పాత తరం హిందీ పాటల ప్రియులకు ఆమె అనుపమాన ఆరాధ్య దేవత. పంజాబీ ఫక్కీ జానపద గీతాలంటే, భారత ఉపఖండంలో ఎవరి కైనా గుర్తుకొచ్చేది ఆమె పేరే. అవిభక్త భారతదేశంలో గ్రామ్ఫోన్ రికార్డుల గానంతో స్టార్ సింగర్ అయిన ఆమె – శంషాద్ బేగమ్. మొన్న ఏప్రిల్ 23న కన్నుమూసిన ఈ గంధర్వ గాయని పాటలు ఎప్పటికీ స్మృతి సుగంధ పరిమళాలే! చెరగని ఆమె గాన మాధుర్యానికి ఇది ఓ సంగీత ప్రియుడి అక్షర నివాళి…
హిందీ మూకీ సినిమాల శకం ముగిసి టాకీ సినిమాలు ప్రారంభమైన కాలంలో చాలా వరకు నటీ నటులే పాటలు పాడుకునేవారు. అలా ప్రసిద్ధులైన సురయ్య, నూర్జహాన్, కె.ఎల్. సైగల్ లాంటి వారి మధ్య 1941లో ‘ఖజాంచీ’ చిత్రంలో ప్లేబాక్ సింగర్ శంషాద్ బేగం (ఎస్.బి) రెండు పాటలు మినహా అన్ని పాటలూ పాడారు. ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ సినిమా సంగీత దర్శకుడు గులాం హైదర్ ఆమెను సినీ రంగానికి తీసుకురావడం వెనుక ఓ కథ ఉంది. గతంలో హార్మోనియం ప్లేయర్గా గ్రామఫోన్ కంపెనీలో పనిచేస్తున్న కాలంలో లాహౌర్, పెషావర్ రేడియోలో ప్రైవేట్ గీతాలు, ఇస్లాం సంప్రదాయ భక్తి గీతాలైన నాట్లు పాడుతున్న ఎస్.బితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయంతో పంజాబీలో 1940లో ‘యమ్లా జట్’ చిత్రంలో శంషాద్ బేగంతో ‘కంకాణ్ దియాన్ ఫసలా పకియా మే’ పాట పాడించారు. ఆ చిత్రమే ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన నటుడు ప్రాణ్ మొదటి చిత్రం కూడా!
ఆ తరువాత 1941లో ఈ ‘ఖజాంచీ’ అనే హిందీ చిత్రంలో పాడిం చారన్న మాట. చిత్ర విజ యానికి పాటలు విశేషంగా తోడ్పడడంతో ఎస్.బి.కి ఆఫర్లు, అవకాశాలు వెతు క్కుంటూ వచ్చాయి. నిజానికి, శంషాద్ బేగం గాయకురాలిగా అవత రించడం వెనుక కూడా చాలా కథే ఉంది. లాహౌర్లో 1919 ఏప్రిల్ 14న ఆమె జన్మించారు. సరిగ్గా జలియన్ వాలా బాగ్ ఘటన జరిగిన మరునాడే ఆమె పుట్టారు. హుసేన్ బక్ష్, గులాబ్ ఫాతిమాలకు ఆరో సంతానం ఆమె. తండ్రి చెక్క నగిషీ పనిచేసే వ్యాపారంలో ఉండేవారు. ఇంట్లో అంతా సంప్రదాయ వాతావరణం. దాంతో, ఆమెను బయటకు వెళ్ళ నిచ్చేవారు కాదు. అయితే, పుట్టుకతోనే గొంతులో తేనె పోసుకొని పుట్టినట్లు పాడే ఎస్.బి. తమ బంధువుల ఇళ్ళల్లో జరిగే శుభ కార్యాల్లో గొంతు విప్పేవారు. బహదూర్ షా జఫర్ గజల్ పాడేవారు. ఆమె గాన ప్రతిభను చిన్నాన్న గుర్తించాడు. శంషాద్ తండ్రిని ఆయనే ఒప్పించి, గ్జెనోఫోన్ గ్రామఫోన్ కంపెనీకి ఆడిషన్కు తీసుకు వెళ్ళారు. అక్కడ ‘హాత్ జోడ్ పకియాన్ దా’ అనే పంజాబీ గీతం మొదట రికార్డింగే చేశారు. ఒక్కో పాటకు పన్నెండు రూపాయల వంతున మొత్తం 12 పాటలకు కాంట్రాక్ట్ కుదిరింది. అక్కడ హార్మోనియమ్ ప్లేయరైన గులామ్ హైదర్ ఆమెను సినీ రంగానికి తీసుకొచ్చారు.
తండ్రి నుంచి ఆమె ఎన్నో ఆంక్షలను ఎదుర్కొన్నారు. ఎప్పుడూ విందు వినోదాలకు వెళ్ళరాదనీ, ఫోటో దిగరాదనీ షరతు పెట్టారు. దాంతో, ఆమె బురఖా వేసుకొని, రికార్డింగ్కు వెళ్ళి వచ్చేవారు. 1970ల వరకు ఆమె పాటే తప్ప, ఆమె ఎలా ఉండేవారో జనానికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు స్టూడియో యజమాని మెహబూబ్ఖాన్ తన ‘తకదీర్’ (1943) చిత్రంలో ఎస్.బి.తో పాడించుకోవడం కోసం చాలా కసరత్తే చేశారు. ఆమె తండ్రిని ఎలాగోలా ఒప్పించి లాహౌర్ నుంచి ముంబాయికి మకాం మార్పించారు. అదే ప్రముఖ నటి నర్గీస్ మొదటి చిత్రం. ఆ చిత్ర విజయంతో మొహబూబ్ ఖాన్ నిర్మించిన ‘హుమయూన్, ‘అనోఖీ’, ‘అన్మోల్ఘడీ’, ‘ఆన్’, ‘అందాజ్’, ‘మదర్ ఇండియా’ చిత్రాలలో ఎన్నో మధురగీతాలను ఎస్.బి. ఆలపించారు.
ఎస్.బి. తొలి రోజుల్లో కోరస్ సింగర్స్గా ఉండే మదన్మోహన్, కిశోర్కుమార్లు తర్వాత కాలంలో ఆమె ప్రోత్సాహంతో యుగళగీతాలు ఆలపించారు. మొదటి చిత్రం ‘ఆంఖే’ (1949)కి పట్టుబట్టి ఎస్.బి.తో మదన్మోహన్ పాట పాడించుకొన్నారు. ఆ రోజుల్లో ఎస్డి బర్మన్, నయ్యర్, మదన్ మోహన్, నౌషాద్, బులో సి. రాణి, అనిల్ బిశ్వాస్, వసంత్ దేశాయి లాంటి వర్ధమాన సంగీత దర్శకులకు ఎస్.బి.తో పాడించుకోవడం సెంటిమెంట్.
రికార్డింగ్ సమయంలో పరిచయమైన ఓ.పి. నయ్యర్ సంగీతంలో ‘సిఐడి, ఆర్పార్, కిస్మత్, మిస్టర్ అండ్ మిస్టర్ 55’ తదితర చిత్రాల్లో ఎస్.బి.కి ఎన్నో చాలా ప్రజాదరణ పొందిన పాటలు వచ్చాయి. ఆశాభోంస్లేతో సాన్నిహిత్యం వల్ల ఎస్.బి.తో పాటలు పాడించడం నయ్యర్ మానేయడంతో ఒక శకం ముగిసింది. దేశ విభజన ముందు, తర్వాత స్వతంత్ర భారతంలో విజయ ఢంకా మోగించిన ‘అన్మోల్ ఘడీ, షాజహాన్, దిల్లగీ, దులారీ, బాబుల్, బైజు బావరా, మదర్ ఇండియా, మొఘల్-ఏ-ఆజమ్’ చిత్రాల చిత్ర సంగీత దర్శకుడు నౌషద్ ఆలీ ఎన్నో మంచి పాటలను ఏరికోరి పాడించుకోవడం గమనించదగ్గ విషయం. ఆ తర్వాత వచ్చిన శంకర్ – జైకిషన్, కళ్యాణ్ జీ – ఆనంద్జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, రవి, ఆర్.డి. బర్మన్, రాం గంగూలీలు ప్రత్యేకంగా ఎస్.బి.తో కొన్ని పాటలు కోరి పాడించుకున్నారు.
సినిమా తళుకుల ప్రపంచంలో ఉండి కూడా ఎస్.బి. ఏనాడూ సినిమా ఫంక్షన్స్కు గానీ, పార్టీలకు గానీ, విజయోత్సవ వేడుకలకు ఎన్నడూ హాజరు కాలేదు. 1970వ దశకం వరకు కూడా ఎస్.బి. ఫోటో కాని, వ్యక్తిగతంగా చూసిన అభిమానులు ఎవరూ లేరు. 1955లో ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త హఠాన్మరణంతో పాడడం విరమించుకొన్న ఎస్.బి. ఆ తర్వాత వర్ధమాన సంగీత దర్శకుల కోరిక మేరకు అడపాదడపా కొన్ని పాటలు పాడారు. రేడియో, గ్రామ్ఫోన్ రికార్డుల వల్ల భారతదేశమంతటా ఎంతోమంది అభిమాను లను సంపాదించుకొన్న ఎస్బికి భారతదేశ ప్రాంతీయ భాషలలోని ప్రముఖ గాయక, గాయనీ మణులందరికి ఆవిడంటే ఎనలేని అభిమానం.
నాలుగేళ్ళ క్రితం 2009 జూన్ 9న హైదరాబాద్ జూబ్లీహాల్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎస్బిని రావు బాలసరస్వతీ దేవి, పి. సుశీల, జమునారాణి ఎల్ఆర్ ఈశ్వరి, అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్యల చేతుల మీదుగా ”కళా సరస్వతి” బిరుదుతో సత్కరించారు. ఆ కార్యక్రమంలో అలనాటి మేటి చిత్రాలలోని హిట్ గీతాలాపనతో అభిమానులు, వేదిక మీద వీల్ఛైర్లో ఉన్న 90 సంవత్సరాల పండు ముదుసలి ఎస్బి కూడా ఎంతో ఆనందించారు. ఆమె పాటలు ఇప్పటికీ రేడియోలో ప్రసారం అవుతూనే ఉన్నాయి. ప్రచారానికి దూరంగా వుండే ఎస్.బిని భారత ప్రభుత్వం 2009 పద్మభూషణ్తో సత్కరించింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సాంస్కృతిక వారధులు – అలనాటి చిత్రాలు, ఆ సినిమాల సంగీతం, వాటిలో శంషాద్ బేగం, రఫీ, నూర్జహాన్లు ఆలపించిన గీతాలు. అలనాటి మేటి తారలైన శ్యామ షకీలా, నిగర్ సుల్తాన్, నర్గీస్, మీనాకుమారి, గీతాబాలీ, మధుబాల, వహీదా రెహమాన్, కామినీకౌశల్, నళినీ జయవంత్, వైజయంతి మాల తదితరులందరికీ శంషాద్ బేగం నేపథ్య గీతాలు పాడడం విశేషం. నటి భానుమతి హిందీలో నటించిన ‘నిషాన్’, ‘మంగళ’ చిత్రాలకు శంషాద్ గాత్రం అందించడం విశేషం. స్వయంగా గాయని అయిన భానుమతికి పాడే అవకాశం తెలుగులో ఎవరికీ దక్కలేదు. అలాగే, పార్థ సారథి, సాలూరి రాజేశ్వరరావు, ఈమని శంకరశాస్త్రి లాంటి దక్షి ణాది సంగీత దర్శకత్వంలో హిందీలో ఆవిడ పాటలు పాడారు.
ప్రతిభావంతులైన నటులు, దర్శకులు, నిర్మాతలుగా తర్వాత కాలంలో ప్రశంసించబడిన దేవానంద్, గురుదత్, మెహబూబ్, కె.ఆసీఫ్, షోరబ్మోడీలు ప్రత్యేక శ్రద్ధతో ఆసక్తితో ఎస్బితో వారి చిత్రాలలో పాడించుకొన్నారు. ఒ.పి. నయ్యర్ మాటల్లో చెప్పాలంటే, గుండిగంటలలోని ‘స్వచ్ఛత” ఎస్బి సొంతం. హిందీ, పంజాబీ, గుజరాతీ భాషల్లో 600కు పైగా ప్రేమ గీతాలు, విషాదగీతాలు, బృందగీతాలు, పెళ్లిపాటలు పాడారు. హౌలీ గీతం, పెళ్లిళ్లలో వినిపించే అప్పగింతల గీతం… ఎన్ని తరాలైనా ఎస్.బి. గాత్రంలో వాడని కుసుమాలే.
వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఎన్నో ఒడుదొడుకులు వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాన్మరణం, చెందారు. ఒకప్పుడు తను లేకపోతే సంగీతం కూర్చబోమన్న మదన్మోహన్, ఒపి నయ్యర్లు, ఎస్డి బర్మన్లు ఆ తర్వాత వచ్చిన నూతన గాయకులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల ఒత్తిడికి తలొగ్గారు. దాంతో, ఎస్.బి.కి అవకాశాలు తగ్గాయి. 1940, 50 దశకాలలో ‘సంగీత సామ్రాజ్ఞి’గా కీర్తించబడిన ఎస్బి పాడిన చిత్రాలు ఇప్పటికి డివిడిలతో అందుబాటులో ఉండడం విశేషం. ఈ పాటలలో శంషాద్ సదా చిరంజీవే!
ప్రజాదరణ పొందిన పలు హిట్ గీతాలు
‘డర్నా మొహబ్బత్ కర్లే…’ – ‘అందాజ్’ (1949). లతతో కలసి పాడారు. నర్గీస్, దిలీప్ కుమార్, కుకూలపై చిత్రీకరణ. నౌషాద్ సంగీతం.
‘ఏక్, దో, తీన్ ఆజా మాసమ్ హై రంగీన్..’ – ‘ఆవారా’ (1951)లో నాట్యతార కుకూ, రాజ్కపూర్లపై చిత్రించిన క్లబ్ గీతం. శంకర్ – జైకిషన్ సంగీతం.
‘ఉడన్ కటోలేపే జావూ..’ – ‘అన్ మోల్ఘడీ’ (1946) – మేటి గాయని జొహ్రా బాయితో కలసి పాడారు. నౌషాద్ సంగీతం.
‘మేరి పియా గయా రంగూన్..’- ‘పతంగ’ (1949). చితాల్కర్ పేరుతో సంగీత దర్శకుడు సి. రామచంద్ర, ఎస్బితో పాడిన ఎవర్గ్రీన్ హిట్.
‘సయ్యా దిల్ మే ఆనారా…’ – ‘బహార్’. ఎస్.డి. బర్మన్ సంగీతం.
‘యే దునియా రూప్ కీ చోర్…’ – ‘షబ్నం’ (1949). కామినీ కౌశల్పై చిత్రించిన ఈ బహు భాషా గీతంతో ఎస్డి బర్మన్ సంగీత దర్శకుడిగా మార్మోగిపోయారు.
‘దూర్ కోయిగాయే ధున్…’- ‘బైజూ బావరా’ (1952). నౌషాద్ సంగీతం. మీనా కుమారి బృందంపై చిత్రీకరణ.
‘ఓ లేకే పెహలా పెహలా ప్యార్…’ – ‘సిఐడి’ (1956). ఓ.పి.నయ్యర్ సంగీతం. ఎస్బి, రఫీతో కలసి పాడారు.
‘కభీ ఆర్ కబీ పార్ తీరే నజర్…’ – ‘ఆర్పార్’ (1954). ఓ.పి. నయ్యర్ సంగీతం. గురుదత్, శ్యామాలపై చిత్రీకరణ జరిగిన పాట.
‘రేష్మీ శల్వార్ కుర్తా జాలీకా…’ – ‘నయాదౌర్’ (1957). ఓ.పి. నయ్యర్ సంగీతం. ఆశా భోంస్లేతో కలసి ఎస్.బి. పాడిన సూపర్హిట్.
‘ఆనా మేరీ జాన్ మేరీ జాన్ సండే సే సండే…’ – ‘షెహనాయి’ (1948). సంగీత దర్శకుడు సి. రామచంద్ర భారత సినిమా రంగంలో తొలిసారిగా పాశ్చాత్య బాణీలో చేసిన గీతం.
‘హౌలీ ఆయీరే కన్హాయి…’ – ‘మదర్ ఇండియా’ (1957). నౌషద్ సంగీతం. ఇప్పటికే హౌలీకి ఇదే పాట.
‘కజ్రా మొహబ్బత్ వాలా..’ – ‘కిస్మత్’ (1967). నయ్యర్ సంగీతం. ఆశాతో ఎస్.బి. పాడిన ఎవర్గ్రీన్ పాట.
‘మిల్తే హి ఆంఖే దిల్ హువా దీవానా…’ – ‘బాబుల్’. తలత్ మొహమ్మద్తో కలసి పాడారు.
‘మేరీ నీందో మే తుమ్…’ – ‘నయా అందాజ్’. ఒపి నయ్యర్, కిశోర్కుమార్, ఎస్బిల కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ రొమాంటిక్ డ్యూయట్.
అరుదైన జ్ఞాపకాలు
రాజ్కపూర్ తన తొలి సొంత చిత్రం ‘ఆగ్’ (1948)లో పాట పాడమని ఎస్బిని కోరారు. పారితోషికం పెద్దగా ఇవ్వలేమని చెప్పారు. అప్పట్లో స్టార్ సింగరైన ఎస్.బి. ఆయన తండ్రి, తాను పాటలు పాడిన పలు చిత్రాల కథానాయకుడు పృథ్వీరాజ్ కపూర్పై గౌరవంతో ఒప్పుకున్నారు. ఆ పాట రిహార్సల్ కోసం సంగీత దర్శకుడు రాంగంగూలీ తన సహాయకులు శంకర్-జైకిషన్లతో ఎస్బి ఇంటికి వెళ్ళి రిహార్సల్ చేశారు. ఆ పాటే ‘కాహే కోయర్ షోర్ మచాయిరే’!
చాలా మంది సంగీత దర్శకుల మొదటిచిత్రాలకు, వారి కెరిర్ ఒక గాడిలో పడటానికి తోడ్పడిన పలు పాటలకు గాత్రం అందించారు.
మైక్కు దూరంగా జరిగి పాడటం, తారాస్థాయిలో ఎస్బి పాడటం ప్రత్యేక శైలి.
ఆ కాలంలో వచ్చిన బాక్స్ఫీస్, మ్యూజికల్ హిట్ చిత్రాలకు ప్రధానభూమిక ఎస్బి పోషించారు.
చాలా వరకు ఎస్బి ప్రైవేట్ గీతాలు, లాహౌర్,షెషావర్ రేడియోకి పాడినవి అలభ్యాలే. కారణం గ్రామఫోన్ రికార్డులుగా విడుదల కాకపోవటం.
1940, ’50 దశకాలలో 78 ఆర్పిఎం గ్రామఫోన్ రికార్డులలో ఎస్బి పాటలు లభ్యం కావటం వల్ల ‘గ్రామ్ఫోన్ గాడెస్’ అని అభిమానులు పిలుస్తారు.
1950వ దశకంలో తన కెరియర్ తారా స్థాయిలో ఉన్నప్పుడు భర్త హఠాన్మరణంతో స్వచ్ఛందంగా విరమించుకొని కొంత మంది సంగీత దర్శకుల కోరికపై అడపాదడపా పాటలు పాడారు. ఆమె చివరి పాట పాడిన చిత్రం 1981లో విడుదలైన ”గంగా మాంగ్ రహిపై బలిదాన్’.
భారత విభజన తర్వాత నూర్జహాన్, సంగీత దర్శకుడు గులాం హైదర్ పాకిస్థాన్ వెళ్లిపోవడంతో ఎస్బి 1955 వరకు ఎన్నో హిట్ చిత్రాలకు ప్లేబాక్ ఇచ్చారు. 1940 దశకం, 50 దశకాల్లోని ప్రసిద్ధ తారల మొదటి గీతాలు శంషాద్ బేగమే పాడారు.
తాజా కామెంట్లు