు, నిరసన తెలిపే హక్కు, అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు… ఇలాంటివన్నీ ప్రభుత్వాలు కాలరాస్తున్నప్పుడు దృతరాష్ట్ర న్యాయం ప్రదర్శించే కోర్టుల పట్ల పెరుమాళ్ మురుగన్ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకింత సానుకూలత కలిగిస్తుందనేది రచయితలుగా మనం మరిచి పోకూడదు.

పెరుమాళ్ మురుగన్ కి ఇచ్చిన స్వేచ్ఛని అడ్డం పెట్టుకుని  కోర్టులు తాము మరింత ప్రజాస్వామికంగా వున్నట్టు మనని నమ్మిస్తాయి. నిజానికి హక్కులు, స్వేచ్ఛ కారణంగా వర్ధిల్లే బూతు సాహిత్యం ఎక్కువ!  కోర్టుల నిస్సహాయత బయట పడేది ఇక్కడే!

అసలు పెరుమాళ్ మురుగన్ భయానికిగురై రచయితగా తాను మరణించినట్టు ప్రకటించడానికి కారణమైన సంస్థలు, అధికార వ్యవస్థలను కూడా కోర్టులు ఏమీ చెయ్యలేవన్నది నిజం.  ఒకవేల అలాచేయాలని అనుకున్నా అది కత్తి పట్టుకుని పైపైకి వచ్చేవాడిని కళ్లురిమి అదుపు చేయాలనీ అనుకోవడం లాంటిదే! ఆపరిమితి కోర్టులకున్నది.  కోర్టుల నిస్సహాయత గురించి చెప్పుకోవలసి వస్తే మన రాజకీయాలు ఎంత దుర్మార్గమైనవి అంటే అవి ఒక సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ చేతకూడా పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టించ గలవని మనకి తెలిసిన విషయమే.

6

నాలుగు రోజుల కిందట  ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ఒక కేసులో బెయిలుపై బయటికి రాగానే మరొక ధర్నా కేసంటూ వెంటనే అరెస్టు చేసి వెంటనే కోర్టుకి పెట్టారు. ఆయనేం మావోయిస్టు కూడా కాదు.  ప్రతిపక్ష ఎమ్మెల్యే.  సహజంగా పోలీసులకి వుండే పవర్ ఇది. ఈ పవర్ గురించే రావిశాస్త్రి తనకథల్లో పదేపదే చెప్పింది. కోర్టులు కూడా అధికార వ్యవస్థల్లో మరో వ్యవస్థ కాబట్టి సహజంగా తనకి కలిగిన “కళ్లురిమే” అదృష్టాన్ని అనవసరంగా  కాలదన్ను కోవడానికి సిద్ధపడవు.

కొన్నిసార్లు కోర్టులు పార్లమెంటుని సైతం ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తాయి గాని టెక్నికల్గా బాహాటంగా దొరికితే తప్ప అవి ప్రభుత్వాల పీక
పట్టుకోవన్నది నిజం.  ప్రభుత్వాలే మద్యం అమ్మకాలు చేయించడాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తూ ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి
మారడాన్ని, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు కొమ్ముకాసి దేశ సంపదని దోచి పెట్టడం గానీ ప్రశ్నిస్తూ కోర్టులు సుమోటోగా కేసులు పెట్టినప్పుడు
కోర్టుల్లో గుణాత్మక మైన మార్పులు వచ్చాయని మనం నమ్మొచ్చు.

అందాకా తప్పేమీ లేదు మిత్రమా!

ప్రపంచం అంతటా నీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని కొల్లగొట్టడానికి ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది.  ఈడ్రామాని నువ్వు జీవితం అనే మొత్తాన్ని ఖర్చుచేసి టిక్కెట్టు కొని చూస్తున్నావు.  నిజమా  కాదా అని అనుమానించడంలో తప్పేమీలేదు.  ప్రతి మార్పునీ, ప్రతి తీర్పునీ ఒక గీటురాయి మీద గీసి చూసుకో!

*     *      *      *

కథ కళారూపమే, కానీ…!

 

artwork: Srujan

artwork: Srujan

దగ్గుమాటి పద్మాకర్
~

daggumatiతెలుగు రచయితలు పాఠకుల స్థాయిని తక్కువచేసి చూడడం ద్వారా తక్కువస్థాయిరచనలు వస్తున్నాయని ఒక ఆరోపణా; సమాజాన్నో, వ్యక్తులనొ మార్చాలన్న తపన వల్ల  కథ కళారూపమన్న విషయం మరుగున పడిపోతున్నదన్న ఆరోపణ మరొకటి గతవారం అమెరికానుంచి వచ్చిన కన్నెగంటి చంద్రగారు చేశారు. ఈరెండు ఆరోపణలు చేసిన కన్నెగంటి చంద్ర గారు కానీ, ఇతర అమెరికా నుంచి సాహితీవ్యాసంగం నిర్వహించే మిత్రులు గానీ ఒక విషయం అర్ధం చేసుకోవాలి.

వారు ఏదైనా ఒక కథను లేదా పదికథలను విమర్శకు స్వీకరించి ఎంత తీవ్రంగా అయినా విమర్శించ వచ్చు! అలాకాకుండా ఈతెలుగు సమాజానికి దూరంగా వుంటూ కళ పేరుతోనో, ఉత్తమ కథలపై మమకారంతమకే ఉన్న భావనతోనో ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం.సాహిత్య కళారంగాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్యంగా ఉన్నప్పుడేతమజీవనం, సంస్కృతి, సాహిత్యం, భాష వంటి అంశాల మీద  ఆంధ్రుల దృక్పథాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నించి నిలదీశారు అన్నది గమనించాలి. అందుకని ఇక్కడి తెలుగుసమాజం, రచయితలు, సామాజిక నేపథ్యం గురించి అమెరికా మిత్రులకు రెండు మాటలు చెప్పాలనిపిస్తుంది.

సాధారణంగా ఒక రచయిత దాదాపు నాలుగైదు కథలు రాస్తేగాని కొన్ని కథాంగాలు,నైపుణ్యాలపై స్పష్టత రాదు. కొందరికి ఈసంఖ్య పది కథలుబ్కూడా కావచ్చు.సమాజంలో రచయితల సంఖ్య పెరిగే కొద్దీ ఈ కొత్తవారి కథలు అనేకం వస్తూఉంటాయి. అనేక పత్రికలు, అనేక కారణాలవల్ల ఈతరహా కథలని ప్రచురిస్తాయి. అలాంటి కథలు సమాజంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సమాజంలోని పేదరికమో,అన్యాయాలో, అస్తవ్యస్త పరిస్తితులో, ఇతర అపసవ్యతలో…. తనని కలిచి వేయడంవల్ల సాధారణంగా ఎవరైనా రచనలు ప్రారంభిస్తారు. అది యవ్వనప్రాయంలోనిసామాజిక సంక్షోభానికి ప్రతీక. అంతెందుకు…. ఎంతగొప్ప రచయితలు అయినా తనమొదటి రచనలు చూసి అప్పటి అవగాహనా రాహిత్యంపై కాస్త సిగ్గుపడతారు. తమలోపాలు తాము గమనించుకునే మెచ్యూరిటీ రానంతవరకు వారి రచన వారికి ముద్దే! అదొక పరిణామ క్రమానికి సంబంధించిన విషయం.

ఎక్కువగా అలాంటి కథలుకనిపిస్తున్నాయంటే దాని అర్ధం కొత్త రచయితల సంఖ్య పెరుగుతుందని కూడాఅర్ధం చేసుకోవచ్చు. ఏరచయిత అయినా ప్రారంభంలో తాను  పనిగట్టుకుని ఈ సమాజానికి ఏదైనా చెప్పాలనే ఆకాంక్షతోనే రాయడం ప్రారంభిస్తాడనేది వాస్తవం. ఇది రచయితల వ్యక్తిగత కోణం.

ఇకపోతే సామాజిక కోణంలో కథల్లోని నీతి, లేదా సందేశం అనే వాటిని చూద్దాం. ఈ సమస్యపై కంప్లయింట్స్ ఎక్కువగా అమెరికా మిత్రుల నుండే వస్తున్నాయి. ( ఈతరహా విమర్శ మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాం అనే ఆత్మ విమర్శ కూడా చేసుకోలేనంతగా వారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.) అమెరికా జీవన విధానం క్రమబద్దంగా, సాఫీగా జరిగిపోయే విధంగా ఏర్పాటు చేసుకోబడిన ఒక ఆధునికదేశం. అక్కడి జీవన విధానానికి అలవాటైనా కారణంగానో, అక్కడ అందుబాటులోవున్న వివిధ భాషల సాహిత్యాన్ని చదువుతున్న కారణంగా అక్కడి మిత్రులుతెలుగు సాహిత్య సమాజంలోని కథలని చూసి పెదవి విరుస్తున్నారు!

ఇదెలావుంటుందంటే, తండ్రిని షేవింగ్ చేసుకోవడం చూసిన పిల్లవాడు తానుకూడాఅనుకరిస్తూ గడ్డం చేసుకోవాలని ఉబలాట పడడంలా ఉంటుంది! కానీ గడ్డం రావాలి కదా! వర్ధమాన దేశాలకీ, భారత దేశానికీ మధ్యన టెక్నాలజీ కారణంగా సాధారణ సమాచారమార్పిడి క్షణాల్లో జరుగుతుంది.  కానీ అందులో లక్షవంతు భాగం కూడా ఇక్కడ సామాజిక మార్పులు ముందుకు పోవడం లేదు. ఇక్కడ సామాజిక పరిపాలన అంతా మోసాలతో కుట్రలతో జరుగుతుంది. (అక్కడ జరుగుతాయా లేదా అన్నది అసందర్భం) అస్సలు జవాబుతారీ తనం లేని పరిపాలన ఈనేలపై సాగుతుంది. ఈ కారణంగా రచయితల  కళ్ళముందు సగటు జనాభా అట్టడుగు జీవితాలు తప్ప మరొక వస్తువు కనపడనిస్తితి.

మరో పక్కన వేల కోట్ల దోపిడీని పథకాల పేరుతో, ప్రజా ప్రయోజనాల పేరుతోవరల్డ్ బ్యాంక్ మేధావుల సూచనలు ఎత్తుగడలతో ‘కడుపునెప్పితో ఆసుపత్రికిపోతే  దొంగతనంగా కిడ్నీ తొలగించినట్టు’ దేశ వనరులని అమ్మేస్తున్నారు. మహాశయులారా! ఇక్కడి సమస్యలకి స్పందించే తెలుగు ప్రాంతంలోని రచయితలు తమకుతోచిన వస్తువులతో తమ స్థాయిలో రచనలు చేస్తు ప్రజా సమస్యలని, ఆకాంక్షలనీ వెలుగులోకి తేవడం వారి బాధ్యతగా గుర్తిస్తున్నారు.

మీడియాని సైతం పాలకులు కొనేసిన నేపథ్యంలో వారి అక్రమాలకు బలవుతున్న ప్రజల సమస్యలవైపుకనీస ప్రత్యామ్నాయంగా ఉండడం రచయితలు తమ బాధ్యతగా గుర్తిస్తున్నారు. ఇంతగాటెక్నాలజీ డెవలప్ అయినా కనీసం చెక్పోస్టుల అవినీతిని దశాబ్దాలుగాప్రభుత్వాలు ఆపడం లేదు! అంతా కుమ్మక్కు! పదిమంది గొంతెత్తబట్టే బాక్సైట్గనుల జీవోపై ప్రభుత్వం వెన్నక్కి తగ్గింది. ఎవరు ఎలా గొంతెత్తారు అనేది అనవసరం.

రాగయుక్తంగా పాడలేనంత మాత్రాన తల్లి పాడేది లాలిపాట కాకుండా పోదు! బిడ్డ ఏడుపుకు ఎలాగోలా పాడడం తల్లికి ఒక అనివార్యత అని గుర్తించమని మనవి! పైన చెప్పినదంతా తెలుగు ప్రాంతపు సామాజిక నేపథ్యం. ఇకపోతే;వస్తువులోగానీ, శైలిలో గానీ, రచనా నైపుణ్యం గానీ సాహిత్యంపై సమాజంపై వారివారి దృక్పథాన్ని అభిరుచినీ బట్టి రచయితలు తమని తాము మెరుగు పరుచుకునేప్రయత్నం చేస్తారు.  ఆక్రమంలోనే  కొందరినుంచి మనం  అప్పుడప్పుడు గర్వంగాచెప్పుకోగలిగే మంచి కథలూ కొన్ని వస్తున్నాయి. అక్కడ నుండి రాస్తున్నకథకులు అక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకున్నట్టే; ఇక్కడి కథకులుఇక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకుంటారు! పేదరికం వస్తువైనప్పుడు ఆ కథలు త్రీస్టార్ హోటల్ కస్టమర్లకు బిచ్చగాళ్ళలా కనిపించి చిరాకుపరుస్తున్నాయేమో గమనించాలి!   అది త్రీస్టార్ హోటల్ కావడం వల్ల చిరాకుమాత్రమే! అదే గుడిముందు అయితే అంత చిరాకు ఉండక పోవచ్చు!

ఇలాంటి రచనలవల్ల  కళకి ఏదో అన్యాయం జరుగుతుందన్న పేరుతో విమర్శించే అమెరికా మిత్రులు ఇందుకు అవసరమైన అన్నిరకాల నైపుణ్యాలనీ ఇక్కడ అవసరమైన రచయితలకు అందించేరీతిలో సాహిత్య పాఠశాలలు నిరంతరం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తే తెలుగుసమాజానికి మేలుచేసిన వారు అవుతారు.

*

తనదైన స్పృహతో రాసిన కథలు!

రండి బాబూ రండి!

[మోసం లేదు, మాయా లేదు!
ద్రోహం లేదు, దగా లేదు!

రండి బాబూ రండి!
రండీ, కొనండీ, చదవండీ, ఆనందించండీ, ఆలోచించండీ, ఆశీర్వదించండి….
ఆంధ్రుల అభిమాన యువ రచయిత అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం”
కథాసంకలనం! నేడే మీ కాపీ రిజర్వ్ చేసుకోండి ! ఆలసించిన ఆశాభంగం-
త్వరపడితే తపోభంగం!]

*    *    *

Cover

అఫ్సర్ గారినుంచి వినతి లాంటి ఆజ్ఞ రావడంతో మొహమాటానికి పోయానుగాని, పుస్తకాన్ని సమీక్షించడం అంటే తల మాసినవాడు తలకి పోసుకోవడం లాంటిదని కాసేపటికి యిట్టే తెలిసిపోయింది!

ఈ మాట ఎందుకంటే అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం” పుస్తకం లోని 18 కథలు వెంట వెంటనే చదివేసి వాటి సమాచారాన్ని అరల్లో భద్రపరచే మెకానిజం, మెమరీ పవరూ నాకుందని నేననుకోను. అయితే కొన్నిసార్లు సన్యాసికైనా విన్యాసాలు తప్పవుకదా!:-)

కథలు రాయడం అనే ప్రక్రియని సత్యప్రసాద్ ఒక యోగవిద్యలాగానో, యుద్దవిద్యలాగానో భావించి తగినంత స్వయంశిక్షణతో రాశాడనేది అర్ధమయ్యాక తనమీద గౌరవం మరింత పెరిగింది. తెలుగు సినిమాల్లో పేదరికం కమ్ముకున్న హీరో రకరకాల వృత్తులు చేసినట్టుగా, తనకథలకి భిన్నమైన సబ్జెక్టులు యెన్నుకుని తననితను బాగా కష్టపెట్టుకున్నాడు రచయిత.

ఈ సంకలనం లోని కథల్లో మొదటి కథ “స్వప్నశేషం”, చివరికథ “భూదేవతమ్మ” నాకు బాగా నచ్చాయి. స్వప్నశేషం కథలో ఒక చోట అన్నట్టు, “ఫైన్ ఆర్ట్స్ మర్చిపోయి ఎకనామిక్స్ మాత్రమే బోధించే జీవితపు విశ్వవిద్యాలయంలో భావుకత్వం ఇక భ్రమ”– అన్నప్రకారం ప్రతి తల్లీ, తండ్రీ, స్కూలు కలిసి భావి తరాలను యంత్రాలుగా మార్చే దశలో మనమందరం జీవిస్తున్నాం. ఈ పరిస్తితులను వివరిస్తున్నట్టు పచ్చి రియాలిటీతో సాగే “ఓపన్ టైప్” అనే కథను రాశాడు రచయిత. దీనికి పుర్తి భిన్నంగా, యిదే రచయిత రాశాడంటే నమ్మలేని విధంగా “చినుకులా రాలి” అనే కథని కూడా రాశాడు. ప్రతి కధా దేనికదే ప్రత్యేకంగా అనిపించే 18 కథల్లో 3 కథలు పట్టించుకోదగినవి కాదనేది నా అభిప్రాయమైనా, మిగతా కథలన్నీ మటుకు మనకొక టూర్ ప్రోగ్రాం చేసొచ్చిన అనుభుతిని కలిగిస్తాయి.

ఈ సంకలనంలో భిన్న నేపథ్యాలున్న కథలవల్ల రచయితకొక తాత్వికత లేనట్లుగా పైకి కనిపిస్తుంది గానీ, అంతర్లీనంగా అలోచిస్తే ‘భౌతిక ప్రపంచం వేగంగా మారిపోతున్న వర్తమాన సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న *దూరం* దాదాపు అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. వీలైననంతవరకు ఈ దూరాన్ని దగ్గర చేసే ప్రయత్నంలోనే రచయిత ఈ కథలు రాశాడని చెప్పవచ్చు.

ఇందులోని కథల్లో రచయిత మార్క్సిజం, బుద్దిజం, అంబేద్కరిజం ఇంకా వివిధ అస్తిత్వవాదాలు వంటి సిద్దాంతాల జోలికి పోకపోవడం  ఒక రిలీఫ్. వివిధ సిద్దాంతాలే వైరుధ్యాలతో సంఘర్షిస్తున్న వేళ –  మానవ విలువలే తన దృక్పధంగా ఈ కథల ద్వారా రచయిత తనదైన స్పృహని ప్రకటించుకోవడం కూడా ఆహ్వానించ దగ్గ పరిణామం.

అయితే రచయిత చాలా కథల ముగింపు విషయంలో తగినంత శ్రద్ద తీసుకోలేదని మాత్రం నాకు అనిపించింది. ఇది రచనపై అశ్రద్ద అనేకన్నా మన అవగాహనపై అశ్రద్ద అనవచ్చేమో.  పదిమందికి చేసే కూరలో ఒక ఇల్లాలు ఉప్పు అవసరానికన్నా తక్కువే వేసి గిన్నె దించుతుంది. ఈ తగ్గించి వేయడంలోని జాగ్రత్త గమనిస్తే, తదుపరి కథలు మనల్ని  రచయితకి మరింత దగ్గర చేస్తాయి.

–దగ్గుమాటి పద్మాకర్

daggumati