ఒక యుద్ధస్వరం కొనకంచి “మంత్రలిపి”

 

-ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

రాజ్యం ఉనికిలోనుంచే,సమాజం ఉనికిలోనుంచే కొన్ని అపసవ్యదిశలున్నాయి.కాని ప్రపంచీకరణ తరువాత దీని భీకర రూపం ప్రభావం ఎక్కువ.ఈ పరిణామాలతరువాత మనిషి కేవలం ఆర్థికమానవుడుగా ఇంకాచెబితే, కేవలం సాంకేతికమానవుడుగా తయారయాడు.ఈ పరిణామాలు,పరిణామాలఫలితాలు ఈకాలపు కవిత్వంలో ప్రతిఫలిస్తున్నాయి.వస్తుగతంగా “కొనకంచి”-మంత్రలిపి”కూడా దీనికి మినహాయింపుకాదు.కాని కవిత్వంలో కనిపించే సంవేదనాంశానికి,అస్తిత్వజిజ్ఞాసకు,ఈకవిత్వంలోఉండే భావావేశతీవ్రతకు మధ్య చెప్పుకోదగ్గ వైరుధ్యాలున్నాయి.వాక్యాల్లో ప్రస్ఫుటంగా వర్గస్పృహకాకుండా విశ్వాత్మలో చెల్లుబాటయ్యే సార్వజనీన తిరస్కరణనుచూడొచ్చు.

రాజ్యం యొక్క పట్టించుకోని తనాన్ని,లంచగొండితనాన్ని,స్వార్థంలాంటి అంశాలపై కవిత్వం రాసినా ఈవాక్యాలవెనుక ఉనికిసంబంధమైన పోరాటం ఉంది. రాజ్యపులక్షణాలను,రాజ్యం,ప్రపంచీకరణ రెండూ ప్రసారం చేస్తూ మానవీయమూలాలుదెబ్బతీసే ప్రతివ్యక్తీ,అంశం ఈకవిత్వంలో తిరస్కరింపబడుతాయి.అందులోనూ రాజ్యాన్ని ప్రథమశత్రువుగా చూడడం ఇందులో గమనించవచ్చు.అనేక కవితలు అందుకు నిదర్శనం కూడా.కొన్ని కవితల్లో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలనుగురించి మాట్లాడటమూ గమనించవచ్చు.జీవితం పోరటమైన సందర్భాలలో మానవుని అస్తిత్వాన్ని గురించి” మంత్రలిపి” ఆలోచిస్తుంది.

అంశాత్మకంగాచూస్తే మానవీయలక్షణాల అణ్వేషణ,దానికి కారణాలను,కారకులను తిరస్కరించడం,క్షేమాన్ని కనిపెట్టాల్సిన రాజ్యపు స్వభావాన్ని,అందులోని దుర్నీతిని తిరస్కరించడం ప్రధానంగా ఎక్కువకవితల్లో కనిపిస్తుంది.

 

ప్రియురాలి హృదయంలో ప్రేమలేదు

ఉన్నదంతా ఒక అవసరం

ప్రియునిమనసులో ప్రేమలేదు

ఉన్నదంతా పచ్చిదేహభాష

 

నెచ్చెలిని కౌగిట్లోనిద్రపుచ్చే

మంత్రగాడిలా మారాలనుకున్నప్పుడల్లా

చీకటి పడీపడకముందే

తొలికోళ్ళు కూస్తున్నాయి

 

స్నేహాన్నినటిస్తూనే

నాకుతెలియకుండా నన్ను ప్లాస్టిక్ పువ్వును చేసి

బతుకు పుస్తకంలో ఉన్న ఆఖరి రక్తమాంసాలని

ఎవరో ఎత్తుకుపోయారు“–(మంత్రలిపిపే.21/22)

 

ఈవాక్యాలన్నీ జీవితవిలువల్లోని చరమస్థాయిని చిత్రిస్తున్నాయి.మొదటివాక్యం జీవన సంబంధాలను ,రెండవవాక్యం బంధాలు దూరమవుతున్న క్రమాన్ని,మూడవభాగం మోసపోతున్న జీవితాలను వ్యక్తం చేస్తాయి.ఇవన్నీ జీవితపు విలువలను వ్యక్తం చేసినా వీటివెనుక ప్రపంచీకరణప్రభావాలను పరోక్షంగాప్రస్తావిస్తాయి.కేవలం అవసరంగామారడాన్ని,సమయంలేకపోవడాన్ని,మేలుచేస్తున్నట్టుగా కీడుచేయడాన్ని ఈవాక్యాలు గుర్తించాయి.నిర్మాణగతంగా ఇవి వస్తువుయొక్క సంవిధానస్థాయిని(the proairetic code) చెబుతాయి.ప్రపంచీకరణ నీడను గుర్తించడానికి ఈవాక్యాలు దోహదం చేస్తాయి.నిర్మాణగతంగా పూర్తిసమాజాన్ని చిత్రించే సంపూర్ణత్వం(Wholeness)దాన్ని అర్థంచేసుకోడానికి గతవర్తమానాలను పరిచయం చేసే పరిణామశీలం(Transformation)ఈ కవితల్లో కనిపిస్తాయి.వీటన్నిటి వెనుక రాజకీయస్పృహ గమనించదగింది.కొనకంచి వాక్యాలన్నీ రాజ్యాన్ని దాన్నీఅనుకొని ఉన్న స్వార్థాన్ని,దోపిడీని ఎక్కు పెట్టేవే.

ఉన్మాదుల..పాలకులచేతుల్లో/మనుషులజీవితాలన్నీ/రాళ్ళు రప్పలపాలయినప్పుడు/అధికారమే మారణాయుధాలతో/తనమనుషులను తానే చంపటానికి దండెత్తినప్పుడు/

మనుషులంతా నీళ్లలో తిరిగే చేపలవుతారు/తమప్రాణాలను కాపాడుకునేందుకు/తామేవెళ్ళి కనపడుతున్న/నైలాన్దారాల్లో దాక్కుంటారు

 చుట్టూ ఉన్న ప్రపంచంలో/మనుషులంతా నడిచే నల్లనాగులుగా మారినప్పుడు/గుడ్డుగుడ్డులాగే ఉంటుంది/గుడ్డులో పచ్చసొనమాయమవుతుంది/మనిషి మనిషిలాగే ఉంటాడు/మనిషిలో మనిషి మాయమవుతాడు/రాజ్యాంగం రాజ్యాంగం లాగే ఉంటుంది/రాజ్యాంగంలో అన్నీ తెల్లకాగితాలే మిగులుతాయి. -(మంత్రలిపిపే.23/24)

చట్టబద్ధంగా రాజ్యంచేసే హత్యలకు/అసలుహంతకులు/రాజ్యాంగం పేజీల్లోనే/అక్షరాలయి దాక్కున్నారు“-(పే.41.ఇది హత్యాత్మహత్య)

kona1

మొదటివాక్యం ప్రజలు తమకు తాముగానే (విధిలేని పరిస్థితుల్లో) బలి అవడాన్ని,రెండవ వాక్యం ప్రజలను బలితీసుకుంటున్న విధానాన్ని చెబుతుంది.ఇందులో రాజ్యం యొక్కప్రవర్తన గుర్తించడంలో కొనకంచిలో విప్లవచాయలున్నాయి.రాజ్యాంగంపైన దేశంలోని రాజకీయపార్టీలు సైద్ధాంతికంగాకానీ,ఆచరణరీత్యాకానీ,మానసిక ప్రవృత్తులవలనకానీ కట్టుబడిఉన్నాయన్న దాఖలాలు లేవు.అంతేకాక ప్రపంచీకరణలోని ప్రధానాంశం ప్రత్యామ్నాయ ఆర్థికవిధానాల అభివృద్ధి(Development group for attentive policies)కి ప్రధానవాహికగా ఉన్నాయి.చిల్లరవర్తకాలపై పెట్టుబడులనాహ్వానించిన మొన్నటి కాంగ్రెస్ నుంచి,ఇప్పటివరకు ఉన్న రాజ్యాలన్నీ దీనికి మినహాయింపుకాదు.స్వాతంత్రాన్ని సంపాదించుకున్న చైతన్యం ఇలా వట్టిపోయిందనే అనాలి.కాడ్వెల్-ఒకమాటంటాడు.

 Consciousness is generated by men’s Active struggle with nature and perishes in a blind formalism once that grapple ceases

 (చైతన్యం ప్రకృతితో జరిగే మనిషిక్రియాశీలపోరాటం నుంచి పుడుతుంది.ఒకసారి అనుకున్నది సాధించాక ఆచైతన్యం ఒక గుడ్డి వ్యవస్థగా మారి నశిస్తుంది-(Illusion and Reality-పే 63).

వర్తమానస్థితిని చెబుతున్న కొనకంచివాక్యాలసారాంశమూ ఇదే.ప్రాచీనభారతీయ రాజనీతిశాస్త్రం రాజును రాజ్యాన్ని ఆరాధించే ప్రజలగురించి ప్రస్తావించింది.

 

ధార్మికం పాలనపరం సమ్యక్పరపురజ్ఞయః

రాజానామభిమన్యంతే ప్రజాపతిమివప్రజాః

 ఈలక్షణాలు లేని ధార్మికత్వం,ప్రజాగతపాలన లేనిరాజ్యాన్నే మంత్రలిపి నిలదీస్తున్నది..వస్తుగతంగా ఉద్వేగమున్నా కవిత్వీకరణలో హృదయాన్ని హత్తుకోగల కళాంశాలనేకంగా ఉన్నాయి.

 కాలం నల్లలాంతరుపట్టుకొని/చీకట్లో చీకటిని వెతుక్కుంటూ/బయల్దేరినప్పుడు“-(పే.37.అప్పుడు ఎప్పుడో ఒకసారి)

 తనకంటే ముందుగా/తనచావే పుట్టిందని

ఇప్పటివరకు/ రైతూ గుర్తించలేదు“-(పే.42.ఇది హత్యాత్మహత్య)

 ఇలాంటివాక్యాల్లోని సంకేతాలు కళాదృష్టిని ప్రసారం చేయడమేకాకుండా వాస్తవికతను బలపరుస్తాయి.ఈ సంపుటిలో ఇలాంటివాక్యాలను అనేకంగా ఎత్తిరాయొచ్చు.ఇవన్నీ వాస్తవాన్ని ప్రతిఫలిస్తాయి.వర్తమాన రాజకీయ,సామాజిక పరిస్థితులపై  గొంతెత్తిన యుద్ధస్వరం కొనకంచి మంత్రలిపి.

                                                                   ___________