గజేంద్ర సింగ్! మమ్మల్ని క్షమించు..

వైవీ రమణ

రమణఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గజేంద్ర సింగ్ అనే రాజస్థాన్‌కి చెందిన రైతు చెట్టుకి ఉరేసుకుని చనిపొయ్యాడు. గజేంద్ర సింగ్ చెట్టుమీద కూర్చునున్న వీడియో క్లిప్పింగ్ చూశాను. ఆ తరవాత అతను శవమై చెట్టుకు వెళ్ళాడుతున్న ఫోటో చూశాను. మనసంతా దిగాలుగా అయిపోయింది. 

ఢిల్లీ దేశరాజధాని కాబట్టి, ఈ రైతు మరణానికి మీడియా కవరేజ్ లభించింది గానీ – రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణా.. రాష్ట్రం ఏదైతేనేం రైతులు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు. కొన్నేళ్ళుగా మధ్యతరగతి బుద్ధిజీవులు రైతుల మరణాన్ని ఒక విశేషంగా భావించట్లేదు. ఆసక్తి కలిగించిన ఈ ‘అప్రధాన’ వార్తల్ని మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. 

ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, వడదెబ్బ తగిలి కొందరు చస్తారు. రేపు వర్షాకాలంలో రోగాలొచ్చి ఇంకొందరు చస్తారు. ఎల్లుండి చలికాలంలో చలికి నీలుక్కుపొయ్యి మరికొందరు చస్తారు. ‘మరణిస్తారు’ అని గౌరవంగా రాయకుండా ‘చస్తారు’ అని రాస్తున్నదుకు నన్ను మన్నించండి. వారి చావులు ఈ సభ్య సమాజాన్ని కనీసంగా కూడా కదిలించలేనప్పుడు భాష ఏదైతేనేం?

నరాలు మొద్దుబారి చర్మం స్పర్శ కోల్పోతే ‘న్యూరోపతీ’ అంటారు, ఇదో రోగం. నిస్సహాయులైనవారు – తమని ఇముడ్చుకోలేని ఈ సమాజం పట్ల విరక్తి చెంది.. కోపంతో, అసహ్యంతో ఆత్మహత్య చేసుకుంటారు. ఇంతకన్నా బలంగా తెలిపే నిరసన ప్రకటన ఇంకేదీ లేదు. అట్లాంటి ‘చావు ప్రకటన’ని కూడా కాజువల్‌గా తీసుకునే ఈ సమాజపు ‘ఎపతీ’ని ఏ రోగం పేరుతో పిలవాలి?

మన దేశం జీడీపి పెరుగుతుంది అంటారు, ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది అంటారు, స్టాక్ మార్కెట్లు పైపైకి దూసుకుపొతున్నయ్ అంటారు. ఇవన్నీ గొప్పగా వున్నాయి కాబట్టి విదేశీ పెట్టుబడులు దేశంలోకి లావాలాగా పొంగి ప్రవహిస్తున్నాయి అంటారు. మంచిది, దేశం అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషం. మరి రైతులు ఎందుకు చనిపోతున్నారు? పెరుగుతున్న సంపదలో రైతులకి వాటా లేదా? రైతులకి వాటా లేని అభివృద్ధి అభివృద్ధేనా?

22-1429701205-farmer-attemts-suicide-during-aam-aadmi-party-aaps-rally4

మన రాజకీయ పార్టీలు సామాన్యుణ్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి. ఈ విషయం చెప్పుకోడానికి అవి సిగ్గు పడుతున్నాయి గానీ, కొద్దిపాటిగా ఆలోచించేవాడికైనా విషయం అర్ధమైపోతుంది. అందుకే ప్రభుత్వాలిప్పుడు వాగాడంబరం, మాటల పటోటాపం, పదాల జిమ్మిక్కుల్ని ఆశ్రయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బున్నవాడికే టిక్కెట్లివ్వడం, కొంతమంది పెద్దలకి లాభించే పనులు చేసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పి పెట్టుకోడానికి మీడియాని మేనేజ్ చేసుకోవడం.. ఇదంతా చాలా ఆర్గనైజ్‌డ్‌గా, ప్రొఫెషనల్‌గా, వెల్ ఆయిల్డ్ మెషీన్లా స్మూత్‌గా సాగిపోతుంది.

రాజకీయ పార్టీల పెద్దలకో విజ్ఞప్తి! అయ్యా! మీరు మాకేం చెయ్యరని తెలుసు, చెయ్యకపోయినా పర్లేదు. కానీ – నిస్సహాయుల మరణం పట్ల మినిమం డీసెన్సీతో స్పందించడం నేర్చుకోండి. ఈ మరణాలకి సిగ్గుతో తల దించుకుని మీకింకా ఎంతోకొంత సభ్యత, మానవత్వం మిగిలుందని మాబోటి అజ్ఞానులకి తెలియజెయ్యండి.

ఇది రాస్తుంటే – నాకు నేనే ఒక ఈడియాటిక్ అశావాదిలా అనిపిస్తున్నాను. వేలమంది ఊచకోతకి గురైనా – ఆ చంపిందెవరో ఇప్పటిదాకా మనకి తెలీదు! ఇకముందైనా తెలుస్తుందనే ఆశ లేదు. మరప్పుడు ఆఫ్టరాల్ ఒక అల్పజీవి మరణం వార్తా పత్రికల్లో ఒకరోజు హెడ్లైన్‌కి తప్ప ఇంకెందుకు పనికొస్తుంది?

ఈ చావుని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటాయి. ఇలా ‘లబ్ది’ పొందడం రాజకీయ పార్టీలకి ‘వృత్తిధర్మం’ అయిపోయింది. గజేంద్ర సింగ్ ముగ్గురు బిడ్డలు దిక్కులేని వాళ్లైపొయ్యారే అని దిగులు చెందుతుంటే, ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ చికాకు పెడుతుంది. స్వతంత్ర భారతంలో ఇదో విషాదం.

గజేంద్ర సింగ్! మమ్మల్ని క్షమించు. నువ్వు బ్రతికున్నప్పుడు ఏం చెయ్యాలో మాకు తెలీలేదు. చనిపొయినప్పుడూ ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు…

*